జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 17, 2013

మహేశ్‌బాబు కొత్త చిత్రం...కొరటాల శివ దర్శకత్వంలో... 'యు' టి.వి.తో!

    హీరో మహేశ్‌బాబు తరువాత సినిమా ఏమిటి? దీనికి సంబంధించి ఇటీవల రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే, ఆ ఊహాగానాలకు ఇప్పుడు తెరపడింది. సెట్స్‌ మీద ఉన్న '1', 'ఆగడు' కాకుండా మూడో సినిమాకు ఆయన పచ్చ జెండా ఊపారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'యు' టి.వి.తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని 'ప్రజాశక్తి'కి తెలిసింది. 

'మిర్చి' చిత్ర ఫేమ్‌ అయిన దర్శక - రచయిత కొరటాల శివ దర్శకత్వంలో ఆ చిత్రం తెర కెక్కనుంది. వచ్చే ఏడాది జూలై - సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. మరో రెండు, మూడు రోజుల్లో 'యు' టి.వి. కార్పొరేట్‌ కార్యాలయం అధికారికంగా ఈ సంగతిని ప్రకటించనుంది.

నిజానికి, మహేశ్‌ హీరోగా ఓ పక్క సుకుమార్‌ దర్శకత్వంలో తయారవుతున్న '1 (నేనొక్కడినే)' చిత్రం ఇప్పటికే సుదీర్ఘ కాలంగా షూటింగ్‌లోనే ఉంది. ఆ చిత్రంతో పాటు మరో పక్క శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రానికి కూడా మహేశ్‌ సర్వవిధాలా సన్నద్ధమయ్యారు. కానీ, ఈ రెండు చిత్రాల్లో ఏదీ ఈ ఏడాది విడుదలయ్యే సూచనలు లేవు. దాంతో, ఈ ఏడాది మొదట్లో రిలీజైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తప్ప ఇప్పటి దాకా మరో సినిమాయే విడుదల కాని మహేశ్‌ ప్రేక్షకుల నుంచి అనుకోకుండా సుదీర్ఘ విరామం తీసుకున్నట్లయింది. అప్రమత్తమైన మహేశ్‌ ఇక పైన ఇలాంటి పొరపాటు పడకుండా ఉండాలని తగిన జాగ్రత్త తీసుకుంటున్నారు. అందుకే, ఆయన సెట్స్‌ మీద రెండు సినిమాలు ఉండగానే, ముచ్చటగా ఈ మూడో సినిమాకు కమిటైపోయారు. మరి, కొరటాల శివ - కార్పొరేట్‌ సంస్థ 'యు' టి.వి.ల కాంబినేషన్‌లో మహేశ్‌ ఏం చేస్తారో వేచి చూడాలి.

(Published in 'Praja Sakti' daily, 17th Oct 2013, Thursday, Page no.8)
...........................................................

1 వ్యాఖ్యలు:

Unknown said...

మహేష్ బాబు గారు మూసలో పడిపోకుండా సరికొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి!తాను stale కాకుండా పాలిపోకుండా చూసుకోవాలి!