జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, July 31, 2014

" 'శంకరశాస్త్రి' పుణ్యమా అని నేను, అన్నయ్య ఎనిమిదేళ్లు మాట్లాడుకోలేదు..!" - నటుడు జె.వి. రమణమూర్తి

జె.వి. సోమయాజులుది నిండైన విగ్రహం... ఖంగుమని వినిపించే స్వరం...
 తమ్ముడు రమణమూర్తితో కలసి ఆయన ప్రాణం పోసిన నాటక పాత్రలనేకం...
 కానీ, ఒక్క సినిమా, ఒకే ఒక్క పాత్ర ఆయన జీవితాన్నే మార్చేశాయి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రిగా చెరగని ముద్ర వేసిన సోమయాజులు ‘కన్యాశుల్కం’కీ, తమ్ముడికీ
 కొన్నేళ్ళు ఎందుకు దూరమయ్యారు? ఎన్నో ఏళ్ళు కలసి నటించినా, తమ్ముణ్ణి
 ఎందుకు మెచ్చుకోలేదు? ఇవాళ సోమయాజులు జన్మదినం సందర్భంగా
 నిజజీవిత శంకరశాస్త్రి జ్ఞాపకాల కిటికీని 81 ఏళ్ళ తమ్ముడు తెరిచారు.

 
మాది శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారం. మా తాత గారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య సోమయాజి. మా నాన్న గారు జె.వి. శివరామమూర్తి ఆ రోజుల్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్. మా అమ్మా నాన్నలకు మేము అయిదుగురం అబ్బాయిలం, ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు రెండో సంతానమైతే, నేను నాలుగో సంతానం. అన్నయ్య పూర్తి పేరు - జొన్నలగడ్డ వెంకటసుబ్రహ్మణ్య సోమయాజులు. మేమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అన్నదమ్ముల లాగా కాకుండా, మంచి స్నేహితుల లాగా ఉండేవాళ్ళం. ఒకరినొకరం ‘ఒరేయ్’ అంటూ, పేర్లతోనే పిలుచుకొనేవాళ్ళం.

రంగస్థలంపై తొలి రోజుల్లో...

మా అన్నయ్య సోమయాజులు, నేను, నా తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - మేమంతా రంగస్థల పక్షులం. స్కూలు, కాలేజ్ రోజుల నుంచే అందుకు భూమిక ఏర్పడింది. నాటకం పేరు గుర్తు లేదు కానీ, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశాడు అన్నయ్య. అది ఆయన తొలి నటనానుభవం. తర్వాత పెద్ద బ్యాచ్‌ను వదిలేసి, మా పిల్లకుంకల బ్యాచ్‌లో సభ్యుడయ్యాడు. అప్పటి నుంచి నేను, అన్నయ్య కలసి మా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పక్షాన ఆత్రేయ ‘ఎన్జీఓ’, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ - ఇలా ఎన్నెన్నో పట్టుదలగా, ఉత్సాహంగా ఆడేవాళ్ళం! డెరైక్టర్‌గా నాటకంలో ముఖ్యమైన పాత్ర అన్నయ్యకిచ్చేవాణ్ణి. మిగిలినవాళ్ళకు తగిన పాత్రలు ఇచ్చేసి, అందరూ వదిలేసిన పాత్ర నేను వేసేవాణ్ణి. అదీ పద్ధతి. నాటకంలో పాత్రపోషణ ఎలా ఉండాలనే దాని మీద మా అన్నయ్యకూ, నాకూ వాదనలు జరిగిన సందర్భాలున్నాయి. వాడి దగ్గర సుగుణం ఏమిటంటే, ఒకసారి డెరైక్టర్ చెప్పాక, దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్లు చేసేసేవాడు.

ఏళ్ళ తరబడి ‘కన్యాశుల్కం’ జైత్రయాత్ర

ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు ప్రభుత్వాఫీసులో క్లర్క్. పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా ఆఫీసులో ఉండేవాడు కాబట్టి, రిహార్సల్స్ కష్టంగా ఉండేది. అందుకే, వాడు అన్నం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉండి స్క్రిప్టు చదివి వినిపించేవాణ్ణి. అవన్నీ గుర్తుపెట్టుకొనేవాడు. అన్నదమ్ములం నాటకాలు వేస్తుంటే, మా అమ్మ చూసి, ఎంతో ఆనందించేది. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ చేపట్టినప్పుడు కీలకమైన రామప్ప పంతులు వేషం మా అన్నయ్యకిచ్చి, నేను గిరీశం వేషం కట్టాను. తొలిసారిగా విజయనగరంలో 1953 ఏప్రిల్ 20న ‘కన్యాశుల్కం’ వేశాం. ఆ రోజు మొదలు 1995 సెప్టెంబర్ 22న ఆఖరు ప్రదర్శన దాకా 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. దేశమంతటా మాకు అఖండ కీర్తి వచ్చింది. నటుడిగా వాడిలో ఉన్న పెద్ద బలం - ఆత్మవిశ్వాసం. పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవాడు. ఇద్దరం కలసి నాటకాలు వేస్తున్నప్పుడు పరిషత్ పోటీల్లో చాలాసార్లు ఉత్తమ నటుడి విషయంలో నాకూ, వాడికీ మధ్య పోటీ టై అయ్యేది.

ఫ్లాప్‌తో... సినీ రంగ ప్రవేశం

1957లో నేను సినిమాల్లోకి వెళ్ళాను. ఎల్వీ ప్రసాద్ మేనల్లుడు కె.బి. తిలక్ ‘ఎం.ఎల్.ఎ’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యా. తరువాత 22 ఏళ్ళకు దర్శకుడు యోగి ‘రారా కృష్ణయ్యా!’ ద్వారా వైజాగ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న అన్నయ్యను తెరపైకి తెచ్చాడు. మొదట వేయనని పట్టుబట్టినా, నా చీటీ చూసి, స్క్రిప్టు చదివి, నా సలహా మేరకు అన్నయ్య ఒప్పుకున్నాడు. తీరా, సినిమా ఫ్లాపైంది.

ఆ తరువాత సినిమాల్లోనూ, సమాజంలోనూ మా అన్నయ్యను రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా - ‘శంకరాభరణం’. ఆ స్క్రిప్టు ప్రకారం ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి పాత్రకు తెలిసిన ముఖాలు పనికిరావు, కొత్తవాళ్ళు కావాలి. అలాగని కథను పండించాలంటే కొత్తవాళ్ళయితే కుదరదు, అనుభవం ఉండాలి. ఏం చేయాలని విశ్వనాథ్ ఆలోచిస్తున్నప్పుడు, ఆయనకు మా అన్నయ్య పేరు చెప్పారు యోగి. ‘రారా కృష్ణయ్య’ ఫ్లాపవడంతో, అన్నయ్య ఇష్టపడలేదు. కానీ, ‘ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుంద’ంటూ స్క్రిప్టు తెలిసిన నేను అన్నయ్యను అతి కష్టం మీద ఒప్పించి, మద్రాసుకు రప్పించాల్సి వచ్చింది. మొదట వద్దు వద్దన్నా చివరకు అంగీకరించాడు. ‘శంకరాభరణం’ (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ఇంటింటా పాటలు మారుమోగేసరికి రాత్రికి రాత్రి స్టారైపోయాడు.
 
మనిషిని మార్చేసిన ‘శంకరాభరణం’

వాడు ఇంట్లో కూడా అచ్చం శంకరశాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచీ వాడికి మహా రాజసం. అవతలవాళ్ళు పది మాటలు మాట్లాడితే, ఒక మాట ‘ఊ’, ‘ఆ’ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే, ఓ సారి మా వదిన నాతో, ‘రమణా! శంకరశాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి, చచ్చిపోతున్నారు గానీ, ఏవిటి చేశాడోయ్ అక్కడ! రోజూ ఇంట్లో మనం చూసే భాగోతమే కదా!’ అని అంది నవ్వుతూ. ఒక్కమాటలో చెప్పాలంటే, పాత్రను మా వాడు పోషించలేదు. నిజజీవితంలోలా ప్రవర్తించాడు.

అయితే, ఒకరకంగా చూస్తే - ఆ సినిమా, పాత్ర సోమయాజులుకు ఎంత పేరు తెచ్చాయో, నటుడిగా అంత చెరుపూ చేశాయని తరువాత తరువాత నాకు అనిపించింది. అంతటి అఖండ కీర్తితో సహజంగానే ఎవరికైనా దర్పం వస్తుంది. చుట్టూ భజనపరులు తయారయ్యారు. తరువాత కొద్దికాలానికి మునుపెప్పుడో ఒప్పుకున్న ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన చేయాల్సి వచ్చింది. కానీ, ‘ఇంత పేరొచ్చాక, ఇప్పుడు ‘కన్యాశుల్కం’ రామప్ప పంతులు పాత్ర చేయలేను. జనం నన్ను ఆ పాత్రలో అంగీకరించరు’ అన్నాడు సోమయాజులు. దాంతో, నాకు కోపం వచ్చింది. ‘నాటకం కన్నా, పాత్ర కన్నా నటుడు గొప్పవాడేమీ కాదు. ఏ వేషం నీకు గుర్తింపు తెచ్చి, నిన్ను నటుడిగా తీర్చిదిద్దిందో అది వేయనంటున్నావు. నీ లాంటివాడితో కలసి మళ్ళీ రంగస్థలం ఎక్కను’ అని చెప్పేశాను. అలా శంకరశాస్త్రి పాత్ర పుణ్యమా అని దాదాపు తొమ్మిదేళ్ళు నాకూ, వాడికీ మధ్య రాకపోకలు, మాటలు లేవు. కానీ, చివరకు ‘కన్యాశుల్క’మే మళ్ళీ మమ్మల్ని కలిపింది. ఆ నాటకం నూరేళ్ళ పండుగకు విజయనగరం వాళ్ళు మళ్ళీ మా బృందంతో ప్రదర్శన వేయించాలని పట్టుబట్టి, మమ్మల్ని కలిపారు. గురజాడ వారు తొలిసారిగా ప్రదర్శించిన విజయనగరం కోటలోనే ఆ నాటక ప్రదర్శన దిగ్విజయంగా వేశాం. ఆ నూరేళ్ళ ఉత్సవ సందర్భంగా ఆ ఒక్క ఏడాదిలోనే దేశమంతటా మళ్ళీ కొన్ని పదుల ప్రదర్శనలిచ్చాం! గొడవ కాకముందైతేనేం, తరువాత అయితేనేం... మా అన్నయ్య, నేను - ఇద్దరం కలసి తెరపై నటించాం. కలిసి నటించినా, మాట్లాడుకున్నా ఎందుకనో నాకూ, వాడికీ మధ్య మునుపటి సద్భావం పోయింది. ముభావంగానే ఉండేవాడు. కానీ, (గద్గదికంగా...) అప్పటికీ, ఇప్పటికీ వాడంటే నాకు ప్రేమ, గౌరవమే.



















అరుదైన నిజాయతీ... అపూర్వ గౌరవం...

 మా అన్నయ్యలోని మరో గొప్పతనం ఏమిటంటే, క్లర్క్‌గా మొదలైనవాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎదిగాడు. ఎవరైనా వచ్చి ఏ సాయం అడిగినా, తన అధికార పరిధిలో చేయగలిగినదంతా చేసేవాడు. వాళ్ళ ఇల్లు నిలబెట్టేవాడు. కానీ, ఏనాడూ ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. ‘శంకరాభరణం’ తరువాత వాడి ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నటించి, పారితోషికం తీసుకున్నాడని గిట్టనివాళ్ళు పిటిషన్లు పెట్టారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘శంకరాభరణం’ సినిమా తెప్పించుకొని, చూసి, ‘మన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఇంత గౌరవం తెచ్చినవాణ్ణి మనం గౌరవించుకోవాలి’ అన్నారు. ఆ వెంటనే మన తెలుగునాట తొలిసారిగా కల్చరల్ ఎఫైర్స్ అనే శాఖను సృష్టించి, దానికి డెరైక్టర్‌గా సోమయాజులును నియమించారు. అలాగే, ‘కళాకారుడైన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సినిమాల్లో నటించి, పారితోషికం అందుకోవచ్చు. దానికి అనుమతి అవసరం లేదు’ అని కూడా ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. గమ్మత్తేమిటంటే, అసలు ‘శంకరాభరణం’కి అన్నయ్యకు దక్కిన పారితోషికం కేవలం రూ. 6 వేలు. అదీ సినిమా విడుదలై, అఖండ విజయం సాధించాక ఓ ఏడాది గడచిన తరువాత! ‘శంకరాభరణం’ తరువాత ‘త్యాగయ్య’, ‘సప్తపది’, ‘వంశవృక్షం’ - ఇలా అనేక సినిమాల్లో అన్నయ్య నటించినా, శంకరశాస్త్రి లాంటి చిరస్మరణీయ పాత్ర మరొకటి కనపడలేదు. ఆ పాత్ర ఒక స్టార్‌ను సృష్టించింది. కానీ, అదే పాత్రతో వచ్చిపడ్డ ఇమేజ్ ఒక మంచి నటుణ్ణి మింగేసింది.

- సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 30 July 2013, Wednesday)
.................................

Wednesday, July 30, 2014

" ’ జ్ఞానపీఠ్’ నాకు వస్తుందని నేను కూడా అనుకోలేదు" - సి. నారాయణరెడ్డి (ప్రత్యేక భటి)


తెలుగులో విశ్వనాథ, మీరు (‘విశ్వంభర’-1988), రావూరి భరద్వాజ - మీ ముగ్గురికే ప్రతిష్ఠాత్మక ‘జ్ఞానపీఠ్’ దక్కింది. ఇతర భాషలతో పోలిస్తే తరచూ ఈ గౌరవం మనకు రావడం లేదేం?     
 అసలు నాకు వస్తుందని నేను కూడా అనుకోలేదు. అయితే, ‘విశ్వంభర’కు వచ్చింది. రావాల్సిన దానికి వచ్చింది. అది నాకు తృప్తినిచ్చింది. జ్ఞానపీఠం వచ్చిన ‘విశ్వంభర’, దాని భూమిక, ‘మట్టీ - మనిషి - ఆకాశం’ కావ్యం గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ.
   
మీ రోజుల్లో తెలంగాణ కవులు, రచయితలు, సినీ జీవుల మీద సాహిత్య, సినీ రంగాల్లో  వివక్ష ఉండేదా? సాహిత్య, సినీరంగాల్లో అది కనిపించేదా? మీకెప్పుడైనా అనుభవమైందా?

 లేదు. ఎప్పుడూ వివక్ష లేదు, ఏమీ లేదు. అలాంటి అనుభవాలు నాకెప్పుడూ ఎదురు కాలేదు. అసలు అలాంటి ధోరణి ఉంటే నన్నెలా ఆదరించేవారు! నేనెలా ఇంత పైకొచ్చేవాణ్ణి!!
- రెంటాల జయదేవ

(Published in 'sakshi'  daily, 27th July 2014, Sunday)
...............................................

Tuesday, July 29, 2014

"నేనెప్పుడూ ఎవరితోనూ లాలూచీ పడలేదు!" - సి. నారాయణరెడ్డి (ప్రత్యేక భటి)

29 july 84వ వసంతంలో అడుగిడుతున్న సినారె...
....................................................................................


 తెలుగు సాహితీ లోకానికి ఆయన ఆభరణం...
 కొన్ని దశాబ్దాలుగా కవికులానికి ఆచార్య పీఠం...
 తెలుగు జాతికి గర్వకారణమైన జ్ఞానపీఠం...
 ప్రతి ఏటా ఓ కావ్య వసంతాన్ని పూయించే కవితా వృక్షం...

 తెలంగాణ గడ్డలో పుట్టి, తెలుగు సాహితీ మాగాణిలో
 బంగారు పంటలు పండించిన ఆధునికాంధ్ర కవి, సినీ రవి ఆయన.
 సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంటే తెలిసిన వారు చాలా తక్కువ...
 సి. నారాయణరెడ్డి పేరు తెలియని తెలుగు వారు మాత్రం మరీ తక్కువ...

 తెలుగు... ఉర్దూ... సాహిత్యం... సంస్కృతి...
 భాష ఏదైనా, అంశమేదైనా...
 అది సినిమా పాటైనా... భాషా పరివేషమైనా
 బోధన, బాధ్యతల నిర్వహణ  అయినా... ఆయనది బహుముఖీన ప్రజ్ఞ

 కలం పట్టినా, గళం విప్పినా... ఆయనది నిత్య చైతన్యం... సత్య దర్శనం...
 ఎనభై నాలుగో ఏట కూడా నిరంతర రచనా వైదుష్యం...
 ఏది రాసినా, ‘సినారె... ఏమి రాసినారే’ అనిపించుకొన్న ఘనచరిత్ర ఆయన సొంతం.

 హలం పట్టడం మాని, కలం పట్టిన ఈ అవిశ్రాంత సాహితీ హాలికుని
 గతం... స్వగతం... ఆగతాల... నుంచి కొన్ని మల్లెలు...
మొల్లలు...
..................................................................
 
 రెండు రోజుల్లో ఎనభై నాలుగో ఏట అడుగు పెడుతున్న సమయంలో వెనుతిరిగి చూస్తే, మీ మానసిక భావ సంచలనం?
 (నవ్వేస్తూ...) సంకల్పం, లక్ష్యం కలిగిన మనస్సుకు వయస్సుతో నిమిత్తం లేదు. వయస్సును బట్టి శారీరక పరిణామాలు రావచ్చు. కానీ, మనస్సు యౌవనంలో లానే రచనోత్సాహంతో ఉరకలు వేస్తోంది. నేనిప్పుడు పాఠాలు చెప్పడం లేదు. సినిమా పాటలు కూడా ఇంచుమించు రాయడం లేదు. కానీ, నా కవితా రచన నిరంతరాయంగా సాగిపోతోంది. ఇప్పటికీ వారానికి రెండు కవితలు రాస్తా. పత్రికల్లో ప్రచురిస్తా. ప్రతి ఏటా నా పుట్టినరోజుకు అంతకు ముందు ఏడాదిగా రాసిన కవితలన్నిటినీ కలిపి సంపుటిగా తెస్తున్నా.

 చదువు లేని ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఇంతటి సాహితీ వారసత్వాన్ని అందుకొంటారనుకున్నారా?
 (నవ్వేస్తూ...) నేనే కాదు... ఎవరూ అనుకోని ఉండరు. మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేట. అమ్మానాన్నలైన బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు నేనొక్కణ్ణే సంతానం. ఉన్న వందెకరాలకు ఏకైక వారసుణ్ణి. మా అమ్మకు చదువు రాదు. మా నాన్నకు కొద్దిపాటి చదువు వచ్చు. మా ఊళ్ళో కనీసం బడి కూడా లేదు. మూడో తరగతి వరకు అరుగు మీద బడిలో చదువుకున్నా. తరువాత సిరిసిల్ల, కరీంనగర్‌లలో 10వ తరగతి దాకా చదివా. నిజామ్ ఏలుబడిలోని తెలంగాణలో అప్పుడంతా ఉర్దూ మీడియమ్ చదువే. హైదరాబాద్ వచ్చి, సోషియాలజీ, ఎకనామిక్స్, తెలుగుతో ఇంటర్, బి.ఏ చదివా. అదీ ఉర్దూ మీడియమే. తరువాత ఎం.ఏ - తెలుగు చేశా. తొలినాళ్ళలోనే ‘నాగార్జున సాగరం’, ‘కర్పూర వసంతరాయలు’, ‘విశ్వనాథ నాయడు’ లాంటి కావ్యాలతో సాహిత్యంలో పేరు తెచ్చుకున్నా.

 ఉర్దూ మీడియమ్‌లో చదివినా తెలుగు మీద ఇంత పట్టు సంపాదించడానికి మీ గురువుల బోధన కారణమనుకోవచ్చా?
 సృజనాత్మక శక్తి సహజాతం. నా మేధాక్షేత్రంలో భాషా బీజాలున్నాయి. అవి సహజ ప్రతిభతో అంకురించి, పైకి పొడుచుకొచ్చాయి. గురువులు తమ బోధన ద్వారా వాటిని వికసింపజేశారు. పుట్టి పెరిగిన పల్లె వాతావరణం, అక్కడి సంస్కృతి, జానపద గీతాల ప్రభావం నా మీద ఉంది.

 మరి సంగీతజ్ఞానం, లయతో రాసి పాడడమెలా అబ్బాయి?
 అదీ సహజాతమే. నేర్చుకుంటే శాస్త్రీయ సంగీతమొ స్తుంది. కానీ అసలు సంగీత జ్ఞానం పుట్టుకతో రావాల్సిందే.

 పుట్టినప్పుడు పెట్టిన పూర్తి పేరు సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి అయితే, మరి మీరు సి. నారాయణరెడ్డి ఎలా అయ్యారు?
 నా ముందు పిల్లలు పుట్టిపోయారు. మా ఊళ్ళో కోమట్ల ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం జరుగుతుంటే, అక్కడకు వెళ్ళిన మా అమ్మ మొక్కుకుందట. తరువాత నేను పుట్టడంతో నాకు సత్యనారాయణరెడ్డి అని పేరు పెట్టారు. బడిలో చేరినప్పుడు అబ్దుల్ ఖాదర్ అని ఉర్దూ టీచర్ ఉండేవారు. ‘తుమ్హారా నామ్ క్యా హై’ అని అడిగారు. సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి అని చెప్పా. ఆయన వెంటనే, సింగిరెడ్డిని కాస్తా ‘సి’ అని, సత్యని కూడా తీసేసి, నా పేరు సి. నారాయణరెడ్డి చేశారు. అలాఈ పేరంతా మా టీచర్ ఘనత (నవ్వు).

 మీరూ తెలుగు ఆచార్యుడిగా నేటి ప్రముఖుల్లో చాలామందికి గురుత్వం వహించినట్లున్నారు!
 అవును. టి. సుబ్బిరామిరెడ్డి, పి.వి. నరసింహారావు కుమారుడు పి.వి. రంగారావు, మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి నా విద్యార్థులే. నా దగ్గర చదువుకొన్న చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒకానొక దశలో అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నన్ను శాఖాధ్యక్షుడిగా నియామకం చేస్తే, కాదన్నాను. ఎందుకంటే నాకు పరిపాలనా దృష్టి కన్నా బోధన దృష్టి ఎక్కువ. పిల్లలకు బోధించడంలో ఎంతో తృప్తి.

 కానీ, తర్వాత అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా, ఓపెన్, తెలుగు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా, ఇంకా అనేక బాధ్యతల్లో పాలనా నిర్వహణ చేశారు. అదీ అత్యంత సమర్థంగా...
 ఒక పదవిని కానీ, కార్యక్రమాన్ని కానీ చేపట్టిన తరువాత దాన్ని సమర్థంగా, సమగ్రంగా నిర్వహించాలి. లేదంటే, ఆ పదవిని విసర్జించాలి. అది నా దృక్పథం. అందుకే, ఏ పదవి వచ్చినా, ఆ బాధ్యతను చక్కగా నిర్వహించాను. ఇప్పటికీ, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ, వారానికి రెండు రోజులు వెళ్ళి, వ్యవహారాలు చక్కబెట్టి వస్తున్నా.

 రాజ్యసభ సభ్యుడిగా చేశారు. లోక్‌సభకు పోటీ చేయలేదేం?
 కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ పక్షాన కరీంనగర్ నుంచి పోటీ చేయమంటూ అవకాశమిస్తే, వద్దన్నా. నాకు ఎంతో సాన్నిహిత్యమున్న ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున పోటీ చేయమంటూ బలవంతపెట్టారు. ఆయన పట్టుదలకూ, ఒత్తిడికీ మరొకరైతే సులభంగా లొంగిపోయేవారు. కానీ, సున్నితంగా తోసిపుచ్చా. రాజ్యసభ సభ్యత్వమంటారా? కేంద్ర సర్కార్ నన్ను నామినేట్ చేసింది. దక్షిణాది నుంచి ఇలా రాజ్యసభకు నామినేటైన తొలి కవిననే గౌరవం దక్కింది. ప్రత్యక్ష రాజకీయాల మీద నాకెప్పుడూ విముఖతే!

 కానీ, పదవులతో రాజకీయాలు, అడ్డంకులు సృష్టించేవాళ్ళు సాధారణం. వాటినెలా ఎదుర్కొన్నారు?
 (గంభీరంగా) కవిగా వేరు, బాధ్యతల నిర్వహణలో ఉన్నప్పుడు వేరు. నాకు కార్యగతమైన పౌరుషం ఎక్కువ. పని పూర్తయ్యేదాకా విశ్రమించేవాణ్ణి కాదు. అందుకే, నాకెవరూ అడ్డు రాలేదు. ఎవరైనా అడ్డొచ్చినా లెక్క చేయలేదు.

 ఏ పార్టీ అధికారంలోకొచ్చినా, ఒకే పార్టీకి చెందిన భిన్న వర్గాల వారు పగ్గాలు చేపట్టినా మిమ్మల్ని మాత్రం పదవులు వరిస్తూనే వచ్చాయి. అదెలా సాధ్యమైంది? మీకు చాలా లౌక్యమని...
 (అందుకుంటూ...) కొందరి విమర్శ. అంతేనా? నా గురించి నేను చెబితే, ఆత్మస్తుతిలా అనిపిస్తుంది. ఆత్మస్తుతికి పాల్పడే బలహీనత నాకు లేదు. అయితే, ఒకటి నిజం. పార్టీలకూ, వర్గాలకూ అతీతంగా వాళ్ళందరూ నన్ను అభిమానించినవారు, గౌరవించినవారు. అందుకే, ఎవరు అధికారంలోకి వచ్చినా నాకు బాధ్యతలు అప్పగించారు. నేను చినుకుకూ, చినుకుకూ మధ్య ఒడుపుగా కదులుతూ, తడవకుండా ముందుకు వెళ్ళా. అది ప్రస్థానం. దాన్ని ఆపలేదు... అదే సమయంలో నేనెప్పుడూ ఎవరితోనూ లాలూచీ పడలేదు.

 మీరు పైకి ధీరగంభీరంగా కనిపించినా, శిష్యవాత్సల్యం, ఆశ్రీత వత్సలత ఎక్కువ. దాన్ని బలహీనతగా చెప్పేవాళ్ళూ ఉన్నారు.
 లేదు. ఆచార్యుడిగా, ఏదైనా పదవిలో ఉన్నప్పుడు అధికారిగా నాదెప్పుడూ సమదృష్టే. రాగద్వేషాలు లేకుండా బాధ్యతలు నిర్వహించా. అయినా, సమర్థుల్ని సరైన స్థానంలో ఉంచితే తప్పేమిటి? తండ్రికి పుత్ర వాత్సల్యం ఉండదా?  

తెలుగు ఆచార్యుడిగా ఉన్న రోజుల్లోనే సినీ కవి అయ్యారు.  ఇటు బోధన, అటు సినీ రచన-ఎలా సమన్వయపరుచుకున్నారు?
 సెలవులుంటాయి. వాటిని బట్టి, ఫలానా రోజుల్లో మద్రాసులో ఉంటానని దర్శక, నిర్మాతలకు ముందే తెలియపరిచేవాణ్ణి. దాదాపు ప్రతి శనివారం సాయంత్రం మద్రాసుకు విమానంలో వెళ్ళేవాణ్ణి. ఆదివారం ఒకే రోజు మూడు సంస్థల వాళ్ళ పాటలు రాసేసేవాణ్ణి. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో దిగుతూనే, కారులో ఆ కావ్యం చదువుకుంటూ, నేరుగా వెళ్ళి, 10 గంటలకల్లా క్లాసు ఆరంభించేవాణ్ణి. నేను తెలుగు చెబుతుంటే, ఫిలాసఫీ విద్యార్థులు సైతం తమ క్లాసు ఎగ్గొట్టివచ్చి, నా పాఠం వినేవారు.  

 బోధన కన్నా ఎక్కువ డబ్బు, పేరు సినీ గీతరచన ద్వారా వస్తున్నప్పటికీ, అధ్యాపక ఉద్యోగం మీరు వదల్లేదు. కారణం?
 ముందే చెప్పినట్లుగా బోధన నాకు ఇష్టమైన విషయం. దానిలో నాకు తృప్తి ఉంది. నాకు ఈ డబ్బు లెక్కలు తెలియవు. అందుకే, పిల్లలకు పాఠాలు చెప్పడం వదలలేదు. నిర్మాత డి.వి.ఎస్. రాజు గారి లాంటి వాళ్ళు, ‘రెడ్డి గారూ! ఉద్యోగం వదిలేసి, ఇక్కడే మద్రాసులో ఉండండి. సినీ కవిగా స్థిరపడిపోదురు గాని!’ అని పదే పదే చెప్పినా, తోసిపుచ్చా.

 దశాబ్దాల క్రితం మీరు చేసిన పరిశోధన ‘ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు’ పదే పదే ముద్రణకు నోచుకుంది. దానికి బీజం ఎలా పడింది?
 నిజానికి, నాకు కవితా రచన మీద ఉన్న ఆసక్తి ఎన్నడూ పరిశోధన మీద లేదు. ప్రొఫెసర్ కావాలంటే పిహెచ్.డి. ఉండాలంటూ కృష్ణశాస్త్రి నాకు హితబోధ చేశారు. ‘కన్వెన్షన్ అండ్ రివోల్ట్ ఇన్ మోడరన్ ఇంగ్లీష్ పొయెట్రీ’ అనే గ్రంథం నన్ను చదవమన్నారు. అది సుమారుగా ఉంది. అయితే, దాన్ని మన ఆధునికాంధ్ర కవిత్వానికి వర్తింపజేస్తూ, పరిశోధన చేస్తే బాగుంటుందనిపించింది. అలా ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి మార్గదర్శకత్వంలో కృషి చేసి, పిహెచ్.డి పట్టా పొందా. ఇవాళ ఆ రచన రిఫరెన్స్ గ్రంథమైంది.

 కానీ, పరిశోధన అనేది సృజనాత్మకతకు కొంత అడ్డంకి కదా! మరి, మీ సృజనాత్మకతను ఎలా కాపాడుకొన్నారు?
 సృజన చేస్తున్నప్పుడు పరిశోధన అంశాలు బుర్రలోకి రాకూడదు. అలాగే, పరిశోధిస్తున్నప్పుడు సృజనాత్మకతను ఆశ్రయించకూడదు. ఆ రెండూ రెండు వేర్వేరు పాయలు. వేటికవిగా ప్రవహించనివ్వాలి. నేను చేసింది అదే.

 మీరు కవిత్వం మొదలుపెట్టే సమయానికే అభ్యుదయ కవితా ఉద్యమం కూడా వచ్చేసింది. కానీ, మీరు వెనక్కివెళ్ళి గేయ కథాకావ్యాలతో మొదలుపెట్టి, తరువాత ఆధునికత వైపు వచ్చారు.  
 అప్పటికే సంప్రదాయ కవిత్వానికి విశ్వనాథ, భావ కవిత్వానికి రాయప్రోలు, అభ్యుదయ కవిత్వానికి శ్రీశ్రీ లాంటి మహాకవులున్నారు. నేనూ వాళ్ళ లాగానే రాస్తే, వారి వెనుక... అట్టడుగున పడిపోయేవాణ్ణి. వాళ్ళకు భిన్నంగా ఉండాలనే కథాత్మక గేయ కావ్యాలు రాశా. అందులో చారిత్రక అంశాలు తీసుకున్నా. గేయాన్ని కూడా ఖండ, త్రిశ్ర, మిశ్ర - ఇలా వేర్వేరు గతుల్లో రాశా. పద్యంలాగా గేయాన్ని నడిపాను. ఇవన్నీ నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తర్వాత ‘విశ్వంభర’, ‘మట్టి - మనిషి - ఆకాశం’ లాంటి వాటితో మానవుడే కథానాయకుడిగా ఆధునిక కావ్యాలు రాశాను.

 మీ మీద ప్రభావం చూపిన ఆధునిక కవులు ఎవరు?
 కళాశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లో నేను అభిమానించిన ఆధునిక కవుల్లో విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ఉన్నారు. తొలినాళ్ళలో ప్రణయ కవిత్వం రాసినప్పుడు నా మీద కృష్ణశాస్త్రి ప్రభావం స్వల్పంగా ఉంది. క్రమంగా ప్రయత్నపూర్వకంగా దాని నుంచి బయటకొచ్చాను. నాదైన మార్గం వెతుక్కున్నాను. ఇక, మానవీయ కవిత్వం రాయడానికి నాకు ప్రేరణ - గుఱ్ఱం జాషువా.

 కొన్ని వందల కవితలు రాశారు. ‘పద్మభూషణ్’తో సహా వేల గౌరవాలందుకున్నారు. తొలి కవిత, సన్మానం గుర్తున్నాయా?
 నేను ఇంటర్‌లో ఉండగా రాసిన ఓ కవిత జువ్వాది గౌతమరావు సంపాదకత్వంలోని అప్పటి ‘జనశక్తి’ వారపత్రికలో ప్రచురితమైంది. అది నాకు ఇప్పటికీ గుర్తే. ఇక, తొలినాళ్ళ చిరు సత్కారాలు మొదలు ఇవాళ్టి దాకా ఎన్నో జరిగాయి. అయితే, పిహెచ్.డి వచ్చిన సందర్భంలో 1961లో విజయవాడలో జరిగిన సభలో కవి మిత్రుడు రెంటాల గోపాలకృష్ణ, నటుడు గుమ్మడి తదితరులు అభినందించారు. వెంటనే గుంటూరులో పౌరసన్మానం చేశారు. జాషువా, కరుణశ్రీ, జమ్మలమడక తదితరులున్నారు. అదెన్నటికీ మర్చిపోలేను.


 కవి దాశరథితో మీది ప్రత్యేక అనుబంధం! ఆయనతో మీ సాన్నిహిత్యం, ఆయన మార్గదర్శకత్వం గురించి చెబుతారా?
 నేను బి.ఏ విద్యార్థిగా ఉన్నప్పుడే దాశరథితో నాకు పరిచయం. మా పరిచయం బాగా పెరిగి, స్నేహంగా పరిణమించింది. నన్ను ఆయన ‘తమ్ముడూ’ అనేవారు. నేనేమో ‘అగ్రజా!’ అని పిలిచేవాణ్ణి. తెలంగాణ రచయితల సంఘం పెట్టినప్పుడు ఆయన అధ్యక్షుడు. నేను కార్యదర్శిని. గజల్స్, రుబాయీలు, ఆధునిక కవితా రచనల్లో ఎవరి పద్ధతి వారిదే! ఆయన మార్గదర్శనం, ప్రభావం నా మీద లేవు.

 ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ కన్నా ముందే సురవరం వారి ‘గోలకొండ కవుల సంచిక’ వెలువడింది. అయినా, ‘వైతాళికులు’లో తెలంగాణ కవులకు స్థానం దక్కలేదని ఇటీవల ఓ వివాదం.
 ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో కవులున్నారనీ, కవిత్వముందనీ చెప్పడం కోసం వారందరివీ సేకరించి, సురవరం ప్రతాపరెడ్డి సంకలనం చేసినది - ‘గోలకొండ కవుల సంచిక’. కొద్ది నెలల తేడాలో వచ్చిన ‘వైతాళికులు’ పూర్తిగా నవ్యాంధ్ర కవుల కవితల సంకలనం. అప్పటి ఆధునికాంధ్ర కవుల రచనలను స్వీకరించి వేసిన సంకలనం. కాబట్టి, దానికీ, దీనికీ ముడిపెట్టలేం. అప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఆధునిక తెలుగు కవులు రాలేదు. తెలంగాణ నుంచి వచ్చిన ఆధునిక తెలుగు కవుల్లో మొదటివాడు - దాశరథే.

 తెలంగాణ బిడ్డ అయ్యుండీ, 1969లో ‘ప్రత్యేక తెలంగాణ’ ఉద్యమ ఉద్ధృతి వేళ మీరు ఎన్టీఆర్ ‘తల్లా-పెళ్ళామా’లో ‘తెలుగు జాతి మనది..’ అంటూ సమైక్యవాద గీతం రాశారని...
 (మధ్యలోనే...) విమర్శ ఉంది. అంతేనా? ఎన్టీఆర్ ‘విశాలాంధ్ర’ వాది. ‘తల్లా-పెళ్ళామా’ చిత్రం తీస్తూ, ఎన్టీఆర్ గారు సినిమాలో కళాశాలలో జరిగే ఓ సమావేశంలో సందర్భోచితంగా, తెలుగుజాతి సమైక్యత మీద పాట రాయాలని నన్ను అడిగారు. ఒక కవిగా నన్ను పెట్టుకున్నారు కాబట్టి, దర్శక - నిర్మాత కోరింది నేను రాసి ఇచ్చాను. అంతే.  

 తర్వాత... అలా రాయకుండా ఉండాల్సిందనిపించిందా?
 (గంభీరంగా...) లేదు. ప్రత్యేక తెలంగాణవాదం అప్పటికే ఉంది. కానీ, నేనది సినిమా సందర్భాన్ని బట్టి రాశానని గ్రహించాలి. తర్వాత పరిణామాలతో, తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలుగా తెలుగువాళ్ళమంతా వెలగాలని, ‘తెలుగు జాతి మనది...‘రెండుగ’ వెలుగు జాతి మనది’ అన్నా. రాష్ట్రాలుగా రెండయ్యామే తప్ప, జాతిగా ఒక్కటే!

 కానీ ఇవాళ కళా - సాహిత్య రంగాల్లోనూ తెలియని విభజన వచ్చేసినట్లనిపిస్తోంది. విద్వేషాలొద్దంటూ రాయవచ్చుగా?
 ఆ విభజన మనుషుల్లో లేదు. మన రాజకీయ వర్గాల్లోనే ఉంది. విద్వేషాలు వద్దంటూ మానవతా గీతాలు ఎన్నో రాశా. ‘మానవుడు - దానవుడు’లోని ‘అణువూ అణువున వెలసిన దేవా’ సుప్రసిద్ధం. అది నాకెంతో ఇష్టమైన పాట!

 ‘అభ్యుదయ రచయితల సంఘం’లో సభ్యులుగా కొంత కృషి చేశారే తప్ప, ఇతర సాహిత్య, సామాజిక ఉద్యమాలు ప్రచలితంగా ఉన్నప్పుడు మీది దాదాపు మౌనముద్రే? ఎందుకలా?
 నాది మౌన ముద్ర కాదు... జ్ఞానముద్ర. ఏ ఉద్యమంతో సంబంధం లేకుండా సాగిన సృజనాత్మక ప్రయాణం.

కానీ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్లను కవిగా ఎదిరించినట్లు కనబడరు. ఇదంతా ‘డాలరైజేషన్’ అని మాత్రం అన్నట్లున్నారు.
 గ్లోబలైజేషన్ అంటే ఏమిటో నాకు తెలియదు. అది నన్ను అంటుకోలేదు. ప్రపంచం పట్ల ఒక ఒక విశ్వ దృక్పథం ఉన్నవారికి ఇవేవీ ఉండవు. నాది ‘వసుధైవ కుటుంబకమ్’ అని భావన. ఒక్క మాటలో చెప్పాలంటే, నాది ప్రగతిశీల మానవతావాదం. ‘విశ్వంభర’తో సహా నా కావ్యాలన్నిటిలో ఉన్న దదే. మానవుని పక్షాన నేను నిలబడడం వాటిలో చూడచ్చు.

 వేల సినీ గీతాలు రాసినా, మాటలు రెండే చిత్రాలకు రాశారేం?
 నేను ప్రాథమికంగా కవిని. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట కాదనలేక ‘ఏకవీర’, ‘అక్బర్ సలీవ్‌ు అనార్కలీ’ చిత్రాలకు మాటలు రాశా. ఈ రెండు కథల్లో ఆ పాత్రలు, ఆ చారిత్రక నేపథ్యానికి తగ్గట్లు రాసిన మాటలు జనానికి అర్థం కాలేదు. మరే సినిమాకూ మాటలు రాసే పనీ పడలేదు.

 మీకు అత్యంత ఇష్టమైన ఒక పది పాటల్ని ఎంచమంటే?
 అప్పటికప్పుడు పాటలు చెబుతూ, రాస్తూ పోవడమే తప్ప, వాటిని లెక్కించడం, రాసినవి దాచుకోవడం నాకు అలవాటు లేదు. దాదాపు 3500 దాకా సినీ గీతాలు రాసినట్లు సినీ గీత చరిత్రకారుల అంచనా. అవన్నీ నా బిడ్డలే. వాటిలో దేని మీద ఎక్కువ ప్రేమ అంటే ఎలా చెప్పను!

 మీ కుటుంబం, పిల్లల గురించి చెబుతారా?
 ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టి పోయారు. దాంతో, మా ఆవిడ సుశీల గోదావరి నదిలో స్నానం చేసి, మొక్కుకుంది. ఆ తరువాత మాకు ఆడపిల్ల పుట్టింది. అలా మా పెద్దమ్మాయికి ‘గంగ’ అని పేరు పెట్టా. తరువాతి పిల్లలకు ‘యము న’, ‘సరస్వతి’, ‘కృష్ణవేణి’ అని పేర్లు పెట్టా. అలా మా ఇల్లు నాలుగు నదుల నిలయం. వారందరికీ పెళ్ళిళ్ళు చేసి, అల్లుళ్ళను కూడా ఇంటికే తెచ్చుకున్నాను. వాళ్ళ కొడుకులు, మునిమనుమలు, మునిమనుమరాళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటారు. ఎవరి గది వారిదే! ఎవరి వృత్తి, ప్రవృత్తి వారిదే!

 ఇంతకీ, ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఇప్పుడు మీ దృష్టి దేనిపై?
 (నవ్వేస్తూ...) గడియారం మీద! మధ్యాహ్న భోజన సమయమవుతోందిగా! (నవ్వులు...) ఇప్పుడు నా దృష్టి అంతా కవితా సృజన మీదే. అది ఇలాగే నిరంతరం సాగాలని నా కోరిక. కవిగా ఇన్ని దశాబ్దాలుగా చైతన్యశీలంగా ఉన్నందుకు ఆత్మతృప్తి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, నా జీవితం ఎందుకున్నదీ అంటే, కవిత్వం రాయడం కోసమేనంటాను!

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 27thJuly 2014, Sunday)
.............................................

Saturday, July 26, 2014

సినిమా రివ్యూ: అల్లుడు శీను --- అవే కథలు, పాత్రలతో ఎంతకాలమీ గిల్లుడు?

 ..........................
 చిత్రం - అల్లుడు శీను, తారాగణం - బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రవిబాబు, రఘుబాబు, కథ - కె.ఎస్. రవీంద్ర, కోన వెంకట్, మాటలు - కోన వెంకట్, రచన - గోపీ మోహన్, ఛాయాగ్రహణం - ఛోటా కె. నాయుడు, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ - గౌతంరాజు, సమర్పణ - బెల్లంకొండ సురేశ్, నిర్మాత - బెల్లంకొండ గణేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - వి.వి. వినాయక్
 ..........................

 చిత్ర నిర్మాణానికి ఏం కావాలి? అవసరమైన డబ్బా... అందుబాటులో అగ్రశ్రేణి తారాగణం - సాంకేతిక నిపుణులా... వాణిజ్యపరంగా విజయం సాధించాలనే కోరికా..? దీనికి సమాధానం చెప్పడం కొంత కష్టమే. పైవన్నీ ఉంటే, సినిమా తీయగలరని నమ్మకంగా చెప్పవచ్చేమో కానీ, తీసిన సినిమా బాగుంటుందన్న నమ్మకం మాత్రం చెప్పలేం. ఇంట్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న కుర్రాడు ఉన్నాడు, చేతిలో డబ్బు, పరిశ్రమలో కావాల్సినంత అనుభవం ఉంది కదా అని, అన్నిటికీ కలిసొస్తుందని అతణ్ణి హీరో చేద్దామంటే కుదిరేపని కాదు. డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టినా, కథలో, కథనంలో దమ్ము లేకపోతే శ్రమ నిష్ఫలమవుతుంది. ‘అల్లుడు శీను’కు జరిగింది అదే. 

 కథ ఏమిటంటే...

  కర్ణాటకలోని బాదామిలో అనాథగా దొరికిన శీనును ‘అల్లుడు శీను’ (బెల్లంకొండ శ్రీనివాస్)గా పెంచుకొంటాడు నరసింహ (ప్రకాశ్‌రాజ్). ఊరందరికీ అప్పులున్న ఈ మామా అల్లుళ్ళు ఓ రాత్రి అక్కడ నుంచి పారిపోయి, చెన్నై అనుకొని హైదరాబాద్ చేరతారు. అక్కడ ఓ అందమైన అమ్మాయి అంజలి (సమంత)ను చూసి, హీరో ప్రేమలో పడతాడు. తీరా ఆ ఊళ్ళో అన్ని రకాల సెటిల్మెంటు చేసే భాయ్ (మరో ప్రకాశ్‌రాజ్) కూతురే ఆ అమ్మాయని తెలుస్తుంది. మల్టీ మిలియనీర్‌నని అబద్ధమాడి, ఆమె పరీక్షలన్నీ తట్టుకొని, ప్రేమను అందుకుంటాడు. తీరా భాయ్ ఆమె చిన్నాన్నే తప్ప, అసలు తండ్రి కాదనీ, తనను పెంచిన నరసింహే ఆమె అసలు తండ్రి అనీ హీరో తెలుసుకుంటాడు. అసలు ఆమె జీవితంలో జరిగిందేమిటి? వేరే మాఫియా డాన్ కొడుకుతో షార్జాలో పెళ్ళికి సిద్ధమైన ఆమెను అసలు తండ్రి దగ్గరకు హీరో ఎలా చేర్చాడు? ఆమె చేతిని తానెలా అందుకున్నాడన్నది మిగతా సినిమా.

 ఎలా ఉందంటే...

  కథకు ఇద్దరు, మాటలకు ఒకరు, రచనకు మూడో వ్యక్తి రచయితలుగా పనిచేయగా, స్క్రీన్‌ప్లే క్రెడిట్ దర్శకుడు తీసుకున్న సినిమా ఇది. తీరా కథ మాత్రం దాదాపు కొన్నేళ్ళుగా తెలుగు ప్రేక్షకులు చూసి విసుగెత్తిన భాయ్ నేపథ్యం, వేరొకరితో హీరోయిన్ పెళ్ళి కుదిరితే హీరో ఆ పెళ్ళివారింటికే వెళ్ళి, వాళ్ళను బురిడీ కొట్టించి, తాను ఆమెను చేసుకోవడం! (ఆమె తండ్రిని ఆమెతో కలపడం, ఊళ్ళో ఫ్లోరోసిస్ బాధితులకు తోడ్పడే ప్లాంట్ వ్యవహారం లాంటివన్నీ కథకు కొత్త రూపమివ్వడానికి బలవంతాన పూసిన పై పూతలు). ‘ఢీ’ రోజుల నుంచి ఇటీవలి దాకా తెరపై చివికిపోయిన ఈ శ్రీను వైట్ల చిత్రాల మార్కు ప్రధాన కథ, వినోదాన్నే పాతిక కోట్ల పైగా ఖర్చుతో మరోసారి వండి వడ్డించడం సగటు ప్రేక్షకులకు లేని, దర్శక, నిర్మాతలు, రచయితలకు ఉన్న బాక్సాఫీస్ గుండె ధైర్యానికి గుర్తు! 

  నీటిలో కబడ్డీ ఘట్టంతో ఆసక్తిగా మొదలయ్యే సినిమా అరగంట గడిచేసరికి ఏ దోవలో వెళుతోందో అర్థమైపోతుంది. సస్పెన్స్‌లు, సుదీర్ఘమైన ఫ్లాష్‌బ్యాక్‌లు లేకుండా ప్రతి కాసేపటికో ట్విస్టు చొప్పున కథను నడిపించారు కానీ, అవి ఆఖరుదాకా ఆసక్తిని మిగల్చవు. ద్వితీయార్ధంలో కథ షార్జాకు మారాక విలన్లను హీరో వట్టి ‘బకరా’లను చేసే ఘట్టాలు రొటీనే. పైగా, పాత్రల ప్రవర్తనలో, సన్నివేశాల్లో లాజిక్‌లు పూజ్యం. హీరోను ప్రేమించాననడానికి పానీపురీ, పుచ్చకాయ తినడం, ఆటో ప్రయాణం, గాజుల కొనుగోలు లాంటి సిల్లీ పరీక్షలు పెట్టే హీరోయిన్, తీరా మరో మాఫియా నేత కొడుకుతో పెళ్ళికి నిరభ్యంతరంగా ఎలా సిద్ధపడుతుందో అర్థం కాదు. ప్రకాశ్‌రాజ్ పోషించిన నరసింహ పాత్రను కాసేపు అమాయకుడున్నట్లు, ఫ్లాష్‌బ్యాక్‌లో, చివరా మాత్రం ఆలోచనాపరుడు, త్యాగి అన్నట్లు చూపారు. 


ఇక, అంత లావు మాఫియా నేతలు, వారి అనుచరులు సైతం హీరో వేసే చిన్న ట్రిక్కులకు పడిపోయిన బలహీనులన్నట్లు చూపడం సినిమాటిక్ కన్వీనియెన్సే! దర్శకుడు ఎలా కావాలనుకుంటే అలా కథలో పురోగతి వచ్చేస్తుంటుంది. విమానాశ్రయంలో ఛేజ్‌తో దాదాపు సినిమా అయిపోయిన భావన కలుగుతుంది. ‘అల్లుడూ శీనూ! నువ్వొస్తే సూపర్‌హిట్టే ప్రతి సీనూ’ అంటూ ఆ తరువాత టైటిల్ సాంగ్ వచ్చేసరికే జనానికి కుర్చీలో కూర్చొనే సహనం లేకపోతే ఆశ్చర్యమేమీ లేదు. అటు పైన మళ్ళీ క్లైమాక్స్!

 ఎలా నటించారంటే...

  కథ -కథనాల సంగతి పక్కన పెడితే, తొలి పరిచయమనే భావన కలగనివ్వకుండా శ్రీనివాస్ డ్యాన్సులు, ఫైట్లు బాగానే చేశారు. కానీ, సన్నివేశాన్ని బట్టి హావభావాలు పలికించే అభినయ ప్రతిభ లాంటివన్నీ ఈ కొత్త ముఖం నుంచి ఆశిస్తే, అది దురాశే. అందుకు అవకాశమున్న సీన్లు కూడా స్క్రిప్టులో లేవన్నది వేరే కథ. ఆర్థిక అండదండలున్నా, ఆంగికం, వాచికాలను మరికొంత మెరుగుపరుచుకోవడం శ్రీనివాస్‌కు భవితకు శ్రీరామరక్ష. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఈ కొత్త హీరో పక్కన నటించిన సమంత ఎప్పటిలానే తన అందాన్నీ, అభినయాన్నీ ప్రదర్శించారు. 

నరసింహగా, భాయ్‌గా ప్రకాశ్‌రాజ్‌ది ద్విపాత్రాభినయం. ఇప్పటికే, ఓ రొటీన్ నటన అలవాటైన ఆయన ఆ పరిధిలోనే కన్నకూతురు మీద ప్రేమ చూపే ఘట్టాల్లోనూ కనిపించేస్తారు. హాస్యం కోసమని భాయ్ దగ్గర పనిచేసే డింపుల్‌గా బ్రహ్మానందం, ఇంకా రవిబాబు, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్ లాంటి చాలామందిని సినిమాలో పెట్టారు. బ్రహ్మానందం పాత్ర కొన్నిచోట్ల, ముఖ్యంగా ద్వితీయార్ధం చివరలో ‘ఇరికిస్తాన్’ మాటలతో కొంత నవ్విస్తుంది. ఇక, గ్రహాలు, జాతకాల పిచ్చిలో తిరిగే విలన్ భానూ భాయ్‌గా ప్రదీప్ రావత్ ఎదురవుతారు. చిత్ర ప్రారంభంలోనే ‘నా ఇంటి పేరు సిల్కు... నా ఒంటి రంగు మిల్కు’ అని ప్రత్యేక నృత్య గీతంలో ప్రముఖ హీరోయిన్ తమన్నా తళుక్కున మెరుస్తారు. 

 బాక్సాఫీస్ కొలతల్లో కథనం 

  సాంకేతిక నిపుణుల సంగతికొస్తే, ఛోటా కె. నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. డ్యాన్స్, ఫైట్స్ విభాగాల్లో బాగానే శ్రమించారు. దేవిశ్రీప్రసాద్ మాస్ బాణీలకే పీట వేశారు. ద్వితీయార్ధంలో ‘నీ నీలి కన్నుల్లోన నను కట్టేశావే...’ పాట వినడానికీ, చూడడానికీ బాగుంది. అయితే, నిశ్శబ్దం కూడా సన్నివేశంలోని గాఢతను పెంచుతుందన్న విషయం విస్మరించి, ప్రతి సీన్‌కూ ఆయన తన రీరికార్డింగ్‌తో చెవులకు మోత మోగించారు. చాలా సినిమా తీసినా, చివరకు కొంతే తెరపై మిగిలిందన్న సంగతి ద్వితీయార్ధంలో జంప్ కట్‌ల మధ్య తెలిసిపోతుంటుంది. దర్శకుడిగా వినాయక్ మార్కు దృశ్యాలు సినిమాలో ఉన్నా, వాటికి ఒకప్పటి వాడి, వేడి లేవేమిటనిపిస్తుంటుంది. 

  వెరసి, బొత్తిగా బాక్సాఫీస్ ఫార్ములా కొలతలు వేసుకొని మరీ ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ప్రతి పావుగంట - ఇరవై నిమిషాలకో పాట... డ్యాన్సు... మధ్య మధ్యలో ఫైట్లు... లేని హాస్యంతో రాని నవ్వును తెప్పించేందుకు విపరీత ప్రయత్నం... కాసిన్ని డైలాగ్ విసుర్లు... వీటితో ఈ అతుకుల బొంతను ఉన్నంతలో అందంగా కుట్టాలని ప్రయత్నించారు. కానీ, దాని వల్ల సినిమా అంతా ఏ ముక్కకు ఆ ముక్కగా వెళ్ళిపోతుంటుందే తప్ప, ఒక సంపూర్ణ సినీ సందర్శన అనుభవాన్ని అందించదు. పాటలు, ఫైట్లు, ఛేజ్‌ల లాంటివి సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకొనేవే అయినా, మనసుకు పట్టే పాత్ర చిత్రణ కానీ, కనీసం కన్విన్సింగ్‌గా అనిపించే సన్నివేశాలు కానీ లేకపోవడంతో ఈ అల్లుడి గిల్లుడును ఆసాంతం భరించడం కష్టమే. వెరసి, ఖర్చుకు వెనుకాడని నిర్మాత... అతి భారీ తారాగణం... అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు... హోరెత్తిస్తున్న ప్రచారం... ఇలా అన్నీ ఉన్నా, ‘అల్లుడు...’ ఆహా ఓహో అని తమ నోట అనడానికి సిటీ జనం మొహమాటపడతారు. అందుకే, ఈ సినిమా ఆశలన్నీ బి, సి సెంటర్ల మీదే! 

- రెంటాల జయదేవ

 ............
 బలాలు - 1. అగ్రశ్రేణి తారాగణం, సమర్థులైన సాంకేతిక నిపుణులు 2. తొలి చిత్రమనిపించని హీరో డ్యాన్సులు, ఫైట్లు 3. అక్కడక్కడ విరిసిన హాస్యపు జల్లులు

 బలహీనతలు - 1. అనేక చిత్రాల్లో చూసేసిన కథ 2. బాక్సాఫీస్ కొలతలతో ఒకే లెక్కలో సాగే, బొత్తిగా అనాసక్తికరమైన కథనం 3. బలహీనమైన విలన్ పాత్రలు 4. దర్శకుడు అనుకున్నట్టల్లా స్థిరత్వం లేకుండా మారే పాత్రల స్వభావం, సన్నివేశాలు 5. ఎడిటింగ్, రీ-రికార్డింగ్.
..............


(Published in 'Sakshi' daily, 26th July 2014, Saturday)
........................................................

Thursday, July 24, 2014

మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!

భారతీయ సినిమా ఇప్పటికి 101 ఏళ్ళు పూర్తి చేసుకొని, దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. మూగగా మొదలై మాటలు నేర్చిన సినిమా తెలుగు భాషలోనూ ఇప్పటికి 82 ఏళ్ళుగా సామాన్యుల్ని అలరిస్తూనే ఉంది. అయితే, వేషభాషలతో సహా మానవ జీవితాన్నే ఎంతో మార్చేసిన ఈ శతాధిక వత్సర అద్భుతం తాలూకు చరిత్ర ఇప్పటికీ సమగ్రంగా రికార్డు కాలేదనే చెప్పాలి. కొద్దిమంది ప్రయత్నాలు చేసినా, ఆర్థిక వనరుల కొరత మొదలు అనేక ఇబ్బందులతో సంతృప్తికర ఫలితాలు తెరపైకి రానే లేదు. ఈ నేపథ్యంలో మన తెలుగు హీరో - నిర్మాత మంచు విష్ణు తాజాగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. నూరు వసంతాల భారతీయ సినిమాపై ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను తీయాలని భావిస్తున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వంలో రూపొందిన తొలి భారతీయ మూకీ ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ (1913) దగ్గర మొదలుపెట్టి, హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో 1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మీదుగా ఇప్పటి వరకు మన సినీ ప్రస్థానాన్ని పలు భాగాల డాక్యుమెంటరీగా తెర కెక్కించనున్నట్లు భోగట్టా. విష్ణు తీసే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు ఆయన తండ్రి, నటుడు, నిర్మాత అయిన మోహన్‌బాబు ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లూ, తెలుగు సినీ పరిశ్రమకు తమ వంతు సేవగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లూ  కృష్ణానగర్ కబురు.



ఈ విశిష్ట ప్రయత్నంపై వినవస్తున్న వార్తల గురించి ‘సాక్షి’ ప్రతినిధికి విష్ణు వివరణనిస్తూ, ‘‘అవును. డాక్యుమెంటరీ సిరీస్ తీయాలనుకుంటున్నది నిజమే’’ అని అంగీకరించారు. ‘‘నేను కొన్ని భాగాలు తీస్తే, మరో ప్రముఖ దర్శకుడు కొన్ని భాగాలు తీస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం’’ అని ఈ యువ హీరో తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం గురించి పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వివరాల మాట అటుంచితే, మన సినిమా చరిత్ర రికార్డు కాలేదని ఆవేదన చెందుతున్న సినీ ప్రియులకు ఇది శుభవార్తే. సాధికారికమైన సమాచారంతో, సమగ్రంగా ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి! ఆల్ ది బెస్ట్ విష్ణూ!

.................................................................

Sunday, July 20, 2014

సినిమా రివ్యూ - అశ్లీలపు అంచుల్లో ఒక క్రిమినల్ ప్రేమకథ



అశ్లీలపు అంచుల్లో ఒక క్రిమినల్ ప్రేమకథ : సినిమా రివ్యూ
దేశంలో బాలలపైన, టీనేజర్లపైన జరుగుతున్న అత్యాచారాల్లో నూటికి 93 శాతం సమీప బంధువుల ద్వారా జరుగుతున్నవే. ఇలాంటి అత్యాచారాల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇవన్నీ ఎవరినైనా ఆందోళనకు గురి చేసే గణాంకాలు... ఆలోచనలు రేపే కఠోర వాస్తవాలు. ఈ వాస్తవాలను ఆధారం చేసుకొని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి చేసిన తాజా సినిమా - ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’. వాస్తవిక అంశాలను తీసుకొని, వాటిని డాక్యుమెంటరీ అనిపించకుండా తెరపై సమర్థంగా చిత్రించడానికి తపించడం ఈ దర్శకుడి అలవాటు. కానీ, ఈసారి ఏం చేశాడో చూద్దాం.

కథ ఏమిటంటే...
ఓ వీడియో స్టూడియోలో సహాయకుడిగా పనిచేస్తున్న శీను (మనోజ్ నందం) ఓ ఫంక్షన్‌లో బిందు (ప్రియాంకా పల్లవి)ను చూసి, ఆకర్షణలో పడతాడు. వీరిద్దరూ దగ్గరవుతున్న సమయంలో... తండ్రి అనారోగ్యం కారణంగా హీరోయిన్ మేనమామ దగ్గరకు కుటుంబమంతా వైజాగ్ వెళ్ళిపోతుంది. శీను ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి, ఆమె కోసం కాలేజ్ క్యాంటీన్‌లో పనిచేస్తుంటాడు. అసలు వారిద్దరూ కలిశారా లేదా? ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బంది ఏమిటన్నది ఈ చిత్రంలోని కీలకాంశం.

ఎలా ఉందంటే...
చిత్ర ప్రథమార్ధం చాలా అనాసక్తంగా గడుస్తుంది. కొన్నిసార్లు పరి ణతి లేని నటన, నిర్మాణ, దర్శకత్వ పరిమితులతో కృతకమైన నాటకం చూస్తున్నంత నీరసం కలుగుతుంది. హీరోయిన్ పాత్ర ప్రవర్తన కూడా ఘడియకో రకంగా మారుతూ చీకాకు పరుస్తుంది. ఇక, ద్వితీయార్ధంలో హీరోయిన్ తనకు ఎదురైన అనుభవాలను ఫ్లాష్‌బ్యాక్‌లో చెబుతూ, తన తేడా ప్రవర్తనకు కారణాలను వివరిస్తున్న క్రమంలో సినిమా ఒకింత ఆసక్తికరమైన దోవలో పడుతుంది.  కానీ, ఆ కారణాలేవీ కన్విన్సింగ్‌గా అనిపించవు. రకరకాల ఛాయలున్న పాత్రలో కథానాయిక, ఆమె మామయ్య పాత్రలో సుప్రసిద్ధ నట శిక్షకుడు ‘వైజాగ్’ సత్యానంద్ చక్కటి అభినయం చూపారు. హీరో మిత్రుడి పాత్రధారి అనిల్ ఫరవాలేదనిపిస్తాడు. ఈ చిత్రంలోని పాటలు, చిత్రీకరణ, సంగీతం లాంటి విభాగాలేవీ మరో మెట్టు పెకైక్కించేవి కావు.

అన్నీ తెరపైనే...!?
గతంలో తీసిన ‘ఒక రొమాంటిక్ ప్రేమ కథ’కు దక్కిన వాణిజ్య విజయం మూలంగానో ఏమో, ఆలోచింపజేసే చిత్రాలు తీస్తారని పేరున్న దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి ఈ సారి కూడా టీనేజ్ ప్రేక్షకుల బలహీనతల మీద ఆధారపడ్డ సినిమా తీశారు. సమాజంలో మన చుట్టూ మంచీ, చెడూ - రెండూ ఉంటాయి. మనం దేన్ని ఎంచుకొని, ఎలా చెబుతున్నామన్నది కళాసృజన అయిన సినిమాల్లో కీలకం. కానీ, ఈ చిత్రంలో తెలిసిన సామాజిక నాణేనికి తెలియని మరో వైపును చూపించే ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా పక్క దోవ పట్టేశారు. అధర చుంబనం, బలాత్కారం, సంభోగం - ఇలా సగటు అశ్లీల చిత్రంలో మాత్రమే ఉండే ఘట్టాలు. వేర్వేరు సందర్భాల్లో కనిపిస్తాయి.

కొన్ని డైలాగులు వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించాయి. దాంతో, పొరపాటున ఏ బూతు సినిమాకో రాలేదు కదా అన్న అనుమానం మామూలు ప్రేక్షకులకు వస్తుంది. ఇతివృత్తంగా చేపట్టిన ప్రధాన సమస్యతో మనసును కదిలించాల్సింది, ఆలోచింపజేయాల్సింది పోయి మనుషుల్లో దాగి ఉండే పశుప్రవృత్తిని ప్రేరేపించే దృశ్యాలతో సినిమా నిండడం వీటన్నిటికీ పరాకాష్ఠ. ఒకప్పుడు సెజ్‌లపై ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలు తీసిన ఉత్తమ దర్శకుడు ఎన్నో మెట్లు దిగజారి, ఇలా మార్కెట్ ఆధారిత చౌకబారు చట్రంలో ఇరుక్కుపోవడం మంచి సినిమాలను ప్రేమించేవారికి జీవిత కాలపు దుఃఖం.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 19th July 2014)
.....................................................

Wednesday, July 16, 2014

సినిమా రివ్యూ: ఐస్‌క్రీమ్ --- అవును... ఇది భయపెట్టే సినిమానే!


అవును... ఇది భయపెట్టే సినిమానే!

సినిమా రివ్యూ
చిత్రం: ఐస్‌క్రీమ్,
తారాగణం: తేజస్వి, నవదీప్, సంగీతం:
పద్యోతన్, కెమెరా: అంజి, నిర్మాత: తుమ్మలపల్లి
రామసత్యనారాయణ, దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ


దర్శకుడు వర్మకూ, హారర్ చిత్రాలకూ తెగని బంధం. జనాన్ని కుర్చీ అంచులో కూర్చోబెట్టే చిత్రాలు తీయాలని ఆయనకు చాలాకాలంగా తపన. పదే పదే విఫలమవుతూ వచ్చినా, ఆ కోరిక ఆయన్ను వదల్లేదు. ఈసారైనా సక్సెస్ సాధించాలనుకుంటూ ఆయన చేసిన తాజా విఫల యత్నం ‘ఐస్‌క్రీమ్’.

కథ ఏంటంటే...
రేణు (తేజస్వి) ఓ మెడికల్ స్టూడెంట్. ఆమె ప్రియుడు విశాల్ (నవదీప్). తల్లితండ్రులు పెళ్ళికి వెళ్ళడంతో లంకంత కొంపలో రేణు ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఆమె ప్రియుడు విశాల్ ఏం చేశాడు? ఏం జరిగిందన్నది ఈ ‘ఐస్‌క్రీమ్’.

ఎలా ఉందంటే...
ఈ సినిమా పేరే విచిత్రం. కథానాయికకు ఐస్‌క్రీమ్ అంటే తెగ ఇష్టం. ఆమె తరచూ అది తింటూ కనిపిస్తుంటుంది. అందుకనో ఏమో ఈ సినిమాకు అదే పేరు పెట్టారు. కానీ, తీరా సినిమాలో, మరీ ముఖ్యంగా చిత్ర ప్రథమార్ధంలో హీరోయిన్ చేసేదల్లా పడుకోవడం, లేవడం, పై దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం, స్నానం చేయడమే! ద్వితీయార్ధంలోనూ దాదాపు ఇదే తంతు. హీరోయిన్ కలగంటోందా, అతీంద్రియ శక్తులేమైనా ఉన్నాయా - అన్నది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటారు. హఠాత్తుగా వర్మ చేసిన ముగింపు, చూపిన కై్లమాక్స్ తొందరగా జీర్ణించుకోలేరు.

హారర్ సినిమా అనగానే కెమేరా పనితనం, రీరికార్డింగ్ కీలకం. విచిత్రమైన కోణాల్లో కెమేరాను ఉంచి తీసిన మాట నిజమే కానీ, సినిమా అంతటా హీరోయిన్ నడుము కింది భాగాన్నే పదే పదే చూపించారు. ఒక దశలో హీరోయిన్ ముఖం నేరుగా తెర మీద కనిపించేది చాలా తక్కువనిపిస్తుంది. వెరసి, ఈ చిత్రీకరణతో దర్శకుడు మరేదో ఉద్దేశించినట్లు అనిపిస్తుంది.

అలాగే, వర్మ మార్కు సంచలనమైన హీరోయిన్ నగ్న సన్నివేశ చిత్రీకరణ కూడా ఫక్తు పబ్లిసిటీ స్టంటేనని అర్థమవుతుంది. కిర్రుమనే తలుపు చప్పుళ్ళు, బాత్రూమ్ కుళాయి నుంచి బొట్లు బొట్లుగా నీళ్ళు పడే చప్పుడు, సన్నటి శబ్దంతో సుడులు తిరిగే గాలి లాంటి హారర్ సౌండ్ ఎఫెక్ట్‌లన్నీ ఉన్నా, నిర్దిష్టమైన కథ కానీ, బలమైన సన్నివేశాలు కానీ ‘ఐస్‌క్రీమ్’లో లేవు.


వెండితెర దుస్సాహసం    
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సమంత పక్కన మెరిసిన తేజస్వి నాయికగా ప్రమోటై, భయోద్విగ్నతలు బాగానే పలికించారు. ఆమెకు జంటగా నవదీప్ ఫరవాలేదనిపిస్తారు. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమెకు దెయ్యంగా తారసపడే ముసలావిడే కనిపిస్తుంటారు. మరో మూడు పాత్రలు అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతాయి. ఇన్ని తక్కువ పాత్రలతో, సినిమా తీయడం ఓ ప్రయోగం, సాహసమే. కానీ, తెలుగు సినిమా మార్కు పాటలేమీ లేకుండానే కాదు... కనీసం కథైనా లేకుండా సినిమా తీయడం వర్మ మాత్రమే చేయగల దుస్సాహసం. సినిమా అంతా ఓ పెద్ద ఇంట్లో కింద హాలు, పైన బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లోనే జరుగుతుంది.

 దాంతో, ఖర్చు కలిసొచ్చిందేమో కానీ, చూసిన పరిసరాలు, సన్నివేశాలే చూస్తున్నట్లనిపించి, కళ్ళతో పాటు బుర్రకూ అలసటనిపిస్తుంది. మొత్తానికి, అంచనాలతో వెళ్ళి, ఈ సినిమాను ధైర్యం చేసి గంటాము ప్పావు భరించగలిగితే చాలు... ఇక సినిమాలంటేనే ఎవరైనా భయపడడం ఖాయం. వర్మ అలా సక్సెసయ్యారు. వాణిజ్యపరంగా చూస్తే, ఈ వెండితెర కల జనం చూడక ముందే హాలులో నుంచి కరిగిపోయే ఐస్‌క్రీమ్. కొసమెరుపు: సినిమా చూసి మల్టీప్లెక్స్ నుంచి బయటకొస్తూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బృందం కాస్తంత బిగ్గరగానే, తమలో తాము అనుకుంటుండగా చెవినపడ్డ మాట -‘‘వర్మా! మాకు ఇదేం ఖర్మ!!’’

బలాలు:  వర్మ ఇమేజ్  తొలిసారిగా ఫ్లోకామ్ టెక్నాలజీ వాడకం, నగ్నంగా నటించిన హీరోయిన్ లాంటి ప్రచారం
 తక్కువ నిడివి సినిమా

బలహీనతలు:  యథార్థ ఘటన ఆధారంగా అల్లుకున్నామని వర్మ ప్రకటించిన అర్థం పర్థం లేని స్క్రిప్టు  విసుగెత్తించే టేకింగ్
 పస లేక నస పెట్టే స్క్రీన్‌ప్లే

- రెంటాల జయదేవ

...................................................

Monday, July 14, 2014

సినిమా రివ్యూ: 'దృశ్యం'


నటీనటులు: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
నిర్మాతలు: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి
సంగీతం: శరత్
సినిమాటోగ్రఫి: ఎస్ గోపాల్ రెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేశ్
దర్శకత్వం: శ్రీ ప్రియ
 
- రెంటాల జయదేవ

Saturday, July 12, 2014

వేదిక... వెండితెరల సవ్యసాచి - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు



వేదిక... వెండితెరల సవ్యసాచి
 చిలకలపూడి సీతారామ ఆంజనేయులు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులంటే తెలియని తెలుగు సినీ ప్రియులుం డరు. హీరోగా, ఆ పైన విలన్‌గా, కమెడియన్‌గా, చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా జీవితంలోని వివిధ దశల్లో విభిన్న తరహా పాత్రలను పోషించి, అన్నింటిలోనూ సమాన ఆదరణ పొందిన అరుదైన నటుడాయన.

 రంగస్థలిపై రాణింపు
 రంగస్థలం నుంచి వచ్చినా, వెండితెరకు అనుగుణంగా కొద్ది రోజుల్లోనే తమను తాము మలుచుకొని, రెండు రంగాల్లోనూ సమాన ప్రతిభ చూపిన వారి జాబితాలో మొదట నిలిచే పేరు - సి.ఎస్.ఆర్. 1907 జూలై 11న నరసరావుపేటలో పుట్టి, పొన్నూరు, గుంటూరుల్లో  చదివి, మద్రాసులో స్థిరపడిన ఆయన నాటక, సినీ రంగాలు రెంటిలోనూ మకుటం లేని మహారాజుగా వెలిగారు. చిన్నతనంలోనే నాటకాలు వేసిన ఆయన పెద్దయ్యాక తీరైన విగ్రహం, తీయనైన కంఠంతో అభిమానుల్ని సంపాదించుకున్నారు.

 అప్పటికే ఆడపాత్రలు వేసే పురుషుడిగా ప్రతిష్ఠ సంపాదించుకున్న ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు పక్కన ముఖ్య పాత్రలో సి.ఎస్.ఆర్.ది అపూర్వమైన కాంబినేషన్‌గా రంగస్థలంపై వెలిగిపోయింది. స్వతహాగా జాతీయవాదైన సి.ఎస్.ఆర్. ఆ రోజుల్లోనే హరిజనుల అభ్యుదయంపై ‘పతిత పావన’, అలాగే సంత్ ‘తుకా రామ్’ లాంటి నాటకాలు రాయించుకొని, తన సొంత నాటక సమాజం ‘శ్రీలలిత కళాదర్శ మండలి’ పక్షాన ప్రదర్శించడం ఓ చరిత్ర. తుకారామ్ నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బును సుభాష్ చంద్రబోస్ ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి అందజేయడం ఓ అపూర్వ ఘట్టం. ఆ రంగస్థల పేరుప్రతిష్ఠలు ఆయనకు సినీ ఆహ్వానమిచ్చాయి.

 వెండితెరకు కొత్త వెలుగు
 1933లో తీసిన ‘రామదాసు’ చిత్రంలో సి.ఎస్.ఆర్. శ్రీరాముడి పాత్ర పోషించినా, అది వెలుగులోకి రాలేదు. కానీ, ఆ తరువాత హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోని బాక్సాఫీస్ హిట్ ‘ద్రౌపదీ వస్త్రాపహరణము’ (1936)లో శ్రీకృష్ణుడిగా తెరపై స్థిరపడ్డారు. ‘తుకారామ్’ (’37)గా వెలిగారు. పి. పుల్లయ్య తీసిన ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యము’ (’38) ఘన విజయంతో తొలి తెర వేలుపయ్యారు. అక్కడ నుంచి ఒకపక్క ‘జయప్రద’, ‘భీష్మ’ లాంటి చిత్రాల్లో పురాణ, చారిత్రక కథా పాత్రల్లో, మరో పక్క ‘చూడామణి’, ‘గృహప్రవేశం’ లాంటివాటిల్లో నవతరం సాంఘిక పాత్రల్లో సమాన ప్రజ్ఞను చూపడం ఆయనలోని గొప్పదనం. ముఖ్యంగా సారథీ వారి ‘గృహప్రవేశం’ (’46)లో ‘మై డియర్ తులశమ్మక్కా’ అంటూ ఆయన పాడిన పాట, చేసిన నృత్యం ఇవాళ్టికీ హైలైట్. విజయా వారి ‘మాయాబజార్’ (’57)లో శకునిగా ఆయన చూపిన అభినయం, ‘ముక్కోపానికి మందు ముఖస్తుతి ఉండనే ఉందిగా!’ అంటూ చెప్పిన డైలాగులు ఇవాళ్టికీ జనానికి గుర్తే. ‘లైలా మజ్ను’, ‘దేవదాసు’, ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’, ‘అప్పు చేసి పప్పుకూడు’ లాంటి చిత్రాల్లో అటు దుష్టత్వమైనా, ఇటు లలితమైన హాస్యమైనా, సాత్త్వికాభినయమైనా  - తూకం వేసినట్లు పండించిన ఆయన పాత్రలు నవతరం నటులకు ఓ పెద్దబాలశిక్ష. దర్శకుడిగా ‘శివగంగ’, ‘రిక్షావాలా’ లాంటి ప్రయత్నాలు పురిటిలో సంధి కొట్టడంతో సి.ఎస్.ఆర్.లోని మరో ప్రతిభా పార్శ్వం బహిర్గతం కాలేదు. 


 పాండీబజార్ పరమ శివుడు
 చిత్రసీమ మద్రాసు మహానగరంలో వెలిగిన ఆ రోజుల్లో నటీనటులకు ఆటపట్టయిన టి.నగర్‌లోని పాండీబజార్ ఉదయాస్తమాన వేళల్లో సి.ఎస్.ఆర్‌కు శాశ్వత చిరునామా. అందమైన ‘బ్యూక్’ కారు వేసుకొని వచ్చి, పాండీబజార్ గీతా కేఫ్ (ఇప్పటికీ ఉంది) సెంటర్‌లో, చెట్టు కింద నిలబడి, వచ్చే పోయే సినీ జనాన్ని పలకరిస్తూ ఆయన నడిపిన మాట కచ్చేరీలు అనంతం. అందరినీ ఆదరిస్తూ, గుప్తదానాలతో ఆదుకుంటూ వచ్చి, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుణ్ణి వదిలి, పెద్ద వయసు రాకుండానే కన్నుమూశారు. ఆయన చనిపోతే, రంగస్థల ప్రియులు ‘తుకారామ్ పోయాడ’న్నారు. సీనియర్ సినీ జర్నలిస్టు ఇంటూరి ‘సి.ఎస్.ఆర్. లేని పాండీబజార్... శివుడు లేని కైలాసం’ అని వాపోయారు.

 తెలుగు తెర చరిత్రను పరికిస్తే, మాటకు ముక్కును కూడా ఒకింత ఆసరాగా చేసుకున్న సి.ఎస్. ఆర్. విలక్షణ వాచికం అప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేకమే. పద్యాన్నీ, వచనాన్నీ విలక్షణ రీతిలో చెప్పడమే కాక, ఒకే మాటను ఆయా సమయ, సందర్భాలకు తగ్గట్లు భిన్న రసాలతో పలికించి, మెప్పించేవారు. ప్రత్యేకమైన ఆంగికాభినయం కూడా అంతే ప్రత్యేకం. వాటికి పాత్రోచితమైన ఆహార్యం కూడా తోడవడంతో, సి.ఎస్.ఆర్. ఏ పాత్ర చేసినా, అక్కడ ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలే సాక్షాత్కరించేవి. నాగయ్య లాంటి గొప్ప నటుడు సైతం ‘ఒక రకంగా సి.ఎస్.ఆర్. నాకు గురువు’ అన్నది అందుకే. ఈనాటి బాక్సాఫీస్ ప్రమాణాల్లో టాప్ స్టార్‌గా వెలగకపోయినా, ఉత్తమ నటుడిగా ిసి.ఎస్.ఆర్. వెలిగారు. నూట ఏడేళ్ళ క్రితం పుట్టి, అయిదు దశాబ్దాల క్రితమే (1963 అక్టోబర్ 8) భౌతికంగా దూరమైనా ఇవాళ్టికీ జనం నోట మిగిలారు.

 - రెంటాల జయదేవ
.................................................

Friday, July 11, 2014

విజయం - నాడు రిక్షావాలా... నేడు రాష్ట్రపతికి అతిథి!

నాడు రిక్షావాలా... నేడు రాష్ట్రపతికి అతిథి!
రిక్షా కార్మికుడిగా మొదలైన ఆయన ఇప్పుడు సాక్షాత్తూ భారత రాష్ట్రపతి నివాసంలో అతిథి. ఇరవై ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో ఈ బ్రిటిష్ కాలపు భవనాలను అబ్బురంగా చూస్తూ తిరిగిన ఆయనకు ఇది ఊహించని అనుభవం. హర్యానా వాసి అయిన 51 ఏళ్ళ ధరమ్‌వీర్ కాంబోజ్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉంది. ఎంతోమందికి ఉపయోగపడే యంత్రాన్ని రూపొందించిన పట్టుదల ఉంది.

ధరమ్‌వీర్ కథ అచ్చంగా ఓ సినిమా కథలా ఉంటుంది. హర్యానాలోని యమునా నగర్ ధరమ్‌వీర్ సొంత ఊరు. ఒకానొక దశలో కన్నకూతురి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుర్భర స్థితిలో గడిపారు. భార్యాబిడ్డల్ని పోషించలేక, తండ్రితో మాటా మాటా రావడంతో, 23 ఏళ్ళ వయసప్పుడు 1986లో ధరమ్‌వీర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఢిల్లీకి చేరిన ఆ యువకుడు రిక్షా కార్మికుడిగా మారాడు. కానీ, 1987లో ప్రమాదానికి గురవడంతో తప్పనిసరై, ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.

అప్పుడు కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఓ ఆలోచన ఆయన మెదడును తొలిచేసింది. రైతులైన తాము గ్రామాల్లో పండించే పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలకు ఆట్టే లాభం రావడం లేదనీ, అదే గనక వాటిని ప్రాసెస్ చేసి, ప్యాకేజ్ చేస్తే లాభం వస్తోందని ఢిల్లీలో ఉండగా ఆయన గమనించారు. ఆ ఆలోచన జీవితాన్నే మార్చేసింది.

ప్రమాదం నుంచి కోలుకోగానే రైతులతో మాట్లాడడం మొదలుపెట్టారు. సేంద్రియ వ్యవసాయంలో అనేక రకాల ప్రయోగాలు చేశారు. చివరకు రూపొందించిన ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రం ఘన విజయం సాధించింది. గంటకు 200 కిలోలకు పైగా టమోటాల నుంచి గుజ్జు తీసే యంత్రమది.

కలబంద, ఉసిరి, నేరేడు లాంటి వాటి నుంచి, అనేక ఇతర ఔషధమూలికల నుంచి రసం తీయడానికీ, వాటిని రకరకాల ఉత్పత్తులుగా తయారు చేయడానికి కూడా ఉపకరించే ఆ యంత్రమే ఇప్పుడు ఆయనను దేశ ప్రథమ పౌరుడికి అతిథిని చేసింది. రాష్ట్రపతి భవన్ అతిథులుగా ఎంపిక చేసిన అయిదుగురు నవీన ఆవిష్కర్తల్లో ఒకరిని చేసింది.
 ‘‘ఈ యంత్రాన్ని తయారుచేయడానికి నాకు 11 నెలలు పట్టింది.

‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’కు చెందిన అధికారులు 2008లో నేనుంటున్న దామ్లా గ్రామానికి వచ్చి, యంత్రం ఎలా పనిచేస్తుందో చూశారు’’ అని ధరమ్‌వీర్ చెప్పుకొచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి, గుర్తింపు తేవడంతో ఈ నెల ఒకటి నుంచి ఇరవై రోజుల పాటు రాష్ట్రపతి భవన్‌లో అతిథిగా గడుపుతున్నారాయన. ధరమ్‌వీర్ రూపొందించిన యంత్రం ద్వారా పువ్వుల నుంచి, ఔషధ మొక్కల నుంచి సారం తీసి, జెల్ లాగా కూడా చేయవచ్చు.

‘‘హోలీ రంగుల కోసం మా అమ్మ పువ్వులు సేకరించడం, వాటి నుంచి రసం తీయడం లాంటి నా చిన్ననాటి సంగతులు ఇప్పటికీ గుర్తే’’ అంటూ ఔషధ రసాలు తీయడం వెనుక తనకున్న ఆసక్తికి కారణాన్ని ఈ అయిదుపదుల సృజనశీలి తెలిపారు. చెరుకుగడల పిప్పి సాయంతో పుట్టగొడుగులు పెంచి, రికార్డు స్థాయి దిగుబడి సాధించారు. టేప్ రికార్డర్ మోటార్‌ను వాడుతూ, బ్యాటరీ ద్వారా పని చేసే స్ప్రేయింగ్ యంత్రం, అలాగే క్రిమికీటకాలను పట్టుకొనే మరో సాధనం లాంటివి కూడా రూపొందించారు.

ఆయన ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ, ఇవాళ నవ్విన నాపచేనే పండింది. ఈ యంత్రాల కోసం ఇప్పటికే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘‘కెన్యాలోని ఓ సంస్థకు ఇలాంటి 20 యంత్రాలు సరఫరా చేస్తున్నా’’ అని ధరమ్‌వీర్ చెప్పారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, పదో తరగతి పైన చదువుకోలేకపోయిన ఆయన బడిలో చదువుకుంటున్నప్పుడే సైన్స్ ఎగ్జిబిషన్లలో ఎమర్జెన్సీ లైట్ తయారు చేశారు.

ఆ దశ నుంచి గంటలో 100 కిలోల కలబందను ప్రాసెస్ చేసే యంత్రాన్ని రూపొందించే స్థాయికొచ్చారు. అది బాయిలర్‌గా, స్టెరిలైజర్‌గా, కుకర్‌గా రకరకాలుగా ఉపయోగపడుతుంది. దాంతో, బియ్యం ఉడికించవచ్చు. టొమేటా కెచప్ చేయవచ్చు. మసాలా దినుసులు, పండ్ల నుంచి పొడి తీయవచ్చు.

ఈ ఉత్సాహవంతుడి కృషిని గమనించి హర్యానా ప్రభుత్వం ఇప్పటికే తమ హిసార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోర్డ్ సభ్యుడిగా కూడా ఆయనను నియమించింది. అనేక అవార్డులూ వచ్చాయి. అయితే, ఒకప్పుడు తిట్టిన తండ్రి ఈ ఘన విజయాలను కళ్ళారా చూడలేకపోయారని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. తిండికి గడవని రోజుల నుంచి ఇవాళ నెలకు రూ. 50 వేలు సంపాదిస్తూ, కనీసం పాతికమందికి పైగా ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆయన ఘనత.

తాను పెద్దగా చదువుకోకపోయినా కొడుకును కంప్యూటర్ ఇంజనీర్‌నూ, కూతుర్ని ఎం.బి.ఎ. పట్టభద్రురాలినీ చేశారు. అలోవెరా షాంపూలూ, చూర్ణాలు, జెల్, ఫేస్‌ప్యాక్, ఉసిరికాయ జ్యూస్, లడ్డూ, బర్ఫీ లాంటివి తన కుమారుడు ప్రిన్స్ పేరు మీద తయారు చేస్తున్నారు. ఉత్తరాదిన ఈ ఉత్పత్తులు జోరుగా అమ్ముడవుతున్నాయి. భార్య సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందంటున్న ధరమ్‌వీర్ సానుకూల దృక్పథం, కఠోర పరిశ్రమ, ఏదైనా సరే నేర్చుకోవాలన్న తపన తన బలాలంటున్నారు. విజయ సాధకులకు కావాల్సినవేమిటో ఇక వేరే చెప్పాలా?     - మహతి

(Published in 'Sakshi' daily, 9th July 2014, Wednesday)

..........................................

Thursday, July 10, 2014

ఆ వారం నాన్నగారితోకలసి పనిచేయడం కష్టమైంది! - దర్శకుడు అక్కినేని అక్షయ్

ఆ కుర్రాడికి పెద్ద సినీ నేపథ్యమే ఉంది. తాత ఎ. సంజీవి పేరున్న ఎడిటర్. తండ్రి ఎ.శ్రీకర్‌ప్రసాద్ ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు అందుకున్న ఎడిటర్. అలాంటి కుటుంబంలోని కుర్రాడు సినీ రంగంలోకి రావడం చిత్రమేమీ కాదు. కానీ, 27 ఏళ్ళ అక్షయ్ అక్కినేని... ఎడిటింగ్ శాఖలో కాకుండా దర్శకత్వంలో అడుగుపెట్టడం మాత్రం చిత్రమే. పైగా, తొలి అడుగే హిందీ చిత్రసీమలో! పెపైచ్చు తొలి చిత్రమే 3డిలో! అదీ కాక, ఆ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్టయిన ‘పిజ్జా’కు రీమేక్! ఇన్ని విశేషాలతో వచ్చే నెల 18న ‘పిజ్జా-3డి’ దర్శకుడిగా జనం ముందుకొస్తున్న అక్షయ్‌తో కాసేపు...

 మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?
 చిన్నప్పటి నుంచీ సినిమా రంగంలోకి రావాలన్నది నా కల. అయితే, అది దర్శకత్వమా, ఎడిటింగా అనుకోలేదు. పెద్దయ్యాక దర్శకత్వం వైపు మొగ్గు చూపా. ఆలిండియా స్థాయిలో మంచి ర్యాంక్ వచ్చి, ఐ.ఐ.టి.లో చేరాల్సి ఉన్నప్పటికీ, అటు వెళ్ళకుండా సినీ రంగం వైపు వచ్చేశా.

  మీ ఇంట్లో ఏమీ అనలేదా? నాన్నగారు ‘అలా కాదు... ఇలా’ అని చెప్పలేదా?
 నేను సినిమాల్లోకి వెళతానని చెప్పగానే, నాన్న ఎందుకు, ఏమిటి అని అడుగుతారనుకున్నాను. కానీ, ఒక్క క్షణమైనా మరో ఆలోచన చేయకుండా ఆయన సరే అన్నారు. ఒక్కగానొక్క బిడ్డనైన నన్ను మా అమ్మ కూడా ప్రోత్సహించింది.

 దర్శకత్వంలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు?
 చిన్నప్పటి నుంచి నాన్న ఎడిటింగ్ సూట్‌లలో, సినిమా ల్యాబ్‌లలో తిరుగుతూ పెరగడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చా. చెన్నైలోని పూనమల్లి హైరోడ్‌లో ఉన్న ఎస్.ఐ.ఐ.టి-జె.ఇ.ఇ.లో ప్లస్ 2 చదివిన నేను లయోలా కాలేజ్‌లో విజువల్ కమ్యూనికేషన్స్ కూడా చేశా. ఆ సమయంలోనే చాలా మ్యూజిక్ వీడియోలకూ, షార్ట్‌ఫిల్మ్‌లకూ పనిచేశా. పవన్‌కల్యాణ్ ‘పంజా’ చిత్రానికి దర్శకుడు విష్ణువర్ధన్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా సినీ రంగంలో అడుగుపెట్టా. ‘అడియోస్’ అనే లఘుచిత్రానికి రచన, దర్శకత్వం వహించా. అది చూపెట్టినప్పుడు, దర్శక - రచయిత బిజయ్ నంబియార్‌కు నచ్చి, తన దగ్గర పని చేయడానికి నన్ను ముంబయ్‌కి వచ్చేయమన్నారు. ఆయన దర్శకత్వంలో ‘ఎం’ టి.వి.లో వచ్చిన ‘రష్’ అనే టీవీ షోకు కూడా సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆ పైన ఆయన దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా తయారైన ‘డేవిడ్’ అనే తమిళ, హిందీ చిత్రానికి పనిచేశాను. ఆయనే నాకు ‘పిజ్జా’ హిందీ రీమేక్‌తో దర్శకుడిగా భారీ అవకాశమిచ్చారు.

 దర్శకుడిగా తొలి అవకాశమే పెద్దది రావడం విశేషమే! తొలి చిత్రంగా రీమేక్‌ను ఎంచుకోవడం సేఫ్ అనా?
 తెలుగు అనువాద రూపంలోనే కాక, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా కూడా అలరించిన కథ కావడం, అలాగే హిందీలో ప్రతిష్ఠాత్మక యు టి.వి. సంస్థ నిర్మించడం లాంటివన్నీ తొలి సినిమాకే లభించడం విశేషమే. మంచి అవకాశం వచ్చిందని అంగీకరించానే తప్ప, రీమేకా, మరొకటా అన్నది ఆలోచించనే లేదు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథలో మార్పులు చేశాను. మాతృకతో పోలిస్తే, దాదాపు 60 నుంచి 70 శాతం మార్చాం కాబట్టి, ఓ కొత్త సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది.


 మరి 3డి ఎందుకు ఎంచుకున్నట్లు?
 కథను బాగా చెప్పడానికి 3డి టెక్నాలజీ తోడ్పడుతుందని నేనేప్పుడూ అనుకుంటూ ఉంటాను. పైగా, ‘పిజ్జా’ కథకు ఇది అతికినట్లు సరిపోతుంది. సినిమా ప్రారంభిస్తున్నప్పుడే 3డిలో తీయాలనుకున్నాం.

 తొలి సినిమానే 3డిలో తీయడం కష్టం కాలేదా?
 3డి వ్యవహారం చూడడానికి ఓ టీమ్ ఉంది. సినిమా చిత్రీకరణ ప్రారంభించే ముందు నేను, నా కెమెరామన్ జయకృష్ణ గుమ్మడి కలసి 3డిలో చిత్రీకరణ గురించి వారం రోజుల పాటు అధ్యయనం చేశాం. పుస్తకాలు చదివి, నెట్‌లో చూసి, దాని మీద అవగాహన పెంచుకున్నాం. 3డిలో చిత్రీకరణ విధానమైన స్టీరియోస్కోపీలో రకరకాల పద్ధతులున్నాయి. అందులో ఒకటి ఎంచుకున్నాం. వేగంగా, సాఫీగా పని చేసే సెమీ-ఆటోమేటిక్ రిగ్ అయిన ‘టి.ఎస్ 5’ను వాడాం. ఇన్ని జాగ్రత్తల వల్ల ముంబయ్‌లోనే 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశాం.

 మీ నాన్న దగ్గర ఎడిటింగ్ చూశారు. ఇప్పుడు దర్శకత్వం చేశారు. ఇదే కష్టమనిపించిందా?
 ఎడిటింగ్‌లోకి నేను వెళ్ళకూడదని కాదు కానీ, నా మటుకు నాకు దర్శకత్వం మరింత ఆనందదాయకమని అనిపించింది. నన్నడిగితే ఎడిటింగ్, దర్శకత్వం - దేనికదే ఓ పెను సవాలు. ఆ రెండు సవాళ్ళనూ పోల్చలేం.

 ఈ చిత్రానికి మీ నాన్నే ఎడిటర్. ఆయనతో కలసి దర్శకుడిగా పని చేయడం ఎలా ఉంది?
 మొదటి వారం రోజులు కష్టమైంది. వ్యక్తిగతంగా తండ్రీ కొడుకులుగా కాక, వృత్తి నిపుణులమైన ఎడిటర్ - దర్శకులుగా వ్యవహరించడానికి కాస్తంత టైమ్ పట్టింది. ఆ తరువాత ఈ ప్రక్రియ అందమైన ప్రయాణంగా మారింది.

 దర్శకుడిగా మీ పని తీరు చూసి, ఆయన ఏమన్నారు?
 సంతోషించారు. ఓ ఎడిటర్‌గా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పట్ల ఆనందం వెలిబుచ్చారు. కొన్నిచోట్ల మరికొంత బాగుండాల్సిందన్నారు.

 ఇంతకీ దర్శకునిగా ఏం నేర్చుకున్నారు?
 ఎంతో నేర్చుకున్నాను. గతంలో నేర్చుకున్నవెన్నో వదిలించుకున్నాను. నా తోటి టెక్నీషియన్ల నుంచి నేర్చుకుంటూనే ముందుకు వెళ్ళాలి... వెళతాను కూడా!

 ఒక వ్యక్తిగా మీ నాన్న నుంచి మీరు నేర్చుకున్నది?
 అది చెత్త సినిమా కావచ్చు, మంచి సినిమా కావచ్చు... పని చేస్తున్నప్పుడు త్రికరణశుద్ధిగా, సర్వశక్తులూ పెట్టి కృషి చేయాలి. ఆ విషయం ఆయన నాకెప్పుడూ చెప్పలేదు కానీ, ఆయన ఆ పనే చేస్తారు. ఆయనను చూసి నేనది నేర్చుకున్నాను.

 దర్శకుడిగా  తదుపరి ప్రణాళికలు
 ‘పిజ్జా - 3డి’ తరువాత ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. కాకపోతే, దర్శకుడిగా ప్రయాణం సాగిస్తాను. ప్రస్తుతం ముంబయ్‌లో ఉన్నా, నా కేంద్రస్థానం - మద్రాసే. తమిళనాట పుట్టి పెరిగి, ముంబయ్ దాకా వచ్చిన తెలుగు కుర్రాడిగా తమిళ, హిందీ, తెలుగు భాషలు మూడింటిలోనూ తప్పక సినిమాలు చేస్తాను. ప్రేక్షకులను అలరిస్తాను.

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 7th July 2014, Monday)
..............................................

Monday, July 7, 2014

నాకు సంగీతం తెలియదు... సంగీతానికి నేను తెలుసు! - డాక్టర్ మంగళంపల్లి బాలమురళి


నాకు సంగీతం తెలియదు...  సంగీతానికి నేను తెలుసు!
 ఆయన అపర త్యాగయ్య అంటారు కొందరు! 
ఆయనకు అహంకారమంటారు... ఇంకొందరు!
 మితిమీరిన ఆత్మవిశ్వాసమంటారు... మరికొందరు! 
ఎవరేమన్నా, అనుకొన్నా వెరవని స్వభావం...
 సంగీతంలో, జీవితంలో నిత్య ప్రయోగశీల వ్యక్తిత్వం...
 నమ్మినదాన్ని ఆచరించే పట్టుదల...
 నమ్మి వచ్చినవారికి ఆశ్రయమిచ్చే ఔదార్యం...
 సమకాలీన కర్ణాటక సంగీత ప్రపంచంలో
 అరుదైన వాగ్గేయకారుడిగా గౌరవం...
 76 ఏళ్ళుగా పాడుతున్నా...
 ఇప్పటికీ వన్నె తగ్గని ఆ మధు మురళి...
 డాక్టర్ మంగళంపల్లి బాలమురళి.

 త్యాగరాజ స్వామి వారి శిష్యపరంపరలో అయిదో తరం వ్యక్తిగా... తెలుగువారి ఆస్తి ఆయన.
 ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’, ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సత్కారం ‘షెవాలియర్’...
 ఇలా అన్నీ ఈ భారత జాతిరత్నం ద్వారా తమ గౌరవాన్ని పెంచుకున్నవే.

ఎంత ఎత్తు ఎదిగినా, హృదయంలోని
 పసితనాన్ని ఇప్పటికీ పోగొట్టుకోని...
 84 వసంతాల నిత్య బాలుడాయన.

 నేడు (June 6) పుట్టినరోజు జరుపుకొంటున్న
 ఈ ముగ్ధమోహన గాన మురళితో
 ‘సాక్షి’ మాటకచ్చేరీ...

............................................


 త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా!
 
గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం వెంకట స్వామి నాయుడుగారి వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను.
తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే!
నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల),


‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం...’లాంటివి..!

ఆత్మకథ రాయమని అడిగేవారికి నేను చెప్పేదొక్కటే... నా మీద ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. ఎంతోమంది నా జీవితానికి అక్షరరూపం ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. నా జీవితం, సంగీత కృషి మీద ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. పిహెచ్.డి. పట్టా కూడా దక్కాయి. ఇక నేను రాయడమెందుకు!

సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం!

................................................

ఎనిమిదేళ్ళు నిండీనిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ..?
1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్లో హాలు ప్రారంభోత్సవం... మా గురువుగారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తిగారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు.

అసలు మీరు పుట్టింది... చదువుకున్నది ఏ ఊరిలో..?
 తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాలవితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మ గారు నన్ను పెంచారు. నేను స్కూల్‌లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్‌లో హెడ్‌మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు. మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. అంతా నా చుట్టూ చేరేవారు.

అయితే, నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్‌మాస్టర్ నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా. రేడియోలో పని చేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థంకాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా.

చిన్ననాటి అనుభవాలు మరికొన్ని...

 నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లివారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న దూబగుంట వారి సత్రంలో చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు.

ఆయన పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్యగారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది.

మీ జీవితంలో గురువుగారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత?

 మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట!

కానీ, పారుపల్లి వారి వద్ద నేర్చుకున్న త్యాగరాయ సంగీతం కన్నా, మీ సొంత బాణీకీ, కృతులకే మీరు ప్రాధాన్యమిచ్చారని మరో విమర్శ...
త్యాగరాజస్వామి ముందువాళ్ళు ఎవరు ఎలా పాడేవారో ఎవరికీ తెలీదు కదా! ఆయన ఆ రాగాల్లో కృతులు రాసుకొని, ఆలపించారు. ఆ త్యాగరాయ సంగీతం పరంపరాగతంగా మా వరకు వచ్చింది. ఆ సంగీతాన్ని పాడుతూనే, పెద్దగా పాపులర్ కాని రాగాల్లో సైతం కీర్తనలు రాసి పాడాను. రాగాలు కనిపెట్టాను. అలా రచన, గానంతో వాగ్గేయకారుణ్ణయ్యాను. నా పద్ధతి, పాట ‘బాలమురళి బాణీ’గా ప్రచారంలోకి వచ్చింది. అదేదో నేను ఉద్దేశపూర్వకంగా కొత్తగా, ధైర్యంగా చేశానని చెప్పను కానీ, అలా జరగాలని రాసి ఉంది....  జరిగింది. అంతే!

రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట!
అవును. ఆ రోజుల్లో కోరి మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆయా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం!

విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం?
 ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళాసాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను.

ఉత్తరాదిన ఎందరికో దక్కిన ‘భారతరత్న’ మీకు రాలేదు. వివక్ష కారణమా?
ఫలానాది కావాలి, రావాలి అని నేనెప్పుడూ అనుకోలేదు... ‘భారతరత్న’ గురించీ అంతే! ఎవరికి ఏది ప్రాప్తమో అదే వస్తుంది. లతా మంగేష్కర్, భీమ్‌సేన్ జోషీ, బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరసియా, పండిట్ రవిశంకర్ లాంటి దిగ్గజాలూ, నేనూ కలిసి ఎన్నో వేదికలపై కచ్చేరీలు చేశాం. కానీ, దురదృష్టవశాత్తూ ఇవాళ ప్రతిదీ రాజకీయమైపోయింది.

ఈ ఆధునిక యుగంలో కర్ణాటక సంగీతానికి భవిష్యత్తు ఉందంటారా?
కర్ణాటక సంగీతం అనగానే మీరు గిరి గీసుకొని, సంకుచితంగా ఆలోచించకండి. చెవులకు ఇంపుగా ఉండేది అని ఆ మాటకు అసలైన అర్థం. కాబట్టి, శాస్త్రీయ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాలు ఏవైనా సరే, ఇంపుగా ఉంటే అది కర్ణాటక సంగీతమే. ప్రపంచమే ఓ కుగ్రామమైపోయి, సరిహద్దులు చెరిగిపోవడంతో, మునుపటితో పోలిస్తే ఈ తరానికి వేదికలు, అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కచ్చితంగా కర్ణాటక సంగీతానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. అయినా, కాలంతో పాటు వచ్చే మార్పులకు తగ్గట్లుగా కొత్త కూరలు వస్తాయి, రుచులు మారతాయే తప్ప, తినడమైతే మానేయం కదా! సంగీతమూ అంతే!

అన్నట్లు, మీకు అత్యంత ఇష్టమైన రాగం..?

 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే. వాటిలో ఏది ఎక్కువంటే చెప్పడం కష్టం.

కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమని విన్నట్టు గుర్తు..?
 (నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా!

అవును... రోజుకి ఎంత సేపు సాధన చేస్తుంటారు?
కచ్చేరీకి వెళ్ళేముందు ఒక రిహార్సల్ కానీ, ప్రాక్టీస్ కానీ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. మైకు ముందుకు వెళ్ళే వరకూ ఏం పాడతానో నాకే తెలియదు. కూర్చోగానే, ఇవాళ పాడాలి కదా, వీళ్ళందరినీ సంతోషపెట్టాలి కదా అనిపిస్తుంది. అంతే... సంగీతం, పాట వాటంతట అవే వస్తాయి. వాటికి నేను వాహికనవుతాను.

కానీ, ఇలా సాధన లేకుండా, అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని పాడేయడం..?
నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా ఉంటాను. పాట నా నోట పలుకుతుంది.

ఎందరికో సంగీతం నేర్పారు... వారసులు ఎవరంటారు?
నా బాణీని కొనసాగించే, ప్రతిభావంతులైన శిష్యులు ఎందరో ఉన్నారు. వారందరూ నాకు సమానమే. నా శిష్యుల్లో ఎవరో ఒకరు ఈ పరంపరను కొనసాగిస్తారు. కానీ, ఫలానావాళ్ళు నా వారసులని చెప్పలేను.. చెప్పకూడదు కూడా!

ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నవంబర్ 1న ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయొలిన్‌తో, మీరు గాత్రంతో రసానందంలో ముంచి తేల్చారని చదివా. కొత్త రాష్ట్రాల్లో కూడా ఆ భాగ్యం కలిగిస్తారా?
నన్ను ఆహ్వానిస్తే... తప్పకుండా వెళ్ళి, అవతరణ దినోత్సవాల్లో పాడతాను. సంగీతామృతాన్ని పంచుతాను.

గతంలోకి వెళితే... ఎన్టీఆర్‌తో మీ అనుబంధం? ఎన్టీఆర్ ముఖ్య మంత్రి పదవిలో ఉండగా, తెలుగు నేలపై పాడనని శపథం పట్టారే..?
ఎన్టీఆర్ మంచి నటుడు, గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ తన తప్పు తెలుసుకొని, పంథా మార్చుకొని, సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను.

కానీ, సంగీత, సాహిత్య, నాటక అకాడెమీలు పైరవీల మీద, ఆశ్రీతపక్షపాతం మీద నడవడం తప్పే కదా! అయినా అకాడెమీల అవసరం ఉందంటారా?

అకాడెమీలు ఇవాళ్టికీ అవసరమే. ఇక, వాటిలో జరిగే తప్పొప్పులు అంటారా... అవన్నీ జరిగితేనే కదా, ఎలా చేయాలి, ఎలా చేయకూడదనే అనుభవం వస్తుంది. తప్పు జరిగిందని మొత్తం వ్యవస్థనే వద్దనడం తప్పు కదా?!  


సినిమా రంగంతో కూడా మీది అవిస్మరణీయమైన అనుబంధం...
అక్కినేని, నా శిష్యురాలు ఎస్. వరలక్ష్మి నటించిన ‘సతీ సావిత్రి’  మొదలుకొని మొన్నామధ్య దాకా నన్ను అడిగినవాళ్ళకు పాడాను. అలాగే, ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’లో నారదుడిగా నటించాను. జి.వి. అయ్యర్ రూపొందించిన ‘హంస గీతె’ (కన్నడం), ‘ఆది శంకరాచార్య’ (సంస్కృతం), ‘మధ్వాచార్య’, ‘భగవద్గీత’ లాంటి చిత్రాలకు సంగీతం అందించాను. ఉత్తమ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులందుకున్నాను. బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు కనిపిస్తాను. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశాను.

మీ భార్యాపిల్లల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు..?
 నా భార్య పేరు అన్నపూర్ణ. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ సంగీతం వచ్చు. కానీ, సంపాదనలో స్థిరత్వం ఉండని ఈ రంగం వైపు రావద్దని సూచించాను. మా పెద్దమ్మాయి అమ్మాజీ హైదరాబాద్‌లో ఉంటుంది. పెద్దబ్బాయి అభిరామ్ ప్రింటింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. రెండో అమ్మాయి లక్ష్మి గృహిణి. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇక, ఆ తరువాత పిల్లలైన సుధాకర్, వంశీ మోహన్‌లు డాక్టర్లు. సుధాకర్ చెన్నైలోనే ఆదంబాక్కమ్‌లో ఎస్.పి.హాస్పిటల్ పేరిట పెద్ద ఆసుపత్రి నడుపుతూ బిజీగా ఉన్నాడు. వంశీ మోహన్ పేరున్న డయాబెటాలజిస్ట్. నాతోనే చెన్నైలో ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇక, నా ఆఖరు అమ్మాయి మహతి కూడా మద్రాసులోనే ఉంటోంది. ఇదీ నా కుటుంబం.

‘మహతి’ పేరు బాగా ఇష్టమా? మీ ఇంటికీ అదే పేరు పెట్టుకున్నారు..?

మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా... అందుకే, ఈ పేరు.
దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా భావితరాలకు అందించే ప్రయత్నంచేసిన నర్తకి సరస్వతి మరణించడం...(తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్! ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది.

మరి, మీ గాత్రంలోనే మీ కృతులన్నిటినీ వీడియో రికార్డు కూడా చేయాలన్న ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?
దాదాపు 500 రచనల్లో కొన్ని రికార్డు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆ పని జరుగుతోంది.

మీ పుట్టినరోజంటే, కచ్చేరీలు, ఇతర కళాకారులకు సన్మానాలతో సాగేవి. ఈ సారి ఎలా జరుపుకోబోతున్నారు?
నేనెప్పుడూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోను. అభిమానులే చేస్తుంటారు. ఈ సారి ‘సరిగమ’ సంస్థవారు 1950ల నుంచి ఇప్పటి దాకా నా రికార్డింగుల్లోని ఆణిముత్యాలన్నిటినీ ఏరి, ‘సెలస్టియల్ ట్రెజర్’ అని ఓ సీడీ విడుదల చేస్తున్నారు.

గడచిన 83 ఏళ్ళు మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తే, ఎలా బతకాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పటి బాల మురళీలాగానేనా?
నా 83 ఏళ్ళ జీవితంలో నాకు చేతనైనంత మంచే చేశాను. నాకు నచ్చినట్లుగా బతికాను. ఏం జరిగినా, అది నా మంచికే అనుకుంటా. ప్రతి క్షణం నాకు చిరస్మరణీయమే!

 - రెంటాల జయదేవ

....................................................