జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, February 19, 2015

మూవీ మొఘల్ ఇకలేరు

  • ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు కన్నుమూత
  •  కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి
  •  సందర్శనార్థం నేడు ఉదయం 9 నుంచి రామానాయుడు స్టూడియోలో పార్థివ దేహం... మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడే అంత్యక్రియలు
  •  నివాళులు అర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
  •  సంతాపంగా నేడు సినిమా షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేత
  •  13 భాషల్లో 150 చిత్రాలకుపైగా నిర్మాణం... గిన్నిస్‌కు ఎక్కిన అజాత శత్రువు
  •  సినీ రంగంలో కృషికి దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ భూషణ్ పురస్కారాలు


సాక్షి, హైదరాబాద్: మూవీ మొఘల్.. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (78) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న ఆయన స్వగృహంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా రామానాయుడు కేన్సర్‌తో బాధపడుతున్నారు. దాదాపు పదమూడేళ్ల కిందే అమెరికాలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. కానీ కేన్సర్ మళ్లీ ముదరడంతో ఇటీవల బెంగళూర్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో... ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో వెంటిలేటర్‌పై ఉన్న రామానాయుడును ప్రత్యేక వాహనంలో ఫిలింనగర్ వెంచర్-2లోని స్వగృహానికి తీసుకొచ్చారు. ఇంటికి చేరిన కొద్దిసేపటికే ఆయన కన్నుమూశారు. రామానాయుడు కన్నుమూసిన విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ, అభిమానులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు రామానాయుడు నివాసానికి చేరుకుని, ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్, టి.సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ, రాజశేఖర్, అల్లు అర్జున్, జగపతిబాబు, ఆర్.నారాయణమూర్తి తదితరులు విచ్చేసి రామానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోకు తరలించనున్నట్లు ఆయన కుమారుడు, సినీ హీరో వెంకటేష్ తెలిపారు. స్ట్టూడియో ఆవరణలోనే మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రామానాయుడు మృతికి సంతాపంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని షూటింగ్‌లతో పాటు థియేటర్లు సెలవు పాటించనున్నట్లు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పారు.
 
(Published in 'Sakshi' daily, 19th Feb 2014, Thursday)
..............................

0 వ్యాఖ్యలు: