జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 31, 2010

భయపెట్టిన ‘బావ’



ఈ మధ్య మనవాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తున్నారంటే హాలుకు వెళ్ళాలంటే భయమేస్తోంది. అయినా సరే, తెలుగు సినిమా విడుదలైతే, మనసు ఊరుకోదు. దాంతో, ఖర్చు, శ్రమ పక్కనబెట్టి, పట్టువదలని విక్రమార్కుడిలా హాలు దారి పట్టక తప్పడం లేదు.

గడచిన వారం, పది రోజుల పైగా రకరకాల కారణాలతో తెగని పనుల్లో తెగ మునిగిపోవడంతో ఈ వారాంతం ఎలాగైనా సినిమాకు చెక్కేయాలనుకున్నా. దానికి తోడు పక్షం రోజుల తరువాత ఊళ్ళోకి కొత్త తెలుగు సినిమా వచ్చి, ఊరించింది. రెండు రోజులుగా కురుస్తున్న వానల మధ్యలోనే మనసు విహంగం రెక్కలు విప్పుకొని, హాలు ముంగిట వాలింది.

కానీ, సిద్ధార్థ నటించిన ‘బావ’ ఉన్న ఉత్సాహాన్ని కూడా హరించేసింది. నిలువునా నీరసం తెప్పించేసింది. సగటు తెలుగు సినిమా ఇక మారదేమోననే నిరాశ వైపు నన్ను మరో అడుగు ముందుకు నెట్టేసింది. కష్టపడి నిద్ర ఆపుకొని ఈ మూడుముక్కల టపా రాస్తున్నా... కనీసం రేపు ఆదివారం పొద్దున్నే నా లాగా మరెందరో తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఈ సినిమాకు బకరాలుగా దొరికిపోకూడదని.

(రేపు నిద్ర లేచాక, ఓపిక చేసుకొని మిగతా కథ చెబుతాను మిత్రులారా....)

Wednesday, October 20, 2010

ఇది రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ చరిత్ర!

సినిమా సిద్ధమవుతుండగానే, దానికి ఏ రకంగా ప్రచారం పొందాలా అని చూడడం దర్శక - నిర్మాతల్లో సహజం. బహుశా, సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల వరకు ఏదో ఒక వివాదంతో మీడియాను తన చుట్టూ తిప్పుకోవడం దర్శక - నిర్మాత రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అనుకోవాలి. ఏ సినిమా తీస్తున్నా, దాని గురించి నలుగురూ చెప్పుకొనేలా చేయడంలో ఆయన కళకు తాజా ఉదాహరణ - రానున్న రక్తచరిత్ర చిత్రం.

ఆంధ్రదేశంలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని ముఠా నేతల నిజజీవితాలను ఆధారంగా చేసుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన సిద్ధం చేసిన రక్తచరిత్ర సినిమా ఇప్పటికి ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికీ తెలుసు. కానీ, ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ప్రకటన దానికి పరాకాష్ఠ. ఈ సినిమాలో ఎవరిని ఎక్కువగా, మరెవరిని తక్కువగా చూపారో అనీ ఇప్పటికే కొందరు కత్తులు నూరుతుంటే, అనంతపురంలో రక్తచరిత్ర ప్రీమియర్ ప్రదర్శన జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదేమిటి, పబ్లిసిటీ వ్యూహమా అని అడిగిన వాళ్ళకు వర్మ నిర్లజ్జగా ఒకే మాట చెప్పారు. ‘‘అవును. పబ్లిసిటీ కోసమే’’ అని తడుముకోకుండా బదులిచ్చారు. పైగా, ‘‘నేను చేస్తున్నది సినిమా వ్యాపారం. దేనికైనా పబ్లిసిటీ అవసరం. సినిమాకు మరీ అవసరం’’ అని ఓ విశ్లేషణ కూడా వాక్రుచ్చారు. వర్మాజీ, వాట్ యాన్ ఎనాలసిస్. అంటే, ఇటు పబ్లిసిటీ కోసం వాస్తవికత, అటు (అ)వాస్తవికతతో పబ్లిసిటీ అన్న మాట.

రాయలసీమ అంటేనే రక్తపాతాలు, బాంబులు, బరిసెలు, వందలాది టాటా సుమోలని చూపుతున్న సగటు తెలుగు సినిమా చాలదన్నట్లు, ప్రచారం కోసం మీరూ ఏదన్నా చేస్తారన్నమాట. అన్నట్లు, మొన్నే వర్మ గారు మరో మాట అన్నారు. ‘‘నేను ఏవో పాత్రలు తీసుకొని సినిమా కథలు రాసుకుంటున్నా. దానికి మీడియానే లేని పోని వివాదం రేపుతోంది’’ అని వర్మ ఉవాచ. పబ్లిసిటీ కోసమే అంతా అని స్పష్టత ఉన్న రామ్ గోపాల్ వర్మ తప్పు మరెవరిదో అనేస్తున్నారు. ఆయన మాటలు వింటే, ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే, దూడకు గడ్డి కోసం’ అన్న మాటకు నాలుగు ఆకులు ఎక్కువగా - ‘గడ్డి మేస్తున్న దూడ కోసం’ అని చెబుతున్నట్లుంది.

Monday, October 18, 2010

ఎవరు మాసు? ఎవరు క్లాసు? - ఇంతకీ చిన్న ఎన్టీయార్ మాస్ హీరోనా? క్లాస్ హీరోనా?

ఎవరు మాసు? ఎవరు క్లాసు? ఇది చాలా చిత్రమైన ప్రశ్న. చిక్కుప్రశ్న. జవాబు తెలుసని అనిపిస్తూనే, చెప్పాలంటే ఇబ్బందిగా మారే అంశం. బృందావనం - ఈ గోవిందుడు 'ఎందరి' వాడోలే... అన్న నా టపాపై కొత్త పాళీ గారు పెద్ద చర్చకే తెర తీశారనిపించింది. దీనికి జవాబు మీకు తెలియనిదని నేను అనుకోను. నాకు పూర్తిగా తెలుసని చెప్పడానికి ధైర్యం చేయను. అయితే, ఇటీవల నేను రాసిన బృందావనం... చిత్రంపై సమీక్ష వరకు పరిమితమై నాకు తోచిన వివరణ ఇవ్వదలిచాను.

చెప్పాలంటే - ఒక్కో నటుడికి / హీరోకు ఒక్కో వర్గం ప్రేక్షకులలో అభిమానం, ఆదరణ ఎక్కువ ఉండడం చిత్ర సీమలోని లక్షణం. అయితే, ప్రతి వర్గమూ దానికదే ప్రత్యేక ఉనికితో కూడినదని కానీ, మరొక వర్గం ప్రేక్షకులతో ఎక్కడా ఉమ్మడి లక్షణాలు లేనిదని కానీ చెప్పలేం. అలాగే, అన్ని వర్గాలనూ, అన్ని వేళలా, అన్ని సినిమాల్లో ఆకట్టుకొనే నటుడు, నటన ఉంటాయని అనుకోలేం.

మార్కెట్ లో ఉన్న విశ్లేషణను బట్టి చెప్పాలంటే - చిన్న ఎన్టీయార్ మాస్ హీరో. మొదటి నుంచి అతని సినిమాలకు ఉన్న ఓ నిర్దిష్ట ప్రేక్షక వర్గాన్ని ఉద్దేశించి చేసిన ఉరామరిక వర్గీకరణ అది. అతని సినిమాలు సామాన్య ప్రేక్షక జనాన్ని ఉద్దేశించి, ఎక్కువగా సాగుతాయన్నది ఆ అంచనా. తదనుగుణంగానే, ఎక్కువ భాగం అతని సినిమాలకు వారే మహారాజ పోషకులు. సింహాద్రి, ఆది, నా అల్లుడు, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్ లాంటి ఆయన చిత్రాల సరళి, వాటిలోని అంశాలు గమనిస్తే - ఆ మాటలోని అంతరార్థమేమిటో గ్రహించవచ్చు.

అది రచన అయినా, సినిమా అయినా, మరొకటైనా సరే - ప్రతి సృజనకూ దానికంటూ ఓ లక్షిత పాఠక వర్గం / వీక్షక వర్గం ఉంటుంది. అయితే, ఆ లక్షిత వర్గాన్ని అవి రంజింపజేస్తాయా లేదా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు చిన్న ఎన్టీయార్ చిత్రాలన్నీ ప్రధానంగా పైన చెప్పిన సామాన్య ప్రేక్షక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని తీసేవే.

అయితే, చిత్రాల మార్కెట్ ను విస్తరించుకోవాలన్నా, వాటికి వసూళ్ళు పెంచుకోవాలన్నా, నటుడిగా చిరకాలం నిలబడాలన్నా - ఉన్న అభిమాన ప్రేక్షక వర్గ పునాదిని నిలుపుకొంటూనే, కొత్త వర్గాలను కూడా తన చిత్రాలకు వీక్షకులుగా మార్చుకోవాలి. స్టార్ హీరోలు అయిన వారు, అవుదామని ప్రయత్నించేవారు అనివార్యంగా చేసే ప్రయత్నం ఇదే. పైగా, ఎప్పుడూ ఒకే వర్గ ప్రేక్షకులను ఆకర్షించే చిత్రాలు చేసి, చేసీ, హీరోలకూ మొహం మొత్తడం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో కొత్త వర్గాన్ని ఆకర్షించేలా ఇమేజ్ మార్పునకు హీరో ప్రయత్నిస్తాడు.

ఎన్.టి.ఆర్. జూనియర్ తాజాగా బృందావనం చిత్రంలో చేసిన పని అదే. పోరాటాలు నిండిన యాక్షన్ పాత్రలతో, నృత్యాలతో తాను అభిమానులుగా సంపాదించుకున్న ప్రధానమైన సామాన్య ప్రేక్షక వర్గానికి తోడుగా, కుటుంబ ప్రేక్షకులనూ, ఎగువ తరగతి ప్రేక్షక వర్గాలనూ కూడా మరింత ఎక్కువగా ఆకర్షించాలనీ, ఆ రకం కథలు, పాత్రలు ఎంచుకోవాలనీ అతను నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. కెరీర్ పురోగమనంలో అది అతనికి తప్ప లేదు. అందులో తప్పూ లేదు. అందుకే, బృందావనం కథ, అతని రూపురేఖలు ఈ ఆశించిన కొత్త మార్పునకు తగ్గట్లు ఉన్నాయి. దీన్నే ముతకగా సినిమా పరిభాషలో మాస్ నుంచి క్లాస్ హీరోగా ఇమేజ్ మార్చుకోవడం అంటున్నాం. (అఫ్ కోర్స్, మళ్ళీ తనకున్న సామాన్య అభిమాన వర్గం పునాదిని కోల్పోకుండా ఉండడం కోసం ఇదే సినిమాలో ఎన్.టి.ఆర్. జూనియర్ యాక్షన్ తరహా చిత్రాల ఫైట్లూ ఎక్కువే చేశారు. అది వేరే సంగతి).

అయితే, ఇక్కడే ఓ చిక్కొస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాకు రోజు కూలీ శ్రామికుడు రాజ పోషకుడు. మహిళలు మహారాజ పోషకులు. మాయ చేసి, జోల పాడే సినిమా అప్పట్లో సమస్యల నుంచి మధ్యతరగతి జనం ఎస్కేపిజానికి మార్గం. ఈ వర్గాలన్నిటికీ సినిమా తప్పనిసరి వినోదం. ఇలాంటి విస్తృత జనబాహుళ్యాన్ని మెప్పించడమే ధ్యేయంగా మన సినిమా నడిచింది.

టీవీ చానళ్ళ ప్రభంజనం మొదలయ్యాక, హాళ్లలో టికెట్ రేట్లు అందీ అందకుండా పోయాక, ఇవాళ హాలుకు వచ్చే ప్రేక్షక వర్గాలు, వారి అభిరుచులు మారిపోయాయన్నది నిష్ఠుర సత్యం. ఈ పరిస్థితుల్లో, సినిమాను వ్యాపారంగానే చూస్తున్న ప్రస్తుత తరుణంలో మన సినిమాలన్నీ ప్రధానంగా యువతరాన్నీ, కాలేజీ కుర్రకారునూ (తెలుగునాట వాళ్ళే ఇవాళ ఎక్కువగా సినిమాలకు వస్తున్నారన్నది ఓ థీరీ) దృష్టిలో పెట్టుకొని వస్తున్నాయి. తరచూ సినిమాలకొచ్చే శ్రామిక వర్గం, ఈ యువజన వర్గాలే ఇవాళ తెలుగు సినిమాకు పోషకులు. కాబట్టి అదే నేటి సామాన్య ప్రేక్షక వర్గం.

ఇక, ఒకప్పుడు సినిమాలు చూసినా ఇప్పుడు ఆ జోరు తగ్గించేసిన పెద్దలు, నడి వయసు దాటిన మహిళలు, సకుటుంబ ప్రేక్షకులు - వీరంతా అదనపు వర్గాలు. అరుదుగానో, అప్పుడప్పుడో, తమను ఆనందింపజేసే కథ తెరపై వచ్చినప్పుడో మాత్రమే హాళ్ళకు కదిలే ఈ వర్గాన్నే సినిమా ట్రేడ్ వర్గాలు క్లాస్ అంటున్నారు. ఈ వర్గీకరణలు ఏ మేరకు నిర్దుష్టమైనవన్నది పెద్ద చర్చే. కానీ, ఈ పరిభాషను తప్పించుకొంటూ, సినిమాలను సమీక్ష చేయడం అసాధ్యం కాకపోవచ్చు. అలాగని ఈ నేపథ్యాన్ని పూర్తిగా విస్మరిస్తూ, విశ్లేషణకు దిగడం మాత్రం ఆచరణలో, అనుభవంలో అవివేకమయ్యే ప్రమాదం ఉంది.

Saturday, October 16, 2010

ఇమేజ్ మార్పు కోసం చిన్న ఎన్టీయార్ విఫలయత్నం - 'బృందావనం'


(‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?! - పార్ట్ 2)

జగపతిబాబు 'శుభమస్తు' (నిజానికి అది ఓ తమిళ చిత్రానికి రీమేకట)మొదలు పతాక సన్నివేశంలో బాలకృష్ణతో నిర్మాత 'యువచిత్ర' కాట్రగడ్డ మురారి తీసిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం దాకా అనేకానేక చిత్రాల ప్రభావం బృందావనం... గోవిందుడు అందరి వాడేలే... సినిమా మీద కనిపిస్తూనే ఉంటుంది.

చూపిన కథలే చూపితే....

పలు విజయవంతమైన చిత్రాల నుంచి వీలైనన్ని ముక్కలు ఏరుకొని తీసిన ఈ సినిమాకు కథ, కథనం, దర్శకత్వం - మూడూ వంశీ పైడిపల్లివే. ఈ సినిమా నిడివి పదహారు రీళ్ళే అయినా, కనీసం పదహారేళ్ళ కథను ఏకబిగిన చూపిస్తున్న భావన కలిగిస్తుంది. దర్శకుడి కథన మహిమ అది. ఇదే 'బృందావనం'చిత్ర నిర్మాత దిల్ రాజు హీరో ప్రభాస్ తో నిర్మించిన 'మున్నా' చిత్రం తీసిన దర్శకుడు ఈయనే.

నటులు సరే... నటన మాటేమిటి...

'బృందావనం...'లో నటీనటుల సంగతి చూస్తే - బాగా ట్రిమ్ చేసిన మీసం, గడ్డంతో క్రిష్ పాత్రలో చిన్న ఎన్టీయార్ బాగున్నారు. ప్రేమికుడిగా, రౌడీలను ఎదిరించే సాహసికుడిగా ఏక కాలంలో అటు కుటుంబ ప్రేక్షకులనూ, ఇటు సామాన్య జనాన్నీ ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నించారు. అయితే, నిజమైన భావోద్వేగాలకు అవకాశం లేని ఈ స్క్రిప్టులో ఆయన అద్భుతంగా చేసిన నటన ఏమిటంటే - ప్రశ్నార్థకమే.

పైపెచ్చు ఆ ప్రయత్నమేదో పూర్తిగా నిజాయతీతో చేసి ఉండాల్సింది. అదీ లేదు. సినిమా మరీ క్లాస్ అవుతుందన్న భయమో ఏమో, దర్శకుడు వీలైన చోటల్లా హీరోతో మానవమాత్రులకు సాధ్యం కాని ఫైట్లు చేయించారు. మాస్ ను మెప్పించాలని అతిగా శ్రమించారు. (ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్లు - రామ్ - లక్ష్మణ్ సోదరులు). కానీ,పల్లెటూరి ఎర్రబస్సులో పవర్ స్టీరింగ్, కత్తితో వందల అడుగుల చెట్టును కూల్చేయడం, ఎంత భారీ మనిషినైనా సరే అందులో సగమైనా లేని హీరో ఒంటిచేతితో గాలిలో గిరగిరా తిప్పేయడం లాంటి నమ్మశక్యం కాని ఆ ఫైట్లతో ఏ వర్గం ప్రేక్షకుడైనా మమేకం కావడం కష్టమే. దాంతో, ఈ నిమా అటూ, ఇటూ - ఎటూ చెందకుండా తయారైంది.

కథానాయికలుగా సమంత, కాజల్ - ఇద్దరూ ఉన్నా వారు కథలో అందమైన బొమ్మలే తప్ప, ప్రాణమున్న పాత్రలుగా కనిపించే ఘట్టాలు సినిమాలో అరుదు. ఆహుతి ప్రసాద్, రఘుబాబు, బ్రహ్మాజీ, సురేఖావాణి, తనికెళ్ళ భరణి, సితార - ఇలా సినిమా నిండా పేరున్న నటులు చాలా మందే ఉన్నారు. కానీ, మనసును తాకే పాత్రలే కరవు.

పాత్రచిత్రణలో లోటుపాట్లు

కాజల్ కు తాత పాత్రలో కోట శ్రీనివాసరావు, అతని పెద్ద కొడుకుగా ప్రకాశ్ రాజ్, చిన్న కొడుకుగా శ్రీహరి - వీరి మధ్య బంధాలనూ, అంతస్సంఘర్షణనూ బలంగా చెప్పగల అవకాశం స్క్రిప్టులో ఉంది. అయితే, ఆ పని చేయలేకపోయారు. భావోద్వేగ ప్రకటన అంటే గొంతు చించుకొని అరవడమని మన చిత్ర రూపకర్తలు అనుకున్నట్లు ఉన్నారు. అందుకే, సినిమాలో కొన్నిచోట్ల ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఆంగికాన్ని వదిలి వాచికం మీద అతిగా పడ్డారు. ఫలితం - దృశ్యప్రాధాన్యం పోయి, శబ్ద కాలుష్యం మిగిలింది. అలాంటి సన్నివేశాల్లోని ఆ మితిమీరిన నాటకీయ ఫక్కీ ఏ తరం ప్రేక్షకులకైనా సహన పరీక్ష అని దర్శకుడు గుర్తించగలిగితే బాగుండేది.

ఈ సినిమాలో పాత్రల ప్రవర్తనకు క్రమానుగత పరిణామం కూడా లేదు. ‘‘ పాతికేళ్ళ వైరాన్ని పది నిమిషాల్లో పోగొట్టే మొనగాడివా’’ అని ఓ దశలో హీరోను ప్రకాశ్ రాజ్ ప్రశ్నిస్తాడు. పాత్ర ద్వారా తాను వేసుకున్న ప్రశ్నను తానే మర్చిపోయిన దర్శకుడు చివరకు సినిమాలో చూపించింది అదే. ప్రకాశ్ రాజ్, శ్రీహరి పాత్రలు ద్వేషం నుంచి ప్రేమకూ, ప్రేమ నుంచి ద్వేషానికీ ఎప్పటికప్పుడు మీట నొక్కినంత సులభంగా మారిపోయినట్లు కనిపిస్తుంది.

అలాగే, ‘‘మా అందరి మనసూ చూరగొని, మమ్మల్ని మార్చేశాడు. ఈ ఇంటిని బృందావనం చేశాడు’’ - అంటూ హీరో పట్ల ప్రకాశ్ రాజ్ కుటుంబం ప్రేమ చూపడానికీ, ఇంటిపెద్ద ప్రకాశ్ రాజ్ తోనే వాదించడానికీ కారణమైన సన్నివేశాలేవీ సినిమాలో లేవు. (ఒక్క ఆహుతి ప్రసాద్, రఘుబాబులను నాటకీయంగా మార్చేసిన సీన్ తప్ప). దాంతో, వాళ్ళ డైలాగులు తెచ్చి పెట్టుకొని చెప్పినట్లు ఉంటాయే తప్ప, కథనంలో అతకవు. హీరో తల్లి తండ్రుల పాత్రలు కూడా కథ కోసం రాసుకున్నట్లు కనబడేవే. పాత్రల్లోనూ, వాటి భావోద్వేగాల్లోనూ సహజత్వం కన్నా కృత్రిమత్వమే తాండవిస్తుంది.

కామెడీయే కొంత అండ

ఎటొచ్చీ మధ్య మధ్య వస్తూ పోయే వినోదమే ఈ సినిమాకు ఉన్నంతలో పెద్ద బలం. ప్రకాశ్ రాజ్ కుటుంబంలోని చిట్టి పాత్రలో వేణుమాధవ్ కాసేపు కామెడీకి ఉపకరించారు. 'రత్తాలు - రైసు మిల్లు' సి.డి. లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అలాగే, 'బొమ్మరిల్లు' టైపు తండ్రినంటూ సెకండాఫ్ లో హీరోకు తండ్రిగా నాటకమాడడానికి వచ్చిన కాసేపు బ్రహ్మానందం - ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్.

సాంకేతిక విభాగాల సంగతి

ఈ చిత్ర సాంకేతిక విభాగాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది - ఛోటా కె. నాయుడి ఛాయాగ్రహణ శ్రమ. మార్తాండ్ కె. వెంకటేశ్ తన ఎడిటింగ్ కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే బాగుండేది. అఫ్ కోర్సు ఇప్పుడు కూడా వచ్చిన నష్టమేమీ లేదు. హాలులోని ప్రొజెక్టర్ ఆపరేటర్లే ఆ పని చేయడం ఖాయమని అర్థమవుతూనే ఉంది.

అలాగే, ఆ మధ్య కొన్ని మెరుపులు మెరిపించిన థమన్ ఎస్. ఈ చిత్రానికి అందించిన సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో మెలొడీ పాటలు కూడా కట్టిన ఈ యువ సంగీత దర్శకుడు పాటల్లోని బీజియమ్ ల మొదలు సినిమాలోని సన్నివేశాల వరకు బీట్ కే పెద్దపీట వేశారు. రీ-రికార్డింగులోనూ అదే వరస. సన్నివేశంలోని ఎఫెక్టును పెంచడానికి సంగీతంలో నిశ్శబ్దం కూడా ఓ భాగమేనని మర్చిపోయేసరికి, ప్రతి దృశ్యంలో రీ-రికార్డింగ్ శబ్దాలు చెవులకు హోరెత్తిస్తుంటాయి, మనసుకు ఠారెత్తిస్తుంటాయి.

పాటలు, డ్యాన్సులు


కొన్ని పాటలకు ఎంచుకున్న లొకేషన్లు (ముఖ్యంగా కాజల్, ఎన్టీయార్ల పల్లె సీమ పాట), వాటిని చూపిన తీరు కంటికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కోసం కూడా బాగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ చిత్రంలోని పాటలు గుర్తుంచుకోగలిగేలా లేవు. నాకైతే, ఈ డి.టి.ఎస్.ల హోరులో పాటల్లో మాటలు అక్కడక్కడే వినిపించాయి. రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, లలిత నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటల్లో చిన్న ఎన్టీయార్ తన స్వతఃసిద్ధంగా చులాగ్గా నర్తించారు. (నర్తించలేక ఇబ్బంది పడ్డ పాట ఒకటి ఉంది. దాని గురించి చివరలో...)

ఇక, పిక్స్ లాయిడ్ సంస్థకు చెందిన యుగంధర్, నయీమ్ ల బృందం ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్ లు సమకూర్చారు. ప్రకాశ్ రాజ్ ఇల్లుగా సినిమాలో కనపడే నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలోని ఇంటి సెట్టింగ్ చుట్టూరా అంత ఖాళీ స్థలం, ప్రకృతి దృశ్యాలు వగైరా మొత్తం కంప్యూటర్ లో విజువల్ ఎఫెక్ట్ ల క్రియేషనే.

వంశీ పైడిపల్లి రాసుకున్న ఈ చిత్ర కథకు ముగ్గురు రచనా సహకారం అందించారు. ఆ ముగ్గురిలో ఒకరైన కొరటాల శివ దీనికి సంభాషణలు సమకూర్చారు. కొన్ని చోట్ల పాటక జన ప్రశంసలందే డైలాగులూ రాశారు. ‘సిటీ నుంచి వచ్చాడు కదా - సాఫ్టుగా ఉన్నాడనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని రెచ్చగొట్టకు. రెచ్చగొడితే రచ్చ రచ్చే...’ (విలన్ తో హీరో)లాంటివి ఆ కోవ లోవే. ‘‘భయమా, వినయమా’’ అని హీరో అడిగితే, ‘భయంతో కూడిన
వినయంతో వచ్చిన....’ అంటూ వేణుమాధవ్ చెప్పే డైలాగు మహేశ్ బాబు ‘అతడు’లో త్రివిక్రమ్ రాసిన డైలాగుకు నకలు.

చిన్న ఎన్టీయార్ ఇమేజ్ పెంపు కోసం మళ్ళీ ‘యమదొంగ’ వగైరా చిత్రాల్లో లాగా పెద్ద ఎన్టీయార్ పాత్రను సినిమాలోకి రప్పించారు. దాన వీర శూర కర్ణ చిత్రంలోని గీతోపదేశం సన్నివేశంలోని విశ్వరూప కృష్ణుడి వేషంలో పెద్దాయన క్లైమాక్స్ లో కనిపిస్తారు. కానీ, అక్కడ రెండు మూడు డైలాగులకు మిమిక్రీ వాళ్ళతో చెప్పించిన పెద్ద ఎన్టీయార్ డబ్బింగ్ ఆ పాత సినిమాలను చూసి పెరిగిన తరానికి చీకాకు తెప్పిస్తుంది.

'ఢీ, రెఢీ, బిందాస్' - ఇలా ఈ మధ్య కాలంలో వినోదాత్మక పంథాలో నడిచిన మాస్ చిత్రాలు అందరికీ గుర్తే. నాలుగు డబ్బులు చేసుకున్న ఆ చిత్రాల తోవే ఈ కథకూ శ్రేయస్కరమని దర్శక, నిర్మాతలు భావించినట్లున్నారు. అందుకే, చాలా చోట్ల ఆ బాటలోనే నడిచారు. కానీ, 'బావగారూ బాగున్నారా', 'అల్లుడు గారు వచ్చారు' లాంటి పలు సినిమాలను గుర్తుకు తెచ్చేలా, అనేక అంశాల కిచిడీగా మార్చడంతో, ఓ దశ గడిచేసరికే హాలులోని ప్రేక్షకులకు విసుగు పుడుతుంది. ఎప్పటికప్పుడు అయిపోవచ్చిందని అనిపిస్తూనే అవకుండా సినిమా ఇంకా ముందుకు సా....గుతున్నట్లు కనిపిస్తుంది. అదే ఈ చిత్రంలోని పెద్ద బలహీనత. అందుకే, విశ్రాంతి దగ్గరే పతాక సన్నివేశం చూపించినంత భావన కలిగించే, ఈ గోవిందుడు - ప్రేక్షక జనులందరి వాడు కాలేకపోయాడు. ఇమేజ్ మార్పు ప్రయత్నంలో ఆశించినంత సఫలం కాలేకపోయాడు.

కొసమెరుపు -

సినిమా చివరలో వచ్చే ‘‘ రా.. ఎయ్ రా... ఏసేయ్ రా...’’ పాటలో ఎన్టీయార్ పదే పదే కింద కూర్చొని, పైకి లేచే ఓ స్టెప్పు వేయడానికి కష్టపడుతున్నట్లు తెరపై కనిపించేస్తుంది. ఇప్పటికే ఆర్య-2 లాంటి చిత్రాల్లో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వేసి మెప్పించిన అదే తరహా స్టెప్పును (యాక్సిడెంట్ అనంతరం కొంత ఇబ్బంది పడుతున్న)చిన్న ఎన్టీయార్ మీద ప్రయోగించాల్సిన పనేమిటి. ఆ స్టెప్పు వేయకపోయినా అతని నృత్య ప్రతిభకు వచ్చిన కొరతేమీ లేదు కదా. (అన్నట్లు కాళ్ళతో నేలను తుడిచినట్లుండే ఈ ఫ్లోర్ క్లీనింగ్ స్టెప్పు నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దేనా...)

‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?!

ఒక ఇమేజ్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పెద్ద హీరోను మరో ఇమేజ్ వైపు మరలించడం అంత సులభం కాదు. ఆ మార్పునకు అభిమాన ప్రేక్షక జనంతో అవుననిపించుకోవాలంటే చాలా శ్రమే పడాలి. మంచి కథ, ఆసక్తి కరమైన కథనం, ఆర్టిస్టుల అభినయ ప్రతిభ, ఆహ్లాదకరమైన సంగీతం - అన్నీ కావాలి. అవన్నీ ఆశించిన స్థాయిలో కుదరకపోతే కష్టమే. మాస్ హీరోగా ముద్ర పడిన చిన్న ఎన్టీయార్ ను, మంచి లవర్ బాయ్ గా చూపి, క్లాస్ కు దగ్గర చేయాలనే ప్రయత్నంగా ‘బృందావనం’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కానీ, ఆ ప్రయత్నం ఉడికీ ఉడకని అన్నంగా తయారవడమే విషాదం.

వేల కోట్ల రూపాయల కూడిన కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అధినేత సురేంద్ర (ముఖేశ్ ఋషి). అతనికి ఏకైక సంతానం కృష్ణ అలియాస్ క్రిష్ (ఎన్టీయార్ జూనియర్). ప్రాణాలకు తెగించి అయినా సరే, స్నేహితుడి ప్రేమను సఫలం చేసే రకం. ఏ సమస్యా లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్న హీరో, కాలేజీలో ఇందు (‘ఏ మాయ చేశావే’ చిత్ర ఫేమ్ సమంత)ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని తెచ్చి, ఇంట్లో అమ్మా నాన్నకు పరిచయం కూడా చేస్తాడు.

స్నేహితురాలి సమస్యకు పరిష్కారం కోసం హీరోను ఇందు ఆశ్రయిస్తుంది. ఇందు స్నేహితురాలు భూమి (కాజల్ అగర్వాల్). ఆమెకు విదేశాల్లో పై చదువులు చదవాలని ఉంటుంది. కానీ, ఆమె నాన్న (ప్రకాశ్ రాజ్) మాత్రం తన అక్క కొడుకు (అజయ్)కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేసేయాలని నిర్ణయిస్తాడు. ఆ పెళ్ళి తప్పించుకోవడం కోసం తాను ఇప్పటికే ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు భూమి తమ ఇంట్లో అబద్ధం చెబుతుంది. ఆ అబ్బాయిని తీసుకురమ్మంటాడు ఆమె తండ్రి. లేని బాయ్ ఫ్రెండ్ ను ఎక్కడ నుంచి తేవడమా అని భూమి ఇబ్బంది పడుతుంటుంది. భూమితో పాటు వాళ్ళ ఊరుకి వెళ్ళి, బాయ్ ఫ్రెండ్ గా నటించి, ఆ గండం నుంచి ఆమెను గట్టెక్కించాల్సిందిగా హీరోను ఒప్పిస్తుంది ఇందు.

భూమికి బాయ్ ఫ్రెండ్ గా నటిస్తూ, ఆమెతో పాటు ఊరెళ్ళిన హీరో ఆ పెద్ద కుటుంబంలో అందరి అభిమానాన్నీ సంపాదిస్తాడు. బద్ధశత్రువులుగా వేరు వేరు ఊళ్ళలో బతుకుతున్న భూమి తండ్రి (ప్రకాశ్ రాజ్)నీ, బాబాయ్ (శ్రీహరి)నీ కూడా కలుపుతాడు. భూమిని ఏకంగా హీరోకే ఇచ్చి పెళ్ళి చేసేయాలన్న దాకా కథ వెళుతుంది. అప్పటి దాకా బాయ్ ఫ్రెండ్ గా నటిస్తున్న హీరో ఒక్కసారి ఉలిక్కిపడతాడు. అదే సమయంలో పట్నం నుంచి ఇందు కూడా ఆ ఊరికి, ఆ ఇంటికి వస్తుంది. దాంతో కథ రసకందాయంలో పడుతుంది. గోవిందుడు ఏమవుతాడో... అంటూ ఫస్టాఫ్ ముగుస్తుంది.

పట్నం నుంచి వచ్చిన ఇందుకూ, ఆ ఇంటికీ సంబంధం ఏమిటి, ఈ దొంగ బాయ్ ఫ్రెండ్ నాటకం ఏమైంది, భూమిని పెళ్ళాడాలని తపిస్తున్న విలన్ బావ సంగతి ఏమైంది, ఇద్దరు భామల మధ్యన నలిగిన హీరో చివరకు ఏం చేశాడు - లాంటి ప్రశ్నలకు జవాబులన్నీ సెకండాఫ్ లో చూడవచ్చు.

(మిగతా భాగం మరి కాసేపట్లో...)

Friday, October 15, 2010

'బృందావనం' టికెట్ల కోసం ఇక్కట్లు


ఈ దసరా పండుగ సినిమాల్లో భాగంగా వచ్చిన ఆఖరి పెద్ద తెలుగు సినిమా బృందావనం. నిన్న అక్టోబర్ 14న రిలీజైంది. అయితే, మా ఊళ్ళో బృందావనం టికెట్లకు నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓ పక్క రోబో, మరో పక్క ఖలేజా వచ్చి పక్షం రోజులైనా పూర్తికాకపోవడంతో, మా ఊళ్ళో ఉన్న ఒకటి రెండు రెగ్యులర్ తెలుగు సినిమా హాళ్ళలో బృందావనం ఎక్కడ, ఎన్ని ఆటలు వేస్తున్నారన్నది ఆఖరి దాకా ఖరారు కాలేదు. అది ఓ పెద్ద తలకాయనొప్పిగా మారింది.

దాంతో, సినిమా రిలీజు రోజు ఉదయానికి కూడా సెకండ్ షో మాకు దగ్గరలో ఏ హాల్లో అయినా ఉందా, ఉంటే టికెట్లున్నాయా అన్నది తేలలేదు. అప్పటికీ మా సినీ మిత్ర బృందంలో ఒకరు అన్ని రకాలుగా ప్రయత్నించి చూశారు. ఇంటర్నెట్ బుకింగ్ కు సైతం సై అన్నా, సినిమా ఎక్కడ ఆడుతోందన్నది ఖరారవలేదు. దాంతో ఇబ్బంది పట్టుకుంది.

క్రమం తప్పకుండా తెలుగు సినిమాలు మాత్రమే ప్రదర్శించే హాలుకు మా మిత్రుడు రెండు, మూడు సార్లు బండి వేసుకు తిరిగాడు. కానీ, ఆఖరికి రిలీజ్ రోజు మధ్యాహ్నానికి ఆ హాలు వాడు చేతులెత్తేశాడు. రాత్రి 10 గంటలకు సెకండ్ షో గా బృందావనం వేద్దామని అనుకున్నప్పటికీ, రోజు మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క ఆట కూడా పోతుందని ఖలేజా వాళ్ళు పట్టుబట్టారట. దాంతో, ఖలేజా స్థానంలో బృందావనం సెకండ్ షో వేయడం కుదరలేదని హాలు మేనేజర్ చెప్పారు.

కానీ, ఎలాగైనా సినిమా చూడాలని ఓ కోరిక. చివరకు, మాకు చాలా దూరంగా ఉండే ఓ థియేటర్ లో సెకండ్ షో వేస్తున్నట్లు ఆఖరి నిమిషంలో కన్ఫర్మ్ చేశారు. దానికి మా మిత్రుడు కష్టపడి, ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేశాడు. విచిత్రం ఏమిటంటే ఆ సాదాసీదా థియేటర్లో మల్టీప్లెక్సు హాళ్ళకు దీటుగా టికెట్ రేటు వసూలు చేయడం. నిజానికి, ఆ థియేటర్లో నేల (రూ. 10), కుర్చీ (రూ. 50), బాల్కనీ (రూ. 70) ఉన్నాయి. కానీ, తెలుగు సినిమాలకు ఉండే వేలం వెర్రి దృష్ట్యా అక్కడ బాల్కనీ టికెట్ ను రూ. 100కు అధికారికంగా అమ్మేస్తున్నారు. ఇంటర్నెట్ లో బుకింగ్ చేసుకుంటే, ప్రతి టికెట్ కీ అదనంగా మరో 10 రూపాయలు బొక్క. ఇలా థియేటర్ యజమానులు ప్రేక్షకుల ఆసక్తిని ఆసరాగా చేసుకొని, నిలువు దోపిడీ చేయడం అక్షరాలా అన్యాయం. దీని గురించి మాట్లాడేవాళ్ళు కూడా లేరు. (ఈ పిట్టకథ గురించి మరోసారి, మరో సందర్భంలో...). మొత్తానికి, అలా ఒక్కో టికెట్ రూ. 110 వంతున ఖర్చు పెట్టుకొని, మా మిత్ర బృందమంతా ఆ దూరపు థియేటర్ కి 'బృందావనం' కోసం వెళ్ళాం. చూశాం. సినిమా ఎలా ఉందంటారా. చెబుతా. కాస్త ఆగండి.

( ‘బృందావనం’ సమీక్ష.....తరువాతి టపాలో...)

Wednesday, October 13, 2010

'మేస్త్రి' ని ఏమైనా అనచ్చు కానీ, 'మగధీర' మీద మాట్లాడకూడదా!?

సినీ రంగంలో, అభిమానుల్లో ఓ వైపరీత్యం ఉంది. ఏ చిన్న విమర్శ వచ్చినా ఎవరూ తట్టుకోరు. కువిమర్శ చేస్తే సరే కానీ, సద్విమర్శ చేసినా అది పరిస్థితి. ‘నంది’లో మోసం జరిగిందా..? ‘మగధీర’లో నటన ఉత్తమమైనదేనా..? అని రాసిన పోస్టు మీద కొందరు నా మీద కోపం చూపారు. దాసరి చేసిన (చేశారనే మనవాళ్ళ అభిప్రాయం) పైరవీ గురించే మాట్లాడాలి కానీ, ‘మగధీర’ గురించి కూడా మాట్లాడడమేమిటని కొందరు అన్నారు. ఇంకొందరు వ్యాఖ్యలు రాశారు. వారికి సుదీర్ఘ వివరణగానే ఈ తాజా టపా.

నా మటుకు నేను మునుపటి టపా రాయడానికి ఓ కారణం ఉంది. ఆ ఉత్తమ నటుడి అవార్డు దాసరికి ఇవ్వడం సరైనదా, కాదా అన్నది ఒక అంశం. దానికి తోడు 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన సైతం అందుకు అర్హంగా ఉన్నదా, లేదా అన్నది మరో అంశం. ఈ రెండు అంశాలూ తాజాగా జనం ఎదుట చర్చకు నిలవాల్సినవే. అలా కాకుండా వాటిలో ఎంతసేపూ ఒకదాన్నే పట్టుకొని మాట్లాడడం సరైనది కాదు.

అందరూ నాణానికి ఒకవైపే చూస్తూ, 'మేస్త్రీ' సినిమా గురించే ప్రస్తావిస్తుండడంతో, నాణానికి రెండో వైపు దృష్టి సారించేలా చేయాలన్నదే ఈ టపా ఉద్దేశం. నన్నడిగితే, ఇలాంటి అవార్డుల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉంటుందన్నది జనానికి తెలియనిది కాదు. అంతమాత్రాన ఈ అంశాలను చర్చకు పెట్టడమే నేరం, ఇది చిరంజీవినీ, ఆయన కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకోవడమే అనుకుంటే శుద్ధ పొరపాటు.

ఇక, కొందరేమో, అసలు సంగతి వదిలేసి, చిరు ఒళ్ళు తగ్గడమనే అంశంపైన దృష్టి పెట్టారు. నా టపాలో లేని అర్థాలు వెతికారు. లైపో సక్షన్ అంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించు (తొలగించు) కోవడమనే నాకు తెలిసిన అర్థం. కొవ్వు కరిగించుకోవడమని రాస్తే, రాతలో లేని అహంకారమనే అర్థం తీసుకుంటే, అది చదువుతున్న వారి ఆలోచనే తప్ప, రాతలో ఉన్నది కాదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం ఎవరికీ లేదు. నాకైతే ఏ కోశానా లేదు.

దాసరి సీనియర్ నటుడు కాబట్టి, ఎలాగైనా బాగా నటించేస్తాడని మీ ఉద్దేశ్యమా అని ఇంకొందరు అన్నారు. అదే నా ఉద్దేశమైతే, మేస్త్రీ చిత్రాన్నీ, నటననూ నేను భుజానికెత్తుకోవాలిగా. ఆ పని చేయలేదే. అలాగే, నేనిక్కడ దాసరి, రామ్ చరణ్ తేజ్ ల ఇద్దరి నటననూ పోల్చడం లేదు. ఆడలేదు కాబట్టి మేస్ర్తీ చిత్రంలో నటనకు అవార్డు ఏమిటని వస్తున్న విమర్శలో ఎంత న్యాయముందో, జనం చూశారు కాబట్టి మగధీరలో నటనకు అవార్డు ఇవ్వాలన్న వాదనలోనూ అంతే న్యాయముంది. ఒకటి ఎడమ చేయి, రెండోది పుర్ర చేయి. అంతే తేడా. బ్లాగర్ బద్రి గారి కామెంట్ మాటల్లో చెప్పాలంటే... ‘‘ ‘నంది’లో మోసం జరిగిందా ? అవును. ‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ? కాదు...’’

Tuesday, October 12, 2010

‘నంది’లో మోసం జరిగిందా ? ‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ?

మన ఆంధ్ర్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగు సినిమాలకు ఏటేటా ఇచ్చే నంది అవార్డులు వివాదాస్పదం కావడం, విమర్శలు రావడం కొత్తేమీ కాదు. 2009వ సంవత్సరానికి గాను ఈ మధ్యే ప్రకటించిన అవార్డులు కూడా అందుకు మినహాయింపు కాలేదు. మిగిలినవాటి మాటెలా ఉన్నా ఉత్తమ నటుడు అవార్డుకు దాసరి నారాయణరావు ('మేస్త్రీ' చిత్రం)ను ఎంపిక చేయడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

'మగధీర' చిత్రం ఏకంగా 9 అవార్డులు గెలుచున్నా అందులోని హీరో రామ్ చరణ్ తేజ్ ను ఉత్తమ నటుడిగా తీర్మానించకుండా, ప్రత్యేక జ్యూరీ అవార్డుతో సరిపెట్టారేమిటని ఆ వర్గంలోని వారు నిలదీస్తున్నారు. దీని వెనుక దాసరి కుట్ర ఉందనేది వారి వాదన. దానిపై ఇప్పటికే మాటకు మాట సమాచార సాధనాల్లో వస్తూనే ఉంది.

ఇది ఇలా ఉండగా, గడచిన పక్షం రోజులుగా విదేశాల్లో ఉన్న పి.ఆర్.పి. అధ్యక్షుడు చిరంజీవి సొంతగడ్డకు తిరిగొచ్చారు. ఆయన వచ్చీరాగానే, సహజంగానే విలేఖరులు ఈ నంది అవార్డుల ప్రశ్న అడిగారు. దానికి చిరంజీవి మాత్రం చాలా కూల్ గా, జనరంజకత్వం కోసం 'మగధీర' చిత్రం తీశామనీ, ఆ చిత్రం తెలుగులో బాక్సాఫీసు రికార్డులన్నిటినీ బద్దలు కొట్టిందనీ పేర్కొన్నారు. నంది అవార్డు కన్నా ఈ ప్రజాదరణే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. త్వరలో నటించనున్న 150 వ చిత్రానికి తగ్గట్లుగా ఒళ్ళు తగ్గించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళిన చిరంజీవి మొత్తానికి లౌక్యంగా జవాబిచ్చి తప్పించుకున్నారు.

అవార్డు ఎంపిక సరైనదే అని కానీ, కాదని కానీ నేను అదాటున ఓ నిర్ణయానికి వచ్చేయ దలుచుకోలేదు. తెర వెనుక ఏం జరిగిందన్నది తెలిస్తే కానీ, ఓ నిర్ణయానికి రాలేం. అయితే, ఒకటి మాత్రం నిజం. నా మటుకు నన్ను అడిగితే, 'మగధీర' జనాదరణ పొందిన చిత్రం. సాంకేతికంగా చక్కగా రూపొందించిన చిత్రం. అయితే, అన్ని రకాల సాంకేతిక విభాగాలకూ పేరు వచ్చి, సినిమాకు అవార్డులొచ్చినంత మాత్రాన అందులో నటించిన వ్యక్తి సైతం ఉత్తమ నటుడు కావాలని నియమం ఎక్కడైనా ఉందా. లేదు కదా.

పైగా, 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన తొలి చిత్రం 'చిరుత' కన్నా మెరుగ్గా ఉందే తప్ప, ఉత్తమ నటుడికి సరిపడా మెరుగైందా అంటే ఆలోచించాల్సిందే. వివిధ విభాగాల కృషితో సినిమా ఉత్తమంగా నిలబడడం వేరు. ఉత్తమ నటన వేరు. ఆ రెంటినీ కలిపి చూస్తేనే కన్ ఫ్యూజన్. ఆ సంగతి మనవాళ్ళు గ్రహించాలి. లేదంటే, ఇలాంటి విమర్శలే వస్తాయి. ఇలా అన్నంత మాత్రాన నేనేదో దాసరి "మేస్త్రీ" ఎంపికను ఏకపక్షంగా సమర్థిస్తున్నానని పొరపాటు పడకండి. ఏమైనా, ఇప్పటికి మాత్రం - కొవ్వు కరిగించుకొని, ఒళ్ళు తగ్గి వచ్చిన చిరు తన 150వ చిత్రంలో ఉత్తమ నటన చూపుతారేమో ఎదురుచూడాలి. అభిమానులమంతా దాని కోసమే నిరీక్షిస్తున్నాం.

Saturday, October 9, 2010

ఖలేజా: సరదా డైలాగుల జోరు - సవ్యంగా సాగని కథనమే బేజారు!


(‘‘ఖలేజా: కథాంశం మంచిదే... కథనమే.... ’’- పార్ట్ 2)

నిజానికి, మహేశ్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లోని ‘ఖలేజా’ చిత్ర కథకు తీసుకున్న ‘దైవం మానుష రూపేణ’ అన్న అంశం మంచిదే. సాటి మనిషిని కాపాడాలంటే, దేవుడు కానక్కర లేదు. మంచి మనసున్న మనిషిలోనే దేవుడుంటాడు. తన కోసం కాక, సాటి వారి బాగు కోసం ఆ మనసుతో ఆలోచిస్తే, అనుకున్నదల్లా అవుతుంది. అప్పుడలా ఆ మనిషే దేవుడన్నది ఈ సినిమాలో చెప్పదలుచుకున్న సారాంశంగా కనిపిస్తుంది.

బాగోగులు ఏమిటంటే...

ఈ విషయాన్నే వీలైనంత వినోదాత్మకంగా చెప్పాలని దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించారు (ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - అన్నీ ఆయనవే). అంతవరకు బాగానే ఉంది. అందుకే, ఈ సినిమాలో హీరో పాత్రచిత్రణ, ప్రవర్తన, హీరోయిన్ తో ఎదురయ్యే సంఘటనలు, చుట్టుపక్కలి పాత్రలు - అన్నీ వినోదమే కేంద్రంగా నడుస్తుంటాయి. అది వినోదానికి బాగా ఉపకరించినా, విషయానికి వచ్చే సరికి - చివర కాసేపు తప్ప, మిగిలిన చోట్ల కూడా సీరియస్ విషయం కూడా సరదా బాటలో పడి గాడి తప్పినట్లనిపిస్తుంది.

అలాగే, మనిషిలోని దేవుడి తత్త్వాన్ని ప్రభావశీలంగా చెప్పాలని రెండు, మూడు సన్నివేశాల్లో ప్రయత్నించారు (ఉదాహరణకు, హీరో తన కోసం 10 రూపాయలు అడిగితే ఎవరూ ఇవ్వరు కానీ, మరొకరి కోసం 10 అడిగితే 100 రూపాయలు రావడం లాంటివి). కానీ, అవి విజువల్ గా ఆశించిన ఇంప్యాక్ట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ వాదనతో ప్రేక్షకులు కన్విన్స్ కావడం కొద్దిగా కష్టమే.

పాత్రలు - పాత్రధారుల పనితనం ఎలా ఉందంటే...

అందంలో, అభినయంలో ఎప్పుడూ మార్కులు పడే మహేశ్ ఎప్పటిలానే చక్కగా నటించారు. కష్టపడి ఫైట్లు చేశారు. ఎప్పుడూ హుందాగా, తక్కువ మాటలు, ఎక్కువ భావప్రకటన ధోరణిలో వెళ్ళే మహేశ్ ఈ సినిమాలో ఎన్నడూ లేనంత ఎక్కువగా మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో మహేశ్ ఇంతగా డైలాగులు చెప్పిన సినిమా బహుశా ఇదే కావచ్చు.

దర్శక - రచయిత సృష్టించిన ఈ తరహా పాత్ర కోసం త్రివిక్రమ్ సారథ్యంలో మహేశ్ తన శారీరక భాషను సమర్థంగా మార్చుకున్నారు. పూర్తి వినోదభరితమైన పాత్రచిత్రణతో మహేశ్ ను తెరపై ఇలా చూపడం ఇదే మొదటిసారి. ఈ రకం నటన అటు మహేశ్ కూ, ఇటు ఆయన అభిమానులకూ కొత్త అనుభవమే. కానీ, ఆ పాత్రే అటు హాస్యం, ఇటు రౌద్రం, మధ్యలో ప్రేమ - అన్నీ చూపెడుతూ వస్తుంది. దాంతో, కథను నడిపే భారమంతా ఆ పాత్ర మీదే పడింది.

ఐరన్ లెగ్ అమ్మాయి పాత్ర హీరోయిన్ అనూష్కది. ఫస్టాఫ్ కామెడీకీ, సినిమాలో పాటలకీ పనికొచ్చే పాత్ర. అంత వరకూ ఆమె ఓ.కె. ఉపాసనతో జోస్యం చెప్పగల ఊళ్ళోని పెద్దాయన పాత్రలో రావు రమేశ్ నటన, వాచికం బాగున్నాయి. ఇదే ఛాయలతో ఉండే పాత్రను ఆయన గతంలో మగధీర (2009)లో బాగా పండించిన సంగతి తెలిసిందే. సిద్ధయ్య పాత్రలో షఫీ బాగా చేశారు. కానీ, మాటి మాటికీ అతనితో హర హర మహాదేవ్ అని పలికించడం కొన్ని చోట్ల అవసరాన్ని మించిపోయిందేమో అనిపిస్తుంది.

జెమినీ టీవీలో కార్యక్రమాల డైరెక్టర్ బాబ్జీగా సునీల్, చెట్లు - కాయల గురించి పరిశోధన చేసే టామ్ క్రూజ్ గా అలీ, లాయర్ మిరియం గా బ్రహ్మానందం సినిమాలో వినోదం పంచుతారు. అయితే, ‘మర్యాద రామన్న’ బిజీలోనో ఏమో, సినిమా సగమైనా కాక ముందే సునీల్ పాత్రను ముగించాల్సి వచ్చినట్లుంది. లాయర్ మిరియంగా బ్రహ్మానందాన్ని కూడా మూడు, నాలుగు సీన్లకే పరిమితం చేశారు. సినిమా మూడొంతులు అయిన దగ్గర నుంచీ క్లైమాక్స్ ముందు వరకు కనిపించేది ఒక్క అలీయే. కానీ, అతనికీ, హీరోకూ అంత సన్నిహిత సంబంధం ఎందుకో, హీరోతో కలసి అతనెందుకు చివరి దాకా తిరుగుతాడో తెలియదు. కమెడియన్ ఎం.ఎస్. నారాయణ ఒకే సీన్ లో మెరిసి మాయమవడాన్ని బట్టి చూస్తే, చిత్రీకరణ ముగిశాక ఎడిటింగ్ కత్తెరకు బాగానే పని పడ్డట్లు అర్థమవుతుంది.

విలన్ ప్రకాశ్ రాజ్ కూడా క్లైమాక్స్ లో గొంతు చించుకు అరవడం, భయం నటించడం తప్ప చేసిందేమీ లేదు. పైగా, రూపురేఖల్లో చాలా తేడా వచ్చిన ప్రకాశ్ రాజ్ మునుపటి ఆకర్షణను కోల్పోయారు. ఆయనను చూడడం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు తదితరుల పాత్రలన్నీ ప్యాడింగ్ కే తప్ప, పెద్దగా చేసేదేమీ లేదు.

సినిమాను నిలబెట్టే డైలాగులు ఏవంటే...

ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి కూడా త్రివిక్రమ్ శైలి సంభాషణలే. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా పేలాయి. అయితే, మరికొన్ని చోట్ల అర్థమయ్యీ కాకుండా వేగంగా చెవులు దాటి వెళ్ళిపోతాయి. ‘మీ పేరు’ అని హీరోయిన్ అడిగితే - ‘జెమినీ టి.వి’ అనీ, ‘ఏం చేస్తుంటారు’ అంటే - ‘బాబ్జీ’ అనీ సునీల్ తో డైలాగ్స్ చెప్పించడం మీడియా మనుషుల ఖంగాళీతనానికి త్రివిక్రమ్ మార్కు చురక. ‘‘8,950కి రౌండ్ ఫిగర్ 9 వేలు కదా’’ అని హీరోయిన్ అంటే, ‘‘10000లో రౌండ్లు ఎక్కువ కదండీ’’ అని హీరో చెప్పడం లాంటివి బాగా నవ్విస్తాయి. ‘‘వినపడక అడుగుతున్నావా, లేక అర్థం కాక అడుగుతున్నావా’’ అని హీరో అంటే, ‘‘కాదు. తెలియక అడుగుతున్నాను సార్’’ అని బ్రహ్మానందం అనడం ఫక్కున నవ్వు తెప్పిస్తుంది.

గ్రామాన్ని కాపాడే దేవుడు ఎలా ఉంటాడో పెద్దాయన వర్ణించే ఘట్టంలో ‘‘...నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధా. గాలి హోరుమంటుంది...’’, ‘‘...ఎవడు చూస్తే భయం చస్తుందో, ఎవణ్ణి చూస్తే ధైర్యం వస్తుందో...’’ లాంటి డైలాగులు సన్నివేశంలో గాఢతను పెంచాయి. ‘‘నీ నవ్వు వరం. నీ కోపం శాపం. నీ మాట శాసనం’’ అంటూ దేవుడిగా కొలిచే హీరో గురించి సిద్ధ చెప్పే మాటలు తూటాల్లా దూసుకుపోతాయి. ‘‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. అద్భుతం జరిగిపోయాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’ (హీరోతో రావు రమేశ్) లాంటి కొన్ని భావస్ఫోరకమైన సంభాషణలూ ఉన్నాయి.

అలాగే, ఎప్పుడూ మరింత క్లాస్ టచ్ తో నడిచే త్రివిక్రమ్ సంభాషణలు ఈ సినిమాలో కొన్నిచోట్ల ఎందుకనో కిందకు దిగి, మాస్ రంగును పులుముకున్నాయి. హీరో పోషించినది ట్యాక్సీ డ్రైవర్ పాత్ర కావడం అందుకు కారణమని సరిపెట్టుకోవాలేమో. మొత్తం మీద డైలాగ్ కామెడీ మీద ఎక్కువగానే ఆధారపడ్డారు. జల్సా చిత్రంలో లాగానే, ఇందులో కూడా హీరో, కమెడియన్ల మద్యపాన హాస్య సన్నివేశాన్ని త్రివిక్రమ్ మళ్ళీ పెట్టారు.

సాంకేతిక విభాగాల శ్రమ ఏమిటంటే...

పాటల సంగతికొస్తే - తెరపై కన్నా విన్నప్పుడే బాగున్నాయి. పైగా, ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ కథాగమనానికి అడ్డంగా వచ్చి, విసిగిస్తాయి. ‘‘ఆరు పాటలు సిద్ధం చేసుకున్నారు కదా అని, ఎక్కడబడితే అక్కడ అతికించేయడమేనా’’ అని ఓ సగటు ప్రేక్షకుడు వాపోయాడు. విన్నప్పుడు బాగున్న ‘పిలిచే పెదవుల పైన...’ పాట కూడా సినిమాలో చరణాలకొచ్చేసరికి మెరుపు కోల్పోయింది. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహించిన ‘ఓం నమో శివ రుద్రాయ...’ పాటలోని సాహిత్య గాంభీర్యం కూడా దృశ్యాల్లో అడపా దడపా వస్తూ, పోవడమే తప్ప, నిలకడగా కనిపించదు. పాటల నృత్యపరికల్పన (రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్ వగైరా) ఫరవా లేదే తప్ప, చిరస్మరణీయం కాలేకపోయింది.

అయితే, చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ పరంగా మాత్రం సినిమాకు వంక పెట్టలేం. చూస్తున్నంత సేపు తెర నిండుగా, కనువిందుగా దృశ్యాలున్నాయి. కెమేరా (యశ్ భట్ తో పాటు 'అతడు' చిత్ర ఫేమ్ కె.వి. గుహన్, 'హమ్ తుమ్' చిత్ర ఫేమ్ సునీల్ పటేల్ కూడా పనిచేశారు), ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), ఫైట్లు (పీటర్ హెయిన్స్, రామ్ - లక్ష్మణ్), సౌండ్ మిక్సింగ్ (సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదన రెడ్డి)అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ లోని దృశ్యాలు బాగా వచ్చాయి. గ్రాఫిక్స్ (పిక్స్ లాయిడ్ సంస్థ)కూడా ఎక్కువగానే వాడారు. అయితే, హీరో పరిచయ ఘట్టంలో మహేశ్ చేతిలో కనిపించే పాము గ్రాఫిక్స్ మాత్రం బొమ్మ పాము కన్నా ఘోరంగా ఉంది.

చిత్ర ప్రారంభం, ఇంటర్వెల్ ఘట్టం లాంటివి బాగున్నాయి. కొన్ని చోట్ల దర్శకుడి ముద్రా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం - తీసుకున్న ఇతివృత్తాన్ని బలంగా చెప్పేలా కథనాన్ని నడిపించ లేదని అనిపిస్తుంది. కాలక్షేపానికి సినిమా ఫరవాలేదని అనిపించినా, కథలోని ఆత్మ మాత్రం కనిపించీ, కనపించకుండా తచ్చట్లాడుతుంటుంది. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏతావతా, త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే - ‘ఖలేజా’ యావరేజే.

కొసమెరుపు - అన్నట్లు ఈ సినిమా పేరు వట్టి ‘ఖలేజా’ కాదు. ‘మహేశ్ ఖలేజా’. అదేమిటంటారా. ఈ 16 రీళ్ళ 2.45 – 2.50 గంటల సినిమాస్కోప్ చిత్రం ఆ పేరు మీదే సెన్సారైంది. బహుశా, ‘ఖలేజా’ టైటిల్ ఎవరిదన్న దాని మీద వివాదం జరుగుతుండడంతో, ఎందుకైనా మంచిది లెమ్మని ముందుచూపుతో ‘మహేశ్ ఖలేజా’ అని పేరు నమోదు చేసి, ఆ పేరుతోనే సెన్సార్ చేయించినట్లున్నారు. ఫలితంగా, రికార్డుల సృష్టి ఆశ లేని ఈ సినిమా పేరు రికార్డు పుస్తకాల్లో మాత్రం - ‘మహేశ్ ఖలేజా’.

Friday, October 8, 2010

‘ఖలేజా’: కథాంశం మంచిదే... కథనమే....


ఏ సినిమా ఎవరికి ఎందుకు నచ్చుతుందో, ఎందుకు నచ్చదో చెప్పడం అంత సులభం కాదు. అయితే, సమూహ వీక్షక అనుభవమైన సినిమా - చూసేవారిలో ఉమ్మడిగా ఓ అనుభూతిని కలిగించాలి. ఆ అనుభూతి ఎంత బలమైనదైతే, ఎంత సామూహికమైనదైతే జనం అభిప్రాయం కూడా అంత బలంగా, అంత ఉమ్మడిగా ఉంటుంది. అలా కానప్పుడు ఎవరి అనుభూతి వారిది. ఎవరి అభిప్రాయం వారిది. ఓ సినిమా గురించి భిన్నాభిప్రాయాలు వచ్చేది అలాంటి సందర్భంలోనే. ‘ఖలేజా’ అందుకు తాజా ఉదాహరణ.

కథ ఏమిటంటే...

దాదాపు రెండేళ్ళ పైగా సెట్స్ పై ఉన్న ‘ఖలేజా’లో అంశం చిన్నది. దాని వివరణ 16 రీళ్ళ పెద్దది. ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే ఓ గ్రామంలో జనం కారణం ఏమీ లేకుండానే పిట్టలు రాలినట్లు రాలిపోతుంటారు. ఆ నెలలో 20 మంది మట్టి కలిసిపోతారు. ఆ గ్రామాన్ని కాపాడాలంటే - 28 ఏళ్ళ క్రితం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన ఫలానా లాంటి యువకుడి వల్ల అవుతుందని ఉపాసకుడైన ఆ ఊరి పెద్దాయన (రావు రమేశ్) చెబుతాడు. మండలం (48) రోజుల్లో ఆ యువకుణ్ణి తెమ్మని సిద్ధుణ్ణి పంపిస్తాడు.

హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవర్ అయిన జి. సీతారామరాజు అలియాస్ రాజు (మహేశ్) ఓ పని మీద రాజస్థాన్ వస్తాడు. కనుచూపు మేరలో మనిషి కనిపించక, ఊరు వెతుక్కుంటూ అక్కడికే కథానాయిక సుభాషిణి (అనూష్క) వస్తుంది. హీరో ఆ ఊరు రావడానికీ, ఆమె కూడా అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరులో తప్పిపోవడానికీ చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ లింకులుంటాయి.

ఆమెను కూడా తీసుకొని తెలుగు నేలకు తిరిగి వద్దామని హీరో యత్నిస్తున్న సమయంలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడతాడు. అదే క్రమంలో తమ గ్రామాన్ని కాపాడే దేవుడు ఆ హీరోయే అని పంచభూతాల సంకేతాలతో సిద్ధుడు గ్రహిస్తాడు. అక్కడికి సరిగ్గా మండలం పూర్తవుతుంది. ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఆ హీరోనూ, హీరోయిన్ నూ తన వెంట గ్రామానికి తీసుకెళ్ళి, కాపాడతాడు సిద్ధుడు. తేరుకున్న హీరోను ఊరి జనమంతా దేవుడు అంటూ ఉంటారు. తాను దేవుణ్ణి కాదు మొర్రో అంటూ ఉంటాడు హీరో. అలా కథ ముందుకు వెళ్ళి, ఆ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, ఆ గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేయడం వల్ల ఎవరికి వచ్చే లాభం ఏమిటి, మధ్యలో ఈ రాజస్థాన్ పిట్టకథేమిటి - లాంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఆఖరికి చెడు మీద మంచి విజయంతో కథ ముగుస్తుంది.

కథాకథనం ఎలా సాగిందంటే...

ప్రథమార్ధంలో జరిగే కథ కొంచెమే అయినా, మున్ముందు కథలో వచ్చే ఘట్టాలకు లీడ్స్ కనిపిస్తాయి. సరదా సంభాషణలు, సన్నివేశాల సమాహారంగా సినిమా నడుస్తుంది. అసలు కథంతా ద్వితీయార్ధంలోనే. అయితే, అందులో అసలు పాయింట్ ఆఖరికి కానీ రాదు. జనం చనిపోతుండడానికి కారణం, కారకులు, దానికి హీరో పరిష్కార ప్రయత్నం సినిమా చివరి మూడు నాలుగు రీళ్ళలో కానీ చెప్పరు.

దాంతో, చివరి వరకు అసలు కథేమిటన్నదానిలో సస్పెన్స్ కన్నా అర్థం కావడం లేదన్న కన్ ఫ్యూజనే ప్రేక్షకులకు ఎక్కువుంటుంది. దేవుడనే జనం, దేవుణ్ణి కాదనే హీరోల మధ్య చర్చతోనే చాలా సేపు గడిచిపోయినట్లనిపిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి తానుగా ముందుకొచ్చే నాయక పాత్రల సినీ కథలకు అలవాటు పడ్డ జనసామాన్యానికి ఇది విచిత్రమనిపిస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన హీరోయే దానికి దూరంగా పారిపోవడం ఏమిటని ఓ చిన్న అసంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా టైటిల్స్ కు ముందు వచ్చే ఘట్టం మిస్ అయితే, కథానేపథ్యం అర్థం కావడం మరింత కష్టమవుతుంది.

సమస్యే తప్ప, సమస్యకు కారకులైన జి.కే. వాళ్ళ (ప్రకాశ్ రాజ్ వగైరా)తో హీరో ముఖాముఖి పోరాటం ఒకే ఒక్కసారి, అదీ క్లైమాక్స్ లో కానీ రాదు. దాంతో, మంచి, చెడుల మధ్య ఘర్షణలో మంచి ఎలా గెలిచిందనే ఉత్కంఠభరిత ప్రయాణం చప్పగా ముగిసిపోయినట్లు అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు.

(మిగతా భాగం ఇంకాసేపట్లో...)

‘ఖలేజా’లో ఆనవాయితీ తప్పింది

సినిమా విడుదలైనా, ఆ సినిమా ప్రత్యక్షంగా చూసేదాకా కథ, కథనాల గురించి తెలుసుకోకపోవడం నా అలవాటు. కథ, అవతలి వాళ్ళ అభిప్రాయం తెలిసిపోతే, ముందుగానే ఓ మూస అభిప్రాయంతో వెళ్ళి సినిమాను చూసే ప్రమాదం ఉంది. దానివల్ల మన సొంత అభిప్రాయాలు, ఆలోచనలపై వాటి ప్రభావం పడే ఇబ్బంది ఉంది. ముఖ్యంగా ఆ సినిమా గురించి మనం ఏదైనా రాయాల్సి వచ్చినప్పుడు అదీ మరీ ఇబ్బంది. తప్పో, ఒప్పో - అది నా సొంత అభిప్రాయం. అయితే, అనుకోకుండా ఈసారి ఆ ఆనవాయితీ తప్పింది.

‘రోబో’ వాణిజ్య హంగామా నడుమ వస్తున్న చిత్రంగా ‘ఖలేజా’ మీద అందరి లాగే ఆఫీసులోనూ ఆసక్తి హెచ్చింది. ‘ఖలేజా’ విడుదలైన రోజున ఆఫీసు పనిలో ఉండగా, అందులో భాగంగా ఓ ఉద్యోగి వచ్చి, సినిమా గురించి నెగటివ్ వార్తను నలుగురితో చెప్పాడు. అసలు సంగతి కనుక్కోమన్న ఆఫీసు మిత్రుల పోరుతో, మరో మిత్రుడికి తప్పనిసరై ఫోన్ చేశా. కథ కాకపోయినా, సినిమా రిజల్ట్ పై అతని అభిప్రాయం అడిగి, విన్నా.

ఏ సినిమా వచ్చినా, ఆ యా కులాలు, ప్రాంతాలను బట్టి ఇలాంటి దుష్ప్రచారాలు జరగడం తెలుగు పరిశ్రమలో చాలా కాలంగా ఉన్న జాడ్యం. కళను కులంతో ముడిపెట్టి మాట్లాడే, చూసే అలాంటి జనాభా మీద జాలి పడడం తప్ప, చేయగలిగిందేమీ లేదు.

‘ఖలేజా’ మీద ప్రచారం కూడా అలాంటిదేనా? లేక నిజంగానే సినిమా తేడాగా ఉందా? ఏమో! రాత్రి సినిమాకు వెళ్ళినప్పుడు చూడాలి అనుకున్నా. అలాగే, ‘దైవం మానుష రూపేణ’ అనే ఇతివృత్తం చుట్టూ కథ తిరుగుతుందని అప్పటికే తెలియడం వల్ల అనుకోకుండానే ఓ ముందస్తు అభిప్రాయంతో సినిమాకు వెళ్ళా.

('ఖలేజా' పై రివ్యూ మరికాసేపట్లో...)

Thursday, October 7, 2010

చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది! త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్ ఖలేజా!!



గడచిన పదిహేను, ఇరవై రోజుల్లో టీవీలో రెండు హిట్ సినిమాలు కొద్దిగా, కొద్దిగా చూశా. యాదృచ్ఛికంగా రెండూ దర్శక - రచయిత ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ రూపకల్పనలే. ఒకటి - మహేశ్ బాబు నటించిన ‘అతడు’. రెండోది - పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’. సెలవు రోజున మధ్యాహ్నం పూటో, రాత్రో ఇంటిలోనే ఉండి భోజనం చేస్తున్నప్పుడు టీవీ చానళ్ళు తిప్పడం నాకు అలవాటు. ఇంటిల్లపాదీ కూర్చొని, అన్నం తింటూ, ఆ కాసేపు టీవీ చానల్ ధర్మమా అని ఆ సినిమాలు చూశాము.

నిజానికి, ఆ రెండు సినిమాలూ నేను గతంలో థియేటర్లో చూసినవే, పత్రికల్లో రాసినవే. టీవీలో కూడా అడపా దడపా అదాటున కాసేపు కనిపించినవే. అయినా, సన్నివేశాల్లోని గాఢత నన్ను మరోసారి చూసేలా చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికి ఏ పదో సారో అయినా సరే, గుడ్లప్పగించి చూస్తూ, సినిమాలోని సెంటిమెంట్, హాస్యాలను ఆస్వాదించడం గమనించాను.

ఉన్నమాట చెప్పాలంటే, ‘అతడు’ కానీ, ‘జల్సా’ కానీ మొదటిసారి చూస్తున్నప్పుడు ఫరవాలేదు బాగానే ఉన్నాయని అనిపించాయే తప్ప, ‘ఆహా, ఓహో’ అనో, పదే పదే చూసి ఆనందించగలమనో అనిపించలేదు. కానీ, తీరా ఇప్పుడు అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుండేసరికి, నేను గతుక్కుమన్నాను. నేనే కాదు, నా లాగానే మా ఇంట్లోనూ, బయట చాలా మంది ఆ సినిమాలనూ, అందులోని దృశ్యాలనూ పదే పదే చూసి ఆనందించడం నన్ను ఆలోచనలోకి నెట్టింది.

ఒక సృజనాత్మక కృషి పదే పదే ఆస్వాదయోగ్యం అవుతుండడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ కృషిని ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి రూపకర్త పాటించిన పద్ధతి ఏమిటి? దీనికీ ఏదైనా ఫార్ములా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు నాకొచ్చిన సమాధానమేమిటంటే - ఒక సన్నివేశాన్ని ఎన్నో రకాలుగా తెరపై చూపవచ్చు. చూసిన తక్షణమే ప్రేక్షకుడి నరనరాల్లోకీ అది ఎక్కేసేలా, ఒక విధమైన కిక్ వచ్చేలా చిత్రీకరించడం ఒక పద్ధతి. దీని వల్ల ప్రేక్షకుల్ని, ప్రధానంగా మాస్ ను ఆకర్షించవచ్చు. చూడగానే అబ్బో అనిపించవచ్చు. సర్వసాధారణంగా మాస్ చిత్రాల దర్శకులు అనుసరించే పద్ధతి ఇది. కానీ, ఆ ప్రభావం, ఫలితం ఆ క్షణానికే, ఆ కొద్ది రోజులకే. ఆ తరువాత ఆ ఘట్టాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించదు. చూసినా తొలి సందర్శన నాటి కిక్ రాదు.

అలా లౌడ్ గానో, క్రూడ్ గానో కాకుండా అదే ఘట్టాన్ని వివిధ పాత్రల మధ్య సంఘర్షణగా, సున్నితమైన పద్ధతిలో తెరకెక్కించవచ్చు. ఆ రకంగా ఒక సన్నివేశాన్ని సంస్కారవంతమైన ధోరణిలో వేర్వేరు స్తరాలుగా చూపితే కలిగే ప్రభావం దీర్ఘకాలికమైనది. ఆ ఒక్క క్షణానికే కాకుండా, చూసిన ఒక్కొక్కసారీ ఆ సన్నివేశంలోని ఒక్కొక్క పొర ప్రేక్షకుడికి తెలిసి వస్తుంటుంది.

ఆ లోతులు అర్థమవుతున్న కొద్దీ సన్నివేశంలోని గాఢత పెరుగుతుంది. అందుకే, ప్రేక్షకుడికి తెలిసిన ఘట్టమే అయినా, ఆ సన్నివేశాలు చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంటాయి. త్రివిక్రమ్ తన చిత్రాల రచనలో, దర్శకత్వంలో ఉపయోగించే విధానం ఇదే. అందుకే, పాత్రలకూ, ప్రేక్షకులకూ మధ్య సమతూకపు డిగ్నిటీని కాపాడే ఆ చిత్రాల్లోని ఘట్టాలు చిరస్మరణీయం కాగలుగుతున్నాయి. అయితే, అలా తీయడానికి దర్శకుడికి అక్షరాలా ఖలేజా కావాలి. త్రివిక్రమ్ కు అది ఉంది.

అందుకే, మొదటి సారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి - అతని చిత్రాలు బాగుంటాయి. ఒక్క ముక్కలో చెప్పమంటే, త్రివిక్రమ్ సినిమాలు మంచి వైన్ లాంటివి. పాత బడిన కొద్దీ రుచి, విలువ పెరగడం ఫ్రెంచ్ మద్యమైన వైన్ స్వభావం. ఆ లక్షణం త్రివిక్రమ్ రచన, దర్శకత్వాల్లో వచ్చిన అధిక భాగం సినిమాల్లో గమనించవచ్చు. అదే ఆయనను సమకాలీన రచయితలు, దర్శకుల్లో ప్రత్యేక స్థానంలో నిలిపింది.

కావాలంటే, 'అతడు', 'జల్సా' లాంటి సినిమాలు మరోసారి చూడండి. మీరూ నా మాటలతో ఏకీభవిస్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం, చదివిన కొద్దీ చదవాలనిపించడం - ఇదే కదా కాలానికి అతీతంగా నిలిచే ఉత్తమ సృజనకు ప్రాథమిక లక్షణం. త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్.... ఆల్ ది బెస్ట్ టు ఖలేజా!

Wednesday, October 6, 2010

అవునా, మైనా...! ఇది సినిమాయేనా!?



తెలుగు సినిమా వస్తే చాలు, ఏ మాత్రం వీలున్నా వదలకుండా చూడడం ఓ బలహీనత. అది నాకు మరీ ఎక్కువ. అందుకే, వంశీ దర్శకత్వం వహించిన 'సరదాగా కాసేపు...' సినిమా ఊళ్ళోకి వచ్చిందని తెలిసి,వెళ్ళకుండా ఉండలేకపోయా. తెలుగునాట విడుదలైన తరువాతఇన్నాళ్ళకు కానీ, ఈ చిత్రరాజం (!) మా ఊరికి రాలేదు.

ఆంధ్రదేశంతో పాటు ఏకకాలంలో మా ఊరికి రాలేదేమని విచారిస్తూ, మిత్రులతో కలసి కాసేపు నవ్వుకుందామని ఈ సినిమాకు వెళ్ళాను. అయితే, మాకు నవ్వు రావడం మాట అటుంచి, ఏడుపొచ్చిందంటే నమ్మండి. టికెట్ కు పెట్టిన ఖర్చుకు కనీసపు గిట్టుబాటు కూడా లేదు. బుద్ధీ బుర్రా ఉన్నాయని అనుకొనే వంశీ లాంటి దర్శకుడి నుంచి ఇంత అవకతవక సినిమా రావడం మరింత బాధ కలిగించింది.

అసలీ సినిమాకూ, ఆ పేరుకూ సంబంధం కళ్ళజోడు పెట్టుకొన్నా కనిపించదు. సినిమా నిండా శబ్దకాలుష్యం. సినిమా చూస్తున్నామా, లేక డ్రామాకు వచ్చామా, లేదంటే టీవీ సీరియల్ చూస్తున్నామా అని మనకే అనుమానం వచ్చేస్తుంది. ఈ సినిమాలో కెమేరా మొదలు ఎడిటింగ్, సంగీతం (రీ-రికార్డింగ్, మిక్సింగ్) - ఇలా అన్ని విభాగాల్లో బోలెడన్ని తప్పులు కనిపిస్తాయి.

ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అందించిన మూలకథకు విస్తరణ ఈ చిత్రం. వేమూరి సత్యనారాయణ స్ర్కిప్టు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తే, పడాల శివ సుబ్రహ్మణ్యం మాటలు రాశారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంశీ కృత్యాలు.

అమెరికా నుంచి అమ్మానాన్నల దగ్గరకు వచ్చిన ఓ అబ్బాయి ('అష్టాచెమ్మా' చిత్ర ఫేమ్ అవసరాల శ్రీనివాస్) ఆంధ్రాలో పెళ్ళిచూపుల కోసం వెళతాడు. చేసుకొనే అమ్మాయి (మధురిమ) వాళ్ళ ఇంట్లో కొద్దిరోజులుండి, ఆమె ప్రవర్తన తెలుసుకోవాలనుకుంటాడు.

పెళ్ళికొడుకుగా వెళితే, అసలు విషయం రాబట్టలేమని, తన వెంట వచ్చే డ్రైవర్ (రంగబాబుగా - 'అల్లరి' నరేశ్)కు పెళ్ళికొడుకుగా, తాను డ్రైవర్ గా బయలుదేరతాడు. ఆ సంగతి పెళ్ళికూతురు వాళ్ళకు తెలిసిపోతుంది. అందుకని డ్రైవర్ గా వస్తున్నదే తమ కాబోయే అల్లుడని వాళ్ళు ఫిక్సయిపోతారు.

ఇంతలో దోవలో వచ్చిన ఇబ్బందులతో పెళ్ళికొడుకు, డ్రైవర్ తమ మారువేషాలు తీసేసి, మామూలుగా మారిపోతారు. ఆ సంగతి తెలియని పెళ్ళికూతురు తరఫు వాళ్ళు అసలు డ్రైవర్ ను పట్టుకొని, తమ కాబోయే అల్లుడనుకుంటారు. ఆ తరువాత జరిగే తమాషా సంఘటనలే మిగిలిన సినిమా.

ఈ సినిమాలో పాత్రలు, వాటి ప్రవర్తన - అంతా అతి. హీరోయిన్ గా వేసిన మరాఠీ అమ్మాయి మధురిమ అందం సంగతి దేవుడెరుగు, కనీసం ఆకర్షణీయంగా కూడా లేదు. హీరోయిన్ తొలిసారి తెరపై కనిపించినప్పుడు నేపథ్యంలో నుంచి ఓ కవితాత్మక గీత ఖండిక వస్తుంది. నిజం చెప్పాలంటే - హీరోయిన్ కన్నా ఆ కవితా ఖండికే బాగుంది.

వినోదభరిత చిత్రాలకు పేరున్న వంశీకి ఇప్పుడు ఆ ‘టచ్’ పోయిందేమో అనిపిస్తుంది - ఈ ‘సరదాగా కాసేపు’ కాసేపైనా చూస్తే! (చూడగలిగితే!!) సినిమాలో పేర్లు పడుతుండగానే సినిమా జాతకం అర్థమైపోతుంది. అప్పుడే విమానాశ్రయానికి చేరుకున్న అవసరాల శ్రీనివాస్ డైలాగులకు రీ-రికార్డింగు పరమ ఘోరం.

మాటలు, వగైరా ఒకదాని మీద మరొకటి పడిపోతుంటాయి. ఇదంతా ఎడిటింగ్ మహిమో, మిక్సింగ్ మహిమో వంశీకే తెలియాలి. సినిమా షూటింగులో లేని డైలాగులను కూడా డబ్బింగ్ దశలో కలిపి, అక్కడికక్కడ అనిపించారని సీను చూస్తే తెలిసిపోతుంటుంది.

అలాగే ఈ సినిమాకు ఏ రకమైన వెధవ కెమేరా యాంగిల్ వాడారో, ఏమో కానీ, దృశ్యాలన్నీ పూర్తిగా రూపురేఖలు మారిపోయి కనిపిస్తుంటాయి (కెమేరామన్- లోకి). తెరపై ఆ డిస్టార్టెడ్ ఇమేజెస్ బాగా లేకపోగా, చూసే ప్రేక్షకులకు చీకాకు తెప్పిస్తాయి.

సినిమాలో వచ్చే టైటిల్ సాంగ్ లో అసలు బాణీ కన్నా, పాఁవ్, పాఁవ్ అనే శబ్దాలే ఎక్కువగా ఉన్నాయి. '...ఊహలో నాయకా...' అనే పాట చూస్తే, ఇత్తడి - స్టీలు బిందెలు, వంటింటి సామాన్లను తెరపై నింపేసి, తాను మరో రాఘవేంద్రరావునని వంశీ అనిపించుకున్నారు. '...తెల్లనవ్వు, మల్లె పువ్వు...' పాట ఒకటీ కొంత బాగున్న అనుభూతిని కలిగిస్తుంది.

కథ ఉందని కాక, వినోదభరిత చిత్రాల విజయంతో జోరు మీదున్న అల్లరి నరేశ్ డేట్లున్నాయి కదా అని వంశీ - అల్లరి నరేశ్ ల కాంబినేషన్ల లెక్కలు చూసి ఈ సినిమా తీసినట్లుంది. వంశీ అలవాటుపడిపోయిన అక్రమ సంబంధాల కామెడీనీ, గుంపుల కొద్దీ పాత్రల మధ్య డైలాగు కామెడీనీ, ఒకే రకంగా వినిపించే బాణీల వరుసనూ వంశీ మార్చుకోకపోతే, కష్టమే. ఆయన కూడా గుంపు కవాతు నృత్యాల పాటలు తీయడం విచిత్రం. మొత్తం మీద ఈ సినిమా బాగుందని చెప్పాలంటే - అందుకు తగిన సన్నివేశాలు ఏవేమిటని ఏరుకోవడం ఎంత వంశీ అభిమానులకైనా కష్టమే!

Tuesday, October 5, 2010

మహేశ్ బాబు ‘ఖలేజా’ సెన్సార్ పూర్తి - రిలీజ్ కు రెడీ!



ఇప్పుడే అందిన వేడి వేడి తాజా కబురు. మహేశ్ బాబు అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఖలేజా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. అన్ని కార్య క్రమాలూ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నిన్న (అక్టోబర్ 4వ తేదీ - సోమవారం) రాత్రి కల్లా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారులు ఖలేజాకు యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో, సినిమా విడుదలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం సినిమా ప్రదర్శనకు కావాల్సిన వందల కొద్దీ ప్రింట్లను ల్యాబ్ లో సిద్ధం చేస్తున్నారు. ఓ పక్కన ప్రింట్ల పని జరుగుతుంటే, మరోపక్క సినిమా కు సంబంధించిన టీవీ ట్రైలర్ల తయారీ హడావిడి సాగుతున్నట్లు భోగట్టా. అక్టోబర్ 7వ తేదీ గురువారం నాడు విడుదల కోసం నిర్మాణ వర్గాలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఓ పక్క రోబో వాణిజ్యపరంగా కలెక్షన్లలో సంచలనం రేపుతుండడంతో, ఖలేజా కు తగినన్ని హాళ్ళను సమకూర్చుకోవడంలో కొంత ఇబ్బంది తలెత్తుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, ఈ హంగామాలను ఊహించి, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబట్టడంతో జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న బృందావనం రిలీజ్ ను అక్టోబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఆ రకంగా అక్టోబర్ 1, 7, 8 తేదీలను దాటి ఎట్టకేలకు 14కు బృందావనం విడుదల ఖరారైంది.

సెప్టెంబర్ ఆఖరులో విడుదలైన ఖలేజా పాటల్లో కొన్ని ఇప్పటికే జనాన్ని ఆకర్షిస్తున్నాయి. మణిశర్మ సంగీత దర్శకత్వంలోని ...పిలిచే పెదవుల పైనా..., ఓం నమో శివ రుద్రాయ.... పాటల గురించి అభిమానులు మురిసిపోతున్నారు. ఏమైనా, దాదాపు మూడేళ్ళ తరువాత వస్తున్న సినిమాగా మహేశ్ బాబు ఖలేజా అభిమానుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న అంశం. అది తెలుసుకోవడానికి మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Monday, October 4, 2010

పాత్రికేయ పితామహుడికి పురస్కారం: ...ఇవాళే ...అదీ హైదరాబాద్ లోనే..!



చిత్రం ఏమిటంటే - వయస్సులో నా కన్నా పెద్ద వాళ్ళతో నాకు చటుక్కున దోస్తీ కుదురుతుంటుంది. అది పెరుగుతుంటుంది. నా సమవయస్కులతోనూ, చిన్నవాళ్ళతోనూ ఇట్టే కలిసిపోయినా, పెద్ద వయస్సు వాళ్ళతో మటుకు నా స్నేహం మరింత బలంగా పెనవేసుకుపోవడం జరుగుతుంటుంది. మన జాతకమో, రూపురేఖా విలాసాలో, మాటలో మంచితనమో తెలీదు కానీ, చిన్నప్పటి నుంచీ ఎందుకో నాకు అలా జరుగుతోంది.

ఇంతకీ ఇప్పుడు నేను చెప్పొచ్చేది నాతో అలా బంధం పెనవేసుకుపోయిన ఓ పెద్ద మనిషి గురించి. కనీసం మా నాన్నగారు, తాత గారు వయస్సున్న మంచి మనిషి గురించి. ఆయనతో నా దోస్తీ గురించి. ఆయన - ఎం.ఎస్. శర్మగా ఎక్కువ మందికి సుపరిచితులైన పాత తరం జర్నలిస్టు. పూర్తి పేరు - మద్దాలి సత్యనారాయణ శర్మ. ఆయనకిప్పుడు 92 ఏళ్ళు. ఇప్పటికీ, అందంగా, ఆరోగ్యంగా ఉండే ఆయన నిజానికి మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ కన్నా పెద్దవారు. మా నాన్న గారి కన్నా ముందు నుంచీ జర్నలిజంలో ఉన్న కురువృద్ధులు.

శర్మ గారితో నా పరిచయం చిత్రంగా జరిగింది. అది గౌరవం నుంచి స్నేహంగా పరిణమించడం మరీ చిత్రం. ఆ స్నేహం ఇప్పుడు సౌహార్దంగా ఎదగడం ఇంకా విచిత్రం. నార్ల వెంకటేశ్వర రావు, గూడవల్లి రామబ్రహ్మం, చల్లా జగన్నాథం లాంటి 1940ల నాటి ప్రముఖ సంపాదకులతో భుజం రాసుకు తిరిగి, పత్రికా రచన చేసిన పెద్దాయన శర్మ గారు. ‘ప్రజామిత్ర’, ‘గోభూమి’, ‘క్రాంతి’, ‘మీజాన్’, ప్రసిద్ధ కన్నడ వారపత్రిక ‘ప్రజామత’ నడిపిన అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏ.ఐ.సి.సి) సభ్యుడు బి.ఎన్. గుప్తా గారి ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికల్లో ఆయన పనిచేశారు. ఆ తరువాత 1940ల మధ్య నాటి నుంచి రిటైరయ్యే వరకూ 'ఆంధ్రపత్రిక' దినపత్రిక సంపాదక వర్గంలో శర్మ గారు విస్తృత సేవలందించారు. అటు మద్రాసులోనూ, ఆ తరువాత హైదరాబాద్ లోనూ 'ఆంధ్రపత్రిక' డైలీ ఎడిషన్ కు పెద్ద దిక్కుగా పనిచేశారు.

మరో విశేషం ఏమిటంటే - తొలి తరం సినీ పాత్రికేయులలో ఆయన ఒకరు. 1940ల తొలినాళ్ళ నుంచి 1950ల ప్రథమార్థం వరకు ఆంధ్రపత్రిక డైలీలో సినిమా పేజీ నిర్వహణ ఆయన చేతి మీదు గానే జరిగింది. అప్పటి సంగతులు ఇప్పటికీ ఆయన పూస గుచ్చినట్లు చెబుతుంటారు. మా నాన్న గారితో సాహితీ పరిచయం, మా మూడో వదిన వాళ్ళ నాన్న గారు ('ఆంధ్రపత్రిక' సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ పినపాక సూర్యప్రకాశరావు)తో సాన్నిహిత్యం శర్మ గారి సొంతం. ఎప్పటి నుంచో శర్మ గారిని కలుసుకోవాలని ఉన్నా, ఎందుకనో కుదరనే లేదు. అలాంటిది - ఉన్నట్టుండి ఆఫీసు పని మీద వివరాల సేకరణ కోసం సరిగ్గా 15 నెలల క్రితం హైదరాబాద్ లో ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి కలిశాను. ఓ నాలుగు రోజులు వరుసగా వెళ్ళి, ఆపాత మధురమైన ఆయన జ్ఞాపకాలను తెలుసుకున్నా. అలా మొదలైన మా పరిచయం అక్షరాలా దినదిన ప్రవర్ధమానమైంది. సాయంకాలపు నీడలా పెరుగుతూ వచ్చింది.

ఆయన అనుభవంలో సగమన్నా లేని నాతో ఆయనకు దోస్తీ ఏమిటి! అది విచిత్రమే కాదు, ఆయన మంచితనం కూడా!! ఈ 15 నెలల్లో మా స్నేహం ఏ దశకు చేరిందంటే - కనీసం వారానికి ఒకసారైనా ఓ అరగంట ఎస్టీడీ ఫోన్లో మాట్లాడుకోవాల్సిందే. ఏ పనిలోనైనా ఉండి నేను చేయకపోతే, ఆ మరునాడే 'ఏమైంది, ఏమిట'ని ఆయనే ఫోన్ చేసి, యోగక్షేమాలు అడుగుతారు. సూచనలు, సలహాలిస్తారు. రాజకీయాల నుంచి సాహిత్యం, సినిమాలు, షికార్ల దాకా ఏ అంశం మా మాటల్లో నిషిద్ధం కాదు. అప్పట్లో 'ఆంధ్రపత్రిక'లో చేరిన సుప్రసిద్ధులు ముళ్ళపూడి వెంకట రమణ, నండూరి రామమోహనరావు తదితరులను జర్నలిజంలో చేయి పట్టుకొని నడిపించిన ఈ పాత్రికేయ భీష్ముడికి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం దక్కడం ఎంతో ఆనందకరమైన విషయం. తొలినాళ్ళ జర్నలిస్టు సంఘాల స్థాపనలో ముఖ్యపాత్ర పోషించిన ఎం.ఎస్. శర్మ గారు యూనియన్ కార్యకలాపాల్లో, ప్రెస్ క్లబ్ పక్షాన సలహా సంప్రతింపుల్లో కూడా చాలా కాలం క్రియాశీలంగా వ్యవహరించిన పెద్దలు. అన్నట్లు - ఇవాళ బెజవాడలో పబ్లిసిటీ రంగంలో, ముఖ్యంగా సినీ పబ్లిసిటీ రంగంలో అందరికీ తలలో నాలుకైన పాత్రికేయుడు కృష్ణాజీ సాక్షాత్తూ శర్మ గారి అబ్బాయే.

మరో చిత్రం ఏమిటంటే - ఎం.ఎస్. శర్మ గారు పుట్టింది - 1919 సెప్టెంబర్ 19న, కృష్ణాజిల్లా కలవపాముల గ్రామంలో. సంవత్సరం వేరైనా (1887), సెప్టెంబర్ 19నే పుట్టారు - శర్మ గారి ముందు తరానికి చెందిన రచయిత - పాత్రికేయుడు తాపీ ధర్మారావు. ఇప్పుడు అక్షరాలా ఆ తాపీ ధర్మారావు గారి పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి’ పురస్కారం శర్మ గారికి లభించింది. తాపీ వారితో శర్మ గారికి ప్రత్యక్ష పరిచయం కూడా ఉండడంతో ఈ సత్కారం మరింత సబబుగా మారింది. కొత్త సొబగు చేకూరింది.

ఈ రోజు (2010 అక్టోబర్ 4, సోమవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియమ్ లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. తమ తమ రంగాల్లో చేసిన సేవలకు గాను ఎం.ఎస్. శర్మ గారితో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 26 మందికి ఈ ‘కీర్తి’ పురస్కార ప్రదానం చేయనున్నారు. (పురస్కారాలందుకొనే ఈ 27 నక్షత్రాలలో నాకు సుపరిచితులైన మరో ఇద్దరు - బెజవాడకు చెందిన రచయిత - పాత్రికేయుడూ, మా నాన్నగారి మిత్రుడు వీరాజీ గారు, మా ఆకాశవాణి మిత్రుడు నాగసూరి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు).

1940 నాటి నుంచి ప్రధాన స్రవంతి పత్రికా రంగంలో పనిచేస్తూ, ఇప్పటికీ వివిధ అంశాలపై తన అభిప్రాయాలనూ, అనుభవాలనూ పత్రికల్లో పంచుకుంటున్న పాత్రికేయ పితామహుడు శర్మ గారు. ఆయనకు ఇన్నాళ్ళకు, ఈ పాటి చిన్న గుర్తింపు ప్రభుత్వం నుంచి రావడం మన వ్యవస్థ, దాని పాలకుల స్థితిగతులకు నిదర్శనం. అయితే, 70 ఏళ్ళుగా ఓ రంగంలో పని చేస్తున్న వ్యక్తికి ఇప్పటికైనా, ఈ మాత్రం గుర్తింపైనా దక్కడం ఆవేదనలోనూ ఆనందమనిపిస్తోంది. లేటు వయసులోనూ రాతలో, మాటలో ఘాటు తగ్గని ఎం.ఎస్. శర్మ గారికి ఈ శుభ సందర్భంగా తెలుగు పత్రికా రంగం తరఫున జేజేలు!!

కొసమెరుపు - గగన్ మహల్ ప్రాంతంలో ఉన్న బాల్య మిత్రుడి దగ్గరకు ఇప్పటికీ ప్రతి వారం బస్సులో వెళ్ళి, ఓ రోజంతా కబుర్లాడుకొని రావడం ఎం.ఎస్. శర్మ గారికి వారకృత్యం. సరిగ్గా అయిదు రోజుల క్రితం ఆయన అలాగే వెళ్ళి, మళ్ళీ ఇంటికి బస్సులో వచ్చేస్తుంటే ఓ గమ్మత్తు జరిగింది. అదే బస్సులో ఎక్కిన ఓ యువతి ఆయనను అదే పనిగా గమనిస్తోంది. విషయమేమిటో శర్మ గారికి అర్థం కాలేదు. తీరా దిగాల్సిన స్టాపు దగ్గర పడేసరికి, సర్దుకొని లేచిన ఆ అమ్మాయి, హడావిడిగా దిగిపోతూ, తెల్లటి లాల్చీ - పంచెల్లో దబ్బపండులా ఉన్న ఎం.ఎస్. శర్మ గారి దగ్గరకు వచ్చి, ‘‘మీరు బాగున్నారండీ!’’ అంది. దానికి, శర్మ గారు లిప్తపాటు కాలం నివ్వెరపోయినా, వెంటనే -‘‘మనుమరాలి స్వయంవరం మంచిదే!’’ అని హాయిగా నవ్వేస్తూ, ఆశీర్వదించారు. నిండు జీవితాన్ని ఇలా ఆహ్లాదంతో నింపుకోవడం ఆ తరం నుంచి మన తరం అక్షరాలా నేర్చుకోవాల్సిందే!

అందుకే, "శర్మాజీ! మీరు మరిన్ని పురస్కారాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా కాలం గడపాలి. మీ అనుభవాలనూ, జ్ఞాపకాలనూ యువతరం పాత్రికేయులతో సదా పంచుకోవాలి." అదే నా ఆశ, ఆశంస!

(మిత్రులకో మాట - హైదరాబాద్ లో ఉండి, తీరిక, ఓపిక ఉన్న మిత్రులు, మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఈ పురస్కార ప్రదానానికి వెళితే బాగుంటుంది. వయస్సులోనూ, అనుభవంలోనూ అక్కడ అందరిలోకీ పెద్దాయన శర్మ గారు పురస్కారం అందుకుంటున్నప్పుడు నాలుగు చప్పట్లు కొడితే మరీ బాగుంటుంది. అది ఆయన కోసం కాదు, మన కోసం! 70 ఏళ్ళుగా ఓ రంగంలో ఓ వ్యక్తి చేసిన విశిష్ట కృషిని గౌరవించాలన్న సంస్కారాన్ని నలుగురితో పంచుకోవడం కోసం, మనలో మనం పెంచుకోవడం కోసం!!)

Sunday, October 3, 2010

‘రోబో’: భారీతనం మింగిన భావోద్వేగాల పండు!



('విజువల్స్ సరే...! విషయం మాటేమిటి...?!' – రోబో చిత్ర సమీక్ష 2వ పార్ట్)

ఆట్టే విలనీ చూపించకుండా సగంలోనే చచ్చిపోయిన ప్రొఫెసర్ బోరా పాత్రతో కలుపుకొన్నా సరే, ‘రోబో’ సినిమా మొత్తం నాలుగే నాలుగు పాత్రల చుట్టూ (ప్రొఫెసర్ బోరా, హీరో, హీరోయిన్, రోబో) నడుస్తుంది.

హీరో కన్నా విలనే బెటర్!

ఇందులో సైంటిస్ట్ గా రజనీకాంత్ అందంగా కనిపిస్తారు. ఐశ్వర్యారాయ్ కూడా ఇప్పటికీ అందాల భరిణే అనిపిస్తుంది. కొన్ని పాటల్లో ఆమె ఇవాళ్టికీ కుర్రకారుకు గిలిగింతలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఆమె అభినయం కూడా పాత్రను సహజంగా మార్చింది.

రోబోగా రజనీకాంత్ నటన భేష్. ముందు మంచితనం, అమాయకత్వం నిండిన రోబోగానూ, ఆ తరువాత చెడు దోవ పట్టిన రోబో గానూ రెండు పార్శ్వాలనూ రజనీకాంత్ మెప్పించారు. గట్టిగా చెప్పాలంటే, సైంటిస్ట్ హీరో పాత్ర కన్నా చెడు దోవ పట్టిన రోబో నటనలోనే రజనీకాంత్ కు ఎక్కువ మార్కులు పడతాయి.

కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు పోషిస్తూ, ఆనక హీరోగా ఎదిగిన రజనీకాంత్ ఈ రోబో విలనీని బాగా పండించారు. వంద రోబోల్లో ఒకడిగా మారువేషంలో జొరబడిన సైంటిస్ట్ హీరోను, విలన్ రోబో కనిపెట్టే సన్నివేశం అందుకు ఓ మంచి ఉదాహరణ. అక్కడ విలన్ రోబోగా ఆయన నటన ‘చంద్రముఖి’లో ‘లక లక లక...’ ఘట్టం లాంటి వాటిని గుర్తుకు తెచ్చింది. ఇక, ప్రొఫెసర్ బోరాతో సహా మిగిలిన పాత్రలన్నీ - ఇలా వచ్చి, అలా వెళ్ళేవే.

ఊహలకే రెక్కలు వస్తే...

దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందినట్లుగా ప్రచారమవుతున్న ఈ సినిమా సాంకేతికత విషయంలో భారతీయ సినిమాను ఓ కొత్త తీరానికి తీసుకువెళ్ళిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా, విజువల్ ఎఫెక్ట్ లు, రోబోట్రానిక్స్ (స్టాన్ విన్ స్టన్ స్టూడియో), యాక్షన్ సన్నివేశాల (పీటర్ హెయిన్స్, యూయెన్ వూ పింగ్) రూపకల్పనలో హాలీవుడ్ చిత్రాలను తలపించింది. ఈ కథకూ, సన్నివేశాలకూ ‘ఐ- రోబో’ మొదలు ‘ట్రాన్స్ ఫార్మర్’ దాకా అనేకానేక ఆంగ్ల చిత్రాల నుంచి దర్శకుడు శంకర్ ప్రేరణ పొందారు. ఆంగ్ల సినిమాలు ఎక్కువగా చూసే వారికి ఆ మేరకు రోబోలోని కొన్ని అంశాలు, దృశ్యాలు కొత్తగా తోచకపోవచ్చు.

కానీ, కొన్నేళ్ళ క్రితమే వాటి స్ఫూర్తితో అల్లుకున్న శంకర్ ఆలోచన కమలహాసన్ - ప్రీతీ జింటా; షారుఖ్ ఖాన్ లను దాటి; చివరకు రజనీకాంత్ - ఐశ్వర్యారాయ్ లతో ఇప్పటికి ఇలా తెరపైకి ఎక్కిన తీరు సామాన్య ప్రాంతీయ భాషా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. భారీ ఊహను అంతే భారీగా తెరపై చూపడానికి దర్శకుడు శంకర్ పటిష్ఠమైన సాంకేతిక బృందంతో కలసి చేసిన కృషి, అతణ్ణి నమ్మి నిర్మాతలు (సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్) చేసిన శతాధిక కోట్ల సాహసం, దానికి చేస్తున్న వీర ప్రచారం దక్షిణాది సినీ రంగంలో అపూర్వ ఘట్టమే. శంకర్ ఈ సినిమాతో తన సమకాలికులకు ఓ కొత్త బెంచ్ మార్కు పెట్టారు.

అపూర్వ సాంకేతిక శ్రమ

నిజం చెప్పాలంటే, ‘రోబో’ సినిమా మొత్తానికీ మూలస్తంభాలు - సాంకేతిక నిపుణులు. ముదిమి మీద పడుతున్న రజనీకాంత్ ను మధ్యవయస్కుడిగా అందంగా (ఇంకా చెప్పాలంటే, మొన్నటి ‘శివాజీ’లో కన్నా అందంగా) చూపడంలో మేకప్ తో పాటు, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని చెప్పుకొని తీరాలి.

సైంటిస్ట్ గా, రోబో గా ఒకే ఫ్రేములో ఇద్దరు రజనీలు కనబడినా, అంతా సహజంగానే అనిపిస్తుంది. ఎక్కడా తేడా తెలియదు. సినిమాలో వచ్చే గ్రాఫిక్స్ సరే సరి. ఏకకాలంలో ఓ వంద మంది రజనీకాంత్ లు, (ఒక పాటలో పదుల కొద్దీ ఐశ్వర్యారాయ్ లు) కనిపించి కనువిందు చేస్తారు.

రెహమాన్ బాణీల్లో హాలులో తెలుగు మాటలు సరిగా వినిపించని పాటలు సో - సో అనిపించినా, వాటి చిత్రీకరణ మాత్రం ప్రతి శంకర్ సినిమాలో లానే లార్జర్ దేన్ లైఫే. హీరోయిన్ మీద ప్రేమను రోబో వ్యక్తం చేసే ‘ఇనుములో హృదయం మొలిచెనే...’, పెరూలో చిత్రీకరించిన ‘కిలిమంజారో...’ పాటలు కొన్నాళ్ళు జనాన్ని ఆకర్షిస్తాయి. ఎడారి ఇసుక తిన్నెల నడుమ నీలం రంగు నీటి చెలమలతో సినిమా మొదట్లోనే వచ్చే ‘నీలో వలపు...’ పాట లొకేషన్ ను చూసి, ప్రేక్షకులు మురిసిపోవడం ఖాయం. అలాగే పాటలకు వేసిన సెట్లు, సన్నివేశాల మొదలు పాటల దాకా వాడిన కాస్ట్యూమ్ లూ బాగున్నాయి.

ప్రొడక్షన్ డిజైనర్ గా బాధ్యతలు నిర్వహించిన సాబూ సిరిల్ కృషి ఒకటీ అరా చోట్ల కృత్రిమం అనిపించినా, హైటెక్ రోబోల రూపం నుంచి హెలికాప్టర్లు, సెట్ల దాకా రూపొందించడంలో ఆయన చేసిన శ్రమ సామాన్యం కాదు. ఆంటోనీ ఎడిటింగ్ కథనాన్ని వేగవంతం చేయడంలో సహకరించింది.

డబ్బింగ్ ప్రతిభ

తెలుగులో రజనీకాంత్ కు గాయకుడు మనో చేసిన స్వరదానం పాత్రను సజీవంగా నిలిపింది. ఇక, ఐశ్వర్యారాయ్ కు సవితా రెడ్డి గాత్రం నప్పింది. ‘నకరాలా’ అని పోలీసు అడిగితే (బహుశా తమిళంలో ‘నక్కలా’ (ఎగతాళి అని అర్థం) అయ్యుండాలి), ‘కాదు నికెల్’ అని రోబో జవాబు లాంటి చోట్ల అనుకున్న ఎఫెక్ట్ ను తెలుగు డబ్బింగ్ లో కూడా మాటల రచయిత శ్రీరామకృష్ణ తీసుకురాగలిగారు.

ఇక, తెలుగు పాటలు సుద్దాల అశోక్ తేజ, వనమాలి రచనలు. పాటల్లో ‘యంత్రుడు’ లాంటి అపసవ్యమైన తెలుగు ప్రయోగాలు కూడా అనిపించారు. ‘యంతిరన్’ అని తమిళంలో వస్తే, దానికి ‘యంత్రుడు’ అని యథేచ్ఛగా రాసినట్లనిపిస్తుంది. ఈ మన రచయితలు తమ విశృంఖల సృజనాత్మకతతో తెలుగు భాషకు మరోసారి జోహార్ అనేశారు.

జవాబు లేని ప్రశ్నలెన్నో...

ఇంత పెద్ద సినిమాలో లోపాలు కూడా ఇంకా లేకపోలేదు. మానవ స్పందనలు సైతం ఉన్నదిగా మారిన రోబో చిట్టి - ఆర్మీ టెస్టులో ఫెయిలవడంతో హీరో ముక్కలుగా విడగొట్టి పారేస్తాడు. తనను ముక్కలుగా విడగొట్టి పడేసి, తన ప్రేమను తోసిపుచ్చిన హీరోను మనిషి ఫీలింగ్స్ వచ్చిన రోబో ద్వేషించడం సహజం.

కానీ, తీరా చివరలో ఆ రెడ్ చిప్ ప్రోగ్రామ్ ఒక్కటి తీసేయగానే తన పాత స్పందనలన్నీ రోబో వదిలేస్తుంది. అప్పటి దాకా తాను ద్వేషించి, చంపడానికి కూడా సిద్ధమైన అదే హీరో పట్ల స్నేహంగా, మంచిగా ప్రవర్తిస్తుంది. ఈ మార్పు ఎలాగన్నది అర్థం చేసుకోలేం. స్పందనలనేవి రెడ్ చిప్ తో సంబంధం లేని అంశం కదా!

ఇక, అంత పెద్ద సైంటిస్ట్ హీరో, విడిభాగాలుగా విడగొట్టేసిన రోబోను ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా అలా చెత్తకుండీలో వేసేస్తాడా? పేటెంట్ రావడం కోసం చూస్తున్న సదరు శాస్త్రవేత్త, రోబోలోని సాఫ్టువేర్, ప్రోగ్రామింగ్ ల గురించైనా ఆలోచించకుండా అలా నిర్లక్ష్యంగా పారేస్తాడా…? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. అలాగే, విలన్ చేసిన ఒక్క (రెడ్ చిప్) ప్రోగ్రామ్ తో రోబో యావత్ ప్రపంచానికే అంత వినాశకరంగా మారడం కొంత సినిమాటిక్ గా అనిపిస్తుంది.

నో స్టయిల్స్, నో పంచ్ డైలాగ్స్

ఇక, రజనీకాంత్ తరహా మాస్ మెచ్చే స్టయిల్స్, పంచ్ డైలాగులు ఈ సినిమాలో శూన్యం. వాటిని ఆశించే వారికి ఈ సినిమా ఆశాభంగమే. సాధారణంగా రజనీకాంత్ సినిమాల్లో ఉండే భావోద్వేగభరిత అంశాలూ ఇందులో కనిపించవు. అలాగే, కథలో హీరో సైంటిస్ట్ పాత్ర కానీ, కాసేపు విలన్ గా కనిపించి - అర్ధంతరంగా చచ్చిపోయే ప్రొఫెసర్ బోరా పాత్ర కానీ పెద్దగా చేసిందేమీ లేదు. వాటి కన్నా రోబో పాత్రదే పైచేయి అయిందనిపిస్తుంది. ఒకానొక దశకు వచ్చేసరికి, విలన్ రోబోను అరికట్టడానికి హీరో ఏమీ చేయలేకపోయాడని కూడా అనిపించేస్తుంది. ఇలాంటివన్నీ తెలియకుండానే ప్రేక్షకుల అంతరాంతరాళాల్లో అసంతృప్తిని కలిగిస్తాయి. పైకి చెప్పలేని ఏదో వెలితిని మిగులుస్తాయి.

ముగింపు

అన్నట్లు, సినిమా చివరలో 2030 కాలం నాటిదంటూ ఓ భవిష్యత్ సన్నివేశాన్ని చూపారు. ఇరవై ఏళ్ళ క్రితం (2010లో) తయారుచేసిన ఈ రోబోను ఎందుకు డిస్ మ్యాంటిల్ చేశారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజియమ్ సందర్శనకు తీసుకొచ్చిన టీచర్ ని, ఓ విద్యార్థిని అడుగుతుంది.

దానికి, గాజు అరలో ఉన్న రజనీకాంత్ రోబో శిరస్సు సమాధానం చెబుతూ, ‘ఎందుకంటే -- నేను ఆలోచించడం మొదలుపెట్టాను కాబట్టి’ అంటుంది. ఇప్పుడు దర్శకుడు శంకర్ చేయాల్సింది కూడా అదేనేమో అనిపిస్తుంది. సినిమాను సాంకేతికంగా, విజువల్ గా ఇంత భారీగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమపడిన శంకర్ స్ర్కిప్టు మీద, కథలోని భావోద్వేగాల పైన మరింత లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాల్సి ఉంది.

నిజానికి, మనిషి యాంత్రికంగా మారుతున్న వేళ, యంత్రానికే మానవ సహజమైన స్పందన వస్తే అన్న ఆలోచన మంచిదే. రోబోకు రెడ్ చిప్ లాగా, మనుషులు అబద్ధం, అసూయ, వంచన, ద్రోహం, స్వార్థం, ద్వేషం లాంటి రెడ్ చిప్ లు తగిలించుకొని తిరుగుతున్నారన్న అంశమూ సమాజానికి చెంపదెబ్బే. కానీ, వాటిని ఇంకా ప్రభావశీలంగా చెప్పాల్సింది.

చిన్న ఇతివృత్తానికి చిత్రీకరణలోని భారీ తనంతో సరిపుచ్చకుండా, పకడ్బందీ కథనూ, పాత్రచిత్రణనూ, మానవ సంబంధాలనూ మరింత బలంగా అల్లుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా, కొన్నేళ్ళుగా స్క్రిప్టు రూపకల్పనలో శంకర్ కు ప్రధానబలంగా నిలిచిన ప్రముఖ తమిళ కథా రచయిత సుజాత ఆ మధ్య మరణించడం కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఈ బలహీనతకు కారణమేమో అనిపిస్తుంది. అందుకే, ఈ సినిమాను శంకర్ 'అపరిచితుడు' లాంటి గత చిత్రాలతో పోల్చలేం.

ఈ చిత్రంలో రోబో ప్రేమను హీరోయిన్ తిరస్కరించే ఘట్టం, చివరకు రోబో చిట్టి తనను తానే డిస్ మ్యాంటిల్ చేసుకొనే దృశ్యం లాంటి కొన్ని చోట్ల భావోద్వేగాల మెరుపులు మెరిశాయి. కానీ, ఇంతటి భారీ సినిమా - పై నుంచి కింది వరకూ అందరి మనసుల మీదా బలమైన ముద్ర వేయాలంటే ఆ మెరుపులు చాలవు. అది లేనప్పుడు ఇలాంటి సినిమాలు వట్టి సాంకేతిక అపురూపాలుగానే మిగిలిపోతాయి! బాక్సాఫీస్ కలెక్షన్లలోనే ఒరిగిపోతాయి!!

కొసమెరుపు: సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాల గురించి చాలామందిమి ఆహా, ఓహో అంటున్నాం. కానీ, నేను సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఆ జనంలో యువకుడైన ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం పక్కనున్న ఫ్రెండ్ తో ఇలా అన్నాడు: ‘‘అందరూ ‘క్లైమాక్స్ అదిరింది. అద్భుతం’ అంటూ ఉంటే ఏమో అనుకున్నారా బాబూ! చిన్నపిల్లల కామిక్స్, 3డి యానిమేషన్ గేమ్స్ చూసినట్లుందిరా!!’’ భావోద్వేగాల ముద్ర లేకపోతే బంధనాలు లేని ఎంతటి భారీ ఊహలకైనా వచ్చే కామెంట్లు ఇలానే ఉంటాయేమో?!

‘రోబో’: విజువల్స్ సరే...! విషయం మాటేమిటి...?!


సినిమా అంటే కొద్ది గంటల పాటు ఓ చీకటి గదిలో కళ్ళ ముందు కదిలే జీవితం. మనం కూడా అందులో భాగమనిపించేలా భ్రమ పెట్టే (కొన్నిసార్లు భయపెట్టే) మాయ. అలాంటి మాయా లోక విహారంలో వాస్తవం పాలు ఎంత, కల్పన పాలు ఎంత అన్న విచికిత్స ఒక్కోసారి ఎంత అవసరమో, అంత అనవసరం కూడా.

తీస్తున్నదీ, తెరపై చూస్తున్నదీ మాయలు, మంత్రాల కథో, ఆధునిక సైన్స్ - ఫిక్షనో అయినప్పుడు ఇక తర్కాలు, వాస్తవాలు, సంభావ్యతల కన్నా ఏ మేరకు సంభ్రమానికి గురయ్యామన్నదే కీలకమై కూర్చుంటుంది. రజనీకాంత్ హీరోగా, దర్శకుడు ఎస్. శంకర్ రూపొందించిన ‘రోబో’ (తమిళంలో ‘యంతిరన్’) సరిగ్గా అదే కోవకు చెందిన సినిమా. నిన్న ప్రపంచవ్యాప్తంగా వేల కొద్దీ థియేటర్లలో, ఆ స్థాయిలోనే ప్రింట్లతో, వందల కొద్దీ షోలతో విడుదలై, సంచలనం రేపిన (రేపుతూనే ఉన్న) ‘రోబో’ అనేకులతో ‘అమ్మో’ అనిపించడానికి కారణం అదే. కానీ, అదే సమయంలో సినిమా మొత్తం చూశాక, సాంకేతిక నైపుణ్యం, విజువల్స్ సరే కానీ, కథ, పాత్రల లోతుపాతులేమిటని ఆలోచిస్తే మాత్రం - పెళ్ళి విందుకని పిలిచి, మంచి మండపంలో మెస్ భోజనం పెట్టించినట్లుంది.

కథాక్రమంబెట్టిదనిన....

కథగా చెప్పాలంటే - డాక్టర్ వశీకర (రజనీకాంత్) ఓ మంచి శాస్త్రవేత్త. ఎంతో కష్టపడి అచ్చం తన లాగే ఉండే ఓ యాండ్రో - హ్యూమనాయిడ్ రోబోను తయారుచేస్తాడు. చెప్పిన పనల్లా చేయడమే కాక, బోలెడంత సమాచారాన్ని నిల్వ చేసుకోగల రోబో అది. ఎన్నో భాషలు, కళలు కూడా వచ్చిన ఈ మర మనిషికి చిట్టి (రెండో రజనీకాంత్) అని పేరు పెడతాడు హీరో. వంద మంది తెలివితేటలతో, సామర్థ్యంతో, శతయోధులకు సమానంగా సిద్ధం చేసిన ఈ రోబోను సైన్యానికి అప్పగించి, దేశభక్తిని చాటుకోవాలని ఆ సైంటిస్ట్ హీరో ఆలోచన.

ఈ పనుల్లో పడి ప్రేమించిన వైద్యవిద్యార్థిని సనా (ఐశ్వర్యారాయ్ బచ్చన్)ను కూడా కొంత అలక్ష్యం చేస్తాడు. అన్ని విధాలా తయారైన రోబోను శాస్త్రవేత్తల సదస్సులో నిలబెట్టి, ప్రశంసలు పొందుతాడు. అయితే, అదే సదస్సుకు హాజరైన వశీకర గురువు ప్రొఫెసర్ బోరా (డేనీ డెన్ జొప్ప)కు ఇది కంటగింపుగా మారుతుంది. అచ్చం మనిషిలా ప్రవర్తించే అలాంటి రోబోను తయారు చేయాలని అప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న బోరా, పైకి కనిపించనంతటి ద్వేషాన్ని వశీకర మీద పెంచుకుంటాడు.

రోబో చిట్టి చేసే విన్యాసాలు, కథానాయికను ఆదుకొనే సంఘటనలతో సినిమా మరికాసేపు గడుస్తుంది. రోబోను సైన్యానికి అప్పగించేందుకు అనుమతి కోసం శాస్త్రవేత్తల ముందు పరీక్షకు పెడతాడు సైంటిస్ట్ వశీకర. కానీ, అక్కడ మనిషి లాగా విచక్షణనూ, స్పందననూ ఉపయోగించలేని, ‘తన - పర’తేడా తెలియని వట్టి మరమనిషి అంటూ రోబోను ఫెయిల్ చేస్తాడు - ప్రొఫెసర్ బోరా. బయటి ప్రపంచంలోకి ఆ రోబోను పంపితే ప్రమాదమనేస్తాడు. మరొక్క అవకాశం ఇవ్వమంటాడు హీరో.

ఓ సవాలుగా తీసుకొని, రోబో చిట్టికి కోపం, ప్రేమ, సంతోషం లాంటి మనుషుల భావావేశాలనూ, స్పందనలనూ కష్టపడి ప్రోగ్రామ్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో పడ్డ ఓ గర్భిణికి హీరోయిన్ తో కలసి మామూలు ప్రసవం చేసి, రోబో చిట్టి చరిత్ర సృష్టిస్తాడు. ముద్దిచ్చి, అభినందించిన హీరోయిన్ ను మానవ స్పందనలున్న రోబో చిట్టి నిజంగానే ప్రేమించడం మొదలుపెడతాడు. అక్కడికి సినిమా ఫస్టాఫ్ పూర్తవుతుంది.

రోబో చిట్టిలో పెరిగిన ఈ ప్రేమ తరహా ప్రకృతి సహజమైన స్పందనలు హీరో, హీరోయిన్లకు తలనొప్పిగా తయారవుతాయి. ప్రకృతి విరుద్ధమైన ఆ ప్రేమను మర్చిపొమ్మని వాళ్ళు రోబోకు నచ్చజెబుతారు. కానీ, ఆ మాటలతో రోబో చిట్టి సమాధానపడడు. మరోపక్క విధ్వంసకరమైన వంద రోబోలను తయారుచేసి ఇవ్వడానికి విదేశీ అక్రమ ఆయుధ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రొఫెసర్ బోరా ఆ పని పూర్తి చేయలేక సతమతమవుతుంటాడు. రోబో చిట్టిలోని బాధను ఆసరాగా చేసుకొని, హీరో మీద అతని మనసు విరిచేస్తాడు బోరా.

దాంతో, మరునాడు ఆర్మీ టెస్టులో రోబో చిట్టి కావాలనే ప్రేమపాఠాలు వల్లిస్తూ, ఫెయిలవుతాడు. కొన్నేళ్ళ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైనందుకు హీరో కోపం కట్టలు తెచ్చుకుంటుంది. బతకాలని ఉందని రోబో బతిమాలుతున్నా వినకుండా, ముక్కలు ముక్కలు చేసి, చెత్తకుండీలో పారేయిస్తాడు. అన్నేళ్ళ ప్రయోగం విఫలమైందని బాధపడతాడు.

అప్పటికే హీరో మీద అక్కసుతో ఉన్న అతని అసిస్టెంట్ల (సంతానం, కరుణాస్) సహాయంతో ఆ రోబోకు మళ్ళీ జీవం పోస్తాడు ప్రొఫెసర్ బోరా. ప్రేమ కోసం బతకదలచిన రోబో చిట్టి నుంచి అలాంటి రోబోలను మరిన్ని తయారుచేసే మూలసూత్రం రాబడతాడు. ఉన్న ప్రోగ్రామ్ లకు తోడుగా, విధ్వంసాలు సృష్టించే తనదైన ప్రమాదభరిత రెడ్ చిప్ ప్రోగ్రామ్ ను కూడా రోబో చిట్టిలో ప్రవేశపెడతాడు.

విధ్వంసక శక్తిగా మారిన రోబో చిట్టి తన లాంటి మరిన్ని రోబోలను సృష్టించి, తనదైన సామ్రాజ్యం నెలకొల్పుకుంటాడు. సమాజంలో అల్లకల్లోలం రేపుతాడు. మళ్ళీ జీవం పోసిన ప్రొఫెసర్ బోరాను సైతం చంపేస్తాడు. హీరో, హీరోయిన్ల పెళ్ళి చెడగొట్టి, పెళ్ళి పీటల మీద నుంచి హీరోయిన్ ను ఎత్తుకు వచ్చి, తన రోబో సామ్రాజ్యంలో బందీని చేస్తాడు.

అక్కడ నుంచి అతణ్ణి ఎదుర్కోవడానికి అందరూ పడే తంటాలు, హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను తలపించే గ్రాఫిక్స్ నిండిన పతాక సన్నివేశాల్లో రోబోలను హీరో ఎలా నిర్వీర్యం చేశాడన్నది మిగతా సినిమా.

కథా కథనం

ఈ సినిమాలో ఫస్టాఫ్ కాస్త సరదా ఘట్టాలతో గడిచిపోతుంది. నీటికీ, నిప్పుకూ తట్టుకొనే రోబో చిట్టి పెద్దగా పాటలు పెట్టిన వారిని ఎదుర్కోవడం, దుండగుల బారి నుంచి లోకల్ ట్రైన్లో హీరోయిన్ ను కాపాడడం, అగ్నిప్రమాదంలో చిక్కుకున్న బాధితులను రక్షించడం లాంటి సన్నివేశాలతో ప్రథమార్ధంలో కొద్దిపాటి కథే అయినా, గబగబా గడిచిపోతుంది.

అక్కడికక్కడ ఆ యా సన్నివేశాల్లో ఆసక్తిని నిలిపి, పిల్లలను ఆకట్టుకోవడానికి ఆ కథనం తోడ్పడుతుంది. పిల్లలను ప్రధానమైన టార్గెట్ గా చేసుకొన్న ఈ సినిమాలో దోమలతో, రోబో సంభాషణల లాంటి లాజిక్ కు అందని మేజిక్కులు కూడా పుష్కలం.

ద్వితీయార్ధానికి వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. కథలోని అసలు పీటముడి, దానికి పరిష్కారమంతా సెకండాఫ్ లోనే వస్తాయి. సెకండాఫ్ సగమైన తరువాత నుంచి కథ మొత్తం సాంకేతికత సాయంతో చేసిన విజువల్ మాయ. దాంతో, ఓ దశకు వచ్చేసరికి పాత్రల మధ్య సంఘర్షణ కన్నా, ఏ మీట నొక్కి, ఏ టెక్నిక్ తో హీరో, ఆ రోబోల ఆట కట్టిసాడోనని ఎదురుచూడడమే మిగులుతుంది. అదే ఈ సినిమాలోని బలమూ, బలహీనత కూడా!

(మిగతా భాగం మరికాసేపట్లో...)

Saturday, October 2, 2010

'రోబో' సందడే సందడి!



హమ్మయ్య. ఎలాగైతేనేం. రజనీకాంత్ - శంకర్ ల 'రోబో' సినిమా చూశా. అదీ కష్టపడి టికెట్ సంపాదించి, మరీ మొదటి రోజే రాత్రి చూశా. హాలు కౌంటర్ లోనే బాల్కనీ టికెట్ ను అక్షరాలా నాలుగు రెట్ల రేటుకు అన్యాయంగా అమ్ముతూ, ప్రేక్షకులను దోచుకుంటున్న తీరుకు ఆవేదనపడుతూ మరీ చూశా. రజనీకాంత్ కు తెలుగులో కూడా ఉన్న అభిమానుల క్రేజును హాలులో ఆనంద పడుతూ చూశా. తెలుగులోనూ ఇలాంటి విజువల్ వండర్స్ చేసే దర్శకులు ఒకరికి నలుగురు వస్తే బాగుండునే అని ఆశిస్తూ చూశా.

పొద్దు పోయాక ఇంటికి వస్తూ, బోలెడన్ని హాళ్ళలో ఏకకాలంలో విడుదలైన 'రోబో' (తమిళంలో 'యంతిరన్') దెబ్బకు రోడ్ల మీద ఆగిపోయిన వాహనాలనూ అబ్బురంగా చూశా. అంత ట్రాఫిక్ రద్దీలోనూ బస్సులో జనం తెల్లవారు జాము నుంచి ఆ సినిమా చేస్తున్న సందడి గురించే మాట్లాడుకొంటున్న అలవికాని అభిమానాన్ని ఆశ్చర్యపోతూ చూశా. వెరసి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అని అంచనాలు కడుతూ ఇంటికి వచ్చేశా.

('రోబో'- సినిమా సమీక్ష... తరువాతి టపాలో... మరికొద్దిసేపట్లో...)

Friday, October 1, 2010

మేకప్ కి మూడు కోట్లా...? ఆడియోకు 8 కోట్లా..?

(‘ఒక రోబో - ఎన్నో కథలు’ - 2వ పార్ట్)

* రోబో చిత్ర సెట్ల విషయానికి వస్తే - ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా కళా దర్శకుడు సాబూ శిరిల్ చాలా కష్టమే పడ్డారు. ఈ సినిమా కోసం దాదాపు 35కు పైగా వేర్వేరు రకాల సెట్లు వేశారు. పతాక సన్నివేశంలోని సెట్ కోసమే దాదాపు 5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు భోగట్టా. అయితే, అన్నీ పర్యావరణ అనుకూలమైన పదార్థాలతో రూపొందించిన సెట్లే కావడం విశేషం. ఈ సినిమా కోసం కొత్త రకం హెలికాప్టర్లనూ, ఎయిర్ ఫోర్స్ విమానాలనూ ఆయన రూపొందించారు. ఇక, కిలిమంజారో.... అనే పాట కోసం అద్భుతమైన సెట్ వేశారు.

* ఈ సినిమాలో మొత్తం 6 పాటలుంటే, వాటిలో ఒక పాటను సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతీజా పాడడం విశేషం. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలసి ఆ చిన్నారి టైటిల్ సాంగ్ పాడింది. ‘‘ఆ పాట రికార్డు చేసేసరికి అర్ధరాత్రి దాటింది. నా కోసం ఆ పాట రికార్డు చేశాక, మరునాడు మా పాప బడికి వెళ్ళలేకపోయింది’’ అని రెహమాన్ ఆ మధ్య వెల్లడించారు.

* ఈ చిత్రం తమిళ ఆడియో రైట్లను థింక్ మ్యూజిక్ సంస్థ చేజిక్కించుకుంది. అందు కోసం ఆ సంస్థ చెల్లించిన మొత్తం అక్షరాలా 8 కోట్ల రూపాయలు. ఓ దక్షిణ భారతీయ సినిమా ఆడియో హక్కులు ఇంత భారీ మొత్తానికి అమ్ముడు కావడం ఇదే ప్రథమం.

* ప్రభుదేవా, రాజు సుందరం, లారెన్స్ రాఘవేంద్రలు ఈ సినిమాలోని వేర్వేరు పాటలకు నృత్య రీతులు సమకూర్చారు. రెండు పాటల చిత్రీకరణకే రూ. 30 కోట్లు ఖర్చయిందని యూనిట్ వర్గాలు చెబుతున్న మాట.

* ఇంతకీ ఈ సినిమాలో రజనీకాంత్ మేకప్ కే అక్షరాలా రూ. 3 కోట్లు ఖర్చయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. అంటే, ఓ చిన్న తెలుగు సినిమా బడ్జెట్ అన్నమాట.

* ఈ సినిమాను వియన్నా, పెరూలోని మచూ పిచూ, అమెరికా, బ్రెజిల్ లాంటి వేర్వేరు దేశాల్లో చిత్రీకరించారు. మనదేశంలో కూడా చెన్నైలోని వివిధ ప్రాంతాలతో పాటు రాయవెల్లూరు, పుణే, కులూమనాలి, గోవాలలో చిత్రీకరణ సాగింది.

* సినిమా కన్నా ముందు ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా తమిళనాట పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. తిరుచ్చిలో తొలిసారిగా రోబో (యంతిరన్) ట్రైలర్ ప్రదర్శిస్తుంటే, నిర్ణీత సమయాని కన్నా దాదాపు మూడు గంటల ముందు నుంచే అభిమానులు సినిమా హాలు బయట నిరీక్షించారు.

* ఇక, తూత్తుకుడిలో అయితే, ట్రైలర్ రీలును ఉన్న బాక్సును ఏనుగు అంబారీ మీద పెట్టి, బ్యాండు మేళాలతో పట్నమంతా ఊరేగించారట. కోయంబత్తూరులో రథంలో పెట్టి తిప్పారట. చెన్నైలో రజనీకాంత్ కటౌట్లకు అభిమానులు పాలాభిషేకాలు, హారతులు ఇవ్వడం సరేసరి. సినిమా విడుదల రోజు కూడా ఇలాంటి హంగామాకు మనం సిద్ధంగా ఉండాల్సిందే!