జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, November 4, 2012

ఉత్తమ సినీ విమర్శకుడిగా రెంటాల జయదేవ - ‘వార్త’లో వార్త





పత్రికా రచనా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న డాక్టర్ రెంటాల జయదేవను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుకు ఎంపిక చేసింది. 2011వ సంవత్సరానికి గాను ఉత్తమ సినీ విమర్శుడిగా నంది పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. ఇప్పటికి ఇరవయ్యేళ్ళుగా రెంటాల జయదేవ సినీ పత్రికా రచనలో ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఆయన సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు పాఠకులతో పాటు సినీ పరిశ్రమవారినీ ఆకట్టుకుంటున్నాయి.

తొలి పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద సరైన విడుదల తేదీని జయదేవ ఇటీవలే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా జన్మదినోత్సవం విషయంలో కొన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న తప్పును ఆయన సాక్ష్యాధారాలు చూపి, సరిదిద్దారు. ఈనాడు పత్రిక సంపాదక మండలిలో గురుతర బాధ్యతలు నిర్వహించిన జయదేవ ప్రస్తుతం ఇండియా టుడే తెలుగు వారపత్రిక సంపాదక వర్గంలో పనిచేస్తున్నారు. ప్రముఖ కవి,శతాధిక గ్రంథకర్త, సీనియర్ పాత్రికేయులు, సినీ రచయిత కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ ఆఖరి కుమారుడైన జయదేవ తండ్రిగారి నుంచి ఇటు పుస్తక రచననూ, అటు పత్రికా రచననూ వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు.

‘‘ఇప్పటికి ఇరవై ఏళ్ళకు పైగా పత్రికా రచనలో, ముఖ్యంగా సినీ పరిశ్రమపై చేస్తున్న కృషికి ఇది ఓ గుర్తింపుగా భావిస్తున్నా. గత ఏడాది నేను రాసిన వ్యాసాలను పరిశీలించి, ప్రతిభా వ్యుత్పత్తులను గమనించి, ఉత్తమ తెలుగు సినీ విమర్శకుడిగా నన్ను ఎంపిక చేసిన అవార్డుల సెలక్షన్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని అవార్డుకు ఎంపికైన జయదేవ అన్నారు.

( 2012 అక్టోబర్ 17వ తేదీ బుధవారం నాటి వార్త దినపత్రిక సినిమా పేజీ తెరలో ప్రచురితం)

Wednesday, October 31, 2012

‘‘తెలుగు సినిమాపై నా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది!’’ - ‘ఆంధ్రజ్యోతి’లో నా ఇంటర్వ్యూ



‘‘తెలుగు సినిమాపై నా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది!’’ : 

 ‘నంది’ అవార్డు విజేత రెంటాల జయదేవ
 
ఉత్తమ సినీ విమర్శకుడిగా నన్ను ఎంపిక చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించిన సందర్భంగా,
ఇది ఇవాళ్టి (30 అక్టోబర్ 2012, మంగళవారం) ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక తమిళనాడు ఎడిషన్(పేజీ నంబర్ 7)లో
ప్రచురితమైన నా ఇంటర్వ్యూ...

రెండు గంటల పైగా భేటీ వేసి, ఎన్నెన్నో అడిగి, ఎంతో రాసుకొని, ఒకటీ అరా పొరపాట్లున్నా తారీఖుల్లో మాత్రం (పరిశోధనే పుట్టిన తేదీ గురించి కాబట్టి) ఎక్కడా తప్పులు లేకుండా ఆ భేటీకి అక్షర రూపమిచ్చిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు.


కోడంబాక్కం: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పత్రికా రచనపై మక్కువతో దాదాపు రెండు దశాబ్దాలుగా
జర్నలిస్టుగా కొనసాగుతున్న వ్యక్తి డాక్టర్ రెంటాల జయదేవ. తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాలపై పరిశోధన
జరిపి, 80 ఏళ్ళ తెలుగు చరిత్రను తిరగరాసిన ఉత్తమ సినీ విమర్శకుడు. 2011 సంవత్సరానికి గాను నంది
పురస్కారానికి ఎంపికైన రెంటాలతో చిన్న ఇంటర్వ్యూ...

 * సినిమాపై ఆసక్తి ఎలా కలిగింది?

చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం, ఆసక్తి. నాన్న గారు రెంటాల గోపాలకృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికలో సినీ
జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ సమయంలో నాన్న గారిని కలిసేందుకు వచ్చే గొప్ప గొప్ప నటులు, రచయితలతో
పరిచయం, నాన్న గారు రాసే సినిమా వ్యాసాలు చదవడం వంటివి తెలియకుండానే నాకు సినిమాపై ఆసక్తిని
కలిగించాయి.

* తెలుగు సినిమా చరిత్రపై పరిశోధన చేసేందుకు కారణం?

నాన్నగారి ప్రభావంతో జర్నలిజంలోకి వచ్చిన తరువాత నేనే సినిమా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను.
సినిమా వ్యాసమంటే అందులో చరిత్ర తప్పక చెప్పాలి. దాంతో సినిమా గురించి మరింతగా తెలుసుకోవడం
ప్రారంభించాను. ఆ జిజ్ఞాసే తెలుగు సినిమా చరిత్రపై పరిశోధనకు నన్ను పురిగొల్పింది.

* పరిశోధనల దిశగా మీలో స్ఫూర్తి నింపిందెవరు?

ఇంతకు ముందు చెప్పినట్టుగానే నాన్న గారి ప్రభావం చాలా ఉంది. అయితే, పరిశోధన దిశగా ఆరుద్ర గారు
స్ఫూర్తి. ప్రతి విషయాన్నీ పరిశోధనాత్మకంగా చూడడం ఆయనకు అలవాటు. ఆయన రాసిన ‘సమగ్ర ఆంధ్ర
సాహిత్యం’ అలా రూపొందిందే.

* తెలుగు సినిమా పుట్టిన తేదీపై పరిశోధన చేయడానికి కారణం. కొన్నేళ్ళుగా జరుపుకొంటున్న తేదీ తప్పు అని మీకెందుకనిపించింది?

ఈ విషయంలో చాలామంది పొరపాటు పడుతున్నారు. తెలుగు సినిమా పుట్టుక తేదీ తప్పు అని నేను ఏనాడూ
భావించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు. తెలుగు సినిమా చరిత్రపై పరిశోధన చేస్తున్న సమయంలో
తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ చరిత్రకారుడిని కలిశాను. ఆయనతో జరిగిన సంభాషణలో ఒకసారి తొలి
తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’ గురించి చర్చ వచ్చింది. తమిళులు ‘కాళిదాస్’ని తమిళ టాకీగానే భావిస్తారు.
ఆ సినిమా విడుదల తేదీని నిర్ధారించే ఆధారాన్ని నాకు చూపిస్తూ, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1931
సెప్టెంబర్ 15వ తేదీనే విడుదలైందనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు. ఆ ప్రశ్నే నేను తెలుగు సినిమా
పుట్టుక తేదీపై పరిశోధన చేయడానికి కారణం. తెలుగు సినిమా గురించి పరిశోధన చేస్తున్న నాకు పుట్టుక తేదీకి
ఆధారాన్ని కనిపెట్టాలన్న సంకల్పం కలిగింది. కేవలం ఆధారం కనిపెట్టాలన్న లక్ష్యంతోనే పరిశోధన
ప్రారంభించాను. కానీ, సమాచార సేకరణలో అసలు సెప్టెంబర్ 15వ తేదీన తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త
ప్రహ్లాద’ విడుదల కాలేదన్న విషయం తెలిసింది.

* మరి ఆధారం ఎలా లభించింది? ఖచ్చితమైన తేదీని ఎలా కనుగొనగలిగారు?

సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైంది అని చూపించే ఆధారం ఎవరి దగ్గరా లేదు. దాని కోసం మద్రాసు,
విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ, పూణే తదితర తెలుగు సినిమా జాడలున్న ప్రాంతాల్లో పర్యటించి, చరిత్రకారులను
కలుసుకొని వివరాలు సేకరించాను. ఎన్నో పుస్తకాలు చదివాను. అదే సమయంలో పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో
‘ఫిలిం అప్రిసియేషన్’ కోర్సులో చేరాను. అక్కడికి అతి సమీపంలో ‘నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’ ఉంది.
అందులో పాత గ్రంథాలు, సినిమాలు, సెన్సార్ సర్టిఫికెట్లు భద్రపరిచి ఉన్నాయి. వాటిలోనే ‘భక్త ప్రహ్లాద’తో సహా
అప్పటి చిత్రాల సెన్సార్ సర్టిఫికెట్ వివరాలున్న గవర్నమెంట్ గెజిట్ కనపడింది. 1932 జనవరి 22న ‘భక్త ప్రహ్లాద’
సెన్సార్ జరిగినట్లు అందులో ఉంది. అప్పటికి దశాబ్దం క్రితమే సెన్సార్ చట్టం అమలులో ఉంది కాబట్టి, సెన్సార్
జరగకుండా సినిమా విడుదలయ్యే ప్రశ్నే లేదు. దీనిని బట్టి 1931 సెప్టెంబర్ 15న ‘భక్త ప్రహ్లాద’ విడుదల కాలేదని
నిర్ధారణైంది. ఆ తరువాత అసలు తేదీని కనిపెట్టేందుకు శ్రమించి, మరింతగా శోధించాను. అప్పటి పత్రికల్లోని
ప్రకటనలను బట్టి 1932 ఫిబ్రవరి 6న ముంబయ్ లోని కృష్ణా సినిమా థియేటర్ లో తొలి సంపూర్ణ తెలుగు టాకీ
విడుదలైందని తేలింది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో
విడుదలైంది.

* ఈ పరిశోధనకు ఎంతకాలం పట్టింది ?

ఇది పూర్తిగా నా స్వీయ పరిశోధన. దాదాపు నాలుగున్నరేళ్ళు శ్రమించాను. వ్యక్తిగతంగా చేస్తున్న పరిశోధనలకు
 వ్యవస్థ సహకారం కూడా ఉండాలన్నది నా అభిప్రాయం.

* ఇంతవరకు తెలుగు సినిమా పెద్దలు దీనిపై ఆశించినంతగా స్పందించలేదు. దీనిపై మీ కామెంట్...

పరిశోధకుడిగా వాస్తవాలను బయటపెట్టాలన్నదే నా ప్రయత్నం. ఫిబ్రవరి 6నే తొలి తెలుగు సినిమా పుట్టిందని
సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను. ఇక వాళ్ళదే బాధ్యత. సాహితీ లోకం మొత్తం నా పరిశోధనను
అభినందించింది. ప్రజల్లోకి తీసుకెళ్ళడమే తరువాయి.

* మీ భవిష్యత్ కార్యాచరణ?

ఏదో కనిపెట్టాలన్నది నా అభిమతం కాదు. నిరంతర పరిశోధనలో కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి.
ఇప్పటికీ మన దగ్గర మూకీ చిత్రాల గురించి పక్కా సమాచారం లేదు. సాక్ష్యాధారాల సహితంగా తెలుగు సినిమా
చరిత్రను నిర్మించాలన్నది నా లక్ష్యం. అందుకే తెలుగు సినిమా నా పరిశోధన సాగుతూనే ఉంటుంది. నా
ముందు తరం నిర్మించిన మెట్లపై నడుచుకుంటూ సాక్ష్యాధార సహిత తెలుగు సినిమా చరిత్ర నిర్మాణానికి నేను
సైతం...!
* * * * * * * * * * * * * * * ***

Tuesday, October 16, 2012

వార్త 'సాక్షి'గా - రెంటాల జయదేవకు నంది అవార్డ్



2011కు గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నాకు నంది అవార్డు రావడంతో సాక్షి దినపత్రిక, తమిళనాడు సంచిక, 14 అక్టోబర్ 2012, ఆదివారంనాడు 12వ పేజీలో ఈ వార్త ప్రచురించింది. ఆ వార్తను మీ అందరితో పంచుకోవడానికే ఈ టపా. నన్ను అభిమానించి, ఆదరించి, నా రాతలను ప్రోత్సహించిన బ్లాగు మిత్రులందరికీ కృతజ్ఞతలు.


వరించిన నంది అవార్డు - ఉత్తమ సినీ విమర్శకుడు రెంటాల జయదేవ




తెలుగు చలనచిత్రాలకు ఏటేటా ఇచ్చే నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొన్న ప్రకటించింది. 2011వ సంవత్సరానికి గాను ఈ అవార్డుల ప్రకటన జరిగింది. ఉత్తమ సినీ విమర్శకుడి అవార్డు నన్ను వరించింది. ఇరవై ఏళ్ళ పైగా నేను సాగిస్తున్న పత్రికా వ్యాసంగంలో ఇది ఓ చెప్పుకోదగ్గ మజిలీ.

ఈ నందుల్లో శ్రీరామరాజ్యం, దూకుడు చిత్రాలకు ఏడేసి అవార్డులు లభించాయి. మహేశ్ బాబు ఉత్తమ నటుడు (దూకుడు చిత్రం)గా, నయనతార ఉత్తమ నటి (శ్రీరామరాజ్యం చిత్రం)గా, ఎన్. శంకర్ ఉత్తమ దర్శకుడు (జై బోలో తెలంగాణ చిత్రం)గా ఎంపికయ్యారు. మొత్తం నంది అవార్డుల పూర్తి వివరాలను పక్కనే ఇచ్చిన జాబితాలో (సౌజన్యం - ఆంధ్రజ్యోతి దినపత్రిక, 13 అక్టోబర్ 2012, ఆదివారం) చూడవచ్చు.


Sunday, September 9, 2012

తెలుగు సినీ పరిశ్రమకు హిందూ పత్రిక మేలుకొలుపు

Photo caption -- Who’s the first?File photos of ‘Bhakta Prahlada’ considered the first talkie film in any South Indian language; ‘Sita Kalayanam’ ; ‘Lava Kusa’ ప్రచారంలో ఉన్న చరిత్రను మార్చేస్తూ, తెలుగు సినిమా పుట్టిన రోజుకు సంబంధించి నేను చేసిన పరిశోధనకు మరో గుర్తింపు లభించింది. ఆంగ్ల దినపత్రిక ది హిందూ నా పరిశోధనకు ఐ.ఎస్సై మార్కు వేసింది. తొలి పూర్తి తెలుగు టాకీ, భక్త ప్రహ్లాద విడుదల తేదీ 1931 సెప్టెంబర్ 15 కాదు, వాస్తవంగా అది రిలీజైంది 1932 ఫిబ్రవరి 6న అంటూ ససాక్ష్యంగా నేను నిరూపించిన తీరునూ, వాదననూ ఇవాళ్టి (2012 సెప్టెంబర్ 9, ఆదివారం) ది హిందూ పత్రిక తన సినిమా అనుబంధం సినిమా ప్లస్ లో వివరించింది. సీనియర్ పాత్రికేయులు, రచయిత ఎం.ఎల్. నరసింహం రాసిన ఆ ఆంగ్ల కథనం తాలూకు లింకు, సమాచారం ఈ దిగువన మీ కోసం.... Wake up, industry!!! While the debate about the ‘first south Indian talkie’, is on, there’s a need to archive works of the Telugu film industry for posterity!! Though the 80th year celebrations of Telugu talkie were held on a low key last year, to mark the completion of 75 years since the first Telugu talkie, Bhaktha Prahlada hit the screen, it was celebrated with great pomp and show in 2007 at the Mecca of Telugu cinema, Hyderabad. So when was the Telugu talkie first made? According to popular belief the first Telugu talkie was released on September 15, 1931 and so the function should have been held some time in 2006, but, by sheer coincidence, the three-day fete was inaugurated on January 26, 2007, just four days away from the 75th anniversary of the first Telugu talkie. The film was censored on January 22, 1932. Last September, when senior journalist and film researcher, Dr. Rentala Jayadeva, published his findings on the exact release date of Bhaktha Prahlada doubts were raised by some film critics about the veracity of his claim. According to Rentala’s research, Bhaktha Prahlada was released first in Bombay on February 6, 1932 and later in the Andhra region and on April 2, 1932 in Madras. How could a film censored on January 22, 1932 be released on September 15, 1931? It’s a valid question indeed. Rentala says that it was the heckle of a veteran Tamil film chronicler that made him undertake the arduous task of finding the exact date about the release of the first Telugu talkie. There are newspaper reviews and advertisements to prove the first Tamil talkie, Kalidas , was released on October 31, 1931, but there is no such proof about the first Telugu talkie. The veteran Telugu film-maker, H.M. Reddy, was commissioned by Ardeshir Irani to direct the first Tamil talkie, and this fact might have led some inventive Telugu film personality to presume that he (H.M. Reddy) must have made the Telugu talkie first and then the Tamil movie, Kalidas. This presumption led to the belief that Bhaktha Prahlada was released on September 15, 1931. Critics’ questions whether he had any proof for his claim prompted Rentala to do some research on the issue. “After scouting for evidence in libraries in Chennai, Andhra Pradesh and Mumbai, I finally stumbled upon ‘The Bombay Government Gazette -Part I’ (page no.:313) dated February 4, 1932 at the National Film Archives, Pune, which had the dates of films produced and censored in Bombay. The censor date of Bhaktha Prahlada was given in it as January 22, 1932. The Bombay Chronicle carried an advertisement on January 31, 1932 that the film would be released soon. And it was released on February 6, 1932 at Krishna Cinema on New Charlie Road, Bombay. The Times of India carried a review of the film on the same day of its release as preview show was held before its release. Subsequently, it was released in Andhra and then on April 2, 1932 at the National Picture Palace (later renamed as Broadway Talkies), Madras. All this clearly proves that Bhaktha Prahlada was released only in 1932.” Though Kalidas was hailed as the first Tamil talkie, in which the film’s hero (Srinivasa Rao) speaks and sings in Telugu and the heroine (T.P. Raalakshmi) delivers her dialogue in Tamil and rendered Thyagaraya krithis in Telugu and L.V. Prasad who played a cameo spoke in Hindi, it was not considered a true Tamil talkie by some diehard Tamil film critics. They consider Sampoorna Harischandra , released on April 9, 1932, as the first full-length Tamil talkie. Even The Hindu , a day before the film’s release, reviewed it as the “first Tamil talkie. And funnily the advertisement of Kalidas carried that it is the first Tamil-Telugu talkie.” “On this point, we can still feel proud of the fact that Bhaktha Prahlada was the first complete talkie film in any of the South Indian languages as it was released a couple of months before the full-length Tamil talkie, Harischandra ,” states Jayadeva. Though the Telugu film industry is one of the largest movie producers in the country, unfortunately there is no proper archive to keep track of these facts. Is it not high time the industry took note of this and captured its history for posterity? --- m.l. narasimham THE HINDU daily, Today's Paper » FEATURES » CINEMA PLUS Published: September 9, 2012 Sunday

Friday, March 9, 2012

బాలకృష్ణ ‘సి.ఎం.’పై మాట మార్చిన వై.వి.ఎస్. చౌదరి - నోరు విప్పని మీడియా





(ఫోటోల వివరం - ‘సింహా’లో బాలకృష్ణ, ‘నిప్పు’ చిత్రం విడుదలకు ముందు విలేఖరుల సమావేశంలో బొమ్మరిల్లు బ్యానర్ అధినేత, దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరి)

ఒపీనియన్స్ ఛేంజ్ చేయనివాడు రాజకీయ నాయకుడు కాడన్నాడు మన ''కన్యాశుల్కం'' గిరీశమ్. ఆ విషయాన్ని తమకు కూడా అన్వయించుకొనేలా మార్చేసుకోవడంలో మన సినిమా వాళ్ళు ఘటికులు. అయితే, ఒపీనియన్ల గురించి మాత్రమే మన గిరీశం చెప్పాడు కానీ, మన సినిమా వాళ్ళు వాటిని ఫ్యాక్ట్ లు, ఫిగర్ల (వాస్తవాలు, గణాంకాల) దాకా విస్తరించారు. అభిప్రాయాలే కాదు, రెండు రోజుల క్రితం తామే స్వయంగా చెప్పిన, చేసిన ప్రకటనకూ, తమకూ ఎలాంటి సంబంధమూ లేదని కూడా నిష్పూచీగా చెప్పేస్తారు.

మొదటి సారి ప్రకటన చేసినప్పుడూ, తరువాత ఆ ప్రకటనతో తనకేమీ సంబంధం లేదన్నప్పుడూ కూడా మన మీడియా కెమేరాలు కళ్ళప్పగించి చూస్తాయి. సోదర జర్నలిస్టులు చెవులప్పగించి వింటారు. కానీ, మాట మార్చిన పెద్దమనిషిని అదేమిటని అడగరు. పైగా, మొదటి ప్రకటనను మీడియాయే తప్పుగా ప్రచురించిందని అడ్డంగా అబద్ధం ఆడేస్తూ, తప్పంతా పత్రికా వృత్తి మీద నెట్టేస్తుంటే, ఆ పెద్దమనిషిని నిలదీయరు. వృత్తి మీద నింద వేస్తున్నందుకైనా అతగాణ్ణి కడిగేయరు.

ఈ మధ్య ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరి తన తాజా చిత్రం ‘నిప్పు’ విడుదలకు ముందు, విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలవుతున్న సమయం కావడంతో, పాత బాకీల బెడద తప్పించుకోవడానికో, మరెందుకో కానీ అక్కడే ఓ కొత్త సినిమా సంగతి కూడా లోపాయకారీగా బయటపెట్టారు. హీరో బాలకృష్ణతో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘సి.ఎం. (కామన్ మేన్)’ అనే సినిమాను తాను నిర్మిస్తున్నట్లు సాక్షాత్తూ వై.వి.ఎస్. చౌదరే మీడియా మిత్రులకు తెలిపారు. ఆ వార్తను ఆ రోజే టీవీలన్నీ హోరెత్తించాయి. మరునాడు కొన్ని దినపత్రికలూ యథావిధిగా ప్రచురించాయి.

కట్ చేస్తే, వారం పది రోజుల తరువాత వై.వి.ఎస్. చౌదరి నుంచి ఓ ఖండన ప్రకటన వచ్చింది. మీడియాలో ‘సి.ఎం.’ సినిమా గురించి వస్తున్న వార్తలు తప్పనీ, అసలు ఆ సినిమాతో తనకు కానీ, తమ బొమ్మరిల్లు బ్యానర్ కు కానీ సంబంధం లేదనీ, ఆ సినిమా తాము తీయడం లేదనీ, తాము తీస్తున్నట్లు వచ్చిన వార్తలు ఎవరో పుట్టించినవనీ వై.వి.ఎస్. వాక్రుచ్చారు. అడ్డంగా తన మాట మార్చేశారు. షరా మామూలుగా మన మీడియా అంతకు ముందు ఏమీ జరగనట్లే, ఈ వార్తనూ ప్రసారం చేసింది. పత్రికల్లో వేసింది.

అసలు ఈ వార్తలు, ఈ ఖండన ప్రకటనలతో అనుమానం వచ్చింది. కూపీ లాగితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒపీనియన్ ను కాదు, ఏకంగా కెమేరాల సాక్షిగా స్వయంగా చెప్పిన మాటనే వై.వి.ఎస్. ఇలా మార్చేయడం వెనుక కృష్ణానగర్ వర్గాల సమాచారం ప్రకారం పెద్ద కథే ఉంది.

బాలకృష్ణతో గతంలో ‘ఒక్క మగాడు’ అనే ఓ భయంకరమైన ఫ్లాప్ చిత్రం తీసిన ఘన చరిత్ర నందమూరి వంశ వీరాభిమానిగా చెప్పుకొనే వై.వి.ఎస్. చౌదరి సొంతం. (అఫ్ కోర్స్, కమలహాసన్ తో దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు చిత్రానికి పేలవమైన కాపీగా తయారైన ఆ సినిమాను ముందుగానే పెద్ద రేట్లకు చౌదరి అమ్మేసుకున్నారు. అలా చౌదరికైతే లాభాలు మిగిలాయి కానీ కొన్న బయ్యర్లే మట్టి కొట్టుకు పోయారు). ఇప్పుడు, ఈ కొత్త చిత్రం ‘సి.ఎం.’ తాలూకు ప్రకటనను కనీసం బాలకృష్ణతో మాట మాత్రంగానైనా చెప్పకుండానే వై.వి.ఎస్. ప్రకటించేశారట.

ఆ మాటకొస్తే, ఈ కొత్త సినిమా గురించి అసలు బాలకృష్ణకు తెలియనే తెలియదట. బాలయ్య బాబుతో కాకుండా ఆయనకు బంధువూ, అత్యంత సన్నిహితుడూ, ఆయన సినిమా వ్యవహారాలు చూసే వ్యక్తీ అయిన ఓ ఆరక్షరాల పెద్దమనిషితోనే ఈ సినిమా వ్యవహారమంతా వై.వి.ఎస్ మాట్లాడుకున్నట్లు భోగట్టా. వై.వి.ఎస్. కానీ, ఆ చిత్రానికి దర్శకుడిగా ఒప్పుకున్న కృష్ణవంశీ కానీ హీరో బాలకృష్ణను అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కలవనే లేదు, చర్చించనే లేదన్నది ఆంతరంగిక వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం.

బాలయ్యకు బంధువైన సన్నిహితుడితో చెప్పేశాం కదా, ఇక బాలకృష్ణతో తరువాత మాట్లాడుకోవచ్చనుకున్నారో ఏమో, ‘నిప్పు’ విడుదల వేళ ఒత్తిళ్ళు తప్పించుకొనే హడావిడిలో వై.వి.ఎస్. ఈ బాలకృష్ణతో కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలు మీడియాకు తెలివిగా ఊదారు. గతంలో ‘ఒక్క మగాడు’ చిత్ర సమయంలో ఆ ఆరక్షరాల బాలయ్య బంధువునే అడ్డం పెట్టుకొని, హీరో బాలకృష్ణకు 50 లక్షల రూపాయలు ఎగ్గొట్టిన వై.వి.ఎస్. చౌదరి ఈసారి కూడా ఆ బంధు మంత్రం పారుతుందని అనుకున్నట్లున్నారు. కానీ, ఇప్పుడు ఆ పాచిక పారలేదు సరి కదా ఎదురుతన్నింది. అసలు ఈ ప్రాజెక్టు గురించి తనకు ఎవరూ, ఏమీ చెప్పకుండానే పేపర్లలో వై.వి.ఎస్. లీకుతో వార్తలు వచ్చేసరికి బాలకృష్ణ అపర ‘లక్ష్మీ నరసిం’హుడే అయ్యారు.

ఇంతలో ‘నిప్పు’ రానూ వచ్చింది, అట్టర్ ఫ్లాప్ అవనే అయింది. అగ్నికి ఆజ్యం పోసింది. ఇక, ఆగ్రహంతో ఉన్న బాలయ్యను శాంతింపజేయడానికి ఏం చేయాలో ఎవరికీ తెలియలేదట. సినిమా చేస్తానని వై.వి.ఎస్.తో ఒప్పుకోవడమే తప్ప, అప్పటి వరకు బాలకృష్ణను స్వయంగా కలవడం కానీ, మాట్లాడడం కానీ చేయని దర్శకుడు కృష్ణవంశీకి కూడా గుండెల్లో రాయి పడింది. హీరో అయిన తనతో ప్రాజెక్టు గురించి మాట్లాడనైనా మాట్లాడకుండానే ఏకంగా సినిమా గురించి ప్రకటనే ఇచ్చేసిన దర్శక, నిర్మాతలతో సినిమా చేసేందుకు బాలకృష్ణ ససేమిరా అనేశారు. చివరకు వేరే దారి లేక, వై.వి.ఎస్. చౌదరే ‘సి.ఎం.’ చిత్ర ప్రకటనకు ఖండన జారీ చేయాల్సి వచ్చింది.

గమ్మత్తు ఏమిటంటే, అన్న మాటను వారం పది రోజులకే మింగేసిన వై.వి.ఎస్. ఆఖరికి తప్పంతా మీడియాలో వచ్చిన అసత్య వార్తలదే అన్నట్లుగా ఆ ఖండన ప్రకటన ఇచ్చారు. మీడియాలో ఒక్కరూ అదేమిటని అడిగిన పాపాన పోలేదు. మీరే విషయం చెప్పి, ఆనక మీరే మాట మార్చేసి, చివరకు తప్పంతా మీడియాలో వచ్చిన వార్తలది అంటారేమిటని ఒక్క జర్నలిస్టూ ధైర్యంగా అడగ లేదు. వై.వి.ఎస్.ను కడగలేదు.

కనీసం - మాట మార్చింది వై.వి.ఎస్సే తప్ప మీడియా కాదన్న సంగతి తెలిసే విధంగానైనా వార్త రాయలేదు, టీవీలో చెప్పలేదు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాగా - ఆ రోజుకు ఆ వార్త, ఈ రోజుకు ఈ వార్త ఇచ్చేసి చేతులు కడుక్కున్నారు.

మీడియా మరీ ఇంత దారుణంగా తన మీద పడిన అకారణ నిందను ఎందుకు సహిస్తున్నట్లు.... ? సినిమాలకు ప్రచారం కోసం దర్శక, నిర్మాతలు, హీరోలు అందజేస్తున్న ‘అతిథి మర్యాదల’కు అలవాటు పడడమే దీనికి కారణమని వై.వి.ఎస్. సన్నిహితులు కుండబద్దలు కొట్టారు.

ఈ మాటతో పాటు, కొన్ని ప్రైవేటు ఎఫ్.ఎం. చానళ్ళు ఏకంగా పత్రికా విలేఖరుల మీద తరచూ వ్యంగ్యోక్తులు ప్రసారం చేస్తున్నట్లు వినవచ్చింది. నలుగురికీ చెప్పాల్సిన మన పత్రికల వారే వార్తల ‘కవరేజ్’ అంటూ చివరకు నలుగురిలో పలచనైపోవడం, నగుబాటుకు గురవడం చాలా బాధగా అనిపించింది. ఉండబట్టలేక, ఈ నాలుగు మాటలూ రాయాల్సి వచ్చింది.

మీడియా మిత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా... ? ప్రచారం కోసం చూసేవారే ఏకంగా పత్రికా రచనను శాసించే స్థాయికి ఎదగడాన్ని అడ్డుకుంటారా... ? అసలు ఇంతటి దు:స్థితికి మనమెందుకు దిగిపోవాలని ఆత్మవిమర్శ చేసుకుంటారా... ? చెప్పిన మాటను చెప్పలేదంటూ, ఆనక తప్పంతా మీడియాదే అనే అపర సినీ గిరీశాల అసలు కథను జనం కట్టెదుట పెడతారా... ? అక్షరం అమ్ముడు కాదని చూపెడతారా... ? మీడియా గౌరవాన్ని నిలబెడతారా.... ? అన్నీ బేతాళ ప్రశ్నలే.

Saturday, March 3, 2012

''నిప్పు'' మీద నెగటివ్ టాక్ - ఆశ్చర్యపరిచే తెర వెనుక కథ




(ఫోటోల వివరం - ''నిప్పు''లో రవితేజ, ''పూల రంగడు''లో సిక్స్ ప్యాక్ లో సునీల్)


రవితేజ హీరోగా నటించగా, ఇటీవల విడుదలైన ''నిప్పు'' సినిమా నేనింకా చూడలేదు. అసలు రిలీజు రోజునే చూద్దామంటే కుదరలేదు. చూద్దామని అనుకుంటుండగానే, సినిమా బాగా లేదంటూ, పత్రికలలో, చానళ్ళలో హోరెత్తించే ప్రచారం సాగింది. ఖాళీ కుదుర్చుకొని, సినిమా చూసేలోగా, హాళ్ళలో ఆ సినిమా దాదాపు అదృశ్యమైంది. ఒకటీ అరా మల్టీప్లెక్సుల్లో ఉన్నా, రోజుకు ఒకటీ, అరా ఆటలే మిగిలాయి. అబ్బ.... ప్రతి సినిమానూ ఆహా, ఓహో అద్భుతం అని ఆకాశానికి ఎత్తేసే మీడియా ఈ సారి ఇంత నిష్కర్షగా ముక్తకంఠంతో చెప్పిన మాట అక్షరాలా నిజంలా ఉందే అని అనుకున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఓ పేరున్న పెద్ద పేపర్ లో సినిమా విడుదలైన మరునాడే నిప్పు బాగా లేదంటూ రివ్యూ కూడా వచ్చేసింది. ఇవన్నీ నాకు ఆశ్చర్యం, మీడియాలో సత్యనిష్ఠ పెరిగిందేమోనన్న ఆనందం కలిగించాయి.

కానీ, ఇందరూ, ముక్తకంఠంతో ఇంతగా సినిమా బాగా లేదని చెప్పడం వెనుక కారణమేమిటా అని నా బుర్రలో ఏదో ఒక మూల గంట కొడుతూనే ఉంది. తీరా ఇవాళే నాకు అదాటున ఓ అద్భుతమైన నిజం తెలిసింది. దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి నిర్మాతగా మారి, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ''నిప్పు'' సినిమా బాగా లేదన్న మాట నిజమే. అయితే, ఆ సినిమా గురించి రిలీజు రోజు సాయంత్రానికే టీవీ చానళ్ళతో సహా మీడియా అంతటా అలా నెగటివ్ ప్రచారం జరగడం వెనుక మరో నిగూఢ రహస్యం ఉంది.

సినీ రంగంలోని ఆంతరంగిక వర్గాలు వెల్లడించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం - ఈ నెగటివ్ టాక్ వెనుక ''పూలరంగడు'' సినిమా ఉంది. అదేమిటని ఆశ్చర్యపోకండి. ఇది పచ్చి నిజమని కృష్ణానగర్ కబురు. ''పూలరంగడు'' సినిమాను రూపొందించిన ఆర్. ఆర్. మూవీ మేకర్స్ వారికీ, హీరో రవితేజకూ ఏదో పాత తగాదాలున్నాయని భోగట్టా. ఆ మధ్య ''మిరపకాయ్'' సినిమా తీసిన రోజుల్లో ఆ చిత్ర నిర్మాతలైన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారికీ, ఆ చిత్ర హీరో రవితేజకీ ఎక్కడో చెడిందట. అప్పటి నుంచి వారు రవితేజకు ఝలక్ ఇవ్వడానికి అదను కోసం చూస్తున్నారు.

''పూలరంగడు'' చిత్రం వాణిజ్య విజయంపై ప్రగాఢమైన నమ్మకంతో ఉన్న నిర్మాతలు, కావాలనే ''నిప్పు'' ఎప్పుడు రిలీజైతే, అప్పుడే పోటీగా రిలీజ్ చేయాలని పంతం పట్టి కూర్చున్నారు. అందుకు తగ్గట్లే సంక్రాంతికి ''నిప్పు'' రిలీజనగానే, అప్పుడే ''పూలరంగడు'' రిలీజ్ చేయాలని సిద్ధమయ్యారు. తీరా ''నిప్పు'', దాంతో పాటు ''పూల రంగడు'' వాయిదా పడ్డాయి. మహాశివరాత్రి కానుకగా ''నిప్పు'' రిలీజనగానే, ఆ మరునాడే ''పూలరంగడు'' రిలీజ్ పెట్టేశారు.

''నిప్పు'' రిలీజైన రోజునే, ఆ సినిమా గురించి అన్ని టీవీ చానళ్ళలో ఆ సినిమా బాగా లేదంటూ వార్తలు వచ్చేలా ప్రచారం జరిగింది. అప్పట్లో రవితేజతో ''మిరపకాయ్'', ఇప్పుడు సునీల్ తో ''పూలరంగడు'' తీసిన నిర్మాతల ప్రాయోజకత్వంలో ఇలా నెగటివ్ ప్రచారం జోరుగా సాగినట్లు కృష్ణానగర్ కబురు. చిత్రం ఏమిటంటే, అటు వారికీ, ఇటు రవితేజకూ మధ్య తగాదా మాటేమో కానీ, మధ్యలో ''నిప్పు'' నిర్మాత వై.వి.ఎస్. చౌదరి ఇరుక్కుపోయారు.

ఇంకా విచిత్రం ఏమిటంటే - అటు ఆర్.ఆర్. మూవీమేకర్స్ వారి ''పూల రంగడు''కూ, ఇటు బొమ్మరిల్లు వారి ''నిప్పు''కూ పి.ఆర్.ఓ. ఒకరే. డబ్బులు దండిగా తీసుకోవడమే కాక, మీడియాకు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడనే పేరున్న ఆ అగ్ర పీ.ఆర్.ఓ. ఏకకాలంలో అటూ, ఇటూ కూడా పనిచేస్తూ, ఒక సినిమా వాళ్ళ వ్యక్తిగత కక్ష సాధింపు కోసం మరో సినిమా మీద బురద జల్లనివ్వడం ఆశ్చర్యకరమే కాదు, ప్రొఫెషనల్ ఎథిక్స్ ను కూడా మలినపరిచిన అత్యంత విషాదం కూడా.

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ తో అతి సన్నిహిత సంబంధాలు ఉండడం, వారే తన సినిమా ఒక దానికి నిర్మాతలు కావడంతో ఆ ఘనత వహించిన పి.ఆర్.ఓ. గారు ''నిప్పు'' పై దుష్ప్రచారానికి ఆజ్యం పోసి ఊరకున్నట్లు హైదరాబాద్ లో సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇక, ఆ విష ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఆ పి.ఆర్.ఓ. కాదు కదా, కనీసం ఇటు ''నిప్పు'' సినిమా తీసిన బొమ్మరిల్లు అధినేత వై.వి.ఎస్. చౌదరి కూడా గట్టిగా నిలబడలేకపోవడం చేతకానితనం అనుకోవాలా, చేవచచ్చినతనం అనుకోవాలా. అసలే ''నిప్పు'' సినిమాను కొనేవాళ్ళు లేక, సొంతంగా రిలీజు చేసుకొని, కొన్న కొద్ది ఏరియాల వాళ్ళు కూడా డబ్బులు తగ్గించి కట్టడంతో, దెబ్బతిన్న వై.వి.ఎస్. చౌదరికి ఇది దెబ్బ మీద దెబ్బ. మూలిగే నక్క మీద తాటిపండు పడడమంటే ఇదే.

కొసమెరుపు -

ఇదంతా చెప్పింది ''నిప్పు'' సినిమా ఏదో మహత్తర సినిమా అని ఒప్పించడానికి కాదు. ఎంతో మంచి సినిమా ఈ విష ప్రచారం వల్ల దెబ్బతిన్నదని నమ్మించడానికీ కాదు. దురదృష్టవశాత్తూ, మన మీడియా ఇవాళ ఎటుబడితే అటు, ఎలా పడితే అలా ఒంగిపోతూ, పిచ్చివాడి చేతిలో రాయిగా మారిందని తెలియపరచడానికే.

అన్నట్లు, ''నిప్పు'' చిత్రం ఇప్పుడు ఎంత పెద్ద ఫ్లాపంటే, రవితేజ కెరీర్ లోని ''చంటి'', ''షాక్'' లాంటి చిత్రాల కన్నా ఈ సినిమాకు కలెక్షన్లు కనాకష్టంగా వచ్చాయి. అసలు ఓపెనింగులే లేని ''నిప్పు'' రెండో వారం తిరిగే సరికల్లా ఒకటీ అరా మినహా మిగతా హాళ్ళలో కనబడితే ఒట్టు. అలాగే, ఈ సినిమా విడుదల కాకముందే తప్ప, విడుదలయ్యాక సినిమా ప్రచారంలో దర్శకుడు, హీరో కనిపించనే లేదు.

అదేమని ఆరా తీస్తే, ప్రచారానికి రమ్మంటే, అటు హీరో రవితేజ, ఇటు దర్శకుడు గుణశేఖర్ పరుగో పరుగట. రాము గాక రామని చెప్పేశారట. చిత్రం చూశారా... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజలు సినీ జీవితం తొలినాళ్ళలో మద్రాసులో రూమ్ మేట్లంటూ సినిమా విడుదల ముందు తెగ చెప్పుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యేసరికి, ఆ పాత స్నేహం ఆవిరైపోయినట్లుంది. అవును మరి. అన్ని సంబంధాలూ ఆర్థిక సంబంధాలే అయిన సినీ రంగంలో సక్సెస్ సత్యం, స్నేహాలు మిథ్య. బహుశా, దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరికి ఈ మాట ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటా.

Wednesday, February 29, 2012

వ్యంగ్యభరిత హాస్యానికి వజ్రోత్సవ చిరునామా 'పెళ్ళి చేసి చూడు'














ఏ సినిమా అయినా సాధారణ స్థాయిలో విజయవంతమైందంటే, దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ, ఓ సినిమా అఖండ విజయం సాధించిందంటే, దానికి ప్రధాన కారణం మాత్రం ఒకటే. అప్పటి దాకా ఉన్న మూసను ఛేదించి, కొత్త పంథా తొక్కడం. ఆంతకు మునుపు వచ్చిన చిత్రాలకు భిన్నమైన దోవలో నడక సాగించడం. సరిగ్గా ఇవాళ్టికి 60 ఏళ్ళ క్రితం వచ్చిన 'పెళ్ళి చేసి చూడు' చిత్రం చేసినది అదే. ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ సినిమా గుర్తున్నదీ, ఇవాళ్టికీ దాన్ని గుర్తు చేసుకుంటున్నదీ అందుకే.

నాలుగేళ్ళకు ఒకసారి మాత్రమే ఫిబ్రవరిలో 29 రోజులుండే లీపు సంవత్సరంలో 'పెళ్ళి చేసి చూడు' విడుదలైంది. విజయవాడలోని శ్రీదుర్గాకళా మందిరంలో ఈ హాస్యరసభరిత చిత్రం ఏకంగా 182 రోజులు ఆడింది. ఇంకా చెప్పాలంటే, ఆ దశకంలో 'పాతాళ భైరవి' తరువాత అతి పెద్ద ఘన విజయం సాధించిన చిత్రం ఇదే. 1952లో ఫిబ్రవరి 29న విడుదలైన ఈ చిత్రం అలా తెలుగు గడ్డ మీద రజతోత్సవం జరుపుకొన్న తొలి సాంఘిక చిత్రంగా రికార్డు సృష్టించింది.

మూసను బద్దలు కొట్టి, మరెందరికో స్ఫూర్తి

తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' విడుదలయ్యాక సరిగ్గా 20 ఏళ్ళకు వచ్చిన చిత్రం -'పెళ్ళి చేసి చూడు'. నిజానికి, 'పెళ్ళి చేసి చూడు' కన్నా ముందే గణనీయమైన సంఖ్యలో సాంఘికాలు వచ్చాయి. వాటిలో 'బారిస్టర్ పార్వతీశం', 'బోండాం పెళ్ళి', 'భలే పెళ్ళి' లాంటి కొన్ని హాస్యరస చిత్రాలూ ఉన్నాయి. కానీ, అంతకు మునుపటి సాంఘిక చిత్రాల్లో కథానాయక పాత్రలు ఎక్కువ భాగం కొంత పెద్ద వయసువి. పెళ్ళాం, పిల్లలతో, కుటుంబంలోని రకరకాల జంఝాటాలతో సతమతమవుతూ ఉండేవి. కొండకచో, విషయలోలత, స్వార్థపరత్వం లాంటి అవలక్షణాలూ ఉండేవి. మానసిక దౌర్బల్యంతో బాధపడుతుండేవి. అలా ప్రధానంగా కొంత మేర నెగటివ్ క్యారెక్టరైజేషన్ తో నాయక పాత్రలు ఉండేవి.

సరిగ్గా ఆ మూసను బద్దలుకొట్టి, కొత్త పుంత తొక్కడం 'పెళ్ళి చేసి చూడు'లోని ప్రత్యేకత. ఇందులో హీరోది పాజిటివ్ క్యారెక్టరైజేషన్. అనుకున్నది చేయడానికి అవసరమైతే అబద్ధమాడి, అన్ని రకాల సాహసాలూ చేయడానికి తెగించే ధీరుడు. ముఖ్యంగా బామ్మ గారి, తాత గారి భావాలకు ఎదురొడ్డే యోధుడు. యువతరం భావావేశాలకు సరైన సైదోడు. పెళ్ళి కావాల్సిన నవ యువకుడు. వరకట్నం లాంటి దురాచారాలను ఎదిరించే కుర్రవాడు. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకొని, వంద అబద్ధాలైనా ఆడి, ఆఖరికి ఇంట్లో వాళ్ళను కూడా ఒప్పించే నవతరం ప్రతినిధి. అందుకే, 'పెళ్ళి చేసి చూడు'లో ఎన్టీయార్ పోషించిన వెంకట రమణ పాత్రలో అప్పటి కుర్రకారు తమను చూసుకుంది. వయసు మీద పడ్డ పెద్ద తరం చిన్న వయసులో ధైర్యం చాలక తాము చేయని పనిని తెరపై హీరో చేసి చూపిస్తే, చప్పట్లు కొట్టింది.

కేవలం హాస్యరస భరితంగానే మిగిలిపోకుండా, దానికి వ్యంగ్యాన్ని మిళాయించడం ఈ సినీ వంటకానికి గుబాళింపు తెచ్చిన తాళింపు. సెటైర్ తో కలగలిసిన హాస్యరసభరిత చిత్రంగా 'పెళ్ళి చేసి చూడు' నూటికి నూటయాభై మార్కులు తెచ్చుకుంది. తెలుగు తెరకు అప్పట్లో కొత్తగా తోచిన ఆ రకం హాస్యానికి తరతరాలకూ తరగని స్ఫూర్తిగా నిలిచింది. 'పెళ్ళి చేసి చూడు' ప్రత్యేకత అది.

పాటలు, పిల్లల తీపి చేష్టలు

ఆణిముత్యాల లాంటి చిత్రాలెన్నిటినో అందించిన విజయా సంస్థ వారి కానుకే ఈ 'పెళ్ళి చేసి చూడు' కూడా. ఎన్టీయార్, ఈ సినిమాలో హాస్యం, పాత్రధారుల అభినయానికి తోడు పాటలు, సంగీతం చిత్ర విజయానికి కీలకమయ్యాయి. 'ఓ భావిభారత భాగ్య విధాతలారా...' అంటూ మొదలై, 'పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని....' అంటూ సాగే పింగళి నాగేంద్రరావు రచన, ఘంటసాల మార్కు స్వరాలాపనలతో ఆ పాట ఇవాళ్టికీ నిత్య నూతనం. పెళ్ళీడు కొచ్చిన కుర్రకారుకు తారక మంత్రం. అలాగే, బాల నటులైన మాస్టర్ కుందు (గాదె రామకృష్ణారావు) తదితరుల మీద వచ్చే 'అమ్మా నొప్పులే... అమ్మమ్మా నొప్పులే...' అనే ఊటుకూరి సత్యనారాయణ రచన ఒక తరంలో పిల్లలకూ, పెద్దలకూ పెద్ద ఫేవరెట్ గీతం. బడికి వెళ్ళమనగానే కడుపు నొప్పి అని మారాం చేసే పిల్లలు, ఇంట్లో గారెలు వండామనగానే నొప్పి పోయి, ఆకలి అని చెప్పడం లాంటివి మన నిజ జీవితాల్లో నుంచి తెర మీదకు నడిచొచ్చిన సన్నివేశాలే. ఆబాలగోపాలం తెర మీది పాత్రల్లో తమను తాము చూసుకోవడానికి అంతకు మించి ఇంకేం కావాలి. సినిమాలోని మొత్తం 17 పాటల్లో 'రాధనురా...', 'ఎవడొస్తాడో చూస్తాగా...', 'చిట్టీ భయమెందుకే...' లాంటి చాలా పాటలు జనానికి ఇవాళ్టికీ గుర్తే.

ఎన్టీయార్, కథానాయిక జి. వరలక్ష్మి, ఎస్వీయార్ లాంటి చేయి తిరిగిన నటీనటుల మాట చెప్పనక్కర లేదు. కానీ, 'రేడియో బాలన్నయ్య'గా ప్రసిద్ధులైన న్యాయపతి రాఘవరావు శిక్షణలోని 'బాలానంద' సంఘం పిల్లలు కెమేరా ముందు నటిస్తున్నట్లు కాకుండా, సహజంగా ప్రవర్తించడం, ముఖ్యంగా సిసింద్రీ పాత్రలో మాస్టర్ కుందు అభినయం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఆ సినిమా బాల నటీనటుల్లో ఒకరైన మాస్టర్ మోహన్ (అమ్మా నొప్పులే... అంటూ పాటలో అభినయించే అబ్బాయి) ఇవాళ మనకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నత బాధ్యతలు నిర్వహించిన ఐ.ఏ.ఎస్. అధికారి కందా మోహన్ అంటే, ఒకింత ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.

తెలుగు సినీ ఫార్ములాల్లో చక్రపాణీయం

అంతకు ముందు 'ధర్మపత్ని' (1941)తో మాటల రచయితగా మొదలై, 'స్వర్గసీమ' (1945) కథా రచయితగా ఎదిగి, 'షావుకారు' (1950)కు కథ, సంభాషణలూ రెండూ తానే అందించిన చక్రపాణి అదే వరుసలో కథ, కథనం, సంభాషణలు అందించిన సినిమా ఇది. ఇందులో చక్రపాణి మార్కు హాస్యం, సమకాలీన సామాజిక పరిస్థితులపై చురకలు చోటుచేసుకున్నాయి. విజయా సంస్థపై నాగిరెడ్డి - చక్రపాణి సంయుక్తంగా అందించిన చాలా భాగం చిత్రాల్లో ఇవి తప్పనిసరి దినుసులు. 'పెళ్ళి చేసి చూడు'తో సహా ఆ చిత్రాలు ఇవాళ్టికీ ఎవర్ గ్రీన్ గా మిగలడానికీ, తరువాతి తరాల దర్శక - నిర్మాతలకు పాఠ్యగ్రంథాలుగా మారడానికీ అది ఓ ముఖ్య కారణం. గమనిస్తే, విజయా వారి చిత్రాలైన ఆ తరువాతి 'మిస్సమ్మ', 'అప్పు చేసి పప్పు కూడు' మొదలు ఇటీవలి జంధ్యాల మార్కు సినిమాల దాకా ఈ వ్యంగ్యభరితమైన హాస్య రస పూరిత కథలు చాలానే వచ్చాయి. జనానికి నచ్చాయి. 'నేను దర్శకుడిగా హాస్యరసభరిత చిత్రాల తీయడానికి విజయా వారి చిత్రాలే కారణమ'ని సాక్షాత్తూ జంధ్యాలే ఓ సందర్భంలో చెప్పారంటే, ఆ తరహా చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా 'పెళ్ళి చేసి చూడు' ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు.

సావిత్రికి గుర్తింపు

ఇక, 'గృహప్రవేశం' రోజుల నుంచి ఇలాంటి ఘట్టాలను తెర కెక్కించడంలో అనుభవమున్న దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ 'షావుకారు' తరువాత 'పెళ్ళి చేసి చూడు' మీదుగా 'మిస్సమ్మ'కు వచ్చేసరికి హాస్యరస పరిపోషణలో చేయి తిరిగిన నిర్దేశకుడు కావడం కూడా గమనించదగ్గ విషయం. హీరోయిన్ గా ఎదగడానికి ముందు అభినేత్రి సావిత్రి కాస్తంత గుర్తుపెట్టుకొనే పాత్ర వేసింది కూడా తొలిసారిగా 'పెళ్ళి చేసి చూడు'లోనే. 'సంసారం'లో కథానాయిక స్నేహితుల్లో ఒకరైన జూనియర్ ఆర్టిస్టుగా తెరపై తళుక్కున మెరిసి మాయమైన ఆమె 'పాతాళ భైరవి'లో డ్యాన్సర్ గా, 'రూపవతి'లో వ్యాంప్ తరహా పాత్రలోనే కనిపించారు. తొలిసారిగా 'పెళ్ళి చేసి చూడు'లో నటుడు యండమూరి జోగారావుకు జోడీగా, సహాయక పాత్రకు ఎదిగారు. ఆ సినిమా తరువాతే సావిత్రి 'పల్లెటూరు'లో ఎన్టీయార్ సరసన నాయిక అయ్యారు. ఆ పైన 'దేవదాసు'తో తిరుగులేని నటి అనిపించుకున్నారు.

గమ్మత్తేమిటంటే, 'పెళ్ళి చేసి చూడు' అంత హిట్టయినా, ఎన్టీయార్ సరసన నాయికగా నటించిన జి. వరలక్ష్మి ఆ తరువాత ఆయన పక్కన రెండు మూడు సినిమాల్లో మాత్రమే నాయికగా, అదీ పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో కనిపించడం. ఆ తరువాత కాలంలో జి. వరలక్ష్మి తల్లిగా నటిస్తే, ఆమెకు కొడుకుగా ఎన్టీయార్ పాత్ర పోషణ చేయడం తెలుగు సినిమాల్లో కనిపించే హీరో డామినేషన్ కూ, ఎన్టీయార్ లాంటి ఆ తరం నటీనటుల సుదీర్ఘమైన హీరో ఇన్నింగ్స్ కూ ప్రతీకలు.

విజయ గాథ

'పెళ్ళి చేసి చూడు' చిత్రకథ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇదే హీరో హీరోయిన్లతో ఏకకాలంలో నిర్మాణమైంది. తెలుగు వెర్షన్ వచ్చి విజయవంతమయ్యాక, కాస్త ఆలస్యంగా 1952 ఆగస్టు 15న 'కల్యాణం పణ్ణి పారు'గా ఆ తమిళ రూపం విడుదలైంది. ఆ తమిళ చిత్రంలో మాత్రం ఓ పాటను రంగుల్లో చిత్రీకరించారట. అప్పట్లో అదో పెద్ద విశేషం. తమిళంలోనూ సినిమా హిట్టే. అప్పట్లోనే విజయా వారే ఈ చిత్రాన్ని హిందీలోనూ తీద్దామనుకున్నా కుదరలేదు. ఆఖరికి ఇరవై ఏళ్ళ తరువాత 1972లో దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో 'షాదీ కే బాద్'గా ఈ కథను హిందీలో నిర్మించారు. కానీ, స్క్రిప్టులో చేసిన మార్పులు, బాల నటీనటుల పాత్రల ప్రాధాన్యం మాతృకలో కన్నా తగ్గడం లాంటి అనేక కారణాలతో సినిమా ఆడలేదు.

తెలుగు 'పెళ్ళి చేసి చూడు' వాణిజ్య విజయానికి వస్తే, తొలివిడతలో 15 కేంద్రాల్లో విడుదలై, 11 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. ఆలస్యంగా మలి విడతలో విడుదలైన కేంద్రాలను కూడా కలుపుకొంటే, మొత్తం 26 కేంద్రాల్లో నూరు రోజులు ఆడింది. విజయవాడలో రజతోత్సవం సరేసరి. నిజానికి, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలోనే ఎన్టీయార్, ఏయన్నార్ నటించిన సాంఘిక చిత్రం 'సంసారం' (1950) కూడా రజతోత్సవ చిత్రంగా పేరు తెచ్చుకుంది. కాకపోతే, ఆ సినిమా ఆడింది 170 రోజులు. అదీ మద్రాసులోని పల్లవరంలోని జనతా థియేటర్ లో. పూర్తిగా మన తెలుగు గడ్డ మీదకు వస్తే, తొలి తెలుగు సాంఘిక రజతోత్సవ చిత్రంగా విజయవాడ దుర్గాకళామందిరంలో 182 రోజులు ఏకధాటిగా వీరవిహారం చేసిన 'పెళ్ళి చేసి చూడు' నిలుస్తుంది. పంచదార గుళిక లాంటి హాస్యం, చురుక్కున తగిలీ తగలని వ్యంగ్యం, మాటల్లో కాకుండా పాత్రల ప్రవర్తనల్లో కలగలసిపోయిన సందేశం - ఇవన్నీ 'పెళ్ళి చేసి చూడు'ను మరెన్నో శతమానోత్సవాల దాకా చెప్పుకొనేలా చేస్తాయి. వాణిజ్య విజయమే కాదు, విశేష ప్రభావమే ఏ సినిమా వజ్రపు తునకో చెప్పేందుకు అసలైన గీటురాయి.

తాజా కలం - ఇప్పుడే అందిన వార్త. ఇవాళ రాత్రి 10.30 గంటలకు తెలుగు టీవీ చానల్ 'ఈ' టి.వి.లో 'పెళ్ళి చేసి చూడు' చిత్రం ప్రసారమవుతోంది. హాస్యరసాభిమానులు మిస్ కాకండి...

Tuesday, February 7, 2012

తెలుగు ‘టాకీ’ పుట్టుకపై.... ‘సాక్షి’....లో

ఇది ఇవాళ్టి సాక్షి దినపత్రికలోది...




తెలుగు ‘టాకీ’ పుట్టి 80 ఏళ్ళు!

భారతీయ చలనచిత్ర రంగంలో మూకీలను వెనక్కి నెడుతూ టాకీలు వచ్చింది 1931లో! హిందీ - ఉర్దూల మిశ్రమ భాషలో తయారై, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. ఆ తరువాత మరో ఏడు నెలలకు కానీ, మన దక్షిణాది భాషలలో మాట్లాడే టాకీ చిత్రాలు రాలేదు. తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న విడుదలైంది. తెలుగు, తమిళ భాషలు రెండూ ఈ సినిమాతోనే తెరపై తొలిసారిగా వినిపించినప్పటికీ, ఎక్కువగా తమిళంలోనే మాటలు,పాటలున్నాయి కాబట్టి, తమిళులు దాన్ని తమ లెక్కలో వేసుకొని,‘కాళిదాస్’ ను తొలి తమిళ టాకీగా చెప్పుకొంటున్నారు. కానీ, నిజానికి అప్పట్లో ఆ చిత్రానికి ‘‘తమిళ - తెలుగు భాషల్లో మాట్లాడే చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు.

ఇక, పూర్తిగా తెలుగులోనే సంభాషణలున్న తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’. ఇంతవరకూ ఆ చిత్రం సరైన విడుదల తేదీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ చివరలో వచ్చింది కాబట్టి, దానికి కనీసం నెలన్నర ముందు 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైనట్లు అందరూ భావిస్తున్నారు. ఏటేటా సెప్టెంబర్ 15ను ‘తెలుగు సినిమా జన్మదినం’గా జరుపుకొంటున్నారు. కానీ, ఈ పరిశోధకుడి అన్వేషణలో బయటపడ్డ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.

దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి టాకీలైన ‘కాళిదాస్’కూ, ‘భక్త ప్రహ్లాద’కూ రెండింటికీ దర్శకుడు ఒకరే. ఆయనే హెచ్.ఎం. రెడ్డి. తొలి తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న విడుదలైతే, అంతకన్నా ముందే రిలీజైనట్లు ప్రచారంలో ఉన్న పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సెన్సారైందే - 1932 జనవరి చివరలో! ఆ జనవరి 22న ‘బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్’ సెన్సారింగ్ చేసి, అదే తేదీన సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా జారీ చేసింది. దీన్నిబట్టి, ఒకటి స్పష్టం. ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ మధ్యలో విడుదల కాలేదు. ఇక, దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి సైతం సగం తమిళం - సగం తెలుగు మాటలున్న ‘కాళిదాస్’ విడుదలై విజయవంతమయ్యాకే, ఆ ఉత్సాహంతో పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ను రూపొందించినట్లు ఆ రోజుల్లోనే ఇంటర్వ్యూల్లో చెప్పారు. హెచ్.ఎం. రెడ్డితో అనుబంధం... తొలి నాళ్ళ టాకీలైన ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’, ‘భక్త ప్రహ్లాద’లు మూడింటిలో పనిచేసిన సంబంధం ఉన్న ఎల్.వి. ప్రసాద్ సైతం ఆ వరుసే చెప్పారు. 1930ల తరం దర్శకుడు పి. పుల్లయ్య కూడా ఆ క్రమాన్నే పేర్కొనడం మరో ధ్రువీకరణ.

మరి ఇంతకీ, ‘భక్త ప్రహ్లాద’ అసలు సిసలు విడుదల తేదీ ఏమిటన్నట్లు? అది - 1932 ఫిబ్రవరి 6. అంటే ఈ 2012 ఫిబ్రవరితో పూర్తి తెలుగు టాకీ చిత్రానికి 80 ఏళ్ళు నిండుతున్నాయి. ఈ సాక్ష్యాధారాలను బట్టి, సగం తమిళం - సగం తెలుగు సినిమా వచ్చిన తరువాతే, పూర్తి తెలుగు టాకీ విడుదలైందనీ, తెలుగు సినిమా పుట్టిన రోజు సెప్టెంబర్ 15 కాదు, ఫిబ్రవరి 6 అనీ తేలిపోయింది. ఇకనైనా, తెలుగు సినిమాకు సరైన తేదీనే జన్మదినం జరుపుకోవడం విధాయకం!



- డాక్టర్ రెంటాల జయదేవ

Monday, February 6, 2012

తెలుగు టాకీకి అసలు సిసలు 80 ఏళ్ళు ఇవాళే! - 'ఈ' టి.వి.లో వచ్చిన స్టోరీ

ఈనాడు టెలివిజన్ చానల్ తమ రెండు చానళ్ళలోనూ ('ఈ' టి.వి. తెలుగులో, 'ఈ' టి.వి.-2లో) కూడా ఈ అంశంపై నా పరిశోధనను పేర్కొంటూ, కథనాలు ప్రసారం చేసింది. 'ఈ' టి.వి. - 2 చానల్ ఇవాళ ప్రసారం చేసిన ప్రత్యేక వార్తా కథనం లింకు ఇదుగో....

తొలి తెలుగు సినిమా పుట్టిందెప్పుడు? - అసలు చరిత్ర ఏంటి?- - టి.వి 9లో స్టోరీ

ఈ అంశంపై నా పరిశోధనను పేర్కొంటూ, టి.వి - 9 చానల్ ఇవాళ ప్రసారం చేసిన ప్రత్యేక వార్తా కథనం లింకు ఇదుగో....





తొలి పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదలై ఇవాళ్టికి, అంటే ఈ 2012 ఫిబ్రవరి 6వ తేదీకి సరిగ్గా 80 ఏళ్ళు. ఇంతకాలం ఈ సినిమా 1931లో విడుదలైందని అనుకుంటూ వచ్చారు చాలామంది. అలాగే, విడుదల తేదీ సెప్టెంబర్ 15 అంటూ సాక్ష్యాధారాలేవీ లేని ఓ ప్రచారం జరుగుతూ వచ్చింది. అదే అందరం నమ్మాం. కానీ, ఆ నమ్మకం తప్పు అని నా పరిశోధన తేల్చింది.

ముందుగా దర్శకుడు హెచ్. ఎం. రెడ్డి సగం తెలుగు - సగం తమిళంలో డైలాగులు, పాటలున్న కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పటి పత్రికలన్నీ ఆ చిత్రాన్ని తొలి తమిళ - తెలుగు టాకీ అనే పేర్కొన్నాయి. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ఆ సినిమా విజయవంతమయ్యాక, పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలని తనకు ఆలోచన వచ్చినట్లు స్వయంగా ఆయనే ఇంటర్వ్యూల్లో చెప్పారు, వ్యాసాల్లో రాశారు.

ఆ రకంగా 1931లో నిర్మాణం మొదలైన పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద బొంబాయిలో చిత్రీకరణ జరుపుకొంది. అక్కడే సెన్సారింగూ పూర్తి చేసుకుంది. 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారైన ఆ సినిమా, సరిగ్గా పక్షం రోజులకు బొంబాయిలోనే న్యూ ఛార్నీ రోడ్డులోని కృష్ణా సినిమా హాలులో విడుదలైంది. అలా ఆ సినిమా తొలి విడుదల తేదీ 1932 ఫిబ్రవరి 6. అంటే, ఇవాళ్టితో మన తొలి తెలుగు సినిమాకు 80 ఏళ్ళు నిండాయన్నమాట.

ప్రామాణికమైన సాక్ష్యాధారాలు సేకరించి, అవి ప్రత్యక్షంగా చూపిస్తూ నేను చేసిన ఈ పరిశోధనను సినీ విమర్శకులు, చరిత్రప్రేమికులు వి.ఏ.కె. రంగారావు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, వకుళాభరణం రామకృష్ణ లాంటి వారు స్వయంగా చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమా జన్మదినం ఫిబ్రవరి 6న జరుపుకోవడమే సముచితమని అంగీకరించారు. మరి, ఇక నుంచైనా మన సినీ చరిత్రకారులు, పరిశ్రమ పెద్దలు ఈ అంశంపై దృష్టి సారిస్తారా....!?