జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, July 12, 2013

సంగీత సాధుమూర్తి నూకల చిన సత్యనారాయణ




  • నిన్న మరణించిన సంగీత విద్వన్మణి నూకల చిన సత్యనారాయణకు నివాళిగా ఈ స్మ ృత్యంజలి వ్యాసం
సంగీతంలో గొప్ప పండితులు, జ్ఞానస్థులు నూకల చిన సత్యనారా యణ ఇక నన్నెప్పుడూ పలకరించలేని లోకానికి వెళ్ళి పోయారని తెలిసిన క్షణం నా మనస్సు అదొకలా అయి పోయింది. సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఆయన, నాకు ఫోను చేశారు - 'స్టంటు వేయించుకున్నావని తెలిసింది. ఇప్పుడెలా ఉంది?' అంటూ! ఆయన ఎప్పుడు ఫోన్‌లో పలకరించినా మా అమ్మాయి గురించి అడిగేవారు. ఈసారి కూడా రెండో పలకరింపు ఫోనులో 'అమ్మాయి ఎలా ఉంది' అని! అంత అభి మానం ఆయనకి! దానికో పిల్ల కథ ఉంది.
ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ముచ్చట. నూకల గారు విజయవాడలో సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌. అక్కడే నేను సంగీతం లెక్చరర్‌ని. సాధారణంగా ప్రిన్సి పాల్‌ హౌదాలో వారు కింద పనిచేసే వారి ఇళ్ళకు రారు. కానీ ఆయనకి తన సిబ్బంది అంటే చాలా అబి óమానం. సంగీత ప్రపంచంలో అధికం, అల్పం భేదాలు ఆయనికి ఎప్పుడూ రాలేదు. అందర్నీ 'మీరు' అంటూ గౌరవంగా పిలవడమే కాదు, మనసారా గౌరవించే లక్షణం ఆయనది. నూకల వారు మా ఇంటికి వచ్చి కూర్చునేసరికి మా రెండేళ్ళ అమ్మాయి తను ఆడుకునే కుర్చీలో కూర్చుంది. నూకల వారు సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నారు. మా అమ్మాయి ముద్దుగా 'కాఫీ సోఫాలో పోస్తావు.. మా అమ్మ తన్నుతుంది' అని ప్రిన్సి పాల్‌ గారికి వార్నింగ్‌ ఇచ్చింది. అప్పటి నుంచీ మా అమ్మాయి అంటే ఆయనకి ఎంతో పితృవాత్సల్యం.
ఆయన మనిషిగా ఎంతో ఉన్నతుడు. చిన్న ఉద్యోగి అంటే ఎంత ప్రేమో మరో ఉదాహరణ చెప్తాను. ఆఫీసులో ప్యూను వర్షంలో తన చంటి పిల్లను భుజాల మీద వేసుకొని వెళ్తూ కనబడ్డాడు. ఇలా వర్షంలో ఎక్కడికి అని నూకల పలకరిస్తే తడిసి ముద్ద యిన ప్యూను 'ఆసుపత్రికి' అని చెప్పాడు. నడవటం ఎందుకంటే డబ్బులు లేవన్నాడు. నూకల గారు అతణ్ణి ముందు తన ఇంటికి తీసుకెళ్ళి, పిల్లని తను మోస్తూ, అతనికి పొడిబట్టలిచ్చి, డబ్బిచ్చి ఆసుపత్రికి పంపారు. ఇలా నిజంగా ఎవరైనా చేస్తారా అనిపిస్తుంది.
ఈసారి ఆఫీసు పని మీద బందరు వెళ్ళాం. జీతం బిల్లులు కలెక్టర్‌ ఆఫీసులో సంతకం పెట్టించుకోవాల్సి ఉంది. అక్కడ లంచం తీసుకోని ఓ కఠినమైన పెద్ద గుమాస్తా మాసిన బట్టల్లో కనబడ్డాడు. పని అయిన తర్వాత అతనికి ఏమైనా స్వీటు పాకెట్‌ ఇస్తే బాగుం టుందనుకున్నాం. కానీ గుమస్తా ఏమంటాడో అని వెనక్కి తగ్గాం. పోనీ ఇంటికి వెళ్ళి పిల్లలకిద్దాం అన్నారు నూకల. ఇల్లు తెలుసుకొని ఇంటికి వెళ్తే భార్య, పిల్లలు పాకలో ఉంటున్నారు. మేము బహుమతి అంద చేయ బోతే భార్య నిరాకరించింది. వద్దంది. 'ఆయన కిష్టం ఉండదు' అని చెప్పి తలుపేసుకుంది. తిరిగి వస్తూ నూకల, 'దేవుడికి గుడి కడతాం. కానీ, ఇలాంటి వారికి గుడి కట్టాలయ్యా' అంటూ గద్గదంగా మాట్లాడారు.
ఆయనకున్న బంధుప్రేమ అపారం. ఇల్లంతా కళకళ లాడుతూండేది ఎప్పుడూ. ఆయన చిన్ననాటి స్నేహితుల పట్లా అంతే అభిమానం పరవళ్ళు తొక్కేది. ఒక్కొక్కసారి సినిమాల్లో దృశ్యంలా కనబడేది. విజయ నగరంలో చదువుకునే సమయంలో నూకల గారికి వాసా కృష్ణమూర్తి గారు బాగా మిత్రులు. అందువల్ల ఎప్పుడు విజయవాడ రేడియో రికార్డింగుకు వచ్చినా నూకల గారింట్లోనే ఆయన మకాం చేసేవారు. ఒక సారి నూకల గారింటికి రాకుండా శ్రీరంగం గోపాల రత్నం గారింట దిగారు. మర్నాడు కాలేజీకి నూకల గారిని పలకరిద్దామని కృష్ణమూర్తి వచ్చారు. ఆయన అంతదూరంలో ఉండగానే ఇక్కడ నుంచి నూకల 'ఇంతకంటే నన్ను చంపెయ్యరా! ఎవరింట్లోనో దిగు తావా!' అంటూ సీను సృష్టించారు నిజంగా ఏడుస్తూనే! కృష్ణమూర్తి గారెంత బ్రతిమాలినా ఆయన ఆగలేదు.
నూకల వారు విజయనగరం కళాశాల విద్యార్థిగా చేరకముందు బాలమురళి తండ్రి పట్టాభిరామయ్యగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆ రోజుల్లో వారాలు చేసి చదువుకోవడం మామూలు. ఒకరింట్లో వారం కుదిరింది. ఆ ఇంటి వారబ్బాయి తరువాత కాలంలో విజయవాడ కేంద్రంలో తంబురా విద్వాంసుడుగా చేరారు. ఇప్పుడు నూకలగారు ఒక కార్యక్రమం రిహార్సల్‌ చేస్తూ పాడుతు న్నారు. ఆ రికార్డింగ్‌ ప్రత్యేకతల వల్ల అర్ధరాత్రి రెండ యింది. నూకల గారు ఒక ఆలాపన చేస్తూ రికార్డింగ్‌ చేస్తూ ఉంటే అపశ్రుతి వచ్చి ఆపారు. తంబురా వేస్తున్న కుటుంబయ్య విరామంగా తాంబురా కింద పెట్టారు. తరువాత కొంతసేపటికి నూకల రెడీ అయి 'తంబురా తీయండి కుటుంబయ్య గారూ!' అన్నారు. కుటుంబయ్య గారు వెంటనే తంబురా మీటకుండా 'అవసరమంటారా! అన్నారు. అందులో నూకల గార్కి ఏదో వేళాకోళం కనబడి 'ఎంతమాటన్నారండీ! మీ ఇంట్లో భోంచేశాను కనుక కానీ, లేదంటే డైరెక్టర్‌గార్కి రిపోర్టు చేసేవాడి'నంటూ అందరిలోనూ గొడవ పెట్టుకున్నారు. మొత్తానికి ఆ రాత్రి రికార్డింగ్‌ పూర్తి చేయలేదు. మరునాటికి వాయిదా వేశారు. అలాంటి మానవ సహజమైన గుణాలతో జీవితం ఆనందంగా సాగించగల్గిన అసాధారణ వ్యక్తిత్వం నూకలగారిది.
నేనూ రమణమూర్తి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో ఎంతో మందికి మా గురించి చెప్పి పాడటానికి అవకా శాలు కల్పించారాయన. సాధారణంగా సంగీత విద్వాం సులలో మొదటి తరగతికి చెందిన విద్వాంసులు శిష్యులు కానటువంటి విద్వాంసులను అలా ప్రోత్సహిం చటం తక్కువ. కానీ నూకలగారికి తన తోటి సీనియర్‌ విద్వాంసులు బాగా పాడుతుంటే ఆనందించే గుణమే ఉండేది. ఒకసారి కె.వి. నారాయణస్వామి గారు కచేరీ చేస్తున్నారు తిరుపతిలో. అప్పుడు తిరుపతిలో నూకల వారు ప్రిన్సిపాల్‌. చివరి అంశాలు కదా అని నేను సెలవు కోరాను. నూకల 'కృష్ణా బేగడ - నారాయణ స్వామి బాగా పాడతారు. పాడించుకొంటాను' అని నన్ను కావాలంటే వెళ్ళమన్నారు. నారాయణస్వామితో ఆ పాట పాడించుకొని నూకల విన్నారు. ఇతరులైనా, సాటివారైనా అంతటిసంగీత సమాదరణ ఆయనది.
ప్రిన్సిపాల్‌గా పనిచేసినన్నేళ్ళూ విజయవాడలో ఆయన అందరి ఉద్యోగులనూ గౌరవంతో చూడటమే కాదు పాఠం చెప్పేవారిని ఎప్పుడూ ఎవరి ముందూ ఏ క్లాసులోనూ కించపరిచేవారు కాదు. ఎప్పుడైనా చెప్ప దలచుకుంటే లెక్చరర్‌ ఒక్కడినీ తనతో కూర్చోబెట్టు కుని సూచనలు చేసేవారు.
ఆయన సంగీతపరంగా సాధించిన విద్వత్తు చాలా సంపన్నమైనది. రక్తిగా పాడటంలో ఆయనకున్నంత సదుపాయం చాలా తక్కువమందికి ఉంటుంది. ఎన్ని గంటలైనా అంత రక్తిగానూ, అంత పాండిత్యంతోనూ పాడి ఒప్పించి, ఆయన దేశమంతా పేరు సంపాదించు కున్నారు. నళినికాంతి, అభేరి వంటి జారుడుగుణం గల రాగాలనూ, అన్యస్వరాలకు పీట వేసే ఉపాంగ రాగాలనూ ఎంతో తేలికగా కష్టం కనబడకుండా అంత దృఢంగా పాడగల ప్రతిభ ఆయనది. ఇక సోదాహరణ ప్రసంగాలు చేశారంటే అటు విద్వాంసులకూ, సీనియర్‌ శ్రోతలకూ పండుగగా వినిపించేవారు. ఆయన లాంటి కచేరీ విద్వాంసులు పుస్తకాలను, అందులోనూ సంగీ తాన్నీ, రాగాలనూ గూఢంగా తర్కించే గ్రంథాలను వ్రాయలేరు. కానీ నూకల మాత్రం చాదస్తం లేకుండా, అంటే అనవసర విషయాలు చర్చించకుండా సంగీ తాన్ని ఆనందింపచేయగల విజ్ఞానంగా, అందాలు, అనుస్వరాల గొప్పతనం చెబుతూ స్టడీ చేసి ప్రచురిం చారు. అలా రెండు వందల రాగాలు చర్చించారు.
మంచి గొంతు చాలా మంది పాడేవారికి ఉండవచ్చు. సంగీతం చాలా మంది గొప్పగా వినిపించవచ్చు. కానీ హుందాగా, గౌరవంగా, మానవీయ స్పర్శతో, ఆత్మీయంగా నూకల గారిలా జీవితం ధన్యం చేసుకున్నవారు తక్కువ మంది ఉంటారు. ఆయన లేకపోవటం నాకు వ్యక్తిగతంగా ఎంతో లోటు.
- పెమ్మరాజు సూర్యారావు
(ఈ వ్యాస రచయిత ప్రముఖ కర్ణాటక సంగీత విద్యాంసుడు, విమర్శకుడు) 
(Published in Praja Sakti daily, 12th July 2013, Page No.5)
...............................................................

0 వ్యాఖ్యలు: