జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, September 8, 2010

మణిరత్నంకి మరో గుర్తింపు!




(ఫోటోల వివరం- 67వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విక్రమ్, మణిరత్నం, సుహాసిని; పురస్కారం అందుకుంటూ మణిరత్నం)
...................

దక్షిణ భారతదేశానికి వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం కీర్తికిరీటంలో మరో మణి వచ్చి చేరింది. చలనచిత్ర రూపకర్తలకు ఇచ్చే ‘జేగెర్ - లే కౌల్ట్రే గ్లోరీ టు ది ఫిల్మ్ మేకర్ అవార్డు’ అవార్డు ఆయనకు దక్కింది. ప్రపంచ ప్రసిద్ధ వెనిస్ చలనచిత్రోత్సవంలో భాగంగా ఈ గౌరవం ఇచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీ సోమవారం నాడు కాన్స్ లో మణిరత్నం తాజా చిత్రం ‘రావణ్’ ప్రదర్శనకు ముందు ఇదంతా జరిగింది. ఇలా ‘వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’లో ‘గ్లోరీ టు ది ఫిల్మ్ మేకర్ అవార్డు’తో గౌరవం పొందిన తొలి భారతీయుడు మణిరత్నమే.

ఈ అవార్డు ప్రదానోత్సవం ముగిసిన వెంటనే ‘రావణ్’ చిత్రాన్ని ప్రదర్శించారు. చిత్ర ప్రదర్శన పూర్తయ్యాక 600 మందికి పైగా ప్రతినిధులు లేచి నిలబడి, దాదాపు 5 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు చేశారట. ఈ ఉత్సవంలో ‘రావణ్’ హిందీ చిత్రాన్ని సైతం ప్రదర్శించారు.

వెనిస్ చలనచిత్రోత్సవం డైరెక్టర్ మార్కో ముల్లర్ మాట్లాడుతూ, ‘‘సమకాలీన భారతీయ సినిమాలోని అతి గొప్ప సృజనశీలురలో మణిరత్నం ఒకర’’ని ప్రశంసలు కురిపించారు. ‘‘సమకాలీన భారతీయ హిందీ చలనచిత్ర పరిశ్రమకు ఆటెర్ సిద్ధాంతాన్ని పరిచయం చేయడంలో మణిరత్నం దోహదం చేశార’’ని పేర్కొన్నారు. ‘‘ఉత్తమ భారతీయ చలనచిత్ర దర్శకుడైన మణిరత్నం కృషిని గుర్తించి, గౌరవిస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు.

ఈ ‘67. మోస్ట్రా ఇంటర్నేజనల్ డి ఆర్టే సినిమాటోగ్రాఫికా’ (67వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం)లో మణిరత్నంతో పాటు ఆయన భార్య - నటి సుహాసిని, ‘రావణ్’ చిత్ర నటీనటులు విక్రమ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ కూడా పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా, వచ్చే నెలలో (అక్టోబర్ లో) జరగనున్న పుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా రావణ్ (తమిళం), రావణ్ (హిందీ) చిత్రాలు పాల్గొంటున్నాయి. మొత్తం మీద రావణ్ చిత్రం మన దేశంలో ఎవరినీ పెద్దగా ఆకట్టుకోకపోయినా, మణిరత్నంకి అంతర్జాతీయ గౌరవాలు పెంచడంలో మాత్రం తోడ్పడినట్లే కనిపిస్తోంది.

0 వ్యాఖ్యలు: