జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, January 1, 2013

దక్షిణాది సినిమా రూపురేఖలు మార్చింది తెలుగువాడే - రెంటాల జయదేవ



అంబత్తూరు: దక్షిణాది సినిమా మొగ్గ తొడుగుతున్న రోజుల్లో దాని రూపు రేఖలను మార్చిన వ్యక్తి మన తెలుగువాడేనని ప్రముఖ పాత్రికేయులు, నంది అవార్డు గ్రహీత డాక్టర్ రెంటాల జయదేవ పేర్కొన్నారు. వేదవిజ్ఞాన వేదిక , ఆంధ్రా సాంఘిక , సాంస్కృతిక సంఘం (ఆస్కా) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం జరిగింది. టీనగర్‌లోని ఆస్కా ప్రాంగణం కావేరీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రెంటాల జయదేవ 'తొలి తెలుగు సినీమాట-పాట-కవి' అనే అంశంపై ఉపన్యసించారు. చలనచిత్రం పుట్టుపూర్వోత్తరాలను వివరించడంతో పాటు, తెలుగు సినిమాకు అప్పటి జనాలు ఏ తీరున బ్రహ్మరథం పట్టేవారో సోదాహరణంగా వివరించారు.

తొలి భారతీయ చలనచత్రం 'ఆలం ఆరా' కాగా, తొలి తెలుగు చిత్రం కాళిదాస్ అని తెలిపారు. అందరూ అనుకునే విధంగా తొలి తెలుగు చిత్రం 'భక్త ప్రహ్లాద' కాదని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. కాళిదాస్ చిత్రంలో నటించిన టీ పీ రాజలక్ష్మీ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆధారాలను చూపించారు. తొలి తమిళ, తెలుగు చిత్రంగా కాళిదాస్ తెరకెక్కిందని,అందులోని మూడు త్యాగరాజ కీర్తనలే తొలి తెలుగు సినిమా పాటగా చెప్పారు. 'ఎంతరానీ, తనకెంత పోనీ నీ చింత విడువజాల శ్రీరామ' అంటూ త్యాగరాజ కీర్తన తెలుగు సినిమా పాటగా మనకు వినపడిందని పేర్కొన్నారు. అయితే ఆ తరువాత వచ్చిన 'భక్త ప్రహ్లాద' చిత్రం సంపూర్ణ తెలుగు చిత్రమని తెలిపారు. అప్పట్లో తొలి టాకీ చిత్రాలకు సంబంధించిన రీళ్ల్ఱ బాక్సులకు జనాలు బ్రహ్మరథం పట్టేవారని పేర్కొన్నారు. తన పరిశోధనల్లో లభ్యమైన ఆధారాల మేరకు గులాబీ పూలతో రీలు బాక్సులకు స్వాగతం చెప్పేవారని వెల్లడించారు.

దక్షిణాదిన సినిమా మొగ్గతొడిగే సమయంలో దాని రూపురేఖలను ఇట్టే మార్చేసిన వ్యక్తి మన తెలుగువాడైన రఘుపతి వెంకయ్య నాయుడని తెలిపారు. అప్పట్లోనే ఆయన మద్రాసు మౌంట్ రోడ్‌లో తనదైన హవాను కొనసాగించినట్లు చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు. తన కొడుకు చేత లండన్‌లో సినిమా పరిజ్ఞానానికి సంబంధించిన కోర్సులను చదివించి సినిమా తీసిన అంకిత భావం కలిగిన వ్యక్తి రఘుపతి వెంకయ్యనాయుడని అన్నారు. మూకీల కాలం నుంచి టాకీల కాలం వచ్చే వరకు సినిమా వెలుగులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ టాకీ ల తరువాత యావత్ సమాజాన్ని శాసించే స్థాయి సినిమాకు వచ్చేసిందని వివరించారు. ఆంధ్రదేశంలో బెజవాడలో మోతే మారుతీ థియేటర్‌లో తొలి తెలుగు చిత్రం ప్రదర్శింపబడిందని వెల్లడించారు. అప్పట్లో సినిమాకు సంబంధించి ఎలాంటి పబ్లిసిటీ ఉండేది కాదని, అయినా తెలుగు సిని మా పురుడు పోసుకున్న రోజుల నుంచి నేటి వరకు సినిమాకు ఉన్న ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని హర్షం వ్యక్తం చేశారు.
1885 ప్రాంతంలో మహారాష్ట్రలో ప్రాణం పోసుకున్న గాజుస్లైడ్ ప్రదర్శనల దగ్గర నుంచి తోలు బొమ్మలాట, మూకీ, టాకీ, నేటి సినిమా వరకు పలు పరిశోధనలు చేసి సంగ్రహించిన వివరాలను రెంటాల జయదేవ ఆహూతుల ముందు సాక్షాత్కరించారు.

అంతకు ముందు భమిడిపాడి శ్రీకాంత్ ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ చీరాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన సాంబమూర్తి, ప్రసాద్‌లు ఉపన్యాసకుడిని చందనమాల, దుశ్శాలువతో సత్కరించారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డమురారి కొత్త వస్త్రాలను అందజేశారు. నిన్నటి తరం నటుడు ఏచూరి చలపతి రావు రెంటాల జయదేవను ప్రత్యేకంగా సత్కరించారు. వేద విజ్ఞాన వేదిక అధ్యక్షుడు జెకే రెడ్డి ఉపన్యాసకుడి పరిచయ నివేదికను చదివి విన్పించారు. కార్యదర్శి కందనూరు మధు వ్యాఖ్యతగా వ్యవహరించారు. సాహితీ విమర్శకులు వీఏకే రంగారావు, ప్రముఖ కవి డాక్టర్ కాసల కాసలనాగభూషణం, సినీ గేయరచయిత వెన్నెలకంటి, డబ్బింగ్ కళాకారులు ఘంటసాల రత్నకుమార్, ఆస్కా మాజీ అధ్యక్షులు ఆదిశేషయ్య తదితర తెలుగు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి విచ్చేసిన ప్రత్యేక అతిథి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రిటైర్ట్ ఎగ్జిక్యూటివ్ అధికారి పెంచలరెడ్డిని నిర్వాహకులు సభకు పరిచయం చేశారు.

26th November 2012, Monday, Andhra Jyothy Telugu daily, Tamilnadu Edition

 (ఇది 'ఆంధ్రజ్యోతి' తెలుగు దినపత్రిక తమిళనాడు సంచికలో 26 నవంబర్ 2012, సోమవారం నాడు ప్రచురితమైన నా ప్రసంగ వార్త.) 

సమాజాన్ని మార్చే ఆయుధంగా సినిమా




కొరుక్కుపేట, న్యూస్‌లైన్ : సాధారణ మాధ్యమంగా ప్రారంభమైన సినిమా జన జీవన విధానంతో పాటు సమాజాన్ని మార్చగల ఆయుధంగా మారిందని జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడు, నంది అవార్డు విజేత డాక్టర్ రెంటాల జయదేవ అభివర్ణించారు. వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోష ల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారా వాహి క కార్యక్రమంలో తొలి తెలుగు సినీమాట-పాట- కవి అనే అంశంపై ఆదివారం రెంటాల జయదేవ ఉపన్యసించారు. డైలాగులు, పాటలతో వచ్చిన మొట్టమొదటి తెలుగు సినిమా కాళిదాస్ అని పేర్కొన్నారు. ఆ తరువాతనే భక్త ప్రహ్లాద తదితర చిత్రాలు తెలుగు భాషలో వెలుడ్డాయన్నారు.

1882-85 మధ్య కాలంలోనే సినిమా పేరు పెట్టిక ముందే ప్రదర్శన పేరుతో చిత్రాలు ఉండేవన్నారు. అప్పుడు చిన్నపాటి గ్లాజు స్లైడ్‌ల మీద బొమ్మలు గీచి ప్రదర్శించే వారని వివరించారు. ఆ తరువాత ఎన్నో తరాల నుంచి వస్తున్న తోలుబొమ్మలాట మూలంగా కథ చెప్పడం ప్రారంభమైందన్నారు.1896లో లూమియే బ్రదర్స్ రీల్ పద్ధతిలో చిన్న చిన్న సంఘటనలు చిత్రించి చూపిస్తూ వచ్చారని తెలిపారు. 1912లో ఆర్ ‌జీ టోర్నీ అనే వ్యక్తి పుండలీక అనే ప్రదర్శనను చిత్రించి సినిమాగా తీసుకువచ్చారని పేర్కొన్నారు. 1909లో రఘుపతి వెంకయ్య తన స్టూడియోను రూ.40 వేలకు తాకట్టుపెట్టి యంత్రా లు తీసుకువచ్చారని, వాటిని చెన్నై సెంట్రల్ సమీపంలో విక్టోరియా పబ్లిక్ హాలు‌లో అమర్చి చిత్రాలను ప్రదర్శించారని వెల్లడించారు. పరిసర ప్రాంతాలు, సంఘటనల ఆధారంగా సినిమాలను చిత్రించడం ప్రారంభించారని తెలిపారు. 1921లో మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞను రఘుపతి వెంకయ్య రూపొందించారని వివరించారు.

ఆ రోజుల్లో సినిమాల వైపు ప్రజలను ఆకర్షించేందుకు సోడా, కిల్లీలను ఇచ్చేవారని అన్నారు. ప్రకటనల కోసం కరపత్రాలను ముద్రించి పంచేవారని తెలిపారు. ఆ క్రమంలో సినిమాలు సీరియల్స్‌గా వచ్చేవని అన్నారు. సాధారణ మాద్యమంగా తయారైన సినిమా 10 ఏళ్లకే సమాజా న్ని మార్చే ఆయుధంగా మారిందన్నారు. ఆ తరువాత మాట్లాడే చిత్రం తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దృశ్యంతో పాటు, డైలాగులను ఒకేసారి చూపిస్తూ చిత్రించారని వివరించారు. 1931 మార్చి 14న ఆలమారా సినిమాను తొలి భారతీయ టాకీ చిత్రంగా రూపొందించారన్నారు.

దక్షిణ భారతీయ ప్రాంతీయ భాషల్లో తొలి సినిమాగా కాళిదాస్ చిత్రం తీశారని చెప్పారు. ఇక్కడి నుంచే తెలుగు మాట, పాట మొదలైందని పేర్కొన్నారు. అనంతరం రెంటాల జయదేవ్‌ను చీరాలకు చెందిన సాంబమూర్తి, వడ్డిపాటి సుబ్రమణ్యం, ప్రసాద్ చందనమాల, శాలువతో సన్మానించారు. సినీ నిర్మాత, రచయిత కాట్రగడ్డ మురారి, జె.కె.రెడ్డి తదితరులు షీల్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు, ఆదిశేషయ్య, శ్రీనివాసులు రెడ్డి, ఘంటశాల రత్నకుమార్, కాసల నాగభూషణం, వీఏకే రంగారావు తదితరులు పాల్గొన్నారు.

26th November 2012, Monday, Sakshi Telugu daily, Tamilnadu Edition

(ఇది 'సాక్షి' తెలుగు దినపత్రిక తమిళనాడు సంచికలో 26 నవంబర్ 2012, సోమవారం నాడు ప్రచురితమైన నా ప్రసంగ వార్త.) 



తొలి తమిళ, తెలుగు టాకీ కాళిదాస్ - డాక్టర్ రెంటాల జయదేవ













ఇది 'ఈనాడు' తెలుగు దినపత్రిక తమిళనాడు సంచికలో 26 నవంబర్ 2012, సోమవారం నాడు ప్రచురితమైన నా ప్రసంగ వార్త.