జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 10, 2011

నిజం చెబితే నేరమా?




‘శ్రీరామరాజ్యం’పై ఇష్టపదిలో రాసిన మూడు భాగాల సమీక్షపై వచ్చిన ప్రశంసలకు కానీ, విమర్శలకు కానీ వెంటనే స్పందించలేకపోయాను. సమీక్ష రాస్తున్న నాటికే ఉన్న పని ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు మరికొంత పెరగడంతో, తీరిక చేసుకొని తాపీగా స్పందించాలన్న ఆలోచన సఫలం కాలేదు. ఏమైనా, అందుకు ముందుగా మన్నించాలి. ఆ హడావిళ్ళ మధ్యనే ఈ నాలుగు మాటలు...


విషయానికి వస్తే, సినిమా చూశాక అందులో కనిపించిన, అనిపించిన తప్పొప్పుల గురించి మాట్లాడుకోవడం మామూలుగా ఎవరమైనా చేసే పనే. సినిమా గురించి సమీక్షిస్తున్నప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా చేయాల్సిన పని. ఆ మధ్య తాజా ‘శ్రీరామరాజ్యం’ సినిమా గురించి ఈ ‘ఇష్టపది’ బ్లాగులో అదే చేశాను. కానీ, చిత్రంగా ఈ విషయానికి చాలా మందికి కోపాలు వచ్చాయి. కొందరేమో నన్ను, నా సమీక్షనూ దుమ్మెత్తి పోశారు. ఆవేశంతో ఊగిపోయిన వీరవరులేమో ఏకంగా వ్యక్తిగత జీవితాలపై విమర్శలకూ దిగారు. శ్రీరామరాజ్యం దర్శక, రచయితలకూ, హీరోకూ అపారంగా ఉన్న భక్త జనగణం ఎనానిమస్ గా ప్రచురణార్హం కాని వ్యాఖ్యలూ చేశారు.

సినిమా బాగోగుల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. అందులో అందరి అభిప్రాయాలూ, అన్ని అభిప్రాయాలూ ఒకటేలా ఉండాలన్న రూలూ ఏమీ లేదు. ఏకీభవించడానికి ఎంత అవకాశం ఉందో, అవతలివారి అభిప్రాయంతో గౌరవపూర్వకంగానే విభేదించడానికీ అంతే స్వేచ్ఛ ఉంది. కానీ, విభేదించినంత మాత్రాన దూషణలు, దోషారోపణలు చేయడమన్నది వారి వారి సంస్కారానికి సంబంధించిన విషయం.

ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా ఆ చిత్రం మీద కానీ, ఆ చిత్రానికి పని చేసిన వారి మీద కానీ రాగద్వేషాలు లేకుండా సినిమాను సమీక్షించడం శాస్త్రీయమైన, సమర్థనీయమైన పద్దతి. అది ఎంత చక్కగా చేస్తే, అంత నిష్పాక్షికంగా సమీక్ష ఉంటుందనేది విజ్ఞులకు చెప్పనక్కరలేదు. శ్రీరామరాజ్యంపై ఈ సమీక్షకుడు ఇష్టపదిలో చేసిందీ అదే. పైగా, మన తెలుగు జాతికి కల్ట్ ఫిగర్లయిన బాపు - రమణలంటే గౌరవం, వారి సృజనాత్మక కృషి పట్ల అభిమానం, వారి స్నేహ సౌశీల్యాలతో సన్నిహిత పరిచయం ఉన్నా, వీలైనంత వరకు అవేవీ అవరోధం కాకుండా, శ్రీరామరాజ్యం సినిమాను సమీక్షించాలని ప్రయత్నించడం జరిగింది.

కానీ, ఫలానా వారి సినిమా కాబట్టి, ఫలానా తరహా (పౌరాణికం, జానపదం, వగైరా వగైరా) సినిమా కాబట్టి, ఫలానా కథాంశం మీద కాబట్టి ఎలా ఉన్నా సరే బాగుందనే అనాలంటే, ఇక దానిలో చర్చ లేదు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలోని లోటుపాట్ల గురించి చేదు నిజాలు చెబితే, ఆ లోటుపాట్ల మీద మాట్లాడకుండా, నాకు నచ్చింది కాబట్టి, నచ్చలేదనడానికి నువ్వెవడివి అంటూ ఒళ్ళంతా కారం పూసుకొంటే చెప్పగలిగిందేమీ లేదు. తేటతెలుగులో తిట్టినా, తిట్టుకున్నా లాభం లేదు.


పాత్ర చిత్రణలోనైనా, చిత్రీకరణలోనైనా, సాంకేతికంగానైనా లోటుపాట్ల గురించి చర్చించుకొంటే, సినిమా మీద అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతుంది. అలా కాకుండా రాజుగారి దేవతా వస్త్రాల కథలో లాగా డూడూ బసవన్నలా ఉందామంటే.... ఏ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అందామంటే.... పుంజాలు తెంపుకొని ఏ దర్శకుడికి, ఆ దర్శకుడికి, ఏ హీరోకు ఆ హీరోకు భట్రాజుల్లా వ్యవహరిద్దామంటే.... దానికి మళ్ళీ బ్లాగులెందుకు? ఇప్పటికే ఉన్న కొన్ని భజన పత్రికలు, చానళ్ళు చాలవా?


ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు --- అది సమీక్షలు రాయడంలోనైనా..! పోస్టు వేయడంలోనైనా..! వ్యాఖ్యలు, ప్రశంసలు, విమర్శలు రాసినవాళ్ళకీ, రాళ్ళు విసిరిన వారికీ - అందరికీ కృతజ్ఞతలు.

Tuesday, November 29, 2011

‘శ్రీరామరాజ్యం’ - చేజారిన మహదవకాశం?



(‘శ్రీరామరాజ్యం’ సినిమా సమీక్ష - పార్ట్ 3)

(మునుపు రాసినవేమో...

పార్ట్ 1 - ‘రామరాజ్యమంటే ఇదా...!?’,
పార్ట్ 2 - ‘శ్రీరామరాజ్యం - చిన్న లోపాలే పెద్ద శాపాలా?

ఆ రెండు పోస్టులకు కొనసాగింపుగా ఇది చివరి భాగం)



పౌరాణికాలకు పెట్టింది పేరైన మన తెలుగు చిత్ర పరిశ్రమలో 14 ఏళ్ళ తరువాత వచ్చిన పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం - ఈ 'శ్రీరామరాజ్యం'. దీనికి ముందు తెలుగులో ఆఖరుగా వచ్చిన నేరు పౌరాణిక చిత్రం చిన్న ఎన్టీయార్ పసివయసులో రాముడిగా నటించిన బాలల చిత్రం 'రామాయణం' (1997). ఆ తరువాత వచ్చిన 'శ్రీరామదాసు', 'పాండురంగడు' లాంటివి పూర్తి పౌరాణిక చిత్ర వర్గంలోకి రావు. చిరంజీవి 'శ్రీమంజునాథ' పౌరాణికమైనా, అది అనువాద చిత్రం. మీడియాలో ఒక వర్గం మాత్రం 'రామాయణం' కన్నా ఏడాది ముందే బాలకృష్ణ నటించిన విజయా వారి 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) చిత్రాన్నే ఆఖరుగా వచ్చిన పౌరాణిక చిత్రంగా పేర్కొంటూ, 'శ్రీరామరాజ్యం' ప్రచార కథనాలు ఇటీవల ప్రసారం చేసింది. ఏమైనా, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న భారీ పౌరాణిక చిత్రంగా సహజంగానే 'శ్రీరామరాజ్యం' పై అందరిలో ఆసక్తి, తెలుగుదనానికి ప్రతీకలైన బాపు - రమణల చిత్రం కావడంతో కొన్ని అంచనాలు నెలకొన్నాయి. పైగా, పెరిగిన సాంకేతికత నేపథ్యంలో వస్తున్న మహదవకాశమైన ఈ భారీ పౌరాణికానికి పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు పనిచేశారు.

సంగీతం, సాహిత్యం, నృత్యాల శ్రమ ఫలించిందా ?

సంగీతం ఇళయరాజా అందించారు. పాటలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశారు. ఇళయరాజా సంగీతంలో ఒకటి, రెండు పాటల్లో తప్ప, మిగిలిన చోట్ల మునుపటి మ్యాజిక్ లేదు. 'సాగర సంగమం' లాంటి కొన్ని చిత్రాల్లో ఇప్పటికీ చెప్పుకొనే ఆయన మార్కు రీ-రికార్డింగు 'శ్రీరామరాజ్యం'లో వినిపించదు. ఉదాహరణకు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో రాజమందిరంలో రాముడు వేదనాపూర్వకంగా సంభాషించే సన్నివేశం లాంటివి చూస్తే, రీ-రికార్డింగ్ జరపడానికి ముందే రీలు హాలుకు వచ్చేసిందేమో అనిపిస్తుంది. రీ-రికార్డింగ్ కి అంటూ హంగేరీకి కూడా వెళ్ళి వచ్చిన ఇళయరాజా బృందం అక్కడ ప్రత్యేకంగా చేసినదేమిటమని అనుమానం కలుగుతుంది.

కవి, పండితుడైన జొన్నవిత్తుల పాటల్లో 2, 3 వినగా, వినగా బాగున్నాయి. 'జగదానంద కారకా... జయ జానకీ ప్రాణనాయకా... ' అన్న త్యాగరాయ కీర్తన మకుటంతో రాసిన పల్లవి సినిమా రిలీజుకు ముందు నుంచే తెలుగు నాట ఇంటింటా మారుమోగింది. ఇక, 'దేవుళ్ళే మెచ్చింది... మీ ముందే జరిగింది... ' అంటూ లవకుశులు చేసే రామాయణ గానం కూడా విన్నకొద్దీ ఎక్కే పాట. అందులో ముఖ్యంగా సీతకు అగ్నిపరీక్ష సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాసిన '...ఎవ్వరికీ పరీక్ష, ఎందులకీ పరీక్ష, ...రాముడి ప్రాణానికా, జానకి దేహానికా.... ' లాంటి వాక్యాలు మనసుకు తాకుతాయి. సీతను అడవిలో వదిలే సమయంలో వచ్చే విషాద గీతం 'గాలి..నింగి..నీరు... ' కూడా ఇళయరాజా బాణీలో, భావోద్వేగాలను పండించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వాణిలో కదిలిస్తుంది. శ్రేయా ఘోశల్ లాంటి గాయనీ గాయకులు ఈ చిత్ర గీతాలను బాగానే పాడారు.

అయితే, వచ్చిన చిక్కేమిటంటే, మొత్తం మీద పాటల్లో సాహిత్యం బాగున్నా, కథకు కావాల్సిన ఆర్తి, ఆవేదన, ఆవేగం అన్ని చోట్లా పలకలేదు. పైగా, విడిగా వినప్పటి కంటే, తెరపై దృశ్యంతో కలసి విన్నప్పుడు వాటి స్థాయి మరికొంత తగ్గిందేమో అనిపిస్తుంది. ఇక, ఆల్ టైమ్ హిట్లుగా నిలిచిన 'లవకుశ'లోని 'శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా... ', 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...' లాంటి పాటలతో పోలికలు రానే వస్తాయి. అదీ ఓ ప్రతికూలతే. అన్నట్లు ఈ చిత్రానికి మొదట్లో వెన్నెలకంటితో 2 పాటలు, కొన్ని పద్యాలు కూడా రాయించారు. రికార్డు కూడా చేసినట్లున్నారు. మరి, సినిమాలో అవేవీ లేవు. జొన్నవిత్తులదే సింగిల్ కార్డు. దీనికి వెనుక కథేమిటో తెలియదు.

ఈ చిత్రానికి డ్యాన్స్ మాస్టర్ సీనియర్ టెక్నీషియన్ శ్రీను. అయితే, ఈ సినిమాలోని నృత్యగీతాలు, ముఖ్యంగా రాముల వారి అయోధ్యా నగర ప్రవేశం, సీతమ్మవారి సీమంతం పాటలకు కంపోజ్ చేసిన బృంద నృత్యాలు పౌరాణిక సినిమాలకు తగ్గట్లుగా అనిపించవు. పైగా శాస్త్రానుసారం రంగస్థలి మీద ఉండకూడని లోపాలూ ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్య తార (ల)ను మధ్యలో పెట్టుకొని, బృంద నర్తకులు చుట్టూ తిరిగి నర్తిస్తున్నప్పుడు కథకూ, సినిమాకూ ప్రధానమైన ఆ ముఖ్య తారలు, వారి ముఖాలు కనపడాలి కదా. వారు కనపడరు సరి కదా, ఈ బృంద నర్తకుల పృష్ఠ భాగాలు తెరపై తారట్లాడుతూ, చూపరులకు చెప్పుకోలేని చీకాకు కలిగిస్తాయి.

అతుకుల బొంతగా ఆధునిక సాంకేతికత

జి.జి. కృష్ణారావు కూర్పు అద్భుతాలు, ఆశ్చర్యాలు లేకుండా, సాఫీగా సాగిపోతుంది. కళా దర్శకత్వానికి వస్తే - ఎస్. రవీందర్, కిరణ్ కుమార్ లు ఆ బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా, వాల్మీకి ఆశ్రమం (కళా దర్శకుడు ఎస్. రవీందర్), అయోధ్య రాజమందిరం లాంటివి పూర్తి స్థాయి అచ్చమైన సెట్లయితే, మిగిలినవి కొద్దిగా వేసిన సెట్ కు, మిగతా భాగం విజువల్ ఎఫెక్టులు జోడించిన వర్చ్యువల్ సెట్లు.

సుమారు రెండుమ్ముప్పావు గంటల ఈ సినిమాలో దాదాపుగా రెండుంబావు గంటల దాకా గ్రాఫిక్స్ ఉన్నాయి. అందు కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు - ఏకంగా నాలుగు సంస్థల వారు (ఇ.ఎఫ్.ఎక్స్, పిక్సెలాయిడ్, మకుట, ఆరెంజ్ మీడియా) శ్రమించారు. కానీ, తెరపై తుది ఫలితం మాత్రం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. అయోధ్యా నగర వీధులు, రాజ ప్రాసాదంలో కోటంత ఎత్తు గోడలు, ద్వారాలు, తలుపులు వగైరాలన్నీ కంప్యూటర్ లో రూపొందించిన వర్చ్యువల్ సెట్లే. ఇలాంటి వర్చ్యువల్ సెట్లు సైతం కంటికి తేడా తెలియకుండా గ్రాఫిక్స్ లో నేర్పుగా చేసిన తీరు మనం మునుపటి ‘అరుంధతి’, ‘మగధీర’ (2009) చిత్రాల్లో చూశాం. కానీ, ‘శ్రీరామరాజ్యం’లో మాత్రం ఈ గ్రాఫిక్స్ విశ్వామిత్ర సృష్టి సెట్స్ లో చాలా భాగం సహజంగా లేవు. నాటకాల్లో, పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పరిసర వాతావరణాన్ని సృష్టించడానికి గుడ్డ మీద వేసిన బొమ్మలను వాడినట్లుగా ఉంది.

పైగా, కెమేరా కంటి (ప్రేక్షకుడి) దృక్కోణానికి కానీ, సన్నివేశంలోని పాత్రధారులు నిలబడిన తలానికి సారూప్యంగా కానీ, వారి కదలికలకు తగ్గట్లుగా కానీ ఈ బ్లూ మ్యాట్ ద్వారా సృష్టించిన గ్రాఫిక్ సెట్లు లేవు. ఒకరకంగా ఇవి ఆధునిక సాంకేతికతలోనూ మనం ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నామని చెప్పకనే చెబుతాయి.

ఇక, అయోధ్యలోని రాజమందిర అంతర్భాగంలోని సూర్య భగవానుడి భారీ విగ్రహం మనవాళ్ళ అరకొర గ్రాఫిక్స్ లో మెల్లకన్నుతో సాక్షాత్కరిస్తుంది. పైగా, సినిమాలో ఓ సన్నివేశంలో దాన్ని మిడ్ క్లోజప్పులో చూపేసరికి, హాలులో ప్రేక్షక జనం హాహాకారం చేయడం ఒక్కటే తక్కువ. ఆ మందిరంలో రాముడి పూర్వీకులైన రఘువంశ రాజుల విగ్రహాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క విగ్రహం మాత్రం చేతిలో ధనుస్సుతో 'సత్య హరిశ్చంద్ర' సినిమాలోని పెద్ద ఎన్టీయార్ పోలికలతో చూడగానే, గుర్తుపట్టేలా ఉంటుంది.

జంతు సంక్షేమ మండలి కఠిన నిబంధనలైతేనేం, ఈ రోజుల్లో పెరిగిన ఖర్చు వల్ల అయితేనేం ఈ సినిమాలో వాల్మీకి ఆశ్రమంలో కనిపించే లేళ్ళు, జింకలు, నెమళ్ళు వగైరాలన్నీ గ్రాఫిక్స్ సృష్టే. అయితే, వాటిని సరిగా దృశ్యంలో అతకకపోవడంతో, జింకల పక్కనే, వాటి కొమ్ముల మధ్య నుంచి పాత్రధారులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూడా కంప్యూటర్ సృష్టికీ, కెమేరా కంటితో పాత్రధారుల మీద తీసిన దృశ్యానికీ పర్ స్పెక్టివ్ లో తేడా తెలుస్తుంటుంది. రథంలో లక్ష్మణుడు, సీతను అడవికి తీసుకువెళ్ళే దృశ్యంలో వచ్చే టాప్ యాంగిల్ షాట్లకూ ఇదే తంటా వచ్చింది.

కెమేరాతోనూ కొరవడిన తృప్తి

ఇటీవల కాలంలో బాపు చిత్రాలు, ‘శ్రీభాగవతం’ సీరియల్ కు పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ పి.ఆర్.కె. రాజు గారే ఈ చిత్రానికీ ఛాయాగ్రాహకులు. పాత్రధారులను చూపిన తీరు, లైటింగ్ వగైరాల్లో కెమేరా పనితనం బాగుందనిపిస్తుంది. బాపు మార్కు క్లోజప్పులు సరే సరి. కానీ, ఇద్దరు పాత్రధారుల మధ్య సాగే సంవాదాల లాంటి దృశ్యాల్లో కెమేరా తేలిపోయింది.

పాత్రధారుల్లో ఒకరు కెమేరాకు దగ్గరగా ముందు, వేరొకరు కెమేరాకు కాస్త దూరంగా వెనుక ఉన్నప్పుడు కెమేరాను స్థిరంగా ఉంచి, డైలాగు చెబుతున్న పాత్రధారి మీదకు లెన్సును ఫోకస్ పెట్టడం సాధారణంగా ఆనవాయితీ. డైలాగు చెప్పే అతను ఫోకస్ లో, డైలాగు లేని రెండో పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఒకే ఫ్రేములో కనిపించడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కెమేరా కదలకుండా ఉంటూనే, డైలాగు చెప్పే పాత్రధారి మారినప్పుడల్లా ఆ పాత్ర మీదకు ఫోకస్ మాత్రం మారుతూ వస్తుంది. ఈ ప్రాథమికమైన పద్ధతిని పాటించకుండా, కెమేరాతో పాటు ఫోకస్ ను కూడా కదపకుండా అలాగే ఉంచేసిన దృశ్యాలు 'శ్రీరామరాజ్యం'లో కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దాంతో, కొన్నిసార్లు డైలాగు చెబుతున్న పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఉంటాడు. అందుకే, ఇంతటి బ్రహ్మాండమైన నిర్మాణ విలువలున్న భారీ బడ్జెట్ సినిమాలోనూ, ఈ లోపాలు ప్రేక్షకుడికి రసభంగం కలిగిస్తాయి. తెలియని అసంతృప్తిని కలిగిస్తాయి.

నిజాయితీ, నిర్మాణ విలువలే శ్రీరామరక్ష

78 ఏళ్ళ వయసులోనూ దర్శకుడిగా బాపు తన మార్కు చూపడానికి తపించారు. ప్రతి ఫ్రేమునూ సౌందర్యభరితంగా చూపాలని ప్రయత్నించారు. తనకు మాత్రమే ప్రత్యేకమైన ఫ్రేములతో దృశ్యాలను కన్నులపండుగ చేశారు. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ముళ్ళపూడి వెంకట రమణ సామాన్య జనభాషలో రచన చేశారు. ఒకటి, రెండు చోట్ల తన కలంలో మెరుపులూ మెరిపించారు.

కానీ, కథను తెరపై నడిపిన తీరులో, అందుకు ఎంచుకున్న ఘట్టాల్లో క్రమానుగత పరిణామం, రసావిష్కరణకు ప్రాతిపదిక, ఆ దిశగా ప్రయాణం, తుది ఫలితం సమగ్ర రూపం ధరించలేదు. ఈ కథ మొత్తాన్నీ సింహావలోకనం చేస్తే - కథలోని పాత్రలకు ఎదురయ్యే సమస్యకు మూలం - సీతపై లోకనింద. దానికి వెరచిన రాముడి ప్రతిస్పందన ఏమిటంటే - సీతాపరిత్యాగం. అంటే ఆ యాక్షన్ కు రాముడి రియాక్షన్ అది. దాని పర్యవసానం - భార్యాభర్తల వియోగం, రాముడికీ, సీతకూ మానసిక సంఘర్షణ. ఈ చిక్కుముడిని విడదీసే ముగింపు - రాముడు, లవకుశులు తమ బాంధవ్యం తెలుసుకొని కలుసుకోవడం.

స్క్రిప్టుకు ప్రధానమైన ఈ అంశాల్లో రాముడి మానసిక సంఘర్షణ, భర్తృ వియోగ బాధతో సీతా సాధ్వి వేదన, తల్లితండ్రులు అని తెలియకుండానే శ్రీరాముడి మీద, సీతమ్మ మీద లవకుశులు గౌరవ అనురాగాలు పెంచుకోవడం, రాముడు సీతమ్మను కారడవుల పాలు చేశాడని తెలిసి సాక్షాత్తూ ఆయననే తిరస్కరించడం లాంటివి ఎంత బాగా ఎలివేట్ అయితే, తెరపై కథ అంత బాగా పండుతుంది. దానికి బాల లవకుశుల చేష్టలతో అద్భుత, హాస్య రసాలు కూడా తగు పాళ్ళలో చేరిస్తే మరింత బాగుంటుంది. కానీ, ఈ చిత్రంలో అవన్నీ దేనికవిగా మిగిలాయి. కలసికట్టుగా కుదరలేదు. పైగా, మామూలు ఘట్టాలుగానే వచ్చాయి తప్ప, మనస్సును ఆర్ద్రపరిచే అనుభవాలుగా మారలేదు.

సినిమా అనేది నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషి అయిన సమాహార కళ కావడంతో ఏ విభాగంలోని ఏ చిన్న లోపమైనా, ఇతర విభాగాలపై ప్రభావం చూపుతుంది. అది అనివార్యం. 'శ్రీరామరాజ్యం'కూ అదే జరిగింది. ఇంతటి ప్రచార ఆర్భాటంలోనూ, దేవతా వస్త్రాల కథలో లాగా అందరి ఆహా ఓహోల మధ్యలోనూ సినిమాకు ప్రేక్షకులూ, వసూళ్ళూ తక్కువగా ఉండడానికి కారణం అదే.

ఈ సినిమాకు సంబంధించి మారు మాట్లాడకుండా మెచ్చుకోవాల్సింది మాత్రం - నిర్మాతనే. లాభనష్టాల ధ్యాస లేకుండా, ఈ కథను ఈ తరం వారికి అందించాలన్న ఆయన కృత నిశ్చయానికి జోహార్లు. అందుకోసం ఆయన సర్వశక్తులూ కేంద్రీకరించి చేసిన వ్యయం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పౌరాణిక చిత్రం ఈ రోజుల్లో ప్రతి ఫ్రేములో ఇంత రిచ్ గా కనబడడానికి ఆయనే కారణం. యూనిట్ ను నమ్మి ఆయన పెట్టిన ప్రతి పైసానూ తెర మీద కళకళలాడే దృశ్యాల్లో చూడవచ్చు. కరెన్సీ కట్టల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరం కోసం, ఇలాంటి చిత్రం తీయాలనే ఈ రకం నిర్మాత ఉండడమే పెద్ద విచిత్రం, విశేషం. తమ ఊళ్ళోని ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి నమ్ముకొని ఆయన ఇంత సాహసం చేశారు. ఆ భక్తి శ్రద్ధలూ, నిజాయితీలే ఆయనకూ, ఈ సినిమాకూ శ్రీరామరక్ష. ఆయన కోసమైతే ఈ సినిమా అందరం తప్పనిసరిగా చూడాల్సిందే. ఉత్తర రామాయణ గాథను బాపు - రమణల బాణీలో ఈ తరం పిల్లలకూ చూపాల్సిందే.

కొసమెరుపు --

పౌరాణిక చిత్రాలతో ఇంటింటా దేవుడిగా వెలిసిన పెద్ద ఎన్.టి.ఆర్.కు నిజజీవితంలో వీపు మీద ఎడమవైపున చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది. ఆయన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది. గమ్మత్తేమిటంటే, ఆయన కుమారుడైన బాలకృష్ణకు ఈ సినిమాలో కావాలని వీపు మీద పెట్టుడు పుట్టుమచ్చను మేకప్ లో సృష్టించారు. అయినా వారసత్వ హీరోల వెర్రి కానీ, ఈ పెట్టుమచ్చలతో పెద్దాయనను అనుకరించే కన్నా, ఆ అనుకరణేదో ఇలాంటి పాత్రపోషణ సందర్భంలో ఆయన పాటించే నియమాలు, చేసే కఠోర పరిశ్రమలో ఉండి ఉంటే, ఈ ముదురు రాముడు కూడా తెరపై మరింత అందంగా ఉండేవాడేమో...!?

అన్నట్లు, 'శ్రీరామరాజ్యం' చిత్ర నిర్మాణం మొదలైనప్పుడు ఈ సినిమాలో భరతుడి పాత్ర సాయికుమార్ పోషిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. తీరా ఏమైందో కానీ, సినిమా విడుదలయ్యాక తెర మీద మాత్రం భరతుడి పాత్రలో నటుడు సమీర్ కనిపించారు. అయితే, ఈ సినిమా గురించి టీవీల్లో, పేపర్లలో, ఇంటర్నెట్ లో విపరీతమైన హడావిడి చేస్తున్న మీడియాలో కొందరు సినిమా విడుదల రోజు దాకా భరతుడిగా సాయికుమార్ అని రాస్తూ వచ్చారు. అంతే కాదు, తీరా సినిమా విడుదలయ్యాక కూడా ఇప్పటికీ భరతుడిగా సాయికుమార్ నటించినట్లు రాస్తూనే ఉండడం చిత్రాతిచిత్రం. విడుదలకు ముందు వివరాలు కనుక్కొని రాయకపోతే మానె, కనీసం విడుదలై కళ్ళారా సినిమా చూశాకైనా తప్పు దిద్దుకోకపోతే.... ఇంకేమనాలి..!?

రామ......! రామ.....!

Monday, November 28, 2011

‘శ్రీరామరాజ్యం' - చిన్న లోపాలే పెద్ద శాపాలా?




(‘శ్రీరామరాజ్యం' సినిమా సమీక్ష - పార్ట్ 2. 'రామరాజ్యమంటే ఇదా...!?' పోస్టుకు ఇది తరువాయి భాగం)

నటనను మించిన డబ్బింగ్

‘శ్రీరామరాజ్యం'లో సీతగా నయనతార కనిపిస్తారు. ఆ పాత్రకు ఆమెను తీసుకున్నప్పటి నుంచి ఎన్నెన్ని చర్చలు జరిగాయో తెలిసిందే. కానీ, కురచ దుస్తుల్లో కమర్షియల్ చిత్రాల్లో కనిపించే నయన తారను కూడా సీత పాత్రకు తగ్గట్లుగా, ఒడుపుగా తీర్చిదిద్దడం విశేషమే. సినీ జీవితంలో నభూతో నభవిష్యతి అవకాశమిదని గ్రహించిన నయనతార సైతం దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. గొంతు ఎలాగూ డబ్బింగే కాబట్టి, తాను చేయగలిగిందల్లా ఆంగికాభినయం ద్వారా తాను చేయగలిగినదంతా చేశారు. ఆ మేరకు ఆమెకు మార్కులు వేయాల్సిందే. కానీ, ఆమె పాత్రలోని మానసిక సంఘర్షణను వెల్లడించేలా తెరపై పండే సీన్లు స్క్రిప్టులోనూ పెద్దగా లేవు. ఉన్న ఒకటీ అరా సీన్లలో ఆమెకున్న పరిమితులూ తెలిసిపోతుంటాయి.

నయనతారకు ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి సునీత గాత్రదానం చేశారు. సునీత మరీ అతిగా ప్రయత్నించడం వల్లనో ఏమో, అసలు అభినయం కన్నా కొసరు స్వరానిదే పైచేయి అయింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని 'శ్రీరామదాసు' (2006) చిత్రంలో రామదాసు భార్య కమల పాత్రధారిణి స్నేహకు డబ్బింగ్ చెప్పినప్పుడు సరిగ్గా అతికినట్లున్న సునీత గళం ఈ చిత్రంలో మాత్రం ఇడ్లీ కన్నా చట్నీ ఎక్కువైన ఫీలింగ్ కలిగించింది.

అక్కినేని పాత్రలో వాల్మీకి

చాలా ఏళ్ళ తరువాత అక్కినేని నాగేశ్వరరావు తెరపై కనిపించారు. అదీ పౌరాణిక పాత్రలో - వాల్మీకిగా. ఎనిమిది పదుల పై చిలుకు వయసొచ్చిన ఏయన్నార్ రెండు గాత్రాలూ (అటు శరీరమూ, ఇటు గొంతు) అదుపు తప్పినా, తన అనుభవంతో ఈ పాత్రను నడిపేశారు. మొదట కాసేపు ఆ గెటప్, ఆ వాచికం ప్రేక్షకుడికి కొత్తగా అనిపించినా, కాసేపయ్యే సరికి అంతా అలవాటై, సర్దుకుంటుంది. ''స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య'' అని చెప్పే అక్కినేనికి స్వతహాగా తనకు కుడి కన్ను కన్నా ఎడమ కన్ను చిన్నదని తెలుసు. ఆ లోపం తెర పై తెలియకుండా ఉండడం కోసం, ఆ కనుబొమ పైకెత్తి, ఆ కంటిని విప్పార్చి చూస్తూ నటిస్తూ ఉంటాననీ ఆయనే ఈ సమీక్షకుడితో ఒక సందర్భంలో వివరంగా చెప్పారు. కానీ, 'శ్రీరామరాజ్యం'లో మాత్రం చిన్నదైన ఆ ఎడమ కన్ను ఇదేమీ తెలియని సామాన్యులకు కూడా తెలిసిపోతూ ఉంటుంది.

వాల్మీకి పాత్రకు సీత తారసిల్లే మొదటి సన్నివేశంలోనేమో, ఆమెను లోకమాతగా, సాక్షాత్తూ దేవతగా భావిస్తున్నట్లు చూపారు. డైలాగులు చెప్పించారు. కానీ, ఆ తరువాత మాత్రం సీతాదేవే ఆయనకు భక్తురాలన్నట్లుగా, వాల్మీకిని కేవల వాత్సల్య మూర్తిగా కాక, ఆపద్బాంధవుడైన మహాత్ముడిలా హావభావాల్లో, మాటల్లో చూపెట్టారు. ప్రేక్షకులు స్పష్టంగా ఇదీ అంటూ వ్యక్తం చేయలేకపోయినా, మింగుడుపడని ఈ మార్పు రసస్ఫూర్తికి భంగమే.

వయసుతో పాటూ తగ్గిన కండర పటుత్వానికి ఎవరినీ తప్పు పట్టలేం. పెరిగిన ఛాతీ భాగం కనిపించకూడదని, ఒళ్ళంతా కప్పుకొన్న వాల్మీకిగా కనిపించడాన్ని అర్థం చేసుకోగలం. కానీ ఎటొచ్చీ, చిత్తూరు నాగయ్య లాంటి వారు శాంత రసపోషణతో మెప్పించిన వాల్మీకి పాత్రలో ఈ తరహాలో అక్కినేనిని తెరపై చూశాక ఓ మిత్రుడు అన్నట్లు - ''వాల్మీకి పాత్రలో నాగేశ్వరరావు నటించినట్లు లేదు. నాగేశ్వరరావు పాత్రనే వాల్మీకి ధరించినట్లుంది.''

పిల్లలు కాదు, పిడుగులు

ఈ సినిమాలో లవకుశులుగా నటించిన చిన్నారులు (లవుడిగా మాస్టర్ దాసరి గౌరవ్, కుశుడిగా తెరంగేట్రం చేసిన మాస్టర్ ఎస్. ధనుష్ కుమార్) ఇద్దరూ కెమేరా ముందు బెరుకు, బిడియం, కృతకత్వం లేకుండా సహజంగా నటించడం విశేషం. ముఖ్యంగా బూరెబుగ్గలతో లవుడిగా నటించిన అబ్బాయి అయితే, మరీ ముద్దొస్తాడు. ఇక, కోయజాతి పిల్లాడైన బాలరాజు వేషంలో వచ్చే బాల హనుమంతుడిగా మాస్టర్ (పొనుగుపాటి) పవన్ శ్రీరామ్ చాలా హుషారుగా నటించాడు, నర్తించాడు. సొంత డబ్బింగ్ తో డైలాగులూ బాగా చెప్పాడు. ఇక, లవకుశులిద్దరికీ డబ్బింగ్ చెప్పిన అమ్మాయిలు కూడా చక్కగా డైలాగులు పలికారు. ఈ పసికూనల నుంచి ఆ మేరకు కావలసిన ఎఫెక్ట్ రప్పించడంలో దర్శకుడు చేసిన కృషినీ, పడ్డ శ్రమనూ అభినందించాలి.

అయితే, ఎటొచ్చీ హనుమంతుడే ఆ వేషంలో ఉన్న సంగతి చిత్రకథానుసారం సినిమాలో వాల్మీకి మహర్షికీ, హాలులో సినిమా చూస్తున్న మన లాంటి ప్రేక్షకులకీ మాత్రమే తెలుసు. కథలోని మిగిలిన పాత్రలెవరికీ తెలియదు. సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ పాత్ర ఆశ్రమంలో ప్రవేశిస్తుంది. ఆ తరువాత లవకుశులు పుడతారు. పెరిగి పెద్దవుతారు. వారిని తానే స్వయంగా ఆడించి, పెంచి పెద్ద కూడా చేస్తాడు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా సరే ఈ బాలరాజు పాత్ర అదే వయసుతో, అలాగే ఉంటాడు. మరి, వాల్మీకికి విషయం తెలుసు కాబట్టి అనుమానం రాలేదంటే సరే. ఆశ్రమంలోని సీతతో సహా, ఋషులు, ఋషిపత్నులు తదితర జనాభాకూ అనుమానం రాదా? హాలులోనూ, హాలు బయటకు వచ్చాక మిత్రుల దగ్గరా వ్యక్తమైన ఈ బేతాళ ప్రశ్నకు నా దగ్గరైతే సమాధానం లేదు.

సద్వినియోగం కాని సువర్ణావకాశాలు

గమ్మత్తేమిటంటే, ఇది సినీ జీవితంలో తమకు దక్కిన అపూర్వ అవకాశమని చెప్పిన వారెవరూ అందుకు తగ్గ కృషి చేసినట్లు కనిపించలేదు. లక్ష్మణుడి పాత్రను హీరో శ్రీకాంత్ ధరించారు. నూటికి పైగా చిత్రాల అనుభవం ఉన్న శ్రీకాంత్ ను ఈ పాత్రలో చూస్తుంటే, ఆయన తన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ఆపరేషన్ దుర్యోధన తరహా చిత్రాల ప్రభావంలోనే ఉన్నారనిపిస్తుంది. చివరకు చిరాకెత్తిన ఓ ప్రేక్షకుడు సీతను అడవికి తీసుకువెళ్ళే సన్నివేశంలో ఆయనను చూసి, ద్రౌపదిని కురుసభకు తీసుకువెళుతున్న దుశ్శాసనుడిలా ఉన్నాడని బాహాటంగానే కామెంట్ చేశాడు. ఇక, చివర యుద్ధ సన్నివేశంలో ఆయన ధరించిన గులాబీ రంగు చెమ్కీ దుస్తులు చూసినప్పుడు బ్యాండు మేళగాళ్ళు గుర్తుకొస్తే అది మీ తప్పేమీ కాదు. (నాలుగంటే 4 సీన్లలో వచ్చేఈ మాత్రం పాత్రకు అతనికి 70 లకారాల పైనే ఇచ్చారని కృష్ణానగర్ కబురు).

హనుమంతుడిగా విందూ దారాసింగ్ దర్శక రచయితలు బాపు - రమణలకు 'ఈ' టి.వి. 'శ్రీభాగవతం' సీరియల్ రోజుల నుంచి అలవాటైనవాడే. కానీ, అర్జా జనార్దనరావు లాంటి నిండైన విగ్రహాన్ని ఆంజనేయుడిగా చూశాక, అందరూ అనాకారులుగానే కనిపిస్తారు. పైగా, హనుమంతుణ్ణి మరీ క్లోజప్ లో చూపే ఓ సన్నివేశంలో నోరు కదలదు, పెద్ద డైలాగు మాత్రం వచ్చేస్తుంటుంది. విందూ దారాసింగ్ సైతం తనకున్న కొద్దిపాటి విగ్రహ పుష్టినీ కోల్పోతున్న లక్షణాలు జారిపోతున్న కైదండల సాక్షిగా సినిమాలో కనిపించేస్తుంటాయి.

నప్పని నటులతో తప్పని తిప్పలు

ఇక ఈ సినిమాలో వశిష్ఠుడిగా సీనియర్ నటుడు బాలయ్య, కౌసల్యగా కె.ఆర్. విజయ కనిపిస్తారు. శరీర పుష్టే కాదు, వాచికమూ పూర్తిగా పోయిన బాలయ్య పట్టి పట్టి డైలాగులు చెబుతుంటే, వినలేకపోతాం. ఇక, దేవతల పాత్రల్లో ఒకప్పుడు నిండుగా అలరించిన కె.ఆర్. విజయను మీద పడిన వయసులో, ముడతలు పడిన ముఖంలో చూడనూ లేము. నోరు విప్పితే విననూ లేము. కౌసల్యగా ఆమెను ఎందుకు పెట్టారో అర్థం కాదు. సుమిత్రగా వేసిన సనతోనే ఆ పాత్ర బదులు కౌసల్య పాత్ర వేయించినా బాగుండేది. సీతను అడవి పాలు చేసిన రాముణ్ణి, కాస్తంత విషాదభరితమైన డైలాగులతో, నిలదీసే తల్లి కౌసల్య పాత్ర ఆ ఒక్క సీనుకైనా, ఎంతో కీలకమని గుర్తించి ఉండాల్సింది.

అలాగే, లవకుశులు అయోధ్యలోని రాజమందిరంలో రామకథా గానం చేస్తున్నప్పుడు ఆవేదన ఆపుకోలేక గానం ఇక చాలు ఆపేయమని అంటుంది కౌసల్యా మాత. కానీ, తీరా అప్పుడే అది వింటూ రాముడు రాగానే, కొడుకును చూసి, భయపడిన రీతిలో కౌసల్య చటుక్కున సర్దుకుంటుంది. వచ్చిన రాముడు కథాగానాన్ని కొనసాగించమన్నట్లు సైగ చేస్తాడు. అది అధికార దర్పంలానూ అనిపిస్తుంది. పాత్రధారుల ఈ పొరపాటు రియాక్షన్ లను ఎడిటింగ్ లో చూసైనా, దిద్దుబాటు చేసుకోవాల్సింది.

తెరపై లోటుపాట్లు

జనక మహారాజుగా మురళీమోహన్, ఆయన భార్యగా సుధ (కెమేరా కనిపిస్తే, అంతగా నవ్వడమెందుకో అర్థం కాదు), విశ్వామిత్రుడిగా (ఎబ్బెట్టు గడ్డంతో) సుబ్బరాయశర్మలను చూడవచ్చు. చాకలి తిప్పడుగా బ్రహ్మానందం, అతని భార్యగా టి.వి. యాంకర్ ఝాన్సీ రెండే రెండు సన్నివేశాల్లో కనిపిస్తారు. చాకలి తిప్పడు కుటుంబ వ్యవహారం మీద ఎంతో తీసినా, చివరకు ఎడిటింగ్ లో నిర్దాక్షిణ్యంగా కోసేసి, సినిమాలో ఇంతే ఉంచారేమోనని అనుమానం వస్తుంది. తిప్పడు తన భార్యను అనుమానించే సన్నివేశం కూడా ఎలాంటి భావోద్వేగాలూ కలిగించకుండా, నాటకీయత ఏమీ లేకుండా ఠక్కున వచ్చి, ఠక్కున అయిపోతుంది. పైగా, ఆ సన్నివేశంలో ఫ్రేము నిండా జనం కనిపిస్తూ, ఎవరి యాక్షన్ కు ఎవరి రియాక్షనూ కట్ చేసి చూపించకుండా, అంతా నాటకంలో నడిపించేశారు.

ఇక, భూదేవి పాత్రలో రోజా కనిపించేది రెండు సీన్లే అయినా, భూదేవి వచ్చే దృశ్యం, సీతను తీసుకొని భూగర్భంలోకి వెళ్ళే దృశ్యం చిత్రీకరణ బాగున్నాయి. అయితే, గర్భవతిగా ఉన్న సీతాదేవిని, భూదేవి ఓదార్చే సన్నివేశంలో భూదేవి పాత్రలో రోజాను చూస్తుంటే, గర్భవతిగా ఉన్నది సీతా, లేక భూదేవా అని అనుమానం కలిగితే ఆశ్చర్యం లేదు.

సినిమాలో శ్రీరాముడి అక్క పాత్రలో శివపార్వతి నటించారు. ఆమె భర్త ఋష్యశృంగ మహర్షిగా 'మర్యాద రామన్న' చిత్ర ఫేమ్ నాగినీడు కనిపించారు. పేరులోనే ఉన్నట్లుగా పురాణాల ప్రకారం ఆ పాత్రకు నెత్తిన కొమ్ము ఉండాలి. కానీ, ఒక్క డైలాగైనా లేని ఆ పాత్ర కనిపించేదే రెండు సీన్లు. అందులో మొదటి సీన్ లో పాత్రధారికి మేకప్ లో నెత్తిన కొమ్ము పెట్టడం మరిచిపోయినట్లున్నారు. తరువాత యాగం సీన్ లో మాత్రం అతని నెత్తిన కొమ్ము ప్రత్యక్షమవుతుంది. ఈ సినీ ఋష్యశృంగుడు డైలాగు లేకపోతే పోయె, పాత్రోచితంగా తిన్నగానైనా ఉండకపోగా, తాపీగా కాళ్ళూపుకుంటూ ఆసనంలో చేరగిలపడి కూర్చోవడంతో దృశ్యం రసాభాస. చెప్పుకోవడానికి ఇవి చిన్న లోపాలుగానే అనిపించినా, ప్రేక్షకుడి సినీ సంలీన సందర్శనానుభవంపై పెను ప్రభావాన్ని చూపుతాయన్నది నిష్ఠుర సత్యం.

(‘శ్రీరామరాజ్యం' సినిమా సమీక్షలో చివరిదైన 3వ భాగం కాసేపట్లో...)

Sunday, November 27, 2011

రామరాజ్యమంటే ఇదా...!?



(‘శ్రీరామరాజ్యం’సినిమా సమీక్ష - పార్ట్ 1)

ఆఫీసు పని ఒత్తిళ్ళ వల్లనైతేనేం, ఆరోగ్య కారణాల వల్లనైతేనేం, వ్యక్తిగత సమయాభావం వల్లనైతేనేం, ఇటీవల సినిమాలకు వెళ్ళడం అనివార్యంగా తగ్గింది. కానీ, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న పౌరాణికం, బాపు గారి దర్శకత్వం, బాలకృష్ణ శ్రీరామపాత్రపోషణ అనేసరికి మనసు పీకింది. ‘శ్రీరామరాజ్యం’సినిమాకు ఇవాళ ఆదరా బాదరాగా వెళ్ళింది అందుకే. అయితే, అంచనాలు ఎక్కువగా పెట్టుకొని వెళితే, ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నాకు మరోసారి రుచి చూపించింది.

సినిమాకు వెళ్ళకముందే సాయంత్రం ఓ మిత్రుడి ఫోన్. సినిమా కన్నుల పండుగ అని చెప్పాడు. మరో మిత్రుడు ఫోన్ చేసి, సినిమాకు టాక్ - ఆంధ్రాలో సూపర్. అమెరికాలో అయితే మరీ సూపర్ డూపర్ అన్నాడు. అంతే, ఇనుమడించిన ఉత్సాహంతో ఆఖరి నిమిషంలో టికెట్లు ఎలాగోలా కొనుక్కుని వెళ్ళాను. అంతకు ముందు ‘‘ రాము గాక రాము‘‘ అని భీష్మించుకున్న కొందరు మిత్రులు కూడా, ఈ పాజిటివ్ ఫీడ్ బ్యాక్, టాక్ విని, ఉత్సాహపడ్డారు. అంతా కలసి వెళ్ళాం.

కానీ, ఆఖరికి అనుకున్నదే అయింది. సినిమా ఎందుకో అందరూ చెబుతున్నంత ఆహా, ఓహోగా అనిపించలేదు. అదే సమయంలో, సినిమా తయారీలో ఉండగా బాలకృష్ణ, నయనతార, తదితరుల గురించి వ్యక్తం చేసిన నెగటివ్ కామెంట్లంత నాసిగానూ లేదు. అయితే, ‘శ్రీరామరాజ్యం’ అన్న టైటిల్ కూ, ఈ సినిమా కథకూ సంబంధం చాలా తక్కువ. ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న భావమేమిటో సినిమాలో ఎక్కడా స్పష్టం కాదు.

రామరాజ్యమంటే ఎలా ఉండేదో, రామరాజ్యాన్ని ఇవాళ్టికీ ఎందుకు ఆదర్శంగా చెప్పుకుంటారో అన్న విషయాలు సినిమాలో చూపలేదు. పట్టాభిషేక సమయంలో కిరీటధారి రాముడిగా బాలకృష్ణ నోట నాలుగు పొలిటికల్ డైలాగుల ఉపన్యాసంలో పొడిపొడి మాటలు మాత్రం వినిపిస్తారు.

ఒక కథ - మూడు సినిమాలు

ఉత్తరరామాయణ కథ తెలుగు తెరకు కొత్త కాదు. దేవకీ బోస్ దర్శకత్వంలో తీసిన హిందీ ‘సీత’ (1934)ఆధారంగా, ఆ సెట్లు, ఆభరణాలు ఆసరాగా చేసుకొని సి. పుల్లయ్య దర్శకత్వంలో అదే నిర్మాతలు ఈస్టిండియా వారు తెలుగులో ‘లవకుశ’ (1934) నిర్మించారు. అది మొదటిది. గ్రామీణ జనం బళ్ళు కట్టుకొని మరీ పట్నానికి వచ్చి, సినిమా చూసిన సినిమా అది. అప్పుడప్పుడే మూకీల నుంచి టాకీలకు మళ్ళుతున్న తెలుగు నాట సినిమా హాళ్ళు తీర్థప్రజతో నిండిన తొలి చిత్రం దాదాపు అదే. అప్పటి దాకా మూగ చిత్రాలను ప్రదర్శిస్తున్న హాళ్ళు చకచకా టాకీ ఎక్విప్మెంట్ ను బిగించుకున్నదీ ఈ సినిమా అపూర్వ విజయ పర్యవసానమే.

ఆ సినిమా మన తండ్రులు, తాతల తరమే తప్ప మనం చూడలేదు. ఆ సినిమా వీడియో కూడా అలభ్యం. ఇక, మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసిందల్లా ఆ తరువాత , అదే సి. పుల్లయ్య గారి దర్శకత్వంలో మొదలై, ఆయన కుమారుడు సి.ఎస్. రావు నిర్దేశకత్వంలో పూర్తయిన లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ చిత్రం (1963). సీతారాములుగా అంజలీదేవి, ఎన్టీయార్ నటించిన ఆ చిత్రం ఏ రకంగా చూసినా ఓ క్లాసిక్. పట్టుగా నడిచే స్క్రీన్ ప్లే, సదాశివబ్రహ్మం రచన, పాత్రధారుల అభినయం, మరీ ముఖ్యంగా ఘంటసాల సంగీతం, పి.లీల - సుశీల లాంటి గంధర్వ గాయనీమణుల అద్భుత గానవైదుష్యం, వీటన్నిటినీ సమస్థాయిలో నడిపిన దర్శకత్వ ప్రతిభ - ఇలా అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఆ సినిమాను అజరామరం చేశాయి.


ఆ ‘లవకుశ’ ఓ చరిత్ర

వసూళ్ళలోనూ, చూసిన ప్రేక్షకుల సంఖ్యలోనూ ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రానిది ఓ చరిత్ర. అప్పటి దాకా తెలుగులో ఏ సినిమాకూ అత్యధికంగా రూ. 25 లక్షలు మించి వసూళ్ళు రాలేదు. కానీ, ‘లవకుశ’ చిత్రం వసూళ్ళు ఏకంగా కోటి రూపాయలు దాటాయి. సినిమా హాళ్ళలో అమ్మిన టికెట్ల ఆధారంగా లెక్కవేస్తే, అంతకు మునుపెన్నడూ ఏ సినిమానూ చూడనంత మంది ఆ సినిమాను చూశారు. చుట్టుపక్కలి గ్రామాల వారందరూ సమీపంలోని పట్టణ సినీ కేంద్రానికి వెళ్ళి సినిమా చూడాల్సిన ఆ 1960ల ప్రథమార్ధంలో, దాదాపు ప్రతి రిలీజు కేంద్రంలోనూ ఆ ఊరి జనాభా కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ మంది ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రం చూశారు. అప్పట్లో వరంగల్ కేంద్రం గురించి వచ్చిన ప్రకటనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 1963లో వచ్చిన ఆ చిత్రం ఆ తరువాతెప్పుడో పుట్టిన 1970లు, 1980ల నాటి తరానికి కూడా సుపరిచితమైనదే. అంటే, ఆ సినిమా మళ్ళీ మళ్ళీ హాళ్ళలో విడుదలై, ఎన్ని రోజులు ఆడిందో, ఎంతెంత మందిని ఆకర్షించిందో, ఆ రిపీట్ రన్లలో ఇంకెంత వసూలు చేసిందో ఊహించుకోవచ్చు. ఆ రకంగా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక కాలం ఆడిన సినిమాగా ‘లవకుశ’ను పేర్కొన్నా తప్పు లేదు. అలాంటి చిత్రకథను మళ్ళీ తెరకెక్కించడం సాహసమే అయినా, ‘‘శ్రీరామరాజ్యం’’ యూనిట్ అందుకు సిద్ధపడింది.

ఇప్పుడు యలమంచిలి సాయిబాబు నిర్మాతగా, బాలకృష్ణతో బాపు - రమణల ‘‘శ్రీరామరాజ్యం’’ ముచ్చటగా మూడోది. తెలుగు రంగస్థలం మీద, సినీ లోకంలో ‘లవకుశ’గా ప్రసిద్ధమైన ఉత్తర రామాయణ కథను తెరకెక్కిస్తూ, ఆ పేరు పెట్టకపోవడంలోనే జంకు తెలుస్తోంది. కానీ, పోల్చిచూడడాలు అనివార్యమని వారికీ తెలుసు. అయితే, కొత్త పేరు పెట్టినా ఆ పేరుకు న్యాయం చేయలేకపోయారు. (ఈ పేరు కూడా 1943లో హిందీ, మరాఠీల్లో విజయ్ భట్ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘రామ్ రాజ్య’ పేరు నుంచి అరువు తెచ్చుకున్నదే. అదీ లవకుశుల కథే). ఇంకా చెప్పాలంటే, గొప్పగా చెప్పుకొనే రామరాజ్యంలో జరిగింది ఇదా అని అనుమానపడేలా చేశారు.

పాత కథకు కొత్త మార్పులు

పధ్నాలుగేళ్ళ అరణ్యవాసం, రావణ సంహారం తరువాత సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడై వానర ప్రముఖులు తోడు రాగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు చేరడం, పట్టాభిషిక్తుడు కావడం, సీతాదేవి గర్భవతి కావడం, లోకనిందకు వెరచి సీతా సాధ్విని రామచంద్రుడు అడవిలో వదిలి రమ్మనడం, లక్ష్మణుడు అన్న ఆజ్ఞను శిరసావహించడం, వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి ఆశ్రయం పొందడం, లవకుశుల జననం, విద్యాబుద్ధులు నేర్వడం, వారి రామాయణ కథా గానం, రాముడి అశ్వమేథ యాగం, అశ్వాన్ని లవకుశులు బంధించడం, తండ్రితోనే యుద్ధానికి తలపడడం, ఆఖరికి అసలు విషయం తెలియడం, సీతాదేవి భూమాత ఒడిలో చేరడం, లవకుశులకు పట్టాభిషేకం చేసి, రాముడి అవతార సమాప్తి - ఇదీ స్థూలంగా కథ.

నిజానికి, అందరికీ తెలిసిన, తెరపై చూసేసిన కథను మరోసారి చెప్పదలిచినప్పుడు ఇబ్బందే. అయితే, చెబుతున్నది సెల్ ఫోన్లు, సోషల్ నెట్ వర్క్ సైట్ల నవతరానికి, పౌరాణిక చిత్రాల పొడ తెలియని యువతరానికి కాబట్టి, ఈ చిత్ర రచయిత ముళ్ళపూడి వెంకట రమణ భాష, భావం వీలైనంత సరళంగా ఉండేలా చూశారు. (పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఆ బాటలోనే నడిచారు). వాల్మీకి ఆశ్రమంలో సీతా సాధ్వి సేవ కోసం బాల హనుమంతుణ్ణి బాలరాజు పాత్రగా ప్రవేశపెట్టి మూలంలో లేని మార్పు చేశారు ముళ్ళపూడి. తద్వారా కథాగమనంలో కొత్తదనం కోసం కృషి చేశారు. ఆ మార్పు బాగున్నా, దాన్ని సమర్థంగా స్క్రిప్టులో వాడుకోలేకపోయారు. ఆ కొత్త పాత్రతో ప్రధాన రసానికి పరిపోషకంగా హాస్య, అద్భుత, కరుణ రసాలు వేటినీ పండించడానికి ప్రయత్నించనేలేదు.

అలాగే, సీతారాముల ప్రణయ సన్నివేశాల్లో బాపు - రమణల మార్కు కనబడుతుంది. మోతాదు మించనివ్వకపోయినా, రెగ్యులర్ కమర్షియల్ ప్రేమ సినిమాలు చాలకనా, ఆరాధ్యదేవతలైన సీతారాముల మధ్య ఇలాంటి ఘట్టాలు చూపెట్టాలా అని మొహం చిట్లించిన వాళ్ళూ లేకపోలేదు. సినిమాగా, కళాత్మక వ్యక్తీకరణగా మనం సరిపెట్టుకున్నా, మూతిముడుచుకున్న మహాభక్తుల ఆ సెంటిమెంట్ ను పూర్తిగా కొట్టిపారేయలేం.

ఇక, రాముల వారి ఏకపత్నీ వ్రతాన్నీ, పరాయి కాంతల నీడనైనా తాకని ఆయన నిష్ఠనూ తెలిపే సంఘటన సినిమాలో కొత్తగా ఉంది.

రాముడిగా అనూహ్యంగా బాలయ్య

ఉద్దేశపూర్వకంగానో, యాదృచ్ఛికంగానో, ‘శ్రీరామరాజ్యం’ అనే పేరు, హీరోల చుట్టూ తిరిగే సినీ పరిశ్రమ ధోరణికి తగ్గట్లుగా ఉన్నా, నిజానికి ఇది సీత కథ. అడవిలో వదిలి రమ్మని భర్తే ఆజ్ఞాపించడంతో ఆమెకు కలిగిన వ్యధ. అక్కడే అడవిలో పుట్టిన ఆమె పిల్లలు ఆఖరికి తండ్రిని చేరిన గాథ. అందుకే, సహజంగానే ఇందులో శ్రీరాముడి పాత్ర తెరపై ఆట్టే కనిపించదు. అయినా సరే, పౌరాణిక పాత్రల మీద మమకారం, తండ్రి పోషించిన పౌరాణికాలకు తెలుగు నాట తనదే పేటెంట్ అన్న నమ్మకంతో ఈ సినిమాలో బాలకృష్ణ నటించారు.

తండ్రి పోలికలే తప్ప, స్వరూప, స్వభావాల రీత్యా పెద్దాయనకు ఉన్న సానుకూలతలు కొన్ని లేకపోవడం బాలయ్యకు లోటే. అదుపులో లేని శరీరం చాలా సార్లు అడ్డొస్తూ, అర్థమై పోతూ ఉంటుంది. శాంత, శోక, కరుణ రసాన్వితమూర్తి అయిన ఉత్తర రామాయణ రాముడు అందుకు పూర్తి భిన్నంగా, ఎర్రటి కళ్ళతో రోజూ రాత్రి పొద్దుపోయే దాకా నిద్ర లేదని తెలిసిపోతుంటాడు. కరుణ రసపూరిత ఘట్టాల్లోనూ ఎర్రటి కళ్ళతో క్రోధావేశంతో ఉన్నాడేమో అనిపిస్తాడు.

అయినప్పటికీ, అనూహ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఊహించినదాని కన్నా చాలా బాగున్నారు. అదే పనిగా అలవాటైపోయిన ఆంగిక, వాచిక హావ భావ విన్యాసాలకు దూరంగా, నియంత్రితమైన నటనను కనబరచడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. డైలాగులే లేని కొన్ని దృశ్యాల్లో, ముఖ్యంగా వేగు భద్రుడు వచ్చి, లోకనిందను తెలిపిన సందర్భంలో మ్రాన్పడిపోవడం లాంటి చోట్ల దర్శకుడి ఆలోచనలు, సూచనలకు తగ్గట్లు క్లోజప్పుల్లో బాలకృష్ణ లీనమై నటించిన తీరు బాగుంది.

(తరువాయి భాగం మరికాసేపట్లో...)

Sunday, October 23, 2011

కనుగొంటి కనుగొంటి ఇప్పుడిటు కనుగొంటి... తొలి తెలుగు సినిమా పుట్టిన తేదీ కనుగొంటి...



* ‘భక్త ప్రహ్లాద’ విడుదలైంది 1932 ఫిబ్రవరి 6న!

* తొలి పూర్తి తమిళ టాకీ కన్నా మనదే ముందు!



తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ చిత్రం విడుదల తేదీ మీద చివరకు నా పరిశోధనే నిజమని తేలింది. ఆ సినిమా అటు సెన్సారైందీ,
ఇటు విడుదలైందీ కూడా 1932లోనే. ఇన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న 1931లో,అందులోనూ సెప్టెంబర్ 15న ఆ చిత్రం విడుదల కానే కాలేదని నేను చేసిన వాదనకు మరిన్ని తిరుగులేని సాక్ష్యాధారాలు దొరికాయి. మన తొలి తెలుగు సినిమా తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ విడుదలైందీ అన్వేషణలో తేలింది.

టి.వి. 9 లాంటి చానళ్ళు నా వాదనను వినిపిస్తూ ప్రత్యేక వార్తాకథనాలు ప్రసారం చేశాయి. అయితే, సత్యాన్వేషణ దృష్టి, పరిశోధన మీద ఆసక్తి తప్ప నాకు మరో ఉద్దేశమేమీ లేకపోయినా, ‘ఆంధ్రప్రభ’తో సహా పలువురు నా పరిశోధనకు దురుద్దేశాలు ఆపాదించారు. అనుమానాలు వ్యక్తం చేశారు. అవన్నీ నా మునుపటి పోస్టు పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు లో తెలిపాను.

వాటిలోని డొల్లతనాన్నినిరూపిస్తూ, నేనిచ్చిన వివరణ ఇవాళ్టి ‘ఆంధ్రజ్యోతి’దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది. ఆ రిజాయిండర్ ఇదీ --

.......................................................................

పరిశోధన


తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్తప్రహ్లాద' విడుదలైన తేదీ ఎట్టకేలకు దొరికింది.

అది 1932 ఫిబ్రవరి 6.


గతంలో (11.9.2011 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచిక) ప్రచురితమైన నా పరిశోధనా పత్రంలో- ఇంతకాలం అనుకున్నట్టుగా 'భక్తప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదల కాలేదనీ, సగం తెలుగున్న ''తమిళ - తెలుగు టాకీ'' 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలయ్యాకే అసలు ఈ పూర్తి తెలుగు టాకీ నిర్మాణమైందనీ చెప్పాను. 1932 జనవరి 22న మాత్రమే భక్త ప్రహ్లాద సెన్సారై, సర్టిఫికెట్ పొందిందని ఆధారం చూపాను. ఆ సెన్సార్ తేదీ నుంచి మద్రాసు రిలీజ్ సమాచారం ససాక్ష్యంగా దొరుకుతున్న ఏప్రిల్ 2వ తేదీ లోపల ఎప్పుడయినా విడుదలై ఉండవచ్చని చెప్పాను. అప్పటికి కచ్చితమైన తేదీ నాకూ సాక్ష్యాధారాలతో లభించ లేదు. ఆ తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మరిన్ని ఆధారాలు సంపాదించి ఈ విషయాలు మీ ముందు పెడుతున్నాను.

తొలి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద', తమిళ - తెలుగు టాకీ 'కాళిదాస్' తర్వాతే వచ్చిందని చెప్పడంలో నాకేవో దురుద్దేశ్యాలు ఉన్నట్లు మరికొంతమంది రాశారు. చరిత్ర పట్ల గౌరవం, పరిశోధన పట్ల ఆసక్తి తప్ప నాకు ఇతరత్రా ఉద్దేశం ఏదీ లేదని మరోసారి తెలియజేసుకుంటున్నాను.


ప్రామాణికమైన సెన్సార్ సర్టిఫికెట్

1931 చివరలో నిర్మాణమై, 1932 జనవరిలో బొంబాయిలో సెన్సారైన 'భక్త ప్రహ్లాద' సెన్సార్ సర్టిఫికెట్ ''నంబర్ 11032.'' ఆ మాటే చెబితే, 'సెన్సార్ అయిన తేదీ కరెక్టేననే నమ్మకం ఏమిటి' అని కొందరు అడిగారు. పైగా 'సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ వేలల్లో (11032) ఎందుకు ఉంది, అప్పుడప్పుడే కదా టాకీలు ప్రారంభమయ్యాయి' అని కూడా సందేహం వెలిబుచ్చారు.

ఆ రోజుల్లో సెన్సారైన చిత్రాలన్నిటి వివరాలనూ సాక్షాత్తూ ప్రభుత్వమే ఏ నెలకానెల చెబుతూ వచ్చింది. 1932 ఫిబ్రవరి 4 నాటి 'ది బాంబే
గవర్నమెంట్ గెజిట్', పార్ట్-1 (పేజీ 313)లో ఆ క్రిందటి నెల సెన్సారైన అన్ని చిత్రాల వివరాలూ ఉన్నాయి. అందులో 'భక్తప్రహ్లాద' కూడా ఉంది. మన దేశంలో సినిమాటోగ్రాఫ్ చట్టం-1918 అమలవడం మొదలైన దగ్గర నుంచి స్వదేశీ ఫిల్ములూ, విదేశీ దిగుమతి చిత్రాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీళ్లు సైతం సెన్సారింగ్ జరుపుకుని సర్టిఫికెట్ నెంబర్లు పొందుతూ వచ్చాయి.

దాంతో, 1932 వచ్చేసరికి 'భక్తప్రహ్లాద'కు సర్టిఫికెట్ నెంబర్ వేల సంఖ్యలోకి వచ్చింది.


సెన్సారైతేనే రిలీజు! ఒకచోట సెన్సారైతే చాలు!


'సెన్సార్ కాకముందే విడుదలయ్యే అవకాశం లేదా? బొంబాయి కంటే ముందు ఇంకెక్కడయినా సెన్సార్ అయి ఉండొచ్చు కదా' ఇత్యాది
సందేహాలు కూడా లేవనెత్తారు.


ఆ అవకాశం లేదు. ఎందుకంటే 'సినిమాటోగ్రాఫ్ చట్టం - 1918' ప్రకారం 1920 నుంచే దేశంలో సెన్సార్ బోర్డులు ఏర్పాటయ్యాయి. "బొం బాయి, కలకత్తా, మద్రా సు, రంగూన్, ఆ తరువాత (ఏర్పాటైన) పంజాబ్ (అంటే లాహోర్)లలోని ప్రాంతీయ బోర్డ్ ఆఫ్ సెన్సార్స్‌లో ఒక దాని నుంచి మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ పొందాలి. అలా పొందకుండా ఏ ఫిల్మునూ ప్రదర్శించడానికి వీలు లేదు...'' ('మేకింగ్ మీనింగ్ ఇన్ ఇండియన్ సినిమా',సంపాదకత్వం: రవి ఎస్. వాసుదేవన్; పేజీ 52).


అలాగే "భారతదేశం మొత్తానికీ చెల్లుబాటయ్యేలా (చిత్రాలకు) సర్టిఫికెట్లను మంజూరు చేసే అధికారాన్ని ఈ (ప్రాంతీయ సెన్సార్) బోర్డులకు ఇచ్చారు. అయితే ఏ ప్రావిన్షియల్ ప్రభుత్వమైనా సరే, సదరు చిత్రం తమ ప్రావిన్సులో బహిరంగ ప్రదర్శనకు తగినది కాదని భావించినట్లయితే, ఆ ఫిల్ముకున్న సర్టిఫికెట్‌ను రద్దు చేయవచ్చు...'' ('కొలోనియల్ ఇండియా అండ్ ది మేకింగ్ ఆఫ్ ఎంపైర్ సినిమా', రచన : ప్రేమ్ చౌధ్‌రీ; పేజీ 19) అంటే, 1932 జనవరి చివరలో బొంబాయి బోర్డులో సెన్సార్ జరుపుకున్న 'భక్తప్రహ్లాద'కు దేశమంతటా ప్రదర్శనకు ఆ సర్టిఫికెట్ సరిపోతుంది. ప్రతిచోటా మళ్లీ మళ్లీ సెన్సార్ జరుపుకుని, కొత్త సర్టిఫికెట్ నెంబర్ పొందాల్సిన అవసరం లేదు.
ఇక అసలు విషయానికి వద్దాం.


1932 ఫిబ్రవరి 6 : తొలిసారిగా తెరపై 'ప్రహ్లాద'


సెన్సారైన తరువాత సరిగ్గా పక్షం రోజులకు 1932 ఫిబ్రవరి 6, శనివారం నాడు 'భక్తప్రహ్లాద' రిలీజైనట్లు నా తాజా అన్వేషణలో తేలింది. అంటే ఇంకా మూడున్నర నెలలకు గాని పూర్తి తొలి తెలుగు టాకీ చిత్రానికి 80 ఏళ్ళు నిండవు. మరో ముఖ్యమైన విషయం ఈ చిత్రం మన దేశంలో మొట్టమొదటిసారిగా విడుదలైంది- అప్పటికి ఆంధ్రులు పెద్దసంఖ్యలో ఉన్న బొంబాయిలో. సెన్సారైన మరుసటి వారమే "తెలుగులో మాటలు, పాటలున్న భారత్ మూవీటోన్ వారి భక్తి రస చిత్రం 'భక్తప్రహ్లాద్' త్వరలో విడుదల'' అంటూ ప్రకటనలు వేశారు. ('ది బాంబే క్రానికల్', 1932 జనవరి 31).

ఆ ప్రకటన వచ్చిన వారం లోపలే బొంబాయిలోని న్యూ ఛార్నీ రోడ్డులోని 'కృష్ణా సినిమా'లో తొలిసారిగా 'భక్తప్రహ్లాద విడుదలైంది. రిలీజ్ రోజున కూడా బొంబాయి పత్రికలు ప్రకటనలు వేశాయి. ప్రివ్యూ చూడడం వల్ల అదే రోజుకి వచ్చేలా సమీక్షలు రాశాయి.

'సంపూర్ణ తెలుగు టాకీ' అనే శీర్షికతో "భారతదేశంలో తొలి సంపూర్ణ తెలుగు టాకీని నిర్మించిన ఘనత బొంబాయికి చెందిన భారత్ మూవీటోన్ కంపెనీకి దక్కింది. కృష్ణా స్టూడియోలోని యంత్ర సామగ్రిని ఉపయోగించుకుని,నిపుణులైన సాంకేతిక సిబ్బందితో కలిసి పనిచేయడం ద్వారా పూర్తిగా మాటలు, పాటలున్న చిత్రం (భక్త) 'ప్రహ్లాద'ను ఆ సంస్థ పూర్తి చేసింది...'' అంటూ సమీక్ష రాశారు. ('ది టైమ్స్ ఆఫ్ ఇండియా', 1932 ఫిబ్రవరి 6).

దీన్నిబట్టి కూడా 'భక్తప్రహ్లాద' తయారైందీ, తొలిసారిగా విడుదలయిందీ బొంబాయిలోనేనని అర్థమవుతోంది.

మద్రాసులో ఏప్రిల్ 2న! అంతకన్నా ముందే ఆంధ్రాలో!!

ఈ సినిమా మద్రాసుకు రావడానికి మరో రెండు నెలలు పట్టింది. తెలుగు ఉగాదికి నాలుగు రోజుల ముందు 1932 ఏప్రిల్ 2 శనివారం నాడు 'నేషనల్ పిక్చర్ ప్యాలెస్' (ఇప్పటి '(న్యూ) బ్రాడ్వే టాకీస్')లో విడుదలై రెండు వారాలు ప్రదర్శితమైంది. బొంబాయి నుంచి, అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నపట్నానికి వచ్చే లోపల 'భక్తప్రహ్లాద' ఇంకెక్కడెక్కడ ఆడిందో తెలియదు గాని "... రాజమహేంద్రవరము నందు వరుసగా మూడు వారముల వరకు ప్రజల నాకర్షించెను...'' ('ఆంధ్రపత్రిక' దినపత్రిక, 1932 ఏప్రిల్
2, పేజీ 14) అనే వాక్యం ఒక్కటే తెలుసు మనకు. ఆ ఒక్క వాక్యం మినహా,తెలుగు నేలపై ఏయే ప్రాంతాలలో, ఏయే తేదీల్లో ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ప్రదర్శించబడిందో తెలిపే సాక్ష్యాలు దురదృష్టవశాత్తూ ఇప్పటికీ లభించడం లేదు.


రాజమండ్రిలో, బెజవాడలో రిలీజైందెక్కడ?


రికార్డులను బట్టి చూస్తే, 1932 నాటికి రాజమండ్రిలో 'శ్యామలా టాకీస్'నిర్మాణమే కాలేదు. అప్పటికి ఉన్నవి రెండే హాళ్ళు 'శ్రీకృష్ణా సినిమా', 'బాబ్జీ సినిమా' (ఇప్పటి 'విజయా టాకీస్'). 'భక్తప్రహ్లాద' ఈ రెండిట్లో ఒక దానిలో విడుదలై ఉండాలి. నిడమర్తి వారి 1923-24 నాటి 'శ్రీకృష్ణా సినిమా'ను ఇప్పటికీ 'శ్రీసాయికృష్ణా'గా నిర్వహిస్తున్న మూడో తరానికి చెందిన 58 ఏళ్ళ నిడమర్తి మురళి "తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా', తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద'- రెండూ రాజమండ్రిలో మా హాలులోనే రిలీజయ్యాయి'' అని తమ పెద్దలు చెబుతూ వచ్చిన సంగతుల్ని ఈ పరిశోధకుడికి తెలిపారు. దాన్నిబట్టి ఇది 'శ్రీకృష్ణా సినిమా'లోనే రిలీజయిందని అనుకోవాలి.

నిజానికి అప్పటికి రాజమండ్రి కన్నా బెజవాడ పెద్ద పట్నం. మూకీలు కూడా జోరుగా ప్రదర్శితమైన సినీ కేంద్రం. కాబట్టి, కచ్చితంగా రాజమండ్రి కన్నా ముందే బెజవాడలోనూ 'భక్తప్రహ్లాద' ప్రదర్శింపబడి ఉండొచ్చు.

అప్పటికి బెజవాడలోనూ ఉన్నవి రెండే హాళ్ళు- శ్రీమారుతీ సినిమా, శ్రీదుర్గా కళామందిరం. 1932 డిసెంబర్ తొలినాళ్ళకు గానీ దుర్గా
కళామందిరంలో 'టాకీ' యంత్రాన్ని అమర్చలేదు. కాబట్టి, తొలి విడుదలలో 'మారుతీ'లోనే 'భక్తప్రహ్లాద' వచ్చి ఉండాలి.

అప్పట్లో బెజవాడలో 'భక్తప్రహ్లాద' చూసిన వయోవృద్ధులు తాము 'మారుతీ'లోనే ఆ సినిమాని చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఏడాది
తర్వాత మళ్లీ రిలీజయినపుడు మాత్రం దుర్గాకళామందిరంలో వచ్చింది. ఇవాళ మీడియాలో తరచూ కనిపిస్తున్న 'భక్తప్రహ్లాద' వాణిజ్య ప్రకటన ఆ రెండో రిలీజ్‌కు సంబంధించినదే.


తొలి తెలుగు టాకీల వరుస క్రమం

1932లో సెన్సారైన మొత్తం తెలుగు చిత్రాలు మూడు. వాటి వరుస 'భక్తప్రహ్లాద' (సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ 11032, తేదీ 22 జనవరి 1932. తొలి రిలీజ్ : బొంబాయిలోని 'కృష్ణా సినిమా'లో 1932 ఫిబ్రవరి 6). రెండోది 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకము' (నెం. 11739, తేదీ 17 నవంబర్ 1932. తొలి రిలీజ్ : మద్రాసులోని 'కినిమా సెంట్రల్'లో 1932 డిసెంబర్ 24). మూడో టాకీ 'శకుంతల' (నెం. 11830, తేదీ 21 డిసెంబర్ 1932. తొలి రిలీజ్ : అదే 'కినిమా సెంట్రల్'లో 1933 మార్చి 25). చిత్ర నిర్మాణం వరుసలో 'శకుంతల' మూడో తెలుగు టాకీ అయినా, విడుదల విషయానికి వచ్చేసరికి ఐదోది అయింది. ఎందుకంటే 1933 ఫిబ్రవరి 4,5 తేదీల్లో రెండు 'సతి సావిత్రులు' విడుదలయ్యాయి. వాటి తరువాతే 'శకుంతల' మార్చి 25న రిలీజైంది.


కొసమెరుపు :

తమిళం కన్నా ముందే తెలుగు


ఇంత చెప్పాక ఇదేమిటని ఆశ్చర్యపోకండి. సగం తమిళం, సగం తెలుగుతో 'తమిళ- తెలుగు టాకీ'గా 1931లో రూపొందిన 'కాళిదాస్'ను ప్రభుత్వ సెన్సార్ బోర్డు తమిళ టాకీగానే లెక్కలో వేసుకున్నా 1932 ఏప్రిల్ 9న పూర్తి తమిళ మాటలు, పాటలతో విడుదలైన 'హరిశ్చంద్ర'నే ఆనాటి పత్రికలు "మొట్టమొదటి తమిళ టాకీ'' అని పేర్కొన్నాయి ('ది హిందూ', 1932 ఏప్రిల్ 8). అదెలాగున్నా 'కాళిదాస్'ని ఉమ్మడి వారసత్వంలో చేర్చేసుకుని తెలుగు, తమిళాల్ని విడివిడిగా చూస్తే దక్షిణాదిలో తొలి సంపూర్ణ టాకీ చిత్రం రూపకల్పనలోనూ, విడుదలలోనూ తమిళుల కన్నా మనమే రెండు నెలల పైచిలుకు ముందున్నామనేది స్పష్టం.


మూడు భాషల్లోనూ సినిమాకు మాట నేర్పింది మనవాళ్ళే!


ఆ మాటకొస్తే ఒక్క మలయాళం మినహా దక్షిణాది భాషల్లోని మిగతా మూడింటిలో సినిమాకు మాటలు నేర్పిన దర్శకబ్రహ్మలు తెలుగువారే
కావడం గర్వకారణం. ('కాళిదాస్', 'భక్తప్రహ్లాద'లకు హెచ్.ఎం. రెడ్డి, 1934 మార్చి 3న రిలీజైన తొలి కన్నడ టాకీ 'సతీ సులోచన'కు వై.వి. రావు). ఎస్. నోట్టానీ దర్శకత్వంలో వచ్చిన 'బాలన్' (1938) తొలి మలయాళ టాకీ. అయితే గర్వకారణమైన ఇలాంటి ఎన్నో విశేషాల చరిత్ర రచన నమ్మకాల మీద కాక, వాస్తవాల ఆధారంగా సాగాలి.

దురదృష్టవశాత్తూ, ఆ దృష్టి మందగించడం వల్ల మన సినిమా చరిత్ర రచన ఇప్పటికీ ససాక్ష్యంగా, సాకల్యంగా సాగడం లేదు. గురజాడ, చలం, శ్రీశ్రీల పుట్టిన తేదీల్లో దశాబ్దాలుగా చలామణిలో ఉన్న తప్పులను పరిశోధకులు బయటపెట్టినపుడు సరిదిద్దుకున్నాం. సాహిత్యం, సామాజిక చరిత్ర లాంటి ఎన్నో అంశాల్లో ఎంతో సాధారణమైన ఈ చరిత్ర నిర్మాణ సూత్రాన్ని సినీ చరిత్రకూ వర్తింపజేస్తే తప్పేముంది?

- రెంటాల జయదేవ
.....................................................................

Saturday, October 22, 2011

పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు




ఆరోపణలు చేయడం సులభం. తర్కం, ఆధారాలు లేకుండా ఆరోపించడమైతే మరీ సులభం. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద

విడుదల తేదీ మీద నేను సమర్పించిన పరిశోధన పత్రంలోని అంశాలపై
కొందరు ఆ పనే చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరికొందరు ఓ మెట్టు పైకెక్కి పరిశోధనకు దురుద్దేశాలు పులిమే ప్రయత్నం చేశారు. వాస్తవాలను నివేదిస్తూ, వాటి ఆధారంగానే వార్తలు, వ్యాసాలు అందించాల్సిన పత్రికా రచయితలలోని సీనియర్లు కొందరూ, దీర్ఘకాలంగా పత్రికా రంగంలో సమున్నత సేవలందిస్తున్న ప్రముఖ పత్రికలలో కొన్నీ - కూడా తొందరపాటుతో ఆ అవాంఛనీయ వైఖరినే అవలంబించడం ఆశ్చర్యకరమే కాదు, బాధాకరం కూడా. తొలి తెలుగు టాకీ పుట్టిన ‘‘తేదీపై వివాదమెందుకు?’’ అంటూ ఆంధ్రప్రభ దినపత్రిక తమ వారం వారీ సినీ ప్రత్యేకానుబంధం ’’చిత్రప్రభ’’లో ఏకంగా సంపాదకుడి సంతకంతో ఎడిటోరియల్ రాసింది (ఆ ఎడిటోరియల్ తాలూకు డిజిటల్ బొమ్మ, అందులోని సమాచారం ఈ పోస్టులోనే పక్కనే చూడగలరు).

తెలుగు సినిమా ఎనభై ఏళ్ళ ఉత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఈ హడావిడి ఏమిటంటూ, పరిశోధన ఉద్దేశాన్నే ప్రశ్నించింది. దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించింది. తర్కానికి అందని వ్యాఖ్యలెన్నో చేసింది. చేసిన పరిశోధనను సహృదయంతో అనుశీలించకపోగా, మళ్ళీ తానే గొంతు సవరించుకొని - ‘‘కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది’’ - అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఆ వెంటనే తానే తీర్పరి పాత్ర పోషిస్తూ - ‘‘అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి’’ - అని ఆ పత్రిక ముక్తాయించింది.

పరిశోధన జరపాలని ఓ నాలికతో అంటూ, ఇప్పటిదాకా సరైన సాక్ష్యాధారమేదీ లేని సెప్టెంబర్ 15వ తేదీనే తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని అలా తెగేసి మరో నాలికతో తీర్మానించేయడం ఏమిటో అర్థం కాదు. పరిశోధన చేస్తేనేమో దురుద్దేశాలు అంటగడుతున్నారు. కానీ పరిశోధన జరగాల్సి ఉందనీ మళ్ళీ తామే అంటున్నారు. ఇదెక్కడి చిత్రం.


పరిశోధనపై ఆరోపణలు చేసి, అనుమానాలు వ్యక్తం చేసిన ఆంధ్రప్రభ ఎడిటోరియల్ పూర్తిపాఠం ఇదీ --


..........................................
తేదీపై వివాద మెందుకు?


భక్త ప్రహ్లాద విడుదల తేదీపై వివాదం చెలరేగింది. ఇప్పటి వరకు 1931 సెప్టెంబర్‌ 15న ఈ చిత్రం విడుదలైందని చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. ఇటీవలే భక్త ప్రహ్లాద విడుదలైన తేదీని తెలుగు సినిమా పుట్టినరోజుగా పరిశ్రమ ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే కొత్త తేదీ ప్రచారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం వజ్రోత్సవాలను అట్టహాసంగా జరుపుకుని, ఇప్పుడు
ఎనబై యేళ్ళ ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలోనే విడుదల తేదీ, సంవత్సరం సరికాదంటూ వివాదం చేయడం వెనుక వారికి ఉన్న ఉద్దేశాల గురించి రంధ్రాన్వేషణ చేయడం అనవసరం.

సినీ ప్రముఖులు దాసరి నారాయణరావుగారు పేర్కొన్నట్టు తేదీపై సంపూర్ణ సమాచారం లేదు. ఆ రోజుల్లో తొలుత విజయవాడ మారుతీ టాకీస్‌లో తర్వాత రాజమండ్రి శ్యామల టాకీసులో విడుదలైన తర్వాత మద్రాసులో 1932లో విడుదలై ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై శాస్త్రీయంగా పరిశోధన జరగాలని సూచించారు. దాసరిలాంటి ప్రముఖులు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరనే విషయం పరిశ్రమకు తెలియంది కాదు. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భక్త ప్రహ్లాద తొలి టాకీ తెలుగు సినిమానా, లేక హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తెలుగు తమిళ సంభాషణలతో, తెలుగు పాటలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళ చిత్రంగా రూపొందిన కాళిదాసు తొలి తమిళ చిత్రమా అనేది కూడా తేలాలి.

దీనిపై సినీ పరిశోధకులు ఇంటూరి వెంకటేశ్వరరావు, వి.ఏ.కె.రంగారావు వంటి వారు ఎప్పుడో శోధించారు. వారి సూచన మేరకే 1931 సెప్టెంబర్‌ 15 అని పరిశ్రమ నిర్ణయానికి వచ్చింది. 1932న విడుదలైందంటూ కొన్ని ఆధారాలు చూపుతున్న పరిశోధకులు ఇంతకాలం మౌనంగా ఎందుకున్నారనేది ఆలోచించాల్సిన విషయం. ఎనిమిది దశాబ్ధాల ఉత్సావాన్ని సంబరంగా చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే ఇవిగో సాక్ష్యాలంటూ హడావుడి చేయడం వెనుక ఉన్న వారి ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. ఎనిమిది దశాబ్ధాలుగా నిజమని విశ్వసిస్తున్న తెలుగువారి నమ్మకాన్ని కాదని చెబుతున్నారు.

భక్త ప్రహ్లాద విడుదలైన తర్వాత సెన్సార్‌ జరిగి ఉండవచ్చు, లేదా దాసరి చెప్పినట్టు విజయవాడ, రాజమండ్రి తర్వాత మద్రాసులో రిలీజై
వుండవచ్చు కూడా. మన దేశంలో తక్కువ సంఖ్యలో అప్పట్లో టాకీచిత్రాలు (అంతకుముందు మూకీ చిత్రాలు వచ్చాయి) వస్తున్న సందర్భంలో సెన్సార్‌ శాఖ వేలసంఖ్య (11032)ను పొందు పరుస్తూ ఎందుకు సర్టిఫికెట్‌ జారీ చేసిందో మరి. ఏది ఏమైనప్పటికీ, విడుదల తేదీని పెద్ద వివాదం చేయడం సరికాదు. కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల, అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్‌ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి.

- పి. విజయబాబు,
ఎడిటర్‌
................................

Friday, October 21, 2011

తెలుగు సినిమా పుట్టినరోజు వివాదంపై టి.వి 9 స్టోరీ - వీడియో లింకు

తొలి తెలుగు సినిమా పుట్టిందెప్పుడు అన్న నా పరిశోధన పత్రంలోని అంశాలు పెద్ద చర్చకే దారి తీశాయి. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద 1931 సెప్టెంబర్ 15న విడుదల కానే లేదనీ, కాబట్టి తెలుగు సినిమా పుట్టినరోజంటూ ఆ తేదీని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదనీ సాక్ష్యాధారాలతో నేను చేసిన వాదనను కొన్ని టి.వి. చానళ్ళు ప్రస్తావించాయి. సరికొత్త సాక్ష్యాధారాలను పట్టించుకోకుండా తెలుగు సినిమా 80 ఏళ్ళ పండుగంటూ పరిశ్రమ ఏటేటా ఆ రోజు ఉత్సవం చేస్తామన్నసందర్భంలోనే ప్రముఖ ఉపగ్రహ టీవీ చానల్ టి.వి. 9 దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం తాలూకు వీడియో లింకును మిత్రులు ఈ మధ్యే నాకు మెయిల్ చేశారు.

1932 జనవరి 22న సెన్సారైన భక్త ప్రహ్లాద ఆ తరువాత ఏప్రిల్ 2న మద్రాసులో విడుదలైనట్లు నా పరిశోధనలో సాక్ష్యం దొరికింది. ఆ మధ్యలో ఎక్కడెక్కడ ఏ తేదీల్లో వచ్చిందో ససాక్ష్యంగా వివరాలు లభించలేదు. ఏమైనా, సినిమా సెన్సారైన 1932 జనవరి 22 నుంచి మద్రాసులో సినిమా విడుదల సమాచారం తొలిసారిగా లభిస్తున్న ఏప్రిల్ 2వ తేదీ మధ్యలోనే భక్త ప్రహ్లాద తొలి రిలీజు తేదీ ఉంటుందని నా వాదన.

పరిశోధించి, ప్రాథమిక, ప్రాసంగిక సాక్ష్యాధారాల సహాయంతో నేను చేసిన ఈ వాదనను టి.వి 9 జనం ముందుకు సమర్థంగానే తీసుకువెళ్ళింది. 30 నిమిషాల రికార్డింగును 300 సెకన్లకు కుదించడంలో ఒకటీ, అరా తప్పులు దొర్లినా, చరిత్రను సవ్యంగా అందించే కృషిలో భాగమైనందుకు టి.వి 9 బృందానికి కృతజ్ఞతలు. అక్కడ ప్రసారమైన వార్తా కథనం ఇక్కడ చూడండి.

Sunday, September 11, 2011

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రిలీజైంది 1931లో కాదు, 1932లో!



(తొలి తెలుగు టాకీ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న తప్పుడు చరిత్ర దీర్ఘకాలంగా ప్రచారంలో ఉంది. తీరా ఈ 2011 సెప్టెంబర్ 15న ఆ సినిమా వచ్చి, 80 ఏళ్ళు పూర్తయ్యాయనే పండుగ కూడా సినీ పరిశ్రమ పెద్దలు చేసేస్తున్నారు. కానీ, విడుదల తేదీపై వాస్తవ చరిత్ర అందుకు భిన్నంగా ఉన్నట్లు ఎంతో శ్రమించి చేసిన పరిశోధనలో తేలింది. మరి, అసలు తెలుగు సినిమాయే పుట్టని తేదీన పుట్టిన రోజు పండుగ చేస్తున్న మనవాళ్ళు ఇకనైనా కళ్ళు తెరుస్తారా?)

మాటలు లేని మూగ సినిమాలు నిర్మాణమవుతున్నంత కాలం ఏ భాష వారు ఆ చిత్రాన్ని తీసినా, దాన్ని భాషల చట్రాల్లో బిగించలేం. అది అందరి సినిమాయే తప్ప, ఫలానా భాషా చిత్రంగా చెప్పడానికి వీలు కాదు. కానీ, తెర మీద కదిలే బొమ్మలు మాటలు నేర్చుకోవడం మొదలైన తరువాత నుంచి పరిస్థితి మారింది. ఏ భాషలో మాటలు వినిపిస్తుంటే, ఆ భాషా చిత్రంగా పేర్కొనడం మొదలైంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సంగతికొస్తే, మూకీలను వెనక్కి నెడుతూ టాకీలు వచ్చింది - 1931లో. హిందీ - ఉర్దూల మిశ్రమ భాష (హిందుస్థానీ)లో తయారై, 1931 మార్చి 14న బొంబాయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో విడుదలైన 'ఆలమ్ ఆరా'యే తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేషిర్ ఎం.ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. 'ఆలమ్ ఆరా' తరువాత మరో ఏడు నెలలకు కానీ, మన దక్షిణాది భాషలో మాట్లాడే చిత్రాలు రాలేదు.

తొలి సినిమాపై తప్పుడు చరిత్ర

తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ఆ చిత్రంలో కథానాయక పాత్రధారి తెలుగులో మాట్లాడితే, మరో కథానాయిక సౌదామిని పాత్రధారిణి టి.పి. రాజలక్ష్మి తమిళంలో సమాధానమిచ్చారు. (కథానాయిక పాత్ర పేరు విద్యాధరి అని కొందరి కథనం) ఈ చిత్రంలో కథానాయిక రెండు త్యాగరాయ కీర్తనలను సైతం ఆలపించారు. అంటే తెలుగు, తమిళ భాషలు రెండూ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే ఎక్కువగా తమిళంలోనే మాటలు, పాటలు వినిపించాయి కాబట్టి, ప్రధానంగా దాన్ని తమిళ భాషా చిత్రంగానే పరిగణించారు. ఇలా 'కాళిదాస్'ను తొలి తమిళ టాకీగా తీర్మానించారు.

అయితే, ఆ తర్వాత పూర్తి తెలుగు సంభాషణలతో వచ్చిన తొలి తెలుగు టాకీ మాత్రం 'భక్త ప్రహ్లాద'. ఇంతవరకూ ఆ చిత్రం సరైన విడుదల తేదీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. తొలి తమిళ టాకీ 1931 అక్టోబర్ చివరలో వచ్చింది కాబట్టి, దానికి కనీసం నెలన్నర ముందు 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైనట్లు ఎవరో తెలివిగా ఓ కథనాన్ని పుట్టించారు. అందులోని నిజానిజాలు నిగ్గు తేల్చకుండా, ఆ కథనాన్నే ప్రతి ఒక్కరూ ప్రచారంలో పెట్టారు. తొలి తెలుగు టాకీ విడుదలైంది సెప్టెంబర్ 15నే అంటూ సాక్ష్యాధారాలు లేకుండానే మన చరిత్రకారులు గొఱ్ఱెదాటు ధోరణిని ప్రదర్శించారు. ఇటీవల పెరిగిన ఈ ధోరణితో, ఏటేటా సెప్టెంబర్ 15ను 'తెలుగు సినిమా జన్మదినం'గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ప్రకారం ఈ 2011 సెప్టెంబర్ 15తో తొలి తెలుగు సినిమా విడుదలై 80 ఏళ్లు పూర్తవుతున్న పండుగ కూడా చేసేస్తున్నారు.

కానీ, చరిత్ర మీద సిసలైన అభిమానంతో లోతుగా పరిశీలిస్తే, వాస్తవాలు వీటికి విరుద్ధంగా ఉన్నాయి. 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న వాదన కానీ, కనీసం తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ వచ్చేసిందన్న వాదన కానీ శుద్ధ తప్పు అని ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలింది.

సెన్సార్ కన్నా ముందే రిలీజెట్లా?

తొలి తమిళ, తెలుగు టాకీలు రెండింటికీ దర్శకుడు ఒకరే - హెచ్.ఎం.రెడ్డి. తమిళ టాకీ 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న మద్రాసులోని 'కినిమా సెంట్రల్' (ఇప్పుడు ఈ హాలు పేరు 'మురుగన్' టాకీస్)లో విడుదలైందనడానికి పత్రికా ప్రకటనలతో సహా తమిళ చరిత్రకారులు సాక్ష్యాధారాలు సేకరించారు. "10 వేల అడుగుల నిడివి'' గల ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది. ప్రదర్శన కాలం 112 నిమిషాలైన ఈ చిత్రం సర్టిఫికెట్ నెంబర్ "ఎం (మద్రాసు?) - 1598.''

కానీ, అంతకన్నా ముందే రిలీజైనట్లు పుట్టించిన పుక్కిటి చరిత్ర చెబుతున్న తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' మాత్రం సెన్సారైంది - 1932 జనవరి చివరిలో! ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 1932 జనవరి 22న! మొత్తం 9,762 అడుగుల నిడివి గల 10 రీళ్ల ఆ చిత్రం బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకొంది. 'బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సెన్సార్స్' అదే తేదీతో సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ "నెంబర్ - 11032, తేదీ 22 జనవరి 1932''. దీన్నిబట్టి, ఒక విషయం స్పష్టం. 1932 జనవరి చివరిలో సెన్సారింగ్ జరుపుకొన్న మన 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ మధ్యకే రిలీజై పోయిందనడం తలాతోకా లేని వాదన.

హెచ్.ఎం. రెడ్డి ఏం చెప్పారు?

దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి సైతం తాను ముందుగా తెలుగు టాకీ నిర్మించి, ఆ పైన తమిళ టాకీ చేశానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు, తమిళ టాకీ తీశాకే, తెలుగు టాకీ తీసినట్లు తన మాటల్లో, రాతల్లో స్పష్టంగా పేర్కొన్నారు. "... మొదటి హిందీ టాకీ అయిన 'ఆలమ్ ఆరా'ను తయారు చేసిన నలుగురు ప్రముఖులలో ఒకణ్ణి నేను" అని ఆయన చెప్పారు.

(బెంగళూరులోని సూర్యా ఫిలిమ్స్‌వారు తీసిన మూకీ చిత్రాలతో సినీ పరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హెచ్.ఎం.రెడ్డి ఆ తరువాత బొంబాయికి మకాం మార్చి, దర్శక - నిర్మాత అర్దేషిర్ ఎం. ఇరానీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఇరానీ నిర్మించిన 'విజయ్ కుమార్'లాంటి మూకీలకు దర్శకత్వం వహించారు.

తొలి టాకీ 'ఆలమ్ ఆరా' విజయంతో దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని అర్దేషిర్ ఇరానీ అనుకున్నప్పుడు ఆయన సహజంగానే తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణ భారతీయుడు హెచ్,ఎం.రెడ్డి వైపు మొగ్గారు. ఆ భాషలు తెలిసిన రెడ్డికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆ రకంగా, అర్దేషిర్ ఇరానీ నిర్మించిన తొలి తమిళ టాకీకి హెచ్.ఎం.రెడ్డి స్వయంగా దర్శకత్వం వహించారు).

"...మొదటి అరవ ఫిలిమ్ డైరెక్ట్ చేసినవాణ్ణీ నేనే! అది - టి.పి.రాజలక్ష్మి యాక్టు చేసిన 'కాళిదాస్'. అది నాదేగా! ... ఆ పైన అఖిల భారతదేశంలో ప్రథమ తెలుగు టాకీ అయిన 'ప్రహ్లాద'ను నేనే డైరెక్టు చేశాను...'' అని హెచ్.ఎం. రెడ్డి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్నిబట్టి చూసినా, తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చిందని అర్థమవుతోంది.

ఎల్.వి.ప్రసాద్ ఏం చెప్పారు?

మూకీల రోజుల నుంచి బొంబాయిలో ఉన్న నటుడు, తరువాత ప్రముఖ దర్శక - నిర్మాతగా మారిన ఎల్.వి. ప్రసాద్ సైతం తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా'లో ఉన్న ఎల్.వి. ప్రసాద్, తొలి తమిళ టాకీ 'కాళిదాస్'లోనూ ఓ చిన్న వేషం వేశారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తయారైన తొలి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద'లో సైతం ఆయన ప్రహ్లాదుడి సహాధ్యాయీ, గురువు చండామార్కుల వద్ద శిష్యుల్లో ఒకడూ అయిన మొద్దబ్బాయి పాత్ర ధరించారు. ఆ రకంగా హిందీ, తమిళం, తెలుగు - ఈ మూడు భారతీయ భాషల్లోనూ తొలి టాకీ చిత్రాలతో సంబంధం ఉన్న వ్యక్తులు - హెచ్.ఎం.రెడ్డి, ఎల్.వి. ప్రసాద్.

ఓ సందర్భంలో ఎల్.వి. ప్రసాద్ తన అనుభవాలను వివరిస్తూ 'బొంబాయిలో (హెచ్.ఎం) రెడ్డి గారు నాకు పరిచయమయ్యారు. ఆయనేదో అక్కడ పృథ్వీరాజ్ కపూర్ హీరోగా ఒక సైలెంట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడే 'టాకీ' ప్రారంభమైంది. 'ఆలమ్ ఆరా' వచ్చింది. అర్దేషిర్ గారికి తమిళంలో ఏదైనా సినిమా తీద్దామని ఉద్దేశం కలిగి, 'కాళిదాస్' ప్లాన్ చేశారు. అప్పుడు టి.పి. రాజలక్ష్మినీ, వారినీ పిలిపించారు. నేను కూడా ఉన్నాను కనుక అందులో నేనూ ఒక వేషం వేశాను. ఆ విధంగా హెచ్.ఎం.రెడ్డి గారితో పరిచయమైంది. ఆయన తెలుగువాడైనా, అక్కడ బాగా కమాండ్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడల్. ఆ ('కాళిదాస్') సినిమా అవగానే, కృష్ణా ఫిలిమ్ కంపెనీ వారికి 'భక్త ప్రహ్లాద' తీయాలనే ఉద్దేశం కలిగింది. (హెచ్.ఎం) రెడ్డిగారే డైరెక్ట్ చెయ్యడం కనుక ఆయనే నన్ను పిలిచారు' అని 'భక్త ప్రహ్లాద' విషయాలు తెలిపారు. ఆయన చెప్పిన మాటలను బట్టి చూసినా, తెలుగులో టాకీలు వచ్చింది తమిళం తరువాతే అన్నది స్పష్టం!

నోటి మాట కాదు, రాతలోనూ అదే!

వట్టి నోటి మాటగా చెప్పడమే కాదు, హెచ్.ఎం. రెడ్డి స్వయంగా ఈ వివరాలు రాశారు కూడా. భారతీయ టాకీ రజతోత్సవాల సమయంలో హెచ్.ఎం. రెడ్డి 'గడిచిన 25 ఏళ్లలో దక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ' శీర్షికతో ఓ వ్యాసం రాశారు. అందులోనూ ఆయన తమిళ టాకీ విజయమే తనను తెలుగు టాకీ నిర్మాణానికి ప్రోత్సహించినట్లు చాలా స్పష్టంగా తెలిపారు.

"... ఎన్నో పురిటినొప్పుల మధ్య తొలి తమిళ చిత్రం 'కాళిదాస్' (9000 అడుగులు)ను బొంబాయిలోని ఇంపీరియల్ స్టూడియోస్‌లో నిర్మించాం. అప్పట్లో తారలంటే రంగస్థల తారలే! సుప్రసిద్ధ రంగస్థల నటీనటులకు ఎంతో గిరాకీ ఉండేది. నిజం చెప్పాలంటే, ఆ తొలి సంవత్సరాల్లో నిర్మించిన చిత్రాలు కేవలం సుప్రసిద్ధ నాటకాల పునర్నిర్మాణాలే! కాకపోతే, సరికొత్త మాధ్యమమైన వెండితెరపై ఆ నాటకాలు చూపేవాళ్లం!

తమిళ చిత్రం సాధించిన విజయం తెలుగులో ఓ చిత్ర నిర్మాణానికి ప్రోత్సాహమిచ్చింది. అలా నేను దర్శకత్వం వహించిన (తెలుగు చిత్రం) 'భక్త ప్రహ్లాద' 1932లో విడుదలైంది. ఈ చిత్రం విజయం సాధించడంతో, తెలుగులో, తమిళంలో వరుసగా ఎన్నో పౌరాణిక చిత్రాలు వచ్చాయి. స్వర్గీయ రాజా శాండో, నారాయణ్ లాంటి అనుభవజ్ఞులైన సీనియర్లు, సి. పుల్లయ్య, హెచ్.వి.బాబు, స్వర్గీయ చిత్రపు నరసింహారావు లాంటి వారు ఆ పౌరాణికాలకు దర్శకత్వం వహించారు...'' అని సాక్షాత్తూ హెచ్.ఎం.రెడ్డే రాశారు. 'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1931లో కానే కాదనడానికి ఆ చిత్ర దర్శకుడు రాసిన ఈ మాటలే ప్రబలమైన సాక్ష్యం!

మరి 'భక్త ప్రహ్లాద' రిలీజైంది ఎప్పుడు?

ఇంతకీ, 'భక్త ప్రహ్లాద' విడుదల తేదీ ఏమిటన్నట్లు? ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలిందేమిటంటే, "తొలి 100 % తెలుగు టాకీ''గా సగర్వంగా ప్రకటించుకున్న 'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైంది తెలుగు సంవత్సరాది కానుకగా - 1932 ఏప్రిల్ 2న! మద్రాసులోని నేషనల్ పిక్చర్ ప్యాలెస్‌లో 'భక్త ప్రహ్లాద' విడుదలైంది. "ప్రేక్షకులచే క్రిక్కిరిసి పోవుచున్నది. గనుక ముందుగ స్థలము కొరకై జాగ్రత్త పడుడు. ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూచు యవకాశము బోగొట్టుకొనకుడు'' అంటూ ప్రకటనలు ఇచ్చారు. అప్పట్లో రోజుకు రెండు ఆటలే (సాయంత్రం ఫస్ట్ షో, రాత్రి వేళ సెకండ్ షో) ప్రదర్శించేవారు. ఏవైనా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మధ్యాహ్నం వేళ ప్రత్యేకంగా మ్యాట్నీ షో వేసేవారు. 'భక్త ప్రహ్లాద'కు కూడా ఆ తెలుగు సంవత్సరాది పండుగ నాడు సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు 'ప్రత్యేక మేటనీ ప్రదర్శన' వేశారు.

'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1932లోనే అని చెప్పడానికి మరో ప్రాసంగిక సాక్ష్యాధారం కూడా ఉంది. అది ఏమిటంటే - ఆ సినిమాకు సమీక్షలు సైతం 1932లోనే వచ్చాయి. 'ఆనంద బోధిని' లాంటి పత్రికలు 1932 మార్చి సంచికలో ఈ చిత్రాన్ని సమీక్షించాయి. ఒకవేళ పుక్కిటి చరిత్ర చెబుతున్నట్లు, 1931 సెప్టెంబర్‌లో 'భక్త ప్రహ్లాద' సినిమా రిలీజై ఉంటే, దొంగలు పడ్డ ఆరు నెలలకు సమీక్షించరు కదా! ఆ రకంగా చూసినా, 'భక్త ప్రహ్లాద' విడుదల 1931లో కాదు, 1932లో అని చెప్పవచ్చు.

('భక్త ప్రహ్లాద' రిలీజైంది ఏప్రిల్‌లో అయితే, మార్చి సంచికలో సమీక్ష రావడానికి కారణం ఏమిటని ఎవరైనా అనుమానం వ్యక్తం చేయవచ్చు. దానికి ఈ పరిశోధకుడి వివరణ ఏమిటంటే - అప్పటి పత్రికలు ఇప్పటిలా ముందస్తు తేదీలతో కాక, ఏ నెలకు ఆ నెలే రావడం కద్దు. పైగా , కొన్ని పత్రికలు నెల మధ్యలోనో, ఒక్కోసారి మరీ ఆలస్యంగా నెలాఖరులోనో విడుదలయ్యేవి. ఆర్థికాది అనేక కారణాలతో మరీ ఆలస్యమైనప్పుడు అరుదుగా కొన్నిసార్లు ముందటి నెల తేదీతోనే తరువాతి నెలలో వచ్చేవి. ఓపిగ్గా వెతికితే అలాంటి ఉదాహరణలు చాలా కనపడతాయి. కాబట్టి, పత్రిక మీద "మార్చి నెల'' అని రాసినా సదరు పత్రిక మార్చి నెల చివరలోనో, ఏప్రిల్‌లోనో వచ్చి ఉండవచ్చు.

ఇక, సినిమా రిలీజు ముందే సమీక్ష ఏమిటని కూడా నోళ్ళు నొక్కుకోనక్కర లేదు. ఎందుకంటే, సినీ పరిశ్రమ పెద్దలకూ, పత్రికల వారికీ సినిమాను ముందుగానే ప్రదర్శించి చూపే అలవాటు అప్పటికే చిత్రసీమలో ఉంది. సినిమా విడుదలకు ముందు రోజునో, రిలీజ్ రోజునో పెద్దలకూ, సన్నిహితులకూ ప్రివ్యూ వేసి చూపడం ఇప్పటి వాడుక. కానీ, అప్పట్లో అలా కాదు! సినిమా విడుదల కన్నా వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల ముందరే ప్రివ్యూ వేసేవారు. తొలి తమిళ టాకీ 'కాళిదాస్'కూ ఆ పద్దతి పాటించారు. అదే పద్ధతిని ఆ తరువాత వచ్చిన 'భక్త ప్రహ్లాద'కూ అనుసరించారని ఊహించవచ్చు. ఫలితంగా, ఏప్రిల్ 2న రిలీజైన 'భక్త ప్రహ్లాద'కు మార్చి నెల పత్రికలోనే సమీక్ష వచ్చి ఉండవచ్చు).

ఏమైనా, ఒకటి వాస్తవం. ఏ రకంగా చూసినా తొలి తమిళ టాకీ తరువాతే తొలి తెలుగు టాకీ విడుదలైందనేది చేదు నిజం! తెలుగు సినిమా పుట్టిన రోజు 1931 సెప్టెంబర్ 15 తేదీ కాదనేది ఖాయం!! ఇప్పటి వరకు లభిస్తున్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తే 1932 జనవరి చివరిలో సెన్సారైన తరువాతా, చిత్ర తొలి విడుదల సమాచారం దొరుకుతున్న ఏప్రిల్ లోపలా 'భక్త ప్రహ్లాద' విడుదలైనట్లు స్పష్టమవుతోంది. కాబట్టి, 'భక్త ప్రహ్లాద' 1931లో విడుదలైందన్న మాటే సత్యదూరం. మరి, ఇప్పటికైనా మన సినీ చరిత్రకారులు తెలుగు సినిమా పుట్టిన తేదీ గురించి ప్రచారంలో ఉన్న పాత తప్పులను సవరించుకుంటారా? పుట్టని సెప్టెంబర్ 15ను వదిలేసి, ఇకనైనా తెలుగు సినిమాకు సరైన రోజునే జన్మదినం జరుపుతారా?!

కొసమెరుపు :

'ఇన్నాళ్లూ తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ ముందు వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ సంతోషం లేకుండా చేశారే'మని మిత్రులు బాధపడనక్కర లేదు. ఎందుకంటే, తెలుగు మాటలు, పాటలు ఉన్నాయి కాబట్టి, హెచ్.ఎం. రెడ్డి 'కాళిదాస్' సినిమాను కేవలం తమిళ టాకీగా కాక, తొలి తెలుగు - తమిళ టాకీగా చెప్పుకోవచ్చు! అందులో హీరోయిన్ మన అచ్చ తెలుగు కీర్తనలు రెండు కూడా పాడారు. "తమిళ లిపిలో రాసుకొని మరీ, తెలుగు సంభాషణలు పలికా''రు. హీరో కూడా తెలుగులో డైలాగులు చెప్పారు. నిజానికి, 'కాళిదాస్' చిత్రానికి "తమిళ - తెలుగు భాషల్లో మాట్లాడే చిత్రం'' అనే ప్రకటనలిచ్చారు. ఆ రకంగా, తెర మీద బొమ్మలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి మాట్లాడాయి కాబట్టి, తమిళంతో సమానంగా తెలుగూ నిలిచిందని చెప్పుకోవచ్చు! సంతోషపడవచ్చు!!

(మద్రాసు విశ్వవిద్యాలయంలో సమర్పించిన పరిశోధన వ్యాసం నుంచి...)

Monday, August 29, 2011

కౌబాయ్ లకు కౌబాయ్




ఆ సినిమా వచ్చి ఇప్పటికి సరిగ్గా నాలుగు దశాబ్దాలైంది. విడుదలైన రోజుల నుంచి ఇవాళ్టి వరకు దాని గురించి గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నారు. తెలుగు చలనచిత్ర లోకానికి కౌబాయ్ కథలను పరిచయం చేసి, సంచలనం రేపిన ఆ చిత్రం - 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ రోజుల్లో ''ఏ తెలుగు నిర్మాతా సాహసించని లొకేషన్లలో, విశేష వ్యయ ప్రయాసలతో నిర్మించిన అపూర్వ చిత్రం''గా ఓ విశిష్ట స్థాయిని అందుకున్న ఈ ''తొలి తెలుగు కౌబాయ్ చిత్రం'' విడుదలై, ఈ ఆగస్టు 27 నాటికి సరిగ్గా నలభై ఏళ్ళయింది. తెలుగు తెరపై హాలీవుడ్‌ పోకడలకు తెర తీసి, ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించి, వివిధ భాషల్లోకి అనువాదమైన ఈ సూపర్‌హిట్‌ చిత్రం జ్ఞాపకాల స్వారీకి స్వాగతం...

ఒకే రకమైన జానపదాలు, పౌరాణిక చిత్రాలతో జనానికి విసుగెత్తుతున్న కాలం అది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు తారలుగా స్థిరపడిపోయి చాలా కాలం అవడంతో, యువతరానికి చెందిన నవ తారలకు అవకాశాలు తెరుచుకున్న సమయం. కృష్ణ, శోభన్‌బాబు లాంటి నటులు ఆ అవకాశాలను అందుకోవాలని తపిస్తున్న తరుణం. ఆ పరిస్థితుల్లో ఇంగ్లీషు, హిందీ చిత్రాల స్ఫూర్తితో తెలుగు సినిమా సైతం క్రైమ్‌, యాక్షన్‌ తరహా చిత్రాల వైపు క్రమంగా మొగ్గింది. అలాంటి కొత్త కథల అన్వేషణలో తెలుగు మసాలాతో వండి, వడ్డించిన పాశ్చాత్య తరహా కౌబాయ్ వంటకం - 'మోసగాళ్ళకు మోసగాడు' (సంక్షిప్తంగా 'మో.మో').

కౌబాయ్ కథే ఎందుకు?

తెలుగు సినీ లోకానికి అప్పటికి కొత్తగా అనిపించే ఈ సాహస గాథను హీరో కృష్ణ అసలు ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక కూడా నాటకీయత, సాహసం ఉన్నాయి. 1960ల ద్వితీయార్ధంలో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ, 1970 నాటికి 40కి పైగా సినిమాలు చేశారు. కానీ, నటుడి నుంచి తార స్థాయికి తనకు పదోన్నతి కల్పించే చిత్రాలు చేయలేకపోతున్నాననే అసంతృప్తి ఆయనలో కలిగింది. ఆ అసంతృప్తి నుంచే సొంత చిత్ర నిర్మాణ సంస్థ, సొంత సినిమాల నిర్మాణమనే ఆలోచనలకు బీజం పడింది. అనుకున్నదే తడవుగా పెద్దమ్మాయి పేరు మీద 'శ్రీపద్మాలయా మూవీస్‌' సంస్థను నెలకొల్పారు. ఆ పతాకంపై తొలి సొంత చిత్రంగా తానే హీరోగా 'అగ్ని పరీక్ష' (1970) నిర్మించారు. కానీ, అది ఫ్లాపైంది. హీరోగా కృష్ణ ఆశించిన ఫలితమూ దక్కలేదు.

దాంతో, స్వీయ చిత్ర నిర్మాణ సంస్థలో పెద్ద హిట్‌ సాధించాలనీ, ఇటు నిర్మాతగా, అటు హీరోగా పేరు తెచ్చుకోవాలనీ సహజంగానే కృష్ణలో పట్టుదల పెరిగింది. అలాంటి విజయం సాధించాలంటే, ఓ కొత్త తరహా సినిమా తీయాలని భావించారు. సరైన కథ కోసం వెతుకులాట మొదలైంది. అదే సమయంలో 'మెకన్నాస్‌ గోల్డ్‌' లాంటి హాలీవుడ్‌ కౌబాయ్ చిత్రాలు మద్రాసులో సంచలనం రేపుతున్నాయి. కృష్ణ మనసులో తళుక్కున ఆలోచన మెరిసింది. అలాంటి కౌబాయ్ కథే తెలుగులో తీస్తే? అలా 'మెకన్నాస్‌ గోల్డ్‌', 'గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ', 'ఫ్యూ డాలర్స్‌ మోర్‌' తదితర హాలీవుడ్‌ చిత్రాలను కలిపి, తెలుగులో కొత్త వంటకం తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ పాశ్చాత్య కథలు, సంఘటనలను పక్కాగా తెలుగు వాతావరణానికి తగ్గట్లు వండి, వడ్డించే బాధ్యతను రచయిత ఆరుద్రకు అప్పగించారు. అదిగో అలా తయారైన కథే - 'మోసగాళ్ళకు మోసగాడు'.

ఊళ్ళూ, పేర్లూ మాత్రం తెలుగు వాతావరణానికి తగ్గట్లు మార్చి, పాత్రల రూపురేఖలు, వస్త్రాలంకరణ మాత్రం ఇంగ్లీషు కౌబాయ్ సినిమాల శైలిలోనే ఉండేలా చూశారు. ఇంగ్లీషు చిత్రాల స్ఫూర్తితోనే తెలుగులో స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నారు. కృష్ణతో 'టక్కరి దొంగ - చక్కని చుక్క' (1969) తదితర చిత్రాలు రూపొందించిన కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ రౌడీ రాణి' (1970) చిత్ర విజయంతో మంచి జోరు మీదున్నారు. దాంతో, యువకుడు దాస్‌ను ఈ యాక్షన్‌ చిత్రానికి డైరెక్టర్‌గా ఎంచుకున్నారు.

సాహస గాథకు సాహసోపేత చిత్రీకరణ

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రేమికులైన హీరో హీరోయిన్లు తమ తండ్రులను చంపినవారిపై ఎలా పగ సాధించుకున్నారనేది ఈ చిత్ర కథ. హంతకులెవరో కనిపెట్టి, వారిని వెంటాడి, వేటాడే ఈ క్రైమ్‌ ఫార్ములాకు అమూల్యమైన నిధి కోసం అన్వేషణ, దాన్ని శోధించి సాధించడం, ప్రజల పరం చేయడం ఆసక్తికరమైన పైపూత! ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణం, గుర్రాల మీద ఛేజింగులు, పేలే తుపాకులు, కాలే ఇళ్ళు, దుర్గమమైన ప్రాంతాల్లో ప్రయాణాలు, సరసాలు, సరదాలు, వినోదాలతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, చకచకా సాగిపోయే కథా కథనం 'మో.మో'ను అప్పట్లో ప్రత్యేకంగా నిలిపాయి. ఈ సాహస గాథను సెల్యులాయిడ్‌పై చిత్రీకరించిన తీరు కూడా నిజంగా సాహస గాథే.

అప్పట్లో హీరో కృష్ణ సినిమాలను మూడు, నాలుగు లక్షల బడ్జెట్‌లో తీసేవారు. కానీ ఈ చిత్రానికి అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశారు. ''భారతదేశంలోనే తొలి కౌబాయ్ మా 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ సినిమాను సిమ్లా, రాజస్థాన్‌లోని బికనీర్‌, మద్రాసు, పాండిచ్చేరిలలో తీశాం. ఎడారి దృశ్యాలను రాజస్థాన్‌లోని కోటా అనే చోట చాలా శ్రమపడి చిత్రీకరించాం'' అని కథానాయకుడు కృష్ణప్రసాద్‌ పాత్రను పోషించిన హీరో కృష్ణ చెప్పుకొచ్చారు. కథానాయిక రాధగా నటించిన విజయనిర్మల సైతం తన కెరీర్‌లో ఎంతో కష్టపడి నటించిన సినిమా 'మో.మో' అని చెప్పారు. ''ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎన్నడూ అలవాటు లేని ఫైట్లు, గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నేను, కృష్ణ గారు, నాగభూషణం గారు రోజూ మద్రాసులోని మెరీనా సముద్రతీరంలో గుర్రపు స్వారీ సాధన చేసేవాళ్ళం'' అని విజయనిర్మల చెప్పారు.

''ఆ చిత్ర నిర్మాణం కోసం కృష్ణ ఎంతో శ్రమపడ్డారు. యూనిట్‌ సభ్యులందరినీ రైళ్ళలో ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ గదులు బుక్‌ చేసి ఉంచి, అక్కడ నుంచి సిమ్లాకు తీసుకువెళ్ళారు'' అని కృష్ణ కెరీర్‌ తొలి రోజుల నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉన్న సీనియర్‌ సినీ జర్నలిస్టు మోహన్‌ కుమార్‌ చెప్పారు. హీరో కృష్ణ నిర్మించిన చిత్రాలకు కొద్దికాలం పాటు నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, జ్యోతిలక్ష్మి తదితర ప్రముఖ నటీనటులెందరో ఈ చిత్రంలో నటించారు. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో మనుషులు తిరగని, మంచినీళ్ళు కూడా దొరకని చోట ప్రాణాలకు తెగించి, ఈ చిత్ర షూటింగ్‌ చేశారు. బికనీర్‌ కోటలో, సట్లెజ్‌ నదీ తీరంలోని తట్టాపానీ ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు. ''మో.మో. ఓపెనింగ్‌ షాటే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. వి.ఎస్‌.ఆర్‌. స్వామి కెమేరా పనితనం తెలియాలంటే, 'మో.మో' చూడాల్సిందే!'' అని మోహన్‌ కుమార్‌ అన్నారు.

విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు చూపించే సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. సరైన మేకప్‌ సామగ్రి దొరకని సమయంలో కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్‌ సి. మాధవరావుకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. దగ్గరలోనే బఠాణీలు దొరికితే తెప్పించారు. ఆ బఠాణీల పైన పొరలా ఉండే, తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖంపై అంటించారు. అంతే! సన్నివేశానికి కావాల్సిన ముఖంపై పొక్కుల ఎఫెక్ట్‌ వచ్చింది. సాంకేతిక నిపుణులు చూపిన అలాంటి సమయస్ఫూర్తి, 'గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ' చిత్రంలోని 'అగ్లీ' పాత్ర స్ఫూర్తితో మలచిన నక్కజిత్తుల నాగన్న (పాత్రధారి విలక్షణ నటుడు నాగభూషణం) పాత్రచిత్రణ, ఫైట్‌ మాస్టర్లు మాధవన్‌, రాఘవులు చేసిన సాహసాల లాంటివి ఇవాళ్టికీ ఓ పెద్ద గాథ.

తప్పిన అంచనాలు! తప్పని గురి!!

అయితే, ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత - దర్శకుడు, చిత్ర పరిశ్రమలో హీరో కృష్ణకు మొదటి నుంచీ శ్రేయోభిలాషీ అయిన చక్రపాణి ఒకసారి షూటింగ్‌ జరుగుతుండగా వచ్చారు. సెట్‌లోని కౌబాయ్ వాతావరణం, నటీనటుల గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. మన తెలుగు వాతావరణానికి దూరంగా ఉండే ఈ గెటప్పులనూ, సెటప్పులనూ సామాన్య ప్రేక్షక జనం మెచ్చరని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. కానీ, అప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్‌ అయిపోయింది. దాంతో, హీరో కృష్ణ బృందం ఆ అభిప్రాయాలను పక్కనపెట్టి, ముందుకు సాగారు. మొదట ఈ చిత్రానికి 'అదృష్ట రేఖ' అని పేరు పెడదామనుకున్నా, చివరకు 'మోసగాళ్ళకు మోసగాడు' అనే మాస్‌ టైటిల్‌నే ఎంచుకున్నారు.

తీరా షూటింగ్‌ పూర్తయి, తొలి కాపీ వచ్చాక కూడా ప్రివ్యూలు చూసినవారెవరూ, ఈ సినిమాపై సరైన అంచనా చెప్పలేకపోయారు. కానీ, హీరో ఎన్టీఆర్‌ మాత్రం 'బాగుంది బ్రదర్‌! నిజంగా విభిన్నమైన మాస్‌ సినిమా తీశారు. అయితే, ఈ సినిమాలో ఆడవాళ్ళకు నచ్చే అంశాలు మిస్సయ్యారు. కాబట్టి, వాళ్ళు పెద్దగా చూడరు. ఫస్ట్‌ రిలీజ్‌ కన్నా, రీ-రిలీజుల్లో మరింత డబ్బు వస్తుంది. సంచలనం రేపుతుంది' అన్నారు. సరిగ్గా ఆయన అన్నట్లే అయింది. 1971 ఆగస్టు 27 శుక్రవారం నాడు బెంగుళూరుతో సహా తెలుగు నాట సుమారు 27 కేంద్రాల్లో, ''దాదాపు 35 ప్రింట్లతో'' 'మోసగాళ్ళకు మోసగాడు' విడుదలైంది. చివరకు, ''ఎన్టీఆర్‌ చెప్పినట్లే అయింది. మహిళాదరణ దక్కలేదు కానీ, సినిమా సంచలనాత్మక విజయం సాధించింది'' అని హీరో కృష్ణ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

సక్సెస్‌కు సహకరించిన అంశాలు

తెలుగులో అంతకు మునుపెన్నడూ రాని సాహస గాథా చిత్రమైన 'ఈ కొత్త తరహా సినిమా తెలుగు తెరకు శోభాయమానమైన అమూల్య కానుక' అని అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంకా బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలే రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో పూర్తిగా ''ఈస్ట్‌మన్‌ కలర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో కథ కన్నా, కథా గమనం కన్నా కమనీయమైన దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా'' ఆకర్షించాయి. ''ఒక చక్కని ఆంగ్ల చిత్రం చూస్తున్నట్లు'' అనిపించింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది దర్శకుడు, ఛాయాగ్రహణ దర్శకుల చిత్రం. ఈ చిత్రానికి వన్నె తెచ్చింది, ప్రాణం పోసింది - ముఖ్యంగా వి.ఎస్‌.ఆర్‌. స్వామి సినిమాటోగ్రఫీ. అప్పుడప్పుడే వాడుకలోకి వస్తున్న రంగుల ఫిలిమ్‌ను ప్రకృతి రామణీయతను చూపేందుకు సద్వినియోగం చేసుకున్నారు. కెమేరా కోణాలను వి.ఎస్‌.ఆర్‌. స్వామి ఎంత వేగంగా మారుస్తూ వెళ్ళారో, సన్నివేశ పరంపరను కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ అంతే వేగంగా నడిపిస్తూ వెళ్ళారు. ఫలితంగా చిత్రంలోని లోటుపాట్లు చటుక్కున ఎవరికీ తట్టలేదు.

ఈ చిత్రకథకు సందర్భశుద్ధి కల్పించడానికి ఆరుద్ర ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అవి లోపరహితం కాలేకపోయాయి. ఈ సినిమాలో చూపినట్లు చిత్ర కథ జరిగే కర్నూలు సబాలో ఎడారులుండవు. గుంటూరు సర్కార్‌లో మంచుకొండలూ ఉండవు. అయినా, ఆ ఊపులో ఈ అనౌచిత్యం గురించి ప్రేక్షకులు ఎవరూ ఆలోచించ లేదు. ''దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కెమేరా కదలికలు వాడాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. 'మోసగాళ్ళకు మోసగాడు'లో ప్రధానంగా 8 ఆకారంలో కనిపించే కెమేరా కదలిక ఆయన సృష్టించినదే!'' అని కృష్ణ, ఈ వ్యాసకర్తకు వెల్లడించారు.

ఇక, సంగీతం, ప్రధానంగా నేపథ్య సంగీతాన్ని చిత్ర వాతావరణానికి అనుకూలంగా, కొత్త తరహాలో ఉంటూ జనాన్ని బాగా హుషారు పరిచేలా ఆదినారాయణరావు సమకూర్చారు. 'కోరినది దరి చేరినది...' అనే యుగళగీతం ఆకట్టుకుంది. డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్ల కృషి ఫలించడానికి కోటగిరి గోపాలరావు కూర్పు కూడా బాగా తోడ్పడింది. విచిత్రం ఏమిటంటే, అప్పటి దాకా నాయిక, ప్రధాన పాత్రలకే పరిమితమైన శాస్త్రీయ నర్తకి, నటి రాజసులోచనతో ఈ చిత్రంలో ఓ శృంగార నృత్యం చేయించడం! 'సిగ్గేలా మగాడికీ.. పగ్గాలా వయారికీ...' అనే ఆ పాటలో రాజసులోచన నృత్యం ఆనాటి ప్రమాణాల్లోనే ఆంగ్ల చిత్రాల స్థాయిని అందుకుంది.

సరికొత్త చరిత్రకు శ్రీకారం

హీరోగా కృష్ణకు 60వ సినిమాగా విడుదలైన 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం విమర్శలు, లోపాలకు అతీతంగా విజయవంతమైంది. 'పద్మాలయా' పతాకానికి తొలి విజయం అందించడమే కాక, తొలి తెలుగు కౌబాయ్ సినిమాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కృష్ణ ఈ చిత్రంతో స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతకు పదింతల పేరు నిర్మాతగా సంపాదించుకున్నారు. ''కేవలం 7 లక్షల రూపాయల బడ్జెట్‌లో 28 రోజుల్లో ఆ చిత్రాన్ని నిర్మించాం. తొలి రిలీజ్‌లోనే దాదాపు రూ. 32 లక్షలు వసూలు చేసింది. స్టార్‌ ఇమేజ్‌ కోసం సొంత బ్యానర్‌ను పెట్టిన నా లక్ష్యం నెరవేరింది. వెరసి 'మోసగాళ్ళకు మోసగాడు' ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయింది'' అని కృష్ణ అన్నారు.

ఆ సినిమాతో కృష్ణ ఎంత బిజీ అయ్యారంటే, మరో 12 చిత్రాలు విడుదలయ్యాక కానీ, ఆయన మళ్ళీ సొంత సినిమాను ప్రారంభించలేనంత బిజీ!

ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమా సహజంగానే ఇతర భాషల్లోకి డబ్‌ అయింది. తమిళంలో 'మోసక్కారనుక్కు మోసక్కారన్‌'గా, హిందీలో 'గన్‌ఫైటర్‌ జానీ' పేరుతో, ఇంగ్లీషులో 'ది ట్రెజర్‌ హంట్‌'గా అనువాదమైంది. ''తమిళంలో వంద రోజులాడింది. హిందీలో వంద రోజులు ఆడలేదు కానీ, బాగా వసూళ్ళు సాధించింది'' అని కృష్ణ చెప్పారు. గమ్మత్తేమిటంటే, హాలీవుడ్‌ చిత్రాల స్ఫూర్తితో అటు నుంచి ఇటు వచ్చిన ఈ చిత్ర కథ, మళ్ళీ ఇటు నుంచి అటు ఇంగ్లీషులోకి అనువాదమై, అక్కడి ప్రేక్షకుల్ని అలరించడం! ''ఇంగ్లీషు డబ్బింగ్‌ రూపం గల్ఫ్‌ దేశాలు, సింగపూర్‌, కౌలాలంపూర్‌, టర్కీ, ఆఫ్రికన్‌ దేశాలన్నిటిలో కలిపి దాదాపు 80 దేశాల్లో విడుదలైంది'' అని కృష్ణ తెలిపారు.

సినిమా విడుదలైన తొలి రోజుల్లో ప్రచారంలో పేర్కొన్నట్లుగానే ఈ చిత్రం ''తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభించిన చిత్రం''గా నిలిచింది. ఆ పైన మరెన్నో కౌబాయ్ చిత్రాలు తెలుగులో రావడానికీ, కృష్ణ కూడా మరిన్ని కౌబాయ్ వేషాలు వేయడానికీ తోడ్పడింది. 'మోసగాళ్ళకు మోసగాడే' ప్రేరణగా దాదాపు 15 కౌబాయ్ చిత్రాల్లో కృష్ణ నటించారు. అయితే, ఆ తదుపరి చిత్రాలేవీ తొలి విజయాన్ని మరిపించలేక పోయాయి.

సాక్షాత్తూ కృష్ణకు నట వారసుడైన యువ హీరో మహేష్‌బాబుతో కూడా మళ్ళీ అదే రకమైన కథతో పదేళ్ళ క్రితం భారీ వ్యయంతో 'టక్కరి దొంగ' (2002) చిత్రం నిర్మితమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, హాలీవుడ్‌ కౌబాయ్ ల అసలు సిసలు లొకేషన్లలో ఆ సినిమా తీశారు. హీరో కృష్ణ కూడా ఆ సినిమా శుభం కార్డు పడే సమయంలో ఒక్క క్షణం తెరపై మెరిశారు. కానీ, అవేవీ ఆ సినిమాకు విజయం అందించలేకపోయాయి. ఏమైనా, ఇవాళ్టికీ తెలుగులో కౌబాయ్ హీరో అంటే కృష్ణే! కౌబాయ్ సినిమా అంటే - 'మోసగాళ్ళకు మోసగాడే'!

Tuesday, July 19, 2011

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"



(మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది. దాన్ని పక్కన ఇమేజ్ రూపంలో చూడగలరు. వ్యాసం పూర్తి పాఠం ఈ కింద ఉంది).

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే!

ఆ గది లో ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , 'బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.

ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది.

గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడకు వచ్చేశారు. 'పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట 'రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.

నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--'ఎర్ర జెండాల' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో 'ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న 'జయంతి పబ్లికేషన్స్' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండలు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశంలో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమగా కొనసాగిన కాలంలో ఆయనకు సహచరులు, సహవ్రతులు.

నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గంలో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే 'సినిమా పేజీ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం. ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు.(రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు).

'పంచకళ్యాణి- దొంగలరాణి', 'కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లలాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే -- సాయంత్రం సినిమా సభలో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన 'దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు.

చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్షను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు 'బాలజ్యోతి' మాస పత్రికలో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడిగా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్య రెంటాల సత్యనారాయణనూ, మా అక్కయ్య కల్పనా రెంటాలనూ, నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.

నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ, పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు -- ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, 'రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, 'అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు.

ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గదిలో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజంలోకి తలుపులు తెరిచాయి.

గమ్మత్తేమిటంటే, నరసరావు పేటలో 'నవ్య కళా పరిషత్' వారి 'నయాగరా' (అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన 'కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన 'సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన 'సర్పయాగం' కవితా సంపుటాలు, 'శిక్ష', 'ఇన్స్పెక్టర్ జనరల్', 'అంతా పెద్దలే' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు.

"అమ్మా! ఉమా! రుమా! హీరోషిమా! విలపించకు పలపించకు..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవితను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.

అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి 'అరసం' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, 'నవభారతి' పత్రికకు 'మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వనాథను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు 'ఆంధ్రప్రభ' దినపత్రికలో 'వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు.

ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారంలోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యంలో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకి వెళ్ళిపోయారు.

నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాథమ్ సంపాదకత్వంలో గుంటూరు నుంచి వచ్చిన 'దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య 'నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వంలో 'ఆంధ్రప్రభ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు.

సమాజాన్ని సరైన దోవలో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి -- ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, 'స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా 'ఆంధ్ర ప్రభ', 'స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.

నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం 'శివధనువు' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18న కీర్తి శేషులయ్యారు. ఆ పైన 'శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.

'అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకంలో మేము 'నవగ్రహాలు' అన్న మాట! (చిన్నతనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యంలో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.

నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ -- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ -- ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.

అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్ గానే, 'ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. 'ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పన కవితలో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ

Sunday, May 8, 2011

అభినయానికీ, అందానికీ చిరునామా



అభినయ ప్రదర్శనతో పని లేకుండా అవయవ ప్రదర్శనదే ప్రాధాన్యమైన ప్రస్తుత సినిమా ప్రపంచంలో గుర్తుండే కథానాయికల పేర్లు, ముఖాలు అతి తక్కువ. కానీ, రెండు దశాబ్దాల క్రితం పరిస్థితి అలాంటిది కాదు. పాత్రను బట్టి అభినయానికీ, అందానికీ సమయోచిత ప్రాధాన్యం కల్పించే నాయికలు కనిపించేవారు. ఆ తరం నాయికల్లో సుజాత ఒకరు. ఆమె చూపిన అభినయం ఇవాళ్టికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. అందుకే, ఏప్రిల్‌ 6వ తేదీన చెన్నైలో సుజాత అకాల మరణ వార్త తెలియగానే చాలా మందికి మనసు చివుక్కుమంది. అందచందాల ప్రదర్శనతో కాక అభినయంతోనూ, ఆత్మ విశ్వాసం నిండిన పాత్రలతోనూ అభిమానులను సంపాదించుకున్న ఓ మంచి నటి దూరమైనందుకు తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రియులు బాధపడ్డారు.

చారడేసి కళ్ళు, ముచ్చటైన ముఖం, తీర్చిదిద్దినట్లుండే శరీరం, హుందాతనం నిండిన అలంకరణ, వస్త్రధారణలతో సుజాత ఎవరికి వారికి తమ ఇంట్లో అమ్మాయిలా అనిపించేవారు. నిజానికి, సుజాత మలయాళ అమ్మాయి. వాళ్ళ సొంత ఊరు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మరదు. కానీ, తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో స్థిరపడ్డారు. సుజాత పుట్టింది, పెరిగింది - శ్రీలంకలోని గాలే ప్రాంతంలో. 1952 డిసెంబర్‌ 10న ఆమె జన్మించారు. ఎనిమిదిమంది తోబుట్టువుల్లో సుజాత ఒకరు. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు.

రంగస్థలి నుంచి రంగుల లోకంలోకి...

సుజాత ఇంగ్లీషు బాగా మాట్లాడేవారు. కానీ, అసలు ఆమె పెద్దగా చదువుకోలేదనీ, కనీసం పదో తరగతి దాకా అయినా బడికి పోలేదనీ తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాల్లో ఆమె ప్రవేశం కూడా గమ్మత్తుగా జరిగింది. 1966లో తండ్రి రిటైరయ్యాక, సుజాతకు 13 ఏళ్ళ వయస్సులో వాళ్ళ కుటుంబం మళ్ళీ కేరళకు వచ్చేసింది. అప్పట్లో 'సినిమా మాసియా' అని మలయాళంలో ఓ మాసపత్రిక వచ్చేది. ''మా పక్కింటి అంకుల్‌ వాళ్ళ కుటుంబంతో నేను స్నేహంగా ఉండేదాన్ని. ఆయన నా ఫోటోను ఆ పత్రికకు పంపారు. పత్రికలో నా ఫోటో రావడంతో, తమ నాటకాల్లో నటించాల్సిందిగా చాలా మంది అడిగేవారు. మా అన్నయ్యకు నాటకాలన్నా, సినిమాలన్నా ఇష్టం. అన్నయ్య ప్రోద్బలం వల్ల నటించడం మొదలుపెట్టాను'' అని సుజాత ఒక సందర్భంలో చెప్పారు. అలా ఆమె రంగస్థల కళాకారిణిగా అడుగులు వేశారు. మలయాళ మేకప్‌మన్‌ జోస్‌ ప్రకాశ్‌ సాయంతో 'పోలీస్‌ స్టేషన్‌' అనే మలయాళ నాటకంతో ఆమె రంగస్థలం మీదకు వచ్చారు. అలా నాటకాలు వేస్తుండగానే సినీ నిర్మాతల దృష్టిలో పడ్డారు.

పదిహేనో ఏట 1967లో సుజాత సినీ జీవితం మొదలైంది. మలయాళ చిత్రం 'తబస్విని' ఆమె తొలి చిత్రం. ఆ తరువాత తమిళంలో, ఆ పైన తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ దర్శకత్వంలో 'అవళ్‌ ఒరు తొడర్‌ కదై' చిత్రం ద్వారా 1974లో సుజాత తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు (ఇదే చిత్రం తెలుగులో 1976లో 'అంతులేని కథ'గా జయప్రదతో రీమేకైంది). కుటుంబ బాధ్యతలను మోసే పట్టణప్రాంత ఉద్యోగిని పాత్రను సుజాత పోషించిన తీరు అప్పట్లో ఓ సంచలనమైంది. ఆ చిత్ర ఘనవిజయంతో సుజాతకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. శివాజీ గణేశన్‌, శివకుమార్‌, రజనీకాంత్‌, కమలహాసన్‌, విజయకుమార్‌ తదితర ప్రముఖ తమిళ హీరోల సరసన నాయిక పాత్రలను ఆమె ధరించారు. 'అవళ్‌ ఒరు తొడర్‌ కదై', 'విధి' లాంటి తమిళ చిత్రాల్లో విప్లవాత్మక ధోరణిలోని పాత్రలు పోషించిన ఈ అభినేత్రి కుటుంబ కథా చిత్రాల్లోని బరువైన పాత్రలను పోషించడంలోనూ అంతకు మించి పేరు సంపాదించారు. తమిళంలో ఆమె నటించిన 'సెందమిళ్‌ పాట్టు', 'అవళ్‌ ఒరువాళా' తదితర చిత్రాలు అందుకు నిదర్శనం.

సుజాతది ప్రేమ వివాహం. 1977 ప్రాంతంలో తమిళ చిత్రాల్లో తీరిక లేకుండా నటిస్తున్న సుజాత చెన్నైలో తాము అద్దెకున్న ఇంటివాళ్ళ అబ్బాయి జయకర్‌ హెన్రీని ప్రేమించారు. ఆ ప్రేమే, పెద్దల అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా పెళ్ళికి దారి తీసింది. తరువాత అమెరికా వెళ్ళినా, అక్కడి అలవాట్లు, సంప్రదాయాలు నచ్చని సుజాత కాన్పు కోసం భారతదేశానికి వచ్చి, భర్తతో కలసి ఇక్కడే ఉండిపోయారు.

తెలుగులో పండిన 'గోరింటాకు'

తెలుగులో తొలి చిత్రం 'గోరింటాకు' (1979)తోనే ఆమె తెలుగు చిత్రసీమలో బలమైన ముద్ర వేశారు. 'యువచిత్ర' పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాత కె. మురారి నిర్మించిన ఆ చిత్రంలో హీరో శోభన్‌బాబు సరసన ఆమె పోషించిన పాత్ర ఇవాళ్టికీ సినీ ప్రియులకు మరపురానిదే. ''అప్పట్లో 'గోరింటాకు' చిత్రంలో కొత్త కథానాయిక కోసం వెతుకుతున్నాం. అప్పుడు బాలచందర్‌ గారి సాయంతో సుజాతను హీరోయిన్‌గా ఎంపిక చేశా. షూటింగ్‌ సమయంలో ఆమె నటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ చిత్రంలో 'కొమ్మ కొమ్మకో సన్నాయి...', 'ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...' లాంటి పాటల్లో ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది'' అని అప్పటి సంగతులను మురారి గుర్తు చేసుకున్నారు. అలాగే, 'సంధ్య' (1980) లాంటి తెలుగు చిత్రాల్లో సుజాత పోషించిన త్యాగమయమైన పాత్రలు అప్పటికీ, ఇప్పటికీ మనస్సును చెమరింపజేస్తాయి.

గమ్మత్తేమిటంటే - 'గోరింటాకు' అవకాశం వచ్చినప్పుడు సుజాత ముందు ఒప్పుకోలేదట! తెలుగు తెలియదు కాబట్టి, తెలియని భాషలో డైలాగులు చెప్పేటప్పుడు అందరూ నవ్వితే అవమానకరం కాబట్టి, నటించనని ఆమె చెప్పారు. కానీ, 'గోరింటాకు' చిత్ర రచయిత్రి కె. రామలక్ష్మీ ఆరుద్ర వదలకుండా, తాను దగ్గరుండి ప్రతిదీ నేర్పుతాననే సరికి, బలవంతం మీద సుజాత ఒప్పుకున్నారు. 'గోరింటాకు' చిత్రంలో ఏడుస్తూ ఓ పెద్ద డైలాగు చెప్పడానికి 16 టేకులు తిన్న సుజాత ఆ తరువాత పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నారు. మొదట్లో సరిత, ఆ తరువాత ఇతరులు డబ్బింగ్‌ చెప్పినా, అటు పైన తెలుగు మీద పట్టు సంపాదించి, సొంతంగా సంభాషణలు చెప్పుకున్నారు. వృత్తి పట్ల అంకితభావం ఉన్న సుజాత తొలి రోజుల్లో సైతం ''పెద్ద స్టార్‌ హీరోయిన్‌ని అనే గర్వం కానీ, ఆడంబరం కానీ మచ్చుకైనా చూపించేవారు కాదు. అలాంటి మంచి మనిషి, గొప్ప నటి'' అని హీరో కమలహాసన్‌ సైతం ఇటీవల అన్నారు.

పెద్ద వయసు పాత్రల్లోనూ ప్రతిభావిష్కరణ

విచిత్రంగా - కథానాయిక పాత్రలు వేసిన రోజుల నుంచి కూడా సుజాత గ్లామర్‌ పాత్రలు ధరించింది చాలా తక్కువ. తెలుగులో ఎన్టీఆర్‌ ('సర్కస్‌ రాముడు' - 1980), ఏయన్నార్‌ ('గురుశిష్యులు' - 1981), శోభన్‌బాబు ('గోరింటాకు' - 1979), కృష్ణంరాజు ('బెబ్బులి' -1980) లాంటి అప్పటి అగ్ర హీరోల సరసన నటించినప్పుడు కూడా ఆమె పాత్రల్లో హుందాతనమే ఎక్కువ. చిరంజీవితో 'ప్రేమతరంగాలు' (1980)లో నటించిన సుజాత 1980ల చివరినాటి కల్లా ఆమె పెద్ద వయసు పాత్రలు పోషించడం మొదలుపెట్టేశారు. అక్కినేనితో 'బహుదూరపు బాటసారి' (1983), 'జస్టిస్‌ చక్రవర్తి' లాంటి చిత్రాల్లో ఆమె పోషించిన పెద్ద తరహా పాత్రలు సైతం ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్‌ను నిలిపాయి. అలాగే, గతంలో తాను హీరోయిన్‌గా నటించిన రజనీకాంత్‌, కమలసహాసన్‌లకు తల్లిగానూ సుజాత నటించారు. అందుకు రజనీకాంత్‌ 'బాషా' చిత్రమే ఈ మధ్య కాలపు ఉదాహరణ. 'ఏడంతస్తుల మేడ' (1980) తన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన తెలుగు సినిమా అని చెప్పిన సుజాతకు 'పసుపు - పారాణి' (1980), 'సుజాత' (1980), 'సంధ్య' (1980), 'గుప్పెడు మనసు' (1979), 'వంశ గౌరవం' లాంటి చిత్రాలు ఆమెతో పాటు జనానికీ నచ్చాయి.

మధ్యతరగతి ఇల్లాలిగా, కుటుంబం బరువంతా మోసే వనితగా మంచితనం, త్యాగం నిండిన పాత్రలకు ఆమె ప్రతీకగా నిలిచారు. 'సీతాదేవి' చిత్రంలో వికలాంగురాలిగా ఆమె చక్కటి నటన ప్రదర్శించారు. ''భావోద్వేగ నటనకు సుజాత పెట్టింది పేరు. కెమేరా ముందు మాత్రమే అభినయించడం గొప్ప కాదు. డబ్బింగ్‌ సమయంలోనూ వాచికంలో ఆమె అంతే భావోద్వేగాలను పలికిస్తారు. అప్పట్లో తమిళనాట ఇళయరాజా సంగీతం ఉంటే సినిమాలు హిట్టయ్యేవి. అలాగే, సుజాత నటించినా చాలు, ఆ చిత్రాలు బ్లాక్‌బస్టర్లే!'' అని సుజాతతో 12 చిత్రాల్లో కలసి నటించిన తమిళనాట ప్రముఖ సీనియర్‌ నటుడు శివకుమార్‌ చెప్పారు.

పెద్ద వయస్సు పాత్రలకు మళ్ళాక, 1990లలో ఆమె 'సూత్రధారులు', 'చంటి', 'సూరిగాడు' లాంటి పలు చిత్రాల్లో నటించారు. 'చంటి' చిత్రంలో హీరో వెంకటేశ్‌ తల్లిగా ఆమె పాత్ర ఒక కోణంలో సాగితే, 'పెళ్ళి' చిత్రంలో కోడలి బాగు కోసం కొడుకుకు విషమిచ్చే తల్లి పాత్ర మరో కోణంలో నడుస్తుంది. రెంటినీ ఆమె సమర్థంగా పోషించారు. 'పెళ్ళి' చిత్రంలోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల 'శ్రీరామదాసు'లో భద్రాచల సీతారామ విగ్రహాలను సంరక్షించే భక్తురాలు దమ్మక్క పాత్రలో జీవించారు. తమిళంలో 'వరలారు', తెలుగులో 'వెంగమాంబ' ఆమె చివరి చిత్రాలు.

పుట్టుక రీత్యా మలయాళీ అయినా, సుజాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 300 దాకా చిత్రాల్లో నటించారు. సెట్స్‌లో ఎవరితోనూ మాట్లాడకుండా, ముభావంగా ఉండడం మొదటి నుంచీ సుజాతకు అలవాటు. దాంతో, సుజాతకు పొగరెక్కువ అని ప్రచారం చేసినవాళ్ళూ ఉన్నారు. ''హంగామా లేకుండా అభినయం ద్వారా ఆకట్టుకొనే నటి సుజాత. పెళ్ళయిన తరువాత ఆమె ఎక్కువగా కుటుంబం మీద శ్రద్ధ చూపెడుతూ వచ్చారు. సెట్స్‌లో కూడా తన పనిలో తాను మునిగిపోయేవారు. గడచిన కొన్నేళ్ళుగా ఆమె సినీ పరిశ్రమకూ, బహిరంగ కార్యక్రమాలకూ దూరంగా కాలం గడుపుతూ వచ్చారు'' అని వెండితెరపై సుజాత తొలి చిత్రంలో ఆమెతో కలసి నటించిన తమిళ - తెలుగు సినీ నటుడు విజయకుమార్‌ చెప్పారు.

ఆఖరి రోజుల్లో బాధించిన అనారోగ్యం

గడచిన కొన్నేళ్ళుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినడంతో ఆమె క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అది అలా ఉండగా, హృద్రోగం కూడా తలెత్తడంతో, మార్చి నెలలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు పేస్‌మేకర్‌ను ఏర్పాటుచేస్తూ, శస్త్రచికిత్స చేసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఆ శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోక ముందే గుండెపోటుతో సుజాత హఠాన్మరణం పాలయ్యారు. సుజాత, వ్యాపారవేత్త జయకర్‌ హెన్రీ దంపతులకు ఓ అబ్బాయి (సజీత్‌), ఓ అమ్మాయి (దివ్య).

ఇన్నేళ్ళుగా సినిమా రంగంలో ఉన్నా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా, తన కన్నా తాను పోషించిన పాత్రలతోనే జనానికి సన్నిహితంగా మెలగడం సుజాతలోని విశిష్ట లక్షణం. 1970లు, '80లలో అభినయ ప్రధానమైన నాయిక పాత్రలు పోషించాలంటే, దర్శక, నిర్మాతలు అనివార్యంగా ఆమెనే ఎంచుకొనేవారు. నిజానికి, దర్శకుడు బాలచందర్‌ తీసుకువచ్చిన ఈ వజ్రం తమిళ, తెలుగు సినిమాల్లోకి వచ్చేనాటికి సినిమా హీరోయిన్లంటే టీనేజ్‌ అమ్మాయిలనే భావమే ఎక్కువ. అయిదు పదులు మీద పడిన అగ్ర హీరోలకు సైతం కుర్ర హీరోయిన్లే కథానాయికలు. వాళ్ళతో పోలిస్తే, వయస్సులోనూ, పరిణతిలోనూ పెద్దదైన సుజాత నాయికగా నిలదొక్కుకోవడం ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యకరమే.

అందంలో, అభినయంలో హుందాతనం

'గోరింటాకు' చిత్రం షూటింగ్‌ సమయానికే బిడ్డ తల్లి అయిన ఆమె, పసివాణ్ణి వెంట వేసుకొని షూటింగ్‌కు వచ్చేవారు. నాయిక పాత్రల నుంచి తల్లి పాత్రలకు మారినా, ఎబ్బెట్టుగా తోచకుండా, అభినయంతో పాత్రకు నిండుదనం చేకూర్చడం సుజాతలోని ప్రత్యేకత. అందమైన ముఖం, ఎడమ వైపు బుగ్గ మీద అందమైన చిన్న పుట్టుమచ్చ, ఒంటికి సరిగ్గా అతికినట్లు కుట్టించుకున్న జాకెట్ల, సాదాగా ఉన్నా చక్కటి కేశాలంకరణ, గంజి పెట్టినట్లు బిగుతుగా ఉండే కాటన్‌ చీర, అందుకు తగ్గ అలంకరణతో సుజాత ఎప్పుడూ హుందాగా కనిపించేవారు. ''ఎప్పుడూ ఆమె ముఖంలో చిరునవ్వే కనిపించేది. అలసట కనపడేది కాదు. ఆమె పరాయి భాషకు చెందిన అమ్మాయి అయినా, తెలుగు చిత్రాలతో తెలుగు ఆడపడుచుగానే గుర్తింపు పొందారు'' అని బాలచందర్‌ 'గుప్పెడు మనసు'తో సహా పలు చిత్రాల్లో సుజాతతో కలసి నటించిన శరత్‌బాబు పేర్కొన్నారు.

దక్షిణాది భాషా చిత్రాల్లో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న సుజాత ఎంత పెద్ద హీరోతో నటించినా, వాళ్ళకు దీటుగా అభినయిస్తూ, కొన్నిసార్లు వాళ్ళ కన్నా ఎక్కువ మార్కులు తానే సంపాదించేవారు. హీరోలదే రాజ్యమైన చిత్ర పరిశ్రమలో వివిధ భాషల్లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకూ, వాటి బాక్సాఫీస్‌ విజయానికీ ఈ అభినేత్రి చాలా కాలం మూలస్తంభంగా నిలిచారు. అప్పట్లో నటించిన చిత్రాల్లో అధిక భాగం బలమైన ఇతివృత్తం, బిగువైన కథనాలతో కూడుకున్నవి కావడం కూడా ఆమెకు సానుకూల అంశమైంది. అలాగే, అతిగా భావావేశాల ప్రదర్శనే వెండితెరపై రాజ్యమేలుతున్న రోజుల్లో ఆమె సున్నితమైన హావభావాలతో, అండర్‌ ప్లే ద్వారా పాత్రను ప్రేక్షకుల మనస్సుల్లోకి జొప్పించేవారు. నాట్యం నేర్చుకోకపోయినా, ఆమె తన వెడల్పాటి కళ్ళతో సులభంగా నవరసాలూ పండించేవారు. అందుకే, ''నా చిత్రాల్లో నటించిన హీరోయిన్లందరిలోకీ చాలా చక్కటి నటి - సుజాత'' అని చెప్పే నిర్మాత మురారి అన్నట్లు, ''సావిత్రి లాంటి నటనా చాతుర్యం ఉన్న మనిషి సుజాత. అభినయ ప్రధానమైన పాత్రలకు చిరునామా అయిన ఆమె మరణం నిజంగా విషాదం.''

Wednesday, April 13, 2011

విశిష్ట వాచికమే వశీకరణ మంత్రం



నటులు చాలా మంది ఉంటారు. కానీ, ఆంగికం, వాచికం, ఆహార్యం - మూడింటితో మెప్పించే అభినయవిదులు మాత్రం కొందరే ఉంటారు. 1970లలో తెలుగు చిత్రసీమలో ప్రవేశించిన నటులలో ఈ మూడింటిలోనూ దిట్టగా కనిపించిన కొద్దిమందిలో ఒకరిగా నూతన్‌ ప్రసాద్‌ ఓ చిరకాల జ్ఞాపకం. కథానాయక పాత్రల దగ్గర నుంచి కామెడీ పాత్రలు, క్యారెక్టర్‌ పాత్రల వరకు ఏ వేషం కట్టినా, దాన్ని తనదిగా చేసుకొని సొంత ముద్ర వేయడం, మనిషి చూపులో, మాట విరుపులో విలక్షణత చూపడం 'నూతన్‌ ప్రసాద్‌'గా స్థిరపడ్డ తాడినాడ వరప్రసాద్‌లోని విశిష్టత. అనారోగ్యంతో గతనెల 30 వ తేదీన నూతన్‌ ప్రసాద్‌ కన్నుమూయడంతో తెలుగు సినీ రంగంలోని గుణచిత్ర నటుల చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది.

నిజానికి, నూతన్‌ ప్రసాద్‌ పెద్ద ఇంట్లో పుట్టి, వెనుక ఉన్న అండదండలతో సినీ రంగంలోకి నడిచొచ్చిన వాడు కాదు. ఆ మాటకొస్తే నటన కూడా ఆయనకు యాదృచ్ఛికంగా ఒంటబట్టినదే! చిన్నతనంలో బడికి వెళుతున్నప్పుడు ఊళ్ళో ఓ పౌరాణిక నాటక సమాజం వారి రిహార్సల్సు చూసీ చూసీ, పద్యాలు వినీ వినీ అనుకోకుండా అర్జునుడి పాత్ర పోషించడంతో ఆయన రంగస్థల జీవితం ఆరంభమైంది.

నూతన్‌ ప్రసాద్‌ అసలు పేరు - దుర్గా సత్యవరప్రసాద్‌. స్వస్థలం - కృష్ణాజిల్లా కైకలూరు. తాడినాడ సుబ్బారావు, శ్యామలాంబ దంపతులకు 1945 డిసెంబర్‌ 12న జన్మించిన వరప్రసాద్‌ చదువుకున్నది కూడా అంతంత మాత్రమే. ఐ.టి.ఐ. పూర్తి చేసినా, నాటకాల మీద ఆసక్తితో అటువైపు నడిచారాయన. ఆయన తండ్రి కైకలూరులోని సమితి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేవారట! ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో తల్లి నిత్యం కుట్టుమిషన్‌ మీద పనిచేస్తూ, దుస్తులు కుడుతూ కుటుంబ భారాన్ని మోసేవారు. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. వరకు కైకలూరులో చదివి, 1965లో మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో ఐ.టి.ఐ. పూర్తి చేశారు.

నాటకాల నుంచి సినిమాల్లోకి...

1966లో పి.డబ్ల్యు.డి.లో చిరుద్యోగిగా మొదలైన వరప్రసాద్‌ ఆ తరువాత హైదరాబాద్‌లోని 'హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌' (హెచ్‌.ఏ.ఎల్‌)లో చేరారు. అక్కడ సహోద్యోగి, ప్రముఖ రంగస్థల నటుడు భానుప్రకాశ్‌ నిర్వహిస్తున్న 'కళారాధన' నాటక సంస్థలో చేరి, ఎన్నో నాటకాలు వేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలిచ్చి, ఉత్తమ నటుడిగా బహుమతులు గెల్చుకున్నారు. 'రాగరాగిణి', 'గాలివాన', ఏ.ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి 'మాలపల్లి' నవల నాటకరూపం - ఇలా ఎన్నో నాటకాల్లో ఆయన పాత్రపోషణ అందరినీ ఆకట్టుకుంది. ''పాతికేళ్ళ వయస్సులో 'గాలివాన' నాటకంలో 65 ఏళ్ళ వృద్ధుడి పాత్ర పోషించి ఉత్తమ నటుడి అవార్డు పొందిన ప్రతిభ ఆయన సొంతం'' అని రంగస్థల ప్రదర్శనలతోనే సినీ నటుడిగా ఎదిగిన ప్రముఖ నట - నిర్మాత మురళీమోహన్‌ గుర్తు చేసుకున్నారు.

రాళ్ళపల్లి, పరుచూరి బ్రదర్స్‌, కోట శ్రీనివాసరావు లాంటి నాటి రంగస్థల, నేటి సినీ రంగ ప్రముఖులకు ఆ నాటకాల రోజుల నుంచే వరప్రసాద్‌ సుపరిచితుడు. 1971 ప్రాంతంలో విజయవాడలోని నాటకపోటీల్లో ఏకకాలంలో అటు గంభీరమైన 'గాలివాన' నాటకంలోనూ, ఇటు 'పైడిరాజు' అనే హాస్య నాటికలోనూ పరస్పర విభిన్నమైన పాత్రల్లో వరప్రసాద్‌ చూపిన ఉత్తమ నటనకు ఆకర్షితులైన రచయిత పినిసెట్టి శ్రీరామమూర్తి ఆయనను తెలుగు సినీ రంగంలోని తెలిసినవారికి పరిచయం చేశారు.

కొత్తవాళ్ళతో నిర్మిస్తున్న 'నీడలేని ఆడది' (1974)తో ఆయన కెమేరా ముందుకు వచ్చారు. అయితే, దాని కన్నా ముందే బాపు - రమణల 'అందాల రాముడు' (1973) ఆయనను సినీ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. వెండితెరపై వరప్రసాద్‌ ఆవిర్భావం జరిగింది. ఆ తరువాత 'ముత్యాల ముగ్గు' (1975)లో నిత్య పెళ్ళికొడుకు పాత్రతో మెప్పించారు. 'కల్పన', 'ఊరుమ్మడి బ్రతుకులు' చిత్రాల్లో నటించారు. అయితే, ప్రతిభకు తగ్గట్లుగా ఆశించినన్ని సినిమా అవకాశాలు రాని పరిస్థితుల్లో కొన్ని నెలల పాటు ఆయన మద్యానికి బానిసగా మిగిలిపోయారు. ఆనక, తల్లి, భార్య తదితరుల అనునయంతో, ఆ అలవాటు నుంచి బయటపడ్డారు. ఆ వెంటనే కొద్ది రోజులకే వచ్చిన 'చలిచీమలు' (1978) అవకాశంతో సరికొత్త నటుడిగా, 'నూతన్‌ ప్రసాద్‌' అనే కొత్త పేరుతో తిరిగి విజృంభించారు.

నిత్య నూతన వాచికాభినయ వరప్రసాద్‌

'ప్రెసిడెంట్‌ పేరమ్మ' (1979), 'తాతయ్య ప్రేమలీలలు' (1980), 'అమ్మ మనసు' లాంటి చిత్రాల్లో నాయక పాత్రధారిగా అలరించిన నూతన్‌ ప్రసాద్‌ది విశిష్టమైన వాచికం. మాటలోని స్పష్టత, స్వచ్ఛత, డైలాగును చెబుతున్నట్లుగా కాకుండా ఆ పాత్రే ప్రవర్తిస్తున్నట్లుగా విరుపులతో కొత్త అందం తీసుకురావడం, వ్యంగ్యం మిళాయించిన విలనీ ఆయనను విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. 'చలిచీమలు' చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ రాసిన ''నూటొక్క జిల్లాలకు అందగాణ్ణి'' అనే డైలాగు నూతన్‌ నోట తెలుగు నాట చిరంజీవిగా మారిపోయింది. ఆ చిత్రంతో వచ్చిన గుర్తింపు ఆయనను వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం లేకుండా చేసింది. ప్రాథమికంగా రంగస్థలం మీద నుంచి కెమేరా ముందుకు రావడం వల్ల నూతన్‌ ప్రసాద్‌ ఎంత నిడివి గల సంభాషణలనైనా, అలవోకగా గుర్తుంచుకొని, సింగిల్‌ టేక్‌లో షాట్‌ ఓ.కె. చేసేవారు.

మహాభారత పౌరాణిక గాథను నేటి ఎన్నికల భారతావనికి వర్తింపజేస్తూ రూపొందిన 'కలియుగ మహాభారతం' (1979) చిత్రంలో రారాజు పాత్రలో నూతన్‌ ప్రసాద్‌ మెప్పించారు. ఆ పాత్రకు ఆయన చెప్పిన డైలాగుల గురించి జనం అప్పట్లో చెప్పుకున్నారు. చిత్రం నిడివిని పెంచడం కోసం ఆ పాత్రకు ఆఖరి నిమిషంలో రాసిన సుదీర్ఘమైన సంభాషణల్ని ఆయన అద్భుతంగా పండించారు. 'కుడి ఎడమైతే?' (1979) చిత్రంలో 450 అడుగుల షాట్‌ను ఆయన సింగిల్‌ టేక్‌లో చేసేశారనీ, అలాగే 'షోకిల్లా రాయుడు' సినిమాలో 786 అడుగుల షాట్‌ కూడా ఆయన అలా సింగిల్‌ టేక్‌లో చేసినదేననీ ఆ నాటి సినిమా సంగతులు తెలిసినవారు చెప్పేమాట.

'రాజాధిరాజు' (1980) చిత్రంలో సైతాను వేషంలో ఆయన ఆహార్యం, ఆంగికం, ''శిశువా!'' అంటూ ప్రత్యేక తరహా వాచికం ఆ పాత్రను చిరస్మరణీయంగా మార్చాయి. ఆ సినిమాలో ''కొత్తా దేవుడండీ! కొంగొత్తా దేవుడండీ! ఇతడే దిక్కని మొక్కనివారికి దిక్కూ మొక్కూ లేదండండీ! రాండి! రాండి! శిశువా!...'' అంటూ నూతన్‌ ప్రసాద్‌ ధరించిన సైతాను పాత్రపై వచ్చే పాట అప్పట్లో సామాన్య జనంలో కూడా ప్రాచుర్యం పొందింది. ఇక, 'పట్నం వచ్చిన పతివ్రతలు' (1982) చిత్రంలో నూతన్‌ పలికిన ''దేశం చాలా క్లి...ష్ట పరిస్థితుల్లో ఉంది'' డైలాగు ఆ నాటి నుంచి ఈనాటి వరకూ నిత్యనూతనమే.

తెలిసిన మనిషిలో తెలియని సంగతులు

చాలామందికి తెలియనిదేమిటంటే - 'ఈలపాట'లో వరప్రసాద్‌ సిద్ధహస్తుడు. హైదరాబాద్‌, తదితర ప్రాంతాల్లో ఆయన దాదాపు 50 పై చిలుకు సార్లు 'ఈలపాట' ప్రదర్శనలిచ్చారు. అలాగే, సినిమాల్లోకి వచ్చాక నూతన్‌ ప్రసాద్‌ ప్రభ వెలిగిపోతున్న సందర్భాన్నే సర్వసాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, కెమేరా ముందు ఆ స్థాయి నటన చూపడానికి మునుపే, రంగస్థలంపై ఆయన ఎంతటి విశ్వరూపం దాల్చేవారో, ఎన్ని వందల ప్రదర్శనల్లో నటుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారో ఈ తరంలో కొద్దిమందికే తెలుసు. మంచి సినిమాల పట్ల అభిరుచి ఉన్న నూతన్‌ ప్రసాద్‌ చిత్ర నిర్మాణంలోనూ దాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నించారు. 'పవన్‌ ఇంటర్నేషనల్‌' పతాకంపై ఆయన సమర్పకుడిగా వచ్చిన 'ఓ అమ్మ కథ' (1981) వాణిజ్య విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలను అందుకొంది. 'మృణాల్‌సేన్‌' తదితర ప్రసిద్ధ వాస్తవిక చిత్ర దర్శకుల ఫక్కీలో ఆ సినిమాకు దర్శకుడు పేరాల సుబ్రహ్మణ్యం పేరును 'వసంత్‌ సేన్‌'గా మార్చడం ఓ గమ్మత్తు!

ఏ వేషం కట్టినా, దాన్ని తెర మీది కథలోని పాత్రగా కాక, వాస్తవ జీవితంలో నుంచి నడిచొచ్చిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నూతన్‌ ప్రసాద్‌ తపించేవారు. అందుకే, ఆయన ఏ పాత్ర వేసినా దానిలో సమాజంలోని ఆ యా వర్గాల వ్యక్తుల ప్రవర్తన, చిత్రమైన మ్యానరిజమ్‌లను కలగలిపేవారు. ఆ మేరకు సాధ్యమైనంత వరకు ఆ పాత్రలో వాస్తవికతను రంగరించేవారు. ''పదిమందిని ఏడిపించడం కన్నా, పదిమందినీ నవ్వించడం మంచిది కదా!'' అని చెబుతూ వచ్చిన నూతన్‌ ప్రసాద్‌ విలనీలో కూడా తనదైన శైలిలో వ్యంగ్యాన్ని దట్టించేవారు. సంభాషణల ఉచ్ఛారణలో తనకున్న అపారమైన బలంతో ఏ పాత్రకైనా కొత్త రంగు, రుచి, వాసన అద్దేవారు. తల్లి ఎంతో కష్టపడి తమను పోషించిన తీరు ఆయనకు ఎప్పటికీ గుర్తే. ''ఆ కుట్టు మిషన్‌ శబ్దాలు నేనెప్పటికీ మర్చిపోలేను'' అనేవారాయన. నటుడిగా స్థిరపడ్డాక తల్లిని మరింత సుఖంగా, ప్రాణప్రదంగా చూసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆయన మనస్సులోని సెంటిమెంట్‌కు నిదర్శనం.

ఒకసారి మనస్సుకు దగ్గరై, తనకు ప్రేమ పాత్రుడైన వ్యక్తిని చిరకాలం ప్రేమించడం కూడా నూతన్‌ ప్రసాద్‌ లక్షణం. 'చలిచీమలు' తరువాత వేషాల కోసం మద్రాసులో తిరుగుతూ, లాడ్జీలో అవస్థలు పడుతున్నప్పుడు బాపు - రమణలు ఏడాది పాటు తమ ఆఫీసులో ఆశ్రయం ఇచ్చిన సంగతిని ఆయన ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా చెబుతుండేవారు. అలాగే, నటుడిగా సక్సెసయ్యాక తాను కూడా రచయితలు పరుచూరి బ్రదర్స్‌కు అలాంటి అండదండలే ఇచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ళు తమ ఇంటి మేడ మీద స్థానం కల్పించారు.

ఆత్మవిశ్వాసానికి అసలైన ప్రతీక

బామ్మ మాట - బంగారు బాట' (1989) చిత్రం షూటింగ్‌లో ప్రమాదానికి గురై, నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైనా, ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పరుచూరి బ్రదర్స్‌ లాంటి రచయితలు తన కోసం ప్రత్యేకంగా రాసిన న్యాయమూర్తి, దెబ్బతిన్న సైనికాధికారి లాంటి పాత్రలను కేవలం వాచికంతో, ముఖకవళికలతో మెప్పించారు. వాచికంలోని తన విశిష్టతను టీవీ కార్యక్రమాల వ్యాఖ్యానానికి వినియోగించారు. ఉపగ్రహ తెలుగు టి.వి. చానల్‌ 'ఈ' టి.వి.తో మొదటి నుంచి అనుబంధం ఉన్న నూతన్‌ ప్రసాద్‌ మహామహుల నటనా వైదుష్యాన్ని విశ్లేషించే 'హ్యాట్సాఫ్‌' కార్యక్రమంతో సహా కొన్ని టీవీ షోలకు యాంకర్‌గానూ వ్యవహరించారు. 'నేరాలు - ఘోరాలు' లాంటి కార్యక్రమాలకు ఆయన మాట ఊపిరి అయింది.

నిజానికి, సినిమాల్లోకి రాకముందే ఆయన టీవీలో నటించారు. అప్పట్లో దూరదర్శన్‌లో ప్రసారమైన 'పండగొచ్చింది' నాటికలో ఇంటల్లుడి పాత్ర పోషించారని కొద్దిమందికే తెలుసు. హీరో కృష్ణ రూపొందించిన 'సింహాసనం' (1986) చిత్రం తెలుగు రూపంలో హిందీ నటుడు అమ్జాద్‌ ఖాన్‌కు గళదానం చేసిన నూతన్‌ ప్రసాద్‌, 'ఆయనకు ఇద్దరు' చిత్రంలో గుమ్మడికీ డబ్బింగ్‌ చెప్పారు. దాదాపు 475 చిత్రాల్లో నటించిన నూతన్‌ ప్రసాద్‌ అనేక అవార్డులు అందుకున్నారు. 'సుందరి - సుబ్బారావు' (1984)లో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు పొందారు. 'ప్రజాస్వామ్యం' (1987), 'నవభారతం' (1988), 'వసుంధర' చిత్రాల్లోని నటన కూడా ఆయన ఇంటికి 'నందు'లను నడిపించుకొచ్చింది. అలాగే, 'గాజుపూలు' టీవీ సీరియల్‌కు సైతం ఆయన 'నంది' అవార్డు అందుకున్నారు. 2000లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

ఆఖరి వరకు అలుపెరుగని కళాసేవ

చివరి రోజుల వరకు తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికే నూతన్‌ ప్రసాద్‌ ప్రయత్నించారు. ''మేము నాటకం వేస్తున్నామని తెలిస్తే చాలు, ఇవాళ్టికీ చక్రాల కుర్చీలో సభకు వచ్చి, ప్రదర్శన చూసి, అభినందించే అరుదైన నాటక ప్రియుడు ఆయన'' అని రంగస్థల ప్రదర్శనలతోనే సినీ రంగానికి ఎదిగిన మరో సీనియర్‌ నటుడు రాళ్ళపల్లి గద్గదస్వరంతో నూతన్‌ ప్రసాద్‌ను గుర్తు చేసుకున్నారు. 'తెలుగుదేశం పార్టీ'కి సన్నిహితంగా మెలిగిన నూతన్‌ప్రసాద్‌ శారీరక వైకల్యం వచ్చి పడ్డ తరువాతి కాలంలోనే హైదరాబాద్‌లోని రంగస్థల వేదిక 'రవీంద్రభారతి'కి కార్యదర్శిగా ప్రభుత్వ పక్షాన నియమితులయ్యారు. ఆ హోదాలోనూ తనదైన కళాసేవను కొనసాగించారు.

ప్రముఖ చిత్రకారుడు - దర్శకుడు బాపు చేత శృంగార, హాస్య, కరుణాది నవరసాలకూ వర్ణచిత్రాలు వేయించి, ఆ నవరసాల చిత్ర మాలికను రవీంద్రభారతిలో పెట్టించారు. ఇవాళ ఆ నవరసాల చిత్రమాలిక రాష్ట్రంలోని అనేక ప్రాంగణాల్లో వెలసి, కళాప్రియులను అలరిస్తోందంటే దానికి నూతన్‌ ప్రసాద్‌ ప్రయత్నమే కారణమని చెప్పక తప్పదు. అలాగే, భారతీయ శాస్త్రీయ నృత్య రీతులను పరిచయం చేసే వర్ణచిత్రాలను గీయించి, 1973 జూన్‌ 10న ప్రమీలతో వివాహమైన నూతన్‌ ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వాళ్ళబ్బాయి నూతన్‌ కుమార్‌ అనే పేరుతో వెండితెరకు పరిచయమై, 'సాంబ', 'సోగ్గాడు' లాంటి చిత్రాల్లో నటించారు. అబ్బాయిని మంచి నటుడిగా చూడాలని నూతన్‌ ప్రసాద్‌ కలలు కన్నారు. ఆ కలలు పూర్తిగా ఫలించకుండానే కన్నుమూశారు.

చాలాకాలంగా, పూర్తిస్థాయి పాత్రల్లో కనిపించకపోయినా, ఇవాళ్టికీ ప్రేక్షకులకు నూతన్‌ ప్రసాద్‌ గుర్తుండిపోవడం ఆయన మునుపు పోషించిన పాత్రల చిరస్మరణీయతకు చిహ్నం. సినిమా నటుడిగా ఆయన ప్రభ వెలిగింది గట్టిగా ఓ దశాబ్దమే అయినా, ఆయన గురించి జనం చెప్పుకోవడానికి ఆ పాత్రలే కారణం. అందుకే, 1960ల చివర నుంచీ నూతన్‌ ప్రసాద్‌తో స్నేహం ఉన్న మరో నటుడు కోట శ్రీనివాసరావు చెప్పినట్లు, 'తనకంటూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకొని, తనదైన ఓ దశాబ్దాన్ని లిఖించుకున్న నటుడు - నూతన్‌ ప్రసాద్‌'. 1970ల ద్వితీయార్ధం నుంచి 1980ల చివరి వరకు తెలుగు సినిమా చరిత్ర రాస్తే - ఆ కాలంలో ఓ వెలుగు వెలిగిన విశిష్ట నటుడిగా నూతన్‌ ప్రసాద్‌ది నిత్య నూతన చరిత్ర. నటన పట్ల అంకితభావం, నిజాయతీ ఉన్న ఆయనకు కళాంజలి!