జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, March 28, 2015

ఎన్నికల వేళ...పేలుతున్న మాటల తూటాలు

ఎన్నికల వేళ...పేలుతున్న మాటల తూటాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సిన ఆదివారం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఎన్నికలు నిలిపి వేయాలంటూ నటుడు ఒ. కల్యాణ్ గురువారం కోర్టులో వేసిన పిటిషన్, దానిపై విచారణ జరిపి, ‘ఎన్నికలు జరపండి. కానీ, ఫలితాలు వెల్లడించవద్దు’ అంటూ కోర్టు శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. మరోపక్క నటుడు నాగబాబు, తదితరుల మద్దతున్న రాజేంద్రప్రసాద్ వర్గానికీ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతున్న జయసుధ వర్గానికీ మధ్య సాగుతున్న ఎన్నికల పోరులో మాటల తూటాలు శుక్రవారం కూడా పేలాయి.
 
 సాధారణ ఎన్నికలను తలపిస్తూ, వాగ్ధానాల వర్షం కురిసింది. అధ్యక్షపదవికి పోటీపడుతున్న జయసుధ, ఆమె ప్యానెల్‌లోని ఇతర పోటీదారులు శుక్రవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈసారి తమ ప్యానెల్‌ను గెలిపిస్తే, సభ్యులకు తాము చేయదలుచుకున్న పనుల గురించి చెప్పడానికి జయసుధ, బృందం ప్రయత్నించారు. అలాగే, బుధవారం నాటి మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ వర్గం చేసిన ఆరోపణలకు, వ్యాఖ్య లకు దీటుగా ఎదురు బాణాలు సంధించారు. తానెవరికీ డమ్మీని కాదని జయసుధ ఘాటుగా చెప్పారు.  
 
 ‘‘కార్పస్ ఫండ్ కోసం ప్రత్యర్థి వర్గం హామీ ఇస్తున్నట్లు ఎవరి దగ్గర నుంచో డబ్బులు తేవడం కాకుండా, ముందుగా మా ప్యానెల్ సభ్యులమే విరాళాలిస్తాం. అలాగే, ఆరు నెలలకొకసారైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలకు నటీనటులం వెళ్ళి, వినోద కార్యక్రమాలు చేసి, నిధులు సేకరిస్తాం’’ అని జయసుధ పేర్కొన్నారు. సేకరించగల నిధి, లబ్ధిదారుల సంఖ్యను స్పష్టంగా పేర్కొనడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు. కేవలం కొద్దిమందికి కాకుండా, ప్రత్యేక సర్వే చేసి, అర్హులైన అందరికీ వైద్యబీమా, పెన్షన్ ఇస్తామంటూ జయసుధ తమ ప్యానెల్ వాగ్దానాలను వివరించారు. అలాగే, అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న కళాకారులకు అవకాశాలు వచ్చేలా సాయపడతామనీ హామీ ఇచ్చారు. కళాకారుల కష్ఠనష్టాలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక గ్రీవెన్‌‌స సెల్ పెడతామన్నారు. పేద కళాకారుల ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకు సాయం చేసేందుకు కూడా ప్రయత్నిస్తామన్నారు.
 
 ఇది ఇలా ఉండగా, ‘‘నాలుగైదు రోజులుగా ఈ ఎన్నికల వ్యవహారం పెద్ద వినోదంగా, టీవీ చానల్స్‌లో చర్చలతో టి.ఆర్.పి. రేటింగులు పెరిగేలా తయారయ్యాయ’’ని జయసుధ వ్యాఖ్యానించడం విశేషం. బయట రాజకీయాల కన్నా ఈ ‘మా’ ఎన్నికల వేళ ఇక్కడ రాజకీయాలు దారుణంగా ఉన్నాయనీ, ఒకరిపై మరొకరం బురద జల్లుకోవడం ఇష్టం లేకనే దీనిపై ఏ టీవీ చానల్స్‌లోనూ చర్చలకు వెళ్ళడం లేదనీ ఆమె పేర్కొన్నారు. ‘‘మొన్న వాళ్ళు (రాజేంద్రప్రసాద్ వర్గం) నా గురించి ఎగతాళిగా మాట్లాడారు. అది చూసి, నా శ్రేయోభిలాషులు కూడా ‘నీకీ ఎన్నికలు, పోటీ అవసరమా?’ అని అడిగారు. కానీ, నేను మాత్రం ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొన దలిచా’’ అని ఆమె అన్నారు.
 
  జయసుధ ప్యానెల్ పక్షాన కోశాధికారి పదవికి పోటీ చేస్తున్న పరుచూరి వెంకటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న సీనియర్ నరేశ్, నటి హేమ, ఉపాధ్యక్షుడిగా ఇప్పటికే పోటీ లేకుండా ఎన్నికైన పి.శివకృష్ణ తదితరులు కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ‘‘ఓడిపోతామనే భయంతో కొందరు కోర్టును ఆశ్రయించినా, ఎన్నికలు జరపాల్సిందేనంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వు క్షుద్రశక్తులకు గొడ్డలిపెట్టు’’ అని నరేశ్ వ్యాఖ్యానించారు. అలాగే, టీవీ చానల్‌లో మాట్లాడుతూ నాగబాబు పేర్కొన్న కొన్ని అంశాలను ఆయన తప్పుపట్టారు. కాగా, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నవారు సైతం కావాలని పింఛన్లకు వస్తుండడంతో, అసలైన అర్హులకే వాటిని పరిమితం చేయాలని గతంలో ప్రయత్నించామనీ, అందుకే వారి సంఖ్య తక్కువగా ఉందనీ మునుపటి కార్యవర్గాల్లో పనిచేసిన శివకృష్ణ వివరించారు.
 
(Published in 'Sakshi' daily, 28th March 2015, Saturday)
..................................................

0 వ్యాఖ్యలు: