జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 30, 2010

మన వాళ్ళు ఇలాంటి సినిమా తీయరేం..?




ఇటీవల తమిళంలో 'మదరాస పట్టిణం' అనే ఓ సినిమా వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది కాలం ముందు నాళ్ళ నేపథ్యంలో రూపొందిన కల్పిత కథ అది. దానికి అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, దాని రాజధాని మద్రాసు వేదికలు. అలా అరవై ఏళ్ళ వెనక్కి తీసుకువెళ్ళి, అప్పటి మద్రాసు పట్టణం రూపురేఖలను చూపే ప్రయత్నం ఈ సినిమాలోని ప్రత్యేకత. కథాంశం తెలియకపోయినా, కథా నేపథ్యం తెలుసు కాబట్టి, విడుదలకు ముందు నుంచి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా సినిమా విడుదలై నెల రోజులు దాటినా, రకరకాల కారణాల వల్ల 'మదరాస పట్టిణం' చూడడం కుదరలేదు.

ఎట్టకేలకు గత వారం ఆ సినిమాకు వెళ్ళగలిగాను. లండన్ లోని ఓ ముసలావిడ మనస్సు అటు గతానికీ, ఇటు వర్తమానానికీ మధ్య తారట్లాడుతుండగా ఈ సినిమా కథ మొత్తం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ ముసలావిడ ఓ బ్రిటిషు గవర్నర్ కూతురు. మద్రాసు నగరానికి వచ్చిన ఆ యువతి, అక్కడి రజకుల పేటకు చెందిన ఓ కుర్రాణ్ణి (తెలుగు చిత్రం వరుడులో విలన్ ఆర్య) చూసి, ప్రేమలో పడుతుంది. కుస్తీ యోధుడు కూడా అయిన ఆ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ మధ్య ప్రేమ కథ నడుస్తుంది. దాన్ని అంగీకరించని గవర్నర్... ఆ అమ్మాయితో పెళ్ళికి నిశ్చితార్థం కూడా అయిన ఓ బ్రిటిషు పోలీసు అధికారి.... - ఇలా రకరకాల పాత్రల మధ్య కథ జరుగుతుంది. చివరకు 1947 ఆగస్టు 14 నాటి రాత్రి దేశానికి స్వాతంత్ర్యం వస్తున్న వేళ జరిగే గొడవ మధ్య ఆ ప్రేమ జంట అనూహ్యంగా విడిపోతుంది. ఆ తరువాత ఇంగ్లండ్ వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ ఇన్నేళ్ళకు భారత్ కు తిరిగి వచ్చిందన్నమాట. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనలు మిగతా సినిమా.

'ఈ సినిమా కథలో, కథనంలో లోపాలు లేవా?' అంటే బోలెడు ఉన్నాయి. కురిసే వాన కోసం రజక పేటలో ఆనంద నృత్యం, బ్రిటిషు అధికారికీ, భారత యోధుడికీ మధ్య కుస్తీ పోటీ లాంటి సన్నివేశాల్లో హిందీ హిట్ 'లగాన్' ప్రభావమూ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, కథాకాలం నాటి వాస్తవిక సామాజిక పరిస్థితికి ఈ సినిమా ఏ మేరకు దగ్గరగా ఉందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ముగింపు కూడా అర్ధంతరమనే అనిపిస్తుంది.

మరి, 'ఇంతకీ ఆ సినిమా గురించి ఎందుకు చెబుతున్నట్లు?' అంటారా! ఎందుకంటే, ఈ సినిమా కోసం కొన్ని వందల మంది సాంకేతిక నిపుణులు చేసిన కృషి కోసం! 60 ఏళ్ళ పైచిలుకు క్రితం నాటి మద్రాసును మళ్ళీ తెరపై పునఃసృష్టించడం కోసం వారు పడ్డ శ్రమ కోసం! కళా దర్శకుడు వి. సెల్వకుమార్ ప్రతిభ కోసం! కథా నేపథ్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన గ్రాఫిక్స్ ను అద్భుతంగా ఉపయోగించుకున్న తీరు కోసం! ఛాయాగ్రాహకుడు నీరవ్ షా పనితనం కోసం!! .... ఇవన్నీ ఆ సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.

విజయ్ అనే ఓ నూతన దర్శకుడు ధైర్యంగా ఇలాంటి నేపథ్యంలో కథను అల్లుకోవడం, నిర్మాతలు కూడా సాహసించి చిత్రం నిర్మించడం చూస్తే మనకు ముచ్చటేస్తుంది. అందుకు చేసిన పరిశోధనకు ఆనందం అనిపిస్తుంది. ఆలోచనా దారిద్ర్యం లేకపోవడం, దేశవాళీ తరహాలో తెరపై కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించాలని అనుకోవడం, ఫార్ములా కథల ఏటికి ఎదురీదడం... వీటన్నిటికీ కలిపిమెచ్చుకోవాలనిపిస్తుంది. సెక్సీ పాటలు కానీ, వీరబాదుడు పోరాటాలు కానీ లేకుండా సినిమా తీసినందుకైనా అభినందించాలనిపిస్తుంది. మన సగటు తెలుగు సినిమాల్లో ఉపయోగం కన్నా దురుపయోగం ఎక్కువ జరిగే డిజిటల్ ఇంటర్ మీడియట్ (డి.ఐ), విజువల్ ఎఫెక్టుల లాంటి వాటిని కథకు ఎలా మూలస్తంభాలుగా వాడవచ్చో ఈ సినిమా చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన తెలుగులో రావడం లేదేమని బాధ పడాలనిపిస్తుంది. ఇంకా మనం ఆరు పాటలు, ఆరు ఫైట్ల రోజుల్లోనే ఉన్నందుకు సిగ్గు పడాలనిపిస్తుంది.

'లగాన్, టైటానిక్' లాంటి సినిమాల ప్రభావం ఈ సినిమా మీద ఉందని కొందరు తక్కువ చేయవచ్చు. నిజమే. కానీ, ఆ సినిమాలు మనవాళ్ళూ చూశారుగా! ఆ ప్రేరణతోనైనా మనం కథలెందుకు అల్లలేకపోయాం? సినిమాలెందుకు తీయలేకపోయాం? 400 ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ మొదలు దశాబ్దాల చరిత్ర ఉన్న మన పట్టణాల నేపథ్యంలో మనకున్న కథలు, చారిత్రక గాథలనైనా తెరకెక్కించేందుకు ప్రయత్నించనైనా ప్రయత్నించామా? లేదే!! ఇలాంటి సినిమాలు పక్క రాష్ట్రాల్లో వచ్చినప్పుడైనా మనవాళ్ళు కళ్ళు తెరుస్తారంటారా?!

పి.ఎస్. - అన్నట్లు ఈ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి అనువాదమవుతోందట. పాత మద్రాసునూ, ఊళ్ళో అప్పటి ట్రామ్ ప్రయాణాలనూ, (ఇప్పుడు మురుగు కాలువగా మారిన అప్పటి అందమైన కూవమ్ నదిలో) ఆహ్లాదభరిత నదీ విహారాలనూ తెరపైనే చూడగలిగే ఈ తరానికి ఇది ఓ కనువిందు. ఆ తరం మద్రాసు ప్రేమికులకు ఓ నోస్టాల్జియా. సినిమా ముందు, సినిమా చివర టైటిల్స్ లో చూపే మద్రాసు రేఖా చిత్రం, అప్పటికీ ఇప్పటికీ మద్రాసులోని ప్రధాన ప్రాంతాల్లో వచ్చిన మార్పును ప్రతిఫలించే పాత, కొత్త ఫోటోలు చూడడం మిస్ కాకండేం!!

Saturday, August 28, 2010

ఇప్పుడిక నేరుగా శిర్దీకే!



(ఫోటో - శిర్దీలో సాయిబాబా)

ఎన్నో ఏళ్ళ కల ఇప్పటికి తీరింది. ఎందరికో ఆరాధ్యదైవమైన సాయిబాబా నడయాడిన పవిత్ర శిర్దీ ప్రాంతానికి ఇప్పుడు నేరుగా రైలు వచ్చేసింది. ఇప్పటి దాకా శిర్దీకి దగ్గరలోని మన్మాడ్ వరకే రైలులో వెళ్ళగలిగేవాళ్ళం. అక్కడ నుంచి బస్సులోనో, వేరే బండిలోనే శిర్దీకి వెళ్ళాల్సి వచ్చేది. కానీ, ఆగస్టు 27 శుక్రవారం నాటి నుంచి శిర్దీ సైతం భారతదేశపు రైల్వే పటంలోకి వచ్చేసింది. తాజాగా ముంబయ్ తో శిర్దీని కలుపుతూ, వారానికి మూడు సార్లు నడిచే ఓ సూపర్ ఫాస్ట్ రైలు బండి వేశారు.

శిర్దీలో తాజాగా ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ కు సాయినగర్ శిర్దీ అని పేరు పెట్టారు. ఈ కొత్త రైల్వే స్టేషన్ పుణ్యమా అని మన తెలుగునేల నుంచి నేరుగా శిర్దీకి వెళ్ళడానికి వీలు దొరికింది. ఇప్పటి దాకా సికింద్రాబాద్ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్, కాకినాడ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్, విజయవాడ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్ - ఇలా అన్ని రైలు బళ్ళూ మన్మాడ్ దాకానే నడిచేవి. భక్తుల సౌకర్యం కోసం ఈ రైలుబళ్ళన్నిటినీ సాయినగర్ శిర్దీ దాకా పొడిగిస్తున్నారు. అంటే, మన తెలుగు నేల మీద నుంచి శిర్దీకి వెళ్ళే లక్షలాది భక్తులు ఇక నుంచి నేరుగా తమ ఊళ్ళో రైలెక్కి, శిర్దీలోనే దిగవచ్చన్నమాట. బాబా భక్తులకు ఇది గొప్ప వరమే.

Friday, August 27, 2010

ప్రకాశ్ రాజ్ కు పిల్లలంటే ప్రేమే!



(ప్రకాశ్ రాజ్ విడాకుల వెనక కథ - 2)

నిజం చెప్పాలంటే, ప్రకాశ్ రాజ్ కు తన కుటుంబమంటే మహా ప్రాణం. పిల్లలంటే మరీను. చిన్నవాడైన కొడుకు చనిపోయినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి ఆ సీరియస్ నటుడు ఎంతో ఉద్వేగంతో ఈ వ్యాసకర్తకు ఓ సందర్భంలో వివరించారు. అలాగే, ఆ కొడుకును ఖననం (?) చేసిన వ్యవసాయ క్షేత్రానికి తరచూ వెళుతుంటానని కూడా ఆయన చెప్పారు.

మద్రాసులో తరచూ ప్రకాశ్ రాజ్ తన కుటుంబంతో కలసి ఏదో ఒక స్టార్ హోటల్ లో సేదతీరుతూ కనిపించేవారు. సరిగ్గా రెండున్నరేళ్ళ క్రితం, బహుశా పవన్ కల్యాణ్ చిత్రం జల్సా రిలీజ్ టైములో అనుకుంటా - మద్రాసు మౌంటు రోడ్డులోని పార్క్ హోటల్లో ప్రకాశ్ రాజ్ కుటుంబ సమేతంగా కనిపించారు. పోయిన కొడుకు పోగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఆయనకు తన పిల్లలంటే మహా ప్రాణం. యెన్ చెల్లం, యెన్ తంగం (నా బంగారు కొండ అని స్థూలంగా అర్థం) అని నేను, మరో మిత్రుడు (ఆయన సినిమాల్లో ఉన్నా, నన్ను స్నేహితుడిగానే ఎక్కువగా చూస్తారు) కూతుళ్ళను ముద్దు చేయడం చూశాం. ఎక్కడ కనిపించినా, నవ్వుతూ పలకరించే ప్రకాశ్ రాజ్ ఆ రోజు కూడా కాసేపు మాట్లాడారు.

మాతృభాష తుళుతో పాటు కన్నడం ఎలాగూ ప్రకాశ్ రాజ్ కు వచ్చు. ఇక, తమిళం, తెలుగు ఇత్యాది భాషలను వాటిలోని సాహిత్యం కూడా చదివేటంత బాగా నేర్చుకోవడం ఆయనలోని నిబద్ధుడైన నటుడికి గుర్తు. నటనలో ఆయన ఉద్దండుడు. అందులో సందేహం లేదు.

ప్రకాశ్ రాజ్ నటనలో జీవిస్తూ, ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పించడం ఒక ఎత్తు అయితే, నటించడానికి సమయానికి సెట్స్ కు రాకుండా దర్శక, నిర్మాతలను ఏడిపించడం మరో ఎత్తు. ఎంతో మంది దర్శక - నిర్మాతలు ఈ బాధ పడలేకే, ప్రకాశ్ రాజ్ చేయాల్సిన పాత్రలను కూడా ఆయనకు ఇవ్వడానికి వెనకాడుతున్నారు, వెనకాడుతుంటారు. ఆ మధ్య జాతీయ అవార్డుకు ఎంపికైన తమిళ చిత్రం కాంజీవరం సినిమాకు వెళ్ళినప్పుడు, ప్రకాశ్ రాజ్ చాలా ఆలస్యంగా వచ్చి, పాత్రికేయుల మన్నింపు కోరారు. సొంతంగా ఓ పట్టు చీర నేసి, కుటుంబానికి ఇవ్వాలని తపించే ఓ నేత గాడి పాత్రలో ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్ కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తారు. ఆయన సమయానికి సెట్ కు రావడం కష్టమైతే కావచ్చు కానీ, వచ్చిన తరువాత తాము అనుకున్నదానికి రెట్టింపు అభినయ ప్రతిభను ఆయన చూపిస్తారని దర్శక, నిర్మాతలకు తెలుసు. ప్రకాశ్ రాజ్ కోసం కొంతమంది ఎదురుచూసేది అందుకే.

ఓ పక్క వృత్తి జీవితంలో, మరో పక్క వ్యక్తిగత జీవితంలో విపరీతమైన ఆకర్షణ ఉన్న ప్రకాశ్ రాజ్ ఓ బాధ్యత గల తండ్రిగా తన కుమార్తెల విషయం పట్టించుకుంటారేమో చూడాలి. తండ్రీ, కూతుళ్ళ మధ్య బంధం చుట్టూ తిరిగే అభియుమ్ నానుమ్ (తెలుగులో ఆకాశమంత) కథను అంతగా ఇష్టపడ్డ ప్రకాశ్ నిజజీవితంలోనూ ఆ బంధాన్ని వదలరని అనుకోవచ్చేమో. తాజా పెళ్ళికి కుమార్తెలిద్దరూ రావడం అందుకు ఉదాహరణ కావచ్చేమో. వేచి చూడాలి.

Thursday, August 26, 2010

ప్రకాశ్ రాజ్ విడాకుల వెనక కథ!




(ఫోటో - ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి)

పిల్లల మీద, భార్య మీద ప్రేమ చూపే ప్రకాశ్ రాజ్ మొదటి పెళ్ళి విడాకుల దాకా ఎందుకు వెళ్ళిందన్నది ఆశ్చర్యకరమే. కాపురాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. బాలీవుడ్ నృత్య దర్శకురాలు పోనీ వర్మతో ప్రకాశ్ రాజ్ తాజా పరిచయం అందుకు దోహదం చేసినట్లయింది. అందుకే, ప్రకాశ్ రాజ్ మాజీ భార్య లలిత కుమారి ఆ మధ్య మాట్లాడుతూ, పోనీ వర్మతో ప్రకాశ్ కు ఉన్న బంధం గురించి తనకు తెలుసని ఒప్పుకున్నారు. వారి వైవాహిక బంధం సంతోషంగా దీర్ఘకాలం సాగాలని ఆకాంక్షించారు. సినీ కుటుంబంలో పుట్టిన లలిత కుమారి విడాకుల తరువాత మళ్ళీ సినిమాల్లో జీవితం వెతుక్కోసాగారు. ఒకటి రెండు తమిళ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మిగిలిన అన్ని విషయాల కన్నా ప్రస్తుతం తన కుమార్తెలిద్దరి భవిష్యత్తే ముఖ్యమని చెబుతున్నారు.

వాంటెడ్ (తెలుగు పోకిరికి హిందీ రీమేక్) రోజుల నుంచి ప్రకాశ్ రాజ్ కు, పోనీ వర్మతో స్నేహం ఉందని అభిజ్ఞవర్గాల భోగట్టా. వారి స్నేహం బలపడి, ప్రేమగా మారింది. తమిళ చిత్రం అభియుమ్ నానుమ్ (గత ఏడాది ఆకాశమంత... పేరిట కొన్ని జగపతిబాబు దృశ్యాల పునశ్చిత్రీకరణతో తెలుగులోకి అనువాదమైంది) అంటే ప్రకాశ్ రాజ్ కు బాగా ఇష్టం. అందుకే, అది వివిధ భాషల్లోకి వెళ్ళడానికి తోడ్పడ్డారు. ఆ చిత్ర కన్నడ రీమేక్ ప్రత్యేక స్ర్కీనింగ్ సందర్భంగా ప్రకాశ్, పోనీలు తొలిసారిగా జనం ముందు కనిపించారు. ఆ తరువాత ఆ బంధం మరింత బలపడింది. తాజాగా ప్రకాశ్ రాజ్ తమిళంలో నిర్మించిన ఇనిదు ఇనిదు (తెలుగు హిట్ హ్యాపీడేస్ కు రీమేక్) చిత్రానికి కూడా నృత్య దర్శకురాలిగా పోనీ వర్మ పనిచేశారు. లలిత కుమారితో విడాకులయ్యాక, చివరకు మొన్న ఆగస్టు 24న ప్రకాశ్, పోనీ ఓ ఇంటి వారయ్యారు. చిత్రం ఏమిటంటే, పంజాబీ శైలిలో ముంబయ్ లో జరిగిన ఆ పెళ్ళికి ప్రకాశ్ రాజ్ కుమార్తెలు కూడా హాజరైనట్లు వార్తలు వచ్చాయి.

(మిగతా భాగం మరి కాసేపట్లో....)

Wednesday, August 25, 2010

మళ్ళీ పెళ్ళికొడుకైన ప్రకాశ్ రాజ్!




(ఫోటో -- బొంబాయిలో పెళ్ళి వేడుకలో నటుడు ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ నృత్య దర్శకురాలు పోనీవర్మ)

ఎట్టకేలకు అనుకున్నంతా అయింది. కొన్ని నెలలుగా వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ సరికొత్త ప్రేమకథ చివరకు పెళ్ళి పీటల కెక్కింది. శ్రావణ పౌర్ణమి (రాఖీ) పండుగ శుభవేళ ఆగస్ట్ 24 ముంబయ్ లో జరిగిన వివాహ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మళ్ళీ పెళ్ళి కొడుకయ్యారు. ఎంతో కాలంగా తాను ఇష్టపడుతున్న బాలీవుడ్ యువ నృత్యదర్శకురాలు పోనీ వర్మ మెడలో కల్యాణ మాల వేశారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఎదురవడంతో ప్రకాశ్ రాజ్ ఆనందంగా కనిపించారట. మెడలో మంగళసూత్రం పడేసరికి పోనీ వర్మ కూడా హమ్మయ్య అని సంతోషించారు.

నిజానికి, నృత్య దర్శకురాలు పోనీవర్మతో కలసి ప్రకాశ్ రాజ్ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న వార్త చాలా రోజులుగా సమాచార సాధనాల్లో షికారు చేస్తూనే ఉంది. అయితే, అది అవునని కానీ, కాదని కానీ ఖండించే తీరిక, ఓపిక కూడా ఇటీవలి దాకా ఆ జంటకు లేకుండా పోయింది. ఇప్పటికే పెళ్ళయిన ముదురు గృహస్థు ప్రకాశ్ రాజ్ మటుకు తన మొదటి భార్యకు విడాకులిచ్చే పనిలో చాలా రోజులుగా బిజీగా ఉన్నారు. అటు ఆ విడాకుల సంగతి ఓ కొలిక్కి రాగానే, కొద్ది నెలల క ల్లా ప్రకాశ్ రాజ్ రెండో పెళ్ళికి రెడీ అయ్యారు. పోనీ వర్మ మెడలో తాళి కట్టారు.

ప్రకాశ్ రాజ్ కు గతంలో నటి - నర్తకి డిస్కో శాంతి చెల్లెలు లలిత కుమారితో పెళ్ళయింది. డిస్కో శాంతి భర్త హీరో శ్రీహరి. ఆ రకంగా, శ్రీహరి, ప్రకాశ్ రాజ్ తోడల్లుళ్ళు. ఏమయిందో కానీ, ప్రకాశ్ రాజ్ కాపురంలో కొన్నాళ్ళుగా కలతలు రేగాయి. ప్రకాశ్ రాజ్ కూ, తన చెల్లెలుకూ సయోధ్య కుదర్చడానికి డిస్కో శాంతి చాలా ప్రయత్నించారు. చివరకు శ్రీహరి కూడా రంగం మీదకు వచ్చి, జోక్యం చేసుకున్నట్లు భోగట్టా. కానీ, అవేవీ ఫలించలేదు. కొన్నేళ్ళుగా హాయిగా సాగుతూ వచ్చిన ప్రకాశ్ రాజ్ కాపురం చివరకు కోర్టుకెక్కింది. విడాకులతో ఆ జంట విడిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటనతోనూ, తమిళ చిత్రాల నిర్మాణంతోనూ ఖాళీ లేకుండా తిరిగే ప్రకాశ్ రాజ్, చివరకు పోనీ వర్మ ను పెళ్ళి చేసుకొని, ఇన్నాళ్ళూ గుసగుసలుగానే వినిపిస్తున్న సంగతిని బాహాటం చేశారు. ప్రకాశ్ రాజ్ కు మరోసారి పెళ్ళి శుభాకాంక్షలు. ఈ పెళ్ళయినా కాలాన్ని గెలిచి, అన్యోన్య దాంపత్యంగా నిలుస్తుందని ఆశిద్దాం.

Monday, August 23, 2010

నెట్ మాయాజాలం - వినిపిస్తున్నది వివేకానందుల స్వరమేనా?






(చికాగో సభ లో స్వామి వివేకానంద)

ఎటుచూసినా అవినీతి, అక్రమాలు తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో నవ తరానికి స్ఫూర్తి ప్రదాతలు కరవయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ యువతరానికి కొన్ని దశాబ్దాలుగా నిరంతరం స్ఫూర్తినిస్తున్న మహోన్నతుడు - స్వామి వివేకానంద. మహాసమాధి చెంది నూరేళ్ళు దాటినా, ఆయన ఇప్పటికీ చెరగని ప్రేరణ నిస్తున్నారు. ఈ నిరంతర చైతన్య దీప్తి ప్రబోధాలను చదివినా, విన్నా సరికొత్త ప్రేరణ కలగడం తరతరాలుగా కొన్ని కోట్ల మందికి అనుభవైకవేద్యం. పరోక్షంగానే ఇంతటి ప్రభావం చూపుతున్న వివేకానందుణ్ణి ప్రత్యక్షంగా చూస్తే.... కనీసం ఆయన ధీర గంభీర ప్రబోధాన్ని ఆయన గొంతులోనే వింటే.... ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేం.

స్వామి వివేకానంద స్వరం ఇటీవల ఇంటర్ నెట్లో మెయిల్స్ రూపంలో ప్రచారంలో ఉంది. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ....సోదర సోదరీమణులారా.... అంటూ స్వామీజీ చేసిన ప్రసంగం, ఆ సంబోధనతోనే సభికులందరూ ఆగకుండా కరతాళ ధ్వనులు చేయడం అందరికీ తెలిసిన విషయాలే. సరిగ్గా ఆ ప్రసంగమేనంటూ ఇప్పుడు మెయిల్సు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ ఉద్యమానికి చెందిన భక్తులు, వివేకానంద భక్తులు ఈ మెయిల్స్ చూశారు. అందులో స్వామీజీ స్వరం విన్నారు. మరి, ఆ గొంతు స్వామి వివేకానందునిదేనా అన్నది ప్రశ్న.

దీని మీద ఇటీవల ఎంతో చర్చ జరిగింది. రామకృష్ణ - వివేకానంద భక్తులు ఒకరు దీని మీద ఏకంగా లోతైన పరిశోధనే జరిపారు. నిజానిజాల నిగ్గుతేల్చారు.

1893 సెప్టెంబరు 11న చికాగోలో విశ్వమత సమ్మేళనం జరిగింది. భారతదేశం నుంచి ఓ స్వతంత్ర ప్రతినిధిగా వివేకానంద దానికి హాజరయ్యారు. నిజానికి, అప్పుడు స్వామీజీ ఆ ప్రసంగం చేసే నాటికి ఇప్పటి లాగా ఆడియో రికార్డింగు వసతులు లేవు. రామకృష్ణ మఠం భక్తులైన బెంగుళూరుకు చెందిన ఎం.ఎస్. నంజుండయ్య అది గమనించి, ప్రస్తుతం నెట్ లో ప్రచారంలో ఉన్న ఆడియో క్లిప్పింగుల పూర్వాపరాల్ని లోతుగా పరిశీలించారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో ప్రపంచ బ్యాంకులో దాదాపు 16 ఏళ్ళు పనిచేసి, ఉన్నత హోదాలు నిర్వహించిన ఆయన, అసలు 1893లో స్వామీజీ రికార్డింగులు ఏమైనా జరిగాయా అని విచారించారు. చికాగోలోని వివేకానంద వేదాంత సొసైటీకి చెందిన స్వామి చిదానంద ఈ విషయంపై విచారణలు జరిపి, అలాంటివేమీ జరగలేదని నంజుండయ్యకు తెలిపారు. అటుపైన సెయింట్ లూయీస్ లోని వేదాంత సొసైటీకి చెందిన స్వామి చేతనానంద సైతం ఈ విషయంపై తదుపరి విచారణ జరిపారు. చికాగో హిస్టారికల్ సొసైటీ (ఆర్కైవ్స్ అండ్ మ్యాన్యుస్క్రిప్ట్స్)తోనూ, వారి సలహా మేరకు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ తోనూ వివరాలు కనుక్కున్నారు. ఆ విచారణలో సైతం ఇలాంటి రికార్డింగులేవీ జరగలేదని తేలింది.

స్వామి వివేకానంద జరిపిన పాశ్చాత్య దేశాల సందర్శనలపై పరిశోధనలు జరిపిన మేరీ లూయిస్ బర్క్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. 1994 జనవరిలో ఆమె బేలూరు మఠాన్ని సందర్శించారు. ప్రస్తుతం రామకృష్ణ మఠం - మిషన్ల ప్రధాన కార్యదర్శి అయిన స్వామి ప్రభానందజీతో భేటీ అయ్యారు. అప్పుడు ఆమె కూడా ఇదే విధమైన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ నిర్ణీత కాలం నాటి అమెరికా చరిత్రపై ప్రత్యేక కృషి జరిపిన మరో ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయమే కాక, తన సొంత పరిశోధనల ప్రకారం కూడా విశ్వమత సభలో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపన్యాసం రికార్డింగు జరగలేదని ఆమె వివరించారు.

అయితే, నంజుండయ్య అంతటితో సంతృప్తి పడలేదు. చికాగో హిస్టారికల్ సొసైటీకి చెందిన పరిశోధక విభాగంతోనూ, చికాగోలోని ఆర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆర్కైవ్స్ తోనూ ఈ -మెయిల్ ద్వారా నేరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అలాంటి రికార్డులేవీ లేవని ఆ సంస్థలు తెలిపాయి. అసలు ఆ విశ్వ మత సమ్మేళన సమయంలో ఎలాంటి వాయిస్ రికార్డింగులూ జరగనేలేదని ఆర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆర్కైవ్స్ తెగేసి చెప్పింది.

ఆ మాటకొస్తే అప్పట్లో అందుబాటులో ఉన్న రికార్డింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. 1893 నాటికి అమెరికాలో ఎవరి గొంతైనా రికార్డు చేయాలంటే, ఆ మనిషి మాట్లాడుతున్న మాటల తాలూకు ప్రకంపనాలను తిరిగే స్తూపాకారపు వాటి మీదే నమోదు చేసేవారు. తిరిగే ఆ సిలిండర్లు సైతం 2 నుంచి 3 నిమిషాల పాటే రికార్డు చేయగలిగేవి. కాబట్టి దీర్ఘమైన స్వామీజీ ప్రసంగాన్ని రికార్డు చేయగలిగే అవకాశమే లేదు.

మరో సంగతి ఏమిటంటే, అప్పట్లో స్టూడియోల్లో రికార్డు చేయడానికి సైతం ఎంతో అవస్థ పడాల్సి వచ్చేది. ఇక, స్టూడియోలో కాకుండా బయట రికార్డు చేయడమనేది కలలో కూడా కుదరని పని. వీటన్నిటి దృష్ట్యా వివేకానందుని ఉపన్యాసం రికార్డయ్యే అవకాశం లేదని నంజుండయ్య తేల్చారు.

ఇక, ఇప్పుడు నెట్లో వినిపిస్తున్న ఆడియోలో వివేకానంద స్వామి చికాగోలో చేసిన తొలి ప్రసంగమే కాక, ఇతర ప్రసంగాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలసి చాలా నిమిషాలున్నాయి. అప్పట్లో అంతంత సేపు రికార్డు చేసే వీలే లేదు.

అంతేకాకుండా, ఆ రికార్డింగులో ఓ మహిళ, వివేకానంద స్వామిని సభకు పరిచయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. నిజానికి, చికాగో సభలో స్వామీజీని సభకు పరిచయం చేసింది - డాక్టర్ బారోస్ అనే పురుషుడు. మద్రాసుకు చెందిన అలసింగ పెరుమాళ్ అనే భక్తుడికి 1893 నవంబరు 2న వివేకానందే స్వయంగా లేఖ రాస్తూ, బారోస్ తనను సభకు పరిచయం చేసిన సంగతి చెప్పారు. దీన్నిబట్టి కూడా నెట్లో ఉన్నది తప్పని తేలుతోంది.

అలాగే, స్వామి వివేకానంద, ...సోదర సోదరీమణులారా... అని సంబోధించినప్పుడు రెండు నిమిషాల పాటు సభాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. కానీ, నెట్లో ప్రచారంలో ఉన్న ఆడియోలో ఆ హర్షధ్వానాలు కొద్ది సెకన్లే ఉన్నాయి. పైపెచ్చు, ఆ నాటి ఎడిసన్ సిలిండర్ రికార్డింగులను ఇన్నేళ్ళ తరువాత పునరుద్ధరించినా, అందులో కీచు కీచు శబ్దాలు వినిపిస్తాయి. ఒకవేళ ఆ శబ్దాన్ని తొలగించాలని ప్రయత్నిస్తే, రికార్డయిన మాట దెబ్బ తింటుంది. కానీ, నెట్లోని స్వరం ఈ శబ్దాలేమీ లేకుండా సుస్పష్టంగా ఉంది. వీటన్నిటిని బట్టి నెట్లో ప్రచారంలో ఉన్నది ప్రామాణికమైన రికార్డింగు కాదని తేలిపోతోంది.

వివేకానందుని వాణి అంటూ ఎవరిదో గొంతు వినిపించి, జనాన్ని మోసగించడానికి కొందరు చేసిన కుట్ర ఇది. దీన్నిబట్టి, కనిపించేది, వినిపించేదంతా నిజమని అనుకోకూడదని తేలుతోంది. నెట్లో చేసే మాయకు ఇది ఓ తాజా ఉదాహరణ. తస్మాత్ జాగ్రత్త.

Friday, August 13, 2010

మహా బోరు శీను!





రవితేజ సినిమా అంటే కాసేపు కాలక్షేపం గ్యారెంటీ అనుకొనే జనం చాలా మందే ఉన్నారు. అలా తెగే టికెట్ల మినిమమ్ గ్యారెంటీ చూసుకొనే - నిర్మాతలు రవితేజతో సినిమాకు ఉత్సాహం చూపిస్తుంటారు. బాల్కనీ నుంచి నేల దాకా ప్రతి తరగతి ప్రేక్షకుడిలోనూ అంతర్గతంగా ఉండే మాస్ లక్షణాన్ని ఆధారంగా చేసుకొనే రవితేజ చిత్రాల కథలల్లుతుంటారు. అందుకే, ‘ఏ’ నుంచి ‘సి’ దాకా అన్ని సెంటర్లలో రవితేజ చిత్రాలకు కనబడని క్రేజు.

అల్లరి చిల్లరిగా తిరిగే జులాయి తరహా కుర్రాడి పాత్రచిత్రణ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సరిపోతూ వచ్చింది. అందుకే, ఆయన సినిమాలన్నీ ఆ పద్ధతిలోనే సాగుతున్నాయి. అయితే, ఎల్లకాలమూ అదే మంత్రం పనిచేస్తుందని అనుకోవడానికి వీలు లేదు. దానికి తగిన కథ, కథనం లేకపోతే, ఆ పాచిక పారదు. అలాంటి పారని పాచికకు ఉదాహరణ - తాజా ‘డాన్ శీను.’

ఈ సినిమా ఓ పెద్ద కథ. మలుపు మీద మలుపుతో ఓ దశ దాటాక ప్రేక్షకుడికి చీకాకు తెప్పించే సుదీర్ఘమైన కథ. స్థూలంగా ఏమిటంటే - డాక్టరో, యాక్టరో కావాలనుకొనే వాళ్ళకు భిన్నమైన వాడు శీను. ‘డాన్’ కావాలన్నది చిన్నప్పటి నుంచి శీను ఆశ, ఆశయం. అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని అయిన శీను పెద్దయ్యాక నగరానికి వస్తాడు. నగరంలోని ఇద్దరు పెద్ద ముఠా నాయకులైన మాచిరాజు (శాయాజీ శిందే), నర్సింగ్ (శ్రీహరి)లలో ఎవరో ఒకరి దృష్టిని ఆకర్షించి, వాళ్ళలో ఏదో ఒక గ్రూపులో చేరాలనుకుంటాడు. ఆ క్రమంలో మాచిరాజు దగ్గర చేరతాడు.

విరోధి అయిన నర్సింగ్ ను దెబ్బతీయడానికి శీనూని జర్మనీకి పంపిస్తాడు మాచిరాజు. జర్మనీలో ఉన్న నర్సింగ్ చెల్లెల్ని శీనుతో ప్రేమలో పడేయించి, ఆ రకంగా నర్సింగ్ ను దెబ్బ తీయాలన్నది మాచిరాజు ప్లాను. అలా అక్కడ జర్మనీలో దీప్తి (శ్రియ)ను ప్రేమలో పడేయడానికి హీరో చేసే నానారకాల చేష్టలతో ఫస్టాఫ్ కాస్తంత వినోదాత్మకంగా గడిచిపోతుంది. తీరా, ఆమెతో అతను తిరిగొచ్చేసరికి ఆమె జర్మనీలోనే ఉండి చదువుకుంటున్న మాచిరాజు చెల్లెలని తెలుస్తుంది. అక్కడికి ఇంటర్వెల్.

ఆ తరువాత నుంచి కథ బోలెడన్ని మలుపులు తిరుగుతుంది. అటు మాచిరాజుతోనూ, ఇటు నర్సింగ్ తోనూ దోస్తీగా ఉంటూ, హీరో వారిని బోల్తా కొట్టిస్తుంటాడు. దుబాయ్ లో ఉండే బడా పారిశ్రామికవేత్త దుగ్గల్ (మహేశ్ మంజ్రేకర్), అతని విలన్ కొడుకుల కథ మరొకటి సమాంతరంగా నడుస్తుంటుంది. ఇంతకీ అసలు ఈ మాచిరాజు, నర్సింగ్ ల దగ్గరకు హీరో ఎందుకు వచ్చాడన్నది మరో బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాల ఫ్లాష్ బ్యాక్. చివరకు దుగ్గల్ వగైరా విలన్లపై హీరో చేసే క్లైమాక్స్ ఫైటుతో కథ కంచికి... మనం ఇళ్ళకి...

టామ్ అండ్ జెర్రీ కార్టూన్ పాత్రల తరహాలో ఒకరిని మరొకరు వెంటాడి, వినోదభరితంగా కష్టపెట్టే పాత్రచిత్రణ హిట్టయింది కదా అని ప్రతిసారీ ఆ దోవే తొక్కితే కష్టమే. గతంలో ఇదే రవితేజతో ‘కిక్’ సినిమా తీసిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత అయిన నిర్మాత వెంకట్ అనుకోకుండా ఆదరణకు నోచుకున్న ఆ సినిమాను ప్రాతిపదికగా చేసుకొని, రెండోసారి ఈ గందరగోళ కథను తెరకెక్కించారు. కోన వెంకట్ రచన చేసిన ఈ సినిమాలో ‘ఢీ’, ‘రెఢీ’ లాంటి ఆయన గత చిత్రాలు సహా అనేక ఇతర సినిమాల ఛాయలు ఇట్టే తెలిసిపోతుంటాయి. డాన్ సొంత చెల్లెల్ని అతనికి తెలియకుండా ప్రేమలో పెట్టడం లాంటివి అక్కడ చూసేసినవే.

ఇలాంటి పాత్రలు, రవితేజ వాటిని పోషించే తీరు ఇప్పటికి కొన్ని పదులసార్లు తెరపైకి వచ్చేసినవే. నిజజీవితంలో కూడా అమితాబ్ వీరాభిమాని అయిన రవితేజ ఆ తరహా స్టెప్పులు వేస్తున్నప్పుడు ఒడ్డూ పొడుగుతో అమితాబ్ ను గుర్తుకు తెస్తారు. ఈ సినిమా నుంచి ‘మాస్ రాజా’ అంటూ కొత్త పట్టంతో కనిపించిన రవితేజ ఆ మాట నిలబెట్టుకోవాలంటే, కథల ఎంపికలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. మొనాటనీని బ్రేక్ చేయకా తప్పదు.

చాలా రోజుల తరువాత తెలుగు తెరపై మెరిసిన శ్రియ - అందంలో, ఆకర్షణలో పాత మెరుపును కోల్పోయారు. జానా బెత్తెడు దుస్తుల్లో, పెట్టుడు అందాలతో ఎంత ఒళ్ళు ఊపినా లాభం లేకపోయింది. తెరపై రవితేజనే కాదు, తెర ముందున్న ప్రేక్షకుల్ని కూడా ఇంప్రెస్ చేయడానికి శ్రియ చిన్న చిన్న చెడ్డీలతో, ఊపుకొంటూ డ్యాన్సులు చేశారు. అయినా సరే, కొన్నిచోట్ల శ్రియ కన్నా రెండో హీరోయిన్ అంజనా సుఖానీ (శ్రీహరి చెల్లెలు పాత్రధారిణి) మెరుగని ఫీలైతే, అందులో ప్రేక్షకుల తప్పేమీ లేదు. హాస్యం కోసం అబద్ధపు గుడ్డివాడు పిత్రేగా వేణుమాధవ్, సినిమా చివరలో వచ్చే అప్ డేట్ల విశ్వాస్ గా బ్రహ్మానందం పాత్రలను సృష్టించారు. ఇలా సినిమా నిండా జనమైతే ఉన్నారు కానీ, జనం మెచ్చే పాత్రలు, పాత్రపోషణలు కనిపించవు.

హీరోయిజాన్ని పెంచి చూపే తాపత్రయంలో నుంచి వచ్చిన ‘‘...ఒంటి పేరు శీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కు చాలా పెద్ద ఫ్యాను...’’ లాంటి డైలాగులు కొన్నిచోట్ల మాస్ తో ఈలలు వేయించవచ్చు. అలాగే, ‘‘....ఉచ్చ పోసే ప్రతోడూ మొగోడు కాదు. ఉచ్చ పోయించెటోడు మగోడు...’’ (హీరో గురించి శ్రీహరి) లాంటి అనర్ఘ రత్నాలు కూడా విని తరించవచ్చు. అలీ, రవితేజల మాటల్లో, చేష్టల్లో కావాల్సినంత ద్వంద్వార్థాలు పలికించారు. ఇదే వినోదం అనుకుంటే, మన వాళ్ళ అభిరుచికి సిగ్గుపడాలి.

పాటల్లోని మాటలు కూడా (దీన్ని సాహిత్యం అంటే మహాపాపం) ఇందుకేమీ తీసిపోలేదు. ‘‘....అందమేమో ఇస్తరాకు, మడత చూస్తే మామిడాకు, తడిమి చూస్తే తామరాకు... లంగరేసి లాగమాకు.....’’ అనేది నాయికా నాయకుల మధ్య ప్రణయగీతం. మరో పాటలో ‘‘....బలుపుగాడు...., ....ప్రేమంటే పెంట....’’ లాంటి మాటలు వినిపిస్తాయి. ఇదీ నేటి తెలుగు సినిమా పాట. మణిశర్మ సంగీతంలో గుర్తుండే బాణీ కానీ, పాట కానీ ఒక్కటైనా ఉంటే ఒట్టు.

విదేశీ అందాలను చూపడంలో సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఓ.కె. సినిమా చివరలో వచ్చే ‘‘....రాజ రాజా రవి తేజా తేజా...’’ పాటకు వేసిన సెట్టు, వాడిన కాస్ట్యూములు ఆకట్టుకుంటాయి. దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇదే తొలి చిత్రం. గతంలో ఇ.వి.వి. సత్యనారాయణ, శీను వైట్ల లాంటి పలువురి దగ్గర పనిచేసిన ఈయన పది కథలతో ఒక కథను వండే పని మానేసి, తనదైన శైలి కోసం ప్రయత్నించడం ఆయనకూ, ప్రేక్షకులకూ కూడా మంచిది.

వెరసి సుదీర్ఘంగా సాగిన భావన కలిగించే డాన్ శీను ఫస్టాఫ్ వరకు కొంత ఫరవాలేదనిపించినా, సెకండాఫ్ మాత్రం పరమ బోర్. ‘‘.....ఇంకా ‘తెర’ వాలదేమి...ఈ చీకటి విడిపోదేమీ....’’ అనుకుంటూ అసహనంగా సినిమా చూడాల్సి వస్తుంది. రవితేజ తరహా జులాయి పాత్రల చిత్రీకరణలోని వినోదాన్ని ఆస్వాదించేవారు సైతం ఈ చిత్రంలోని లెక్కలేనన్ని అనవసర మలుపుల గందరగోళాన్ని ఏ మేరకు భరించగలరో అనుమానమే.

Wednesday, August 11, 2010

వివాదాల ఉచ్చులో ‘రోబో’

భారీ సినిమా వస్తోందంటే, రకరకాల హంగులతో పాటు హంగామాలు కూడా
చాలానే ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ - శంకర్ దర్శకత్వంలో
రజనీకాంత్ నటిస్తున్న ‘రోబో’ (తమిళ మాతృక పేరు ‘యంతిరన్’).
షూటింగ్ రోజుల నుంచి వివాదాలను ఎదుర్కొంటూ వచ్చిన సినిమా ఇది.
నిజానికి, మొదట్లో ఈ చిత్రకథను బాలీవుడ్ నటుడు షా రుఖ్ ఖాన్ తో
తీయాలని శంకర్ సంకల్పం. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. తీరా
అన్నీ ఖరారయ్యాక షారుఖ్ కీ, శంకర్ కీ మధ్య పొసగలేదు. షారుఖ్
పక్కకు తప్పుకున్నారు. దాంతో, తన మునుపటి చిత్రమైన ‘శివాజీ’ హీరో,
ఆలిండియా ఇమేజ్ ఉన్న రజనీకాంత్ నే శంకర్ మళ్ళీ ఆశ్రయించక
తప్పలేదు.


‘శివాజీ’ రోజుల్లోనే ఈ కథ తెలిసిన రజనీకాంత్ వెంటనే ఓకే
చెప్పేశారు. దాదాపు వంద కోట్ల పైచిలుకు ఖర్చయ్యే ఈ సినిమాను
మొదలు పెట్టిన నిర్మాత మొదట వేరొకరు. తీరా సినిమా పట్టాల మీదకు
ఎక్కి, షూటింగ్ మొదలై రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు తీశాక, ఈ
ఖర్చు తన వల్ల కాదంటూ సదరు నిర్మాత చేతులెత్తేశాడు. దాంతో, మళ్ళీ
వివాదం. పక్కవాడు పడిపోయాడంటే, పండగ చేసుకొనే చిత్ర పరిశ్రమలో
నానా మాటలూ వినిపించాయి. రజనీకాంత్, శంకర్ ల బృందాన్ని చూసి
నవ్విన వాళ్ళే ఎక్కువ.


చివరకు రజనీకాంత్, శంకర్లకున్న పేరు, పలుకుబడి
ఫలించాయి. దక్షిణ భారత టీవీ చానళ్ళ గ్రూపులో అతి పెద్దదైన సన్ టి.వి.
నెట్ వర్క్ లిమిటెడ్ సంస్థ సినిమా పూర్తి చేయడానికి ముందుకొచ్చింది.
దాని అనుబంధ విభాగమైన సన్ పిక్చర్స్ పేరిట బరిలోకి దిగింది. ఇప్పటికే
తమిళ చిత్రాల పంపిణీ, పూర్తయిన చిత్రాల గుదిగుత్త కొనుగోళ్ళతో మార్కెట్
ను మింగేస్తున్న సరికొత్త తిమింగలంగా సన్ పిక్చర్స్ (అప)ఖ్యాతి
తెచ్చుకుంది. అలాంటి సంస్థ తొలిసారిగా తామే పూర్తిగా చిత్ర నిర్మాణానికి
శ్రీకారం చుట్టింది. అలా సన్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ తొలి
చిత్రం ఎట్టకేలకు రెండేళ్ళ నిర్మాణం తరువాత ఇప్పుడు తుది మెరుగుల్లో
పడింది.

తాజాగా ఈచిత్రం కొనుగోళ్ళపై వివాదం రేగింది. తెలుగు ‘రోబో’
చిత్రం ప్రదర్శన హక్కుల్ని మరో నిర్మాత, పంపిణీదారు చదలవాడ
శ్రీనివాసరావు దాదాపు రూ. 30 కోట్లకు కొనుగోలు చేశారంటూ రెండు
రోజుల క్రితం పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది చూసి, సన్ పిక్చర్స్ వారు
ఖంగారు పడ్డారు. సర్వసాధారణంగా ఎవరికీ, ఏ వివరణకూ అందుబాటులో
ఉండని సన్ సంస్థ వారు తమంతట తాముగా హడావిడిగా తెలుగు
విలేఖరుల సమావేశం పెట్టారు. ‘రోబో’ హక్కుల్ని తామింతవరకు ఎవరికీ
అమ్మనే లేదంటూ వివరణ నిచ్చుకున్నారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా
తెలుగు రోబో హక్కుల అమ్మకం కోసం చదలవాడ శ్రీనివాసరావు పలువురి
నుంచి రూ. 5 కోట్ల దాకా సొమ్ము వసూలు చేశారంటూ సన్ పిక్చర్స్ చీఫ్
ఆపరేటింగ్ ఆఫీసర్ (సి.ఓ.ఓ.) డబ్ల్యు. హన్స్ రాజ్ సక్సేనా వాపోయారు.

చదలవాడ శ్రీనివాసరావు ఎవరో తమకు తెలియనే తెలియదనీ, అతనికి
డబ్బులిచ్చి ఎవరూ మోసపోవద్దనీ వివరించారు. హక్కుల అమ్మకం
వార్తను ఆగస్టు 8న ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికకూ, ప్రసారం చేసిన
ఆంధ్రజ్యోతి - ఏ.బి.ఎన్. చానల్ కూ ఘాటుగా లేఖ రాస్తున్నట్లూ చెప్పారు.
అలాగే, చదలవాడ, తదితరులపై పోలీసు కేసు పెడుతున్నట్లూ, చట్టపరంగా
దావా వేస్తున్నట్లూ తెలిపారు. అవును మరి, దాదాపు రూ. 130 - 140 కోట్ల
దాకా పెట్టిన ఖర్చును వెనక్కి రాబట్టుకొనేందుకు ఎవరికి మాత్రం ఆందోళన
ఉండదు చెప్పండి.

కాగా, తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు మాత్రం సన్ సంస్థతో తనకు ఒప్పందం కుదిరిందనీ, ఆగస్టు 7న రూ. 2 కోట్లు ఆ సంస్థకు డి.డి. రూపంలో చెల్లించాననీ వివరణ ఇస్తున్నారు. రూ. 27 కోట్లకు రోబో హక్కులు ఇవ్వాలంటూ తమ మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరిందంటూ, కొన్ని పత్రాలు చూపిస్తున్నారు. సన్ సంస్థ ప్రతినిధి ఉదయ్ కుమారే దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. దీనికి సన్ వారు ఏమంటారో చూడాలి. ఇందులో ఎవరిది నిజమో, ఏది నిజమో నిలకడ మీద కానీ తేలేలా లేదు. అందాకా రోబోకు వివాదాల జడి తప్పేలా లేదు.

Monday, August 9, 2010

బెజవాడలో అభివృద్ధి అంటే ఇదేనా?!

(కళ్ళుండీ చూడలేని వారి కోసం మా బెజవాడ ఘనత -2 )

బెజవాడలో కొద్ది నెలల క్రితం ‘మెట్రో ఎక్స్ ప్రెస్’ల పేరిట కొత్త సిటీబస్సులు వేశారు. వీటిలో ఎక్కితే కనీసం 6 రూపాయల దాకా టికెట్టు. సాధారణబస్సు టికెట్ ధర కన్నా 2, 3 రూపాయల పైనే ఎక్కువ. దూరం పెరిగే కొద్దీటికెట్ రేటు, ఈ తేడా మరీ పెరిగిపోతాయి. కానీ, అది మామాలు బస్సువేగంతోనే, అదే విధంగా అన్ని స్టాపుల్లోనూ ఆగుతూ వెళుతుంది. అలా వెళ్ళేబస్సు ఎక్స్ ప్రెస్ ఎలా అవుతుంది! ఆదాయం పెంచుకోవడానికి పాలనా యంత్రాంగం,రోడ్డు రవాణా సంస్థలు చేస్తున్న రైట్ రాయల్ దోపిడీ ఇది!! వీటి గురించిప్రజా క్షేమం కోసమే ఉన్నామంటున్న పార్టీలు కానీ, పెద్దలు కానీ, అందుకోసమేకలం పట్టామంటున్న పత్రికల వాళ్ళు కానీ పెదవి విప్పరు.

సత్యనారాయణపురం రైల్వే లైను తొలగించాక, ఆ రోడ్డును చాలా వెడల్పు చేసి,ప్రత్యేక బి.ఆర్.టి.ఎస్. బస్సు మార్గంగా చేస్తున్నామన్నారు. మూడు
నాలుగేళ్ళు గడిచాక ఎలాగైతేనేం, అక్కడి మట్టి తొలగించి, కొంత మేర రోడ్డువేశారు. కానీ, పూర్తి కాకుండానే ఆ మార్గానికి తూతూ మంత్రంగాప్రారంభోత్సవం జరపాలని ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డినిరప్పించారు. పూర్తవని రోడ్డులో, వెళ్ళని బస్సులకు ప్రారంభోత్సవం ఏమిటనితెలుసుకున్న మంత్రి గారు కారు దిగకుండానే కూకలేసి, ప్రారంభోత్సవంజరపకుండానే వెనక్కివెళ్ళిపోయారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఈ ఘటన మనబెజవాడ అభివృద్ధికి గీటురాయి కాదా!

ఇవాళ్టికీ బెజవాడలో కాలక్షేపానికి సినిమా తప్ప మరేదైనా ఉందా? కనీసం పెద్దపార్కులు కూడా లేవు. ఉన్న ఒకటి రెండింటిలో సౌకర్యాలు లేవు. గాంధీనగరంలోదుర్గా కళామందిరం పక్కన కాలువ ఒడునున్న గోరా పార్కు లాంటివి కూడాప్రభుత్వ శాఖల భవన నిర్మాణాల చేతిలో ఆక్రమణ పాలై, కుంచించుకుపోయాయి.చదువుకోవడానికి గ్రంథాలయాలు లేవు. వందేళ్ళ నాటి రామమోహన లైబ్రరీ, పాతశివాలయం భ్రమరాంబా మల్లేశ్వర స్వామి లైబ్రరీ లాంటి వాటిని గబ్బిలాలకొంపలుగా మార్చేసి, శిథిలావస్థలో వదిలేశాం. పోటీ పరీక్షల పుస్తకాలతోనిండిపోయిన ఠాగూర్ లైబ్రరీ మినహా మరో దిక్కు లేకుండా పోయింది. ఈతప్పెవరిది? మీదీ, నాదీ, మనదీ, మనం ఎన్నుకున్న పాలకులదీ కాదా? (ఇక్కడపార్టీల తేడాలేవీ లేవు. అన్నీ ఆ తాను ముక్కలే).

తాతల కాలం నాటి హనుమంతరాయ గ్రంథాలయం, రోడ్ల వెడల్పులో అగ్గిపెట్టెంత అయినరోటరీ క్లబ్ ఆడిటోరియం, ఒక్కగానొక్క తుమ్మలపల్లి వారి క్షేత్రయ్యకళాక్షేత్రం తప్ప మనకు ఓ శాశ్వత కళా, సాంస్కృతిక కేంద్రాన్నిఏర్పాటుచేసుకోగలిగామా? అయితే హాల్లో, లేదంటే టీవీలో సినిమాలు చూడడానికేతప్ప, మన సంస్కృతికీ, సాహిత్యానికీ పెద్దపీట వేసే కార్యక్రమాలకు బెజవాడనుకేంద్రంగా మలుచుకోగలిగామా? ఒకప్పుడు వెలిగిన ఆ పాత వైభవాన్ని మన చేతులతోమనమే ధ్వంసం చేయలేదా!!

విజయవాడకు ఇవాళ్టికీ సరైన విమానాశ్రయం ఉందా! లేదు కదా....!! చీకటి పడితేవిమానాలు దిగడానికి వీలుండని గన్నవరం విమానాశ్రయమే అప్పటికీ, ఇప్పటికీదిక్కు. ఇన్నేళ్ళలో దాన్ని అభివృద్ధి చేసిన నాథుడు లేడు. సమీపభవిష్యత్తులో అభివృద్ధి చేసే దాఖలాలూ లేవు. రాష్ట్రంలోని నాలుగు ముఖ్యనగరాల్లో ఒకటిగా పేరే తప్ప, ఒకప్పటితో పోలిస్తే బెజవాడ జనాభాలోనే తప్ప,
వసతుల్లో పెరిగినట్లు చెప్పలేం.

లక్షల కొద్దీ జనాభా ఉంటేనో, చుట్టుపక్కలి ఊళ్ళ కన్నా వైశాల్యంలో,వ్యాపారంలో పెద్దది అయితేనో, మౌలిక వసతులు లేకుండా విలాసాలకు విడిదిఅయితేనో నగరమని చెప్పడం ఒంటి కన్నుతో చూడడమే! బి.ఆర్.టి.ఎస్. బస్సులువచ్చేస్తున్నాయనీ, హైదరాబాద్ నుంచి బెజవాడ మార్గం నాలుగు లైన్ల మార్గంఅయిపోతోందనీ, కారులో ప్రయాణం సుఖంగా సాగిపోతుందనీ చంకలు గుద్దుకుంటేసరిపోతుందా! సామాన్యమైన జీతంతో సాధారణ జీవితం గడిపే సగటు మనిషికి రోడ్లు,నీళ్ళు లేకపోయినా, ఉన్నవాటికి డబ్బు ఎక్కువ వెచ్చించాల్సి వచ్చినా -మనకేం లెమ్మని ఊరుకుందామా?!

సోకాల్డ్ కార్పొరేషన్ పేట పెద్దల మొదలు మన వోట్లతో ఢిల్లీ దాకా ఎదిగిననోట్ల మూటలు సంపాదిస్తున్న నేతల దాకా ఎవరికీ ఇవేవీ పట్టనందుకు నిజంగా మనంగర్వించాల్సిందే! ఇన్ని లోటుపాట్లున్నా సరే, ఉష్ట్రపక్షిలా తల ఎక్కడోపెట్టుకొని, ఆకాశంలో చుక్కలు చూస్తూ, నేల మీద కాళ్ళెక్కడున్నాయోచూసుకోకుండా మైమర్చిపోవాల్సిందే! ‘మాది ఎంతో అందమైన నగరం’ అంటూ శుష్కవచనాలతో, కాలం గడపాల్సిందే! అలా నింగిచూపుల దృష్టితో చూస్తే మాత్రం -అవును ‘పెద్ద పల్లెటూరు’ బెజవాడ అతి అందమైన నగరం.

(పారిశ్రామికంగానే కాదు, ప్రజావసరాల రీత్యా కూడా అభివృద్ధికి నోచుకోక,సంస్కృతి - సాహిత్యపరంగా కూడా పాత వైభవాన్ని కూడా పోగొట్టుకుంటున్న నాపుణ్యభూమి - జన్మభూమి మీద ప్రేమతో, బాధతో........)

కళ్ళుండీ చూడలేని వారి కోసం మా బెజవాడ ఘనత - 1



‘బెజవాడ పెద్ద పల్లెటూరు’ - అనే సరికి చాలామందికే కోపాలొచ్చాయి. ‘అంత మాట అంటావా’ అంటూ, నేను రాసిన పోస్టు మీద తమ అసహనాన్ని నాతో నేరుగా చెప్పినవారు కొందరైతే, కామెంట్లు రాసినవారు మరికొందరు. ఇంకొందరు అంతటితో ఆగక, ఏకంగా బెజవాడ ఎంత సుందర నగరమో ప్రత్యేకంగా పోస్టులు రాశారు. బెజవాడ మీద నాకేదో ద్వేషం ఉన్నట్లు, నేను ఉద్దేశపూర్వకంగా నిందలు వేసినట్లూ భావించారు. యీ నేపథ్యంలో కామెంట్ల రూపంలో కాక, నా భావాలను మరింత వివరంగా చెప్పాలనే ప్రత్యేకంగా ఈ పోస్టు!

నిజానికి, నన్ను పెంచి, పెద్ద చేసిన బెజవాడ మీద నాకెంత ప్రేమో మొదటి టపాలోనే చెప్పా. ఏ ఊరెళ్ళినా, ఎక్కడున్నా అక్కడికీ, మా బెజవాడలో ఉన్న సుఖానికీ పోలిక చూసుకొని, గర్వంగా భుజాలెగరేయడం నాకూ అలవాటే! అంతమాత్రాన ‘...నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ...’ అంటూ కళ్ళు మూసుకొని, ఊహల్లో విహరిస్తూ, వాస్తవ పరిస్థితులను మర్చిపోవడం సబబూ కాదు ! సాధ్యమూ కాదు !! నా బాధల్లా అప్పటికీ, ఇప్పటికీ - బెజవాడలో వచ్చిన అసలు సిసలు అభివృద్ధి - దేశంలోని, రాష్ట్రంలోని అనేక ఇతర నగరాలతో పోలిస్తే - అతి తక్కువేనని!

నేను ట్రాఫిక్ గురించే మాట్లాడుతున్నానని కొందరు మిత్రులు పొరబడ్డారు. కేవలం ట్రాఫిక్ అయితే, బెజవాడ కన్నా హైదరాబాద్ లాంటి ఊళ్ళు మరీ దారుణమని వాపోయారు. నా వాదన ఏమిటంటే - కార్లు, బంగళాల వాళ్ళ మాట అటుంచండి, సగటు మనిషి బతకడానికి సాధారణ వసతులు ఉండాలి కదా! కొన్ని వేల మంది కోసమంటూ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన హౌసింగ్ బోర్డ్ కాలనీలో కనీసం రోడ్లు వేయరేం! వారాల కొద్దీ బస్సులే లేకపోతే, ఆ కాలనీలోని దిగువ, మధ్యతరగతి ఆదాయ వర్గ (ఎల్.ఐ.జి, ఎం.ఐ.జి) నివాసులకు రవాణా మాటేమిటి! అక్కడి పిల్లలు చదువులకూ, పెద్దలు ఉద్యోగాలకూ ఎలా వెళ్లాలి? కార్పొరేషనైన ఇన్నేళ్ళ తరువాత కూడా కీలకమైన కూడళ్ళలో కూడా సరైన రోడ్లకు నోచుకోని బస్తీని ఏమనాలి? నగరం అనాలా, పల్లెటూరు అనాలా?

నగరమంటే ఓ ముందు చూపు, ఓ నిర్దిష్ట ప్రణాళికతో నిర్మాణం, విస్తరణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే పెరిగే జనాభా అవసరాలను ఆ నగరం తీర్చగలుగుతుంది. కానీ, ప్రధాన కూడలి అయిన బస్ స్టాండ్ లాంటి చోట్ల కూడా నగర అవసరాలను గుర్తించని / తీర్చని రీతిలో ఫ్లయ్ ఓవర్ వేసి, ట్రాఫిక్ సిగ్నల్ పెట్టేస్తే సరిపోతుందా! మామూలు రోజుల్లోనే బెజవాడ బస్టాండ్ ఎదుట అంతంత సేపు బస్సులు ఆగిపోతూ, పావు ఫర్లాంగైనా లేని దూరానికి పది నిమిషాల పాటు హారన్ల మోత, జనం కూతల మధ్య కదలని బస్సుల్లో ఖైదీలుగా కూర్చోవాల్సి వస్తోంది.

ఇక అమ్మవారి పండుగలైన దసరా లాంటి రోజుల్లో పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇది ఎంత నరకమో రోజూ ఆ దోవలో చదువులకూ, ఉద్యోగాలకూ, అత్యవసరమైన పనులకూ వెళుతున్న మామూలు వాళ్ళతో మాట్లాడి చూస్తే తెలుస్తుంది. ‘ఏలూరు రోడ్డు బాగుంది’, ‘బందరు రోడ్డుకేం బ్రహ్మాండంగా ఉంది’... అనుకుంటే చాలదు. ఏడాది క్రితం వర్షాలకు వన్టౌన్ మొత్తం మునిగిపోయిన సంఘటన అప్పుడే మర్చిపోదామా! మరోసారి వర్షాల్లో మునిగితేనో, టూ టౌన్ దాకా ఆ ప్రమాదం వస్తేనో - అప్పుడు కళ్ళు తెరుద్దామా!!

భారీ వర్షాలు వస్తే బుడమేరు పొంగి, కాలనీలు మునిగిపోవడం ఎన్నిదశాబ్దాలుగా మనం చూస్తున్న తతంగం. దానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి మన వాళ్ళకు చిత్తశుద్ధి లేదేం! ఆ కాలనీల్లో ఉండేవాళ్ళు మనుషులు కారా!

(మిగతా భాగం మరి కాసేపట్లో....)

Saturday, August 7, 2010

చిరంజీవి నటించడం ఖాయమే!

('రోబో' ఆడియో ఆవిష్కరణ సభలో రామానాయుడు, కెమెరా మాన్ రత్న వేలు, మోహన్ బాబు, దర్శకుడు శంకర్, సన్ పిక్చర్స్ సక్సేనా, రజనీ కాంత్, చిరంజీవి)


ప్రాచుర్యం, ప్రజాదరణ ఉండే కళా రంగాల్లోని వ్యక్తులు ఆ యా రంగాలను వదిలిపెట్టడం అంత ఈజీ
కాదు. అలవాటై పోయిన బాజా భజంత్రీలను వదులుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది
చెప్పండి. నూటికి 90 మంది చివరి దాకా కళామతల్లినే కొలుస్తూ ఉంటామనేది అందుకే. సరిగ్గా అవే కారణాలతో కాకపోయినా, గడచిన రెండు రోజులుగా వేర్వేరు వేదికలపై తన సినీ రంగ పునఃప్రవేశం గురించి చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలు ఆ చూస్తే,నటన మీద ఆయనకు మక్కువ తీరలేదని ఇట్టే అర్థమై పోతోంది. తాజాగా ఈ రోజు శంకర్ - రజనీకాంత్ ల రోబో చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో చిరంజీవి మళ్ళీ తన సినిమా ఆశలను బయటపెట్టారు.



జెంటిల్మన్ చిత్రం చూసినప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందనీ, అప్పట్లోనే ఆ
సంగతిని సభా ముఖంగా శంకర్ కు చెప్పాననీ రోబో సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి వివరించారు. మద్రాసులో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చదువుతున్న రోజుల్లోనే తమ బ్యాచ్ కు రెండు మూడేళ్ళు సీనియరైన రజనీకాంత్ ను చూసి స్ఫూర్తిపొందానని చిరు ఆ సంగతులు చెప్పుకొచ్చారు. ''అప్పటికే నాలుగైదు తమిళ చిత్రాల్లో నటించి, పేరు తెచ్చుకున్న రజనీని చూసి, సాదా సీదాగా ఉండే రజనీయే నటుడిగా నిలదొక్కుకుంటున్నప్పుడు ఏదో ఒక రోజు నేనూ అంతటి వాణ్ణి అవుతానని అనుకున్నాను, అయ్యాను" అని చిరంజీవి తెలిపారు.

ఆ తరువాత సినిమా జీవితంలో తనకన్నా కొద్ది అడుగులు ముందుండి, మార్గదర్శకుడిగా నిలిచిన రజనీ ఒక్క విషయంలో మాత్రం మోసం చేశారని చిరంజీవి ఛలోక్తిగానే మనసులో మాట చెప్పారు. "..అభిమానుల మొదలు అనేకుల నుంచి వస్తున్న ఒత్తిళ్ళ కారణంగా సినిమాల్లో నుంచి రాజకీయాలకు రజనీకాంత్ వస్తారనుకున్నా. నాకూ అలాంటి ఒత్తిళ్ళే ఉండడంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. కానీ, రజనీ మాత్రం నన్ను రాజకీయాల్లోకి నెట్టేసి, తాను రోబో సినిమాలో నటించారు. ఇది నిజంగా మోసమే..." అంటూ చిరంజీవి వేదికపై నుంచి చెప్పుకొచ్చారు.


"...ఎంతో భారీ వ్యయంతో, భారీ సాంకేతిక విలువలతో రూపొందిన రోబో
చిత్రం ట్రైలర్లు వగైరా చూస్తుంటే, కళాకారుడిగా నాకు ఈర్ష్య కలుగుతోంది. శంకర్ తో సినిమా చేయడం
సుఖం. మనం బుర్ర పెట్టి ఆలోచించాల్సిన పని లేదు. మన నుంచి తనకు కావాల్సింది చెప్పి
చేయించుకుంటాడని రజనీ నాతో చెప్పారు. నువ్వు, శంకర్ తో కలసి సినిమా చేయాలంటూ
రజనీ అంటే సరేనన్నా. తీరా రోబో చిత్రం రజనీ చేశారు..." అని శంకర్ దర్శకత్వంలో
నటించాలన్న తన చిరకాల వాంఛను మరోసారి చిరు బయటపెట్టారు.


మొత్తం మీద రాజకీయాల్లోకి వచ్చినా, ఇప్పటి వరకు ఆశించిన విజయాలు
దక్కని చిరు మనస్సు మళ్ళీ సినిమాల వైపు మళ్ళుతున్నట్లే ఉంది. రెండు రోజుల ముందు
అభిమానుల సమావేశంలోనూ, ఇవాళ రోబో పాటల విడుదలలోనూ ఆయన మాటలు అందుకు
నిదర్శనం. అందుకే, "...సామాజిక స్పృహనూ, వ్యాపారాత్మకతనూ సమపాళ్ళలో
మేళవించగల నేర్పు ఒక్క శంకర్ కే ఉందంటూ" చిరు ప్రశంసల జల్లు కురిపించారు. మళ్ళీ
అవకాశం వస్తే శంకర్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమన్న సూచనలు బాహాటంగానే చెప్పేశారు.
రోబో ట్రైలర్ భావోద్వేగంతో మాట్లాడుతున్న చిరును చూసి, రజనీ సైతం లేచి నిలబడి చప్పట్లు
కొట్టారు. "...మీరు సినిమాల్లో మళ్ళీ నటించాలి. ఇది నా అభ్యర్థన..." అని కూడా రజనీ
మైకులో చెప్పేశారు. అక్కడి దాకా తెచ్చిన చిరు వెంటనే "అంతా భగవంతుడి ఇచ్ఛ.
చూద్దాం" అన్న పద్ధతిలో పైకి చూస్తూ, సైగ చేశారు.


రాజకీయాల్లోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నపడూ, రాజకీయాల్లోకి
వచ్చేసిన తరువాత చిరంజీవికి ఒకటే ఆలోచన. సామాజిక స్పృహతో కూడిన చిత్రాల్లో నటిస్తే అది
సినీ గ్లామర్ కూ, రాజకీయ జీవితానికీ ఉభయతారకంగా ఉంటుందని ఆయన భావన.
రాజకీయ రంగ ప్రవేశానికి కొద్ది నెలల ముందు ఆయన అందుకు ప్రయత్నాలు చేయడం,
పరుచూరి బ్రదర్స్, గుణశేఖర్, వి.వి. వినాయక్ తదితర సినీ ప్రముఖులతో స్ర్కిప్టులు
చర్చించడం స్వయంగా గమనించాను.


రాష్ట్రంలో ఎన్నికలకు మామూలుగా అయితే మరో
నాలుగేళ్ళ దాకా సమయం ఉన్నందు వల్ల, రాజకీయాలకు కూడా పనికొచ్చే ఒకటి రెండు
సినిమాలు చేస్తే బాగుంటుందనే ఆలోచన చిరు మనస్సును తొలుస్తున్నట్లుంది. సామాజిక
స్పృహను స్ర్కిప్టులో మిళాయించే శంకర్ తో సినిమా అయితే, అటు ఆయనతో కలసి
పనిచేయాలన్న చిరకాల వాంఛా తీరుతుంది. ఇటు రాజకీయ జీవితానికీ పనికొస్తుందని చిరు
మనస్సులో ఆశ వెలుగుతోంది. మరి, 75 కోట్లు (శివాజీ), ఇప్పుడు 130 - 140
కోట్లు (రోబో) అంటూ ఎప్పటికప్పుడు బడ్జెట్ ను పెంచుకుంటూ, వివిధ భాషల్లో మార్కెట్ ను
విస్తరించుకుంటూ వెళుతున్న శంకర్, చిరంజీవితో సినిమాకు ముందుకొస్తారా.. శంకర్ సై
అంటే, సరైన స్ర్కిప్టు కోసం చూస్తున్న చిరు సినీ రంగంలోకి రీ ఎంట్రీ దాదాపు ఖాయమనే
చెప్పాలి.

Friday, August 6, 2010

బెజవాడ... ఓ పెద్ద పల్లెటూరు!

కొన్ని నెలల తరువాత మళ్ళీ మా ఊరు బెజవాడ... అదే విజయవాడ వెళ్ళా. ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు కదా... ఎవరికైనా ఆపేక్ష ఎక్కువుండడం సహజం. నా మటుకు నాకూ అంతే. ఎప్పుడు వెళ్ళినా ఒకటి రెండు రోజుల సెలవులో ఏదో హడావిడిగా పని చూసుకొని,మళ్ళీ ఉద్యోగానికి వచ్చేయడమే. ఈసారీ అంతే. కాకపోతే, బయట కొద్దిగా ఎక్కువ తిరగాల్సి రావడం, దానికి తోడు వర్షాకాలం కావడంతో, ఊరి అసలు పరిస్థితులు కాస్త ఎక్కువగానే తెలిసొచ్చాయి.
అందుకనో ఏమో నాకీ సారి బెజవాడ అంతగా నచ్చలేదు. ఊహ తెలిసినప్పటి నుంచీ చూస్తున్న ఊరు... నన్ను పెంచి
పెద్ద చేసిన ఊరు... మార్పులు చాలానే వచ్చాయి. కానీ, అవన్నీ మంచికా, చెడుకా... అంటే ఏక పద, ఏక వాక్య సమాధానాలు చెప్పలేం. మార్పు సహజం అనుకొని మనల్ని మనం ఊరడించుకోవచ్చు. కానీ, మారని
విషయాల మీద అసహనాన్ని మాత్రం ఎలా శాంతింపజేసుకోవాలి.

నాకు జన్మనిచ్చిన ఊరు, నాకు చదువు చెప్పిన ఊరు ఇప్పుడు అప్పటి బెజవాడ కాదు. కనీసం నిన్న మొన్నటి విజయవాడా కాదు. జనం పెరిగారు. వాహనాలు పెరిగాయి. రద్దీ పెరిగింది. మునుపటి కన్నా విలాసాలు
పెరిగాయి. కానీ, ఇప్పటికీ ఊళ్ళో ప్రాథమిక సౌకర్యాలు పెరిగినట్లు కనిపించలేదు. కాస్తంత వర్షానికే కాలనీల నిండా బురద. మనుషులు కాదు కదా, కనీసం పశువులు కూడా తిరగడానికి భయపడేంత బురద... బస్సులు
లోపలికి రావడం బంద్. కనకదుర్గ గుడి కొండ వెనుక వైపున ఉండే భవానీపురం, ఆ చుట్టుపక్కలి హౌసింగ్ బోర్డ్ కాలనీ లాంటి వాటిల్లో జనం పడే బాధ వర్ణనాతీతం. హైదరాబాదుకు దారి తీసే 9వ నంబరు జాతీయ రహదారి
(ఎన్.హెచ్. 9)కు కూతవేటు దూరంలో ఉన్న కాలనీల పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే ఎవరైనా నమ్మగలరా...

ఇక, కృష్ణలో స్నానం చేసి, కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి రోజూ కొన్ని వేల మంది వస్తుంటారు. కానీ, అదేం
పాపమో... దుర్గా ఘాట్ దగ్గర కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఎన్.హెచ్. 9 మీదుగా హైదరాబాద్ వైపు నుంచి ఊళ్ళోకి వచ్చే వాహనాలు, అవి కాక సిటీ బస్సులు, ఆటోలు, బండ్లు... అన్నిటికీ ఆ రోడ్డే గతి. కొండ వెనక పక్క
నుంచి కొండ ముందుకు దూరం కిలోమీటరైనా ఉంటుందో, ఉండదో... కానీ, ఆ కాస్త దూరం ప్రయాణానికి అరగంట పైనే పడుతోంది. అంటే, అక్కడ మన వాళ్ళ ట్రాఫిక్ నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోండి. బస్సెక్కితే నరకమే...

బెజవాడలో స్థానిక సిటీ బస్సులన్నీ బస్టాండ్ మీదుగానే వెళతాయి. గమ్యం ఏదైనా సరే, మార్గమధ్యంలో బస్ స్టాండులోకి వెళ్ళి, ఆ తరువాతే గమ్యం దిశగా ప్రయాణం. బస్టాండ్ ముందే పోలీసు కంట్రోల్ రూం, ఓ
ఫ్లయ్ ఓవర్. అక్కడ నాలుగు పక్కలకూ దోవలు. వన్టౌన్ మీద నుంచి టూ టౌన్ లోకి బస్ లో రావాలన్నా, ఏలూరు రోడ్డు - బందరు రోడ్డుల్లోకి వెళ్ళాలన్నా అదే కీలకమైన కూడలి. కొన్నేళ్ళ క్రితం అక్కడ ఓ ఫ్లయ్ ఓవర్ వేశారు - వన్టౌన్
నూ, టూ టౌన్ ను కలపడానికి. కానీ, భవిష్యత్ అవసరాలను పట్టించుకోకుండా ఈ రోజు గడిస్తే చాలు అన్న పద్ధతిలో కట్టిన ఆ ఫ్లయ్ ఓవర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయి. బస్ స్టాండ్లోకి బస్ వెళ్ళి, బయటకు
రావడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వరుసగా ఆగిపోయిన బస్సులు.

వన్టౌన్ గా పేరున్న పాత బస్తీ ప్రాంతంలో ఇవాళ్టికీ పూర్తి అండర్
గ్రౌండ్ డ్రైనేజీ వసతి లేదు. గట్టి వాన పడితే, ఆ ప్రాంతమంతా జలమయం.
ఇదుగో అదుగో అంటున్న పాలకులు గత రెండు, మూడేళ్ళుగా మురుగు నీటి
పారుదల వసతి కంటూ రోడ్లు తవ్వుతూనే ఉన్నారు. మట్టి పోస్తూనే ఉన్నారు.
నిధులు ఖర్చవుతున్నాయి కానీ, పనులు జరిగిన దాఖలాలు లేవు. రోడ్లన్నీ
అలాగే తవ్వి పడేసి ఉన్నాయి. వానలో కాదు కదా, మామూలుగానైనా సరే
నడవాలంటే భయపడే పరిస్థితి.

అందుకే, వాణిజ్య రాజధాని, సినీ రాజధాని, కోస్తాకు గుండె
కాయ - ఇలా బోలెడు పేర్లయితే ఉన్నాయి కానీ, విజయవాడ నిజంగా ఏ
మేరకు అభివృద్థి చెందిందంటే అనుమానమే. సరైన రోడ్లు, పారిశుద్ధ్యం,
మురుగునీటి పారుదల వసతి లేని ప్రాంతం మహానగరం ఎలా అవుతుంది..
రాబోయే రాష్ట్రానికి కాబోయే రాజధాని (ప్రత్యేక ఆంధ్ర ఇవ్వాలంటున్న వారి వాదన)
ఎలా అవుతుది...

ఈ సెప్టెంబర్ నాటికి కార్పొరేషన్ కాలం ముగుస్తుందట.
అందుకని ఇప్పుడు ఏదో పని అయిందంటే అయిందనిపించాలని పాలకులు
హడావిడి పడుతున్నారు. వీలుంటే అయిదారు నెలల పైగా ఎన్నికలు వాయిదా
వేయించాలని చూస్తున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అంటే, ఎన్నికలంటే
భయం తప్ప, జనానికి ఏదైనా చేయాలని ఎవరికీ లేదన్నమాట.

కావాలంటే మీరిప్పుడు బెజవాడ వెళ్ళి చూడండి. అది రాష్ట్రంలోని
పేరున్న పెద్ద నగరమంటే మీరే కాదు, ఆ ఊరికి కొత్తగా వచ్చినవాళ్ళూ నమ్మరు.
అభివృద్ధి అంటే, ఏ బందర్ రోడ్డులోనో కనిపించే బంగళాలు, షాపింగ్ మాల్స్
కాదు... మన చుట్టూ వెలిసిన ఐ నాక్స్ థియేటర్లూ కాదు... ఏరి కోరి వెళ్ళే
ఏసి వస్త్ర దుకాణశాలలూ కాదు... సామాన్యుడి జీవితంలో ప్రమాణాలు
పెరగనప్పుడు అది ఏ రకం అభివృద్ధి.

అందుకే, మళ్ళీ మళ్ళీ అంటున్నా - మా
బెజవాడ ఇప్పుడు సిటీ కాదు, పే...ద్ద పేరున్న పల్లెటూరు.... బెజవాడ
బాగుపడాలంటే... కనీసం బాగున్నట్లన్నా కనిపించాలంటే... అక్కడ
ఎన్నికలు రావాలి. అదీ ప్రతి రోజూ రావాలి... అప్పటి దాకా నా కిష్టమైన నా
ఊరు ఓ పల్లెటూరే...