జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, July 28, 2013

''బాబాయిని చరణ్ గౌరవిస్తాడు! భయపడడు!'' - 'ఎవడు' చిత్రం వాయిదాపై నిర్మాత 'దిల్‌' రాజు


జూలై 31న విడుదల కావాల్సిన 'ఎవడు' చిత్రాన్ని ఆగస్టు 21కి వాయిదా వేయడంపై వివరణ నిచ్చారు నిర్మాత దిల్ రాజు. పవన్ కల్యాణ్ కూ, ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికీ భయపడి ఏమీ తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.


'ఎవడు' వాయిదా గురించి వెబ్‌సైట్లతో సహా మీడియాలో రకరకాల కథనాలు, ఊహాగానాలు వస్తున్నాయంటూ, శనివారం సాయంత్రం పొద్దు పోయాక, నిర్మాత 'దిల్‌' రాజు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తన వివరణ ఇచ్చారు. ''(పవన్‌) కల్యాణ్‌ బాబాయి. చరణ్‌ అబ్బాయి. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడే కానీ, భయపడడు. కేవలం మెగా అభిమానుల్లో ఎవరినీ నొప్పించకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. 'అత్తారింటికి..' విడుదలైన రెండు వారాల తరువాత ఆగస్టు 21న 'ఎవడు' వస్తుంది. శనివారం మధ్యాహ్నం మేమంతా చర్చించుకొని, ఈ నిర్ణయం తీసుకున్నాం. బాబాయి, అబ్బాయిల సినిమాలు రెండూ ఒకే నెలలో విడుదల కానున్నాయి. ఫ్యాన్స్‌కు ఇది పండగే! రెండూ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలవుతాయి'' అని 'దిల్‌' రాజు వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ''రిలీజయ్యాక తెరపై చూస్తే కదా! ఏ సినిమా సత్తా ఏంటే తెలిసేది. నాకు తెలిసి రెండు చిత్రాలూ పెద్ద హిట్టయ్యే సినిమాలే'' అని పేర్కొన్నారు.
'ఎవడు' కోసం రెండేళ్ళ పాటు శ్రమించామని చెప్పిన 'దిల్‌' రాజు ఈ చిత్రం కోసం రచయితలు, సాంకేతిక నిపుణులు దర్శకుడికిచ్చిన సహకారం మరువలేనిదన్నారు. ''2011లో దర్శకుడు వంశీ పైడిపల్లి ముప్పావుగంట సేపు నాకు 'ఎవడు' కథ చెప్పాడు. ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళే సినిమా అవుతుందిది అనుకున్నాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంతా పూర్తయ్యాక శుక్రవారం నాడు ఈ సినిమా చూశా. కథ విన్నప్పుడు కలిగిన ఉద్వేగమే మళ్ళీ కలిగింది. రేపు హాల్లోని ప్రేక్షకులకు కూడా ఇదే ఉద్వేగం కలిగితే, సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది'' అని 'ఎవడు' గురించి ఆయన దృఢమైన విశ్వాసం వ్యక్తం చేశారు.

(Published in 'Praja Sakti' daily, 28th July 2013, Sunday, Page no.8)
...........................................................

0 వ్యాఖ్యలు: