జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Showing posts with label సినిమా - కోడంబాకమ్ కబుర్లు. Show all posts
Showing posts with label సినిమా - కోడంబాకమ్ కబుర్లు. Show all posts

Thursday, July 21, 2016

నలభై ఏళ్ల రజనీ కాంతి

An Old article written by me 
on Rajinikanth.. in Sakshi daily... from my archives 

రజనీకాంత్‌కు ఈ మంగళవారం (2015 August 18
ఒక మరపురాని రోజు. ఈ సౌతిండియన్ సూపర్‌స్టార్ వెండితెరపై
 తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇవాళ్టి (ఆగస్టు 18)తో
 సరిగ్గా నాలుగు దశాబ్దాలు పూర్తవుతున్నాయి. కె. బాలచందర్
 దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ 
(తెలుగులో దాసరి ‘తూర్పు - పడమర’గా రీమేక్ చేశారు) 
సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1975 ఆగస్టు 18న రిలీజైంది. 
బస్ కండక్టర్‌గా జీవితం మొదలుపెట్టిన శివాజీరావ్ గైక్వాడ్, 
చిన్న చిన్న పాత్రల్లో రాణించి, విలన్‌గా పేరు తెచ్చుకొని, 
హీరోగా తిరుగులేని స్థానానికి చేరుకొని తమిళ తెరకు 
రజనీకాంతుడైన ప్రస్థానం ఎప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన చరిత్రే.

 ఆరు పదుల వయసు దాటినా, ఇప్పటికీ తమిళ తెరపై
మకుటంలేని మహారాజుగా వెలుగుతున్న స్టార్ రజనీకాంత్.
 ఏడాదికో, రెండేళ్ళకో ఒక సినిమా చేసినా, బాక్సాఫీస్ వద్ద
 హిట్టయితే కలెక్షన్లకు ఆకాశమే హద్దని తమిళ ఫిల్మ్
 ఇండస్ట్రీ ఉవాచ. ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో అభిమాన
 సంఘాలు, రాజకీయంగా ఒక్క అభిప్రాయం చెబితే దాన్ని
తు.చ తప్పకుండా పాటించే కోట్లాది అభిమానులు ఆయన
 సొంతం. భోగిగా మొదలై హిమాలయ గురువుల
బోధనలతో యోగిగా పరిణతి చెందిన జీవితం రజనీది.

 ఇంతకీ కాళీనా? కపాలీనా?
 భక్తియోగంలో ఆధ్యాత్మికతను అనుసరిస్తూనే
కర్మయోగంలో నటనను వదులుకోని రజనీకాంత్
ఇప్పుడు తన 159వ సినిమాతో మళ్ళీ కెమేరా ముందుకు
 రావడానికి బిజీ బిజీగా సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు
రంజిత్ నిర్దేశకత్వంలో సెట్స్ మీదకొస్తున్న తమిళ చిత్రం
సన్నాహాల్లో ఉన్నారు. వయసు మీద పడ్డ మాఫియా
డాన్‌గా రజనీ కనిపించే ఈ చిత్రానికి ఇటీవలి వరకు ‘కాళి’
అనే పేరు మీడియాలో ప్రచారమైంది. తాజా కబురేమిటంటే,
ఈ సినిమాకు ‘కపాలి’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట.
కపాలీశ్వరుడనేది శివుడి పేరు. చెన్నైలోని మైలాపూర్
 ప్రాంతంలోని కపాలీశ్వరస్వామి కోవెల సుప్రసిద్ధం. ఈ సినిమా
కథ కూడా చెన్నైలోని మైలాపూర్‌లో మొదలవుతుందట.
అందుకే, ఈ పేరు పెట్టాలనుకుంటున్నారట.

 నిజజీవిత డాన్ కథ? అన్నట్లు, ఈ సినిమాలో రజనీ
పోషిస్తున్న పాత్ర పేరు కూడా కపాలీశ్వరన్ అట. ఒకప్పుడు
 మైలాపూర్‌లో నివసించిన కపాలీశ్వరన్ అనే మాఫియా
 డాన్ జీవితం కూడా ఈ కథకు స్ఫూర్తి అని కోడంబాకవ్‌ులో
గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి సెట్స్
మీదకు వెళ్ళనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం
మలేసియాలో జరగనుంది. సినిమాలో మొదట కొద్దిసేపు
 మైలాపూర్, ఆ గుడి పరిసరాలు కనిపిస్తాయిట. రాధికా
ఆప్టే, ధన్సిక తదితరులు నటించే ఈ సినిమాతో రజనీ
 కొత్త రికార్డులు సృష్టిస్తారా? చూడాలి.

Wednesday, September 30, 2015

సూర్య సినిమాకు తప్పు చేశా! - నిర్మాత లగడపాటి శ్రీధర్‌

ఆయన సిల్వర్‌స్పూన్‌తో పుట్టారు. సిల్వర్‌స్క్రీన్ గురించి కలగన్నారు. పదేళ్ళ క్రితం నిర్మాతయ్యారు. లగడపాటి శ్రీధర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం సంపాదించినా అన్నీ సినిమాల వల్లే కాబట్టి, చుట్టూ ఉన్నవాళ్ళను ‘సినిమాల’తోనే సంతోషపెట్టాలనుకొన్నారు. శుక్రవారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’తో రానున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి బర్త్‌డే బాయ్ శ్రీధర్‌తో కాసేపు...

 * వరుసగా కన్నడం నుంచి రీమేక్ చేస్తున్నారేం?
 బడ్జెట్ పరిమితులున్న చోట, తప్పనిసరై క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. కన్నడంలో అదే జరుగుతోంది. నన్నడిగితే, మన చిన్న సినిమాలకు కన్నడ చిత్రాలే నమూనా లాంటివి. వాటిని గనక తెలుగుకు తగ్గట్లు రీ-ప్యాకేజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి చిన్న సినిమాలు వస్తాయి. అందుకే, ‘పోటు గాడు’, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ లాంటివి చేయగలిగా.

* కానీ, చిన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటారా?
 ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీతో సహా 5 కోట్లలో సినిమా తీస్తే కానీ, ప్రేక్షకుల్ని ఆకర్షించే చిన్న సినిమా రాదు. అలాంటి ప్రయత్నమే ప్రేమ ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ‘కృష్ణమ్మ...’ ప్రేమకు ఒక గైడ్‌లా ఉంటుంది. స్కూలు మొదలు కెరీర్ దాకా పన్నెండేళ్ళ ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టాం.

 * డిజిటల్ ఏజ్‌లో స్వచ్ఛమైన ప్రేమను కోరేవారు, చూసేవారు ఉంటారా?
 ఇందులో టైమ్‌పాస్ లవ్, టైమ్‌లెస్ లవ్ - రెండూ చూపించాం. జీవితంలో చాంపియన్ కావాలంటే, సిన్సియర్ ప్రేమే అవసరమని చెప్పాం.

 * బయట ఎమోషనల్‌గా ఉండే మీరు, ప్రేమ కథలు తీయడం...?
 (మధ్యలోనే అందుకుంటూ...) కుటుంబ విలువల మీద నాకు ఆసక్తి ఎక్కువ. సిన్సియర్ ప్రేమను చూపిస్తూ, కన్నడంలో చంద్రు తీసిన ‘ప్రేమ్ కహానీ’, ‘తాజ్‌మహల్’, ‘చార్మినార్’ మూడూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ‘తాజ్‌మహల్’ను ‘పోటుగాడు’గా తీశా. ఇప్పుడు ఇది చేశా.

 * డెరైక్షన్, కెమేరా, సంగీతం- వీటికి కన్నడ టీమ్‌నే వాడారేం?
 చాలా రీమేక్స్‌లో ఒరిజినల్‌లో ఉన్న ఫ్లేవర్ మిస్సయిందని అనుకుంటూ ఉంటాం. అందుకే, ‘చార్మినార్’ దర్శకుడు (చంద్రు), కెమేరామన్ (కె.ఎస్. చంద్రశేఖర్), సంగీత దర్శకుడు (హరి) ముగ్గురినీ తీసుకున్నా.

* మీ జోక్యం ఎక్కువనేనా స్టార్స్‌తో సినిమా తీయలేదు?
 స్టార్స్ కోసం సినిమాలు తీయలేను. సినిమాను ప్రేమిస్తా. చేస్తున్న పని ప్రతి సెకనూ ఆస్వాదిస్తా. టీమ్ సక్సెసే నా సక్సెస్ అనీ, ప్రేక్షకుల వినోదానికి బాధ్యుడిగా నిలవాలనీ భావిస్తా. అవన్నీ తెలిసినవాళ్ళే నాతో చేయడానికి ముందుకొస్తారు. కాంబినేషన్స్‌తో డబ్బులు పెట్టి కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే, నాకెప్పుడూ నిద్ర లేని రాత్రుల్లేవు.

 * మరి, సూర్య ‘సికిందర్’ను డబ్ చేసిన విషయం...?
 (మధ్యలోనే...) వేరేవాళ్ళ మాట నమ్మి, చూడకుండానే రిలీజ్ చేసేశా. అది నేను చేసిన తప్పు. అలా మళ్ళీ చేయను.

* నిర్మాతగా ఈ పదేళ్ళలో ఆర్థికంగా పోగొట్టుకున్నదే ఎక్కువేమో?
 నో రిగ్రెట్స్! కాకపోతే, ఛాన్సిచ్చి చూద్దామని ‘అండర్ డాగ్స్’ మీద తరచూ పందెం కాశాను. పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడిక దీన్ని బిజినెస్‌గానే చేయాలనుకుంటున్నా. ఇకపై మంచి రేసుగుర్రాలపైనే పందెం కాస్తా.

* మీ అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చి, నటిస్తున్నట్లున్నాడు!
 మా అబ్బాయి విక్రమ్ (9వ తరగతి)కి నటుడు కావాలని ఆశ. దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’లో పరిచయం చేశారు. ‘కృష్ణమ్మ...’లో చిన్నప్పటి ఎపిసోడ్‌లో వాడు నటించాడు. అందరూ రకరకాల స్టార్స్ అని పేరు పెట్టుకుంటుంటే, వాడు ‘గ్లోబల్ స్టార్’ అని పెట్టుకున్నాడు (నవ్వు).

* మీ రాబోయే సినిమాలు?
 తమిళ సూపర్‌హిట్ ‘గోలీసోడా’ హక్కులు కొన్నా. అన్నీ కుదిరితే, ఆ రీమేక్ చేయాల్సిందిగా ‘అతనొక్కడే’ కథా చర్చల రోజుల నుంచి మాకు సన్నిహితుడైన దర్శకుడు సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం.

* ఏమిటీ అన్నీ రీమేక్‌లేనా? అవి సేఫ్ అనా? సొంత కథలు చేయరా?
 మూడు నాలుగు మించి కొత్త కథలెవరూ చెప్పలేరు. మొదట నేనూ కొత్త ఐడియాలతో వచ్చా. ఇప్పుడు రీమేక్‌లు చేస్తున్నా. అది సొంత కథా, రీమేకా అని కాదు - జనానికి కావాల్సినవి, నచ్చేవి ఇవ్వాలనుకుంటున్నా.

* మీ డ్రీమ్ ‘స్టైల్ -2’ ఏమైంది?
 స్క్రిప్ట్ సిద్ధం. అద్భుతంగా నాట్యం చేసే అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అలాంటి నటి కోసం చూస్తున్నా. వేటూరి గారు చివరి రోజుల్లో బెడ్ మీద ఉంటూనే, ‘స్టైల్ -2’ కోసం రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఎప్పటికైనా ఈ సినిమా తీసి, ఆయనకు అంకితమిస్తా.     
  - రెంటాల

(Published in 'Sakshi' daily, 14th June 2014)
...................................................

Thursday, March 5, 2015

మాకు స్ఫూర్తి రజనీ గారే! - మహాభాష్యం చిత్తరంజన్,

- మహాభాష్యం చిత్తరంజన్,
 ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు


మాకు స్ఫూర్తి రజనీ గారే!
 ప్రముఖ కవి, గాయకుడు, వాగ్గేయకారుడు, స్వరకర్త రజనీగారు లలిత సంగీత వికాసానికీ, అభివృద్ధికీ ఎనలేని సేవలందించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో 1941లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో మధురమైన లలిత గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఉమర్ ఖయ్యాయి తత్త్వాన్ని వర్ణిస్తూ కృష్ణశాస్త్రి గారు రాసిన ‘అతిథిశాల’కు ఆయన పర్షియన్ సంగీతపు పోకడలతో అద్భుతమైన బాణీలు కూర్చారు. ఆయనే ఖయ్యావయిగా కూడా నటించి పాడారు.  మా తండ్రి గారు, రజనీ గారి తండ్రి గారు పిఠాపురం వాస్తవ్యులు.

 అందుకని ఆయనకు నా పైన ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. 1963లో హైదరాబాద్ ఆకాశవాణిలో ఈ నాటిక ప్రసారమైనప్పుడు ఆయనతో పాటు నేనూ అందులోని పాటలు పాడాను. అరబ్బీ సంగీత పద్ధతిలో పాటలే కాక పద్యాలు కూడా చదవడం అంత తేలికైన విషయం కాదు. కర్ణాటక, హిందుస్తానీ సంగీతంలో వాడుకలో లేని రాగాలెన్నిటినో ఉపయోగించడం లాంటి ప్రయోగాలెన్నో చేసిన మొట్టమొదటి వ్యక్తి - రజనీగారు. ఆ తరువాత పాలగుమ్మి విశ్వనాథం గారు, ఆ పైన నేను కూడా వాడుకలో లేని అనేక రాగాల్ని వినియోగించి, ప్రజారంజక గీతాలు తయారుచేశాం. ఆ విషయంలో మా అందరికీ స్ఫూర్తి రజనీ గారే.  

- Interview by Rentala Jayadeva

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
............................

Wednesday, August 27, 2014

దీపావళికి 180 కోట్ల శంకర్ ‘మనోహరుడు’

 దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనానికి ఈ దీపావళి తెర తీయనుంది. తొలిసారిగా ఓ దక్షిణ భారతీయ భాషా సినిమా చైనాలో విడుదల కానుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఈ దీపావళికి చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలవుతున్న తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కనుంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ విషయం ఆదివారం నాడు వెల్లడించారు. తెలుగు పత్రికా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ చిత్రం గురించి తొలిసారిగా అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ విధంగా వెల్లడించారు.

 12 గంటలు మేకప్... రిఫ్రిజిరేటర్‌లో విక్రమ్

 ఇప్పటికి రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు సగానికి పైగా ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషిస్తున్నారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందిస్తున్నారు. ‘‘ఈ సినిమా కోసం హీరో విక్రమ్ పడిన శ్రమ, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఒక స్పెషల్ గెటప్ కోసం ఆయనకు మేకప్ చేయడానికే దాదాపు 12 గంటలు పట్టేది. అయినా, ఆయన ఓపిగ్గా ఉండేవారు. మేకప్ వేసిన తరువాత పూర్తి ఏ.సి.లోనే ఆయన ఉండాల్సి వచ్చేది. అందు కోసం దాదాపు పది అడుగుల ఎత్తున్న ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది నిర్మించాం. ఈ గెటప్ కోసం ప్రత్యేకంగా ఆయన 125 కిలోల స్థాయికి బరువు పెరిగారు. తెరపై ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు’’ అని రవిచంద్రన్ తెలిపారు.

  మూడెకరాల సెట్... పాటకు 40 రోజులు...

 ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక ట్రైలర్‌నూ, ఒక పాటనూ ఆయన విలేకరుల కోసం ప్రత్యేకంగా ముందుగా చూపించారు. హీరో నీళ్ళపై నడిచే ఆశ్చర్యకరమైన దృశ్యాలున్న ఈ సినిమా పాటలు, ఫైట్ల కోసం శంకర్ డబ్బునూ, కాలాన్నీ లెక్కచేయలేదట. ఒక విచిత్రమైన ఘట్టంలో, అపూర్వమైన గెటప్‌తో హీరో వచ్చే ఒక సిట్యుయేషనల్ సాంగ్ కోసం ఏకంగా మూడెకరాల్లో ఒక సెట్ వేసి, 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. అలాగే, చైనాలో తీసిన ఒక సైకిల్ ఫైట్‌కు కూడా దాదాపు 40 రోజులు కష్టపడ్డారు. ‘‘ఈ సినిమా మీద నాకున్న నమ్మకం అపారం. ప్రతి ఘట్టం తెరపై చూడగానే ‘అయ్’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘ఐ’ అని పేరు పెట్టాం’’ అని ఆయన చెప్పారు. చైనా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తున్నారు.

  భారతీయ ‘జేమ్స్ కామెరూన్’

 ‘‘దీన్ని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్ సినిమా అనో, ప్రేమ కథా చిత్రమనో, థ్రిల్లర్ అనో - ఒక గాటన కట్టి చెప్పలేం. రేపు ఈ చిత్రం చూసినప్పుడు నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 285 రోజుల పైగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా మునుపటి ‘అపరిచితుడు’ కన్నా వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో విశేషాలతో, ప్రాణం పెట్టి తీసిన ఈ సాంకేతిక అద్భుతం చూశాక శంకర్‌ను ‘భారతీయ జేమ్స్ కామెరూన్ (ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు)’ అనాలని అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా రావడం ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృప. నన్నడిగితే ఈ భారీ చిత్రానికి నేను కాదు... ఆయనే నిర్మాత’’ అని వ్యాఖ్యానించారు.


   హైదరాబాద్‌కు జాకీ చాన్... చెన్నైకి ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్!

 ‘‘సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుతున్నారు. సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేస్తున్నాం’’ అని రవిచంద్రన్ తెలిపారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు ఆడియో రిలీజ్‌కు తన చిరకాల పరిచయస్థుడైన యాక్షన్ హీరో జాకీచాన్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో జరిపే తమిళ ఆడియో రిలీజ్‌కు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ఆహ్వానిస్తున్నారు. ‘‘చెన్నైలో భారీ వేదికపై ఆడియో రిలీజ్ జరపాలని ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలూ మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు కానున్నాయి’’ అని రవిచంద్రన్ ‘సాక్షి’కి చెప్పారు.

  భారీ ఎత్తున విడుదల

 తమిళంలో తయారైన ఈ టెక్నికల్ వండర్‌ను ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘తెలుగులో ‘మనోహరుడు’గా వస్తున్న ఈ చిత్ర డబ్బింగ్ దాదాపు పూర్తయింది. శ్రీరామకృష్ణ సంభాషణలు, రామజోగయ్యశాస్త్రి, తదితరులు పాటలు అందిస్తున్నారు’’ అని రవిచంద్రన్ చెప్పారు. మీడియా ముందుకెన్నడూ రాని రవిచంద్రన్ తొలిసారి ఈ చిత్రం గురించి పలు విషయాలు పంచుకోవడం గమనార్హం.


.................................

Wednesday, June 4, 2014

మళ్ళీ సీక్వెల్ కూడానా?


జనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’కు సీక్వెల్ వస్తోందా? ఆ చిత్రం సహ నిర్మాత మురళీ మనోహర్ మాటలు వింటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. త్రీడీ మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందిన ఈ చిత్ర సీక్వెల్‌కు తమ బృందం మరింత కష్టపడుతుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో ఆశించిన రీతిలో ‘కోచ్చడయాన్’కు ఆదరణ లభించలేదని అంగీకరించిన ఆయన, ఈ వ్యాఖ్య చేశారు. ‘‘పరిమిత సమయంలో, పరిమిత బడ్జెట్‌లో మేము చేయగలిగినదంతా చేశాం. అయితే, ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందని ఒప్పుకుంటున్నా.
 
  ఏమైనా, దీనికి సీక్వెల్‌లో మరింత కష్టపడి, బాగా తీస్తాం’’ అని మురళీ మనోహర్ అన్నారు. హిందీ ప్రాంత ప్రేక్షకులు ఈ సాంకేతిక అద్భుతాన్ని ఆస్వాదించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రం ఏమిటంటే, తమిళ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా, ఈ సహ నిర్మాత మాత్రం ఘన విజయం సాధించిందంటూ డబ్బా కొట్టుకున్నారు.  అనుకున్న దాని కన్నా ఆలస్యమైనా, హిందీలో కూడా ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కబుర్లు విని, సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అవును మరి... మొదటి సినిమాకే దిక్కు లేదంటూ ఉంటే, దీనికి సీక్వెల్ కూడానా అని పెదవి విరుస్తున్నారు.


(Published in 'Sakshi' daily, 3rd May 2014, Tuesday)
............................................................................

Thursday, September 26, 2013

'నూరేళ్ళ సినిమా' ఉత్సవాలు... నేడే మొదలు - దక్షిణాది సినీ రాజధాని చెన్నైలో జోరుగా ఏర్పాట్లు

చెన్నైలోని సత్యం థియేటర్ కాంప్లెక్స్ వద్ద సత్యం థియేటర్ ప్రతినిధి మునికన్నయ్య,
సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్, గౌరవ కార్యదర్శి ఎల్. సురేశ్, వగైరా

సినిమాకు చిరునామాగా ఉన్న చెన్నై నగరం నూరేళ్ల సినీపండుగకు ముస్తాబైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు సినిమా ఉత్సవాలతో నగరం కళకళలాడనుంది. భారతీయ సినిమా నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దక్షిణాదిలోని నాలుగు ప్రాంతీయ భాషా సినీ పరిశ్రమల తరఫున దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ - ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి) నేతృత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషా సినీ రంగ ఫిల్మ్‌ చాంబర్లు, ఆ యా సినీ రంగాల ప్రముఖులు, పెద్దలు పాలుపంచుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అండదండలందిస్తున్న ఈ కార్యక్రమానికి చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియమ్‌ ప్రధాన వేదికగా ఈ పండుగ జరుగుతోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం సాయంత్రం ఉత్సవాలను ప్రారంభిస్తారు. నగరంలోని ప్రధాన కూడళ్ళు, పార్కులు ఇప్పటికే ఈ ఉత్సవ ప్రకటనలు, హోర్డింగులు, తోరణాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నగరంలోని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో సెప్టెంబర్‌ 16 నుంచి 24 దాకా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలను ప్రజలకు ఉచితంగా ప్రదర్శిస్తారు. ప్రధానమైన పార్కుల్లో రోజూ సాయంత్రం పాత సినీ ఆణిముత్యాలను ప్రదర్శిస్తున్నారు. ''తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ సినీ నటి జయలలిత ఈ ఉత్సవం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ సహకారం లేనిదే ఇంత భారీ స్థాయిలో ఉత్సవాల నిర్వహణ సాధ్యమయ్యేది కాదు'' అని ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. అధ్యక్షుడు, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కల్యాణ్‌ చెప్పారు. ''దక్షిణ భారతీయ సినిమాకు మద్రాసు జన్మస్థానం. అందుకే, ఈ నగరాన్ని వేదికగా ఎంచుకున్నాం'' అని ఆయన వివరించారు.
మరోపక్క ఈ ఉత్సవాల సన్నాహాల నిమిత్తం సెప్టెంబర్‌ 18 నుంచి 24 దాకా తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లను ఆపుచేశారు. రజనీకాంత్‌, కమలహాసన్‌ సహా ప్రముఖ తారలందరూ ఈ వేడుకలో పాలొంటారు. ఇక, రెండో రోజైన సెప్టెంబర్‌ 22 ఆదివారం నాడు ఉదయం కన్నడ చిత్ర సీమ వేడుకలు, సాయంత్రం నుంచి తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరగనున్నాయి. మూడో రోజైన సెప్టెంబర్‌ 23 సోమవారం మలయాళ పరిశ్రమ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే, గడచిన 72 ఏళ్ళుగా సినిమాల్లో నటిస్తూ, నిన్నటితో 90వ ఏట అడుగుపెట్టిన ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కూడా ఈ వేదికపై జరపనున్నారు. వేడుకలలో భాగంగా ప్రతి రోజూ సినిమా తారలతో జరిపే సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.

ఇక, ఉత్సవాలు ముగిసే సెప్టెంబర్‌ 24 మంగళవారం నాడు నాలుగు సినీ పరిశ్రమల తాలూకు తారలతో 'గ్రాండ్‌ ఫైనల్‌' నిర్వహించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఈ ముగింపు ఉత్సవానికి హాజరు కానుండడం విశేషం. ఈ తుది రోజు వేడుకల్లో దక్షిణాది భాషా తారలందరూ పెద్దయెత్తున పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ''దక్షిణ భారతీయ సినిమా వారందరూ ఒక గొడుగు కిందకు వచ్చి, ఇంత పెద్ద చేయడం విశేషం'' అని దర్శక, నిర్మాత, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఆర్‌. అన్నారు. ''ఈ ఉత్సవం మన జాతీయ సమైక్యత, సమగ్రతకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది'' అని కె.ఆర్‌. అభిప్రాయపడ్డారు.
అయితే, తెలుగునాట నెలకొన్న సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ వాదాల సెగ ఈ వేడుకలను కూడా తాకింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ వేడుకలను వాయిదా వేయాలంటూ ఈ నెల మొదటి వారంలో నటుడు - నిర్మాత మోహన్‌బాబు చేసిన అభ్యర్థన కలకలం రేపింది. అన్ని రాష్ట్రాల వారూ కలసి ఎంతో ముందుగా నిర్ణయించుకొని చేస్తున్న ఈ ఉత్సవాలను ఆపడం సాధ్యం కాదంటూ నిర్వాహకులు తెగేసి చెప్పారు. దాంతో, ఉత్సవాలైతే ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నాయి కానీ, అనేక ఇగో సమస్యలు, అంతర్గత విభేదాలున్న పలువురు సినీ తారలు మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నట్లు ఇప్పటి దాకా అందుతున్న సమాచారం.

 సినిమా ఉత్సవాల్లో అక్కినేని పుట్టినరోజు వేడుకలను కలపడాన్ని కూడా కొన్ని వర్గాల వారు వ్యతిరేకించారు. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వర్గం కూడా ఈ ఉత్సవాల పట్ల అంతగా ఆసక్తిని చూపడం లేదని కృష్ణానగర్‌ వర్గాల కథనం. దాంతో, ఈ ఉత్సవాల్లో 22న జరిగే తెలుగు వేడుకల్లోనూ, ఆ తరువాత మన వాళ్ళలో ఎంతమంది, ఏ మేరకు పాలుపంచుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. 

మరోపక్క ఈ ఉత్సవాల సన్నాహాల నిమిత్తం సెప్టెంబర్‌ 18 నుంచి 24 దాకా తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లను ఆపుచేశారు. రజనీకాంత్‌, కమలహాసన్‌ సహా ప్రముఖ తారలందరూ ఈ వేడుకలో పాలొంటారు. ఇక, రెండో రోజైన సెప్టెంబర్‌ 22 ఆదివారం నాడు ఉదయం కన్నడ చిత్ర సీమ వేడుకలు, సాయంత్రం నుంచి తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరగనున్నాయి. మూడో రోజైన సెప్టెంబర్‌ 23 సోమవారం మలయాళ పరిశ్రమ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే, గడచిన 72 ఏళ్ళుగా సినిమాల్లో నటిస్తూ, నిన్నటితో 90వ ఏట అడుగుపెట్టిన ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కూడా ఈ వేదికపై జరపనున్నారు. వేడుకలలో భాగంగా ప్రతి రోజూ సినిమా తారలతో జరిపే సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.
ఇక, ఉత్సవాలు ముగిసే సెప్టెంబర్‌ 24 మంగళవారం నాడు నాలుగు సినీ పరిశ్రమల తాలూకు తారలతో 'గ్రాండ్‌ ఫైనల్‌' నిర్వహించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఈ ముగింపు ఉత్సవానికి హాజరు కానుండడం విశేషం. ఈ తుది రోజు వేడుకల్లో దక్షిణాది భాషా తారలందరూ పెద్దయెత్తున పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ''దక్షిణ భారతీయ సినిమా వారందరూ ఒక గొడుగు కిందకు వచ్చి, ఇంత పెద్ద చేయడం విశేషం'' అని దర్శక, నిర్మాత, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఆర్‌. అన్నారు. ''ఈ ఉత్సవం మన జాతీయ సమైక్యత, సమగ్రతకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది'' అని కె.ఆర్‌. అభిప్రాయపడ్డారు.

అయితే, తెలుగునాట నెలకొన్న సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ వాదాల సెగ ఈ వేడుకలను కూడా తాకింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ వేడుకలను వాయిదా వేయాలంటూ ఈ నెల మొదటి వారంలో నటుడు - నిర్మాత మోహన్‌బాబు చేసిన అభ్యర్థన కలకలం రేపింది. అన్ని రాష్ట్రాల వారూ కలసి ఎంతో ముందుగా నిర్ణయించుకొని చేస్తున్న ఈ ఉత్సవాలను ఆపడం సాధ్యం కాదంటూ నిర్వాహకులు తెగేసి చెప్పారు. దాంతో, ఉత్సవాలైతే ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నాయి కానీ, అనేక ఇగో సమస్యలు, అంతర్గత విభేదాలున్న పలువురు సినీ తారలు మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నట్లు ఇప్పటి దాకా అందుతున్న సమాచారం. 
 సినిమా ఉత్సవాల్లో అక్కినేని పుట్టినరోజు వేడుకలను కలపడాన్ని కూడా కొన్ని వర్గాల వారు వ్యతిరేకించారు. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వర్గం కూడా ఈ ఉత్సవాల పట్ల అంతగా ఆసక్తిని చూపడం లేదని కృష్ణానగర్‌ వర్గాల కథనం. దాంతో, ఈ ఉత్సవాల్లో 22న జరిగే తెలుగు వేడుకల్లోనూ, ఆ తరువాత మన వాళ్ళలో ఎంతమంది, ఏ మేరకు పాలుపంచుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. 

- రెంటాల జయదేవ 
(Published in 'Prjasakti' daily, 21 Sept 1002, Saturday, pageNo. 8)
.........................................................................................


Friday, December 17, 2010

‘3 ఇడియట్స్’లో విజయ్ లేడోచ్! మహేశ్ అయినా ఉన్నాడా?



ఆమిర్ ఖాన్ నటించగా హిందీ చిత్రసీమలో సంచలనాత్మక విజయం సాధించిన ‘3 ఇడియట్స్’ తెలుగులోకీ, తమిళంలోకీ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘రోబో’ ఫేమ్ శంకర్ దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మిస్తున్న ఈ రెండు భాషల రీమేక్ చిత్ర కథ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పుడే అందిన తాజా వార్త... ఆ చిత్ర తమిళ రీమేక్ లో హీరో విజయ్ నటించడం లేదహో.....

నిజానికి, ఈ రీమేక్ చిత్రంలో తమిళంలో విజయ్, తెలుగులో మహేశ్ బాబు నటించాల్సి ఉంది. కానీ, సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందే తమిళ హీరో విజయ్ కూ, దర్శకుడు శంకర్ కూ భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. విగ్ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదని కూడా కోడంబాకమ్ కబురు. మొత్తం మీద ఈ చిత్రంలో విజయ్ ఉన్నాడనీ, లేడనీ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తమ సినిమాలో విజయ్ నటించడం లేదని తేల్చి చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చింది. హీరో విజయ్, తాము ఎంతో సామరస్యపూర్వకంగానే విడిపోయామనీ, ఇప్పుడు 3 ఇడియట్స్ తమిళ రూపం కోసం మరో హీరోను వెతుకుతున్నామనీ తెలిపింది. అన్నట్లు మరో అగ్ర తమిళ హీరోను ఆ పాత్రలో నటింపజేసేందుకు నిశ్చయించుకున్నారు. ఆ నటుణ్ణి ఇప్పటికే సంప్రతించారు కూడా. సదరు అగ్ర హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆ హీరో సూర్య అని కోడంబాకమ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

తమిళ రీమేక్ రూపం మాట అటుంచితే, తెలుగు రీమేక్ వ్యవహారం కూడా అంత సజావుగా సాగుతున్నట్లు లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారవుతున్న ‘దూకుడు’ చిత్రంతో బిజీగా ఉన్న హీరో మహేశ్ బాబు ఈ ‘3 ఇడియట్స్’ కు డేట్లు సర్దలేక సతమతమవుతున్నట్లు కృష్ణానగర్ కబురు. ఆయన ఏకంగా ఈ సినిమాకు గుడ్ బై చెప్పేశాడని కూడా అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఆ సంగతేదో అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అప్పటి దాకా మనకు సస్పెన్సే.

Friday, October 1, 2010

మేకప్ కి మూడు కోట్లా...? ఆడియోకు 8 కోట్లా..?

(‘ఒక రోబో - ఎన్నో కథలు’ - 2వ పార్ట్)

* రోబో చిత్ర సెట్ల విషయానికి వస్తే - ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా కళా దర్శకుడు సాబూ శిరిల్ చాలా కష్టమే పడ్డారు. ఈ సినిమా కోసం దాదాపు 35కు పైగా వేర్వేరు రకాల సెట్లు వేశారు. పతాక సన్నివేశంలోని సెట్ కోసమే దాదాపు 5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు భోగట్టా. అయితే, అన్నీ పర్యావరణ అనుకూలమైన పదార్థాలతో రూపొందించిన సెట్లే కావడం విశేషం. ఈ సినిమా కోసం కొత్త రకం హెలికాప్టర్లనూ, ఎయిర్ ఫోర్స్ విమానాలనూ ఆయన రూపొందించారు. ఇక, కిలిమంజారో.... అనే పాట కోసం అద్భుతమైన సెట్ వేశారు.

* ఈ సినిమాలో మొత్తం 6 పాటలుంటే, వాటిలో ఒక పాటను సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతీజా పాడడం విశేషం. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలసి ఆ చిన్నారి టైటిల్ సాంగ్ పాడింది. ‘‘ఆ పాట రికార్డు చేసేసరికి అర్ధరాత్రి దాటింది. నా కోసం ఆ పాట రికార్డు చేశాక, మరునాడు మా పాప బడికి వెళ్ళలేకపోయింది’’ అని రెహమాన్ ఆ మధ్య వెల్లడించారు.

* ఈ చిత్రం తమిళ ఆడియో రైట్లను థింక్ మ్యూజిక్ సంస్థ చేజిక్కించుకుంది. అందు కోసం ఆ సంస్థ చెల్లించిన మొత్తం అక్షరాలా 8 కోట్ల రూపాయలు. ఓ దక్షిణ భారతీయ సినిమా ఆడియో హక్కులు ఇంత భారీ మొత్తానికి అమ్ముడు కావడం ఇదే ప్రథమం.

* ప్రభుదేవా, రాజు సుందరం, లారెన్స్ రాఘవేంద్రలు ఈ సినిమాలోని వేర్వేరు పాటలకు నృత్య రీతులు సమకూర్చారు. రెండు పాటల చిత్రీకరణకే రూ. 30 కోట్లు ఖర్చయిందని యూనిట్ వర్గాలు చెబుతున్న మాట.

* ఇంతకీ ఈ సినిమాలో రజనీకాంత్ మేకప్ కే అక్షరాలా రూ. 3 కోట్లు ఖర్చయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. అంటే, ఓ చిన్న తెలుగు సినిమా బడ్జెట్ అన్నమాట.

* ఈ సినిమాను వియన్నా, పెరూలోని మచూ పిచూ, అమెరికా, బ్రెజిల్ లాంటి వేర్వేరు దేశాల్లో చిత్రీకరించారు. మనదేశంలో కూడా చెన్నైలోని వివిధ ప్రాంతాలతో పాటు రాయవెల్లూరు, పుణే, కులూమనాలి, గోవాలలో చిత్రీకరణ సాగింది.

* సినిమా కన్నా ముందు ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా తమిళనాట పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. తిరుచ్చిలో తొలిసారిగా రోబో (యంతిరన్) ట్రైలర్ ప్రదర్శిస్తుంటే, నిర్ణీత సమయాని కన్నా దాదాపు మూడు గంటల ముందు నుంచే అభిమానులు సినిమా హాలు బయట నిరీక్షించారు.

* ఇక, తూత్తుకుడిలో అయితే, ట్రైలర్ రీలును ఉన్న బాక్సును ఏనుగు అంబారీ మీద పెట్టి, బ్యాండు మేళాలతో పట్నమంతా ఊరేగించారట. కోయంబత్తూరులో రథంలో పెట్టి తిప్పారట. చెన్నైలో రజనీకాంత్ కటౌట్లకు అభిమానులు పాలాభిషేకాలు, హారతులు ఇవ్వడం సరేసరి. సినిమా విడుదల రోజు కూడా ఇలాంటి హంగామాకు మనం సిద్ధంగా ఉండాల్సిందే!

Thursday, September 30, 2010

ఒక ‘రోబో’! ఎన్నో కథలు!!



రేపే విడుదల కానున్న రజనీకాంత్ - శంకర్ ల ‘రోబో’ గురించి ఇప్పటికే ఎంతో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా గురించి రోజుకో విశేషం, విచిత్రం తెలుస్తూనే ఉన్నాయి.

* మరి కొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రం దాదాపు రూ. 150 – 160 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందింది. ఆ రకంగా అత్యధిక బడ్జెట్ తో తయారైన చిత్రం ఇదేనని రోబో యూనిట్ ఢంకా బజాయిస్తోంది.

* సన్, జెమినీ వగైరా టీవీ చానళ్ళన్నిటికీ మాతృ సంస్థ అయిన సన్ టీవీ నెట్ వర్క్ తమ సినిమా విభాగమైన సన్ పిక్చర్స్ ద్వారా ఇప్పటికే అనేక తమిళ చిత్రాల హక్కులను విడుదలకు ముందు పొందారు. వాటిని విడుదల చేశారు. అయితే, నిర్మాణ దశలోనే ప్రాజెక్టు మొత్తాన్నీ చేపట్టి, తామే స్వయంగా సినిమాను నిర్మించడం సన్ పిక్చర్స్ కు ఇదే మొదలు. సో, వారికి ఇదే మొదటి స్వీయ నిర్మాణ చిత్రమన్నమాట.

* తమిళంలో ఈ యంతిరన్ అలియాస్ రోబోయే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా.

* కథ సంగతికొస్తే - సమాజానికి ఉపయోగపడే రోబో (మరమనిషి)ని తయారు చేస్తాడు ఓ శాస్త్రవేత్త. పైగా, అచ్చంగా తన పోలికలతోనే, మనిషిలా ప్రవర్తించేలా చూస్తాడు. తీరా ఆ రోబో దేశద్రోహుల చేతిలో పడుతుంది. అప్పుడు ఆ శాస్త్రవేత్త ఏం చేశాడన్నది మిగతా సినిమా.

* రజనీకాంత్ అటు రోబోగా, ఇటు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రోబో రజనీకి జంటగా వైద్య పరిశోధక విద్యార్థిగా ఐశ్వర్యారాయ్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథలోని అంశాలన్నీ 2020 కాలం చుట్టూ తిరుగుతాయి.

* అయితే, ఇది ఎప్పటి లాంటి రజనీకాంత్ స్టయిల్స్ తో నిండిన సినిమా కాదని యూనిట్ సభ్యులు చెప్పారు. ‘‘మామూలు రజనీకాంత్ సినిమాల లాగా ఇది ఉండదు. రజనీ తరహా స్టయిల్, పంచ్ డైలాగులు ఇందులో ఉండవు. అయితేనేం, రజనీకాంత్ సినిమా కెరీర్ లోనే ఇది అత్యుత్తమ చిత్రం’’ అని రజనీకాంత్ ను రెండు విభిన్న పాత్రల్లో అందంగా చూపిన సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ (యూనిట్ అంతా ఈయనను ముద్దుగా ర్యాండీ అని పిలుస్తారు) చెప్పారు.

* మామూలుగా సినిమాలకు వాడే సాంప్రదాయిక లైటింగ్ విధానానికి భిన్నంగా ఈ సినిమా మొత్తంలో కొత్తరకం లైటింగ్ పద్ధతిని వాడారు. పైపెచ్చు, రజనీ 3డి దృశ్యాలను తీయడానికి ఈ సినిమాలో తొలిసారిగా డోమ్స్ లైట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే దృశ్యంలో శాస్త్రవేత్తగా, రోబోగా రజనీకాంత్ కనిపిస్తున్నప్పుడు రెండు పాత్రల శరీర ఛాయకూ జత కుదిరేలా లైటింగ్ చేశారట.

‘‘రోబో రజనీకాంత్ దృశ్యాలను విడిగా తీశాం. శాస్త్రవేత్త రజనీ దృశ్యాలను మరోసారి తీశాం. కానీ, రెండూ సరిగ్గా నప్పేలా లైటింగ్ చేశాం’’ అని రత్నవేల్ చెప్పారు. కేవలం లైటింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికీ, తీస్తున్న ప్రతి షాట్ లోని సాంకేతిక పరామితులను నోట్ చేసుకోవడానికే రత్నవేలు దగ్గర ఓ ప్రత్యేక అసిస్టెంట్ పనిచేశారు. ఈ మొత్తం సినిమా కెమేరా రిపోర్టే దాదాపు 1600 పేజీలు వచ్చింది.

* ఇక, ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 40 శాతం స్పెషల్ ఎఫెక్ట్ లకే ఖర్చు చేశారు. ఈ సినిమాలో రోబో కోసం వాడాల్సిన యానిమేట్రానిక్స్ టెక్నాలజీ కోసం దర్శకుడు శంకర్ ప్రపంచ ప్రసిద్ధ స్టాన్ విన్ స్టన్ స్టూడియోస్ ను ఆశ్రయించారు. అలాగే, హాంగ్ కాంగ్ కు చెందిన కంప్యూటర్ గ్రాఫిక్స్ నిపుణులను కూడా వినియోగించారు. ఆ స్టాన్ విన్ స్టన్ స్టూడియో వారి యానిమేట్రానిక్స్ టెక్నాలజీని వాడిన తొలి భారతీయ చిత్రం రోబోయే. జురాసిక్ పార్క్, ప్రిడేటర్, టెర్మినేటర్, ఇరన్ మ్యాన్, ఇటీవలి అవతార్ లాంటి పలు చిత్రాలలో అద్భుతమైన పనితనం చూపింది ఈ స్టూడియోయే.

* అలాగే, జాకీ చాన్ కు సైతం దర్శకత్వం వహించి, మ్యాట్రిక్స్, కిల్ బిల్ చిత్రాల సీక్వెల్స్ కు పనిచేసిన యాక్షన్ దృశ్యాల రూపకర్త యూయెన్ వూ పింగ్ ఈ రోబో చిత్రానికి స్టంట్ కో-ఆర్డినేటర్ గా పనిచేశారు.

* అన్నట్లు ఈ సినిమా కోసం రజనీ దాదాపు 55 పైచిలుకు కాస్ట్యూమ్ లలో కనువిందు చేస్తారు. ఐశ్వర్యా రాయ్ కూడా అందుకు తగ్గకుండా 57కు పైగా కాస్ట్యూమ్ లలో కనిపిస్తుంది. మెన్ ఇన్ బ్లాక్ లాంటి హాలీవుడ్ చిత్రాల సిరీస్ కు పనిచేసిన మేరీ ఇ. వోగ్ట్ అనే మహిళ ఈ కాస్ట్యూమ్ విభాగానికి పర్యవేక్షణ జరిపారు. భారతీయ సినిమా పరిశ్రమలో పనిచేయడం ఆమెకూ ఇదే మొదటి సారి.

(మరికొన్ని విశేషాలు తరువాతి టపాలో... మరికొద్ది సేపట్లో... )

Saturday, September 18, 2010

'రోబో' వాయిదా కథేంటి?



మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ సినిమా అభిమానుల నిరీక్షణ మరికొన్నాళ్ళు పెరిగింది. రజనీకాంత్ - శంకర్ ల కలయికలో జనమంతా ఎదురుచూస్తున్న 'రోబో' చిత్రం విడుదల అక్టోబర్ 1కి వాయిదా పడింది. ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థ ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సరిగ్గా మరో వారం రోజుల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా, సెప్టెంబర్ 17 శుక్రవారం చీకటి పడ్డాక చల్లగా ఈ వార్తను తెలిపింది.

".... ఈ ఏడాదిలో జనమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'యంతిరన్ ' ('రోబో') చలనచిత్రం..." అక్టోబర్ 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్నట్లు సన్ పిక్చర్స్ ఆ ప్రకటనలో తెలిపింది. "భారత్ లోనే కాక, అమెరికా, బ్రిటిన్, ఐరోపా, మలేసియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో అదే రోజున సినిమా విడుదల అవుతుంద"ని పేర్కొంది.

చడీచప్పుడు లేకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రకటనతో మీడియా ఒక్కసారిగా మేల్కొంది. వివిధ రకాల వార్తా కథనాలు, టీవీ ఇంటర్వ్యూల కోసం సన్నద్ధమవుతున్న సమాచార సాధనాలు గబగబా అసలు విషయం కనుక్కునేందుకు ప్రయత్నించాయి. విలేఖరులు ఆగకుండా ఫోన్లలో మాట్లాడడం మొదలైంది. అయితే, విడుదల వాయిదాకు కచ్చితమైన కారణాలు అధికారికంగా వివరించడానికి నిర్మాణ వర్గాల వారెవరూ అందుబాటులోకి రాలేదు.

ఎవరి సంతకమూ లేకుండా, కేవలం ఆఫీసు ముద్రతో 'సన్ పిక్చర్స్' లెటర్ హెడ్ మీద వచ్చిన ప్రకటన మినహా మరే సమాచారమూ అందలేదు. ఇప్పటి దాకా చిత్రాల పంపిణీలోనే ఉన్న సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఇదే తొలి చిత్రం. సన్ టి.వి, జెమినీ టివి, ఉదయ టి.వి. తదితర తమిళ, తెలుగు, కన్నడ భాషా టీవీ చానళ్ళతో దక్షిణాదిన తిరుగులేని సంస్థగా ఎదిగిన సన్ టి.వి. నెట్ వర్క్ లిమిటెడ్ కు చెందిన ఓ విభాగమే - సన్ పిక్చర్స్. వీటన్నిటికి అధినేత అయిన కళానిధి మారన్ ఎప్పటి లానే ఈ సారి కూడా మీడియాకు దూరంగా ఉన్నారు.

'రోబో'చిత్ర నిర్మాత అయిన కళానిధి మారన్ అలా దూరంగా ఉంటే, ఆయన మిత్రుడూ - 'రోబో' చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాత అయిన హన్స్ రాజ్ సక్సేనా సైతం ఈ ప్రకటనపై సంతకం పెట్టకపోవడం గమనార్హం. ఇటీవల మద్రాసులో ఓ పెద్ద హోటల్ పై సన్ టీవీ అధినేత దాడి జరిపించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ దాడిలో కళానిధి పక్షాన చక్రం తిప్పింది ఈ మిత్రుడేనని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఆ కారణంగానే కొద్దిరోజులుగా సక్సేనా ఎవరికీ అందకుండా ఉండిపోయారని కోడంబాకమ్ కబురు.

నిజానికి, 'రోబో' సెప్టెంబర్ 24 రిలీజవుతుందని రజనీకాంత్ గత పక్షంలో తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. సన్ పిక్చర్స్ వర్గాలు సైతం ఆ తేదీని ఖరారు చేస్తూ, అధికారికంగా ప్రకటించాయి. ఆ పైన సినిమా ట్రైలర్ విడుదలప్పుడూ ఆ తేదీనే చెప్పాయి. దాంతో, ఇప్పటికే మద్రాసు లాంటి చోట్ల దాదాపు 30కి పైగా హాళ్ళలో 'రోబో' విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. తీరా సినిమా టికెట్లకు అడ్వాన్ బుకింగ్ మొదలయ్యే తరుణంలో కథ ఇలా మలుపు తిరిగింది.

సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాలేదనీ, అందుకే ఈ వాయిదా అనీ కొందరు చెబుతున్నారు. కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ తో సహా అన్ని పనులూ ఇప్పటికీ పూర్తయ్యాయనీ, సెన్సార్ కు కూడా సినిమా సిద్ధమైందనీ అభిజ్ఞ వర్గాలను ఉట్టంకిస్తూ ఇప్పటికే వార్తలు వచ్చేశాయి. అసలు 'రోబో' సెన్సార్ కూడా అయిపోయిందనీ, కట్స్ ఏమీ లేకుండా, అందరూ చూడవచ్చంటూ యు (యూనివర్సల్) సర్టిఫికెట్ ఇచ్చారనీ కూడా ఇవాళ ఓ అనధికారిక వార్త వెలువడింది. మరి, అలాంటప్పుడు సినిమా విడుదల ఎందుకు వాయిదా వేసినట్లు? 'రోబో' విషయంలో ఇది ప్రస్తుతానికి అంతుచిక్కని మిస్టరీ! అక్షరాలా 150 – 160 కోట్ల రూపాయల విలువైన ప్రశ్న!!

Friday, September 17, 2010

వాయిదా పడ్డ రజనీకాంత్ 'రోబో'



ఇప్పుడే అందిన వేడి వేడి తాజా వార్త - అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దర్శకుడు ఎస్. శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కలయికలోని 'రోబో' (తమిళంలో 'యంతిరన్') చిత్రం విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా ఈ సెప్టెంబర్ 24 (శుక్రవారం) నాడు విడుదల కావాల్సింది. కానీ, ఇప్పుడు ఈ చిత్రం విడుదలను అక్టోబర్ 1వ తేదీ (శుక్రవారం)కి వాయిదా వేశారు. ఈ వార్తను అశేష అంతర్జాల సినీ అభిమానులతో పంచుకోవడానికే ఈ తక్షణ టపా.

(మరిన్ని వివరాలు మరికొద్ది సేపట్లో తరువాతి టపాలో....)

Thursday, September 16, 2010

పెరిగిన ఆసక్తి - సినిమా ట్రైలరా మజాకా!

చీకటి దివాణంలో తెరపై వెలుగు నింపే దృశ్యాలు చూడడం ఎవరికైనా ఓ మరపురాని అనుభవం. ముఖ్యంగా సినిమా తప్ప, ఇవాళ్టి టీవీ వగైరా వినోద సాధనాలు, ఆధునిక సాంకేతికత లేనప్పుడు అదే ఓ మహేంద్రజాలం. అందుకే, అప్పట్లో సినిమాలే కాదు, సినిమాకు ముందూ, సినిమా మధ్యలో విశ్రాంతి సమయంలో హాల్లో చూపించే ట్రయల్ పార్టీలు (తప్పొప్పుల సంగతి తెలియని చిన్నప్పుడు అలానే పిలిచేవాళ్ళం) కూడా ఓ ఉద్విగ్నభరిత అనుభవం.

పైపెచ్చు, రాబోయే సినిమాలకు ముందుగానే ట్రైలర్ సిద్ధం చేసి, హాళ్ళలో ప్రదర్శించేవాళ్ళు. మనం కూడా వాటిని చూసి ఆనందించేవాళ్ళం. అసలు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళం.

కానీ, ఇటీవల కాలంలో హాలీవుడ్, హిందీ చిత్రాలను మినహాయిస్తే, తెలుగు సినిమాల ట్రైలర్లు రావడం బాగా తగ్గింది. కాగా, తాజా 'రోబో ' సినిమా కోసం ఓ చిన్న ట్రైలర్ ఈ మధ్యనే తమిళంలో విడుదల చేశారు. సోమవారం నుంచి తెలుగులో కూడా ఆ ట్రైలర్ చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే అది ఓ అద్భుతం.

ట్రైలర్ చూడక ముందు వరకు నా మనసులో ఏ మూలో సినిమా గురించి కొద్దిగా సంశయం ఉంది. కానీ, ట్రైలర్ చూశాక షాక్ కొట్టినట్లయింది. భారీతనానికి శంకర్ సినిమాలు పెట్టింది పేరు. కానీ, ఈ సైన్స్ - ఫిక్షన్ కథ ట్రైలర్ చూస్తుంటే, నిజంగానే ఏ హాలీవుడ్ సినిమా ట్రైలరో చూస్తున్నట్లు అనిపించింది. చిరు గడ్డం, ఒత్తయిన జుట్టుతో సైంటిస్టు పాత్రలో రజనీ అందంగా కనిపించాడు. తెరపై మళ్ళీ రజనీకాంత్ ను చూసి జనం కేరింతలు కొడుతున్నారు. మొత్తానికి, సెప్టెంబర్ 24 కోసం నిరీక్షణ పెరిగిపోయింది. నాకైతే చిన్నప్పుడు ట్రైలర్లు చూపిన ‘ఎపటైజర్ ఎఫెక్ట్’ మరోసారి గుర్తుకొచ్చింది.