జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, September 18, 2010

'రోబో' వాయిదా కథేంటి?



మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ సినిమా అభిమానుల నిరీక్షణ మరికొన్నాళ్ళు పెరిగింది. రజనీకాంత్ - శంకర్ ల కలయికలో జనమంతా ఎదురుచూస్తున్న 'రోబో' చిత్రం విడుదల అక్టోబర్ 1కి వాయిదా పడింది. ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థ ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సరిగ్గా మరో వారం రోజుల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా, సెప్టెంబర్ 17 శుక్రవారం చీకటి పడ్డాక చల్లగా ఈ వార్తను తెలిపింది.

".... ఈ ఏడాదిలో జనమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'యంతిరన్ ' ('రోబో') చలనచిత్రం..." అక్టోబర్ 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్నట్లు సన్ పిక్చర్స్ ఆ ప్రకటనలో తెలిపింది. "భారత్ లోనే కాక, అమెరికా, బ్రిటిన్, ఐరోపా, మలేసియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో అదే రోజున సినిమా విడుదల అవుతుంద"ని పేర్కొంది.

చడీచప్పుడు లేకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రకటనతో మీడియా ఒక్కసారిగా మేల్కొంది. వివిధ రకాల వార్తా కథనాలు, టీవీ ఇంటర్వ్యూల కోసం సన్నద్ధమవుతున్న సమాచార సాధనాలు గబగబా అసలు విషయం కనుక్కునేందుకు ప్రయత్నించాయి. విలేఖరులు ఆగకుండా ఫోన్లలో మాట్లాడడం మొదలైంది. అయితే, విడుదల వాయిదాకు కచ్చితమైన కారణాలు అధికారికంగా వివరించడానికి నిర్మాణ వర్గాల వారెవరూ అందుబాటులోకి రాలేదు.

ఎవరి సంతకమూ లేకుండా, కేవలం ఆఫీసు ముద్రతో 'సన్ పిక్చర్స్' లెటర్ హెడ్ మీద వచ్చిన ప్రకటన మినహా మరే సమాచారమూ అందలేదు. ఇప్పటి దాకా చిత్రాల పంపిణీలోనే ఉన్న సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఇదే తొలి చిత్రం. సన్ టి.వి, జెమినీ టివి, ఉదయ టి.వి. తదితర తమిళ, తెలుగు, కన్నడ భాషా టీవీ చానళ్ళతో దక్షిణాదిన తిరుగులేని సంస్థగా ఎదిగిన సన్ టి.వి. నెట్ వర్క్ లిమిటెడ్ కు చెందిన ఓ విభాగమే - సన్ పిక్చర్స్. వీటన్నిటికి అధినేత అయిన కళానిధి మారన్ ఎప్పటి లానే ఈ సారి కూడా మీడియాకు దూరంగా ఉన్నారు.

'రోబో'చిత్ర నిర్మాత అయిన కళానిధి మారన్ అలా దూరంగా ఉంటే, ఆయన మిత్రుడూ - 'రోబో' చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాత అయిన హన్స్ రాజ్ సక్సేనా సైతం ఈ ప్రకటనపై సంతకం పెట్టకపోవడం గమనార్హం. ఇటీవల మద్రాసులో ఓ పెద్ద హోటల్ పై సన్ టీవీ అధినేత దాడి జరిపించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ దాడిలో కళానిధి పక్షాన చక్రం తిప్పింది ఈ మిత్రుడేనని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఆ కారణంగానే కొద్దిరోజులుగా సక్సేనా ఎవరికీ అందకుండా ఉండిపోయారని కోడంబాకమ్ కబురు.

నిజానికి, 'రోబో' సెప్టెంబర్ 24 రిలీజవుతుందని రజనీకాంత్ గత పక్షంలో తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. సన్ పిక్చర్స్ వర్గాలు సైతం ఆ తేదీని ఖరారు చేస్తూ, అధికారికంగా ప్రకటించాయి. ఆ పైన సినిమా ట్రైలర్ విడుదలప్పుడూ ఆ తేదీనే చెప్పాయి. దాంతో, ఇప్పటికే మద్రాసు లాంటి చోట్ల దాదాపు 30కి పైగా హాళ్ళలో 'రోబో' విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. తీరా సినిమా టికెట్లకు అడ్వాన్ బుకింగ్ మొదలయ్యే తరుణంలో కథ ఇలా మలుపు తిరిగింది.

సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాలేదనీ, అందుకే ఈ వాయిదా అనీ కొందరు చెబుతున్నారు. కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ తో సహా అన్ని పనులూ ఇప్పటికీ పూర్తయ్యాయనీ, సెన్సార్ కు కూడా సినిమా సిద్ధమైందనీ అభిజ్ఞ వర్గాలను ఉట్టంకిస్తూ ఇప్పటికే వార్తలు వచ్చేశాయి. అసలు 'రోబో' సెన్సార్ కూడా అయిపోయిందనీ, కట్స్ ఏమీ లేకుండా, అందరూ చూడవచ్చంటూ యు (యూనివర్సల్) సర్టిఫికెట్ ఇచ్చారనీ కూడా ఇవాళ ఓ అనధికారిక వార్త వెలువడింది. మరి, అలాంటప్పుడు సినిమా విడుదల ఎందుకు వాయిదా వేసినట్లు? 'రోబో' విషయంలో ఇది ప్రస్తుతానికి అంతుచిక్కని మిస్టరీ! అక్షరాలా 150 – 160 కోట్ల రూపాయల విలువైన ప్రశ్న!!

2 వ్యాఖ్యలు:

Anil Dasari said...

వారం లేటైతే ఇంతగా ఇదై పోవాలా!!

Anonymous said...

The court verdict on Ramajanmabhumi issue is due on September 24th. I guess that is the reason for this postponement.