జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, August 28, 2013

తెలుగు నాట మహిళా దర్శకులకు మార్గం చూపిన 'చండీరాణి'

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి
తెలుగు సినీ రంగానికి సంబంధించినంత వరకు నటి భానుమతిది ఓ ప్రత్యేక అధ్యాయం. సినీ ప్రముఖులు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలోని 'వర విక్రయము' (1939)లో కాళింది పాత్రతో వెండితెరపైకి వచ్చిన ఆమె తరువాతి కాలంలో కేవలం నటనకే పరిమితం కాలేదు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రిగా బహు పాత్రపోషణ చేశారు. బహుముఖీనమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగు సినీ రంగంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు. ఓ మహిళ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమైన 'చండీరాణి' 1953 ఆగస్టు 28న విడుదలైంది. అంటే, ఆ చిత్రం వచ్చి, ఇవాళ్టికి సరిగ్గా 60 ఏళ్ళయింది. తెలుగు తెరపై మహిళా దర్శకుల శకం ఆరంభమై, ఇవాళ్టితో ఆరు పదుల పండుగ పూర్తవుతున్న వేళ...ఆ చిత్ర విశేషాలు...

ఏమంత ఇష్టం లేకుండానే సినీ రంగానికి వచ్చి, నటిగా ప్రస్థానం ప్రారంభించిన చరిత్ర భానుమతిది. నటనలో వేళ్ళూనుకుంటున్న రోజుల్లోనే 'కృష్ణ ప్రేమ' (1943) తదితర చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న పి.ఎస్‌. రామకృష్ణతో ప్రేమలో పడ్డారు. వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట తరువాత 'భరణీ' పతాకంపై స్వీయ చిత్ర నిర్మాణానికీ దిగింది. 'లైలా మజ్ను' లాంటి హిట్లూ, 'ప్రేమ' లాంటి ఫ్లాపులూ తీసింది. అప్పటికే, తెలుగు, తమిళాల్లో భానుమతి స్టార్‌ హీరోయిన్‌. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఆమె దర్శకురాలయ్యారు.
అనుకోని దర్శకత్వంతో అరుదైన రికార్డు
'ప్రేమ' చిత్రం విడుదలైన రోజుల్లో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, ప్రస్తావవశాత్తూ రామకృష్ణ ఓ జానపద కథను భానుమతికి వినిపించారు. ఆ కథ ఆమెకు నచ్చింది. వెంటనే, ఆ కథను వెండితెర కెక్కించేందుకు దర్శకత్వ బాధ్యత కూడా చేపట్టమంటూ భార్యను ప్రోత్సహించారు రామకృష్ణ. వెంట ఉండి, పని మొత్తాన్నీ తాను పర్యవేక్షిస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ జానపథ కథే వెండితెర మీద 'చండీరాణి'గా వచ్చింది. తీరా ఈ సినిమా తీసే సమయానికి బయటి చిత్ర నిర్మాణ సంస్థకు 'బ్రతుకు తెరువు' సినిమా దర్శకత్వం వహిస్తూ, రామకృష్ణ బిజీగా ఉన్నారు.

దాంతో, భర్త పర్యవేక్షణ లేకుండానే భానుమతి బాధ్యతలన్నీ భుజానికెత్తుకొని, ఆ ఇతివృత్తాన్ని సినిమా కథగా విస్తరించుకొని, ఎన్టీయార్‌ను కథానాయకుడిగా ఎంచుకొని, చండీరాణిగా, చంపగా తాను రెండు పాత్రలు పోషిస్తూనే, దర్శకురాలిగా అవతరించారు. ఆ సినిమా ఎడిటింగ్‌ బాధ్యతలు మాత్రం ఆయన నిర్వహించారు.
ఏకంగా తెలుగు, తమిళ, హిందీ భాషలు మూడింటిలో ఈ చిత్రం రూపొందింది. అంతేకాక, మూడు భాషల్లోనూ ఒకే రోజున (1953 ఆగస్టు 28న), దేశవ్యాప్తంగా విడుదలైంది. అది అప్పటికీ, ఇప్పటికీ చెరిగిపోని ఓ అరుదైన ఘనత. అలా 'చండీ రాణి'తో ఏకకాలంలో మూడు భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, ఆ మూడు వెర్షన్లలోనూ ద్విపాత్రాభినయం చేస్తూ, కథను తానే రాసుకొని, స్వరరచనకు పర్యవేక్షకురాలిగా వహించిన తొలి మహిళగా భానుమతి రికార్డు సృష్టించారు. అది ఇప్పటికీ చెరిగిపోని రికార్డు.
కలిసొచ్చిన హిందీ వెర్షన్‌
అసలు మొదట్లో 'చండీరాణి' చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళాల్లో తీయాలనుకున్నారు. అప్పటికే, తెలుగు, తమిళాల్లో జెమినీ వారు హీరో ఎం.కె.రాధా ద్విపాత్రాభినయంతో 'అపూర్వ సహౌదరులు' (1950) చిత్రం తీశారు. అలెగ్జాండర్‌ డ్యూమాస్‌ ప్రసిద్ధ నవల 'కార్సికన్‌ బ్రదర్స్‌', దాని ఆధారంగా వచ్చిన హాలీవుడ్‌ చిత్రం స్ఫూర్తితో ఆ సినిమా వచ్చింది. అది విజయవంతమైంది. ఆ సినిమాను వారే హిందీలో 'నిశాన్‌'గా రీమేక్‌ చేసి, అక్కడా విజయం సాధించారు. ఆ నేపథ్యంలో హీరో బదులు హీరోయిన్‌ డ్యుయల్‌ రోల్‌ అయితే, ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభావం 'చండీ రాణి' ఇతివృత్తానికి బీజం అనుకోవచ్చు.'నిశాన్‌' ప్రేరణతోనో ఏమో వ్యాపార రీత్యా కూడా బాగుంటుందని 'చండీరాణి' హిందీ వెర్షన్‌ను కూడా తీశారు. 
తారాగణంలో ఒకటి, రెండు మార్పులు చేసినప్పటికీ, హీరో మాత్రం తెలుగు, తమిళ, హిందీ రూపాలు మూడింటిలోనూ ఎన్టీయారే! అప్పటికే, 'పాతాళ భైరవి' హిందీ రూపం (1952)లోనూ నటించిన అనుభవం ఎన్టీయార్‌కు ఉంది. అయితే, హిందీ వెర్షన్‌లో ఎన్టీయార్‌ బదులు ఓ హిందీ తారను పెట్టాలని మొదట్లో భావించారట. కానీ, చివరకు ఆ ఆలోచన మానుకున్నారట! హాస్యనటుడు రేలంగి బదులు హిందీ వెర్షన్‌లో మాత్రం అక్కడి పాపులర్‌ కమెడియన్‌ ఆఘాను నటింపజేశారు.
విశేషం ఏమిటంటే, మద్రాసులో సొంత స్టూడియో కట్టుకోవాలని భానుమతి, రామకృష్ణలు భావించినా, అప్పటికి ఆ కల నెరవేర్చుకోలేకపోయారు. ఈ 'చండీరాణి' హిందీ వెర్షన్‌కు పంపిణీదారుల నుంచి వచ్చిన అడ్వాన్సు మొత్తం పుణ్యమా అని, వారు కోడంబాకమ్‌ ప్రాంతంలో 'భరణీ స్టూడియో' నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగారు.
అందరి కృషితో అలరించిన కథనం
రాజు గారికి పుట్టిన కవల కూతుళ్ళు చిన్నప్పుడే సేనాధిపతి ద్రోహంతో విడిపోవడం... ఒకరు అడవుల్లో ధైర్యశాలిగా, మరొకరు రాజ్యంలో సుకుమారంగా పెరగడం... సేనాధిపతి చేతిలో మరణించిన మంత్రిగారి కుమారుడు తన తండ్రికి జరిగిన ద్రోహానికి కక్ష తీర్చుకోవాలని అనుకోవడం... విడిపోయిన కవల సోదరీమణులిద్దరూ కలిసి, అందుకు సహకరించడం... ఆఖరుకు విలన్‌ను హతమార్చడం, కవలల్లో ధైర్యశాలి చనిపోవడం, మిగిలిన హీరోయిన్‌కూ, హీరోకూ వివాహం - ఇదీ టూకీగా 'చండీరాణి' ఇతివృత్తం. 
కథగా చూస్తే, 'చండీరాణి'లో కొత్తదనం ఏమీ లేదు. అయితే, ఆ కథను తెరపై చెప్పిన రీతిలో నవ్యత ఉంది. చండీరాణిగా హీరోయిన్‌ కత్తి యుద్ధాలు చేయడం, పులితో పోరాటం, కవల సోదరీమణులు ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్ళడం లాంటివన్నీ అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి.
'చండీరాణి'లో భానుమతి, ఎన్టీయార్
'పాతాళ భైరవి' (1951) హిట్‌ తరువాత తారాపథంలో దూసుకుపోతున్న ఎన్టీయార్‌ తన అందం, అభినయం, అలవాటైన జానపద ఆహార్యంతో ఆకట్టుకున్నారు. కవలలైన చండిగా, చంపగా నటించిన భానుమతి ఎక్కువ భాగం దృశ్యాల్లో కనిపించాలి కాబట్టి, ఆమె కెమేరా ముందు నటనతో బిజీగా ఉన్నప్పుడల్లా, దర్శకత్వంలో ఆమెకు అసోసియేట్‌ అయిన పి.వి. రామారావు (తరువాతి రోజుల్లో ఏయన్నార్‌ నటించిన 'భక్త జయదేవ' దర్శకుడు) చిత్రీకరణ బాధ్యత అంతా నిర్వహించారట! సముద్రాల రాఘవాచార్య మాటలు, పాటలు రాశారు. 
సినిమా సగంలో ఉండగానే సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ మరణించడంతో, స్వతహాగా గాయని అయిన భానుమతి పర్యవేక్షణలో సుబ్బురామన్‌ సహాయకుడు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ బాణీలు కట్టారు. ఆ బాణీల్లో 'ఓ తారకా...ఓ జాబిలీ..' పాట చిరకాలంగా జనంలో నిలిచింది. భానుమతి పాడిన సోలో పాటలు సరే సరి! 
ఇక, కళా దర్శకుడు ఏ.కె. శేఖర్‌, ఈ చిత్రంతో ఛాయాగ్రాహకుడిగా రంగప్రవేశం చేసిన పి.ఎస్‌. సెల్వరాజ్‌ తదితరుల పనితనం సినిమాకు అండగా నిలిచింది. 'చండీరాణి' కొన్ని చోట్ల విజయవంతంగానూ, మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగానూ ఆడింది. అయితేనేం, నిర్మాతలకు మాత్రం లాభాలే తెెచ్చిపెట్టింది. తెలుగు దర్శక, నిర్మాతలు ఏకకాలంలో తీసిన తొలి త్రిభాషా చిత్రంగా చరిత్రలో నిలిచింది.
ఆమె బాటలో ఆ తరువాతెందరో...
హిందీ 'పాతాళభైరవి', 'చండీరాణి' తరువాత ఎన్టీయార్‌ తన కెరీర్‌ మొత్తంలో మరో రెండు హిందీ చిత్రాల్లోనే నటించారు. ఒకటి - తమిళ రూపం 'వేలైక్కారి', తెలుగులో ఎన్టీయార్‌ 'సంతోషం' (1955 డిసెంబర్‌ 22) చిత్రాలకు రీమేకైన 'నయా ఆద్మీ' (1956 ఏప్రిల్‌ 6). మరొకటి - ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చాక, కెరీర్‌ చివరలో తీసిన పౌరాణిక చిత్రం 'బ్రహ్మర్షి' (1992 - తెలుగులో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'). 
'చండీరాణి'తో అనుకోకుండా దర్శకురాలైన భానుమతి ఆ తరువాతి కాలంలో 'అంతా మన మంచికే!', 'విచిత్ర వివాహం', 'అమ్మాయి పెళ్ళి', 'మనవడి కోసం', 'రచయిత్రి', 'అసాధ్యురాలు' తదితర చిత్రాలకు నిర్దేశకత్వం వహించారు. అందరూ బాల నటీనటులతో, 'భక్త ధ్రువ - మార్కండేయ' అనే ప్రయోగం చేశారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలతో పాటు కళా దర్శకత్వ, ఎడిటింగ్‌ శాఖలను పర్యవేక్షించి, సంగీతంలో ఎస్‌. రాజేశ్వరరావుకు సహకరించి, స్వీయ దర్శకత్వంలో ఆ ప్రయోగం చేయడం ఆమె సాహసానికి నిదర్శనం. 
వందకు పైగా చిత్రాల్లో నటించి, ఎన్నింటినో నిర్మించి, 'పద్మభూషణ్‌' పురస్కారం స్థాయికి ఎదిగిన భానుమతి సినీ రంగంలో, అందులోనూ దర్శకత్వ శాఖలో చూపిన బాట ఆ పైన మహిళలు మెగాఫోన్‌ పట్టుకొనేందుకు ప్రేరణనిచ్చింది. సావిత్రి నుంచి విజయనిర్మల తరం మీదుగా జీవిత, ఇవాళ్టి బి. జయ, నందినీ రెడ్డి దాకా ఎంతోమంది ఆమె బాటలో వచ్చారు. పురుషాధిక్య సినీ రంగంలోనూ స్త్రీలు విజయాలు సాధించగలరని చేతల్లో చూపారు. ఆరు దశాబ్దాల క్రితం ఆ ధోరణికి తెలుగులో నాంది పలికిన చిత్రంగా 'చండీరాణి' ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
- రెంటాల జయదేవ
............................................................................

Monday, August 26, 2013

ముందు ఓ.కె! ఆ తరువాతే... ('అంతకుముందు... ఆ తరువాత' - సినిమా సమీక్ష)


ప్రేమ, పెళ్ళి - తెలుగు సినిమాకు ప్రధానమైన ముడిసరుకులు. వాటి చుట్టూ అల్లుకున్న కథలతో లెక్కలేనన్ని చిత్రాలు వచ్చాయి. ప్రేమకు పర్యవసానం పెళ్ళిగా చూపించిన దశ నుంచి పెళ్ళి తరువాత కూడా ప్రేమ ఉంటుందా, లేదా అని చర్చించే దశకు కథలు మారాయి. రేపు పెళ్ళయిన తరువాత కూడా అభిరుచులు కలుస్తాయా, లేదా అన్న సందేహంతో, పెళ్ళికి ముందే భార్యాభర్తలుగా ఇద్దరు ప్రేమికులు సహజీవనం చేస్తే? ఈ వినూత్న ఇతివృత్తంతో వచ్చిన చిత్రం - ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోని 'అంతకు ముందు... ఆ తరువాత...' కాస్త అటూ ఇటూ బెసిగితే, అశ్లీలమైపోయే ప్రమాదమున్న కత్తి మీద సాము లాంటి కథను తీసుకొని, అసభ్యతకు తావు లేని రీతిలో ఆయన చేసిన ప్రయత్నం
నిదానంగా సాగే... ఈ చిత్రం. 
.......................................................
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, ఈషా, మధుబాల, రవిబాబు, రావు రమేశ్‌, రోహిణి, అవసరాల శ్రీనివాస్‌, సంగీతం: కల్యాణి కోడూరి, ఛాయాగ్రహణం: పి.జి. విందా, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌, నిర్మాత: కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ 
..............................................................................
ఆధునిక సమాజంలో పెరిగిన వేగం వ్యక్తుల మధ్య సంబంధాలు, అనుబంధాలలో కూడా గతంలో లేని అనూహ్యమైన మార్పులు తెచ్చింది, తెస్తోంది. కుటుంబ, వైవాహిక బంధాలు కూడా ఆ మేరకు గణనీయంగా ప్రభావితమయ్యాయి. ఆ పరిస్థితుల నేపథ్యంలో తీసిన సినిమా ఇది.
కథ: 
రాజమండ్రి దగ్గర పెద్దయెత్తున పువ్వుల ఎగుమతి చేసే వ్యాపారవేత్త (రావు రమేశ్‌), అతని భార్య సుజాత (రోహిణి)ల కుమారుడు అనిల్‌ (సుమంత్‌ అశ్విన్‌). హైదరాబాద్‌ వచ్చిన హీరో, అక్కడ చిత్రకారిణి అనన్య (ఈషా - తొలిపరిచయం)తో ప్రేమలో పడతాడు. టీవీ కార్యక్రమాల రూపకర్త శ్రీధర్‌ (రవిబాబు), యోగా క్లాసులు నిర్వహించే కల్పన (మధుబాల)ల కుమార్తె అయిన సదరు హీరోయిన్‌ను కూడా తన ప్రేమలో పడేస్తాడు.
డేటింగులకూ తిరిగిన ఈ జంటకు తమ తల్లితండ్రులు వారి వైవాహిక జీవితంలో పడుతున్న ఘర్షణను చూశాక, సందేహం వచ్చేస్తుంది. పెళ్ళయ్యాక కూడా తమ మధ్య ఇదే ప్రేమ ఉంటుందా, అసలు తమ ఇద్దరికీ పొంతన కుదిరిందా అన్నది తెలుసుకోవాలని ఈ యువ ప్రేమికుల జంట భావిస్తుంది. దాంతో, పెళ్ళి కాకుండానే, వైవాహిక జీవితానికి డెమో వెర్షన్‌ లాగా 'అమ్మా నాన్నల ఆట' ఆడాలని వారిద్దరూ నిర్ణయించుకుంటారు. అక్కడికి ఫస్టాఫ్‌ అవుతుంది. 
ఆ తరువాత వారి జీవితం ఏ మలుపులు తిరిగింది, వారి తల్లితండ్రుల జీవితాలు ఏమయ్యాయన్నది మిగతా సినిమా.


అభినయం: 
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు కుమారుడైన సుమంత్‌ అశ్విన్‌కు హీరోగా ఇది రెండో సినిమాయే! 'తూనీగా... తూనీగా...'లో కన్నా కొంత మెరుగైన ఈ యువ హీరో భావ వ్యక్తీకరణను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, తెలుగమ్మాయి ఈషా గతంలో మాడల్‌గా వ్యవహరించినా, వెండితెరపై కథానాయికగా ఇదే ఆమె తొలి సినిమా. తొలి యత్నంలో ఫరవాలేదనిపించినా, ముందు ముందు నటిగా తనను తాను ఎలా మలుచుకుంటారో చూడాలి. కొడుకుతో బాధను పంచుకొనే సన్నివేశాల లాంటి చోట్ల తేలిపోయినా, హీరో తండ్రిగా రావు రమేశ్‌ ఆ రకం పాత్రలకు భవిష్యత్‌ చిరునామాగా స్థిరపడ్డారనుకోవచ్చు.
'రోజా' ఫేమ్‌ మధుబాల చాలా కాలం తరువాత దక్షిణాది తెరపై మెరిసిన సినిమా ఇది. కానీ, ఆమె వల్ల పాత్రకు కానీ, పాత్ర వల్ల ఆమెకు కానీ వచ్చిన అదనపు ప్రయోజనం కనిపించదు. భర్తతో ఆమె ఘర్షణ పడి, నిలదీసే సన్నివేశం, సంభాషణలు బాగున్నాయి. హీరోయిన్‌ తండ్రి పాత్రలో రఘుబాబు, హీరో తల్లిగా రోహిణి లాంటి వారికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.
ప్రత్యేకంగా కామెడీ ట్రాక్‌లంటూ లేని ఈ చిత్రంలో హీరో మిత్రుడిగా అవసరాల శ్రీనివాస్‌ డైలాగులు, నటనే ఉన్నంతలో వినోదం పంచుతాయి. సరుకుల షాపులో బిల్లు చేసే వ్యక్తిగా 'తాగుబోతు' రమేశ్‌ చాలా రోజుల తరువాత మద్యం వాసన లేని పాత్రలో అలరించారు. పువ్వుల వ్యాపారంలా కాక, కార్పొరేట్‌ కంపెనీలా అనిపించే హీరో ఆఫీసు వాతావరణాన్ని కూడా వినోదానికి వినియోగించుకొనేందుకు దర్శకుడు ప్రయత్నించారు.
సాంకేతిక విభాగాలు: 
కల్యాణీ మాలిక్‌ కాస్తా కల్యాణి కోడూరిగా పేరు మార్చుకొని, సంగీతమిచ్చిన ఈ చిత్ర బాణీల్లో పాటల సాహిత్యం శుద్ధంగా వినిపిస్తుంటుంది. వింజమూరి సిస్టర్స్‌ ద్వారా పాపులరైన జానపద గీతాల ఫక్కీలో 'ఈ బంతి వడ్డించి పోవే...' లాంటి పెళ్ళి పాటను ప్రస్తావించి, ఆ బాణీలో 'ఏ ఇంటి అమ్మాయివే...' అంటూ పాట పెట్టడం దర్శక, సంగీత దర్శకుల అభిరుచికి నిదర్శనం. 'తేనె ముల్లులా...' పాట శ్రావ్యంగా, 'ఓయ్ కనిపెట్టెయ్ కొత్త ఫార్ములా...' వేగంగా ఆకట్టుకుంటాయి.  
కొద్దిమంది నటీనటులు, పరిమితమైన లొకేషన్లే అయినా పి.జి. విందా కెమేరా తెర మీది దృశ్యాలను రిచ్‌గా చూపెట్టింది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ మాత్రం తన కత్తెరకు మరికొంత పదును పెడితే, ద్వితీయార్ధం వేగంగా గడిచేది. 

సంభాషణలు: 

ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది డైలాగులు.  కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి. ''వేటాడడం ఎలాగని చిట్టెలుకని చిరుతపులి అడిగిందట'', ''ఆడదాని కోసం మగాడు పెళ్ళిని భరిస్తాడు. పెళ్ళి కోసం ఆడది మగాణ్ణి భరిస్తుంది'', ''గ్యారెంటీ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడన్నీ వారెంటీ రోజులు'' (హీరోతో అతని స్నేహితుడు) లాంటివి థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. 

''మగాడి వంట మరిగిన ఆడది, మనిషి రక్తం రుచి మరిగిన పులి లాంటిది'' లాంటి పురుషాధిక్య భావజాల సంభాషణలూ సరదా ముసుగు మాటున వినిపిస్తాయి. 

''అశాంతిగా ఇద్దరం కలిసి బతికే కన్నా ప్రశాంతంగా ఒంటరిగా ఉండడం బెస్ట్'' (హీరోయిన్ తల్లి పాత్రధారిణి మధుబాల), ''మన జీవితంలో ఎంతో ముఖ్యమైన, కావాల్సిన మనుషులు మనం ఏం చేసినా పడి ఉంటారనుకోకు. దెబ్బ తింటావు నా లాగా'' (హీరోయిన్ తో ఆమె తండ్రి) లాంటి వివాహ బంధాన్ని చర్చించే డైలాగుల్లో కొన్ని ఆలోచింపజేస్తాయి.
బలాబలాలు: 
ఇప్పుడు ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్ళయిన తరువాత కూడా ఆ ప్రేమ కలకాలం నిలుస్తుందా అన్న సందేహం వచ్చిన ప్రేమికులుగా కథానాయికా, నాయకుల పాత్రలను దర్శకుడు సమర్థంగా తీర్చిదిద్దారు. వాళ్ళ మధ్య ప్రేమానుభూతుల సన్నివేశాలను కూడా శ్రుతి మించకుండా, సున్నితంగా తెరకెక్కించారు. సాధారణంగా ప్రేయసీ ప్రియుల మధ్య తలెత్తే సందేహాలనూ, 'ఇగో' తగాదాలనూ ఆ పాత్రల మధ్య చూపెట్టారు. 
ఇలాంటి ఇతివృత్తాలు దొరికితే చాలు, 'యూత్‌ ట్రెండ్‌' అంటూ సినిమాను బూతుల బుంగగా మార్చేస్తున్న కొంతమంది నవతరం దర్శక, నిర్మాతలకు భిన్నమైన పంథాలో పయనించినందుకు మోహనకృష్ణను అభినందించాలి. 'అలా మొదలైంది..'తో మళ్ళీ అభిరుచి గల చిత్రాలతో ఓ కొత్త ప్రస్థానం ప్రారంభించి, ఈ సినిమాతో దాన్ని కొనసాగించిన శ్రీరంజిత్‌ మూవీస్‌ అధినేత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌కు కూడా ఆ ప్రశంసల్లో వాటా ఇవ్వాలి.
 అయితే, సినిమాలో వాదనలను సిద్ధాంతీకరించే ప్రయత్నంలో పాత్రల మధ్య చర్చల నిడివి కొన్ని చోట్ల బాగా పెరిగింది. అలా రెండు పాత్రల మధ్య భావ సంఘర్షణ కాస్తా డైలాగ్‌ వార్‌ లాగా మారింది. దృశ్య మాధ్యమమైన సినిమా కాస్తా నవల, నాటకాల పద్ధతిలోకి వచ్చేసిందనిపిస్తుంది. వాటిని సినిమాకు తగ్గట్లు కొంత తగ్గించుకొని ఉంటే బాగుండేది.
తల్లితండ్రులకు తెలియకుండా, అనుమానం రాకుండా హీరోయిన్‌ రెండు నెలల పాటు అదే ఊళ్ళో ఇంటికి దూరంగా ఎలా ఉండగలిగిందన్నదీ తెలియదు. ఇక, మధుబాల పోషించిన హీరోయిన్‌ తల్లి పాత్ర అంత చటుక్కున విడాకుల నిర్ణయానికి రావడానికీ, ఆ పైన హీరో చెప్పగానే మనసు మార్చుకోవడానికీ బలమైన భూమిక లేదు. హీరో తల్లి పాత్ర త్యాగానిదీ అంతే! మొత్తం మీద కై ్లమాక్స్‌కు వచ్చేసరికి అన్ని పాత్రలనూ ఓ సానుకూల కోణంలో చూపి, కథను కంచికి చేర్చాలన్న దర్శకుడి ఆదుర్దా కనిపించింది.
ఇంటర్వెల్‌కు ముందు ఓ.కె. అనిపించినా, ఆ తరువాతి కథలో కనిపించే ఇలాంటి లోటుపాట్లు పంటి కింద రాళ్ళవుతాయి. వాటి సంగతి అటుంచితే, మొత్తం మీద మాత్రం సినిమా అసంతృప్తి కలిగించదు. చాలా కాలం తరువాత అసభ్యత లేకుండా వచ్చిన కుటుంబ కథగాఈ చిత్రం నిలుస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న, చేసుకోలేకపోయిన చాలా జంటలకు తమ కుటుంబ జీవితపు తొలి రోజులను గుర్తు చేసి, వారి మనసులు గెలుస్తుంది. 
- రెంటాల జయదేవ
(Published in "Praja Sakthi" daily, 25th Aug 2013, Sunday)
......................................................................

Saturday, August 24, 2013

అసంబద్ధమైన కథాకథనం ('1000 అబద్ధాలు' సినిమా సమీక్ష)


పదమూడేళ్ళ క్రితం 'చిత్రం'(2000) తో మొదలుపెట్టి, వరుసగా ప్రేమ కథా చిత్రాలతో విజయాలు సాధిస్తూ, కొత్త సహస్రాబ్దిలో తెలుగు సినిమాను మలుపు తిప్పిన యువ దర్శకుడు తేజ. అయితే, సమష్టి కృషితో విజయాలు అందించిన ఆయన టీమ్‌లో ఒక్కొక్కరూ దూరమవడం, విజయాలు కరవవడం గడచిన కొన్నేళ్ళుగా ఆయనను బాధిస్తున్న అంశం. 'ఒక 'వి'చిత్రం', 'కేక', 'నీకూ నాకూ డ్యాష్‌ డ్యాష్‌' - ఇలా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శక - సినిమాటోగ్రాఫర్‌ సర్వశక్తులూ కూడగట్టుకొని చేసిన తాజా ప్రయత్నం - '1000 అబద్ధాలు'. అలవాటైన ప్రేమ కథల కోవ నుంచి కాస్తంత పక్కకు జరిగి, వినోదానికి పెద్ద పీట వేస్తూనే, ప్రేమ, పెళ్ళి అనే అంశాల చుట్టూ తిరిగే కథాంశాన్ని ఈసారి ఆయన ఎంచుకున్నారు. కానీ, ఈ తాజా ప్రయత్నం బాగుంటుందన్న ఆయన హామీ మాత్రం వెయ్యిన్నొకటవ అబద్ధంగా మిగిలింది.
...................................................................................................
చిత్రం - 1000 అబద్ధాలు, తారాగణం - సాయిరామ్ శంకర్, ఎస్తేర్, నరేశ్, హేమ, గౌతంరాజు, సంగీతం - రమణ గోగుల, ఛాయాగ్రహణం - రసూల్ ఎల్లోర్, నిర్మాత - పాలడుగు ప్రభాకర్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - తేజ
..................................................................................................
కథానాయిక సత్య (ఎస్తేర్‌)ను పెళ్ళి చూపులు చూడడానికి అమెరికా నుంచి ఓ డాక్టర్‌ వస్తాడు. అతగాడు అన్యాయంగా మాదక ద్రవ్యాల కేసులో పోలీసులకు దొరుకుతాడు. ఈ పెళ్ళి చెడగొట్టింది సత్య (హీరో సాయిరామ్‌ శంకర్‌ పేరు కూడా సత్యానే!) అని కథానాయిక, ఆమె తల్లి (హేమ) తదితరులు అతని మీదకు వెళతారు. విడాకులు తీసుకున్నా సరే, కథానాయికే తన భార్య అంటూ, ఆమెను మరెవరికైనా ఇచ్చి పెళ్ళి చేస్తే ఊరకొనేది లేదంటూ కథానాయకుడు అంటాడు. అప్పటికే, హీరో, హీరోయిన్లకు పెళ్ళయి, విడాకులా అని ప్రేక్షకులు ఆశ్చర్యపడుతుండగా, ఆ ఫ్లాష్‌బ్యాక్‌ను లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణికులకు హీరో చెప్పడంతో కథ మొదలవుతుంది.
వేరెవరితోనే నిశ్చితార్థం అయిపోయిన కథానాయికను ప్రేమిస్తాడు కథానాయకుడు. ఆమె ప్రేమను పొందడం కోసం నానా అబద్ధాలూ ఆడతాడు. చివరకు నిశ్చయమైన పెళ్ళిని కాదనుకొని, హీరోను పెళ్ళి చేసుకుంటుంది హీరోయిన్‌. తీరా ఓ సందర్భంలో అతను ఓ పథకం ప్రకారం ఎన్నో అబద్ధాలు ఆడి, తనను పెళ్ళి చేసుకున్నాడని తెలిసి, ఆమె మనసు విరిగిపోతుంది. విడాకులు తీసుకుంటుంది. తీరా, కొన్నాళ్ళకు తన స్నేహితురాలికి ఎదురైన సమస్యకు పరిష్కారం కోసం మళ్ళీ హీరోనే ఆశ్రయిస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడు, వారిద్దరూ మళ్ళీ ఒకటయ్యారా, లేదా లాంటి ఘట్టాలన్నీ మిగతా సినిమా.


తాము నిజంగా ప్రేమిస్తున్నది ఎవరిని, పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నది ఎవరిని అన్న విషయంలో ఈ సినిమాలోని పాత్రలకు స్పష్టత ఉన్నట్లు తోచదు. అసలు ఈ కథా రచయిత అయిన దర్శకుడికైనా ఆ క్లారిటీ ఉందా అంటే అనుమానమే. ఈ కథలోని పాత్రల ప్రవర్తనలో ఉన్న గందరగోళం సహజంగానే సినిమా కథనంలోకి కూడా యథాశక్తి జొరబడింది. మొదట కాసేపు సినిమా ఆసక్తికరంగా అనిపించినా, ఫస్టాఫ్‌ సగమయ్యే సరికల్లా ఆ బిగి పోతుంది. సెకండాఫ్‌ వచ్చే సరికి మరీను! చివరి అరగంట సినిమా అయితే, ఏ క్షణం సినిమా అయిపోతుందా అని ప్రేక్షకుడు సహనంతో నిరీక్షించడమే!
మధ్యలో 'బంపర్‌ ఆఫర్‌' లాంటి విజయం లభించినా, కెరీర్‌ తొలి రోజుల్లో వచ్చిన '143' లాంటి సినిమాలప్పటి నటనా స్థాయినే ఇన్నేళ్ళ తరవాత కూడా హీరో సాయిరామ్‌ శంకర్‌ కొనసాగిస్తున్నారు. మరింకెన్నాళ్ళకు ఆయన తన హావభావ ప్రకటననూ, డైలాగ్‌ డెలివరీనీ మెరుగుపరుచుకుంటారో కాలమే జవాబు చెప్పాలి. బహుశా ఆయనకు కూడా తెలియకపోవచ్చు. గతంలో రీమాసేన్‌, రైమాసేన్‌, తదితరుల లాగానే ఈ చిత్రం ద్వారా నూతన నటి ఎస్తేర్‌ను తెలుగు తెర మీదకు తెచ్చారు - దర్శకుడు తేజ. క్లోజప్‌లో కన్నా మిడ్‌, లాంగ్‌షాట్‌లలోనే బాగుందనిపించే ఆమె నుంచి అభినయం ఆశించడానికేమీ లేదు. ఈ సినిమాలోని మరో ముఖ్యమైన పాత్ర - 'అయామ్‌ టవర్‌ స్టార్‌... ఫ్యాన్‌ ఆఫ్‌ పవర్‌ స్టార్‌' అనే పాత్రలో నాగబాబు విలక్షణంగా కనిపించారు. ఆయన తన రొటీన్‌ పాత్రలకు భిన్నమైన ఈ వేషంలో చక్కగా ఇమిడిపోవడమే కాక, కావాల్సినంత వినోదం పంచారు.
హీరో బామ్మగా పాత తరం నటి గీతాంజలి, హీరోయిన్‌ తల్లితండ్రులుగా హేమ, సీనియర్‌ నటుడు నరేశ్‌, పాన్‌డబ్బా నడిపేవాడి పాత్రలో 'సత్యం' రాజేశ్‌ మొదలైన గుర్తింపున్న నటీనటులు, హాస్య పాత్రధారులు సినిమాలో చాలామందే ఉన్నారు. కానీ, ఆ పాత్రలన్నీ కథలో భాగంగా వచ్చి వెళిపోతుంటాయి. 'కొను... ఏదైనా కొను' అంటూ రాజేశ్‌ మాత్రం మొదటి రెండు, మూడు సార్లు నవ్విస్తాడు. సీనియర్ నటుడు నరేశ్ కు ఎందుకనో వేరెవరి చేతో డబ్బింగ్ చెప్పించారు దర్శకుడు తేజ. సుపరిచిత నటుడు కావడంతో, ఆ డబ్బింగ్ వేరెవరిదో గొంతన్న సంగతి తెలిసిపోతూ, ప్రేక్షకులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
సాంకేతిక శాఖల్లో రసూల్‌ ఎల్లోర్‌ ఛాయాగ్రహణం బాగుంది. విజయాల కోసం ఎదురుచూస్తున్న సంగీత దర్శకుడు రమణ గోగుల చాలాకాలం తరువాత వినిపించిన బాణీలు కూడా సో...సో..! ఉన్నంతలో, ద్వితీయార్ధంలో వచ్చే మొదటి పాట 'కొంటె కొంటె చూపుల్తోనే...' ఎత్తుగడ, పల్లవి, మొదట కాసేపు బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సాగిన విధానం కొంత బాగుందనిపిస్తుంది.
కథ, మాటల క్రెడిట్‌ కూడా తానే తీసుకున్న తేజ సినిమాలో అక్కడక్కడా సినిమా పరిశ్రమపై విసుర్లు విసిరారు. 'ప్రకాశ్‌రాజ్‌ కనిపించడం లేదా? అయితే, తెలుగు ఇండిస్టీకి మంచిది' (ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో పోలీసు), 'నిన్నటి దాకా హాలీవుడ్‌ సినిమాలు ఆలోచించలేదా? ఇవాళ కొరియన్‌ సినిమాలు ఆలోచించలేదా? వాళ్ళేమో ఏడాదికి 20 సినిమాలే తీస్తున్నారు. మనమేమో వంద సినిమాలు తీయాలి. ఎక్కడ నుంచి వస్తాయి కొత్త కథలు?' (రైలులో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌) లాంటి చెణుకులు బాగున్నాయి. సెల్‌ఫోన్‌ వాడకాన్ని బట్టి ఆడవాళ్ళ మన:స్థితినీ, ఏ వయసులో ఎందుకు తాగుతారనే విశ్లేషణనూ చెప్పే ఇంటర్నెట్‌ జోక్‌ల ఫక్కీ డైలాగులు హాలులో కాసేపు నవ్విస్తాయి. పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పృథ్వీరాజ్‌, కెమేరాల ముందు అతని ప్రెస్‌ మీట్ల పిచ్చి కూడా కాస్తంత వినోదమే!
అయితే, సినిమాలో అక్కడక్కడా వచ్చే ఈ మెరుపులే తప్ప, మిగిలిన సన్నివేశాలు, సంఘటనలు, కామెడీ కూడా బలవంతాన తెచ్చిపెట్టినట్లు, కృత్రిమంగా అనిపిస్తాయి. ''మనం ఆడే అబద్ధాలు మన చుట్టూ ఉన్నవాళ్ళకు చిన్న చిన్న సంతోషాలిస్తే, అందులో తప్పేమీ లేదు'' అంటూ హీరోయిన్‌కు హీరో ఉపన్యాసం దంచుతూ, 'నువ్వూ అబద్ధాలు ఆడావం'టూ ఆమెకు ఏవేవో చెప్పే ఘట్టం ఓ ఫార్సు! ఏమైనా, పాత్రల ప్రవర్తనతో పాటు సన్నివేశాల కల్పనలో కూడా దర్శక, రచయిత అబద్ధాన్నే ఆశ్రయించడం ఈ సినిమా టైటిల్‌కు పెద్ద జస్టిఫికేషన్‌ అనుకోవాలి! అందుకే, ప్రేక్షకులు ఏ దశలోనూ కథలో లీనం కాలేకపోతారు. వెరసి, విజయం కోసం ఆవురావురుమంటున్న ఈ దర్శక, హీరో, సంగీత దర్శకుల ఆకలి ఈ సినిమాతో తీరుతుందని ఎవరైనా అంటే, అది మరో పచ్చి అబద్ధం!
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 18 ఆగస్టు 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.........................................................................


వాణిజ్య అంశాలతో వివాదాస్పద ఇతివృత్తం ('దళం' సినిమా సమీక్ష)



సమాజంలోని సమకాలీన అంశాలను తీసుకొని, వాటిని వాస్తవిక రీతిలో వెండితెరకు ఎక్కించి, ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సిసలైన సృజనశీలికి ఎవరికైనా ఓ సంతోషం, సంతృప్తి ఉంటాయి. కానీ, ఆ పని చేయడంలో ఎన్నో సంక్లిష్టతలున్నాయి. పైగా, చిత్ర నిర్మాణం కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోయాక వాణిజ్యపరంగా అది సాహసం కూడా అవుతోంది. ఇటీవలి కాలంలో అలాంటి ప్రయత్నాలు తగ్గిపోతున్నది అందుకే! చాలా రోజుల తరువాత తెరపైకి వచ్చిన అలాంటి ప్రయత్నం - 'దళం'. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర పని చేసిన జీవన్‌ రెడ్డి దర్శకుడిగా తొలి చిత్రంతోనే ఈ ధైర్యం చేశారు. వివాదాస్పదమైన నక్సలిజమనే అంశానికి ప్రేమ కథను జోడించి, వాణిజ్య ఫార్ములా పరిధిలో పరిభ్రమించేందుకు ప్రయత్నించారు.


ఆయుధంతో వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురాగలమని నమ్ముతూ, జనం మధ్య కాకుండా అరణ్యంలో కాలం గడుపుతున్న నక్సలైట్లు గనక ఆయుధాలు వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే పరిస్థితులేమిటి? ఎదుర్కొనే ఇబ్బందులేమిటి? ఇలా ప్రశ్నలు వేసుకొని, అసలు సమస్యల లోతుల్లోకి వెళ్ళకుండా, వాణిజ్య చట్రంలోనే దర్శకుడు ఇచ్చిన సమాధానం - 'దళం'.


కథ: 
శత్రు ('భీమిలి కబడ్డీ జట్టు'లో కోచ్‌ పాత్రధారి అయిన తమిళ నటుడు కిశోర్‌) నేతృత్వంలో మొత్తం 22 మంది నక్సలైట్లు ఆయుధాలను వదిలిపెట్టి, పోలీసుల ఎదుట లొంగిపోతారు. జనంలో కలసిపోయి, సామాన్య జీవితం గడపాలని ఆశిస్తారు. శత్రుకు కుడి భుజంగా వ్యవహరించే సహచరుడు అభి ('అందమైన రాక్షసి' ఫేమ్‌ నవీన్‌ చంద్ర). వీళ్ళందరూ సామాన్య జీవితం గడపాలని భావించినా, గతం వారిని నీడలా వెంటాడుతుంటుంది. జైలు జీవితం నుంచి సమాజంలో పోలీసులు, రాజకీయ నేతల ప్రమేయం దాకా ప్రతిదీ వారిని వేధిస్తుంటుంది.
దాంతో, బతకడం కోసం అరణ్యంలో లాగానే, జనారణ్యంలోనూ ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. పోలీసుల పక్షాన ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూ, వారికి కంటకంగా ఉన్నవాళ్ళను శాశ్వతంగా అడ్డు తొలగించే పనిలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టయిన ఎస్‌.పి. లడ్డా (అభిమన్యు సింగ్‌) రంగంలోకి దిగుతాడు. మాజీ 'అన్న'లైన శత్రు ముఠాలోని ఒక్కొక్కరినీ చంపడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే శ్రుతి (పియా బాజ్‌పారు) అనే అమ్మాయితో అభి ప్రేమలో పడతాడు. వారి ప్రేమ ఎటు దారి తీసింది? లడ్డాను శత్రు బృందం ఎలా ఎదుర్కొంది? జనజీవనంలో భాగమై పోదామని భావించిన ఈ మాజీ నక్సల్స్‌ కథ ఆఖరుకు ఏమైంది? లాంటివన్నీ వెండితెరపై వచ్చే మిగతా కథాఘట్టాలు.


కథనం: 
ఇలాంటి సమకాలీన ఇతివృత్తాన్ని ఎన్నుకున్నప్పుడు దర్శక, రచయిత మరింత లోతుగా ఆ సమస్యను పరిశీలించాలి. దానికున్న అన్ని కోణాలనూ పరిశోధించాలి. వాస్తవాలను వీలైనంత సేకరించి, వాటిని సినీ మాధ్యమానికి అనువుగా సాధారణీకరించాలి. అయితే, ఈ చిత్ర కథలో ఆ పని చేసినట్లు అనిపించదు. దాంతో, సినిమాలో చాలా చోట్ల పాత్రలు, సన్నివేశాల మధ్య అల్లిక సరిగ్గా లేదనిపిస్తుంది.
ఉద్విగంగా ఆరంభమయ్యే ఈ చిత్ర ప్రథమార్ధం తరువాత కొద్దిగా పట్టు సడలిందని అనిపించినా, మొత్తం మీద బాగుందనే అభిప్రాయం కలిగిస్తుంది. కథలో రకరకాల పరిణామాలు చోటుచేసుకొనే ద్వితీయార్ధానికి వచ్చేసరికి క్రమంగా పట్టు సడలుతుంది. వాణిజ్యపరమైన అంశాల జోలికి వెళ్ళడం ఎంచుకున్న ఇతివృత్తాన్ని కాస్తంత పలచన చేసింది. అయితే, తరువాతి దృశ్యం, ఘట్టం ఏమై ఉంటుందా అన్న ఆసక్తిని నిలపడంలో మాత్రం దర్శకుడు సక్సెసయ్యారు.
అభినయం: 
మాజీ నక్సలైట్‌ నేతలుగా కిశోర్‌, నవీన్‌ చంద్రలిద్దరూ తక్కువ మాటలు, ఎక్కువ భావప్రకటనలతో నటించారు. జైలర్‌గా హర్షవర్ధన్‌ నటన బాగుంది. పియా బాజ్‌పారు ఫరవాలేదనిపిస్తుంది. యాదవ్‌గా 'తాగుబోతు' రమేశ్‌', మరో సహచరుడిగా ధన్‌రాజ్‌లు కామెడీని పండించారు. మాజీ నక్సల్‌ భద్రంగా కృష్ణుడు, మేక వన్నె పులి లాంటి రాజకీయ నాయకుడు జె.కె.గా నాజర్‌, ఎమ్మెల్యేగా సుబ్బరాజు, గంజాయి పండించే వ్యక్తిగా అజరు కనిపిస్తారు.
సాంకేతిక నైపుణ్యం: 
సినిమాలో కొన్ని చోట్ల వచ్చే ''అడవిలో జంతువుల మధ్య ఉన్నప్పుడు కూడా భయం కలగలేదు కానీ, ఇక్కడ మనుషుల మధ్య భయమేస్తోంది'' (ధన్‌రాజ్‌) లాంటి డైలాగులు చురకలు వేస్తూ, ఆలోచింపజేస్తాయి. అదే సమయంలో జైలర్‌ మాటల్లో నేరుగా అశ్లీలపదాలే ఆడియో కట్‌లు లేకుండా తెరపై వినిపిస్తాయి. కొన్ని చోట్ల సరైన యాక్షన్‌, టైమింగ్‌ కుదరకపోవడంతో, కవిత్వం పాలు ఎక్కువై, అతిగా మారిన అతకని డైలాగులూ ఉన్నాయి. 'ఎటెళ్ళినా అరణ్యమే... స్థితీగతీ అగమ్యమే...' పాట సన్నివేశంలోని గాఢతను పెంచే, నేపథ్య గీతంగా ఉపకరించింది. జేమ్స్‌ వసంతన్‌ సంగీతం ఫరవాలేదు. ఛాయాగ్రహణం ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది.
లోటుపాట్లు: ఎస్పీపై హత్యాయత్నం, షాలిమార్‌ ఎమ్మెల్యే హత్య, హోమ్‌ మంత్రిగా మహిళ లాంటివన్నీ మన రాష్ట్రంలో జరిగిన ఘటనల్ని గుర్తు చేస్తుంటాయి. అయితే, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టయిన ఎస్పీ లడ్డా (అభిమన్యు సింగ్‌) పోలీసుల పక్షానే సెటిల్మెంట్లు నడుపుతున్న ముఠా నేతలనూ కాల్చిపారేస్తుంటాడు. కానీ, అదే నగరంలో ఎమ్మెల్యే హత్య జరిగినా, జర్నలిస్టును ప్రత్యర్థులు చంపి పారేసినా, రాజకీయ నేతలు నాటకాలు ఆడుతున్నా అవేవీ అతనికి పట్టవెందుకో?
శత్రు గ్యాంగ్‌లో సభ్యులిద్దరినీ (కృష్ణుడు, ధన్‌రాజ్‌) ఎస్పీ క్రూరంగా ఎన్‌కౌంటర్‌ చేయడానికి తక్షణ కారణం కనిపించదు. పైపెచ్చు, ఆ వెంటనే అతను ఆ జోరును కొనసాగించకుండా ఆగడంలోని తర్కమూ లేదు. అలాగే, శత్రు గ్యాంగ్‌, ఎస్పీ లడ్డా ఒకే ఊళ్ళో ఉంటున్నా, వాళ్ళెక్కడ ఉన్నారన్నది తెలియదన్నట్లుగా ఎస్పీ ప్రవర్తించడం ప్రేక్షకులకు మింగుడు పడదు. ఇక, కథానాయిక పాత్ర శ్రుతికీ, మాజీ నక్సలైట్‌ అభికీ మధ్య ప్రేమ చిగురించడం, వారి మధ్య బంధం బలపడడం లాంటివి కన్విన్సింగ్‌గా దర్శకుడు చెప్పలేకపోయాడు. అలాగే, పత్రికా రచయిత అనగానే ఇంకా పాత సినిమాల స్థాయిలోనే లాల్చీ, భుజానికి సంచీతో కనిపించేలా, ప్రవర్తించేలా సాయి కుమార్‌ పాత్రను తీర్చిదిద్దడం నప్పలేదు. .
మొత్తం మీద, ''జనం కోసం గన్ను పట్టుకున్న మేము, చివరకు జనం మధ్యన బతకడానికి మళ్ళీ గన్ను పట్టుకోవాల్సి వచ్చింది'' అన్న వివాదాస్పద ఇతివృత్తాన్ని తెరపై చెబుదామన్న ఉద్దేశంతో బయలుదేరిన దర్శకుడికి కథను కాసేపు నడిపాక, సినిమాలో వాణిజ్య విలువలు లేవేమోనన్న శంక పీడించడం మొదలుపెట్టినట్లుంది. అందుకని, ఈ సీరియస్‌ కథలోనే కామెడీ, కథాగమనానికి అవసరం లేని పాటలు, చివరలో ఓ ప్రత్యేక నృత్య గీతం - ఇలా అన్ని మసాలాలూ కలిపేశారు. ఆ కలగాపులగం చేయకుండా, నేపథ్యంతో పాటు సమస్యను కూడా లోతుగా చర్చించి ఉంటే, 'దళం' మరికొంత నిజాయతీతో కూడిన ప్రయత్నంగా అనిపించేది. అలాంటి లోపాలున్నా, రొటీన్‌ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు మాత్రం ఇది కాస్తంత విభిన్నమైన కాలక్షేపంగా తోస్తే, అది సమకాలీన రొడ్డకొట్టుడు తెలుగు సినిమాల చలవే!
- రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 22 ఆగస్టు 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
..................................................

Thursday, August 22, 2013

తెలుగు ప్రమదల హృదయ నేత్రి - మాలతీ చందూర్

'జగతి' పత్రిక సంపాదకులుగా ఎన్‌.ఆర్‌.చందూర్‌, రచయిత్రిగా మాలతీ చందూర్‌ మద్రాసు మహానగరంలో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సామాజిక జీవితానికి దీపస్తంభాలుగా సుదీర్ఘకాలం వెలిగారు. చెన్నపట్నంలో తెలుగు సాహితీ సంస్థలకూ, సామాజిక ప్రముఖులకూ పెద్ద దిక్కుగా నిలిచారు. సంతానం లేని ఈ దంపతులు రచనలే తమ సంతానంగా, సాహితీ ప్రియులే బంధువులుగా గడిపారు. 


సాహితీ వ్యాసంగానికి పునాది

1930లో కృష్ణాజిల్లా నూజివీడులో మాలతి జన్మించారు. తల్లితండ్రులైన జ్ఞానాంబ, వెంకటేశ్వర్ల ఆరుగురు సంతానంలో ఆమె చివరి వ్యక్తి. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. సోదరులందరూ మరణించగా, పెద్దక్క సీతాబాయి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. మద్రాసులో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రెండో అక్క శారదాంబ దీర్ఘకాలంగా అక్కడే మాలతీ చందూర్ దంపతులతోనే ఉంటున్నారు. తోడబుట్టిన వారందరికీ చిన్నదైన మాలతి అంటే ఎంతో ప్రేమ, అనురాగం.


బాల్యమంతా ఎక్కువభాగం నూజివీడులోనే గడిపిన మాలతి ఎనిమిదో తరగతి వరకు అక్కడే ఎస్.ఆర్.ఆర్. ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆ తరువాత మేనమామ అయిన ఎన్‌.ఆర్‌. చందూర్‌ ఇంట్లో ఏలూరులో ఉండి, అక్కడ వల్లూరి సెయింట్ థెరెస్సా పాఠశాలలో ఇంగ్లీషు మీడియమ్ లో చదువుకున్నారు. తరువాతి కాలంలో మేనమామనే వివాహం చేసుకున్నారు. చదువు పూర్తికాకుండానే పెళ్ళవడం వల్ల మాలతి ప్రైవేటుగా ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేశారు.

NR Chandur and Malathi Chandur
స్వతహాగా కథా రచయిత, 'కథావీధి' తదితర పత్రికలను నడిపిన చందూర్‌ సాహచర్యంలో మాలతి సాహితీ వ్యాసంగం వికసించి, విస్తరించింది. అక్కడే ఆనాటి సాహితీ దిగ్గజాలను ఎందరినో దగ్గర నుంచి ఆమె చూశారు. 1947లో మద్రాసుకు వచ్చిన ఈ జంట అప్పటి నుంచి ఆ నగరాన్నే తమ స్థిర నివాసంగా చేసుకున్నారు. 

మొదట పరశువాక్కమ్ ప్రాంతంలోని ముక్కద్దాల్ వీధిలో అద్దె ఇంట్లో గడిపిన ఈ దంపతులు 1960ల నుంచి చెన్నైలోని మైలాపూర్‌ ప్రాంతంలో కచ్చేరీ రోడ్డులో తెలుగు సాహితీ వాతావరణానికి చిరునామాగా నిలిచారు. వారి స్వగృహం బెజవాడ గోపాలరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, శ్రీశ్రీ, ఆరుద్ర, సి. నారాయణ రెడ్డి తదితర రాజకీయ, సాహితీ ప్రముఖులెందరికో ఆటపట్టుగా వెలిగింది. మాలతీ చందూర్‌ అక్కయ్య, గతంలో ఉపాధ్యాయురాలైన శారదాంబ ఇప్పటి దాకా ఆ ఇంటికి పెద్ద దిక్కుగా అందరికీ తలలో నాలుకగా మెలిగారు.

రచనలే లోకం!
భర్త చందూర్‌ను ఎప్పుడూ ''మామయ్య''గానే సంబోధించే మాలతి పల్లెటూరిలో పెరిగిన తనను ఓ వ్యక్తిగా, ఇంత పెద్ద రచయిత్రిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని బాహాటంగా చెబుతుండేవారు. ఆమె చదువుకున్నది ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకానే అయినా, సమాజాన్నీ, జీవితాన్నీ ఆమె కాచివడపోశారు. 

'చంపకం - చెదపురుగులు' (1955 సెప్టెంబర్ లో ప్రథమ ముద్రణ) లాంటి ఆమె తొలినాళ్ళ నవలలు అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. 'శతాబ్ది సూరీడు', 'కాంచన మృగం', 'మనసులో మనసు', 'ఏమిటీ జీవితాలు', 'మధుర స్మృతులు', 'శిశిరవసంతం', 'ఆలోచించు', 'భూమిపుత్రితదితర పాతిక పైగా నవలలు ఆమె రచించారు. పలు ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు.


భారత స్వాతంత్య్ర సమర కాలంలో జరిగిన ప్రసిద్ధ చీరాల - పేరాల ఉద్యమ నేపథ్యంతో 'వనిత' మాసపత్రికలో ఆమె రాసిన 'హృదయ నేత్రి' నవలకు 1990వ దశకం తొలి రోజుల్లో కలకత్తాలోని 'భారతీయ భాషా పరిషత్‌' వారి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు వరించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ తరువాత ఈ నవలను శ్రీమతి శాంతాదత్ గారు “ఇదయ విళిగళ్” అన్న పేరుతో తమిళంలో అనువదించారు.


రచనా జీవితంతో తీరిక లేక, ఎప్పుడూ వంటింటికి దూరంగానే జీవితం గడిపిన మాలతీ చందూర్‌ రాసిన 'వంటలు - పిండి వంటలు' రచన తెలుగునాట ఇవాళ్టికీ ఎంతో ప్రసిద్ధం. పదే పదే పలు ముద్రణలు పొంది, వేల ప్రతులు అమ్ముడైంది. ''మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త వంటలను తెలుసుకొని రాశాను'' అని ఆమె చెబుతూ ఉండేవారు. 

తెలుగుతో పాటు ఆంగ్లం, తమిళాల్లో చక్కగా మాట్లాడే మాలతి కొన్ని ప్రసిద్ధ తమిళ రచనలను 'సాహిత్య అకాడెమీ' తదితరుల కోసం తెలుగులోకి అనువదించారు. తమిళ రచయిత డి. జయకాంతన్ గారి నవలను కొన్ని సమయాలల్లో కొంత మంది మనుషులు”, ఎన్. పార్థసారధి గారి నవలను సమాజం కోరల్లో”, శివశంకరి గారి నవలను ఓ మనిషి కథ పేరిట తెలుగు పాఠకులకు ఆమె అందించారు. అలాగే, మాలతీ చందూర్ తెలుగు రచనలు అనేకం తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.


మధ్యతరగతి జీవితానికి మల్లెపందిరి:
తెలుగులో చలం, విశ్వనాథ సత్యనారాయణ, ఇంగ్లీషులో సోమర్ సెట్ మామ్ తనకు ఇష్టమైన రచయితలని చెప్పే మాలతీ చందూర్ వాస్తవానికి దగ్గరగా రచనలు చేసేవారు. వాటిలో మధ్యతరగతి జీవితాన్నికళ్ళకు కట్టించే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి కుటుంబాలలోని మానవ సంబంధాలు, ఒడుదొడుకులు ఆమె రచనల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్త్రీ పాత్రలను వట్టి బేలలుగా ఆమె చిత్రించరు. ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు ఆత్మ గౌరవంతో సమస్యలను ఎదుర్కొంటాయి. 

మద్రాసు రేడియోలో ప్రసంగాలతో ఆమె తన సాహితీ వ్యాసంగం మొదలు పెట్టారు. 1950 ప్రాంతంలో 'ఆనందవాణి' వారపత్రికలో ప్రచురితమైన 'రవ్వల దుద్దులు' ఆమె రాసిన మొదటి కథ. 1953 ఆగస్టులో ప్రచురితమైన 'పాప' కథానిక, ఇంకా 'లజ్ కార్నర్', 'నీరజ' తదితర రచనలన్నీ ప్రముఖ సాహిత్య మాసపత్రిక 'భారతి'లో వచ్చాయి. దాదాపు 150కి పైగా కథలు ఆమె రాశారు. దాదాపు 66 ఏళ్ళుగా మద్రాసు మహానగరంలో ఉన్న ఆమె సహజంగానే తన కథలలో ఎక్కువగా చెన్నపట్టణాన్ని నేపథ్యంగా తీసుకొన్నారు. 

పాఠకులకు సుదీర్ఘ 'కాలమ్‌' ఇష్టురాలు:
ఇప్పటికి దాదాపు 6 దశాబ్దాల కాలంగా పాఠకులతో ప్రశ్నలు, జవాబులు శీర్షికను విజయవంతంగా నడుపుతూ వస్తూ, తెలుగు కాలమిస్టుల చరిత్రలో మాలతీ చందూర్‌ ఓ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు 1950లలో 'ఆంధ్రప్రభ' వారపత్రికలో 'ప్రమదావనం' పేరిట స్త్రీల కోసం ప్రత్యేకంగా మాలతీ చందూర్‌తో కాలమ్‌ ప్రారంభించారు.
వంటలు, కుట్లు - అల్లికల సామాన్య విషయాల మొదలు సామాజిక, రాజకీయ, కుటుంబ వ్యవహారాల దాకా మహిళలకు సూచనలు, సలహాలిస్తూ మాలతీ చందూర్‌ నడిపిన ఆ శీర్షిక కొన్ని తరాల వారికి ప్రీతిపాత్రమైంది. ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఒక రకంగా తెలుగు నాట 'ఎగొనీ ఆంట్‌' తరహా కాలమ్స్‌కు ఆమె 'ప్రమదావనం' ఒరవడి పెట్టింది.
ఆ పత్రిక చేతులు మారే ముందు నూతన సహస్రాబ్ది తొలిరోజుల దాకా ఆ కాలమ్‌ అందులో కొనసాగింది. ఆ తరువాత నుంచి ఇప్పటి దాకా అదే కాలమ్‌ 'నన్ను అడగండి' అనే కొత్త పేరు, రూపంతో 'స్వాతి' సపరివారపత్రికలో వారం వారం అలరిస్తూ వస్తోంది. పాఠకులు ఏ చిన్న ప్రశ్న అడిగినా, సమగ్రమైన సమాచారంతో వ్యాఖ్యానభరితంగా ఆమె ఇచ్చే జవాబులు ఎంతో పాపులర్‌. మాలతీ చందూర్‌ మాటలతో జీవితాలను సరిదిద్దుకున్నామనీ, ఇవాళ్టికీ తమ మనుమరాళ్ళ సమస్యలకూ ఆమెనే సలహాలు అడుగుతున్నామనీ చెప్పేవారు ఎంతోమంది!


'Swathi' Editor Vemuri Balaram with Malathi on Jan11th 2013 at Chennai
అలాగే, 'స్వాతి' మాసపత్రిక ప్రారంభ రోజుల నుంచి ఇప్పటి దాకా మూడు దశాబ్దాల పైచిలుకుగా 'పాత కెరటాలు' పేరిట మరో పాపులర్‌ శీర్షికను ఆమె నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి నెలా ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల నవలలను పరిచయం చేస్తూ వస్తున్నారు. 

ఆ నవలా పరిచయాల కోసం ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు తెప్పించుకొని, వాటిని క్షుణ్ణంగా చదివి, ఆ పుస్తకసారాన్ని కొద్ది పేజీల్లో సాకల్యంగా పరిచయం చేయడానికి ఆమె తీసుకొనే శ్రమ ప్రత్యక్షంగా చూసినవారికి తెలుసు. ''తెలుసుకున్న విషయాలను నలుగురికీ తెలియజేయాలనీ, ఓ పుస్తకం బాగుంటే దాన్ని ఇతరులకు పరిచయం చేయాలనీ జిజ్ఞాస నాలో ఎక్కువ. అలా తెలుగు వారికి 400కు పైగా ఇంగ్లీషు నవలల్ని పరిచయం చేశా'' అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. 

ఆ నవలా పరిచయాలు 2002 ప్రాంతంలో 'పాత కెరటాలు' శీర్షికనే పుస్తక రూపంలోకి వచ్చాయి. కాగా, ఆ తరువాత 2008 - 2010 నాటికి 'నవలా మంజరి' శీర్షికన ఆరు భాగాలుగా కొత్త పేరుతో తిరిగి ప్రచురితమయ్యాయి.


చివరి వరకు అదే కృషి
'పుస్తక పఠనం, సజ్జన సాంగత్యం'తో చందూర్‌ దంపతులు వయస్సు మీద పడినా దాన్ని లెక్క చేయకుండా, చివరి వరకు సాహిత్య, సామాజిక కృషిలో గడిపారు. దుర్గాబారు దేశ్‌ముఖ్‌ స్థాపించిన 'ఆంధ్ర మహిళా సభ' నిర్వహణలో, అభివృద్ధిలో మొదటి నుంచి ఇప్పటి వరకు భాగస్వామ్యం వహించారు. ఆప్యాయమైన పలకరింత, తమను కలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చే సాహితీ ప్రియులకు వారిచ్చే ఆతిథ్యం చాలామందికి అనుభవైకవేద్యం. 

1970లలో కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా పని చేసిన ఆమెకు మద్రాసులో తెలుగు చిత్ర పరిశ్రమ వెలిగిన రోజుల్లోని ప్రముఖులందరూ సుపరిచితులే. ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి తదితరులు ఆమెను ఎంతో గౌరవించేవారు.
తెలుగు నేలకు దూరంగా ఉన్నప్పటికీ, ఇక్కడి వారితో సమానంగా, కొన్ని సందర్భాల్లో ఎక్కువగా పేరు తెచ్చుకున్న రచయిత్రిగా మాలతీ చందూర్‌ కృషిని గుర్తించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆమె రచనలపై పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.
చందూర్‌ మరణానంతరం మాలతి, కుటుంబ సభ్యులు ఆయన పేరు మీద 'ఎన్‌.ఆర్‌. చందూర్‌ - జగతి అవార్డు' పేరిట ఓ స్మారక పురస్కారాన్ని నెలకొల్పారు. ప్రతి ఏటా జనవరి 11న చందూర్‌ వర్ధంతి నాడు నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగేందుకు తాను మదుపు చేసిన సొమ్ము అంతా ఓ ట్రస్టు పేరిట మాలతి పెట్టారు. ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ (2012), 'ఆంధ్రజ్యోతి' ఢిల్లీ విలేకరి ఏ. కృష్ణారావు (2013)కు ఇప్పటి దాకా ఈ పురస్కారాలు ఇచ్చారు.


NR Chandur-Jagathi Award function on 11 Jan 2013 at Chennai
'మామయ్య' చందూర్ తన 'జగతి' పత్రికలో నిర్వహించిన పాపులర్ శీర్షిక 'డైరీ'లోని ప్రధాన అంశాలను గుదిగుచ్చి, ఈ ఏడాది జనవరిలో ఆయన వర్ధంతి నాటికి పుస్తకరూపంలో తెచ్చారు మాలతి. 'జగతి డైరీ' పేరిట కొన్ని వందల పేజీల్లో వచ్చిన ఈ పుస్తకానికి ఎడిటింగ్ వగైరా బాధ్యతలన్నీ ఆమే స్వయంగా చూసుకున్నారు. దాదాపు 50 ఏళ్ళ చెన్నపట్న తెలుగు సాహితీ, సాంస్కృతిక జీవితానికి దర్పణమైన ఆ డైరీని ప్రచురించడానికి ఆమె పడిన శ్రమ, తపన దగ్గరగా ఉన్న వాళ్ళకు తెలుసు. 
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1950ల ప్రథమార్ధంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష జరిపి, అసువులు బాసిన భవన సంరక్షణ, నిర్వహణ బాధ్యతల్లో కూడా మాలతీ చందూర్‌ దంపతులు అవిరళ కృషి చేశారు. 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ' సంస్థాపక సభ్యురాలైన ఆమె ప్రస్తుతం ఆ సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
చెన్నైలోని క్వీన్‌ మేరీస్‌ కళాశాల లాంటి ప్రసిద్ధ విద్యాసంస్థల్లో తెలుగు బోధనాంశాన్ని ఎత్తి వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆ మధ్య ప్రయత్నించినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ఉద్యమబాట పట్టారామె. సాహితీ ప్రియులైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కేంద్ర మంత్రి పురంధేశ్వరి తదితరులతో మాట్లాడి, 'తెలుగు ఎత్తివేత' నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా చేశారు. రాజా-లక్ష్మి ఫౌండేషన్‌ అవార్డుతో సహా ఎన్నో పురస్కారాలు, సన్మానాలతో పేరుప్రతిష్ఠలు వచ్చినా, చివరి వరకు ఎంతో నిరాడంబరంగా, సాదాసీదా మహిళ లాగా జీవించడం ఆమెలోని విశిష్టత.
- రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 22 ఆగస్టు 2013, గురువారం, పేజీ నం. 4లో ప్రచురితం)
...................................................

ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ హఠాన్మరణం

- క్యాన్సర్ ఆపరేషన్ జరిగిన మరునాడే కన్నుమూత 
- పలువురు ప్రముఖుల సంతాపం
- చెన్నైలోని రామచంద్రా మెడికల్‌ కాలేజ్‌కు శరీరదానం

సుప్రసిద్ధ తెలుగు రచయిత్రి, కాలమిస్టు మాలతీ చందూర్‌ ఇక లేరు. తెలుగ్ను సాహిత్యాభిమానుల, పత్రికా ప్రియుల పఠనా జీవితంలో కొన్ని దశాబ్దాలుగా భాగమైన ఆమె ఆగస్టు 21వ తేదీ బుధవారం నాడు సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని మైలాపూర్ లో ఇసబెల్లా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వయస్సు 83 సంవత్సరాలు. ఆమె భర్త స్వర్గీయ ఎన్‌.ఆర్‌. చందూర్‌ (పూర్తి పేరు చందూరి నాగేశ్వర రావు) కూడా ప్రముఖ జర్నలిస్టు - రచయిత.  

మొన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న మాలతీ చందూర్‌ ఇటీవలే కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. పరీక్షల్లో ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం డాక్టర్లు కనుగొన్నారు. చికిత్స కోసం ఆగస్టు 12వ తేదీన ఆమె ఆసుపత్రిలో చేరారు. అనేక పరీక్షలు చేసిన అనంతరం, వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 20వ తేదీ మంగళ వారం నాడు ఆమెకు శస్త్రచికిత్స జరగగా, బుధవారం నాడు సాయంత్రం కన్ను మూశారు. 

నిజానికి, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శస్త్రచికిత్స జరిగిన తరువాత కూడా ఆమె స్పృహలోకి వచ్చి, రాత్రి 11 గంటల దాకా కూడా బంధువులతో మాట్లాడారు. కానీ, ఆ తరువాత పూర్తిగా స్పృహ కోల్పోయారు. ఆగస్టు 20 ఉదయం నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆమెను కాపాడాలని వైద్యులు శతవిధాల ప్రయత్నించినా, లాభం లేకపోయింది. చివరకు డయాలసిస్ వగైరా చేయడానికి ఉపక్రమిస్తూ, ఆసుపత్రిలోనే ఒక ఐ.సి.యు నుంచి మరో ఐ.సి.యు.కు తరలిస్తుండగా, మాలతీ చందూర్ తుదిశ్వాస విడిచారు.

‘జగతి’ మాసపత్రికతో ఎందరికో ఆప్తులైన ఎన్‌.ఆర్‌. చందూర్‌ మరణించిన రెండున్నరేళ్ళకే ఆయన భార్య, రచయిత్రి మాలతీ చందూర్ కూడా కన్నుమూయడంతో, చెన్నైలోని తెలుగు సాహితీ, సాంస్కృతిక ప్రియులు విచారంలో మునిగిపోయారు.మాలతీ చందూర్‌ భౌతిక కాయాన్ని ఆమె చివరి కోరిక మేరకు చెన్నైలోని పోరూర్ ప్రాంతంలో ఉన్న శ్రీరామచంద్రా మెడికల్‌ కాలేజ్‌కు దానం చేసినట్లు ఆమె కుటుంబానికి అత్యంత ఆత్మీయులూ, పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ కార్యదర్శి అయిన వై. రామకృష్ణ తెలిపారు.  















Add caption

ప్రముఖుల సంతాపం

బుధవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి మాలతీ చందూర్ భౌతిక కాయాన్నిఅంబులెన్స్ల్ లోనే సమీపంలోని ఆమె స్వగృహానికి తెచ్చి, బంధు మిత్రుల సందర్శనార్థం కొద్ది సేపు ఉంచారు. ముంబయ్ తో సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమీప బంధువులు, స్థానిక పత్రికా విలేఖరులు ఆమె భౌతిక కాయాన్ని దర్శించి, నివాళులు అర్పించారు. ఆ వెంటనే శరీర దానం నిబంధనల ప్రకారం మాలతి భౌతిక కాయాన్ని శ్రీరామచంద్రా మెడికల్ కాలేజ్ కు తరలించారు.

మాలతీ చందూర్‌ మృతికి తమిళ నాడు గవర్నర్ కె. రోశయ్య తీవ్ర సంతాపం తెలిపారు. రచయితలు కె. రామలక్ష్మీ ఆరుద్ర, గొల్లపూడి మారుతీరావు, భువనచంద్ర, వెన్నెలకంటి, సినీ నిర్మాత కె. మురారి, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు - రచయిత మాడభూషి సంపత్‌ కుమార్‌, అభ్యుదయ రచయితల సంఘం మద్రాసు శాఖకు చెందిన ఆచార్య జి.వి.ఎస్‌.ఆర్‌. కృష్ణమూర్తి, కాసల నాగభూషణం, స్వప్న మాసపత్రిక సంపాదకులైన సీనియర్ జర్నలిస్టు ఎం.ఎల్. నరసింహం, ఇంకా పలువురు పత్రికా రచయితలు ఆమె మృతికి విచారం వ్యక్తం చేశారు. సంగీత విమర్శకుడు పప్పు వేణుగోపాలరావు తదితరులు మాలతీ చందూర్‌ భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. 

- రెంటాల జయదేవ 

(Published in 'Praja Sakti' Daily, 22 Aug 2013, Thursday, Page No. 1 & 4)
.......................................................

Monday, August 19, 2013

ఆదిశంకర..అంతంత మాత్రమే - చిత్ర సమీక్ష


చరిత్రలో ప్రసిద్ధులైన వ్యక్తుల జీవితాలను వెండితెరకు ఎక్కించడం అంత సులభమైన పని కాదు. అందులోనూ ఆ సుప్రసిద్ధుడు కొన్ని శతాబ్దాల క్రితం వాడైనప్పుడు, కాలగతిలో ఆ వ్యక్తి జీవిత కథలో ఎన్నెన్నో కొత్త కథలు వచ్చి చేరిపోయినప్పుడు అది మరీ కష్టం. ఏది చరిత్ర, ఏది జనం నోట ప్రచారంలో ఉన్న కల్పితం అన్నది చెప్పలేం. వెరసి, తీసేది 'బయోగ్రఫికల్‌' సినిమానా, లేక పురాణాల ఆధారంగా చేస్తున్న 'భక్తి రస కథా చిత్రమా' అన్న సందేహం వచ్చేస్తుంది. 
భారతదేశంలోని ప్రసిద్ధ వైదిక ధర్మ తత్త్వవేత్తల్లో ఒకరైన క్రీస్తుశకం 8వ శతాబ్ది నాటి ఆది శంకరాచార్యుల జీవితాన్ని సినీ మాధ్యమం ద్వారా జన సామాన్యానికి చేరువ చేయాలనుకోవడం సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే. రచయిత - దర్శకుడు జె.కె. భారవి ఆ సాహసానికి దిగారు. నిర్మాత నారా జయశ్రీదేవి అందుకు అండగా నిలిచారు. అలా 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'పాండురంగడు', 'శిరిడిసాయి' చిత్రాల వరుసలో తాజాగా వచ్చింది 'జగద్గురు ఆదిశంకర'. 
అయితే, ఇలాంటి వెండితెర సాహసాలను చేసే క్రమంలో కథలో, కథనంలో, సంభాషణల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మాత్రం దర్శకుడు ఆశించిన పరిణతి చూపించలేకపోవడమే పెద్ద లోపం.
తారాగణం: కౌశిక్‌బాబు, రోహిణి, నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, తనికెళ్ళ భరణి, సంగీతం: నాగ్‌ శ్రీవత్స, సాహిత్యం: ఆది శంకరాచార్య, శ్రీవేదవ్యాస, కెమేరా: పి.కె.హెచ్‌. దాస్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, కార్యనిర్వాహక దర్శకుడు: ఉదయభాస్కర్‌, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: జె.కె. భారవి 
ఆది శంకరుల జీవిత కథ 'శంకర (దిగ్‌) విజయం'గా పలువురు ప్రసిద్ధుల పేర వేర్వేరు కథనాలతో ప్రచారంలో ఉంది.
తెలిసిన కథ: 
ఎనిమిదో శతాబ్ద కాలంలో జీవించిన ఆది శంకరాచార్య అప్పటికి దేశంలో ఉన్న అనేక మతాలనూ, ఆ మతాలను అవలంబించే వివిధ కులాలు, వర్గాల మధ్య నెలకొన్న సంఘర్షణనూ తన వాదనతో గట్టిగా ఎదుర్కొన్నారు. 'దేవుడు, జీవుడనేవి రెండూ వేరు కాదు. ఒకటే!' అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించారు. 
కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా దేశమంతటా నాలుగు సార్లు పాదయాత్ర చేసి, ఈ అద్వైత మత స్థాపకుడయ్యారు. దేశంలోని నాలుగు దిక్కులా (తూర్పున పూరీ, పశ్చిమాన ద్వారక, దక్షిణాన శృంగేరి, ఉత్తరాన బదరీనాథ్‌ సమీపంలోని జోషీమఠ్‌ వద్ద) నేటికీ నిలిచిన నాలుగు మఠాలను ఈ అద్వైత సిద్ధాంత ప్రచారానికి స్థాపించారు. 32 ఏళ్ళ జీవితకాలంలోనే ఇవన్నీ సాధించి, దేహాన్ని విడిచారు.
రాజకీయ నాయకుడిగా మారిన హీరో చిరంజీవి నేపథ్యంలో నుంచి కథను స్థూలంగా వివరిస్తుండగా, టైటిల్స్‌ పడుతూ 'జగద్గురు ఆదిశంకర' సినిమా మొదలవుతుంది. కేరళ ప్రాంతంలోని కాలడి గ్రామంలో శంకరుడు జన్మిస్తాడు. బాల్యంలోనే అతను శ్రీచక్రార్చన ఉపదేశం పొందడం, తండ్రిని పోగొట్టుకోవడం, నీళ్ళలో మొసలి పట్టుకొన్నప్పుడు 'ఆపత్‌ సన్న్యాసం' తీసుకోవడం, దేశాలూ తిరిగి గురు శుశ్రూషలో అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకోవడం, కాశీ వెళ్ళి సర్వమత మహాసభలో పాల్గొనడం, మండన మిశ్రుడితో వాదం, కాశ్మీర్‌లో 'సర్వజ్ఞ శారదా పీఠా'న్ని అధిరోహించడం, శిష్యులకు అద్వైత సిద్ధాంత ప్రచార బాధ్యతను అప్పగించి, దేహత్యాగం చేయడం లాంటి ఘట్టాలతో సినిమా సాగుతుంది.
దశాబ్దాల క్రితమే ఆత్రేయ రాసిన 'అన్నమయ్య' స్క్రిప్టు రోజుల నుంచి ఆయన దగ్గర సహాయకుడిగా సుశిక్షితుడై, ఆనక దర్శకత్వ శాఖలోకీ విస్తరించి, 'చిటికెల పందిరి' లాంటి సినిమాలు రూపొందించిన అనుభవం సుదర్శన భట్టాచార్య అలియాస్‌ జె.కె. భారవిది. దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'పాండురంగడు' లాంటి చిత్రాలకు పనిచేసిన ఆయన అదే రకం చట్రంలో ఈ సినిమాను రూపొందించే ప్రయత్నం చేశారు.


తృప్తి కలిగించని కథనం: 
ఆరంభం కాసేపు బాగుందనిపించే ఈ చిత్రం ఆనక గ్రాఫిక్స్‌ జిమ్మిక్కులకూ, అడపాదడపా ఆకట్టుకొనే పాటలకే పరిమితమైంది. పట్టుగా నడిచే సన్నివేశాలూ, పాత్రలూ లేకపోవడంతో కుంటు కుంటూ సాగింది. నిజానికి, ఆది శంకరుల కథలో, ఆయన ప్రసిద్ధ శిష్యుల విశేషాలలో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలను స్క్రిప్టుగా మలుచుకోవచ్చు.
కానీ, దర్శక, రచయిత ఎందుకనో ఆ పనికి పోలేదు. తెరకెక్కించిన సన్నివేశాలు కూడా అక్కడో ముక్క, అక్కడో ముక్క అన్నట్లు ఉండడంతో, సాఫీగా కథ సాగినట్లు అనిపించదు. అంతా కప్ప గెంతుల ఎడిటింగ్‌ అనిపిస్తుంది. పైగా, తెరపై కనిపిస్తున్న పాత్రల్లో ఎవరేమిటి, వారికి ఆది శంకరుడి కథతో ఉన్న బంధం ఏమిటన్నది ఓ పట్టాన అర్థం కాదు. మోహన్‌బాబు, నాగబాబు, తనికెళ్ళ భరణి, శ్రీహరి లాంటి ప్రసిద్ధ తారలు తెరపై ఉన్నా, వాళ్ళ పాత్రలతో వచ్చిన సమస్య ఇదే!
ఆ మాటకొస్తే ఆది శంకరుల కథ వెండితెరకు కొత్తేమీ కాదు. ఈ కథను ప్రసిద్ధ భారతీయ దర్శకుడైన కీర్తిశేషుడు జి.వి. అయ్యర్‌ 'ఆది శంకరాచార్య' (1983) పేరిట మూడు దశాబ్దాల క్రితం ఒక సారి తెరకెక్కించారు. మొట్టమొదటి సంస్కృత భాషా చిత్రమైన ఆ సినిమా అప్పట్లో ఉత్తమ చలనచిత్రం, సినిమాటోగ్రఫీతో సహా 4 జాతీయ అవార్డులు అందుకొంది. సర్వదమన్‌ బెనర్జీ (తరువాత కె. విశ్వనాథ్‌ 'సిరివెన్నెల' హీరో) ఆది శంకరుల వేషంలో పరమ శాంతంగా, ప్రశాంతంగా పాత్రోచితంగా కనిపిస్తారు. 
ఆ రోజుల్లో విశేష జనాదరణ పొందడమే కాక, పదే పదే దూరదర్శన్‌ జాతీయ చానల్‌లో ప్రసారమైన సినిమా అది. ఆ సినిమా చూడనివారి మాటేమో కానీ, అది చూసినవారికి మాత్రం సరిగ్గా 30 ఏళ్ళ తరువాత వచ్చిన ఈ ఆధునిక గ్రాఫిక్స్‌ మిళిత కథ అసంతృప్తినే మిగులుస్తుంది.
మెరుపులకే పరిమితమైన తారలు: 
గతంలో అయ్యప్ప స్వామి పాత్రలో తెలుగుతో పాటు మలయాళంలోనూ టీవీ కెమేరాల ముందు తరచూ మెరిసిన కౌశిక్‌బాబు ఈ తాజా చిత్రంలో ఆది శంకరుడిగా కథానాయకపాత్రలో తెరకు పరిచయమయ్యారు. మంచి ఒడ్డూ పొడుగూ, స్పష్టమైన ఉచ్చారణ, హావభావాలతో చూడడానికి బాగున్నారు. కానీ, చాలా సందర్భాల్లో ఈ పాత్రను కొంత స్వాతిశయం నిండినదేమో అన్నట్లు అప్రసన్న వదనంతో, ఆగ్రహంగా చూపడం పెద్ద లోపం.
శంకరుడిలోని తప్పును ఎత్తిచూపే కాటికాపరిగా నాగార్జున, ప్రతినాయక ఛాయలున్న కాపాలికుడిగా సుమన్‌ నటించారు. లక్ష్మిగా రోజా, పార్వతిగా మీనా, శారదామాతగా సన, నారసింహుడిగా సాయికిరణ్‌ కనిపిస్తారు. ఆఖరుకు గతంలో నటించిన 'శ్రీమంజునాథ' చిత్రం పుణ్యమా అని ఆ సన్నివేశాల చలవతో, ఇందులోనూ చిరంజీవి కొద్ది క్షణాలు శివుడిగా తాండవమాడుతూ తెరపై మెరుస్తారు.
కామశాస్త్ర రహస్యాలను తెలుసుకొనేందుకు శంకరుడు ప్రయత్నించే పరకాయ ప్రవేశ ఘట్టంలో వచ్చే అమరుక మహారాజు - అతని భార్య ('ఇండియన్‌ ఐడల్‌' ఫేమ్‌ శ్రీరామచంద్ర - కామ్నా జెఠ్మలానీ), మంత్రి (పోసాని), రాజ పురోహితుడు (విజయచందర్‌) కూడా గెటప్పులు, నటనల్లో కృత్రిమంగా ఉన్నారు. రెండు, మూడు సన్నివేశాల్లో ఓ ముసలి సాధువు లాగా దర్శక, రచయిత భారవి వచ్చి, ఆది శంకరుడితో మాట్లాడి వెళతాడు. వాటి అర్థం, ప్రయోజనం బోధపడవు.
అనవసర కామెడీ - ఆకట్టుకొనే సంగీతం
సినిమాలో వాణిజ్య అంశాలు లేవేమోనన్న భయంతో దర్శకుడు కొన్నిచోట్ల అనవసరపు కామెడీ వైపు మొగ్గారు. శంకరుల గురువు - గురుపత్ని (అశోక్‌కుమార్‌ - తులసి), అలాగే మండన మిశ్రుడు - వాద పరీక్షలో తీర్పరిగా నిలిచే అతని సతీమణి (సాయికుమార్‌ - కమలినీ ముఖర్జీ) మధ్య సన్నివేశాలు అందుకు ఉదాహరణ. దాంతో, కీలకమైన మండన మిశ్రుడితో శంకరుల వాదన ఘట్టం కాస్తా వట్టి వెర్రి కామెడీగా మారింది.
కొన్ని చోట్ల డైలాగులు బాగున్నా, మరికొన్నిసార్లు భారవి పరిణతి, పగ్గాలు లేని రచనకు దిగడం ఈ చిత్ర ఇతివృత్తానికి తగ్గట్లు లేదు. 'ఎగిరిపోతే ఎంత బాగుంటుంది' లాంటి పాటల ప్రస్తావన కామెడీ ఈ సినిమాలో ఔచిత్య భంగమే!
మహర్షి ధారపోయడంతో ప్రతిసారీ ఎనిమిదేళ్ళ వంతున ఆది శంకరుడి ఆయుష్షు పెరగడమనే కథ ఎక్కడ నుంచి వచ్చిన పురాణ కథో ఆది శంకరుల జీవితం చదివిన వారికీ తెలియదు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించేందుకు వెళ్ళమన్న కాపాలికుడే, ఆనక మళ్ళీ వచ్చి అక్కడ శంకరుడికి అడ్డుచెప్పడం, ఆఖరుకు అదంతా నాటకమనడం నప్ప లేదు. 
జీవిత కథా చిత్రంగా కాక, భక్తి రస పౌరాణిక గాథగా మార్చేసిన ఈ సినిమా మొత్తంలో ఆది శంకరుడి దేశాటన విశేషాలు కానీ, ఆయన చేసిన ఉపదేశాల సారం కానీ చూపలేకపోయారు. 'ఫర్‌ యూత్‌' అని ఈ చిత్రానికి ప్రచారం సాగించడంతో, సినిమా చివరలో ఆది శంకరుడు మాటల్లో ''పోరాడితే పోయేదేమీ లేదు అజ్ఞానపు సంకెళ్ళు తప్ప!'', ''యువతరాన్ని తక్కువగా అంచనా వేయకండి. వారు శక్తి క్షేత్రాలు'' లాంటి సందేశాలతో జస్టిఫై చేయడానికి ప్రయత్నించారు.
తెరపై రిచ్‌గా కనిపించే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఛాయాగ్రహణం బాగుంది. నాగ్‌ శ్రీవత్స (ప్రముఖ వేణుగాన కళాకారుడు నాగరాజు) బాణీలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. శ్రీవేదవ్యాస రాసిన సాహిత్యం, ముఖ్యంగా కై ్లమాక్స్‌కు ముందు శంకర మహదేవన్‌ గొంతులో వినిపించే 'ఓంకారం...', సినిమా ఆరంభంలో వచ్చే భారవి రచన 'భ్రమ అని తెలుసు...' లాంటి పాటలు సన్నివేశాల్లోని పట్టు పెంచగలిగాయి.
ఏతావతా, లోటుపాట్లున్నా వీనుల విందైన పాటలతో, ఆది శంకరుడి జీవితాన్ని స్థూలంగా తెరపై చూడాలనుకొనే భక్తిరస ప్రధాన చిత్ర వర్గ ప్రేక్షకులకు ఈ 'జగద్గురు ఆదిశంకర' రెండు గంటల పైచిలుకు వెండితెర కథా కాలక్షేపం.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 17th Aug 2013, Saturday, Page No.8)
........................................................................

Friday, August 16, 2013

బాక్సాఫీస్‌ను దోచిన 'బందిపోటు' - ఎన్టీయార్, విఠలాచార్యల కాంబినేషన్ కు 50 ఏళ్ళు


వెండితెరపై అద్భుత రసాన్ని అమోఘంగా పండించిన దర్శకుడు ఒకరు. ఆబాలగోపాలాన్నీ తన నటనతో కట్టిపడేసిన స్టార్ హీరో మరొకరు. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా అంటే - సినీ పరిభాషలో క్రేజీ కాంబినేషనే. కమర్షియల్ గానూ కాసులు కురిపించిన అలాంటి కాంబినేషనైన దర్శకుడు బి. విఠలాచార్య - హీరో ఎన్టీయార్ల కలయికకు శ్రీకారం చుట్టిన చిత్రం -  'బందిపోటు'. రాచరిక వ్యవస్థలోని కుట్రలు, కుతంత్రాలకూ, ప్రజల పక్షాన వాటికి ఎదురొడ్డిన సామాన్య కథానాయకుడి వీరోచిత కార్యాలకూ ప్రతిరూపమైన ఈ చిత్రం అప్పట్లో కమర్షియల్ హిట్. పైగా, అలాంటి మరెన్నో చిత్రాలకు ఓ మూసగా నిలిచింది. విఠలాచార్య, ఎన్టీయార్ల కాంబినేషన్ లో ఆ తరువాత మరో 13 చిత్రాలకు అది ఆరంభం.
1963 ఆగస్టు 15న విడుదలైన 'బందిపోటు' సరిగ్గా ఇవాళ్టితో యాభై ఏళ్ళు పూర్తి చేసుకొంటోంది. ఈనాటి స్వర్ణ జయంతి వేళ ఆ కాంబినేషన్‌ సంగతులు కొన్ని...

బ్లాక్‌ అండ్‌ వైట్‌ యుగంలో మొదలై కలర్‌ చిత్రాల కాలం దాకా ఒకే విధమైన పంథా నమ్మి, ఆ రకమైన ఫార్ములాతోనే వరుస హిట్లు సాధించడమంటే సామాన్యమైన విషయం కాదు. బహుశా, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆ రకమైన అరుదైన విన్యాసం చేసి, చిరస్థాయిగా పేరు సంపాదించుకున్న దర్శకుడు ఎవరంటే, బి. విఠలాచార్య పేరే చెప్పుకోవాలి. అధికారం కోసం రాజ్యాల్లో సాగే కుట్రలు, కుతంత్రాలు, అందమైన రాజకుమారిని ఆపద నుంచి తప్పించే తోట రాముడు, అధికారం కోసం రాజుకు వెన్నుపోటు పొడిచే సేనాధిపతి, అందాల రాకుమారిని అమ్మవారికి బలి ఇవ్వాలనుకొనే మాంత్రికుడు, మాయలు, మంత్రాలు, అన్నిటినీ ఎదిరించి ఆఖరుకు ముసలి రాజును కాపాడే కథానాయకుడు - ఇవే రకం పాత్రలు, నేపథ్యాలతో పదుల కొద్దీ సినిమాలు తీసి, ప్రేక్షకులకు కాలక్షేపం, నిర్మాతలకు కాసుల నిక్షేపం అందించిన దర్శకుడిగా విఠలాచార్యది ఓ ప్రత్యేక అధ్యాయం.
తొలి కలయికలోనే...
స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సాంఘిక చిత్రం 'కన్యాదానం' (1955)తో తెలుగులోకి కాలుమోపినా, సాంఘికాల కన్నా జానపదాలకే విఠలాచార్య క్రమంగా ప్రసిద్ధులయ్యారు. దేవుళ్ళు - దయ్యాలు - మంత్రాలు - తంత్రాల లాంటి జనబాహుళ్యంలోని నమ్మకాల ఆధారంగా తెలుగు తెరపై అద్భుత రసాన్ని పండించారు. సామాన్య ప్రేక్షకులను ఆనంద, ఆశ్చర్యాలలో ముంచెత్తి, వాణిజ్య విజయాలు అందుకున్నారు. అలాంటి దర్శకుడు, అప్పట్లో స్టార్‌ హీరో అయిన ఎన్టీయార్‌ల కాంబినేషన్‌లో సినిమా అంటే వ్యాపార వర్గాల్లో, మాస్‌లో ఎలాంటి క్రేజు ఉంటుందో చెప్పనక్కర లేదు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం - 'బందిపోటు'.
రాజలక్ష్మీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుందర్‌లాల్‌ నహతా - డూండీ నిర్మించిన చిత్రమిది. ఆ పతాకంపై అప్పటికే నాలుగైదు చిత్రాల్లో నటించిన ఎన్టీయార్‌ ఈ 'బందిపోటు' సినిమాలో నటించేందుకు వెంటనే అంగీకరించారు. అలా కుదిరిన ఈ దర్శక, హీరోల తొలి కాంబినేషన్‌ ఘన విజయం సాధించింది. ఆ తరువాత వారిద్దరి కలయికలో మరెన్నో చిత్రాలకు బాట వేసింది.
మాయా లేదు! మర్మం లేదు!!
గమ్మత్తు ఏమిటంటే, ఈ సినిమాలో విఠలాచార్య మార్కు మాయలు, మంత్రాలు ఉండవు. వినోదం అందించే విన్యాసాలు, వీరోచిత పోరాటాలే ఉంటాయి. అయినా సరే, అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్‌. రాజకుటుంబాల నేపథ్యంలోని జానపథ కథలను అప్పటికే విఠలాచార్య తెరకెక్కించారు. అయితే, ఈసారి రాచరిక వ్యవస్థలో జరిగే మోసాలు, కుట్రలు, కుతంత్రాలకు తోడు పెద్దలను కొట్టి పేదలకు పెట్టే రాబిన్‌హుడ్‌ తరహా కథానాయక పాత్రనూ, ఆ నేపథ్యాన్నీ జోడించి అల్లుకున్న కథ - 'బందిపోటు'. ఆ చిత్రానికి రచన చేసిన త్రిపురనేని మహారథి స్వతహాగా తనకున్న అభ్యుదయ, విప్లవ భావజాలానికి తగ్గట్లుగానే ఇందులో డైలాగులు రాశారు. ఆ రకమైన కథా సంవిధానం, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దానికి ఘంటసాల సంగీతం మరో పెద్ద అండ అయింది.
జనం నోట... అదే పాట
నహతా వారి 'రాజలక్ష్మి' సంస్థకు దాదాపు ఆస్థాన సంగీత దర్శకుడైన ఘంటసాల ఈ చిత్రానికి తన స్వరరచనలోని జిగి, బిగి ఏమిటో చూపించారు. పాటల ఆర్కెస్ట్రయిజేషన్‌లోనూ ప్రత్యేక ముద్ర వినిపించారు. ప్రేయసిని చూసి ప్రియుడు పాడే పాటల్లో 'బందిపోటు'లో ఎన్టీయార్‌, కృష్ణకుమారి జంట మీద వచ్చే 'వగలరాణివి నీవే... సొగసుకాడను నేనే!..' ఇవాళ్టికీ చిరస్మరణీయమే! చిలిపిదనం మేళవించిన ఈ హుషారైన పాటకు భిన్నంగా, మంద్రగతిలో శ్రావ్యంగా సాగే పాట 'ఊహలు గుసగుసలాడే... నా హృదయము ఊగిసలాడే...' అంటూ ఆరుద్ర రాసిన పాటలోని బీజియమ్‌లలో ఘంటసాల వాడిన వాద్య శబ్దాలు సున్నితమైన రీతిలో సన్నివేశానికి బలమిచ్చేవే! ఆ పాటలు, వాటికి నటీనటుల అభినయం, ''తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు...'' లాంటి భావాలతో కూడిన సాహిత్యం ప్రేక్షకులకు ఇప్పటికీ తీపి గుర్తులే!
కలర్‌లో క్లయిమాక్స్
తెలుగు నాట కలర్‌ సినిమాలంటే క్రేజు పెరుగుతున్న రోజులవి. తెలుగులో పూర్తి కలర్‌ చిత్రం 'లవకుశ' (1963) అప్పటికే విడుదలై, జన నీరాజనాలు అందుకుంటోంది. ఆ క్రమంలోనే 'బందిపోటు'లో కూడా పతాక సన్నివేశాలను మాత్రం 'ఈస్ట్‌మన్‌ కలర్‌'లో చిత్రీకరించారు. ఈ సినిమాకు అది కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ అయింది. ఇక, రవికాంత్‌ ఛాయాగ్రహణం, కృష్ణారావు కళా దర్శకత్వం, ప్రకాష్‌ ఎడిటింగ్‌ కూడా చిత్రాన్ని జనాకర్షకం చేశాయి. విజయవాడ 'దుర్గాకళామందిరం'తో సహా మొత్తం 5 కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది.
అంతకు ముందు 'పిచ్చి పుల్లయ్య', 'వినాయక చవితి' లాంటి చిత్రాల్లో కలసి నటించినప్పటికీ, ఎన్టీయార్‌, కృష్ణకుమారి కాంబినేషన్‌కు 'బందిపోటు' ఓ కొత్త స్థానం తెచ్చింది. ఆ దెబ్బతో దాదాపు ఆరేళ్ళ పాటు వారిద్దరూ హిట్‌ పెయిర్‌గా పలు చిత్రాల్లో పదే పదే తెరపై కనిపించారు.
కాసులు కురిపించిన కాంబినేషన్‌

తక్కువ పని దినాల్లోనే సినిమా పూర్తి చేసి, విజయాలు అందించే విఠలాచార్య శైలి నచ్చడంతో ఎన్టీయార్‌ ఆయనకు అప్పట్లో వరుసగా సినిమాలు చేశారు. బాక్సాఫీస్‌ హిట్‌ 'బందిపోటు' తరువాత 1974 జనవరిలో విడుదలైన 'పల్లెటూరి చిన్నోడు' దాకా కేవలం పదేళ్ళ చిల్లర కాలంలోనే వీరిద్దరి కలయికలో ఏకంగా 14 చిత్రాలు ('బందిపోటు'తో కలిపి) రావడం చెప్పుకోదగ్గ విశేషం. 'మంగమ్మ శపథం', 'పిడుగు రాముడు', 'చిక్కడు - దొరకడు', 'గండికోట రహస్యం', 'కదలడు - వదలడు', 'లక్ష్మీ కటాక్షం', 'ఆలీబాబా నలభై దొంగలు' వగైరా ఆ వరుసలోవే! ఈ పధ్నాలుగు చిత్రాల్లో మూడు విఠలాచార్య సొంత నిర్మాణాలే!
ఏతావతా, ఈ కాంబినేషన్‌లోని మొత్తం 14 సినిమాల్లో ఏకంగా 11 చిత్రాలు విశేష జనాదరణతో విజయవంతమైనవే! మిగిలిన మూడు చిత్రాలు ('విజయం మనదే', 'రాజకోట రహస్యం', సాంఘిక చిత్రం 'పల్లెటూరి చిన్నోడు') కూడా నిర్మాణంపై పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టి, ఎంతో కొంత లాభాలు తేవడం గమనార్హం. పరిమితమైన వ్యయంతో చిత్ర నిర్మాణం సాగించే విఠలాచార్య శైలికీ, ఎన్టీయార్‌ ఇమేజ్‌కూ అది నిదర్శనం. ఈ 14 సినిమాలే కాక, విఠలాచార్య నిర్మాతగా నిలిచి, తన కుమారుడు బి.వి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో తీసిన మరో రెండు చిత్రాలు 'అగ్గి వీరుడు', 'నిన్నే పెళ్ళాడతా' లోనూ ఎన్టీయారే హీరో!
రిపీట్‌ రన్‌లలోనూ కనక వర్షం
అప్పటి దాకా కాంతారావు లాంటి మధ్య శ్రేణి హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన విఠలాచార్య, 'బందిపోటు', ఆ తరువాతి హిట్లతో పెద్ద స్థాయి దర్శకుడయ్యారు. మరో విశేషం ఏమిటంటే, ఎన్టీయార్‌ స్టార్‌ ఇమేజ్‌ కారణంగా 'బందిపోటు'తో సహా విఠలాచార్య - ఎన్టీయార్ల కాంబినేషన్‌ చిత్రాలన్నీ రిపీట్‌ రన్‌ వ్యాల్యూను పెంచుకున్నాయి. ఆ రిపీట్‌ రన్‌లలోనూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పండించాయి.
అంతేకాక, తొలి రిలీజుల్లో హిట్టయిన వీరి చిత్రాలు ఆ తదుపరి విడుదలల్లో కూడా మళ్ళీ ఆ చిత్ర నిర్మాణ వ్యయాలకు సమానంగా వసూళ్ళు సాధించడం ఓ అరుదైన రికార్డు. ఈ విషయాన్ని ఆ చిత్రాల పంపిణీదారులు, ప్రదర్శకులు ఇప్పటికీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.
'జురాసిక్‌ పార్క్‌' బలాదూర్‌!
మాస్‌ మెచ్చే ఇలాంటి చక్కటి కాలక్షేప చిత్రాలతో 'జానపద బ్రహ్మ'గా పేరు తెచ్చుకున్న విఠలాచార్య గొప్పతనం ఇటీవల కూడా తేటతెల్లమైంది. వాణిజ్య వివరాలలోకి వెళితే, రాక్షస బల్లుల నేపథ్యంలో నడిచే స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 'జురాసిక్‌ పార్క్‌' (1993) ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టే రీతిలో వసూళ్ళు సాధించింది. కానీ, విచిత్రంగా ఒక్క తెలుగునాట మాత్రం ఆ సినిమాకు యావరేజ్‌ వసూళ్ళే దక్కాయన్నది చేదు నిజం. అదే 'జురాసిక్‌ పార్క్‌' కన్నా ఏడాది పై చిలుకు ముందే వచ్చిన మరో హాలీవుడ్‌ యాక్షన్‌ అద్భుతం జేమ్స్‌ కామెరాన్‌ 'టెర్మినేటర్‌-2' మాత్రం మిగతా ప్రాంతాల్లో 'జురాసిక్‌ పార్క్‌' వసూళ్ళలో సగం కూడా సంపాదించలేకపోయింది కానీ, తెలుగునాట మటుకు 'జురాసిక్‌ పార్క్‌'కు రెట్టింపు కలెక్షన్లు సాధించింది.
మరి ఈ రెండు హాలీవుడ్‌ హిట్లకూ తెలుగు ప్రేక్షకులు వేర్వేరు రకాలుగా స్పందించడానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరమైన అంశమే! ఈ విచిత్ర ధోరణికి కారణం ఏమిటని లోతుగా విశ్లేషించిన బాక్సాఫీస్‌ పండితులు, ''సాంకేతికంగా ఏమంత పురోగతి సాధించని 1960లు, '70లలోనే విఠలాచార్య అలాంటి రాకాసి బల్లుల నేపథ్యాలతో తెలుగులో సినిమాలు తీశారు. అందుకే, 'జురాసిక్‌ పార్క్‌'లోని అద్భుత రసాన్ని ఇతర ప్రాంతాల ప్రేక్షకులంతగా మన ప్రేక్షకులు ఫీల్‌ కాలేదు'' అని సహేతుకంగా తేల్చారు.
ఏమైనా, స్పీల్‌బర్గ్‌, జేమ్స్‌ కామెరాన్‌ లాంటి దిగ్దర్శకుల కన్నా ఎన్నో ఏళ్ళ ముందే మనకు విఠలాచార్య లాంటి దర్శకుడు ఉండడం ఘనమైన విషయమే! ''విఠలాచార్య సెట్టింగులు'', ''విఠలాచార్య జిమ్మిక్కులు'' అంటూ జనం నోట ఇవాళ్టికీ నానుతూ, తన పేరే ఓ 'బ్రాండ్‌నేమ్‌'గా స్థిరపడిన దర్శకుడికీ, అతని సినిమాలు 2000వ సంవత్సర ప్రాంతం దాకా రిపీట్‌ రన్లు ఆడేందుకు కారణమైన ఎన్టీయార్‌ స్టార్‌ ఇమేజ్‌కూ తెలుగు సినిమా చరిత్రలోనూ, బాక్సాఫీస్‌ రికార్డుల్లోనూ చెరగని స్థానమనేది అందుకే! 
- రెంటాల జూనియర్‌

(Published in 'Praja Sakti' daily, 15th Aug 2013, Thursday, Page No. 10)
......................................................................