జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, December 30, 2014

ఆ విషయంలో... బాలచందర్ నాకు స్ఫూర్తి: దాసరి

ఆ విషయంలో...ఆయనే నాకు స్ఫూర్తి: దాసరి

బాలచందర్ గారి లాంటి ఒక మహాదర్శకుడు కన్నుమూయడంతో భారతదేశంలో ఒక గొప్ప క్రియేటివ్ మ్యాన్ తన శకం ముగించినట్లయింది. నాకు ఆనాటి మద్రాసులో మొట్టమొదటి దర్శక మిత్రుడు బాలచందర్ గారు. మేము ఎప్పుడు కలసి మాట్లాడుకున్నా మా కబుర్లు నాటకాలు, సినిమాల గురించే సాగేవి. నిజానికి, మా ఇద్దరి జీవితాలూ చాలా ప్యారలల్‌గా నడిచాయి. సినిమాల కోసం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నేనూ అలాగే సినిమా కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేశాను.

ఇద్దరం నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్ళమే. రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా కొన్ని వందల ప్రదర్శనలు చేశారాయన. నేనూ అలాగే చేశాను. సినిమాల్లో ఆయన మొదట మాటల రచయితగా ప్రారంభించి ఆ తరువాత దర్శకుడయ్యారు. నేనూ అంతే! అందుకే, నా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథి అయితే, ఆయన కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా వెళ్ళేవాణ్ణి. ఆయనను చివరిసారిగా శిల్పకళావేదికలో మా కార్యక్రమానికి వచ్చినప్పుడు కలిశాను.

ఆయన చాలాసార్లు ‘నారాయణరావు గారూ! మీరంటే నాకు చాలా ఇష్టం’ అనేవారు. కారణం ఏమిటని అడిగితే... ‘మీరూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. నేనూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడను. ఇద్దరం కొత్తవాళ్ళ కోసం, చిన్నవాళ్ళ కోసం కథలు రాసుకొని సినిమాలు తీస్తుంటాం. అలాగే తీసుకుందాం’ అనేవారు. నిజం చెప్పాలంటే, అలా కొత్తవాళ్ళతో, చిన్నవాళ్ళతో కొత్త తరహా కథలు రాసుకొని సినిమాలు తీయడంలో నాకు స్ఫూర్తి ఆయనే! బాలచందర్ సినీ జీవితాన్ని గమనిస్తే, ఆయన తీసుకొచ్చిన నటీనటులు స్టార్స్ అయ్యేవారు. అలా తన స్కూల్ నుంచి వచ్చిన స్టార్స్‌తో ఆయన సినిమాలు తీశారే తప్ప, ఒక్క శివాజీ గణేశన్ మినహా పెద్ద స్టార్లతో ఎప్పుడూ తీయలేదు! గమనిస్తే - ఆయన తీసుకొచ్చిన నటులు రజనీకాంత్, కమలహాసన్‌లు భారతదేశానికే సూపర్‌స్టార్లయ్యారు. అలాగే, ప్రకాశ్‌రాజ్ కూడా! ఇలా ఎంతోమంది ఆర్టిస్టుల్ని స్టార్స్‌ను చేశారాయన.

సమాజంలో జరుగుతున్న అంశాలనూ, కొన్ని చేదు నిజాలనూ మనం సినిమా ద్వారా చెప్పాలని బాలచందర్ గారు నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు. నా సినిమాల్లో నేనూ ఆ పని చేస్తుండేవాణ్ణి కాబట్టి, ఆయన సంతోషించేవారు. మనిద్దరి కోణాలూ ఒకేలా ఉన్నాయనేవారు. ఆయన నాటకాలు ‘మేజర్ చంద్రకాంత్’ లాంటివి ఆయనతో కలసి కూర్చొని, చూసేవాణ్ణి. నా ప్రతి సినిమా ఆయనకు చూపించేవాణ్ణి. నాకు బాగా గుర్తు.     నా ‘మేఘసందేశం’ చిత్రం చూసిన ఆయన ‘నారాయణరావ్! నేను ఇన్‌సై్పర్ అయ్యాను’ అన్నారు. ఒక దర్శకుడి నుంచి మరో దర్శకుడికి దక్కే అరుదైన ప్రశంస అది. ఆ మాటతో ఆగకుండా ఆయన ఆ కథలోని ఆత్మ తీసుకొని, తమిళంలో ‘సింధుభైరవి’ చిత్రం తీశారు. ‘మేఘసందేశం’ మోడల్‌లో, దానికి బాగా దగ్గరగా ఉండేలా ఆ సినిమా తీయడమే కాక, ఆ మాట చెప్పే చేయడం దర్శకుడిగా ఆయన సంస్కారం, గొప్పదనం.

ఇక, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన తొలి రోజుల్లో తమిళంలో తీసిన సంచలనాత్మక ‘అరంగేట్రం’ చిత్రం చాలా బాగుంటుంది. ఇక, ఆయన సినిమా చూసి, ఆ కథ తెలుగులో నేను చేయాలనుకున్న సందర్భాలూ ఒకటి రెండు లేకపోలేదు. ఆయన అద్భుతంగా తీసిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ను తెలుగులో నేను ‘తూర్పు - పడమర’గా తీశా.

పోస్టర్ మీద దర్శకుడి పేరు ప్రత్యేకంగా కనిపించేలా వేయడమనే సంస్కృతిని ఆయన తమిళంలో, నేను తెలుగులో తెచ్చాం. ఆయన మాత్రం సెంటిమెంట్‌గా తన పేరును కిందే వేసుకొనేవారు. నేను మాత్రం ‘అందరి కన్నా డెరైక్టరే టాప్ కాబట్టి, నా పేరు పోస్టర్‌లో పైనే వేసుకుంటా’ అని ఆయనతో అంటుండేవాణ్ణి.

ఆయననూ, నన్నూ, కన్నడ దిగ్దర్శకుడు పుట్టణ్ణ కణగల్‌నూ ‘డెరైక్టర్స్ ఆఫ్ ది సౌత్’ అంటూ అప్పట్లో అందరూ గొప్పగా ప్రస్తావించేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా... ఒక పెద్ద హీరోకు ఉండేంత క్రేజున్న దర్శకుడు - బాలచందర్ గారు. ఆయనను చూసి ఈ తరం ఏం నేర్చుకోవాలంటే... దర్శకుడనేవాడు ఎప్పుడూ ఏ హీరో మోకాళ్ళ దగ్గరా ఉండకూడదని నేర్చుకోవాలి. మొదటి నుంచి చివరి దాకా అలాగే సింహంలా జీవించిన అలాంటి ఒక మహా వ్యక్తి ఈ రోజున లేరన్న నిజాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలు జీర్ణించుకోలేవు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

(సంభాషణ - రెంటాల జయదేవ)

Published in 'Sakshi' daily, 24th Dec 2014
...............................................

Saturday, December 27, 2014

బాలచందర్‌ నుంచి...ఎవరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!

బాలచందర్‌ నుంచి...ఎవరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!
సి. మృణాళిని (ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు)

తెలుగు సినిమాల్లో స్త్రీలను బాగా చూపించడం (అంటే అందంగా కాదు) అనేది ఎవరూ పెద్దగా ఆశించే విషయం కాదు. అలా ఆశించిన వారికి ఆశాభంగమే. కాకపోతే ‘‘స్త్రీలను కంటతడి పెట్టించే సినిమాల’’నే స్త్రీ ప్రాధాన్య సినిమాలుగా భావించే సంప్రదాయం మనది. అలా ఏడ్పించే సినిమాలకు ఏమీ కొదవలేదు. అయితే, అలా ఏడిపించడం కంటే, దుఃఖించే సందర్భాల్లోనూ మనోనిబ్బరంతో, పరిణతితో ప్రవర్తించే స్త్రీలను సృష్టించిన అపురూప దర్శకుడు కె. బాలచందర్. ఆయన సినిమాలన్నిటిలోనూ ఆధునిక స్త్రీలో ఉన్న ఆత్మవిశ్వాసం, పరిణతితో కూడిన ఆలోచనా విధానం కనిపిస్తాయి. బాలచందర్‌గారికి స్త్రీల పట్ల అపారమైన గౌరవం, స్త్రీలకు ఈ సమాజంలో ఎదురవుతున్న పరిస్థితుల పట్ల అసహనం, వారి పట్ల సానుభూతి పుష్కలంగా ఉన్నాయి. అయితే, బహుశా ఆ సానుభూతి మాత్రమే ఉండి ఉంటే, ఈ రోజు మహిళా ప్రేక్షకులు ఆయన్ని అంతగా గుర్తు పెట్టుకోనవసరం లేదు.

 కానీ స్త్రీలను వ్యక్తులుగా చూసిన, అర్థం చేసుకున్న ఒక అపూర్వమైన దృష్టి ఆయనలో ఉంది. స్త్రీలలోని సున్నితత్వాన్ని ఇతరులు బలహీనతగా చూపిస్తే, ఆయన అదే సున్నితత్వాన్ని ఆమె బలంగా చూపారు. ఇతర దర్శకులకూ, ఆయనకూ బహుశా తేడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా అంతులేని కథ, ఇది కథకాదు, గుప్పెడు మనసు, మరో చరిత్ర (మాధవి పాత్ర) మొదలైన సినిమాలు చూసినప్పుడు ఈ అభిప్రాయం బలపడుతుంది.స్త్రీ పాత్రల చిత్రణలో ఆయన ప్రత్యేకత వారిని దేవతలుగా కాక మనుషులుగా చూపడం. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’ ఆనాటి స్త్రీలెందరి జీవితాలకో ప్రాతినిధ్యం వహించిన చిత్రం. అప్పుడప్పుడే స్త్రీలు కుటుంబ భారాన్ని మోయడం ప్రారంభమైంది. బహుశా మరో దర్శకుడైతే ఆ స్త్రీ (జయప్రద)ని సంపూర్ణ విషాదజీవిగా, స్వీయకరుణతో కుమిలిపోయేదానిగా, ఇంటిల్లిపాదినీ ఒక్క మాటా అనని సహనశీలిగా... అంటే అతిమానుష జీవిగా (లార్జర్ దేన్ లైఫ్) చూపించేవారేమో.

కానీ బాలచందర్ ఆమెను రక్తమాంసాలున్న, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా, అత్యంత సహజంగా చిత్రించారు. ఇంట్లో వాళ్లకు ఆమె ‘పెద్ద పులి’, పిల్లలకైతే ‘రాక్షసి’ కూడా. బయటకు వెళ్లి పదిమందిలో కూర్చుని పని చేసే తనకు మంచి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం, హక్కూ కూడా ఉన్నాయని భావించే వాస్తవిక దృష్టిని చూపడం మరవలేదు దర్శకుడు. ఇంతకూ ఆమె చేసిన త్యాగాలు చిన్నవేమీ కాదు. తన ప్రేమను, వివాహాన్ని, విరామాన్ని అన్నిటినీ కోల్పోతుంది; తన శ్రమను సునాయాసంగా తక్కిన వాళ్ల కోసం ఖర్చు చేస్తుంది. కానీ ఒక త్యాగమూర్తిలాగా ప్రవర్తించదు; కుటుంబం పట్ల తన బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నాక, దాని నిర్వహణలో కలిగే మనస్తాపాలు వంటివి కూడా ప్రతి స్త్రీ అనుభవిస్తుందనీ, కుటుంబం, తన జీవితం - ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణను మనో నిబ్బరంతో ఎదుర్కొంటుందనీ చిత్రించడం ఆయన చేసిన గొప్ప పని.

అంతేకానీ, స్త్రీ అంటే భూదేవి వంటి సహనమూర్తి అనే టైప్స్ లాగా ఆయన చిత్రించలేదు.ఇదే దృక్పథం ‘గుప్పెడు మనసు’ చిత్రంలో సుజాత పాత్రలో కూడ కనిపిస్తుంది. సుజాత ప్రసిద్ధ రచయిత్రి. తన నవలల్లో స్త్రీ పాత్రలకు ఆమె పేరు పొందింది. అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ నిజ జీవితంలో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తనలోని రచయిత్రి, తనూ వేర్వేరేమో అనుకుంటుంది. తను ఎంతగానో ప్రేమించే భర్త, తామిద్దరు కూతురిగా భావిస్తున్న యువతితో క్షణాకావేశంలో దైహిక సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోతుంది. క్షమించలేకపోతుంది. అతనితో కాపురం చేయలేకపోతుంది. అయితే సుజాతలో ఉన్న రచయిత్రి, సరితను మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది. ఆ అమ్మాయి తప్పులేదనీ, తప్పంతా తన భర్తదేననీ భావిస్తుంది. తన కలలో సరితను చనిపోయినట్లుగా ఊహించుకుని ఆనందించినందుకు జాగ్రదావస్థలో తనని తానే అసహ్యించుకుంటుంది. సరితలో కూడ సుజాత పట్ల గౌరవం అమితంగా ఉన్నందువల్లే, శరత్‌బాబుతో ఒక్కరాత్రి సంబంధం వల్ల తనకు పుట్టిన పాపకు విద్య (సుజాత పేరు) అని పేరు పెట్టుకుంటుంది.

 అన్నిటికంటే ఇక్కడ చెప్పదగ్గ విషయం సరిత పాత్ర. తన తండ్రి వయస్సుగలిగిన వ్యక్తి అతను; అతను తనను లోబరచుకోవడానికి పూనుకున్నప్పుడు లొంగిపోయింది. అది పరిపక్వత లేని తన తప్పు కాదని ఇతరులు చెప్పినా, ఒప్పుకోదు. తనకు కూడ మనసులో ఎక్కడో అతని పట్ల కోరిక లేకపోతే వ్యతిరేకించి ఉండేది కదా. కానీ ఎందుకు ఆనందంగా లొంగిపోయింది? కనక తప్పు తనలోనూ ఉందని అనుకుంటుంది. అందుకే ఈ సంఘటనను పట్టించుకోకుండా తనని వివాహం చేసుకుంటానని వచ్చిన సుజాత తమ్ముడిని తిరస్కరిస్తుంది. అందరూ మంచి వాళ్లే. కానీ ఒకే బలహీన క్షణం ఇంతమంది జీవితాలనూ నాశనం చేసింది. పితృస్వామ్య వ్యవస్థలో సహజంగానే ఏ ఆపద జరి గినా, ఎక్కువ బాధపడేది స్త్రీలే. కానీ ఆ స్త్రీలిద్దరూ ఈ దుర్భరమైన సన్నివేశంలోనూ, ఎంత హుందాగా ప్రవర్తిస్తారో చూసినపుడు, బాలచందర్ వంటి దర్శకులు మనకెంత అవసరం కదా అనిపిస్తుంది.

ఇక మూడో చిత్రం ‘ఇది కథ కాదు’. ఇది నిజంగా సంచలనాత్మక చిత్రమే అన్ని విధాలా. పురుషులతో స్త్రీ సంబంధాల్లో ఎన్ని సంక్షిష్టతలున్నాయో అన్నిటినీ చూపిస్తూ (చిరంజీవి, శరత్‌బాబు, కమల్‌హాసన్‌లతో జయసుధ అనుబంధం), స్త్రీల మధ్య అత్యంత సహజంగా ఉండ గలిగిన స్నేహబంధాన్ని (ముఖ్యంగా జయసుధ, అత్తగారి మధ్య) మనకు గుర్తు చేస్తూ, అత్యంత ఆలోచనాత్మకమైన సినిమాగా దీన్ని రూపొందించారు. ఇక్కడ కూడ జయసుధ పాత్ర కరుణాస్పదమై మాత్రమే ఉండేది మరో దర్శకుడి చేతిలో. కానీ బాలచందర్ చేతుల్లో మనందరి గౌరవం పొందేలా ఆమె ఉంటుంది. అసాధారణమైన ఇందులోని అత్తగారి పాత్ర ఈనాడు స్త్రీవాదులు చెప్పే ‘స్త్రీల ఐక్యత’కు ప్రోటోటైపా అన్నట్టుంటుంది.

 జయసుధ కృంగిపోయే పరిస్థితులు ఇందులో చాలానే వస్తాయి. కానీ ప్రతి సన్నివేశం నుంచీ మళ్లీ తనని తాను పునరుజ్జీవింపజేసుకునే ఒక సహజమైన ధైర్యం ఆమెలో చూపించి, ఆమె పట్ల మనకు అపారమైన గౌరవం కలిగిస్తారు దర్శకుడు. బహుశా మరో రకం దర్శకుడైతే, తనని ఎంతగానో ప్రేమించే కమలహాసన్‌ను ఆమె జీవిత భాగస్వామిని చేసుకున్నట్టు చిత్రించేవారేమో. కానీ, ఏ మగవాడూ అక్కర్లేకుండా తన జీవితాన్ని కొనసాగించగలనన్న ఆత్మ విశ్వాసాన్ని ఈమెలో చూపించి, ఒక ఆధునిక స్త్రీ ఎలా ఉండగలదో ఆయన మనకు చెప్పారు. చివర అత్తగారు ఆమెకు తోడుగా నిలవడంతో బంగారానికి తావి అబ్బినట్టే అయింది.

‘మరో చరిత్ర’లో మాధవి పాత్రలోనూ, ‘ఆకలిరాజ్యం’లో శ్రీదేవి పాత్రలోనూ ఒక ఆధునిక స్త్రీ జీవితంలోని సంఘర్షణ, దాన్ని ఆమె సంయమనంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న తీరు ఆయనకు స్త్రీల పట్ల ఎంత గౌరవం, నమ్మకం ఉన్నాయో తెలియజేసేవే. సింధుభైరవి, అపూర్వ రాగంగళ్ (తెలు గులో దాసరి గారి ‘తూర్పు పడమర’), ఆడవాళ్లూ మీకు జోహార్లు, జీవితరంగం మొదలైన మరెన్నో సినిమాలు ఆయన స్త్రీలను తను ఎంత వాస్తవిక దృష్టితో, అవగాహనతో చిత్రించారో రుజువు చేస్తాయి. సినిమాల్లో నాయికల ఆహార్యంలో కూడ ఆయన ఎంత సహజత్వాన్ని, హుందాతనాన్ని పాటించడానికి శ్రద్ధ తీసుకునేవారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.బాలచందర్‌గారిని అభిమానించేవారు, గురువుగా భావించేవారూ చాలా మందే ఉన్నారు. కానీ ఆయన నుంచి, స్త్రీలను ఎలా చిత్రించాలో మాత్రం బహుశా ఎవ్వరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!

(Published in 'Sakshi' daily, 24th Dec 2014)
.......................................

Friday, December 26, 2014

ఆయన ఓ చరిత్ర! - బాలచందర్‌కు ప్రముఖుల Tribute

ఆయన ఓ చరిత్ర! - బాలచందర్‌కు ప్రముఖుల Tribute

 ‘‘సినీ రంగంలో ఆయన కన్నా ఎంతో సీనియర్‌నైన నన్ను ఏరికోరి తన అసోసియేట్‌గా తీసుకున్నారు. నన్ను ‘తమ్ముడి లాంటి వాడు’ అనేవారు. తమిళ పత్రికలూ మా గురించి అన్నదమ్ములని ప్రస్తావిస్తూ రాసేవి. ‘భలే కోడళ్ళు’ మొదలు ‘మూణ్రామ్ ముడిచ్చు’ దాకా 16 చిత్రాలకు ఆయన దగ్గర పనిచేశా. రొటీన్‌కు భిన్నమైన చిత్రాలు చేయడం ఆయన గొప్పదనం. అందుకే, ఆయన పేరు అంతగా దేశవ్యాప్తమైంది. ఆయన గ్రేట్ లెజెండ్. మళ్ళీ అలాంటి మేధావి కానీ, అంత క్రియేటివ్ జీనియస్‌లు కానీ సినిమా రంగానికి రావడం కష్టం.’’

- ఈరంకి శర్మ, ‘చిలకమ్మ చెప్పింది’ దర్శకుడు - బాలచందర్‌కు సన్నిహితుడు

 ‘‘బాలచందర్‌గారి మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని  లోటు.’’- కె. రాఘవేంద్రరావు, దర్శకుడు

 ‘‘దక్షిణాది దిగ్గజ దర్శకుల్లో కె. బాలచందర్ ముందు వరుసలో ఉంటారు. సినీ రంగానికి తన దర్శకత్వ ప్రతిభతో కొత్త మార్గం చూపించిన - మార్గదర్శకుడు.’’- మోహన్‌బాబు, నటుడు, నిర్మాత

 ‘‘మధ్యతరగతి జీవిత చీకటి కోణాల్ని అద్భుతంగా తెరకెక్కించిన  ఘనుడాయన.’- త్రివిక్రమ్ , దర్శకుడు, రచయిత

 ‘‘బాలచందర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’- రామ్‌చరణ్, నటుడు

‘‘చిరంజీవిగారితో ‘రుద్రవీణ’లాంటి సందేశాత్మక చిత్రం చేశారు బాలచందర్. ఎందరో నటీనటుల్ని స్టార్స్ చేసిన ఘనులు.’’
- అల్లు అర్జున్, నటుడు

 ‘‘సినీ సీమకు ఆయనో అద్భుతం’’
- బోయపాటి శ్రీను, దర్శకుడు

 ‘‘బాలచందర్ గారి ‘డ్యూయట్’ చిత్రానికీ,‘గుప్పెడు మనసు’ సహా అనేక టీవీ సీరియల్స్‌కూ తెలుగులో డబ్బింగ్ రచన చేసే అదృష్టం నాకు వచ్చింది. నా పని తీరు నచ్చి, ఆయన తన ‘కల్కి’ చిత్రాన్ని తెలుగులోకి స్వీయ నిర్మాణంలో డబ్ చేస్తూ ప్రత్యేకంగా నాకప్పగించారు. అలాగే, కమలహాసన్ ‘అవ్వై షణ్ముఖి’ చిత్రం తెలుగు అనువాదం ‘భామనే సత్యభామనే’ చూసిన బాలచందర్ ఆ చిత్ర శతదినోత్సవంలో వేదికపై అందరి ఎదుటా నన్ను ప్రత్యేకంగా మెచ్చుకొన్నారు. అది నాకు అత్యుత్తమ అవార్డు. ఆయనన్నా, ఆయన సృజన అన్నా నాకు అపార గౌరవం. అలాంటి మహానుభావుడు మళ్ళీ  పుట్టడు!’’
- వెన్నెలకంటి, సినీ రచయిత

(Published in 'Sakshi' daily, 24th Dec 2014)
.........................................

Thursday, December 25, 2014

పదికాలాల... బాలచంద్రికలు (కె.బాలచందర్ పది సినిమాల గురించి...)

కె.బాలచందర్ -  భారతీయ సినిమా సగర్వంగా తలెత్తి చూసే దర్శక శిఖరం. మాలాంటి వాళ్లం పుట్టకముందే ఆయన ప్రముఖ రచయిత, దర్శకుడు. అంటే మాకు ఊహ తెలిసి, సినిమాల మీద మోజు పడేటప్పుటికి బాలచందర్ ఆలోచనలు, సినిమాలు అవుట్‌డేటెడ్ అయిపోయి ఉండాలి. కాని... మొన్న మొన్నటి దాకా ఏ జనరేషన్ ఎమోషన్ - ఆ జనరేషన్ టైమ్‌లోనే పట్టుకుని - మధ్య తరగతి కష్టాలు, యువతరం ఆవేశాలు, ప్రేమ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన అద్భుత చిత్రకారుడు బాలచందర్. తమిళుడైనా - తమిళ, తెలుగు, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా సూపర్‌హిట్ సినిమాలు తీశారు. కాని ఎక్కడా ఏ ప్రాంతం, భాష వాసనా రాదు. మానవత్వం, వాస్తవాల పరిమళాలే వీస్తాయి. కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. మరికొన్ని చాలా ఘాటుగా ఉంటాయి. 50 సంవత్సరాల సినిమా కెరీర్‌లో 101 సినిమాలు - వాటిలో కొన్ని వందల జీవితాలు - ముందు తరాలకి కూడా చేరువయ్యేలా. వాటిలో నుంచి కొన్ని ఎంపిక చేసుకోవడం కష్టమైనదే. వేటిని కాదనగలం? వేటిని వదిలేయగలం? అయినప్పటికీ మనసుపై చెరగని ముద్రవేసిన ఓ పది సినిమాల గురించి...

బొమ్మా - బొరుసా? (1971)


‘సుఖదుఃఖాలు’, ‘సర్వర్ సుందరం’, ‘సంబరాల రాంబాబు’ - ఈ సినిమాలతో బాలచందర్ కథలు తెలుగు ప్రేక్షకులని పలకరించాయి. సుఖదుఃఖాలు (మేజర్ చంద్రకాంత్), సర్వర్ సుందరం - ఆయన రాసిన నాటకాలు. ‘భలే కోడళ్లు’, ‘సత్తెకాలపు సత్తయ్య’ చిత్రాలతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన స్టార్‌డమ్ స్టామినాకి తెలుగులో బాక్సాఫీస్ సాక్షిగా శ్రీకారం చుట్టిన సినిమా ‘బొమ్మా-బొరుసా?’. అంతవరకూ బాలచందర్‌గారి స్క్రిప్టుల్లో నాటకీయత, సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఉండేది. పూర్తిగా వినోదంతో కొంత వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథ ‘బొమ్మా- బొరుసా?’. 1971లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి అత్తా అల్లుళ్ల ఛాలెంజ్‌ల కథలకి ముడిసరుకు. బాలచందర్ సినిమా నేపథ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తారనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. విజయవాడ, నాగార్జున సాగర్ బాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంటుంది.

అహంభావి, గర్విష్టి, డబ్బు మీద ఆశ ఉన్న (అత్తగారికీ (ఎస్. వరలక్ష్మి), ముగ్గురు అల్లుళ్లు (జట్కాబండి అల్లుడు - చలం, మిగిలిన వారు రామకృష్ణ, చంద్రమోహన్) ఎలా బుద్ధి చెప్పారనేది లైన్. సాధారణంగా బాలచందర్ సినిమా ప్రారంభంలోనే ప్రధాన పాత్రలని పరిచయం చేసి, కథలో ఇన్వాల్వ్ అయ్యేలా కథనాన్ని పరిగెత్తిస్తారు. ఫస్ట్ షాట్‌లోనే సినిమా ఎలా ఉంటుందనేది చెప్పడం బాలచందర్ స్టయిల్. దానికి మరో అందమైన సాక్ష్యం - ఈ సినిమా ప్రారంభం. బొడ్లో తాళాల గుత్తి దోపుకున్న ఎస్. వరలక్ష్మి మాట్లాడుతుంటే, పక్కనే బీరువా మీద ఉన్న బొమ్మ తలాడిస్తుంటుంది. అత్త మాటలకి అల్లుడు తందానా తానా అనేది చాలా సింబాలిక్‌గా చెప్పారు. ఎ.వి.ఎమ్. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
 
 అరంగేట్రం (తమిళం) (1973)

 తమిళనాట పెను సంచలనం సృష్టించిన సినిమా ‘అరంగ్రేటం’. బాలచందర్ సినిమాల్లో స్త్రీ పాత్రలని చాలా బోల్డ్‌గా చూపించడం ఈ సినిమాతోనే ప్రారంభమైనందని చెప్పాలి.  ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచార వృత్తిలోకి దిగడమనేది ఈ సినిమా కథాంశం. ప్రమీల కథానాయిక పాత్ర పోషించారు.
 అప్పట్లో ఈ సినిమా పలు వివాదాలకి, విమర్శలకి దారి తీసింది. అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్‌హాసన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జీవిత రంగం’ పేరుతో పి.డి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. హిందీలో ముంతాజ్, రాజేష్‌ఖన్నాలతో ‘అయినా’ అని బాలచందరే స్వయంగా రీమేక్ చేశారు.
 
అంతులేని కథ (1976)

 బాలచందర్ కీర్తి తెలుగునాట పతాక స్థాయికి చేర్చిన సినిమా ‘అంతులేని కథ’. ఓ వర్కింగ్ ఉమెన్ జీవితంలోని ఒడిదుడుకులని, ఆశలని, నిరాశలని చాలా హృద్యంగా చిత్రీకరించారు బాలచందర్.‘మేఘ దాకా తారా’ అనే అస్సామీ చిత్రం ప్రభావం దీనిపై ఉందని కొంతమంది విమర్శకులు అంటుంటారు. జయప్రదకి విశేషంగా పేరు తెచ్చి పెట్టిన ఈ సినిమాలో ఎందరో మహిళా ఉద్యోగినులు తమ వేదనని వెదుక్కున్నారు.మొదట సుజాత హీరోయిన్‌గా 1974లో ‘అవళ్ ఒరు తోడర్ కథై’ పేరుతో ఈ సినిమా తీశారు. హిందీలో రేఖతో తాతినేని రామారావు ‘జీవన్‌ధార’, కన్నడంలో సుహాసినితో బాలచందరే స్వయంగా ‘బెంకెయిల్లి అరిడ హూవు’ (అగ్నిలో పుట్టిన పువ్వు) పేరిట రీమేక్ చేశారు. బెంగాలీలో కూడా ‘కబిత’ పేరుతో వచ్చింది. ఈ సినిమా ముగింపులో, పబ్లిసిటీలో ‘ఇంకా ఉంది’ అని ప్రచారం చేయడం - ప్రేక్షకులు సరికొత్తగా ఫీలయ్యారు. ఈ చిత్రం మీద ఆసక్తి రెట్టింపయ్యింది.
 
 అపూర్వ రాగంగళ్ (1975)

తండ్రి మీద ఓ యువతి మనసు పడుతుంది. ఆ తండ్రి కొడుకు ఆ యువతి తల్లిపై ప్రేమ పెంచుకుంటాడు. విచిత్రమైన ఈ పొడుపు కథలాంటి కథతో సినిమా తీయాలంటే ఆ డెరైక్టర్‌కి ఎన్ని గట్స్ ఉండాలి? ఆ ధైర్యం బాలచందర్‌కి ఉంది కాబట్టే - ఆయన అజరామరమైన దర్శకుడయ్యారు. 1975లో వచ్చిన ఈ సినిమా చాలా చర్చనీయాంశమైంది. సామాజిక కట్టుబాట్లని సవాల్ చేసింది.
 శ్రీవిద్య, కమల్‌హాసన్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ పరిచయమయ్యారు.
 ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ కథాంశం కొత్తగా ఉంటుంది. అంతే కాదు - స్వతహాగా రచయిత అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు తొలిసారి రీమేక్ చేసింది ఈ సినిమానే (తూర్పు-పడమర). జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకుంది ఈ ‘అపూర్వ రాగంగళ్’. బాలచందర్ స్వయంగా రాజ్‌కుమార్, కమల్‌హాసన్, హేమమాలిని, పద్మిని కొల్హాపురిలతో ‘ఏక్ నయా పమేలీ’ పేరుతో రీమేక్ చేశారు.
 
ఆకలి రాజ్యం (1981)

80వ దశకంలో యువతరం ముందున్న ప్రధాన సమస్య ఆకలి, నిరుద్యోగం - మరోవైపు కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడం.
 అప్పటికే బాలచందర్ ఆడవాళ్ల కన్నీళ్లు (అంతులేని కథ, ఇది కథ కాదు, ఆడవాళ్లు మీకు జోహార్లు) కుర్రాళ్ల కలలు (మన్మథలీల, మరోచరిత్ర, అందమైన అనుభవం) తెరపై చూపించేశారు. రగులుతున్న సమస్యల్ని తనదైన కోణంలో చెప్పాలనుకున్నారు. అందుకు దేశ రాజధాని ఢిల్లీనే నేపథ్యంగా ఎంచుకున్నారు. వ్యవస్థ మీద ఎంత వ్యంగ్యంగా చెప్పాలో అంత వ్యంగ్యంగా చెప్పారు. ఓ సంగీత విద్వాంసుడి కొడుకు పొట్టకూటి కోసం క్షురకవృత్తి చేపట్టడం పరాకాష్ట. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్‌హాసన్ ఆశువుగా చెప్పిన కవితలు, ప్రసిద్ధ గాయకుడు పి.బి. శ్రీనివాస్ రాసిన హిందీ పాట... బురదలో పడ్డ ఆపిల్‌ని కడుక్కుని తినడం - ఒకటా, రెండా.. ఎన్నెన్నో గుర్తుండిపోయే అంశాలు. కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 1981 జనవరి 9న ఈ సినిమా విడుదలయితే, దీనితోపాటు ఎన్టీఆర్-రాఘవేంద్రరావుల ‘గజదొంగ’, జనవరి 14న కృష్ణ-రాఘవేంద్రరావుల ‘ఊరికి మొనగాడు’ విడుదలయ్యాయి. ఆ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రెండింటినీ తట్టుకుని ఈ సినిమా ఘన విజయం సాధించిందంటే ‘ఆకలిరాజ్యం’ పొటెన్షియాలిటీ అర్థం చేసుకోవచ్చు.
 
ఎరడు రేఖగళ్ (కన్నడ) (1984)

తన ప్రియురాలే తనపై అధికారిణిగా వస్తే... ఆమెని వదిలి, మరొకరిని వివాహమాడిన అతని పరిస్థితి ఏమవుతుంది?
 ‘ఇరుకోడగళ్’ అనే పేరుతో షావుకారు జానకి, జెమినీ గణేశన్, జయంతిలతో 1969లో కె. బాలచందర్ తమిళంలో తీసిన సినిమా ఇది.ఈ కథాంశంతో తెలుగులో ‘కలెక్టర్ జానకి’ సినిమా వచ్చింది.బాలచందర్ తమిళ-తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా, 1983లో ‘బెంకెయిల్లి అరడ హొవు’ చిత్రంతో కన్నడంతో ఎంటరయ్యారు. ఆ సినిమా సక్సెస్‌తో - 1984లో శ్రీనాథ్, సరిత, గీతలతో ‘ఎరడు రేఖగళ్’ (రెండు రేలు) రూపొందించారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మాటల్లో చెప్పలేం. హిందీలో అమితాబ్ ‘సంజోగ్’ చిత్రానికి మూలం ఇదే. అంటే బాలచందర్ ఓ కథ రాస్తే, అది ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. భారతదేశమంతటా ఆ కథ భావోద్వేగం కలిగిస్తుందనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ.
 
ఏక్ దూజ్ కే లియే (1981)

 భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రం ‘ఏక్ దూజ్ కే లియే’ మన తెలుగు సూపర్‌హిట్ ‘మరో చరిత్ర’ని హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. సినీ లెజెండ్ ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. తెలుగువారు, తమిళుల మధ్య ఎక్కువ అభిప్రాయభేధాలుండవు. కాని హిందీ-తమిళ భాషల మధ్య రాజకీయ నాయకుల పుణ్యమాని చాలా దూరం సృష్టించి ఉంది.
 అందుకే హిందీలో ఈ చిత్రం మరింత జనరంజకమయ్యింది. ప్రేమకి భాష అడ్డుకాదని వెండితెరపై ఒట్టేసి, చాలా బలంగా చెప్పిన సినిమా ఇది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారిని హిందీకి తీసుకెళ్లి, జాతీయ అవార్డుతో ఆయన ప్రతిభ ఏంటో దేశానికి చాటి చెప్పిన సినిమా ఇది.
 ఈ సినిమాలోని విరహం, విషాదం మబ్బు తునకలా గుండెని తడుపుతూనే ఉంటుంది. తెలుగులో విషాదాంతమైన ముగింపుని హిందీలో సుఖాంతం చేస్తే ఎలా ఉంటుందని చాలా చర్చలు జరిగాయి. రెండు రకాల క్లైమాక్స్‌లు షూట్ చేసి, చివరికి ట్రాజెడీనే ఎంచుకున్నారు. అందుకే ‘దేవదాసు’లా ఇదో అజరామరమైన ప్రేమకథ. ఇప్పటికీ ప్రేమకథల్లో (తొలిప్రేమ) బాలు యే హీరో.
 
తన్నిరు - తన్నిరు (1981)

మనిషికి అత్యవసరమైన వాటిల్లో నీరు ముఖ్యం. గాలి, నీరు అనేవి ప్రకృతి ఇచ్చేవి. కాని వాటిని కూడా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిస్తే సామాన్యులు ఎలా నలిగిపోతారనేది ‘తన్నిరు-తన్నిరు’ కథాంశం. ఓ పాపులర్ తమిళ నాటకం ఆధారంగా బాలచందర్ దీనిని తెరకెక్కించారు. 1981లో సరిత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ భారతాన్ని కళ్లకి కట్టినట్లు చూపించింది. యధావిధిగానే ఈ సినిమా సంచలనం రేకెత్తించింది. జాతీయ అవార్డులతో పాటు - చాలా ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. తెలుగులో అనువాదమైంది. భారతీయ వంద ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమాని ఐబిఎన్ ఛానెల్ పేర్కొంది
 
సింధు భైరవి (1985)

కళాకారుడికి ఎప్పుడూ ప్రేరణ అవసరం. అది ప్రకృతి నుంచి లభించవచ్చు. లేదా - ఎవరి ప్రేమ నుంచో దొరకొచ్చు. ఆ రెండోది అయితేనే సమస్య వస్తుంది. ఓ కర్ణాటక సంగీత విద్వాంసుడు తన ప్రియురాలిని స్ఫూర్తిగా తీసుకుని రాణిస్తుంటాడు. ఆమె దూరం కావడంతో సంగీతానికి దూరమవుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇద్దరు స్త్రీలు చేసిన ప్రయత్నం ఈ సినిమా. సుహాసిని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాగే ఇళయరాజా, చిత్రాలు కూడా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది.
 
రుద్రవీణ (1988)

‘ఇది కథ కాదు’ ‘47 రోజులు’ - కె. బాలచందర్ మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన చిత్రాలు. ఆ రెండింట్లో నెగెటివ్ పాత్రలు చేశారు చిరంజీవి. అన్నట్లు ‘ఆడవాళ్లూ - మీకు జోహార్లు’లో అతిథిపాత్రలో తళుక్కున మెరిశారు. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించినప్పుడు - దర్శకుడిగా వాళ్ల ఫస్ట్ ఛాయిస్ బాలచందర్‌గారే! అన్నాహజారే జీవితం స్ఫూర్తిగా, ‘రుద్రవీణ’ కథని మలిచారు బాలచందర్. మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని చెప్పడంతో పాటు - కళ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలనే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్‌దత్ అవార్డ్ కైవసం చేసుకుంది ‘రుద్రవీణ’. అంతే కాదు - తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరిలో ‘రుద్రవీణ’ స్ఫూర్తితో యువకులందరూ కలిసి ఊళ్లోవాళ్ల తాగుడు మాన్పించి, ఆ డబ్బుతో లైబ్రరీ, స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ప్రభావితం చేశారనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?
- By Thota Prasad 
(Film Writer and Cine analyst)

(Published in 'Sakshi' daily, 24th Dec 2014)
......................................................

Sunday, December 21, 2014

గురితప్పని... ‘పీకే’ 47


గురితప్పని... పీకే 47

‘పీకే’... ఇటీవలి కాలంలో దేశమంతటా అందరి నోటా నానుతున్న పేరు ఇది. కించిత్ కథ కానీ, కనీసం పాత్రల వివరాలు కానీ వెల్లడించకుండా అంతా గుట్టుగా అట్టిపెడుతూనే, విశేష ప్రచారం పొందిన సినిమా అంటే ఇదే. హీరో ఆమిర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, నిర్మాత విధు వినోద్‌చోప్రా - ఇలా ముగ్గురు దిగ్దంతుల కలయికలో వస్తున్న సినిమా అయినప్పుడు ఆ మాత్రం హల్‌చల్ సహజమే. రైలు పట్టాల మధ్య నగ్నంగా, ట్రాన్సిస్టర్‌ను అడ్డుపెట్టుకొని నిలబడ్డ ఆమిర్‌ఖాన్ ఫస్ట్‌లుక్ ఫోటో నుంచి ఇవాళ్టి దాకా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడమే తప్ప తగ్గింది లేదు. మరి, ఇంతగా జనం నోట నానిన ‘పీకే’లో అసలింతకీ ఏముంది!
 
2014 దాదాపుగా ముగింపునకు వచ్చిన వేళ ఈ ఏడాది కాలంలో విడుదలైన హిందీ చిత్రాలను గమనిస్తే,  ఏ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందన్న దగ్గరే చర్చ మొదలై, అక్కడే ఆగిపోతోంది. ఎన్ని లక్షలమంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది, ఎంత వినూత్న కథాంశంతో వచ్చిందన్న చర్చ జరగడానికే అవకాశం లేకుండా తామరతంపరగా సినిమాలొచ్చాయి. తీరా, ఏడాది చివరలో ఒక్కసారిగా వెండితెరపై వచ్చిన కుదుపు - ‘పీకే’. కథాంశం ఎంతో సమకాలీనమైనదే కాక, అంతకు అంత ఆలోచించాల్సిన విషయం కావడం విశేషం.
 
అంతరిక్ష పరిశోధనలో భాగంగా గ్రహాల పైకి వ్యోమనౌకల్ని పంపి, జీవరాశి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఒక గ్రహాంతరవాసి (ఆమిర్‌ఖాన్) మన భూమండలం మీదకు వస్తే? మనిషికే కాక మనసుకు కూడా దుస్తుల ముసుగులు లేని అలాంటి వ్యక్తికి ఇక్కడి మోసాలు, అబద్ధాలు ఎదురైతే? తన వ్యోమనౌక తాలూకు రిమోట్‌గా పనికొచ్చే పచ్చల పతకాన్ని ఇక్కడి జనం కొట్టేస్తే? సరిగ్గా అదే జరుగుతుందీ సినిమాలో. దుస్తులు కానీ, భాష కానీ లేని అతనెలా భాష నేర్చాడన్నది ఆసక్తికరమనిపిస్తుంది.

 
పోయిన పచ్చల పతకాన్ని వెతుక్కుంటూ తిరిగే అతనిలోని మంచితనం, అతడు అడిగే అమాయకపు ప్రశ్నలు చూసి, ‘పీకే’ హై క్యా (తాగి ఉన్నావా) అని అందరూ అడుగుతుంటారు. ‘పోయిన వస్తువు దక్కాలంటే... దేవుడే దిక్కు’ అన్నప్పుడు అతను మనస్ఫూర్తిగా దేవుడి కోసం పడే ఆరాటం కథను మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. ఈ క్రమంలో అతనికి జగజ్జనని అలియాస్ జగ్గు (అనుష్క శర్మ) అనే టీవీ జర్నలిస్టు తారసపడుతుంది. ఒకరు వినాయకుడు, మరొకరు లక్ష్మీదేవి, ఇంకొకరు శంకరుడు - ఇలా ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి ప్రార్థించడం పీకేకు ఒక విచిత్రంగా కనిపిస్తుంది.
అలాగే, మతాల సారం ఒకటేననీ, అందరి దేవుడూ ఒకడేననీ చెప్పే ఈ దేశంలో మనిషికో మతం ఉండడం, ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన విశ్వాసం కావడం లాంటివి పీకేను గందరగోళానికి గురి చేస్తాయి. కట్టెదుట కనిపించని దేవుడు కరుణించకపోవడంతో ‘కనిపించుట లేదు’ అంటూ దేవుళ్ళ బొమ్మలు ముద్రించి పంచే పీకే ఆసక్తిరేపే న్యూస్‌స్టోరీ అవుతాడని భావిస్తుంది జగ్గు. అతని వెంట పడి, అసలు కథ తెలుసుకుంటుంది. ఇంతలో అందరూ ఆరాధించే ‘గాడ్ మన్’ (సౌరభ్ శుక్లా) దగ్గర ఆ పచ్చల పతకం ఉన్నట్లు గ్రహిస్తారు.

ఇక అక్కడ నుంచి పీకే తన గ్రహానికి తిరిగి వెళ్ళేందుకు తోడ్పడే ఆ పతకాన్ని తిరిగి సంపాదించుకొనే ప్రయత్నంతో సినిమా నడుస్తుంది. జగ్గు ప్రేమకథ... గ్రహాంతరవాసి అయిన పీకెలో చిగురించే అనురాగం... దేవుడి మీద మనుషుల్లో ఉన్న భక్తిని భయంగా మార్చి, వారి నమ్మకాలను వ్యాపారంగా మార్చుకొనే గాడ్‌మన్ల వ్యవహారం... టీవీ న్యూస్ చానల్‌లో సాగే డిస్కషన్ షో... ఇలా సాగుతుంది సినిమా. ఆఖరుకు పీకే ఆ పతకం ఎలా సాధించాడు, అతని అనురాగం ఏమైంది లాంటివన్నీ ఆకట్టుకొనే రీతిలో నడుస్తాయి.
 
నిజం చెప్పాలంటే, ఈ సినిమాకు ఒకరు కాదు - ఇద్దరు హీరోలు. ఆమిర్ కాక, రెండో హీరో ఎవరయ్యా అంటే - దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. ‘మున్నాభాయ్ ఎం.బి. బి.ఎస్’లో వైద్య విధానాన్ని ప్రశ్నించి, ‘లగే రహో మున్నాభాయ్’లో గాంధీగిరిని ప్రస్తావించి, ‘3 ఇడియట్స్’లో విద్యావిధానాన్ని నిలదీసిన హిరానీ ఇప్పుడు దేశంలో ‘భగవంతుడికి మేనేజర్లు’గా చలామణీ అవుతున్న గాడ్‌మన్లపై కెమేరా గురిపెట్టారు. ఈ చిత్రం అతని చేతిలో ‘ఏకె 47’.
 
దేవుడనే భావన, నేటి సమాజంలో దైవస్వరూపులుగా తమను తాము ప్రచారం చేసుకుంటున్న సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తల వైఖరిని హిరానీ చర్చనీయాంశాలు చేశారు. మతం, విశ్వాసాల గురించి మాట్లాడడమే పాపం... దుస్సహమైపోతున్న సమకాలీన సందర్భంలో ఇది కత్తి మీద సాము. అయినా, అనేక అంశాలను చాలా నేర్పుగా, వ్యంగ్యాత్మకంగా ప్రస్తావించారు దర్శక, రచయితలు. సున్నితమైన మతపరమైన అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ పాటించారు. ఈ క్రమంలో డైలాగ్‌‌స సెటైరికల్‌గా వినోదం అందిస్తూనే, వివేచనను మేల్కొల్పుతాయి.

ఈ కథను ఆలోచించడానికీ, ఆలోచించినదాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా నైసుగా తెరపై చెప్పడానికి హిరానీ చాలా శ్రమించారని అర్థమవుతుంది. అంత శ్రమ ఉంది కాబట్టే, ‘3 ఇడియట్స్’ తరువాత అయిదేళ్ళ విరామంతో వచ్చిన హిరానీ సినిమా వచ్చినా, జనం సీట్లకు అతుక్కుపోయి చూస్తారు. కథలోని ప్రతి పాత్రకూ ఒక ప్రాధాన్యం... ప్రతి సంఘటనకూ కథలో ఒక లింకు కుదిరేలా ఈ స్క్రిప్టును అల్లుకోవడం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. చక్కటి స్క్రీన్‌ప్లే పాఠం అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో జిగిబిగి కొంత తగ్గిందేమో అన్న అనుమానం కలిగినప్పటికీ... ప్రేక్షకులు సంతృప్తిగా హాలులో నుంచి బయటకు వస్తారు. పరేశ్ రావల్ నటించిన ‘ఒ మై గాడ్’ (రానున్న ‘గోపాల గోపాల’కు మాతృక)తో కొద్దిపాటి పోలిక కనిపించినా, దీని అనుభూతి వేరు.
 
వాస్తవానికి, బాక్సాఫీస్ ఫార్ములా శంక మనసును పట్టి పీడిస్తున్నప్పుడు దాని నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులభం కాదు. కానీ, ప్రేక్షకుల తెలివితేటల్నీ, అవగాహననూ, అభిరుచినీ తక్కువగా అంచనా వేయడమనే మానసిక దౌర్బల్యం నుంచి బయట పడి, దర్శక - నిర్మాతలు సినిమా తీస్తే ఎంత మంచి ఇతివృత్తాలు తెరపైకి వస్తాయో చెప్పడానికి ‘పీకే’ ఒక ఉదాహరణ. ఈ సినిమా చూశాక బుద్ధిజీవులు ఈ ‘పీకే’తో ప్రేమలో పడతారు. దర్శక, రచయితల నిబద్ధత మీద, నమ్మి ఈ కథ కోసం ప్రాణం పెట్టిన ఆమిర్ లాంటి నట, సాంకేతికుల మీద గౌరవం పెరుగుతుంది.

ఔత్సాహికులకే కాదు... వసూళ్ళే పరమావధిగా ఆరు పాటలు మూడు ఫైట్ల వరదలో కొట్టుకుపోతున్న అన్ని భాషల్లోని అనేకమంది సీనియర్ సినీ పెద్దలకూ ‘పీకే’ తాజా పాఠం అనిపిస్తుంది. ఏళ్ల తరబడి మనం తీస్తున్న, చూస్తున్న సినిమాల్లో ఇలాంటివి కదా రావాల్సిందనే భావన కలుగుతుంది. అందుకే, మంచి కథ, కథనం, ఐటమ్ సాంగులు -ఫైట్లు లేని ఆహ్లాదకరమైన వినోదం ఆశించేవారికి ‘పీకే’ ఒక మరపురాని జ్ఞాపకం. వినోదం అందిస్తూనే, మన ప్రవర్తన మీద మనకే ఆలోచన రేపే అనుభవం. ఏ సృజనాత్మక కృషికైనా అంతకు మించి పరమార్థమేముంటుంది!


 - రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 20th Dec 2014)
........................................

Saturday, December 20, 2014

పుష్కరాలకు... పాట చేద్దామనుకున్నాం! - భాస్కరభట్ల

పుష్కరాలకు...  పాట చేద్దామనుకున్నాం!










చక్రి మరణం నాకు
ఏ మాత్రం నమ్మశక్యంగా
లేదు. అతను నాకు ఎంత ఆత్మీయుడంటే, గీత రచయితగా
 ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణమే అతను.
చక్రి కెరీర్‌లో అతని సంగీత దర్శకత్వంలో అత్యధిక పాటలు
రాసిన రచయితను నేనే. అలాగే, గీతరచయితగా నా కెరీర్‌లో
నా పాటలకు అత్యధికంగా సంగీతం అందించిన
మ్యూజిక్ డెరైక్టర్ చక్రి. ‘ఇట్లు... శ్రావణి - సుబ్రహ్మణ్యం’తో
మొదలైన మా కాంబినేషన్ ఇప్పటి దాకా ఆగకుండా సాగుతోంది.

వ్యక్తిగతానికి వస్తే, చక్రితో గడిపిన క్షణాలు, జరిగిన సంగతులు
అన్నీ ఇన్నీ కావు. నేను కారు కొనుక్కోవడానికి కారణం - చక్రి.
గీత రచయితగా తొలి రోజుల్లో నేను టూవీలర్ మీద తిరిగేవాణ్ణి.
ఒకసారి హైదరాబాద్‌లో జోరున వర్షం. తడిసిపోయిన నేను
గణపతి కాంప్లెక్స్ దగ్గర చెట్టు కింద నిలుచున్నా. అయినా
వర్షం ధాటికి తడిసిపోతున్నా. ఆ సమయంలో అటు నుంచి
తన ‘మ్యాటిజ్’ కారులో వెళుతున్న చక్రి బండి ఆపి, నన్నూ
 కారులో రమ్మన్నాడు. నా టూవీలర్ అక్కడ వదిలేసి వెళ్ళడం
 ఇష్టం లేక, వద్దన్నాను. ఆ తరువాత నేను కలిసిన వెంటనే
 చక్రి, ‘నువ్విక కారు కొనుక్కోవాలి’ అంటూ బలవంతపెట్టాడు.
అలాగే, పాట రాసినందుకు నాకివ్వాల్సిన పారితోషికం డబ్బులు
తన దగ్గరే దాచి ఉంచి, కారు కొనుక్కోవడానికి తగినంత
పోగయ్యాక ఇచ్చాడు. అలా నేను నా మొదటి కారు కొన్నది
చక్రి వల్లే! అలాగే, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది కూడా చక్రే!
 స్టైల్స్ అంటే ఎలా ఉండాలి, ఏమిటనేది తనే నాకు చెప్పాడు.
 నన్ను ప్రత్యేకంగా సికింద్రాబాద్‌లోని ‘స్టైల్ జోన్’కు
తీసుకువెళ్ళి, అన్నీ కొనిపెట్టాడు. అదీ అతనిలోని స్నేహశీలత.

 చక్రిలోని గొప్ప గుణం ఏమిటంటే, తాను ఎదుగుతూ
పక్కవాళ్ళను కూడా ఎదగనిచ్చే వ్యక్తి. పక్కవాళ్ళ
ఎదుగుదలను చూసి అమితంగా సంతోషించే వ్యక్తి.
నా రచనలు అతనికి ఎంత ఇష్టమంటే, కెరీర్ తొలి
రోజుల్లో ప్రతి పాటకూ రచయితగా నన్నే రికమెండ్
చేసేవాడు. కానీ, ఇతరులకు అది తప్పుగా అనిపిస్తుందేమోనని
ఒక దశకు వెళ్ళాక నేనే వద్దన్నాను. నాకు నేనుగా
ఎదగాలనుకుంటున్నా అన్నా. అతను నా మాటను
అపార్థం చేసుకోలేదు. నా మనసులోని భావం గ్రహించాడు.
చివరకు దర్శక, నిర్మాతలు వచ్చి, పాటలు నాతోనే
రాయించమని అడిగినప్పుడు, ‘వాళ్ళే నిన్ను కోరుకొనే
స్థితికి ఎదిగావు’ అంటూ ఆనందించాడు. అలాంటి
వ్యక్తులు ఇవాళ అరుదు.

 గమ్మత్తేమిటంటే, గోదావరి తీరం నుంచి వచ్చిన నేను
గోదావరి నది మీద రాసిన కవిత అంటే చక్రికి మహా
ఇష్టం. అసలు ఆ కవితే మమ్మల్ని తొలిరోజుల్లో బాగా
సన్నిహితం చేసి, కలిపింది. వచ్చే ఏడాదిలో గోదావరి
 పుష్కరాలు వస్తున్నాయనీ, ఏదైనా మంచి పాట చేద్దామనీ
 ఇటీవలే నాతో అన్నాడు. అందుకు సిద్ధమవుతున్నాం.
రేపో, ఎల్లుండో ఆ పని మీద కలవాల్సింది. ఇంతలోనే
అనుకోని ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. సినీ
పరిశ్రమకనే కాదు... నాకు వ్యక్తిగతంగా కూడా
చక్రి లేని లోటు ఎన్నడూ తీరనిదే!

 - భాస్కరభట్ల ( సినీ గీత రచయిత - చక్రికి సన్నిహితుడు)

ఇంటర్వ్యూ - రెంటాల జయదేవ

..................................

Thursday, December 18, 2014

మత్సరం లేని మంచి మనిషి చక్రి - సింగర్ కౌసల్య

మత్సరం లేని మంచి మనిషి










సంగీత దర్శకుడు
 చక్రి చనిపోయారన్న
 వార్త నాకు ఇప్పటికీ 
షాకింగ్ గానే ఉంది. వాళ్ళింట్లో 
వాళ్ళందరికీ నేను బాగా సన్నిహితురాలిని.
 చక్రి గారి అక్కను నేను కూడా వాణి అక్క 
అనే పిలుస్తాను. సోమవారం ఉదయం చక్రి 
గారి శ్రీమతి శ్రావణి నాకు ఫోన్ చేసి, అపోలో 
హాస్పిటల్‌లో ఉన్నా మంటూ వెక్కివెక్కి 
ఏడుస్తూ చెప్పేసరికి నాకు ఒక్క క్షణం 
విషయం అర్థం కాలేదు. హార్ట్‌బీట్ 
లేదని చెప్పారంటూ శ్రావణి చెప్పిన
 మాటతో హడావిడిగా అపోలోకు 
బయల్దేరా. ఈ లోగా చక్రి ఇక లేరనే
 వార్త తెలిసింది. నిశ్చేష్టురాలినయ్యా. 
అది నిజం కాకుండా ఉంటే బాగుండనుకున్నా.

 నిజానికి, గాయనిగా నన్ను 

వెండితెరకు పరిచయం చేసింది 
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గారు 
- ‘నీ కోసం’ సినిమాతో. ఆయన చిత్రాలు
 మూడింటికి పాడాక, చక్రి తన 
తొలి చిత్రం ‘బాచి’లో పాడించారు. 
గమ్మత్తేమిటంటే, ఆ తరువాత నుంచి 
ఇటీవల మూడేళ్ళ క్రితం దాకా చక్రి 
గారి సినిమాలన్నిటిలో నేను పాడా. 
ఆయన సంగీతంలో పాడిన ‘మళ్ళి 
కూయవే గువ్వా...’ పాట నా కెరీర్‌కు
 పెద్ద బ్రేక్ అయింది. ఇప్పటికి నేను 
400 దాకా పాటలు పాడితే, అందులో
 300 చక్రి స్వరసారథ్యంలో పాడినవే. 
పైగా, ఆయన సినిమాలో ఒక్క పాట 
పాడినా, అది పెద్ద హిట్టయ్యేది. 
అలాగే, గాయకుడు హరిహరన్ గారి 
కాంబినేషన్‌లో నేను పాడిన 
పాటలన్నీ చక్రి స్వరపరచినవే.

 వీలైనంత వరకు స్థానికులను 

ప్రోత్సహించాలన్నది చక్రి గారి 
స్థిరాభిప్రాయం. ఆ క్రమంలో 
ఆయన ఎంతోమంది గాయకులనూ, 
గీత రచయితలనూ పరిచయం 
చేశారు. నిజానికి, నేను ఆయనకు 
అభిమాన గాయనిని. ‘నేను నీ 
ఫ్యాన్‌ను’ అని ఎప్పుడూ అనేవారు.
 అయినా, ఒక దశలో మరింత 
మంది కొత్తవాళ్ళను ప్రోత్సహించ
 దలిచి, నాతో పాడించడానికి కొంత 
విరామం ఇచ్చారు. ఆ మాటే 
నాకూ చెప్పారు. అందుకే, 
‘సింహా’, ‘శ్రీమన్నారాయణ’ తరువాత 
మూడేళ్ళుగా ఆయన చిత్రాల్లో నా 
గొంతు వినిపించలేదు. అయినప్పటికీ, 
మా మధ్య స్నేహానికి అది అడ్డు
 కాలేదు. ఒక సందర్భంలో ఆయనకు 
ఎక్కువ పాటలు పాడినా, ఇప్పుడు 
పాడకపోయినా ఆ తేడాలేమీ 
చూపించకుండా ఎప్పటి లానే 
ఉండడం చూసి, ఆ విషయంలో 
ఆయన నన్నెంతో అభిమానించారు... 
ఆ మాటే నాతోనూ అన్నారు.

  అలాగే, నేను స్వయంగా సంగీత 

దర్శకురాలినైనా ఆయన ఈర్ష్యపడలేదు. 
మత్సరం చూపలేదు. ఆయనది 
చాలా కూల్ మనస్త్తత్త్వం. స్నేహితులైన
వారిని ఎవరినీ వదులుకోలేని మంచి గుణం. 
ఈ డిసెంబర్ 31న చేసే షోలో 
పాడాల్సిందిగా కోరారు. సరేనన్నాను. 
మొన్న ‘మేము సైతం’ కార్యక్రమంలో
 కలిసినప్పుడు ఆయన కొద్దిగా 
ఆయాసపడుతుండడం చూశా. 
కొద్దిగా డిప్రెషన్‌లో కూడా 
ఉన్నట్టనిపించారు. భోజనానికి 
అందరం వెళుతున్నామన్నా 
రాలేదు. తిండి తగ్గించి, ఉడకబెట్టిన 
కాయగూరలు తింటున్నాన న్నారు. 
ఇంతలోకే ఇలా జరిగింది. ఆయన 
మృత దేహం చూసేంత వరకు 
ఈ వార్త నిజం కాకుండా ఉంటే 
ఎంత బాగుండు అనుకున్నా. 
కానీ, దేవుడు నిర్దయుడు. 
మంచివాళ్ళను ముందే తీసుకెళ్ళిపోతాడు.

  (సంభాషణ - రెంటాల)

.........................................

Wednesday, December 17, 2014

► జగమంత కుటుంబం చక్రి ది! - ఆర్.పి. పట్నాయక్



మళ్లి కూయవా గువ్వా!చక్రీ... ఇంత ట్రాజెడీ ట్యూనా! We Miss You











చక్రిదీ, నాదీ చిరకాల స్నేహం. 
సినిమాల్లోకి
రావడాని కన్నా ముందే మా 
ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. హైదరాబాద్‌లోని 
సోమాజీగూడ ప్రాంతంలో ఒక రికార్డింగ్ స్టూడియో ఉండేది. అక్కడ 
మా ఇద్దరికీ తొలి పరిచయమైంది. అతను గీత రచయితగా ఉన్నప్పుడు 
పాటలు రాసేవాడు. మా ఇద్దరి సినిమా కెరీర్లు కూడా దాదాపు ఒకటే 
సమయంలో మొదలయ్యాయి. పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా చక్రికి 
తొలి అవకాశం వచ్చిన రోజు కూడా నాకు బాగా గుర్తే. ముందుగా నాకు 
‘చిత్రం’ (2000) సినిమాతో అవకాశం వచ్చింది. ఆ సినిమా 
విడుదలైనప్పుడు దిల్‌సుఖ్ నగర్‌లోని గంగా థియేటర్‌లో మేమందరం 
వెళ్ళి, ‘చిత్రం’ షో చూస్తున్నాం. ఇంతలో, చక్రికి ఫోన్ వచ్చింది. పూరి 
జగన్నాథ్ ‘బాచి’ (2000) సినిమాకు ఛాన్స్ వచ్చింది. అంతే! ‘జగనన్న 
నుంచి ఫోన్ వచ్చింది. నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. వెళ్ళి కలవాలి’ 
అంటూ సినిమా సగంలోనే వెళ్ళాడు. అలా అతని సినీ సంగీత ప్రస్థానం 
మొదలైంది.

తెలుగు సినీ సంగీతంలో మా ఇద్దరి కెరీర్లూ సమాంతరంగా సాగాయి.
 పోటాపోటీగా సినిమాలు చేశాం. అయితే, ఒకరి అవకాశాలను మరొకరు
 చేజిక్కించుకోవడం లాంటి అవాంఛనీయ ధోరణి ఎప్పుడూ లేదు. 
ఎప్పటికప్పుడు మంచి సంగీతంతో, మంచి పాటలతో ఆకట్టుకోవాలని 
ప్రయత్నించేవాళ్ళం. పైగా, మా ఇద్దరికీ వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగా
 చాలా మంచి అనుబంధం ఉండేది. నన్ను అన్నయ్యగా భావిస్తే, తను 
నాకు తమ్ముడనుకొనేవాణ్ణి. పైగా, 2000 ప్రాంతంలో మా ఇద్దరి 
లక్ష్యం ఒకటే - సినీ సంగీత పరిశ్రమను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లో
 స్థిరపడేలా చేయాలని! అందుకోసం వీలైనంత కృషి చేశాం. ఇక్కడ 
వీలైనంత ఎక్కువమంది గాయనీ గాయకులనూ, సంగీత కళాకారులనూ
 పరిచయం చేశాం. స్థానికులకు అవకాశాలిచ్చాం. పైగా, రవివర్మ, కౌసల్య, 
ఉష లాంటి చాలా మంది యువ గాయనీ గాయకులు మా ఇద్దరి సంగీతంలో 
రెగ్యులర్‌గా పాటలు పాడేవారు.

సంగీతం అందించాలంటూ తన దగ్గరకు వచ్చినవాళ్ళను అతను ఎప్పుడూ
 నొప్పించేవాడు కాదు. ‘నాకు పని వచ్చింది. అది బాగా చేయాలి’ అన్నదే 
అతని దృష్టి అంతా! అందుకే, సినిమాలతో నిత్యం బిజీగా ఉండేవాడు. 
అచిరకాలంలోనే 90 పైచిలుకు సినిమాలు పూర్తి చేయగలిగాడు.

సంగీతపరంగా చక్రి బాణీల్లో అరబిక్ సంగీత స్పర్శ, సంగీత దర్శకుడు 
ఏ.ఆర్. రహమాన్ ప్రభావం ఉండేది. అందుకనే, అతను అంత మాస్ 
బాణీలు, బీట్ పాటలు ఇచ్చేవాడు. అదే సమయంలో చక్కటి శ్రావ్యమైన 
పాటలూ కూర్చాడు. ‘ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’ చిత్రంలో అతను
 కూర్చిన మెలొడీ పాటలు ఆల్‌టైమ్ హిట్. కెరీర్‌లో జోరు కాస్తంత
 తగ్గినప్పుడల్లా మళ్ళీ ఒక సూపర్‌హిట్ సినిమా ఆల్బమ్‌తో ముందుకు 
దూసుకొచ్చేవాడు.

చక్రి చాలా బోళామనిషి. గోరంత పొగిడినా, కొండంత సంతోషించే మనిషి. 
ఎప్పుడూ ఎవరి గురించీ చెడు మాట్లాడేవాడు కాదు. చక్రిలో అది నాకు 
బాగా నచ్చేది. చక్రి ఎన్నో పాటలు కూర్చినా, ఈ క్షణంలో చక్రి పాట 
అంటే నాకు గుర్తొస్తున్నది మాత్రం - ‘చక్రం’ చిత్రంలోని సిరివెన్నెల 
సీతారామశాస్త్రి రచన ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం
 నాది!’ దానికి కారణం లేకపోలేదు. చక్రికి ఎప్పుడూ చుట్టూరా
 జనం ఉండాలి... ఎంతమంది వచ్చినా, అందరికీ భోజనం పెట్టాలి. 
అదీ అతని స్నేహశీలత. ఇవాళ అంతమంది స్నేహితుల్ని 
సంపాదించుకొని, అందరినీ వదిలేసి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. 
చక్రి సినీ, వ్యక్తిగత జీవితం నుంచి అందరం నేర్చుకోవాల్సింది కూడా
 ఒకటుంది. ఎంత పని ఉన్నా... చేయండి. కానీ, దాని కోసం ఆరోగ్యాన్ని 
పణంగా పెట్టకండి. వేళకు తిండి తినండి. వేళాపాళా లేకుండా తినడం, 
అర్ధరాత్రి దాకా పనిచేసి, తెల్లవారు జామున ఎప్పుడో నాలుగింటికి తినడం 
లాంటి పనులు చేయకండి. ఆ జాగ్రత్తలు పాటించి ఉంటే, నలభై ఏళ్ళూ
 నిండీ నిండకుండానే చక్రి మనకు దూరమయ్యేవాడు కాదు. చక్రి 
మా ఇంట్లో సభ్యుడి లాంటివాడు. ఆ సభ్యుడు ఇవాళ లేడు. 
అది తీరని బాధ!
 - ఆర్.పి. పట్నాయక్
 (సినీ సంగీత దర్శకుడు, చక్రికి చిరకాల స్నేహితుడు)

ఇంటర్వ్యూ - రెంటాల జయదేవ

......................................

Tuesday, December 16, 2014

చక్రి మృతికి స్థూలకాయమే కారణమా?


నలభై ఏళ్ళ చిన్న వయసులోనే సంగీత దర్శకుడు చక్రి కన్నుమూయడానికి కారణం ఏమిటి? వ్యక్తిగతంగా అందరితో స్నేహంగా వ్యవహరించే చక్రి తన ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టలేదా? సినీ వర్గాలు ఆ మాటే అంటున్నాయి. సినీ రంగానికి వచ్చిన తొలిరోజుల్లో పాతికేళ్ళ పైచిలుకు వయసులో ఆయన ముద్దుగా, బొద్దుగా ఉండేవారు. అయితే, క్రమంగా ఆహార విహారాల్లోని మార్పు, సినీ రంగంలో తీరిక లేని పనితో వేళాపాళా లేని జీవనవిధానం కొంత దెబ్బతీశాయని చెప్పవచ్చు. క్రమంగా అది స్థూలకాయానికి దారి తీసింది. భోజన ప్రియత్వం కూడా అందుకు తోడైంది.
 
హిందీ చిత్రసీమలోని బప్పీలహరి లాగా చక్రి కూడా లావుగా తయారైనా, తనదైన ప్రత్యేక శైలి దుస్తులు, చేతికి లావాటి బంగారు గొలుసులతో వినూత్నంగా కనిపించేవారు. క్రమంగా ఆయన రూపంతో పాటు, ముఖం రంగులో కూడా కొంత మార్పు వస్తూ వచ్చింది. అయితే, అన్ని విధాలుగా తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చక్రి ఎప్పుడూ ఉత్సాహంగా చెప్పేవారు. లైపోసక్షన్ లాంటివి చేయించుకోవాలనుకున్నా, దుష్ఫలితాలు ఉంటాయేమోనని చక్రి బాధపడ్డారు.
 
 అయితే, శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ కావడం చివరకు ఆయనకు ప్రాణాంతకంగా పరిణమించినట్లు కనిపిస్తోంది. చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆదివారం కూడా అర్ధరాత్రి దాటే వరకు చక్రి తన రికార్డింగ్ పనుల్లో బిజీగా గడిపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఇంటికి తిరిగొచ్చిన ఆయన నిద్ర పోయారు. ఆ నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలని గతంలో పలువురు సన్నిహితులు సలహా ఇచ్చినా, చివరకు అది చక్రికి ప్రాణాంతకంగా పరిణమించిందని భావించవచ్చు.
...............................

సినీ సంగీత 'చక్ర'ధరుడు

సినీ సంగీత 'చక్ర'ధరుడు

http://www.sakshi.com/news/movies/music-director-chakri-is-no-more-195289
తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చాక ఇక్కడ కెరీర్‌ను ప్రారంభించి, అచిరకాలంలోనే అగ్రస్థాయికి చేరిన తొలి సినీ సంగీత దర్శకుడిగాచక్రిని చెప్పుకోవచ్చు. 2000 ప్రాంతంలో తెలుగు చిత్రసీమలోకి పొంగిపొర్లి వచ్చిన కొత్తనీరులో ఆయన భాగం. జాగ్రత్తగా గమనిస్తే, దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోగా రవితేజ, సంగీత దర్శకుడు చక్రి, రచయిత భాస్కరభట్ల తదితరుల కెరీర్ దాదాపు ఏకకాలంలో కలసి ఉన్నత శిఖరాల వైపు సాగినట్లు కనిపిస్తుంది.

 * ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జిల్లా చక్రధర్ సినీరంగంలో ‘చక్రి’గా తనకంటూ పేరు, స్థానం సంపాదించుకోవడానికి ముందు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. వరంగల్ దగ్గరి స్వస్థలం నుంచి ఉద్యోగార్థం హైదరాబాద్ వచ్చిన ఆయన తొలిరోజుల్లో అమీర్‌పేట ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు.

 * సంగీతం మీద ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే సాంస్కృతిక ఉత్సవాల్లో ఒక దేశభక్తి గీతానికి చక్రి బాణీ కట్టారు. ఆ తరువాత తనలాగే సంగీతం పట్ల ఆసక్తి ఉన్న మిత్రులను కలుపుకొని, ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తొలి రోజుల్లో కొన్ని క్యాసెట్లు కూడా రూపొందించి, విడుదల చేశారు. చివరకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'బాచి' (2000) చిత్రంతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా చక్రి పరిచయమయ్యారు.

 * ఒక దశలో సినిమా అవకాశం కోసం అమితంగా కష్టపడ్డ ఆయన ఆ తరువాత ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్‌గా అరుదైన ఘనత సాధించారు. 1980లలో ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి తరువాత మళ్ళీ సంఖ్యాపరంగా ఆ ఘనత అందుకున్నది చక్రి కావడం, ఇద్దరికీ పేరులో సారూప్యత ఉండడం యాదృచ్ఛికమే అయినా, గమ్మత్తై వాస్తవం.

 * ఒక దశలో అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న హీరోల లో బడ్జెట్ చిత్రాల దాకా ఎటు చూసినా చక్రి హవానే కొనసాగింది. తరువాత ఆ  జోరు కొంత తగ్గినా, చక్రికంటూ ఒక వర్గం సినిమాలు ఉండేవి. దర్శక - నిర్మాతలు ఉండేవారు.

 * ఇప్పటికి దాదాపు 80కి పైగా చిత్రాలకు చక్రి సంగీతం అందించినట్లు ఒక లెక్క. ఆ చిత్రాల్లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని 'ఇట్లు... శ్రావణి సుబ్రహ్మణ్యం', 'శివమణి', 'అమ్మ - నాన్న - ఓ తమిళ అమ్మాయి', 'ఇడియట్', 'దేశముదురు', కృష్ణవంశీ దర్శకత్వంలోని 'చక్రం', వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలోని 'దేవదాసు', శ్రీను వైట్ల 'ఢీ' లాంటి పలు విజయాలు ఉన్నాయి.

* చక్రి సినీ సంగీతంలోని ఒక విశేషం ఏమిటంటే - ఒక పక్క ఎంత మెలొడీ పాటలు ఆయన అందించారో, అంతే స్థాయిలో బీట్ పాటలు, ఆధునిక తరానికి నచ్చే ట్రెండీ బాణీలు కూడా అందించడం. 'నాకు వ్యక్తిగతంగా శ్రావ్యగీతాలంటే ఇష్టమైనా, దర్శక - నిర్మాతలు కోరిన విధంగా బీట్ పాటలు ఇస్తుంటా' అని ఆయనే చెప్పారు. సుమారు 80కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన చక్రి పాటల్లో అనేక హిట్లున్నాయి. 'నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిల...' లాంటి ఆల్‌టైమ్ హిట్లు ఆయన పాటలే. అలాగే, 'జగమంత కుటుంబం నాది...'('చక్రం' చిత్రంలోని సీతారామశాస్త్రి రచన) లాంటి తాత్త్విక గీతాలున్నాయి. మాస్, బీట్ పాటలకైతే లెక్కే లేదు.

 * సినీ సంగీత రంగంలోకి ప్రవేశించడానికి తాను పడ్డ కష్టాలను చక్రి చివరి దాకా మర్చిపోలేదు. అందుకే, అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వచ్చిన ఆయన కౌసల్య లాంటి పలువురు వర్ధమాన గాయనీ గాయకులకు పదే పదే అవకాశాలిచ్చి, ప్రోత్సహించారు. స్వతహాగా తనలో ఉన్న గాయకుడి కోణాన్ని కూడా వీలైనప్పుడల్లా వెలికితీసేవారు. తారస్థాయిలో పాడాల్సిన పాటలను సైతం అలవోకగా పాడడం చక్రిలోని విశిష్టత.

 * ఇటీవల దాసరి దర్శకత్వంలో విడుదలైన 151వ చిత్రం 'ఎర్రబస్సు'కు సంగీతం అందించింది చక్రే! చక్రి సంగీతం అందించగా వై.వి.ఎస్. చౌదరి దర్శక - నిర్మాతగా, సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' లాంటివి కొన్ని ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

* తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ సంగీతకారుడు ఆ మధ్య 'జై బోలో తెలంగాణ' చిత్రానికి సంగీతం అందించి, పుట్టినగడ్డ ఋణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఒక ప్రత్యేక గీతాన్ని కూర్చాలని రచయిత భాస్కరభట్లతో చర్చిస్తున్నారు. ఆ కోరిక నెరవేరకుండానే హఠాత్తుగా కనుమరుగయ్యారు. ఇప్పుడు ఆయన లేరు... ఆయన పాటలే తీపిగుర్తులుగా మిగిలాయి. చక్రికి 'సాక్షి' తరఫున నివాళులర్పిస్తున్నాం. 

రెంటాల
.................................

Friday, December 12, 2014

సినిమా రివ్యూ: కార్తికేయ

సినిమా రివ్యూ: కార్తికేయ

పాములు పగబడతాయా? పగబట్టి వెంటపడతాయా? దీనికి సైన్స్ ఏ రకమైన వివరణనిచ్చినప్పటికీ, కథల్లోనూ, సినిమాల్లోనూ పాము సెంటిమెంట్, పగ సెంటిమెంట్ బ్రహ్మాండమైన బాక్సాఫీస్ సూత్రం. పాము పగ అనేది మూఢనమ్మకమని కొట్టిపారేసే జనాన్ని కూడా కన్విన్స్ చేసేలా దానికి శాస్త్రీయ వివరణనిస్తే? అలా ఇటు నమ్మకాలనూ, శాస్త్రీయ వివరణనూ కలగలిపి వండుకున్న కథ - ‘కార్తికేయ’.

............................................
కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్ చంద్ర, కళ: సాహి సురేశ్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-కథనం- మాటలు-దర్శకత్వం: చందు మొండేటి

...........................................


కథ ఏమిటంటే...
మెడికల్ స్టూడెంట్ కార్తికేయ (నిఖిల్ )కు మిస్టరీగా కనిపించే ఏ విషయాన్ని అయినా ఛేదించడం అలవాటు. మరోపక్క సుబ్రహ్మణ్యపురంలో వందల ఏళ్ళ నాటి గుడి ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాటి రాత్రి ఆ ఆలయంలో నుంచి వెలుగులు ప్రసరించడం ఓ అద్భుతం. పాము కాటుతో అందరూ చనిపోతూ, అనుమానాలు రావడంతో ఆ ఆలయం మూతపడుతుంది. మెడికల్ క్యాంప్ కోసం హీరో హీరోయిన్లు అదే ఊరుకు వెళతారు. అప్పుడేమైంది? ఆలయ రహస్యం ఏమిటన్నది మిగతా కథ.

ఎలా నటించారంటే...
ఇటీవలి కాలంలో సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రాలకు తెలుగులో ఆదరణ బాగుంది. ఈ లెక్కలతోనే వచ్చిన తాజా చిత్రం ఇది. స్టూడెంట్‌గా, ప్రేమికుడిగా, నిగూఢ రహస్యాన్ని ఛేదించాలని తపించే యువకుడిగా ఎప్పటికప్పుడు ఆ మార్పుల్ని చూపడానికి నిఖిల్ శ్రమించారు. కాకపోతే, స్క్రిప్టు కాసేపు అటు, కాసేపు ఇటు నడవడంతో పాత్ర కూడా దేని మీదా నిలకడ లేకుండా పరుగులు పెట్టాల్సి వచ్చింది. మెడికల్ కాలేజీ విద్యార్థిని వల్లిగా హీరోను అనుసరించడానికీ, ప్రేమ ట్రాక్‌కే హీరోయిన్ స్వాతి పరిమితమైంది. మిస్టరీ ఛేదనలోనూ ఆమెకు భాగం కల్పిస్తే, ఆసక్తి ఇంకా పెరిగేది. ఇక, సినిమాలో వచ్చే మిగిలిన పాత్రలన్నీ ఆటలో అరటిపండు వ్యవహారమే. కాకపోతే, సుపరిచిత ముఖాలుండడం ఉపకరించింది.నైట్ ఎఫెక్ట్ దృశ్యాల లాంటి వాటిని చిత్రీకరించడంలో ఛాయాగ్రాహకుడి పనితనం కనిపించింది. బాణీలు, పాటలు గుర్తుపెట్టుకుందామన్నా గుర్తుండవు. ఇలాంటి మిస్టరీ సినిమాలకు కీలకమైన రీ-రికార్డింగ్ ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది. చరిత్ర చెప్పడానికి వాడుకున్న బొమ్మలు, విజువల్ ఎఫెక్ట్‌లు బాగున్నాయి.

ఎలా ఉందంటే...
 పాత్రల పరిచయానికీ, కథలోకి ప్రధాన పాత్రను తీసుకురావడానికి ప్రథమార్ధం సరిపోయింది. అయినా తరువాతి కథేమిటన్న ఆసక్తి ప్రేక్షకులలో నిలపగలిగింది. ఇక, అసలు కథంతా ద్వితీయార్ధంలోనే! దాన్ని ఉత్కంఠగా చెబుతారనుకుంటే, అతిగా ఆశపడ్డామని కై్లమాక్స్‌కొచ్చాక ప్రేక్షకులకు అర్థమవుతుంది.

స్క్రిప్టును పకడ్బందీగా రాసుకొని ఉంటే బాగుండేది. ఏ సీన్‌లో ఎలా తాను కథను నడిపించాలనుకుంటే అలా పాత్రలు ప్రవర్తించేలా, సంఘటనలు జరిగేలా చేయడంతో తంటా వచ్చిపడింది. రాజా రవీంద్ర రాసిన పుస్తకం, చేసిన ఫోన్  గురించైనా ఆరా తీయకుండానే పోలీసాఫీసర్ కేస్ మూసేశారనడం కథలో కన్వీనియన్స్ కోసమే! ఇక, హీరో ఫ్యామిలీ సీన్లు కృతకంగా ఉన్నాయి. తనికెళ్ళ, తంజావూరు పీఠాధిపతి కథలో ముందే పెదవి విప్పరెందుకో తెలీదు. హీరోది లియో (సింహరాశి) అని మొదట్లో చెప్పించి, చివరకొచ్చేసరికి మేషరాశి అనిపిస్తారు.  క్లైమాక్స్ కొచ్చేసరికి కాస్తంత అసంతృప్తిగానే సినిమా ముగుస్తుంది. అయితే, లోటుపాట్లున్నా దర్శకుడి తొలి ప్రయత్నంగా భుజం తట్టవచ్చు. ఉత్కంఠభరిత చిత్రాల సీజన్‌లో వచ్చిన తాజా చేర్పుగా ఈ చిత్రాన్ని లెక్కించవచ్చు.

బలాలు:  ఎంచుకున్న మిస్టరీ కథాంశం   హిట్ జంటగా పేరు తెచ్చుకున్న నాయికా నాయకులు  కొన్ని చోట్ల బాగున్న కెమేరా పనితనం

బలహీనతలు:  పాత్రలు, సంఘటనల రూపకల్పన  సంతృప్తినివ్వని ద్వితీయార్ధం  బలహీనమైన స్క్రీన్‌ప్లే  నమ్మకానికీ, సైన్స్‌కూ మధ్య సంఘర్షణకు కుదరని లంకె

- రెంటాల జయదేవ


(Published in 'Sakshi' Telugu daily, 25th Oct 2014, Saturday)

....................................

Thursday, December 11, 2014

ఆయన సినిమాలకు‘అభిమాన్’ను నేను: -- ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్

(హృషీకేశ్ ముఖర్జీ Birth anniversary)

హృషీకేశ్ ముఖర్జీ నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ల్యాబ్ అసిస్టెంట్‌గా మొదలై ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే రచనల మీదుగా సినీ దర్శకుడు కావడం హృషీకేశ్‌జీకి కలిసొచ్చిన అంశం. కలకత్తాలో న్యూ థియేటర్‌‌సలో దర్శకుడు బిమల్‌రాయ్ దగ్గర నుంచి పలువురు దర్శకుల శైలినీ, వారి సామర్థ్యాన్నీ దగ్గర నుంచి గమనించే అవకాశం ఆయనకు వచ్చింది. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. వారిలోని సారాన్ని ఆయన గ్రహించారని నాకు అనిపిస్తుంటుంది. ‘ముసాఫిర్’తో మొదలుపెట్టి ‘అనుపమ’, ‘ఆనంద్’, ‘గుడ్డి’, ‘సత్యకావ్‌’ - ఇలా దాదాపు 50 చిత్రాలు తీసి, ప్రేక్షక హృదయాలను ఆయన గెలుచుకున్నారు.

  పద్మవిభూషణ్, ఫాల్కే పురస్కారాలందు కొన్నారు. హృషీకేశ్‌జీ చిత్రాలనగానే నాకు ఠక్కున గుర్తొచ్చేది ‘అభిమాన్’. నాకు ఎంతో ఇష్టమైన సినిమా అది. అందులోని సంగీతం, సున్నితమైన భావోద్వేగాలు, మనసును తాకే ఆ సన్నివేశ పరిమళాలు నా మనసులో ఇప్పటికీ అలా నిలిచిపోయాయి. ప్రతి సినిమాలో ఆయన మానవ సంబంధాలను అద్భుతంగా చూపిస్తారు. ‘అభిమాన్’లో కథానుసారం భార్యాభర్తల్లో ఒకరి ఆధిపత్య భావజాలం, వారి మధ్య నెలకొనే ఘర్షణ - చాలా సహజంగా చూపారు. ఒక సహజమైన భావోద్వేగాన్ని ఎక్కడా అతి చేయకుండా మామూలుగా చెబుతూనే, మనసుపై ముద్ర వేయడమనే హృషీకేశ్‌జీ శైలి నాకు నచ్చుతుంది.

  కథను తెరకెక్కించడంలో నా స్కూల్ కూడా అదే! అంతా తక్కువ మోతాదులోనే తప్ప, బీభత్సాలు, ఏడుపులు, పెడబొబ్బలు మా చిత్రాల్లో కనపడవు. అలాగే, చుట్టూ ఉన్న మనుషులు, వారి జీవితాలనే తప్ప, జీవితాన్ని మించిపోయిన అసహజమైన కథల జోలి కెళ్ళం. నిజానికి, ‘అభిమాన్’ స్ఫూర్తితో ఒక కథ నా మనసులో ఎప్పటి నుంచో తిరుగుతోంది. దానికెప్పటికైనా తెర రూపమివ్వాలని ఉంది.
 సినీ రంగంలోని చాలామందికి భిన్నంగా, హృషీకేశ్‌జీ ద్వారా పైకి వచ్చిన నటీనటులకు ఆయనంటే ఎంతో గౌరవం, గురుభావం. నటి జయభాదురి (బచ్చన్) ఒకసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ, హృషీకేశ్ పట్ల తనకున్న గౌరవాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ‘హృషీదా గనక ‘రేపటి నుంచి సినిమా ఉంది.

  నువ్వు నటించాలి’ అంటే చాలు... కథేమిటి, నా పాత్ర ఏమిటి లాంటివేవీ అడగనైనా అడగకుండానే, నా చేతిలో ఉన్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని మరీ ఆ సినిమాలో నటిస్తాను’ అని ఆమె బాహాటంగా చెప్పారు. ఒక దర్శకుడు తీర్చిదిద్దిన మైనంముద్దల లాంటి ఆర్టిస్టులు ఆ విషయాన్ని అంగీకరిస్తూ, అలా చెప్పడాన్ని మించిన కితాబు ఇంకేముంటుంది!హృషీకేశ్‌జీ మంచి సృజనశీలే కాక మంచి మనిషి కూడా! బొంబాయిలో నేను హిందీ చిత్రాలు తీస్తున్న సమయంలో రెండు మూడుసార్లు ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశాను. ఇంట్లో మంచం పక్కనే కుక్కలతో ఆయన సరదాగా గడిపేవారు. అప్పటికే హిందీ చిత్రం ‘సర్‌గమ్’ (‘సిరిసిరిమువ్వ’కు రీమేక్)తో అక్కడివాళ్ళకు నేను తెలుసు. ‘శంకరాభరణం’ దర్శకుడిగా ఆయన నన్నెప్పుడూ గుర్తుపెట్టుకొని మాట్లాడేవారు. చలనచిత్రోత్సవాలు, జాతీయ అవార్డు కమిటీలు, సెన్సార్ బోర్డు లాంటి వాటిలో కీలక బాధ్యతలు నిర్వహించడం వల్ల దక్షిణాదిలో ఆయనకున్న పరిచయాలూ ఎక్కువే.

  పనుల మీద మద్రాసుకు ఆయన వచ్చినప్పుడూ కలిశాను. ఒకసారి ఆయన ప్రసిద్ధ మలయాళ నటుడు గోపికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి, కేరళ వెళ్ళి మరీ చూసిరావడం నాకిప్పటికీ గుర్తే!  సందర్భమేమిటో గుర్తులేదు కానీ, దక్షిణ, ఉత్తర భారతీయ సినిమా వాళ్ళం కొందరం కలసి ఒకసారి ఏదో పర్యటనకు వెళ్ళాం. ఆ బృందంలో హృషీకేశ్ ముఖర్జీ, గుల్జార్, నేను - ఇంకొందరం ఉన్నాం.  నటి జయభాదురో, షబనా ఆజ్మీయో కూడా ఉన్నారు. ‘దర్శకుడు, రచయిత, నటి - ఇలా మనందరం ఇక్కడే ఉన్నాం కదా! ఇక్కడే ఒక సినిమాకు సన్నాహాలు చేద్దామా’ అని మేమందరం సరదాగా అనుకున్నాం. అవన్నీ తీపి జ్ఞాపకాలు. ఏమైనా, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన హృషీకేశ్ ముఖర్జీ, శ్యామ్‌బెనెగల్, బాసూ భట్టాచార్య, మృణాల్‌సేన్ లాంటి దర్శకులు, వారి చిత్రాలు మన జాతి సంపద.


- ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్

 సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 30th Sept 20014)
....................................................................