జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, February 6, 2012

తొలి తెలుగు సినిమా పుట్టిందెప్పుడు? - అసలు చరిత్ర ఏంటి?- - టి.వి 9లో స్టోరీ

ఈ అంశంపై నా పరిశోధనను పేర్కొంటూ, టి.వి - 9 చానల్ ఇవాళ ప్రసారం చేసిన ప్రత్యేక వార్తా కథనం లింకు ఇదుగో....





తొలి పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదలై ఇవాళ్టికి, అంటే ఈ 2012 ఫిబ్రవరి 6వ తేదీకి సరిగ్గా 80 ఏళ్ళు. ఇంతకాలం ఈ సినిమా 1931లో విడుదలైందని అనుకుంటూ వచ్చారు చాలామంది. అలాగే, విడుదల తేదీ సెప్టెంబర్ 15 అంటూ సాక్ష్యాధారాలేవీ లేని ఓ ప్రచారం జరుగుతూ వచ్చింది. అదే అందరం నమ్మాం. కానీ, ఆ నమ్మకం తప్పు అని నా పరిశోధన తేల్చింది.

ముందుగా దర్శకుడు హెచ్. ఎం. రెడ్డి సగం తెలుగు - సగం తమిళంలో డైలాగులు, పాటలున్న కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పటి పత్రికలన్నీ ఆ చిత్రాన్ని తొలి తమిళ - తెలుగు టాకీ అనే పేర్కొన్నాయి. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ఆ సినిమా విజయవంతమయ్యాక, పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలని తనకు ఆలోచన వచ్చినట్లు స్వయంగా ఆయనే ఇంటర్వ్యూల్లో చెప్పారు, వ్యాసాల్లో రాశారు.

ఆ రకంగా 1931లో నిర్మాణం మొదలైన పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద బొంబాయిలో చిత్రీకరణ జరుపుకొంది. అక్కడే సెన్సారింగూ పూర్తి చేసుకుంది. 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారైన ఆ సినిమా, సరిగ్గా పక్షం రోజులకు బొంబాయిలోనే న్యూ ఛార్నీ రోడ్డులోని కృష్ణా సినిమా హాలులో విడుదలైంది. అలా ఆ సినిమా తొలి విడుదల తేదీ 1932 ఫిబ్రవరి 6. అంటే, ఇవాళ్టితో మన తొలి తెలుగు సినిమాకు 80 ఏళ్ళు నిండాయన్నమాట.

ప్రామాణికమైన సాక్ష్యాధారాలు సేకరించి, అవి ప్రత్యక్షంగా చూపిస్తూ నేను చేసిన ఈ పరిశోధనను సినీ విమర్శకులు, చరిత్రప్రేమికులు వి.ఏ.కె. రంగారావు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, వకుళాభరణం రామకృష్ణ లాంటి వారు స్వయంగా చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమా జన్మదినం ఫిబ్రవరి 6న జరుపుకోవడమే సముచితమని అంగీకరించారు. మరి, ఇక నుంచైనా మన సినీ చరిత్రకారులు, పరిశ్రమ పెద్దలు ఈ అంశంపై దృష్టి సారిస్తారా....!?

Saturday, December 10, 2011

నిజం చెబితే నేరమా?




‘శ్రీరామరాజ్యం’పై ఇష్టపదిలో రాసిన మూడు భాగాల సమీక్షపై వచ్చిన ప్రశంసలకు కానీ, విమర్శలకు కానీ వెంటనే స్పందించలేకపోయాను. సమీక్ష రాస్తున్న నాటికే ఉన్న పని ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు మరికొంత పెరగడంతో, తీరిక చేసుకొని తాపీగా స్పందించాలన్న ఆలోచన సఫలం కాలేదు. ఏమైనా, అందుకు ముందుగా మన్నించాలి. ఆ హడావిళ్ళ మధ్యనే ఈ నాలుగు మాటలు...


విషయానికి వస్తే, సినిమా చూశాక అందులో కనిపించిన, అనిపించిన తప్పొప్పుల గురించి మాట్లాడుకోవడం మామూలుగా ఎవరమైనా చేసే పనే. సినిమా గురించి సమీక్షిస్తున్నప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా చేయాల్సిన పని. ఆ మధ్య తాజా ‘శ్రీరామరాజ్యం’ సినిమా గురించి ఈ ‘ఇష్టపది’ బ్లాగులో అదే చేశాను. కానీ, చిత్రంగా ఈ విషయానికి చాలా మందికి కోపాలు వచ్చాయి. కొందరేమో నన్ను, నా సమీక్షనూ దుమ్మెత్తి పోశారు. ఆవేశంతో ఊగిపోయిన వీరవరులేమో ఏకంగా వ్యక్తిగత జీవితాలపై విమర్శలకూ దిగారు. శ్రీరామరాజ్యం దర్శక, రచయితలకూ, హీరోకూ అపారంగా ఉన్న భక్త జనగణం ఎనానిమస్ గా ప్రచురణార్హం కాని వ్యాఖ్యలూ చేశారు.

సినిమా బాగోగుల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. అందులో అందరి అభిప్రాయాలూ, అన్ని అభిప్రాయాలూ ఒకటేలా ఉండాలన్న రూలూ ఏమీ లేదు. ఏకీభవించడానికి ఎంత అవకాశం ఉందో, అవతలివారి అభిప్రాయంతో గౌరవపూర్వకంగానే విభేదించడానికీ అంతే స్వేచ్ఛ ఉంది. కానీ, విభేదించినంత మాత్రాన దూషణలు, దోషారోపణలు చేయడమన్నది వారి వారి సంస్కారానికి సంబంధించిన విషయం.

ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా ఆ చిత్రం మీద కానీ, ఆ చిత్రానికి పని చేసిన వారి మీద కానీ రాగద్వేషాలు లేకుండా సినిమాను సమీక్షించడం శాస్త్రీయమైన, సమర్థనీయమైన పద్దతి. అది ఎంత చక్కగా చేస్తే, అంత నిష్పాక్షికంగా సమీక్ష ఉంటుందనేది విజ్ఞులకు చెప్పనక్కరలేదు. శ్రీరామరాజ్యంపై ఈ సమీక్షకుడు ఇష్టపదిలో చేసిందీ అదే. పైగా, మన తెలుగు జాతికి కల్ట్ ఫిగర్లయిన బాపు - రమణలంటే గౌరవం, వారి సృజనాత్మక కృషి పట్ల అభిమానం, వారి స్నేహ సౌశీల్యాలతో సన్నిహిత పరిచయం ఉన్నా, వీలైనంత వరకు అవేవీ అవరోధం కాకుండా, శ్రీరామరాజ్యం సినిమాను సమీక్షించాలని ప్రయత్నించడం జరిగింది.

కానీ, ఫలానా వారి సినిమా కాబట్టి, ఫలానా తరహా (పౌరాణికం, జానపదం, వగైరా వగైరా) సినిమా కాబట్టి, ఫలానా కథాంశం మీద కాబట్టి ఎలా ఉన్నా సరే బాగుందనే అనాలంటే, ఇక దానిలో చర్చ లేదు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలోని లోటుపాట్ల గురించి చేదు నిజాలు చెబితే, ఆ లోటుపాట్ల మీద మాట్లాడకుండా, నాకు నచ్చింది కాబట్టి, నచ్చలేదనడానికి నువ్వెవడివి అంటూ ఒళ్ళంతా కారం పూసుకొంటే చెప్పగలిగిందేమీ లేదు. తేటతెలుగులో తిట్టినా, తిట్టుకున్నా లాభం లేదు.


పాత్ర చిత్రణలోనైనా, చిత్రీకరణలోనైనా, సాంకేతికంగానైనా లోటుపాట్ల గురించి చర్చించుకొంటే, సినిమా మీద అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతుంది. అలా కాకుండా రాజుగారి దేవతా వస్త్రాల కథలో లాగా డూడూ బసవన్నలా ఉందామంటే.... ఏ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అందామంటే.... పుంజాలు తెంపుకొని ఏ దర్శకుడికి, ఆ దర్శకుడికి, ఏ హీరోకు ఆ హీరోకు భట్రాజుల్లా వ్యవహరిద్దామంటే.... దానికి మళ్ళీ బ్లాగులెందుకు? ఇప్పటికే ఉన్న కొన్ని భజన పత్రికలు, చానళ్ళు చాలవా?


ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు --- అది సమీక్షలు రాయడంలోనైనా..! పోస్టు వేయడంలోనైనా..! వ్యాఖ్యలు, ప్రశంసలు, విమర్శలు రాసినవాళ్ళకీ, రాళ్ళు విసిరిన వారికీ - అందరికీ కృతజ్ఞతలు.

Tuesday, November 29, 2011

‘శ్రీరామరాజ్యం’ - చేజారిన మహదవకాశం?



(‘శ్రీరామరాజ్యం’ సినిమా సమీక్ష - పార్ట్ 3)

(మునుపు రాసినవేమో...

పార్ట్ 1 - ‘రామరాజ్యమంటే ఇదా...!?’,
పార్ట్ 2 - ‘శ్రీరామరాజ్యం - చిన్న లోపాలే పెద్ద శాపాలా?

ఆ రెండు పోస్టులకు కొనసాగింపుగా ఇది చివరి భాగం)



పౌరాణికాలకు పెట్టింది పేరైన మన తెలుగు చిత్ర పరిశ్రమలో 14 ఏళ్ళ తరువాత వచ్చిన పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం - ఈ 'శ్రీరామరాజ్యం'. దీనికి ముందు తెలుగులో ఆఖరుగా వచ్చిన నేరు పౌరాణిక చిత్రం చిన్న ఎన్టీయార్ పసివయసులో రాముడిగా నటించిన బాలల చిత్రం 'రామాయణం' (1997). ఆ తరువాత వచ్చిన 'శ్రీరామదాసు', 'పాండురంగడు' లాంటివి పూర్తి పౌరాణిక చిత్ర వర్గంలోకి రావు. చిరంజీవి 'శ్రీమంజునాథ' పౌరాణికమైనా, అది అనువాద చిత్రం. మీడియాలో ఒక వర్గం మాత్రం 'రామాయణం' కన్నా ఏడాది ముందే బాలకృష్ణ నటించిన విజయా వారి 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) చిత్రాన్నే ఆఖరుగా వచ్చిన పౌరాణిక చిత్రంగా పేర్కొంటూ, 'శ్రీరామరాజ్యం' ప్రచార కథనాలు ఇటీవల ప్రసారం చేసింది. ఏమైనా, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న భారీ పౌరాణిక చిత్రంగా సహజంగానే 'శ్రీరామరాజ్యం' పై అందరిలో ఆసక్తి, తెలుగుదనానికి ప్రతీకలైన బాపు - రమణల చిత్రం కావడంతో కొన్ని అంచనాలు నెలకొన్నాయి. పైగా, పెరిగిన సాంకేతికత నేపథ్యంలో వస్తున్న మహదవకాశమైన ఈ భారీ పౌరాణికానికి పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు పనిచేశారు.

సంగీతం, సాహిత్యం, నృత్యాల శ్రమ ఫలించిందా ?

సంగీతం ఇళయరాజా అందించారు. పాటలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశారు. ఇళయరాజా సంగీతంలో ఒకటి, రెండు పాటల్లో తప్ప, మిగిలిన చోట్ల మునుపటి మ్యాజిక్ లేదు. 'సాగర సంగమం' లాంటి కొన్ని చిత్రాల్లో ఇప్పటికీ చెప్పుకొనే ఆయన మార్కు రీ-రికార్డింగు 'శ్రీరామరాజ్యం'లో వినిపించదు. ఉదాహరణకు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో రాజమందిరంలో రాముడు వేదనాపూర్వకంగా సంభాషించే సన్నివేశం లాంటివి చూస్తే, రీ-రికార్డింగ్ జరపడానికి ముందే రీలు హాలుకు వచ్చేసిందేమో అనిపిస్తుంది. రీ-రికార్డింగ్ కి అంటూ హంగేరీకి కూడా వెళ్ళి వచ్చిన ఇళయరాజా బృందం అక్కడ ప్రత్యేకంగా చేసినదేమిటమని అనుమానం కలుగుతుంది.

కవి, పండితుడైన జొన్నవిత్తుల పాటల్లో 2, 3 వినగా, వినగా బాగున్నాయి. 'జగదానంద కారకా... జయ జానకీ ప్రాణనాయకా... ' అన్న త్యాగరాయ కీర్తన మకుటంతో రాసిన పల్లవి సినిమా రిలీజుకు ముందు నుంచే తెలుగు నాట ఇంటింటా మారుమోగింది. ఇక, 'దేవుళ్ళే మెచ్చింది... మీ ముందే జరిగింది... ' అంటూ లవకుశులు చేసే రామాయణ గానం కూడా విన్నకొద్దీ ఎక్కే పాట. అందులో ముఖ్యంగా సీతకు అగ్నిపరీక్ష సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాసిన '...ఎవ్వరికీ పరీక్ష, ఎందులకీ పరీక్ష, ...రాముడి ప్రాణానికా, జానకి దేహానికా.... ' లాంటి వాక్యాలు మనసుకు తాకుతాయి. సీతను అడవిలో వదిలే సమయంలో వచ్చే విషాద గీతం 'గాలి..నింగి..నీరు... ' కూడా ఇళయరాజా బాణీలో, భావోద్వేగాలను పండించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వాణిలో కదిలిస్తుంది. శ్రేయా ఘోశల్ లాంటి గాయనీ గాయకులు ఈ చిత్ర గీతాలను బాగానే పాడారు.

అయితే, వచ్చిన చిక్కేమిటంటే, మొత్తం మీద పాటల్లో సాహిత్యం బాగున్నా, కథకు కావాల్సిన ఆర్తి, ఆవేదన, ఆవేగం అన్ని చోట్లా పలకలేదు. పైగా, విడిగా వినప్పటి కంటే, తెరపై దృశ్యంతో కలసి విన్నప్పుడు వాటి స్థాయి మరికొంత తగ్గిందేమో అనిపిస్తుంది. ఇక, ఆల్ టైమ్ హిట్లుగా నిలిచిన 'లవకుశ'లోని 'శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా... ', 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...' లాంటి పాటలతో పోలికలు రానే వస్తాయి. అదీ ఓ ప్రతికూలతే. అన్నట్లు ఈ చిత్రానికి మొదట్లో వెన్నెలకంటితో 2 పాటలు, కొన్ని పద్యాలు కూడా రాయించారు. రికార్డు కూడా చేసినట్లున్నారు. మరి, సినిమాలో అవేవీ లేవు. జొన్నవిత్తులదే సింగిల్ కార్డు. దీనికి వెనుక కథేమిటో తెలియదు.

ఈ చిత్రానికి డ్యాన్స్ మాస్టర్ సీనియర్ టెక్నీషియన్ శ్రీను. అయితే, ఈ సినిమాలోని నృత్యగీతాలు, ముఖ్యంగా రాముల వారి అయోధ్యా నగర ప్రవేశం, సీతమ్మవారి సీమంతం పాటలకు కంపోజ్ చేసిన బృంద నృత్యాలు పౌరాణిక సినిమాలకు తగ్గట్లుగా అనిపించవు. పైగా శాస్త్రానుసారం రంగస్థలి మీద ఉండకూడని లోపాలూ ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్య తార (ల)ను మధ్యలో పెట్టుకొని, బృంద నర్తకులు చుట్టూ తిరిగి నర్తిస్తున్నప్పుడు కథకూ, సినిమాకూ ప్రధానమైన ఆ ముఖ్య తారలు, వారి ముఖాలు కనపడాలి కదా. వారు కనపడరు సరి కదా, ఈ బృంద నర్తకుల పృష్ఠ భాగాలు తెరపై తారట్లాడుతూ, చూపరులకు చెప్పుకోలేని చీకాకు కలిగిస్తాయి.

అతుకుల బొంతగా ఆధునిక సాంకేతికత

జి.జి. కృష్ణారావు కూర్పు అద్భుతాలు, ఆశ్చర్యాలు లేకుండా, సాఫీగా సాగిపోతుంది. కళా దర్శకత్వానికి వస్తే - ఎస్. రవీందర్, కిరణ్ కుమార్ లు ఆ బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా, వాల్మీకి ఆశ్రమం (కళా దర్శకుడు ఎస్. రవీందర్), అయోధ్య రాజమందిరం లాంటివి పూర్తి స్థాయి అచ్చమైన సెట్లయితే, మిగిలినవి కొద్దిగా వేసిన సెట్ కు, మిగతా భాగం విజువల్ ఎఫెక్టులు జోడించిన వర్చ్యువల్ సెట్లు.

సుమారు రెండుమ్ముప్పావు గంటల ఈ సినిమాలో దాదాపుగా రెండుంబావు గంటల దాకా గ్రాఫిక్స్ ఉన్నాయి. అందు కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు - ఏకంగా నాలుగు సంస్థల వారు (ఇ.ఎఫ్.ఎక్స్, పిక్సెలాయిడ్, మకుట, ఆరెంజ్ మీడియా) శ్రమించారు. కానీ, తెరపై తుది ఫలితం మాత్రం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. అయోధ్యా నగర వీధులు, రాజ ప్రాసాదంలో కోటంత ఎత్తు గోడలు, ద్వారాలు, తలుపులు వగైరాలన్నీ కంప్యూటర్ లో రూపొందించిన వర్చ్యువల్ సెట్లే. ఇలాంటి వర్చ్యువల్ సెట్లు సైతం కంటికి తేడా తెలియకుండా గ్రాఫిక్స్ లో నేర్పుగా చేసిన తీరు మనం మునుపటి ‘అరుంధతి’, ‘మగధీర’ (2009) చిత్రాల్లో చూశాం. కానీ, ‘శ్రీరామరాజ్యం’లో మాత్రం ఈ గ్రాఫిక్స్ విశ్వామిత్ర సృష్టి సెట్స్ లో చాలా భాగం సహజంగా లేవు. నాటకాల్లో, పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పరిసర వాతావరణాన్ని సృష్టించడానికి గుడ్డ మీద వేసిన బొమ్మలను వాడినట్లుగా ఉంది.

పైగా, కెమేరా కంటి (ప్రేక్షకుడి) దృక్కోణానికి కానీ, సన్నివేశంలోని పాత్రధారులు నిలబడిన తలానికి సారూప్యంగా కానీ, వారి కదలికలకు తగ్గట్లుగా కానీ ఈ బ్లూ మ్యాట్ ద్వారా సృష్టించిన గ్రాఫిక్ సెట్లు లేవు. ఒకరకంగా ఇవి ఆధునిక సాంకేతికతలోనూ మనం ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నామని చెప్పకనే చెబుతాయి.

ఇక, అయోధ్యలోని రాజమందిర అంతర్భాగంలోని సూర్య భగవానుడి భారీ విగ్రహం మనవాళ్ళ అరకొర గ్రాఫిక్స్ లో మెల్లకన్నుతో సాక్షాత్కరిస్తుంది. పైగా, సినిమాలో ఓ సన్నివేశంలో దాన్ని మిడ్ క్లోజప్పులో చూపేసరికి, హాలులో ప్రేక్షక జనం హాహాకారం చేయడం ఒక్కటే తక్కువ. ఆ మందిరంలో రాముడి పూర్వీకులైన రఘువంశ రాజుల విగ్రహాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క విగ్రహం మాత్రం చేతిలో ధనుస్సుతో 'సత్య హరిశ్చంద్ర' సినిమాలోని పెద్ద ఎన్టీయార్ పోలికలతో చూడగానే, గుర్తుపట్టేలా ఉంటుంది.

జంతు సంక్షేమ మండలి కఠిన నిబంధనలైతేనేం, ఈ రోజుల్లో పెరిగిన ఖర్చు వల్ల అయితేనేం ఈ సినిమాలో వాల్మీకి ఆశ్రమంలో కనిపించే లేళ్ళు, జింకలు, నెమళ్ళు వగైరాలన్నీ గ్రాఫిక్స్ సృష్టే. అయితే, వాటిని సరిగా దృశ్యంలో అతకకపోవడంతో, జింకల పక్కనే, వాటి కొమ్ముల మధ్య నుంచి పాత్రధారులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూడా కంప్యూటర్ సృష్టికీ, కెమేరా కంటితో పాత్రధారుల మీద తీసిన దృశ్యానికీ పర్ స్పెక్టివ్ లో తేడా తెలుస్తుంటుంది. రథంలో లక్ష్మణుడు, సీతను అడవికి తీసుకువెళ్ళే దృశ్యంలో వచ్చే టాప్ యాంగిల్ షాట్లకూ ఇదే తంటా వచ్చింది.

కెమేరాతోనూ కొరవడిన తృప్తి

ఇటీవల కాలంలో బాపు చిత్రాలు, ‘శ్రీభాగవతం’ సీరియల్ కు పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ పి.ఆర్.కె. రాజు గారే ఈ చిత్రానికీ ఛాయాగ్రాహకులు. పాత్రధారులను చూపిన తీరు, లైటింగ్ వగైరాల్లో కెమేరా పనితనం బాగుందనిపిస్తుంది. బాపు మార్కు క్లోజప్పులు సరే సరి. కానీ, ఇద్దరు పాత్రధారుల మధ్య సాగే సంవాదాల లాంటి దృశ్యాల్లో కెమేరా తేలిపోయింది.

పాత్రధారుల్లో ఒకరు కెమేరాకు దగ్గరగా ముందు, వేరొకరు కెమేరాకు కాస్త దూరంగా వెనుక ఉన్నప్పుడు కెమేరాను స్థిరంగా ఉంచి, డైలాగు చెబుతున్న పాత్రధారి మీదకు లెన్సును ఫోకస్ పెట్టడం సాధారణంగా ఆనవాయితీ. డైలాగు చెప్పే అతను ఫోకస్ లో, డైలాగు లేని రెండో పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఒకే ఫ్రేములో కనిపించడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కెమేరా కదలకుండా ఉంటూనే, డైలాగు చెప్పే పాత్రధారి మారినప్పుడల్లా ఆ పాత్ర మీదకు ఫోకస్ మాత్రం మారుతూ వస్తుంది. ఈ ప్రాథమికమైన పద్ధతిని పాటించకుండా, కెమేరాతో పాటు ఫోకస్ ను కూడా కదపకుండా అలాగే ఉంచేసిన దృశ్యాలు 'శ్రీరామరాజ్యం'లో కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దాంతో, కొన్నిసార్లు డైలాగు చెబుతున్న పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఉంటాడు. అందుకే, ఇంతటి బ్రహ్మాండమైన నిర్మాణ విలువలున్న భారీ బడ్జెట్ సినిమాలోనూ, ఈ లోపాలు ప్రేక్షకుడికి రసభంగం కలిగిస్తాయి. తెలియని అసంతృప్తిని కలిగిస్తాయి.

నిజాయితీ, నిర్మాణ విలువలే శ్రీరామరక్ష

78 ఏళ్ళ వయసులోనూ దర్శకుడిగా బాపు తన మార్కు చూపడానికి తపించారు. ప్రతి ఫ్రేమునూ సౌందర్యభరితంగా చూపాలని ప్రయత్నించారు. తనకు మాత్రమే ప్రత్యేకమైన ఫ్రేములతో దృశ్యాలను కన్నులపండుగ చేశారు. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ముళ్ళపూడి వెంకట రమణ సామాన్య జనభాషలో రచన చేశారు. ఒకటి, రెండు చోట్ల తన కలంలో మెరుపులూ మెరిపించారు.

కానీ, కథను తెరపై నడిపిన తీరులో, అందుకు ఎంచుకున్న ఘట్టాల్లో క్రమానుగత పరిణామం, రసావిష్కరణకు ప్రాతిపదిక, ఆ దిశగా ప్రయాణం, తుది ఫలితం సమగ్ర రూపం ధరించలేదు. ఈ కథ మొత్తాన్నీ సింహావలోకనం చేస్తే - కథలోని పాత్రలకు ఎదురయ్యే సమస్యకు మూలం - సీతపై లోకనింద. దానికి వెరచిన రాముడి ప్రతిస్పందన ఏమిటంటే - సీతాపరిత్యాగం. అంటే ఆ యాక్షన్ కు రాముడి రియాక్షన్ అది. దాని పర్యవసానం - భార్యాభర్తల వియోగం, రాముడికీ, సీతకూ మానసిక సంఘర్షణ. ఈ చిక్కుముడిని విడదీసే ముగింపు - రాముడు, లవకుశులు తమ బాంధవ్యం తెలుసుకొని కలుసుకోవడం.

స్క్రిప్టుకు ప్రధానమైన ఈ అంశాల్లో రాముడి మానసిక సంఘర్షణ, భర్తృ వియోగ బాధతో సీతా సాధ్వి వేదన, తల్లితండ్రులు అని తెలియకుండానే శ్రీరాముడి మీద, సీతమ్మ మీద లవకుశులు గౌరవ అనురాగాలు పెంచుకోవడం, రాముడు సీతమ్మను కారడవుల పాలు చేశాడని తెలిసి సాక్షాత్తూ ఆయననే తిరస్కరించడం లాంటివి ఎంత బాగా ఎలివేట్ అయితే, తెరపై కథ అంత బాగా పండుతుంది. దానికి బాల లవకుశుల చేష్టలతో అద్భుత, హాస్య రసాలు కూడా తగు పాళ్ళలో చేరిస్తే మరింత బాగుంటుంది. కానీ, ఈ చిత్రంలో అవన్నీ దేనికవిగా మిగిలాయి. కలసికట్టుగా కుదరలేదు. పైగా, మామూలు ఘట్టాలుగానే వచ్చాయి తప్ప, మనస్సును ఆర్ద్రపరిచే అనుభవాలుగా మారలేదు.

సినిమా అనేది నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషి అయిన సమాహార కళ కావడంతో ఏ విభాగంలోని ఏ చిన్న లోపమైనా, ఇతర విభాగాలపై ప్రభావం చూపుతుంది. అది అనివార్యం. 'శ్రీరామరాజ్యం'కూ అదే జరిగింది. ఇంతటి ప్రచార ఆర్భాటంలోనూ, దేవతా వస్త్రాల కథలో లాగా అందరి ఆహా ఓహోల మధ్యలోనూ సినిమాకు ప్రేక్షకులూ, వసూళ్ళూ తక్కువగా ఉండడానికి కారణం అదే.

ఈ సినిమాకు సంబంధించి మారు మాట్లాడకుండా మెచ్చుకోవాల్సింది మాత్రం - నిర్మాతనే. లాభనష్టాల ధ్యాస లేకుండా, ఈ కథను ఈ తరం వారికి అందించాలన్న ఆయన కృత నిశ్చయానికి జోహార్లు. అందుకోసం ఆయన సర్వశక్తులూ కేంద్రీకరించి చేసిన వ్యయం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పౌరాణిక చిత్రం ఈ రోజుల్లో ప్రతి ఫ్రేములో ఇంత రిచ్ గా కనబడడానికి ఆయనే కారణం. యూనిట్ ను నమ్మి ఆయన పెట్టిన ప్రతి పైసానూ తెర మీద కళకళలాడే దృశ్యాల్లో చూడవచ్చు. కరెన్సీ కట్టల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరం కోసం, ఇలాంటి చిత్రం తీయాలనే ఈ రకం నిర్మాత ఉండడమే పెద్ద విచిత్రం, విశేషం. తమ ఊళ్ళోని ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి నమ్ముకొని ఆయన ఇంత సాహసం చేశారు. ఆ భక్తి శ్రద్ధలూ, నిజాయితీలే ఆయనకూ, ఈ సినిమాకూ శ్రీరామరక్ష. ఆయన కోసమైతే ఈ సినిమా అందరం తప్పనిసరిగా చూడాల్సిందే. ఉత్తర రామాయణ గాథను బాపు - రమణల బాణీలో ఈ తరం పిల్లలకూ చూపాల్సిందే.

కొసమెరుపు --

పౌరాణిక చిత్రాలతో ఇంటింటా దేవుడిగా వెలిసిన పెద్ద ఎన్.టి.ఆర్.కు నిజజీవితంలో వీపు మీద ఎడమవైపున చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది. ఆయన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది. గమ్మత్తేమిటంటే, ఆయన కుమారుడైన బాలకృష్ణకు ఈ సినిమాలో కావాలని వీపు మీద పెట్టుడు పుట్టుమచ్చను మేకప్ లో సృష్టించారు. అయినా వారసత్వ హీరోల వెర్రి కానీ, ఈ పెట్టుమచ్చలతో పెద్దాయనను అనుకరించే కన్నా, ఆ అనుకరణేదో ఇలాంటి పాత్రపోషణ సందర్భంలో ఆయన పాటించే నియమాలు, చేసే కఠోర పరిశ్రమలో ఉండి ఉంటే, ఈ ముదురు రాముడు కూడా తెరపై మరింత అందంగా ఉండేవాడేమో...!?

అన్నట్లు, 'శ్రీరామరాజ్యం' చిత్ర నిర్మాణం మొదలైనప్పుడు ఈ సినిమాలో భరతుడి పాత్ర సాయికుమార్ పోషిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. తీరా ఏమైందో కానీ, సినిమా విడుదలయ్యాక తెర మీద మాత్రం భరతుడి పాత్రలో నటుడు సమీర్ కనిపించారు. అయితే, ఈ సినిమా గురించి టీవీల్లో, పేపర్లలో, ఇంటర్నెట్ లో విపరీతమైన హడావిడి చేస్తున్న మీడియాలో కొందరు సినిమా విడుదల రోజు దాకా భరతుడిగా సాయికుమార్ అని రాస్తూ వచ్చారు. అంతే కాదు, తీరా సినిమా విడుదలయ్యాక కూడా ఇప్పటికీ భరతుడిగా సాయికుమార్ నటించినట్లు రాస్తూనే ఉండడం చిత్రాతిచిత్రం. విడుదలకు ముందు వివరాలు కనుక్కొని రాయకపోతే మానె, కనీసం విడుదలై కళ్ళారా సినిమా చూశాకైనా తప్పు దిద్దుకోకపోతే.... ఇంకేమనాలి..!?

రామ......! రామ.....!

Monday, November 28, 2011

‘శ్రీరామరాజ్యం' - చిన్న లోపాలే పెద్ద శాపాలా?




(‘శ్రీరామరాజ్యం' సినిమా సమీక్ష - పార్ట్ 2. 'రామరాజ్యమంటే ఇదా...!?' పోస్టుకు ఇది తరువాయి భాగం)

నటనను మించిన డబ్బింగ్

‘శ్రీరామరాజ్యం'లో సీతగా నయనతార కనిపిస్తారు. ఆ పాత్రకు ఆమెను తీసుకున్నప్పటి నుంచి ఎన్నెన్ని చర్చలు జరిగాయో తెలిసిందే. కానీ, కురచ దుస్తుల్లో కమర్షియల్ చిత్రాల్లో కనిపించే నయన తారను కూడా సీత పాత్రకు తగ్గట్లుగా, ఒడుపుగా తీర్చిదిద్దడం విశేషమే. సినీ జీవితంలో నభూతో నభవిష్యతి అవకాశమిదని గ్రహించిన నయనతార సైతం దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. గొంతు ఎలాగూ డబ్బింగే కాబట్టి, తాను చేయగలిగిందల్లా ఆంగికాభినయం ద్వారా తాను చేయగలిగినదంతా చేశారు. ఆ మేరకు ఆమెకు మార్కులు వేయాల్సిందే. కానీ, ఆమె పాత్రలోని మానసిక సంఘర్షణను వెల్లడించేలా తెరపై పండే సీన్లు స్క్రిప్టులోనూ పెద్దగా లేవు. ఉన్న ఒకటీ అరా సీన్లలో ఆమెకున్న పరిమితులూ తెలిసిపోతుంటాయి.

నయనతారకు ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి సునీత గాత్రదానం చేశారు. సునీత మరీ అతిగా ప్రయత్నించడం వల్లనో ఏమో, అసలు అభినయం కన్నా కొసరు స్వరానిదే పైచేయి అయింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని 'శ్రీరామదాసు' (2006) చిత్రంలో రామదాసు భార్య కమల పాత్రధారిణి స్నేహకు డబ్బింగ్ చెప్పినప్పుడు సరిగ్గా అతికినట్లున్న సునీత గళం ఈ చిత్రంలో మాత్రం ఇడ్లీ కన్నా చట్నీ ఎక్కువైన ఫీలింగ్ కలిగించింది.

అక్కినేని పాత్రలో వాల్మీకి

చాలా ఏళ్ళ తరువాత అక్కినేని నాగేశ్వరరావు తెరపై కనిపించారు. అదీ పౌరాణిక పాత్రలో - వాల్మీకిగా. ఎనిమిది పదుల పై చిలుకు వయసొచ్చిన ఏయన్నార్ రెండు గాత్రాలూ (అటు శరీరమూ, ఇటు గొంతు) అదుపు తప్పినా, తన అనుభవంతో ఈ పాత్రను నడిపేశారు. మొదట కాసేపు ఆ గెటప్, ఆ వాచికం ప్రేక్షకుడికి కొత్తగా అనిపించినా, కాసేపయ్యే సరికి అంతా అలవాటై, సర్దుకుంటుంది. ''స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య'' అని చెప్పే అక్కినేనికి స్వతహాగా తనకు కుడి కన్ను కన్నా ఎడమ కన్ను చిన్నదని తెలుసు. ఆ లోపం తెర పై తెలియకుండా ఉండడం కోసం, ఆ కనుబొమ పైకెత్తి, ఆ కంటిని విప్పార్చి చూస్తూ నటిస్తూ ఉంటాననీ ఆయనే ఈ సమీక్షకుడితో ఒక సందర్భంలో వివరంగా చెప్పారు. కానీ, 'శ్రీరామరాజ్యం'లో మాత్రం చిన్నదైన ఆ ఎడమ కన్ను ఇదేమీ తెలియని సామాన్యులకు కూడా తెలిసిపోతూ ఉంటుంది.

వాల్మీకి పాత్రకు సీత తారసిల్లే మొదటి సన్నివేశంలోనేమో, ఆమెను లోకమాతగా, సాక్షాత్తూ దేవతగా భావిస్తున్నట్లు చూపారు. డైలాగులు చెప్పించారు. కానీ, ఆ తరువాత మాత్రం సీతాదేవే ఆయనకు భక్తురాలన్నట్లుగా, వాల్మీకిని కేవల వాత్సల్య మూర్తిగా కాక, ఆపద్బాంధవుడైన మహాత్ముడిలా హావభావాల్లో, మాటల్లో చూపెట్టారు. ప్రేక్షకులు స్పష్టంగా ఇదీ అంటూ వ్యక్తం చేయలేకపోయినా, మింగుడుపడని ఈ మార్పు రసస్ఫూర్తికి భంగమే.

వయసుతో పాటూ తగ్గిన కండర పటుత్వానికి ఎవరినీ తప్పు పట్టలేం. పెరిగిన ఛాతీ భాగం కనిపించకూడదని, ఒళ్ళంతా కప్పుకొన్న వాల్మీకిగా కనిపించడాన్ని అర్థం చేసుకోగలం. కానీ ఎటొచ్చీ, చిత్తూరు నాగయ్య లాంటి వారు శాంత రసపోషణతో మెప్పించిన వాల్మీకి పాత్రలో ఈ తరహాలో అక్కినేనిని తెరపై చూశాక ఓ మిత్రుడు అన్నట్లు - ''వాల్మీకి పాత్రలో నాగేశ్వరరావు నటించినట్లు లేదు. నాగేశ్వరరావు పాత్రనే వాల్మీకి ధరించినట్లుంది.''

పిల్లలు కాదు, పిడుగులు

ఈ సినిమాలో లవకుశులుగా నటించిన చిన్నారులు (లవుడిగా మాస్టర్ దాసరి గౌరవ్, కుశుడిగా తెరంగేట్రం చేసిన మాస్టర్ ఎస్. ధనుష్ కుమార్) ఇద్దరూ కెమేరా ముందు బెరుకు, బిడియం, కృతకత్వం లేకుండా సహజంగా నటించడం విశేషం. ముఖ్యంగా బూరెబుగ్గలతో లవుడిగా నటించిన అబ్బాయి అయితే, మరీ ముద్దొస్తాడు. ఇక, కోయజాతి పిల్లాడైన బాలరాజు వేషంలో వచ్చే బాల హనుమంతుడిగా మాస్టర్ (పొనుగుపాటి) పవన్ శ్రీరామ్ చాలా హుషారుగా నటించాడు, నర్తించాడు. సొంత డబ్బింగ్ తో డైలాగులూ బాగా చెప్పాడు. ఇక, లవకుశులిద్దరికీ డబ్బింగ్ చెప్పిన అమ్మాయిలు కూడా చక్కగా డైలాగులు పలికారు. ఈ పసికూనల నుంచి ఆ మేరకు కావలసిన ఎఫెక్ట్ రప్పించడంలో దర్శకుడు చేసిన కృషినీ, పడ్డ శ్రమనూ అభినందించాలి.

అయితే, ఎటొచ్చీ హనుమంతుడే ఆ వేషంలో ఉన్న సంగతి చిత్రకథానుసారం సినిమాలో వాల్మీకి మహర్షికీ, హాలులో సినిమా చూస్తున్న మన లాంటి ప్రేక్షకులకీ మాత్రమే తెలుసు. కథలోని మిగిలిన పాత్రలెవరికీ తెలియదు. సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ పాత్ర ఆశ్రమంలో ప్రవేశిస్తుంది. ఆ తరువాత లవకుశులు పుడతారు. పెరిగి పెద్దవుతారు. వారిని తానే స్వయంగా ఆడించి, పెంచి పెద్ద కూడా చేస్తాడు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా సరే ఈ బాలరాజు పాత్ర అదే వయసుతో, అలాగే ఉంటాడు. మరి, వాల్మీకికి విషయం తెలుసు కాబట్టి అనుమానం రాలేదంటే సరే. ఆశ్రమంలోని సీతతో సహా, ఋషులు, ఋషిపత్నులు తదితర జనాభాకూ అనుమానం రాదా? హాలులోనూ, హాలు బయటకు వచ్చాక మిత్రుల దగ్గరా వ్యక్తమైన ఈ బేతాళ ప్రశ్నకు నా దగ్గరైతే సమాధానం లేదు.

సద్వినియోగం కాని సువర్ణావకాశాలు

గమ్మత్తేమిటంటే, ఇది సినీ జీవితంలో తమకు దక్కిన అపూర్వ అవకాశమని చెప్పిన వారెవరూ అందుకు తగ్గ కృషి చేసినట్లు కనిపించలేదు. లక్ష్మణుడి పాత్రను హీరో శ్రీకాంత్ ధరించారు. నూటికి పైగా చిత్రాల అనుభవం ఉన్న శ్రీకాంత్ ను ఈ పాత్రలో చూస్తుంటే, ఆయన తన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ఆపరేషన్ దుర్యోధన తరహా చిత్రాల ప్రభావంలోనే ఉన్నారనిపిస్తుంది. చివరకు చిరాకెత్తిన ఓ ప్రేక్షకుడు సీతను అడవికి తీసుకువెళ్ళే సన్నివేశంలో ఆయనను చూసి, ద్రౌపదిని కురుసభకు తీసుకువెళుతున్న దుశ్శాసనుడిలా ఉన్నాడని బాహాటంగానే కామెంట్ చేశాడు. ఇక, చివర యుద్ధ సన్నివేశంలో ఆయన ధరించిన గులాబీ రంగు చెమ్కీ దుస్తులు చూసినప్పుడు బ్యాండు మేళగాళ్ళు గుర్తుకొస్తే అది మీ తప్పేమీ కాదు. (నాలుగంటే 4 సీన్లలో వచ్చేఈ మాత్రం పాత్రకు అతనికి 70 లకారాల పైనే ఇచ్చారని కృష్ణానగర్ కబురు).

హనుమంతుడిగా విందూ దారాసింగ్ దర్శక రచయితలు బాపు - రమణలకు 'ఈ' టి.వి. 'శ్రీభాగవతం' సీరియల్ రోజుల నుంచి అలవాటైనవాడే. కానీ, అర్జా జనార్దనరావు లాంటి నిండైన విగ్రహాన్ని ఆంజనేయుడిగా చూశాక, అందరూ అనాకారులుగానే కనిపిస్తారు. పైగా, హనుమంతుణ్ణి మరీ క్లోజప్ లో చూపే ఓ సన్నివేశంలో నోరు కదలదు, పెద్ద డైలాగు మాత్రం వచ్చేస్తుంటుంది. విందూ దారాసింగ్ సైతం తనకున్న కొద్దిపాటి విగ్రహ పుష్టినీ కోల్పోతున్న లక్షణాలు జారిపోతున్న కైదండల సాక్షిగా సినిమాలో కనిపించేస్తుంటాయి.

నప్పని నటులతో తప్పని తిప్పలు

ఇక ఈ సినిమాలో వశిష్ఠుడిగా సీనియర్ నటుడు బాలయ్య, కౌసల్యగా కె.ఆర్. విజయ కనిపిస్తారు. శరీర పుష్టే కాదు, వాచికమూ పూర్తిగా పోయిన బాలయ్య పట్టి పట్టి డైలాగులు చెబుతుంటే, వినలేకపోతాం. ఇక, దేవతల పాత్రల్లో ఒకప్పుడు నిండుగా అలరించిన కె.ఆర్. విజయను మీద పడిన వయసులో, ముడతలు పడిన ముఖంలో చూడనూ లేము. నోరు విప్పితే విననూ లేము. కౌసల్యగా ఆమెను ఎందుకు పెట్టారో అర్థం కాదు. సుమిత్రగా వేసిన సనతోనే ఆ పాత్ర బదులు కౌసల్య పాత్ర వేయించినా బాగుండేది. సీతను అడవి పాలు చేసిన రాముణ్ణి, కాస్తంత విషాదభరితమైన డైలాగులతో, నిలదీసే తల్లి కౌసల్య పాత్ర ఆ ఒక్క సీనుకైనా, ఎంతో కీలకమని గుర్తించి ఉండాల్సింది.

అలాగే, లవకుశులు అయోధ్యలోని రాజమందిరంలో రామకథా గానం చేస్తున్నప్పుడు ఆవేదన ఆపుకోలేక గానం ఇక చాలు ఆపేయమని అంటుంది కౌసల్యా మాత. కానీ, తీరా అప్పుడే అది వింటూ రాముడు రాగానే, కొడుకును చూసి, భయపడిన రీతిలో కౌసల్య చటుక్కున సర్దుకుంటుంది. వచ్చిన రాముడు కథాగానాన్ని కొనసాగించమన్నట్లు సైగ చేస్తాడు. అది అధికార దర్పంలానూ అనిపిస్తుంది. పాత్రధారుల ఈ పొరపాటు రియాక్షన్ లను ఎడిటింగ్ లో చూసైనా, దిద్దుబాటు చేసుకోవాల్సింది.

తెరపై లోటుపాట్లు

జనక మహారాజుగా మురళీమోహన్, ఆయన భార్యగా సుధ (కెమేరా కనిపిస్తే, అంతగా నవ్వడమెందుకో అర్థం కాదు), విశ్వామిత్రుడిగా (ఎబ్బెట్టు గడ్డంతో) సుబ్బరాయశర్మలను చూడవచ్చు. చాకలి తిప్పడుగా బ్రహ్మానందం, అతని భార్యగా టి.వి. యాంకర్ ఝాన్సీ రెండే రెండు సన్నివేశాల్లో కనిపిస్తారు. చాకలి తిప్పడు కుటుంబ వ్యవహారం మీద ఎంతో తీసినా, చివరకు ఎడిటింగ్ లో నిర్దాక్షిణ్యంగా కోసేసి, సినిమాలో ఇంతే ఉంచారేమోనని అనుమానం వస్తుంది. తిప్పడు తన భార్యను అనుమానించే సన్నివేశం కూడా ఎలాంటి భావోద్వేగాలూ కలిగించకుండా, నాటకీయత ఏమీ లేకుండా ఠక్కున వచ్చి, ఠక్కున అయిపోతుంది. పైగా, ఆ సన్నివేశంలో ఫ్రేము నిండా జనం కనిపిస్తూ, ఎవరి యాక్షన్ కు ఎవరి రియాక్షనూ కట్ చేసి చూపించకుండా, అంతా నాటకంలో నడిపించేశారు.

ఇక, భూదేవి పాత్రలో రోజా కనిపించేది రెండు సీన్లే అయినా, భూదేవి వచ్చే దృశ్యం, సీతను తీసుకొని భూగర్భంలోకి వెళ్ళే దృశ్యం చిత్రీకరణ బాగున్నాయి. అయితే, గర్భవతిగా ఉన్న సీతాదేవిని, భూదేవి ఓదార్చే సన్నివేశంలో భూదేవి పాత్రలో రోజాను చూస్తుంటే, గర్భవతిగా ఉన్నది సీతా, లేక భూదేవా అని అనుమానం కలిగితే ఆశ్చర్యం లేదు.

సినిమాలో శ్రీరాముడి అక్క పాత్రలో శివపార్వతి నటించారు. ఆమె భర్త ఋష్యశృంగ మహర్షిగా 'మర్యాద రామన్న' చిత్ర ఫేమ్ నాగినీడు కనిపించారు. పేరులోనే ఉన్నట్లుగా పురాణాల ప్రకారం ఆ పాత్రకు నెత్తిన కొమ్ము ఉండాలి. కానీ, ఒక్క డైలాగైనా లేని ఆ పాత్ర కనిపించేదే రెండు సీన్లు. అందులో మొదటి సీన్ లో పాత్రధారికి మేకప్ లో నెత్తిన కొమ్ము పెట్టడం మరిచిపోయినట్లున్నారు. తరువాత యాగం సీన్ లో మాత్రం అతని నెత్తిన కొమ్ము ప్రత్యక్షమవుతుంది. ఈ సినీ ఋష్యశృంగుడు డైలాగు లేకపోతే పోయె, పాత్రోచితంగా తిన్నగానైనా ఉండకపోగా, తాపీగా కాళ్ళూపుకుంటూ ఆసనంలో చేరగిలపడి కూర్చోవడంతో దృశ్యం రసాభాస. చెప్పుకోవడానికి ఇవి చిన్న లోపాలుగానే అనిపించినా, ప్రేక్షకుడి సినీ సంలీన సందర్శనానుభవంపై పెను ప్రభావాన్ని చూపుతాయన్నది నిష్ఠుర సత్యం.

(‘శ్రీరామరాజ్యం' సినిమా సమీక్షలో చివరిదైన 3వ భాగం కాసేపట్లో...)

Sunday, November 27, 2011

రామరాజ్యమంటే ఇదా...!?



(‘శ్రీరామరాజ్యం’సినిమా సమీక్ష - పార్ట్ 1)

ఆఫీసు పని ఒత్తిళ్ళ వల్లనైతేనేం, ఆరోగ్య కారణాల వల్లనైతేనేం, వ్యక్తిగత సమయాభావం వల్లనైతేనేం, ఇటీవల సినిమాలకు వెళ్ళడం అనివార్యంగా తగ్గింది. కానీ, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న పౌరాణికం, బాపు గారి దర్శకత్వం, బాలకృష్ణ శ్రీరామపాత్రపోషణ అనేసరికి మనసు పీకింది. ‘శ్రీరామరాజ్యం’సినిమాకు ఇవాళ ఆదరా బాదరాగా వెళ్ళింది అందుకే. అయితే, అంచనాలు ఎక్కువగా పెట్టుకొని వెళితే, ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నాకు మరోసారి రుచి చూపించింది.

సినిమాకు వెళ్ళకముందే సాయంత్రం ఓ మిత్రుడి ఫోన్. సినిమా కన్నుల పండుగ అని చెప్పాడు. మరో మిత్రుడు ఫోన్ చేసి, సినిమాకు టాక్ - ఆంధ్రాలో సూపర్. అమెరికాలో అయితే మరీ సూపర్ డూపర్ అన్నాడు. అంతే, ఇనుమడించిన ఉత్సాహంతో ఆఖరి నిమిషంలో టికెట్లు ఎలాగోలా కొనుక్కుని వెళ్ళాను. అంతకు ముందు ‘‘ రాము గాక రాము‘‘ అని భీష్మించుకున్న కొందరు మిత్రులు కూడా, ఈ పాజిటివ్ ఫీడ్ బ్యాక్, టాక్ విని, ఉత్సాహపడ్డారు. అంతా కలసి వెళ్ళాం.

కానీ, ఆఖరికి అనుకున్నదే అయింది. సినిమా ఎందుకో అందరూ చెబుతున్నంత ఆహా, ఓహోగా అనిపించలేదు. అదే సమయంలో, సినిమా తయారీలో ఉండగా బాలకృష్ణ, నయనతార, తదితరుల గురించి వ్యక్తం చేసిన నెగటివ్ కామెంట్లంత నాసిగానూ లేదు. అయితే, ‘శ్రీరామరాజ్యం’ అన్న టైటిల్ కూ, ఈ సినిమా కథకూ సంబంధం చాలా తక్కువ. ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న భావమేమిటో సినిమాలో ఎక్కడా స్పష్టం కాదు.

రామరాజ్యమంటే ఎలా ఉండేదో, రామరాజ్యాన్ని ఇవాళ్టికీ ఎందుకు ఆదర్శంగా చెప్పుకుంటారో అన్న విషయాలు సినిమాలో చూపలేదు. పట్టాభిషేక సమయంలో కిరీటధారి రాముడిగా బాలకృష్ణ నోట నాలుగు పొలిటికల్ డైలాగుల ఉపన్యాసంలో పొడిపొడి మాటలు మాత్రం వినిపిస్తారు.

ఒక కథ - మూడు సినిమాలు

ఉత్తరరామాయణ కథ తెలుగు తెరకు కొత్త కాదు. దేవకీ బోస్ దర్శకత్వంలో తీసిన హిందీ ‘సీత’ (1934)ఆధారంగా, ఆ సెట్లు, ఆభరణాలు ఆసరాగా చేసుకొని సి. పుల్లయ్య దర్శకత్వంలో అదే నిర్మాతలు ఈస్టిండియా వారు తెలుగులో ‘లవకుశ’ (1934) నిర్మించారు. అది మొదటిది. గ్రామీణ జనం బళ్ళు కట్టుకొని మరీ పట్నానికి వచ్చి, సినిమా చూసిన సినిమా అది. అప్పుడప్పుడే మూకీల నుంచి టాకీలకు మళ్ళుతున్న తెలుగు నాట సినిమా హాళ్ళు తీర్థప్రజతో నిండిన తొలి చిత్రం దాదాపు అదే. అప్పటి దాకా మూగ చిత్రాలను ప్రదర్శిస్తున్న హాళ్ళు చకచకా టాకీ ఎక్విప్మెంట్ ను బిగించుకున్నదీ ఈ సినిమా అపూర్వ విజయ పర్యవసానమే.

ఆ సినిమా మన తండ్రులు, తాతల తరమే తప్ప మనం చూడలేదు. ఆ సినిమా వీడియో కూడా అలభ్యం. ఇక, మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసిందల్లా ఆ తరువాత , అదే సి. పుల్లయ్య గారి దర్శకత్వంలో మొదలై, ఆయన కుమారుడు సి.ఎస్. రావు నిర్దేశకత్వంలో పూర్తయిన లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ చిత్రం (1963). సీతారాములుగా అంజలీదేవి, ఎన్టీయార్ నటించిన ఆ చిత్రం ఏ రకంగా చూసినా ఓ క్లాసిక్. పట్టుగా నడిచే స్క్రీన్ ప్లే, సదాశివబ్రహ్మం రచన, పాత్రధారుల అభినయం, మరీ ముఖ్యంగా ఘంటసాల సంగీతం, పి.లీల - సుశీల లాంటి గంధర్వ గాయనీమణుల అద్భుత గానవైదుష్యం, వీటన్నిటినీ సమస్థాయిలో నడిపిన దర్శకత్వ ప్రతిభ - ఇలా అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఆ సినిమాను అజరామరం చేశాయి.


ఆ ‘లవకుశ’ ఓ చరిత్ర

వసూళ్ళలోనూ, చూసిన ప్రేక్షకుల సంఖ్యలోనూ ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రానిది ఓ చరిత్ర. అప్పటి దాకా తెలుగులో ఏ సినిమాకూ అత్యధికంగా రూ. 25 లక్షలు మించి వసూళ్ళు రాలేదు. కానీ, ‘లవకుశ’ చిత్రం వసూళ్ళు ఏకంగా కోటి రూపాయలు దాటాయి. సినిమా హాళ్ళలో అమ్మిన టికెట్ల ఆధారంగా లెక్కవేస్తే, అంతకు మునుపెన్నడూ ఏ సినిమానూ చూడనంత మంది ఆ సినిమాను చూశారు. చుట్టుపక్కలి గ్రామాల వారందరూ సమీపంలోని పట్టణ సినీ కేంద్రానికి వెళ్ళి సినిమా చూడాల్సిన ఆ 1960ల ప్రథమార్ధంలో, దాదాపు ప్రతి రిలీజు కేంద్రంలోనూ ఆ ఊరి జనాభా కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ మంది ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రం చూశారు. అప్పట్లో వరంగల్ కేంద్రం గురించి వచ్చిన ప్రకటనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 1963లో వచ్చిన ఆ చిత్రం ఆ తరువాతెప్పుడో పుట్టిన 1970లు, 1980ల నాటి తరానికి కూడా సుపరిచితమైనదే. అంటే, ఆ సినిమా మళ్ళీ మళ్ళీ హాళ్ళలో విడుదలై, ఎన్ని రోజులు ఆడిందో, ఎంతెంత మందిని ఆకర్షించిందో, ఆ రిపీట్ రన్లలో ఇంకెంత వసూలు చేసిందో ఊహించుకోవచ్చు. ఆ రకంగా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక కాలం ఆడిన సినిమాగా ‘లవకుశ’ను పేర్కొన్నా తప్పు లేదు. అలాంటి చిత్రకథను మళ్ళీ తెరకెక్కించడం సాహసమే అయినా, ‘‘శ్రీరామరాజ్యం’’ యూనిట్ అందుకు సిద్ధపడింది.

ఇప్పుడు యలమంచిలి సాయిబాబు నిర్మాతగా, బాలకృష్ణతో బాపు - రమణల ‘‘శ్రీరామరాజ్యం’’ ముచ్చటగా మూడోది. తెలుగు రంగస్థలం మీద, సినీ లోకంలో ‘లవకుశ’గా ప్రసిద్ధమైన ఉత్తర రామాయణ కథను తెరకెక్కిస్తూ, ఆ పేరు పెట్టకపోవడంలోనే జంకు తెలుస్తోంది. కానీ, పోల్చిచూడడాలు అనివార్యమని వారికీ తెలుసు. అయితే, కొత్త పేరు పెట్టినా ఆ పేరుకు న్యాయం చేయలేకపోయారు. (ఈ పేరు కూడా 1943లో హిందీ, మరాఠీల్లో విజయ్ భట్ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘రామ్ రాజ్య’ పేరు నుంచి అరువు తెచ్చుకున్నదే. అదీ లవకుశుల కథే). ఇంకా చెప్పాలంటే, గొప్పగా చెప్పుకొనే రామరాజ్యంలో జరిగింది ఇదా అని అనుమానపడేలా చేశారు.

పాత కథకు కొత్త మార్పులు

పధ్నాలుగేళ్ళ అరణ్యవాసం, రావణ సంహారం తరువాత సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడై వానర ప్రముఖులు తోడు రాగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు చేరడం, పట్టాభిషిక్తుడు కావడం, సీతాదేవి గర్భవతి కావడం, లోకనిందకు వెరచి సీతా సాధ్విని రామచంద్రుడు అడవిలో వదిలి రమ్మనడం, లక్ష్మణుడు అన్న ఆజ్ఞను శిరసావహించడం, వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి ఆశ్రయం పొందడం, లవకుశుల జననం, విద్యాబుద్ధులు నేర్వడం, వారి రామాయణ కథా గానం, రాముడి అశ్వమేథ యాగం, అశ్వాన్ని లవకుశులు బంధించడం, తండ్రితోనే యుద్ధానికి తలపడడం, ఆఖరికి అసలు విషయం తెలియడం, సీతాదేవి భూమాత ఒడిలో చేరడం, లవకుశులకు పట్టాభిషేకం చేసి, రాముడి అవతార సమాప్తి - ఇదీ స్థూలంగా కథ.

నిజానికి, అందరికీ తెలిసిన, తెరపై చూసేసిన కథను మరోసారి చెప్పదలిచినప్పుడు ఇబ్బందే. అయితే, చెబుతున్నది సెల్ ఫోన్లు, సోషల్ నెట్ వర్క్ సైట్ల నవతరానికి, పౌరాణిక చిత్రాల పొడ తెలియని యువతరానికి కాబట్టి, ఈ చిత్ర రచయిత ముళ్ళపూడి వెంకట రమణ భాష, భావం వీలైనంత సరళంగా ఉండేలా చూశారు. (పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఆ బాటలోనే నడిచారు). వాల్మీకి ఆశ్రమంలో సీతా సాధ్వి సేవ కోసం బాల హనుమంతుణ్ణి బాలరాజు పాత్రగా ప్రవేశపెట్టి మూలంలో లేని మార్పు చేశారు ముళ్ళపూడి. తద్వారా కథాగమనంలో కొత్తదనం కోసం కృషి చేశారు. ఆ మార్పు బాగున్నా, దాన్ని సమర్థంగా స్క్రిప్టులో వాడుకోలేకపోయారు. ఆ కొత్త పాత్రతో ప్రధాన రసానికి పరిపోషకంగా హాస్య, అద్భుత, కరుణ రసాలు వేటినీ పండించడానికి ప్రయత్నించనేలేదు.

అలాగే, సీతారాముల ప్రణయ సన్నివేశాల్లో బాపు - రమణల మార్కు కనబడుతుంది. మోతాదు మించనివ్వకపోయినా, రెగ్యులర్ కమర్షియల్ ప్రేమ సినిమాలు చాలకనా, ఆరాధ్యదేవతలైన సీతారాముల మధ్య ఇలాంటి ఘట్టాలు చూపెట్టాలా అని మొహం చిట్లించిన వాళ్ళూ లేకపోలేదు. సినిమాగా, కళాత్మక వ్యక్తీకరణగా మనం సరిపెట్టుకున్నా, మూతిముడుచుకున్న మహాభక్తుల ఆ సెంటిమెంట్ ను పూర్తిగా కొట్టిపారేయలేం.

ఇక, రాముల వారి ఏకపత్నీ వ్రతాన్నీ, పరాయి కాంతల నీడనైనా తాకని ఆయన నిష్ఠనూ తెలిపే సంఘటన సినిమాలో కొత్తగా ఉంది.

రాముడిగా అనూహ్యంగా బాలయ్య

ఉద్దేశపూర్వకంగానో, యాదృచ్ఛికంగానో, ‘శ్రీరామరాజ్యం’ అనే పేరు, హీరోల చుట్టూ తిరిగే సినీ పరిశ్రమ ధోరణికి తగ్గట్లుగా ఉన్నా, నిజానికి ఇది సీత కథ. అడవిలో వదిలి రమ్మని భర్తే ఆజ్ఞాపించడంతో ఆమెకు కలిగిన వ్యధ. అక్కడే అడవిలో పుట్టిన ఆమె పిల్లలు ఆఖరికి తండ్రిని చేరిన గాథ. అందుకే, సహజంగానే ఇందులో శ్రీరాముడి పాత్ర తెరపై ఆట్టే కనిపించదు. అయినా సరే, పౌరాణిక పాత్రల మీద మమకారం, తండ్రి పోషించిన పౌరాణికాలకు తెలుగు నాట తనదే పేటెంట్ అన్న నమ్మకంతో ఈ సినిమాలో బాలకృష్ణ నటించారు.

తండ్రి పోలికలే తప్ప, స్వరూప, స్వభావాల రీత్యా పెద్దాయనకు ఉన్న సానుకూలతలు కొన్ని లేకపోవడం బాలయ్యకు లోటే. అదుపులో లేని శరీరం చాలా సార్లు అడ్డొస్తూ, అర్థమై పోతూ ఉంటుంది. శాంత, శోక, కరుణ రసాన్వితమూర్తి అయిన ఉత్తర రామాయణ రాముడు అందుకు పూర్తి భిన్నంగా, ఎర్రటి కళ్ళతో రోజూ రాత్రి పొద్దుపోయే దాకా నిద్ర లేదని తెలిసిపోతుంటాడు. కరుణ రసపూరిత ఘట్టాల్లోనూ ఎర్రటి కళ్ళతో క్రోధావేశంతో ఉన్నాడేమో అనిపిస్తాడు.

అయినప్పటికీ, అనూహ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఊహించినదాని కన్నా చాలా బాగున్నారు. అదే పనిగా అలవాటైపోయిన ఆంగిక, వాచిక హావ భావ విన్యాసాలకు దూరంగా, నియంత్రితమైన నటనను కనబరచడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. డైలాగులే లేని కొన్ని దృశ్యాల్లో, ముఖ్యంగా వేగు భద్రుడు వచ్చి, లోకనిందను తెలిపిన సందర్భంలో మ్రాన్పడిపోవడం లాంటి చోట్ల దర్శకుడి ఆలోచనలు, సూచనలకు తగ్గట్లు క్లోజప్పుల్లో బాలకృష్ణ లీనమై నటించిన తీరు బాగుంది.

(తరువాయి భాగం మరికాసేపట్లో...)

Sunday, October 23, 2011

కనుగొంటి కనుగొంటి ఇప్పుడిటు కనుగొంటి... తొలి తెలుగు సినిమా పుట్టిన తేదీ కనుగొంటి...



* ‘భక్త ప్రహ్లాద’ విడుదలైంది 1932 ఫిబ్రవరి 6న!

* తొలి పూర్తి తమిళ టాకీ కన్నా మనదే ముందు!



తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ చిత్రం విడుదల తేదీ మీద చివరకు నా పరిశోధనే నిజమని తేలింది. ఆ సినిమా అటు సెన్సారైందీ,
ఇటు విడుదలైందీ కూడా 1932లోనే. ఇన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న 1931లో,అందులోనూ సెప్టెంబర్ 15న ఆ చిత్రం విడుదల కానే కాలేదని నేను చేసిన వాదనకు మరిన్ని తిరుగులేని సాక్ష్యాధారాలు దొరికాయి. మన తొలి తెలుగు సినిమా తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ విడుదలైందీ అన్వేషణలో తేలింది.

టి.వి. 9 లాంటి చానళ్ళు నా వాదనను వినిపిస్తూ ప్రత్యేక వార్తాకథనాలు ప్రసారం చేశాయి. అయితే, సత్యాన్వేషణ దృష్టి, పరిశోధన మీద ఆసక్తి తప్ప నాకు మరో ఉద్దేశమేమీ లేకపోయినా, ‘ఆంధ్రప్రభ’తో సహా పలువురు నా పరిశోధనకు దురుద్దేశాలు ఆపాదించారు. అనుమానాలు వ్యక్తం చేశారు. అవన్నీ నా మునుపటి పోస్టు పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు లో తెలిపాను.

వాటిలోని డొల్లతనాన్నినిరూపిస్తూ, నేనిచ్చిన వివరణ ఇవాళ్టి ‘ఆంధ్రజ్యోతి’దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది. ఆ రిజాయిండర్ ఇదీ --

.......................................................................

పరిశోధన


తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్తప్రహ్లాద' విడుదలైన తేదీ ఎట్టకేలకు దొరికింది.

అది 1932 ఫిబ్రవరి 6.


గతంలో (11.9.2011 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచిక) ప్రచురితమైన నా పరిశోధనా పత్రంలో- ఇంతకాలం అనుకున్నట్టుగా 'భక్తప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదల కాలేదనీ, సగం తెలుగున్న ''తమిళ - తెలుగు టాకీ'' 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలయ్యాకే అసలు ఈ పూర్తి తెలుగు టాకీ నిర్మాణమైందనీ చెప్పాను. 1932 జనవరి 22న మాత్రమే భక్త ప్రహ్లాద సెన్సారై, సర్టిఫికెట్ పొందిందని ఆధారం చూపాను. ఆ సెన్సార్ తేదీ నుంచి మద్రాసు రిలీజ్ సమాచారం ససాక్ష్యంగా దొరుకుతున్న ఏప్రిల్ 2వ తేదీ లోపల ఎప్పుడయినా విడుదలై ఉండవచ్చని చెప్పాను. అప్పటికి కచ్చితమైన తేదీ నాకూ సాక్ష్యాధారాలతో లభించ లేదు. ఆ తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మరిన్ని ఆధారాలు సంపాదించి ఈ విషయాలు మీ ముందు పెడుతున్నాను.

తొలి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద', తమిళ - తెలుగు టాకీ 'కాళిదాస్' తర్వాతే వచ్చిందని చెప్పడంలో నాకేవో దురుద్దేశ్యాలు ఉన్నట్లు మరికొంతమంది రాశారు. చరిత్ర పట్ల గౌరవం, పరిశోధన పట్ల ఆసక్తి తప్ప నాకు ఇతరత్రా ఉద్దేశం ఏదీ లేదని మరోసారి తెలియజేసుకుంటున్నాను.


ప్రామాణికమైన సెన్సార్ సర్టిఫికెట్

1931 చివరలో నిర్మాణమై, 1932 జనవరిలో బొంబాయిలో సెన్సారైన 'భక్త ప్రహ్లాద' సెన్సార్ సర్టిఫికెట్ ''నంబర్ 11032.'' ఆ మాటే చెబితే, 'సెన్సార్ అయిన తేదీ కరెక్టేననే నమ్మకం ఏమిటి' అని కొందరు అడిగారు. పైగా 'సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ వేలల్లో (11032) ఎందుకు ఉంది, అప్పుడప్పుడే కదా టాకీలు ప్రారంభమయ్యాయి' అని కూడా సందేహం వెలిబుచ్చారు.

ఆ రోజుల్లో సెన్సారైన చిత్రాలన్నిటి వివరాలనూ సాక్షాత్తూ ప్రభుత్వమే ఏ నెలకానెల చెబుతూ వచ్చింది. 1932 ఫిబ్రవరి 4 నాటి 'ది బాంబే
గవర్నమెంట్ గెజిట్', పార్ట్-1 (పేజీ 313)లో ఆ క్రిందటి నెల సెన్సారైన అన్ని చిత్రాల వివరాలూ ఉన్నాయి. అందులో 'భక్తప్రహ్లాద' కూడా ఉంది. మన దేశంలో సినిమాటోగ్రాఫ్ చట్టం-1918 అమలవడం మొదలైన దగ్గర నుంచి స్వదేశీ ఫిల్ములూ, విదేశీ దిగుమతి చిత్రాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీళ్లు సైతం సెన్సారింగ్ జరుపుకుని సర్టిఫికెట్ నెంబర్లు పొందుతూ వచ్చాయి.

దాంతో, 1932 వచ్చేసరికి 'భక్తప్రహ్లాద'కు సర్టిఫికెట్ నెంబర్ వేల సంఖ్యలోకి వచ్చింది.


సెన్సారైతేనే రిలీజు! ఒకచోట సెన్సారైతే చాలు!


'సెన్సార్ కాకముందే విడుదలయ్యే అవకాశం లేదా? బొంబాయి కంటే ముందు ఇంకెక్కడయినా సెన్సార్ అయి ఉండొచ్చు కదా' ఇత్యాది
సందేహాలు కూడా లేవనెత్తారు.


ఆ అవకాశం లేదు. ఎందుకంటే 'సినిమాటోగ్రాఫ్ చట్టం - 1918' ప్రకారం 1920 నుంచే దేశంలో సెన్సార్ బోర్డులు ఏర్పాటయ్యాయి. "బొం బాయి, కలకత్తా, మద్రా సు, రంగూన్, ఆ తరువాత (ఏర్పాటైన) పంజాబ్ (అంటే లాహోర్)లలోని ప్రాంతీయ బోర్డ్ ఆఫ్ సెన్సార్స్‌లో ఒక దాని నుంచి మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ పొందాలి. అలా పొందకుండా ఏ ఫిల్మునూ ప్రదర్శించడానికి వీలు లేదు...'' ('మేకింగ్ మీనింగ్ ఇన్ ఇండియన్ సినిమా',సంపాదకత్వం: రవి ఎస్. వాసుదేవన్; పేజీ 52).


అలాగే "భారతదేశం మొత్తానికీ చెల్లుబాటయ్యేలా (చిత్రాలకు) సర్టిఫికెట్లను మంజూరు చేసే అధికారాన్ని ఈ (ప్రాంతీయ సెన్సార్) బోర్డులకు ఇచ్చారు. అయితే ఏ ప్రావిన్షియల్ ప్రభుత్వమైనా సరే, సదరు చిత్రం తమ ప్రావిన్సులో బహిరంగ ప్రదర్శనకు తగినది కాదని భావించినట్లయితే, ఆ ఫిల్ముకున్న సర్టిఫికెట్‌ను రద్దు చేయవచ్చు...'' ('కొలోనియల్ ఇండియా అండ్ ది మేకింగ్ ఆఫ్ ఎంపైర్ సినిమా', రచన : ప్రేమ్ చౌధ్‌రీ; పేజీ 19) అంటే, 1932 జనవరి చివరలో బొంబాయి బోర్డులో సెన్సార్ జరుపుకున్న 'భక్తప్రహ్లాద'కు దేశమంతటా ప్రదర్శనకు ఆ సర్టిఫికెట్ సరిపోతుంది. ప్రతిచోటా మళ్లీ మళ్లీ సెన్సార్ జరుపుకుని, కొత్త సర్టిఫికెట్ నెంబర్ పొందాల్సిన అవసరం లేదు.
ఇక అసలు విషయానికి వద్దాం.


1932 ఫిబ్రవరి 6 : తొలిసారిగా తెరపై 'ప్రహ్లాద'


సెన్సారైన తరువాత సరిగ్గా పక్షం రోజులకు 1932 ఫిబ్రవరి 6, శనివారం నాడు 'భక్తప్రహ్లాద' రిలీజైనట్లు నా తాజా అన్వేషణలో తేలింది. అంటే ఇంకా మూడున్నర నెలలకు గాని పూర్తి తొలి తెలుగు టాకీ చిత్రానికి 80 ఏళ్ళు నిండవు. మరో ముఖ్యమైన విషయం ఈ చిత్రం మన దేశంలో మొట్టమొదటిసారిగా విడుదలైంది- అప్పటికి ఆంధ్రులు పెద్దసంఖ్యలో ఉన్న బొంబాయిలో. సెన్సారైన మరుసటి వారమే "తెలుగులో మాటలు, పాటలున్న భారత్ మూవీటోన్ వారి భక్తి రస చిత్రం 'భక్తప్రహ్లాద్' త్వరలో విడుదల'' అంటూ ప్రకటనలు వేశారు. ('ది బాంబే క్రానికల్', 1932 జనవరి 31).

ఆ ప్రకటన వచ్చిన వారం లోపలే బొంబాయిలోని న్యూ ఛార్నీ రోడ్డులోని 'కృష్ణా సినిమా'లో తొలిసారిగా 'భక్తప్రహ్లాద విడుదలైంది. రిలీజ్ రోజున కూడా బొంబాయి పత్రికలు ప్రకటనలు వేశాయి. ప్రివ్యూ చూడడం వల్ల అదే రోజుకి వచ్చేలా సమీక్షలు రాశాయి.

'సంపూర్ణ తెలుగు టాకీ' అనే శీర్షికతో "భారతదేశంలో తొలి సంపూర్ణ తెలుగు టాకీని నిర్మించిన ఘనత బొంబాయికి చెందిన భారత్ మూవీటోన్ కంపెనీకి దక్కింది. కృష్ణా స్టూడియోలోని యంత్ర సామగ్రిని ఉపయోగించుకుని,నిపుణులైన సాంకేతిక సిబ్బందితో కలిసి పనిచేయడం ద్వారా పూర్తిగా మాటలు, పాటలున్న చిత్రం (భక్త) 'ప్రహ్లాద'ను ఆ సంస్థ పూర్తి చేసింది...'' అంటూ సమీక్ష రాశారు. ('ది టైమ్స్ ఆఫ్ ఇండియా', 1932 ఫిబ్రవరి 6).

దీన్నిబట్టి కూడా 'భక్తప్రహ్లాద' తయారైందీ, తొలిసారిగా విడుదలయిందీ బొంబాయిలోనేనని అర్థమవుతోంది.

మద్రాసులో ఏప్రిల్ 2న! అంతకన్నా ముందే ఆంధ్రాలో!!

ఈ సినిమా మద్రాసుకు రావడానికి మరో రెండు నెలలు పట్టింది. తెలుగు ఉగాదికి నాలుగు రోజుల ముందు 1932 ఏప్రిల్ 2 శనివారం నాడు 'నేషనల్ పిక్చర్ ప్యాలెస్' (ఇప్పటి '(న్యూ) బ్రాడ్వే టాకీస్')లో విడుదలై రెండు వారాలు ప్రదర్శితమైంది. బొంబాయి నుంచి, అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నపట్నానికి వచ్చే లోపల 'భక్తప్రహ్లాద' ఇంకెక్కడెక్కడ ఆడిందో తెలియదు గాని "... రాజమహేంద్రవరము నందు వరుసగా మూడు వారముల వరకు ప్రజల నాకర్షించెను...'' ('ఆంధ్రపత్రిక' దినపత్రిక, 1932 ఏప్రిల్
2, పేజీ 14) అనే వాక్యం ఒక్కటే తెలుసు మనకు. ఆ ఒక్క వాక్యం మినహా,తెలుగు నేలపై ఏయే ప్రాంతాలలో, ఏయే తేదీల్లో ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ప్రదర్శించబడిందో తెలిపే సాక్ష్యాలు దురదృష్టవశాత్తూ ఇప్పటికీ లభించడం లేదు.


రాజమండ్రిలో, బెజవాడలో రిలీజైందెక్కడ?


రికార్డులను బట్టి చూస్తే, 1932 నాటికి రాజమండ్రిలో 'శ్యామలా టాకీస్'నిర్మాణమే కాలేదు. అప్పటికి ఉన్నవి రెండే హాళ్ళు 'శ్రీకృష్ణా సినిమా', 'బాబ్జీ సినిమా' (ఇప్పటి 'విజయా టాకీస్'). 'భక్తప్రహ్లాద' ఈ రెండిట్లో ఒక దానిలో విడుదలై ఉండాలి. నిడమర్తి వారి 1923-24 నాటి 'శ్రీకృష్ణా సినిమా'ను ఇప్పటికీ 'శ్రీసాయికృష్ణా'గా నిర్వహిస్తున్న మూడో తరానికి చెందిన 58 ఏళ్ళ నిడమర్తి మురళి "తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా', తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద'- రెండూ రాజమండ్రిలో మా హాలులోనే రిలీజయ్యాయి'' అని తమ పెద్దలు చెబుతూ వచ్చిన సంగతుల్ని ఈ పరిశోధకుడికి తెలిపారు. దాన్నిబట్టి ఇది 'శ్రీకృష్ణా సినిమా'లోనే రిలీజయిందని అనుకోవాలి.

నిజానికి అప్పటికి రాజమండ్రి కన్నా బెజవాడ పెద్ద పట్నం. మూకీలు కూడా జోరుగా ప్రదర్శితమైన సినీ కేంద్రం. కాబట్టి, కచ్చితంగా రాజమండ్రి కన్నా ముందే బెజవాడలోనూ 'భక్తప్రహ్లాద' ప్రదర్శింపబడి ఉండొచ్చు.

అప్పటికి బెజవాడలోనూ ఉన్నవి రెండే హాళ్ళు- శ్రీమారుతీ సినిమా, శ్రీదుర్గా కళామందిరం. 1932 డిసెంబర్ తొలినాళ్ళకు గానీ దుర్గా
కళామందిరంలో 'టాకీ' యంత్రాన్ని అమర్చలేదు. కాబట్టి, తొలి విడుదలలో 'మారుతీ'లోనే 'భక్తప్రహ్లాద' వచ్చి ఉండాలి.

అప్పట్లో బెజవాడలో 'భక్తప్రహ్లాద' చూసిన వయోవృద్ధులు తాము 'మారుతీ'లోనే ఆ సినిమాని చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఏడాది
తర్వాత మళ్లీ రిలీజయినపుడు మాత్రం దుర్గాకళామందిరంలో వచ్చింది. ఇవాళ మీడియాలో తరచూ కనిపిస్తున్న 'భక్తప్రహ్లాద' వాణిజ్య ప్రకటన ఆ రెండో రిలీజ్‌కు సంబంధించినదే.


తొలి తెలుగు టాకీల వరుస క్రమం

1932లో సెన్సారైన మొత్తం తెలుగు చిత్రాలు మూడు. వాటి వరుస 'భక్తప్రహ్లాద' (సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ 11032, తేదీ 22 జనవరి 1932. తొలి రిలీజ్ : బొంబాయిలోని 'కృష్ణా సినిమా'లో 1932 ఫిబ్రవరి 6). రెండోది 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకము' (నెం. 11739, తేదీ 17 నవంబర్ 1932. తొలి రిలీజ్ : మద్రాసులోని 'కినిమా సెంట్రల్'లో 1932 డిసెంబర్ 24). మూడో టాకీ 'శకుంతల' (నెం. 11830, తేదీ 21 డిసెంబర్ 1932. తొలి రిలీజ్ : అదే 'కినిమా సెంట్రల్'లో 1933 మార్చి 25). చిత్ర నిర్మాణం వరుసలో 'శకుంతల' మూడో తెలుగు టాకీ అయినా, విడుదల విషయానికి వచ్చేసరికి ఐదోది అయింది. ఎందుకంటే 1933 ఫిబ్రవరి 4,5 తేదీల్లో రెండు 'సతి సావిత్రులు' విడుదలయ్యాయి. వాటి తరువాతే 'శకుంతల' మార్చి 25న రిలీజైంది.


కొసమెరుపు :

తమిళం కన్నా ముందే తెలుగు


ఇంత చెప్పాక ఇదేమిటని ఆశ్చర్యపోకండి. సగం తమిళం, సగం తెలుగుతో 'తమిళ- తెలుగు టాకీ'గా 1931లో రూపొందిన 'కాళిదాస్'ను ప్రభుత్వ సెన్సార్ బోర్డు తమిళ టాకీగానే లెక్కలో వేసుకున్నా 1932 ఏప్రిల్ 9న పూర్తి తమిళ మాటలు, పాటలతో విడుదలైన 'హరిశ్చంద్ర'నే ఆనాటి పత్రికలు "మొట్టమొదటి తమిళ టాకీ'' అని పేర్కొన్నాయి ('ది హిందూ', 1932 ఏప్రిల్ 8). అదెలాగున్నా 'కాళిదాస్'ని ఉమ్మడి వారసత్వంలో చేర్చేసుకుని తెలుగు, తమిళాల్ని విడివిడిగా చూస్తే దక్షిణాదిలో తొలి సంపూర్ణ టాకీ చిత్రం రూపకల్పనలోనూ, విడుదలలోనూ తమిళుల కన్నా మనమే రెండు నెలల పైచిలుకు ముందున్నామనేది స్పష్టం.


మూడు భాషల్లోనూ సినిమాకు మాట నేర్పింది మనవాళ్ళే!


ఆ మాటకొస్తే ఒక్క మలయాళం మినహా దక్షిణాది భాషల్లోని మిగతా మూడింటిలో సినిమాకు మాటలు నేర్పిన దర్శకబ్రహ్మలు తెలుగువారే
కావడం గర్వకారణం. ('కాళిదాస్', 'భక్తప్రహ్లాద'లకు హెచ్.ఎం. రెడ్డి, 1934 మార్చి 3న రిలీజైన తొలి కన్నడ టాకీ 'సతీ సులోచన'కు వై.వి. రావు). ఎస్. నోట్టానీ దర్శకత్వంలో వచ్చిన 'బాలన్' (1938) తొలి మలయాళ టాకీ. అయితే గర్వకారణమైన ఇలాంటి ఎన్నో విశేషాల చరిత్ర రచన నమ్మకాల మీద కాక, వాస్తవాల ఆధారంగా సాగాలి.

దురదృష్టవశాత్తూ, ఆ దృష్టి మందగించడం వల్ల మన సినిమా చరిత్ర రచన ఇప్పటికీ ససాక్ష్యంగా, సాకల్యంగా సాగడం లేదు. గురజాడ, చలం, శ్రీశ్రీల పుట్టిన తేదీల్లో దశాబ్దాలుగా చలామణిలో ఉన్న తప్పులను పరిశోధకులు బయటపెట్టినపుడు సరిదిద్దుకున్నాం. సాహిత్యం, సామాజిక చరిత్ర లాంటి ఎన్నో అంశాల్లో ఎంతో సాధారణమైన ఈ చరిత్ర నిర్మాణ సూత్రాన్ని సినీ చరిత్రకూ వర్తింపజేస్తే తప్పేముంది?

- రెంటాల జయదేవ
.....................................................................