జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, January 29, 2014

నడవనే లేని గుర్రం ఎగిరేదెలా? ( సినిమా రివ్యూ- 'ఏమో గుర్రం ఎగరావచ్చు!')


            ఆధునికంగా ఆలోచించే అమెరికా అబ్బాయి - పల్లెటూరి అమ్మాయిల పెళ్ళి కథలు, దానికి రివర్స్‌గా పల్లెటూరి అబ్బాయి - ఆధునికమైన అమ్మాయి పెళ్ళి కథలు ఇప్పటికి చాలాసార్లే తెర మీదకు వచ్చాయి. ఏదో బలవంతం మీద పెళ్ళి చేసుకున్న వారి సంసార జీవితంలో వచ్చే ఇబ్బందులు, చివరకు ఒకరు తప్పు తెలుసుకొని మరొకరిని గౌరవించడమనే కథన సూత్రం ఇట్టే తెలిసిన విషయమే. ఈ ఇతివృత్తాన్ని కాస్త అటూ ఇటూ చేసి వచ్చిన ఏయన్నార్‌ 'పల్లెటూరి బావ' దగ్గర నుంచి శ్రీకాంత్‌ 'ఇంగ్లీషు పెళ్ళాం - ఈస్టు గోదావరి మొగుడు' దాకా చాలానే తెలుగు ప్రేక్షకులు చూసేశారు. మళ్ళీ అలాంటి కథతోనే వచ్చిన తెలుగు తెర పాత చింతకాయ పచ్చడి - 'ఏమో గుర్రం ఎగరావచ్చు!'

     తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పూసపాటి బుల్లెబ్బాయి (సుమంత్‌). పదో తరగతి పధ్నాలుగు సార్లు ఫెయిలైన అతగాడికి పెళ్ళి, అమెరికాకు వెళ్ళడం అనేవి అందని చందమామలుగా అనిపిస్తుంటాయి. ఇంతలో అతని బంధువైన హీరోయిన్‌ నీలవేణి (పింకీ సావిక) అమెరికా నుంచి వస్తుంది. ఆమెకు తమ సామాజిక వర్గంలోనే పెళ్ళి చేయాలని ఆమె తండ్రి భావిస్తాడు. వచ్చిన సంబంధాన్నల్లా తిరగ్గొట్టే హీరోయిన్‌, అప్పటి దాకా తాను పదే పదే గొడవ పడిన హీరోతో పెళ్ళికి సిద్ధమవుతుంది. 

   ఈ పెళ్ళి చేసుకొని,అమెరికా వెళ్ళాక రెండు నెలల్లో విడాకులు ఇచ్చేస్తాను, వేరొకరిని పెళ్ళి చేసుకుంటానంటూ హీరోకు ముందే చెప్పేస్తుంది. అయినా సరే హీరో సరేనని ఒప్పుకుంటాడు. అక్కడికి ఫస్టాఫ్‌ అయిపోతుంది. పెళ్ళయిన వాళ్ళిద్దరూ అమెరికాకు వెళతారు. అక్కడ ఏమైంది, నిజంగానే హీరోయిన్‌ మరొకరిని ప్రేమించిందా? మరి హీరో ఏం చేశాడు? లాంటివన్నీ మిగతా కథ. 


రెండున్నర గంటలకు ఓ అయిదారు నిమిషాలు తక్కువ నిడివి ఉన్న ఈ 'యు/ఏ' చిత్రంలో కథలో, పాత్రల ప్రవర్తనలో లోపాలు కొల్లలు. పక్కా పల్లెటూరిలో పుట్టి పెరిగిన హీరోయిన్‌ అమెరికా నుంచి వచ్చేటప్పటికి మాత్రం తానేదో విదేశాల్లో పుట్టి పెరిగిన దానిలా ఆలోచిస్తుంటుంది, ప్రవర్తిస్తుంటుంది. అది అలా ఉంటే, హీరోతో ఎప్పుడూ తగాదా పడే ఆ అమ్మాయి ఉన్నట్టుండి అతనికి ముద్దుపెట్టి, పెళ్ళికి సిద్ధపడడానికి కారణం ఏమిటో అర్థం కాదు. మరోపక్క అమెరికా వెళ్ళగానే విడాకులు ఇచ్చేస్తానని చెప్పాక కూడా ఆమెతో పెళ్ళికీ, అమెరికా వెళ్ళడానికీ ఎందుకు ముందుకు వచ్చినట్లు? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలెన్నో ప్రేక్షకులను గందరగోళపెడతాయి. 
    ఫస్టాఫ్‌లో వచ్చే గోదావరి జిల్లా వేళాకోళాలు, వెక్కిరింతలు కొద్ది క్షణాలు ఫరవాలేదనిపించినా, ఆ తరువాత మరీ అతి అనిపించేస్తాయి. సీరియల్‌ తరహాలో కాంచి, తన మిత్ర బృందంతో చేసిన కామెడీ కూడా అంతే! ఫస్టాఫ్‌ అంతా పల్లెటూరి వాతావరణంలో నడిస్తే, సెకండాఫ్‌ అమెరికా నేపథ్యంలో సాగుతుంది. కథ అమెరికాకు మారాక సీన్ల వెంట సీన్లు వచ్చి వెళుతుంటాయే తప్ప, వాటిలో చెప్పిన విషయం కానీ, నడిచిన కథ కానీ చాలా తక్కువ. దాంతో, ఇంటర్వెల్‌ తరువాత పది, పదిహేను నిమిషాలకే ప్రేక్షకులకు సినిమా చివరి సీను తెలిసిపోతుంది. ఆద్యంతం సినిమా చూశాక దానితో తమకు కలిగే తలనొప్పి రిజల్టూ అర్థమైపోతుంటుంది. 
    అసలు ఈ కథను ఎంచుకోవడంలోనే లోపం ఉంది. సంగీత దర్శకుడు కీరవాణికి సోదరుడైన కాంచి ఇతివృత్తం వరకే కాదు... చివరకు దానికి రచనలోనూ కొత్తదనం చూపలేకపోయారు. త్వరలోనే దర్శకుడి అవతారం కూడా ఎత్తాలని అనుకుంటున్న ఆయన ఇలాంటి ప్రాథమికమైన తప్పులు చేయడం ఆలోచనలో పడేస్తుంది. ఇక, దర్శకుడి కథనమూ అంతే! ఫస్టాఫే అంతంత మాత్రంగా ఉందని అనుకుంటే, సెకండాఫ్‌కు వచ్చేసరికి గుర్రం పూర్తిగా పడుకుండిపోయింది. కీరవాణి మార్కు సెంటిమెంట్‌ గీతాలాపనలు, వయొలిన్‌ వాదన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్లు కూడా గుర్రాన్ని నిలబెట్టలేకపోయాయి. 
   ఈ కథకు, కథానాయకుడి పాత్రకు సుమంత్‌ ఏ మాత్రం సరిపోయినట్లు అనిపించరు. మంచివాడైన పల్లెటూరి యువకుడు పూసపాటి బుల్లెబ్బాయి పాత్రలో చురుకుగా కనిపించాలనీ, చాలా ఫ్రీగా, ఓపెన్‌గా నటించాలనీ ఆయన భావించారు. అందుకు ప్రయత్నించారు కూడా! కానీ, తీరా తెర మీద చూస్తే, ఆయన అభినయం అత్యంత కృతకంగా కనిపిస్తుంది. సుమంత్‌ ఆడగెటప్‌లో కూచిపూడి తరహా డ్యాన్స్‌ చేస్తూ కనిపించే 'సంపంగి పువ్వు లాంటి దాన్ని రా...' పాట కాసేపు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించినా, కథకు పెద్దగా అవసరం లేని పాట అది. కాకపోతే, కథకు ఓ ఐటమ్‌ సాంగ్‌గా పనికొచ్చిందనుకోవాలి. 
   కథానాయికగా తెర మీదకు వచ్చిన థారు నటీమణి పింకీ సావిక (తొలి పరిచయం) అందానికీ, అభినయానికీ - రెంటికీ తక్కువే. ఇక, సినిమాలో ఫస్టాఫ్‌ నడపడానికి కాంచి, బృందం, సెకండాఫ్‌ నడపడానికి 'తాగుబోతు' రమేశ్‌ కనిపిస్తారు. కానీ, వాళ్ళ సినిమాల జాబితాలో మరో అంకె పెరిగిందేమో తప్ప, సినిమాకు ఉపయోగపడింది తక్కువ. ఫస్టాఫ్‌లో కాసేపు అన్నపూర్ణ, సుధ, శివన్నారాయణ లాంటివాళ్ళు కనిపిస్తారు. 

    సినిమా చిత్రీకరణకు ఎంచుకున్న లొకేషన్లు, కలర్‌ స్కీముల వరకు బాగానే అనిపిస్తాయి. అమెరికా పేరు చెప్పి, అత్యధికంగా బ్యాంకాక్‌ లాంటి చోట్ల తీసినట్లు అర్థమవుతుంది. అయితే, ఆసక్తి లేని మందగమనపు కథనంతో అవేవీ ఉపయోగపడలేదు. పైగా, కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసిన దర్శకుడు కొన్ని చోట్ల అపాన వాయువు జోకులు, ''సెకండ్‌ హ్యాండ్‌ కన్నా నా హ్యాండే బెటర్‌'' అంటూ హీరోతో అశ్లీలార్థం ధ్వనించే డైలాగులకు దిగకుండా ఉండాల్సింది. వెరసి, ఇప్పటి దాకా 'ఫీల్‌ గుడ్‌' సినిమాలు ఎక్కువ తీసిన చంద్రసిద్ధార్థ తాజా చిత్రంలో అటు ఫీలూ లేదు. కనీసం గుడ్‌ సినిమా అయినా కాకుండా పోయింది. తీసుకున్న కథను కూడా ఆసక్తికరంగా, మనస్సుకు హత్తుకొనే సెంటిమెంట్‌ సీన్లతోనైనా చెప్పకపోవడంతో ఈ కుంటి గుర్రం ఎగరడం మాట దేవుడెరుగు... కనీసం కుంటు కుంటూ నడవను కూడా నడవలేకపోయింది! ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న హీరో సుమంత్‌ కానీ, దర్శకుడు చంద్రసిద్ధార్థ కానీ తమ కెరీర్‌లో పైకి ఎదగాలన్నా, ఎగరాలన్నా మరికొంత వేచి ఉండక తప్పదు!

కొసమెరుపు: ఆర్థిక ఇబ్బందులు వచ్చి, అనుకున్న దాని కన్నా ఒక రోజు ఆలస్యంగా శనివారం నాడు విడుదలైన ఈ సినిమా.... నిజానికి కథంతా చూశాక కనీసం ఓ పాతికేళ్ళ క్రితం రావాల్సినదని అనిపిస్తుంది. సినిమా చివరలో కనువిప్పు కలిగిన హీరోయిన్‌ 'లైఫ్‌ అనేది మిస్టరీగా ఉండాలి' అంటుంది. ముందే అన్నీ పక్కాగా ప్లాన్‌ చేసేసి, అలానే బతకడాన్ని నిరసిస్తూ, 'ఐ డోంట్‌ వాంట్‌ టు లివ్‌ ది సేమ్‌ లైఫ్‌ ఎగైన్‌' అని కుండబద్దలు కొడుతుంది. కానీ, అదే సూత్రాన్ని తాము తీసుకున్న కథకూ, తీసే సినిమాకూ అప్లరు చేయడం దర్శక, రచయితలు మర్చిపోయినట్లున్నారు! చూసేసిన చాలా సినిమాల్లో ఉన్న అదే రకం కథను ప్రేక్షకులు ఇంకోసారి చూస్తారంటారా?

-  రెంటాల జయదేవ
(Published in 'PrajaSakti' daily, 26th Jan 2014, Sunday, PageNo.8)
.......................................................................

Tuesday, January 28, 2014

కాంతి నింపిన 'మిణుగురులు' (సినిమా రివ్యూ)

(This review was telecasted in 10tv)
     
  టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వాస్తవిక, సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. అడపాదడపా ఒకటి అరా వచ్చినా అవి వాస్తవికతకు దూరంగా ఉండడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అవడంలో విఫలమవుతున్నాయి. దీనికి తోడు కథలో దమ్ము లేకపోవడంతో ఇలాంటి సినిమాలు ఆదరణకు గురవడం లేదు. ఈ నేపథ్యంలో అయోధ్యకుమార్ సామాజిక స్ఫృహ కలిగిన చిత్రంగా, హాస్టళ్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ప్రధానంగా తీసుకొని 'మిణగురులు' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్నో అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో అవార్డ్స్ అందుకుని రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం మన ముందుకు వచ్చింది. అశిష్ విద్యార్థి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అంథ విద్యార్థుల సమస్యలను కరెక్ట్ గా చూపించగలిగిందా..? లేదా..? అనేది చూద్దాం.

కథ విషయానికి వస్తే..
     
సంక్షేమ హాస్టళ్లలో అరకొర సౌకర్యాల మధ్య బతుకీడుస్తున్న అంధ విద్యార్థుల జీవితం చుట్టూ అల్లుకున్న కథే 'మిణుగురులు'.. దర్శకుడు కావాలనుకునే రాజు (దీపక్ సరోజ్) ప్రమాదవశాత్తు జరిగిన ఓ ప్రమాదంలో గాయపడి అంధుడిగా మారతాడు. తాగుడుకు బానిసైన అతని తండ్రి... రాజుని బ్లైండ్ హాస్టల్ లో చేర్చుతాడు. ఆ హాస్టల్ వార్డెన్ నారాయణ(ఆశిష్ విద్యార్థి) తన స్వార్థం కోసం ప్రభుత్వ నిధులను తనే వాడుకుంటూ.. అంధ విద్యార్థులను ఆకలికి మాడ్చుతుంటాడు. ఇదేంటని అడిగిన విద్యార్థులను చితకబాదుతాడు. చివరకు హాస్టల్ లోని ఓ విద్యార్థినిని ఓ కామాంధుడికి అమ్మే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఎలాగైన వార్డెన్ ఆకృత్యాలను బయట పెట్టాలనుకుంటాడు రాజు. దీనికి గాను రాజు చేసిన ప్రయత్నాలేంటి..? నారాయణ చేసే ఆకృత్యాలు బయటపడ్డాయా..? అంధకారంలో ఇబ్బందులు పడుతున్న అంధ విద్యార్థుల్లో కాంతిని నింపిందా..? అనేది మిగతా కథ.


విశ్లేషణ:..
     
ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవస్థలోని లోపాలు, అవినీతి...వికలాంగులకు శాపంగా మారుతున్నాయి. నరకాన్ని తలపించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అంధ విద్యార్థులు పడుతున్న అవస్థలను కళ్లకు కట్టింది 'మిణుగురులు' సినిమా. ప్రభుత్వం ఇస్తున్న నిధులను అవినీతి పరులైన అధికారులు తమ స్వార్థానికి వాడుకుంటూ... ప్రపంచాన్ని చూడలేని పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ అంశాలను కథగా ఎంచుకుని మిణుగురులు సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అయోధ్య కుమార్. నిజాయతీతో సినిమాను తెరకెక్కించి చలన చిత్రానికి వినోదానికి మించిన సార్థకత చేకూర్చాడు.

    మిణుగురులు సినిమా క్రెడిట్ అంతా తెరకెక్కించిన దర్శకుడికే చెందుతుంది. హాస్టళ్లలో అంధ విద్యార్థుల బాధలను బాగా అధ్యయనం చేసిన దర్శకుడు సినిమాను రూపొందించడంలో సక్సెస్ అయ్యాడు. వాళ్ల సమస్యలను సినిమా స్క్రీన్ ప్లేలో పర్ ఫెక్ట్ గా చూపగలిగాడు. ప్రతి సన్నివేశం ఒకదానితో ఒకటి లింక్ ఉండడమే కాకుండా సినిమా అంతా సహజంగా ఉంటుంది. అంధుల కష్టాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపిండంతో సినిమాను చూసిన ప్రేక్షకులు చివరకు కన్నీరు పెడుతూ బయటకు వస్తారు. అయితే సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నా.. వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో అవి పెద్దగా కనిపించవు.

    ఆశిష్ విద్యార్థి కెరీర్ లో బెస్ట్ ఫర్మార్మెన్స్ ఇది. కలెక్టర్ పాత్రలో సుహాసినీ కనిపించిన కొంత సేపైనా...పాత్రకు నిండుదనం తెచ్చింది. రాజు పాత్రలో దీపక్ సరోజ్ ఆకట్టుకున్నాడు. మిగతా అంధ విద్యార్థుల నటన, ఫిల్మ్ మేకింగ్ అంతా అత్యంత సహజంగా ఉన్నాయి. జోస్య భట్ల సంగీతం, రీరికార్డింగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే దీనిలో నటించిన అంధ విద్యార్థులందరూ.. నిజ జీవితంలో కూడా అంధ విద్యార్థులే. అయితే అందరి ప్రశంసలు అందుకునే ఇలాంటి సినిమాలు.. చివరకు ఆర్థికంగా నష్టాలపాలు అయ్యే ప్రమాదం పొంచి ఉండటమే తెలుగు చిత్ర పరిశ్రమలో అసలైన విషాధం.

    నిజ జీవితంలో ఎంతో మంది అంధ విద్యార్థులు తమ హాస్టళ్లలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ అంధకారంతో చదువులనుకొనసాగిస్తుంటారు. వారిలో.. దర్శకుడు ఆయోద్య కుమార్ ఈ చిత్రం ద్వారా వెలుగులు నింపే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

గమనిక: వాస్తవికతతో, సామాజిక దృక్పథంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేటింగ్ నుంచి మినహాయిస్తున్నాము.
....................................

Monday, January 27, 2014

భరించలేం... బంగారం! ('లవ్ యూ బంగారం' సినిమా రివ్యూ)




  ఇటీవలి కాలంలో ఉన్నట్టుండి తారాపథానికి దూసుకువచ్చిన దర్శక - నిర్మాత మారుతి. ఆయన సమర్పణలో, ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మించిన సినిమా 'లవ్‌ యు బంగారం'. గతంలో వచ్చిన 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్‌', నిరుటి 'రొమాన్స్' లాగానే మారుతి ఈ సారి కూడా తనకు అలవాటైన అసభ్య, అశ్లీల పద్ధతిలోనే తీసిన సినిమా ఇది. యూత్‌ను ఆకట్టుకోవాలనే దుగ్ధతో బూతు చిత్రాలు తీస్తున్న ఇటీవలి కుక్కమూతి పిందెల ధోరణికి ఈ సినిమా మరో తాజా ఉదాహరణ. 

     సర్వసాధారణంగా కాలేజీ ప్రేమ కథలను తీసుకొనే మారుతి ఈసారి భార్యాభర్తల మధ్య ప్రేమనూ, వారి మధ్య శృంగారాన్నీ ఎంచుకున్నాడు. విశాఖపట్నంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు హీరో ఆకాశ్‌ (శేఖర్‌ కమ్ముల తీసిన 'హ్యాపీ డేస్‌' ఫేమ్‌). నిదానంగా సాగే ఈ కుర్రాడు, వేగంగా సాగే మీనాక్షి ('ఆర్య'లో బాల నటిగా మెరిసి ఇప్పుడు హీరోయిన్‌ అయిన శ్రావ్య) ప్రేమలో పడతారు. తల్లితండ్రుల్ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకుంటారు. ఆపైన హైదరాబాద్‌కు మకాం మారుస్తారు. 
కొన్నాళ్ళు ఆనందంగా జీవితం గడిచాక, ఇంట్లో విసుగు పుడుతోంది కాబట్టి, ఉద్యోగం చేస్తానంటుంది హీరోయిన్‌. అందుకు సరేనంటాడు హీరో. ఆమె ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరుతుంది. కానీ, అభద్రతా భావం, భార్య పట్ల అనుమానం అతని బలహీనతలు. అదే సమయంలో ఆమె చిన్ననాటి బారుఫ్రెండ్‌ ఒకరు కథలోకి వస్తారు. ఆ క్రమంలో ఆమె ప్రవర్తన భర్తకు అనుమానాస్పదంగా మారుతుంది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోంది? అసలు ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? భర్త అనుమానం నిజమైందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా. 
భార్యను భర్త అనుమానించడం అనే అంశం చుట్టూ అల్లుకున్న ఈ సినిమా అసలు కథలోకి ద్వితీయార్ధంలో గానీ రాదు. ప్రథమార్ధంలో, అందులోనూ సినిమా మొదట్లో చాలాసేపు అసలు ఇతివృత్తానికి సంబంధం లేని ప్రేమ కథగా నడుస్తుంది. హీరో, హీరోయిన్ల తండ్రులను రాజకీయ నాయకులుగా చూపిస్తూ, అడ్డమైన కామెంట్లూ చేశారు - దర్శక- రచయిత, సమర్పకుడు. ద్వితీయార్ధమంతా భార్యను అనుమానించే భర్త అనే కాన్సెప్ట్‌లో వెళ్ళే ఈ కథకు కీలక పాత్రధారి మాత్రం సినిమా మరో పావుగంటలో ముగిసిపోతుందనగా కనిపిస్తాడు. అదీ అమితమైన ఓవర్‌ యాక్షన్‌తో! ఫస్టాఫ్‌లోనే చాలా సార్లు సహనం చచ్చిపోయిన ప్రేక్షకుడు, అప్పటికి పూర్తిగా విసిగిపోయి ఉంటాడు. అవి చాలదన్నట్లు, సినిమా అయిపోతుండగా రోలింగ్‌ టైటిల్స్‌లో సమర్పకుడు మారుతి కనిపించి, మరేదో మహత్తర కామెడీ సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. 

సినిమాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మీరా పాత్ర తాను తన భర్తకు దూరంగా బతకడానికి కారణాన్ని వివరిస్తుంది. తీరా దానికీ, సినిమా చివరలో విలన్‌ ద్వారా చెప్పించిన విషయానికీ పొంతన లేదు. అలాగే, విలన్‌ బెదిరింపులతో హీరోయిన్‌ ప్రవర్తించిన తీరుకూ ఓ లాజిక్‌ లేదు. హీరో పాత్ర ప్రవర్తనకూ ఓ స్థిరమైన నడక లేదు. 
మారుతి మార్గదర్శకత్వంలో దర్శకుడు ఈ సినిమాలో కాలేజీ కుర్రకారు ప్రేమల కన్నా మరీ అన్యాయంగా, భార్యాభర్తల మధ్య శృంగారాన్ని చూపించారు. దుస్తుల దుకాణంలోని ట్రయల్‌ రూమ్‌లో, బయట పార్కుల్లో ఇలా ఎక్కడబడితే అక్కడ వారు ప్రణయం సాగించినట్లు చూపించారు. సినిమాలో బెడ్‌ రూమ్‌ దృశ్యాలకూ, మసాలా పాటల చిత్రీకరణకూ లెక్క లేదు. కథలో కానీ, కథనంలో కానీ ఆసక్తిగా సాగే సన్నివేశాలు తక్కువ కావడంతో, సినిమాను పాటలతో నింపేశారు. ఫస్టాఫ్‌లోనే నాలుగు పాటలు వచ్చేస్తే, ద్వితీయార్ధంలో మరో నాలుగు దాకా పాటలు వినిపిస్తాయి. భార్య పుట్టినరోజు కానుకగా భర్త ఓ ఐటమ్‌ సాంగ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు చూపడం దర్శక, రచయితల మానసిక పరిస్థితికి పరాకాష్ఠ. 

సినిమా నిండా అశ్లీల దృశ్యాలతో పాటు, అసభ్య సంభాషణలే. 'సీల్‌ ఓపెన్‌ చేయడంలో నా అంత ఎక్స్‌పీరియన్స్‌ ఎవరికీ లేదు' (ఓ అమ్మాయితో అబ్బాయి), 'తొక్కడం కొత్తనుకుంటానే వీడికి' (ఓ అబ్బాయి గురించి స్నేహితురాళ్ళతో ఓ అమ్మాయి), డబుల్‌ మీనింగ్‌ డైలాగులకు లెక్కే లేదు. మహిత్‌ నారాయణ్‌ సంగీతంలో ఒకటి, రెండు పాటల బాణీలు మాత్రం బాగున్నాయి. అయితే, పాటల సాహిత్యంలోనూ బూతు బాటను దర్శకుడు వదలలేదు. 

ఈ సినిమాకు హీరో రాహుల్‌ ఓ పెద్ద మైనస్‌. అతనికి డైలాగ్‌ డెలివరీ కానీ, అభినయం కానీ పూజ్యం. అస్పష్టమైన మాటలు, అభినయ శూన్యత తెర మీద వెక్కిరిస్తూ కనిపిస్తాయి. కథానాయికగా తొలి పరిచయమైన శ్రావ్య చూడడానికి బాగానే ఉన్నట్లు అనిపించినా, ఆమె అందాలు ఆరబోసే ఆకర్షణీయ పాత్రలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందనిపిస్తుంది. ఇక, సినిమాలో తెలిసిన నటీనటులెవరూ పెద్దగా కనిపించరు. అందరూ జూనియర్‌ నటీనటులే! హైదరాబాద్‌, వైజాగ్‌లలో పరిమిత బడ్జెట్‌లో తీసిన ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సిన ఇతర సాంకేతిక విభాగాలేమీ లేవు. 

ఉద్యమ పార్టీల మీద, సినీ విమర్శకుల మీద, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల మీద ఇటు అవగాహన కానీ, అటు బాధ్యత కానీ - రెండూ లేకుండా నోటికి వచ్చినట్టలా వ్యాఖ్యలు రాసి, అవన్నీ పాత్రలతో అనిపించేశారు. ఈ సినిమా చూశాక పదే పదే ప్రస్తావనకు గురయ్యే ఓ హీరో అభిమానుల మొదలు గుడిలో పూజారులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దాకా అందరికీ దర్శక, రచయితలు బాగానే చిర్రెత్తిస్తారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగమంటే, వరుస వావీ లేని వ్యక్తుల సమూహాలు చేసే కాలక్షేపం అన్నట్లు చూపెట్టారు. అలాగే, అమ్మాయిల మీద ఏ మాత్రం గౌరవం లేకుండా, వాళ్ళనూ, వాళ్ళ వ్యక్తిత్వాలనూ చాలా చౌకబారు అభిప్రాయంతో చిత్రీకరించిన తీరు సినిమా అంతటా కనిపిస్తుంది. కొన్ని మాటలు, దృశ్యాలు చూశాక అసలు ఈ సినిమాకు సెన్సార్‌ వాళ్ళు ఎలా అనుమతినిచ్చారా అన్న సందేహమూ కలుగుతుంది. 
గతంలో 'అభిలాష', 'ఛాలెంజ్‌', 'చంటి' లాంటి ఉత్తమ చిత్రాలను అందించిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ, క్రమంగా తన వారసుడు వల్లభను నిర్మాతగా పైకి తేవాలని చూస్తున్న ఆ సంస్థ అధినేత కె.ఎస్‌. రామారావు ఎందుకు ఈ సినిమా నిర్మించారో అర్థం కాదు. వాణిజ్య విజయం కోసం ఇంత దిగజారుడు సినిమా తీయడం వల్ల ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ తాత్కాలికంగా నాలుగు డబ్బులు రావచ్చేమే కానీ, శాశ్వతంగా మాత్రం గతంలో సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు మసకబారిపోతాయి. ఆ సంగతి గ్రహించడం మంచిది. అన్నట్లు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ కూడా ఇప్పుడు మారుతితో సినిమా తీస్తోంది. మరి, వాళ్ళు ఏమవుతారో చూడాలి. 

కొసమెరుపు : ఏతావతా ఒకప్పటి 'బి' గ్రేడ్‌, 'సి' గ్రేడ్‌ మలయాళ బూతు సినిమాల తెలుగు వెర్షన్‌ లాగా ఈ సినిమా అనిపిస్తుంది. అలాంటి సినిమాను 70 ఎం.ఎం.లో, తెలుగు తారలు, తెలుగు డైలాగులతో చూడాలనుకొనే వారికి మాత్రమే ఇది 'లవ్‌ యు బంగారం'. మిగతా ప్రేక్షకులందరికీ ఇది 'హేట్‌ యు బంగార'మే! హాలులో ఈ రెండున్నర గంటల హింసను భరించి, బయటకొస్తూ ఓ నవ యువకుడు అన్న మాటల్లో చెప్పాలంటే, ఇది ''భరించలేం... బంగారం!''
- రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 25th Jan 2014, Saturday, Page No.8)
............................................................

Saturday, January 25, 2014

'' ప్రతి పాత్రా నాకు ఓ పిహెచ్.డి !'' - అక్కినేని నాగేశ్వరరావు ('ప్రజాశక్తి'తో అక్కినేని ఆఖరి ఇంటర్వ్యూ)


  
- 'ప్రజాశక్తి'తో అక్కినేని ఆఖరి ఇంటర్వ్యూ
ఉదయం 11 గంటల వేళ. చిరుజల్లులతో చలి పుడుతూ, వాతావరణం గిలిగింతలు పెడుతోంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గరలోని 'అన్నపూర్ణ' నివాసంలో మరికొద్ది నెలల్లో 90వ పడిలోకి అడుగు పెట్టనున్న ఎవర్‌గ్రీన్‌ హీరో 'పద్మవిభూషణ్‌' అక్కినేని నాగేశ్వరరావు తన ట్రేడ్‌ మార్కు తెల్లప్యాంటు, బంగారు రంగు చొక్కాలో చిరునవ్వుతో సాదరంగా స్వాగతించారు. 'దేవదాసు', 'బాటసారి'గా, 'విప్రనారాయ'ణుడిగా, 'దసరా బుల్లోడు'గా తెలుగు ప్రేక్షకులకు 'ప్రేమాభిషేకం' చేసిన ఈ 'బహుదూరపు బాటసారి' ప్రజాశక్తితో అనేక సంగతులను పంచుకున్నారు. ముఖ్యాంశాలు:

తొంభయ్యో ఏట అడుగుపెడుతున్నా, చురుగ్గా నడుస్తున్నారు. 
వయస్సుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే, ఎవరైనా సరే ఏదో ఒక పని, వ్యాపకం పెట్టుకోవాలి. నా యాభయ్యో ఏట 1974 నుంచి రోజూ ముప్పావు గంట సేపు నడుస్తున్నా. గతంలో జూబ్లీహిల్స్‌లోని పార్కులో నడిచేవాణ్ణి. అయితే, అక్కడ వాకింగ్‌కు వస్తూ, ఎదురుపడేవాళ్ళు పోచికోలు కబుర్లతో ఏవో నెగటివ్‌ మాటలు, ఆలోచనలు ప్రస్తావిస్తుండడంతో క్రమంగా అక్కడకు వెళ్ళడం మానేశా. అలాంటివి మనలో ఉత్సాహాన్ని చంపేస్తాయి. ఇప్పుడు ఇంట్లోనే పెరట్లో మూడడుగుల వెడల్పు ట్రాక్‌ ఒకటి సిద్ధం చేసుకొని, నడుస్తున్నా. చెట్లతో, చెట్టు కొమ్మల్లోని పిట్టలతో ఊసులాడుతూ, మనస్సును ఉత్సాహంగా ఉంచుకుంటున్నా. 

అభిమానుల పట్ల మీరెంతో ప్రేమ, గౌరవం చూపిస్తుంటారే!
అవును. నేను వాళ్ళకు ఎంతో ఋణపడి ఉన్నాను. వ్యక్తిగతంగా నేను 'స్వచ్ఛమైన మనస్సు'ను నమ్ముతాను. అందుకే, అలాంటి స్వచ్ఛమైన మనస్సుండే అభిమానులంటే నాకెంతో గౌరవం. వాళ్ళు నా దగ్గర నుంచి ఏమీ ఆశించరు - కేవలం నా సినిమాలు, పాత్రల అభినయం ద్వారా నేను అందించే అపురూపమైన ఆనందాన్ని తప్ప! ఏ రకమైన స్వార్థ చింతన లేకుండా మన దగ్గరకు వస్తారు కాబట్టే, వాళ్ళను నేను దేవుళ్ళంటాను. వాళ్ళ ఆశీస్సుల వల్లే మేమంతా ఇంత ఎదిగాం. గుండె ఆపరేషన్లను కూడా తట్టుకొని, ఇంతకాలంగా నేను ఆరోగ్యంగా ఉన్నా. 

మీ వీరాభిమానుల్ని చూసి, మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా?
చాలానే ఉన్నాయి. అయితే, ఆ మధ్య జరిగిన ఓ సంఘటన చెబుతాను. ఒక ముసలి సనాతన వితంతువు ఒకావిడ వచ్చి, నన్ను కలిసింది. పక్కన మనుమడు ఉండి, తీసుకొస్తే ఆమె వచ్చింది. 1940ల నాటి 'బాలరాజు' రోజుల నుంచి నన్ను చూడాలని ఆమె కోరిక అట! అప్పుడు అది తీరలేదు. ఈ ముసలి వయస్సులో వచ్చి, నన్ను చూసి వెళ్ళి ంది. ఇలాంటి సంఘటనలు చూస్తే, వాళ్ళు మన మీద ఎంత ప్రేమ, అభిమానం పెట్టుకున్నారో కదా అనిపిస్తుంది. అందుకే, నాకు దేవుళ్ళు ఎక్కడో లేరు! ప్రేక్షకుల్లోనే ఉన్నారు. కాబట్టే, ప్రేక్షక దేవుళ్ళు అంటూ ఉంటాను. 

మీ కుటుంబంలోని మూడు తరాలూ నటిస్తున్న 'మనం' గురించి...
జూన్‌ 7 నుంచి షూటింగ్‌ జరుగుతోంది. మా ఇంట్లోని మూడు తరాల హీరోలం నటిస్తున్నాం కాబట్టి, అంచనాలు ఎక్కువే ఉంటాయి. మీ సమాచార ప్రసార సాధనాల వాళ్ళ రాతలు, మాటలతో అది మరింత పెరుగుతుంది. ఏమైనా, చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. 

మీ మరో మనుమడు అఖిల్‌ రంగప్రవేశానికి కూడా రంగ సిద్ధమైంది. వారసుల గురించి ఏమంటారు?
మా ఇంట్లో నేను, నాగార్జున, సుమంత్‌, సుశాంత్‌, నాగచైతన్య - ఇప్పటికే అయిదుగురు హీరోలం ఉన్నాం. రానున్న అఖిల్‌తో ఆరుగురు హీరోల కుటుంబం అవుతుంది మాది. అయితే, ఇది పరిచయానికి పనికొస్తుందే తప్ప, ఎవరికి వాళ్ళు తమ ప్రతిభ ద్వారా పైకి రావాల్సిందే! అఖిల్‌ ఇప్పటికే థాయిలాండ్‌లో ఫైటింగులు నేర్చుకున్నాడు. నటనలో క్రాష్‌కోర్స్‌ చేశాడు. మా ఎవరి ప్రమేయం లేకుండా తాను ఎలా ఉండాలో, తానే తీర్చిదిద్దుకుంటున్నాడు. 

పెద్దగా చదువుకోని మీకెవరు ఉపాధ్యాయులు?
నేను పోషించిన పాత్రలే నాకు ఉపాధ్యాయులు. నిష్ఠాగరిష్ఠుడు సైతం చంచల స్వభావంతో ఎలా దెబ్బ తింటాడనే పాఠం 'విప్రనారాయణ' నుంచి నేర్చుకున్నా. అది నాకు ఓ పిహెచ్‌.డి. అలాగే, 'దేవదాసు', 'బాటసారి', 'మూగమనసులు', 'ధర్మదాత' లాంటి ఎన్నో చిత్రాలు నాకెన్నో పాఠాలు నేర్పాయి. నన్ను మనిషిగా తీర్చిదిద్దాయి. ఈ నటన వల్లే జ్ఞానం, పేరు, డబ్బు, ప్రజల ఆశీర్వాదం లభించాయి. 

సినిమాల్లో ధ్రువతారవుతానని ఊహించారా?
నేనెప్పుడూ ఏదీ ఊహించలేదు. ఊహించని విధంగా నాకివన్నీ సమకూరాయి. ఇదంతా యాదృచ్ఛికం. అయితే, వచ్చిన అవకాశాలన్నీ నేను చక్కగా ఉపయోగించుకున్నా. వృత్తినే దైవంగా భావించా.

కెరీర్‌లో ఉత్కృష్ట పాత్ర అయిన 'దేవదాసు'తో మీ తొలి పరిచయం ఎలా జరిగింది? మీ మీద శరత్‌ సాహిత్య ప్రభావమెంత?
ఈ సినిమాలో నటించడానికి ముందే శరత్‌ బెంగాలీ నవల 'దేవదాసు' నవల నాకు సుపరి చితం. అప్పట్లో రచయిత సముద్రాల రాఘవా చార్యులుగారు 123 రూపాయలకు చక్రపాణి అనువాదం చేసిన శరత్‌ సాహిత్యం మొత్తం నాకు తెచ్చి ఇచ్చారు. 'మంచి సాహిత్యం. బ్రహ్మ సమాజ భావాలతో ఆధునికంగా ఉంటుంది. సాంఘిక చిత్రాల్లో నటిస్తున్నప్పుడు పాత్రల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి ఇవి ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి. వీటిని చదువుతూ ఉండు' అంటూ నాకు ఇచ్చారు. అలా శరత్‌ 'దేవదాసు' నేను ఎన్నోసార్లు చదివాను. స్కూలు చదువు కూడా చదవని, ఓ పల్లెటూరి రైతు కుటుంబంలో నుంచి వచ్చినవాణ్ణి నేను. కాబట్టి, ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రల మానసిక సంఘర్షణ, ప్రవర్తన లాంటి వాటి గురించి ఏవైనా సందేహాలు వస్తే, షూటింగ్‌కు ముందే రచయిత - నిర్మాత చక్రపాణి గారి దగ్గరకు వెళ్ళి, ఆయనతో పాత్ర స్వభావం, వగైరా చర్చిస్తుండేవాణ్ణి. ఆయన నాకు విడమరిచి చెప్పేవారు. ఆ మాటలు, సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. ఆ తరువాత కూడా బెంగాలీ నవలలు, శరత్‌ రచనల ఆధారంగా చిత్రాల్లో నటించాను. అలా సహజంగానే నా మీద శరత్‌ సాహిత్య ప్రభావం బానే ఉంది. నమస్కారం పెట్టాలని కూడా తెలియని పల్లెటూరి బైతు అయిన ఏయన్నార్‌ అనే మట్టిముద్దను వెన్నముద్దగా మార్చింది - ఈ సినీ రంగం, ఇక్కడి అనుభవాలే!
అసలు 'దేవదాసు' తీయాలనే ఆలోచన ఎవరిది?
ఆ ఆలోచన నిర్మాత డి.ఎల్‌. (ద్రోణావఝల లక్ష్మీ) నారాయణదే! ఆయన భరణీ పిక్చర్స్‌లో మేడమ్‌ (భానుమతి) దగ్గర ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేసేవారు. గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గర సినిమాల్లో చేస్తున్నప్పుడు భరణీ' వారి తరఫున వచ్చి, గూడవల్లి గారితో మాట్లాడి, 'రత్నమాల' చిత్రానికి నన్ను తీసుకువెళ్ళింది ఆయనే! అందరూ వద్దన్నా, ఆయన మొండిగా ఈ చిత్రం తీశారు. 

'దేవదాసు' ఇంత చిరస్మరణీయం అవుతుందని మీరు ఊహించారా?
(గట్టిగా నవ్వుతూ...) అందరూ మమ్మల్ని విమర్శిస్తూ, నిరుత్సాహపరుస్తున్న సమయంలో సినిమా తీస్తున్న మేము జాగ్రత్తగా బయటపడితే చాలు అనుకున్నాం తప్ప, సినిమా ఇలా చిరస్మరణీయమవుతుందని ఊహించనే లేదు. అయితే, సినిమా తీస్తున్నంత కాలం మేమందరం ఎంతో శ్రద్ధాసక్తులతో శ్రమించాం. ఓ కసితో పని చేశాం. ఆ శ్రమ ఫలించింది. 

'దేవదాస్‌' తమిళంలో మిమ్మల్ని ఆరాధ్యనీయుడిగా నిలిపినట్లుంది!
నిజానికి, తొలి రిలీజ్‌లో 'దేవదాసు' తెలుగులో కన్నా, తమిళంలో బ్రహ్మాండంగా ఆడింది. 'ఉలగే మాయం... వాళ్వే మాయ...' (జగమే మాయ బతుకే మాయ) లాంటి పాటలు అక్కడ ఆల్‌టైమ్‌ హిట్లు. మదురైలో నాకు ఓ సంస్థ వారు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా ఇచ్చారు. తెలుగులో తొలి రిలీజ్‌లో 7 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. నిజం చెప్పాలంటే, అందులో 3 చోట్లే సినిమా సరిగ్గా ఆడింది. మిగిలిన 4 చోట్ల 10వ వారం తరువాత, 'డిస్ట్రిబ్యూటర్‌ వాటా పోగా, మిగిలినది మీరే తీసేసుకోండ'ని నిర్మాత డి.ఎల్‌. నారాయణ చెప్పడంతో ఆ హాళ్ళ వాళ్ళు అలా 100 రోజులు ఆడించారు. గమ్మత్తేమిటంటే, తెలుగులో కాలగతిలో క్రమ క్రమంగా ఈ సినిమా ఓ కళాఖండంగా నిలిచిపోయింది. 

మీ తరువాత 21 ఏళ్ళకు హీరో కృష్ణ కలర్‌లో 'దేవదాసు' (1974) తీశారు. ఆ 'దేవదాసు'కు పోటీగా మీ 'దేవదాసు' విడుదల అప్పట్లో పెను దుమారం రేపింది. ఆ సినిమా చూశారా!
(వెంటనే అందుకుంటూ...) ఆ సినిమా నేను చూడలేదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఓ మాట చెబుతున్నాను. ఆ సినిమా మీద పోటీగా నా సినిమాను నేను విడుదల చేయలేదు. ఎవరో అమ్ముతుంటే, మా 'దేవదాస్‌'కు నిజామ్‌ స్టేట్‌ వరకు నెగటివ్‌ రైట్లు నేను కొనేశాను. అప్పటికి సరిగ్గా నాకు 50 ఏళ్ళు. గుండె జబ్బుకు అమెరికాలో బైపాస్‌ చేయాలన్నారు. 1974 అక్టోబర్‌ 18న ఆపరేషన్‌. ఇక్కడ నుంచి 3 వేల డాలర్లు తీసుకువెళ్ళడానికీ, నా భార్యను వెంటనే అమెరికాకు పంపడానికీ వీలుగా అప్పటి మంత్రి బ్రహ్మానందరెడ్డి, రెవెన్యూ మంత్రి చెన్నారెడ్డి గార్లను నేను అభ్యర్థించాను. నేనసలు బతుకుతానో, లేదో కూడా తెలియదు. డబ్బులు కావాలి. ఆ పరిస్థితుల్లో కలర్‌ 'దేవదాసు' వస్తోంది. అది రిలీజైతే, బ్లాక్‌ అండ్‌ వైట్‌కు డబ్బులొస్తాయో, లేదో అని నా 'దేవదాసు' విడుదల చేసేయమని చెప్పాను. అంతే! దీనికి పత్రికలు, సినిమా వాళ్ళు ఏవేవో అనుకున్నారు, రాశారు. అవేమీ లేదు. ఆ తరువాత కృష్ణ - విజయనిర్మల తీసిన 'హేమాహేమీలు'లో కూడా నేను నటించాను.
 'దేవదాసు' ప్రభావంతో తర్వాత చాలా పాత్రలు చేసినట్లున్నారు. 
ఓ ఇతివృత్తాన్ని, ఓ పాత్రను విజయవంతం చేసినప్పుడు, అలాంటి పాత్రల బరువు సదరు నటుడి మీద మోపవచ్చనే నమ్మకం పెట్టుబడి పెట్టే నిర్మాతకు వస్తుంది. సినిమాల్లో అంతే! ఎన్టీయార్‌ కృష్ణుడిగా బాగున్నాడు అంటే, ఆయనతో ఆ పాత్రతోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. నాకు విషాద పాత్రలు, 'బాటసారి', 'మూగ మనసులు' ల్లోని మనస్తత్త్వ చిత్రణతో కూడిన పాత్రలు, 'మిస్సమ్మ', 'చక్రపాణి', 'ప్రేమించి చూడు'ల్లోని వ్యంగ్యంతో కూడిన వినోదాత్మక పాత్రలు, 'చెంచులక్ష్మి', 'మాయా బజార్‌'లలోని పౌరాణిక పాత్రలు - ఇలా అన్నీ వచ్చాయి. అన్ని పార్శ్వాలూ స్పృశించాను కాబట్టే, ఒక నటుడిగా ఇంతకాలం జనం మెచ్చేలా నిలిచాను. మన దగ్గర ఏమీ లేకపోతే, జనం మెచ్చుకోరు కదా!

దేవదాసు సినిమా, పాత్రల ప్రభావం మీ మీద ఉందా?
(తల అడ్డంగా ఊపుతూ) నో...నో... ఆ ప్రభావమే లేదు. సినిమాల్లో నటులుగా మేము ఆ పాత్రల్ని అభినయిస్తున్నామే తప్ప, అదే మేము కాదనే స్పృహ నాకు ఉంది. అందుకే, ఏ పాత్ర పోషించినా అది అయిపోగానే దాన్ని అక్కడే వదిలేయాలి. అలాగే వదిలేసేవాణ్ణి. నేను పోషించిన ఏ పాత్ర అయినా, అది ఒక తొడుగు. దాన్ని అక్కడే తీసి పడేయాలి. వాటిలా మారిపోతే, సినిమాకు ఓ రకంగా మార్పు చెంది, (నవ్వుతూ...) అంతమంది హీరోయిన్లతో తిరగాలి. అది సాధ్యమా? 

కానీ, దేవదాసు పాత్ర పోషణను ఓ సవాలుగా తీసుకొని, మీరెంతో హోమ్‌వర్క్‌ చేశారు కదా! అది మీ మీద ప్రభావం చూపలేదా?
ఒక్క దేవదాసు పాత్రకనే కాదు. ఏ సినిమాలో ఏ పాత్ర చేస్తున్నా సరే దానికి తగ్గట్లుగా కృషీ, ప్రయత్నమూ ఉంటాయి. ఇప్పుడీ చిత్రం గురించి మాట్లాడుతు న్నాం కాబట్టి, దీని గురించి చెబుతున్నాం. అంతే! అయితే, వృత్తి జీవితపు తొలినాళ్ళలో తీసిన సినిమా కాబట్టి, సినీ రంగంలో ఎంతోమంది నిరుత్సాహ పరుస్తున్నా, ఏటికి ఎదురీది తీసిన సినిమా కాబట్టి, 'దేవదాసు' పాత్ర పోషణకు నేను కష్టపడాల్సి వచ్చింది. చాలా హోమ్‌వర్క్‌ చేయాల్సి వచ్చింది. కానీ, కెరీర్‌లో ఆ తరువాతి రోజుల్లో ఆ ఛాయలతో వచ్చిన 'ప్రేమ్‌నగర్‌', 'ప్రేమాభిషేకం' చిత్రాలకు ఇంత కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. నాకు తొలిసారి గుండె ఆపరేషన్‌ జరిగిన 1974 అక్టోబర్‌ దాకా నాకు మద్యం అలవాటు కూడా లేదు. అయితే, మా భాగస్వామి - సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ సహా, సినీ రంగంలోని పలువురి తాగుడు అలవాట్లను చూసినవాణ్ణి కాబట్టి, 'దేవదాసు'లో తాగుబోతులా చేశాను.

'దేవదాసు'తో సహా ఆనాటి కళాఖండాల నెగటివ్‌లు, ప్రింట్లు ఇప్పుడు లేవు. వాటిని పరిరక్షించి, భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అగ్ర హీరోలు, వారి సంతానం కూడా తీసుకోవడం లేదేం?
మీరన్నది నిజమే! మన కళాఖండాలను మనం భద్రపరుచుకోవాలి. నా తొలినాళ్ళ చిత్రాలైన 'శ్రీసీతారామ జననము', 'మాయలోకం' లాంటి కొన్ని చిత్రాలు ఒక్క రీలు ముక్క కూడా లేవు. కానీ, నాతో ఇతరులు నిర్మించిన చిత్రాలకు నేనేం చేయగలను! ఆ నిర్మాతల్లో చాలా మంది లేరు. వాళ్ళ వారసులు ఎక్కడున్నారో తెలియదు. అయితే, నేను నటించిన చిత్రాల తాలూకు వీడియోలను మాత్రం సేకరించి, భద్రపరుస్తున్నా. 'ఈ' టి.వి. రామోజీరావు గారు కూడా నేను ఉత్తరం రాస్తే, నా అభ్యర్థనను మన్నించి, ఆయన దగ్గరున్న నా చిత్రాల వీడియోలను పైసా తీసుకోకుండా కాపీ చేయించి ఇచ్చారు. అసలు మన సినీ పరిశ్రమకే ఒక లైబ్రరీ కావాలి. అందులో మన క్లాసిక్‌ చిత్రాల కాపీలన్నిటినీ భద్రపరచాలి. ఆ కృషి ప్రభుత్వం, సినిమా రంగం చేయాలి. పుణేలోని ఆర్కైవ్స్‌లో ఆ ప్రయత్నం కొంత జరుగుతున్నా, అది సరిపోదు.
శ్రీమతి అన్నపూర్ణతో మీది సుదీర్ఘ కాల అనుబంధం. ఆ వియోగాన్ని ఎలా భరిస్తున్నారు?
కష్టమే. కానీ తప్పదు. నిజం చెప్పాలంటే, మంచాన పడి, రోజూ యాతన అనుభవిస్తున్నప్పుడు అప్పట్లో మా అమ్మ కానీ, ఆ మధ్య నా శ్రీమతి కానీ చనిపోతేనే బాగుంటుందని కోరుకున్నా. ఇది చాలా మందికి కటువుగా కనిపించవచ్చు. కానీ, సత్యప్రమాణకంగా నేను అలా అనుకున్నాను. కిడ్నీలు పాడైపోయి, నా శ్రీమతి దాదాపు ఏణ్ణర్ధం పాటు ఇంట్లోనే డయాలసిస్‌ చేయించుకుంటూ, చక్రాల కుర్చీలో కూర్చొని, శరీరంలోని భాగాలపై నియంత్రణ లేక నానా అగచాట్లూ పడిన వైనం నేను కళ్ళారా చూశాను. ఒంటి మీద అదుపు పోయినందుకు ఆమె తనను తాను తిట్టుకుంటూ, విచారపడడం చూశాను. ఆ యాతన నుంచి ఆమె ఎంత త్వరగా విముక్తి అయితే, అంత బాగుండని అనుకున్నా. అది ప్రాక్టికల్‌ ఆలోచన. అంతే కాదు! ఎక్కువ కాలం బతకవన్న సంగతి ఆమెకు కూడా చెప్పి, ఆ లోపల తన చివరి కోరికలు తీర్చేందుకు ప్రయత్నించాను. తన ఆస్తిపాస్తులను ఎవరికి ఎలా ఇవ్వాలనుకుంటోందో తెలుసుకొని, వివరాలన్నీ కాగితం మీద రాయించుకొని, ఆమె మరణించగానే ఆ వివరాలు అందరి ఎదుటా పెట్టాను. అలాగే, అన్నీ పంచాను. నా శ్రీమతికి కూడా తాను చనిపోతానని ముందే తెలుసు. అందుకే, 'నా టైమ్‌ అయిపోయింది. ఆసుపత్రిలో ఉండను. ఇంటికి పంపెయ్య'మని డాక్టర్‌ను అడిగింది. అలాగే, ఇంటికొచ్చిన మరునాడే ఆమె కన్నుమూసింది. నాకూ, ఆమెకూ మధ్య ఏనాడూ అరమరికలు లేవు. ఒకటి రెండు రోజులకు మించి నేను ఎక్కడకైనా వెళుతుంటే, చాలామంది నటులకు భిన్నంగా నేను నా శ్రీమతిని వెంట తీసుకువెళ్ళేవాణ్ణి. అలా ప్రపంచమంతా తిరిగాం. ఎప్పుడైనా, ఎక్కడైనా నేను జారిపోతానేమో అన్న భయం కూడా ఆమెను నా వెంటే ఉంచుకొనేలా చేసింది. ఆమె నా పక్కనే ఉండడం కూడా నాకు తెలియకుండానే నన్ను నేను నియంత్రించు కోవడానికి ఉపకరించింది. అలాగే, నేను జీవితంలో ఒకటీ, అరా తప్పులు చేస్తే, అవి కూడా ఆమెకు తెలుసు. ఆమెకు తెలియకుండా నా జీవితంలో ఏమీ లేవు. మా దాంపత్యం అలాంటిది. నా మనస్సులో ఉన్నది నేనెప్పుడూ ధైర్యంగా చెబుతాను. నటనే నా వృత్తి కాబట్టి, కెమేరా ముందు జీవితమంతా అబద్ధమే. కెమేరా వెనుక నా నిజజీవితంలో మాత్రం నేనెన్నడూ యాక్ట్‌ చేయను. 

ఈ సుదీర్ఘ పయనంలో నటనపై విసుగెత్తలేదా?
లేదు. నేను ఆస్తికుణ్ణి కాదు. అయితే, ప్రకృతికి భక్తుణ్ణి. పని చేయడం వల్ల ఓ తృప్తి లభిస్తుంది. అలా తృప్తిగా ఓ పని చేయడం వల్ల శక్తిని కోల్పోము, పుంజుకుంటాం. 

ఎన్టీయార్‌లో ఆవేశం ఎక్కువైతే, మీరు ఆలోచన నిండిన వ్యూహచతురులనే ఓ విమర్శ ఉంది!
అందులో విమర్శేముంది! నన్ను ఆలోచనాపరుడంటే అది పొగడ్తేగా!

ఇన్నేళ్ళలో మన సినిమాల్లో గమనించిన ముఖ్య మార్పు చెబుతారా?
- సినిమా పరిశ్రమలో ఓ పొరపాటు జరుగుతోంది. అప్పట్లో కథాబలం ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడది తగ్గింది. అప్పట్లో, సాంఘికం, జానపదం, పౌరాణికం - ఇలా అన్ని తరహా చిత్రాలూ చేసేవాళ్ళం. పైగా గ్రాఫిక్స్‌ లేని రోజుల్లోనే 'మాయలోకం', 'కీలుగుఱ్ఱం' లాంటి వాటితో మెప్పించాం. కానీ, ఇప్పుడు గ్రాఫిక్స్‌ వచ్చాక అతి పెరిగింది. అవే కథను కమ్మేస్తున్నాయి. మనం నగలు పెట్టేది అమ్మాయి అందాన్ని పెంచడానికే కానీ, కమ్మేయడానికి కాకూడదు కదా! ఇలాంటి లోపాల వల్లే మన సినిమాల్లో వైఫల్యాల రేటు పెరుగుతోంది. అప్పట్లో సినిమాలు చాలా అరుదుగానే విఫలమ య్యేవి. కానీ, ఇప్పుడు మాత్రం చాలా అరుదుగా సక్సెస్‌ అవుతు న్నాయి. పాటలు, డ్యాన్సులు శరీరాన్ని తాకుతున్నాయి కానీ, మనస్సునూ, గుండెనూ తాకడం లేదు. పాటల్లో బీట్‌ ఎక్కువై, మెలొడీ తగ్గింది. మళ్ళీ మార్పు రావాలి. తప్పనిసరిగా వస్తుందనీ, అదీ త్వరలోనే వస్తుందని నాకు ఆశ, నమ్మకం. ఎందుకంటే, కాలంతో పాటు మార్పు తప్పదు కదా!

- ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ 

(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Page No.8)
.........................................................................

పాత తరం నటుడు నాగరాజారావు మృతి



- నేపథ్య గాయని ఎస్‌. జానకి సంతాపం
  
పాత తరం రంగస్థల, సినీ నటుడు, ప్రముఖ నేపథ్య గాయని ఎస్‌. జానకి చెల్లెలి భర్త అయిన వి. నాగరాజారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున 4.40 గంటల ప్రాంతంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 ఏళ్ళు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూకాభినయ తారగా దేశ, విదేశాల్లో తెలుగు వారి ఖ్యాతిని వ్యాపింపజేసిన కీర్తిశేషులు 'ఫన్‌ డాక్టర్‌' చంద్రశేఖరం రెండో కుమారుడే నాగరాజారావు. 

నేపథ్య గాయని ఎస్‌. జానకి చెల్లెల్ని వివాహమాడిన ఆయన రంగస్థలంపై ఎన్నో పాత్రలను రక్తికట్టించారు. ముఖ్యంగా, రచయిత - నటుడు రావి కొండలరావు రాసిన చాలా నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆ నాటకాలను రక్తి కట్టించడంలో కీలక భూమిక వహించారు. చాలా ఏళ్ళుగా చెన్నైలో ఉంటున్న ఆయన కొద్ది సినిమాల్లో కూడా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్టీయార్‌ 'నర్తనశాల' (1963)లో సహదేవుడి పాత్ర పోషించింది ఆయనే. అలాగే, బి.ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రంగుల రాట్నం' చిత్రంలో నటి విజయనిర్మలకు జోడీగా తెరపై కనిపించారు. 
చెన్నైలోని తెలుగువారి సినీ, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ తప్పనిసరిగా హాజరయ్యే నాగరాజారావు స్థానికులకు ఎంతో సన్నిహితులు. ఆయన మరణంతో గాయని జానకి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కేరళ నుంచి వచ్చిన ఎస్‌. జానకి, నాగరాజారావుతో కలసి నటించిన సినీ నటి శారద తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. సీనియర్‌ సినీ నటుడు విజ్జిబాబు, కూచిపూడి నాట్యాచార్యుడు మాధవపెద్ది మూర్తితో సహా పలువురు సన్నిహితులు, స్నేహితులు నాగరాజారావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నాగరాజారావు భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు జరిపారు.
(Published in 'Praja Sakti' daily, 22 Jan 2014, Wednesday, Page No.8)
........................................

Friday, January 24, 2014

అలుపెరుగని సినీ బాటసారి అక్కినేని



   రంగస్థలం మీద నుంచి సినీ రంగానికి వచ్చిన తొలి తరం తారల్లో అక్కినేని ఒకరు. పి. పుల్లయ్య దర్శకత్వంలోని 'ధర్మపత్ని' (విడుదల: 1941 జనవరి 10న)లో ఓ చిన్న పాత్రతో ఆయన సినీ జీవిత ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి చనిపోవడానికి కొద్ది నెలల ముందు షూటింగ్‌లో పాల్గొన్న సొంత చిత్రం 'మనం' (ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది) దాకా ఆయన సినీ జీవిత పయనం సుదీర్ఘంగా సాగింది. 'మనం' ఆయన నటించిన 256వ సినిమా! 
ఈ ఏడు దశాబ్దాల పైచిలుకు కెరీర్‌లో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. సాంఘికాలు చేశారు, మెప్పించారు. పౌరాణికాల్లో మెరిశారు. చారిత్రక పాత్రల్లో విమర్శకుల ప్రశంసలు పొందారు. అయితే, కెరీర్‌ తొలి రోజుల్లో జానపద హీరోగా అనిపించుకున్న అక్కినేని, ఆపైన దీర్ఘకాలంలో అది తనకు విజయసూత్రం కాదని గ్రహించి, సాంఘికాల వైపు మళ్ళడం విశేషం. చివరి దాకా సాంఘికాలకూ, అందులోనూ ప్రేమ కథలకూ, విషాదాంత ప్రేమకథలకూ తనదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారు.

ఆయన కెరీర్‌ను గమనిస్తే... తొలి పూర్తి తెలుగు టాకీ కన్నా ఏడేళ్ళ పై చిలుకు పెద్దవాడైన అక్కినేని 'ధర్మపత్ని' (1941)లో బాలానందం పిల్లల్లో ఒకడిగా ఓ పాటలో కనిపించి, తెరంగేట్రం చేశారు. ఆ పైన ఆశించిన అవకాశాలు రాక రంగస్థలికే పరిమితమయ్యారు. దర్శక - నిర్మాత ఘంటసాల బలరామయ్య చలవతో 'శ్రీసీతారామ జననము' (1944)తో హీరో అయ్యారు. 'ముగ్గురు మరాఠీలు', 'రత్నమాల' తరువాత 'బాలరాజు' (1948)తో హీరోగా నిలబడ్డారు. 'కీలుగుఱ్ఱం', 'లైలా మజ్ను' లాంటి విజయాలు, 'శ్రీలక్ష్మమ్మ కథ' లాంటి పోటాపోటీ చిత్రాల తరువాత జానపద హీరోగా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దాంతో, పునస్సమీక్షించుకొని, 'సంసారం'తో సాంఘిక చిత్రాల బాట పట్టారు. 
భరణీ వారి చిత్రాల్లో భానుమతికి జోడీ అయ్యారు. 'ప్రేమ' (తమిళంలో 'కాదల్‌') తదితర చిత్రాలతో, ఆ పైన 'దేవదాసు' (1953)తో ప్రణయ కథానాయకుడిగా తెలుగు, తమిళ దేశ ప్రజల నీరాజనాలు అందుకున్నారు. 'చక్రపాణి' (1954), 'మిస్సమ్మ' ('55) లాంటి వినోదాత్మకాలూ, 'విప్రనారాయణ' ('54) లాంటి భక్తి చిత్రాలు, 'అర్ధాంగి', 'రోజులు మారాయి', 'దొంగరాముడు' లాంటి సాంఘికాలు వరుస విజయాలిచ్చాయి. 'మాయా బజార్‌', అరవంలోనే కాక తెలుగులోనూ వచ్చిన పార్‌ట్లీ కలర్‌ 'అల్లావుద్దీన్‌', తెలుగు నుంచి తమిళ, హిందీ భాషలకు అనువాదమైన 'భూకైలాస్‌'తో అక్కినేని కీర్తి ఎల్లలు దాటింది. 'మాంగల్య బలం' (1959), 'జయభేరి' ('59), 'శాంతి నివాసం' ('60), 'మహాకవి కాళిదాసు' ('60) లాంటి విభిన్న చిత్రాలు ఆయన ప్రతిభకు గీటురాళ్ళయ్యాయి. ''వద్దని వారించినా'' భానుమతి తీసిన 'బాటసారి' ('61) అక్కినేని మాటల్లోనే చెప్పాలంటే, ఆయన ''కెరీర్‌లో మరపురాని కళాఖండం.''

1960 -'71 మధ్య 'ఇద్దరు మిత్రులు', 'ఆరాధన', 'మూగమనసులు', 'అమరశిల్పి జక్కన', 'ప్రేమ్‌నగర్‌', 'దసరా బుల్లోడు' లాంటి వైవిధ్య చిత్రాలు బంగారం పండించాయి. ఆ పై 'అందాల రాముడు' (1973), 'మహాకవి క్షేత్రయ్య' ('76) రజత నందులు సాధించాయి. ఆ పైన 'దేవదాసు' స్ఫూర్తి ఉన్న 'ప్రేమాభిషేకం' ప్లాటినమ్‌ జూబ్లీ విషాదాంత హీరోగా అక్కినేని కీర్తికి కలికితురాయి. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులెన్నో అందుకున్న 'మేఘసందేశం' ('82)ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిన కళాఖండం.
 క్రమంగా పెద్ద తరహా పాత్రలకు మళ్ళిన అక్కినేని 'బహుదూరపు బాటసారి', 'సూత్రధారులు', 'సీతారామయ్య గారి మనవరాలు' ('91), ఉత్తమ నటుణ్ణి చేసిన 'బంగారు కుటుంబం' ('94) తరువాత రాశి తగ్గించారు. అడపా దడపా 'చుక్కల్లో చంద్రుడు', 'శ్రీరామదాసు' లాంటి సినిమాల్లో కనిపించారు. బాపు - రమణల 'శ్రీరామరాజ్యం' ఏయన్నార్‌ నటించగా విడుదలైన ఆఖరి చిత్రం. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న 'మనం'లో ఆయన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తయింది. ఆపరేషన్‌ అయి వచ్చాక, అక్కినేని ముందుజాగ్రత్తగా తన పాత్రకు డబ్బింగ్‌ కూడా చెప్పేశారు. ఈ ఏడాది రానున్న ఆ సినిమాతో ఈ బహుదూరపు బాటసారి సినీ జీవితం ముగిసిపోవడం సినీ ప్రియులకు విషాదమే! 

అక్కినేని బాక్సాఫీస్‌ ప్రస్థానం
ఎనిమిది దశాబ్దాలుగా నట రంగంలో ఉంటూ, అందులో ఏడు దశాబ్దాల పైగా సినీ రంగంలో కొనసాగిన ఏకైక భారతీయ నటుడు అక్కినేనే! ఇన్నేళ్ళు నటనను కొనసాగించిన మరో వ్యక్తి దేశవిదేశాల్లోనూ మరెవరూ ఉండి ఉండకపోవచ్చు. మొత్తం 256 చిత్రాల్లో కెరీర్‌ తొలినాళ్ళలో, చివరి రోజుల్లో పోషించిన సహాయక పాత్రల లాంటివి వదిలేస్తే, దాదాపు 210 దాకా చిత్రాల్లో ఆయనే హీరో. ఈ సినిమాల్లో సుమారు 70 పైచిలుకు చిత్రాలు థియేటర్‌ మారకుండా, నేరుగా శతదినోత్సవాలు జరుపుకొన్నవే.

ఇక, థియేటర్లు మారి (షిఫ్టింగ్‌తో) వంద పైచిలుకు సినిమాలు వంద రోజుల ఉత్సవాలు చేసుకున్నాయి. భారతదేశంలో ఎన్టీయార్‌, తమిళ నటుడు ఎమ్జీయార్‌ తరువాత ఇన్ని శతదినోత్సవ చిత్రాలున్న నటుడు అక్కినేనే! ఆయన నటించిన 'దేవదాసు' చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 70 ఎం.ఎం.లో ఉదయం ఆటలతో రీ-రిలీజులో 104 రోజులు ఆడి, సంచలనం రేపింది. 
అక్కినేని చిత్రాల్లో స్ట్రెయిట్‌గా సిల్వర్‌ జూబ్లీ జరుపుకొన్న చిత్రాలు పది దాకా ఉన్నాయి (రోజులు మారాయి, సువర్ణ సుందరి, మాయాబజార్‌, పెళ్ళి కానుక, గుండమ్మ కథ, ఇద్దరు మిత్రులు, మూగమనసులు, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం). షిఫ్టింగులతో సిల్వర్‌ జూబ్లీ చేసుకున్న చిత్రాల్లో 'బాలరాజు' నుంచి 'సీతారామయ్య గారి మనవరాలు' దాకా దాదాపు 11 ఉన్నాయి. 
ఇక, 'దసరా బుల్లోడు', ప్రేమాభిషేకం', 'ఏడంతస్తుల మేడ' చిత్రాలు ద్విశతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. వాటిలో మొదటి రెండు చిత్రాలు ఇంకా ముందుకు సాగి, ఏడాది పాటు ఆడి రికార్డు సృష్టించాయి. ఇక, ట్రాజెడీ హీరోగా ఏయన్నార్‌కు ఉన్న పేరును నిలబెట్టిన 'ప్రేమాభిషేకం' మరింత సక్సెస్‌ సాధించి, ఏకంగా 75 వారాలు ఆడి ప్లాటినమ్‌ జూబ్లీ చేసుకుంది. ఇన్ని విజయాలతో ఏయన్నార్‌ తన స్థానాన్ని అభిమానుల మదిలో సుస్థిరం చేసుకున్నారు.

- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Thursday, Page No. 8)
............................................................

బాటసారి తుది మజిలీ



-    మంగళవారం అర్ధరాత్రి అక్కినేని ఆఖరి శ్వాస 
-    ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-    విషాదంలో సినీ పరిశ్రమ 
-    అశేషజనం అశ్రునివాళి

      తెలుగు సినీ కళామతల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని హిమాలయ పర్వతమంత స్థాయికి తీసుకువెళ్ళిన నట శిఖరం ఒరిగిపోయింది. ఏడు దశాబ్దాల పాటు కథానాయక పాత్రలతో అందరినీ అలరించి 'ఎవర్‌గ్రీన్‌' తారగా వెలిగిన నట సమ్రాట్‌ 'టాటా వీడుకోలు... ఇంక సెలవు...' అంటూ అభిమానులకు వీడ్కోలు చెబుతూ తుది శ్వాస విడిచారు. అభిమానుల శుభాకాంక్షలతో క్యాన్సర్‌ను సైతం జయించి వస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆ వాగ్దానం మాత్రం నెరవేర్చకుండానే జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రియులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. శాసనసభ, మండలి సంతాపం ప్రకటించాయి. 
   తెలుగు సినీ రంగానికి రెండు కళ్ళలో ఒకటిగా అందరూ ప్రస్తావించే 'పద్మవిభూషణ్‌' అక్కినేని నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లో తన స్వగృహంలో కన్నుమూశారు. గడచిన సెప్టెంబర్‌ 20న తొంభయ్యో ఏట అడుగుపెట్టిన ఆయన కొద్ది నెలలుగా జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గడచిన అక్టోబర్‌ నెలలో ఆ వ్యాధి బయటపడడంతో రాష్ట్ర రాజధానిలోని 'కిమ్స్‌' ఆసుపత్రిలో శస్త్రచికిత్స కూడా జరిపారు. క్యాన్సర్‌కు గురైన పేగు భాగాన్ని తొలగించి, కొన్ని వారాలుగా కెమోథెరపీతో వైద్యం అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కూడా కుటుంబ సభ్యులతో మామూలుగా మాట్లాడిన ఏయన్నార్‌ ఆరోగ్యం రాత్రి భోజనం తరువాత క్రమంగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్న అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళి, తుది ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
  ఏయన్నార్‌ మరణంతో తెలుగు చిత్రసీమను ఏలిన తొలినాళ్ళ హీరోల్లో ఆఖరి నట దిగ్గజం నిష్క్రమించినట్లయింది. మంగళవారం సాయంత్రం కూడా అక్కినేని చివరిసారిగా కుటుంబసభ్యులందరితో ఎంతో సంతోషంగా మాట్లాడారని నాగార్జున తెలిపారు. ఏయన్నార్‌ మరణ సమయంలో ఆయన కుమార్తె నాగసుశీల, మనుమడు - యువ హీరో సుశాంత్‌ పక్కనే ఉన్నారు. తెల్లవారుజామున అక్కినేని భౌతిక కాయాన్ని కేర్‌ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తరలించారు. ఉదయం కొద్దిసేపు ఇంట్లో ఉంచిన తరువాత ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు, అభిమానుల సందర్శనార్థం అక్కినేని భౌతిక కాయాన్ని ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు తరలించారు.

   స్టూడియోలో అక్కినేని అత్యంత ఇష్టమైన 'క్రిటిక్స్‌ గ్రోవ్‌' ప్రాంతంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. బుధవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయని అక్కినేని కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ అరుదైన నట విశారదుడి అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కె. అరుణ వెల్లడించారు. 

  తమ అభిమాన నటుణ్ణి ఆఖరుసారిగా చూసుకోవడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి, దేశవిదేశాల నుంచి సినీప్రియులు పెద్దయెత్తున తరలివస్తున్నారు. జనం పోటెత్తడంతో అన్నపూర్ణా స్టూడియోస్‌ ప్రాంగణం క్రిక్కిరిసి కనిపించింది. చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా ఎంతో మంది సుదీర్ఘమైన క్యూలో నిల్చొని, అక్కినేని కడసారి చూపు కోసం నిరీక్షిస్తూ వచ్చారు. సినీ నటులు కృష్ణ, చిరంజీవి మొదలు పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీయార్‌, అలీ, సీనియర్‌ నటుడు కాకరాల దాకా, నిర్మాతలు డి. రామానాయుడు, ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేశ్‌ప్రసాద్‌, దర్శకులు కె. రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లాణి శ్రీధర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఇంకా ఎంతో మంది రాజకీయ, సామాజిక ప్రముఖులు అక్కినేని భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలోనూ, అన్నపూర్ణా స్టూడియోలోనూ దర్శించి, నివాళులు అర్పించారు.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Thurs day, Page 1 and Page 4)
........................................................

Sunday, January 19, 2014

అస్తమించిన అపురూప నాయిక - సుచిత్రా సేన్‌

-   సుచిత్రా సేన్‌ (1931 - 2014)

     సుప్రసిద్ధ సినీ నటి సుచిత్రా సేన్‌ కన్నుమూశారు. ఆమె వయసు 82 ఏళ్ళు. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌కు గురై కొద్దికాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఈ అలనాటి అందాల తార కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హౌమ్‌లో గురువారం ఉదయం 8.25 గంటలకు తీవ్రమైన గుండెపోటుకు గురై, తుదిశ్వాస విడిచారు. గడచిన డిసెంబర్‌ 24వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆమె గడచిన మూడు వారాలుగా 'లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌' మీద ఉంటూ, అనారోగ్యంతో పోరాడి, ఆఖరుకు జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించడంతో సినీ పరిశ్రమ వర్గీయులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. బెంగాల్‌కు చెందిన సుచిత్రా సేన్‌ మరణంతో కోల్‌కతాలోని బెంగాలీయులు కడసారి చూపు కోసం ఆమె చికిత్స పొందిన నర్సింగ్‌ హౌమ్‌కు పెద్దయెత్తున తరలిరావడం విశేషం. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సహా ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

అలనాటి ఆరాధ్య దేవత
     బెంగాలీయులు 'మహానాయిక' (గొప్ప హీరోయిన్‌ అని అర్థం)గా పేర్కొనే సుచిత్రా సేన్‌ ఆ రోజుల్లో ఎంతోమందికి ఆరాధ్యదేవతగా వెలిగారు. 'దేవ్‌దాస్‌', 'ఆంధీ' లాంటి హిందీ చిత్రాల్లో ఆమె నటన ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టింది. బెంగాలీలో కూడా 'సప్తపది' (1961), 'దీప్‌ జ్వెలే జారు' లాంటి పలుచిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి. ముఖ్యంగా 'దీప్‌ జ్వెలే జారు' (1959)లో ఆసుపత్రి నర్సు రాధగా, 'ఉత్తర్‌ ఫల్గుణి' (1963)లో దేవదాసిగా - ఆమె కుమార్తెగా చేసిన ద్విపాత్రాభినయం ఇవాళ్టికీ బెంగాలీ సినీ ప్రియులకు మరపురానివే! ఓ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డు పొందిన తొలి భారతీయ నటి ఆమే! యాభై ఏళ్ళ క్రితం 1963లో మాస్కో చలనచిత్రోత్సవంలో 'సాత్‌ పాకే బాంధా' చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటిగా వెండి బహుమతిని ఆమె అందుకున్నారు. అలాగే, 1972లో భారత ప్రభుత్వం ఆమెకు 'పద్మశ్రీ' పురస్కారాన్నిచ్చింది.

సుచిత్రాసేన్‌ అసలు పేరు రమా దాస్‌గుప్తా. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931 ఏప్రిల్‌ 6న బెంగాల్‌లోని పబ్నా గ్రామం (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భాగం)లో ఆమె జన్మించారు. ఆమె తండ్రి కరుణామరు దాస్‌గుప్తా స్థానిక పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేసేవారు. తల్లి ఇందిరా దేవి సాధారణ గృహిణి. వారి అయిదో సంతానం సుచిత్ర. బెంగాలీ ధనిక పారిశ్రామికవేత్త కుమారుడైన దీపానాథ్‌ సేన్‌తో 1947లో ఆమె వివాహం జరిగింది. వారి సంతానమే - తరువాతి రోజుల్లో నటిగా పేరు తెచ్చుకున్న మూన్‌ మూన్‌ సేన్‌. కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలోని 'సిరివెన్నెల'లో కూడా మూన్‌ మూన్‌ సేన్‌ నటించారు. 

కాలం చెరపని తీపి జ్ఞాపకం
బెంగాలీ చిత్రాల్లో స్త్రీత్వానికి ప్రతిరూపంగా సుచిత్రా సేన్‌ పేరు తెచ్చుకున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది. సంప్రదాయానికి కట్టుబడి ఉంటూనే, ఆదర్శాల విషయంలో పక్కకు బెసగడానికి ఒప్పుకోని దృఢమైన స్త్రీ పాత్రలకు ఆమె జీవం పోశారు. నిజానికి, ఆమె నటించిన తొలి చిత్రం 'శేష్‌ కొఠారు' (1952) విడుదల కానే లేదు. ఆ మరుసటి ఏడాది నటుడు ఉత్తమ్‌కుమార్‌ సరసన ఆమె నటించిన 'షారే చౌత్తోర్‌' చిత్రం బాక్సాఫీస్‌ హిట్టవడంతో, ఆమె దశ మారిపోయింది. బెంగాలీ సినీ రంగంలో ఉత్తమ్‌కుమార్‌, సుచిత్రలది సూపర్‌హిట్‌ జంటగా పేరు తెచ్చుకుంది. దాదాపుగా రెండు దశాబ్దాల పైచిలుకు ఆ ప్రభంజనం కొనసాగింది. బెంగాలీ ప్రేమకథా చిత్రాలకూ, మెలోడ్రామా చిత్రాలకూ చెరగని చిరునామాగా నిలిచిన ఆమె ఒకటి, రెండు తరాల ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశారు. 1960లు, '70లలో ఆమె నటించిన చిత్రాల ఘన విజయాలతో అత్యంత పాపులర్‌ బెంగాలీ తారగా అవతరించారు. 

హిందీ చిత్ర రంగంలో కూడా సుచిత్రాసేన్‌ మరిచిపోలేని పాత్రలు పోషించారు. బిమల్‌ రారు రూపొందించిన హిందీ 'దేవ్‌దాస్‌' (1955)లో దిలీప్‌కుమార్‌ సరసన పార్వతి పాత్రలో ఆమె చూపిన అభినయం ఉత్తరాది ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. ఆ తొలి హిందీ చిత్రంతోనే ఆమె దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాగే, తరువాతి రోజుల్లో ఆమె నటించిన మరో హిందీ చిత్రం 'ఆంధీ' (1975), అందులో ఆమె పోషించిన రాజకీయ నాయకురాలు ఆర్తీదేవి పాత్ర సంచలనమయ్యాయి. భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆ సినిమా కథ అల్లుకోవడం చర్చనీయాంశమైంది. ఆ చిత్రంలో సంజీవ్‌ కుమార్‌తో కలసి ఆమె కనిపించే 'తేరే బినా మేరే జిందగీ సే...' అన్న పాట, అందులో ఆమె హావభావాలు ఆల్‌ టైమ్‌ హిట్టే! దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ సినిమా కూడా నిషేధానికి గురైంది. హృషీకేశ్‌ ముఖర్జీ దర్శకత్వంలోని 'ముసాఫిర్‌' కూడా ఎంతో పేరు తెచ్చింది. 

తీరని సత్యజిత్‌ రే, రాజ్‌కపూర్‌ల కోరిక
వెండితెరపై బలమైన, భిన్నమైన స్త్రీ పాత్రలకు పేరు తెచ్చుకున్న ఆమె నిజజీవితంలోనూ తాను నమ్మిన రీతిలో దృఢమైన నిర్ణయాలు తీసుకొనేవారు. సుచిత్రా సేన్‌తో 'దేవి చౌధురాణి' పేరిట ఓ చిత్రం తీయాలని సత్యజిత్‌ రే భావించారు. కానీ డేట్ల సమస్యతో ఆమె తోసిపుచ్చారు. అలాగే, దర్శక - నటుడు రాజ్‌కపూర్‌ ఇచ్చిన సినిమా ఆఫర్‌ను కూడా ఆమె కాదన్నారు. దిలీప్‌ కుమార్‌ ఆమెకు మంచి మిత్రుడు. అలాగే, దేవానంద్‌తో కూడా 'సర్హద్‌' (1960), 'బొంబయి కా బాబు' (1960) లాంటి చిత్రాల్లో నటించారు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలు, దర్శకులతో సినీ జీవిత పయనానికి ఆమె మొగ్గుచూపడం విశేషం. దాదాపు పాతికేళ్ళ పాటు అపరిమిత ప్రభావం చూపిన ఆమె1978లో సినీ రంగానికి గుడ్‌బై చెప్పేశారు. జనజీవితానికి దూరంగా ఉండిపోయారు. రామకృష్ణ మిషన్‌ భావాలకు ఆకర్షితురాలై, వారి సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. 

దశాబ్దాలుగా... జనం దృష్టికి దూరంగా...
సినిమాల నుంచి పక్కకు తప్పుకున్న తరువాత దాదాపు మూడు దశాబ్దాల పైగా ఆమె జనానికీ, ప్రచారానికీ దూరంగా ఉంటూ వచ్చారు. కోల్‌కతా దక్షిణ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జనం కంటికి దూరంగా కాలం గడుపుతూ వచ్చారు. నిజానికి, 2005లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు నివ్వాలని భావించింది. అయితే, అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వ్యక్తిగతంగా వచ్చి జనం దృష్టిలో పడడం ఇష్టం లేని సుచిత్రాసేన్‌ సినీ రంగంలో ప్రభుత్వమిచ్చే ఆ అత్యున్నత పురస్కారాన్ని సైతం తిరస్కరించడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామిచ్చే అత్యున్నత పురస్కారమైన 'వంగ విభూషణ్‌' పురస్కారాన్ని 2012లో ఆమెకు ప్రకటించారు. 

ఎవరి కంటా పడకుండా అనారోగ్యంతో కాలం గడుపుతున్న ఆమెను రహస్యంగా కెమేరాలో చిత్రీకరించడం కోసం ఓ ప్రముఖ బెంగాలీ వార్తా చానల్‌ కొన్నేళ్ళ క్రితం ఓ జర్నలిస్టును ఆసుపత్రి సిబ్బంది వేషంలో ఆమె ఇంటికి కూడా పంపింది. వ్యక్తిగత గోప్యతను గౌరవించని ఈ రహస్య ఆపరేషన్‌ నైతికత మాటెలా ఉన్నా, సుచిత్రా సేన్‌ అంటే బెంగాలీయులకు ఉన్న ఆరాధన, ఎలాగైనా ఆమెను చూడాలన్న కోరికకు ఆ ఉదంతం ఓ మచ్చుతునక. నటుడు, దర్శక - నిర్మాత దేవానంద్‌ ఓ సందర్భంలో చెప్పినట్లు, ''సుచిత్రా సేన్‌ను కేవలం అందగత్తె అని చెప్పి ఊరుకోలేం. అందం కన్నా, ఆమె వ్యక్తిత్వం ఇంకా గొప్పది. అందుకే ఆమె దృఢనిశ్చయంతో ఉన్న వ్యక్తిగా, వీడని ఓ చిక్కుముడిగా అందరినీ ఆకర్షించారు.'' ఆ ఆకర్షణ, ఆ మార్మికతల్ని బెంగాలీ, హిందీ సినీ ప్రియులు ఎన్నటికీ మర్చిపోలేరు. 
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 18th Jan 2014, Saturday, Page No.8)
...............................................

Saturday, January 18, 2014

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా! - సినీ నటుడు కృష్ణంరాజు

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) తరఫున పోటీ చేయనున్నట్లు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు. కృష్ణంరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఈ సంగతి వెల్లడించారు. కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కృష్ణంరాజు ఇటీవల మళ్ళీ బి.జె.పి.లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో కాకినాడ, నరసాపురం పార్లమెంటరీ స్థానాల నుంచి బి.జె.పి. తరఫున నిలిచి, గెలిచిన ఆయన ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేయనున్నదీ చెప్పలేదు. ''పార్టీ నిర్ణయించిన స్థానంలో పోటీ చేస్తా'' అని ఆయన 'ప్రజాశక్తి'తో అన్నారు. మునుపటి నియోజక వర్గాల్లో తన పని తీరు బాగున్నందు వల్ల ఇప్పుడు ఇతర స్థానాల నుంచి కూడా తనను పోటీ చేయమంటూ అభ్యర్థనలు వస్తున్నాయని ఆయన అంటున్నారు. 

పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం నాడు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్న ఆయన, ''నేను బి.జె.పి. కుటుంబంలోని వాణ్ణి. మధ్యలో బయటకు వచ్చినా, ప్రస్తుత రాజకీయాలు నచ్చకపోవడంతో గడచిన నాలుగేళ్ళుగా వాటికి దూరంగా ఉంటున్నా. కానీ, పరిస్థితులు మారుతున్నాయనే చిన్న ఆశతో మళ్ళీ ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నా'' అని వివరించారు. 2009 ఎన్నికల సమయంలో మరో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం పార్టీ' (పి.ఆర్‌.పి)లోకి వెళ్ళిన కృష్ణంరాజు ఆ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో, కొద్ది రోజులకే బయటకు వచ్చేశారు. 

ఇక నుంచి మళ్ళీ బి.జె.పి. పక్షాన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటానన్న కృష్ణంరాజు ''మన రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్న''ట్లు తెలిపారు. 'ఒక ఓటు - రెండు రాష్ట్రాలు' అంటూ చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్న బి.జె.పి. అధినాయకత్వం బాటలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ''అయితే, రాష్ట్ర విభజన సమయంలో ఏ ప్రాంతం వాళ్ళకూ అన్యాయం జరగకూడదు. రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలి. అందు కోసం నా స్వరం వినిపిస్తాను'' అని కృష్ణంరాజు, 'ప్రజాశక్తి'తో అన్నారు. 


''నేను కోస్తా ఆంధ్రలో పుట్టినా, ఇక్కడే హైదరాబాద్‌లో బద్రూకా కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చదివాను. ఇక్కడ నుంచే మద్రాసులో సినీ రంగానికి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడకే వచ్చాను. కాబట్టి, నేను అన్ని ప్రాంతాల వాణ్ణి'' అని ఆయన అన్నారు. కొత్త ఏడాదిలో అవినీతి మూలాలను నిర్మూలించాలన్న ఇతివృత్తథంతో 'ఒక్క అడుగు' పేరిట ఓ సందేశాత్మక సాంఘిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభాస్‌, తాను కలిసి ఆ చిత్రంలో నటిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బి.జె.పి. విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌:

(Published in 'Praja Sakti' daily, 17th Jan 2014, Friday, Page No.4)
.........................

Friday, January 17, 2014

ఆరున్నర దశాబ్దాల సినీ ఆణిముత్యం నటి అంజలీదేవి

ఆరున్నర దశాబ్దాల పైచిలుకుగా తెలుగు వారి ఇంటింటా సుపరిచితురాలైన తొలినాళ్ళ నటీమణి అంజలీదేవి. ఆమె జీవితం, సినీ జీవితం ఊహించని ఎన్నో మలుపులతో సాగింది. 1928 October 28 సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె సినీ జీవితపు శిఖరాలను చూశారు. నిర్మాతగా నమ్మినవారి చేతుల్లో మోసపోయినప్పుడు ఈ రంగంలోని అగాధాల అంచులను కూడా తాకారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇతోధికంగా పాల్గొన్నారు. నటిగా, నిర్మాతగా బాక్సాఫీస్‌ హిట్లు అందించారు. భారీ ఫ్లాపులతో నష్టాలూ చవిచూశారు. ఎంతో సీనియర్‌ నటి అయినా, ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ 'పద్మ' పురస్కారమూ దక్కకుండానే కన్నుమూశారు. 

స్టేజీ నుంచి సినిమాకు...
అంజలీ దేవి నట జీవితాన్ని గమనిస్తే, ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న ఆమె బాల నటిగా రంగస్థలంపై ఓనమాలు దిద్దుకున్నారు. కాకినాడలోని ప్రసిద్ధ 'యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌' ఆర్గనైజర్‌ అయిన సంగీత దర్శకుడు, రచయిత ఆదినారాయణరావు ఆమెను నటిగా, నాట్యరాణిగా తీర్చిదిద్దారు. తల్లీ, తండ్రీ, గురువు, స్నేహితుడు - అన్నీ తానే అయిన ఆయన పట్ల అంజలీదేవికి ఆరాధనా భావం పెరగడంతో, అనంతరం 1942లో వారు పెళ్ళి చేసుకున్నారు. 

మొదట పలు ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించక చివరకు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలోని 'గొల్లభామ' (1947) చిత్రం ద్వారా అంజలీదేవి సినీ రంగ ప్రవేశం జరిగింది. ఓ నాటక ప్రదర్శనలో అంజలీదేవి అభినయం చూసిన ఆయన ఆమెకు సినిమా అవకాశమిచ్చారు. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే, కొన్ని వందల చిత్రాల్లో అమ్మ పాత్రలకూ, సాత్త్వికమైన పాత్రలనూ పోషించిన అంజలీదేవి మొదట్లో అందానికీ, ఆకర్షణకు ప్రాధాన్యమున్న వ్యాంప్‌ పాత్రలతో సినీ జీవితం ఆరంభించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. తొలి చిత్రం విడుదల కాకుండానే ఆమెకు ఏకంగా నాలుగు సినిమాల్లో అవకాశం రావడం విచిత్రం. 'గొల్లభామ'లో మోహినిగా, అక్కినేని నటించిన 'బాలరాజు' (1948)లో అందగత్తెగా, 'కీలుగుఱ్ఱం' (1949)లో రాక్షస కన్యగా ఆమె ప్రేక్షకుల మనస్సు దోచారు.

మంచి పాత్రలతో మారిన ఇమేజ్‌
అంజలీదేవికి ఉన్న తొలి రోజుల నాటి వ్యాంప్‌ ఇమేజ్‌ను మార్చిన సినిమా ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో అక్కినేనితో నటించిన 'శ్రీలక్ష్మమ్మ కథ' (1950). అనంతరం ఆమె సీత, సుమతి, రుక్మిణి లాంటి పవిత్రమైన పాత్రలు చేశారు. పుల్లయ్య దర్శకత్వంలోనే ఎన్టీయార్‌ శ్రీరాముడిగా, అంజలీదేవి సీతాదేవిగా నటించిన 'లవకుశ' ఆమెకు పెద్ద ఇమేజ్‌ను సంపాదించి పెట్టింది. 'తెలుగింటి సీతమ్మ'గా పేరు తెచ్చింది. 'భక్త ప్రహ్లాద', 'భక్త తుకారామ్‌', 'బడి పంతులు' లాంటి చిత్రాలు ఆమెను తెలుగువారు తమ ఇంటి మనిషిగా గుర్తు పెట్టుకొనేలా చేశాయి. కథానాయిక నుంచి క్రమంగా తల్లి పాత్రలకు ఆమె మారారు. అందరికీ ఆత్మీయంగా మెలిగారు. 

చిరస్మరణీయ చిత్రాల నిర్మాత 
సినీ పరిశ్రమలోకి వచ్చిన మూడేళ్ళకే అంజలీదేవి నిర్మాత అయ్యారు. అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావు, అక్కినేని, మేకప్‌మ్యాన్‌ గోవిందరావు భాగస్వాములుగా అశ్వినీ పిక్చర్స్‌ పతాకంపై 'మాయలమారి' చిత్రాన్ని నిర్మించారు. కానీ, తరువాత ఆ చిత్ర నిర్మాణ సంస్థ మూతపడింది. అటుపైన అంజలి దంపతులు 1953లో 'అంజలీ పిక్చర్స్‌' పేరిట స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ పతాకంపై తీసిన 'పరదేశి' సినిమా ద్వారా తమిళ నటుడు శివాజీ గణేశన్‌ను తెలుగు వారికి పరిచయం చేశారు. ఆ కృతజ్ఞతతో ఆయన తరువాతి రోజుల్లో ఆమె నిర్మించిన 'భక్త తుకారామ్‌'లో ఛత్రపతి శివాజీ మహారాజుగా అతిథి పాత్రలో ఉచితంగా నటించారు. 

సొంత నిర్మాణ సంస్థపై ఆ దంపతులు దాదాపు పాతిక పైగా చిత్రాలు నిర్మించారు. 'అనార్కలి', బాక్సాఫీస్‌ బంపర్‌ హిట్‌ 'సువర్ణ సుందరి', 'స్వర్ణ మంజరి', 'సతీ సుమతి', 'సతీ సక్కుబాయి', 'భక్త తుకారామ్‌', 'మహాకవి క్షేత్రయ్య', 'చండీప్రియ' తదితర చిత్రాలు వారి నిర్మాణంలో వచ్చినవే. 

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వారు చిత్ర నిర్మాణం చేశారు. తమిళంలో ఎమ్జీయార్‌, శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ లాంటి స్టార్ల సరసన నటించిన అంజలీదేవి యాభయ్యో దశకంలో ఓ అరడజను హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్‌. ఎన్టీ రామారావు హిందీలో నటించిన ఏకైక సాంఘిక చిత్రం 'నయా ఆద్మీ'లో ఆమే హీరోయిన్‌. 'ఉస్తాద్‌', 'ఏక్‌ థీ రాజా', 'లడ్కీ', 'దేవ్‌తా' లాంటివి ఆమె నటించిన మరికొన్ని హిందీ చిత్రాలు. 





ఆత్మీయ పాత్రల అమ్మ

అప్పట్లో రోజూ రెండు కాల్షీట్లతో, రోజుకు పదహారు గంటలు పని చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఆమె. కథానాయిక నుంచి క్యారెక్టర్‌ వేషాలకు మారిన తరువాత వదినగా, అమ్మగా అంజలీదేవి నటించిన సినిమాలకు లెక్కలేదు. బి.ఎన్‌. రెడ్డి దర్శకత్వంలోని 'రంగుల రాట్నం', ఎన్టీయార్‌తో 'బడి పంతులు' (దర్శకుడు పి.సి. రెడ్డి), ఎస్వీ రంగారావుతో 'తాత - మనవడు' (దర్శకుడు దాసరి నారాయణరావు), కాంచన నటించిన 'కల్యాణ మండపం' (దర్శకుడు వి. మధుసూదనరావు) లాంటివి ఆమె నటజీవితంలో మేలిముత్యాలయ్యాయి. 

నిజానికి, వంద సినిమాలు పూర్తయ్యాక ఒక దశలో ఆమె సినీ జీవితం నుంచి రిటైరై పోవాలని కూడా అనుకున్నారు. ఆ ఆలోచనతో కొత్త చిత్రాలు అంగీకరించడం కూడా ఆపారు. కానీ, అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ వారి దాడులతో చిక్కుల్లో పడ్డారు. మరోపక్క నటి వైజయంతిమాలతో హిందీలో తీసిన 'ఫూలోంకా సేజ్‌' చిత్రంలో ఫైనాన్షియర్లు మోసం చేయడంతో ఆస్తులన్నీ కోర్టు స్వాధీనమయ్యాయి. అయినా, అటు తమిళ చిత్ర సీమ, ఇటు తెలుగు సినీ సీమ ఆమెను ఆదరించడంతో మళ్ళీ పుంజుకున్నారు. 

చిత్ర నిర్మాణ రంగంలో దెబ్బతిన్న సమయంలో 1963లో సీనియర్‌ నటుడు చిత్తూరు వి. నాగయ్య ద్వారా సత్యసాయిబాబాకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయనకు భక్తురాలిగా మారిన ఆమె చెన్నైలో తమ ఇంటిని ఆనుకొనే ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆయన ఆశ్రమం 'సుందరం' నిర్మాణానికి రాసి ఇచ్చేశారు. 'షిర్డీ సాయి - పత్రి సాయి దివ్యకథ' అనే సీరియల్‌ను కూడా స్వయంగా నటిస్తూ, నిర్మించారు. 

తోటి తారలతో అనుబంధం
సౌతిండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు 1950 - 51లో ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ గౌరవం దక్కిన తొలి మహిళ అంజలీదేవే! అలాగే, దక్షిణ భారత చలనచిత్ర కళాకారుల సంఘం (నడిగర సంగంగా సుప్రసిద్ధం)కి 1959లో అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. తెలుగు సినీ రంగంలో తొలినాళ్ళ గ్లామర్‌ తార అయిన అంజలీదేవికి తాను ఏకలవ్య శిష్యురాలినని తరువాతి తరం నటి సావిత్రి చెప్పేవారు. 'గొల్లభామ' చిత్రంలో అంజలీదేవి చేసిన నృత్యాలను ఆమె సభా వేదికలపై చూస్తూ ఉండేవారు. సావిత్రితో పాటు ఆ నాటి నటీమణులైన జమున, 'షావుకారు' జానకి, కృష్ణకుమారి, తరువాత సినీ రంగానికి వచ్చిన కాంచన, శారద లాంటి వారందరూ ఆమె అంటే ఇప్పటికీ అపరిమితమైన ప్రేమాభిమానాలు. 

చెన్నైలో ఒకే ప్రాంతంలో దగ్గరి ఇళ్ళు కావడంతో నటి - నిర్మాత సి. కృష్ణవేణితో అంజలిది ప్రత్యేక అనుబంధం. ఆ మధ్య మరణించిన నటి టి.జి. కమలాదేవితో కలసి చిత్తూరు వి. నాగయ్య మెమోరియల్‌ అవార్డు పేరిట ఏటా చెన్నైలో అవార్డులు అందిస్తూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తూ వచ్చారు. అలాగే, తొలితరం సినీ జర్నలిస్టు కీర్తిశేషులు ఇంటూరి వెంకటేశ్వరరావు మీద గౌరవంతో, ఏటా ఓ ఉత్తమ సినీ జర్నలిస్టుకు సత్కారం చేసే కార్యక్రమంలో విధిగా పాల్గొనేవారు. 

సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక తరహాలు నాలుగింటిలోనూ పేరు తెచ్చుకోవడం, తెలుగులో లాగానే తమిళంలోనూ సుపరిచిత నటిగా వెలగడం అంజలీదేవి నటజీవితంలోని విశేషం. 1946వ సంవత్సరం భోగి పండుగ రోజున అంజలీదేవి, ఆదినారాయణరావు దంపతులు మద్రాసులో దిగారు. సరిగ్గా అరవై ఏడేళ్ళ తరువాత అదే భోగి రోజున మధ్యాహ్నం అంజలీదేవి అదే చెన్నపట్నంలో కన్నుమూయడం. కాకతాళీయం. ఒక విశిష్ట నటిగా, నిర్మాతగానే కాక, తరువాతి తరం తారలెందరికో మార్గనిర్దేశనం చేసిన వ్యక్తిగా, మనసున్న మంచి మనిషిగా అంజలీదేవి చిరకాలం గుర్తుంటారు. 

- రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 14th Jan 2014, Tuesday, Page No.10)
...............................................................