జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, December 31, 2010

'రగడ' - బాగుందన్నవాడితో పెట్టుకోవాలి గొడవ!



ముగిసిపోతున్న ఈ 2010లో ఇప్పటి దాకా తెలుగు సినిమా ఒకటీ అరా సందర్భాల్లో తప్ప, మిగిలిన అన్నిసార్లూ అన్యాయంగా ప్రేక్షకుల్ని వీరబాదుడు బాదింది. ఆ సంగతి తెలిసీ నేను బుక్ అయి వచ్చిన తాజా సినిమా - ‘రగడ’. సినిమా ఫరవాలేదట అని కొందరూ, బాగానే ఆడుతోంది - ఆడుతుందని మరికొందరూ పొద్దుటి నుంచీ ఆఫీసులో ఒకటే రగడ. సరే, ‘యథా ప్రకారం సిద్ధిరస్తు’ అని అనుకుంటూనే, వెళ్ళాం.

కథా సంగ్రహం

రాయలసీమలో కడపకు చెందిన సత్యారెడ్డి అనే ఓ యువకుడి కథగా ఈ సినిమా నడుస్తుంది. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ ‘‘కడపోడు’’ డబ్బు కోసం ఏం చేయడానికైనా రెడీ అంటూ ఉంటాడు. పెద్ద పెద్ద రిస్కీ ఫైట్లు కూడా చేసేస్తుంటాడు. నగరంలోని పెద్దన్న (ప్రదీప్ రావత్) గ్యాంగులోని ఛోటా నేతల్లో ఒకడికీ, నగరంలోని మరో గ్యాంగు నేత జి.కె. (‘మగధీర’లో రాజమౌళి చూపించిన కొత్త విలన్ దేవ్ గిల్)కూ మధ్య గొడవ. జి.కె.కు దగ్గరైన హీరో అతనికి ప్రత్యర్థులైన పెద్దన్న గ్యాంగుల్లోని ఛోటా నేతలను ఒక్కొక్కణ్ణీ చంపి, అడ్డు తొలగిస్తుంటాడు. ఆ క్రమంలోనే అతను శిరీష (అనూష్క)తోనూ, అష్టలక్ష్మి (ప్రియమణి)తోనూ దగ్గరవుతాడు. అతను సీమ నుంచి ఆ ఊరెందుకు వచ్చాడు, వాళ్ళను ఎందుకు చంపుతున్నాడు లాంటి అంశాలకు సమాధానంగా ఓ ఫ్లాష్ బ్యాక్. ఆ తరువాత సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే బోలెడన్ని ట్విస్టులు. ఆఖరికి ది ఎండ్.

కంటి చూపుతో కాదు, కత్తులతోనే చంపేసే హీరో

కుటుంబ, హాస్య కథా చిత్రాల హీరోగా సంతోషం చిత్రం రోజుల నుంచీ రూటు మార్చిన నాగ్ ను మళ్ళీ చాలా వెనక్కి తీసుకెళ్ళిందీ సినిమా. బహుశా ‘విక్రమ్’ (1986) నుంచి ఇప్పటి వరకు - గడచిన 25 ఏళ్ళ కెరీర్ లో నాగార్జున ఇంతగా తెరపై హింస, రక్తపాతాలు చూపించలేదేమో. నాకైతే మునుపెన్నడూ చూసిన గుర్తు లేదు. రాయలసీమ నేపథ్యం, కత్తి పట్టుకొని వందల మందిని కసక్కున పొడిచేసే కథానాయకుడి కదన కుతూహలం, ఒకరికి ముగ్గురు నాయికలు లాంటి కమర్షియల్ అంశాలు నాగ్ మీద అతిగా ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒక్క హిట్ కోసం ఇంత హింస అవసరమా!?

వయసు మీద పడుతున్నా గ్లామర్ తగ్గకుండా కనిపించే నాగార్జున ఎందుకో, ఈ చిత్రంలో అంత ఆహ్లాదంగా కనిపించరు. కొన్ని దృశ్యాల్లో వయసు తెలిసిపోయింది. అనూష్క, ప్రియమణి - నటించడానికి ఏమీ లేకపోవడంతో, పాటల్లో తక్కువ దుస్తులతో ఆకట్టుకోవడానికి శ్రమపడ్డారు. బ్రహ్మన్న, బ్రహ్మీ డార్లింగ్ గా బ్రహ్మానందం కొన్ని ఘట్టాల్లో నవ్వించారు. ధర్మవరపు, బాల నటుడు భరత్ ల బ్యాచ్ కామెడీ కాసేపయ్యాక నవ్వు కాదు, నస అనిపిస్తుంది.

మాటలెక్కువ, చేసింది తక్కువ

కథ, మాటల రచయితగా మొదలై, ఆనక దర్శకుడైన వీరూ పోట్ల ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. కలిసొస్తే చెరుకుగడ, ఎదురొస్తే రగడ ..... లాంటి పంచ్ (!?) డైలాగులను మార్చి, మార్చి సినిమాలో వాడారు. వాటిని పాటక జనం ప్రశంసిస్తారని దర్శక, నిర్మాతలు, హీరో అభిప్రాయం. కథే అస్తుబిస్తుగా ఉన్న ఈ చిత్రంలో ఇక, స్క్రీన్ ప్లే, మాటల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. దర్శకత్వ ప్రతిభ కూడా చాలా యావరేజ్.

సినిమాకు సంగీతం (థమన్ ఎస్.) పెద్ద ఎసెట్ కావాల్సింది. కానీ, ఈ చిత్రంలోని పాటలేవీ ఆ ఫక్కీలో నడవలేదు. కనీసం ఒక్క పాటైనా బావుంటుందనుకుంటే, అదీ నిరాశే. అసలే ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం మోకాలుకు చేయించుకున్న సర్జరీతో డ్యాన్సులు, ఫైట్లు నాగ్ కు కష్టంగా మారాయి. దానికి తోడు ఇప్పుడు మీద పడుతున్న వయస్సు. దాంతో, చిన్న చిన్న మూవ్ మెంట్లు హీరో చేస్తుంటే, హీరోయిన్లు, డ్యాన్సర్లు మాత్రం తెగ నర్తించేస్తుంటారు. స్టెప్పులు వేస్తుంటారు. ఈ వరుస చూస్తే, ఎన్టీయార్ 1980ల నాటి సినిమాల్లో చేసిన డ్యాన్సులు గుర్తొస్తే, తప్పు ప్రేక్షకులది కాదు. ఫైట్లూ అంతే - ఒక దెబ్బకు పదుల సంఖ్యలో జనం పడిపోవడమే. కాస్తయినా రియలిస్టిక్ గా అనిపించవు.

కథనంలోనూ లోటుపాట్లు

అమ్మలా తనను పెంచిన డాక్టరమ్మ నిర్మలమ్మను చంపారని తెలిసిన హీరో ఆమెను చంపినవారిని హతమార్చి, పగ తీర్చుకోవడానికి నగరానికి వచ్చాడు. సెకండాఫ్ లో వచ్చే రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఆ సంగతే చూపారు. అలాగే, ఒక్కొక్కరినీ చంపుతూ వస్తుంటాడు. సో, ఇక అక్కడ మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్)కి మూడునెలల్లో రూ. 87 కోట్లిచ్చి, అమ్మతో ఆ ఆసుపత్రిని ఖాళీ చేయించకుండా ఉంచాలన్న బంధం ఏమీ హీరోకు లేదు. కానీ, బండి దగ్గర కోట శ్రీనివాసరావు ఎదురై, తమతో చేతులు కలిపేయమంటూ హీరోను బెదిరించే సన్నివేశంలోనే ముందుగా హైదరాబాద్ - కడప బస్సులో వేరెవరి ద్వారానో సంచీ నిండా హీరో డబ్బులు పంపుతున్న షాట్ ఎందుకు చూపినట్లన్నది అర్థం కాని ప్రశ్న.

అలాగే, మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్), అతని అన్న పెద్దన్నల పనుపునే ఛోటా నేతలు వచ్చి హీరో తల్లిని చంపుతారు. ఆ హంతకుల్ని చంపుతానని తల్లి సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన హీరో, చివరకు వచ్చేసరికి - పెద్దన్నను చంపడమే తప్ప, మహేందర్ రెడ్డిని ఎందుకు వదిలేసినట్లు. ఈ సినిమాలో ఇలాంటి లోపాలు ఇంకా అనేకం.

కొసమెరుపు -

ఈ సినిమాలో కథ కోసం బలవంతాన తెచ్చిపెట్టిన మలుపులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. పైపెచ్చు, అసలు ఈ ట్విస్టులు నచ్చే సినిమా చేశానన్న హీరో గారి మాటలు చదివాక, నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఏమైనా, ఈ 14 రీళ్ళ సినిమాను ఓపిగ్గా మొదటి నుంచి చివరి దాకా చూసి బయటకు వచ్చాక నాకు అనిపించింది కాస్త ప్రాసలో చెప్పాలంటేఒకటే- 'రగడ' ..... ఈ సినిమా చాలా బాగుందని చెప్పినవాడితో వేసుకోవాలి గొడవ!

చివరిగా, చిన్నమాట.

2010కి వీడ్కోలు చెబుతూ, 2011కు శుభస్వాగతం పలుకుతూ, మన బ్లాగు మిత్రులకూ, పాఠకులకూ, హితులకూ, స్నేహితులకూ

విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యపీ, జాయ్ ఫుల్ అండ్ ఫ్రూట్ ఫుల్ న్యూ ఇయర్.

Friday, December 24, 2010

బతుకు భయం కలిగించే ‘నాగవల్లి’



(వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’ - పార్ట్ 2)

‘నాగవల్లి’ సినిమాలో ప్రేక్షకుడికి నచ్చే అంశాల కన్నా నచ్చని అంశాలే ఎక్కువ. ‘నాగవల్లి’ చిత్రంలో సాఫీగా సాగే కథ లేదేమో కానీ, నటీనటులు మాత్రం బోలెడంత మంది. హీరోగా రజతోత్సవ సంవత్సరంలో ఉన్న వెంకటేశ్ ఈ చిత్రంలో డాక్టర్ విజయ్ గా, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రాజు నాగభైరవ రాజశేఖరుడిగా ద్విపాత్రాభినయం చేశారు. 130 ఏళ్ళుగా బతికుండి, ఓ అఘోరా లాగా పెరిగిన మీసాలు, గడ్డాలు, గోళ్ళతో మూడో వేషంలోనూ కనిపిస్తారు.

పాత్రలు - పాత్రధారులు

కానీ విషాదం ఏమిటంటే - ఒక్క డాక్టర్ విజయ్ వేషంలోనే ఆయన ఫరవాలేదనిపిస్తారు. మిగిలిన వేషాల్లో ఆయన ఆంగిక, వాచికాలు అన్యాయంగా ఉన్నాయి. రాజు వేషంలో ఆహార్యమైనా బాగుంది (రమా రాజమౌళి స్టైలింగ్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి), కెమేరాలో కాళ్ళకు బూట్లతో కనిపించేస్తున్న అఘోరా వేషానికి వచ్చేసరికి ఆయన మేకప్ కానీ, ఆ కుంగ్ ఫూ తరహా యుద్ధ విన్యాసాలు, ఆ అరుపులు ఏ మాత్రం ప్రొఫెషనల్ గా లేవు. రాజు అంటే ఓ హుందాతనం, ఆ నడకలో, కరచరణ విన్యాసాల్లో ఓ ఠీవి కనిపించాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఈ సినిమాలో అవేవీ లేవు. పైగా, హీరోయిన్ తో పాట పాడుతూ, రాజు నడిచే నడక, భుజాలు ఊపే తీరు విదూషకుడిని తలపించాయి. సంభాషణల్లోనూ, వాటి ఉచ్చారణలోనూ పాత్రల తాలూకు స్థల కాలాలను చూపెట్టడంలో కూడా విఫలమయ్యారు.

ప్రధానపాత్ర నాగవల్లి (అసలు పేరు నాగవల్లి. నాట్యకళలో ప్రావీణ్యంతో అందరూ పిలిచే పేరు చంద్రముఖి అని సినిమాలో చెప్పించారు)లో అనూష్కను సైతం పోస్టర్లలో చూపించినంత పాటి అందంగానైనా తెర మీద చూపలేకపోయారు. నృత్యంలో అభినివేశం లేని ఆమె శాస్త్రీయ నృత్యం చేస్తుంటే, తెరపై ఎలా ఉందో వేరుగా చెప్పనక్కర లేదు. ఆమె ప్రియుడైన గుణశేఖరన్ పాత్రధారి ఆమె కన్నా పొట్టిగా, లేత ముఖంతో ఆమెకు చిన్న తమ్ముడిలా కనిపించాడు.

సినిమాలో శరత్ బాబు - ప్రభల కుమార్తెలుగా కమలినీ ముఖర్జీ (నాట్యకళాకారిణి గాయత్రి పాత్ర), శ్రద్ధాదాస్ (చిత్రకారిణి గీత పాత్ర), రిచా గంగోపాధ్యాయ (పరిశోధకురాలు గౌరి పాత్ర), ఇంకా ధర్మవరపు కుమార్తెలుగా లహరి తదితరులతో గ్లామర్ కు తక్కువ ఏమీ లేదు. కానీ, ఏ పాత్రనూ చిరకాలం గుర్తుంచుకోలేం. బ్రహ్మానందం కామెడీ కూడా నవ్వించడానికి విఫలయత్నం చేస్తుంది. కొంతసేపయ్యాక విసుగు కలిగిస్తుంది.

సాంకేతిక విభాగాలు

ఈ సినిమాలో హంపీ తదితర ప్రాంతాలను శ్యామ్ కె. నాయుడి కెమేరా అందంగా తెరకెక్కించింది. గురుచరణ్ సంగీతంలో హీరో పరిచయ గీతం మినహా మరేవీ జనం పదే పదేలా పాడుకొనేలా గుర్తుండవు. కళాదర్శకత్వం (చిన్నా) చాలా నాసిగా ఉంది. రాజు గారి ఆస్థానం లాంటి వాటికి అంత గాడీగా ఉన్న రంగులు ఎలా వాడారో అర్థం కాదు. గమ్మత్తేమిటంటే - చంద్రముఖిని రాజు బంధించి ఉంచిన ప్రణయ కేళీ మందిరమంతా ఎర్రటి రంగు గోడలతో ఉండడం ఆలోచన, అవగాహనల రాహిత్యానికి నిదర్శనం. అలాగే, తలుపునకు నాగుపాము, త్రిశూలం వగైరాలతో తాళం ఉండే ఘనమైన దర్వాజాను కూడా మనకు ఆ ప్రాచీన భావాన్ని కలిగించేలా తీర్చిదిద్దకపోవడం పెద్ద తప్పు. చంద్రముఖిని అష్ట దిగ్బంధనం లాంటి దృశ్యాల్లో సైతం వాడిన తాళాలు, తాళం చెవులు లాంటివి కూడా క్లోజప్ లో కనిపిస్తూ, కథాకాలం నాటికి సంబంధం లేని రూపురేఖలతో చీకాకు తెప్పిస్తాయి. సినిమా చూసే ప్రేక్షకులు ఇవేవీ నోరువిప్పి వివరించకపోవచ్చు కానీ, వారి అంతరాంతరాళాల్లో ఇవి చూపే తెలియని ప్రభావమే చిత్ర ఫలితానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

డిజిటల్ ఇంటర్మీడియట్ (డి.ఐ) చేసిన ఈ చిత్రంలో కొన్ని చోట్ల దృశ్యాలు అలికేసినట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పరిచయ గీతం లాంటి చోట్ల డి.ఐ.లోని లోపాలు తెలిసిపోతున్నాయి. గ్రాఫిక్స్ సంగతికొస్తే - చంద్రముఖి 30 అడుగుల పొడవున్న పాము రూపంలో వెళ్ళిపోతోందని చెబుతూ వస్తారు. కానీ, గ్రాఫిక్స్ లో పాములా కాకుండా అది కొండచిలువలా తయారైంది. పడగ విప్పినప్పుడు మాత్రం అది పాములా అనిపిస్తుంది. కథలోనే కొంత కన్ఫూజన్ ఉండడంతో, ఎడిటింగ్ మరేమీ చేయలేకపోయింది.

లోటుపాట్లు

కథలో చంద్రముఖి వెంటాడడం ఏమో కానీ, ‘నాగవల్లి’ చిత్రాన్ని చూస్తుంటేనూ, చూసొచ్చాకా ప్రేక్షకుల్ని బోలెడన్ని ప్రశ్నలు వెంటాడతాయి, వేధిస్తాయి. చాలా భాగం జవాబులు దొరకని ప్రశ్నలే. చంద్రముఖి వ్యవహారంలో సాయం కోరుతూ సిద్ధాంతే స్వయంగా డాక్టర్ విజయ్ ని పిలిపిస్తాడు. నిజానికి, వాళ్ళిద్దరూ కలసి ఆ ఎదురైన సమస్యను పరిష్కరించాలి. కానీ, అది పోయి, చివరకు ఒకరిపై మరొకరు పోటీ పడుతూ, నువ్వు తప్పా, నేను తప్పా అని వాదనకు దిగుతున్నట్లుగా తయారైంది.

హేతువాదానికీ, ఆచారాల పట్ల నమ్మకానికీ మధ్య వాదులాట లాగా కనిపించినా, రెండు పాత్రలకూ సమప్రాధాన్యం ఇస్తూ, రెంటిలో ఏదీ దేనికీ తక్కువ కాదన్నట్లు చూపాల్సింది. ‘చంద్రముఖి’లో అలాంటి ప్రయత్నమే చూశాం. కానీ, ‘నాగవల్లి’ అందుకు విరుద్ధంగా సాగింది. చివరకు సిద్ధాంతి పాత్రను డమ్మీని చేసేశారు. క్లైమాక్స్ లో డాక్టర్ విజయ్ పాత్ర ప్రవర్తన కానీ, సమస్య పరిష్కారంలో అతని పాసివ్ పాత్ర కానీ అర్థరహితంగా ఉన్నాయి.

ఎంత సీక్వెల్ అయినా ఇంత కాపీనా?

అలాగే, పెద్ద హిట్ చిత్రానికి సీక్వెల్ అయినంత మాత్రాన అక్షరాలా అంతకు ముందు సినిమా ఫార్ములానే యథాతథంగా వాడేస్తామంటే కుదురుతుందా? కానీ, ఈ చిత్ర దర్శక రచయిత పి. వాసు (కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం మూడూ ఆయనవే) ఆ పిచ్చి పనే చేశారు.

‘చంద్రముఖి’లో రజనీకాంత్ ఇంట్రడక్షన్ పాట (దేవుడా దేవుడా తిరుమల దేవుడా...)కు కాపీ లాగా ఇక్కడా అలాగే హీరో పరిచయ గీతం (అభిమాని లేనిదే హీరోలు లేరులే...). అక్కడ ఇంటిల్లపాదీతో రజనీ పాడే గాలిపటం పాటకు, ఇక్కడ వెంకటేశ్ ఆడవాళ్ళందరితో కలసి కబడ్డీ ఆడి, ఆ పైన పాడే పాట. అక్కడ ‘రారా సరసకు రారా’ పాట ఉంటే, ఇక్కడ ‘ఘిరని ఘిరని...’ అంటూ నర్తకి నాగవల్లి చంద్రముఖి (అనూష్క) డ్యాన్సుకు రాజు గారు (వెంకటేశ్) తాళం వేస్తూ పాడే పాట.

పాటలే కాదు, పాత్రల విషయంలోనూ ఆ వేలంవెర్రి అనుకరణనే కొనసాగించారు. ‘చంద్రముఖి’లో ఇంటికొచ్చిన హీరో, తన భార్యకు దగ్గరైపోతున్నాడేమోనని అనుమానించే వడివేలు పాత్ర గుర్తుందిగా. సరిగ్గా దానికి జిరాక్స్ కాపీ లాంటిది ‘నాగవల్లి’లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పోషించిన పాత్ర. అందులో హీరోకు ఓ సహాయకుడు. ఇందులోనూ హీరోకు ఓ సహాయకుడు. బహుశా సీక్వెల్ ముసుగులో తమ హిట్ సినిమాను తామే ఇంత పచ్చిగా, అడుగడుగునా కాపీ కొట్టుకుంటూ మరో సినిమా తీయడం మన చిత్ర సీమల్లోనే సాధ్యం. ఇలాంటి దర్శక, రచయితలను గుడ్డిగా నమ్మి, ఫార్ములా చట్రంలోనే గుడుగుడు గుంజాలాడాలని అనుకోవడం మన సోకాల్డ్ నిర్మాతలు, హీరోల అవివేకం. దీనికి కోట్ల కొద్దీ కుమ్మరించడం దాన్ని మించిన అహంభావం.

కొసమెరుపు -

ఈ సినిమాకు కొందరు మిత్రులం కలసి వెళ్ళాం. ఆఫీసు పని ముగించుకొని, హడావిడిగా రాత్రి భోజనాలు చేసి, సెకండ్ షోకి వెళ్ళాలని ఆలోచన. అడ్వాన్సుగా టికెట్లు తీసుకొద్దామని ఓ మిత్రుడు ఆటకు రెండున్నర గంటల ముందే హాలుకు వెళ్ళాడు. టికెట్లిమ్మంటే కౌంటర్ వాడు వాడి మాతృభాషలో బదులిస్తూ, ఓ కాగితం చూపాడు. దాని మీద రూ. 1000 అని అంకె ఉంది. మన ఊరు కాని ఊళ్ళో ఆ భాష బాగా తెలియకపోయినా, వాడి భావం మాత్రం మా వాడికి బాగా తెలిసింది.

‘‘ఇక్కడ జనం లేక తెరిచిపెట్టుకు కూర్చున్నాం. మునుపటి ఆటకు వచ్చిన కలెక్షనే రూ. 1000 (అంటే 20 మందే వచ్చారన్నమాట). మీరు తాపీగా సినిమా మొదలు కావడానికి పది నిమిషాల ముందు వస్తే చాలు. ఎన్ని టికెట్లంటే అన్ని టికెట్లిస్తాం, హాలంతా మీదే’’ అన్నది కౌంటర్ వాడి కామెంట్ భావం. అయినా ధైర్యం చేసి సినిమాకు వెళ్ళి, మా లాంటి మరో 25 మంది సినిమా పిచ్చి వాళ్ళతో హాలంతా ఏలుతూ సినిమా చూసేశాం. కానీ, మరునాడు ఉదయం పేపర్లో ‘‘ఈ ఏటి మేటి 5 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ’’అంటూ నాగవల్లి వాణిజ్య ప్రకటన చూశాక, నమ్మాలో, నవ్వాలో అర్థం కాలేదు.

Thursday, December 23, 2010

వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’



ఓ సినిమా పొరపాటునో, గ్రహపాటునో, అనుకోకుండా అన్నీ కుదిరో హిట్టయితే చాలు - ఆ కథను వివిధ భాషల్లో తెరకెక్కించడానికీ, అదే ఫార్ములాతో రకరకాల కథలు అల్లుకోవడానికీ మన దర్శక - నిర్మాతలు అత్యుత్సాహం చూపిస్తుంటారు. పదిహేడేళ్ళ క్రితం మలయాళంలో హిట్టయిన ‘మణి చిత్ర తాళు’ కథ ఇప్పటికి ఎన్ని రూపాలు ధరించిందో చూస్తే, ఆ మాట కచ్చితంగా నిజమని ఎవరైనా ఇట్టే చెప్పవచ్చు. కేరళ ప్రాంతపు ఓ రాజవంశంలో జరిగిన నిజ జీవిత కథగా ప్రచారంలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని ఆ మలయాళ చిత్రం తయారైంది. ప్రజాదరణ పొందిన ఆ చిత్రంలో నాయిక పాత్ర నటి శోభనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్నీ తెచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే - ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ కూడా జరుపుకొంది.

రీమేకులు తీయడంలో దిట్ట అయిన దర్శకుడు పి. వాసు అదే సినిమాను కన్నడంలో ‘ఆప్తమిత్ర’గా, తమిళంలో ‘చంద్రముఖి’గా రూపొందించారు. రెండూ సూపర్ హిట్ కావడంతో వాసులో మరో ఆశ మొగ్గ తొడిగింది. ఈ కథకు కొనసాగింపుగా మరో కథ అల్లుకొని, ‘చంద్రముఖి -2’గా రజనీకాంత్ తోనే మళ్ళీ తీయాలని తెగ ఉత్సాహపడ్డారు. కానీ, రజనీ పచ్చజెండా ఊపకపోవడంతో, ఆ కథనే కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ తో ‘ఆప్త రక్షక’గా తీశారు. సరిగ్గా విష్ణువర్ధన్ మరణం, ఆ సినిమా రిలీజు ఒకే సమయంలో జరగడంతో ఆ మహానటుడి ఆఖరి సినిమాగా జనం ఆ కథకు బ్రహ్మరథం పట్టారు. దాంతో, సహజంగానే దాని తెలుగు రీమేక్ కు మన వాళ్ళు ఎగబడ్డారు. రీమేకుల నిర్మాణానికి వేయి కళ్ళతో కాచుకొని ఉండే బెల్లంకొండ సురేశ్ తెలుగులో దీని హక్కులు తీసుకున్నారు. పి. వాసు దర్శకత్వంలోనే ఇది ‘నాగవల్లి’గా రీమేక్ అయింది.

రజనీకాంత్ నటించిన పాత్రకు కొనసాగింపు, విభిన్నమైన గెటప్ తో కూడిన రాజు పాత్ర లాంటివి కన్నడ మాతృకలో చూసి మురిసిపోయిన తెలుగు హీరో వెంకటేశ్ ఏరి కోరి ఈ రీమేక్ లో నటించారు. కానీ, ఎంత ఆత్మల కథ అయినా కథలో ఆత్మ లేకపోతే, లాభం లేదని మరో మారు ‘నాగవల్లి’ నిరూపించింది. నటుడనే వాడికి రకరకాల పాత్రల మీద ప్రేమ ఉంటే చాలదు, ఆ పాత్రపోషణకు మనం సరిపోతామా, లేదా అన్న ఆలోచన, అవగాహన కూడా ఉండాలని ‘నాగవల్లి’ చూస్తే అర్థమవుతుంది. మానిటర్లో చేసిన షాట్ చూసుకొనే సౌకర్యాలు సైతం ఉన్న ఈ రోజుల్లో ఈ చిత్రంలోని నటీనటులు, దర్శకుడు పాత్రపోషణకు కావాల్సిన కనీసపు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు కనిపించదు.

అసలు ‘చంద్రముఖి’ సినిమాలో ఏ అంశం జనానికి అంతగా పట్టిందో అర్థం కాక ఇప్పటికీ కొందరు జుట్టు పీక్కుంటున్న తరుణంలో, దానికి సీక్వెల్ నంటూ ‘నాగవల్లి..... చంద్రముఖి’ వచ్చింది. నూరేళ్ళ పైచిలుకు నాటి చంద్రముఖి తైలవర్ణ చిత్రం ఓ చిత్రకారుడికి దొరకడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ వర్ణచిత్రం కారణంగా చిత్రకారుడు మరణించడం, శాస్త్రీయ నృత్య పోటీల్లో ఆ చిత్రాన్ని బహుమతిగా పొందిన వెంటనే గాయత్రి (కమలినీ ముఖర్జీ) భర్త యాక్సిడెంట్ కు గురై మరణించడం, ఆ పటాన్ని తెచ్చుకున్న గాయత్రి కుటుంబంలో ఆడపిల్ల పెళ్ళిళ్ళు చెడిపోతూ ఉండడం లాంటివన్నీ జరుగుతాయి. తిరుపతి సమీపంలో ఓ కలవారి ఇంట్లో ఓ 30 అడుగుల పాము కనిపిస్తుంటుంది. ఆ చిత్రవిచిత్ర సమస్యలన్నిటి నుంచి బయట పడడం కోసం వారు దైవశక్తి గల రామచంద్ర సిద్ధాంతి (అవినాశ్)ని కలుస్తారు. ఈ చంద్రముఖి వ్యవహారాన్ని పరిష్కరించేందుకు గతంలో తనకు సాయపడ్డ సైకియాట్రిస్ట్ కు సహచరుడైన డాక్టర్ విజయ్ (వెంకటేశ్)ను ఆయన పిలిపిస్తారు.

ఆ సైకియాట్రిస్ట్ హేతుబద్ధంగా, ఈ సిద్ధాంతి దైవ - దుష్టశక్తుల పట్ల నమ్మకాల పరంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒకప్పటి చంద్రముఖి ఆ ఇంట్లోని ఎవరిని ఆవహించి ఉందో తెలుసుకొనే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ కృషిలో భాగంగా నూరేళ్ళ పైచిలుకు క్రితం నాటి వెంకటాపురం రాజు చరిత్రను విజయ్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ నాగభైరవ రాజశేఖరుడు (మళ్ళీ వెంకటేశే) ఎవరు, ఏమిటి, ఏం చేశాడు, అతనికీ - తంజావూరు ప్రాంత నర్తకి చంద్రముఖికీ ఉన్న సంబంధం ఏమిటి లాంటి అనేక అంశాల గత చరిత్రను తెలుసుకుంటాడు.

ఆ తరువాత ఏం జరిగింది, ఆ ఇంట్లో చంద్రముఖిలా ప్రవర్తిస్తున్నది ఎవరు లాంటి సస్పెన్స్ నిండిన అంశాలతో మిగిలిన సినిమా నడిచింది. సినిమా అంతటా చంద్రముఖి ఆత్మ ప్రస్తావన వస్తుందన్న మాటే కానీ, కథలో మనల్ని కట్టిపడేసే ఆత్మే ఎక్కడా లేదు. ఏ ఘట్టంలోనూ ప్రేక్షకుణ్ణి తనతో పాటు ప్రయాణం చెయ్యనివ్వని దృశ్యాలు, సంఘటనల సమాహారం ఈ చిత్రం. అందుకే, ‘నాగవల్లి’ని చూస్తుంటే, మనం తెర మీద కన్నా చేతికున్న వాచీని ఎక్కువగా చూస్తాం.

( ‘నాగవల్లి’లోని లోటుపాట్లు, వెంకటేశ్ చేసిన తప్పేమిటి. ఒప్పేమిటి వగైరా వివరాల మిగతా భాగం తరువాయి పోస్టులో...)

Sunday, December 19, 2010

బాగానే ఉందనిపించే ‘ఆరెంజ్’ జనానికి ఎందుకు నచ్చలేదు?

(‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం? - పార్ట్ 2)

ఫస్టాఫ్ మొదలు అప్పటి దాకా ‘ఆరెంజ్’ కథానాయక పాత్ర ప్రతిపాదించిన అంశాలతో సహానుభూతి చెందుతున్న ప్రేక్షకులను నాగబాబు పాత్ర హితోపదేశ ఘట్టం నుంచి దర్శకుడే స్వయంగా దూరం చేసుకున్నారనిపిస్తుంది. ప్రేమ విషయంలో హీరో భావాలకూ, అభిప్రాయాలకూ కారణం - అతని గత జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలేనని సినిమాలో చూపిన ఫ్లాష్ బ్యాక్ తో అర్థమవుతుంది. ఆ అభిప్రాయాలు, ఆ సంఘటనలతో యువతరం ప్రేమికుల నుంచి పెళ్ళయిన పెద్దల దాకా అందరూ ఎంతో కొంత కనెక్ట్ అవుతారు. కానీ, ఆ తరువాత కేవలం నాగబాబు చెప్పిన నాలుగు మాటలతో హీరో ఒక్కసారిగా తన పంథానే మార్చేసుకోవడం ఏ మాత్రం నమ్మబుద్ధిగా, ప్రేక్షకులకు సంతృప్తిగా అనిపించదు. అప్పటిదాకా తెరపై దృశ్యాలతో సంలీనమై ఉన్నవాళ్ళను ఒక్కసారిగా వెనక్కి రప్పించే సన్నివేశాలు ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా వచ్చేస్తాయి.

హీరో అప్పటి దాకా తాను ప్రవచించిన సిద్ధాంతాలను వదిలేసుకోవడానికి సిద్ధమై, హీరోయిన్ ప్రేమ కోసం ఆమె వెంటబడుతున్నట్లుగా అక్కడ నుంచి కథ దిశ మార్చుకుంది. వ్యక్తిగత ఇష్టానిష్టాలను మరచి, తెర మీద కథానాయకుడు చెప్పిన సిద్ధాంతాలను తలకెక్కించుకున్న వారికి సైతం ఈ అనూహ్యమైన అకస్మాత్తు మార్పు ఏ మాత్రం మింగుడు పడే విషయం కాదు.

హీరో అంటే సామాన్య తెలుగు ప్రేక్షకులకు విజేత అనే అర్థం. హీరో పాత్ర అనుకున్నది, చేసేదే కరెక్ట్. ఎప్పటికైనా అతని వాదనే నిలవాలి, గెలవాలి తప్ప, మరొకరి ముందు అతని వాదన నీరు గారిపోయినట్లు చూపిస్తే, సగటు ప్రేక్షకులను మెప్పించలేం. పైపెచ్చు, ఈ సినిమాలో హీరో అలా వాదన మార్చుకోవడానికి తగిన కారణం కానీ, సంఘటనలు కానీ - సందర్భాలు కానీ (ఫ్లాష్ బ్యాక్ లో లాగా) లేనే లేవు.

ఇక అక్కడ నుంచి దర్శకుడికి కూడా కథ ఎలా నడపాలనే గందరగోళం వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే, హీరో పాత్ర ద్వారా తాను ప్రవచించదలచిన, అప్పటి దాకా ప్రవచిస్తూ వచ్చిన అంశాన్ని పక్కనబెట్టి, మళ్ళీ రొటీన్ గా హీరో, హీరోయిన్లను కలపాలని చూశారు. అలా కాకుండా, హీరో ఆది నుంచి చెబుతూ వస్తున్న సిద్ధాంతాన్నే చూపుతూ, హీరో, హీరోయిన్ల ప్రేమ పెళ్ళి పీటలకు ఎక్కలేదని వాస్తవిక రీతిలో చెబుతూ, ముగించడానికి భయపడ్డారేమో అనిపిస్తుంది.

హీరో పాత్రచిత్రణకు నప్పని రీతిలో కథ చివరి భాగం సాగడంతో, ఆరెంజ్ ఏ వర్గానికీ సంతృప్తి నివ్వలేదు. ఈ సినిమా ఇంతగా పరాజయం పాలవడానికి నాకు అనిపించిన, కనిపించిన ప్రధాన కారణం అది. అలాగే, సినిమాలో జెనీలియా మేకప్ కానీ, ఆమె నటన కానీ బాగాలేవని చెప్పక తప్పదు. ఇక, తెరపై దృశ్యాల్లోని రంగుల గాఢతను కావలసినట్లుగా మార్చుకోవడం కోసం చేసిన డి.ఐ. (డిజిటల్ ఇంటర్మీడియట్) ప్రక్రియ కూడా నాసిగా ఉంది. అందుకే కావచ్చు - సినిమాలో చాలా చోట్ల హీరో, ప్రత్యేకించి హీరోయిన్ మేకప్ లు ముఖానికి మెత్తినట్లుగా, తెల్ల తెల్లగా, ముద్ద ముద్దగా ఉన్నట్లు అనిపించాయి. ఇక, హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు ప్రభు, హీరోయిన్ అక్కబావలుగా నటుడు మహేశ్ బాబా సొంత అక్క మంజుల, బావ సంజయ్ స్వరూప్ లు నటించడం వల్ల సినిమాకు వచ్చిన అదనపు హంగేమీ లేదు. నటనలో అంతంత మాత్రం, తెలుగు డైలాగులకు డబ్బింగ్ సాయం అవసరమైన వీరందరినీ ఎందుకు తెచ్చుకున్నారో దర్శకుడు భాస్కర్ కు తెలియాలి.

నిజం చెప్పాలంటే - ఈ సినిమాలో హారిస్ జైరాజ్ బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగినా, అనకాపల్లిలో జరిగినా పెద్ద తేడా లేని ఈ కథను ప్రత్యేకించి హిందీ చిత్రాల ఫక్కీలో ఆస్ట్రేలియాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపారు. పప్పీ పాత్రలో బ్రహ్మానందం బాగానే నవ్వించారు. ‘ప్రేమంటే - నాలుగు అబద్ధాలు, మూడు ఎస్.ఎం.ఎస్.లు, రెండు కుళ్ళు జోకులు’, ‘మొదట ప్రేమిస్తాం. ఆ తరువాత పుట్టిన పిల్లల కోసం ఆ బంధాన్ని కొనసాగిస్తాం’ తరహా మాటలూ గుర్తుంటాయి. ఒక్కో సినిమాకూ నటుడిగా మెరుగుపడుతున్న రామ్ చరణ్ తేజ్ లోని నటుడికి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఘట్టం ఓ ఉదాహరణ. ప్రేమ కోసం జీవితాన్నే అబద్ధాలమయంగా మార్చుకోలేనంటూ ప్రేయసి ఇంటి నుంచి వచ్చేస్తూ, కథానాయక పాత్ర మాట్లాడే మాటలు, చేసే నటన రామ్ చరణ్ లోని మెరుగుదలకు మచ్చుతునకలు.

ఇలా సినిమాలో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. కానీ, సెకండాఫ్ లో సగమయ్యాక హీరో పాత్ర చిత్రణలో వచ్చిన అకస్మాత్తు మార్పుతో, పూర్తిగా ఈ సినిమా కథే అడ్డం తిరిగింది. మిగతా లోపాలకు ఇది తోడై, కుండెడు పాలల్లో ఒక్క విషపు బొట్టు చిందినట్లయింది. ‘ఆరెంజ్’కు అదే పెద్ద శాపం. మంచి కథాంశాన్ని ఎంచుకున్నా, దాన్ని సమర్థంగా పాత్రల ద్వారా చివరి వరకు డ్రైవ్ చేయకపోతే, విమర్శకుల పరంగానూ, వాణిజ్యపరంగానూ మిగిలేది అసంతృప్తేనని ఆరెంజ్ ఋజువు చేసింది.

Saturday, December 18, 2010

‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం?

ప్రతి పెద్ద తెలుగు సినిమా వచ్చే మా ఊళ్ళో ఎందుకనో రామ్ చరణ్ తేజ్ ‘ఆరెంజ్’ సినిమా విడుదల కాలేదు. దాంతో, నేను చూడ లేదు. అనుకోకుండా ఇవాళ ఇక్కడ ఓ షో వేస్తే హడావిడిగా వెళ్ళి చూశా. వెళ్ళేటప్పటికి పది నిమిషాల ఆట అయిపోయింది కానీ, ఆద్యంతం కదలకుండా చూశా. బాక్సాఫీస్ దగ్గర సినిమా అడ్డంగా దొరికిపోయిందని (ఈ తెలుగు టీవీ భాషకు పాఠకులు నన్ను మన్నింతురు గాక) ఇప్పటికే విన్నాను. అయినా సరే, సినిమా చూస్తే, విశ్రాంతి దాకా వచ్చేసరికి నాకే డౌట్ వచ్చింది. సినిమా ఫరవాలేదు - బాగానే ఉంది కదా. మరి, ఎందుకింత నెగటివ్ టాక్ వచ్చింది అని నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దానికి సమాధానం సెకండాఫ్ లో కాసేపైన తరువాత నుంచి నాకు దొరికింది.

మొత్తం సినిమా చూశాక, కొత్త కథాంశంతో తీసిన ఈ సినిమా జనానికి ఎందుకు నచ్చి ఉండకపోవచ్చనడానికి నాకు కొన్ని కారణాలు తట్టాయి. వాటిని మీతో పంచుకుంటాను.

నిజం చెప్పాలంటే - ఈ చిత్ర కథకు తీసుకున్న అంశం చాలా మంచిది. ప్రేమలో ఏ మేరకు నిజాయతీ ఉంటోంది, ఓ మనిషిని జీవితాంతం ఒకే రకంగా ప్రేమించడం సాధ్యమా లాంటి సున్నితమైన అంశాలను ఈ కథలో డీల్ చేశారు. ఎలాంటి అబద్ధాలూ లేకుండా, జీవితాంతం ఒక వ్యక్తిని ప్రేమించడం కుదిరేపని కాదన్న కథానాయకుడు రామ్ పాత్ర (రామ్ చరణ్ తేజ్) దృష్టి కోణం నుంచి కథ మొత్తం నడుస్తుంది. ఈ చిన్న అంశం మీద ఐటమ్ సాంగ్ లు, విలన్లు, ఛేజ్ లు, భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ లాంటివేమీ లేకుండా సంసారపక్షపు సినిమా తీయడమంటే - ఇవాళ్టి తెలుగు సినీ వ్యాపార లెక్కల ప్రకారమైతే పెద్ద రిస్కు. మామూలు సినిమా కథల ప్రకారం చూసినా సరే, ఎలాంటి హీరోకూ, దర్శకుడికైనా సరే ఇలాంటి అంశాన్నీ, స్క్రిప్టునూ తెర మీద రెండున్నర గంటలు చూపడం కత్తి మీద సాము. అందులోనూ పేరున్న హీరోతో, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ లాంటి మరో పేరున్న దర్శకుడు ఆ సినిమా తీస్తే - అది కత్తి మీద సామే కాదు, పీకల మీద కత్తి కూడా.

అయినా సరే, ఈ దర్శక, హీరోలు ఆ సాహసానికి దిగినందుకు అభినందించాల్సిందే. సన్నటి కథాసూత్రం మీదే నడిపించుకుంటూ వెళ్ళినా, చిత్ర ప్రథమార్ధం ఫరవాలేదన్నట్లుగా గడిచిపోతుంది. కానీ, ద్వితీయార్ధంలో నాగబాబు పోషించిన పాత్రతో హీరోకు గీతోపదేశం చేయించిన దగ్గర నుంచి సినిమా గాడితప్పింది. అప్పటి దాకా హీరో ప్రవర్తనకూ, అతని ఐడియాలకూ, ఐడియాలజీకీ ముక్కున వేలేసుకుంటూనే ముచ్చటపడుతూ వచ్చిన ప్రేక్షకులకు అక్కడ నుంచి షాకుల మీద షాకులు ఎదురవుతాయి.

(మిగతా భాగం తరువాయి పోస్టులో...)

Friday, December 17, 2010

‘3 ఇడియట్స్’లో విజయ్ లేడోచ్! మహేశ్ అయినా ఉన్నాడా?



ఆమిర్ ఖాన్ నటించగా హిందీ చిత్రసీమలో సంచలనాత్మక విజయం సాధించిన ‘3 ఇడియట్స్’ తెలుగులోకీ, తమిళంలోకీ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘రోబో’ ఫేమ్ శంకర్ దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మిస్తున్న ఈ రెండు భాషల రీమేక్ చిత్ర కథ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పుడే అందిన తాజా వార్త... ఆ చిత్ర తమిళ రీమేక్ లో హీరో విజయ్ నటించడం లేదహో.....

నిజానికి, ఈ రీమేక్ చిత్రంలో తమిళంలో విజయ్, తెలుగులో మహేశ్ బాబు నటించాల్సి ఉంది. కానీ, సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందే తమిళ హీరో విజయ్ కూ, దర్శకుడు శంకర్ కూ భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. విగ్ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదని కూడా కోడంబాకమ్ కబురు. మొత్తం మీద ఈ చిత్రంలో విజయ్ ఉన్నాడనీ, లేడనీ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తమ సినిమాలో విజయ్ నటించడం లేదని తేల్చి చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చింది. హీరో విజయ్, తాము ఎంతో సామరస్యపూర్వకంగానే విడిపోయామనీ, ఇప్పుడు 3 ఇడియట్స్ తమిళ రూపం కోసం మరో హీరోను వెతుకుతున్నామనీ తెలిపింది. అన్నట్లు మరో అగ్ర తమిళ హీరోను ఆ పాత్రలో నటింపజేసేందుకు నిశ్చయించుకున్నారు. ఆ నటుణ్ణి ఇప్పటికే సంప్రతించారు కూడా. సదరు అగ్ర హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆ హీరో సూర్య అని కోడంబాకమ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

తమిళ రీమేక్ రూపం మాట అటుంచితే, తెలుగు రీమేక్ వ్యవహారం కూడా అంత సజావుగా సాగుతున్నట్లు లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారవుతున్న ‘దూకుడు’ చిత్రంతో బిజీగా ఉన్న హీరో మహేశ్ బాబు ఈ ‘3 ఇడియట్స్’ కు డేట్లు సర్దలేక సతమతమవుతున్నట్లు కృష్ణానగర్ కబురు. ఆయన ఏకంగా ఈ సినిమాకు గుడ్ బై చెప్పేశాడని కూడా అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఆ సంగతేదో అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అప్పటి దాకా మనకు సస్పెన్సే.

Thursday, December 16, 2010

సర్కారీ ఖజానాకు సినిమా దొంగల గండి

అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మేస్తున్న ఈ పద్ధతుల వల్ల ప్రభుత్వానికి కూడా భారీ నష్టం కలుగుతోంది. నిజానికి, తెలుగు సినిమా తనకు వచ్చే మొత్తం వసూళ్ళ (గ్రాస్‌)లో సగటున 15 శాతం దాకా వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే 'రోబో' లాంటి అనువాద, పరభాషా చిత్రాలకైతే ఆ పన్ను 20 శాతం దాకా ఉంటుంది. కానీ, చిత్ర ప్రదర్శకులు తాము నిజంగా అమ్మిన టికెట్ల సంఖ్య కానీ, వాటి అడ్డగోలు రేటు కానీ బయటపెట్టరు. తక్కువ టికెట్లే, అదీ మామూలు రేటుకే అమ్ముడైనట్లు చూపిస్తారు. అలా వీలైనంత తక్కువ వినోదపు పన్ను చెల్లిస్తారు. అంటే, అడ్డగోలు టికెట్‌ రేట్లతో ప్రేక్షకులకే కాక, ఆ రేట్ల లెక్కన వినోదపు పన్ను కట్టరు కాబట్టి ప్రభుత్వానికి కూడా చాలా నష్టమే!

ఉదాహరణకు, కేవలం 3 లక్షల చిల్లర జనాభాతో రాష్ట్రంలో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న నగరపాలక సంస్థ కడప. ఆ నగరంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ 'మగధీర' (2009) చిత్రానికి రూ. 95 లక్షల దాకా నికర వసూళ్ళు (నెట్ కలెక్షన్స్) లభించాయి. ఇందులో తొలి వారం అడ్డగోలు టికెట్ రేట్లతో సంపాదించినదే రూ. 45 లక్షల దాకా ఉన్నట్లు భోగట్టా. అలాగే, కడపలోనే బాలకృష్ణ 'సింహా' (2010) చిత్రం రూ. 75 – 80 లక్షలు, రజనీకాంత్ - శంకర్ ల 'రోబో' చిత్రం రూ. 85 లక్షలు నికర వసూళ్ళు సాధించాయి. ఉన్న వాస్తవం చెప్పాలంటే, ఆ యా హాళ్ళలోని సీట్ల సంఖ్య, ప్రభుత్వం వారి అధికారిక టికెట్ రేట్ల ప్రకారమైతే - ఈ చిత్రాలు కనీసం రెండేళ్ళు హౌస్ ఫుల్ గా అడినా సరే రావడం అసాధ్యమైన నికర వసూళ్ళు ఇవి. ఇది ప్రేక్షకుల నుంచి చేసిన దోపిడీ అయితే, ప్రభుత్వ ఖజానాకు కూడా మరో దోపిడీ జరుగుతోంది. ఈ వచ్చిన కలెక్షన్లలో 20 నుంచి 25 శాతం మాత్రమే ప్రభుత్వానికి లెక్క చూపిస్తున్నారు. ఆ మేర మాత్రమే వినోదపు పన్ను కడుతున్నారు. మిగతాదంతా జేబులో వేసేసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టేస్తున్నారు.

దొంగలకు దొంగ

ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఓ విషవలయం. ఈ పద్ధతిలో వచ్చిన భారీ కలెక్షన్లను సాకుగా చూపెడుతూ, హీరోలు తమ మామూలు పారితోషికాలను సగటున మూడింతలు పెంచేశారు. నటీనటుల పారితోషికాలు, తద్వారా నిర్మాణ వ్యయం, వగైరా పెరిగాయి. ఫలితంగా, ఆ యా ప్రాంతాలకు సినిమాల అమ్మకాల రేట్లు మారిపోయాయి. అంతలేసి మొత్తాలిచ్చి కొన్నవారు పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవడం కోసం ఇలా మళ్ళీ అడ్డగోలు టికెట్ రేట్లనే ఆశ్రయిస్తున్నారు. వెరసి మొత్తం సినిమా వ్యాపారమే మారిపోయింది. పైరసీతో సహా అనేక రోగాలకు ఇదే మూలం. సినిమా చూడడాన్ని ప్రేక్షకుడికి భారంగా మార్చేయడం పరిశ్రమ వాళ్ళు చేస్తున్న తప్పు. అలా మొదటి తప్పును, అన్నిటికీ మూలమైన తప్పును సినిమా పరిశ్రమవాళ్ళే చేస్తూ, మళ్ళీ పైరసీ లాంటి అవతలివాళ్ళ తప్పుల గురించి గొంతు చించుకుంటున్నారు.

సమస్యలకు మూలమైన ఈ దోషాన్ని కనుక్కొని, దానికి సరైన మందివ్వాల్సింది పోయి, తాత్కాలిక ఉపశమనాల వైపు మన సినిమా పరిశ్రమ పరుగులు తీస్తోంది. ''ఇంతింత రేట్లు పెట్టి టికెట్లు అమ్మడం అన్యాయం, అక్రమం కాదా! పైరసీని తిడుతున్న వారికి దానికి మూలమైన తాము చేస్తున్న ఈ తప్పు గురించి తెలియదా! ఇది ఎలా ఉందంటే - (టికెట్లను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్న) ఒక దొంగ, (పైరసీ చేస్తున్న) మరొక దొంగను చూపెడుతూ, 'దొంగ... దొంగ...' అని అరుస్తున్నట్లుంది'' అని తొలితరం సినీ పాత్రికేయుల్లో ఒకరైన మద్దాలి సత్యనారాయణ శర్మ విమర్శించారు.

పత్రికల వారి పరోక్ష పాపం

అసలు, ఈ పాపంలో సమాచార ప్రసార సాధనాలకూ పరోక్షంగా పాత్ర ఉందంటున్నారు - తెలుగు సినీ రంగ వ్యాపార, పబ్లిసిటీ ధోరణులను 60 ఏళ్ళ పైగా నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్‌ సినీ విశ్లేషకులు కాట్రగడ్డ నరసయ్య. ''ఇవాళ దినపత్రికల్లోని సినిమా కాలమ్స్‌లో ఎంతసేపటికీ చిత్ర నిర్మాణ వార్తలు, గ్లామర్‌ వార్తలే ప్రచురిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా అందచందాల ప్రదర్శనలోనే పడి కొట్టుకుపోతోంది. చిత్ర పరిశ్రమలోని సమస్యలు, వర్తమానంలో ఎదురవుతున్న సంక్షోభాల గురించి రావడమే లేదు. దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటోంది'' అని నరసయ్య వాపోయారు. చిత్ర నిర్మాణ వార్తలతో పాటు పంపిణీ, ప్రదర్శక రంగాలతో కూడిన చిత్ర మార్కెటింగ్‌ వ్యవహారాల వార్తలు, విశ్లేషణలు కూడా విరివిగా మీడియాలో రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి విశ్లేషణాత్మక కథనాల వల్ల మేడిపండు లాంటి చిత్ర పరిశ్రమ లోలోపలి సమస్యలు నలుగురి దృష్టికీ వస్తాయి. పరిష్కారం దిశగా ప్రయత్నాలూ జరుగుతాయి.

మరి, గడచిన వారం నుంచి రానున్న సంక్రాంతి వరకు ఎన్నో క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి. పైరసీ గురించి, ఆ దోపిడీ - దొంగ సొమ్ముల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తున్న పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాల టికెట్‌ రేట్ల ద్వారా చేస్తున్న దోపిడీని ఆపేస్తారా? ముందుగా ప్రేక్షకులనూ, ఆ తరువాత వినోదపు పన్ను తక్కువ చెల్లింపుతో ప్రభుత్వాన్నీ నిస్సిగ్గుగా దోచేస్తూ ఆర్జిస్తున్న దొంగ సొమ్మును వదిలేస్తారా? అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న మన ప్రభుత్వాధికారులు, పాలకులు కళ్ళు తెరుస్తారా? సామాన్యులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు బదులేది!?

Monday, December 13, 2010

బ్లాక్ టికెట్లతో మన హీరోల భారీ రికార్డులు

స్థానిక ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం కావాలని కళ్ళు మూసుకుంటూ ఉండడంతో, ఇవాళ అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మే విధానాలు ఆంధ్రదేశంలో ప్రతి అగ్ర హీరో సినిమాకూ నిత్యకృత్యమయ్యాయి. విడుదలైన సినిమాకు క్రేజు ఉన్నన్ని రోజులూ ఈ జంపింగ్ రేట్లు, ఫ్లాట్ రేట్ల విధానంలోనే టికెట్లు అమ్ముతున్నారు. అత్యధిక శాతం హాళ్ళ వారందరూ ఒక్కో టికెట్‌ రూ. 200 - 300 ఉండే 'జంపింగ్‌ రేట్ల' విధానాన్నే ఆశ్రయిస్తున్నారు. గత పోస్టులోనే చెప్పినట్లు - తెలుగు హీరోల చిత్రాలతో పాటు, తాజా అనువాద చిత్రం ‘రోబో’కు కూడా ఈ పద్ధతే యథేచ్ఛగా కొనసాగింది. ఆ నేపథ్యంలో ‘రోబో’ వసూళ్ళు తొలి వారం పది రోజులకు రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి.

భారీ రికార్డుల్లో బలుపు కన్నా వాపే ఎక్కువ

అగ్ర హీరోల సగటు తెలుగు సినిమా కలెక్షన్లకు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ అడ్డగోలు టికెట్‌ రేట్లతో వస్తున్న తొలి వారం వసూళ్ళే ఆ సినిమాకు మొత్తం మీద వచ్చే కలెక్షన్లలో 60 నుంచి 70 శాతం! ఇది విస్మయం కలిగించే వాస్తవం. ఉదాహరణకు, చిన్న ఎన్టీయార్ నటించిన ‘అదుర్స్’ చిత్రం గుంటూరు జిల్లాలో ఆడిన అన్ని వారాలూ కలిపి మొత్తం రూ. 2.7 కోట్ల మేర వసూళ్ళు సాధించింది. అయితే, అందులో ఒక్క తొలి వారంలో వచ్చినవే రూ. 1.75 నుంచి 1.78 కోట్లు. దీన్నిబట్టి సగటు తెలుగు చిత్రాల మొదటి ఒకటి రెండు వారాల వసూళ్ళలో బలుపు కన్నా వాపే ఎక్కువని ఇట్టే గ్రహించవచ్చు.

ప్రేక్షకులను దోచేస్తున్న ఈ పద్ధతి వల్ల ఒకే ఒక్క ప్రయోజనం ఉంది. ఫ్లాపైన సినిమా కూడా భారీగా నష్టపోకుండా, మొదటి వారం రోజుల కలెక్షన్లతో కొంత మేర పెట్టుబడిని వెనక్కి రప్పించడానికే ఈ పద్ధతి ఉపయోగపడుతోంది. దాదాపు రూ. 35 కోట్ల పైగా ఖర్చుతో రూపొంది, టైటిల్‌ విషయంలో తెలంగాణ ప్రాంతంలో వివాదాస్పదమైన ఓ ప్రముఖ హీరో చిత్రం ఇటీవల పెద్ద ఫ్లాపైంది. అయినా సరే, రాష్ట్రంలో ఆ చిత్రానికి వచ్చిన నికర వసూళ్ళు దాదాపు రూ. 15 కోట్లు. లెక్క చూస్తే, అందులో సగం ఇలా అడ్డగోలు టికెట్లతో తొలి రోజుల్లో వచ్చిన అక్రమ సొమ్మే! ఈ అడ్డగోలు టికెట్‌ అమ్మకాలే లేకపోతే, ఆ సినిమా మరింత నష్టపోయేది. కౌంటర్‌లోనే అమ్మిన బ్లాక్‌ పుణ్యమా అని అంత పెద్ద ఫ్లాప్‌లో కూడా నష్టాన్ని కొంత పూడ్చుకోగలిగింది.

పారిపోతున్న ప్రేక్షకులు - పెరిగిపోతున్న పైరసీ

గతంలో కింది పట్నాల్లో ఇలాంటి వినాశకర ధోరణి ఉన్నా, నెల్లూరు లాంటి పెద్ద పట్నాల్లో అధికారుల నిఘాకు వెరచేవారు. మామూలు రేట్లకే టికెట్లు అమ్మేవారు. కానీ, ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారిపోయింది. అగ్ర హీరోల సినిమాను తొలి రోజుల్లో చూడాలంటే, అయిదుగురు సభ్యుల కుటుంబానికి కనీసం వెయ్యి రూపాయలు టికెట్లకే అవుతోంది! గుంటూరు జిల్లా సంగతే చూస్తే, అక్కడ సగటున ప్రతి పెద్ద సినిమా 22 ప్రింట్లతో విడుదలవుతుంది. ఇప్పుడు వాటిలో 21 ప్రింట్లు ఈ రకంగా అడ్డగోలు టికెట్ రేట్లతోనే ప్రదర్శితమవుతున్నాయి. ఈ రేట్ల దెబ్బతో - హాలుకొచ్చి సినిమా చూడాలంటే ప్రేక్షకుడు భయపడి పారిపోతున్నాడు. అదే సమయంలో సినిమా చూడాలనే కోరికను చంపుకోలేక, చౌకగా దొరికే పైరసీ సీడీలను అనివార్యంగా ఆశ్రయిస్తున్నాడు.

''ఇది చిత్రపరిశ్రమ స్వయంకృతాపరాధం. ప్రేక్షకులను దేవుళ్ళుగా పేర్కొంటూనే, ఎక్కువ రేట్లతో వాళ్ళను మేమే హింసిస్తున్నాం. వాళ్ళను అక్షరాలా దేవుళ్ళ లాగా చూసుకుంటేనే, వాళ్ళు ఒకటికి పదిసార్లు హాళ్ళలో సినిమా చూసి, వరాలిస్తారు. దీర్ఘకాలం పాటు పరిశ్రమను పరిరక్షిస్తారు. కానీ, అలా జరగడం లేదు'' అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్‌ వాపోయారు. ''పరిస్థితి ఎలా ఉందంటే - ఇవాళ వేగంగా కోడిని కోసుకు తిందామని అనుకుంటున్నామే తప్ప, గుడ్లు పెట్టే దాకా ఆగడం లేదు. రోజుకో గుడ్డు తిందామని అనుకోవడం లేదు. అదే జరుగుతున్న పెద్ద తప్పు'' అని ఆయన ఆవేదనగా వ్యాఖ్యానించారు.

(ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న భారీ నష్టం కథా కమామిషు తరువాయి పోస్టులో...)

Saturday, December 11, 2010

‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు

అసలు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా, ఎక్కడికక్కడ లోపాయకారీగా జరుగుతున్న అడ్డగోలు టికెట్ల రేట్ల దోపిడీ విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రబలమైన జాఢ్యంగా విస్తరిస్తోంది. తెలుగునాట సినిమా హాళ్ళలో ప్రస్తుతం టికెట్లను రెండు రకాలుగా అక్షరాలా అధికారికంగా బ్లాకులో అమ్మేస్తున్నారు. అందులో మొదటిది - 'ఫ్లాట్‌ రేట్ల విధానం'. అంటే - బాల్కనీ నుంచి నేల వరకు హాలులోని అన్ని తరగతుల టికెట్లనూ 'ఫ్లాట్‌' రేటున బాల్కనీ టికెట్‌ ధరకే కౌంటర్‌లోనే అమ్మేస్తారు. ఈ పద్ధతిలో 'ముందు వచ్చినవారిని మున్ముందు' పద్ధతిలో, పైనుంచి కిందికి తరగతుల సీట్లను క్రమంగా నింపుతారు. ముందుగా హాల్లోకి వెళితే బాల్కనీలో కూర్చుంటే, పై తరగతులు నిండిపోయాక వెళితే బాల్కనీ రేటిచ్చి కొన్న టికెట్‌తో నేల తరగతిలో కూర్చొని సినిమా చూడాల్సి వస్తుంది. ఇది చాలా ఏళ్ళుగా చిన్న కేంద్రాల్లో సాగుతున్న వ్యవహారం.

ఇక, రెండోది - 'జంపింగ్‌ రేట్ల విధానం'. అంటే - సినిమాకున్న క్రేజును బట్టి, బాల్కనీ అసలు రేటుకు అయిదారు రెట్ల ధరకు టికెట్లన్నీ అధికారికంగా కౌంటర్‌లోనే అమ్మేస్తారు. రోజులు గడిచి, క్రేజు తగ్గే కొద్దీ అడ్డగోలు ధరను తగ్గించుకుంటూ అసలు సిసలు అధికారిక టికెట్‌ రేటు వద్దకు వస్తారు. ఆ లోగా సినిమా చూడాలంటే, ప్రేక్షకుడికి పెనుభారమే. ఈ దశాబ్దం మొదట్లో ఆరంభమైన ఈ అక్రమ వ్యాపారం ఒకప్పటి 'ఇంద్ర' దగ్గర నుంచి నేటి 'రోబో', 'ఆరెంజ్‌'ల వరకు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది.

కొన్ని ఊళ్ళలో అయితే, సినిమా తొలి నుంచి ఆఖరి రోజు వరకూ హాలులోని అన్ని తరగతులకూ ఒకే టికెట్‌ రేటుతో దోపిడీ సాగడం విచిత్రం. ఉదాహరణకు, ప్రకాశం జిల్లా కందుకూరు అనే చిన్న కేంద్రం సంగతే తీసుకుందాం. (తెలుగు సినిమా వ్యాపార పరిభాషలో ‘పాత నెల్లూరు జిల్లా’ పరిధిలోకి వచ్చే ఈ కేంద్రాన్ని చిన్నస్థాయి ‘బి’ సెంటర్ (మైనర్ బి) అంటారు). అక్కడ అధికారికంగా సినిమా హాలులో గరిష్ఠ టికెట్ రేటు సుమారు రూ. 20 మాత్రమే. కానీ, అక్కడ ఏ సినిమా కైనా సరే పై నుంచి కింది దాకా అన్ని తరగతుల టికెట్లనూ రూ. 25 నుంచి రూ. 30 వరకు అమ్ముతుంటారు. ‘‘ఇక్కడ ఆఖరికి నేల టికెట్ కూడా అదే 25 – 30 రూపాయలే. ఈ రోజుతో సినిమా ఆఖరు అన్నప్పుడు మాత్రం ఆ ఒక్క రోజుకు ఏ తరగతి టికెట్ ను ఆ తరగతి రేటుకే అమ్ముతారు’’ అని ఆ ఊరి సినిమా ప్రదర్శన సంగతులు తెలిసిన ఓ ప్రేక్షకుడు వివరించారు.

ఇదీ తమిళం నుంచి దిగుమతే!

రజనీకాంత్‌ లాంటి క్రేజీ పెద్ద హీరోల చిత్రాలకు తమిళనాట ఈ 'ఫ్లాట్‌ రేట్లు', 'జంపింగ్‌ రేట్ల' పద్ధతులు అమలులో ఉన్నాయి. అక్కడ నుంచి ఈ జాడ్యాన్ని తెలుగు చిత్రసీమ కూడా చాలా ఏళ్ళ క్రితమే అంటించుకుంది. అంతకు ముందు ఒకటి రెండు చిత్రాలకు జరిగినా, ప్రధానంగా చిరంజీవి నటించిన 'ఇంద్ర' (2002) చిత్రం నుంచి ఈ 'జంపింగ్‌ రేట్ల విధానం' తెలుగు నాట విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో చీరాల లాంటి చిన్న పట్నంలోనే మొదటి రోజున ఒక్కో టికెట్ రూ. 400 చొప్పున కౌంటర్ లో అమ్మేసినట్లు తెలుగు సినీ వ్యాపారవర్గాలు ఆ చరిత్రంతా చెబుతున్నాయి. కాగా, జనంలో క్రేజున్న సినిమాలకు ఇలా దర్జాగా కౌంటర్ లోనే అసలు రేటు కన్నా ఎక్కువ రేటుకు టికెట్లను అమ్మే ‘జంపింగ్ రేట్ల’ విధానం తెలుగునాట ఇప్పుడు ఊరూరా పాకింది. ఇలా వచ్చిన అనధికారిక సొమ్ముతో ఏ సినిమాకు ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించి, జబ్బలు చరుచుకుంటోంది.

పెట్టిన ఖర్చును గబగబా వెనక్కి రప్పించుకోవాలని భారీయెత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన 'రోబో' సినిమాకు టికెట్ల రేట్లు కూడా భారీగానే పెట్టారు. తమిళనాట పెద్ద పెద్ద మల్టీప్లెక్సుల్లో సైతం రూ. 120కి మించి టికెట్‌ రేటు ఉండకూడదనే ప్రభుత్వ నిబంధన ఉంది. దాన్ని పాటిస్తున్నట్లు నటిస్తూ, టికెట్‌ మీద మాత్రం మామూలు రేటే ముద్రించి, 'రోబో' / 'యంతిరన్‌' ప్రేక్షకులకు మాత్రం ఒక్కో టికెట్‌నూ రూ. 200 నుంచి రూ. 500 వరకు అధికారికంగా, కౌంటర్‌లోనే అమ్మేశారు. మద్రాసులో సాగిన ఈ నిలువుదోపిడీకి నేను ప్రత్యక్షసాక్షినే కాక, బాధితుణ్ణి కూడా. తమిళనాట తెలుగు అనువాద చిత్రం 'రోబో'ను ప్రదర్శిస్తున్న హాళ్ళు కూడా ఈ దోపిడీలో యథేచ్ఛగా పాల్గొన్నాయి. ఆ రకంగా తొలినాళ్ళలోనే సినిమా చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తినీ, బలహీనతనూ ఆసరాగా తీసుకొని, డబ్బులు దండుకుంటున్నారు.

(బ్లాక్ టికెట్లతో మన తెలుగు చిత్రాల భారీ రికార్డుల భాగోతం కథ తరువాయి పోస్టులో...)

Monday, December 6, 2010

నను వీడని నీడ - అయోధ్య



ఈ మధ్య అయోధ్య అంశంపై లక్నో ధర్మాసనం తీర్పు వెలువరించినప్పుడు నేనొక్కసారిగా గతంలోకి వెళ్ళా. మళ్ళీ ఇవాళ సరిగ్గా 18 ఏళ్ళ క్రితం అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురైనప్పటి సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి. అది నేను పూర్తిస్థాయి జర్నలిజం ఉద్యోగంలో చేరిన తొలి రోజుల సంగతి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు దినపత్రిక ‘ఈనాడు’లో జర్నలిజమ్ పాఠాలు బూదరాజు రాధాకృష్ణ లాంటి పెద్దల వద్ద గురు ముఖతః నేర్చుకొని, పత్రిక సంపాదకవర్గంలో నేను, నా బ్యాచ్ మేట్లు అప్పుడే చేరాం.

మా బ్యాచ్ లో టాప్ లో నిలిచిన అయిదుగురిని జనరల్ డెస్కులో వేశారు. ఆ అయిదుగురిలో నేనూ ఒకడిని. జనరల్ డెస్కు అంటే పత్రికలోని మొదటి పేజీతో సహా ప్రధానమైన పేజీల్లో వచ్చే జాతీయ, అంతర్జాతీయ వార్తలను తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువదించడం, శీర్షికలు పెట్టడం, మొదటి పేజీలో వచ్చే స్థానిక వార్తలను రిపోర్టర్లు తెలుగులో రాసిస్తే, దిద్ది, హెడ్డింగులు పెట్టడం వగైరా పనులు ఉంటాయి. ఎంత బాగా చదువుకున్నవాళ్ళమైనా సరే, మేము కొత్తగా పనిలోకి దిగినవాళ్ళం గనక మమ్మల్ని జర్నలిజమ్ పరిభాషలో చెప్పాలంటే ‘కబ్’ జర్నలిస్టులుగానే చూసేవారు. అచ్చతెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పిల్లకాకులు’ అన్నమాట.

అప్పటికి ఆఫీసులో అత్యధిక శాతం మంది నేరుగా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళే తప్ప, జర్నలిజం స్కూలులో ఓనమాలు దిద్దుకొని వచ్చినవాళ్ళు కాదు. దాంతో, కొండొకచో కొందరికి మా మీద కాస్తంత గుర్రుగా కూడా ఉండేది. మాకు ఏమీ రాదని నిరూపించాలని కూడా ఒకరిద్దరు సీనియర్లకు మహా పంతంగా ఉండేది. అలా ఎందుకు అనుకొనేవారో మాకు (కనీసం నాకు) అర్థమయ్యేది కాదు. ఇలాంటివన్నీ జర్నలిజమ్ రంగంలో సర్వసాధారణంగా ఉండే జాడ్యాలని ఆ తరువాతెప్పటికో కానీ మాకు తెలియలేదు.

నిజానికి, వారితో తగాదా పడాలనో, వాళ్ళ కన్నా మేమేదో ఊడబొడవగలమని చెప్పాలనో మాలో ఎవరికీ ఉండేది కాదు. పైగా, మాలో అందరికీ అదే తొలి ఉద్యోగం. నేనైతే అప్పుడే కాలేజ్ నుంచి, మా ఊరి నుంచి ఫ్రెష్ గా ఉద్యోగంలోకి వచ్చినవాణ్ణి. బయటి ప్రపంచం కూడా పెద్దగా తెలియదంటే నమ్మండి. (అఫ్ కోర్స్... ఇప్పటికీ నాకు తెలియదు లెండి. మా అన్నయ్యలు, అక్కయ్యలు ఆ మాటే పదే పదే చెబుతుంటారు. అది వేరే కథ).

అది 1992 డిసెంబర్ 6వ తేదీ. అప్పటికి మేము డెస్కులో చేరి నిండా రెండు నెలలైనట్లుంది. అంతే. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం జోరుగా సాగుతోంది. ఆ రోజు ఉదయం నేను మా అద్దె గదిలో ఉన్నాను. ఇల్లుగలవాళ్ళ వాటాకు వెనకాలగా మా గది ఉండేది. అందులో నేను, ధన్వంతరి అనే ఇంకో మిత్రుడు ఉండేవాళ్ళం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా ఇల్లు గల వాళ్ళ వాటాలోని టీవీ పెద్దగా వినిపిస్తోంది. అయోధ్యలో వివాదాస్పద కట్టడం మీద కరసేవకులు ఎక్కి ధ్వంసం చేస్తున్న దృశ్యాలను బి.బి.సి. ప్రసారం చేస్తోంది.

ఇల్లు గల వాళ్ళబ్బాయి చెప్పడంతో నేను హడావిడిగా వెళ్ళి, కాసేపు ఆ దృశ్యాలు టీవీలో చూశాను. జరుగుతున్న పరిణామాలు ఓ పెద్ద చరిత్ర కాబోతున్నాయన్న గ్రహింపు నాకు అప్పటికి ఏ మేరకు ఉందో చెప్పలేను కానీ, ఆ రోజుకు పేపర్లో అదే పతాక శీర్షిక అన్న సంగతి మాత్రం అర్థమైంది.

మధ్యాహ్నం మెస్ లో భోజనం చేసి, యథాప్రకారం సాయంత్రం డ్యూటీకి అటు నుంచి అటే వెళ్ళిపోయా. అప్పటికే టెలిప్రింటర్ మీద వివాదాస్పద కట్టడం విధ్వంసం వార్తలు కట్టలు కట్టలుగా వచ్చి పడ్డాయి. వివాదాస్పద కట్టడంలోని మూడు గుమ్మటాల్లో ఒక్కొక్కటి విధ్వంసాని గురై, సాయంత్రం 3.30 – 4 గంటల మధ్య ఆఖరి గుమ్మటం కూడా కూల్చివేతకు గురైందని తెలిసింది.

ఆ రోజు ఎందుకనో డ్యూటీలో ఒకే ఒక్క సీనియర్ మినహా మిగతా సీనియర్లు ఎవరూ లేరు. దాంతో, అనివార్యంగా, మా కుర్రకారుకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఆనాటి బ్యానర్ వార్త రాసే అవకాశం మాకు దక్కింది.

వార్తలన్నీ రెండు నెలలైనా అనుభవం లేని మేము రాస్తే, ఉన్న ఒక్క సీనియర్ వాటిని సమన్వయం చేసుకుంటూ, సూపర్ లీడ్ వగైరా రాశారు. డ్యూటీలో అనుభవజ్ఞులు ఎవరూ లేకపోవడంతో చేరిన రెండు నెలలకే మొదటి పేజీలోని పతాక వార్త రాసే అవకాశం, అదృష్టం మాకు దక్కాయి. ఆ రోజున సమయానికి తగ్గట్లుగా చేతికి అందివచ్చి, నేను, మా బ్యాచ్ మేట్లు (సూరావజ్ఝల రాము, ఇసికేల ఉదయకుమార్, పమిడికాల్వ మధుసూదన్,వగైరా అని గుర్తు) బ్యానర్ రాయడం ఓ సంచలనమే అయింది.

అప్పట్లో బ్యానర్ రాయడమంటే పెద్ద ఎఛివ్ మెంట్. చేరిన ఎన్నో నెలలకూ, ఏళ్ళకు కానీ బ్యానర్ రాసే అవకాశం వచ్చేది కాదు, ఇచ్చేవారూ కాదు. అలాంటిది అయోధ్య అంశం మాకు అనుకోని అవకాశంగా పరిణమించి, మాలోని పనితనాన్ని సీనియర్లకు తెలిసేలా చేసింది. మరునాడు (అంటే, 1992 డిసెంబర్ 7) ఉదయం పొద్దున్నే పేపర్లో మా రాతలు మేమే బ్యానర్లో చూసుకొని, ఉద్విగ్నతకు గురయ్యాం.

వివాదాస్పద కట్టడం విధ్వంసం తాలూకు పరిణామాలు దేశ చరిత్రను ఎంతో ప్రభావితం చేయడమనేది తరువాతి చరిత్ర. ఇప్పుడు మొన్నీమధ్య అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో ధర్మాసనం అయోధ్య అంశంపై తీర్పు సందర్భంలో నాకు ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. యాదృచ్ఛికంగా, ఇప్పుడు కూడా ఆ వార్తలు రాసి, పాఠకులతో పంచుకొనే అవకాశం నాకు వచ్చింది.

సుప్రీమ్ కోర్టు జోక్యంతో మొదట తీర్పు వాయిదా పడ్డ వారం, ఆఖరికి సెప్టెంబర్ 30న లక్నో ధర్మాసనం తీర్పు నిచ్చిన వారం - వరుసగా ఈ రెండు వారాలూ, ఈ రెండు సందర్భాల్లోనూ ‘ఇండియా టుడే’ తెలుగు వారపత్రిక ముఖచిత్ర కథనాలు నేను, నా సహోద్యోగి మరొకరు (ఒకవారం నేను, మూర్తి గారు, మరొకవారం నేను, ధూర్జటి గారు) కలసి తెలుగు చేసి, అందించాం. డైలీకి బ్యానర్ ఎలాగో, వీక్లీకి కవర్ స్టోరీ అలాగన్నది తెలిసిందేగా. ఉద్యోగానికి కొత్త అయిన అప్పుడూ, అనుభవం వచ్చిన ఇప్పుడూ - రెండు సార్లూ అయోధ్య అంశం కీలక వార్తలు యాదృచ్ఛికంగా నేనే రాయడం నా కెరీర్ లో ఓ చెరగని జ్ఞాపకం.

కొసమెరుపు -

అన్నట్లు అప్పట్లో జర్నలిజమ్ స్కూల్ లో చేరడానికి పరీక్ష రాయాలంటే, అప్లికేషన్ తో పాటు ఏదైనా సమకాలీన అంశం మీద ఓ వ్యాసం రాసి పంపాల్సి ఉండేది. ఆ వ్యాసం ఆధారంగా మన రచనా సామర్థ్యాన్ని అంచనా కట్టి, పరీక్షకు పిలిచేవారు. అందులో పాసైతే, ఆ పైన ఇంటర్వ్యూ. అక్కడా పాసైతే, అప్పుడు జర్నలిజమ్ స్కూల్లో అడ్మిషన్. అలా నేను 1991 చివరలోనో, 1992 జనవరిలోనో ‘ఈనాడు’ జర్నలిజమ్ స్కూల్ కు అప్లికేషన్ పెడుతూ, రాసిన మొదటి వ్యాసం కూడా అప్పటికే బర్నింగ్ టాపిక్ అయిన అయోధ్య మీదే.

అప్పుడే డిగ్రీ పూర్తి చేసి, బయటకొచ్చిన ఆవేశంలో అయోధ్యపై (‘ఆరని రావణకాష్ఠం అయోధ్య’ అన్న టైటిల్ తో అనుకుంటా) ఘాటుగా వ్యాసం రాసి, అప్లికేషన్ తో పంపా. అది చూసి పరీక్షకు పిలవడం, ఆ పై ఇంటర్వ్యూ, అడ్మిషన్, జర్నలిజమ్ లో ప్రవేశం - అన్నీ జరిగిపోయాయి. అలా జర్నలిజమ్ లోకి నా పూర్తి కాలిక ప్రవేశానికి కూడా అయోధ్యతో సంబంధం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ వృత్తిలో కొనసాగుతున్నా. మరి, అయోధ్యతో ఈ నా బంధం యాదృచ్ఛికమా? దైవ ఘటనా? జననాంతర సౌహృదమా, సంబంధమా? మరేదన్నానా!? ఏమో!? మీరేమంటారు!

(అయోధ్యలో నా ప్రత్యక్ష అనుభవం గురించి మరోరోజు... మరోసారి....)

Sunday, December 5, 2010

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!



ఈ మధ్య 'రగడ‌' చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు 'ఆరెంజ్‌' చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం - దారుణమైన పైరసీ! దీన్ని అందరూ ఖండించాల్సిందే! పైరసీని నిరోధించాల్సిందే! ఒక్క క్షణం ఆ సంగతి అటుంచి, ఇప్పుడు నాణానికి రెండో కోణం చూద్దాం. ఇంత పైరసీ అసలు ఎలా పెరుగుతోంది? దీనికి హీరోలు, దర్శక - నిర్మాతల బాధ్యత ఏమిటి? ప్రేక్షకులు హాలుకు వెళ్ళడం మానేసి, పైరసీ సీడీలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఈ విషయాలన్నీ లోతుగా ఆలోచిస్తే, పైరసీకి కారణమై, ఊరూరా పాకుతూ, తెలుగు సినిమాను తినేస్తున్న క్యాన్సర్‌ కనిపిస్తుంది. అది ఏమిటంటే - సామాన్యుడికి అందుబాటులో లేని సినిమా టికెట్‌ రేట్లు!

టికెట్ రేట్ల వ్యవహారం ఎప్పుడూ ఉన్నదే కదా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాలను కాస్త పక్కనపెడదాం. రాష్ట్రంలోని మిగిలిన ఏ ఊళ్ళోనైనా అగ్ర హీరోల సినిమాకు విడుదలైన తొలి రోజుల్లో వెళ్ళి చూశారా. వెళ్ళి చూస్తే, చూద్దాం. సినిమా హాళ్ళలో పబ్లిక్‌గా ప్రేక్షక జనానికి జరుగుతున్న నిలువు దోపిడీ కళ్ళెదురుగా కనబడుతుంది. సినిమాకున్న క్రేజును బట్టి హాలు కౌంటర్‌లోనే అధికారికంగా టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హీరోల తెలుగు చిత్రాలు సగటున 250 నుంచి 300 కేంద్రాల్లో విడుదలవుతున్నాయి.
సినీ వ్యాపార పరిభాషలో ఈ కేంద్రాలను ఏ ప్లస్ (హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటివి), ఏ (తెనాలి, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటివి), మేజర్ బి, మైనర్ బి, మేజర్ సి, మైనర్ సి - అనే ఆరు వర్గాలుగా వర్గీకరిస్తుంటారు.

ఇందులో ప్రభుత్వ అధికారుల నిఘా ఎంతో కొంత ఉండే 'ఏ ప్లస్‌' కేంద్రాల్లో తప్ప, మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఇష్టారాజ్యంగా సాగుతోంది. ...రాష్ట్రంలో మహా అయితే ఓ 10 కేంద్రాలు మినహా, మిగిలిన అన్ని చోట్లా ఈ దోపిడీ సాగుతోంది. ఒకప్పుడు హాలు బయట ఎవరో, అదీ కొన్ని టికెట్లే బ్లాకులో అమ్మేవారు, అమ్మించేవారు. కానీ, ఇవాళ బాహాటంగా బుకింగ్ లోనే అన్ని టికెట్లూ బ్లాకులో అమ్మేస్తున్నారు... అని సినిమా పంపిణీ, ప్రదర్శక రంగాలపై పట్టున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో ఏ తెలుగు సినిమా అయినా చూడండి. ఆరంభంలోని ఈ అడ్డగోలు టికెట్ రేట్ల పుణ్యమా అని ప్రతి అగ్రహీరో తెలుగు సినిమా తొలి వారంలోనే కోట్ల కొద్దీ ఆర్జిస్తోంది. చిత్రం ఏమిటంటే - బాగా లేదని టాక్ వచ్చిన సినిమాకు కూడా తొలినాళ్ళ కలెక్షన్లు కళ్ళు తిరిగేలా ఉంటున్నాయి. దీనికి కారణం - ఇలా అడ్డగోలు రేట్లకు టికెట్లను అమ్మే విధానమే. నిజానికి, ప్రభుత్వపరంగా ఈ విధానానికి అనుమతి లేదు. గతంలో జై చిరంజీవ (2005 డిసెంబర్) చిత్రం విడుదల సమయంలో మన సినిమా పెద్దలే తమ పలుకుబడితో, అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో ఓ ఉత్తర్వు ఇప్పించుకున్నారు. విడుదలైన కొత్త సినిమాకు రెండు వారాల పాటు హాలులోని పై రెండు తరగతుల టికెట్ రేట్లనూ పెంచుకొనేందుకు అనుమతి పొందారు. అలా టికెట్ రేట్లు ఒక్కసారిగా అందని ఎత్తుకు వెళ్ళాయి. దాదాపు 40 రూపాయల బాల్కనీ టికెట్ కాస్తా రూ. 70 దాకా వెళ్ళింది. అలా టికెట్లను అధికారికంగానే ఎక్కువ రేట్లకు అమ్మే ఏర్పాటును తెలివిగా చేసుకున్నారు. భారీ ఖర్చు పెట్టి జై చిరంజీవ తీసినవాళ్ళూ, భారీ రేట్లకు ప్రాంతాల వారీగా సినిమా హక్కులు కొన్నవారూ ఈ రేట్ల పెంపు వెనుక ఉన్నారని అప్పట్లో కృష్ణానగర్ జనం కోడై కూశారు.

అది అలా ఉంచితే, మొత్తానికి ఈ పద్ధతి వల్ల తొలివారాల్లో పెద్ద సినిమాలకు వసూళ్ళు పెరిగినా, పోను పోనూ పైరసీకి ఇది యథోచితంగా తోడ్పడింది. దానికి చిత్రపరిశ్రమలోని వర్గ రాజకీయాలు వచ్చి చేరడంతో - మళ్ళీ అదే సినీ పెద్దలు ఆ రెండు వారాల టికెట్ రేట్ల పెంపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో రద్దు చేయించారు. కాగా, మళ్ళీ ఇటీవలే కొద్ది నెలల క్రితం మళ్ళీ రోశయ్య నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ సారి మొదటి రెండు వారాలనే కాకుండా శాశ్వతంగా టికెట్ రేట్లు పెంచుకొనే అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు పెద్ద ఊళ్ళలో బాల్కనీ టికెట్ రేటు రూ. 40 నుంచి రూ. 50 అయింది. ఇక, మల్టీప్లెక్సుల్లో టికెట్ రూ. 100 నుంచి రూ. 150 అయింది. ...ఈ అనుమతులన్నీ పరిశ్రమ కోసం, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు కానే కావు. భారీ రేటుకు తాము ఏరియాల వారీగా కొన్న సినిమాల మీద డబ్బులు వెనక్కి రాబట్టుకోవడం కోసమే. ఇవన్నీ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి సంకుచిత, స్వార్థ ప్రయోజనాలతో చేసిన పనులే... అని చిత్రపరిశ్రమ అంతర్గత వర్గాలు లోగుట్టు బయటపెట్టాయి.

(తెలుగునాట జరుగుతున్న మరిన్ని బ్లాక్ మార్కెట్ సిత్రాలు తరువాయి పోస్టులో...)