skip to main | skip to sidebar

ఇష్టపది

అస్తవ్యస్తంగా ఉన్నవాటిని ఇష్టమైనరీతిగా మార్చుకోవాలన్న తపన...

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, January 9, 2017

స్టార్‌ వార్స్‌... ఇంద్రసేన వర్సెస్‌ సమరసింహ.... చిరంజీవి Vs బాలకృష్ణ... ఖైదీ నంబర్‌ 150 Vs గౌతమిపుత్ర శాతకర్ణి


Sakshi | Updated: January 08, 2017 05:17 (IST)


సినిమాలో డ్రామా ఉంటుంది...
యాక్షన్‌ ఉంటుంది... ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది...
ఫస్టాఫ్‌ ఉంటుంది... సెకండాఫ్‌ ఉంటుంది... క్లైమాక్సూ ఉంటుంది...
హీరోయిన్లుంటారు... క్యారెక్టర్లుంటాయి...
కామెడీ ఉంటుంది... అబ్బో! చాలానే ఉంటుంది.
అవును... అసలు విషయం మర్చిపోయాం!
 సినిమా బయట కూడా డ్రామా ఉంటుంది.
అభిమానులుంటారు. ఆడియన్స్‌ ఉంటారు.
 ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లుంటారు.
వాళ్ళంతా హ్యాపీయే!... టెన్షన్‌ అంతా అభిమానులది.
కటౌట్లు పెట్టాల... దండలు వెయ్యాల... అభిషేకాలు చెయ్యాల...
సమ్‌టైమ్స్‌... ప్రాణాల మీదకు తెచ్చుకోవాల...
ఇవన్నీ హీరోలకు కల్ట్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టాయ్‌.
గవర్నమెంట్‌ పందెంరాయుళ్ళపై ఆంక్షలు విధించవచ్చు.
 పందెంకోళ్ళను జైళ్ళలోనూ పెట్టవచ్చు.
కానీ, ఈ అభిమాన పందెంపై కంట్రోలు
 ఏ ప్రభుత్వం మాత్రం పెట్టగలదు?
దిస్‌ స్టోరీ ఈజ్‌ బిగ్గర్‌ దేన్‌ టూ మూవీస్టోరీస్‌!
రెండు సినిమాల కన్నా గొప్ప డ్రామా ఉన్న స్టోరీ! చదవండి.
.......................................................................


ఇది వెండితెర మహా సంగ్రామం..
. సంక్రాంతి ... థియేటర్లలో జరుగుతున్న సినిమా కోడి పందెం...
ఒకరు మెగా స్టార్‌... మరొకరు నందమూరి యుగా స్టార్‌...
 ఒకరిది (హీరోగా) 150వ సినిమా... ఇంకొకరిది 100వ సినిమా...
ఒకరిది తమిళ సూపర్‌ హిట్‌ కథ... ఇంకొకరిది తెలుగు జాతి యోధుడి జీవితం...
ఒకరేమో శక్తిపీఠాల్లో పూజలు, మరొకరు ఆలయాల్లో అభిషేకాలు...
 ఎవరూ తగ్గేది లేదు... ఎక్కడా తలొగ్గేది లేదు...
 అందుకే... తెలుగు సినీ జనంలో... ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్‌ టాపిక్‌...
 ‘ఖైదీ నంబర్‌ 150’ వర్సెస్‌ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’...
చిరంజీవి సిన్మా వర్సెస్‌ బాలకృష్ణ సిన్మా..
సంక్రాంతి సీజన్‌లో... మరికొన్ని సినిమాలు బరిలోకి వస్తున్నా...
ఈ ‘స్టార్‌ వార్స్‌’ పైనే అందరి దృష్టి. 
............................................

కథ కోసం కసరత్తులు

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌
కెరీర్‌లో మైలురాళ్ళ లాంటి ఈ సినిమాలు చేయడానికి సరైన
కథల కోసం స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కసరత్తులే
చేశారు. కొన్నేళ్ళపాటు ఊరించి, పరుచూరి బ్రదర్స్‌‘ఉ య్యాలవాడ
 నరసింహారెడ్డి’ స్క్రిప్ట్‌ దగ్గర నుంచి పూరీ జగన్నాథ్‌ ‘ఆటో జానీ’
దాకా వందల కథలు విన్న చిరంజీవి చిట్టచివరికి తమిళంలో
మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన హిట్‌ ‘కత్తి’ (2014)
రీమేక్‌కు జెండా ఊపారు. అదీ కుమారుడు రామ్‌చరణ్‌ నిర్మాతగా
తొలి యత్నం కావడం విశేషం. గతంలో ‘ఠాగూర్‌’(తమిళ
 ‘రమణ’కి రీమేక్‌)తో విజయం అందించిన వినాయక్‌కు
 దర్శకత్వ బాధ్యతలు అందించారు.

తెలుగు వాడి పౌరుషం
హీరోగా 100వ సినిమాకు బాలకృష్ణ చాలా స్క్రిప్ట్‌లు
విన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్‌మిషన్‌
కాన్సెప్ట్‌తో పాతికేళ్ళ క్రితం వచ్చిన ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా
‘ఆదిత్య 999’ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారు. కుమారుడు మోక్షజ్ఞనీ
 దాంతో తెరంగేట్రం చేయాలని ఊగారు. తర్వాత రైతుల కష్టాన్ని
 ప్రతిబింబించే ‘రైతు’ కథ నచ్చి, కృష్ణవంశీ దర్శకుడిగా దాదాపు
 ఖరారు చేశారు. అదే టైమ్‌లో దర్శకుడు క్రిష్‌ వచ్చి, తల్లి పేరును
 తన పేరు ముందుపెట్టుకొన్న చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ
 ఏకధాటిన 2 గంటలు చెప్పారు. విని 24 గంటలైనా గడవక
ముందే ఇదే నూరో సినిమాకు కరెక్ట్‌ అని బాలయ్య అటు మొగ్గారు.
...............................................

ఇంతకీ... కథేంటి? 

మెగా రీమేక్‌
బేసిక్‌గా ఇది తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌. కాకపోతే, తెలుగు
 నేటివిటీ, చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌
సహా పలువురు కలసి, స్క్రిప్ట్‌కు  మార్పులు చేశారు. కార్పొరేట్‌
 సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు
 ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది.
 చూడడానికి ఒకేలా కనిపించే రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది
 జీవానందంగా, అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్‌ అలియాస్‌
 కత్తిగా రెండు పాత్రలూ తమిళ్‌లో విజయ్‌ చేశారు. జీవానందం
 గాయపడగా, అతని స్థానంలోకి కత్తి వెళ్ళి రైతుల పక్షాన పోరాడతాడు.

హిస్టరీ రిపీట్స్‌
చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఒకే
 ఏలుబడికి తెచ్చిన తొలి భారతీయ చక్రవర్తి, తెలుగు యోధుడి
 కథ ఇది. దర్శకుడు క్రిష్‌ లభిస్తున్న కొద్దిపాటి చరిత్ర ఆధారాల్నీ
 తీసుకొని, ఊహ జోడించి, స్క్రిప్ట్‌ చేసుకున్నారు. క్రీ.శ. 1వ
శతాబ్దానికి చెందిన ఈ తెలుగు యోధుడి కథను 1900 ఏళ్ళ
 తరువాత ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. శాతకర్ణి జీవితంలో
తల్లి ఎంతటి కీలకపాత్ర వహించిందో, భార్యాబిడ్డల కన్నా దేశాన్ని
 ఒక్క తాటి మీదకు తేవాలన్న ఆకాంక్షకే అతనిచ్చిన ప్రాధాన్యం
 ఏమిటో ఈ కథ చెబుతుంది. అయితే, ఈ చిత్రం శాతకర్ణి
విజయగాథలకే పరిమితం.పూర్తి జీవితం చూపడం లేదు.
....................................................

ముసురుకున్న వివాదాలు

కథ ఎవరిది?: 
తమిళ ‘కత్తి’ సినిమా ఒరిజినల్‌ కథ తనదేననీ, పేరు, డబ్బులు –
 ఏమీ ఇవ్వకుండా ఆ కథను అడ్డంగా వాడేసుకున్నారనీ దర్శక –
 రచయిత ఎన్‌. నరసింహారావు వీధికెక్కారు. ఆ కథ ఒరిజినల్‌గా
 నరసింహారావు రిజిస్టర్‌ చేసుకున్న స్క్రిప్ట్‌లోదేనని ‘రచయితల సంఘం’
కమిటీ కూడా తేల్చింది. తమిళ దర్శక, నిర్మాతల నుంచి డబ్బుల
 వ్యవహారం తేలే లోగానే, ‘కత్తి’ని చిరంజీవి రీమేక్‌ చేస్తున్నారనే
వార్తతో కాపీరైట్‌ వివాదాన్ని మళ్ళీ ఫిల్మ్‌నగర్‌లో గుప్పుమనిపించారు.
 అలా ‘ఖైదీ నంబర్‌ 150’ షూటింగ్‌ కన్నా ముందే వార్తల్లో నిలిచింది.   

నో పర్మిషన్‌: 
‘ఖైదీ నంబర్‌ 150’ ట్రైలర్‌ కమ్‌ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కు విజయవాడలో
అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ మరో
వివాదం రేగింది. నిజానికి, మొదట డిసెంబర్‌ ఆఖరులో విజయవాడలోని
 మునిసిపల్‌ స్టేడియమ్‌లో చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరపాలనుకొని,
 ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలు ‘శాతకర్ణి’ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత
 ఆ ఫంక్షన్‌నే రద్దు చేసుకొన్నారు. తీరా సినిమా రిలీజ్‌కు పట్టుమని
 వారం రోజులైనా లేక ముందు ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం పెట్టుకొన్నారు.
అయితే, ఆ ఫంక్షన్‌కు స్టేడియమ్‌లో అధికారపక్షం ఉద్దేశపూర్వకంగానే
అనుమతి ఇవ్వడం లేదని చిరు అభిమాన వర్గం ఆరోపించింది.
అధికారులు మాత్రం మునిసిపల్‌ స్టేడియమ్‌లను, బయటి
 ఫంక్షన్లకివ్వరాదంటూ ఉమ్మడి రాష్ట్ర కాలంలో వచ్చిన జీవో వల్లే
అనుమతులు ఇవ్వడం లేదంటూ సన్నాయినొక్కులు నొక్కారు.
 చివరకు చిరు వర్గం తమ వేదికను బెజవాడ – గుంటూరు
మధ్యకు మార్చి, కార్యక్రమం శనివారం చేసింది.

ఎవరు లెజెండ్‌?

డేట్‌ ముందుకు మార్చుకొని, జనవరి 11న రిలీజ్‌కు వచ్చిన
 ‘ఖైదీ...’ వర్గం ‘ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజు రావడం
 మంచిది కాదని నాన్న (చిరంజీవి) గారన్నారు’ అంటూ తెలివిగా
ప్రకటించింది. అలా పోటీ సినిమా సేమ్‌ డే రిలీజ్‌కి రాకుండా, ముందరి
 కాళ్ళకి బంధం వేసింది. ఈ పరిస్థితుల్లో రకరకాల ఒత్తిళ్ళ మధ్య
 జనవరి 3వ తేదీ రాత్రి పొద్దుపోయాక, క్రిష్‌ సైతం పోటీ
 సినిమాకు స్నేహహస్తం చాపుతూ, ‘‘ఈ సంక్రాంతికి ఇద్దరు
లెజెండ్స్‌ తమ మైలురాళ్ళ లాంటి సినిమాలతో వస్తున్నారు...
 స్వాగతిద్దాం’’ అని ట్వీట్‌ చేశారు. కానీ, ఇరు వర్గాల
అభిమానులూ ఎవరికి వారు ‘మా హీరో తప్ప మరొకరు
 లెజెండ్‌ ఎలా అవుతారు’ అంటూ బుస కొట్టారు.
 సోషల్‌ మీడియాలో విషం కక్కారు.

అంత మాటంటారా? ఖబడ్దార్‌!

డిసెంబర్‌ 26న తిరుపతిలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’
పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, దర్శకుడు
 క్రిష్‌ మాటల ఉరవడిలో ‘సంక్రాంతికి వస్తున్నాం. ఖబడ్దార్‌’
 అనే పదప్రయోగం చేయడం వివాదమైంది. అది చిరు వర్గాన్ని
ఉద్దేశించి అన్న మాటలుగా సోషల్‌ మీడియాలో ప్రచారమైంది.
దానికి తోడు ‘అన్నయ్య’ కోసం మెగా బ్రదర్‌ నుంచి వచ్చిన
 వరుస ఫోన్‌కాల్స్‌! ఒకరికి నలుగురు హీరోలు చేతిలో ఉన్న
 మెగా ఫ్యామిలీతో వ్యవహారం కావడంతో, ఈ ఉక్కిరిబిక్కిరి
 మధ్య, క్రిష్‌ మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం,
 అపార గౌరవం గురించి వివరణ ఇవ్వాల్సొచ్చింది.
..........................................................

సోషల్‌ మీడియాలో వార్‌ !

బాలకృష్ణ సినిమా వస్తున్న రోజున అసలు బయటకే
రావద్దంటూ ఎగతాళి వాట్సప్‌ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో
 బాగా తిరిగింది. మరోపక్క, చిరంజీవి సిన్మాలో ‘అమ్మడు...
 కుమ్ముడు’ లాంటి మరీ మాస్‌ పాట ఏమిటని నెట్‌లో విమర్శలు
వెల్లువెత్తాయి. ఇలాంటి ‘ట్రాలింగ్‌’లను పక్కన పెడితే, 
‘మా టీజర్, ట్రైలర్‌ లుక్‌కు ఇన్ని లక్షల వ్యూస్‌ వచ్చాయి’
 అని మొదట ఒక సిన్మా వారు ప్రకటించారు. మా పాటనీ
 అంతమంది చూశారంటూ మరొక సినిమావారు అంతకన్నా 
పెద్ద అంకెలతో, పోటీ ప్రకటన చేశారు. ఇలా ప్రకటనలతో
 పోటాపోటీలు పడుతున్నారు. మీడియాలో స్టార్‌ వార్‌
 చూసి, హద్దు మీరినా, బ్యానర్లు చింపినాlచర్య తప్పదని 
ఏపీ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. హాళ్ళ వద్ద బందోబస్తు పెట్టారు.
.....................................................

అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారు! 
                          – ‘ఖైదీ...’ దర్శకుడు వినాయక్‌
⇔ తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవినెలా చూపిస్తున్నారు?
వినాయక్‌: సినిమా రిలీజయ్యాక చూస్తే, అసలు ఆ తొమ్మిదేళ్ళ
 గ్యాపూ చెరిగిపోతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే,
దాదాపు 20 ఏళ్ళ క్రితం ‘చూడాలని ఉంది’ (1998) టైమ్‌లో
 ఎలా ఉన్నారో, అలా అనిపిస్తారు చిరంజీవి. ఆయనను చూసి
 అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారు. నో డౌట్‌. ఆయన డ్యాన్స్‌లు,
 ఫైట్లు చూసి అదిరిపోతారు.

⇔ ఇది తమిళ ‘కత్తి’కి రీమేక్‌ కదా! మరి తెలుగులో...?
చాలా మార్పులు చేర్పులు చేశాం. అక్కడ యువ హీరో
విజయ్‌ కోసం, అతని ఇమేజ్‌కి తగ్గట్లుగా చేసిన స్క్రిప్ట్‌ ఇది.
 దాన్ని మన తెలుగు నేటివిటీకీ, ‘అన్నయ్య’ బాడీ లాంగ్వేజ్‌కీ
 తగ్గట్లు మార్చడం కోసం సమష్టిగా కృషి చేశాం.

⇔ ‘ఠాగూర్‌’ లానే ‘ఖైదీ నంబర్‌ 150’లో కూడా 
సామాజిక సమస్యను ప్రస్తావించినట్లున్నారు!
ఏ బాధ్యతా లేని ఒక వ్యక్తి – ఒక ఊరిలో ఒక రైతుకు జరిగిన
అన్యాయం తెలుసుకొని కదిలిపోతాడు. ‘నేను వీళ్ళ కోసమే
బతకాలి’ అని నిర్ణయించుకొని, ఆ దిశలో చేసే అలుపెరుగని
 పోరాటం చిత్ర కథ. రైతు సమస్య, నీటి సమస్య లాంటి
అంశాలెన్నో వస్తాయి.

⇔ రైతు గురించి వచ్చే ‘నీరు నీరు నీరు...’ పాట ఇవాళ 
మీడియాలో హాట్‌టాపిక్‌ అయినట్లుంది!
చాలా మంచి పాట అది. దేవిశ్రీ సంగీతం, రామజోగయ్యశాస్త్రి
సాహిత్యం, శంకర్‌ మహదేవన్‌ గానం – అద్భుతం. సినిమాలో
బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుందీ పాట.

⇔ చిరంజీవి కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌ వరమాల ఎందరినో 
దాటి మీ మెడలో పడినప్పుడు ఏమనిపించింది?
చిరంజీవి గారు పిలిచి, ‘కత్తి’ సినిమా తెలుగులో చేద్దామన్నారు.
 వెంటనే ఆ దృష్టితో సినిమా చూశాను. చూస్తుండగా నా మనసులో
 తిరిగిన ఆలోచనలు, మార్పులు చేర్పులతో – నాదైన పద్ధతిలో
 ఆయనకు కథను నేరేట్‌ చేశాను. నా అప్రోచ్‌ నచ్చి, చేసేద్దామన్నారు.

∙మీకు ఈ సినిమా పెద్ద ఎఛివ్‌మెంట్‌. మరి, ప్రేక్షకులకు 
ఎలాంటి అనుభూతి అంటారు?
ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఠాగూర్‌’లో ఉన్న నిజాయతీ,
‘రౌడీ అల్లుడు’లోని కామెడీ, ‘ఇంద్ర’లోని పాటలు – ఇవన్నీ
 కలిసే ఒకే సినిమాలో ఉంటే? అదే – ‘ఖైదీ నంబర్‌ 150’!
⇔ అంచనాలతో పాటు సినీ పోరాటమూ 
భారీగానే ఉంది! మరి, టార్గెట్‌...
అంచనాలన్నీ అందుకుంటాం. ఇంకా చెప్పాలంటే,
అధిగమిస్తాం. సినిమా సూపర్‌ హిట్‌.
..........................................................


చరిత్రలో గౌతమీపుత్ర శాతకర్ణి 

చరిత్రలోకి వెళితే, శాతవాహనులు తెలుగు వారు.
ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని కోరులింగాల (కోటి లింగాల)
నుంచి తెలుగు ప్రాంతంతో పాటు భారత భూభాగాన్నే ఏలినవారు.
ఆ వంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తి – గౌతమీపుత్ర శాతకర్ణి.
 క్రీ.శ. 78 –102 (కొందరు 60 నుంచి 90 దాకా అంటారు) మధ్య
పరిపాలన సాగించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిజానికి శాతవాహన
వంశంలో ఏ రాజూ సాధించనన్ని విజయాలు సాధించాడు.
శత్రువులైన శకులు, పల్హవులు, యవనులను (గ్రీకులు)
జయించి, జంబూద్వీపాన్ని (భారతభూభాగానికి పురాణనామం)
 పరాయి పాలన నుంచి విముక్తం చేసిన అరుదైన చక్రవర్తి. తాత,
 ముత్తాతలు కోల్పోయిన భూభాగాలనే కాక, కొత్త భూభాగాలను
జయించి, సువిశాల సామ్రాజ్యంగా విస్తరించాడు. అలా మూడు
 సముద్రాల పర్యంతం తన ఆధిపత్యాన్ని స్థాపించి, ‘త్రిసముద్ర
తోయ పీతవాహన’ (మూడు సముద్రాల నీళ్ళు తాగిన గుర్రాన్ని
 వాహనంగా కలవాడా) అనే బిరుదు పొందాడు. తన బొమ్మను
ముద్రించిన వెండి నాణాలను విడుదల చేసిన మొదటి భారతీయ
 చక్రవర్తి అతనే! పేరుకు ముందు తల్లి (గౌతమీ బలసరి/బాలాశ్రీ)
 పేరు చేర్చుకొన్న తొలి భారతీయుడూ అతనే! కొత్త యుగానికి
 ఆదిగా ‘యుగాది’ (ఉగాది, మహారాష్ట్రలో ‘గుడీ పడవా’)
ఆయన మొదలు పెట్టిందనే అంటారు. శాలివాహన శకమనే
కొత్త శకాన్ని స్థాపించి, కాలాన్ని మలుపు తిప్పిందీ ఈయనే
అని కొందరి భావన.
....................................................

"చిన్నతనంలో మా తాతయ్య గారి ఊరికి వెళ్ళినప్పుడు
 అమరావతి చాలాసార్లు చూశా. అమరావతి రాజధానిగా
 పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ లీలగా విన్నా. 
కొన్నేళ్ళుగా ఈ కథ నా మనసు తొలిచేస్తోంది. మన
 తెలుగు వాడి కథ మనకి కూడా తెలియకపోవడం కోపం
 వచ్చింది. 2013 నుంచి ముంబైలో ఉన్నప్పుడు ఆ చరిత్ర 
మరింత తెలిసింది. ఇది అందరికీ చెప్పాల్సిన కథ అనిపించింది. 
అందుకే, ఈ సినిమా తీశా. సినిమా తీస్తున్నంత సేపూ 
ఏదో అదృశ్యశక్తి నా వెంట ఉండి నడిపింది. ఇది నిజం." 
                           – ‘...శాతకర్ణి’ చిత్ర దర్శకుడు క్రిష్‌
.................................


రిలీజ్‌ దోబూచులాట.. రచ్చ

నిజానికి, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం 2016 ఏప్రిల్‌
ప్రారంభమైనప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 జనవరి 12న
 రిలీజ్‌ చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అయితే,
చారిత్రక నేపథ్యం, యుద్ధ సన్నివేశాలున్న భారీ చిత్రం తీయడం
కాబట్టి, అది జరిగేపని కాదని పరిశ్రమ వర్గీయులు, ప్రత్యర్థి చిత్రాల
వాళ్ళు పెదవి విరిచారు. వాళ్ళ అంచనాల్ని తలకిందులు చేస్తూ,
 రికార్డు టైమ్‌లో చిత్ర యూనిట్‌ సినిమా పూర్తి చేసింది.

ఇలా ఉండగా, ‘శాతకర్ణి’ ప్రారంభమైన రెండు నెలల తర్వాత 2016
జూన్‌ 23న చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ షూటింగ్‌ మొదలైంది. దాన్ని
 కూడా సంక్రాంతికే జనవరి 13న రిలీజ్‌ చేస్తామంటూ నిర్మాతలు
మొదట ప్రకటించారు. అయితే, తీరా రెండు సినిమాలూ షూటింగ్‌
 పూర్తి చేసుకొని, రిలీజ్‌కు దగ్గర పడుతుండేసరికి రచ్చ మొదలైంది.

కలిసొచ్చిన ‘నరసింహనాయుడు’ రిలీజ్‌ డేట్‌ జనవరి 11కే ఈ సినిమానూ
రిలీజ్‌ చేయాలంటూ బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఒత్తిడి చేస్తూ వచ్చారు. అందుకు,
దర్శక, నిర్మాతలు కూడా సరేనంటూ, బాక్సాఫీస్‌ వద్ద ప్రత్యర్థుల
 వ్యూహాల్ని బట్టి, తుది రిలీజ్‌ డేట్‌ ప్రకటిద్దామని కూర్చున్నారు.
ఆడియో రిలీజ్‌ వేదికపైనా డేట్‌ చెప్పనిది అందుకే!

అయితే, ఇంతలో ‘ఖబడ్దార్‌’ పదప్రయోగంపై వివాదం క్రిష్‌ను
 చుట్టుముట్టింది. ఒక ఏరియా ‘శాతకర్ణి’ రిలీజ్‌లో భాగస్థుడూ,
చేతిలో పలు థియేటర్లూ ఉన్న ఒక అగ్ర నిర్మాత మధ్యవర్తిగా
రంగప్రవేశం చేశారు. ఆ నిర్మాత తమ్ముడితో నెక్స్‌›్ట సినిమా
 చేయడానికి సిద్ధమవుతున్న ‘శాతకర్ణి’ దర్శక, నిర్మాతలతో
 జనవరి 12న ‘శాతకర్ణి’ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటన
 కమిట్‌ చేయించారు. ఆ ప్రకటన వచ్చాక, పోటీ నివారించడానికి
 ఒక రోజు ముందే జనవరి 11న చిరు సినిమా రిలీజ్‌
చేస్తున్నామంటూ ఆ చిత్ర నిర్మాత – హీరో రామ్‌చరణ్‌ ప్రకటించారు.

దాంతో, రిలీజ్‌ డేట్‌ విషయంలో అగ్ర నిర్మాతతో కుట్ర చేయించారని
 బాలకృష్ణ ఫ్యాన్స్‌ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పూజలు, అభిషేకాలు,
జెండా పండగలకే తప్ప, సిన్మా రిలీజ్‌ డేట్‌ విషయంలో మాత్రం
దర్శక – నిర్మాతలు తమ కన్నా, ప్రత్యర్థి చిత్ర వర్గీయుల
 మాటకే తలొగ్గారంటూ విమర్శించారు. జనవరి 5, గురువారం
నాడు వంద మంది దాకా అభిమానులు సాక్షాత్తూ
హైదరాబాద్‌లోని ‘శాతకర్ణి’ చిత్ర ఆఫీసుకు వెళ్ళి,
జనవరి 11నే తమ హీరో సిన్మా రిలీజ్‌ చేయాలంటూ
ఆందోళన చేయడం కొసమెరుపు. కానీ, చివరకు
జనవరి 12నే ‘శాతకర్ణి’ రిలీజ్‌ చేయాలని దర్శక,
నిర్మాతలు ఖరారు చేసేశారు.
............................................

ఒక్క రోజు ముందొస్తే... 10 కోట్లు!
ఒక రోజు ముందు రిలీజ్‌ కావడం వల్ల అత్యధిక థియేటర్లు
అందుబాటులో ఉండి, రికార్డు కలెక్షన్లకు వీలు చిక్కుతుంది.
తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అనుకొనే
 ఫ్యాన్స్‌కూ, బాక్సాఫీస్‌ రికార్డులే ప్రమాణం అనుకొనే
 సినీజీవులకూ, నంబర్‌ వన్‌ స్థానంపై కన్నేసిన తారలూ
రిలీజ్‌ డేట్‌పై పట్టుపట్టేది అందుకే! ‘మా సినిమా అన్ని వేల
 థియేటర్లలో రిలీజ్, ఇన్ని వేల థియేటర్లలో హంగామా’
అని కొందరు సినిమావాళ్ళు చెబుతుంటారు కానీ, వాస్తవాలు వేరు.

ఉన్న థియేటర్లెన్ని? 
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1650 చిల్లర
థియేటర్‌లే (మల్టీప్లెక్స్‌లలోని స్క్రీన్స్‌ కూడా కలిపి)
ఉన్నాయి. ఇక, తమిళనాడు, కర్ణాటక, విదేశాల్లో క్రేజీ
 తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండేవి కూడా
కలుపుకొన్నా, మహా అయితే, 2 వేల స్క్రీన్స్‌కు మించవు.
ఆర్భాటపు కబుర్లను పక్కనపెట్టి, అసలు లెక్కల్లోకి వెళితే
– థియేటర్లపై పట్టున్న ‘దిల్‌’ రాజు ‘శతమానం భవతి’కి
దాదాపు 250 థియేటర్లు, ఆర్‌. నారాయణమూర్తి
 ‘హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’కు సుమారు 50కి పైగా
థియేటర్లు ఈ సంక్రాంతికి అందుబాటులో ఉంటాయని
అంచనా. ఇక, మిగిలిన 1700 స్క్రీన్స్‌నే చిరు, బాలయ్య
 సిన్మాలు పంచుకోవాలి. వీటిలో ‘గీతా ఆర్ట్స్‌’ పట్టు
 మూలంగా సుమారు 900 దాకా స్క్రీన్స్‌ చిరు సిన్మాకీ,
 800 దాకా స్క్రీన్స్‌ బాలయ్య సిన్మాకొస్తాయని అంచనా.

అయితే, ‘శాతకర్ణి’ కన్నా ఒక రోజు ముందే చిరు సిన్మా
రిలీజ్‌ వల్ల ఆ ఒక్కరోజుకీ, ‘శాతకర్ణి’ సిన్మాకు దక్కాల్సిన స్క్రీన్స్‌లో
అధిక భాగం కూడా లభించడం ‘ఖైదీ నం. 150’కి ఎడ్వాంటేజ్‌
 అవుతుంది. అలా ప్రత్యర్థి సిన్మా కన్నా ముందు రావడం వల్ల
థియేటర్లన్నీ చేతిలో ఉండి, ఆ ఒక్క రోజులో దాదాపు 7 నుంచి
10 కోట్ల మేర ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ అదనంగా వస్తాయి.
ఆ ఎడ్వాంటేజ్‌ కోసం ‘ఖైదీ నం. 150’ వ్యూహం వేస్తే,
అది లేకుండా రెండు సిన్మాలూ ఒకే రోజు వచ్చి,
బాక్సాఫీస్‌ బలపరీక్షకు నిలబడాలని ‘శాతకర్ణి’
అభిమానులు కోరుకున్నారు. అందుకే, జనవరి 11నే
 ‘శాతకర్ణి’నీ రిలీజ్‌ చేసెయ్యమంటూ బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఒత్తిడి చేశారు.
.........................................

నైజామ్‌లో... ఎత్తులు పై ఎత్తులు

సినీ వ్యాపారంలో మొదటి నుంచి నైజామ్‌ ఏరియాది
 ప్రధాన వాటా. ఒకప్పుడు అది చిరంజీవి సినిమాలకు
కంచుకోట. తాజా పోటీ వాతావరణంలోనూ మంచి రెవెన్యూ
తెచ్చే ఆ ఏరియాపై పట్టు కోసం రెండు వర్గాలూ వ్యూహ ప్రతివ్యూహాలు
 సాగిస్తున్నాయి. ‘ఖైదీ...’ చిత్ర నిర్మాతలు ఒక అడుగు ముందుకేసి,
 నైజామ్‌ ఏరియాలో సినిమాను అమ్మకుండా, అలాగని సొంతంగా
కాకుండా, చాలా థియేటర్స్‌ చేతిలో ఉన్న ‘గ్లోబల్‌’ డిస్ట్రిబ్యూటర్స్‌
 సునీల్‌ నారంగ్‌ ద్వారా డిస్ట్రిబ్యూషన్‌కిచ్చారు. నిజానికి, ‘గ్లోబల్‌’లో
భాగస్వామి అయిన నిర్మాత ఎన్‌. సుధాకరరెడ్డే ‘శాతకర్ణి’ని
ఆ ఏరియాకు కొన్నారు. కానీ, ఇప్పుడు ‘ఖైదీ...’ డిస్ట్రిబ్యూషన్‌కి
 గ్లోబల్‌ ఒప్పుకోవడంతో, రెండు సినిమాలకూ హాళ్ళను సర్దుబాటు
చేయక తప్పదు. ఆ రకంగా ‘ఖైదీ...’ వ్యూహంతో నైజామ్‌లో
 ‘శాతకర్ణి’కి హాళ్ళ సంఖ్యలో గండి పడనుంది.  
.............................................

ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ!
ప్రముఖ పంపిణీదారు, థియేటర్ల లీజుదారు కావడంతో,
 ‘దిల్‌’ రాజు సినిమాకు మల్టీప్లెక్స్‌ల నుంచి మామూలు
థియేటర్ల దాకా తగినన్ని స్క్రీన్స్‌ దొరుకుతాయి. అయితే,
ఎటొచ్చీ ‘హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ లాంటి చిన్న
 సినిమాలకే పెద్ద తలనొప్పి. థియేటర్లన్నీ ఈ స్టార్ల వార్‌తో
 నిండిపోవడంతో, ‘పీపుల్స్‌ స్టార్‌’ ఆర్‌. నారాయణమూర్తికి
థియేటర్లే లేని పరిస్థితి. ‘‘ఇలా అయితే చిన్న సినిమాలు
 ఎలా బతుకుతాయి? కనీసం ఊరికొక్క థియేటరైనా
 ఇవ్వండి బాబూ’’ అని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
..............................................

బిజినెస్‌ అదుర్స్‌!

చిరంజీవి హీరోగా, ఆయన కుమారుడే నిర్మాతగా
వస్తున్న ‘ఖైదీ నంబర్‌ 150’ను 86 డేస్‌లో పూర్తి చేశారు.
నిర్మాణ వ్యయం 40 కోట్ల పైమాటే కావచ్చని అంచనా.
 తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న చిరంజీవి సిన్మా కావడంతో,
భారీ క్రేజ్‌ ఉంది.  హక్కులు తీసుకున్నవారిలో ఎక్కువమంది
 కొత్తవాళ్ళు, రోజువారీ‡ సినీ వ్యాపారంతో సంబంధం లేనివాళ్ళేనని
 భోగట్టా. గుంటూరు, నెల్లూరు, తూర్పు గోదావరి ఏరియాలు
 సొంత మనుషులతో రిలీజ్‌ చేసుకుంటున్న నిర్మాతలు వైజాగ్,
సీడెడ్‌ ప్రాంతాల హక్కుల్ని తమకు అత్యంత సన్నిహితులైన
ఆ ప్రాంత రాజకీయ నేతలకూ (గంటా శ్రీనివాసరావు, సి. రామచంద్రయ్య),
వారి బంధువులకూ ఇచ్చారట. ఇవి కాక, కర్ణాటక,
శాటిలైట్‌ రైట్స్‌ (‘మా’టి.వికి రూ. 10.5 నుంచి 12 కోట్లకి)
అమ్మారు. అన్నీ కలిపి రూ. 50 కోట్ల పైగా అయింది.
ఇక రూ. 25 కోట్ల పైగా విలువైన కృష్ణా, నైజామ్,
ఓవర్సీస్‌– నిర్మాతలే అట్టిపెట్టుకొని, సొంత రిలీజ్‌
చేస్తున్నారట. అన్నీ చేరి, రూ. 75 కోట్ల పైగా
లావాదేవీలు జరిగినట్లు లెక్క.

రికార్డు టైమ్‌లో 85 రోజుల్లో షూటింగ్‌ పూర్తి అయిన
బాలకృష్ణ చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి
దాదాపు రూ. 40 కోట్ల పైగా వ్యయమైనట్లు భోగట్టా. ఈ క్రేజీ
 ప్రాజెక్ట్‌ హక్కులు హాట్‌కేక్స్‌లా అమ్ముడవడంతో, సుమారు
 రూ. 60 కోట్లకు పైగా వ్యాపారమైంది. అలా ఏకంగా రూ. 20 కోట్ల
టేబుల్‌ ప్రాఫిట్‌ రావడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ. హీరోల సొంత
 సంస్థలు కాక, బయటి నిర్మాత సిన్మాకింత టేబుల్‌ ప్రాఫిట్‌ రావడం
ఇటీవల లేదని సినీ వర్గాల మాట. శాటిలైట్‌ రైట్లే రూ.8.5 కోట్లు (‘మా’ టివి)
 పలికాయి. ఇంకా తమిళ, హిందీ చిత్రాల థియేటరికల్‌ రైట్స్‌తో
అదనపు ఆదాయం వచ్చే ఛాన్సుంది.
................................................

ష్‌... సెన్సార్‌ అవుతోంది!

        ఇంటిపేరుతో కొత్తగా పెట్టిన ‘కొణిదెల ప్రొడక్షన్స్‌’ పతాకంపై
రామ్‌చరణ్‌ నిర్మించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం విడుదలకు
చాలా ముందే, డిసెంబర్‌ 29నే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. అత్యంత
 విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం – సినిమాలో ఫస్టాఫ్‌ ప్రధానంగా
 వినోదాత్మకం. ఆడవేషంలో అలీ, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్లు
 వస్తాయి. సెకండాఫ్‌లో కథలో అసలు ఘట్టం సాగుతుంది. ‘రైతు’పై
వచ్చే పాట కన్నీరు పెట్టిస్తుంది. ఆరు పదులు దాటిన వయసులోనూ
 చిరు నవ యువకుడిలా తయారై చేసిన ఇంటర్వెల్‌ ఫైట్, 2 పాటలకు
డ్యాన్సులు అదిరిపోయాయి. మొత్తం మీద 9 ఏళ్ళు గ్యాప్‌ తర్వాత,
 ‘యస్‌... బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని అభిమానులు కేరింతలు కొట్టేలా
 సినిమా ఉందని సెన్సార్‌ టాక్‌. ‘యు/ఏ’ సర్టిఫికెట్‌ వచ్చిన
ఈ సినిమా తుది నిడివి 2 గంటల 27 నిమిషాలు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 5న సెన్సార్‌ జరుపుకొంది.
సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు ‘సిన్మా బ్రహ్మాండం సార్‌!
ఇంతలా ఉంటుందని ఊహించలేదు’ అన్నారట. అభిజ్ఞ వర్గాల
 కథనం ప్రకారం – హీరో పాత్రచిత్రణ, యుద్ధ సన్నివేశాలు,
ముఖ్యంగా క్లైమాక్స్‌ ముందు వచ్చే ఎపిసోడ్‌ సూపర్‌. సినిమా
ముగింపు సమయంలో హీరో చెప్పే డైలాగులు, ‘ఇది మన కథ...
ప్రతి తెలుగువాడి కథ...’అంటూ నేపథ్యం నుంచి వచ్చే మాటలు
 సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధంగా
 నిలబెట్టేస్తాయి. యుద్ధాలే కాక, కర్తవ్యానికీ, కుటుంబ బంధానికీ
మధ్య నలిగిపోయే ఒక చక్రవర్తి కథగా ఎమోషన్‌ సీన్లూ పండాయి.
బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్‌లు, సీతారామశాస్త్రి పాటలు,
బాలకృష్ణ డైలాగ్‌ డెలివరీ – అన్నీ కలిసి, ప్రేక్షకులు మీసం
 తిప్పేలా ఉందీ సినిమా అని సెన్సార్‌ టాక్‌. సెన్సారైన
 రోజు సాయంత్రానికే పరిశ్రమలో దీనిపై ఒకటే చర్చ. రెండు
చోట్ల డైలాగుల్లో చిన్న చిన్న సవరణలతో ‘యు/ఏ’ సర్టిఫికెట్‌
వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 14 నిమిషాలే!
.....................................

అప్పుడూ ఇలాగే... బాక్సాఫీస్‌ యుద్ధం

సంక్రాంతి సీజన్‌లో థియేటర్ల బరిలో ఇలా చిరంజీవి,
బాలకృష్ణ చిత్రాలు ఢీ అంటే ఢీ అనుకోవడం ఇదే మొదటిసారి
 కాదు. 1987లో తొలిసారిగా చిరు ‘దొంగమొగుడు’ (జనవరి 9),
బాలయ్య ‘భార్గవరాముడు’ (జన. 14) సంక్రాంతి పందెం
కోళ్ళయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా గత 30 ఏళ్ళలో
– ఏడుసార్లు ఇలాంటి పోటీ జరిగింది. ‘ఖైదీ నంబర్‌ 150’ వర్సెస్‌
 ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎనిమిదోసారి జరుగుతున్న పోటాపోటీ.
ఈ 30 ఏళ్ళలో ఇద్దరి సినిమాలూ ఒకే తేదీన రిలీజైంది ఒక్క 2001లోనే! 
అదీ సంక్రాంతికే! ఆ తరువాత మరెప్పుడూ ఒకే తేదీకి వాళ్ళ చిత్రాలు
 పోటీ పడలేదు. గడచిన 7 సార్లలో ఇప్పటి దాకా 3 సార్లు
 (‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహా’ – 
ఈ మూడూ కూడా 70కి పైగా కేంద్రాల్లో వంద రోజులాడాయి) 
బాలకృష్ణ పైచేయి సాధించారు. మరో రెండుసార్లు (‘అన్నయ్య’, 
‘దొంగమొగుడు’) చిరంజీవిదే అగ్రస్థానం. మిగతా రెండుసార్లు
 (‘మంచిదొంగ’– ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’, ‘హిట్లర్‌’–‘పెద్దన్నయ్య’) 
ఇద్దరు హీరోలూ బాక్సాఫీస్‌ వద్ద సమానంగా నిలిచారు.
.........................................

ఎన్నెన్నో హైలైట్స్‌... ఎవరికీ అందని అంచనాలు!

‘నచ్చిందే చేస్తా’నంటున్న ఖైదీ నంబర్‌ 150
⇔ ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న
చిరంజీవి చిత్రంలో అభిమానులకు కన్నులపండువ కోసం
చాలా హంగామానే చేస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి
ఎన్ని కసరత్తులతో ఏం మాయ చేశారో కానీ, తెరపై కనీసం
 20 ఏళ్ళు తగ్గినట్లు కనిపిస్తున్నారు. దీని కోసం దాదాపు
 ఏడాది పాటు శ్రమించినట్లు సాక్షాత్తూ చిరంజీవే ‘సాక్షి’కి చెప్పారు.
⇔ ఒకప్పుడు ఫైట్లు, డ్యాన్సులకు ఫేమస్‌ అయిన చిరు
మళ్ళీ ఆ ఊపు తరహా మాస్‌ పాటలు, బీట్స్‌కు నర్తించినట్లు అభిజ్ఞ వర్గాల భోగట్టా.
⇔ రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్‌లీ’ చిత్రాల్లో
 తండ్రి చిరంజీవి గెస్ట్‌ అప్పీయరెన్స్‌ ఇస్తే, ఈసారి తండ్రి
 కమ్‌బ్యాక్‌ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మించడమే కాక,
‘అమ్మడు’ పాటలో కొద్ది క్షణాలు కనిపించనున్నారు.
⇔ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ‘ఖైదీ నంబర్‌ 150’లో
 తండ్రి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసి, సై్టలిస్ట్‌గా వ్యవహరించారు.
⇔ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా
 షూటింగ్‌ అంతా హైదరాబాద్‌ పరిసరాల్లో చేశారు. పాటల కోసం ప్రత్యేకంగా స్లొవేనియా, క్రొయేషియా దేశాలకు వెళ్ళి, చిత్రీకరణ జరిపారు.

⇔∙ఫస్టాఫ్‌ సరదాగా ఉంటే, సెకండాఫ్‌లో దాదాపు 45 నిమిషాలు
 ఎమోషనల్‌గా పీక్‌కు చేరుస్తుందని చిత్ర యూనిట్‌ కథనం.
నీటి కోసం కన్నీరు కార్చే రైతుల వెతల్ని చూపే రామజోగయ్య శాస్త్రి
రచన ‘నీరు నీరు నీరు... రైతు కంట నీరు...’ పాట కదిలిస్తుందని అంచనా.
....................................

‘శరణమా... రణమా’ అంటున్న శాతకర్ణి
⇔ తెలుగు జాతి చరిత్ర చెప్పే చారిత్రక కథ కావడం,
ఇలాంటి పాత్రలకు నప్పే హీరో బాలకృష్ణకు 100వ సినిమా కావడం ‘శాతకర్ణి’లో విశేషం.
⇔ తెలుగులో ఎన్టీఆర్‌ ‘పాండవ వనవాసం’– 1965,
 ‘శ్రీకృష్ణ విజయం’ –1971లో నటించిన హేమమాలిని
 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చారు.
తండ్రి ఎన్టీఆర్‌తో నటించిన డ్రీమ్‌ గర్ల్‌ ఇప్పుడు కుమారుడు
 బాలకృష్ణకు తల్లిగా చేశారు.
⇔ చరిత్ర కాబట్టి, ‘బాహుబలి’లా ఊహాలోకపు విహారాల
లాంటివి లేకపోయినా, సినిమాలో 3 యుద్ధ సన్నివేశాలు
 ఆకర్షణ. కబీర్‌ బేడీ లాంటి అంతర్జాతీయ నటులూ,
టెక్నీషియన్లూ అదనపు ఆకర్షణ.
⇔ ఆకట్టుకొనే హీరో పాత్రచిత్రణతో పాటు, ‘సమయం లేదు
 మిత్రమా... శరణమా? రణమా?’, ‘దేశం మీసం తిప్పుదాం!’,
‘దొరికినవాణ్ణి తురుముదాం... దొరకనివాణ్ణి తరుముదాం’
లాంటి మోస్ట్‌ పాపులర్‌ డైలాగ్స్‌ బోలెడున్నాయి. ఈ సినిమాతో పాటు
 ‘ఖైదీ నంబర్‌ 150’కి కూడా కొన్ని పవర్‌ఫుల్‌ డైలాగులు రచయిత
 బుర్రా సాయిమాధవ్‌ రాయడం విశేషం.
⇔ మొరాకో, జార్జియాలతో పాటు మన దేశంలో మధ్యప్రదేశ్‌లో
 ఇండోర్‌ సమీపంలోని నర్మదా నదీ తీరంలోని మహేశ్వర్‌ లాంటి
 చోట్ల షూటింగ్‌ జరిపారు. చిలుకూరులో కోటి రూపాయల ఓడ సెట్‌ వేశారు.
................................................

ఎన్టీఆర్‌ ఆశ తీర్చిన బాలకృష్ణ

పెద్ద ఎన్టీయార్‌ గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని స్వయంగా
నటిస్తూ, నిర్మించాలనుకొన్నారు. 1993 ప్రాంతంలో రచయితలతో
 చర్చించి, స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేయించారు. ఈ సుప్రసిద్ధ తెలుగు
శాతవాహన చక్రవర్తి జీవితం మొత్తాన్నీ సినిమాగా తెరపై చూపాలని
ఆయన భావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన నవ
యువకుడు వాసిష్టీపుత్ర పులుమావి పాత్రను హీరో వెంకటేశ్‌తో
వేయించాలని కూడా భావించారు. గెటప్, కాస్ట్యూమ్‌ స్కెచ్‌లూ
వేయించారు. కానీ, అనివార్య కారణాల వల్ల అప్పట్లో అది
తెరకెక్కలేదు. అప్పుడు తెరకెక్కని ఆ కథాంశం 23 ఏళ్ళ
తర్వాత ఇప్పుడు క్రిష్‌ మనసులో ఆలోచనగా బాలకృష్ణతో
రావడం యాదృచ్ఛికం.
...................................

తప్పని తిప్పలు... మార్పులు!
⇔ ‘ఖైదీ నంబర్‌ 150’లో ఐటమ్‌ సాంగ్‌ కోసం ముందుగా
క్యాథరిన్‌ థెరిసాను తీసుకున్నారు. అయితే, చిరు కుమార్తె సై్టలిస్ట్‌
అయిన సుష్మితతో ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్‌ విషయంలో సెట్‌లో
 తలెత్తిన పేచీతో ఆ అమ్మాయిని పక్కకు తప్పించారు. రాయ్‌
 లక్ష్మితో ఆ పాట చిత్రీకరించారు.
⇔ ‘ఖైదీ..’కీ, ‘శాతకర్ణి’కీ – రెంటికీ మొదట మ్యూజిక్‌ డైరెక్టర్‌
దేవిశ్రీ ప్రసాదే! అయితే, తగినంత సమయం కేటాయించడం
 లేదనే కారణంతో, దేవిశ్రీ స్థానంలో చిరంతన్‌ భట్‌ను ప్రవేశపెట్టారు.
...........................................

‘రుద్రమదేవి’కి నై..! ‘శాతకర్ణి’కి మాత్రం సై!

తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన కథాంశం కావడంతో,
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి అండగా నిలిచేందుకు రెండు 
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం 
ఈ చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయించగా, ఏపీ ప్రభుత్వం 
ఆ బాటలోనే ఉంది. వినోదపు పన్ను కట్టనవసరం లేకపోవడంతో, 
సాధారణంగా అయితే ప్రేక్షకుడికి టికెట్‌ రేటు తగ్గాలి. అయితే, 
ఇలాంటి చారిత్రక చిత్రాలు నిర్మించేవారిని ప్రోత్సహించాలనే 
ఉద్దేశంతో, టికెట్‌ రేట్‌ మామూలుగానే ఉంచేసి, పన్ను
 మినహాయింపు లాభాన్ని నిర్మాతలకు అందజేయాలని
 భావిస్తున్నారు. దాంతో, సినిమాకు వచ్చే వసూళ్ళలో 
ఆ మేరకు (దాదాపు 15 శాతం) నిర్మాతకు లాభిస్తుంది. 
వచ్చిన నికర వసూళ్ళు (షేర్‌) అదనంగా 7 నుంచి 8 శాతం
 దాకా పెరుగుతాయని వ్యాపార వర్గాల అంచనా.

వరంగల్‌ నుంచి తెలుగు ప్రాంతాన్ని అంతటినీ పాలించిన
కాకతీయ సామ్రాజ్ఞి ‘రుద్రమదేవి’ కథను అదే పేరుతో
దర్శక – నిర్మాత గుణశేఖర్‌ ఆ మధ్య సినిమాగా తీశారు.
అయితే, ఆ తెలుగు రాణి కథకు తెలంగాణ ప్రభుత్వమే తప్ప,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండదండగా నిలబడ లేదు. దాదాపు
15 నెలల క్రితం వచ్చిన ఆ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్‌ వినోదపు పన్ను మినహాయింపు నిచ్చారు. కానీ,
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఇదుగో.. అదుగో’
అని తిప్పించుకొని, ఆఖరికి మొండిచెయ్యి చూపించారు.
ఈసారి తన బావమరిది – వియ్యంకుడైన బాలకృష్ణ నటించిన
 ‘శాతకర్ణి’ సినిమాకు రిలీజ్‌కు ముందే పన్ను మినహాయింపునకు
 సిద్ధమవుతున్నారు. అన్నట్లు అప్పట్లో ఈ పన్ను మినహాయింపు
 లాభమంతా ఎప్పటిలా ప్రేక్షకులకూ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకూ
కాకుండా చరిత్రను తెరకెక్కించిన నిర్మాతలకే దక్కేలా కేసీఆర్‌
జీవో జారీ చేశారు. కానీ, ‘రుద్రమదేవి’కి దక్కాల్సిన ఆ ప్రోత్సాహం
 తాలూకు సొమ్మంతా ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన పేరున్న
 తెలంగాణ చిత్ర నిర్మాత – డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ దగ్గరే
ఉండిపోవడం విచిత్రం. పరిశ్రమ వర్గీయులు మధ్యవర్తిత్వం
 చేసినా, ప్రభుత్వమిచ్చిన ఆ ప్రోత్సాహం అసలు నిర్మాతకు
చేరకనేపోవడం విషాదం.
...............................................

పోటీపడుతున్న అభిమానం
          అతిథి పాత్రపోషణల్ని కలిపితే, సినిమాల సంఖ్య
పెరిగినా, చిరంజీవి, బాలకృష్ణలు ఈ తాజా చిత్రాల్ని 150... 100...
సినిమాలుగానే ప్రకటిస్తూ వచ్చారు. అలా ఇవి ‘మేజికల్‌ ఫిగర్‌’
సినిమాలు కావడంతో, చిరు, బాలయ్య అభిమానులు కూడా
 వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే, దేశమంతా
 పుణ్యక్షేత్రాల్లో పూజల దగ్గర నుంచి తమ హీరోల ప్రత్యేక పుస్తకాల
విడుదల దాకా అనేకం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు
 తమ హీరో చిత్ర అఖండ విజయం కోసం గత నవంబర్‌
ఆఖరులో కార్తీక సోమవారానికి 1116 శివాలయాల్లో
 రుద్రాభిషేకం చేయించారు. 3 వ్యాన్లలో తిరుగుతూ,
సుమారు 9 రాష్ట్రాల్లో 39 రోజుల పాటు, 95 పుణ్యక్షేత్రాల్లో
 పూజలు చేసి, ‘భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర’ చేశారు.

చిరు అభిమానులు తామేం తక్కువంటూ అన్నయ్య రీఎంట్రీ
 సిన్మా విజయం కోసం... పుణ్యక్షేత్రాల సందర్శనకు దిగారు.
కాశీ విశ్వనాథుడికీ, విశాలాక్షికీ, కొల్హాపూర్‌లో మహాలక్ష్మి అమ్మవారికీ పూజలు చేశారు.

బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఏమో వంద సినిమాల లోగోలు, స్టిల్స్‌తో
‘ఎన్‌.బి.కె. 100 – నెవర్‌ బిఫోర్‌’ అంటూ ప్రత్యేక పుస్తకం,
క్యాలెండర్లు, డైరీలు ప్రింట్‌ చేసి, ఆడియో రిలీజ్‌ వేదికపై
విడుదల చేశారు. ఇక, చిరు వర్గం అండతో, ఆయన సినిమా
జీవితంపైనా కొన్ని పుస్తకాలు రిలీజ్‌కు ముందే విడుదలకు
 సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు ప్రొద్దుటూరులోని
 ఒక థియేటర్‌లో ఆయన నటించిన 100 సినిమాల్నీ రోజుకొకటి
 చొప్పున ప్రదర్శిస్తూ, శతచిత్రోత్సవం చేస్తున్నారు. చరిత్రలో
శాతకర్ణి ప్రవేశపెట్టిన ‘గుడీపడవా’ (గుడిసెపై జెండా) పండుగకు
గుర్తుగా 100 థియేటర్లపై శాతకర్ణి జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు.

మరోపక్క ‘అన్నయ్య’ రీ–ఎంట్రీకి తగ్గట్లు కర్ణాటకలోని
చిరు వీరాభిమాని ఒకరు ప్రత్యేకంగా పాట రాయించుకొని,
 ప్రముఖ గాయకుడు దీపూతో పాడించి, ‘వచ్చాడు వచ్చాడు
 చిరంజీవి వచ్చాడు...’ అంటూ దాన్ని ఆల్బమ్‌గా రిలీజ్‌ చేశారు.
ఇక, సిన్మా రిలీజ్‌ రోజు హంగామాకైతే ఇరు వర్గాల లక్షలాది
 అభిమానులూ సర్వసన్నద్ధమవుతున్నారు.
.........................................

బరిలో... మిగతా పందెం కోళ్ళు!

గత ఏడాది సంక్రాంతికి ఏకంగా 4 తెలుగు సినిమాలు
 వచ్చాయి. ఈ సారీ నాలుగు వస్తున్నాయి. చిరు,
బాలయ్య సినిమాల్ని పక్కనపెడితే, శర్వానంద్, అనుపమా
పరమేశ్వరన్‌లతో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’
సరిగ్గా సంక్రాంతి రోజున జనవరి 14న రిలీజ్‌ కానుంది.
 అలాగే, ఆర్‌. నారాయణమూర్తి చాలా కాలం తర్వాత
 బయటి నిర్మాతలకు పనిచేసిన ‘హెడ్‌కానిస్టేబుల్‌
వెంకట్రామయ్య’ కూడా జనవరి 14నే వస్తోంది.

‘శతమానం భవతి’ పూర్తిగా కుటుంబకథా చిత్రం ఫీల్‌తో
 సంక్రాంతి పండుగ ఫీల్‌ తెస్తుంటే, నల్లధనంపై పోరాటమనే
లేటెస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌ మీద వస్తున్న ‘హెడ్‌కానిస్టేబుల్‌
 వెంకట్రామయ్య’ ఆలోచింపజేస్తోంది. వరుసగా వచ్చే
 సెలవులు, ఇంటిల్లపాదీ సినిమాలు, షికార్లతో
ఆనందించాలనుకునే పండుగ వాతావరణం ఒకటికి,
నాలుగు సినిమాల్ని బాక్సాఫీస్‌ దగ్గర సునాయాసంగా
 గెలుపునిస్తుంది. అదే ఇప్పుడీ పోటాపోటీ రిలీజ్‌లకు
 పెద్ద ఊపిరి. సామాన్య ప్రేక్షక జనం కూడా ఇప్పుడు
చెబుతున్నది ఒకే మాట .. ‘మాకు నచ్చిందే చూస్తాం...
నచ్చితేనే చూస్తాం...’ మరి, ఈసారి సినిమా బరిలో
 సంక్రాంతి మొనగాడెవరో? జస్ట్‌ మరొక్క మూడు
రోజులు... లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ!

– డాక్టర్‌ రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 8th Jan 2017, Sunday, as Family 3 pages Supplement)
...........................................

Posted by Unknown at Monday, January 09, 2017 0 వ్యాఖ్యలు
Labels: ఇంటర్వ్యూలు, తెలుగు సినిమా, సినిమా - రాజకీయాలు, సినిమా - వివాదాలు

Tuesday, November 22, 2016

నివాళి ----- దర్శకుడు త్రిలోకచందర్!

ఎన్టీయార్, ఎమ్జీయార్, శివాజీ గణేశన్, సూపర్‌స్టార్ కృష్ణ, రజనీకాంత్‌లతో పని చేసిన నిన్నటి తరం దర్శకుడు డాక్టర్ ఎ.సి. త్రిలోకచందర్ ఇక లేరు. ఆరు దశాబ్దాలుగా సినీ రంగంతో అనుబంధమున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఆర్కాట్ ప్రాంతానికి చెందిన త్రిలోకచందర్ పూర్తి పేరు - ఎ. చెంగల్వరాయ ముదలియార్ త్రిలోకచందర్. తమిళ, తెలుగు, హిందీల్లో 65 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ఎ.వి.ఎం.తో అనుబంధం!
త్రిలోకచందర్ పేరు చెప్పగానే ఎన్టీయార్ ‘రాము’, ‘నాదీ ఆడజన్మే’, హీరో కృష్ణ ‘అవే కళ్ళు’ సహా పలు హిట్స్ గుర్తొస్తాయి. విద్యావంతులు సినిమాల్లోకి రావడమనే ధోరణికి తొలి ఆనవాళ్ళలో ఒకరు - త్రిలోకచందర్. ఆ రోజుల్లో ఎకనామిక్స్‌లో ఎం.ఏ చేసి, సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ, సినిమాల్లోకొచ్చారు.

షేక్స్‌పియర్ లాంటి ప్రసిద్ధుల రచనల తమిళ అనువాదాలు తల్లి ద్వారా చిన్న నాటే పరిచయమయ్యాయి. దాంతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగాయి. మిత్రుడైన నటుడు ఎస్.ఎ. అశోకన్ ద్వారా ఏ.వి.ఎం. అధినేత ఏ.వి. మెయ్యప్ప చెట్టియార్ కుమారుడు ఎం. శరవణన్‌తో జరిగిన పరిచయంతో త్రిలోక్ ప్రస్థానం మారిపోయింది. ఏ.వి.ఎం. కుటుంబంలో అందరితో ఆయనకు చివరి దాకా సాన్నిహిత్యం.  

తెలుగులో... ఇళయరాజా పరిచయకర్త!
దక్షిణాది సినీరంగంలో తొలితరం మార్గదర్శకులైన ఆర్. పద్మనాభన్, కె. రామనాథ్ లాంటి వారితో కలసి పనిచేసిన అరుదైన అనుభవం త్రిలోకచందర్‌ది. మొదట్లో ‘ఎ.సి.టి. చందర్’ అనే పేరుతో కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, ఆ పైన సహాయ దర్శకుడిగా ఆయన ప్రస్థానం సాగింది. ఎ.వి.ఎం ‘వీర తిరుమగన్’ (1962)తో దర్శకులయ్యారు. ‘మాయాబజార్’లో చిన్ననాటి శశిరేఖ పాత్ర దారిణి సచ్చుకి నాయికగా ఇదే తొలి చిత్రం. తమిళ నటుడు శివకుమార్ (హీరో సూర్య తండ్రి)ని ‘కాక్కుమ్ కరంగళ్’ ద్వారా పరిచయం చేసిందీ త్రిలోకే! ‘భద్రకాళి’(’77) ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఇళయరాజాకు తెలుగు తెరంగేట్రం చేసిందీ ఆయనే.

అటు శివాజీ... ఇటు ఎమ్జీయార్...
తమిళ రంగంలో రెండు భిన్న ధ్రువాలైన అగ్రనటులు శివాజీ గణేశన్, ఎమ్జీయార్‌లు - ఇద్దరితో పనిచేసిన ఘనత త్రిలోకచందర్‌ది. శివాజీతో 25 సినిమాలు రూపొందించారు. ఎ.వి.ఎం. సంస్థ ఎమ్జీయార్‌తో తీసిన ఒకే చిత్రం ‘అన్బే వా’కు త్రిలోకే దర్శకుడు.  

సాహిత్య ప్రభావంతో... ‘అవే కళ్ళు’!
బ్రిటీషు రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్ సృష్టించిన ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధనల తమిళ అనువాదాల్ని ఇష్టంగా విన్న, చదివిన అనుభవం త్రిలోకచందర్‌ది. చిన్నప్పటి ఆ డిటెక్టివ్ సాహిత్యపు పోకడల వల్లే ఆయన తెలుగులో కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్ళు’(’67) కథ సొంతంగా రాసుకొన్నట్లు కనిపిస్తుంది. అపరాధ పరిశోధన చిత్రాల్లో ఇవాళ్టికీ ‘అవే కళ్ళు’ ప్రత్యేకంగా నిలిచిందంటే అందుకు త్రిలోక్ ప్రతిభే కారణం.

ఎల్వీ ప్రసాద్‌కు ఏకలవ్య శిష్యుడు!
ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ‘ఆస్కార్’ అవార్డులకు మన దేశం పక్షాన ఎంట్రీగా వెళ్ళిన తొలి దక్షిణ భారత సినిమా ‘దైవ మగన్’ కూడా త్రిలోకచందర్ దర్శకత్వం వహించినదే! తెలుగు దర్శక - నిర్మాత ఎల్.వి. ప్రసాద్‌కి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకొ న్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం - ఈ విభాగాల్ని బలంగా నమ్మిన త్రిలోక్ 5సార్లు ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ బిరుదు అందుకున్నారు.

అనుభవాలే ఉపాధ్యాయులన్న సూత్రాన్ని నమ్మిన ఆయన ఎవరి జీవితం నుంచి వారు పాఠాలు నేర్చుకోవాల్సిందే అనేవారు. కానీ, స్వీయానుభవాలు ఎన్ని ఉన్నా, సాహిత్యంతో అనుబంధం త్రిలోక్‌ను దర్శకుడిగా ప్రత్యేకంగా నిలిపిందన్నది నేటి సినీ తరం తెలుసుకోవాల్సిన పాఠం! 

- రెంటాల

(Published in Sakshi daily, 16th June 2016)
................................
Posted by Unknown at Tuesday, November 22, 2016 0 వ్యాఖ్యలు
Labels: తమిళ సినిమా, తెలుగు సినిమా, పత్రికారచనలు, ప్రముఖులు

Monday, October 31, 2016

షష్టి స్ఫూర్తి (చిన్న జీయర్ స్వామీజీతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో  

 ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ 

భగవద్ రామానుజస్వామి...  వారిది మిలీనియమ్ మార్చ్!
దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! 
అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు!

పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్!
తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... 
నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. 
భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. 
మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు.

చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్!
వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి.
భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. 
మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... 
కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు.
ఊరి పెరటిలో... తులసి మొక్క...
సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి!
వీరికి 60 ఏళ్ళు...
వీరి పరంపరకు వెయ్యేళ్ళు...
వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!!   
 .......................................................

నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? 
(సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని!
గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా!
(చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది!

విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? 
విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు.

మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం.

సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు?
ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది.

కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? 
మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి.

మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! 
మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా!

ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి?  
ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు.

మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? 
(నవ్వుతూ... తల పంకించారు...)

సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? 
నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...).అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి.

సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! 
పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. 

మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం...
(నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం.

స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ...
(మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు.

ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో...
(నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి!

అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట!
(నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా.

మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే!
పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్‌డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం.

అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! 
(నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు!

కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది?
వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే!

ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..?
(ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో!

ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...!
అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి.  పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం.

మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు...
ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్‌మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్‌లన్నీ మేమే చింపేశాం.

మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట!
(నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం.

కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి?
ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల.

మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? 
అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే!

సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’ కన్నా‘గాడ్‌మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ!
నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు.

వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది?  
స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్‌వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం.

మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో?  
నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.

మరి, అందుకు ఏం చేయాలంటారు? 
పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి.  కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి.

రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’ అలాంటిదేనా? 
అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్‌టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం!

ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? 
ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది.

మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? 
మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే!

చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం?
ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి.

-  డాక్టర్ రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 29th Oct 2016, Saturday, Family Page)
......................................
Posted by Unknown at Monday, October 31, 2016 0 వ్యాఖ్యలు
Labels: ఇంటర్వ్యూలు, చరిత్ర-సాహిత్యం-సంస్కృతి, పత్రికారచనలు, ప్రముఖులు
Older Posts
Grab this Widget ~ World Of Blogging

వినరో భాగ్యము

Powered by eSnips.com

నాకు నచ్చిన మాటలు

  • అక్షరం
    తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
    5 years ago
  • ఆముక్తమాల్యద
    మాలదాసరి కధ - 2
    5 years ago
  • తూర్పు-పడమర
    సంచయనం
    7 years ago
  • Vantage Point
    Why Indra The Tiger is a permanent fixture on Indian television
    9 years ago

అంతర్జాలంలో తెలుగు


మాలిక: Telugu Blogs




తెలుగు బ్లాగర్ల సమూహం
తెలుగు బ్లాగుల సమాహారం
తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం
సాహిత్యం గుంపు

ఊరకరారు మహాత్ములు

స్వగతం

Unknown
View my complete profile

సుస్వాగతం

వర్గాలు

  • 'ఈ' టి.వి. కథనం (1)
  • 'నేడే విడుదల' (11)
  • 'భక్త ప్రహ్లాద' (21)
  • 100 ఏళ్ళ భారతీయ సినిమా (23)
  • 18వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ (3)
  • Bhakta Prahlada (3)
  • First Telugu Talkie (2)
  • Telugu Cinema anniversary (2)
  • The Hans India (1)
  • The Hindu (1)
  • అవార్డులు (6)
  • ఆధ్యాత్మికం (4)
  • ఇంటర్వ్యూలు (56)
  • ఉత్తమ సినీ విమర్శకుడు (3)
  • ఎన్.టి.ఆర్. (4)
  • కన్నడ సినిమా (1)
  • కాళిదాస్ (3)
  • చరిత్ర - సాహిత్యం - సంస్కృతి (13)
  • చరిత్ర- సాహిత్యం-సంస్కృతి (15)
  • చరిత్ర-సాహిత్యం-సంస్కృతి (7)
  • జనరల్ (12)
  • జనరల్ - ఆధ్యాత్మికం (7)
  • జనరల్ - జర్నలిజమ్ (11)
  • జనరల్ - బెజవాడ కరీమ్ హోటల్ కబుర్లు (3)
  • జనరల్ - విశిష్ట వ్యక్తులు (39)
  • జనరల్ - స్నేహం - సినిమా (4)
  • జనరల్ -విశిష్ట వ్యక్తులు (42)
  • టి.వి-9 కథనం (1)
  • టెన్ టివి (19)
  • తమిళ సినిమా (37)
  • తెలుగు సినిమా (262)
  • తెలుగు సినిమా జన్మదినం (12)
  • నంది అవార్డులు (4)
  • నూకల చిన సత్యనారాయణ (2)
  • పత్రికా రచనలు (224)
  • పత్రికారచనలు (120)
  • పరిశోధన (19)
  • పెళ్ళి చేసి చూడు (1)
  • ప్రముఖులు (92)
  • భారతీయ సినిమా (23)
  • మలయాళ సినిమా (4)
  • మారుతీ హాలు (1)
  • రాజకీయాలు (2)
  • రేడియో తరంగ (1)
  • వివాదాలు (5)
  • వ్యక్తిత్వాలు (13)
  • శ్రీరామరాజ్యం (4)
  • సాహిత్యం (6)
  • సాహిత్యం - సంస్కృతి (23)
  • సినిమా (40)
  • సినిమా - కృష్ణానగర్ కబుర్లు (15)
  • సినిమా - కోడంబాకమ్ కబుర్లు (12)
  • సినిమా - పెళ్ళి (5)
  • సినిమా - రాజకీయాలు (32)
  • సినిమా - వివాదాలు (152)
  • సినిమా - సమీక్షలు (173)

పాత రచనలు

  • ▼  2017 (1)
    • ▼  January (1)
      • స్టార్‌ వార్స్‌... ఇంద్రసేన వర్సెస్‌ సమరసింహ.... ...
  • ►  2016 (21)
    • ►  November (1)
    • ►  October (3)
    • ►  August (4)
    • ►  July (6)
    • ►  June (2)
    • ►  March (1)
    • ►  February (3)
    • ►  January (1)
  • ►  2015 (117)
    • ►  December (8)
    • ►  November (11)
    • ►  October (16)
    • ►  September (2)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (9)
    • ►  April (13)
    • ►  March (21)
    • ►  February (21)
    • ►  January (12)
  • ►  2014 (110)
    • ►  December (13)
    • ►  September (15)
    • ►  August (14)
    • ►  July (14)
    • ►  June (10)
    • ►  May (11)
    • ►  April (15)
    • ►  January (18)
  • ►  2013 (124)
    • ►  December (11)
    • ►  November (13)
    • ►  October (31)
    • ►  September (23)
    • ►  August (19)
    • ►  July (18)
    • ►  June (1)
    • ►  February (5)
    • ►  January (3)
  • ►  2012 (11)
    • ►  November (1)
    • ►  October (3)
    • ►  September (1)
    • ►  March (2)
    • ►  February (4)
  • ►  2011 (24)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (3)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (5)
    • ►  January (6)
  • ►  2010 (71)
    • ►  December (11)
    • ►  November (1)
    • ►  October (19)
    • ►  September (23)
    • ►  August (12)
    • ►  July (5)

కొత్త వ్యాఖ్యలు

పత్రికా ప్రపంచం

  • The Indian Express
  • The Times of India
  • The Hindu
  • ఆంధ్రభూమి
  • ఆంద్రప్రభ
  • సాక్షి
  • ఆంధ్రజ్యోతి
  • ఈనాడు
  • ప్రజాశక్తి
  • సూర్య

మిత్రులు

 
2010 ఇష్టపది Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Design by Evan Eckard Design