జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, March 15, 2011

త్వరలో రంగుల్లో ‘పాతాళ భైరవి’




(‘జై పాతాళ భైరవి’ - పార్ట్ 2)

‘పాతాళ భైరవి’లో స్క్రిప్టు, నటీనటుల ప్రతిభ, రచనా చమత్కృతి, సంగీతం, కళాదర్శకత్వం, ఛాయాగ్రహణం, దర్శకత్వం - అన్నింటినీ ఉత్కృష్టస్థాయిలో చూడవచ్చు. అందుకే, ఆ సినిమా 60 ఏళ్ళ తరువాత ఇప్పటికీ జనాదరణ పొందుతోంది. కొత్త సినిమాలకు సైతం రిపీట్ రన్లు లేని ఈ రోజుల్లో ఏడాదికీ, ఏణ్ణర్థానికీ పాత ప్రింట్లతో ఏదో ఒక ఊళ్ళో ఆడుతూనే ఉంది. పండుగలు, పబ్బాలు వచ్చాయంటే, ఈ సినిమాను మన టీవీ చానళ్ళ వాళ్ళు ప్రధాన ప్రసార సమయంలో ప్రసారం చేసి, అటు వాణిజ్య ప్రకటనలూ, ఇటు టి.ఆర్.పి.లు సాధించడం విశేషం.

ఇవాళ్టికీ కాసులు కురిపించే కామధేనువే


ఇప్పటికీ బెజవాడలో శ్రీదుర్గాకళామందిరం హాలులో ఈ సినిమా పదే పదే విడుదలవడం ఆ నగర వాసులకు చిరపరిచితమే. చిత్రం ఏమిటంటే - నాలుగు నెలల క్రితం ఈ సినిమా గుంటూరులోని గణేశ్ మహల్ లో రిలీజైంది (గుంటూరులోని 3వ అతి పాత హాలు ఇది. 1943లో సరస్వతీ టాకీస్ గా మొదలై, ఆ తరువాత రత్నా టాకీస్ గా, లీలా మహల్ గా పేర్లు మార్చుకొని, ఇప్పుడు గణేశ్ మహల్ గా నడుస్తోంది). పాత ప్రింటుతో రిలీజైనా సరే, ఆరు రోజుల పాటు ఆడి, ఖర్చులు, పన్నులు అన్నీ పోనూ, పంపిణీదారుకు రూ. 14 వేలు నికర ఆదాయం మిగిల్చింది. ఇవాళ కొత్త సినిమాలు సైతం ఈ మాత్రం షేర్ రాని పరిస్థితుల్లో 60 ఏళ్ళ పాత చిత్రం ఈ పాటి లాభం సంపాదించడం ‘పాతాళ భైరవి’ పట్ల ప్రజాదరణకు నిదర్శనం.

అందుకే, ఈ చిత్రాన్ని త్వరలో రంగుల్లో రిలీజు చేయనున్నారు. ఆ మధ్య ‘మాయాబజార్’ చిత్రాన్ని రంగుల్లోకి తెచ్చిన గోల్డ్ స్టోన్ సంస్థ వారే ఈ చిత్రం రంగుల పని పూర్తి చేసినట్లు భోగట్టా. నిజానికి, ఈ చిత్రం అప్పట్లో కూడా కొంత రంగుల్లో విడుదలైందనే విషయం ఆసక్తికరమైన సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. రెండు భాషల్లోనూ సినిమా సూపర్ హిట్. ఆ తరువాత జెమినీ ఎస్. ఎస్. వాసన్ ఈ చిత్రంలోని 3 పాటలను కలర్ లో తీసి, మిగతా చిత్రాన్ని మాత్రం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంచేసి, ఉత్తరాదిన 1952లో రిలీజ్ చేశారు. అక్కడా పాతాళ భైరవి పెద్ద హిట్. ఆ తరువాత చాలా ఏళ్ళకు 1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్ లో తీయడం మరో కథ.

కెరీర్ ను మార్చేసిన సినిమా


గమ్మత్తు ఏమిటంటే - ‘పాతాళ భైరవి’ విడుదలయ్యే వరకూ ఏయన్నార్ ప్రధానంగా జానపద చిత్రాల హీరో. ఎన్టీయార్ చేసినవన్నీ సాంఘిక చిత్రాలు. ఈ ఒక్క సినిమాతో ఎన్టీయార్ జానపద హీరోగా స్థిరపడి, తన సినీ జీవితంలో అత్యధిక భాగం జానపద చిత్రాల హీరోగా ఎదిగారు. ఏయన్నార్ తనను తాను పునరావిష్కరించుకొని, దేవదాసు వగైరా చిత్రాలతో సాంఘిక, ప్రేమ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నారు. పాతాళ భైరవి తరువాత ఏయన్నార్ నటించిన జానపదాలు మూడే మూడని సినీ గణాంక వివరాల నిపుణుల ఉవాచ. ‘నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా...’ అనే పాతాళ భైరవిలోని తోట రాముడి పాత్రతో ఎన్టీయార్ కు దక్కిన మాస్ హీరో ఇమేజ్ చిరకాలం నిలిచిపోవడం విశేషం. ఒక్క సినిమా కెరీర్ నే మార్చేస్తుందనడానికి ఇదో పెద్ద ఉదాహరణ.

‘సాహసం శాయరా డింభకా. రాకుమారి వరిస్తుంది...’ అంటూ నేపాల మాంత్రికుడిగా ఎస్వీ రంగారావు చూపిన నట వైదుష్యాన్ని ఎవరైనా మర్చిపోగలరా. ఈ సినిమా తరువాతే ఆయనకూ స్టార్ నటుడి హోదా లభించింది. ఇక, ఘంటసాల సంగీతంలోని ‘కలవరమాయే మదిలో...’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడూ...’, ‘ఎంత ఘాటు ప్రేమయో...’ లాంటి పాటలు, అడవిలో మాంత్రికుడితో హీరో నడిచివెళ్ళేటప్పుడు వచ్చే నేపథ్య సంగీతం తలుచుకుంటే, ఇప్పటికీ ఒళ్ళు పులకలెత్తుతుంది.

రికార్డుల గణాంకాలు


తొలి సారి విడుదలలో 13 కేంద్రాల్లో రిలీజై విశాఖపట్నం (సరస్వతీ టాకీస్ ), భీమవరం (మారుతీ), కర్నూలు (saibaba టాకీస్)ల్లో 91 రోజులు ఆడితే, మిగిలిన 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది - పాతాళ భైరవి. అలాగే, థియేటర్ మారకుండా తెలుగులో ద్విశత దినోత్సవం జరుపుకొన్న తొలి చిత్రమూ - ‘పాతాళ భైరవే.’ బెజవాడ (శ్రీ దుర్గా కళామందిరం), నెల్లూరు (శేష్ మహల్), గుడివాడ (శరత్), బళ్ళారి (ప్రభాత్ థియేటర్)లలో అలా హాలు మారకుండా 200 రోజులు ఆడింది.

మరో గమ్మత్తు ఏమిటంటే, తెలుగు పాతాళ భైరవి 100 రోజులు పండుగ చేసుకొనే నాటికి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సీమల్లో కలిపి, ఈ చిత్రం తెలుగు, తమిళ రూపాలు 100 కేంద్రాల్లో, 100 ప్రింట్లతో ఆడుతుండడం. 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రమూ - ‘పాతాళ భైరవే.’ ఇన్ని విశేషాలున్న ఓ అపురూపమైన చిత్రాన్ని అందించిన మన సినీ స్రష్టలకు ఈ సందర్భంగా మరో మారు అంజలి ఘటించడం కళాభిమానుల కర్తవ్యం కాదంటారా!

జై పాతాళభైరవి !




భారతీయ టాకీ నిన్న 80 ఏళ్ళు పూర్తి చేసుకుంటే, ఓ మహత్తర తెలుగు టాకీ చిత్రం ఇవాళ 60 ఏళ్ళ పండగ జరుపుకొంటోంది. సాహసం శాయరా డింభకా..., హే డింగరీ... లాంటి పదాలతో తెలుగు జనజీవితంలో మమేకమైన ఆ చిత్రం - ఎన్టీయార్ నటించిన ‘పాతాళభైరవి.’ ఇవాళ విడుదలైన ఏ సినిమా అయినా సరే రేపటికి రెండురోజులు, పదేళ్ళకు పదేళ్ళు పూర్తి చేసుకోవడం సహజం. కాలం ఆ వస్తువు, లేదా మనిషి వయస్సును చెప్పే కొలమానమే తప్ప, వాటి గొప్పదనానికి కొండగుర్తు మాత్రం కాదు. అయితే, ‘పాతాళ భైరవి’ విషయం అలా కాదు. 1951 మార్చి 15న ఆంధ్రదేశంలోని 13 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రానికి ఇవాళ్టితో 60 ఏళ్ళు నిండుతున్నాయని చెప్పుకోవడం కేవలం తారీఖులు, దస్తావేజుల చరిత్ర కోసం కానే కాదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆ చిత్రం ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ చిరంజీవిగా మిగలడం వెనుక ఉన్న కృషిని స్మరించుకోవడానికే.

విజయా పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా, కె.వి. రెడ్డి దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా తయారైన ‘పాతాళభైరవి’ తెలుగు వెండితెరపై కథానాయక పాత్రకు ఓ ఫార్ములాను సృష్టించింది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, ప్రతినాయకుడిపై విజయం సాధించి, నాయికను తనదాన్ని చేసుకోవడమనే ఓ పెద్ద బాక్సాఫీస్ ఫార్ములాకు ఈ సినిమా శ్రీకారం చుట్టింది. అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లావుద్దీన్ - అద్భుత దీపం కథను ప్రేరణగా తీసుకొని అల్లుకున్న ఈ కథ అచ్చ తెలుగు జానపదంగా ఒదిగిపోవడం వెనుక దర్శక (కె.వి. రెడ్డి), రచయిత (పింగళి నాగేంద్రరావు)ల కృషి ఎంతో అబ్బురపరుస్తుంది.

అసలు ఈ సినిమాను అక్కినేని నాగేశ్వరరావును హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ విలన్ గా పెట్టుకొని తీద్దామనుకున్నారు. కానీ, వాహినీ ప్రాంగణంలో ఎన్టీయార్, ఏయన్నార్ల మధ్య టెన్నీస్ ఆట చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది.

అలా ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’, ‘చంద్రహారం’, ‘పెళ్ళి చేసి చూడు’ - మొత్తం విజయా - వాహినీ వారి నాలుగు చిత్రాల్లోనూ నటించేందుకు నెలకు రూ. 750 జీతం మీద ఎన్టీయార్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాతాళ భైరవిలోని తోట రాముడు (ఎన్టీయర్ ), నేపాళ మాంత్రికుడు (యస్వీ రంగారావు), అంజిగాడు (కమెడియన్ బాలకృష్ణ), సదా జపుడు (పద్మనాభం), రాజు గారి బావమరిది (రేలంగి) లాంటి పాత్రలన్నీ మనకు ఇవాళ్టికీ కళ్ళకు కడుతుంటాయి.

(మిగతా భాగం మరికాసేపట్లో)

Monday, March 14, 2011

టాకీ చిత్రాల తొలి నాళ్ళ కబుర్లు



(మన భారతీయ టాకీకి ఇవాళ్టితో 80 ఏళ్ళు - పార్ట్ 2)

తొలి భారతీయ టాకీ ఆలమ్ ఆరా చిత్ర కథ కూడా రంగస్థలం మీద నుంచి వెండితెరకు నడిచి వచ్చినదే! పార్శీ ఇంపీరియల్‌ థియేటరికల్‌ కంపెనీకు చెందిన నాటక రచయిత జోసెఫ్‌ డేవిడ్‌ రాసిన 'ఆలమ్‌ ఆరా' నాటకం అప్పట్లో రంగస్థలంపై విజయవంతమైంది.

నాటకం నుంచి సినిమాగా 'ఆలమ్‌ ఆరా'

అందులో కథ ఏమిటంటే - కుమార్‌పూర్‌ రాజు గారికి ఇద్దరు భార్యలు. ఆ రాణులిద్దరికీ పిల్లలు లేరు. ఓ ఫకీరు చెప్పిన జోస్యం ప్రకారం వారిద్దరిలో సుగుణశీలి అయిన రాణి నవ్‌బహార్‌కు ఓ కొడుకు పుడతాడు. దాంతో, దుష్ట రాణి దిల్‌బహార్‌కు విపరీతమైన అసూయ కలుగుతుంది. మరోపక్క, సైన్యాధ్యక్షుడైన అదిల్‌ మీద దిల్‌బహార్‌ మనసు పడుతుంది. కానీ, అతనేమో ఆమె కోరికను తోసిపుచ్చుతాడు. ప్రతీకారంతో ఆమె అతణ్ణి ఖైదు చేయిస్తుంది. అదిల్‌ భార్య ఓ ఆడపిల్లకు జన్మనిచ్చి చనిపోతుంది. ఆ ఆడపిల్లే - ఆలమ్‌ ఆరా (నటి జుబేదా). కోయగూడెంలో ఆ అమ్మాయి పెరుగుతుంది. ఖైదులో ఉన్న తండ్రిని చూడడం కోసం ఒకసారి ఆ అమ్మాయి రాజప్రాసాదానికి వస్తుంది. మెడలోని హారం వల్ల ఆమె ఎవరన్నదీ తెలుస్తుంది. అక్కడ ఆమె, యువరాజు (నటుడు మాస్టర్‌ విఠల్‌)ను కలుస్తుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. చివరకొచ్చేసరికి - అదిల్‌ ఖైదు నుంచి విడుదలవుతాడు. దుష్టరాణి దిల్‌బహార్‌కు శిక్ష పడుతుంది. యువరాజు, ఆలమ్‌ ఆరాల పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.

సంచలనాత్మక ఆదరణ

అనేకానేక పాటలు, నృత్యాలను గుదిగుచ్చి అందించడానికి ఈ సాదాసీదా ఇతివృత్తం తోడ్పడింది. అయితేనేం, కథ ఏమిటని కాక, తెర మీద కదిలే బొమ్మలను చూడడమే కాక మాటలూ వినవచ్చని జనం వేలంవెర్రిగా థియేటర్లకు తరలివచ్చారు. 'ఆలమ్‌ ఆరా' విడుదల రోజున తెల్లవారుజాము నుంచే జనం బొంబాయిలోని మెజెస్టిక్‌ సినిమా దగ్గరకు గుంపులు గుంపులుగా చేరడం మొదలైంది. ''ఎంతో కష్టం మీద గానీ మేము కూడా థియేటర్‌లోకి ప్రవేశించలేకపోయాం'' అని అర్దేషిర్‌ ఇరానీ భాగస్వామి అబ్దులాలీ యూసూఫాలీ తెలిపారు.

''అప్పట్లో 'వరుస'లో నిల్చొని, టికెట్లు తీసుకొనే పద్ధతి కూడా ప్రేక్షకులకు తెలియదు. దాంతో, జనం టికెట్‌ బుకింగ్‌ ఆఫీసు మీదకు గుంపుగా వచ్చి పడ్డారు. తమకు అర్ధమైన భాషలో మాట్లాడే సినిమాను చూడడానికి, ఎలాగోలా టికెట్‌ సంపాదించాలని తాపత్రయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. చివరకు జనాన్ని అదుపు చేయడానికి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది... వారాల తరబడి టికెట్లు అమ్ముడైపోయాయి. ఎక్కువ రేటుకు బ్లాకులో టికెట్లు అమ్మేవాళ్ళు యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు'' అని ఆనాటి అనుభవాలను ఆయన గతంలో వెల్లడించారు.

సినిమా కష్టాలు

'ఆలమ్‌ ఆరా' తీయడానికి పడ్డ కష్టాలను ఆయన వివరిస్తూ, ''అప్పట్లో సౌండ్‌-ప్రూఫ్‌ స్టేజీలు లేవు. దాంతో మేము స్టూడియో లోపల, అదీ రాత్రి వేళ చిత్రీకరణ జరపడానికి మొగ్గు చూపేవాళ్ళం. మా స్టూడియో పక్కనే రైలు మార్గం ఉండేది. ఫలితంగా, ఆ శబ్దం రికార్డు కాకుండా ఉండడం కోసం, రైళ్ళు రాకపోకలు లేని సమయంలోనే షూటింగ్‌ జరపాల్సి వచ్చేది. పైగా, ఒకే సిస్టమ్‌తో కూడిన టానర్‌ రికార్డింగ్‌ సామగ్రితోనే శబ్దగ్రహణం చేయాల్సి వచ్చింది... అలాగే, నటీనటులు నటిస్తూ పలికే మాటలు, పాటలు రికార్డింగ్‌ చేయడానికి బూమ్‌లు (దూరంగా ఉంచి రికార్డు చేసే మైకులు) కూడా లేవు. కెమేరా కన్నులో పడకుండా మైక్రోఫోన్లను ఎక్కడెక్కడో రహస్యంగా ఉంచి, మాట, పాట రికార్డు చేయాల్సి వచ్చింది'' అని ఇరానీ చెప్పారు. కఠినమైన రికార్డింగ్‌ పరిస్థితుల కారణంగా 'ఆలమ్‌ ఆరా' రూపకల్పనకు నెలలకొద్దీ సమయం పట్టింది. పైగా, ప్రత్యర్థి సినిమా సంస్థల నుంచి పోటీని నివారించడం కోసం అంతా గుట్టుచప్పుడు కాకుండా చేయాల్సి వచ్చింది.

భారతీయ తొలి టాకీ 'ఆలమ్‌ ఆరా'లో సాంకేతిక, కళాత్మక విలువలు స్వల్పమే! అయినప్పటికీ, తొలి ప్రయత్నంగా అందరూ దాన్ని ఆదరించారు. 'ఆలమ్‌ ఆరా' అఖండ విజయంతో 'పాత్రలన్నీ మాట్లాడుతూ, పాటలు పాడుతూ, నృత్యం చేసే' చిత్రాలు చకచకా తయారయ్యాయి. గళం ప్రధానం కావడంతో రంగస్థల నటీనటుల్ని దర్శక - నిర్మాతలు తీసుకోసాగారు. 'ఆలమ్‌ ఆరా' విడుదలైన సరిగ్గా మూడు వారాల కల్లా తొలి బెంగాలీ టాకీ 'జమాయ సష్టి'ని మదన్‌ థియేటర్స్‌ విడుదల చేసింది. ఆ వెంటనే 'షిరీన్‌ ఫర్హాద్‌' అనే మరో భారతీయ టాకీని రూపొందించింది.

'షిరీన్‌ ఫర్హాద్‌' చిత్రాన్ని 22 సార్లు చూడడం కోసం లాహోర్‌లో టాంగా తోలే ఓ పంజాబీ ఏకంగా తన గుర్రాన్నే కుదవపెట్టాడట! ఆ ఊపులో ఒక్క 1931లోనే 8 టాకీ చిత్రాలనూ, 1932లో 16 టాకీలనూ మదన్‌ థియేటర్స్‌ రూపొందించింది.

భారతీయ టాకీలు తెచ్చిన మార్పులు

టాకీల ప్రవేశంతో సౌండ్‌ ప్రక్రియకు మారే స్థోమత లేక చాలా స్టూడియోలు మూతపడ్డాయి. అలాగే, అప్పటి దాకా మూకీల్లో ప్రసిద్ధ తారలుగా వెలిగిన ఆంగ్లో - ఇండియన్‌ నటీమణులు సైతం ధారాళంగా హిందీ, ఉర్దూ మాట్లాడలేక, తెర మరుగయ్యారు. పాటలు పాడుకోవడం రాని వారు కూడా నటనకు దూరం కావాల్సి వచ్చింది. శబ్దగ్రహణంలోని ఇబ్బందుల రీత్యా నటీనటులంతా మైకును దృష్టిలో పెట్టుకొని, దాని మీద ధ్యాసతో నటించాల్సి వచ్చేది. పాటలన్నీ ఒకే షాట్‌లో చిత్రీకరించేవారు. ఎవరికీ నైపుణ్యం లేదు గనక, ప్రయోగాలు చేస్తూ చిత్రీకరణ జరపడంతో బోలెడంత ముడి ఫిల్ము వృథా అయ్యేది. అయితేనేం, కొత్త ఒక వింతగా జనం విపరీతంగా వచ్చి, ఈ చిత్రాలు చూసేవారు. ఈ బాక్సాఫీస్‌ వసూళ్ళతో చాలా సినిమా హాళ్ళు, సంస్థలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణంగా మూతబడ్డ హాళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి.

దాదాపు 16 ప్రధాన భాషలు, కొన్ని వందల మాండలికాలకు నెలవైన భారతదేశంలో వివిధ భాషల్లో టాకీ చిత్రాలు తయారవడం మొదలైంది. మొదట్లో అన్ని ప్రాంతాల వారికీ అర్ధమయ్యేలా, హిందీ, ఉర్దూ కలగలిసిన హిందుస్థానీలో తొలి భారతీయ శబ్ద చిత్రాలు తయారయ్యేవి. ఆ తరువాత బెంగాలీలో 'జమాయ సష్టి' (1931), తమిళంలో 'కాళిదాస్‌' (1931- ఇందులో తెలుగు డైలాగులు, త్యాగరాజ కీర్తనలు ఉండడంతో, దీన్ని తొలి తమిళ, తెలుగు టాకీ అనేవారూ ఉన్నారు), తెలుగులో 'భక్త ప్రహ్లాద', మరాఠీలో 'అయోధ్యా చే రాజా' (1932), గుజరాతీలో 'నరసింహ మెహతా' (1932), కన్నడంలో 'సతీ సులోచన' (1934) చిత్రాలు ఆ యా భాషల్లో తొలి టాకీలుగా విడుదలయ్యాయి. 1931లో హిందీ, బెంగాలీ, తమిళ, తెలుగు టాకీలు తయారు కావడంతో, ఈ ఏడాది ఈ చిత్ర పరిశ్రమలన్నీ ఎనభై వసంతాలు జరుపుకొంటున్నాయి.

(తొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా'కు ఇవాళ్టితో ఎనభై వసంతాలు నిండుతున్న సందర్భంగా...)

మన భారతీయ టాకీకి ఇవాళ్టితో 80 ఏళ్ళు



(తొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా'కు ఎనభై వసంతాలు నిండుతున్న సందర్భంగా...)

మన దేశంలో వెండితెర మీద బొమ్మ మాట్లాడడం మొదలై ఇప్పుడు సరిగ్గా 80 ఏళ్ళు కావస్తోంది. మాటలు లేని మూగ సినిమాల (మూకీల) యుగం నుంచి భారతీయ సినిమా మాట, పాట నేర్చిన (టాకీల) స్థాయికి ఎదిగిన కథ ఎన్నో గమ్మత్తయిన అనుభవాల సమాహారం. తొట్టతొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా' ఇప్పటికి సరిగ్గా ఎనిమిది దశాబ్దాల క్రితం 1931 మార్చి 14న విడుదలైంది. మూకీ చిత్రాల నుంచి మాట్లాడే సినిమాల వైపు జనం ఎలా విపరీతంగా ఆకర్షితులయ్యారనే సంగతులు ఇవాళ్టికీ మనకు ఆసక్తి కలిగిస్తాయి, అబ్బురపరుస్తాయి. ఆ విశేషాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. రండి!

మన దేశంలో మూగ సినిమాల చలనచిత్ర ప్రదర్శన తొలిసారిగా 1896 జూలై 7న, బొంబాయిలో జరిగినట్లు సినిమా చరిత్ర చెబుతోంది. మొదట్లో విదేశాల నుంచి ఈ మూకీ చిత్రాలను తెచ్చి, ఇక్కడ ప్రదర్శించేవారు. 1910వ దశకంలో భారతదేశంలో మన దేశీయులే పూర్తిస్థాయి మూకీ కథా చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. ఆర్‌.జి. టోర్నీ, దాదాసాహెబ్‌ ఫాల్కే లాంటి తొలితరం సినీ రూపకర్తలతో భారతదేశంలో సినిమా పరిశ్రమకు బీజం పడింది. మరి, ఆ తరువాత మూకీల నుంచి టాకీలకు ఎదగడం వెనుక పెద్ద కథే జరిగింది.

ఆర్థిక మాంద్యం తెచ్చిన అనూహ్యమైన మార్పు

తెరపై కదిలే బొమ్మల ప్రదర్శనగా మొదట్లో మూకీలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. భారతదేశంలోనూ అదే పరిస్థితి. అంతా బాగా జరుగుతోందని అనుకుంటున్న సమయంలో 1920ల చివరలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల లాగానే భారతదేశం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. చలనచిత్ర పరిశ్రమ మీద ఆ దెబ్బ గట్టిగా పడింది. ప్రజలకు కదిలే చిత్రాల మీద ఆసక్తి క్రమంగా క్షీణించింది. ప్రజల్లో మారుతున్న వైఖరిని గమనించకుండా గబగబా సొమ్ములు చేసుకోవాలన్న నిర్మాతల వైఖరి, చలనచిత్ర కళలో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దర్శక - నిర్మాతలు మారకపోవడం వల్ల బాక్సాఫీస్‌ వసూళ్ళు క్రమంగా క్షీణించాయి. దాంతో, మనదేశంలో చాలా భాగం సినిమాహాళ్ళు మూతపడ్డాయి. అనేక చలనచిత్ర నిర్మాణ సంస్థలు బిచాణా ఎత్తేశాయి.

శబ్ద శకానికి శ్రీకారం

అయితే, 1930ల నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్లే 'శబ్ద సహిత చిత్రాలు' (సౌండ్‌ ఫిల్మ్‌) ఆవిర్భవించాయని చెప్పుకోవచ్చు. అప్పటి దాకా శబ్దం లేని మూగ చిత్రా (సైలెంట్‌ ఫిల్మ్‌)లే చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఈ 'సౌండ్‌ ఫిల్మ్‌'లు ఒక కొత్త వింతగా మారాయి. అలా 'సౌండ్‌ ఫిల్మ్‌'ల ఆవిర్భావంతో అమెరికాలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బాక్సాఫీస్‌ వసూళ్ళకు మళ్ళీ కొత్త ఊపు వచ్చింది. 'డాన్‌ జువాన్‌' అనే సైలెంట్‌ ఫిల్మ్‌లోని దృశ్యాలకు తగ్గట్లుగా సంగీతాన్నీ, సౌండ్‌ ఎఫెక్ట్‌లనూ జత చేసి, వార్నర్‌ బ్రదర్స్‌ వాణిజ్యపరంగా సినిమాల్లో శబ్ద శకానికి శ్రీకారం చుట్టారు. 1926 ఆగస్టు 6న ఇది జరిగింది.

ఆ తరువాత ఓ సంవత్సరానికి 'ది జాజ్‌ సింగర్‌' చిత్రంలో తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి, వార్నర్‌ బ్రదర్సే ఓ సంచలనాత్మక విజయం సాధించారు. ఆ చిత్రంలో ''ఒక్క క్షణం ఆగండి, ఒక్క క్షణం ఆగండి! ఇప్పటి వరకు మీరింకా ఏమీ వినలేదు...'' అంటూ ఓ సహజమైన స్వరం వినిపించినప్పుడు జనం ముగ్ధులైపోయారు. 'ది జాజ్‌ సింగర్‌' విజయం తరువాత 1928లో వార్నర్‌ బ్రదర్స్‌ తొలిసారిగా 'అన్ని పాత్రలూ మాట్లాడే' చలనచిత్రం 'ది లైట్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌'ను విడుదల చేశారు. నిజానికి, తెర మీద కదిలే బొమ్మలకూ, రికార్డు చేసిన శబ్దానికీ జత కట్టాలన్న ఆలోచన చాలా పాత కాలం నుంచీ ఉన్నదే! అయితే, అవి చాలాకాలం ప్రయోగదశలోనే మిగిలాయి. తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను డాక్టర్‌ లీ డి ఫారెస్ట్‌ కనిపెట్టారు. ఆ ప్రక్రియను తొలిసారిగా భారతదేశంలో 1927 మే నెలలో బొంబాయిలోని రాయల్‌ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు.

భారతదేశంలో తొలి శబ్దచిత్ర ప్రయత్నాలు

వీటన్నిటి తరువాత భారతదేశంలో సైతం బొమ్మలకు తగ్గట్లు శబ్దాన్ని జోడించి, చలనచిత్రాన్ని రూపొందించేందుకు మదన్‌ థియేటర్స్‌ సంస్థ అందరి కన్నా ముందుగా ప్రయత్నాలు చేసింది. 1929లో మదన్‌ థియేటర్స్‌ సంస్థ భారతదేశంలోనే తొలిసారిగా కలకత్తాలోని ఎల్ఫిన్‌స్టన్‌ పిక్చర్‌ ప్యాలెస్‌లో యూనివర్సల్‌ వారి 'మెలొడీ ఆఫ్‌ లవ్‌' అనే టాకీ చిత్రాన్ని ప్రదర్శించింది. నిజానికి, భారతదేశ తూర్పు ప్రాంతంలో అలా శాశ్వత ప్రాతిపదికన శబ్ద యంత్రాలను సమకూర్చుకున్న మొట్టమొదటి హాలు కలకత్తాలోని ఆ ఎల్ఫిన్‌స్టనే! విదేశాల నుంచి టాకీ చిత్రాలు వస్తుండే సరికి 1930 చివరి నాటికల్లా భారతదేశంలోని మొత్తం 370 థియేటర్లలో 30కి పైగా థియేటర్లు (అంటే దాదాపు 10 శాతం హాళ్ళన్న మాట!) శబ్ద సహిత చిత్రాలను ప్రదర్శించేందుకు వీలుగా తగిన సామగ్రిని సమకూర్చుకున్నాయి.

తరచూ విదేశాల్లో పర్యటించే మదన్‌ థియేటర్స్‌ సంస్థ యజమాని జె.జె. మదన్‌ న్యూయార్క్‌లో 'ది జాజ్‌ సింగర్‌'ను చూశారు. దానికి ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనను గమనించారు. ఇక, సినిమా భవిష్యత్తు అంతా శబ్దంతో కూడిన చిత్రాల్లోనే ఉందని గ్రహించారు. సరికొత్త పరిణామాలను లోతుగా పరిశీలించడం కోసం హాలీవుడ్‌ను సందర్శించి, భారత్‌లోని తన స్టూడియోకు శబ్ద సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆర్డరు పెట్టారు. అదే సమయంలో కలకత్తా శివార్లలోని టాలీగంజ్‌ ప్రాంతంలో ఓ సౌండ్‌-ప్రూఫ్‌ స్టూడియో నిర్మాణం మొదలైంది. ఆ టాలీగంజ్‌ ప్రాంతం పేరిటే అక్కడి చిత్ర పరిశ్రమ ఆ తరువాత 'టాలీవుడ్‌'గా ప్రసిద్ధమైంది. (అలా బెంగాలీ పరిశ్రమకు ప్రసిద్ధమైన పేరును అజ్ఞానంతో అరువు తెచ్చుకొని, దానికి సంబంధమే లేని తెలుగు చిత్ర పరిశ్రమను 'టాలీవుడ్‌' అని తప్పుడు పేరుతో పిలవడం గడచిన పదేళ్ళ పైచిలుకుగా తప్పుగా ప్రచారంలోకి వచ్చింది!)

పోటాపోటీలో ముందు వచ్చిన 'ఆలమ్‌ ఆరా'

మరి, కలకత్తాకు చెందిన మదన్‌ థియేటర్స్‌ ఇంత కృషి చేస్తుంటే, బొంబాయికి చెందిన అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలో ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ వారి 'ఆలమ్‌ ఆరా' తొలి భారతీయ టాకీ ఎలా అయింది? దీని వెనుక కూడా ఓ చిన్న కథ ఉంది. నిజానికి, పూర్తిస్థాయి భారతీయ టాకీ చిత్రాల రూపకల్పన కోసం అప్పట్లో కనీసం మూడు సిండికేట్‌ సంస్థలు పోటాపోటీగా ప్రయత్నించాయి. పూర్తి స్థాయిలో మాట్లాడే చలనచిత్రాన్ని రూపొందించాలన్న పోటాపోటీలో ఎట్టకేలకు అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలోని 'ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ'యే ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. ఎనభై ఏళ్ళ క్రితం 1931 మార్చి 14న తొలి పూర్తి నిడివి భారతీయ టాకీ 'ఆలమ్‌ ఆరా'ను బొంబాయిలోని 'మెజెస్టిక్‌ సినిమా' హాలులో విడుదల చేసింది.

(మిగతా భాగం మరి కాసేపట్లో....)

Friday, March 11, 2011

మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్...

రకరకాల పని ఒత్తిళ్ళ మధ్య చాలా రోజులుగా పోస్టులు రాయడానికి వీలు లేకుండా ఉన్న నేను ఈ అర్ధరాత్రి వేళ ఈ పోస్టు మాత్రం రాయకుండా ఉండలేకపోతున్నా. పొద్దుటి నుంచి ఆఫీసులో పని చేసి వచ్చినప్పటి అలసట, బాధలను మించిన బాధ, ఉద్వేగం ఈ పోస్టు రాసేలా చేస్తున్నాయి. బహుశా తెలుగు జాతి చరిత్రలో ఇంతటి దుర్దినాన్ని చూడలేం. ఎక్కడ ఉన్నారు, ఉంటున్నారు, ఉండనున్నారనే ప్రాంతీయ అంశాలకు అతీతంగా తెలుగు వాళ్ళందరికీ వర్తించే బాధ ఇది అని నా నమ్మకం.

ఇవాళ ట్యాంక్ బండ్ మీద జరిగిన దారుణం తాలూకు మానసిక గాయం బహుశా ఇప్పుడే కాదు, బహుశా ఎప్పటికీ మానదేమో. మార్చి 10న మిలియన్ మార్చ్ అని ప్రకటించినప్పటి నుంచి ఇవాళ పొద్దున్న దాకా దాని మీద చెలరేగుతున్న చర్చలు వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంతో సంబంధం లేని ఇలాంటి దారుణాన్ని మాత్రం నేనైతే ఊహించలేదు. ఇక్కడ ప్రశ్న రాష్ట్రం సమైక్యంగా ఉండాలా, లేక రెండుగానో, వీలుంటే మూడు గానో, నాలుగు గానో విడిపోవాలా అన్నది కాదు. రాష్ట్రాల సంఖ్యతో సంబంధం లేకుండా మన తెలుగు జాతికి, తెలుగు నేలకూ గౌరవం తెచ్చిన మహోన్నతులకు మనమే ఇంతటి అపచారం చేయడం ఏమిటి?

తెలుగు సాహిత్యానికీ, సంస్కృతికీ, సమాజానికీ వెలుగుదివ్వెలుగా నిలిచిన పెద్దల విగ్రహాలను ధ్వంసం చేయడం ఏ రకమైన సంస్కారం? నన్నయ్య విగ్రహం ధ్వంసం చేయడమెందుకు? తెలుగులో ఆది కవి అయినందుకా? ఎర్రనను అవమానించాల్సింది ఎందుకు? ఆంధ్రమహాభారతాన్ని అందించినందుకా? తెర మీద తారలే లోకంగా బతికే మన తెలుగు జాతికి సంగీతం వద్దు, సాహిత్యం వద్దు. సంస్కృతి అసలే వద్దు. అందుకే, మన ట్యాంక్ బండ్ పై అన్నమయ్య వద్దు. క్షేత్రయ్య వద్దు. మొల్ల వద్దు. కూచిపూడి నాట్యాన్ని అందించిన సిద్ధేంద్ర యోగి అసలే వద్దు. కృష్ణదేవరాయలు, బ్రహ్మనాయుడు, కనీసం రాణి రుద్రమదేవి కూడా వద్దు. నవ యుగ వైతాళికులైన కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, శ్రీశ్రీ, జాషువాలకు కూడా కుల, మత, ప్రాంతాలను అంటగట్టి, ఈ విద్వేషాలతోనే అంట కాగుదాం.

తెలుగు నాట స్ఫూర్తి దాతలైన వ్యక్తులు అన్ని రంగాల్లో కరవవుతుంటే, ఉన్న ఆ కొందరి స్మృతులను కూడా చెరిపేద్దాం. వేమన నోటికి గుడ్డ కట్టి, సినిమా, రాజకీయ తారాగణమే ఆరాధ్యదైవాలుగా, ఆ సంస్కృతే మన సంస్కృతిగా చంకలు గుద్దుకుందాం. వీలైతే నాదే కులమో, నీదే మతమో, అవతలి వాడిది ఏ ప్రాంతమో తెలుసుకొని, తన్నుకుందాం. ప్రాంతాలకు అతీతంగా వెలుస్తున్న కుహనా రాజకీయ నేతలనే వర్తమాన తరానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఐకాన్స్ గా చెప్పుకుందాం.

పక్క రాష్ట్రం వాడికి ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇచ్చాడనీ, మనకు రాకుండా అడ్డుకున్నారనీ వేదికలెక్కి భోరున ఏడుద్దాం. అదే నోటితో, అదే చేతితో మన భాషా సంస్కృతులకు దీపధారులైన వారి విగ్రహాలను ధ్వంసం చేద్దాం. అందుకే, నా మటుకు నాకు ఇవాళ హుస్సేన్ సాగర్ లో పడ్డది తెగిపడ్డ విగ్రహాలు కాదు, తెలుగు వాడి (అది ఉత్తర కోస్తా నుంచి ఇటు తెలంగాణ వరకూ ప్రతి ఒక్కరి) ఆత్మగౌరవం. మంట గలిసింది మరేదో కాదు, మన జాతి ప్రతిష్ఠ. సంకుచితమైన భావాలకు అతీతంగా కృషి చేసిన మహామహుల త్యాగం.

ఈ రోజున మన జాతినీ, మన భాషనూ మనమే అగౌరవ పరుచుకున్నందుకు భుజాలు ఎగరేద్దాం. ట్యాంక్ బండ్ బుద్ధుడి సాక్షిగా ఏమీ జరగనట్లే మళ్ళీ రేపు మన పనుల్లో మనం మునిగిపోదాం. ఈ భాష, ఈ జాతి, ఈ సంస్కృతి, ఈ సాహిత్యం ఏమైతే ఎవడికి కావాలి? నా కులం వాడికీ, నా ప్రాంతం వాడికీ మంత్రి పదవో, మరొకటో వస్తే చాలని సంతోషిద్దాం. మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్ అన్న మాట పదే పదే నిజం చేద్దాం.

(వెయ్యేళ్ళ పైచిలుకు తెలుగు సాహితీ, సాంస్కృతిక చరిత్రలో తమ వంతు పాత్ర పోషించిన ప్రతిభామూర్తులందరికీ పేరు పేరునా క్షమాపణలు చెప్పుకుంటూ...)