జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, March 14, 2011

మన భారతీయ టాకీకి ఇవాళ్టితో 80 ఏళ్ళు



(తొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా'కు ఎనభై వసంతాలు నిండుతున్న సందర్భంగా...)

మన దేశంలో వెండితెర మీద బొమ్మ మాట్లాడడం మొదలై ఇప్పుడు సరిగ్గా 80 ఏళ్ళు కావస్తోంది. మాటలు లేని మూగ సినిమాల (మూకీల) యుగం నుంచి భారతీయ సినిమా మాట, పాట నేర్చిన (టాకీల) స్థాయికి ఎదిగిన కథ ఎన్నో గమ్మత్తయిన అనుభవాల సమాహారం. తొట్టతొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా' ఇప్పటికి సరిగ్గా ఎనిమిది దశాబ్దాల క్రితం 1931 మార్చి 14న విడుదలైంది. మూకీ చిత్రాల నుంచి మాట్లాడే సినిమాల వైపు జనం ఎలా విపరీతంగా ఆకర్షితులయ్యారనే సంగతులు ఇవాళ్టికీ మనకు ఆసక్తి కలిగిస్తాయి, అబ్బురపరుస్తాయి. ఆ విశేషాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. రండి!

మన దేశంలో మూగ సినిమాల చలనచిత్ర ప్రదర్శన తొలిసారిగా 1896 జూలై 7న, బొంబాయిలో జరిగినట్లు సినిమా చరిత్ర చెబుతోంది. మొదట్లో విదేశాల నుంచి ఈ మూకీ చిత్రాలను తెచ్చి, ఇక్కడ ప్రదర్శించేవారు. 1910వ దశకంలో భారతదేశంలో మన దేశీయులే పూర్తిస్థాయి మూకీ కథా చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. ఆర్‌.జి. టోర్నీ, దాదాసాహెబ్‌ ఫాల్కే లాంటి తొలితరం సినీ రూపకర్తలతో భారతదేశంలో సినిమా పరిశ్రమకు బీజం పడింది. మరి, ఆ తరువాత మూకీల నుంచి టాకీలకు ఎదగడం వెనుక పెద్ద కథే జరిగింది.

ఆర్థిక మాంద్యం తెచ్చిన అనూహ్యమైన మార్పు

తెరపై కదిలే బొమ్మల ప్రదర్శనగా మొదట్లో మూకీలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. భారతదేశంలోనూ అదే పరిస్థితి. అంతా బాగా జరుగుతోందని అనుకుంటున్న సమయంలో 1920ల చివరలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల లాగానే భారతదేశం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. చలనచిత్ర పరిశ్రమ మీద ఆ దెబ్బ గట్టిగా పడింది. ప్రజలకు కదిలే చిత్రాల మీద ఆసక్తి క్రమంగా క్షీణించింది. ప్రజల్లో మారుతున్న వైఖరిని గమనించకుండా గబగబా సొమ్ములు చేసుకోవాలన్న నిర్మాతల వైఖరి, చలనచిత్ర కళలో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దర్శక - నిర్మాతలు మారకపోవడం వల్ల బాక్సాఫీస్‌ వసూళ్ళు క్రమంగా క్షీణించాయి. దాంతో, మనదేశంలో చాలా భాగం సినిమాహాళ్ళు మూతపడ్డాయి. అనేక చలనచిత్ర నిర్మాణ సంస్థలు బిచాణా ఎత్తేశాయి.

శబ్ద శకానికి శ్రీకారం

అయితే, 1930ల నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్లే 'శబ్ద సహిత చిత్రాలు' (సౌండ్‌ ఫిల్మ్‌) ఆవిర్భవించాయని చెప్పుకోవచ్చు. అప్పటి దాకా శబ్దం లేని మూగ చిత్రా (సైలెంట్‌ ఫిల్మ్‌)లే చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఈ 'సౌండ్‌ ఫిల్మ్‌'లు ఒక కొత్త వింతగా మారాయి. అలా 'సౌండ్‌ ఫిల్మ్‌'ల ఆవిర్భావంతో అమెరికాలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బాక్సాఫీస్‌ వసూళ్ళకు మళ్ళీ కొత్త ఊపు వచ్చింది. 'డాన్‌ జువాన్‌' అనే సైలెంట్‌ ఫిల్మ్‌లోని దృశ్యాలకు తగ్గట్లుగా సంగీతాన్నీ, సౌండ్‌ ఎఫెక్ట్‌లనూ జత చేసి, వార్నర్‌ బ్రదర్స్‌ వాణిజ్యపరంగా సినిమాల్లో శబ్ద శకానికి శ్రీకారం చుట్టారు. 1926 ఆగస్టు 6న ఇది జరిగింది.

ఆ తరువాత ఓ సంవత్సరానికి 'ది జాజ్‌ సింగర్‌' చిత్రంలో తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి, వార్నర్‌ బ్రదర్సే ఓ సంచలనాత్మక విజయం సాధించారు. ఆ చిత్రంలో ''ఒక్క క్షణం ఆగండి, ఒక్క క్షణం ఆగండి! ఇప్పటి వరకు మీరింకా ఏమీ వినలేదు...'' అంటూ ఓ సహజమైన స్వరం వినిపించినప్పుడు జనం ముగ్ధులైపోయారు. 'ది జాజ్‌ సింగర్‌' విజయం తరువాత 1928లో వార్నర్‌ బ్రదర్స్‌ తొలిసారిగా 'అన్ని పాత్రలూ మాట్లాడే' చలనచిత్రం 'ది లైట్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌'ను విడుదల చేశారు. నిజానికి, తెర మీద కదిలే బొమ్మలకూ, రికార్డు చేసిన శబ్దానికీ జత కట్టాలన్న ఆలోచన చాలా పాత కాలం నుంచీ ఉన్నదే! అయితే, అవి చాలాకాలం ప్రయోగదశలోనే మిగిలాయి. తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను డాక్టర్‌ లీ డి ఫారెస్ట్‌ కనిపెట్టారు. ఆ ప్రక్రియను తొలిసారిగా భారతదేశంలో 1927 మే నెలలో బొంబాయిలోని రాయల్‌ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు.

భారతదేశంలో తొలి శబ్దచిత్ర ప్రయత్నాలు

వీటన్నిటి తరువాత భారతదేశంలో సైతం బొమ్మలకు తగ్గట్లు శబ్దాన్ని జోడించి, చలనచిత్రాన్ని రూపొందించేందుకు మదన్‌ థియేటర్స్‌ సంస్థ అందరి కన్నా ముందుగా ప్రయత్నాలు చేసింది. 1929లో మదన్‌ థియేటర్స్‌ సంస్థ భారతదేశంలోనే తొలిసారిగా కలకత్తాలోని ఎల్ఫిన్‌స్టన్‌ పిక్చర్‌ ప్యాలెస్‌లో యూనివర్సల్‌ వారి 'మెలొడీ ఆఫ్‌ లవ్‌' అనే టాకీ చిత్రాన్ని ప్రదర్శించింది. నిజానికి, భారతదేశ తూర్పు ప్రాంతంలో అలా శాశ్వత ప్రాతిపదికన శబ్ద యంత్రాలను సమకూర్చుకున్న మొట్టమొదటి హాలు కలకత్తాలోని ఆ ఎల్ఫిన్‌స్టనే! విదేశాల నుంచి టాకీ చిత్రాలు వస్తుండే సరికి 1930 చివరి నాటికల్లా భారతదేశంలోని మొత్తం 370 థియేటర్లలో 30కి పైగా థియేటర్లు (అంటే దాదాపు 10 శాతం హాళ్ళన్న మాట!) శబ్ద సహిత చిత్రాలను ప్రదర్శించేందుకు వీలుగా తగిన సామగ్రిని సమకూర్చుకున్నాయి.

తరచూ విదేశాల్లో పర్యటించే మదన్‌ థియేటర్స్‌ సంస్థ యజమాని జె.జె. మదన్‌ న్యూయార్క్‌లో 'ది జాజ్‌ సింగర్‌'ను చూశారు. దానికి ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనను గమనించారు. ఇక, సినిమా భవిష్యత్తు అంతా శబ్దంతో కూడిన చిత్రాల్లోనే ఉందని గ్రహించారు. సరికొత్త పరిణామాలను లోతుగా పరిశీలించడం కోసం హాలీవుడ్‌ను సందర్శించి, భారత్‌లోని తన స్టూడియోకు శబ్ద సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆర్డరు పెట్టారు. అదే సమయంలో కలకత్తా శివార్లలోని టాలీగంజ్‌ ప్రాంతంలో ఓ సౌండ్‌-ప్రూఫ్‌ స్టూడియో నిర్మాణం మొదలైంది. ఆ టాలీగంజ్‌ ప్రాంతం పేరిటే అక్కడి చిత్ర పరిశ్రమ ఆ తరువాత 'టాలీవుడ్‌'గా ప్రసిద్ధమైంది. (అలా బెంగాలీ పరిశ్రమకు ప్రసిద్ధమైన పేరును అజ్ఞానంతో అరువు తెచ్చుకొని, దానికి సంబంధమే లేని తెలుగు చిత్ర పరిశ్రమను 'టాలీవుడ్‌' అని తప్పుడు పేరుతో పిలవడం గడచిన పదేళ్ళ పైచిలుకుగా తప్పుగా ప్రచారంలోకి వచ్చింది!)

పోటాపోటీలో ముందు వచ్చిన 'ఆలమ్‌ ఆరా'

మరి, కలకత్తాకు చెందిన మదన్‌ థియేటర్స్‌ ఇంత కృషి చేస్తుంటే, బొంబాయికి చెందిన అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలో ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ వారి 'ఆలమ్‌ ఆరా' తొలి భారతీయ టాకీ ఎలా అయింది? దీని వెనుక కూడా ఓ చిన్న కథ ఉంది. నిజానికి, పూర్తిస్థాయి భారతీయ టాకీ చిత్రాల రూపకల్పన కోసం అప్పట్లో కనీసం మూడు సిండికేట్‌ సంస్థలు పోటాపోటీగా ప్రయత్నించాయి. పూర్తి స్థాయిలో మాట్లాడే చలనచిత్రాన్ని రూపొందించాలన్న పోటాపోటీలో ఎట్టకేలకు అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలోని 'ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ'యే ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. ఎనభై ఏళ్ళ క్రితం 1931 మార్చి 14న తొలి పూర్తి నిడివి భారతీయ టాకీ 'ఆలమ్‌ ఆరా'ను బొంబాయిలోని 'మెజెస్టిక్‌ సినిమా' హాలులో విడుదల చేసింది.

(మిగతా భాగం మరి కాసేపట్లో....)

0 వ్యాఖ్యలు: