జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, March 9, 2012

బాలకృష్ణ ‘సి.ఎం.’పై మాట మార్చిన వై.వి.ఎస్. చౌదరి - నోరు విప్పని మీడియా





(ఫోటోల వివరం - ‘సింహా’లో బాలకృష్ణ, ‘నిప్పు’ చిత్రం విడుదలకు ముందు విలేఖరుల సమావేశంలో బొమ్మరిల్లు బ్యానర్ అధినేత, దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరి)

ఒపీనియన్స్ ఛేంజ్ చేయనివాడు రాజకీయ నాయకుడు కాడన్నాడు మన ''కన్యాశుల్కం'' గిరీశమ్. ఆ విషయాన్ని తమకు కూడా అన్వయించుకొనేలా మార్చేసుకోవడంలో మన సినిమా వాళ్ళు ఘటికులు. అయితే, ఒపీనియన్ల గురించి మాత్రమే మన గిరీశం చెప్పాడు కానీ, మన సినిమా వాళ్ళు వాటిని ఫ్యాక్ట్ లు, ఫిగర్ల (వాస్తవాలు, గణాంకాల) దాకా విస్తరించారు. అభిప్రాయాలే కాదు, రెండు రోజుల క్రితం తామే స్వయంగా చెప్పిన, చేసిన ప్రకటనకూ, తమకూ ఎలాంటి సంబంధమూ లేదని కూడా నిష్పూచీగా చెప్పేస్తారు.

మొదటి సారి ప్రకటన చేసినప్పుడూ, తరువాత ఆ ప్రకటనతో తనకేమీ సంబంధం లేదన్నప్పుడూ కూడా మన మీడియా కెమేరాలు కళ్ళప్పగించి చూస్తాయి. సోదర జర్నలిస్టులు చెవులప్పగించి వింటారు. కానీ, మాట మార్చిన పెద్దమనిషిని అదేమిటని అడగరు. పైగా, మొదటి ప్రకటనను మీడియాయే తప్పుగా ప్రచురించిందని అడ్డంగా అబద్ధం ఆడేస్తూ, తప్పంతా పత్రికా వృత్తి మీద నెట్టేస్తుంటే, ఆ పెద్దమనిషిని నిలదీయరు. వృత్తి మీద నింద వేస్తున్నందుకైనా అతగాణ్ణి కడిగేయరు.

ఈ మధ్య ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరి తన తాజా చిత్రం ‘నిప్పు’ విడుదలకు ముందు, విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలవుతున్న సమయం కావడంతో, పాత బాకీల బెడద తప్పించుకోవడానికో, మరెందుకో కానీ అక్కడే ఓ కొత్త సినిమా సంగతి కూడా లోపాయకారీగా బయటపెట్టారు. హీరో బాలకృష్ణతో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘సి.ఎం. (కామన్ మేన్)’ అనే సినిమాను తాను నిర్మిస్తున్నట్లు సాక్షాత్తూ వై.వి.ఎస్. చౌదరే మీడియా మిత్రులకు తెలిపారు. ఆ వార్తను ఆ రోజే టీవీలన్నీ హోరెత్తించాయి. మరునాడు కొన్ని దినపత్రికలూ యథావిధిగా ప్రచురించాయి.

కట్ చేస్తే, వారం పది రోజుల తరువాత వై.వి.ఎస్. చౌదరి నుంచి ఓ ఖండన ప్రకటన వచ్చింది. మీడియాలో ‘సి.ఎం.’ సినిమా గురించి వస్తున్న వార్తలు తప్పనీ, అసలు ఆ సినిమాతో తనకు కానీ, తమ బొమ్మరిల్లు బ్యానర్ కు కానీ సంబంధం లేదనీ, ఆ సినిమా తాము తీయడం లేదనీ, తాము తీస్తున్నట్లు వచ్చిన వార్తలు ఎవరో పుట్టించినవనీ వై.వి.ఎస్. వాక్రుచ్చారు. అడ్డంగా తన మాట మార్చేశారు. షరా మామూలుగా మన మీడియా అంతకు ముందు ఏమీ జరగనట్లే, ఈ వార్తనూ ప్రసారం చేసింది. పత్రికల్లో వేసింది.

అసలు ఈ వార్తలు, ఈ ఖండన ప్రకటనలతో అనుమానం వచ్చింది. కూపీ లాగితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒపీనియన్ ను కాదు, ఏకంగా కెమేరాల సాక్షిగా స్వయంగా చెప్పిన మాటనే వై.వి.ఎస్. ఇలా మార్చేయడం వెనుక కృష్ణానగర్ వర్గాల సమాచారం ప్రకారం పెద్ద కథే ఉంది.

బాలకృష్ణతో గతంలో ‘ఒక్క మగాడు’ అనే ఓ భయంకరమైన ఫ్లాప్ చిత్రం తీసిన ఘన చరిత్ర నందమూరి వంశ వీరాభిమానిగా చెప్పుకొనే వై.వి.ఎస్. చౌదరి సొంతం. (అఫ్ కోర్స్, కమలహాసన్ తో దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు చిత్రానికి పేలవమైన కాపీగా తయారైన ఆ సినిమాను ముందుగానే పెద్ద రేట్లకు చౌదరి అమ్మేసుకున్నారు. అలా చౌదరికైతే లాభాలు మిగిలాయి కానీ కొన్న బయ్యర్లే మట్టి కొట్టుకు పోయారు). ఇప్పుడు, ఈ కొత్త చిత్రం ‘సి.ఎం.’ తాలూకు ప్రకటనను కనీసం బాలకృష్ణతో మాట మాత్రంగానైనా చెప్పకుండానే వై.వి.ఎస్. ప్రకటించేశారట.

ఆ మాటకొస్తే, ఈ కొత్త సినిమా గురించి అసలు బాలకృష్ణకు తెలియనే తెలియదట. బాలయ్య బాబుతో కాకుండా ఆయనకు బంధువూ, అత్యంత సన్నిహితుడూ, ఆయన సినిమా వ్యవహారాలు చూసే వ్యక్తీ అయిన ఓ ఆరక్షరాల పెద్దమనిషితోనే ఈ సినిమా వ్యవహారమంతా వై.వి.ఎస్ మాట్లాడుకున్నట్లు భోగట్టా. వై.వి.ఎస్. కానీ, ఆ చిత్రానికి దర్శకుడిగా ఒప్పుకున్న కృష్ణవంశీ కానీ హీరో బాలకృష్ణను అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కలవనే లేదు, చర్చించనే లేదన్నది ఆంతరంగిక వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం.

బాలయ్యకు బంధువైన సన్నిహితుడితో చెప్పేశాం కదా, ఇక బాలకృష్ణతో తరువాత మాట్లాడుకోవచ్చనుకున్నారో ఏమో, ‘నిప్పు’ విడుదల వేళ ఒత్తిళ్ళు తప్పించుకొనే హడావిడిలో వై.వి.ఎస్. ఈ బాలకృష్ణతో కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలు మీడియాకు తెలివిగా ఊదారు. గతంలో ‘ఒక్క మగాడు’ చిత్ర సమయంలో ఆ ఆరక్షరాల బాలయ్య బంధువునే అడ్డం పెట్టుకొని, హీరో బాలకృష్ణకు 50 లక్షల రూపాయలు ఎగ్గొట్టిన వై.వి.ఎస్. చౌదరి ఈసారి కూడా ఆ బంధు మంత్రం పారుతుందని అనుకున్నట్లున్నారు. కానీ, ఇప్పుడు ఆ పాచిక పారలేదు సరి కదా ఎదురుతన్నింది. అసలు ఈ ప్రాజెక్టు గురించి తనకు ఎవరూ, ఏమీ చెప్పకుండానే పేపర్లలో వై.వి.ఎస్. లీకుతో వార్తలు వచ్చేసరికి బాలకృష్ణ అపర ‘లక్ష్మీ నరసిం’హుడే అయ్యారు.

ఇంతలో ‘నిప్పు’ రానూ వచ్చింది, అట్టర్ ఫ్లాప్ అవనే అయింది. అగ్నికి ఆజ్యం పోసింది. ఇక, ఆగ్రహంతో ఉన్న బాలయ్యను శాంతింపజేయడానికి ఏం చేయాలో ఎవరికీ తెలియలేదట. సినిమా చేస్తానని వై.వి.ఎస్.తో ఒప్పుకోవడమే తప్ప, అప్పటి వరకు బాలకృష్ణను స్వయంగా కలవడం కానీ, మాట్లాడడం కానీ చేయని దర్శకుడు కృష్ణవంశీకి కూడా గుండెల్లో రాయి పడింది. హీరో అయిన తనతో ప్రాజెక్టు గురించి మాట్లాడనైనా మాట్లాడకుండానే ఏకంగా సినిమా గురించి ప్రకటనే ఇచ్చేసిన దర్శక, నిర్మాతలతో సినిమా చేసేందుకు బాలకృష్ణ ససేమిరా అనేశారు. చివరకు వేరే దారి లేక, వై.వి.ఎస్. చౌదరే ‘సి.ఎం.’ చిత్ర ప్రకటనకు ఖండన జారీ చేయాల్సి వచ్చింది.

గమ్మత్తు ఏమిటంటే, అన్న మాటను వారం పది రోజులకే మింగేసిన వై.వి.ఎస్. ఆఖరికి తప్పంతా మీడియాలో వచ్చిన అసత్య వార్తలదే అన్నట్లుగా ఆ ఖండన ప్రకటన ఇచ్చారు. మీడియాలో ఒక్కరూ అదేమిటని అడిగిన పాపాన పోలేదు. మీరే విషయం చెప్పి, ఆనక మీరే మాట మార్చేసి, చివరకు తప్పంతా మీడియాలో వచ్చిన వార్తలది అంటారేమిటని ఒక్క జర్నలిస్టూ ధైర్యంగా అడగ లేదు. వై.వి.ఎస్.ను కడగలేదు.

కనీసం - మాట మార్చింది వై.వి.ఎస్సే తప్ప మీడియా కాదన్న సంగతి తెలిసే విధంగానైనా వార్త రాయలేదు, టీవీలో చెప్పలేదు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాగా - ఆ రోజుకు ఆ వార్త, ఈ రోజుకు ఈ వార్త ఇచ్చేసి చేతులు కడుక్కున్నారు.

మీడియా మరీ ఇంత దారుణంగా తన మీద పడిన అకారణ నిందను ఎందుకు సహిస్తున్నట్లు.... ? సినిమాలకు ప్రచారం కోసం దర్శక, నిర్మాతలు, హీరోలు అందజేస్తున్న ‘అతిథి మర్యాదల’కు అలవాటు పడడమే దీనికి కారణమని వై.వి.ఎస్. సన్నిహితులు కుండబద్దలు కొట్టారు.

ఈ మాటతో పాటు, కొన్ని ప్రైవేటు ఎఫ్.ఎం. చానళ్ళు ఏకంగా పత్రికా విలేఖరుల మీద తరచూ వ్యంగ్యోక్తులు ప్రసారం చేస్తున్నట్లు వినవచ్చింది. నలుగురికీ చెప్పాల్సిన మన పత్రికల వారే వార్తల ‘కవరేజ్’ అంటూ చివరకు నలుగురిలో పలచనైపోవడం, నగుబాటుకు గురవడం చాలా బాధగా అనిపించింది. ఉండబట్టలేక, ఈ నాలుగు మాటలూ రాయాల్సి వచ్చింది.

మీడియా మిత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా... ? ప్రచారం కోసం చూసేవారే ఏకంగా పత్రికా రచనను శాసించే స్థాయికి ఎదగడాన్ని అడ్డుకుంటారా... ? అసలు ఇంతటి దు:స్థితికి మనమెందుకు దిగిపోవాలని ఆత్మవిమర్శ చేసుకుంటారా... ? చెప్పిన మాటను చెప్పలేదంటూ, ఆనక తప్పంతా మీడియాదే అనే అపర సినీ గిరీశాల అసలు కథను జనం కట్టెదుట పెడతారా... ? అక్షరం అమ్ముడు కాదని చూపెడతారా... ? మీడియా గౌరవాన్ని నిలబెడతారా.... ? అన్నీ బేతాళ ప్రశ్నలే.

Saturday, March 3, 2012

''నిప్పు'' మీద నెగటివ్ టాక్ - ఆశ్చర్యపరిచే తెర వెనుక కథ




(ఫోటోల వివరం - ''నిప్పు''లో రవితేజ, ''పూల రంగడు''లో సిక్స్ ప్యాక్ లో సునీల్)


రవితేజ హీరోగా నటించగా, ఇటీవల విడుదలైన ''నిప్పు'' సినిమా నేనింకా చూడలేదు. అసలు రిలీజు రోజునే చూద్దామంటే కుదరలేదు. చూద్దామని అనుకుంటుండగానే, సినిమా బాగా లేదంటూ, పత్రికలలో, చానళ్ళలో హోరెత్తించే ప్రచారం సాగింది. ఖాళీ కుదుర్చుకొని, సినిమా చూసేలోగా, హాళ్ళలో ఆ సినిమా దాదాపు అదృశ్యమైంది. ఒకటీ అరా మల్టీప్లెక్సుల్లో ఉన్నా, రోజుకు ఒకటీ, అరా ఆటలే మిగిలాయి. అబ్బ.... ప్రతి సినిమానూ ఆహా, ఓహో అద్భుతం అని ఆకాశానికి ఎత్తేసే మీడియా ఈ సారి ఇంత నిష్కర్షగా ముక్తకంఠంతో చెప్పిన మాట అక్షరాలా నిజంలా ఉందే అని అనుకున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఓ పేరున్న పెద్ద పేపర్ లో సినిమా విడుదలైన మరునాడే నిప్పు బాగా లేదంటూ రివ్యూ కూడా వచ్చేసింది. ఇవన్నీ నాకు ఆశ్చర్యం, మీడియాలో సత్యనిష్ఠ పెరిగిందేమోనన్న ఆనందం కలిగించాయి.

కానీ, ఇందరూ, ముక్తకంఠంతో ఇంతగా సినిమా బాగా లేదని చెప్పడం వెనుక కారణమేమిటా అని నా బుర్రలో ఏదో ఒక మూల గంట కొడుతూనే ఉంది. తీరా ఇవాళే నాకు అదాటున ఓ అద్భుతమైన నిజం తెలిసింది. దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి నిర్మాతగా మారి, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ''నిప్పు'' సినిమా బాగా లేదన్న మాట నిజమే. అయితే, ఆ సినిమా గురించి రిలీజు రోజు సాయంత్రానికే టీవీ చానళ్ళతో సహా మీడియా అంతటా అలా నెగటివ్ ప్రచారం జరగడం వెనుక మరో నిగూఢ రహస్యం ఉంది.

సినీ రంగంలోని ఆంతరంగిక వర్గాలు వెల్లడించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం - ఈ నెగటివ్ టాక్ వెనుక ''పూలరంగడు'' సినిమా ఉంది. అదేమిటని ఆశ్చర్యపోకండి. ఇది పచ్చి నిజమని కృష్ణానగర్ కబురు. ''పూలరంగడు'' సినిమాను రూపొందించిన ఆర్. ఆర్. మూవీ మేకర్స్ వారికీ, హీరో రవితేజకూ ఏదో పాత తగాదాలున్నాయని భోగట్టా. ఆ మధ్య ''మిరపకాయ్'' సినిమా తీసిన రోజుల్లో ఆ చిత్ర నిర్మాతలైన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారికీ, ఆ చిత్ర హీరో రవితేజకీ ఎక్కడో చెడిందట. అప్పటి నుంచి వారు రవితేజకు ఝలక్ ఇవ్వడానికి అదను కోసం చూస్తున్నారు.

''పూలరంగడు'' చిత్రం వాణిజ్య విజయంపై ప్రగాఢమైన నమ్మకంతో ఉన్న నిర్మాతలు, కావాలనే ''నిప్పు'' ఎప్పుడు రిలీజైతే, అప్పుడే పోటీగా రిలీజ్ చేయాలని పంతం పట్టి కూర్చున్నారు. అందుకు తగ్గట్లే సంక్రాంతికి ''నిప్పు'' రిలీజనగానే, అప్పుడే ''పూలరంగడు'' రిలీజ్ చేయాలని సిద్ధమయ్యారు. తీరా ''నిప్పు'', దాంతో పాటు ''పూల రంగడు'' వాయిదా పడ్డాయి. మహాశివరాత్రి కానుకగా ''నిప్పు'' రిలీజనగానే, ఆ మరునాడే ''పూలరంగడు'' రిలీజ్ పెట్టేశారు.

''నిప్పు'' రిలీజైన రోజునే, ఆ సినిమా గురించి అన్ని టీవీ చానళ్ళలో ఆ సినిమా బాగా లేదంటూ వార్తలు వచ్చేలా ప్రచారం జరిగింది. అప్పట్లో రవితేజతో ''మిరపకాయ్'', ఇప్పుడు సునీల్ తో ''పూలరంగడు'' తీసిన నిర్మాతల ప్రాయోజకత్వంలో ఇలా నెగటివ్ ప్రచారం జోరుగా సాగినట్లు కృష్ణానగర్ కబురు. చిత్రం ఏమిటంటే, అటు వారికీ, ఇటు రవితేజకూ మధ్య తగాదా మాటేమో కానీ, మధ్యలో ''నిప్పు'' నిర్మాత వై.వి.ఎస్. చౌదరి ఇరుక్కుపోయారు.

ఇంకా విచిత్రం ఏమిటంటే - అటు ఆర్.ఆర్. మూవీమేకర్స్ వారి ''పూల రంగడు''కూ, ఇటు బొమ్మరిల్లు వారి ''నిప్పు''కూ పి.ఆర్.ఓ. ఒకరే. డబ్బులు దండిగా తీసుకోవడమే కాక, మీడియాకు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడనే పేరున్న ఆ అగ్ర పీ.ఆర్.ఓ. ఏకకాలంలో అటూ, ఇటూ కూడా పనిచేస్తూ, ఒక సినిమా వాళ్ళ వ్యక్తిగత కక్ష సాధింపు కోసం మరో సినిమా మీద బురద జల్లనివ్వడం ఆశ్చర్యకరమే కాదు, ప్రొఫెషనల్ ఎథిక్స్ ను కూడా మలినపరిచిన అత్యంత విషాదం కూడా.

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ తో అతి సన్నిహిత సంబంధాలు ఉండడం, వారే తన సినిమా ఒక దానికి నిర్మాతలు కావడంతో ఆ ఘనత వహించిన పి.ఆర్.ఓ. గారు ''నిప్పు'' పై దుష్ప్రచారానికి ఆజ్యం పోసి ఊరకున్నట్లు హైదరాబాద్ లో సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇక, ఆ విష ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఆ పి.ఆర్.ఓ. కాదు కదా, కనీసం ఇటు ''నిప్పు'' సినిమా తీసిన బొమ్మరిల్లు అధినేత వై.వి.ఎస్. చౌదరి కూడా గట్టిగా నిలబడలేకపోవడం చేతకానితనం అనుకోవాలా, చేవచచ్చినతనం అనుకోవాలా. అసలే ''నిప్పు'' సినిమాను కొనేవాళ్ళు లేక, సొంతంగా రిలీజు చేసుకొని, కొన్న కొద్ది ఏరియాల వాళ్ళు కూడా డబ్బులు తగ్గించి కట్టడంతో, దెబ్బతిన్న వై.వి.ఎస్. చౌదరికి ఇది దెబ్బ మీద దెబ్బ. మూలిగే నక్క మీద తాటిపండు పడడమంటే ఇదే.

కొసమెరుపు -

ఇదంతా చెప్పింది ''నిప్పు'' సినిమా ఏదో మహత్తర సినిమా అని ఒప్పించడానికి కాదు. ఎంతో మంచి సినిమా ఈ విష ప్రచారం వల్ల దెబ్బతిన్నదని నమ్మించడానికీ కాదు. దురదృష్టవశాత్తూ, మన మీడియా ఇవాళ ఎటుబడితే అటు, ఎలా పడితే అలా ఒంగిపోతూ, పిచ్చివాడి చేతిలో రాయిగా మారిందని తెలియపరచడానికే.

అన్నట్లు, ''నిప్పు'' చిత్రం ఇప్పుడు ఎంత పెద్ద ఫ్లాపంటే, రవితేజ కెరీర్ లోని ''చంటి'', ''షాక్'' లాంటి చిత్రాల కన్నా ఈ సినిమాకు కలెక్షన్లు కనాకష్టంగా వచ్చాయి. అసలు ఓపెనింగులే లేని ''నిప్పు'' రెండో వారం తిరిగే సరికల్లా ఒకటీ అరా మినహా మిగతా హాళ్ళలో కనబడితే ఒట్టు. అలాగే, ఈ సినిమా విడుదల కాకముందే తప్ప, విడుదలయ్యాక సినిమా ప్రచారంలో దర్శకుడు, హీరో కనిపించనే లేదు.

అదేమని ఆరా తీస్తే, ప్రచారానికి రమ్మంటే, అటు హీరో రవితేజ, ఇటు దర్శకుడు గుణశేఖర్ పరుగో పరుగట. రాము గాక రామని చెప్పేశారట. చిత్రం చూశారా... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజలు సినీ జీవితం తొలినాళ్ళలో మద్రాసులో రూమ్ మేట్లంటూ సినిమా విడుదల ముందు తెగ చెప్పుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యేసరికి, ఆ పాత స్నేహం ఆవిరైపోయినట్లుంది. అవును మరి. అన్ని సంబంధాలూ ఆర్థిక సంబంధాలే అయిన సినీ రంగంలో సక్సెస్ సత్యం, స్నేహాలు మిథ్య. బహుశా, దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరికి ఈ మాట ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటా.