జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, May 18, 2026

సారస్వత పరిషత్‌లో... అరుదైన సాహితీ సంస్మరణ!

 

   -    తెలుగువారి చరిత్ర - సంస్కరణోద్యమాలుపై వకుళాభరణం ప్రసంగం

   -      ఆలోచన రేపిన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పుస్తకావిష్కణ


అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు. శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్‌లో హైస్కూల్ టీచర్‌గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ఆంధ్ర సారస్వత పరిషత్  ప్రధానాచార్యులుగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్‌గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).

 

సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.

 

ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్‌లోని తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.

 

అరుదైన చారిత్రక విమర్శకుడు కె.కె.ఆర్: ఆచార్య చంద్రశేఖరరెడ్డి


 

ప్రధాన ప్రసంగానికి ముందు ఎమెస్కో బుక్స్ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్‌లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి. భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన చారిత్రక విమర్శకుడిగా గణిస్తున్నాం. అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు.

 

అలాగే, కె.కె.ఆర్. వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తూ, సమాజంలోని సమకాలీన సంఘటనలపై ఆయన స్పందించేవారు. సర్వసాధారణంగా ఆయన ఎంత సంయమనం పాటిస్తారో, ప్రపంచంలో దుర్మార్గాన్ని చూస్తున్నప్పుడు అంత అసహనం వ్యక్తం చేసేవారు. వాటి గురించి రాయకున్నా, ఉపన్యసించకున్నా... మిత్రులతో తన బాధ, ఆవేదన, ఆవేశం పంచుకొనేవారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని మంచిని ఎంతగా అభిమానిస్తామో... చెడును అంత తీవ్రంగా ఖండించడమన్నది శిష్యులందరూ ఆయనను చూసి నేర్చుకున్నదే. అందుకే, ఒక్కమాటలో కె.కె.ఆర్. సంఘ సంస్కరణవాది కూడా అని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు. అందుకు తగ్గట్టే తెలుగు వారి చరిత్ర – సంఘ సంస్కరణోద్యమాలు అంశంపై  ప్రధాన ప్రసంగకర్త వకుళాభరణం రామకృష్ణ సైతం భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడైన ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ వద్ద పరిశోధన సాగించిన ఉద్దండులంటూ ఆయన కృషిని స్థూలంగా పరిచయం చేశారు.

 

ఆ సమగ్ర స్వరూపమే తెలుగువారి చరిత్ర: వకుళాభరణం

 

వకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేస్తూ, ఢిల్లీలోని జె.ఎన్.యు.లో సాగిన తన చరిత్ర పరిశోధన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రసిద్ధ చరిత్రకారులు, పరిశోధకులైన రొమిల్లా థాపర్, సర్వేపల్లి గోపాల్ తదితరులతో జరిగిన సంగతులు పంచుకున్నారు. తెలుగునాట ఆధునిక సంఘ సంస్కరణలకు దీపధారి లాంటి కందుకూరి వీరేశలింగం మీద రిసెర్చ్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పినప్పుడు మా గైడ్ సర్వేపల్లి గోపాల్ అన్న ఓ మాట నాకు ఇప్పటికీ గుర్తు. పరిశోధనంటే - వీరేశలింగం వితంతు వివాహాలు జరిపాడు, బాలికా విద్యను ప్రోత్సహించాడు లాంటివి కాదు రాయాల్సింది. హౌ బి శానిటైజ్డ్ ది సొసైటీ (తెలుగు సమాజాన్ని ఆయన ఎలా శుభ్రపరిచాడు) అన్నది చెప్పాలి, రాయాలి అన్నారాయన. అది నా మనసులో నాటుకొని, పరిశోధనకు మార్గదర్శకమైంది. కష్టపడి ఆయన దగ్గరే ఎం.ఫిల్, ఆ తర్వాత పీహెచ్డీ చేశాను అని తెలిపారు.

 

ఒకసారి యునెస్కో ఆహ్వానంపై సర్వేపల్లి గోపాల్ గారు ప్యారిస్‌కు వెళ్ళినప్పుడు, ఆయన స్థానంలో నన్ను పెడితే, నేను పాఠాలు చెప్పడం ఓ అపూర్వ గౌరవం. ఆఖరి టాపిక్ మిగిలిస్తే, విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత నేనే ఆ పాఠం చెబుతానని వెళ్ళే ముందు గోపాల్ అన్నారు. తీరా, పర్యటన నుంచి తిరిగొచ్చాక విద్యార్థులకు ఆ పాఠం కూడా నన్నే చెప్పమనేశారు. నేను ఆ పాఠం చెబుతుంటే, ఆయన కూడా ఆ క్లాసులో కూర్చొని విన్న క్షణాలు మర్చిపోలేను అని వకుళాభరణం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.

 


ఈ మే 15 నాడే 88 వసంతాలు పూర్తి చేసుకొని, 89వ ఏట అడుగిడిన వకుళాభరణం దాదాపు నలభై నిమిషాల తన ప్రసంగంలో, ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రలో జరిగిన ప్రధానమైన మార్పులను ఓపికగా ప్రస్తావించారు. బ్రిటీషు వారి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొదలైన ఉద్యమం, 1913 నాటి బాపట్ల ప్రథమాంధ్ర మహాసభ నుంచి ఆంధ్ర రాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు, చివరకు 2013 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాల క్రమాన్ని ఆయన స్థూలంగా వివరించారు.

 

కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రవేశం తర్వాత నడచిన సంస్కరణోద్యమాల తీరుతెన్నుల గురించి సోషల్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే తన సిద్ధాంత గ్రంథంలో విపులంగా చర్చించిన వకుళాభరణం రామకృష్ణ, గురజాడ, గిడుగు, కందుకూరి... ఈ ముగ్గురూ తెలుగు నేలకు వేగుచుక్కల త్రయం. వారిలో మొదటి ఇద్దరు సాహితీస్రష్టలూ విజయనగరం వారే కావడం విశేషం. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ చైతన్యం తెచ్చినవారిలో కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు... ఈ ముగ్గురి పేర్లూ చెప్పుకొని తీరాలి అని అభిప్రాయపడ్డారు. నక్సలైట్ల ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం లాంటి వాటిని ఆయన తన ప్రసంగంలో చూచాయగా ప్రస్తావించారు. రాజకీయంగా, సామాజికంగా, కళాత్మకంగా, సాంస్కృతికంగా తెలుగు నేలపై వచ్చిన మార్పుల్ని లోతుగా చూసినప్పుడే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర – దాని పరిణామాలు – పర్యవసాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో సారస్వత పరిషత్ గ్రంథాలయాన్ని తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్న వకుళాభరణం, చారిత్రక విమర్శ దృక్పథంతో కె.కె.ఆర్. చేసిన సాహిత్య కృషిని ప్రశంసించారు.  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా, కె.కె.ఆర్.తో సాగిన స్నేహాన్ని స్మరించుకున్నారు.

 

అయిదేళ్ళుగా... ప్రతి ఏటా... అదే వేదికపై!

 

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యత్వం వహిస్తున్న డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి ఈ మొత్తం సభా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. ఉత్తమ ఆచార్యుడిగా, లోతైన సాహితీ విమర్శకుడిగా పేరున్న కె.కె.ఆర్. మరణానంతరం ఆయన శిష్య మిత్ర బృందం ఆచార్య చంద్రశేఖరరెడ్డి సారథ్యంలో ఏటా ఒక ప్రత్యేక సాహితీ కార్యక్రమం చేస్తోంది. తొలి ఏడాది కె.కె.ఆర్. సంస్మరణ పేరిట ఆయన సంస్మరణ సంచిక తీసుకువచ్చారు. రెండో ఏడాది ఆయన బహుముఖీన వ్యక్తిత్వంపై కె.కె.ఆర్. సాహిత్య వ్యక్తిత్వం పేరిట పలువురు సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం వెలువరించారు. ఆ తర్వాత నుంచి మూడేళ్ళుగా ఏటా ఒక సుప్రసిద్ధుడితో సంస్మరణ ప్రసంగాలు చేయిస్తున్నారు. తత్త్వశాస్త్ర ఆచార్యులు డాక్టర్ అడ్లూరి రఘురామరాజు, సాహితీ విమర్శకుడు డాక్టర్ బి. తిరుపతిరావుల అనంతరం ఈసారి మూడో సంస్మరణ ప్రసంగం – చరిత్ర పరిశోధకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారిది అంటూ లక్ష్మణ చక్రవర్తి అయిదేళ్ళ ప్రస్థానాన్ని అద్దంలో చూపారు. అలాగే, తాజా సభలో విడుదలైన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగ పుస్తకాలు రెంటికీ లక్ష్మణ చక్రవర్తే సంపాదకత్వ బాధ్యతలు వహించడం విశేషం. 

 

పిల్లలకు ప్రేమ పంచి... ఆచరణలో గౌరవం చూపి...

 

ప్రధాన ప్రసంగానికి ముందు సభలో కె.కె.ఆర్. శిష్యమిత్రులు పలువురు మాట్లాడుతూ, మాస్టారితో తమ అనుబంధాన్నీ, వారి జ్ఞాపకాలనూ పంచుకున్నారు. కె.కె.ఆర్. వద్ద చదువుకున్న 73 ఏళ్ళ అధ్యాపకుడు డాక్టర్ డి. నరసయ్య అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ, విద్యార్థులను సైతం గౌరవించడాన్ని ఆచరణలో చూపిన అరుదైన టీచర్ ఆయన. ఆ విశిష్ట గుణం ఆయన దగ్గరే చూశాను. విద్యార్థులతో అంత్యాక్షరి పద్యపఠనంతో పాటు స్లో సైక్లింగ్ లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ, పిల్లలతో అంతగా మమేకమైన టీచర్‌గా కె.కె.ఆర్. సార్‌ను మర్చిపోలేము అన్నారు.

 




జర్నలిస్ట్ రవీంద్రబాబు మాట్లాడుతూ, ఎం.ఏ, ఎంఫిల్ కె.కె.ఆర్ గారి దగ్గరే చేశా. ఆధునిక కవిత్వం, స్ట్రక్చర్ ఆఫ్ మోడరన్ తెలుగు, సంస్కృతంలోని కాళిదాసు మేఘసందేశం... ఇలా ఏ సబ్జెక్ట్‌నైనా ఆయన బోధించేవారు. తాను చెప్పిన అంశం మీద కాకుండా, అప్పట్లో కొత్తగా వచ్చిన త్రిపురనేని శ్రీనివాస్ హో కవితా సంపుటి మీద నేను పరిశోధన చేస్తానంటే ఆయన అభ్యంతర పెట్టలేదు. ముందుగా తానే ఆ పుస్తకం తెప్పించుకొని, చదివి, పరిశోధక విద్యార్థినైన నాకు సరైన మార్గనిర్దేశనం చేసిన అరుదైన గైడ్ ఆయన అని వివరించారు.

 

అరుదైన అధ్యయనశీలి ఆఖరి కోరిక!

 

తెలుగు అకాడెమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన రచయిత, భాషావేత్త డాక్టర్ అప్పం పాండయ్య మాట్లాడుతూ, విద్యార్థులు, పరిశోధకులపై కె.కె.ఆర్. ఆప్యాయత అపారం. ఏదైనా తనకు తప్పు అనిపిస్తే మాత్రం... మిత్రధర్మం, శిష్యధర్మం ఎంత ఉన్నా సరే వెరవకుండా, వాటిని పక్కనబెట్టి మరీ నిక్కచ్చిగా ఆయన తన అభిప్రాయం చెప్పేవారు. కె.కె.ఆర్. తన విద్యాభ్యాసం, ఉద్యోగ జీవిత కాలంలోని సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సమాజంలోని చైతన్యశీలత, మార్పులను చెబుతూ జీవిత కథనం రాయాలని భావించారు. తీరని ఆయన కోరికను ఇప్పటికైనా మిత్రులెవరైనా పూనుకొని తీరిస్తే బాగుంటుంది అని సూచన చేశారు. సారస్వత పరిషత్‌లో చదువుకొని సినీ, టీవీ నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న మానిక్ అప్పటి తన అనుభవాలు పంచుకున్నారు.

 

కుటుంబంతో కాదు... సాహితీ కుటుంబంతో!

 

ఈ కార్యక్రమానికి కె.కె.ఆర్. సతీమణి ఊర్మిళ, కుమారుడు సుమన్, మనుమడు స్వభావ్‌తో సహా కె.కె.ఆర్. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులమే కాకుండా, సాహితీ బంధువులందరితో కలసి ఏటా కె.కె.ఆర్.ను స్మరించుకోవడం కోసం అయిదేళ్ళుగా ఇలా సాహితీ ప్రసంగాల సభ జరుపుతున్నాం. గతంలో కె.కె.ఆర్. ఇలాంటి ప్రసంగాల సారస్వత వేదికను దాదాపు పదేళ్ళ పాటు నిర్వహించారు. దాని ఫలితంగానే, సాహిత్య చరిత్ర వ్యాసాలుగా చిరస్థాయిగా నిలిచిపోయిన తెలుగు సాహిత్యం - మరోచూపు, ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’ లాంటి లాంటి పుస్తకాల రూపంలో ఆ ప్రసంగాలు మిగిలాయి. ఆ ఫక్కీలోనే ఇప్పుడీ వార్షిక ప్రసంగాలు చేయిస్తున్నాం. రానున్న రోజుల్లో యువతరంతోనూ, ఆధునిక వక్తలతోనూ ఇలాంటి ఆలోచనాత్మక సంస్మరణ ప్రసంగాలు ఇప్పించాలని భావిస్తున్నాం అని ఊర్మిళ సభాముఖంగా ప్రకటించారు. అతిథులకు తమ కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, కవి నాళేశ్వరం శంకరం, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, తెలుగు అకాడెమీ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ఆకాశవాణి వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.

 

దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి. వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు సారస్వత వేదిక పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో!

 -      రెంటాల జయదేవ


https://www.sakshi.com/telugu-news/family/acharya-k-k-ranganathacharyulu-remembrance-day-2789913

(This item was published in 'Sakshi' website on 17th May 2026, Sunday)

Monday, April 20, 2026

మళ్ళీ మన ముందుకు... ఆ మహామహులు!

            - పది గంటల శ్రవ్య – దృశ్య రూపకంగా అలనాటి నాటక ప్రస్థానం

- నాటి నాటక మహామహుల అభినయాన్ని నవతరం కళ్ళ ముందుంచే అపూర్వ ప్రయత్నం

 

నూరు వసంతాలు దాటిన తెలుగు నాటక ప్రస్థానంలో ఎన్నో మెరుపులున్నాయి. మరెన్నో నేర్చుకున్న పాఠాలున్నాయి. ఉత్తుంగ తరంగమై నిలిచి, ఉత్థాన పతనాలెన్నో చూసిన ఈ రంగస్థల స్రోతస్విని ప్రయాణంలో ఎందరో మహానుభావులు... తమ జీవితాన్నే కళకు దివ్య సమర్పణం చేసిన ఎందరెందరో మహామహులు. రంగస్థలం, వెనుక దాన్ని అనుసరించి వచ్చిన వెండితెర రంగుల ప్రపంచం... ఉభయత్రా తమ ప్రతిభా సంపత్తులతో ఆ రంగాలకు కొత్త కాంతులు జోడించిన ఆ దివ్యమూర్తులను నేటి తరానికి పరిచయం చేస్తే? వారిని స్మరిస్తూ, వారి గానం, అభినయాలను శ్రవ్య – దృశ్య రూపంలో కళ్ళ ముందు నిలిపితే? ఆ రూపంలో కొత్త తరానికి మన అలనాటి నాటక ప్రస్థానంపై స్థూలంగా అవగాహన కలిగిస్తే? అదిగో.... అలాంటి విశిష్ట ప్రయత్నమే అలనాటి నాటక ప్రస్థానం.

 

పరిశోధన, పరిశ్రమల మేళవింపు

 

గమనిస్తే... 1880ల నుంచి ఇప్పటి వరకు ఎందరో నటులు, నాటక కర్తలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాల వల్లే తెలుగు నాటక రంగం ఇప్పటి అత్యున్నత స్థితిని చేరుకుంది. అయితే, తెలుగునాట నాటక విమర్శ, పరిశోధన... రెండూ తక్కువే. మన తెలుగు నాటక చరిత్రను కూలంకషంగా గ్రంథస్థం చేసినదీ అతి స్వల్పమే. బళ్ళారి రాఘవ నుంచి నిన్న మొన్న దివంగతులైన వందలాది నటీనటుల అభినయ వైదుష్యం అరకొరగా అయినా అక్షరాల రూపంలో ఉందేమో కానీ, వారి గాన మాధుర్యం, నట వైదుష్యాలను ప్రత్యక్షంగా చూసినవారు నేడు అరుదు. అలాంటి పరిస్థితుల్లో... అంతకంతకూ చదవడం తగ్గిపోతున్న నవతరాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని, మన నాటక రంగ శ్రవ్య, దృశ్య వైభవాన్ని రూపకంగా అందించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఈ తరానికి అలవాటైన, అందరికీ అందుబాటులో ఉన్న యూ ట్యూబ్ వేదికగా అజో... విభో... కందాళం ఫౌండేషన్ ఈ అరుదైన కానుకను సమర్పించింది.


అలా... నాటి మేటి నటీనటుల శ్రవ్య – దృశ్య కళారూపకం ఈ అలనాటి నాటక ప్రస్థానం. మొత్తం 8 భాగాలుగా దీన్ని అందించారు. అన్ని భాగాలూ కలిపి దాదాపు 10 గంటల నిడివి గల సిరీస్ ఇది. ఒక్కమాటలో ఈ సిరీస్ ఎంతో శ్రమతో సాగించిన యజ్ఞం. ప్రముఖ నాటక రంగ పరిశోధకుడు – రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు ఈ రూపకం కోసం అనేక నెలల పాటు పరిశోధించారు. సంబంధిత నటీనటుల దృశ్య, శ్రవ్య ఖండికల సేకరణ నిమిత్తం చాలానే పరిశ్రమించారు. ఆ పరిశోధన, పరిశ్రమ... ఈ రూపకాన్ని చూస్తున్నప్పుడు కళ్ళకే కాదు... మనసుకు కూడా తడతాయి.



 

మూడేళ్ళ క్రితమే... మరో మహత్తర అక్షర కృషి

 

కొద్దిగా వెనక్కి వెళితే... అజో-విభొ- కందాళం ఫౌండేషన్ వారే మూడేళ్ళ క్రితం తెలుగు నాటకరంగ మూలస్తంభాలు పేరిట అపూర్వమైన గ్రంథాన్ని ప్రచురించారు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి కృషి చేసిన తొలి, మలి తరాల రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సంక్షిప్త పరిచయాలతో కూడిన వ్యాస సంకలనం అది. తెలుగు రంగస్థలంపై వారి ప్రాథమిక కృషితో పాటు అరుదైన వారి ఛాయాచిత్రాలను కూడా గుదిగుచ్చిన దాదాపు వెయ్యి పేజీల బృహత్ గ్రంథమది. ఆ రచన కూడా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చేసినదే! మరో రచయిత వాడ్రేవు సుందరరావు ఆ కృషిలో ఆయనకు భాగస్వామిగా వ్యవహరించారు. అందులో 120 మంది నాటక రచయితలు, 117 మంది నటులు – దర్శకులు, 24 మంది సాంకేతిక నిపుణులు... వెరసి 261 మంది దివంగత మహనీయమూర్తుల గురించిన సమాచారం, అపురూపమైన ఫోటోలతో అందించారు.


ఒక రకంగా ఆ బృహత్ రచన సమయంలోనే కందిమళ్ళకు ఈ అలనాటి నాటక ప్రస్థానం శ్రవ్య – దృశ్య రూపకం ఆలోచన వచ్చి ఉండాలి. బహుశా అందుకే... నవతరాన్ని మరింత ఆకట్టుకొనేలా, అలనాటి నటీనటుల కృషి తెలిసేలా వారే పాడిన గ్రామఫోన్ రికార్డులు, నటించిన సినిమాలలోని దృశ్యాలు కష్టపడి సేకరించి, ఈ అరుదైన రూపకాన్ని రూపొందించారు. అందమైన మాలగా గుదిగుచ్చారు. ఈ ప్రయత్నం రంగస్థల అభిమానులందరికీ అమితమైన ఆనందం పంచుతుంది. పేర్లు చదవడమే తప్ప, ప్రత్యక్షంగా తాము చూడని అమరులైన దాదాపు 84 మంది అలనాటి సుప్రసిద్ధ నటీనటులను మళ్ళీ కళ్ళ ముందు ఉంచుతుంది. అప్పటి వారి మాట, పాట, అభినయాలను ఈ తరం మళ్ళీ మళ్ళీ చూసుకొనే అవకాశం కల్పిస్తుంది.

 

కళ్ళ ముందు... నాటి అపూర్వ కళాప్రతిభ

 

బళ్ళారి రాఘవ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, యడవల్లి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తుంగల చలపతిరావు, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి, దాసరి కోటిరత్నం లాంటి 1920 – 30ల తరం ఈ రూపకంలో కనిపిస్తారు. అలాగే, ఆధునికులైన గరికపాటి రాజారావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు జమునా రాయలు వరకు పలువురి పాటలు, పద్యాలు, నటన నిండిన వీడియోలు కూడా ఇందులో ఉన్నారు. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడిన ఈ బృహత్తర యజ్ఞానికి అజో- విభొ- కందాళం ఫౌండేషన్ పక్షాన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆర్థికంగానూ, అన్ని విధాల గానూ అండగా నిలిచారు. ఈ పదిగంటల రూపకాన్ని పూర్తిగా ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంచారు.

యూ ట్యూబ్ వేదిక కావడం ఈ శ్రవ్య – దృశ్య కళారూపకానికి ఉన్న ప్రధానమైన వెసులుబాటు. ఎందుకో తెలియని పరుగుపందేలతో, ఎప్పుడూ తీరిక దొరకని ఈ ఆధునిక కాలంలో... ఎవరి వీలును అనుసరించి వారు ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ భాగాలను చూసే సౌకర్యం లభిస్తుంది. దేశ విదేశాలలోని నాటక రంగ ప్రియులకూ, పరిశోధకులకూ అలా ఇది ఓ అయాచిత వరం.

 

తొలిసారిగా... జంట నగరాల్లో!

 

ఇటీవలే గుంటూరులో లాంఛనంగా ఆవిష్కరణ జరుపుకొన్న ఈ రూపకాన్ని ఇప్పుడు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లోని కళాభిమానులకు తొలిసారిగా పరిచయం చేయనున్నారు. అజో-విభొ-కందాళం ఫౌండేషన్, ప్రముఖ రంగస్థల వేదిక రసరంజని సంయుక్తంగా ఆ పరిచయ సభను నిర్వహిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సర కానుకగా ఈ మార్చి 23, సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పరిచయ సభ జరగనుంది. హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్‌లో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాటక రంగ ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, కళాపోషకులు – ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, రూపకాన్ని రూపొందించడానికి శ్రమించిన కందిమళ్ళ సాంబశివరావు, ఆచార్య అప్పాజోస్యలు సత్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారు. పది గంటల నిడివి గల అలనాటి నాటక ప్రస్థానం రూపకాన్ని ఆనాటి సభలో ఒక గంట నిడివికి కుదించి, ముఖ్యాంశాలను సభికులందరికీ ప్రదర్శించనుండడం విశేషం.

   


ఒక్కమాటలో... తెలుగు నాటకం, సినిమాలు రెంటితోనూ ముడిపడ్డ అలనాటి మహామహుల కృషిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేందుకు, వినేందుకు ఈ రూపకం ఓ అద్భుత అవకాశం. నాటక రంగ అభిమానులకే కాదు... మన ఘన చరిత్రపై ఆసక్తి ఉన్నవారందరికీ ఈ కళారూపకం మృష్టాన్నభోజనం. దృశ్య – శ్రవ్య వేదికల్లో నాటి ప్రయోగాల నుంచి నేటి వరకు వచ్చిన మార్పులను తులనాత్మకంగా అధ్యయనం చేయదలుచుకున్నవారికైతే... ఇది సిద్ధాన్నం. తాజా పరిచయ సభ సాక్షిగా పెద్దల మాటలు వింటూ, ఆ రూపకాన్ని ఆస్వాదించే అపూర్వ అవకాశానికి అందరూ ఆహ్వానితులే.

-  రెంటాల జయదేవ

Sunday, April 19, 2026

కళ్ళకు కట్టిన ఓ మహనీయ జీవితం

 

-      శతజయంతి వేళ ప్రజాసేవకుడు మండలి వెంకట కృష్ణారావు అపూర్వ నాటక ప్రదర్శన

 

సమకాలీనులైన ప్రముఖుల జీవితాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం... తెర మీదైనా, వేదిక మీదైనా ఎప్పుడూ కత్తి మీద సామే. ఒక బయోగ్రఫీని బయోపిక్ సినిమా, లేదా డ్రామాగా మలచాలంటే... అప్పటి సాంఘిక వాతావరణాన్ని పునఃసృష్టించడంలో చిక్కులతో సహా దర్శక, రచయితలకు సవాలక్ష సవాళ్ళు ఉంటాయి. వాటిని అధిగమించి, ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవడంలోనే సృజనశీలురైన ప్రయోక్తలు, నటులకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభవం మిగులుతుంది. సరిగ్గా అలాంటి నాటకమే... శతవసంత సేవామూర్తి, సాంస్కృతిక దీప్తి మండలి వెంకట కృష్ణారావు జీవితకథగా రంగభూమిపై ప్రదర్శితమైన మహాపురుషుడు... మండలి.

చిన్ననాటి నుంచి చివరి వరకు విలువలతో కూడిన జీవితం గడిపిన మండలి వెంకట కృష్ణారావు జీవన ప్రస్థానాన్ని రంగస్థలంపై చూపేందుకు చేసిన అద్భుత ప్రయత్నం ఇది. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ మాజీ సంచాలకులు, ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ ఈ అపూర్వ నాటక రచన చేశారు. ప్రసిద్ధ నటుడు – నాటక ప్రయోక్త గంగోత్రి సాయి ఈ ప్రదర్శనలో కీలకమైన మండలి వారి పాత్రను పోషించడమే కాక, సమర్థంగా దర్శకత్వం వహించారు. సాయి దర్శకత్వంలో విజయవాడ సమీపంలోని తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ నాటక సమాజం వారు ఈ నాటకాన్ని మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి కె.వి. రమణాచారి సారథ్యంలోని ప్రసిద్ధ రసరంజని నాటక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగింది. దాదాపు రెండు గంటల పైచిలుకు నిడివి గల నాటకం నిలబడి మరీ చూసిన ప్రేక్షకుల సాక్షిగా ఆద్యంతం అలరించింది. 


            కళకు టెక్నాలజీ తోడ్పాటు... రంగభూమిపై ఏఐ దృశ్యాల వినియోగం

 

సినిమాలోని స్టార్ట్... కట్ లకు భిన్నంగా అక్కడికక్కడ ఆగకుండా సాగే నాటకంలో దృశ్యాలను పండించాలంటే రంగాలంకరణ కీలకం. మరి, వందేళ్ళ క్రితం నాటి పరిస్థితుల్ని వేదికపై మళ్ళీ సృష్టించాలంటే ఎంతో శ్రమ. అందుకే, మహాపురుషుడు... మండలిలో ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇప్పటి దాకా మనం తెర మీదే చూస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)ను రంగస్థలంపై దృశ్యనేపథ్యాలకు సహాయంగా వినియోగించుకోవాలనే ఆలోచన చేశారు. రంగస్థలిపై ఎల్ఈడీ తెరపై చూపుతున్న అప్పుడెప్పుడో ఆ కాలానికి చెందిన ఫోటోలు – దృశ్యాలు - పాటల చలనచిత్రాన్నీ, వేదికపై నటీనటులు ఇప్పటికిప్పుడు చూపుతున్న హావభావాల రంగస్థల ప్రదర్శననూ తెలివిగా మిళితం చేశారు. చలనచిత్రాన్నీ, రంగస్థలాన్నీ... ఒకదానికొకటి పరిపూరకంగా మార్చారు. మంత్రిగా కారు సౌకర్యం ఉన్నా అది వద్దని, సామాన్యులతో కలసి బస్సులో ప్రయాణిస్తూ మండలి కృష్ణారావు వారు చూపిన నిరాడంబరత, గడిపిన ఆదర్శ జీవనాన్ని ప్రస్తావించారు.

 

అధిక ఖర్చుతో కూడిన సెట్లకు బదులు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సౌలభ్యాన్ని వాడుకోవడం రంగస్థలంపై కొంతకాలంగా ఉన్నదే. గతంలో చాలా ఏళ్ళ క్రితమే గుమ్మడి గోపాలకృష్ణ లాంటి రంగస్థల సుప్రసిద్ధులు ఇలా టెక్నాలజీని వినియోగించుకున్నారు. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో చూసిన ఓ తెలుగువారి ప్రదర్శనతో స్ఫూర్తి పొందిన గోపాలకృష్ణ వెనువెంటనే 2014లోనే తన సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంతో తెలుగునాట రంగస్థలంపై ఇలా వీడియో ద్వారా నేపథ్య దృశ్య ప్రదర్శన విధానాన్ని మొదలుపెట్టారు. సత్యహరిశ్చంద్ర, ఆపైన శ్రీకృష్ణ రాయబారం’, ‘వేమన, శ్రీనాథుడు లాంటి నాటకాలకు శ్మశానం, కౌరవ సభ లాంటి వాటిని ప్రత్యేకంగా సెట్ వేయకుండా, ఎల్ఈడీ తెరపై వీడియో ప్రొజెక్షన్ ద్వారా నేపథ్యంగా చూపుతూ, దాని ముందు పాత్రలు నటించడమనే టెక్నిక్‌ను ఆయన తెలుగునాట వాడి చూపించారు.

ఆ తర్వాత కాలంలో ఆచార్య కోట్ల హనుమంతరావు లాంటివారు వడ్డేపల్లి కృష్ణ రచించిన జయ జయహే తెలంగాణ లాంటి నృత్య నాటకాలకూ, అలాగే ప్రతాప రుద్రమ నాటక త్రయానికీ ఆ పద్ధతిని వినియోగించారు. ఇటీవలి కాలంలో పలువురు యువకులు కొత్తగా వచ్చిన ఏఐని నేపథ్య దృశ్యాలకు వాడడం మొదలుపెట్టారు. తాజాగా విజయవాడకు చెందిన రంగస్థల నట - దర్శకుడు పి.వి.ఎన్. కృష్ణ లాంటి వారు తమ ఛత్రపతి శివాజీ నాటకానికి సైతం ప్రదర్శనలో ఈ తరహా ప్రయోగాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు.

అయితే, ఎల్ఈడీ తెరల ఖర్చు, శ్రమతో కూడిన ఈ ప్రయోగం అన్నిచోట్లా సులభసాధ్యం కాదు. సన్నివేశానికి తగ్గట్టు అమరకపోతే నాటకానికీ నగుబాటే. తాజా మహాపురుషుడు... మండలినాటకంలో మాత్రం నేపథ్యంలో వాడిన ఏఐ సృష్టి దృశ్యాలలో ఒకటీ అరా చిన్న లోటుపాట్లున్నా సమయ సందర్భాలకు తగ్గట్టు సమర్థంగా ఉపయోగించారు. సామాన్యుల్ని మెప్పించారు. ఈ వినూత్న ప్రయోగంతో... ప్రదర్శన పద్ధతుల్లో తెలుగు నాటకరంగాన్ని మరో కొత్త పుంత తొక్కించారు. ప్రేక్షకుల మనఃఫలకంపై వేదికను అపూర్వంగా వెలిగించారు.

 

నాటకంగా... తెలుగు వెలుగుల జీవితం

 

రచన విషయానికొస్తే – గాంధీ, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకులపై నాటక రచనలు, ప్రదర్శనలు కొత్త కాదు. అయితే, తెలుగు సమాజంలోని త్యాగపురుషులు, జాతీయోద్యమ నాయకులపై మాత్రం అవి చాలా అరుదే. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుపై చాలాకాలం క్రితం ఆచార్య మొదలి నాగభూషణశర్మ ప్రజానాయకుడు ప్రకాశం అంటూ నాటక రచన చేశారు. అప్పట్లో రసరంజని సంస్థ దాన్ని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇప్పుడు మండలి వెంకట కృష్ణారావుపై తాజా నాటకం మహాపురుషుడు... మండలి ఆ అరుదైన ప్రయత్నాల వరుసలో తాజా చేర్పు. తెలంగాణ ప్రాంతం నుంచి సుప్రసిద్ధులైన తెలుగు తేజాలు సురవరం ప్రతాపరెడ్డి, కొత్వాల్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి లాంటి ప్రసిద్ధులపై నాటక రచన చేసిన అనుభవం దీర్ఘాసి విజయభాస్కర్‌ది. ఆ అనుభవంతో పాటు మండలి వారిపై అభిమానం, ఆయన సేవాతత్పర జీవితంపై లోతైన అవగాహనతో ఆనాటి పరిస్థితుల్ని అక్షరాక్షరంలో నింపుకొని విజయభాస్కర్ ఈ రచన చేశారు. అది ఈ నాటక ప్రదర్శనలో అడుగడుగునా ప్రస్ఫుటమవుతుంది.

 

మండలి వంశ చరిత్ర మొదలు కృష్ణారావు బాల్యం, స్వాతంత్ర్యోద్యమ కాలప్రభావం, బ్రిటీషు పాలకులపై సాగిన క్విట్ ఇండియా ఉద్యమం, రైతుల పక్షాన చేపట్టిన పోరాటాలు, స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో అవిస్మరణీయమైన కాంగ్రెస్ నేతగా కృష్ణారావు ఎదిగిన తీరు, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దాకా చేపట్టిన పదవులు, చేసిన సత్కార్యాలు, తెలుగు అధికార భాషా సంఘం – ఉర్దూ అకాడెమీ – బాలల అకాడెమీ – వివిధ కార్పొరేషన్లు ఆదిగా అనేక మౌలిక సంస్థల ఏర్పాటులో ఆయన కృషి, అవనిగడ్డలో గాంధీ క్షేత్రం స్థాపన, పులిగడ్డ వంతెన సహా చివరి వరకు ప్రజాక్షేమం కోసమే పలవరించిన తీరు, రాజకీయాల్లో ఆయన తాత్విక భావధారకు కొనసాగింపుగా మండలి బుద్ధప్రసాద్‌ ముందుకు రావడం... ఇలా దాదాపు కొన్ని దశాబ్దాల సమీప కాలపు సమకాలీన చరిత్రను ఈ నాటకంలో కళ్ళ ముందుకు తెచ్చారు రచయిత. ముఖ్యంగా, తెలుగు భాషా, సాంస్కృతిక వికాసానికి మండలి వారు చేసిన కృషి, 1977 నవంబర్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన సాగించిన అనుపమానమైన సేవను ఈ నాటకం మరోసారి గుర్తు చేసింది. మళ్ళీ ఈ తరానికి పరిచయం చేయడంలో అన్నివిధాలా కృతకృత్యమైంది.



 

విజయవంతమైన రచనా భాస్వరం

 

పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు లాంటి రాజకీయ ఉద్దండుల పాత్రలు నాటకంలో కనిపించడం, కీలక సందర్భాల్లో వారు మండలి వారికి ఇచ్చిన తోడ్పాటును చూపించడం ప్రేక్షకులలో పురా జ్ఞాపకాల పేటికలను తెరుస్తుంది. ప్రధాన నాటక అంశాన్ని నేపథ్యంగా తీసుకొని, ఆ పరిధిని దాటకుండానే సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పటికీ వెంటాడే డైలాగులు కొన్ని రాశారు. మనసులో మలినం లేని ప్రతి మనిషీ మాధవుడే..., భాష చచ్చిపోతే... జాతి సగం చచ్చినట్టే,జనంతో కలసి నడిచేవాడు మామూలు మనిషి, జనానికి ముందుండి నడిపించేవాడు నాయకుడు,శ్వాస కన్నా ఆశ పెద్దది, అటు శవాలు... ఇటు జీవచ్ఛవాలు లాంటి అనేక సంభాషణలే అందుకు ఉదాహరణ. అలాగే, నాటకాన్ని నడిపే సూత్రధారుల సంభాషణల్లో సందర్భానుసారం సమకాలీన కలుషిత రాజకీయ వాతావరణాన్ని స్ఫురింపజేస్తూ, బలంగా మాటల కొరడా ఝళిపించడం మరో విశేషం.

రచనతో పాటు ప్రదర్శనలోనూ వివిధ పాత్రధారులు, నేపథ్య సంగీతం సహా పలువురు సాంకేతిక నిపుణుల సాయంతో రక్తికట్టిన నాటక ప్రదర్శన ఇది. సామాన్య రైతుల పాత్రల నుంచి మండలి వారి సహధర్మచారిణి పాత్ర దాకా అందరూ బాగా చేయడంతో చిన్నపాటి లోపాలేవీ కనిపించకుండా పోయాయి. గరిష్ఠ భూపరిమితి చట్టం కింద భూములు ఇవ్వబోమన్న కామందుల సందర్భంలో ఓ పాత్ర పదే పదే చెప్పే ఒక్క డైలాగుతో హాస్యం పండితే... స్వాతంత్ర్య కాలంలో సాగుభూములను ఇతర అవసరాలకు కేటాయించిన ప్రభుత్వ నిర్ణయ వేళ భూమికీ – రైతుకూ మధ్య అనుబంధాన్ని చెబుతూ బడుగు రైతులు బాధపడే సందర్భం మనసును మెలిపెడుతుంది. ఏడున్నర ఎకరాల భూమిలో అయిదున్నర ఎకరాలను నిరుపేదలకు అందించిన మండలి వారి త్యాగనిరతిని చూసినప్పుడు మన కాలంలో మన మధ్యనే ఇలాంటి ఓ నిస్వార్థ జీవి నడయాడాడనే భావనతో తీయటి బాధతో గుండె అంతా నిండిపోతుంది.  

 

కన్నీరు పెట్టించిన అపూర్వ అభినయం

 

ఇంత నాటకంలోనూ దాదాపుగా ద్వితీయార్ధమనిపించే చివరి గంట హైలైట్. మధ్యవయసు మండలి పాత్రను పోషించిన గంగోత్రి సాయి అక్కడ నాటకాన్ని పూర్తిగా తన భుజాలపై నడిపించారని చెప్పక తప్పదు. తమిళ రాజకీయ నేత కామరాజ్‌ను తలపించే పొడుగు చేతుల హాఫ్ హ్యాండ్స్ ఖాదీ చొక్కా నుంచి హిట్లర్ మీసకట్టు, ఎడమ చేతితో పంచె చెరగును పట్టుకొని నడిచే నడక, నిరాడంబరమైన నడత, మాట తీరులో మార్దవం, మానవీయత... వీటన్నిటితో అక్షరాలా మండలి కృష్ణారావును అణువణువునా శరీరంలో ఆవాహన చేసుకొని గంగోత్రి సాయి నటించారు. అందులోనూ, 1975 నాటి తొలి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ – ప్రసంగ సందర్భం, అలాగే 1977 నాటి ప్రకృతి విలయతాండవ వేళ తల్లడిల్లిన ఆ మానవతా మూర్తి హృదయాన్ని రంగస్థలంపై అభినయించిన తీరు, నాటక పతాక సన్నివేశం లాంటివి మరీ ప్రత్యేకం. చిమ్మచీకటిలో టార్చిలైటు వేసుకొని, శవాల దిబ్బల మధ్య కొన ఊపిరితో కొట్టుకుంటున్న అభాగ్యుల కోసం మండలి వారు అన్వేషించే సన్నివేశం, కాళ్ళకు పుండ్లు అయినా కట్లు కట్టుకొని మరీ తిరుగాడే దృశ్యం లాంటివి ఎంతటివారినైనా కన్నీళ్ళు పెట్టించక మానవు. మండలి వారి పాత్ర పోషించిన గంగోత్రి సాయి కాళ్ళకు దణ్ణం పెట్టాలనుంది అని కవి – గాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ సభ్యుడు గోరటి వెంకన్న అన్నారంటే వేదికపై వెలిగిన అభినయ దీప్తిని అర్థం చేసుకోవచ్చు.



జీవితపు చివరి క్షణాల ఘట్టంలో... ఇటు భార్యాబిడ్డలతోనూ, అటు ప్రజాక్షేమం కోసం రాజకీయ నాయకులతోనూ మండలి వారి పాత్ర సంభాషించే సందర్భం నాటకాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. అటు రచయిత రచనా సామర్థ్యం, ఇటు ప్రధానపాత్రధారి అభినయ నైపుణ్యం... పరస్పరం పోటీ పడ్డాయి. ఒకటికొకటి జతకలసి, ప్రేక్షక హృదయాలను తడిపేశాయి. సాత్వికాభినయంతో, నెమ్మదిగానే అయినా స్థిరంగా సాగే సంభాషణా శైలితో, శాంత - కరుణ రసాలను గంగోత్రి సాయి పండించిన తీరు ప్రేక్షకులు కళ్ళారా చూసి అనుభవించదగ్గ వైయక్తిక అనుభూతి. అనేక సందర్భాల్లో ఈ నాటకం అప్రయత్నంగా కన్నీరు పెట్టించింది. ఇది మరిచిపోలేని అనుభవం అని ప్రముఖ రంగస్థల – సినీ రచయిత తనికెళ్ళ భరణి లాంటి వారు అభిప్రాయపడింది అందుకే! ఒక రకంగా ఈ నాటక ప్రేక్షకులందరి సార్వజనీన అనుభవం కూడా అదే!!

 

అక్షరాలా... అంతిమ పరమార్థం

నిజాయతీ, నిరాడంబరత, నిస్వార్థం, కార్యదీక్ష, ప్రజాసంక్షేమమే పరమావధి తదితర సుగుణాలు రాశి పోసిన ఇలాంటి నాయకుల జీవితాలు వర్తమాన సమాజానికీ, సందర్భానికీ అత్యంత అవసరం. ఆ ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని సొంత ఖర్చుతో డాక్యుమెంటరీగా చిత్రీకరించడానికి మాజీ ఎమ్మెల్యే వి. ప్రభాకర చౌదరి ముందుకు వస్తానన్నది. మరో అడుగు ముందుకేసి, ఈ ప్రదర్శనను నేటి తరం రాజకీయ నాయకులు చూసేలా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభ, శాసన పరిషత్తుల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించాలి. ఈ నాటకం చూసి కనీసం 20 మంది రాజకీయ నాయకులు మారినా ఈ దేశం బాగుపడుతుంది" అని దర్శకుడు శివనాగేశ్వరరావు అన్న మాటలు ఆలోచించాల్సినవి. తప్పకుండా ఆచరించి తీరాల్సినవి. ఇప్పటికే అవనిగడ్డలో మొదలుపెట్టి విశాఖపట్నం మీదుగా ముచ్చటగా మూడో ప్రయత్నంగా హైదరాబాద్‌లో అలరించిన మహాపురుషుడు... మండలి లాంటి రచన, ప్రదర్శనల అంతిమ పరమార్థం అదే కదా!                              

  
-
రెంటాల జయదేవ