జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, September 29, 2010

సెన్సారైన సినిమాకు గ్రాఫిక్స్ లేటేంటి? అప్పట్లో చిరంజీవి ‘అందరివాడు’కు అయిందేమిటి!?



'రోబో'సినిమా విడుదల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1కి వాయిదా పడి వారం దాటినా, దాని మీద చర్చ ఇంకా ఆగలేదు. ఆ మధ్య రాత్రి భోజనం వేళ ఓ సినిమా మిత్రుడితో మాటల్లో ‘రోబో' వాయిదా గురించి చర్చ వచ్చింది. అయోధ్య అంశంపై రానున్న తీర్పు వల్ల వాయిదా పడిందేమోనన్న మిత్రుల మాట కూడా మేము చర్చించుకున్నాం. అప్పుడే మా మధ్య మాటల్లో ఓ విషయం చర్చకు వచ్చింది. ప్రింట్ల సమస్య మొదలు ఫైనాన్షియల్ సమస్యల దాకా ఏవి ఎదురైనా సరే, సినిమా విడుదల వాయిదా వేసినప్పుడల్లా మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాలేదనో, గ్రాఫిక్స్ లేట్ అయ్యాయనో చెప్పడం సర్వసాధారణంగా మన వాళ్ళకు అలవాటు. (‘అంజి', 'అరుంధతి' లాంటి చాలా సినిమాలకు అది మనం చూసిన కథే). ఆ మాటే చర్చించుకుంటూ సరదాగా నవ్వుకున్నాం.

ఇంతలో మా మిత్రుడు ఓ గమ్మత్తైన సంగతి గుర్తు చేశాడు. అది మీతో పంచుకోవడమే ఈ టపా ఉద్దేశం. కొన్నేళ్ళ క్రితం 2005 జూన్ 3వ తేదీన చిరంజీవి 'అందరివాడు' సినిమా రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. అభిమానులతో సహా అందరూ ఆ తేదీకి మానసికంగా, సినిమాకు వెళ్ళడానికి శారీరకంగా సిద్ధమయ్యారు. తీరా ఆఖరు నిమిషంలో ఏమైందో, విడుదలకు ఒక్క రోజు ముందుగా ఆకస్మికంగా ప్రకటన వచ్చింది. జూన్ 3 నుంచి 4వ తేదీకి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అంతటితో ఊరుకుంటే ఎలా ఉండేదో. ఆ చిత్ర నిర్మాత - చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చి, గ్రాఫిక్స్ సిద్ధం కాకపోవడంతో సినిమా విడుదల తప్పని సరైందంటూ సాకు చెప్పారు. అంతటితోనూ ఆగక, ఆ గ్రాఫిక్స్ వాళ్ళ మీద దావా వేయడానికి తమ వకీళ్ళు సన్నద్ధమవుతున్నారని కూడా ప్రకటించారు.

గమ్మత్తు ఏమిటంటే, ఆ సినిమాకు అప్పటికే సెన్సార్ కూడా చేయించేశారు. గ్రాఫిక్స్ వగైరాలేమీ లేకుండానే, సినిమాకు అసలెలా సెన్సారింగ్ చేశారన్నది ప్రశ్న. (అవేవీ లేకుండానే మన నిర్మాతలు తమ ధనబలం ఉపయోగించి, ఏవేవో ఎత్తులు వేసి, డూప్ నెగటివ్ లతోనే సెన్సార్ పని కానిచ్చేస్తుంటారన్నది వేరే విషయం). ఆ ధర్మసందేహంతోనే ఓ క్రియాశీలుడెవరో, 'అందరివాడు' నిర్మాత మీద, సెన్సార్ బోర్డు మీద ఫిర్యాదు చేశారు.

విషయం వీధి కెక్కేసరికి, ఆ రోజు చేయాల్సిన ఇతర సెన్సారింగ్ పనులన్నీ ఆపేసి, హైదరాబాద్ సెన్సార్ బోర్డంతా 'అందరివాడు' గొడవలో పడింది. 'సెన్సారైపోయిన సినిమాకు ఇంకా గ్రాఫిక్స్ రాలేదంటూ అబద్ధం చెప్పి, కొంప తీశావు కదయ్యా' అంటూ ఆంతరంగికంగా అల్లు అరవింద్ మీద పడింది.

దాంతో, వాయిదాకు అసలు కారణం బయటకు చెప్పలేక, గ్రాఫిక్స్ మీద నెపం నెట్టేద్దామని చూసిన అరవింద్ నాలుక కరుచుకోవాల్సి వచ్చింది. ఆనక, ఆయన ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తిని పిలిపించుకొని, రూ. 5 లక్షల నజరానా చెల్లించుకోవాల్సి వచ్చిందట! ఆ రకంగా రూకలతో రాజీ ఫార్ములా కుదుర్చుకొని, ఎవరూ నోరు మెదపకుండా చేసుకోవాల్సి వచ్చిందట!

ఈ కథను ఎవరు, ఎంత మేరకు నమ్ముతారన్నది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం. అయితే, హైదరాబాద్ లోని సినీ జీవుల అడ్డా కృష్ణానగర్ లో మాత్రం ఎవరిని కదిలించినా, ఈ కథ గురించే కథలు, కథలుగా చెబుతారని మా మిత్రుడు నాకు చెప్పాడు. అప్పట్లో ఈ కథ నేనూ విన్నా, ఇప్పుడు మా మిత్రుడు మళ్ళీ చెబుతుంటే కానీ గుర్తుకురాలేదు. 'రోబో' విషయంలో మాత్రం ఇప్పటి దాకా ఎవరూ గ్రాఫిక్స్ మీద నెపం నెట్టేయడం లేదు. అంతవరకు మంచిదే!

2 వ్యాఖ్యలు:

DesiApps said...

వాడు మీ కళ్ళ ముందే ౫ లక్షలు చినట్టు మాట్లడుతున్నరుగా...

ANALYSIS//అనాలిసిస్ said...

అసలు విషయం మీకు తెలీదా ... అయితే ఇక్కడ చూడండి
http://www.analysis-sree.blogspot.com