జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, December 31, 2010

'రగడ' - బాగుందన్నవాడితో పెట్టుకోవాలి గొడవ!



ముగిసిపోతున్న ఈ 2010లో ఇప్పటి దాకా తెలుగు సినిమా ఒకటీ అరా సందర్భాల్లో తప్ప, మిగిలిన అన్నిసార్లూ అన్యాయంగా ప్రేక్షకుల్ని వీరబాదుడు బాదింది. ఆ సంగతి తెలిసీ నేను బుక్ అయి వచ్చిన తాజా సినిమా - ‘రగడ’. సినిమా ఫరవాలేదట అని కొందరూ, బాగానే ఆడుతోంది - ఆడుతుందని మరికొందరూ పొద్దుటి నుంచీ ఆఫీసులో ఒకటే రగడ. సరే, ‘యథా ప్రకారం సిద్ధిరస్తు’ అని అనుకుంటూనే, వెళ్ళాం.

కథా సంగ్రహం

రాయలసీమలో కడపకు చెందిన సత్యారెడ్డి అనే ఓ యువకుడి కథగా ఈ సినిమా నడుస్తుంది. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ ‘‘కడపోడు’’ డబ్బు కోసం ఏం చేయడానికైనా రెడీ అంటూ ఉంటాడు. పెద్ద పెద్ద రిస్కీ ఫైట్లు కూడా చేసేస్తుంటాడు. నగరంలోని పెద్దన్న (ప్రదీప్ రావత్) గ్యాంగులోని ఛోటా నేతల్లో ఒకడికీ, నగరంలోని మరో గ్యాంగు నేత జి.కె. (‘మగధీర’లో రాజమౌళి చూపించిన కొత్త విలన్ దేవ్ గిల్)కూ మధ్య గొడవ. జి.కె.కు దగ్గరైన హీరో అతనికి ప్రత్యర్థులైన పెద్దన్న గ్యాంగుల్లోని ఛోటా నేతలను ఒక్కొక్కణ్ణీ చంపి, అడ్డు తొలగిస్తుంటాడు. ఆ క్రమంలోనే అతను శిరీష (అనూష్క)తోనూ, అష్టలక్ష్మి (ప్రియమణి)తోనూ దగ్గరవుతాడు. అతను సీమ నుంచి ఆ ఊరెందుకు వచ్చాడు, వాళ్ళను ఎందుకు చంపుతున్నాడు లాంటి అంశాలకు సమాధానంగా ఓ ఫ్లాష్ బ్యాక్. ఆ తరువాత సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే బోలెడన్ని ట్విస్టులు. ఆఖరికి ది ఎండ్.

కంటి చూపుతో కాదు, కత్తులతోనే చంపేసే హీరో

కుటుంబ, హాస్య కథా చిత్రాల హీరోగా సంతోషం చిత్రం రోజుల నుంచీ రూటు మార్చిన నాగ్ ను మళ్ళీ చాలా వెనక్కి తీసుకెళ్ళిందీ సినిమా. బహుశా ‘విక్రమ్’ (1986) నుంచి ఇప్పటి వరకు - గడచిన 25 ఏళ్ళ కెరీర్ లో నాగార్జున ఇంతగా తెరపై హింస, రక్తపాతాలు చూపించలేదేమో. నాకైతే మునుపెన్నడూ చూసిన గుర్తు లేదు. రాయలసీమ నేపథ్యం, కత్తి పట్టుకొని వందల మందిని కసక్కున పొడిచేసే కథానాయకుడి కదన కుతూహలం, ఒకరికి ముగ్గురు నాయికలు లాంటి కమర్షియల్ అంశాలు నాగ్ మీద అతిగా ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒక్క హిట్ కోసం ఇంత హింస అవసరమా!?

వయసు మీద పడుతున్నా గ్లామర్ తగ్గకుండా కనిపించే నాగార్జున ఎందుకో, ఈ చిత్రంలో అంత ఆహ్లాదంగా కనిపించరు. కొన్ని దృశ్యాల్లో వయసు తెలిసిపోయింది. అనూష్క, ప్రియమణి - నటించడానికి ఏమీ లేకపోవడంతో, పాటల్లో తక్కువ దుస్తులతో ఆకట్టుకోవడానికి శ్రమపడ్డారు. బ్రహ్మన్న, బ్రహ్మీ డార్లింగ్ గా బ్రహ్మానందం కొన్ని ఘట్టాల్లో నవ్వించారు. ధర్మవరపు, బాల నటుడు భరత్ ల బ్యాచ్ కామెడీ కాసేపయ్యాక నవ్వు కాదు, నస అనిపిస్తుంది.

మాటలెక్కువ, చేసింది తక్కువ

కథ, మాటల రచయితగా మొదలై, ఆనక దర్శకుడైన వీరూ పోట్ల ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. కలిసొస్తే చెరుకుగడ, ఎదురొస్తే రగడ ..... లాంటి పంచ్ (!?) డైలాగులను మార్చి, మార్చి సినిమాలో వాడారు. వాటిని పాటక జనం ప్రశంసిస్తారని దర్శక, నిర్మాతలు, హీరో అభిప్రాయం. కథే అస్తుబిస్తుగా ఉన్న ఈ చిత్రంలో ఇక, స్క్రీన్ ప్లే, మాటల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. దర్శకత్వ ప్రతిభ కూడా చాలా యావరేజ్.

సినిమాకు సంగీతం (థమన్ ఎస్.) పెద్ద ఎసెట్ కావాల్సింది. కానీ, ఈ చిత్రంలోని పాటలేవీ ఆ ఫక్కీలో నడవలేదు. కనీసం ఒక్క పాటైనా బావుంటుందనుకుంటే, అదీ నిరాశే. అసలే ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం మోకాలుకు చేయించుకున్న సర్జరీతో డ్యాన్సులు, ఫైట్లు నాగ్ కు కష్టంగా మారాయి. దానికి తోడు ఇప్పుడు మీద పడుతున్న వయస్సు. దాంతో, చిన్న చిన్న మూవ్ మెంట్లు హీరో చేస్తుంటే, హీరోయిన్లు, డ్యాన్సర్లు మాత్రం తెగ నర్తించేస్తుంటారు. స్టెప్పులు వేస్తుంటారు. ఈ వరుస చూస్తే, ఎన్టీయార్ 1980ల నాటి సినిమాల్లో చేసిన డ్యాన్సులు గుర్తొస్తే, తప్పు ప్రేక్షకులది కాదు. ఫైట్లూ అంతే - ఒక దెబ్బకు పదుల సంఖ్యలో జనం పడిపోవడమే. కాస్తయినా రియలిస్టిక్ గా అనిపించవు.

కథనంలోనూ లోటుపాట్లు

అమ్మలా తనను పెంచిన డాక్టరమ్మ నిర్మలమ్మను చంపారని తెలిసిన హీరో ఆమెను చంపినవారిని హతమార్చి, పగ తీర్చుకోవడానికి నగరానికి వచ్చాడు. సెకండాఫ్ లో వచ్చే రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఆ సంగతే చూపారు. అలాగే, ఒక్కొక్కరినీ చంపుతూ వస్తుంటాడు. సో, ఇక అక్కడ మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్)కి మూడునెలల్లో రూ. 87 కోట్లిచ్చి, అమ్మతో ఆ ఆసుపత్రిని ఖాళీ చేయించకుండా ఉంచాలన్న బంధం ఏమీ హీరోకు లేదు. కానీ, బండి దగ్గర కోట శ్రీనివాసరావు ఎదురై, తమతో చేతులు కలిపేయమంటూ హీరోను బెదిరించే సన్నివేశంలోనే ముందుగా హైదరాబాద్ - కడప బస్సులో వేరెవరి ద్వారానో సంచీ నిండా హీరో డబ్బులు పంపుతున్న షాట్ ఎందుకు చూపినట్లన్నది అర్థం కాని ప్రశ్న.

అలాగే, మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్), అతని అన్న పెద్దన్నల పనుపునే ఛోటా నేతలు వచ్చి హీరో తల్లిని చంపుతారు. ఆ హంతకుల్ని చంపుతానని తల్లి సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన హీరో, చివరకు వచ్చేసరికి - పెద్దన్నను చంపడమే తప్ప, మహేందర్ రెడ్డిని ఎందుకు వదిలేసినట్లు. ఈ సినిమాలో ఇలాంటి లోపాలు ఇంకా అనేకం.

కొసమెరుపు -

ఈ సినిమాలో కథ కోసం బలవంతాన తెచ్చిపెట్టిన మలుపులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. పైపెచ్చు, అసలు ఈ ట్విస్టులు నచ్చే సినిమా చేశానన్న హీరో గారి మాటలు చదివాక, నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఏమైనా, ఈ 14 రీళ్ళ సినిమాను ఓపిగ్గా మొదటి నుంచి చివరి దాకా చూసి బయటకు వచ్చాక నాకు అనిపించింది కాస్త ప్రాసలో చెప్పాలంటేఒకటే- 'రగడ' ..... ఈ సినిమా చాలా బాగుందని చెప్పినవాడితో వేసుకోవాలి గొడవ!

చివరిగా, చిన్నమాట.

2010కి వీడ్కోలు చెబుతూ, 2011కు శుభస్వాగతం పలుకుతూ, మన బ్లాగు మిత్రులకూ, పాఠకులకూ, హితులకూ, స్నేహితులకూ

విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యపీ, జాయ్ ఫుల్ అండ్ ఫ్రూట్ ఫుల్ న్యూ ఇయర్.

Friday, December 24, 2010

బతుకు భయం కలిగించే ‘నాగవల్లి’



(వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’ - పార్ట్ 2)

‘నాగవల్లి’ సినిమాలో ప్రేక్షకుడికి నచ్చే అంశాల కన్నా నచ్చని అంశాలే ఎక్కువ. ‘నాగవల్లి’ చిత్రంలో సాఫీగా సాగే కథ లేదేమో కానీ, నటీనటులు మాత్రం బోలెడంత మంది. హీరోగా రజతోత్సవ సంవత్సరంలో ఉన్న వెంకటేశ్ ఈ చిత్రంలో డాక్టర్ విజయ్ గా, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రాజు నాగభైరవ రాజశేఖరుడిగా ద్విపాత్రాభినయం చేశారు. 130 ఏళ్ళుగా బతికుండి, ఓ అఘోరా లాగా పెరిగిన మీసాలు, గడ్డాలు, గోళ్ళతో మూడో వేషంలోనూ కనిపిస్తారు.

పాత్రలు - పాత్రధారులు

కానీ విషాదం ఏమిటంటే - ఒక్క డాక్టర్ విజయ్ వేషంలోనే ఆయన ఫరవాలేదనిపిస్తారు. మిగిలిన వేషాల్లో ఆయన ఆంగిక, వాచికాలు అన్యాయంగా ఉన్నాయి. రాజు వేషంలో ఆహార్యమైనా బాగుంది (రమా రాజమౌళి స్టైలింగ్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి), కెమేరాలో కాళ్ళకు బూట్లతో కనిపించేస్తున్న అఘోరా వేషానికి వచ్చేసరికి ఆయన మేకప్ కానీ, ఆ కుంగ్ ఫూ తరహా యుద్ధ విన్యాసాలు, ఆ అరుపులు ఏ మాత్రం ప్రొఫెషనల్ గా లేవు. రాజు అంటే ఓ హుందాతనం, ఆ నడకలో, కరచరణ విన్యాసాల్లో ఓ ఠీవి కనిపించాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఈ సినిమాలో అవేవీ లేవు. పైగా, హీరోయిన్ తో పాట పాడుతూ, రాజు నడిచే నడక, భుజాలు ఊపే తీరు విదూషకుడిని తలపించాయి. సంభాషణల్లోనూ, వాటి ఉచ్చారణలోనూ పాత్రల తాలూకు స్థల కాలాలను చూపెట్టడంలో కూడా విఫలమయ్యారు.

ప్రధానపాత్ర నాగవల్లి (అసలు పేరు నాగవల్లి. నాట్యకళలో ప్రావీణ్యంతో అందరూ పిలిచే పేరు చంద్రముఖి అని సినిమాలో చెప్పించారు)లో అనూష్కను సైతం పోస్టర్లలో చూపించినంత పాటి అందంగానైనా తెర మీద చూపలేకపోయారు. నృత్యంలో అభినివేశం లేని ఆమె శాస్త్రీయ నృత్యం చేస్తుంటే, తెరపై ఎలా ఉందో వేరుగా చెప్పనక్కర లేదు. ఆమె ప్రియుడైన గుణశేఖరన్ పాత్రధారి ఆమె కన్నా పొట్టిగా, లేత ముఖంతో ఆమెకు చిన్న తమ్ముడిలా కనిపించాడు.

సినిమాలో శరత్ బాబు - ప్రభల కుమార్తెలుగా కమలినీ ముఖర్జీ (నాట్యకళాకారిణి గాయత్రి పాత్ర), శ్రద్ధాదాస్ (చిత్రకారిణి గీత పాత్ర), రిచా గంగోపాధ్యాయ (పరిశోధకురాలు గౌరి పాత్ర), ఇంకా ధర్మవరపు కుమార్తెలుగా లహరి తదితరులతో గ్లామర్ కు తక్కువ ఏమీ లేదు. కానీ, ఏ పాత్రనూ చిరకాలం గుర్తుంచుకోలేం. బ్రహ్మానందం కామెడీ కూడా నవ్వించడానికి విఫలయత్నం చేస్తుంది. కొంతసేపయ్యాక విసుగు కలిగిస్తుంది.

సాంకేతిక విభాగాలు

ఈ సినిమాలో హంపీ తదితర ప్రాంతాలను శ్యామ్ కె. నాయుడి కెమేరా అందంగా తెరకెక్కించింది. గురుచరణ్ సంగీతంలో హీరో పరిచయ గీతం మినహా మరేవీ జనం పదే పదేలా పాడుకొనేలా గుర్తుండవు. కళాదర్శకత్వం (చిన్నా) చాలా నాసిగా ఉంది. రాజు గారి ఆస్థానం లాంటి వాటికి అంత గాడీగా ఉన్న రంగులు ఎలా వాడారో అర్థం కాదు. గమ్మత్తేమిటంటే - చంద్రముఖిని రాజు బంధించి ఉంచిన ప్రణయ కేళీ మందిరమంతా ఎర్రటి రంగు గోడలతో ఉండడం ఆలోచన, అవగాహనల రాహిత్యానికి నిదర్శనం. అలాగే, తలుపునకు నాగుపాము, త్రిశూలం వగైరాలతో తాళం ఉండే ఘనమైన దర్వాజాను కూడా మనకు ఆ ప్రాచీన భావాన్ని కలిగించేలా తీర్చిదిద్దకపోవడం పెద్ద తప్పు. చంద్రముఖిని అష్ట దిగ్బంధనం లాంటి దృశ్యాల్లో సైతం వాడిన తాళాలు, తాళం చెవులు లాంటివి కూడా క్లోజప్ లో కనిపిస్తూ, కథాకాలం నాటికి సంబంధం లేని రూపురేఖలతో చీకాకు తెప్పిస్తాయి. సినిమా చూసే ప్రేక్షకులు ఇవేవీ నోరువిప్పి వివరించకపోవచ్చు కానీ, వారి అంతరాంతరాళాల్లో ఇవి చూపే తెలియని ప్రభావమే చిత్ర ఫలితానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

డిజిటల్ ఇంటర్మీడియట్ (డి.ఐ) చేసిన ఈ చిత్రంలో కొన్ని చోట్ల దృశ్యాలు అలికేసినట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పరిచయ గీతం లాంటి చోట్ల డి.ఐ.లోని లోపాలు తెలిసిపోతున్నాయి. గ్రాఫిక్స్ సంగతికొస్తే - చంద్రముఖి 30 అడుగుల పొడవున్న పాము రూపంలో వెళ్ళిపోతోందని చెబుతూ వస్తారు. కానీ, గ్రాఫిక్స్ లో పాములా కాకుండా అది కొండచిలువలా తయారైంది. పడగ విప్పినప్పుడు మాత్రం అది పాములా అనిపిస్తుంది. కథలోనే కొంత కన్ఫూజన్ ఉండడంతో, ఎడిటింగ్ మరేమీ చేయలేకపోయింది.

లోటుపాట్లు

కథలో చంద్రముఖి వెంటాడడం ఏమో కానీ, ‘నాగవల్లి’ చిత్రాన్ని చూస్తుంటేనూ, చూసొచ్చాకా ప్రేక్షకుల్ని బోలెడన్ని ప్రశ్నలు వెంటాడతాయి, వేధిస్తాయి. చాలా భాగం జవాబులు దొరకని ప్రశ్నలే. చంద్రముఖి వ్యవహారంలో సాయం కోరుతూ సిద్ధాంతే స్వయంగా డాక్టర్ విజయ్ ని పిలిపిస్తాడు. నిజానికి, వాళ్ళిద్దరూ కలసి ఆ ఎదురైన సమస్యను పరిష్కరించాలి. కానీ, అది పోయి, చివరకు ఒకరిపై మరొకరు పోటీ పడుతూ, నువ్వు తప్పా, నేను తప్పా అని వాదనకు దిగుతున్నట్లుగా తయారైంది.

హేతువాదానికీ, ఆచారాల పట్ల నమ్మకానికీ మధ్య వాదులాట లాగా కనిపించినా, రెండు పాత్రలకూ సమప్రాధాన్యం ఇస్తూ, రెంటిలో ఏదీ దేనికీ తక్కువ కాదన్నట్లు చూపాల్సింది. ‘చంద్రముఖి’లో అలాంటి ప్రయత్నమే చూశాం. కానీ, ‘నాగవల్లి’ అందుకు విరుద్ధంగా సాగింది. చివరకు సిద్ధాంతి పాత్రను డమ్మీని చేసేశారు. క్లైమాక్స్ లో డాక్టర్ విజయ్ పాత్ర ప్రవర్తన కానీ, సమస్య పరిష్కారంలో అతని పాసివ్ పాత్ర కానీ అర్థరహితంగా ఉన్నాయి.

ఎంత సీక్వెల్ అయినా ఇంత కాపీనా?

అలాగే, పెద్ద హిట్ చిత్రానికి సీక్వెల్ అయినంత మాత్రాన అక్షరాలా అంతకు ముందు సినిమా ఫార్ములానే యథాతథంగా వాడేస్తామంటే కుదురుతుందా? కానీ, ఈ చిత్ర దర్శక రచయిత పి. వాసు (కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం మూడూ ఆయనవే) ఆ పిచ్చి పనే చేశారు.

‘చంద్రముఖి’లో రజనీకాంత్ ఇంట్రడక్షన్ పాట (దేవుడా దేవుడా తిరుమల దేవుడా...)కు కాపీ లాగా ఇక్కడా అలాగే హీరో పరిచయ గీతం (అభిమాని లేనిదే హీరోలు లేరులే...). అక్కడ ఇంటిల్లపాదీతో రజనీ పాడే గాలిపటం పాటకు, ఇక్కడ వెంకటేశ్ ఆడవాళ్ళందరితో కలసి కబడ్డీ ఆడి, ఆ పైన పాడే పాట. అక్కడ ‘రారా సరసకు రారా’ పాట ఉంటే, ఇక్కడ ‘ఘిరని ఘిరని...’ అంటూ నర్తకి నాగవల్లి చంద్రముఖి (అనూష్క) డ్యాన్సుకు రాజు గారు (వెంకటేశ్) తాళం వేస్తూ పాడే పాట.

పాటలే కాదు, పాత్రల విషయంలోనూ ఆ వేలంవెర్రి అనుకరణనే కొనసాగించారు. ‘చంద్రముఖి’లో ఇంటికొచ్చిన హీరో, తన భార్యకు దగ్గరైపోతున్నాడేమోనని అనుమానించే వడివేలు పాత్ర గుర్తుందిగా. సరిగ్గా దానికి జిరాక్స్ కాపీ లాంటిది ‘నాగవల్లి’లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పోషించిన పాత్ర. అందులో హీరోకు ఓ సహాయకుడు. ఇందులోనూ హీరోకు ఓ సహాయకుడు. బహుశా సీక్వెల్ ముసుగులో తమ హిట్ సినిమాను తామే ఇంత పచ్చిగా, అడుగడుగునా కాపీ కొట్టుకుంటూ మరో సినిమా తీయడం మన చిత్ర సీమల్లోనే సాధ్యం. ఇలాంటి దర్శక, రచయితలను గుడ్డిగా నమ్మి, ఫార్ములా చట్రంలోనే గుడుగుడు గుంజాలాడాలని అనుకోవడం మన సోకాల్డ్ నిర్మాతలు, హీరోల అవివేకం. దీనికి కోట్ల కొద్దీ కుమ్మరించడం దాన్ని మించిన అహంభావం.

కొసమెరుపు -

ఈ సినిమాకు కొందరు మిత్రులం కలసి వెళ్ళాం. ఆఫీసు పని ముగించుకొని, హడావిడిగా రాత్రి భోజనాలు చేసి, సెకండ్ షోకి వెళ్ళాలని ఆలోచన. అడ్వాన్సుగా టికెట్లు తీసుకొద్దామని ఓ మిత్రుడు ఆటకు రెండున్నర గంటల ముందే హాలుకు వెళ్ళాడు. టికెట్లిమ్మంటే కౌంటర్ వాడు వాడి మాతృభాషలో బదులిస్తూ, ఓ కాగితం చూపాడు. దాని మీద రూ. 1000 అని అంకె ఉంది. మన ఊరు కాని ఊళ్ళో ఆ భాష బాగా తెలియకపోయినా, వాడి భావం మాత్రం మా వాడికి బాగా తెలిసింది.

‘‘ఇక్కడ జనం లేక తెరిచిపెట్టుకు కూర్చున్నాం. మునుపటి ఆటకు వచ్చిన కలెక్షనే రూ. 1000 (అంటే 20 మందే వచ్చారన్నమాట). మీరు తాపీగా సినిమా మొదలు కావడానికి పది నిమిషాల ముందు వస్తే చాలు. ఎన్ని టికెట్లంటే అన్ని టికెట్లిస్తాం, హాలంతా మీదే’’ అన్నది కౌంటర్ వాడి కామెంట్ భావం. అయినా ధైర్యం చేసి సినిమాకు వెళ్ళి, మా లాంటి మరో 25 మంది సినిమా పిచ్చి వాళ్ళతో హాలంతా ఏలుతూ సినిమా చూసేశాం. కానీ, మరునాడు ఉదయం పేపర్లో ‘‘ఈ ఏటి మేటి 5 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ’’అంటూ నాగవల్లి వాణిజ్య ప్రకటన చూశాక, నమ్మాలో, నవ్వాలో అర్థం కాలేదు.

Thursday, December 23, 2010

వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’



ఓ సినిమా పొరపాటునో, గ్రహపాటునో, అనుకోకుండా అన్నీ కుదిరో హిట్టయితే చాలు - ఆ కథను వివిధ భాషల్లో తెరకెక్కించడానికీ, అదే ఫార్ములాతో రకరకాల కథలు అల్లుకోవడానికీ మన దర్శక - నిర్మాతలు అత్యుత్సాహం చూపిస్తుంటారు. పదిహేడేళ్ళ క్రితం మలయాళంలో హిట్టయిన ‘మణి చిత్ర తాళు’ కథ ఇప్పటికి ఎన్ని రూపాలు ధరించిందో చూస్తే, ఆ మాట కచ్చితంగా నిజమని ఎవరైనా ఇట్టే చెప్పవచ్చు. కేరళ ప్రాంతపు ఓ రాజవంశంలో జరిగిన నిజ జీవిత కథగా ప్రచారంలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని ఆ మలయాళ చిత్రం తయారైంది. ప్రజాదరణ పొందిన ఆ చిత్రంలో నాయిక పాత్ర నటి శోభనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్నీ తెచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే - ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ కూడా జరుపుకొంది.

రీమేకులు తీయడంలో దిట్ట అయిన దర్శకుడు పి. వాసు అదే సినిమాను కన్నడంలో ‘ఆప్తమిత్ర’గా, తమిళంలో ‘చంద్రముఖి’గా రూపొందించారు. రెండూ సూపర్ హిట్ కావడంతో వాసులో మరో ఆశ మొగ్గ తొడిగింది. ఈ కథకు కొనసాగింపుగా మరో కథ అల్లుకొని, ‘చంద్రముఖి -2’గా రజనీకాంత్ తోనే మళ్ళీ తీయాలని తెగ ఉత్సాహపడ్డారు. కానీ, రజనీ పచ్చజెండా ఊపకపోవడంతో, ఆ కథనే కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ తో ‘ఆప్త రక్షక’గా తీశారు. సరిగ్గా విష్ణువర్ధన్ మరణం, ఆ సినిమా రిలీజు ఒకే సమయంలో జరగడంతో ఆ మహానటుడి ఆఖరి సినిమాగా జనం ఆ కథకు బ్రహ్మరథం పట్టారు. దాంతో, సహజంగానే దాని తెలుగు రీమేక్ కు మన వాళ్ళు ఎగబడ్డారు. రీమేకుల నిర్మాణానికి వేయి కళ్ళతో కాచుకొని ఉండే బెల్లంకొండ సురేశ్ తెలుగులో దీని హక్కులు తీసుకున్నారు. పి. వాసు దర్శకత్వంలోనే ఇది ‘నాగవల్లి’గా రీమేక్ అయింది.

రజనీకాంత్ నటించిన పాత్రకు కొనసాగింపు, విభిన్నమైన గెటప్ తో కూడిన రాజు పాత్ర లాంటివి కన్నడ మాతృకలో చూసి మురిసిపోయిన తెలుగు హీరో వెంకటేశ్ ఏరి కోరి ఈ రీమేక్ లో నటించారు. కానీ, ఎంత ఆత్మల కథ అయినా కథలో ఆత్మ లేకపోతే, లాభం లేదని మరో మారు ‘నాగవల్లి’ నిరూపించింది. నటుడనే వాడికి రకరకాల పాత్రల మీద ప్రేమ ఉంటే చాలదు, ఆ పాత్రపోషణకు మనం సరిపోతామా, లేదా అన్న ఆలోచన, అవగాహన కూడా ఉండాలని ‘నాగవల్లి’ చూస్తే అర్థమవుతుంది. మానిటర్లో చేసిన షాట్ చూసుకొనే సౌకర్యాలు సైతం ఉన్న ఈ రోజుల్లో ఈ చిత్రంలోని నటీనటులు, దర్శకుడు పాత్రపోషణకు కావాల్సిన కనీసపు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు కనిపించదు.

అసలు ‘చంద్రముఖి’ సినిమాలో ఏ అంశం జనానికి అంతగా పట్టిందో అర్థం కాక ఇప్పటికీ కొందరు జుట్టు పీక్కుంటున్న తరుణంలో, దానికి సీక్వెల్ నంటూ ‘నాగవల్లి..... చంద్రముఖి’ వచ్చింది. నూరేళ్ళ పైచిలుకు నాటి చంద్రముఖి తైలవర్ణ చిత్రం ఓ చిత్రకారుడికి దొరకడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ వర్ణచిత్రం కారణంగా చిత్రకారుడు మరణించడం, శాస్త్రీయ నృత్య పోటీల్లో ఆ చిత్రాన్ని బహుమతిగా పొందిన వెంటనే గాయత్రి (కమలినీ ముఖర్జీ) భర్త యాక్సిడెంట్ కు గురై మరణించడం, ఆ పటాన్ని తెచ్చుకున్న గాయత్రి కుటుంబంలో ఆడపిల్ల పెళ్ళిళ్ళు చెడిపోతూ ఉండడం లాంటివన్నీ జరుగుతాయి. తిరుపతి సమీపంలో ఓ కలవారి ఇంట్లో ఓ 30 అడుగుల పాము కనిపిస్తుంటుంది. ఆ చిత్రవిచిత్ర సమస్యలన్నిటి నుంచి బయట పడడం కోసం వారు దైవశక్తి గల రామచంద్ర సిద్ధాంతి (అవినాశ్)ని కలుస్తారు. ఈ చంద్రముఖి వ్యవహారాన్ని పరిష్కరించేందుకు గతంలో తనకు సాయపడ్డ సైకియాట్రిస్ట్ కు సహచరుడైన డాక్టర్ విజయ్ (వెంకటేశ్)ను ఆయన పిలిపిస్తారు.

ఆ సైకియాట్రిస్ట్ హేతుబద్ధంగా, ఈ సిద్ధాంతి దైవ - దుష్టశక్తుల పట్ల నమ్మకాల పరంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒకప్పటి చంద్రముఖి ఆ ఇంట్లోని ఎవరిని ఆవహించి ఉందో తెలుసుకొనే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ కృషిలో భాగంగా నూరేళ్ళ పైచిలుకు క్రితం నాటి వెంకటాపురం రాజు చరిత్రను విజయ్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ నాగభైరవ రాజశేఖరుడు (మళ్ళీ వెంకటేశే) ఎవరు, ఏమిటి, ఏం చేశాడు, అతనికీ - తంజావూరు ప్రాంత నర్తకి చంద్రముఖికీ ఉన్న సంబంధం ఏమిటి లాంటి అనేక అంశాల గత చరిత్రను తెలుసుకుంటాడు.

ఆ తరువాత ఏం జరిగింది, ఆ ఇంట్లో చంద్రముఖిలా ప్రవర్తిస్తున్నది ఎవరు లాంటి సస్పెన్స్ నిండిన అంశాలతో మిగిలిన సినిమా నడిచింది. సినిమా అంతటా చంద్రముఖి ఆత్మ ప్రస్తావన వస్తుందన్న మాటే కానీ, కథలో మనల్ని కట్టిపడేసే ఆత్మే ఎక్కడా లేదు. ఏ ఘట్టంలోనూ ప్రేక్షకుణ్ణి తనతో పాటు ప్రయాణం చెయ్యనివ్వని దృశ్యాలు, సంఘటనల సమాహారం ఈ చిత్రం. అందుకే, ‘నాగవల్లి’ని చూస్తుంటే, మనం తెర మీద కన్నా చేతికున్న వాచీని ఎక్కువగా చూస్తాం.

( ‘నాగవల్లి’లోని లోటుపాట్లు, వెంకటేశ్ చేసిన తప్పేమిటి. ఒప్పేమిటి వగైరా వివరాల మిగతా భాగం తరువాయి పోస్టులో...)

Sunday, December 19, 2010

బాగానే ఉందనిపించే ‘ఆరెంజ్’ జనానికి ఎందుకు నచ్చలేదు?

(‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం? - పార్ట్ 2)

ఫస్టాఫ్ మొదలు అప్పటి దాకా ‘ఆరెంజ్’ కథానాయక పాత్ర ప్రతిపాదించిన అంశాలతో సహానుభూతి చెందుతున్న ప్రేక్షకులను నాగబాబు పాత్ర హితోపదేశ ఘట్టం నుంచి దర్శకుడే స్వయంగా దూరం చేసుకున్నారనిపిస్తుంది. ప్రేమ విషయంలో హీరో భావాలకూ, అభిప్రాయాలకూ కారణం - అతని గత జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలేనని సినిమాలో చూపిన ఫ్లాష్ బ్యాక్ తో అర్థమవుతుంది. ఆ అభిప్రాయాలు, ఆ సంఘటనలతో యువతరం ప్రేమికుల నుంచి పెళ్ళయిన పెద్దల దాకా అందరూ ఎంతో కొంత కనెక్ట్ అవుతారు. కానీ, ఆ తరువాత కేవలం నాగబాబు చెప్పిన నాలుగు మాటలతో హీరో ఒక్కసారిగా తన పంథానే మార్చేసుకోవడం ఏ మాత్రం నమ్మబుద్ధిగా, ప్రేక్షకులకు సంతృప్తిగా అనిపించదు. అప్పటిదాకా తెరపై దృశ్యాలతో సంలీనమై ఉన్నవాళ్ళను ఒక్కసారిగా వెనక్కి రప్పించే సన్నివేశాలు ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా వచ్చేస్తాయి.

హీరో అప్పటి దాకా తాను ప్రవచించిన సిద్ధాంతాలను వదిలేసుకోవడానికి సిద్ధమై, హీరోయిన్ ప్రేమ కోసం ఆమె వెంటబడుతున్నట్లుగా అక్కడ నుంచి కథ దిశ మార్చుకుంది. వ్యక్తిగత ఇష్టానిష్టాలను మరచి, తెర మీద కథానాయకుడు చెప్పిన సిద్ధాంతాలను తలకెక్కించుకున్న వారికి సైతం ఈ అనూహ్యమైన అకస్మాత్తు మార్పు ఏ మాత్రం మింగుడు పడే విషయం కాదు.

హీరో అంటే సామాన్య తెలుగు ప్రేక్షకులకు విజేత అనే అర్థం. హీరో పాత్ర అనుకున్నది, చేసేదే కరెక్ట్. ఎప్పటికైనా అతని వాదనే నిలవాలి, గెలవాలి తప్ప, మరొకరి ముందు అతని వాదన నీరు గారిపోయినట్లు చూపిస్తే, సగటు ప్రేక్షకులను మెప్పించలేం. పైపెచ్చు, ఈ సినిమాలో హీరో అలా వాదన మార్చుకోవడానికి తగిన కారణం కానీ, సంఘటనలు కానీ - సందర్భాలు కానీ (ఫ్లాష్ బ్యాక్ లో లాగా) లేనే లేవు.

ఇక అక్కడ నుంచి దర్శకుడికి కూడా కథ ఎలా నడపాలనే గందరగోళం వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే, హీరో పాత్ర ద్వారా తాను ప్రవచించదలచిన, అప్పటి దాకా ప్రవచిస్తూ వచ్చిన అంశాన్ని పక్కనబెట్టి, మళ్ళీ రొటీన్ గా హీరో, హీరోయిన్లను కలపాలని చూశారు. అలా కాకుండా, హీరో ఆది నుంచి చెబుతూ వస్తున్న సిద్ధాంతాన్నే చూపుతూ, హీరో, హీరోయిన్ల ప్రేమ పెళ్ళి పీటలకు ఎక్కలేదని వాస్తవిక రీతిలో చెబుతూ, ముగించడానికి భయపడ్డారేమో అనిపిస్తుంది.

హీరో పాత్రచిత్రణకు నప్పని రీతిలో కథ చివరి భాగం సాగడంతో, ఆరెంజ్ ఏ వర్గానికీ సంతృప్తి నివ్వలేదు. ఈ సినిమా ఇంతగా పరాజయం పాలవడానికి నాకు అనిపించిన, కనిపించిన ప్రధాన కారణం అది. అలాగే, సినిమాలో జెనీలియా మేకప్ కానీ, ఆమె నటన కానీ బాగాలేవని చెప్పక తప్పదు. ఇక, తెరపై దృశ్యాల్లోని రంగుల గాఢతను కావలసినట్లుగా మార్చుకోవడం కోసం చేసిన డి.ఐ. (డిజిటల్ ఇంటర్మీడియట్) ప్రక్రియ కూడా నాసిగా ఉంది. అందుకే కావచ్చు - సినిమాలో చాలా చోట్ల హీరో, ప్రత్యేకించి హీరోయిన్ మేకప్ లు ముఖానికి మెత్తినట్లుగా, తెల్ల తెల్లగా, ముద్ద ముద్దగా ఉన్నట్లు అనిపించాయి. ఇక, హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు ప్రభు, హీరోయిన్ అక్కబావలుగా నటుడు మహేశ్ బాబా సొంత అక్క మంజుల, బావ సంజయ్ స్వరూప్ లు నటించడం వల్ల సినిమాకు వచ్చిన అదనపు హంగేమీ లేదు. నటనలో అంతంత మాత్రం, తెలుగు డైలాగులకు డబ్బింగ్ సాయం అవసరమైన వీరందరినీ ఎందుకు తెచ్చుకున్నారో దర్శకుడు భాస్కర్ కు తెలియాలి.

నిజం చెప్పాలంటే - ఈ సినిమాలో హారిస్ జైరాజ్ బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగినా, అనకాపల్లిలో జరిగినా పెద్ద తేడా లేని ఈ కథను ప్రత్యేకించి హిందీ చిత్రాల ఫక్కీలో ఆస్ట్రేలియాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపారు. పప్పీ పాత్రలో బ్రహ్మానందం బాగానే నవ్వించారు. ‘ప్రేమంటే - నాలుగు అబద్ధాలు, మూడు ఎస్.ఎం.ఎస్.లు, రెండు కుళ్ళు జోకులు’, ‘మొదట ప్రేమిస్తాం. ఆ తరువాత పుట్టిన పిల్లల కోసం ఆ బంధాన్ని కొనసాగిస్తాం’ తరహా మాటలూ గుర్తుంటాయి. ఒక్కో సినిమాకూ నటుడిగా మెరుగుపడుతున్న రామ్ చరణ్ తేజ్ లోని నటుడికి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఘట్టం ఓ ఉదాహరణ. ప్రేమ కోసం జీవితాన్నే అబద్ధాలమయంగా మార్చుకోలేనంటూ ప్రేయసి ఇంటి నుంచి వచ్చేస్తూ, కథానాయక పాత్ర మాట్లాడే మాటలు, చేసే నటన రామ్ చరణ్ లోని మెరుగుదలకు మచ్చుతునకలు.

ఇలా సినిమాలో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. కానీ, సెకండాఫ్ లో సగమయ్యాక హీరో పాత్ర చిత్రణలో వచ్చిన అకస్మాత్తు మార్పుతో, పూర్తిగా ఈ సినిమా కథే అడ్డం తిరిగింది. మిగతా లోపాలకు ఇది తోడై, కుండెడు పాలల్లో ఒక్క విషపు బొట్టు చిందినట్లయింది. ‘ఆరెంజ్’కు అదే పెద్ద శాపం. మంచి కథాంశాన్ని ఎంచుకున్నా, దాన్ని సమర్థంగా పాత్రల ద్వారా చివరి వరకు డ్రైవ్ చేయకపోతే, విమర్శకుల పరంగానూ, వాణిజ్యపరంగానూ మిగిలేది అసంతృప్తేనని ఆరెంజ్ ఋజువు చేసింది.

Saturday, December 18, 2010

‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం?

ప్రతి పెద్ద తెలుగు సినిమా వచ్చే మా ఊళ్ళో ఎందుకనో రామ్ చరణ్ తేజ్ ‘ఆరెంజ్’ సినిమా విడుదల కాలేదు. దాంతో, నేను చూడ లేదు. అనుకోకుండా ఇవాళ ఇక్కడ ఓ షో వేస్తే హడావిడిగా వెళ్ళి చూశా. వెళ్ళేటప్పటికి పది నిమిషాల ఆట అయిపోయింది కానీ, ఆద్యంతం కదలకుండా చూశా. బాక్సాఫీస్ దగ్గర సినిమా అడ్డంగా దొరికిపోయిందని (ఈ తెలుగు టీవీ భాషకు పాఠకులు నన్ను మన్నింతురు గాక) ఇప్పటికే విన్నాను. అయినా సరే, సినిమా చూస్తే, విశ్రాంతి దాకా వచ్చేసరికి నాకే డౌట్ వచ్చింది. సినిమా ఫరవాలేదు - బాగానే ఉంది కదా. మరి, ఎందుకింత నెగటివ్ టాక్ వచ్చింది అని నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దానికి సమాధానం సెకండాఫ్ లో కాసేపైన తరువాత నుంచి నాకు దొరికింది.

మొత్తం సినిమా చూశాక, కొత్త కథాంశంతో తీసిన ఈ సినిమా జనానికి ఎందుకు నచ్చి ఉండకపోవచ్చనడానికి నాకు కొన్ని కారణాలు తట్టాయి. వాటిని మీతో పంచుకుంటాను.

నిజం చెప్పాలంటే - ఈ చిత్ర కథకు తీసుకున్న అంశం చాలా మంచిది. ప్రేమలో ఏ మేరకు నిజాయతీ ఉంటోంది, ఓ మనిషిని జీవితాంతం ఒకే రకంగా ప్రేమించడం సాధ్యమా లాంటి సున్నితమైన అంశాలను ఈ కథలో డీల్ చేశారు. ఎలాంటి అబద్ధాలూ లేకుండా, జీవితాంతం ఒక వ్యక్తిని ప్రేమించడం కుదిరేపని కాదన్న కథానాయకుడు రామ్ పాత్ర (రామ్ చరణ్ తేజ్) దృష్టి కోణం నుంచి కథ మొత్తం నడుస్తుంది. ఈ చిన్న అంశం మీద ఐటమ్ సాంగ్ లు, విలన్లు, ఛేజ్ లు, భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ లాంటివేమీ లేకుండా సంసారపక్షపు సినిమా తీయడమంటే - ఇవాళ్టి తెలుగు సినీ వ్యాపార లెక్కల ప్రకారమైతే పెద్ద రిస్కు. మామూలు సినిమా కథల ప్రకారం చూసినా సరే, ఎలాంటి హీరోకూ, దర్శకుడికైనా సరే ఇలాంటి అంశాన్నీ, స్క్రిప్టునూ తెర మీద రెండున్నర గంటలు చూపడం కత్తి మీద సాము. అందులోనూ పేరున్న హీరోతో, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ లాంటి మరో పేరున్న దర్శకుడు ఆ సినిమా తీస్తే - అది కత్తి మీద సామే కాదు, పీకల మీద కత్తి కూడా.

అయినా సరే, ఈ దర్శక, హీరోలు ఆ సాహసానికి దిగినందుకు అభినందించాల్సిందే. సన్నటి కథాసూత్రం మీదే నడిపించుకుంటూ వెళ్ళినా, చిత్ర ప్రథమార్ధం ఫరవాలేదన్నట్లుగా గడిచిపోతుంది. కానీ, ద్వితీయార్ధంలో నాగబాబు పోషించిన పాత్రతో హీరోకు గీతోపదేశం చేయించిన దగ్గర నుంచి సినిమా గాడితప్పింది. అప్పటి దాకా హీరో ప్రవర్తనకూ, అతని ఐడియాలకూ, ఐడియాలజీకీ ముక్కున వేలేసుకుంటూనే ముచ్చటపడుతూ వచ్చిన ప్రేక్షకులకు అక్కడ నుంచి షాకుల మీద షాకులు ఎదురవుతాయి.

(మిగతా భాగం తరువాయి పోస్టులో...)

Friday, December 17, 2010

‘3 ఇడియట్స్’లో విజయ్ లేడోచ్! మహేశ్ అయినా ఉన్నాడా?



ఆమిర్ ఖాన్ నటించగా హిందీ చిత్రసీమలో సంచలనాత్మక విజయం సాధించిన ‘3 ఇడియట్స్’ తెలుగులోకీ, తమిళంలోకీ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘రోబో’ ఫేమ్ శంకర్ దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మిస్తున్న ఈ రెండు భాషల రీమేక్ చిత్ర కథ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పుడే అందిన తాజా వార్త... ఆ చిత్ర తమిళ రీమేక్ లో హీరో విజయ్ నటించడం లేదహో.....

నిజానికి, ఈ రీమేక్ చిత్రంలో తమిళంలో విజయ్, తెలుగులో మహేశ్ బాబు నటించాల్సి ఉంది. కానీ, సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందే తమిళ హీరో విజయ్ కూ, దర్శకుడు శంకర్ కూ భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. విగ్ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదని కూడా కోడంబాకమ్ కబురు. మొత్తం మీద ఈ చిత్రంలో విజయ్ ఉన్నాడనీ, లేడనీ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తమ సినిమాలో విజయ్ నటించడం లేదని తేల్చి చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చింది. హీరో విజయ్, తాము ఎంతో సామరస్యపూర్వకంగానే విడిపోయామనీ, ఇప్పుడు 3 ఇడియట్స్ తమిళ రూపం కోసం మరో హీరోను వెతుకుతున్నామనీ తెలిపింది. అన్నట్లు మరో అగ్ర తమిళ హీరోను ఆ పాత్రలో నటింపజేసేందుకు నిశ్చయించుకున్నారు. ఆ నటుణ్ణి ఇప్పటికే సంప్రతించారు కూడా. సదరు అగ్ర హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆ హీరో సూర్య అని కోడంబాకమ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

తమిళ రీమేక్ రూపం మాట అటుంచితే, తెలుగు రీమేక్ వ్యవహారం కూడా అంత సజావుగా సాగుతున్నట్లు లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారవుతున్న ‘దూకుడు’ చిత్రంతో బిజీగా ఉన్న హీరో మహేశ్ బాబు ఈ ‘3 ఇడియట్స్’ కు డేట్లు సర్దలేక సతమతమవుతున్నట్లు కృష్ణానగర్ కబురు. ఆయన ఏకంగా ఈ సినిమాకు గుడ్ బై చెప్పేశాడని కూడా అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఆ సంగతేదో అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అప్పటి దాకా మనకు సస్పెన్సే.

Thursday, December 16, 2010

సర్కారీ ఖజానాకు సినిమా దొంగల గండి

అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మేస్తున్న ఈ పద్ధతుల వల్ల ప్రభుత్వానికి కూడా భారీ నష్టం కలుగుతోంది. నిజానికి, తెలుగు సినిమా తనకు వచ్చే మొత్తం వసూళ్ళ (గ్రాస్‌)లో సగటున 15 శాతం దాకా వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే 'రోబో' లాంటి అనువాద, పరభాషా చిత్రాలకైతే ఆ పన్ను 20 శాతం దాకా ఉంటుంది. కానీ, చిత్ర ప్రదర్శకులు తాము నిజంగా అమ్మిన టికెట్ల సంఖ్య కానీ, వాటి అడ్డగోలు రేటు కానీ బయటపెట్టరు. తక్కువ టికెట్లే, అదీ మామూలు రేటుకే అమ్ముడైనట్లు చూపిస్తారు. అలా వీలైనంత తక్కువ వినోదపు పన్ను చెల్లిస్తారు. అంటే, అడ్డగోలు టికెట్‌ రేట్లతో ప్రేక్షకులకే కాక, ఆ రేట్ల లెక్కన వినోదపు పన్ను కట్టరు కాబట్టి ప్రభుత్వానికి కూడా చాలా నష్టమే!

ఉదాహరణకు, కేవలం 3 లక్షల చిల్లర జనాభాతో రాష్ట్రంలో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న నగరపాలక సంస్థ కడప. ఆ నగరంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ 'మగధీర' (2009) చిత్రానికి రూ. 95 లక్షల దాకా నికర వసూళ్ళు (నెట్ కలెక్షన్స్) లభించాయి. ఇందులో తొలి వారం అడ్డగోలు టికెట్ రేట్లతో సంపాదించినదే రూ. 45 లక్షల దాకా ఉన్నట్లు భోగట్టా. అలాగే, కడపలోనే బాలకృష్ణ 'సింహా' (2010) చిత్రం రూ. 75 – 80 లక్షలు, రజనీకాంత్ - శంకర్ ల 'రోబో' చిత్రం రూ. 85 లక్షలు నికర వసూళ్ళు సాధించాయి. ఉన్న వాస్తవం చెప్పాలంటే, ఆ యా హాళ్ళలోని సీట్ల సంఖ్య, ప్రభుత్వం వారి అధికారిక టికెట్ రేట్ల ప్రకారమైతే - ఈ చిత్రాలు కనీసం రెండేళ్ళు హౌస్ ఫుల్ గా అడినా సరే రావడం అసాధ్యమైన నికర వసూళ్ళు ఇవి. ఇది ప్రేక్షకుల నుంచి చేసిన దోపిడీ అయితే, ప్రభుత్వ ఖజానాకు కూడా మరో దోపిడీ జరుగుతోంది. ఈ వచ్చిన కలెక్షన్లలో 20 నుంచి 25 శాతం మాత్రమే ప్రభుత్వానికి లెక్క చూపిస్తున్నారు. ఆ మేర మాత్రమే వినోదపు పన్ను కడుతున్నారు. మిగతాదంతా జేబులో వేసేసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టేస్తున్నారు.

దొంగలకు దొంగ

ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఓ విషవలయం. ఈ పద్ధతిలో వచ్చిన భారీ కలెక్షన్లను సాకుగా చూపెడుతూ, హీరోలు తమ మామూలు పారితోషికాలను సగటున మూడింతలు పెంచేశారు. నటీనటుల పారితోషికాలు, తద్వారా నిర్మాణ వ్యయం, వగైరా పెరిగాయి. ఫలితంగా, ఆ యా ప్రాంతాలకు సినిమాల అమ్మకాల రేట్లు మారిపోయాయి. అంతలేసి మొత్తాలిచ్చి కొన్నవారు పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవడం కోసం ఇలా మళ్ళీ అడ్డగోలు టికెట్ రేట్లనే ఆశ్రయిస్తున్నారు. వెరసి మొత్తం సినిమా వ్యాపారమే మారిపోయింది. పైరసీతో సహా అనేక రోగాలకు ఇదే మూలం. సినిమా చూడడాన్ని ప్రేక్షకుడికి భారంగా మార్చేయడం పరిశ్రమ వాళ్ళు చేస్తున్న తప్పు. అలా మొదటి తప్పును, అన్నిటికీ మూలమైన తప్పును సినిమా పరిశ్రమవాళ్ళే చేస్తూ, మళ్ళీ పైరసీ లాంటి అవతలివాళ్ళ తప్పుల గురించి గొంతు చించుకుంటున్నారు.

సమస్యలకు మూలమైన ఈ దోషాన్ని కనుక్కొని, దానికి సరైన మందివ్వాల్సింది పోయి, తాత్కాలిక ఉపశమనాల వైపు మన సినిమా పరిశ్రమ పరుగులు తీస్తోంది. ''ఇంతింత రేట్లు పెట్టి టికెట్లు అమ్మడం అన్యాయం, అక్రమం కాదా! పైరసీని తిడుతున్న వారికి దానికి మూలమైన తాము చేస్తున్న ఈ తప్పు గురించి తెలియదా! ఇది ఎలా ఉందంటే - (టికెట్లను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్న) ఒక దొంగ, (పైరసీ చేస్తున్న) మరొక దొంగను చూపెడుతూ, 'దొంగ... దొంగ...' అని అరుస్తున్నట్లుంది'' అని తొలితరం సినీ పాత్రికేయుల్లో ఒకరైన మద్దాలి సత్యనారాయణ శర్మ విమర్శించారు.

పత్రికల వారి పరోక్ష పాపం

అసలు, ఈ పాపంలో సమాచార ప్రసార సాధనాలకూ పరోక్షంగా పాత్ర ఉందంటున్నారు - తెలుగు సినీ రంగ వ్యాపార, పబ్లిసిటీ ధోరణులను 60 ఏళ్ళ పైగా నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్‌ సినీ విశ్లేషకులు కాట్రగడ్డ నరసయ్య. ''ఇవాళ దినపత్రికల్లోని సినిమా కాలమ్స్‌లో ఎంతసేపటికీ చిత్ర నిర్మాణ వార్తలు, గ్లామర్‌ వార్తలే ప్రచురిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా అందచందాల ప్రదర్శనలోనే పడి కొట్టుకుపోతోంది. చిత్ర పరిశ్రమలోని సమస్యలు, వర్తమానంలో ఎదురవుతున్న సంక్షోభాల గురించి రావడమే లేదు. దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటోంది'' అని నరసయ్య వాపోయారు. చిత్ర నిర్మాణ వార్తలతో పాటు పంపిణీ, ప్రదర్శక రంగాలతో కూడిన చిత్ర మార్కెటింగ్‌ వ్యవహారాల వార్తలు, విశ్లేషణలు కూడా విరివిగా మీడియాలో రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి విశ్లేషణాత్మక కథనాల వల్ల మేడిపండు లాంటి చిత్ర పరిశ్రమ లోలోపలి సమస్యలు నలుగురి దృష్టికీ వస్తాయి. పరిష్కారం దిశగా ప్రయత్నాలూ జరుగుతాయి.

మరి, గడచిన వారం నుంచి రానున్న సంక్రాంతి వరకు ఎన్నో క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి. పైరసీ గురించి, ఆ దోపిడీ - దొంగ సొమ్ముల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తున్న పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాల టికెట్‌ రేట్ల ద్వారా చేస్తున్న దోపిడీని ఆపేస్తారా? ముందుగా ప్రేక్షకులనూ, ఆ తరువాత వినోదపు పన్ను తక్కువ చెల్లింపుతో ప్రభుత్వాన్నీ నిస్సిగ్గుగా దోచేస్తూ ఆర్జిస్తున్న దొంగ సొమ్మును వదిలేస్తారా? అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న మన ప్రభుత్వాధికారులు, పాలకులు కళ్ళు తెరుస్తారా? సామాన్యులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు బదులేది!?

Monday, December 13, 2010

బ్లాక్ టికెట్లతో మన హీరోల భారీ రికార్డులు

స్థానిక ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం కావాలని కళ్ళు మూసుకుంటూ ఉండడంతో, ఇవాళ అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మే విధానాలు ఆంధ్రదేశంలో ప్రతి అగ్ర హీరో సినిమాకూ నిత్యకృత్యమయ్యాయి. విడుదలైన సినిమాకు క్రేజు ఉన్నన్ని రోజులూ ఈ జంపింగ్ రేట్లు, ఫ్లాట్ రేట్ల విధానంలోనే టికెట్లు అమ్ముతున్నారు. అత్యధిక శాతం హాళ్ళ వారందరూ ఒక్కో టికెట్‌ రూ. 200 - 300 ఉండే 'జంపింగ్‌ రేట్ల' విధానాన్నే ఆశ్రయిస్తున్నారు. గత పోస్టులోనే చెప్పినట్లు - తెలుగు హీరోల చిత్రాలతో పాటు, తాజా అనువాద చిత్రం ‘రోబో’కు కూడా ఈ పద్ధతే యథేచ్ఛగా కొనసాగింది. ఆ నేపథ్యంలో ‘రోబో’ వసూళ్ళు తొలి వారం పది రోజులకు రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి.

భారీ రికార్డుల్లో బలుపు కన్నా వాపే ఎక్కువ

అగ్ర హీరోల సగటు తెలుగు సినిమా కలెక్షన్లకు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ అడ్డగోలు టికెట్‌ రేట్లతో వస్తున్న తొలి వారం వసూళ్ళే ఆ సినిమాకు మొత్తం మీద వచ్చే కలెక్షన్లలో 60 నుంచి 70 శాతం! ఇది విస్మయం కలిగించే వాస్తవం. ఉదాహరణకు, చిన్న ఎన్టీయార్ నటించిన ‘అదుర్స్’ చిత్రం గుంటూరు జిల్లాలో ఆడిన అన్ని వారాలూ కలిపి మొత్తం రూ. 2.7 కోట్ల మేర వసూళ్ళు సాధించింది. అయితే, అందులో ఒక్క తొలి వారంలో వచ్చినవే రూ. 1.75 నుంచి 1.78 కోట్లు. దీన్నిబట్టి సగటు తెలుగు చిత్రాల మొదటి ఒకటి రెండు వారాల వసూళ్ళలో బలుపు కన్నా వాపే ఎక్కువని ఇట్టే గ్రహించవచ్చు.

ప్రేక్షకులను దోచేస్తున్న ఈ పద్ధతి వల్ల ఒకే ఒక్క ప్రయోజనం ఉంది. ఫ్లాపైన సినిమా కూడా భారీగా నష్టపోకుండా, మొదటి వారం రోజుల కలెక్షన్లతో కొంత మేర పెట్టుబడిని వెనక్కి రప్పించడానికే ఈ పద్ధతి ఉపయోగపడుతోంది. దాదాపు రూ. 35 కోట్ల పైగా ఖర్చుతో రూపొంది, టైటిల్‌ విషయంలో తెలంగాణ ప్రాంతంలో వివాదాస్పదమైన ఓ ప్రముఖ హీరో చిత్రం ఇటీవల పెద్ద ఫ్లాపైంది. అయినా సరే, రాష్ట్రంలో ఆ చిత్రానికి వచ్చిన నికర వసూళ్ళు దాదాపు రూ. 15 కోట్లు. లెక్క చూస్తే, అందులో సగం ఇలా అడ్డగోలు టికెట్లతో తొలి రోజుల్లో వచ్చిన అక్రమ సొమ్మే! ఈ అడ్డగోలు టికెట్‌ అమ్మకాలే లేకపోతే, ఆ సినిమా మరింత నష్టపోయేది. కౌంటర్‌లోనే అమ్మిన బ్లాక్‌ పుణ్యమా అని అంత పెద్ద ఫ్లాప్‌లో కూడా నష్టాన్ని కొంత పూడ్చుకోగలిగింది.

పారిపోతున్న ప్రేక్షకులు - పెరిగిపోతున్న పైరసీ

గతంలో కింది పట్నాల్లో ఇలాంటి వినాశకర ధోరణి ఉన్నా, నెల్లూరు లాంటి పెద్ద పట్నాల్లో అధికారుల నిఘాకు వెరచేవారు. మామూలు రేట్లకే టికెట్లు అమ్మేవారు. కానీ, ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారిపోయింది. అగ్ర హీరోల సినిమాను తొలి రోజుల్లో చూడాలంటే, అయిదుగురు సభ్యుల కుటుంబానికి కనీసం వెయ్యి రూపాయలు టికెట్లకే అవుతోంది! గుంటూరు జిల్లా సంగతే చూస్తే, అక్కడ సగటున ప్రతి పెద్ద సినిమా 22 ప్రింట్లతో విడుదలవుతుంది. ఇప్పుడు వాటిలో 21 ప్రింట్లు ఈ రకంగా అడ్డగోలు టికెట్ రేట్లతోనే ప్రదర్శితమవుతున్నాయి. ఈ రేట్ల దెబ్బతో - హాలుకొచ్చి సినిమా చూడాలంటే ప్రేక్షకుడు భయపడి పారిపోతున్నాడు. అదే సమయంలో సినిమా చూడాలనే కోరికను చంపుకోలేక, చౌకగా దొరికే పైరసీ సీడీలను అనివార్యంగా ఆశ్రయిస్తున్నాడు.

''ఇది చిత్రపరిశ్రమ స్వయంకృతాపరాధం. ప్రేక్షకులను దేవుళ్ళుగా పేర్కొంటూనే, ఎక్కువ రేట్లతో వాళ్ళను మేమే హింసిస్తున్నాం. వాళ్ళను అక్షరాలా దేవుళ్ళ లాగా చూసుకుంటేనే, వాళ్ళు ఒకటికి పదిసార్లు హాళ్ళలో సినిమా చూసి, వరాలిస్తారు. దీర్ఘకాలం పాటు పరిశ్రమను పరిరక్షిస్తారు. కానీ, అలా జరగడం లేదు'' అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్‌ వాపోయారు. ''పరిస్థితి ఎలా ఉందంటే - ఇవాళ వేగంగా కోడిని కోసుకు తిందామని అనుకుంటున్నామే తప్ప, గుడ్లు పెట్టే దాకా ఆగడం లేదు. రోజుకో గుడ్డు తిందామని అనుకోవడం లేదు. అదే జరుగుతున్న పెద్ద తప్పు'' అని ఆయన ఆవేదనగా వ్యాఖ్యానించారు.

(ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న భారీ నష్టం కథా కమామిషు తరువాయి పోస్టులో...)

Saturday, December 11, 2010

‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు

అసలు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా, ఎక్కడికక్కడ లోపాయకారీగా జరుగుతున్న అడ్డగోలు టికెట్ల రేట్ల దోపిడీ విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రబలమైన జాఢ్యంగా విస్తరిస్తోంది. తెలుగునాట సినిమా హాళ్ళలో ప్రస్తుతం టికెట్లను రెండు రకాలుగా అక్షరాలా అధికారికంగా బ్లాకులో అమ్మేస్తున్నారు. అందులో మొదటిది - 'ఫ్లాట్‌ రేట్ల విధానం'. అంటే - బాల్కనీ నుంచి నేల వరకు హాలులోని అన్ని తరగతుల టికెట్లనూ 'ఫ్లాట్‌' రేటున బాల్కనీ టికెట్‌ ధరకే కౌంటర్‌లోనే అమ్మేస్తారు. ఈ పద్ధతిలో 'ముందు వచ్చినవారిని మున్ముందు' పద్ధతిలో, పైనుంచి కిందికి తరగతుల సీట్లను క్రమంగా నింపుతారు. ముందుగా హాల్లోకి వెళితే బాల్కనీలో కూర్చుంటే, పై తరగతులు నిండిపోయాక వెళితే బాల్కనీ రేటిచ్చి కొన్న టికెట్‌తో నేల తరగతిలో కూర్చొని సినిమా చూడాల్సి వస్తుంది. ఇది చాలా ఏళ్ళుగా చిన్న కేంద్రాల్లో సాగుతున్న వ్యవహారం.

ఇక, రెండోది - 'జంపింగ్‌ రేట్ల విధానం'. అంటే - సినిమాకున్న క్రేజును బట్టి, బాల్కనీ అసలు రేటుకు అయిదారు రెట్ల ధరకు టికెట్లన్నీ అధికారికంగా కౌంటర్‌లోనే అమ్మేస్తారు. రోజులు గడిచి, క్రేజు తగ్గే కొద్దీ అడ్డగోలు ధరను తగ్గించుకుంటూ అసలు సిసలు అధికారిక టికెట్‌ రేటు వద్దకు వస్తారు. ఆ లోగా సినిమా చూడాలంటే, ప్రేక్షకుడికి పెనుభారమే. ఈ దశాబ్దం మొదట్లో ఆరంభమైన ఈ అక్రమ వ్యాపారం ఒకప్పటి 'ఇంద్ర' దగ్గర నుంచి నేటి 'రోబో', 'ఆరెంజ్‌'ల వరకు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది.

కొన్ని ఊళ్ళలో అయితే, సినిమా తొలి నుంచి ఆఖరి రోజు వరకూ హాలులోని అన్ని తరగతులకూ ఒకే టికెట్‌ రేటుతో దోపిడీ సాగడం విచిత్రం. ఉదాహరణకు, ప్రకాశం జిల్లా కందుకూరు అనే చిన్న కేంద్రం సంగతే తీసుకుందాం. (తెలుగు సినిమా వ్యాపార పరిభాషలో ‘పాత నెల్లూరు జిల్లా’ పరిధిలోకి వచ్చే ఈ కేంద్రాన్ని చిన్నస్థాయి ‘బి’ సెంటర్ (మైనర్ బి) అంటారు). అక్కడ అధికారికంగా సినిమా హాలులో గరిష్ఠ టికెట్ రేటు సుమారు రూ. 20 మాత్రమే. కానీ, అక్కడ ఏ సినిమా కైనా సరే పై నుంచి కింది దాకా అన్ని తరగతుల టికెట్లనూ రూ. 25 నుంచి రూ. 30 వరకు అమ్ముతుంటారు. ‘‘ఇక్కడ ఆఖరికి నేల టికెట్ కూడా అదే 25 – 30 రూపాయలే. ఈ రోజుతో సినిమా ఆఖరు అన్నప్పుడు మాత్రం ఆ ఒక్క రోజుకు ఏ తరగతి టికెట్ ను ఆ తరగతి రేటుకే అమ్ముతారు’’ అని ఆ ఊరి సినిమా ప్రదర్శన సంగతులు తెలిసిన ఓ ప్రేక్షకుడు వివరించారు.

ఇదీ తమిళం నుంచి దిగుమతే!

రజనీకాంత్‌ లాంటి క్రేజీ పెద్ద హీరోల చిత్రాలకు తమిళనాట ఈ 'ఫ్లాట్‌ రేట్లు', 'జంపింగ్‌ రేట్ల' పద్ధతులు అమలులో ఉన్నాయి. అక్కడ నుంచి ఈ జాడ్యాన్ని తెలుగు చిత్రసీమ కూడా చాలా ఏళ్ళ క్రితమే అంటించుకుంది. అంతకు ముందు ఒకటి రెండు చిత్రాలకు జరిగినా, ప్రధానంగా చిరంజీవి నటించిన 'ఇంద్ర' (2002) చిత్రం నుంచి ఈ 'జంపింగ్‌ రేట్ల విధానం' తెలుగు నాట విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో చీరాల లాంటి చిన్న పట్నంలోనే మొదటి రోజున ఒక్కో టికెట్ రూ. 400 చొప్పున కౌంటర్ లో అమ్మేసినట్లు తెలుగు సినీ వ్యాపారవర్గాలు ఆ చరిత్రంతా చెబుతున్నాయి. కాగా, జనంలో క్రేజున్న సినిమాలకు ఇలా దర్జాగా కౌంటర్ లోనే అసలు రేటు కన్నా ఎక్కువ రేటుకు టికెట్లను అమ్మే ‘జంపింగ్ రేట్ల’ విధానం తెలుగునాట ఇప్పుడు ఊరూరా పాకింది. ఇలా వచ్చిన అనధికారిక సొమ్ముతో ఏ సినిమాకు ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించి, జబ్బలు చరుచుకుంటోంది.

పెట్టిన ఖర్చును గబగబా వెనక్కి రప్పించుకోవాలని భారీయెత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన 'రోబో' సినిమాకు టికెట్ల రేట్లు కూడా భారీగానే పెట్టారు. తమిళనాట పెద్ద పెద్ద మల్టీప్లెక్సుల్లో సైతం రూ. 120కి మించి టికెట్‌ రేటు ఉండకూడదనే ప్రభుత్వ నిబంధన ఉంది. దాన్ని పాటిస్తున్నట్లు నటిస్తూ, టికెట్‌ మీద మాత్రం మామూలు రేటే ముద్రించి, 'రోబో' / 'యంతిరన్‌' ప్రేక్షకులకు మాత్రం ఒక్కో టికెట్‌నూ రూ. 200 నుంచి రూ. 500 వరకు అధికారికంగా, కౌంటర్‌లోనే అమ్మేశారు. మద్రాసులో సాగిన ఈ నిలువుదోపిడీకి నేను ప్రత్యక్షసాక్షినే కాక, బాధితుణ్ణి కూడా. తమిళనాట తెలుగు అనువాద చిత్రం 'రోబో'ను ప్రదర్శిస్తున్న హాళ్ళు కూడా ఈ దోపిడీలో యథేచ్ఛగా పాల్గొన్నాయి. ఆ రకంగా తొలినాళ్ళలోనే సినిమా చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తినీ, బలహీనతనూ ఆసరాగా తీసుకొని, డబ్బులు దండుకుంటున్నారు.

(బ్లాక్ టికెట్లతో మన తెలుగు చిత్రాల భారీ రికార్డుల భాగోతం కథ తరువాయి పోస్టులో...)

Monday, December 6, 2010

నను వీడని నీడ - అయోధ్య



ఈ మధ్య అయోధ్య అంశంపై లక్నో ధర్మాసనం తీర్పు వెలువరించినప్పుడు నేనొక్కసారిగా గతంలోకి వెళ్ళా. మళ్ళీ ఇవాళ సరిగ్గా 18 ఏళ్ళ క్రితం అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురైనప్పటి సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి. అది నేను పూర్తిస్థాయి జర్నలిజం ఉద్యోగంలో చేరిన తొలి రోజుల సంగతి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు దినపత్రిక ‘ఈనాడు’లో జర్నలిజమ్ పాఠాలు బూదరాజు రాధాకృష్ణ లాంటి పెద్దల వద్ద గురు ముఖతః నేర్చుకొని, పత్రిక సంపాదకవర్గంలో నేను, నా బ్యాచ్ మేట్లు అప్పుడే చేరాం.

మా బ్యాచ్ లో టాప్ లో నిలిచిన అయిదుగురిని జనరల్ డెస్కులో వేశారు. ఆ అయిదుగురిలో నేనూ ఒకడిని. జనరల్ డెస్కు అంటే పత్రికలోని మొదటి పేజీతో సహా ప్రధానమైన పేజీల్లో వచ్చే జాతీయ, అంతర్జాతీయ వార్తలను తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువదించడం, శీర్షికలు పెట్టడం, మొదటి పేజీలో వచ్చే స్థానిక వార్తలను రిపోర్టర్లు తెలుగులో రాసిస్తే, దిద్ది, హెడ్డింగులు పెట్టడం వగైరా పనులు ఉంటాయి. ఎంత బాగా చదువుకున్నవాళ్ళమైనా సరే, మేము కొత్తగా పనిలోకి దిగినవాళ్ళం గనక మమ్మల్ని జర్నలిజమ్ పరిభాషలో చెప్పాలంటే ‘కబ్’ జర్నలిస్టులుగానే చూసేవారు. అచ్చతెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పిల్లకాకులు’ అన్నమాట.

అప్పటికి ఆఫీసులో అత్యధిక శాతం మంది నేరుగా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళే తప్ప, జర్నలిజం స్కూలులో ఓనమాలు దిద్దుకొని వచ్చినవాళ్ళు కాదు. దాంతో, కొండొకచో కొందరికి మా మీద కాస్తంత గుర్రుగా కూడా ఉండేది. మాకు ఏమీ రాదని నిరూపించాలని కూడా ఒకరిద్దరు సీనియర్లకు మహా పంతంగా ఉండేది. అలా ఎందుకు అనుకొనేవారో మాకు (కనీసం నాకు) అర్థమయ్యేది కాదు. ఇలాంటివన్నీ జర్నలిజమ్ రంగంలో సర్వసాధారణంగా ఉండే జాడ్యాలని ఆ తరువాతెప్పటికో కానీ మాకు తెలియలేదు.

నిజానికి, వారితో తగాదా పడాలనో, వాళ్ళ కన్నా మేమేదో ఊడబొడవగలమని చెప్పాలనో మాలో ఎవరికీ ఉండేది కాదు. పైగా, మాలో అందరికీ అదే తొలి ఉద్యోగం. నేనైతే అప్పుడే కాలేజ్ నుంచి, మా ఊరి నుంచి ఫ్రెష్ గా ఉద్యోగంలోకి వచ్చినవాణ్ణి. బయటి ప్రపంచం కూడా పెద్దగా తెలియదంటే నమ్మండి. (అఫ్ కోర్స్... ఇప్పటికీ నాకు తెలియదు లెండి. మా అన్నయ్యలు, అక్కయ్యలు ఆ మాటే పదే పదే చెబుతుంటారు. అది వేరే కథ).

అది 1992 డిసెంబర్ 6వ తేదీ. అప్పటికి మేము డెస్కులో చేరి నిండా రెండు నెలలైనట్లుంది. అంతే. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం జోరుగా సాగుతోంది. ఆ రోజు ఉదయం నేను మా అద్దె గదిలో ఉన్నాను. ఇల్లుగలవాళ్ళ వాటాకు వెనకాలగా మా గది ఉండేది. అందులో నేను, ధన్వంతరి అనే ఇంకో మిత్రుడు ఉండేవాళ్ళం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా ఇల్లు గల వాళ్ళ వాటాలోని టీవీ పెద్దగా వినిపిస్తోంది. అయోధ్యలో వివాదాస్పద కట్టడం మీద కరసేవకులు ఎక్కి ధ్వంసం చేస్తున్న దృశ్యాలను బి.బి.సి. ప్రసారం చేస్తోంది.

ఇల్లు గల వాళ్ళబ్బాయి చెప్పడంతో నేను హడావిడిగా వెళ్ళి, కాసేపు ఆ దృశ్యాలు టీవీలో చూశాను. జరుగుతున్న పరిణామాలు ఓ పెద్ద చరిత్ర కాబోతున్నాయన్న గ్రహింపు నాకు అప్పటికి ఏ మేరకు ఉందో చెప్పలేను కానీ, ఆ రోజుకు పేపర్లో అదే పతాక శీర్షిక అన్న సంగతి మాత్రం అర్థమైంది.

మధ్యాహ్నం మెస్ లో భోజనం చేసి, యథాప్రకారం సాయంత్రం డ్యూటీకి అటు నుంచి అటే వెళ్ళిపోయా. అప్పటికే టెలిప్రింటర్ మీద వివాదాస్పద కట్టడం విధ్వంసం వార్తలు కట్టలు కట్టలుగా వచ్చి పడ్డాయి. వివాదాస్పద కట్టడంలోని మూడు గుమ్మటాల్లో ఒక్కొక్కటి విధ్వంసాని గురై, సాయంత్రం 3.30 – 4 గంటల మధ్య ఆఖరి గుమ్మటం కూడా కూల్చివేతకు గురైందని తెలిసింది.

ఆ రోజు ఎందుకనో డ్యూటీలో ఒకే ఒక్క సీనియర్ మినహా మిగతా సీనియర్లు ఎవరూ లేరు. దాంతో, అనివార్యంగా, మా కుర్రకారుకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఆనాటి బ్యానర్ వార్త రాసే అవకాశం మాకు దక్కింది.

వార్తలన్నీ రెండు నెలలైనా అనుభవం లేని మేము రాస్తే, ఉన్న ఒక్క సీనియర్ వాటిని సమన్వయం చేసుకుంటూ, సూపర్ లీడ్ వగైరా రాశారు. డ్యూటీలో అనుభవజ్ఞులు ఎవరూ లేకపోవడంతో చేరిన రెండు నెలలకే మొదటి పేజీలోని పతాక వార్త రాసే అవకాశం, అదృష్టం మాకు దక్కాయి. ఆ రోజున సమయానికి తగ్గట్లుగా చేతికి అందివచ్చి, నేను, మా బ్యాచ్ మేట్లు (సూరావజ్ఝల రాము, ఇసికేల ఉదయకుమార్, పమిడికాల్వ మధుసూదన్,వగైరా అని గుర్తు) బ్యానర్ రాయడం ఓ సంచలనమే అయింది.

అప్పట్లో బ్యానర్ రాయడమంటే పెద్ద ఎఛివ్ మెంట్. చేరిన ఎన్నో నెలలకూ, ఏళ్ళకు కానీ బ్యానర్ రాసే అవకాశం వచ్చేది కాదు, ఇచ్చేవారూ కాదు. అలాంటిది అయోధ్య అంశం మాకు అనుకోని అవకాశంగా పరిణమించి, మాలోని పనితనాన్ని సీనియర్లకు తెలిసేలా చేసింది. మరునాడు (అంటే, 1992 డిసెంబర్ 7) ఉదయం పొద్దున్నే పేపర్లో మా రాతలు మేమే బ్యానర్లో చూసుకొని, ఉద్విగ్నతకు గురయ్యాం.

వివాదాస్పద కట్టడం విధ్వంసం తాలూకు పరిణామాలు దేశ చరిత్రను ఎంతో ప్రభావితం చేయడమనేది తరువాతి చరిత్ర. ఇప్పుడు మొన్నీమధ్య అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో ధర్మాసనం అయోధ్య అంశంపై తీర్పు సందర్భంలో నాకు ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. యాదృచ్ఛికంగా, ఇప్పుడు కూడా ఆ వార్తలు రాసి, పాఠకులతో పంచుకొనే అవకాశం నాకు వచ్చింది.

సుప్రీమ్ కోర్టు జోక్యంతో మొదట తీర్పు వాయిదా పడ్డ వారం, ఆఖరికి సెప్టెంబర్ 30న లక్నో ధర్మాసనం తీర్పు నిచ్చిన వారం - వరుసగా ఈ రెండు వారాలూ, ఈ రెండు సందర్భాల్లోనూ ‘ఇండియా టుడే’ తెలుగు వారపత్రిక ముఖచిత్ర కథనాలు నేను, నా సహోద్యోగి మరొకరు (ఒకవారం నేను, మూర్తి గారు, మరొకవారం నేను, ధూర్జటి గారు) కలసి తెలుగు చేసి, అందించాం. డైలీకి బ్యానర్ ఎలాగో, వీక్లీకి కవర్ స్టోరీ అలాగన్నది తెలిసిందేగా. ఉద్యోగానికి కొత్త అయిన అప్పుడూ, అనుభవం వచ్చిన ఇప్పుడూ - రెండు సార్లూ అయోధ్య అంశం కీలక వార్తలు యాదృచ్ఛికంగా నేనే రాయడం నా కెరీర్ లో ఓ చెరగని జ్ఞాపకం.

కొసమెరుపు -

అన్నట్లు అప్పట్లో జర్నలిజమ్ స్కూల్ లో చేరడానికి పరీక్ష రాయాలంటే, అప్లికేషన్ తో పాటు ఏదైనా సమకాలీన అంశం మీద ఓ వ్యాసం రాసి పంపాల్సి ఉండేది. ఆ వ్యాసం ఆధారంగా మన రచనా సామర్థ్యాన్ని అంచనా కట్టి, పరీక్షకు పిలిచేవారు. అందులో పాసైతే, ఆ పైన ఇంటర్వ్యూ. అక్కడా పాసైతే, అప్పుడు జర్నలిజమ్ స్కూల్లో అడ్మిషన్. అలా నేను 1991 చివరలోనో, 1992 జనవరిలోనో ‘ఈనాడు’ జర్నలిజమ్ స్కూల్ కు అప్లికేషన్ పెడుతూ, రాసిన మొదటి వ్యాసం కూడా అప్పటికే బర్నింగ్ టాపిక్ అయిన అయోధ్య మీదే.

అప్పుడే డిగ్రీ పూర్తి చేసి, బయటకొచ్చిన ఆవేశంలో అయోధ్యపై (‘ఆరని రావణకాష్ఠం అయోధ్య’ అన్న టైటిల్ తో అనుకుంటా) ఘాటుగా వ్యాసం రాసి, అప్లికేషన్ తో పంపా. అది చూసి పరీక్షకు పిలవడం, ఆ పై ఇంటర్వ్యూ, అడ్మిషన్, జర్నలిజమ్ లో ప్రవేశం - అన్నీ జరిగిపోయాయి. అలా జర్నలిజమ్ లోకి నా పూర్తి కాలిక ప్రవేశానికి కూడా అయోధ్యతో సంబంధం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ వృత్తిలో కొనసాగుతున్నా. మరి, అయోధ్యతో ఈ నా బంధం యాదృచ్ఛికమా? దైవ ఘటనా? జననాంతర సౌహృదమా, సంబంధమా? మరేదన్నానా!? ఏమో!? మీరేమంటారు!

(అయోధ్యలో నా ప్రత్యక్ష అనుభవం గురించి మరోరోజు... మరోసారి....)

Sunday, December 5, 2010

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!



ఈ మధ్య 'రగడ‌' చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు 'ఆరెంజ్‌' చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం - దారుణమైన పైరసీ! దీన్ని అందరూ ఖండించాల్సిందే! పైరసీని నిరోధించాల్సిందే! ఒక్క క్షణం ఆ సంగతి అటుంచి, ఇప్పుడు నాణానికి రెండో కోణం చూద్దాం. ఇంత పైరసీ అసలు ఎలా పెరుగుతోంది? దీనికి హీరోలు, దర్శక - నిర్మాతల బాధ్యత ఏమిటి? ప్రేక్షకులు హాలుకు వెళ్ళడం మానేసి, పైరసీ సీడీలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఈ విషయాలన్నీ లోతుగా ఆలోచిస్తే, పైరసీకి కారణమై, ఊరూరా పాకుతూ, తెలుగు సినిమాను తినేస్తున్న క్యాన్సర్‌ కనిపిస్తుంది. అది ఏమిటంటే - సామాన్యుడికి అందుబాటులో లేని సినిమా టికెట్‌ రేట్లు!

టికెట్ రేట్ల వ్యవహారం ఎప్పుడూ ఉన్నదే కదా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాలను కాస్త పక్కనపెడదాం. రాష్ట్రంలోని మిగిలిన ఏ ఊళ్ళోనైనా అగ్ర హీరోల సినిమాకు విడుదలైన తొలి రోజుల్లో వెళ్ళి చూశారా. వెళ్ళి చూస్తే, చూద్దాం. సినిమా హాళ్ళలో పబ్లిక్‌గా ప్రేక్షక జనానికి జరుగుతున్న నిలువు దోపిడీ కళ్ళెదురుగా కనబడుతుంది. సినిమాకున్న క్రేజును బట్టి హాలు కౌంటర్‌లోనే అధికారికంగా టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హీరోల తెలుగు చిత్రాలు సగటున 250 నుంచి 300 కేంద్రాల్లో విడుదలవుతున్నాయి.
సినీ వ్యాపార పరిభాషలో ఈ కేంద్రాలను ఏ ప్లస్ (హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటివి), ఏ (తెనాలి, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటివి), మేజర్ బి, మైనర్ బి, మేజర్ సి, మైనర్ సి - అనే ఆరు వర్గాలుగా వర్గీకరిస్తుంటారు.

ఇందులో ప్రభుత్వ అధికారుల నిఘా ఎంతో కొంత ఉండే 'ఏ ప్లస్‌' కేంద్రాల్లో తప్ప, మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఇష్టారాజ్యంగా సాగుతోంది. ...రాష్ట్రంలో మహా అయితే ఓ 10 కేంద్రాలు మినహా, మిగిలిన అన్ని చోట్లా ఈ దోపిడీ సాగుతోంది. ఒకప్పుడు హాలు బయట ఎవరో, అదీ కొన్ని టికెట్లే బ్లాకులో అమ్మేవారు, అమ్మించేవారు. కానీ, ఇవాళ బాహాటంగా బుకింగ్ లోనే అన్ని టికెట్లూ బ్లాకులో అమ్మేస్తున్నారు... అని సినిమా పంపిణీ, ప్రదర్శక రంగాలపై పట్టున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో ఏ తెలుగు సినిమా అయినా చూడండి. ఆరంభంలోని ఈ అడ్డగోలు టికెట్ రేట్ల పుణ్యమా అని ప్రతి అగ్రహీరో తెలుగు సినిమా తొలి వారంలోనే కోట్ల కొద్దీ ఆర్జిస్తోంది. చిత్రం ఏమిటంటే - బాగా లేదని టాక్ వచ్చిన సినిమాకు కూడా తొలినాళ్ళ కలెక్షన్లు కళ్ళు తిరిగేలా ఉంటున్నాయి. దీనికి కారణం - ఇలా అడ్డగోలు రేట్లకు టికెట్లను అమ్మే విధానమే. నిజానికి, ప్రభుత్వపరంగా ఈ విధానానికి అనుమతి లేదు. గతంలో జై చిరంజీవ (2005 డిసెంబర్) చిత్రం విడుదల సమయంలో మన సినిమా పెద్దలే తమ పలుకుబడితో, అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో ఓ ఉత్తర్వు ఇప్పించుకున్నారు. విడుదలైన కొత్త సినిమాకు రెండు వారాల పాటు హాలులోని పై రెండు తరగతుల టికెట్ రేట్లనూ పెంచుకొనేందుకు అనుమతి పొందారు. అలా టికెట్ రేట్లు ఒక్కసారిగా అందని ఎత్తుకు వెళ్ళాయి. దాదాపు 40 రూపాయల బాల్కనీ టికెట్ కాస్తా రూ. 70 దాకా వెళ్ళింది. అలా టికెట్లను అధికారికంగానే ఎక్కువ రేట్లకు అమ్మే ఏర్పాటును తెలివిగా చేసుకున్నారు. భారీ ఖర్చు పెట్టి జై చిరంజీవ తీసినవాళ్ళూ, భారీ రేట్లకు ప్రాంతాల వారీగా సినిమా హక్కులు కొన్నవారూ ఈ రేట్ల పెంపు వెనుక ఉన్నారని అప్పట్లో కృష్ణానగర్ జనం కోడై కూశారు.

అది అలా ఉంచితే, మొత్తానికి ఈ పద్ధతి వల్ల తొలివారాల్లో పెద్ద సినిమాలకు వసూళ్ళు పెరిగినా, పోను పోనూ పైరసీకి ఇది యథోచితంగా తోడ్పడింది. దానికి చిత్రపరిశ్రమలోని వర్గ రాజకీయాలు వచ్చి చేరడంతో - మళ్ళీ అదే సినీ పెద్దలు ఆ రెండు వారాల టికెట్ రేట్ల పెంపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో రద్దు చేయించారు. కాగా, మళ్ళీ ఇటీవలే కొద్ది నెలల క్రితం మళ్ళీ రోశయ్య నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ సారి మొదటి రెండు వారాలనే కాకుండా శాశ్వతంగా టికెట్ రేట్లు పెంచుకొనే అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు పెద్ద ఊళ్ళలో బాల్కనీ టికెట్ రేటు రూ. 40 నుంచి రూ. 50 అయింది. ఇక, మల్టీప్లెక్సుల్లో టికెట్ రూ. 100 నుంచి రూ. 150 అయింది. ...ఈ అనుమతులన్నీ పరిశ్రమ కోసం, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు కానే కావు. భారీ రేటుకు తాము ఏరియాల వారీగా కొన్న సినిమాల మీద డబ్బులు వెనక్కి రాబట్టుకోవడం కోసమే. ఇవన్నీ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి సంకుచిత, స్వార్థ ప్రయోజనాలతో చేసిన పనులే... అని చిత్రపరిశ్రమ అంతర్గత వర్గాలు లోగుట్టు బయటపెట్టాయి.

(తెలుగునాట జరుగుతున్న మరిన్ని బ్లాక్ మార్కెట్ సిత్రాలు తరువాయి పోస్టులో...)

Monday, November 1, 2010

కనిపించని హింసతో కుటుంబ కథ - ‘బావ’



మునుపటి టపా ‘భయపెడుతున్న బావ’లో ముందుగానే చెప్పినట్లు - ఏ మాత్రం వీలున్నా కొత్త తెలుగు సినిమాకు వెళ్ళిపోవడం నా బలహీనత. ఈ మధ్య కాలంలో ఈ బలహీనత మీద మరీ గట్టిగా దెబ్బ కొట్టిన చిత్రం - కచ్చితంగా ‘బావ’.

ఒకటి కాదు, రెండు కాదు - ఏకంగా పదుల కొద్దీ సినిమాల నుంచి వేర్వేరు దృశ్యాలు, ఘట్టాలు, పాటలు, ప్రహసనాలు అడ్డంగా, అడ్డదిడ్డంగా వాడేసుకొని, దానికి మళ్ళీ కొత్త సినిమా అనే కలర్ ఇచ్చుకొని వచ్చిన సినిమా ఇది. దీనికి పల్లెటూరి నేపథ్యం అదనం. మనం చాలా సినిమాల్లో చూసినట్లే, ఇందులోనూ కథానాయకుడు వీరబాబు (సిద్ధార్థ), తన మిత్రులతో కలసి పనీ పాటా లేకుండా తిరుగుతుంటాడు. తింగరి వేషాలు వేస్తూ, ఊళ్ళో జనంతో ఏదో ఒకటి అనిపించుకుంటూ ఉంటాడు. గారాబంగా చూసుకొనే తండ్రి (రాజేంద్రప్రసాద్), తల్లి - అతని సొంతం. ఓ పెద్ద కుటుంబానికి అల్లుడుగా తన కొడుకు వెళ్ళాలని తండ్రి ఆశ. షరా మామూలుగా కొడుకు, పక్క ఊళ్ళోని ఓ పే....ద్ద ఇంటి పిల్లను ప్రేమిస్తాడు.

ఓ రెండు పాటలు, అరగంట సినిమా గడిచాక వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. చిన్నప్పుడు ఒకే స్కూలులో చదువుకొన్న బాల్యమిత్రులమన్న సంగతి హీరో, ఆ అమ్మాయికి గుర్తు చేయడంతో ఈ ప్రేమ పురాణానికి గట్టి పునాది అవుతుంది.

చిక్కేమిటంటే - హీరో వాళ్ళ ఊరికీ, హీరోయిన్ వాళ్ళ ఊరికీ మధ్య గొడవలుంటాయి. గ్రామాల విభజనలో గుడిని కూడా విభజించుకొని, రాముడు ఒకవైపు, సీత మరొకవైపు ఉండిపోయి, 14 ఏళ్ళుగా కల్యాణం కూడా జరపని గ్రామాలవి. హోదా, స్థాయి కోరుకునే తండ్రి, మరో వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయడానికి సిద్ధపడుతున్నట్లు హీరోయిన్ భయపడుతుంది. దాంతో, హీరోయిన్ మెడలో గుళ్ళో అమ్మవారి తాళి కట్టేసి, తమ ఇంటికి తెచ్చేస్తాడు.

తీరా అందుకు హీరో తండ్రి అభ్యంతరం చెబుతాడు. అయినవాళ్ళందరినీ ఒప్పించి, ఆ ఇంటికి అల్లుడు కావాలని హీరోకు చెబుతాడు. అతను అలా అనడానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, ఆ తరువాత హీరో - హీరోయిన్లు చేసిందేమిటి, హీరోయిన్ ఇంటి వాళ్ళను హీరో ఎలా ఒప్పించాడన్నది ఇంకా సహనం మిగిలిన వాళ్ళే చూడగల మిగతా సినిమా.

ఈ అతుకుల బొంత కథలో అనేక సందేహాలు తలెత్తుతాయి. వాటిలో కొన్ని -
1. చిన్నప్పుడు కలిసి చదువుకొన్న హీరో, హీరోయిన్లకు తాము బావా మరదళ్ళమన్న సంగతి తెలీదా?
2. గుళ్ళో స్తంభానికి కట్టి ఉంచిన అమ్మవారి తాళిబొట్టును హీరోయిన్ మెడలో హీరో కట్టేశాడు. కల్యాణం జరగలేదని ఏళ్ళుగా బాధపడుతున్న జనానికి ఆ తాళిబొట్టు ఏమైందన్న ఆరా రాదా, ఆ అక్కర లేదా?
3. చిన్నప్పటి బాబు జ్ఞాపకాలను తనతోనే దాచుకొని, బొమ్మల పెళ్ళి లక్కపిడతల్ని కూడా దాచుకున్న హీరోయిన్ ఆ తరువాత దాని గురించి పట్టించుకోకుండా, ‘హేయ్... రమణ బావ’ అంటూ మరొకరితో పెళ్ళికి ఇష్టం అన్నంతగా చనువుగా ఉంటుందేం?

రెండు ఊళ్ళ గొడవలతో 14 ఏళ్ళపాటు గుళ్ళో దేవుళ్ళకు కల్యాణం జరగకపోవడం, హీరో - విలన్ల మధ్య సైకిల్ పందెం - ఇలా అన్నీ మనకు పాత సినిమాలను పదే పదే జ్ఞాపకం చేస్తుంటాయి. ఈ కాపీలు చాలవన్నట్లు - హీరోయిన్ పరిచయానికి ఆర్య -2 చిత్రంలోని రింగ రింగా... పాటను పూర్తిగా వాడుకున్నారు. అలాగే, అతకని బ్రహ్మానందం పెళ్ళి హాస్య ఘట్టం కోసం అల్లు అర్జునే నటించిన ఇటీవలి వరుడు చిత్రాన్ని వ్యంగ్యంగా వాడారు.

నటనలో ఈజ్ కనబరిచే హీరో సిద్ధార్థ సైతం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో దారుణమనిస్తారు. కావాలంటే, హీరోయిన్ తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవపడుతూ, ఏడ్చే సందర్భాన్ని (చూడగలిగితే) చూడండి. హీరోయిన్ ప్రణీత తెరపై సుద్దబొమ్మలా తప్ప ప్రాణం ఉన్న మనిషిలా అనిపించకపోవడానికి కథాకథన లోపాలు కూడా యథోచితంగా తోడ్పడ్డాయి. రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర కూడా అసలు ఘట్టాల దగ్గరకు వచ్చేసరికి చేసిందేమీ లేదు. సినిమా నిండా పాత్రలున్నా - వాటి మధ్య అనుబంధాలు కానీ, భావోద్వేగాలు కానీ కృత్రిమంగానే అనిపిస్తాయి. ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా చూస్తున్నవారికి (దర్శక - నిర్మాతలు ఆశించిన) అనుభూతిని అందించవు.

సినిమాలో సంగీతం, ఒకదాని వెంట మరొకటిగా వచ్చిపడే పాటలు - అంతా గందరగోళమే. అన్నట్లు ఓ విషాద గీతంలో సిద్ధార్థ గొంతులో వినిపించిందండోయ్. సినిమాలో బాగున్నదల్లా - పచ్చని ప్రకృతి దృశ్యాలు. వాటిని తెర కెక్కించడానికి ఛాయాగ్రాహకుడు చూపిన పనితనం మెచ్చుకోవాల్సిందే. ఫస్టాఫ్ కాస్తంత జోకులతో నడిచినా, సెకండాఫ్ కు వచ్చేసరికి, ఇంతటి యు సర్టిఫికెట్ కుటుంబ కథ సినిమా కూడా ప్రేక్షకుల పాలిట హింసాత్మకంగా పరిణమిస్తుంది. కథలో హింస లేదన్న మాటే కానీ, సినిమా మాత్రం ఓ పెద్ద హింసాత్మక అనుభవం. ‘బావ’ అంటే భయపడుతున్నది అందుకే.

Sunday, October 31, 2010

భయపెట్టిన ‘బావ’



ఈ మధ్య మనవాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తున్నారంటే హాలుకు వెళ్ళాలంటే భయమేస్తోంది. అయినా సరే, తెలుగు సినిమా విడుదలైతే, మనసు ఊరుకోదు. దాంతో, ఖర్చు, శ్రమ పక్కనబెట్టి, పట్టువదలని విక్రమార్కుడిలా హాలు దారి పట్టక తప్పడం లేదు.

గడచిన వారం, పది రోజుల పైగా రకరకాల కారణాలతో తెగని పనుల్లో తెగ మునిగిపోవడంతో ఈ వారాంతం ఎలాగైనా సినిమాకు చెక్కేయాలనుకున్నా. దానికి తోడు పక్షం రోజుల తరువాత ఊళ్ళోకి కొత్త తెలుగు సినిమా వచ్చి, ఊరించింది. రెండు రోజులుగా కురుస్తున్న వానల మధ్యలోనే మనసు విహంగం రెక్కలు విప్పుకొని, హాలు ముంగిట వాలింది.

కానీ, సిద్ధార్థ నటించిన ‘బావ’ ఉన్న ఉత్సాహాన్ని కూడా హరించేసింది. నిలువునా నీరసం తెప్పించేసింది. సగటు తెలుగు సినిమా ఇక మారదేమోననే నిరాశ వైపు నన్ను మరో అడుగు ముందుకు నెట్టేసింది. కష్టపడి నిద్ర ఆపుకొని ఈ మూడుముక్కల టపా రాస్తున్నా... కనీసం రేపు ఆదివారం పొద్దున్నే నా లాగా మరెందరో తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఈ సినిమాకు బకరాలుగా దొరికిపోకూడదని.

(రేపు నిద్ర లేచాక, ఓపిక చేసుకొని మిగతా కథ చెబుతాను మిత్రులారా....)

Wednesday, October 20, 2010

ఇది రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ చరిత్ర!

సినిమా సిద్ధమవుతుండగానే, దానికి ఏ రకంగా ప్రచారం పొందాలా అని చూడడం దర్శక - నిర్మాతల్లో సహజం. బహుశా, సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల వరకు ఏదో ఒక వివాదంతో మీడియాను తన చుట్టూ తిప్పుకోవడం దర్శక - నిర్మాత రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అనుకోవాలి. ఏ సినిమా తీస్తున్నా, దాని గురించి నలుగురూ చెప్పుకొనేలా చేయడంలో ఆయన కళకు తాజా ఉదాహరణ - రానున్న రక్తచరిత్ర చిత్రం.

ఆంధ్రదేశంలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని ముఠా నేతల నిజజీవితాలను ఆధారంగా చేసుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన సిద్ధం చేసిన రక్తచరిత్ర సినిమా ఇప్పటికి ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికీ తెలుసు. కానీ, ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ప్రకటన దానికి పరాకాష్ఠ. ఈ సినిమాలో ఎవరిని ఎక్కువగా, మరెవరిని తక్కువగా చూపారో అనీ ఇప్పటికే కొందరు కత్తులు నూరుతుంటే, అనంతపురంలో రక్తచరిత్ర ప్రీమియర్ ప్రదర్శన జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదేమిటి, పబ్లిసిటీ వ్యూహమా అని అడిగిన వాళ్ళకు వర్మ నిర్లజ్జగా ఒకే మాట చెప్పారు. ‘‘అవును. పబ్లిసిటీ కోసమే’’ అని తడుముకోకుండా బదులిచ్చారు. పైగా, ‘‘నేను చేస్తున్నది సినిమా వ్యాపారం. దేనికైనా పబ్లిసిటీ అవసరం. సినిమాకు మరీ అవసరం’’ అని ఓ విశ్లేషణ కూడా వాక్రుచ్చారు. వర్మాజీ, వాట్ యాన్ ఎనాలసిస్. అంటే, ఇటు పబ్లిసిటీ కోసం వాస్తవికత, అటు (అ)వాస్తవికతతో పబ్లిసిటీ అన్న మాట.

రాయలసీమ అంటేనే రక్తపాతాలు, బాంబులు, బరిసెలు, వందలాది టాటా సుమోలని చూపుతున్న సగటు తెలుగు సినిమా చాలదన్నట్లు, ప్రచారం కోసం మీరూ ఏదన్నా చేస్తారన్నమాట. అన్నట్లు, మొన్నే వర్మ గారు మరో మాట అన్నారు. ‘‘నేను ఏవో పాత్రలు తీసుకొని సినిమా కథలు రాసుకుంటున్నా. దానికి మీడియానే లేని పోని వివాదం రేపుతోంది’’ అని వర్మ ఉవాచ. పబ్లిసిటీ కోసమే అంతా అని స్పష్టత ఉన్న రామ్ గోపాల్ వర్మ తప్పు మరెవరిదో అనేస్తున్నారు. ఆయన మాటలు వింటే, ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే, దూడకు గడ్డి కోసం’ అన్న మాటకు నాలుగు ఆకులు ఎక్కువగా - ‘గడ్డి మేస్తున్న దూడ కోసం’ అని చెబుతున్నట్లుంది.

Monday, October 18, 2010

ఎవరు మాసు? ఎవరు క్లాసు? - ఇంతకీ చిన్న ఎన్టీయార్ మాస్ హీరోనా? క్లాస్ హీరోనా?

ఎవరు మాసు? ఎవరు క్లాసు? ఇది చాలా చిత్రమైన ప్రశ్న. చిక్కుప్రశ్న. జవాబు తెలుసని అనిపిస్తూనే, చెప్పాలంటే ఇబ్బందిగా మారే అంశం. బృందావనం - ఈ గోవిందుడు 'ఎందరి' వాడోలే... అన్న నా టపాపై కొత్త పాళీ గారు పెద్ద చర్చకే తెర తీశారనిపించింది. దీనికి జవాబు మీకు తెలియనిదని నేను అనుకోను. నాకు పూర్తిగా తెలుసని చెప్పడానికి ధైర్యం చేయను. అయితే, ఇటీవల నేను రాసిన బృందావనం... చిత్రంపై సమీక్ష వరకు పరిమితమై నాకు తోచిన వివరణ ఇవ్వదలిచాను.

చెప్పాలంటే - ఒక్కో నటుడికి / హీరోకు ఒక్కో వర్గం ప్రేక్షకులలో అభిమానం, ఆదరణ ఎక్కువ ఉండడం చిత్ర సీమలోని లక్షణం. అయితే, ప్రతి వర్గమూ దానికదే ప్రత్యేక ఉనికితో కూడినదని కానీ, మరొక వర్గం ప్రేక్షకులతో ఎక్కడా ఉమ్మడి లక్షణాలు లేనిదని కానీ చెప్పలేం. అలాగే, అన్ని వర్గాలనూ, అన్ని వేళలా, అన్ని సినిమాల్లో ఆకట్టుకొనే నటుడు, నటన ఉంటాయని అనుకోలేం.

మార్కెట్ లో ఉన్న విశ్లేషణను బట్టి చెప్పాలంటే - చిన్న ఎన్టీయార్ మాస్ హీరో. మొదటి నుంచి అతని సినిమాలకు ఉన్న ఓ నిర్దిష్ట ప్రేక్షక వర్గాన్ని ఉద్దేశించి చేసిన ఉరామరిక వర్గీకరణ అది. అతని సినిమాలు సామాన్య ప్రేక్షక జనాన్ని ఉద్దేశించి, ఎక్కువగా సాగుతాయన్నది ఆ అంచనా. తదనుగుణంగానే, ఎక్కువ భాగం అతని సినిమాలకు వారే మహారాజ పోషకులు. సింహాద్రి, ఆది, నా అల్లుడు, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్ లాంటి ఆయన చిత్రాల సరళి, వాటిలోని అంశాలు గమనిస్తే - ఆ మాటలోని అంతరార్థమేమిటో గ్రహించవచ్చు.

అది రచన అయినా, సినిమా అయినా, మరొకటైనా సరే - ప్రతి సృజనకూ దానికంటూ ఓ లక్షిత పాఠక వర్గం / వీక్షక వర్గం ఉంటుంది. అయితే, ఆ లక్షిత వర్గాన్ని అవి రంజింపజేస్తాయా లేదా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు చిన్న ఎన్టీయార్ చిత్రాలన్నీ ప్రధానంగా పైన చెప్పిన సామాన్య ప్రేక్షక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని తీసేవే.

అయితే, చిత్రాల మార్కెట్ ను విస్తరించుకోవాలన్నా, వాటికి వసూళ్ళు పెంచుకోవాలన్నా, నటుడిగా చిరకాలం నిలబడాలన్నా - ఉన్న అభిమాన ప్రేక్షక వర్గ పునాదిని నిలుపుకొంటూనే, కొత్త వర్గాలను కూడా తన చిత్రాలకు వీక్షకులుగా మార్చుకోవాలి. స్టార్ హీరోలు అయిన వారు, అవుదామని ప్రయత్నించేవారు అనివార్యంగా చేసే ప్రయత్నం ఇదే. పైగా, ఎప్పుడూ ఒకే వర్గ ప్రేక్షకులను ఆకర్షించే చిత్రాలు చేసి, చేసీ, హీరోలకూ మొహం మొత్తడం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో కొత్త వర్గాన్ని ఆకర్షించేలా ఇమేజ్ మార్పునకు హీరో ప్రయత్నిస్తాడు.

ఎన్.టి.ఆర్. జూనియర్ తాజాగా బృందావనం చిత్రంలో చేసిన పని అదే. పోరాటాలు నిండిన యాక్షన్ పాత్రలతో, నృత్యాలతో తాను అభిమానులుగా సంపాదించుకున్న ప్రధానమైన సామాన్య ప్రేక్షక వర్గానికి తోడుగా, కుటుంబ ప్రేక్షకులనూ, ఎగువ తరగతి ప్రేక్షక వర్గాలనూ కూడా మరింత ఎక్కువగా ఆకర్షించాలనీ, ఆ రకం కథలు, పాత్రలు ఎంచుకోవాలనీ అతను నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. కెరీర్ పురోగమనంలో అది అతనికి తప్ప లేదు. అందులో తప్పూ లేదు. అందుకే, బృందావనం కథ, అతని రూపురేఖలు ఈ ఆశించిన కొత్త మార్పునకు తగ్గట్లు ఉన్నాయి. దీన్నే ముతకగా సినిమా పరిభాషలో మాస్ నుంచి క్లాస్ హీరోగా ఇమేజ్ మార్చుకోవడం అంటున్నాం. (అఫ్ కోర్స్, మళ్ళీ తనకున్న సామాన్య అభిమాన వర్గం పునాదిని కోల్పోకుండా ఉండడం కోసం ఇదే సినిమాలో ఎన్.టి.ఆర్. జూనియర్ యాక్షన్ తరహా చిత్రాల ఫైట్లూ ఎక్కువే చేశారు. అది వేరే సంగతి).

అయితే, ఇక్కడే ఓ చిక్కొస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాకు రోజు కూలీ శ్రామికుడు రాజ పోషకుడు. మహిళలు మహారాజ పోషకులు. మాయ చేసి, జోల పాడే సినిమా అప్పట్లో సమస్యల నుంచి మధ్యతరగతి జనం ఎస్కేపిజానికి మార్గం. ఈ వర్గాలన్నిటికీ సినిమా తప్పనిసరి వినోదం. ఇలాంటి విస్తృత జనబాహుళ్యాన్ని మెప్పించడమే ధ్యేయంగా మన సినిమా నడిచింది.

టీవీ చానళ్ళ ప్రభంజనం మొదలయ్యాక, హాళ్లలో టికెట్ రేట్లు అందీ అందకుండా పోయాక, ఇవాళ హాలుకు వచ్చే ప్రేక్షక వర్గాలు, వారి అభిరుచులు మారిపోయాయన్నది నిష్ఠుర సత్యం. ఈ పరిస్థితుల్లో, సినిమాను వ్యాపారంగానే చూస్తున్న ప్రస్తుత తరుణంలో మన సినిమాలన్నీ ప్రధానంగా యువతరాన్నీ, కాలేజీ కుర్రకారునూ (తెలుగునాట వాళ్ళే ఇవాళ ఎక్కువగా సినిమాలకు వస్తున్నారన్నది ఓ థీరీ) దృష్టిలో పెట్టుకొని వస్తున్నాయి. తరచూ సినిమాలకొచ్చే శ్రామిక వర్గం, ఈ యువజన వర్గాలే ఇవాళ తెలుగు సినిమాకు పోషకులు. కాబట్టి అదే నేటి సామాన్య ప్రేక్షక వర్గం.

ఇక, ఒకప్పుడు సినిమాలు చూసినా ఇప్పుడు ఆ జోరు తగ్గించేసిన పెద్దలు, నడి వయసు దాటిన మహిళలు, సకుటుంబ ప్రేక్షకులు - వీరంతా అదనపు వర్గాలు. అరుదుగానో, అప్పుడప్పుడో, తమను ఆనందింపజేసే కథ తెరపై వచ్చినప్పుడో మాత్రమే హాళ్ళకు కదిలే ఈ వర్గాన్నే సినిమా ట్రేడ్ వర్గాలు క్లాస్ అంటున్నారు. ఈ వర్గీకరణలు ఏ మేరకు నిర్దుష్టమైనవన్నది పెద్ద చర్చే. కానీ, ఈ పరిభాషను తప్పించుకొంటూ, సినిమాలను సమీక్ష చేయడం అసాధ్యం కాకపోవచ్చు. అలాగని ఈ నేపథ్యాన్ని పూర్తిగా విస్మరిస్తూ, విశ్లేషణకు దిగడం మాత్రం ఆచరణలో, అనుభవంలో అవివేకమయ్యే ప్రమాదం ఉంది.

Saturday, October 16, 2010

ఇమేజ్ మార్పు కోసం చిన్న ఎన్టీయార్ విఫలయత్నం - 'బృందావనం'


(‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?! - పార్ట్ 2)

జగపతిబాబు 'శుభమస్తు' (నిజానికి అది ఓ తమిళ చిత్రానికి రీమేకట)మొదలు పతాక సన్నివేశంలో బాలకృష్ణతో నిర్మాత 'యువచిత్ర' కాట్రగడ్డ మురారి తీసిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం దాకా అనేకానేక చిత్రాల ప్రభావం బృందావనం... గోవిందుడు అందరి వాడేలే... సినిమా మీద కనిపిస్తూనే ఉంటుంది.

చూపిన కథలే చూపితే....

పలు విజయవంతమైన చిత్రాల నుంచి వీలైనన్ని ముక్కలు ఏరుకొని తీసిన ఈ సినిమాకు కథ, కథనం, దర్శకత్వం - మూడూ వంశీ పైడిపల్లివే. ఈ సినిమా నిడివి పదహారు రీళ్ళే అయినా, కనీసం పదహారేళ్ళ కథను ఏకబిగిన చూపిస్తున్న భావన కలిగిస్తుంది. దర్శకుడి కథన మహిమ అది. ఇదే 'బృందావనం'చిత్ర నిర్మాత దిల్ రాజు హీరో ప్రభాస్ తో నిర్మించిన 'మున్నా' చిత్రం తీసిన దర్శకుడు ఈయనే.

నటులు సరే... నటన మాటేమిటి...

'బృందావనం...'లో నటీనటుల సంగతి చూస్తే - బాగా ట్రిమ్ చేసిన మీసం, గడ్డంతో క్రిష్ పాత్రలో చిన్న ఎన్టీయార్ బాగున్నారు. ప్రేమికుడిగా, రౌడీలను ఎదిరించే సాహసికుడిగా ఏక కాలంలో అటు కుటుంబ ప్రేక్షకులనూ, ఇటు సామాన్య జనాన్నీ ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నించారు. అయితే, నిజమైన భావోద్వేగాలకు అవకాశం లేని ఈ స్క్రిప్టులో ఆయన అద్భుతంగా చేసిన నటన ఏమిటంటే - ప్రశ్నార్థకమే.

పైపెచ్చు ఆ ప్రయత్నమేదో పూర్తిగా నిజాయతీతో చేసి ఉండాల్సింది. అదీ లేదు. సినిమా మరీ క్లాస్ అవుతుందన్న భయమో ఏమో, దర్శకుడు వీలైన చోటల్లా హీరోతో మానవమాత్రులకు సాధ్యం కాని ఫైట్లు చేయించారు. మాస్ ను మెప్పించాలని అతిగా శ్రమించారు. (ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్లు - రామ్ - లక్ష్మణ్ సోదరులు). కానీ,పల్లెటూరి ఎర్రబస్సులో పవర్ స్టీరింగ్, కత్తితో వందల అడుగుల చెట్టును కూల్చేయడం, ఎంత భారీ మనిషినైనా సరే అందులో సగమైనా లేని హీరో ఒంటిచేతితో గాలిలో గిరగిరా తిప్పేయడం లాంటి నమ్మశక్యం కాని ఆ ఫైట్లతో ఏ వర్గం ప్రేక్షకుడైనా మమేకం కావడం కష్టమే. దాంతో, ఈ నిమా అటూ, ఇటూ - ఎటూ చెందకుండా తయారైంది.

కథానాయికలుగా సమంత, కాజల్ - ఇద్దరూ ఉన్నా వారు కథలో అందమైన బొమ్మలే తప్ప, ప్రాణమున్న పాత్రలుగా కనిపించే ఘట్టాలు సినిమాలో అరుదు. ఆహుతి ప్రసాద్, రఘుబాబు, బ్రహ్మాజీ, సురేఖావాణి, తనికెళ్ళ భరణి, సితార - ఇలా సినిమా నిండా పేరున్న నటులు చాలా మందే ఉన్నారు. కానీ, మనసును తాకే పాత్రలే కరవు.

పాత్రచిత్రణలో లోటుపాట్లు

కాజల్ కు తాత పాత్రలో కోట శ్రీనివాసరావు, అతని పెద్ద కొడుకుగా ప్రకాశ్ రాజ్, చిన్న కొడుకుగా శ్రీహరి - వీరి మధ్య బంధాలనూ, అంతస్సంఘర్షణనూ బలంగా చెప్పగల అవకాశం స్క్రిప్టులో ఉంది. అయితే, ఆ పని చేయలేకపోయారు. భావోద్వేగ ప్రకటన అంటే గొంతు చించుకొని అరవడమని మన చిత్ర రూపకర్తలు అనుకున్నట్లు ఉన్నారు. అందుకే, సినిమాలో కొన్నిచోట్ల ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఆంగికాన్ని వదిలి వాచికం మీద అతిగా పడ్డారు. ఫలితం - దృశ్యప్రాధాన్యం పోయి, శబ్ద కాలుష్యం మిగిలింది. అలాంటి సన్నివేశాల్లోని ఆ మితిమీరిన నాటకీయ ఫక్కీ ఏ తరం ప్రేక్షకులకైనా సహన పరీక్ష అని దర్శకుడు గుర్తించగలిగితే బాగుండేది.

ఈ సినిమాలో పాత్రల ప్రవర్తనకు క్రమానుగత పరిణామం కూడా లేదు. ‘‘ పాతికేళ్ళ వైరాన్ని పది నిమిషాల్లో పోగొట్టే మొనగాడివా’’ అని ఓ దశలో హీరోను ప్రకాశ్ రాజ్ ప్రశ్నిస్తాడు. పాత్ర ద్వారా తాను వేసుకున్న ప్రశ్నను తానే మర్చిపోయిన దర్శకుడు చివరకు సినిమాలో చూపించింది అదే. ప్రకాశ్ రాజ్, శ్రీహరి పాత్రలు ద్వేషం నుంచి ప్రేమకూ, ప్రేమ నుంచి ద్వేషానికీ ఎప్పటికప్పుడు మీట నొక్కినంత సులభంగా మారిపోయినట్లు కనిపిస్తుంది.

అలాగే, ‘‘మా అందరి మనసూ చూరగొని, మమ్మల్ని మార్చేశాడు. ఈ ఇంటిని బృందావనం చేశాడు’’ - అంటూ హీరో పట్ల ప్రకాశ్ రాజ్ కుటుంబం ప్రేమ చూపడానికీ, ఇంటిపెద్ద ప్రకాశ్ రాజ్ తోనే వాదించడానికీ కారణమైన సన్నివేశాలేవీ సినిమాలో లేవు. (ఒక్క ఆహుతి ప్రసాద్, రఘుబాబులను నాటకీయంగా మార్చేసిన సీన్ తప్ప). దాంతో, వాళ్ళ డైలాగులు తెచ్చి పెట్టుకొని చెప్పినట్లు ఉంటాయే తప్ప, కథనంలో అతకవు. హీరో తల్లి తండ్రుల పాత్రలు కూడా కథ కోసం రాసుకున్నట్లు కనబడేవే. పాత్రల్లోనూ, వాటి భావోద్వేగాల్లోనూ సహజత్వం కన్నా కృత్రిమత్వమే తాండవిస్తుంది.

కామెడీయే కొంత అండ

ఎటొచ్చీ మధ్య మధ్య వస్తూ పోయే వినోదమే ఈ సినిమాకు ఉన్నంతలో పెద్ద బలం. ప్రకాశ్ రాజ్ కుటుంబంలోని చిట్టి పాత్రలో వేణుమాధవ్ కాసేపు కామెడీకి ఉపకరించారు. 'రత్తాలు - రైసు మిల్లు' సి.డి. లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అలాగే, 'బొమ్మరిల్లు' టైపు తండ్రినంటూ సెకండాఫ్ లో హీరోకు తండ్రిగా నాటకమాడడానికి వచ్చిన కాసేపు బ్రహ్మానందం - ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్.

సాంకేతిక విభాగాల సంగతి

ఈ చిత్ర సాంకేతిక విభాగాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది - ఛోటా కె. నాయుడి ఛాయాగ్రహణ శ్రమ. మార్తాండ్ కె. వెంకటేశ్ తన ఎడిటింగ్ కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే బాగుండేది. అఫ్ కోర్సు ఇప్పుడు కూడా వచ్చిన నష్టమేమీ లేదు. హాలులోని ప్రొజెక్టర్ ఆపరేటర్లే ఆ పని చేయడం ఖాయమని అర్థమవుతూనే ఉంది.

అలాగే, ఆ మధ్య కొన్ని మెరుపులు మెరిపించిన థమన్ ఎస్. ఈ చిత్రానికి అందించిన సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో మెలొడీ పాటలు కూడా కట్టిన ఈ యువ సంగీత దర్శకుడు పాటల్లోని బీజియమ్ ల మొదలు సినిమాలోని సన్నివేశాల వరకు బీట్ కే పెద్దపీట వేశారు. రీ-రికార్డింగులోనూ అదే వరస. సన్నివేశంలోని ఎఫెక్టును పెంచడానికి సంగీతంలో నిశ్శబ్దం కూడా ఓ భాగమేనని మర్చిపోయేసరికి, ప్రతి దృశ్యంలో రీ-రికార్డింగ్ శబ్దాలు చెవులకు హోరెత్తిస్తుంటాయి, మనసుకు ఠారెత్తిస్తుంటాయి.

పాటలు, డ్యాన్సులు


కొన్ని పాటలకు ఎంచుకున్న లొకేషన్లు (ముఖ్యంగా కాజల్, ఎన్టీయార్ల పల్లె సీమ పాట), వాటిని చూపిన తీరు కంటికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కోసం కూడా బాగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ చిత్రంలోని పాటలు గుర్తుంచుకోగలిగేలా లేవు. నాకైతే, ఈ డి.టి.ఎస్.ల హోరులో పాటల్లో మాటలు అక్కడక్కడే వినిపించాయి. రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, లలిత నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటల్లో చిన్న ఎన్టీయార్ తన స్వతఃసిద్ధంగా చులాగ్గా నర్తించారు. (నర్తించలేక ఇబ్బంది పడ్డ పాట ఒకటి ఉంది. దాని గురించి చివరలో...)

ఇక, పిక్స్ లాయిడ్ సంస్థకు చెందిన యుగంధర్, నయీమ్ ల బృందం ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్ లు సమకూర్చారు. ప్రకాశ్ రాజ్ ఇల్లుగా సినిమాలో కనపడే నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలోని ఇంటి సెట్టింగ్ చుట్టూరా అంత ఖాళీ స్థలం, ప్రకృతి దృశ్యాలు వగైరా మొత్తం కంప్యూటర్ లో విజువల్ ఎఫెక్ట్ ల క్రియేషనే.

వంశీ పైడిపల్లి రాసుకున్న ఈ చిత్ర కథకు ముగ్గురు రచనా సహకారం అందించారు. ఆ ముగ్గురిలో ఒకరైన కొరటాల శివ దీనికి సంభాషణలు సమకూర్చారు. కొన్ని చోట్ల పాటక జన ప్రశంసలందే డైలాగులూ రాశారు. ‘సిటీ నుంచి వచ్చాడు కదా - సాఫ్టుగా ఉన్నాడనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని రెచ్చగొట్టకు. రెచ్చగొడితే రచ్చ రచ్చే...’ (విలన్ తో హీరో)లాంటివి ఆ కోవ లోవే. ‘‘భయమా, వినయమా’’ అని హీరో అడిగితే, ‘భయంతో కూడిన
వినయంతో వచ్చిన....’ అంటూ వేణుమాధవ్ చెప్పే డైలాగు మహేశ్ బాబు ‘అతడు’లో త్రివిక్రమ్ రాసిన డైలాగుకు నకలు.

చిన్న ఎన్టీయార్ ఇమేజ్ పెంపు కోసం మళ్ళీ ‘యమదొంగ’ వగైరా చిత్రాల్లో లాగా పెద్ద ఎన్టీయార్ పాత్రను సినిమాలోకి రప్పించారు. దాన వీర శూర కర్ణ చిత్రంలోని గీతోపదేశం సన్నివేశంలోని విశ్వరూప కృష్ణుడి వేషంలో పెద్దాయన క్లైమాక్స్ లో కనిపిస్తారు. కానీ, అక్కడ రెండు మూడు డైలాగులకు మిమిక్రీ వాళ్ళతో చెప్పించిన పెద్ద ఎన్టీయార్ డబ్బింగ్ ఆ పాత సినిమాలను చూసి పెరిగిన తరానికి చీకాకు తెప్పిస్తుంది.

'ఢీ, రెఢీ, బిందాస్' - ఇలా ఈ మధ్య కాలంలో వినోదాత్మక పంథాలో నడిచిన మాస్ చిత్రాలు అందరికీ గుర్తే. నాలుగు డబ్బులు చేసుకున్న ఆ చిత్రాల తోవే ఈ కథకూ శ్రేయస్కరమని దర్శక, నిర్మాతలు భావించినట్లున్నారు. అందుకే, చాలా చోట్ల ఆ బాటలోనే నడిచారు. కానీ, 'బావగారూ బాగున్నారా', 'అల్లుడు గారు వచ్చారు' లాంటి పలు సినిమాలను గుర్తుకు తెచ్చేలా, అనేక అంశాల కిచిడీగా మార్చడంతో, ఓ దశ గడిచేసరికే హాలులోని ప్రేక్షకులకు విసుగు పుడుతుంది. ఎప్పటికప్పుడు అయిపోవచ్చిందని అనిపిస్తూనే అవకుండా సినిమా ఇంకా ముందుకు సా....గుతున్నట్లు కనిపిస్తుంది. అదే ఈ చిత్రంలోని పెద్ద బలహీనత. అందుకే, విశ్రాంతి దగ్గరే పతాక సన్నివేశం చూపించినంత భావన కలిగించే, ఈ గోవిందుడు - ప్రేక్షక జనులందరి వాడు కాలేకపోయాడు. ఇమేజ్ మార్పు ప్రయత్నంలో ఆశించినంత సఫలం కాలేకపోయాడు.

కొసమెరుపు -

సినిమా చివరలో వచ్చే ‘‘ రా.. ఎయ్ రా... ఏసేయ్ రా...’’ పాటలో ఎన్టీయార్ పదే పదే కింద కూర్చొని, పైకి లేచే ఓ స్టెప్పు వేయడానికి కష్టపడుతున్నట్లు తెరపై కనిపించేస్తుంది. ఇప్పటికే ఆర్య-2 లాంటి చిత్రాల్లో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వేసి మెప్పించిన అదే తరహా స్టెప్పును (యాక్సిడెంట్ అనంతరం కొంత ఇబ్బంది పడుతున్న)చిన్న ఎన్టీయార్ మీద ప్రయోగించాల్సిన పనేమిటి. ఆ స్టెప్పు వేయకపోయినా అతని నృత్య ప్రతిభకు వచ్చిన కొరతేమీ లేదు కదా. (అన్నట్లు కాళ్ళతో నేలను తుడిచినట్లుండే ఈ ఫ్లోర్ క్లీనింగ్ స్టెప్పు నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దేనా...)

‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?!

ఒక ఇమేజ్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పెద్ద హీరోను మరో ఇమేజ్ వైపు మరలించడం అంత సులభం కాదు. ఆ మార్పునకు అభిమాన ప్రేక్షక జనంతో అవుననిపించుకోవాలంటే చాలా శ్రమే పడాలి. మంచి కథ, ఆసక్తి కరమైన కథనం, ఆర్టిస్టుల అభినయ ప్రతిభ, ఆహ్లాదకరమైన సంగీతం - అన్నీ కావాలి. అవన్నీ ఆశించిన స్థాయిలో కుదరకపోతే కష్టమే. మాస్ హీరోగా ముద్ర పడిన చిన్న ఎన్టీయార్ ను, మంచి లవర్ బాయ్ గా చూపి, క్లాస్ కు దగ్గర చేయాలనే ప్రయత్నంగా ‘బృందావనం’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కానీ, ఆ ప్రయత్నం ఉడికీ ఉడకని అన్నంగా తయారవడమే విషాదం.

వేల కోట్ల రూపాయల కూడిన కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అధినేత సురేంద్ర (ముఖేశ్ ఋషి). అతనికి ఏకైక సంతానం కృష్ణ అలియాస్ క్రిష్ (ఎన్టీయార్ జూనియర్). ప్రాణాలకు తెగించి అయినా సరే, స్నేహితుడి ప్రేమను సఫలం చేసే రకం. ఏ సమస్యా లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్న హీరో, కాలేజీలో ఇందు (‘ఏ మాయ చేశావే’ చిత్ర ఫేమ్ సమంత)ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని తెచ్చి, ఇంట్లో అమ్మా నాన్నకు పరిచయం కూడా చేస్తాడు.

స్నేహితురాలి సమస్యకు పరిష్కారం కోసం హీరోను ఇందు ఆశ్రయిస్తుంది. ఇందు స్నేహితురాలు భూమి (కాజల్ అగర్వాల్). ఆమెకు విదేశాల్లో పై చదువులు చదవాలని ఉంటుంది. కానీ, ఆమె నాన్న (ప్రకాశ్ రాజ్) మాత్రం తన అక్క కొడుకు (అజయ్)కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేసేయాలని నిర్ణయిస్తాడు. ఆ పెళ్ళి తప్పించుకోవడం కోసం తాను ఇప్పటికే ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు భూమి తమ ఇంట్లో అబద్ధం చెబుతుంది. ఆ అబ్బాయిని తీసుకురమ్మంటాడు ఆమె తండ్రి. లేని బాయ్ ఫ్రెండ్ ను ఎక్కడ నుంచి తేవడమా అని భూమి ఇబ్బంది పడుతుంటుంది. భూమితో పాటు వాళ్ళ ఊరుకి వెళ్ళి, బాయ్ ఫ్రెండ్ గా నటించి, ఆ గండం నుంచి ఆమెను గట్టెక్కించాల్సిందిగా హీరోను ఒప్పిస్తుంది ఇందు.

భూమికి బాయ్ ఫ్రెండ్ గా నటిస్తూ, ఆమెతో పాటు ఊరెళ్ళిన హీరో ఆ పెద్ద కుటుంబంలో అందరి అభిమానాన్నీ సంపాదిస్తాడు. బద్ధశత్రువులుగా వేరు వేరు ఊళ్ళలో బతుకుతున్న భూమి తండ్రి (ప్రకాశ్ రాజ్)నీ, బాబాయ్ (శ్రీహరి)నీ కూడా కలుపుతాడు. భూమిని ఏకంగా హీరోకే ఇచ్చి పెళ్ళి చేసేయాలన్న దాకా కథ వెళుతుంది. అప్పటి దాకా బాయ్ ఫ్రెండ్ గా నటిస్తున్న హీరో ఒక్కసారి ఉలిక్కిపడతాడు. అదే సమయంలో పట్నం నుంచి ఇందు కూడా ఆ ఊరికి, ఆ ఇంటికి వస్తుంది. దాంతో కథ రసకందాయంలో పడుతుంది. గోవిందుడు ఏమవుతాడో... అంటూ ఫస్టాఫ్ ముగుస్తుంది.

పట్నం నుంచి వచ్చిన ఇందుకూ, ఆ ఇంటికీ సంబంధం ఏమిటి, ఈ దొంగ బాయ్ ఫ్రెండ్ నాటకం ఏమైంది, భూమిని పెళ్ళాడాలని తపిస్తున్న విలన్ బావ సంగతి ఏమైంది, ఇద్దరు భామల మధ్యన నలిగిన హీరో చివరకు ఏం చేశాడు - లాంటి ప్రశ్నలకు జవాబులన్నీ సెకండాఫ్ లో చూడవచ్చు.

(మిగతా భాగం మరి కాసేపట్లో...)

Friday, October 15, 2010

'బృందావనం' టికెట్ల కోసం ఇక్కట్లు


ఈ దసరా పండుగ సినిమాల్లో భాగంగా వచ్చిన ఆఖరి పెద్ద తెలుగు సినిమా బృందావనం. నిన్న అక్టోబర్ 14న రిలీజైంది. అయితే, మా ఊళ్ళో బృందావనం టికెట్లకు నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓ పక్క రోబో, మరో పక్క ఖలేజా వచ్చి పక్షం రోజులైనా పూర్తికాకపోవడంతో, మా ఊళ్ళో ఉన్న ఒకటి రెండు రెగ్యులర్ తెలుగు సినిమా హాళ్ళలో బృందావనం ఎక్కడ, ఎన్ని ఆటలు వేస్తున్నారన్నది ఆఖరి దాకా ఖరారు కాలేదు. అది ఓ పెద్ద తలకాయనొప్పిగా మారింది.

దాంతో, సినిమా రిలీజు రోజు ఉదయానికి కూడా సెకండ్ షో మాకు దగ్గరలో ఏ హాల్లో అయినా ఉందా, ఉంటే టికెట్లున్నాయా అన్నది తేలలేదు. అప్పటికీ మా సినీ మిత్ర బృందంలో ఒకరు అన్ని రకాలుగా ప్రయత్నించి చూశారు. ఇంటర్నెట్ బుకింగ్ కు సైతం సై అన్నా, సినిమా ఎక్కడ ఆడుతోందన్నది ఖరారవలేదు. దాంతో ఇబ్బంది పట్టుకుంది.

క్రమం తప్పకుండా తెలుగు సినిమాలు మాత్రమే ప్రదర్శించే హాలుకు మా మిత్రుడు రెండు, మూడు సార్లు బండి వేసుకు తిరిగాడు. కానీ, ఆఖరికి రిలీజ్ రోజు మధ్యాహ్నానికి ఆ హాలు వాడు చేతులెత్తేశాడు. రాత్రి 10 గంటలకు సెకండ్ షో గా బృందావనం వేద్దామని అనుకున్నప్పటికీ, రోజు మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క ఆట కూడా పోతుందని ఖలేజా వాళ్ళు పట్టుబట్టారట. దాంతో, ఖలేజా స్థానంలో బృందావనం సెకండ్ షో వేయడం కుదరలేదని హాలు మేనేజర్ చెప్పారు.

కానీ, ఎలాగైనా సినిమా చూడాలని ఓ కోరిక. చివరకు, మాకు చాలా దూరంగా ఉండే ఓ థియేటర్ లో సెకండ్ షో వేస్తున్నట్లు ఆఖరి నిమిషంలో కన్ఫర్మ్ చేశారు. దానికి మా మిత్రుడు కష్టపడి, ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేశాడు. విచిత్రం ఏమిటంటే ఆ సాదాసీదా థియేటర్లో మల్టీప్లెక్సు హాళ్ళకు దీటుగా టికెట్ రేటు వసూలు చేయడం. నిజానికి, ఆ థియేటర్లో నేల (రూ. 10), కుర్చీ (రూ. 50), బాల్కనీ (రూ. 70) ఉన్నాయి. కానీ, తెలుగు సినిమాలకు ఉండే వేలం వెర్రి దృష్ట్యా అక్కడ బాల్కనీ టికెట్ ను రూ. 100కు అధికారికంగా అమ్మేస్తున్నారు. ఇంటర్నెట్ లో బుకింగ్ చేసుకుంటే, ప్రతి టికెట్ కీ అదనంగా మరో 10 రూపాయలు బొక్క. ఇలా థియేటర్ యజమానులు ప్రేక్షకుల ఆసక్తిని ఆసరాగా చేసుకొని, నిలువు దోపిడీ చేయడం అక్షరాలా అన్యాయం. దీని గురించి మాట్లాడేవాళ్ళు కూడా లేరు. (ఈ పిట్టకథ గురించి మరోసారి, మరో సందర్భంలో...). మొత్తానికి, అలా ఒక్కో టికెట్ రూ. 110 వంతున ఖర్చు పెట్టుకొని, మా మిత్ర బృందమంతా ఆ దూరపు థియేటర్ కి 'బృందావనం' కోసం వెళ్ళాం. చూశాం. సినిమా ఎలా ఉందంటారా. చెబుతా. కాస్త ఆగండి.

( ‘బృందావనం’ సమీక్ష.....తరువాతి టపాలో...)

Wednesday, October 13, 2010

'మేస్త్రి' ని ఏమైనా అనచ్చు కానీ, 'మగధీర' మీద మాట్లాడకూడదా!?

సినీ రంగంలో, అభిమానుల్లో ఓ వైపరీత్యం ఉంది. ఏ చిన్న విమర్శ వచ్చినా ఎవరూ తట్టుకోరు. కువిమర్శ చేస్తే సరే కానీ, సద్విమర్శ చేసినా అది పరిస్థితి. ‘నంది’లో మోసం జరిగిందా..? ‘మగధీర’లో నటన ఉత్తమమైనదేనా..? అని రాసిన పోస్టు మీద కొందరు నా మీద కోపం చూపారు. దాసరి చేసిన (చేశారనే మనవాళ్ళ అభిప్రాయం) పైరవీ గురించే మాట్లాడాలి కానీ, ‘మగధీర’ గురించి కూడా మాట్లాడడమేమిటని కొందరు అన్నారు. ఇంకొందరు వ్యాఖ్యలు రాశారు. వారికి సుదీర్ఘ వివరణగానే ఈ తాజా టపా.

నా మటుకు నేను మునుపటి టపా రాయడానికి ఓ కారణం ఉంది. ఆ ఉత్తమ నటుడి అవార్డు దాసరికి ఇవ్వడం సరైనదా, కాదా అన్నది ఒక అంశం. దానికి తోడు 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన సైతం అందుకు అర్హంగా ఉన్నదా, లేదా అన్నది మరో అంశం. ఈ రెండు అంశాలూ తాజాగా జనం ఎదుట చర్చకు నిలవాల్సినవే. అలా కాకుండా వాటిలో ఎంతసేపూ ఒకదాన్నే పట్టుకొని మాట్లాడడం సరైనది కాదు.

అందరూ నాణానికి ఒకవైపే చూస్తూ, 'మేస్త్రీ' సినిమా గురించే ప్రస్తావిస్తుండడంతో, నాణానికి రెండో వైపు దృష్టి సారించేలా చేయాలన్నదే ఈ టపా ఉద్దేశం. నన్నడిగితే, ఇలాంటి అవార్డుల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉంటుందన్నది జనానికి తెలియనిది కాదు. అంతమాత్రాన ఈ అంశాలను చర్చకు పెట్టడమే నేరం, ఇది చిరంజీవినీ, ఆయన కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకోవడమే అనుకుంటే శుద్ధ పొరపాటు.

ఇక, కొందరేమో, అసలు సంగతి వదిలేసి, చిరు ఒళ్ళు తగ్గడమనే అంశంపైన దృష్టి పెట్టారు. నా టపాలో లేని అర్థాలు వెతికారు. లైపో సక్షన్ అంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించు (తొలగించు) కోవడమనే నాకు తెలిసిన అర్థం. కొవ్వు కరిగించుకోవడమని రాస్తే, రాతలో లేని అహంకారమనే అర్థం తీసుకుంటే, అది చదువుతున్న వారి ఆలోచనే తప్ప, రాతలో ఉన్నది కాదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం ఎవరికీ లేదు. నాకైతే ఏ కోశానా లేదు.

దాసరి సీనియర్ నటుడు కాబట్టి, ఎలాగైనా బాగా నటించేస్తాడని మీ ఉద్దేశ్యమా అని ఇంకొందరు అన్నారు. అదే నా ఉద్దేశమైతే, మేస్త్రీ చిత్రాన్నీ, నటననూ నేను భుజానికెత్తుకోవాలిగా. ఆ పని చేయలేదే. అలాగే, నేనిక్కడ దాసరి, రామ్ చరణ్ తేజ్ ల ఇద్దరి నటననూ పోల్చడం లేదు. ఆడలేదు కాబట్టి మేస్ర్తీ చిత్రంలో నటనకు అవార్డు ఏమిటని వస్తున్న విమర్శలో ఎంత న్యాయముందో, జనం చూశారు కాబట్టి మగధీరలో నటనకు అవార్డు ఇవ్వాలన్న వాదనలోనూ అంతే న్యాయముంది. ఒకటి ఎడమ చేయి, రెండోది పుర్ర చేయి. అంతే తేడా. బ్లాగర్ బద్రి గారి కామెంట్ మాటల్లో చెప్పాలంటే... ‘‘ ‘నంది’లో మోసం జరిగిందా ? అవును. ‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ? కాదు...’’

Tuesday, October 12, 2010

‘నంది’లో మోసం జరిగిందా ? ‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ?

మన ఆంధ్ర్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగు సినిమాలకు ఏటేటా ఇచ్చే నంది అవార్డులు వివాదాస్పదం కావడం, విమర్శలు రావడం కొత్తేమీ కాదు. 2009వ సంవత్సరానికి గాను ఈ మధ్యే ప్రకటించిన అవార్డులు కూడా అందుకు మినహాయింపు కాలేదు. మిగిలినవాటి మాటెలా ఉన్నా ఉత్తమ నటుడు అవార్డుకు దాసరి నారాయణరావు ('మేస్త్రీ' చిత్రం)ను ఎంపిక చేయడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

'మగధీర' చిత్రం ఏకంగా 9 అవార్డులు గెలుచున్నా అందులోని హీరో రామ్ చరణ్ తేజ్ ను ఉత్తమ నటుడిగా తీర్మానించకుండా, ప్రత్యేక జ్యూరీ అవార్డుతో సరిపెట్టారేమిటని ఆ వర్గంలోని వారు నిలదీస్తున్నారు. దీని వెనుక దాసరి కుట్ర ఉందనేది వారి వాదన. దానిపై ఇప్పటికే మాటకు మాట సమాచార సాధనాల్లో వస్తూనే ఉంది.

ఇది ఇలా ఉండగా, గడచిన పక్షం రోజులుగా విదేశాల్లో ఉన్న పి.ఆర్.పి. అధ్యక్షుడు చిరంజీవి సొంతగడ్డకు తిరిగొచ్చారు. ఆయన వచ్చీరాగానే, సహజంగానే విలేఖరులు ఈ నంది అవార్డుల ప్రశ్న అడిగారు. దానికి చిరంజీవి మాత్రం చాలా కూల్ గా, జనరంజకత్వం కోసం 'మగధీర' చిత్రం తీశామనీ, ఆ చిత్రం తెలుగులో బాక్సాఫీసు రికార్డులన్నిటినీ బద్దలు కొట్టిందనీ పేర్కొన్నారు. నంది అవార్డు కన్నా ఈ ప్రజాదరణే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. త్వరలో నటించనున్న 150 వ చిత్రానికి తగ్గట్లుగా ఒళ్ళు తగ్గించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళిన చిరంజీవి మొత్తానికి లౌక్యంగా జవాబిచ్చి తప్పించుకున్నారు.

అవార్డు ఎంపిక సరైనదే అని కానీ, కాదని కానీ నేను అదాటున ఓ నిర్ణయానికి వచ్చేయ దలుచుకోలేదు. తెర వెనుక ఏం జరిగిందన్నది తెలిస్తే కానీ, ఓ నిర్ణయానికి రాలేం. అయితే, ఒకటి మాత్రం నిజం. నా మటుకు నన్ను అడిగితే, 'మగధీర' జనాదరణ పొందిన చిత్రం. సాంకేతికంగా చక్కగా రూపొందించిన చిత్రం. అయితే, అన్ని రకాల సాంకేతిక విభాగాలకూ పేరు వచ్చి, సినిమాకు అవార్డులొచ్చినంత మాత్రాన అందులో నటించిన వ్యక్తి సైతం ఉత్తమ నటుడు కావాలని నియమం ఎక్కడైనా ఉందా. లేదు కదా.

పైగా, 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన తొలి చిత్రం 'చిరుత' కన్నా మెరుగ్గా ఉందే తప్ప, ఉత్తమ నటుడికి సరిపడా మెరుగైందా అంటే ఆలోచించాల్సిందే. వివిధ విభాగాల కృషితో సినిమా ఉత్తమంగా నిలబడడం వేరు. ఉత్తమ నటన వేరు. ఆ రెంటినీ కలిపి చూస్తేనే కన్ ఫ్యూజన్. ఆ సంగతి మనవాళ్ళు గ్రహించాలి. లేదంటే, ఇలాంటి విమర్శలే వస్తాయి. ఇలా అన్నంత మాత్రాన నేనేదో దాసరి "మేస్త్రీ" ఎంపికను ఏకపక్షంగా సమర్థిస్తున్నానని పొరపాటు పడకండి. ఏమైనా, ఇప్పటికి మాత్రం - కొవ్వు కరిగించుకొని, ఒళ్ళు తగ్గి వచ్చిన చిరు తన 150వ చిత్రంలో ఉత్తమ నటన చూపుతారేమో ఎదురుచూడాలి. అభిమానులమంతా దాని కోసమే నిరీక్షిస్తున్నాం.

Saturday, October 9, 2010

ఖలేజా: సరదా డైలాగుల జోరు - సవ్యంగా సాగని కథనమే బేజారు!


(‘‘ఖలేజా: కథాంశం మంచిదే... కథనమే.... ’’- పార్ట్ 2)

నిజానికి, మహేశ్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లోని ‘ఖలేజా’ చిత్ర కథకు తీసుకున్న ‘దైవం మానుష రూపేణ’ అన్న అంశం మంచిదే. సాటి మనిషిని కాపాడాలంటే, దేవుడు కానక్కర లేదు. మంచి మనసున్న మనిషిలోనే దేవుడుంటాడు. తన కోసం కాక, సాటి వారి బాగు కోసం ఆ మనసుతో ఆలోచిస్తే, అనుకున్నదల్లా అవుతుంది. అప్పుడలా ఆ మనిషే దేవుడన్నది ఈ సినిమాలో చెప్పదలుచుకున్న సారాంశంగా కనిపిస్తుంది.

బాగోగులు ఏమిటంటే...

ఈ విషయాన్నే వీలైనంత వినోదాత్మకంగా చెప్పాలని దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించారు (ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - అన్నీ ఆయనవే). అంతవరకు బాగానే ఉంది. అందుకే, ఈ సినిమాలో హీరో పాత్రచిత్రణ, ప్రవర్తన, హీరోయిన్ తో ఎదురయ్యే సంఘటనలు, చుట్టుపక్కలి పాత్రలు - అన్నీ వినోదమే కేంద్రంగా నడుస్తుంటాయి. అది వినోదానికి బాగా ఉపకరించినా, విషయానికి వచ్చే సరికి - చివర కాసేపు తప్ప, మిగిలిన చోట్ల కూడా సీరియస్ విషయం కూడా సరదా బాటలో పడి గాడి తప్పినట్లనిపిస్తుంది.

అలాగే, మనిషిలోని దేవుడి తత్త్వాన్ని ప్రభావశీలంగా చెప్పాలని రెండు, మూడు సన్నివేశాల్లో ప్రయత్నించారు (ఉదాహరణకు, హీరో తన కోసం 10 రూపాయలు అడిగితే ఎవరూ ఇవ్వరు కానీ, మరొకరి కోసం 10 అడిగితే 100 రూపాయలు రావడం లాంటివి). కానీ, అవి విజువల్ గా ఆశించిన ఇంప్యాక్ట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ వాదనతో ప్రేక్షకులు కన్విన్స్ కావడం కొద్దిగా కష్టమే.

పాత్రలు - పాత్రధారుల పనితనం ఎలా ఉందంటే...

అందంలో, అభినయంలో ఎప్పుడూ మార్కులు పడే మహేశ్ ఎప్పటిలానే చక్కగా నటించారు. కష్టపడి ఫైట్లు చేశారు. ఎప్పుడూ హుందాగా, తక్కువ మాటలు, ఎక్కువ భావప్రకటన ధోరణిలో వెళ్ళే మహేశ్ ఈ సినిమాలో ఎన్నడూ లేనంత ఎక్కువగా మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో మహేశ్ ఇంతగా డైలాగులు చెప్పిన సినిమా బహుశా ఇదే కావచ్చు.

దర్శక - రచయిత సృష్టించిన ఈ తరహా పాత్ర కోసం త్రివిక్రమ్ సారథ్యంలో మహేశ్ తన శారీరక భాషను సమర్థంగా మార్చుకున్నారు. పూర్తి వినోదభరితమైన పాత్రచిత్రణతో మహేశ్ ను తెరపై ఇలా చూపడం ఇదే మొదటిసారి. ఈ రకం నటన అటు మహేశ్ కూ, ఇటు ఆయన అభిమానులకూ కొత్త అనుభవమే. కానీ, ఆ పాత్రే అటు హాస్యం, ఇటు రౌద్రం, మధ్యలో ప్రేమ - అన్నీ చూపెడుతూ వస్తుంది. దాంతో, కథను నడిపే భారమంతా ఆ పాత్ర మీదే పడింది.

ఐరన్ లెగ్ అమ్మాయి పాత్ర హీరోయిన్ అనూష్కది. ఫస్టాఫ్ కామెడీకీ, సినిమాలో పాటలకీ పనికొచ్చే పాత్ర. అంత వరకూ ఆమె ఓ.కె. ఉపాసనతో జోస్యం చెప్పగల ఊళ్ళోని పెద్దాయన పాత్రలో రావు రమేశ్ నటన, వాచికం బాగున్నాయి. ఇదే ఛాయలతో ఉండే పాత్రను ఆయన గతంలో మగధీర (2009)లో బాగా పండించిన సంగతి తెలిసిందే. సిద్ధయ్య పాత్రలో షఫీ బాగా చేశారు. కానీ, మాటి మాటికీ అతనితో హర హర మహాదేవ్ అని పలికించడం కొన్ని చోట్ల అవసరాన్ని మించిపోయిందేమో అనిపిస్తుంది.

జెమినీ టీవీలో కార్యక్రమాల డైరెక్టర్ బాబ్జీగా సునీల్, చెట్లు - కాయల గురించి పరిశోధన చేసే టామ్ క్రూజ్ గా అలీ, లాయర్ మిరియం గా బ్రహ్మానందం సినిమాలో వినోదం పంచుతారు. అయితే, ‘మర్యాద రామన్న’ బిజీలోనో ఏమో, సినిమా సగమైనా కాక ముందే సునీల్ పాత్రను ముగించాల్సి వచ్చినట్లుంది. లాయర్ మిరియంగా బ్రహ్మానందాన్ని కూడా మూడు, నాలుగు సీన్లకే పరిమితం చేశారు. సినిమా మూడొంతులు అయిన దగ్గర నుంచీ క్లైమాక్స్ ముందు వరకు కనిపించేది ఒక్క అలీయే. కానీ, అతనికీ, హీరోకూ అంత సన్నిహిత సంబంధం ఎందుకో, హీరోతో కలసి అతనెందుకు చివరి దాకా తిరుగుతాడో తెలియదు. కమెడియన్ ఎం.ఎస్. నారాయణ ఒకే సీన్ లో మెరిసి మాయమవడాన్ని బట్టి చూస్తే, చిత్రీకరణ ముగిశాక ఎడిటింగ్ కత్తెరకు బాగానే పని పడ్డట్లు అర్థమవుతుంది.

విలన్ ప్రకాశ్ రాజ్ కూడా క్లైమాక్స్ లో గొంతు చించుకు అరవడం, భయం నటించడం తప్ప చేసిందేమీ లేదు. పైగా, రూపురేఖల్లో చాలా తేడా వచ్చిన ప్రకాశ్ రాజ్ మునుపటి ఆకర్షణను కోల్పోయారు. ఆయనను చూడడం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు తదితరుల పాత్రలన్నీ ప్యాడింగ్ కే తప్ప, పెద్దగా చేసేదేమీ లేదు.

సినిమాను నిలబెట్టే డైలాగులు ఏవంటే...

ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి కూడా త్రివిక్రమ్ శైలి సంభాషణలే. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా పేలాయి. అయితే, మరికొన్ని చోట్ల అర్థమయ్యీ కాకుండా వేగంగా చెవులు దాటి వెళ్ళిపోతాయి. ‘మీ పేరు’ అని హీరోయిన్ అడిగితే - ‘జెమినీ టి.వి’ అనీ, ‘ఏం చేస్తుంటారు’ అంటే - ‘బాబ్జీ’ అనీ సునీల్ తో డైలాగ్స్ చెప్పించడం మీడియా మనుషుల ఖంగాళీతనానికి త్రివిక్రమ్ మార్కు చురక. ‘‘8,950కి రౌండ్ ఫిగర్ 9 వేలు కదా’’ అని హీరోయిన్ అంటే, ‘‘10000లో రౌండ్లు ఎక్కువ కదండీ’’ అని హీరో చెప్పడం లాంటివి బాగా నవ్విస్తాయి. ‘‘వినపడక అడుగుతున్నావా, లేక అర్థం కాక అడుగుతున్నావా’’ అని హీరో అంటే, ‘‘కాదు. తెలియక అడుగుతున్నాను సార్’’ అని బ్రహ్మానందం అనడం ఫక్కున నవ్వు తెప్పిస్తుంది.

గ్రామాన్ని కాపాడే దేవుడు ఎలా ఉంటాడో పెద్దాయన వర్ణించే ఘట్టంలో ‘‘...నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధా. గాలి హోరుమంటుంది...’’, ‘‘...ఎవడు చూస్తే భయం చస్తుందో, ఎవణ్ణి చూస్తే ధైర్యం వస్తుందో...’’ లాంటి డైలాగులు సన్నివేశంలో గాఢతను పెంచాయి. ‘‘నీ నవ్వు వరం. నీ కోపం శాపం. నీ మాట శాసనం’’ అంటూ దేవుడిగా కొలిచే హీరో గురించి సిద్ధ చెప్పే మాటలు తూటాల్లా దూసుకుపోతాయి. ‘‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. అద్భుతం జరిగిపోయాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’ (హీరోతో రావు రమేశ్) లాంటి కొన్ని భావస్ఫోరకమైన సంభాషణలూ ఉన్నాయి.

అలాగే, ఎప్పుడూ మరింత క్లాస్ టచ్ తో నడిచే త్రివిక్రమ్ సంభాషణలు ఈ సినిమాలో కొన్నిచోట్ల ఎందుకనో కిందకు దిగి, మాస్ రంగును పులుముకున్నాయి. హీరో పోషించినది ట్యాక్సీ డ్రైవర్ పాత్ర కావడం అందుకు కారణమని సరిపెట్టుకోవాలేమో. మొత్తం మీద డైలాగ్ కామెడీ మీద ఎక్కువగానే ఆధారపడ్డారు. జల్సా చిత్రంలో లాగానే, ఇందులో కూడా హీరో, కమెడియన్ల మద్యపాన హాస్య సన్నివేశాన్ని త్రివిక్రమ్ మళ్ళీ పెట్టారు.

సాంకేతిక విభాగాల శ్రమ ఏమిటంటే...

పాటల సంగతికొస్తే - తెరపై కన్నా విన్నప్పుడే బాగున్నాయి. పైగా, ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ కథాగమనానికి అడ్డంగా వచ్చి, విసిగిస్తాయి. ‘‘ఆరు పాటలు సిద్ధం చేసుకున్నారు కదా అని, ఎక్కడబడితే అక్కడ అతికించేయడమేనా’’ అని ఓ సగటు ప్రేక్షకుడు వాపోయాడు. విన్నప్పుడు బాగున్న ‘పిలిచే పెదవుల పైన...’ పాట కూడా సినిమాలో చరణాలకొచ్చేసరికి మెరుపు కోల్పోయింది. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహించిన ‘ఓం నమో శివ రుద్రాయ...’ పాటలోని సాహిత్య గాంభీర్యం కూడా దృశ్యాల్లో అడపా దడపా వస్తూ, పోవడమే తప్ప, నిలకడగా కనిపించదు. పాటల నృత్యపరికల్పన (రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్ వగైరా) ఫరవా లేదే తప్ప, చిరస్మరణీయం కాలేకపోయింది.

అయితే, చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ పరంగా మాత్రం సినిమాకు వంక పెట్టలేం. చూస్తున్నంత సేపు తెర నిండుగా, కనువిందుగా దృశ్యాలున్నాయి. కెమేరా (యశ్ భట్ తో పాటు 'అతడు' చిత్ర ఫేమ్ కె.వి. గుహన్, 'హమ్ తుమ్' చిత్ర ఫేమ్ సునీల్ పటేల్ కూడా పనిచేశారు), ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), ఫైట్లు (పీటర్ హెయిన్స్, రామ్ - లక్ష్మణ్), సౌండ్ మిక్సింగ్ (సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదన రెడ్డి)అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ లోని దృశ్యాలు బాగా వచ్చాయి. గ్రాఫిక్స్ (పిక్స్ లాయిడ్ సంస్థ)కూడా ఎక్కువగానే వాడారు. అయితే, హీరో పరిచయ ఘట్టంలో మహేశ్ చేతిలో కనిపించే పాము గ్రాఫిక్స్ మాత్రం బొమ్మ పాము కన్నా ఘోరంగా ఉంది.

చిత్ర ప్రారంభం, ఇంటర్వెల్ ఘట్టం లాంటివి బాగున్నాయి. కొన్ని చోట్ల దర్శకుడి ముద్రా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం - తీసుకున్న ఇతివృత్తాన్ని బలంగా చెప్పేలా కథనాన్ని నడిపించ లేదని అనిపిస్తుంది. కాలక్షేపానికి సినిమా ఫరవాలేదని అనిపించినా, కథలోని ఆత్మ మాత్రం కనిపించీ, కనపించకుండా తచ్చట్లాడుతుంటుంది. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏతావతా, త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే - ‘ఖలేజా’ యావరేజే.

కొసమెరుపు - అన్నట్లు ఈ సినిమా పేరు వట్టి ‘ఖలేజా’ కాదు. ‘మహేశ్ ఖలేజా’. అదేమిటంటారా. ఈ 16 రీళ్ళ 2.45 – 2.50 గంటల సినిమాస్కోప్ చిత్రం ఆ పేరు మీదే సెన్సారైంది. బహుశా, ‘ఖలేజా’ టైటిల్ ఎవరిదన్న దాని మీద వివాదం జరుగుతుండడంతో, ఎందుకైనా మంచిది లెమ్మని ముందుచూపుతో ‘మహేశ్ ఖలేజా’ అని పేరు నమోదు చేసి, ఆ పేరుతోనే సెన్సార్ చేయించినట్లున్నారు. ఫలితంగా, రికార్డుల సృష్టి ఆశ లేని ఈ సినిమా పేరు రికార్డు పుస్తకాల్లో మాత్రం - ‘మహేశ్ ఖలేజా’.

Friday, October 8, 2010

‘ఖలేజా’: కథాంశం మంచిదే... కథనమే....


ఏ సినిమా ఎవరికి ఎందుకు నచ్చుతుందో, ఎందుకు నచ్చదో చెప్పడం అంత సులభం కాదు. అయితే, సమూహ వీక్షక అనుభవమైన సినిమా - చూసేవారిలో ఉమ్మడిగా ఓ అనుభూతిని కలిగించాలి. ఆ అనుభూతి ఎంత బలమైనదైతే, ఎంత సామూహికమైనదైతే జనం అభిప్రాయం కూడా అంత బలంగా, అంత ఉమ్మడిగా ఉంటుంది. అలా కానప్పుడు ఎవరి అనుభూతి వారిది. ఎవరి అభిప్రాయం వారిది. ఓ సినిమా గురించి భిన్నాభిప్రాయాలు వచ్చేది అలాంటి సందర్భంలోనే. ‘ఖలేజా’ అందుకు తాజా ఉదాహరణ.

కథ ఏమిటంటే...

దాదాపు రెండేళ్ళ పైగా సెట్స్ పై ఉన్న ‘ఖలేజా’లో అంశం చిన్నది. దాని వివరణ 16 రీళ్ళ పెద్దది. ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే ఓ గ్రామంలో జనం కారణం ఏమీ లేకుండానే పిట్టలు రాలినట్లు రాలిపోతుంటారు. ఆ నెలలో 20 మంది మట్టి కలిసిపోతారు. ఆ గ్రామాన్ని కాపాడాలంటే - 28 ఏళ్ళ క్రితం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన ఫలానా లాంటి యువకుడి వల్ల అవుతుందని ఉపాసకుడైన ఆ ఊరి పెద్దాయన (రావు రమేశ్) చెబుతాడు. మండలం (48) రోజుల్లో ఆ యువకుణ్ణి తెమ్మని సిద్ధుణ్ణి పంపిస్తాడు.

హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవర్ అయిన జి. సీతారామరాజు అలియాస్ రాజు (మహేశ్) ఓ పని మీద రాజస్థాన్ వస్తాడు. కనుచూపు మేరలో మనిషి కనిపించక, ఊరు వెతుక్కుంటూ అక్కడికే కథానాయిక సుభాషిణి (అనూష్క) వస్తుంది. హీరో ఆ ఊరు రావడానికీ, ఆమె కూడా అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరులో తప్పిపోవడానికీ చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ లింకులుంటాయి.

ఆమెను కూడా తీసుకొని తెలుగు నేలకు తిరిగి వద్దామని హీరో యత్నిస్తున్న సమయంలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడతాడు. అదే క్రమంలో తమ గ్రామాన్ని కాపాడే దేవుడు ఆ హీరోయే అని పంచభూతాల సంకేతాలతో సిద్ధుడు గ్రహిస్తాడు. అక్కడికి సరిగ్గా మండలం పూర్తవుతుంది. ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఆ హీరోనూ, హీరోయిన్ నూ తన వెంట గ్రామానికి తీసుకెళ్ళి, కాపాడతాడు సిద్ధుడు. తేరుకున్న హీరోను ఊరి జనమంతా దేవుడు అంటూ ఉంటారు. తాను దేవుణ్ణి కాదు మొర్రో అంటూ ఉంటాడు హీరో. అలా కథ ముందుకు వెళ్ళి, ఆ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, ఆ గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేయడం వల్ల ఎవరికి వచ్చే లాభం ఏమిటి, మధ్యలో ఈ రాజస్థాన్ పిట్టకథేమిటి - లాంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఆఖరికి చెడు మీద మంచి విజయంతో కథ ముగుస్తుంది.

కథాకథనం ఎలా సాగిందంటే...

ప్రథమార్ధంలో జరిగే కథ కొంచెమే అయినా, మున్ముందు కథలో వచ్చే ఘట్టాలకు లీడ్స్ కనిపిస్తాయి. సరదా సంభాషణలు, సన్నివేశాల సమాహారంగా సినిమా నడుస్తుంది. అసలు కథంతా ద్వితీయార్ధంలోనే. అయితే, అందులో అసలు పాయింట్ ఆఖరికి కానీ రాదు. జనం చనిపోతుండడానికి కారణం, కారకులు, దానికి హీరో పరిష్కార ప్రయత్నం సినిమా చివరి మూడు నాలుగు రీళ్ళలో కానీ చెప్పరు.

దాంతో, చివరి వరకు అసలు కథేమిటన్నదానిలో సస్పెన్స్ కన్నా అర్థం కావడం లేదన్న కన్ ఫ్యూజనే ప్రేక్షకులకు ఎక్కువుంటుంది. దేవుడనే జనం, దేవుణ్ణి కాదనే హీరోల మధ్య చర్చతోనే చాలా సేపు గడిచిపోయినట్లనిపిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి తానుగా ముందుకొచ్చే నాయక పాత్రల సినీ కథలకు అలవాటు పడ్డ జనసామాన్యానికి ఇది విచిత్రమనిపిస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన హీరోయే దానికి దూరంగా పారిపోవడం ఏమిటని ఓ చిన్న అసంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా టైటిల్స్ కు ముందు వచ్చే ఘట్టం మిస్ అయితే, కథానేపథ్యం అర్థం కావడం మరింత కష్టమవుతుంది.

సమస్యే తప్ప, సమస్యకు కారకులైన జి.కే. వాళ్ళ (ప్రకాశ్ రాజ్ వగైరా)తో హీరో ముఖాముఖి పోరాటం ఒకే ఒక్కసారి, అదీ క్లైమాక్స్ లో కానీ రాదు. దాంతో, మంచి, చెడుల మధ్య ఘర్షణలో మంచి ఎలా గెలిచిందనే ఉత్కంఠభరిత ప్రయాణం చప్పగా ముగిసిపోయినట్లు అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు.

(మిగతా భాగం ఇంకాసేపట్లో...)

‘ఖలేజా’లో ఆనవాయితీ తప్పింది

సినిమా విడుదలైనా, ఆ సినిమా ప్రత్యక్షంగా చూసేదాకా కథ, కథనాల గురించి తెలుసుకోకపోవడం నా అలవాటు. కథ, అవతలి వాళ్ళ అభిప్రాయం తెలిసిపోతే, ముందుగానే ఓ మూస అభిప్రాయంతో వెళ్ళి సినిమాను చూసే ప్రమాదం ఉంది. దానివల్ల మన సొంత అభిప్రాయాలు, ఆలోచనలపై వాటి ప్రభావం పడే ఇబ్బంది ఉంది. ముఖ్యంగా ఆ సినిమా గురించి మనం ఏదైనా రాయాల్సి వచ్చినప్పుడు అదీ మరీ ఇబ్బంది. తప్పో, ఒప్పో - అది నా సొంత అభిప్రాయం. అయితే, అనుకోకుండా ఈసారి ఆ ఆనవాయితీ తప్పింది.

‘రోబో’ వాణిజ్య హంగామా నడుమ వస్తున్న చిత్రంగా ‘ఖలేజా’ మీద అందరి లాగే ఆఫీసులోనూ ఆసక్తి హెచ్చింది. ‘ఖలేజా’ విడుదలైన రోజున ఆఫీసు పనిలో ఉండగా, అందులో భాగంగా ఓ ఉద్యోగి వచ్చి, సినిమా గురించి నెగటివ్ వార్తను నలుగురితో చెప్పాడు. అసలు సంగతి కనుక్కోమన్న ఆఫీసు మిత్రుల పోరుతో, మరో మిత్రుడికి తప్పనిసరై ఫోన్ చేశా. కథ కాకపోయినా, సినిమా రిజల్ట్ పై అతని అభిప్రాయం అడిగి, విన్నా.

ఏ సినిమా వచ్చినా, ఆ యా కులాలు, ప్రాంతాలను బట్టి ఇలాంటి దుష్ప్రచారాలు జరగడం తెలుగు పరిశ్రమలో చాలా కాలంగా ఉన్న జాడ్యం. కళను కులంతో ముడిపెట్టి మాట్లాడే, చూసే అలాంటి జనాభా మీద జాలి పడడం తప్ప, చేయగలిగిందేమీ లేదు.

‘ఖలేజా’ మీద ప్రచారం కూడా అలాంటిదేనా? లేక నిజంగానే సినిమా తేడాగా ఉందా? ఏమో! రాత్రి సినిమాకు వెళ్ళినప్పుడు చూడాలి అనుకున్నా. అలాగే, ‘దైవం మానుష రూపేణ’ అనే ఇతివృత్తం చుట్టూ కథ తిరుగుతుందని అప్పటికే తెలియడం వల్ల అనుకోకుండానే ఓ ముందస్తు అభిప్రాయంతో సినిమాకు వెళ్ళా.

('ఖలేజా' పై రివ్యూ మరికాసేపట్లో...)

Thursday, October 7, 2010

చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది! త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్ ఖలేజా!!



గడచిన పదిహేను, ఇరవై రోజుల్లో టీవీలో రెండు హిట్ సినిమాలు కొద్దిగా, కొద్దిగా చూశా. యాదృచ్ఛికంగా రెండూ దర్శక - రచయిత ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ రూపకల్పనలే. ఒకటి - మహేశ్ బాబు నటించిన ‘అతడు’. రెండోది - పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’. సెలవు రోజున మధ్యాహ్నం పూటో, రాత్రో ఇంటిలోనే ఉండి భోజనం చేస్తున్నప్పుడు టీవీ చానళ్ళు తిప్పడం నాకు అలవాటు. ఇంటిల్లపాదీ కూర్చొని, అన్నం తింటూ, ఆ కాసేపు టీవీ చానల్ ధర్మమా అని ఆ సినిమాలు చూశాము.

నిజానికి, ఆ రెండు సినిమాలూ నేను గతంలో థియేటర్లో చూసినవే, పత్రికల్లో రాసినవే. టీవీలో కూడా అడపా దడపా అదాటున కాసేపు కనిపించినవే. అయినా, సన్నివేశాల్లోని గాఢత నన్ను మరోసారి చూసేలా చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికి ఏ పదో సారో అయినా సరే, గుడ్లప్పగించి చూస్తూ, సినిమాలోని సెంటిమెంట్, హాస్యాలను ఆస్వాదించడం గమనించాను.

ఉన్నమాట చెప్పాలంటే, ‘అతడు’ కానీ, ‘జల్సా’ కానీ మొదటిసారి చూస్తున్నప్పుడు ఫరవాలేదు బాగానే ఉన్నాయని అనిపించాయే తప్ప, ‘ఆహా, ఓహో’ అనో, పదే పదే చూసి ఆనందించగలమనో అనిపించలేదు. కానీ, తీరా ఇప్పుడు అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుండేసరికి, నేను గతుక్కుమన్నాను. నేనే కాదు, నా లాగానే మా ఇంట్లోనూ, బయట చాలా మంది ఆ సినిమాలనూ, అందులోని దృశ్యాలనూ పదే పదే చూసి ఆనందించడం నన్ను ఆలోచనలోకి నెట్టింది.

ఒక సృజనాత్మక కృషి పదే పదే ఆస్వాదయోగ్యం అవుతుండడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ కృషిని ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి రూపకర్త పాటించిన పద్ధతి ఏమిటి? దీనికీ ఏదైనా ఫార్ములా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు నాకొచ్చిన సమాధానమేమిటంటే - ఒక సన్నివేశాన్ని ఎన్నో రకాలుగా తెరపై చూపవచ్చు. చూసిన తక్షణమే ప్రేక్షకుడి నరనరాల్లోకీ అది ఎక్కేసేలా, ఒక విధమైన కిక్ వచ్చేలా చిత్రీకరించడం ఒక పద్ధతి. దీని వల్ల ప్రేక్షకుల్ని, ప్రధానంగా మాస్ ను ఆకర్షించవచ్చు. చూడగానే అబ్బో అనిపించవచ్చు. సర్వసాధారణంగా మాస్ చిత్రాల దర్శకులు అనుసరించే పద్ధతి ఇది. కానీ, ఆ ప్రభావం, ఫలితం ఆ క్షణానికే, ఆ కొద్ది రోజులకే. ఆ తరువాత ఆ ఘట్టాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించదు. చూసినా తొలి సందర్శన నాటి కిక్ రాదు.

అలా లౌడ్ గానో, క్రూడ్ గానో కాకుండా అదే ఘట్టాన్ని వివిధ పాత్రల మధ్య సంఘర్షణగా, సున్నితమైన పద్ధతిలో తెరకెక్కించవచ్చు. ఆ రకంగా ఒక సన్నివేశాన్ని సంస్కారవంతమైన ధోరణిలో వేర్వేరు స్తరాలుగా చూపితే కలిగే ప్రభావం దీర్ఘకాలికమైనది. ఆ ఒక్క క్షణానికే కాకుండా, చూసిన ఒక్కొక్కసారీ ఆ సన్నివేశంలోని ఒక్కొక్క పొర ప్రేక్షకుడికి తెలిసి వస్తుంటుంది.

ఆ లోతులు అర్థమవుతున్న కొద్దీ సన్నివేశంలోని గాఢత పెరుగుతుంది. అందుకే, ప్రేక్షకుడికి తెలిసిన ఘట్టమే అయినా, ఆ సన్నివేశాలు చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంటాయి. త్రివిక్రమ్ తన చిత్రాల రచనలో, దర్శకత్వంలో ఉపయోగించే విధానం ఇదే. అందుకే, పాత్రలకూ, ప్రేక్షకులకూ మధ్య సమతూకపు డిగ్నిటీని కాపాడే ఆ చిత్రాల్లోని ఘట్టాలు చిరస్మరణీయం కాగలుగుతున్నాయి. అయితే, అలా తీయడానికి దర్శకుడికి అక్షరాలా ఖలేజా కావాలి. త్రివిక్రమ్ కు అది ఉంది.

అందుకే, మొదటి సారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి - అతని చిత్రాలు బాగుంటాయి. ఒక్క ముక్కలో చెప్పమంటే, త్రివిక్రమ్ సినిమాలు మంచి వైన్ లాంటివి. పాత బడిన కొద్దీ రుచి, విలువ పెరగడం ఫ్రెంచ్ మద్యమైన వైన్ స్వభావం. ఆ లక్షణం త్రివిక్రమ్ రచన, దర్శకత్వాల్లో వచ్చిన అధిక భాగం సినిమాల్లో గమనించవచ్చు. అదే ఆయనను సమకాలీన రచయితలు, దర్శకుల్లో ప్రత్యేక స్థానంలో నిలిపింది.

కావాలంటే, 'అతడు', 'జల్సా' లాంటి సినిమాలు మరోసారి చూడండి. మీరూ నా మాటలతో ఏకీభవిస్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం, చదివిన కొద్దీ చదవాలనిపించడం - ఇదే కదా కాలానికి అతీతంగా నిలిచే ఉత్తమ సృజనకు ప్రాథమిక లక్షణం. త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్.... ఆల్ ది బెస్ట్ టు ఖలేజా!

Wednesday, October 6, 2010

అవునా, మైనా...! ఇది సినిమాయేనా!?



తెలుగు సినిమా వస్తే చాలు, ఏ మాత్రం వీలున్నా వదలకుండా చూడడం ఓ బలహీనత. అది నాకు మరీ ఎక్కువ. అందుకే, వంశీ దర్శకత్వం వహించిన 'సరదాగా కాసేపు...' సినిమా ఊళ్ళోకి వచ్చిందని తెలిసి,వెళ్ళకుండా ఉండలేకపోయా. తెలుగునాట విడుదలైన తరువాతఇన్నాళ్ళకు కానీ, ఈ చిత్రరాజం (!) మా ఊరికి రాలేదు.

ఆంధ్రదేశంతో పాటు ఏకకాలంలో మా ఊరికి రాలేదేమని విచారిస్తూ, మిత్రులతో కలసి కాసేపు నవ్వుకుందామని ఈ సినిమాకు వెళ్ళాను. అయితే, మాకు నవ్వు రావడం మాట అటుంచి, ఏడుపొచ్చిందంటే నమ్మండి. టికెట్ కు పెట్టిన ఖర్చుకు కనీసపు గిట్టుబాటు కూడా లేదు. బుద్ధీ బుర్రా ఉన్నాయని అనుకొనే వంశీ లాంటి దర్శకుడి నుంచి ఇంత అవకతవక సినిమా రావడం మరింత బాధ కలిగించింది.

అసలీ సినిమాకూ, ఆ పేరుకూ సంబంధం కళ్ళజోడు పెట్టుకొన్నా కనిపించదు. సినిమా నిండా శబ్దకాలుష్యం. సినిమా చూస్తున్నామా, లేక డ్రామాకు వచ్చామా, లేదంటే టీవీ సీరియల్ చూస్తున్నామా అని మనకే అనుమానం వచ్చేస్తుంది. ఈ సినిమాలో కెమేరా మొదలు ఎడిటింగ్, సంగీతం (రీ-రికార్డింగ్, మిక్సింగ్) - ఇలా అన్ని విభాగాల్లో బోలెడన్ని తప్పులు కనిపిస్తాయి.

ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అందించిన మూలకథకు విస్తరణ ఈ చిత్రం. వేమూరి సత్యనారాయణ స్ర్కిప్టు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తే, పడాల శివ సుబ్రహ్మణ్యం మాటలు రాశారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంశీ కృత్యాలు.

అమెరికా నుంచి అమ్మానాన్నల దగ్గరకు వచ్చిన ఓ అబ్బాయి ('అష్టాచెమ్మా' చిత్ర ఫేమ్ అవసరాల శ్రీనివాస్) ఆంధ్రాలో పెళ్ళిచూపుల కోసం వెళతాడు. చేసుకొనే అమ్మాయి (మధురిమ) వాళ్ళ ఇంట్లో కొద్దిరోజులుండి, ఆమె ప్రవర్తన తెలుసుకోవాలనుకుంటాడు.

పెళ్ళికొడుకుగా వెళితే, అసలు విషయం రాబట్టలేమని, తన వెంట వచ్చే డ్రైవర్ (రంగబాబుగా - 'అల్లరి' నరేశ్)కు పెళ్ళికొడుకుగా, తాను డ్రైవర్ గా బయలుదేరతాడు. ఆ సంగతి పెళ్ళికూతురు వాళ్ళకు తెలిసిపోతుంది. అందుకని డ్రైవర్ గా వస్తున్నదే తమ కాబోయే అల్లుడని వాళ్ళు ఫిక్సయిపోతారు.

ఇంతలో దోవలో వచ్చిన ఇబ్బందులతో పెళ్ళికొడుకు, డ్రైవర్ తమ మారువేషాలు తీసేసి, మామూలుగా మారిపోతారు. ఆ సంగతి తెలియని పెళ్ళికూతురు తరఫు వాళ్ళు అసలు డ్రైవర్ ను పట్టుకొని, తమ కాబోయే అల్లుడనుకుంటారు. ఆ తరువాత జరిగే తమాషా సంఘటనలే మిగిలిన సినిమా.

ఈ సినిమాలో పాత్రలు, వాటి ప్రవర్తన - అంతా అతి. హీరోయిన్ గా వేసిన మరాఠీ అమ్మాయి మధురిమ అందం సంగతి దేవుడెరుగు, కనీసం ఆకర్షణీయంగా కూడా లేదు. హీరోయిన్ తొలిసారి తెరపై కనిపించినప్పుడు నేపథ్యంలో నుంచి ఓ కవితాత్మక గీత ఖండిక వస్తుంది. నిజం చెప్పాలంటే - హీరోయిన్ కన్నా ఆ కవితా ఖండికే బాగుంది.

వినోదభరిత చిత్రాలకు పేరున్న వంశీకి ఇప్పుడు ఆ ‘టచ్’ పోయిందేమో అనిపిస్తుంది - ఈ ‘సరదాగా కాసేపు’ కాసేపైనా చూస్తే! (చూడగలిగితే!!) సినిమాలో పేర్లు పడుతుండగానే సినిమా జాతకం అర్థమైపోతుంది. అప్పుడే విమానాశ్రయానికి చేరుకున్న అవసరాల శ్రీనివాస్ డైలాగులకు రీ-రికార్డింగు పరమ ఘోరం.

మాటలు, వగైరా ఒకదాని మీద మరొకటి పడిపోతుంటాయి. ఇదంతా ఎడిటింగ్ మహిమో, మిక్సింగ్ మహిమో వంశీకే తెలియాలి. సినిమా షూటింగులో లేని డైలాగులను కూడా డబ్బింగ్ దశలో కలిపి, అక్కడికక్కడ అనిపించారని సీను చూస్తే తెలిసిపోతుంటుంది.

అలాగే ఈ సినిమాకు ఏ రకమైన వెధవ కెమేరా యాంగిల్ వాడారో, ఏమో కానీ, దృశ్యాలన్నీ పూర్తిగా రూపురేఖలు మారిపోయి కనిపిస్తుంటాయి (కెమేరామన్- లోకి). తెరపై ఆ డిస్టార్టెడ్ ఇమేజెస్ బాగా లేకపోగా, చూసే ప్రేక్షకులకు చీకాకు తెప్పిస్తాయి.

సినిమాలో వచ్చే టైటిల్ సాంగ్ లో అసలు బాణీ కన్నా, పాఁవ్, పాఁవ్ అనే శబ్దాలే ఎక్కువగా ఉన్నాయి. '...ఊహలో నాయకా...' అనే పాట చూస్తే, ఇత్తడి - స్టీలు బిందెలు, వంటింటి సామాన్లను తెరపై నింపేసి, తాను మరో రాఘవేంద్రరావునని వంశీ అనిపించుకున్నారు. '...తెల్లనవ్వు, మల్లె పువ్వు...' పాట ఒకటీ కొంత బాగున్న అనుభూతిని కలిగిస్తుంది.

కథ ఉందని కాక, వినోదభరిత చిత్రాల విజయంతో జోరు మీదున్న అల్లరి నరేశ్ డేట్లున్నాయి కదా అని వంశీ - అల్లరి నరేశ్ ల కాంబినేషన్ల లెక్కలు చూసి ఈ సినిమా తీసినట్లుంది. వంశీ అలవాటుపడిపోయిన అక్రమ సంబంధాల కామెడీనీ, గుంపుల కొద్దీ పాత్రల మధ్య డైలాగు కామెడీనీ, ఒకే రకంగా వినిపించే బాణీల వరుసనూ వంశీ మార్చుకోకపోతే, కష్టమే. ఆయన కూడా గుంపు కవాతు నృత్యాల పాటలు తీయడం విచిత్రం. మొత్తం మీద ఈ సినిమా బాగుందని చెప్పాలంటే - అందుకు తగిన సన్నివేశాలు ఏవేమిటని ఏరుకోవడం ఎంత వంశీ అభిమానులకైనా కష్టమే!

Tuesday, October 5, 2010

మహేశ్ బాబు ‘ఖలేజా’ సెన్సార్ పూర్తి - రిలీజ్ కు రెడీ!



ఇప్పుడే అందిన వేడి వేడి తాజా కబురు. మహేశ్ బాబు అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఖలేజా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. అన్ని కార్య క్రమాలూ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నిన్న (అక్టోబర్ 4వ తేదీ - సోమవారం) రాత్రి కల్లా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారులు ఖలేజాకు యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో, సినిమా విడుదలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం సినిమా ప్రదర్శనకు కావాల్సిన వందల కొద్దీ ప్రింట్లను ల్యాబ్ లో సిద్ధం చేస్తున్నారు. ఓ పక్కన ప్రింట్ల పని జరుగుతుంటే, మరోపక్క సినిమా కు సంబంధించిన టీవీ ట్రైలర్ల తయారీ హడావిడి సాగుతున్నట్లు భోగట్టా. అక్టోబర్ 7వ తేదీ గురువారం నాడు విడుదల కోసం నిర్మాణ వర్గాలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఓ పక్క రోబో వాణిజ్యపరంగా కలెక్షన్లలో సంచలనం రేపుతుండడంతో, ఖలేజా కు తగినన్ని హాళ్ళను సమకూర్చుకోవడంలో కొంత ఇబ్బంది తలెత్తుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, ఈ హంగామాలను ఊహించి, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబట్టడంతో జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న బృందావనం రిలీజ్ ను అక్టోబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఆ రకంగా అక్టోబర్ 1, 7, 8 తేదీలను దాటి ఎట్టకేలకు 14కు బృందావనం విడుదల ఖరారైంది.

సెప్టెంబర్ ఆఖరులో విడుదలైన ఖలేజా పాటల్లో కొన్ని ఇప్పటికే జనాన్ని ఆకర్షిస్తున్నాయి. మణిశర్మ సంగీత దర్శకత్వంలోని ...పిలిచే పెదవుల పైనా..., ఓం నమో శివ రుద్రాయ.... పాటల గురించి అభిమానులు మురిసిపోతున్నారు. ఏమైనా, దాదాపు మూడేళ్ళ తరువాత వస్తున్న సినిమాగా మహేశ్ బాబు ఖలేజా అభిమానుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న అంశం. అది తెలుసుకోవడానికి మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Monday, October 4, 2010

పాత్రికేయ పితామహుడికి పురస్కారం: ...ఇవాళే ...అదీ హైదరాబాద్ లోనే..!



చిత్రం ఏమిటంటే - వయస్సులో నా కన్నా పెద్ద వాళ్ళతో నాకు చటుక్కున దోస్తీ కుదురుతుంటుంది. అది పెరుగుతుంటుంది. నా సమవయస్కులతోనూ, చిన్నవాళ్ళతోనూ ఇట్టే కలిసిపోయినా, పెద్ద వయస్సు వాళ్ళతో మటుకు నా స్నేహం మరింత బలంగా పెనవేసుకుపోవడం జరుగుతుంటుంది. మన జాతకమో, రూపురేఖా విలాసాలో, మాటలో మంచితనమో తెలీదు కానీ, చిన్నప్పటి నుంచీ ఎందుకో నాకు అలా జరుగుతోంది.

ఇంతకీ ఇప్పుడు నేను చెప్పొచ్చేది నాతో అలా బంధం పెనవేసుకుపోయిన ఓ పెద్ద మనిషి గురించి. కనీసం మా నాన్నగారు, తాత గారు వయస్సున్న మంచి మనిషి గురించి. ఆయనతో నా దోస్తీ గురించి. ఆయన - ఎం.ఎస్. శర్మగా ఎక్కువ మందికి సుపరిచితులైన పాత తరం జర్నలిస్టు. పూర్తి పేరు - మద్దాలి సత్యనారాయణ శర్మ. ఆయనకిప్పుడు 92 ఏళ్ళు. ఇప్పటికీ, అందంగా, ఆరోగ్యంగా ఉండే ఆయన నిజానికి మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ కన్నా పెద్దవారు. మా నాన్న గారి కన్నా ముందు నుంచీ జర్నలిజంలో ఉన్న కురువృద్ధులు.

శర్మ గారితో నా పరిచయం చిత్రంగా జరిగింది. అది గౌరవం నుంచి స్నేహంగా పరిణమించడం మరీ చిత్రం. ఆ స్నేహం ఇప్పుడు సౌహార్దంగా ఎదగడం ఇంకా విచిత్రం. నార్ల వెంకటేశ్వర రావు, గూడవల్లి రామబ్రహ్మం, చల్లా జగన్నాథం లాంటి 1940ల నాటి ప్రముఖ సంపాదకులతో భుజం రాసుకు తిరిగి, పత్రికా రచన చేసిన పెద్దాయన శర్మ గారు. ‘ప్రజామిత్ర’, ‘గోభూమి’, ‘క్రాంతి’, ‘మీజాన్’, ప్రసిద్ధ కన్నడ వారపత్రిక ‘ప్రజామత’ నడిపిన అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏ.ఐ.సి.సి) సభ్యుడు బి.ఎన్. గుప్తా గారి ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికల్లో ఆయన పనిచేశారు. ఆ తరువాత 1940ల మధ్య నాటి నుంచి రిటైరయ్యే వరకూ 'ఆంధ్రపత్రిక' దినపత్రిక సంపాదక వర్గంలో శర్మ గారు విస్తృత సేవలందించారు. అటు మద్రాసులోనూ, ఆ తరువాత హైదరాబాద్ లోనూ 'ఆంధ్రపత్రిక' డైలీ ఎడిషన్ కు పెద్ద దిక్కుగా పనిచేశారు.

మరో విశేషం ఏమిటంటే - తొలి తరం సినీ పాత్రికేయులలో ఆయన ఒకరు. 1940ల తొలినాళ్ళ నుంచి 1950ల ప్రథమార్థం వరకు ఆంధ్రపత్రిక డైలీలో సినిమా పేజీ నిర్వహణ ఆయన చేతి మీదు గానే జరిగింది. అప్పటి సంగతులు ఇప్పటికీ ఆయన పూస గుచ్చినట్లు చెబుతుంటారు. మా నాన్న గారితో సాహితీ పరిచయం, మా మూడో వదిన వాళ్ళ నాన్న గారు ('ఆంధ్రపత్రిక' సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ పినపాక సూర్యప్రకాశరావు)తో సాన్నిహిత్యం శర్మ గారి సొంతం. ఎప్పటి నుంచో శర్మ గారిని కలుసుకోవాలని ఉన్నా, ఎందుకనో కుదరనే లేదు. అలాంటిది - ఉన్నట్టుండి ఆఫీసు పని మీద వివరాల సేకరణ కోసం సరిగ్గా 15 నెలల క్రితం హైదరాబాద్ లో ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి కలిశాను. ఓ నాలుగు రోజులు వరుసగా వెళ్ళి, ఆపాత మధురమైన ఆయన జ్ఞాపకాలను తెలుసుకున్నా. అలా మొదలైన మా పరిచయం అక్షరాలా దినదిన ప్రవర్ధమానమైంది. సాయంకాలపు నీడలా పెరుగుతూ వచ్చింది.

ఆయన అనుభవంలో సగమన్నా లేని నాతో ఆయనకు దోస్తీ ఏమిటి! అది విచిత్రమే కాదు, ఆయన మంచితనం కూడా!! ఈ 15 నెలల్లో మా స్నేహం ఏ దశకు చేరిందంటే - కనీసం వారానికి ఒకసారైనా ఓ అరగంట ఎస్టీడీ ఫోన్లో మాట్లాడుకోవాల్సిందే. ఏ పనిలోనైనా ఉండి నేను చేయకపోతే, ఆ మరునాడే 'ఏమైంది, ఏమిట'ని ఆయనే ఫోన్ చేసి, యోగక్షేమాలు అడుగుతారు. సూచనలు, సలహాలిస్తారు. రాజకీయాల నుంచి సాహిత్యం, సినిమాలు, షికార్ల దాకా ఏ అంశం మా మాటల్లో నిషిద్ధం కాదు. అప్పట్లో 'ఆంధ్రపత్రిక'లో చేరిన సుప్రసిద్ధులు ముళ్ళపూడి వెంకట రమణ, నండూరి రామమోహనరావు తదితరులను జర్నలిజంలో చేయి పట్టుకొని నడిపించిన ఈ పాత్రికేయ భీష్ముడికి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం దక్కడం ఎంతో ఆనందకరమైన విషయం. తొలినాళ్ళ జర్నలిస్టు సంఘాల స్థాపనలో ముఖ్యపాత్ర పోషించిన ఎం.ఎస్. శర్మ గారు యూనియన్ కార్యకలాపాల్లో, ప్రెస్ క్లబ్ పక్షాన సలహా సంప్రతింపుల్లో కూడా చాలా కాలం క్రియాశీలంగా వ్యవహరించిన పెద్దలు. అన్నట్లు - ఇవాళ బెజవాడలో పబ్లిసిటీ రంగంలో, ముఖ్యంగా సినీ పబ్లిసిటీ రంగంలో అందరికీ తలలో నాలుకైన పాత్రికేయుడు కృష్ణాజీ సాక్షాత్తూ శర్మ గారి అబ్బాయే.

మరో చిత్రం ఏమిటంటే - ఎం.ఎస్. శర్మ గారు పుట్టింది - 1919 సెప్టెంబర్ 19న, కృష్ణాజిల్లా కలవపాముల గ్రామంలో. సంవత్సరం వేరైనా (1887), సెప్టెంబర్ 19నే పుట్టారు - శర్మ గారి ముందు తరానికి చెందిన రచయిత - పాత్రికేయుడు తాపీ ధర్మారావు. ఇప్పుడు అక్షరాలా ఆ తాపీ ధర్మారావు గారి పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి’ పురస్కారం శర్మ గారికి లభించింది. తాపీ వారితో శర్మ గారికి ప్రత్యక్ష పరిచయం కూడా ఉండడంతో ఈ సత్కారం మరింత సబబుగా మారింది. కొత్త సొబగు చేకూరింది.

ఈ రోజు (2010 అక్టోబర్ 4, సోమవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియమ్ లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. తమ తమ రంగాల్లో చేసిన సేవలకు గాను ఎం.ఎస్. శర్మ గారితో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 26 మందికి ఈ ‘కీర్తి’ పురస్కార ప్రదానం చేయనున్నారు. (పురస్కారాలందుకొనే ఈ 27 నక్షత్రాలలో నాకు సుపరిచితులైన మరో ఇద్దరు - బెజవాడకు చెందిన రచయిత - పాత్రికేయుడూ, మా నాన్నగారి మిత్రుడు వీరాజీ గారు, మా ఆకాశవాణి మిత్రుడు నాగసూరి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు).

1940 నాటి నుంచి ప్రధాన స్రవంతి పత్రికా రంగంలో పనిచేస్తూ, ఇప్పటికీ వివిధ అంశాలపై తన అభిప్రాయాలనూ, అనుభవాలనూ పత్రికల్లో పంచుకుంటున్న పాత్రికేయ పితామహుడు శర్మ గారు. ఆయనకు ఇన్నాళ్ళకు, ఈ పాటి చిన్న గుర్తింపు ప్రభుత్వం నుంచి రావడం మన వ్యవస్థ, దాని పాలకుల స్థితిగతులకు నిదర్శనం. అయితే, 70 ఏళ్ళుగా ఓ రంగంలో పని చేస్తున్న వ్యక్తికి ఇప్పటికైనా, ఈ మాత్రం గుర్తింపైనా దక్కడం ఆవేదనలోనూ ఆనందమనిపిస్తోంది. లేటు వయసులోనూ రాతలో, మాటలో ఘాటు తగ్గని ఎం.ఎస్. శర్మ గారికి ఈ శుభ సందర్భంగా తెలుగు పత్రికా రంగం తరఫున జేజేలు!!

కొసమెరుపు - గగన్ మహల్ ప్రాంతంలో ఉన్న బాల్య మిత్రుడి దగ్గరకు ఇప్పటికీ ప్రతి వారం బస్సులో వెళ్ళి, ఓ రోజంతా కబుర్లాడుకొని రావడం ఎం.ఎస్. శర్మ గారికి వారకృత్యం. సరిగ్గా అయిదు రోజుల క్రితం ఆయన అలాగే వెళ్ళి, మళ్ళీ ఇంటికి బస్సులో వచ్చేస్తుంటే ఓ గమ్మత్తు జరిగింది. అదే బస్సులో ఎక్కిన ఓ యువతి ఆయనను అదే పనిగా గమనిస్తోంది. విషయమేమిటో శర్మ గారికి అర్థం కాలేదు. తీరా దిగాల్సిన స్టాపు దగ్గర పడేసరికి, సర్దుకొని లేచిన ఆ అమ్మాయి, హడావిడిగా దిగిపోతూ, తెల్లటి లాల్చీ - పంచెల్లో దబ్బపండులా ఉన్న ఎం.ఎస్. శర్మ గారి దగ్గరకు వచ్చి, ‘‘మీరు బాగున్నారండీ!’’ అంది. దానికి, శర్మ గారు లిప్తపాటు కాలం నివ్వెరపోయినా, వెంటనే -‘‘మనుమరాలి స్వయంవరం మంచిదే!’’ అని హాయిగా నవ్వేస్తూ, ఆశీర్వదించారు. నిండు జీవితాన్ని ఇలా ఆహ్లాదంతో నింపుకోవడం ఆ తరం నుంచి మన తరం అక్షరాలా నేర్చుకోవాల్సిందే!

అందుకే, "శర్మాజీ! మీరు మరిన్ని పురస్కారాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా కాలం గడపాలి. మీ అనుభవాలనూ, జ్ఞాపకాలనూ యువతరం పాత్రికేయులతో సదా పంచుకోవాలి." అదే నా ఆశ, ఆశంస!

(మిత్రులకో మాట - హైదరాబాద్ లో ఉండి, తీరిక, ఓపిక ఉన్న మిత్రులు, మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఈ పురస్కార ప్రదానానికి వెళితే బాగుంటుంది. వయస్సులోనూ, అనుభవంలోనూ అక్కడ అందరిలోకీ పెద్దాయన శర్మ గారు పురస్కారం అందుకుంటున్నప్పుడు నాలుగు చప్పట్లు కొడితే మరీ బాగుంటుంది. అది ఆయన కోసం కాదు, మన కోసం! 70 ఏళ్ళుగా ఓ రంగంలో ఓ వ్యక్తి చేసిన విశిష్ట కృషిని గౌరవించాలన్న సంస్కారాన్ని నలుగురితో పంచుకోవడం కోసం, మనలో మనం పెంచుకోవడం కోసం!!)