జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, September 28, 2013

తమిళ సినీ ప్రయాణంలో మైలురాళ్ళు

మూగ చిత్రాల రోజుల నుంచి తమిళ ప్రాంతానికి సినీ మాధ్యమంతో సన్నిహిత సంబంధాలున్నాయి. మద్రాసు, కోయంబత్తూరు, మదురై తదితర ప్రాంతాల్లో కదిలే బొమ్మల ప్రదర్శనలు ఎంతో పాపులర్‌. మూకీల నుంచి టాకీల మీదుగా ఇప్పటి దాకా తమిళ సినిమా పయనం సుదీర్ఘమైనది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు: 
1896 డిసెంబర్‌: మద్రాసులో తొలిసారిగా సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శన. తెరపై కదిలే బొమ్మలతో ప్రజలకు పరిచయం. 
1905: తిరుచ్చికి చెందిన రైల్వే ఉద్యోగి సామికన్ను విన్సెంట్‌ తమ ఊరి మీదుగా ప్రయాణిస్తున్న డ్యూపాంట్‌ అనే ఫ్రెంచ్‌ పెద్దమనిషి నుంచి టూరింగ్‌ సినిమా సామగ్రి కొనుగోలు చేశారు. దానితో 'ఎడిసన్స్‌ సినిమాటోగ్రాఫ్‌' పేర దక్షిణ భారతదేశంలోనే తొలి సంచార సినిమా నెలకొల్పారు. 'లైఫ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌' లాంటి లఘు చిత్రాలను ప్రదర్శిస్తూ ఊరూరా తిరిగారు. తరువాత రోజుల్లో ఆయన సినీ నిర్మాతగానూ ఎదిగారు. 
1907: టి.హెచ్‌. హఫ్టన్‌ అనే వ్యక్తి కొన్ని లఘు చిత్రాలను రూపొందించారు, ప్రదర్శించారు. దక్షిణ భారతావనిలో జరిగిన తొలి చిత్ర నిర్మాణ ప్రయత్నం అదే! తరువాతి కాలంలో 'రాజా హరిశ్చంద్ర' (1913)తో భారతదేశంలో ఫీచర్‌ ఫిల్ముల నిర్మాణం మొదలయ్యాక, హఫ్టన్‌ 'మత్స్యావతార్‌' (1927) లాంటి కొన్ని మూకీ చిత్రాలను నిర్మించారు. 
1911: తంజావూరుకు చెందిన మరుదప్ప మూపనార్‌ లండన్‌ను సందర్శించి, ఆ ఏడాది నవంబర్‌ 11న జరిగిన అయిదవ జార్జ్‌ చక్రవర్తి పట్టాభిషేకాన్ని ఫిల్ముకెక్కించారు. అటుపైన ఆ ఫిల్మును మద్రాసులో ప్రదర్శించారు. 
1914: తెలుగువాడైన రఘుపతి వెంకయ్య నాయుడు మద్రాసులో 'గెయిటీ' థియేటర్‌ను నిర్మించారు. మద్రాసులోనే కాదు, ఏకంగా దక్షిణ భారతదేశంలోనే భారతీయుల సొంత యాజమాన్యంలోని తొలి పర్మనెంట్‌ థియేటర్‌ ఇదే! ఈ హాలు ఈ మధ్యనే కూల్చివేతకు గురై, అక్కడ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వెలిసింది. 
1916: దక్షిణ భారతదేశంలో తొలి సినీ నిర్మాణ సంస్థ 'ఇండియా ఫిల్మ్‌ కంపెనీ' ఏర్పాటైంది. ఈ సంస్థను నెలకొల్పిన ఆర్‌. నటరాజ ముదలియార్‌ 'కీచక వధమ్‌' అనే మూకీ చిత్రం తీశారు. దక్షిణ భారతదేశంలో తయారైన తొలి మూకీ ఇదే. 
1918: ఇండియన్‌ సినిమాటోగ్రాఫ్‌ చట్టం- 1918 కింద విడుదలకు ముందే సినిమాలను సెన్సార్‌ చేయడమనే ప్రక్రియ మొదలైంది. 
1921: బ్రిటీషు ప్రభుత్వం డబ్ల్యు. ఎవాన్స్‌ అనే సినిమా నిపుణుణ్ణి భారతదేశంలోని సినిమా రంగం గురించి అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాల్సిందిగా నియమించింది. ఆయన మద్రాసును సందర్శించారు. 
1927: ఎస్‌.కె. వాసగమ్‌ ఎడిటర్‌గా 'మూవీ మిర్రర్‌' అనే ఇంగ్లీషు సినీ మాసపత్రిక మొదలైంది. దక్షిణ భారతదేశంలోని తొలి సినిమా జర్నల్‌ ఇదేనని పరిశోధకులు చెబుతారు. తరువాతి కాలంలో ఈ జర్నల్‌ 'ఎమ్యూజ్‌మెంట్‌ వీక్లీ'గా పేరు మార్చుకొని, వారపత్రిక అయింది. 
1927: 'ఎగ్జిబిటర్‌ ఫిల్మ్‌ సర్వీసెస్‌' పేరిట ఏ. నారాయణన్‌ దక్షిణాదిలోనే తొలి చలనచిత్ర పంపిణీ సరస్థను ప్రారంభించారు. 
1929: మద్రాసులో 'జనరల్‌ పిక్చర్స్‌ కార్పొరేషన్‌' ఏర్పాటుతో దక్షిణాదిలో సినిమా ఓ వినోద పరిశ్రమగా వేళ్ళూనుకుంది. 
1929: తెలుగువాడైన వీరంకి రామారావు, తమిళుడైన వి. సుందరేశన్‌లు కార్యదర్శులుగా ఇప్పటి 'సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌'కు ముందస్తు రూపమైన 'ది మద్రాస్‌ ఫిల్మ్‌ లీగ్‌' అనే సంఘం ఏర్పాటైంది. 
1931: హెచ్‌.ఎం. రెడ్డి దర్శకత్వంలో తమిళంలోనూ, తెలుగులోనూ మాటలు, పాటలతో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ 'కాళిదాస్‌' వచ్చింది. మద్రాసులోని 'కినిమా సెంట్రల్‌' (తరువాతి కాలంలో శ్రీమురుగన్‌ టాకీస్‌గా పేరు మార్చుకొని, ఇటీవలే కూల్చివేతకు గురైంది)లో 1931 అక్టోబర్‌ 31న విడుదలైంది. 
1934: దక్షిణాదిలో రూపొందిన తొలి తమిళ టాకీ 'శ్రీనివాస కల్యాణం' వచ్చింది. 
1935: సినీ తారల స్టార్‌డమ్‌కు బీజం పడింది. తమిళ గాయక - నటి కె.బి. సుందరాంబాళ్‌ 'నందనార్‌' అనే తమిళ టాకీలో ప్రధానపాత్ర పోషించేందుకు లక్ష రూపాయల పారితోషికం అందుకున్నారు. 
1936: తొలిసారిగా తమిళంలో ఓ మహిళ దర్శకురాలైంది. నటి టి.పి. రాజలక్ష్మి దర్శకత్వం వహించిన 'మిస్‌ కమల' చిత్రం విడుదలైంది. 
1937: ఒకే థియేటర్‌లో ఏడాదికి పైగా ఆడిన తొలి తమిళ చిత్రం 'చింతామణి' విడుదలైంది. 
1939: కె. సుబ్రహ్మణ్యం దర్శక - నిర్మాతగా దక్షిణ భారతదేశంలో తొలి హిందీ చిత్రం 'ప్రేమ్‌సాగర్‌' రూపొందింది.
1939: ఆనాటి ప్రముఖ కాంగ్రెస్‌ వాది ఎస్‌. సత్యమూర్తి తొలి అధ్యక్షుడిగా 'సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' మద్రాసులో ఏర్పాటైంది. 
1940: ప్రముఖ కెమేరామన్‌ - దర్శకుడు కె. రామ్‌నాథ్‌ సారథ్యంలో 'ది సినీ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా' ఆరంభమైంది. 
1943: 'హరిశ్చంద్ర' (1943) అనే తమిళ చిత్రాన్ని నిర్మాత ఏ.వి. మెయ్యప్ప చెట్టియార్‌ కన్నడంలోకి అనువదించారు. ఆ రకంగా అది దక్షిణాదిలో తొలి డబ్బింగ్‌ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. 
1951: నటి కె.బి. సుందరాంబాళ్‌ మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు నామినేట్‌ అయింది. చట్టసభల్లో సినీ తారల రంగప్రవేశానికి అదే శ్రీకారమైంది. 
1952: భారతదేశంలో తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఢిల్లీ, ముంబరు, మద్రాసు, కలకత్తాల్లో జరిగింది. 
1952: దక్షిణ భారతావనిలో తయారైన తొలి హిందీ చిత్రం 'ది జంగిల్‌'ను మోడరన్‌ థియేటర్స్‌ సంస్థ నిర్మించింది. 
1954: పాటలే లేని తొలి తమిళ చిత్రం 'అంద నాళ్‌' విడుదలైంది. 
1955: చలనచిత్రాలకు జాతీయ అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా ఎమ్జీయార్‌ నటించిన 'మలై కళ్లన్‌' (తెలుగు వెర్షన్‌ ఎన్టీయార్‌ నటించిన 'అగ్గిరాముడు') ఎంపికైంది. 
1955: తమిళంలో తొలి పూర్తి నిడివి కలర్‌ చిత్రం 'ఆలీబాబావుమ్‌ నాప్పదు తిరుడర్‌గళుమ్‌' చిత్రాన్ని మోడరన్‌ థియేటర్స్‌ సంస్థ నిర్మించింది. 

1960: మద్రాసులోని అడయార్‌లో 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ' ఆరంభమైంది. 
1967: తమిళ సూపర్‌స్టార్‌ ఎం.జి. రామచంద్రన్‌, మరో తమిళ నటుడు ఎస్‌.ఎస్‌. రాజేంద్రన్‌లు వేర్వేరు నియోజకవర్గాల్లో గెలిచి, తమిళనాడు శాసనసభలో ప్రవేశించారు. 
1973: తమిళంలో తొలి సినిమాస్కోప్‌ చిత్రం శివాజీ గణేశన్‌ నటించిన 'రాజరాజ చోళన్‌' విడుదలైంది. 
1985: తమిళంలో తొలి 3డి చిత్రం 'అన్నై భూమి' (మాతృభూమి అని అర్థం) విడుదలైంది. 
1986: తమిళంలో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా రజనీకాంత్‌ నటించిన 'మావీరన్‌' విడుదలైంది. 
1980లలో: కె. బాలచందర్‌ తరం తరువాత మళ్ళీ తమిళ చిత్ర సీమను మలుపు తిప్పిన కొత్తతరం దర్శకులు భారతీరాజా, బాలూమహేంద్ర లాంటి వారు వచ్చారు. 
1980 - 1990: సంగీత దర్శకుడిగా ఇళయరాజా తన బాణీలతో తమిళ సినీ పరిశ్రమనే కాక, దక్షిణాది సినీ సీమ మొత్తాన్నీ ఏలారు. మోహన్‌, రామరాజన్‌ లాంటి చిన్న హీరోలకు కూడా పెద్ద మ్యూజికల్‌ హిట్లు దక్కాయి. 
1990లలో: భారతీయ శాస్త్రీయ సంగీతానికీ, పాశ్చాత్య సంగీతానికీ అంటుకట్టి, 'రోజా'తో ఏ.ఆర్‌. రెహమాన్‌ సరికొత్త భారతీయ సినీ సంగీతానికి నిర్వచనంగా నిలిచారు. 
1990లలో: మణిరత్నం, శంకర్‌ లాంటి దర్శకులు జాతీయస్థాయికి తమిళ సినిమాను తీసుకువెళ్ళారు. 
2000-13: కమలహాసన్‌, రజనీకాంత్‌ లాంటి వారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నటులయ్యారు. 
కమలహాసన్‌ ఏకంగా పది పాత్రలు పోషించిన 'దశావతారం' విడుదలైంది. 
శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన 'రోబో' తమిళంతో పాటు, హిందీలోనూ ఘన విజయం సాధించి, దక్షిణాది విజయ పతాకాన్ని దేశమంతటా ఎగురవేసింది. 
తమిళ సంస్క ృతినీ, గ్రామీణ వాతావరణాన్నీ ప్రతిబింబించే కొత్త తరహా చిత్రాలు తీసే దర్శకుల హవా పెరిగింది. 
'కొలవెరి' పాట (2011)తో దేశమంతటినీ ఊపేసిన తమిళ నటుడు ధనుష్‌ తన 'ఆడుక్కళమ్‌' ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగారు. హిందీ చిత్రం 'రాణ్‌ఝానా' ద్వారా జాతీయ స్థాయి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 
- రెంటాల జయదేవ
.......................................................

0 వ్యాఖ్యలు: