జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, September 12, 2010

ఆత్రపడ్డ అభిమానులపై ఆకలిగా పడ్డ 'పులి'



(ఫోటో వివరం - ‘కొమరం పులి’గా పవన్ కల్యాణ్)
.................

పెద్ద హీరోల సినిమాలకు ఉండే ఇబ్బందే ఇది. కథ కోసం కాక, హీరో ఇమేజ్ కోసం ఆలోచించడం మొదలుపెడతారు. కోట్లు కుమ్మరించి, ఏళ్ళ తరబడి సినిమా తీస్తారు కానీ, తీరా కథకో, కథనానికో వచ్చేసరికి ఫలానా వర్గం వారి కోసమంటూ ఏవేవో అనవసరపు రాజీలకొస్తారు. వెరసి, సినిమాను అవకతవకగా మార్చేస్తారు. అందరి మీదకూ వదిలేస్తారు. దర్శక, నిర్మాతల పూర్వపుణ్యఫలం వల్లో, హీరో అదృష్టం వల్లో ఏవో కొన్నిసార్లు ఈ వంట ప్రేక్షకులకు రుచించవచ్చు. కానీ, చాలాసార్లు ఆ వంట చెడిపోవడం, చూసినవారి మతిపోవడం సర్వసాధారణం. పవన్ కల్యాణ్ ‘కొమరం పులి’ చిత్రం కూడా సరిగ్గా ఇదే సమస్యకు బాధితురాలైంది.

సమకాలీన తెలుగు అగ్ర హీరోల్లో సమాజం పట్ల కాస్తంత అక్కర, ఆవేశం ఎక్కువే ఉన్న నటుడు - పవన్ కల్యాణ్. ఆయన చదివే పుస్తకాల్లోనూ, మాటల్లోనూ ఆ సంగతి గమనించవచ్చు. ‘కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ లాంటి ఆలోచనలతో ఆ మధ్య ఆయన ఊగింది అందుకే. ఇలాంటి పవన్ ఆలోచనలనూ, ఆయన బాడీ లాంగ్వేజ్ నూ దృష్టిలో పెట్టుకొని అల్లుకున్న చిత్రం - ‘కొమరం పులి’. సామాన్యుల కష్టాలను పట్టించుకొని, వాళ్ళకు అండగా నిలవడమే పోలీసు ఉద్యోగానికి పరమార్థమని నమ్మిన ఓ సిన్సియర్ ఇండియన్ పోలీసు సర్వీస్ (ఐ.పి.ఎస్.) అధికారి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది.

కథా సంగ్రహం

పాతికేళ్ళ క్రితం 1985లో బి.కె. నాయక్ తండాలో కథ మొదలవుతుంది. కనిపించకుండా పోయిన పోలీసు అధికారి అయిన తన భర్త కోసం ఓ మహిళ ఆక్రోశిస్తుంటుంది. పోలీసుల దగ్గర న్యాయం జరగక పోగా, ఆ అధికారిని కనిపించకుండా చేసిన ముఠా నేత అల్ సలీమ్ (మనోజ్ బాజ్ పేయి) చేతిలో ఆమె చచ్చి బతుకుతుంది. అప్పటికే తన కడుపున పడిన బిడ్డను నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా పెంచాలని అడవిలోని అయ్యప్ప ఆలయం సాక్షిగా నిశ్చయించుకుంటుంది.

అలా ఆమెకు పుట్టి పెరిగిన బిడ్డే - ఐ.పి.ఎస్. అధికారి కొమరం పులి (పవన్ కల్యాణ్). ఇప్పటి కథాకాలానికి వస్తే -థాయిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని హత్య కోసం విద్రోహులు వేసిన వరుస పన్నాగాలను భగ్నం చేస్తాడు పులి. ప్రాణాలకు తెగించి, సాహసోపేతంగా తన ప్రాణాలు కాపాడిన పులిని అధికారికంగా సత్కరించబోతాడు ప్రధాన మంత్రి పి.వి. సమరసింహారావు (గిరీశ్ కర్నాడ్). అయితే, తనకు ఆ సత్కారం కన్నా, పోలీసు శాఖను సామాన్యులకు దగ్గర చేసి, వారి సమస్యలను తీర్చేందుకు అవకాశమివ్వమని హీరో అభ్యర్థిస్తాడు. ప్రధాని ఆమోదంతో ‘పులి టీమ్’ ఏర్పడుతుంది. కష్టంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రూపాయి పెట్టి ప్రత్యేక పబ్లిక్ బూత్ ల నుంచి ఫోన్ చేస్తే చాలు, ఆ టీమ్ రంగంలోకి దిగి, వారి కష్టాలను తీర్చేందుకూ, పోలీసుల నుంచి తగిన తోడ్పాటు లభించేందుకూ కృషి చేస్తుంటుంది.

కనిపించకుండా పోయిన తన కొడుకూ, పోలీసు ఇన్ స్పెక్టర్ అయిన హుస్సేన్ (దర్శకుడు ఎస్.జె. సూర్య) కోసం ఆవేదనతో ఓ అమ్మ ఫోన్ చేస్తుంది. అతని జాడ కనిపెడతానని ఆమెకు మాట ఇస్తాడు పులి. హుస్సేన్ ఆఖరుగా అందుకున్న ఫోన్ కాల్ అప్పటికి అంతర్జాతీయ మాఫియా నేతగా ఎదిగిన అల్ సలీమ్ వాళ్ళ ఆఫీసు నుంచే వచ్చింది కాబట్టి, అతని వెంట పడతాడు హీరో. అయితే, ఆ ఫోన్ చేసింది తానే అనడానికి సాక్ష్యం ఏమిటంటాడు ఆ విలన్. సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్న హీరో ‘నో పార్కింగ్’లో ఉన్న విలన్ బెంజి కారును స్టేషన్ కు పట్టుకెళతాడు. ఆ కారు వెనక్కి తెచ్చి ఇవ్వాలని పంతం పడతాడు విలన్. హుస్సేన్ సంగతి చెబితేనే ఇస్తానంటాడు హీరో. ఆ పంతం అలా సాగుతుండగా, కోటిన్నర రూపాయల ఆ కారు గురించి హీరో తీగ లాగేసరికి డొంకంతా కదులుతుంది.

ప్రధాని మీద హత్యాయత్నం చేసి, ఇంటర్ పోల్ ఎదురుదాడిలో మరణించాడనుకుంటున్న నిక్సన్ కూ, అల్ సలీమ్ కూ ఉన్న సంబంధం గురించి బయటకొస్తుంది. నిక్సన్ నిజంగా చనిపోతే, అతని వీసా మీద భారత్ కు వచ్చినదెవరు లాంటి అనుమానాలు రేకెత్తుతాయి. ఆ గుట్టుమట్లను హీరో ఎలా బయటపెట్టాడనే కథనంతో కథ క్లైమాక్స్ కు వెళుతుంది. హుస్సేన్ నే కాదు, ఇన్ స్పెక్టరైన తన తండ్రిని కూడా గతంలో చంపింది ఈ అల్ సలీమే అన్న సంగతి హీరోకు ఎలా తెలిసింది, ఏం చేశాడన్నది పతాక ఘట్టం.

ఈ అసలు కథ మధ్యలో పిట్టకథ - హీరోను అమితంగా ప్రేమించి, అతణ్ణి బుట్టలో వేసుకొనే మధుమతి (తెలుగు తెరకు తొలి పరిచయం నిఖిషా పటేల్) ప్రహసనం. సినిమాలో ఉన్న రొమాన్సయినా, కామెడీ అయినా ఆ సన్నివేశాలే.

(మిగతా భాగం మరికాసేపట్లో...)

0 వ్యాఖ్యలు: