జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, September 28, 2013

సినిమా పండుగ షురూ!

ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. అధ్యక్షుడు, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కల్యాణ్‌, ఏ.వి.ఎం.స్టూడియో అధినేత - నిర్మాత ఎం. శరవణన్‌, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సన్మాన గ్రహీతలు వేదికపై ఆసీనులయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషా సినీ పరిశ్రమలు నాలుగింటికీ మాతృసంస్థ లాంటి ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. చేస్తున్న ఈ భారీ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించినందుకు గాను కల్యాణ్‌ తన ప్రసంగంలో జయలలితకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి - తమిళ పంపిణీదారు ఎల్‌. సురేశ్‌ వందన సమర్పణ చేశారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన దాదాపు 60 మందిని ఈ కార్యక్రమంలో భాగంగా జయలలిత సత్కరించారు. బయోస్కోప్‌ ఆకారంలోని సూక్ష్మ కళాకృతిని వారికి జ్ఞాపికగా అందజేశారు. ఈ ప్రారంభోత్సవ సభ అనంతరం తమిళ సినీ పరిశ్రమకు చెందిన తారలు, స్టంట్‌మెన్లు, నృత్య తారలతో సాంస్కృతిక కార్యక్రమాలు
సాగాయి. హీరోలు సూర్య, కార్తి, జీవా, విశాల్‌, ఆర్య, కమెడియన్లు వివేక్‌, సంతానం, హీరోయిన్లు హన్సిక, కాజల్‌ అగర్వాల్‌, అంబిక, సుహాసిని, రాధ, రోజా, పూర్ణిమా భాగ్యరాజ్‌, దర్శకులు కె.ఎస్‌. రవికుమార్‌, పి. వాసు, తదితరులు ఆడి పాడి అలరించారు. 'జాతీయ గీతం' లాగా, సినిమాకు 'సినిమా గీతం' (సినిమా యాంథమ్‌) అంటూ నా. ముత్తుకుమార్‌ రచించగా, ఇళయరాజా బాణీ కట్టిన గీతాన్ని ఈ కార్యక్రమంలో మనో, టిప్పు, రంజిత్‌, తదితరులు పాడారు.
ఇవాళ ఏమిటంటే...
ఉత్సవాల రెండో రోజైన ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కన్నడ సినీ పరిశ్రమ వేడుకలు, సాయంత్రం తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరగనున్నాయి. తొలి రోజు ఉత్సవాలకు నిర్మాతలు డి. రామానాయుడు, డి. సురేశ్‌బాబు, కె.ఎస్‌. రామారావు, కాట్రగడ్డ ప్రసాద్‌, ఎం.ఎల్‌. కుమార్‌ చౌదరి, అశోక్‌కుమార్‌, నారా జయశ్రీదేవి, బోనీ కపూర్‌ - శ్రీదేవి జంట, హీరోలు కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్‌, రచయితలు పరుచూరి బ్రదర్స్‌ తదితర తెలుగు ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల దృష్ట్యా తమ సభ్యులైన నటీనటులు ఈ ఉత్సవాల్లో పాల్గొనరాదంటూ హైదరాబాద్‌లోని తెలుగు 'మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌' పేర్కొనడంతో ఇవాళ్టి తెలుగు వేడుకల్లో పెద్ద తారలెవరూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపించడం లేదు. మిగిలిన కొంతమంది చిన్నా చితకా నటీనటులతోనే డ్యాన్సులు, స్కిట్లు చేయించి, కార్యక్రమం అయిందని అనిపించడానికి ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. ప్రయత్నిస్తోంది. తెలుగు తారలు ఈ వేడుకలో పాలు పంచుకోవడం గురించి ప్రారంభోత్సవానికి కొద్దిగా ముందు సి. కల్యాణ్‌ను 'ప్రజాశక్తి' ప్రశ్నించగా, ''తెలుగు వాళ్ళను నా మనస్సులో నుంచి తీసేశాను. నేను వారి గురించి ఆలోచించడం లేదు. నా ఆలోచనలన్నీ వేరే అంశాల మీద ఉన్నాయి'' అని కుండబద్దలు కొట్టేశారు.
'అమ్మ' చేతితో అపూర్వ సత్కారం
మొదటిరోజు ఉత్సవాల ప్రారంభోత్సవ సభలో జయలలిత చేతుల మీద నుంచి అలా సన్మానం అందుకున్న వారిలో పాత తరం తమిళ హీరో ఎస్‌.ఎస్‌. రాజేంద్రన్‌, తమిళ సూపర్‌స్టార్లు కమలహాసన్‌, రజనీకాంత్‌, శివకుమార్‌, నిర్మాత 'ఏ.వి.ఎం' శరవణన్‌, ప్రసాద్‌ ల్యాబ్స్‌ ఏ. రమేశ్‌ ప్రసాద్‌, విజయా ప్రొడక్షన్స్‌ బి. వెంకట్రామరెడ్డి, తెలుగు హీరో బాలకృష్ణ, తమిళ హీరో ప్రభు, దర్శకుడు సి.వి. రాజేంద్రన్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా, గాయనీమణులు ఎల్‌.ఆర్‌. ఈశ్వరి, జమునారాణి, నటుడు ప్రభు, దర్శకుడు పి. వాసు, పాత తరం హీరోయిన్లు 'షావుకారు' జానకి, కృష్ణకుమారి, జమున, రాజశ్రీ, కాంచన, శారద, బి. సరోజాదేవి, జయప్రద, జయసుధ తదితరులు ఉన్నారు. తరువాతి తరం నాయికలైన మీనా, సిమ్రాన్‌, త్రిష, అలాగే సీనియర్‌ మేకప్‌ మ్యాన్‌ సి. మాధవరావు, పాత సినిమాటోగ్రాఫర్‌ ఎన్‌.ఎస్‌. వర్మ, ఎడిటర్‌ ఆర్‌. విఠల్‌, కొరియోగ్రాఫర్లు తార, సుందరం మాస్టర్‌ (ఆయన బదులు కుమారుడు రాజు సుందరం తీసుకున్నారు), స్టంట్‌ మాస్టర్‌ కె.ఎస్‌. మాధవన్‌ సన్మానం అందుకున్నారు. దక్షిణాదిలో తొలి తరం ఎగ్జిబిటర్‌ అయిన సామికన్ను విన్సెంట్‌ ప్రారంభించగా, 1914 ప్రాంతం నుంచి ఇవాళ్టికీ కోయంబత్తూరులో నడుస్తున్న 'డిలైట్‌' సినిమా థియేటర్‌ యజమాని జవహర్‌ను సైతం ఈ సభలో జయలలిత సన్మానించడం విశేషం. సినీ రంగంలోని మేకప్‌, కాస్ట్యూమ్స్‌, సెట్‌ డిజైనింగ్‌, స్టిల్‌ ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్‌ అసిస్టెన్స్‌, సెట్‌ డిజైనింగ్‌ విభాగాల్లోని సినీ శ్రామిక జీవుల్లో కొందరిని కూడా గుర్తించి, అందరితో పాటు సత్కరించారు. 
- రెంటాల జయదేవ
...................................................................

0 వ్యాఖ్యలు: