జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, July 27, 2010

కాలక్షేపం రామన్న!

(మర్యాద రామన్నలో అపర్ణగా సలోనీ, రాముగా సునీల్)

ఊళ్ళోకి తెలుగు సినిమా వచ్చిందంటే వదిలిపెట్టడం మన వల్ల కాదు... కొద్ది రోజులుగా ఆ వ్రతానికి భంగం జరిగిందేమో, ఇక లాభం లేదని మాంఛి గురుపూర్ణిమ సుమూహర్తంలో మళ్ళీ ఆ వ్రతం విజయవంతంగా మొదలుపెట్టా --- మర్యాద రామన్నతో... హాస్యనటుడిగా పేరున్న సునీల్ ను హీరోగా చూపెట్టి తాజా చిత్రమిది. దానికి తోడు వరుస విజయాల జోరు మీదున్న ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం. రాజమౌళి సినిమాలన్నిటి లానే దీనికీ రాజమౌళి అన్నయ్య (పెదనాన్న కుమారుడైన) ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. అయితే, ఈ సారి కథ, మాటలు మాత్రం రాజమౌళి నాన్న గారి బృందం (విజయేంద్ర ప్రసాద్, ఆయన టీమ్ మెంబర్ ఎం. రత్నం) అందించలేదు. రాజమౌళికి సోదరుడి వరసయ్యే ఎస్.ఎస్. కాంచీ ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఈ చిత్ర కథలో కొత్తదనం ఏమిటంటే, కష్టమే. ఒక్కముక్కలో కథంటే, తనను చంపాలనుకొనే విలన్ను తప్పించుకొని, అతని కూతురినే పెళ్ళాడే ఓ సీమ బ్యాక్ గ్రౌండ్ హీరో ప్రేమ కథ. కానీ, దీన్ని నడిపించిన విధానంలోనే రాజమౌళి తెలివి చూపించారు. మామూలు ఫ్యాక్షనిస్టు కథగా కాకుండా, రాయలసీమలో కక్షలే కాదు మర్యాదలూ ఉంటాయనీ,అతిథులను ఆదరించే సంప్రదాయమూ ఎక్కువేననీ కథలో జొప్పించారు.

రాయలసీమ నేపథ్యం... అందులో పగ, ప్రతీకారాలతో రగిలిపోయే ఓ పెద్ద మనిషి.... అతనికి ఓ కూతురు... సొంత పని మీద ఆ ఊరికి వచ్చి, అనుకోకుండా ఆమెకు దగ్గరయ్యే హీరో.... కుటుంబాల మధ్య పాత పగతో అతణ్ణి చంపాలనుకొనే హీరోయిన్ తండ్రి, అన్నలు. ఇంట్లో రక్తం చిందరాదంటూ వారికి ఉన్న ఆచారాన్ని ఆసరాగా తీసుకొని, గుమ్మం దాటకుండా ఇంట్లోనే తిరుగుతూ హీరో జాగ్రత్త పడుతుంటాడు. అతను తన కోసమే ఇంట్లోనే ఉంటున్నాడనుకొనే హీరోయిన్ ప్రేమను ఆఖరు క్షణంలో గుర్తించి, ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడతాడు. చివరకు పగ మీద ప్రేమే జయించడంతో కథ కంచికి...

స్వయానా దర్శకుడూ, రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికంలో రాజమౌళికి సీనియరూ, మిత్రుడూ అయిన వర ముళ్ళపూడి ఈ చిత్ర మూల కథకు వీలైనంత సాయం పట్టారు. ఆ సంగతి సినిమా టైటిల్సులో కృతజ్ఞతా పూర్వకంగా దర్శక - నిర్మాతలు ప్రకటించారు. అర్క మీడియా బ్యానర్ మీద దేవినేని ప్రసాద్, యార్లగడ్డ శోభు పేరిట ఈ సినిమా తీసిన డి.ఎస్.ఎస్. ప్రసాద్, వై.ఎన్. శోభనాద్రి ఇద్దరూ రాఘవేంద్రరావుకు అతి సమీప బంధువులే.

రాయలసీమ పాత కక్షల సంగతి తెలియకుండా ఎక్కడో పెరిగి, అనుకోకుండా వాటి మధ్యకు వచ్చిన రాము పాత్రలో సునీల్ అమాయకత్వాన్నీ, భయాన్నీ, సందర్భపరంగా వచ్చే హాస్యాన్నీ పండించారు. చిత్రలేఖనం చేసే నాయిక అపర్ణ పాత్రలో సలోనీ ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటన తరహాలో తెల్లగా, నవ్వుతూ కనిపిస్తుంది. నాయిక తండ్రి పాత్రలో నాగినీడు బాగున్నారు, పాత్రను బాగా చేశారు. రావు రమేశ్ చిన్న పాత్రలో కనిపిస్తారు. రైలులోని కామెడీ సన్నివేశంలో ఈ చిత్ర రచయిత కాంచీ కనిపిస్తారు. ఆ ఘట్టం ప్రధానంగా ఆ పాత్ర చుట్టూరానే తిరుగుతుంది.

గతంలో నృత్య దర్శకత్వ విభాగంలో సహాయకుడిగా పనిచేసిన అనుభవం ఉన్న సునీల్ డ్యాన్సులు బాగా చేశారు. చిరంజీవి తరహా స్టెప్పులతో హాలులో ప్రేక్షకులు కేకలు పెట్టేలా అలరించారు. మునుపు అందాల రాముడులోనూ హీరో పాత్ర పోషించి, డ్యాన్సుల్లో మెప్పించిన సునీల్ కు ఇది మరో కిరీటం. తనకు తగ్గ పాత్రలూ, వినోదం పంచే కథలూ ఎంచుకుంటే, సునీల్ మరికొన్ని చిత్రాల్లో చులాగ్గా హీరో ఇన్నింగ్స్ ఆడేస్తారు.
ఈ మధ్య ప్రతి సినిమాలో సినిమా మొదట్లో కథాంశాన్ని చెప్పడానికో, పాత్రల పరిచయానికో ఆ సినిమాలో నటించని ఎవరో ఒక పెద్ద హీరో గొంతు అరువివ్వడం ఓ ట్రెండ్. (పవన్ కల్యాణ్ -జల్సా-లో మహేశ్ బాబు గొంతు, అల్లు అర్జున్ -వరుడు-లో చిరంజీవి గొంతు గుర్తున్నాయిగా...). ఈ సినిమాలో మరో అడుగు ముందుకు వేసి, సినిమాలో అంతర్భాగమైన ఓ పాత్రలా కనిపించే ఓ డొక్కు సైకిల్ కు ఆద్యంతం హీరో రవితేజతో చెప్పించారు. ఇలా ఓ వస్తువుకో, జంతువుకో మానవ చైతన్యాన్ని ఆరోపించి, కథలో భాగం చేయడమనేది గతంలో దర్శకుడు శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో ఇలాంటిదే చూశాం. అందులో కుక్కపిల్లను పాత్రను చేసి, శేఖర్ కమ్ములే గొంతిచ్చారు. పేరుకు ఇది సీమ సినిమా అయినా,డైలాగులు మాత్రం అన్నీ అక్కడి మాండలికానికి తగ్గట్లు ఉండవు. అది గతంలో వచ్చిన సినిమాల్లోనూ ఉన్న లోపమేగా అనచ్చు. కానీ, ఈ సినిమాలో కొన్ని సీమ పాత్రలు కాసేపు ఆ మాండలికంలోనూ, ఆ వెనువెంటనే సినిమాల్లో వచ్చే కోస్తా తరహా భాషలోనూ మాట్లాడడమే చీకాకు అనిపిస్తుంది.

సింహాద్రిలోని చిత్రమైన గొడ్డలి మొదలు సినిమాకొక కొత్త ఆయుధాన్ని సృష్టించి, జనం మీదకు వదిలే రాజమౌళి ఈ సారి ఆ పని చేయలేదు. అదో రిలీఫ్. ఈ సీమ ఫ్యాక్షన్ సినిమాలో రోకళ్ళు, కత్తులు, గొడ్డళ్ళతోనే సరిపుచ్చుకున్నారు. అలాగే, రాజమౌళి సినిమా అంటే, ఎంతో కొంత సభ్యత పరిధులు దాటిన మాటలు, చేష్టలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఒకటి రెండు సన్నివేశాలు అందుకే ప్రత్యేకిస్తారు. ఎందుకో ఈసారి దానికీ కామా పెట్టారు. ఇది మరో సంతోషం. సింహాద్రి సినిమాలో చిన్న ఎన్టీయార్, పెద్ద రమ్యకృష్ణల ...చిన్నదమ్మే చీకులు కావాలా.... పాట మొదలు దాదాపు ప్రతి సినిమాలో ఏదో ఒక ఐటమ్ సాంగో, హీరోయిన్తో అయినా సరే ఓ మాస్ మసాలా గీతమో పెట్టడం రాజమౌళి దర్శకత్వ మార్కు. ఈసారీ ఆయన ఆ ముద్రను వదిలిపెట్టలేదు. హీరో, హీరోయిన్లు సునీల్, సలోనీల మధ్యే ....రాయె రాయె రాయె రాయె... రాయె సలోనీ జాము రాతిరేళ సందు చూసి జంపు జిలానీ.... అని ఓ మసాలా పాట పెట్టారు.

ఈ సినిమాకు కీరవాణి ఇచ్చిన సంగీతం కథనానికి తోడ్పడింది. రీరికార్డింగులో, సౌండ్ ఎఫెక్టుల్లో చూపిన శ్రద్ధ సన్నివేశాలలోని టెంపోను నిలపడంలో, పెంచడంలో బాగా ఉపకరించింది. పాటల రచనలో, పాడడంలో కూడా కీరవాణి తనదైన శైలిలో చేయి, గొంతు చేసుకున్నారు. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది... పాట, ఆ శైలి కీరవాణే గతంలో అమ్మ చెప్పింది చిత్రంలో అనుసరించిన ధోరణిని గుర్తుకుతెస్తాయి. అలాగే, తెలుగమ్మాయి.... పాట బాగుంటే, పదే పదే నేపథ్యంలో వినిపించే ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే.... అన్న గీత ఖండిక సందర్భం, సన్నివేశాలలోని గాఢతను పెంచింది. సి. రామ్ ప్రసాద్ కెమేరా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా మామూలు కథను వేగంగా చెప్పడంలో తోడ్పడ్డాయి.

మొత్తం మీద రెండే రెండు గంటలున్న ఈ 14 రీళ్ళ సినిమా సమయం తెలియనివ్వకుండా గడిచిపోతుంది. అటు బూతులూ, ఇటు నీతులూ లేకుండా సరదా కాలక్షేపానికి సరిపోతుంది. ఇవాళ చాలా మంది కోరుకుంటున్న వినోదం అదే కాబట్టి, ప్రేక్షకుడికి కాలం గడిచిపోతుంది. సినిమా నడిచిపోతుంది. రాజమౌళికి వరుస విజయాల జాబితాలో మరో అంకె పెరిగిపోతుంది.

6 వ్యాఖ్యలు:

Anonymous said...

very crisp n sweet analysis. keep it going.

తెలుగుయాంకి said...

అయితే చూడాల్సిందేనంటారా? మీ పరిచయము బాగుంది.

Unknown said...

@ anonymous
@ teluguyanki

Thanks andi!

Kathi Mahesh Kumar said...

నవతరంగంలో ఒక సమీక్షకన్నా ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది. లింకు కాకుండా ఒక వ్యాసంలాగా ఈ సమీక్షను ప్రచురిస్తే మీకు అభ్యంతరం లేదుకదా!

శరత్ కాలమ్ said...

బావుంది చిత్ర సమీక్ష.

Anonymous said...

Nijamga chaala baagundandi movie..
mee review kooda daaniki teesipooledu...

idi kooda chaala baagundi.

Indira.