జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, August 7, 2013

ఆ రెండు సినిమాలపై రూ.110 కోట్లు!


 అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమా విడుదల, శాటిలైట్‌, ఆడియో తదితర హక్కులన్నీ కలిపి 'అత్తారింటికి దారేది...' చిత్రంపై దాదాపు 60 కోట్ల మేర వ్యాపారం జరిగింది. తెలుగు చిత్ర సీమలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని భారీ వ్యాపారమిది. 
గతంలో జూనియర్‌ ఎన్టీయార్‌ 'బాద్షా' చిత్రం దాదాపు రూ. 56 కోట్ల దాకా వ్యాపారంతో ఇప్పటి దాకా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పుడు దాన్ని 'అత్తారింటికి..' తిరగరాసింది. 
కాగా, వాయిదా పడ్డ 'ఎవడు' చిత్రంపై కూడా రూ. 50 కోట్ల దాకా వ్యాపారం చేశారు. 
ఇంత భారీ మొత్తాలకు కొనుగోళ్ళు సాగడంతో, అందుకు తగ్గట్లే వసూళ్ళు రాకపోతే బయ్యర్లు, వారితో చేతులు కలిపిన ఎగ్జిబిటర్ల పరిస్థితి కష్టమవుతుంది.
అందుకే, ''ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 7న 'అత్తారింటికి...' రిలీజ్‌ చేద్దామంటే, ముఖ్యంగా రాయలసీమ, వైజాగ్‌ ఏరియాల కొనుగోలుదార్లు తీవ్రంగా ప్రతిఘటించారు.వరుసగా 72 గంటల బంద్‌కు పిలుపు లాంటి నిరసనలు సీమాంధ్రలో తరచూ జరుగుతున్నందు వల్ల ఏ రోజు, ఏ షో వేస్తారో, ఏది బంద్‌ వల్ల రద్దవుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే, ఈ ఉద్రిక్తతలు చల్లారే వరకు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకుంటున్నారు'' అని తెలుగు సినీ వ్యాపారంలో అనుభవమున్న కోస్తా జిల్లాల డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ ఒకరు వివరించారు. 
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 7 ఆగస్టు 2013, పేజీ నం.8లో ప్రచురితం)
............................................

Monday, August 5, 2013

నిరవధికంగా వాయిదా పడ్డ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’

- పవన్‌ కల్యాణ్‌ సినిమాకు ‘సమైక్యాంధ్ర’ ఉద్యమ సెగ

- రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల వల్లే వాయిదా: చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్ 


 

హీరో పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది?’ చిత్రానికి కూడా ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. చిత్రం విడుదల నిరవధికంగా వాయిదా పడింది. ‘‘రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని ఈ చిత్ర  నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంలోని అధికార ‘ఐక్య ప్రగతి శీల కూటమి’ (యు.పి.ఏ) భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో జూలై 30 నుంచి పెద్దయెత్తున ‘సమైక్యాంధ్ర పరిరక్షణ’కై ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే! ఈ పరిస్థితులే సినిమా విడుదలకు బ్రేకులు వేస్తున్నాయి.

దాంతో, ఈ చిత్రం విడుదల వాయిదా పడడం వరుసగా ఇది రెండోసారి. నిజానికి, మొదట ఈ నెల ఏడున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా 9వతేదీకి వాయిదా వేశారు. ఉద్యమ తీవ్రత కారణంగా ఇప్పుడు తదుపరి రిలీజ్‌ తేదీని ప్రకటించకుండా, చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి, గడచిన వారం రోజులుగా ఈ సినిమా అనుకున్నట్లుగా విడుదల అవుతుందా అనే అంశంపై పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. 

ఆగస్ట్ 5వ తేదీ సోమవారం ఉదయం ఇది హాట్‌ టాపిక్‌ అయింది. ‘‘రాజకీయాలకూ, సినిమాకూ సంబంధం లేదు. పవన్‌ కల్యాణ్‌ సినిమాను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కోస్తా ఆంధ్రలోని పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పేరిట సోమవారం మధ్యాహ్నం ప్రకటనలు కూడా వచ్చాయి. 

అయితే, ఎట్టకేలకు సాయంత్రం చీకటి పడే వేళకల్లా సినిమా రిలీజ్‌ వాయిదా పడ్డట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లోని నిజానిజాలు తెలియలేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను కనుగొనేందుకు ‘ప్రజాశక్తి’ ప్రయత్నించింది. ‘‘అవును! సీమాంధ్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా! అందుకే, సినిమా రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేశాం. ఆ విషయాన్ని ఇప్పుడే నిర్మాణ వర్గాలు నిర్ణయించాయి. తదుపరి విడుదల తేదీ ఏమిటన్నది నిర్ధారించుకోలేదు’’ అని ‘అత్తారింటికి...’ చిత్ర యూనిట్‌ సభ్యులు ఒకరు సోమవారం సాయంత్రం పొద్దుపోయాక, ‘ప్రజాశక్తి’కి వివరించారు.

రిలయన్స్‌ సంస్థ భాగస్వామిగా, భోగవల్లి ప్రసాద్‌ నిర్మాణ సారథ్యంలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అత్తారింటికి దారేది?’ మీద ఇప్పటికే పరిశ్రమలో, అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి. చిత్రం విడుదల వాయిదా పడడంతో, అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

కాగా, రాజకీయ నాయకుడిగా మారి, కేంద్రంలో మంత్రి పదవి చేపట్టిన హీరో చిరంజీవి సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేయాలంటూ ఇప్పటికే పలువురు డిమాండ్‌ చేశారు. ఆయన రాజీనామా చేయకపోవడంతో, చిరంజీవి కుటుంబ హీరోలు నటించిన సినిమాలను థియేటర్లలో ఆడనివ్వబోమంటూ ‘సమైక్యాంధ్ర పరిరక్షణ’ ఉద్యమంలోని కొందరు బాహాటంగా ప్రకటించారు. 



తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమతో సహా కొందరు రాజకీయ నేతలు ఈ చిత్రాల ప్రదర్శనను ఆపుచేస్తామంటూ, వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ వేడిని మరింత పెంచారు. వెరసి, ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు తెలుగు సినిమా పరిశ్రమకు తిప్పలు తెచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ ‘అత్తారింటి...’ కోసం రామ్‌చరణ్‌తేజ్‌ ‘ఎవడు’ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నా, ఆఖరుకు ఉద్యమాల సెగతో లాభం లేకుండా పోయింది. ఏమైనా, రాజకీయాల కారణంగా కళా రంగానికీ, వ్యాపారానికీ చిక్కులు రావడం పెనువిషాదం. 

(ప్రజాశక్తి దినపత్రిక, 6 ఆగస్ట్ 2013, మంగళవారం, పేజీ నం. 8)
......................................

ఇతివృత్తం సరే, కథనమే... ( 'అబ్బాయి క్లాస్‌ - అమ్మాయి మాస్‌' చిత్ర సమీక్ష)


మన దర్శక, నిర్మాతలు చిత్ర కథాంశం కోసం వివిధ భాషా చిత్రాలను ప్రేరణగా తీసుకోవడం చాలా సందర్భాల్లో జరిగేదే! అయితే, ఏ భాషలోని ఎంత హిట్‌ చిత్రాన్ని ప్రేరణగా తీసుకున్నప్పటికీ, ఆ అంశాన్ని మనదైన వాతావరణంలో ఎంత గొప్పగా చెప్పామన్నదే కీలకం. ఆ ముఖ్యమైన విషయంలో తప్పటడుగు వేస్తే, ఆసక్తికరమైన ఎంత హిట్‌ పాయింటైనా, చివరకు అనాసక్తికరమైన ఓ సాదాసీదా సినిమాగా మారిపోతుంది. హాలీవుడ్‌ హిట్‌ చిత్రం 'ప్రెట్టీ ఉమన్‌'లోని మూల కథాంశాన్ని ప్రేరణగా తీసుకొని, తెలుగులోకి వచ్చిన 'అబ్బాయి క్లాస్‌ - అమ్మాయి మాస్‌' సినిమా అందుకు తాజా ఉదాహరణ.



గతంలో 'మేం వయసుకు వచ్చాం' (2012) చిత్రాన్ని అందించిన నిర్మాతల్లో ఒకరైన లక్ష్మణ్‌ క్యాదారి తన ద్వితీయ ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. ఈ చిత్రంతో కోనేటి శ్రీనును దర్శకుడిగా పరిచయం చేశారు. కథ తానే కూర్చుకున్న శ్రీను సహజంగానే ఇవాళ తెలుగు సినిమాకు రాజపోషకులైన యువతరాన్నే తన లక్ష్యంగా ఎంచుకున్నారు. అందుకనే, ఆడవాళ్ళంటే బిడియం, భయం కలగలిసిన హీరో పాత్రనూ, ఆ ఫోబియా నుంచి అతణ్ణి బయటకు తెచ్చే వేశ్య పాత్రనూ తీసుకొని కథను అల్లుకున్నారు. ఈ ప్రాథమికమైన కథాంశం హాలీవుడ్‌ హిట్‌ పాయింటే అయినా, దాన్ని తెలుగు వాతావరణంలోకి దిగుమతి చేసే క్రమంలో తడబడ్డారు.


కథ: 

తాత, తండ్రుల లాగానే మనుమడు శ్రీ (వరుణ్‌ సందేశ్‌) కూడా అమ్మాయిల పిచ్చిలో పడి, ఆస్తినీ, ఆరోగ్యాన్నీ పోగొట్టుకోకూడదన్నది బామ్మ (సీనియర్‌ హాస్య నటి శ్రీలక్ష్మి) భావన. అందుకని మనుమణ్ణి ఆడపిల్లలకు దూరంగా పెంచుతుంది. దాంతో, ఓ పెద్ద సంస్థకు అధిపతి అయినా సరే హీరోకు అమ్మాయిలంటే ఖంగారు, భయం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతని సంస్థను గట్టెక్కించాలంటే, తన కుమార్తె అంజలిని పెళ్ళి చేసుకోవాలని పారిశ్రామికవేత్త కె.కె. ('ఆహుతి' ప్రసాద్‌) ప్రతిపాదిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా హీరో ఫోబియాను పోగొట్టడానికి నీరూ (హరిప్రియ) అనే వేశ్యతో అతను పది రోజుల పాటు కలసి మెలసి తిరిగేలా ప్లాన్‌ చేస్తాడు హీరో సహచరుడు (శ్రీనివాసరెడ్డి).
హీరోకూ, హీరోయిన్‌ వేశ్యకూ మధ్య జరిగిన సంఘటనలేమిటి? ఆఖరికి హీరో, ఎవరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు? లాంటి అంశాలన్నీ మిగతా కథ. మరోపక్క కొరియర్లు అందించే హరిదాసు (దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్‌) చేసే వరుస హత్యల వెనుక కథేమిటి? దానికీ ప్రధాన కథకూ లింకేమిటన్నది మరో ఉపకథ.
కథనం: 
దాదాపు రెండున్నర గంటలకు కొద్దిగా తక్కువ నిడివి ఉన్న ఈ చిత్రంలో హీరోకూ, అతనిలోని ఖంగారును పోగొట్టేందుకు ప్రయత్నించే హీరోయిన్‌ (వేశ్య) పాత్రల మధ్య సంఘటనలతో సో సోగా సాగిపోతుంది. ద్వితీయార్ధానికి వచ్చాక, హీరోలో మార్పు తరువాత సినిమా అయిపోతుందని అనుకుంటాం. కానీ, సినిమా అయిపోతుందని అనుకున్నప్పుడల్లా ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా ఏదో ఒక కొత్త ఘట్టం (ట్యాక్సీలో ప్రయాణం, హీరో మిత్రుడి పెళ్ళి, విలన్ల ఛేజింగ్‌..వగైరా)తో సా...గదీశారు. దాంతో, ఎప్పటికీ అయిపోని కథగా సినిమా నడుస్తూ ఉంటుంది. చివరకు, 'మూడడుగులు నడిచిన వీరిద్దరూ (హీరో, హీరోయిన్లు) ఏడడుగులు నడుస్తారని ఆశిద్దాం' అని శుభం కార్డు తెరపై పడడంతో పెద్ద రిలీఫ్‌ అనిపిస్తుంది.
దర్శకుడు ఎక్కువ ఆలోచించే పని పెట్టుకోకుండా, ఇటీవలి హిందీ, తెలుగు హిట్‌ చిత్రాల నుంచి యథాతథంగా కొన్ని దృశ్యాలను అరువు తెచ్చేసుకున్నారు. కాశీ విశ్వనాథ్‌ పోషించిన షూటర్‌ హరిదాసు పాత్ర, దాని నడక, ముగింపు కూడా హిందీ హిట్‌ 'కహానీ' నుంచి నేరుగా నడిచొచ్చినదే! అలాగే, పెళ్ళికి వెళ్ళిన హీరో, హీరోయిన్లను చూశాక, బంధువులు ఏకంగా హీరోయిన్‌ను పెళ్ళికూతురిలా అలంకరించే ఘట్టమైతే నితిన్‌ 'ఇష్క్‌' చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది.
సాంకేతికమైన లోటుపాట్లు కూడా సినిమాలో చాలానే ఉన్నాయి. 'వెన్నెల' కిశోర్‌ తన పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ అధ్వాన్నం. తెర మీద పెదాల కదలికకూ, వినిపించే డైలాగుకూ పొంతన లేదు. చాలా సందర్భాల్లో చెబుతున్నదేమిటో అర్థం కూడా కాదు. భావోద్వేగపరమైన డైలాగులున్న సందర్భాల్లో హీరో వరుణ్‌సందేశ్‌ చెప్పిన డైలాగులు కూడా వినబడితే ఒట్టు! ఓ సన్నివేశంలో హీరో వరుణ్‌ సందేశ్‌ పాత్రకు మధ్యలో కొన్ని డైలాగులు మాత్రం వేరే గొంతులో వినపడిన విషయం హాలులో సామాన్య ప్రేక్షకుడు సైతం ఇట్టే కనిపెట్టేస్తాడు.
ఎలా ఉందంటే..: 
అభినయం విషయానికి వస్తే, హీరో వరుణ్‌ సందేశ్‌ ఇన్ని సినిమాల తరువాత కూడా నటన, డైలాగ్‌ డెలివరీ మెరుగుపరుచుకోవాల్సిన అత్యవసరం తెర మీద తెలిసిపోతుంటుంది. వేశ్య నీరూ పాత్రలో హరిప్రియ కొన్ని కోణాల్లో చూస్తే, నటి రోజాను తలపిస్తుంది. పాత్రలో ఆమె నటించడానికి అవకాశమున్న ఘట్టాలు హీరోను మార్చే సన్నివేశం, క్లైమాక్స్‌ లాంటి కొన్నే! వాటిలో ఫరవాలేదనిపిస్తుంది.
హీరో బామ్మ పాత్రలో సీనియర్‌ హాస్య నటి శ్రీలక్ష్మికి మరీ భక్త శబరి తరహా గెటప్‌లో కనిపిస్తారు. పైగా, ఈ మధ్య సీరియల్స్‌లో ఎక్కువగా నటించడం వల్లనో ఏమో, బుల్లితెరపై చూపే లౌడ్‌ తరహా యాక్టింగ్‌ చేశారు. అది పెద్ద తెరపై అసహజంగా కనిపిస్తూ, అసహనం రేపుతుంది. ఆ మాటకొస్తే, చాలా సందర్భాల్లో దర్శకుడు సీరియల్‌ ఫక్కీ సంభాషణలు, కథన శైలిని ఆశ్రయించడంతో సినిమా చూస్తున్నామా, సీరియల్‌ చూస్తున్నామా అనే సందేహం కలుగుతుంది. 'ఆహుతి' ప్రసాద్‌, బామ్మ పాత్రధారిణి శ్రీలక్ష్మి మధ్య చివరలో వచ్చే ఘట్టంలో కథను సరిగ్గా అర్థమయ్యేలా చెప్పించలేకపోయారు.
అయితే, పాత్ర పరంగా హీరోయిన్‌ వేశ్య అనే అంశాన్ని సాకుగా తీసుకొని, మరీ చవకబారు సంభాషణలకూ, సన్నివేశాలకూ దర్శక, నిర్మాతలు ప్రయత్నించకపోవడం అభినందనీయం. రోడ్డు మీద సర్కస్‌ చేస్తున్న చిన్నారులకు అండగా ఉండేందుకు హీరోయిన్‌ నర్తించే ఘట్టం, హీరోలోని నెర్వస్‌నెస్‌ను పోగొట్టేందుకు హీరోయిన్‌ ప్రయత్నించే ఘట్టం లాంటివి కొన్ని బాగున్నాయి. 'మగవాళ్ళ సైకాలజీ మాకే బాగా తెలుసు. ఎందుకంటే, మేము రోజుకో మనిషి జీవితం చదువుతాం' (హీరోతో వేశ్య పాత్రధారిణి అయిన హీరోయిన్‌) లాంటి కొన్ని సంభాషణలు మనసును తాకుతాయి.
కెమేరా పనితనం బాగున్న ఈ సినిమాలో సంగీతం, పాటల్లో ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. చాలా దృశ్యాలను చిత్రీకరించినా, ఆఖరుకు సినిమాలోకి వచ్చేసరికి ఎడిటింగ్‌ కత్తెరకు బలైపోయిన సంగతి, ముఖ్యంగా ద్వితీయార్ధంలో తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటి లోటుపాట్లు చాలా ఉండడంతో, సెక్స్‌, క్రైమ్‌, (శ్రీనివాసరెడ్డి పెళ్ళి ఘట్టంలో) కామెడీ, ఓ ఐటమ్‌ సాంగ్‌ - ఇలా బాక్సాఫీస్‌ లెక్కలన్నీ కలిపి, తెరపై వడ్డించినా ఈ సినిమా ప్రేక్షకుడికి తృప్తినివ్వదు. అటు క్లాస్‌ను కానీ, ఇటు మాస్‌ను కానీ పూర్తిగా మెప్పించ లేకపోతుంది.
కొసమెరుపు: 
బాలీవుడ్‌లో వేశ్య పాత్ర ప్రధానాంశంగా వచ్చిన 'చమేలీ', 'చాందినీ బార్‌' తరహా సినిమాలన్నీ చూసేసిన ఓ యువ ప్రేక్షకుడు హాలులో నుంచి బయటకొస్తూ వ్యాఖ్యానించినట్లు, ''ఇప్పటికీ మనవాళ్ళు మాత్రం వేశ్య పాత్ర అనగానే ఒక ప్రత్యేక తరహా కట్టూబొట్టూ, కింది పెదవిని మునిపంటితో బిగపట్టడం తరహా హావభావాలే చూపుతున్నారు. వీటి నుంచి ఎప్పుడు బయటపడతారో!''
రెంటాల జయదేవ   
(Published in 'Praja Sakti' daily, 4th Aug 2013, Sunday, Page No.8) 
....................................................................

Saturday, August 3, 2013

యూతంటారా? బూతంటారా? ( 'రొమాన్స్‌' సినిమా సమీక్ష )


వేగం పెరిగిన ఈ ఆధునిక యుగంలో యువతరం ఆలోచనల్లో, ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులనూ, సమకాలీన సమాజాన్నీ ప్రతిబింబించడం ఏ సమాచార సాధనమైనా చేయాల్సిన పని. కానీ, దానిలోని మంచినీ, చెడునూ విశ్లేషించి, మంచి వైపు నడిపిస్తేనే - అర్థం, పరమార్థం. అలా చేయకపోతే, సమాజంలోని చెడునే గోరంతలు కొండంతలు చేసి, డబ్బులు సంపాదించుకొనే రీతిలో పబ్బం గడుపుకొన్నట్లు అవుతుంది. యువతరం కథా చిత్రంగా వచ్చిన 'రొమాన్స్‌' సినిమా ప్రయత్నించింది అదే!

తారాగణం: ప్రిన్స్‌, డింపుల్‌, మానస, సంగీతం: సాయి కార్తీక్‌, పాటలు: కాసర్ల శ్యామ్‌, కరుణాకర్‌, కెమేరా: జె. ప్రభాకరరెడ్డి, కూర్పు: ఎస్‌.బి. ఉద్ధవ్‌, సమర్పణ: మారుతి, నిర్మాతలు: జి. శ్రీనివాసరావు, ఎస్‌.కె.ఎన్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: 'డార్లింగ్‌' స్వామి
గత ఏడాది చిన్న స్థాయిలో విడుదలై, పెద్ద విజయాలు సాధించిన 'ఈ రోజుల్లో...', 'బస్‌స్టాప్‌' చిత్రాలు, ఆ చిత్రాల రూపకర్త మారుతి అందరికీ గుర్తే! మారుతి స్వయంగా దర్శకత్వం వహించకపోయినా, సమర్పించిన ఈ ఏటి 'ప్రేమకథా చిత్రమ్‌' కూడా జనాదరణకు నోచుకున్నదే. ఆయన సమర్పణలో విడుదలైన సరికొత్త సినిమా కాబట్టి 'రొమాన్స్‌' మీద ఓ ఆసక్తి ఏర్పడింది. కానీ, 'ఎవ్రిబడీ నీడ్స్‌...' అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ సినిమా యువతరం ఆలోచనలను చూపుతున్నామనే మిషతో ఓ మసాలా మలయాళ చిత్రంలా తయారైంది.
కథ : 
మునుపెన్నడూ బాయిఫ్రెండ్స్‌ కానీ, వారితో ప్రణయానుభవం కానీ లేని కన్నెపిల్లను తన ప్రేమికురాలిగా ఎంచుకోవాలన్నది ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న కృష్ణ (ప్రిన్స్‌) అభిప్రాయం. అందుకోసం అతను ఇద్దరు అమ్మాయిలను ఎంచుకొని, వారిని పరీక్షించి, వారిలో ఎవరు తాను అనుకున్న అంశాలకు తగ్గట్లుంటే వాళ్ళను ప్రేమించాలనే ఓ విచిత్రమైన పద్ధతిని ఎంచుకుంటాడు. ఆ క్రమంలో అతనికి లలిత (మానస) పరిచయమవుతుంది. మిత్రులిచ్చిన సలహాలతో 'టెస్టులు' పెడతాడు. ఆ పరిచయంలో తాను అనుకున్న లక్ష్మణరేఖను ఆమె దాటిందని హీరో అనుకుంటాడు. చివరకు, ఆమెతో లవ్‌ బ్రేకప్‌ అవుతుంది.
ఆ పైన చిన్నప్పుడే తల్లితండ్రులకు దూరమైన అనూరాధ (డింపుల్‌) అనే రెండో అమ్మాయికి హీరో దగ్గరవుతాడు. నిజాయతీగా అతణ్ణి ప్రేమించిన అనూరాధ, ఈ పరీక్షా క్రమానికి హర్ట్‌ అవుతుంది. హీరో చెబుతున్న ఈ స్వీయకథ ఇక్కడకు వచ్చేసరికి ఇంటర్వెల్‌. 'లక్ష్మణరేఖ' దాటని ఆ అమ్మాయే తనకు సరైన ప్రేమికురాలని గ్రహించిన హీరో లేడీస్‌ హాస్టల్‌కు వెళ్ళి మరీ ఆమెను తన వైపు ఎలా తిప్పుకున్నాడనేది మిగతా కథ. హీరోకు మొదట పరిచయమైన లలిత అసలు ఎవరు, ఆమె కథ ఏమిటన్నది మరో ట్విస్టు!
కథనం : 
తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకూ నాకూ డ్యాష్‌ డ్యాష్‌' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యువ హీరో ప్రిన్స్‌. గతంలో 'బస్‌స్టాప్‌'లోనూ కథానాయక పాత్ర పోషించారు. ఒడ్డూ పొడుగూతో చూడడానికి బాగానే ఉండే ఈ హీరో అభినయించడానికి కూడా శతవిధాల శ్రమించారు. ఆ శ్రమ తెర మీద తెలిసిపోతుంటుంది. ఇక, కథానాయిక పాత్రల్లో అనూరాధగా డింపుల్‌ అనే కన్నడ అమ్మాయి, లలిత పాత్రలో మానస కనిపించారు. వీళ్ళ వల్ల తెర మీద పండిన సన్నివేశం కానీ, గుర్తుంచుకోదగ్గ అభినయం కానీ లేవు. ఆ తప్పు వాళ్ళ పాత్రచిత్రణను రూపొందించిన దర్శకుడిదే! చిత్ర ప్రథమార్ధంలో హీరో తన ల్యాప్‌టాప్‌లో చూస్తూ డైలాగులు చెప్పే సీన్‌, 'డబ్బులు, ఎనర్జీ వేస్ట్‌' అంటూ వచ్చే కాలేజీ సీనుల్లో తెర మీద బొమ్మ ఒక రకంగా, డైలాగులు వేరొక రకంగా ఉండడం లాంటి లోపాలూ ఈ సినిమాలో ఉన్నాయి.
ఎలా ఉందంటే...: 
పేరులో ఉన్నట్లుగానే ఈ సినిమా మొదటి నుంచి చివరి దాకా 'రొమాన్స్‌' అనేదే ప్రధానమైన ముడిసరుకు. ''అమ్మాయిలు కళ్ళను చూసి ప్రేమిస్తారు. కానీ, మీ అబ్బాయిలు మా... ఛీ...'' లాంటి డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. ఇక, కథ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా 'ఒకే యావ'తో కూడిన 'ఏ' సర్టిఫికెట్‌ దృశ్యాలతో తెర నింపేశారు. యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ బాణీల్లో హాస్టల్‌లో వచ్చే 'రాధాకృష్ణుడే రైట్‌ ప్లేసుకొచ్చాడే...' పాట ఒకటీ బీట్‌ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. దీనిలో కూడా సాహిత్యం సరిగ్గా వినపడితే, లేదా కష్టపడి వింటే 'అదిరే అందాల మిల్క్‌ షేకులిద్దామా...' లాంటి అభివ్యక్తీకరణలు దిగ్భ్రమ కలిగిస్తాయి. 'రొమాన్స్‌...' అంటూ బాబా సెహ్ గల్  పాడిన పాట నవతరం 'ప్రేమ'లోని ధోరణులను చెప్పడానికి ప్రయత్నించింది. ఇక, 'ఈరోజుల్లో', 'బస్‌స్టాప్‌'ల లాగానే దీనికీ కెమేరామన్‌ జె. ప్రభాకరరెడ్డి. ఆయన చిన్న '5డి' కెమేరాతో వెండితెరపై ఏ మాత్రం తేడా లేని రీతిలో దృశ్యాల్ని చిత్రీకరించడం అబ్బురపరుస్తుంది. 
రెండు గంటల 20 నిమిషాలకు పైగా నడిచే ఈ సినిమాకు దర్శక, రచయిత తీసుకున్న పాయింట్ అయితే, 'మగవాడి అనుమానానికి అంతు లేదు. ఆడదాని ప్రేమకు అంతు లేదు ' అని. కానీ, చివరకు వచ్చే సరికి హీరో, హీరోయిన్ పాత్రలు రెండూ కూడా అనుమానం అనే అంశం మీదే నడుస్తాయి. 
పైగా, ఇవాళ్టి కాలేజీ కుర్రకారంతా నానా రకాల తిరుగుళ్ళు, అలవాట్లతోనే కాలం గడిపేస్తున్నారన్నట్లు చూపించడం సమంజసమూ కాదు. సమాజానికి సమగ్రమైన ప్రతిఫలనమూ కాదు. పై పెచ్చు, తప్పుడు అభిప్రాయాన్ని ప్రచారం చేసి, ఇతరులనూ తప్పుదోవ పట్టిస్తుందంటే కాదనలేం. 
అన్నింటి కన్నా చిత్రం ఏమిటంటే,  'గుడ్ సినిమా గ్రూప్ ' అని పేరు పెట్టుకొని, ఇలాంటి సినిమా తీయడం. ఈ సినిమాలో చూపించిన దాంట్లో అసలు ఏది గుడ్, ఎవరికి గుడ్ అంటే సమాధానం దొరకదు. తక్కువ ఖర్చుతో సినిమా తీసి, ఎక్కువ లాభాలు గడించడం ఒక్కటే సినిమా లక్ష్యమనీ, అందుకు 50 - 60 సెన్సార్ కట్స్ తో నైనా సరే జనం ముందుకు తెచ్చే కథనూ, కథనాన్నీ ఎన్నుకుంటామనీ వాదించేవారికి మాత్రమే ఈ సినిమా పట్ల అభ్యంతరాలు ఉండవేమో. అలాంటి వర్గానికి ఈ   'రొమాన్స్ ' చిత్రం ఓ ఆదర్శంగా, తాజా బాక్సాఫీస్ ఫార్ములాగా కనిపిస్తుంది. మరిన్ని యూత్ (బూతు) సినిమాలకు బాట చూపిస్తుంది. సమాజానికీ, తెలుగు సినిమాకూ అంతకన్నా విషాదం ఏముంటుంది. 
కొసమెరుపు -
సినిమా చూసి బయటకు వచ్చేస్తూ ఉంటే, ఓ ప్రేక్షకుడు  'ప్రతి సీనూ బెడ్ రూమ్ సీన్ లాగానే ఉందే. ఎంత  'రొమాన్స్ ' అని టైటిల్ పెట్టినా, మరీ ఇలానా... ' అంటూ బుర్ర గోక్కుంటూ, గొణుక్కోవడం వినిపించింది. టైటిల్ కు అసలు సిసలు జస్టిఫికేషన్ అంటే ఇదేనేమో. 
- రెంటాల జయదేవ   
(ప్రజాశక్తి దినపత్రిక, 3 ఆగస్టు 2013, శనివారం, పేజీ నంబర్ 8లో ప్రచురితం)

http://www.10tv.in/news/Romance-Not-for-Ladies


............................................................................

Sunday, July 28, 2013

'ఎవడు' చిత్రం రిలీజ్ వాయిదా తెర వెనుక కథేంటి?













  • ఆగస్టు 21కి 'ఎవడు' వాయిదా!
  • ముందు ప్రకటించినట్లే ఆగస్టు 7నే 'అత్తారింటికి దారేది'
  • మూడు వారాల ఉత్కంఠకు తెర
అభిమానులను ఊరిస్తూ వస్తున్న 'ఎవడు' చిత్రం విడుదల ఆఖరికి వాయిదా పడింది. రామ్‌చరణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిజానికి ఈ నెల 31న విడుదల కావాలి. ఆ విషయాన్నే నిర్మాత 'దిల్‌' రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కొన్నాళ్ళుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ విషయాన్ని పదే పదే మీడియాతో నిర్ధారించారు కూడా! తీరా, శనివారం సాయంత్రం సినిమా విడుదలను ఆగస్టు 21కి వాయిదా వేస్తున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. దీంతో, ఆగస్టు 7న రిలీజ్‌ కానున్న పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల 'అత్తారింటికి దారేది?' చిత్రానికి ఎట్టకేలకు సొంత మెగా కుటుంబం నుంచి పోటీ తప్పినట్లు అయింది.

ఈ అనూహ్య పరిణామాల పూర్వాపరాల విషయానికి వెళితే, నిజానికి గడచిన మూడు, నాలుగు వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్న విషయం - రామ్‌ చరణ్‌ తేజ్‌ 'ఎవడు', పవన్‌ కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది?' చిత్రాల విడుదల గురించే! రంజాన్‌ కానుకగా 'అత్తారింటికి దారేది?' చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇంతలో 'ఎవడు' చిత్రాన్ని జూలై 31న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించడం చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ తదితర 'మెగా' కుటుంబ అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. 

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్ద హీరోల, భారీ బడ్జెట్‌ చిత్రాలు రెండూ వారం తేడాలో పోటాపోటీగా విడుదల అవుతాయనడం వారికి మింగుడు పడలేదు. పదుల కోట్లు వెచ్చించి, వందలాది థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు కావడంతో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా తమ పెట్టుబడుల గురించి ఆందోళన చెందారు. అయితే, విడుదల తేదీలు మార్చేది లేదంటూ రెండు చిత్రాల వాళ్ళూ తమ వాదనకే కట్టుబడడంతో, పీటముడి పడింది. ఈ ఉత్కంఠ ఇలా రెండు, మూడు వారాలు కొనసాగాక, ఎట్టకేలకు ఇప్పుడు 'ఎవడు' చిత్ర దర్శక, నిర్మాతలే వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

బాబాయి, అబ్బాయిల పోటీనా?
'ప్రజాశక్తి' సేకరించిన అత్యంత విశ్వసనీయమైన తెర వెనుక సమాచారం ప్రకారం 'అత్తారింటికి దారేది?' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత భోగవల్లి ప్రసాద్‌, బృందం కొన్ని నెలల ముందే తమ చిత్రం రిలీజ్‌ గురించి, 'ఎవడు' నిర్మాత 'దిల్‌' రాజుతో చర్చించారు. ఆయనను పిలిపించి, తమ సినిమా రిలీజ్‌ను ఆగస్టు 7 అని ఖరారు చేసుకుంటున్నట్లు చెప్పారు. వాళ్ళ 'ఎవడు' సినిమా రిలీజ్‌ ఎప్పుడని కూడా అడిగారు. 'ఎవడు' చిత్రాన్ని జూన్‌ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్‌ చేస్తున్నట్లు 'దిల్‌' రాజు చెప్పారు. దాంతో, దానికి కనీసం నెల రోజుల పైగా విరామం ఉండేలా చూడాలని పవన్‌ కల్యాణ్‌ బృందం చర్చించుకొని, ఆగస్టు 7న తమ చిత్రం రిలీజ్‌ను నిర్ధారించుకున్నారు. 

''ఆ మాటే 'దిల్‌' రాజుకు చెప్పాం. ఆయన కూడా సమ్మతించారు. తీరా, 'ఎవడు' రిలీజ్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతూ, జూలై 31కి వచ్చింది. దాంతో, లేని పోటీ కాస్తా వచ్చిపడింది'' అని 'అత్తారింటికి...' చిత్ర యూనిట్‌లోని అత్యున్నత వర్గాల వారు 'ప్రజాశక్తి'కి వివరించారు.

డేటు..పవన్‌ ముందే చెప్పాడు!
'అత్తారింటికి...' చిత్రం రిలీజ్‌ డేట్‌ను తమ కన్నా ముందుగానే ప్రకటించారని 'దిల్‌' రాజు కూడా బాహాటంగా ఒప్పుకున్నారు. అయితే, ఆ యూనిట్‌ చెప్పిన విధంగా 'అత్తారింటికి...' చిత్రం ఆగస్టు 7న ఎక్కడొస్తుంది లెమ్మని 'ఎవడు' దర్శక, నిర్మాతలు మితిమీరిన ధీమాకు పోయారు. తీరా, అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, ఆగస్టు 7కే పవన్‌ సినిమా రిలీజ్‌కు సిద్ధమైపోవడంతో, 'ఎవడు' టీమ్‌కు షాక్‌ కొట్టింది. లేనిపోని పోటీ తలనొప్పి వచ్చిపడింది. 

అటు అబ్బాయి రామ్‌చరణ్‌ సినిమా, ఇటు బాబాయి పవన్‌ కల్యాణ్‌ సినిమా కావడంతో అభిమానుల్లో, వ్యాపార వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో, 'అత్తారింటికి...' రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేయించడానికి తెర వెనుక చాలానే ప్రయత్నాలు జరిగినట్లు భోగట్టా. 

''తెర వెనుక చాలా తతంగమే జరిగింది. పంచాయతీలూ సాగాయి. కానీ, మేము ముందుగానే అందరినీ సంప్రతించి, అనుమతి తీసుకొని నిర్ణయించిన తేదీ కావడంతో, మమ్మల్ని ఎవరూ తప్పు పట్టలేకపోయారు'' అని పేరు ప్రచురించడానికి ఇష్టపడని 'అత్తారింటికి...' యూనిట్ సభ్యుడొకరు వివరించారు.

చివరకు, హీరో పవన్ కల్యాణ్ సైతం 'ముందే చెప్పి, ఖరారు చేశాం కాబట్టి, 'ఎవడు' కోసం 'అత్తారింటికి...' రిలీజ్ ను మార్చుకోవాల్సిన పని లేద'ని కరాఖండిగా చెప్పినట్లు కృష్ణానగర్ కబురు. 'అత్తారింటికి..' రిలీజ్ మారే సూచనలు లేకపోవడంతో, మరో దారి లేక 'ఎవడు' రిలీజ్ ను 'దిల్' రాజు బృందమే మార్చుకోవాల్సి వచ్చింది. రాఖీ (శ్రావణపూర్ణిమ), మెగాస్టార్ చిరంజీవి జన్మదిన (ఆగస్టు 22) కానుకగా ఆగస్టు 21కి 'ఎవడు' జనం ముందుకొస్తాడని ప్రకటించాల్సి వచ్చింది. ఈ తాజా వాయిదా ప్రకటనకు చిరంజీవి తదితరుల సలహా కూడా కారణమని చెబుతున్నారు. 

ఏతావతా, 'జంజీర్' (తెలుగులో 'తుఫాన్') రిలీజ్ ఖరారైపోయినందువల్ల  తాము వెనక్కి వెళ్ళడం కుదరని గతంలో పదే పదే చెప్పిన 'ఎవడు' బృందం ఇప్పుడు మాత్రం ఆ మాటను పక్కన పెట్టేయడం విశేషం. 

''మనసుంటే మార్గం ఉంటుంది. 'ఎవడు' వాయిదా వేసుకోవడం వాళ్ళ చేతుల్లో పనే'' అని 'అత్తారింటికి..' వర్గాలు 'ప్రజాశక్తి'తో గతంలోనే అన్నాయి. వారు అన్నట్లే, చివరకు మార్గం సుగమం కావడం గమనార్హం. అయితే, రిలీజ్ తేదీల్లో పోటీ నివారణ జరిగింది. 

కానీ, రేపు బాక్సాఫీస్ ఫలితం, వసూళ్ళ  దగ్గర కూడా ఈ రెండు చిత్రాలకూ పోటీ రాదని గ్యారెంటీ ఏముంది. ఆ సంగతే 'కృష్ణానగర్' వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
మరి, ఈ పోటీని తప్పించే దారేది...? తప్పించగలది ఎవడు..? ఇవన్నీజవాబులేని ప్రశ్నలే. 

- రెంటాల జూనియర్

(Published in 'Praja Sakti' daily, 28th July 2013, Sunday, Page No.8)
..............................................................................

''బాబాయిని చరణ్ గౌరవిస్తాడు! భయపడడు!'' - 'ఎవడు' చిత్రం వాయిదాపై నిర్మాత 'దిల్‌' రాజు


జూలై 31న విడుదల కావాల్సిన 'ఎవడు' చిత్రాన్ని ఆగస్టు 21కి వాయిదా వేయడంపై వివరణ నిచ్చారు నిర్మాత దిల్ రాజు. పవన్ కల్యాణ్ కూ, ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికీ భయపడి ఏమీ తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.


'ఎవడు' వాయిదా గురించి వెబ్‌సైట్లతో సహా మీడియాలో రకరకాల కథనాలు, ఊహాగానాలు వస్తున్నాయంటూ, శనివారం సాయంత్రం పొద్దు పోయాక, నిర్మాత 'దిల్‌' రాజు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తన వివరణ ఇచ్చారు. ''(పవన్‌) కల్యాణ్‌ బాబాయి. చరణ్‌ అబ్బాయి. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడే కానీ, భయపడడు. కేవలం మెగా అభిమానుల్లో ఎవరినీ నొప్పించకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. 'అత్తారింటికి..' విడుదలైన రెండు వారాల తరువాత ఆగస్టు 21న 'ఎవడు' వస్తుంది. శనివారం మధ్యాహ్నం మేమంతా చర్చించుకొని, ఈ నిర్ణయం తీసుకున్నాం. బాబాయి, అబ్బాయిల సినిమాలు రెండూ ఒకే నెలలో విడుదల కానున్నాయి. ఫ్యాన్స్‌కు ఇది పండగే! రెండూ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలవుతాయి'' అని 'దిల్‌' రాజు వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ''రిలీజయ్యాక తెరపై చూస్తే కదా! ఏ సినిమా సత్తా ఏంటే తెలిసేది. నాకు తెలిసి రెండు చిత్రాలూ పెద్ద హిట్టయ్యే సినిమాలే'' అని పేర్కొన్నారు.
'ఎవడు' కోసం రెండేళ్ళ పాటు శ్రమించామని చెప్పిన 'దిల్‌' రాజు ఈ చిత్రం కోసం రచయితలు, సాంకేతిక నిపుణులు దర్శకుడికిచ్చిన సహకారం మరువలేనిదన్నారు. ''2011లో దర్శకుడు వంశీ పైడిపల్లి ముప్పావుగంట సేపు నాకు 'ఎవడు' కథ చెప్పాడు. ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళే సినిమా అవుతుందిది అనుకున్నాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంతా పూర్తయ్యాక శుక్రవారం నాడు ఈ సినిమా చూశా. కథ విన్నప్పుడు కలిగిన ఉద్వేగమే మళ్ళీ కలిగింది. రేపు హాల్లోని ప్రేక్షకులకు కూడా ఇదే ఉద్వేగం కలిగితే, సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది'' అని 'ఎవడు' గురించి ఆయన దృఢమైన విశ్వాసం వ్యక్తం చేశారు.

(Published in 'Praja Sakti' daily, 28th July 2013, Sunday, Page no.8)
...........................................................