జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, October 8, 2010

‘ఖలేజా’: కథాంశం మంచిదే... కథనమే....


ఏ సినిమా ఎవరికి ఎందుకు నచ్చుతుందో, ఎందుకు నచ్చదో చెప్పడం అంత సులభం కాదు. అయితే, సమూహ వీక్షక అనుభవమైన సినిమా - చూసేవారిలో ఉమ్మడిగా ఓ అనుభూతిని కలిగించాలి. ఆ అనుభూతి ఎంత బలమైనదైతే, ఎంత సామూహికమైనదైతే జనం అభిప్రాయం కూడా అంత బలంగా, అంత ఉమ్మడిగా ఉంటుంది. అలా కానప్పుడు ఎవరి అనుభూతి వారిది. ఎవరి అభిప్రాయం వారిది. ఓ సినిమా గురించి భిన్నాభిప్రాయాలు వచ్చేది అలాంటి సందర్భంలోనే. ‘ఖలేజా’ అందుకు తాజా ఉదాహరణ.

కథ ఏమిటంటే...

దాదాపు రెండేళ్ళ పైగా సెట్స్ పై ఉన్న ‘ఖలేజా’లో అంశం చిన్నది. దాని వివరణ 16 రీళ్ళ పెద్దది. ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే ఓ గ్రామంలో జనం కారణం ఏమీ లేకుండానే పిట్టలు రాలినట్లు రాలిపోతుంటారు. ఆ నెలలో 20 మంది మట్టి కలిసిపోతారు. ఆ గ్రామాన్ని కాపాడాలంటే - 28 ఏళ్ళ క్రితం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన ఫలానా లాంటి యువకుడి వల్ల అవుతుందని ఉపాసకుడైన ఆ ఊరి పెద్దాయన (రావు రమేశ్) చెబుతాడు. మండలం (48) రోజుల్లో ఆ యువకుణ్ణి తెమ్మని సిద్ధుణ్ణి పంపిస్తాడు.

హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవర్ అయిన జి. సీతారామరాజు అలియాస్ రాజు (మహేశ్) ఓ పని మీద రాజస్థాన్ వస్తాడు. కనుచూపు మేరలో మనిషి కనిపించక, ఊరు వెతుక్కుంటూ అక్కడికే కథానాయిక సుభాషిణి (అనూష్క) వస్తుంది. హీరో ఆ ఊరు రావడానికీ, ఆమె కూడా అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరులో తప్పిపోవడానికీ చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ లింకులుంటాయి.

ఆమెను కూడా తీసుకొని తెలుగు నేలకు తిరిగి వద్దామని హీరో యత్నిస్తున్న సమయంలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడతాడు. అదే క్రమంలో తమ గ్రామాన్ని కాపాడే దేవుడు ఆ హీరోయే అని పంచభూతాల సంకేతాలతో సిద్ధుడు గ్రహిస్తాడు. అక్కడికి సరిగ్గా మండలం పూర్తవుతుంది. ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఆ హీరోనూ, హీరోయిన్ నూ తన వెంట గ్రామానికి తీసుకెళ్ళి, కాపాడతాడు సిద్ధుడు. తేరుకున్న హీరోను ఊరి జనమంతా దేవుడు అంటూ ఉంటారు. తాను దేవుణ్ణి కాదు మొర్రో అంటూ ఉంటాడు హీరో. అలా కథ ముందుకు వెళ్ళి, ఆ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, ఆ గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేయడం వల్ల ఎవరికి వచ్చే లాభం ఏమిటి, మధ్యలో ఈ రాజస్థాన్ పిట్టకథేమిటి - లాంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఆఖరికి చెడు మీద మంచి విజయంతో కథ ముగుస్తుంది.

కథాకథనం ఎలా సాగిందంటే...

ప్రథమార్ధంలో జరిగే కథ కొంచెమే అయినా, మున్ముందు కథలో వచ్చే ఘట్టాలకు లీడ్స్ కనిపిస్తాయి. సరదా సంభాషణలు, సన్నివేశాల సమాహారంగా సినిమా నడుస్తుంది. అసలు కథంతా ద్వితీయార్ధంలోనే. అయితే, అందులో అసలు పాయింట్ ఆఖరికి కానీ రాదు. జనం చనిపోతుండడానికి కారణం, కారకులు, దానికి హీరో పరిష్కార ప్రయత్నం సినిమా చివరి మూడు నాలుగు రీళ్ళలో కానీ చెప్పరు.

దాంతో, చివరి వరకు అసలు కథేమిటన్నదానిలో సస్పెన్స్ కన్నా అర్థం కావడం లేదన్న కన్ ఫ్యూజనే ప్రేక్షకులకు ఎక్కువుంటుంది. దేవుడనే జనం, దేవుణ్ణి కాదనే హీరోల మధ్య చర్చతోనే చాలా సేపు గడిచిపోయినట్లనిపిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి తానుగా ముందుకొచ్చే నాయక పాత్రల సినీ కథలకు అలవాటు పడ్డ జనసామాన్యానికి ఇది విచిత్రమనిపిస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన హీరోయే దానికి దూరంగా పారిపోవడం ఏమిటని ఓ చిన్న అసంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా టైటిల్స్ కు ముందు వచ్చే ఘట్టం మిస్ అయితే, కథానేపథ్యం అర్థం కావడం మరింత కష్టమవుతుంది.

సమస్యే తప్ప, సమస్యకు కారకులైన జి.కే. వాళ్ళ (ప్రకాశ్ రాజ్ వగైరా)తో హీరో ముఖాముఖి పోరాటం ఒకే ఒక్కసారి, అదీ క్లైమాక్స్ లో కానీ రాదు. దాంతో, మంచి, చెడుల మధ్య ఘర్షణలో మంచి ఎలా గెలిచిందనే ఉత్కంఠభరిత ప్రయాణం చప్పగా ముగిసిపోయినట్లు అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు.

(మిగతా భాగం ఇంకాసేపట్లో...)

0 వ్యాఖ్యలు: