జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, June 25, 2016

కట్ చేస్తే ... ‘గుండె కోత’ అంటున్న సినీ పరిశ్రమ


కట్ చేస్తే ... ‘గుండె కోత’ అంటున్న సినీ పరిశ్రమ













హృదయం... అన్నీ కావాలంటుంది!
మైండ్... ‘అదెలా కుదురుతుంది’ అంటుంది!

‘సహజంగా ఉంటే చాలు... సహస్రకోటి భావాలకు వ్యక్తీకరణ ఉంటుంది’
అని హృదయం అనుకుంటే...
‘సహజంగా ఉండడానికి మనమేమన్నా పశువులమా, మృగాలమా? 

సహజం నాట్ ఎలౌడ్ ఇన్ సమాజం’ అని మైండ్ అంటుంది.
మనిషికున్న అమూల్యమైన హక్కు - ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’.
అలాంటి స్వేచ్ఛను వికసింపజేయాలన్నది... హృదయం ఆశ!
భావప్రకటనకు కూడా హద్దులు ఉండాలన్నది మైండ్ మాట!
హృదయంతో తీస్తున్న సినిమాలను... 

మైండ్‌తో కోస్తున్న సెన్సార్‌బోర్డ్ వైఖరికి 
హిందీ సినిమా ‘ఉడ్‌తా పంజాబ్’ వివాదం తాజా ఉదాహరణ.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

‘‘ఇది నాకూ, అక్కడ (సెన్సార్ బోర్డ్‌లో) అధికారంలో కూర్చొని, కొద్దిమంది గొప్పవాళ్ళ చేతిలోని రాజ్యంలా వ్యవహరిస్తున్న ఒక నిరంకుశుడికీ మధ్య జరుగు తున్న పోరు. ఇదంతా చూస్తుంటే, నేను ఏ ఉత్తర కొరియాలోనో ఉన్నట్లుంది.’’
‘ఉడ్తా పంజాబ్’ చిత్ర సహ నిర్మాత, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్

ఒక సృజనశీలి కడుపు చించుకొని వచ్చిన ఆవేశం ఇది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్ళపై సమాజంలోని అనేక మంది సినీ కళాకా రుల ఆక్రందనకు అద్దం ఇది. అవును. సమాజానికి దర్పణం పట్టాల్సిన సినిమాలో, సృజనాత్మక భావ వ్యక్తీకరణకు వేదిక అయిన సినిమాలో... మన చుట్టూ కళ్ళెదురుగా జరుగుతున్నది చూపిస్తే తప్పు అంటే ఆవేదన, ఆవేశం కాక ఏమొస్తాయి? ఇవాళ భారతీయ సినీ ప్రపంచమంతా హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ (కొత్త హుషారుతో ఎగసిపడుతున్న పంజాబ్ అని స్థూలంగా అర్థం) గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటోంది అందుకే! ఈ నెల 17న రిలీజ్ కావాల్సిన ఈ హిందీ సినిమా పంజాబ్‌లో పెచ్చ రిల్లిన డ్రగ్‌‌స ఉపద్రవంపై తీసిన సమకాలీన సినిమా. అయితే, అలా తీయ డమే ఇప్పుడు ఇబ్బందిగా తయారైంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెన్సార్ బోర్‌‌డ దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపడం మొదలుపెట్టింది.

 దాంతో, దేశంలో ఫిల్మ్ సర్టిఫికేషన్ సైతం రాజకీయ ఒత్తిళ్ళకు అతీతం కాదని మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి, 2015లో పగ్గాలు చేపట్టిన ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానీ సారథ్యంలోని సెన్సార్‌బోర్‌‌డపై విమర్శలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఆధునిక జీవితంలో సర్వసాధారణమై పోయిన కొన్ని తిట్లని సైతం సినిమాలో అనుమతించేది లేదంటూ బోర్‌‌డ గత ఏడాది ఒక జాబితానే సిద్ధం చేసింది. ఫలానా సినిమా ఏ వయస్సువాళ్ళు  చూడచ్చో నిర్దేశిస్తూ, సర్టిఫికెట్ జారీ చేయడమే బాధ్యతగా ఉండాల్సిన సెన్సార్ బోర్‌‌డ ‘నైతిక పోలీసింగ్’ చేయసాగింది.

సెన్సార్‌వ్యవస్థపై బాగా విమర్శలు రావడంతో కొన్ని నెలల క్రితం దర్శకుడు శ్యావ్‌ుబెనెగల్ సారథ్యంలో ఒక సిఫార్సుల సంఘాన్ని కేంద్రం వేసింది. సినిమాల్ని కట్ చేసి పారేయడం కాక, 12 ఏళ్ళు పైబడిన వాళ్ళకీ, పెద్దలకీ మాత్రమే అంటూ రకరకాల వర్గీకరణ చేయాల్సిందిగా ఆ సంఘం సిఫార్సులూ చేసింది. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామన్న ప్రభుత్వం ఆ సిఫార్సుల్ని పట్టించుకొన్న పాపాన లేదు. ఇవాళ ‘ఉడ్తా పంజాబ్’పై కత్తెర వేటు దానికి తాజా ఉదాహరణ.

సామాజిక ఉపద్రవమైన డ్రగ్‌‌స గురించి సినిమాల్లో ప్రస్తావిస్తే తప్పే మిటని అనురాగ్ వాదన. ఆయన మాటల్లో చెప్పాలంటే, ‘‘ఉడ్తా పంజాబ్ ఒక నిజాయతీ సినీ ప్రయత్నం. ఈ సిన్మాను వ్యతిరేకి స్తున్న పార్టీలు, వ్యక్తులు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లే లెక్క!’’ వాస్తవ పరిస్థితులపై అందరి దృష్టీ పడేలా చేసి, జనాన్ని జాగృతం చేసే ప్రయత్నాలకు కత్తెర అడ్డం పెడితే తప్పెవరిది? తీసినవాళ్ళదా? కట్ చేసిన వాళ్ళదా?
..........................................

మీ పిల్లలు డ్రగ్స్ బారినపడ్డారా?
ఇవాళ హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని అనేక నగరాల్లో, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మత్తుపదార్థాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతు న్నట్లు ఆరోపణలున్నాయి. యుక్తవయస్సులోని వారు తెలిసీ తెలియక ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. అలా ఇరుక్కున్నవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...

 కళ్ళు ఎర్రబారి ఉంటాయి. కనుపాప సాధారణం కన్నా మరీ చిన్నది, లేదా పెద్దది అయిపోతుంది  ముక్కుతో పీల్చే కొకైన్ లాంటి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు వెంట తరచూ రక్తం కారుతుంటుంది  తిండి, నిద్ర అలవాట్లు మారిపోతాయి. అకస్మాత్తుగా బరువు పెరగడమో, తగ్గడమో జరుగుతుంది  శ్వాసలోనూ, ఒంటి నుంచి, దుస్తుల నుంచి అసాధారణ వాసనలు వస్తాయి  కాళ్ళూ చేతులు వణకడం, మాట నత్తిగా రావడం, మనిషిలో కుదురు లేకపోవడం కనిపిస్తాయి క్లాసులు తరచూ ఎగ్గొడుతుంటారు.

 ఆటపాటలు, హాబీల మీద ఆసక్తి పోతుంది  వినే సంగీతం, వేసుకొనే దుస్తులు, గదిలోని పోస్టర్లపై డ్రగ్స్, మద్యం అలవాట్లను ప్రతిబింబిస్తుంటాయి  చటుక్కున మూడ్స్ మారిపోతుంటాయి. తరచూ తగాదాలకు దిగుతుంటారు. ఎవరితోనూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరు. గది తలుపులు ఎప్పుడూ బిడాయించుకొని, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు.   ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి.

.............................................

సెన్సార్‌తో సమస్యేంటి? ఏం తీసేయమంటోంది?
పంజాబ్‌లో కేవలం మరో 9 నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని డ్రగ్స్ ఉపద్రవంపై అభిషేక్ చౌబే దర్శకత్వంలో రూపొందిన ‘ఉడ్తా పంజాబ్’ అధికారపక్షానికి ఇబ్బందికరమైంది. సినిమా గనక అలాగే రిలీజైతే తమకు కష్టమని అధికార ‘శిరోమణి అకాలీదళ్’ (కేంద్రంలో గద్దెపై ఉన్న నేషనల్ డెమోక్రాటిక్ ఎలయన్స్‌లో భాగస్వామ్యపక్షం) సహజంగానే భావించింది.

మొదట 40... ఇప్పుడు 89 కట్స్!
నిజానికి, మొదట ఈ సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ’ (సి.బి.ఎఫ్.సి. జనం భాషలో ‘సెన్సార్ బోర్డ్’) 40 కట్స్ చేయా లంది. సినిమాలోని భాష, డ్రగ్స్ వినియోగ దృశ్యాలపై ఈ కట్స్ ఇచ్చింది. నిర్మాతలు దీనిపై అప్పీలు చేసుకున్నారు. కట్స్ లేకుండా, ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తారని ఆశించారు. కానీ, సినిమా చూసిన ‘రివైజింగ్ కమిటీ’ (ఆర్.సి) ఏకంగా సినిమా పేరులో ఉన్న ‘పంజాబ్’ అనే పదాన్నే తొలగించమంది. మొత్తం 89 కట్స్ చేయాలంది. పంజాబ్ రాష్ట్రం పేరు, రాజకీయాలు, ఎన్నికల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తొలగించాలంది.

 ‘వాస్తవికతను చూపించడం’ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహలానీకి నచ్చినట్లు లేదు. దాంతో, అసలు ఈ సినిమా కథ అంతా ఏ రాష్ట్రంలోనూ జరిగినట్లు కాకుండా, ఎక్కడో కల్పిత ప్రాంతంలో జరిగినట్లు చూపమని బోర్డ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బోర్డ్ వర్గాలు ఆ వార్తల్ని ఖండిస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదంటూ, ‘‘మేము కేవలం సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపాం. కావాలంటే, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్.సి.ఎ.టి)ని ఆశ్రయించవచ్చు’’ అంటున్నాయి.
........................................................

సినీ వివాదాలు... నిషేధాలు...
మూకీల కాలం నుంచి మన భారతీయ సినిమాకు సెన్సార్ కష్టాలు కొత్తేమీ కాదు. మతం, రాజకీయాలు, సెక్స్ లాంటి అంశాల కారణంగా సినిమాల్లో భావప్రకటన స్వేచ్ఛకు చాలా సార్లు సంకెళ్ళు పడ్డాయి. తెలుగునాట  పెద్ద ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’, ‘శ్రీమద్వి రాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, కృష్ణ ‘అంతం కాదిది ఆరంభం’ సహా పలు చిత్రాలు సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్నాయి. విప్లవ చిత్రాల మాదాల రంగారావు ‘విప్లవ శంఖం’, ‘ప్రజాశక్తి’, ‘ఎర్రమట్టి’ లాంటి చిత్రాల రిలీజ్ కోసం సెన్సార్‌బోర్డ్‌తో, ప్రభుత్వంతో పోరాటాలు, నిరాహార దీక్షలు చేయాల్సొచ్చింది. గత 4 దశాబ్దాల్లో వచ్చిన వివాదాల్లో కొన్ని...

1972 ‘సిద్ధార్థ’: 
పంపిణీ నుంచి నిషేధించిన తొలి చిత్రం. నటి సిమీ గరేవాల్ నగ్న సన్నివేశం కారణం. చివరకు 1996లో టీవీలో రిలీజ్ చేశారు.

1975 ‘ఆంధీ’: 
ఇందిరా గాంధీతో పోలికలున్నాయంటూ ‘ఎమర్జెన్సీ’ సమయంలో నిషేధించారు. తర్వాత గద్దె నెక్కిన జనతాపార్టీ ప్రభుత్వం రిలీజ్‌కు అనుమతించింది.

1978 ‘కిస్సా కుర్సీ కా’:
 ‘ఎమర్జెన్సీ’లో సంజయ్ గాంధీ అనుసరించిన విధానాలపై రాజకీయ వ్యంగ్య చిత్రం. సినిమా మాస్టర్ ప్రింట్‌నూ, కాపీలనూ సెన్సార్ బోర్డు నుంచి తీసుకెళ్ళి, కాల్చేశారు. తర్వాత కొంతకాలానికి సినిమా రిలీజైంది.

1994 ‘బ్యాండిట్ క్వీన్’: 
ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా లేదంటూ మాజీ బందిపోటు రాణి ఫూలన్‌దేవి వాదన. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం.

1996 ‘ఫైర్’:
 హిందూ కుటుంబంలోని ఆడవారి మధ్య స్వలింగ సంపర్కం గురించి చూపారు. దర్శకురాలు దీపా మెహతాను చంపుతామంటూ బెదిరింపులొచ్చాయి. దాంతో, సెన్సార్ బోర్డ్ తలొగ్గింది. తర్వాత కట్స్ ఏమీ లేకుండానే రిలీజ్.

1996 ‘కామసూత్ర... ఎ టేల్ ఆఫ్ లవ్’:
 మీరా నాయర్ తీసిన సినిమా. దృశ్యాలు మరీ ‘బాహాటంగా’ ఉన్నా యని వాదన. అన్నీ బాగా తగ్గించేసిన వెర్షన్ రిలీజ్.

2003 ‘పాంచ్’ : 
1976 -77 ప్రాంతంలో జరిగిన జోషీ - అభ్యంకర్ వరుస హత్యలపై అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. సెన్సార్‌బోర్డ్ చాలా కట్స్‌తో అనుమతించింది.

2004 ‘బ్లాక్ ఫ్రైడే’: 
1993 నాటి బొంబాయి పేలుళ్ళపై తీసిన సినిమా. ప్రభావం చూపుతుందంటూ, తీర్పు వచ్చేదాకా రిలీజ్ ఆపేశారు. ఆనక 2007లో రిలీజ్.

2005 ‘పర్జానియా’: 
గుజరాత్ అల్లర్లపై సినిమా. నేషనల్‌అవార్డ్ వచ్చింది. గుజరాత్‌లో నిషేధించారు.

2005 ‘వాటర్’: 
వారణాసిలోని వితంతువుల అవస్థపై దీపా మెహతా తీసిన సినిమా. ఛాందసవాదుల విధ్వంసంతో శ్రీలంకలో సిన్మా తీశారు. 2007లో ఇండియాలో రీరిలీజ్.

2013 ‘మద్రాస్ కేఫ్’: 
రాజీవ్ గాంధీ హత్య, శ్రీలంక అంతర్యుద్ధంలో భారత జోక్యం చుట్టూ తిరిగే సినిమా. తమిళనాట ప్రదర్శించనివ్వలేదు.

2015 ‘ఎం.ఎస్.జి - ది మెసెంజర్ ఆఫ్ గాడ్’: 
పంజాబ్‌లోని ‘దేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దేవుడిగా అభివర్ణిస్తూ, ప్రచారం చేసిన సినిమా. పలు సిక్కు వర్గాలు సినిమాను నిషేధించాలని ఆందోళన చేశాయి. 2015 జనవరిలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తరువాత కొంతకాలానికి కట్స్‌తో ఇచ్చింది.
.........................................................

‘‘ఈ ‘ఉడ్తా పంజాబ్’ సినిమాను నిషేధించే బదులు పంజాబ్ ప్రభుత్వం ‘ఉడ్తా’ (ఎగసిపడుతున్న) డ్రగ్స్‌ను నిషేధించాలి. అది చేతకాకపోతే, వాళ్ళు తమను తాము నిషేధించుకోవాలి!’’
- రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత

‘‘ఈ దేశంలో అత్యంత విలువైన ఆస్తి అయిన భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేస్తూ, దేశ పురోగతి గురించి ఎంత డబ్బా కొట్టుకొన్నా అది అర్థం లేని  పని.’’- మహేశ్‌భట్, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత

‘‘నా ఈ పోరాటానికి దూరంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్, ఆప్, ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా. ఇది కేవలం నా హక్కులకూ, సెన్సార్‌షిప్‌కూ మధ్య జరుగుతున్న పోరాటం. ... మిగిలినవాళ్ళు వారు పోరాటాలు వారు చేసుకోండి. నా పోరాటానికి ఎలాంటి రాజకీయ రంగులూ  పులమద్దు.’’
అనురాగ్ కశ్యప్, ‘ఉడ్తా పంజాబ్’ సహ-నిర్మాత, ప్రముఖ దర్శక - రచయిత

‘‘సెన్సార్ బోర్డ్ పనిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోదు. నా మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదు. సినిమా పూర్తిగా చూస్తే కానీ, మేము ‘పంజాబ్’ అనే పదం ఎందుకు తొలగించ మన్నామో మీకు అర్థం కాదు. ...అనురాగ్ కశ్యప్‌కు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఆయన ‘ఉత్తర కొరియా’ అనీ, మరొకటనీ ఏమైనా అనగలుగుతున్నారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి ఆయన డబ్బులు తీసుకున్నట్లు నేను విన్నాను. కేవలం పబ్లిసిటీ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు.’’
- పహ్లాజ్ నిహలానీ, కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ - ప్రముఖ నిర్మాత
.......................................

Friday, June 10, 2016

ఉరేసుకున్న ఫొటో

సూసైడ్ విన్నాం! సెల్ఫీ విన్నాం! మరి... సెల్ఫీసైడ్?
 సెల్ఫీల మోజుతో జాగ్రత్తపడకపోతే, అది సెల్ఫీసైడే!
 అంటే ఫోటోతో ఉరేసుకోవడమే 
అమ్మాయిలు అమాయకంగా ప్రేమలో పడి... 
లేకపోతే స్నేహం అనుకొని... 
అదీ కాకపోతే పరిచయం అనుకొని... 
ఫోటోలు, సెల్ఫీలు దిగి... పంచుకొంటే, 
వాటిని బ్లాక్‌మెయిలింగ్ కోసం వాడుతున్న‘బ్లాక్‌షీప్స్’ ఎన్నో!
 అమ్మాయిలూ! జాగ్రత్త!
సెల్ఫీలు క్యారెక్టర్‌ని చంపేస్తున్నాయి!
 డోన్ట్ కమిట్ ‘సెల్ఫీసైడ్’!

ఒకప్పుడు ఆటోగ్రాఫ్... ఆ తరువాత ఫోటోగ్రాఫ్... మరి ఇప్పుడు? స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ!

గౌరవప్రదంగా చెప్పాలంటే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఇవాళ ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్. లోతుగా ఆలోచించి చూస్తే - ప్రతి ఒక్కరూ ఇరుక్కుపోతున్న, తప్పించుకోలేకపోతున్న తీవ్రమైన వ్యసనం. తీసుకున్న సెల్ఫీని మరుక్షణమే సోషల్ మీడియాలో పెట్టుకోవాలని జనం తాపత్రయపడుతున్నారు. ఈ సెల్ఫీల వ్యవహారంతో మిగిలిన ఇబ్బందుల మాట ఎలా ఉన్నా, అమ్మాయిలు మాత్రం అమాయకంగా బలి అవుతున్నారు. కొందరు సైబర్ నేరగాళ్ళ చేతిలో ఆయుధంగా మారిన సెల్ఫీలకు బలవుతున్నారు.  

స్నేహం, ప్రేమ, పెళ్ళి పేరుతో కొందరు ప్రబుద్ధులు - అమ్మాయిల్ని నమ్మించి, వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. తీరా ఎక్కడో బెడిసికొట్టాక, ఆ ఫోటోలను నెట్‌లో పెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ళ సంఖ్య ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలే అందుకు ఉదాహరణ.

సెల్ఫ్ గోల్!
హైదరాబాద్‌లోని సఫిల్‌గూడాకు చెందిన 32 ఏళ్ళ నిజాముద్దీన్ హైదర్ ఇలాంటి సైబర్ నేరానికే పాల్పడ్డాడు. అయిదేళ్ళ క్రితం ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు. ఎం.బి.ఏ. చదివిన ఆ అమ్మాయితో స్నేహం చేశాడు. అనాథనంటూ సినిమా కష్టాలన్నీ చెప్పుకొని సానుభూతి చూరగొన్నాడు. రోజులు గడిచేకొద్దీ వాళ్ళ పరిచయం కాస్తా స్నేహం పరిధి దాటి, చాలా ముందుకు వెళ్ళింది. త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని ఆ అమ్మాయికి మనోడు మాయ మాటలు చెప్పాడు.

అలా రెండేళ్ళు గడిచిపోయాయి. ఆ సమయంలో ఆ అమాయకురాలు ఈ మేకవన్నె పులితో సన్నిహితంగా మెలుగుతూ, అతని ఫోన్‌లో చాలా సెల్ఫీలు దిగింది. తీరా నిజాముద్దీన్‌కు అప్పటికే పెళ్ళి అయిపోయిందని ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. దాంతో, అతగాడిని దూరం పెట్టింది. కానీ, కలసి తీసుకున్న సెల్ఫీలను అడ్డం పెట్టుకొని, ఆమెను నిజాముద్దీన్ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించసాగాడు. చివరకు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. సైబర్ నేరగాడు నిజాముద్దీన్‌ను ఈ ఏప్రిల్ ఆఖరులో పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబర్ నేరాల్లో మరో వికృత కోణం - సోషల్ మీడియాలో తప్పుడు ఐడెంటిటీతో చేస్తున్న మోసపూరిత స్నేహాలు. హైదరాబాద్‌లోని భోలానగర్‌కు చెందిన అబ్దుల్ మజీద్ చేసింది అదే. 21 ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ విద్యార్థి ఫేస్‌బుక్ ద్వారా ఏకంగా కొన్ని వందల మంది అమ్మాయిలతో స్నేహం చేశాడు. తాను కూడా అమ్మాయినే అని ఫేక్ ఐడెంటిటీతో నమ్మించాడు. తోటి కాలేజ్ స్టూడెంట్ అనుకున్న అమ్మాయిలందరూ అతని వలలో పడ్డారు. ఎంతగా మోసపోయారంటే, చివరకు తమ తల్లితండ్రులతో చెప్పని విషయాలు కూడా ‘ఆమెనని మోసం చేసిన అతని’తో పంచుకున్నారు. మద్యపానం, పొగతాగడం దగ్గర నుంచి చివరకు తమ బాయ్‌ఫ్రెండ్స్, లైంగిక ప్రాధాన్యాల దాకా అన్నీ చెప్పుకొన్నారు.

అలా వాళ్ళ దగ్గర చనువు సంపాదించిన మజీద్ వాళ్ళ నుంచి అర్ధనగ్న సెల్ఫీలు కూడా తెప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ సెల్ఫీల బూచి చూపెట్టి, భయపెట్టసాగాడు. ఆన్‌లైన్‌లో పెట్టేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ వ్యవహారం చివరకు సైబర్ పోలీసులకు చేరింది. కొన్ని వందల మంది టీనేజ్ అమ్మాయిల అర్ధనగ్న సెల్ఫీలు, ఫోటోలను ఈ ప్రబుద్ధుడు సేకరించినట్లు తేలింది. గతంలో ఏడు నెలల కాలంలో రెండుసార్లు అరెస్టయిన మజీద్‌పై తాజాగా పీడీ చట్టం కింద చర్య చేపట్టారు.

ప్రేమికుడే బ్లాక్‌మెయిలర్!
ఇవాళ సమాజంలో అమ్మాయిలపై పెరుగుతున్న సైబర్ వేధింపులకు ఈ తాజా సంఘటనలు మచ్చుకు ఒకటి రెండు మాత్రమే! అసభ్యంగా కానీ, బెదిరింపు ధోరణిలో కానీ ఆడవారికి మెయిల్స్, మెసేజ్‌లు పెట్టడం సైబర్ నేరాల విభాగంలోనే, మహిళలపై సాగుతున్న దౌర్జన్యాల కిందకు వస్తాయి. అలాగే, ప్రైవేట్, అశ్లీల సమాచారాన్ని, ఫోటోలను ఆన్‌లైన్‌లో కానీ, అశ్లీల సైబర్ ప్రపంచంలో కానీ పోస్ట్ చేయడం, సర్క్యులేట్ చేయడం కూడా! స్త్రీల విషయంలో ఈ రెండు రకాల నేరాలు ఇటీవల పెరుగుతున్నాయి.

నిజం చెప్పాలంటే - సన్నిహితంగా ఉంటూ తీసుకున్న సెల్ఫీలు, వీడియోలు, వీడియో ఛాట్‌లు ఇప్పుడు స్త్రీల బ్లాక్‌మెయిలింగ్‌కు ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. నూటికి దాదాపు 30 కేసుల్లో - ఇలా మాజీ లవర్స్, మోసగాళ్ళు ఒకప్పటి ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
 విచిత్రం ఏమిటంటే, ఫిర్యాదులైతే చేస్తున్నారు కానీ, బాధితుల్లో నూటికి 90 మంది ఈ విషయాన్ని ఎఫ్.ఐ.ఆర్. దాకా తీసుకువెళ్ళడం లేదు.

విషయం వీధికెక్కకుండా, ఆ మోసగాళ్ళ చేతి నుంచి ఆ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. అవి ఏవీ ఆన్‌లైన్‌లోకి రాకుండా ఉండేలా చూడాలని మాత్రమే తాపత్రయపడుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆ మధ్య జరిపిన సర్వేలలో కూడా సెల్ఫీలకూ, మనుషుల మధ్య అనుబంధాల్లో ఉన్న సమస్యలకూ అవినాభావ సంబంధం ఉందని తేల్చాయి.

అదే పనిగా సెల్ఫీలు తీసుకోవడం, వాటిని పోస్ట్ చేయడం వల్ల అనుబంధాలు దెబ్బతింటాయని ‘సైబర్ సైకాలజీ, బిహేవియర్ అండ్ సోషల్ నెట్‌వర్కింగ్ జర్నల్’ సైతం పేర్కొంది.  మొత్తం మీద సెల్ఫీలతో ఉపయోగాల మాటెలా ఉన్నా, సమస్యలు చాలానే బయటపడుతున్నాయి. అమ్మాయిలూ! తస్మాత్ జాగ్రత్త! డోన్ట్ కమిట్ సెల్ఫీసైడ్!

- రెంటాల జయదేవ
............................................

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ!  నూటికి 90 నమోదు కావట్లేదు!
‘సైబర్ నేరాలు’ జరిగినప్పుడు 2000 నాటి ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం’ కింద, భారతీయ శిక్షాస్మృతి (ఐ.పి.సి) కింద ఎక్కువ భాగం అరెస్టులు జరుగుతున్నాయి. పెరిగిపోతున్న పట్టణీకరణ, ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ప్రధానంగా నగరాల్లో, పట్టణాల్లో సైబర్ క్రైమ్ రేటు ఎక్కువగా ఉంటోంది. అయితే, నేరాల సంఖ్య వేలు, లక్షల్లో ఉన్నా, కేసుల నమోదవడం మాత్రం తక్కువే. మోసాలు, లైంగిక వేధింపులు, అప్రతిష్ఠ పాలు చేయడం లాంటి వ్యవహారాల్లో నూటికి 90 నేరాల్లో జనం వీధికెక్కడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దాంతో, కేసులు నమోదు కావడం లేదు.

‘జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) సమాచారం మేరకు - కేవలం నమోదైన కేసుల లెక్కే చూసినా- 2010 నుంచి 2013 మధ్య కేవలం మూడేళ్ళ కాలంలో సైబర్ నేరాలు 350 శాతం పెరిగాయి. 2010లో కేవలం 966 సైబర్ నేరాల కేసులు నమోదైతే, 2013 కల్లా ఆ కేసుల సంఖ్య ఏకంగా 4,356కు చేరింది. భారతదేశం మొత్తం మీద గమనిస్తే - ఐ.టి, ఐ.టి సంబంధ పరిశ్రమలకు సంబంధించి 70 శాతానికి పైగా ఆదాయం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తుంది. అందుకు తగ్గట్లే, ఈ రాష్ట్రాల్లోనే ఐ.టి. చట్టం కింద అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయి.
................................................

నెట్ సౌకర్యంతో పాటే... నేరాలూ...
ప్రస్తుతం సగటు సైబర్ క్రైమ్ రేటు ప్రపంచవ్యాప్తంగా 32 శాతం కాగా, భారతదేశంలో 16 శాతమే. అయితే, ప్రపంచ ఇంటర్నెట్ విపణిలో మన భారతీయ మార్కెట్ ఏటా 37 శాతం మేర పెరుగుతోంది. వచ్చే 2017 నాటికల్లా మన దేశంలో 50 కోట్ల మంది దాకా ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారని అంచనా. ఆ దెబ్బతో మనం అమెరికాను మించిపోయి, ప్రపంచంలో చైనా తరువాత నెట్ వినియోగదారుల సంఖ్యలో రెండో అతి పెద్ద దేశంగా అవతరిస్తామన్న మాట! ఆ లెక్కన సైబర్ నేరాల రేటు కూడా బాగా పెరగనుంది. ఈ నేరాల్లో భాగమైన లైంగిక వేధింపుల లాంటివి పక్కనపెట్టి, కేవలం ఆర్థిక నేరాల విషయం చూసినా, మనదేశంలోని ప్రతి నాలుగు సంస్థల్లో ఒకటి ఈ సైబర్ ఆర్థిక నేరాల బారిన పడుతోంది.
...................................................


సైబర్ భూతం బారినపడకుండా ఉండాలంటే...
♦ మీ వ్యక్తిగత సమాచారాన్ని ‘సోషల్ మీడియా ఛాట్’లలో వెల్లడించకండి.
♦ ప్రెమ మోజులో అవతలి వ్యక్తుల్ని అతిగా నమ్మి, వాళ్ళతో చనువుగా ఉంటూ, సెల్ఫీలు దిగడం ఎప్పటికైనా ఇబ్బందే!
♦ పిల్లలు కానీ, యువతీ యువకులు కానీ తల్లితండ్రులకు తెలియకుండా తమ ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకపోవడమే బెటర్.
♦ ఈ డిజిటల్ యుగంలో ఏ ఫోటో, ఏ వీడియో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి, మహిళలు తమ సన్నిహితులైనవారితో సహా ఎవరినీ తమ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను రికార్డు చేయనివ్వకూడదు.
♦ అపరిచితులు ఎవరితోనూ ‘సన్నిహితంగా’ ఛాటింగ్ చేయకండి. ప్రైవేట్ ఫోటోలను ఎవరితోనూ షేర్ చేయకండి.
♦ అపరిచితులతో మామూలు ఫోటోలు కూడా పంచుకోవద్దు. వారు దాన్ని ‘మార్ఫింగ్’ చేసి, బ్లాక్‌మెయిలింగ్ చేసే ముప్పు ఎక్కువ.
.......................................................
- రెంటాల జయదేవ
............................................

 Sakshi | Updated: June 06, 2016 23:08 (IST)

(Published in 'Sakshi' daily, Family page on 7th June 2016, Tuesday)


Thursday, March 10, 2016

ఎందరో మహానుభావుల కృషే కారణం.... (తెలుగు సినిమా జన్మదినోత్సవO)


ఎందరో మహానుభావుల కృషే కారణం 













‘‘ఎందరో మహానుభావుల కృషి వల్ల మనమిలా తెలుగు సినిమా తల్లి పండుగను ఆనందంగా జరుపుకోగలుగుతున్నాం. ఇప్పటి తరం కూడా ఈ వేడుకను జరపడం సంతోషకరమ’న్నారు అలనాటి ప్రముఖ నటి జమున.

 తొలి తెలుగు సినిమా ‘భక్తప్రహ్లాద’ ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ నెల ఆరో తేదీకి 84 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తెలుగు సినిమా జన్మదినోత్సవాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ జరుపుకొంది. అందరూ కలిసి కేక్‌ను కోసి ఆనందాన్ని పంచుకున్నారు. 

అనంతరం జమున మాట్లాడుతూ ‘‘నిర్మాతలందరూ గర్వించదగ్గ నిర్మాత కె.రాఘవ. నేను నటిని కావడానికి కారణం ‘కీలుగుర్రం’. హెచ్‌.ఎం.రెడ్డి, కె.వి.రెడ్డి, తాతినేని ప్రకాశరావు వంటి ఎందరో ప్రముఖ దర్శకులు మమ్మల్ని తీర్చిదిద్దారు. ఇది చాలా అదృష్టం. ఇప్పటి తరంలోనూ గొప్ప దర్శకులున్నారు. వీరంతా వారి బాటలో నడుస్తూ ఇప్పడున్న సాంకేతికతను ఉపయోగించుకుని మరింత పురోగతిని సాధించాల’’న్నారు. 

తొలి తరం నటి కృష్ణవేణి మాట్లాడుతూ ‘‘ 1935లో సి.పుల్లయ్య రూపొందించిన ‘సతీ అనసూయ’లో నటించా. అందులో నా పారితోషికం ఆరు వందల రూపాయలు. ఆ తర్వాత నటిగా ఎన్నో చిత్రాల్లో నటించాను. పలు చిత్రాలు నిర్మించాను. అయితే నేను నిర్మించిన ‘కీలుగుర్రం’లో రాక్షసి వేషం వేయమని అంజలీదేవిని అడిగితే నేను పాట పాడితే వేస్తానని షరతు పెట్టి నటించింది. ఆ సినిమా ఆరోజుల్లోనే రూ.40 లక్షలు రాబట్టింది. అలనాటి జ్ఞాపకాలను ఈ వేడుకలో పంచుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు. 

కోడి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘మనమిలా ఈ వేడుక చేసుకోవడం ఓ జీవితసాఫల్యంగా భావిస్తున్నాను. ఈ వేడుకను మరింత ఘనంగా జరపలేదని అనుకోవద్దు. ఎందుకంటే తెలుగు సినిమా తల్లికి నిత్యమూ పండుగే. ఆనాటి మహానుభావులు సాధించినదానితో పోల్చుకుంటే మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది. నాకు సినిమా భిక్ష పెట్టింది రాఘవగారే’’అని అన్నారు. 

‘‘ఈ వేడుకకు కారణమైన ఎందరో మహానుభావులను తలచుకుంటుంటే శరీరం పులకరించిపోతోంది. అనిర్వచనీయ అనుభూతిని పొందుతున్నామ’’న్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. 

రామ్‌ రావిపల్లి చెబుతూ ‘‘తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1931 సెప్టెంబరు 15న పుట్టిందనే ప్రచారం ఉంది. తెలుగు సినిమా పుట్టింది 1932 ఫిబ్రవరి 6 అనీ, దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి అనీ, ఆ సినిమా తొలి టికెట్‌, పోస్టర్‌, కలెక్షన్‌ నివేదికలతో సహా నిరూపించిన రెంటాల జయదేవ్‌ కారణంగానే ఇప్పడీ వేడుకను ఈ రోజున జరుపుకున్నామ’’న్నారు. 

ఈ వేదికపై తొలితరం సినిమా ప్రముఖుల్ని సన్మానించారు. కార్యక్రమంలో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి, గీతాంజలి, నిర్మాత కె.రాఘవ, కె.ఎస్‌.రావు, రావి కొండలరావు, కాకరాల, రెంటాల జయదేవ్‌, అచ్చిరెడ్డి, కాశీ విశ్వనాథ్‌, సాగర్‌, రామసత్యనారాయణ, బాబ్జీ, సాయి వెంక‌ట్‌ తదితరులు పాల్గొన్నారు.






















(Published in 'Eenadu' daily, Cinema Page, 8th Feb 2016, Monday)
......................................

Thursday, February 11, 2016

అందుకే ఇన్నాళ్లు గుర్తింపుతో ఉన్నాం - సీనియర్‌ నటి జమున




‘‘గడిచిన రోజులు ఎంతో మంచివి. హెచ.ఎమ్‌. రెడ్డి, బి.ఎన,రెడ్డి, కె.వి.రెడ్డి, తాతినేని ప్రకాశరావు వంటి దర్శకులు నాలాంటి వారిని నాయికలుగా తీర్చిదిద్ది, వైవిధ్యమైన పాత్రలిచ్చి ప్రొత్సహించారు కాబట్టే తెలుగు పరిశ్రమలో ఇన్నాళ్లు మంచి గుర్తింపుతో ఉండగలిగాం. అలనాటి దర్శకులను స్ఫూర్తిగా తీసుకుంటే ఇప్పుడొస్తున్న యువ దర్శకులు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు’’ అని సీనియర్‌ నటి జమున అన్నారు.

 తెలుగు సినిమా పుట్టినరోజు వేడుక కళామంజూష కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ నటీమణులు కృష్ణవేణి, జమున, గీతాంజలి, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె. రాఘవ, గాయని రావు బాలసరస్వతి, రావి కొండలరావు, కాకరాల వెంకట సత్యనారాయణ, రెంటాల జయదేవలను జ్ఞాపికలతో సత్కరించారు. 

‘‘1935లో ‘సతీ అనసూయ’తో నన్ను బాలనటిగా పరిచయం చేసిన సి.పులయ్యగారిని ఎప్పటికీ మరువలేను. నటిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో నాకెన్నో మంచి అనుభవాలున్నాయి’’ అంటూ కృష్ణవేణి అలనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘చాలామంది మన సినిమా పుట్టినరోజును మరచిపోయాం అనుకుంటారు. పరిశ్రమకు చెందిన ఎవరొకరి జన్మదిన వేడుక ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అలా చూస్తే నిత్యం తెలుగు పరిశ్రమ పుట్టినరోజు వేడుక జరుపుకుంటునట్లే’’ అని కోడి రామకృష్ణ అన్నారు. 

‘‘తెలుగు పరిశ్రమ స్థాయి ఎంతో పెరిగింది. మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’’ అని కె. రాఘవ తెలిపారు. 

ఎస్వీ కృష్ణారెడ్డి,, కె. అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్‌, బాబ్జీ, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





















(Published in 'Andhra Jyothy' daily, Cinema Page, 8th Feb 2016, Monday)
.................................

సిగ్గుపడాలా? గర్వపడాలా!? (తెలుగు సినిమా తల్లి జన్మదినోత్సవ వేడుకలు)




chitram...
మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద ప్రదర్శితమై 84 ఏళ్లయన సందర్భంలో పాత తరానికి చిరు సన్మానం. చిత్రంలో అచ్చిరెడ్డి, రాఘవ, రామారావు, జయదేవ, కృష్ణవేణమ్మ, రావు బాలసరస్వతి, జమున, గీతాంజలి, రావికొండలరావు


......................................










వందస్తుల ఆకాశ హార్మ్యానికైనా
-పునాది ఒక్కటే ఉంటుంది.
80 ఏళ్ల జీవిత ప్రయాణమైనా
-పుట్టుకనుంచే మొదలవుతుంది.
మనిషికైనా మహాక్రతువుకైనా.. విధ్వంసానికైనా వినోదాలకైనా -ఒక మొదలుంటుంది. అది తెలియకుండానే తెలుగు సినిమాకు 84 ఏళ్లు వచ్చేశాయి. పేగు తెంచుకున్న బిడ్డ -ప్రపంచంలోకి రాగానే ఆ అద్భుత ఘడియలను తడిమి తడిమి వెతుక్కుంటాం. ఎంతోమంది బిడ్డలకు జన్మనిచ్చి, కళాకారులుగా గుర్తింపునిచ్చిన తెలుగు సినీ కళామతల్లి -ఆవిర్భావ ఘడియల్ని మాత్రం చరిత్ర పేజీల్లో నిక్షిప్తం చేయలేకపోయాం. దాని నీడన బతికేస్తూనే -మొదలును నరికేసే ప్రయత్నం మాత్రం
దిగ్విజయంగా చేసేస్తున్నాం.

మంచో చెడో, తెలిసో తెలియకో, దొరికిన ఆధారాలు నిజమో కాదోనన్న శంకలు పెట్టుకోకుండా చిన్నదో పెద్దదో -్ఫబ్రవరి 6న హైదరాబాద్‌లో కొందరు ఔత్సాహికులు చిన్న మహత్కార్యం నిర్వహించారు. పొరుగు రాష్ట్రం రికార్డుల్లో నిక్షిప్తమైవున్న ‘్భక్త ప్రహ్లాద’ ప్రదర్శిత తేదీని గుర్తు చేసుకున్నారు. అదే తెలుగు సినిమా ‘డేట్ ఆఫ్ బర్త్’ అన్న ఆనవాళ్లను ఆనవాయితీ చేసే సదుద్దేశంతో -ఆనందంగా వేడుక జరుపుకున్నారు. పదేళ్ల ప్రయత్నంతో ఆ తేదీని ఒకరు వెలికితీస్తే, వందేళ్ల సినిమాకు ఇంత అన్యాయం చేశామా? అన్న సిగ్గుతో కొందరు కనీసం చిన్న పండగైనా చేశారు. అసలా తేదీని ఎవరు నిర్థారించారు? తెలుగు సినిమా జన్మదినంగా ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలన్న -అనుమానాలు అక్కడెవరికీ రాలేదు. నిజానికి రాకూడదు కూడా. ఎందుకంటే -అసలు లేనిదానికంటే తెలిసిన తేదీని ‘సినిమా బర్త్ డే’ అనుకుని సెలబ్రేషన్ చేయడం ఉత్తమం కనుక.

ఇంతకాలం మూలాలను గాలికి వదిలేసుకున్నందుకు సిగ్గుపడాలా? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని చిన్న ప్రయత్నంగా వెలికితీసిన ‘డేట్ ఆఫ్ బర్త్’ను అతి చిన్నగానైనా సెలబ్రేట్ చేసుకున్నందుకు గర్వపడాలా? అన్నది -సినిమాను నమ్ముకున్నోళ్ల, సినిమాను అమ్ముకుంటున్నోళ్ల, సినిమాను అభిమానించి ఆరాధించేవాళ్ల ఆత్మసాక్షిమీద ఆధారపడి ఉంటుంది.

ఎవరెస్ట్ ఎత్తాలనుకుంటే అత్యాశగానీ, ఎక్కాలనుకోవడంలో తప్పులేదుగా. నిన్న జరిగింది అలాంటి ప్రయత్నమే. తెలుగు సినిమాను ప్రత్యేకంగా ఉద్దరించాల్సిన పని లేదు. కనీసం -దాని పుట్టుకను గాలికొదిలేయకుండా నిక్షిప్తం చేసుకోవడం, పండుగ చేసుకోవడం మాత్రం చారిత్రక అవసరం. అందుకు -ఇచ్చకాలు చెప్పే గొప్ప స్టార్లు ఎంతవరకూ సహకరిస్తారో చూద్దాం.
ప్రపంచ సినిమా ప్రారంభమైనప్పుడే -తెలుగు సినిమా అంకురార్పణకు ఆలోచనా బీజం పడింది. మూకీ సినిమాగా ఆరంభమైంది. అయితే మూకీకి -్భషతో సంబంధం లేదు కనుక వాటిని విడిచిపెట్టాలి. మూకీ నుంచి మొదలైన అడుగులు టాకీకి చేరడంతో -తొలి తెలుగు టాకీ సినిమాగా భక్తప్రహ్లాద విడుదలైంది. నిజానికి ఆ సినిమా విడుదల రోజే -తెలుగు సినిమా డేట్ ఆఫ్ బర్త్. ఆ రోజు ఎప్పుడు? అన్నది కొనే్నళ్ల వరకూ అంతుచిక్కనిదే.
**

టాకీలు వచ్చిన తరువాత -సినిమా నిర్మాణంలో మునిగిపోయిన ముందుతరం చరిత్రను నమోదును చేయడం తెలుగు పరిశ్రమ మర్చిపోయింది. షూటింగ్‌ల్లో మునిగిపోయి గొప్ప చిత్రాలను రూపొందించారే తప్ప, చరిత్రను నిక్షిప్తం చేసుకోవాలన్న ఆలోచనకు రాలేకపోయారు. తొలి తెలుగు చిత్రం తొలిసారి తెరపై ఎప్పుడు ఆవిష్కృతమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ విషయాన్ని నిర్ధారించుకోడానికి 80ఏళ్లు పట్టింది. డేట్ ఆఫ్ బర్త్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి మరో నాలుగేళ్ల కాలం గడిచింది. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద తెరపై తొలిసారి ఫిబ్రవరి 6, 1932లో ప్రదర్శించారన్న విషయాన్ని ఔత్సాహిక జర్నలిస్ట్ రెంటాల జయదేవ నాలుగేళ్ల క్రితమే నిరూపించాడు. అయినా పరిశ్రమ పెద్దలకు అదేమంత గొప్ప విషయం అనిపించలేదు. తెలుగు సినిమా తల్లి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోడానికి ఒక మొదలు దొరికిందన్న ఆనందం కలగలేదు.
**

సినిమా అనేది వినోదాన్ని పంచే వేడుక. స్వర్గయుగం నుంచీ ఎన్నో సినిమా వేడుకలు జరిగాయి. పరిశ్రమలోనూ, ప్రతి చిత్రంలోనూ, సినిమా విడుదలకు, వందరోజుల ప్రదర్శనకు.. ఇలా చిన్న కారణాలకూ పెద్ద వేడుకలే చేశారు. చేస్తూ వస్తున్నారు. ఆ వేడుకలు శృతిమించి స్టార్ హీరోల బర్త్‌డేలు, ఆడియో విడుదలలు, టీజర్లు, ఫస్ట్ పిక్ విడుదలలూ ఇలా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు -స్టార్ హీరో సోషల్ మీడియా ఫాలోవర్స్ లక్షదాటినా, మేకోవర్ స్టిల్‌కు మిలియన్ లైకులొచ్చినా -పండుగలు చేస్తూనే ఉన్నారు. వీటన్నింటికీ మూలమైన -సినిమా పుట్టుకను మాత్రం పట్టించుకున్న వాళ్లు లేరు. బిడ్డ పుడితే జన్మనక్షత్రం, రాసిఫలం చూసుకుని ఉన్నతమైన భవిష్యత్ కోసం జాతకం రాయించుకుంటాంగానీ, -ఇంతమంది బిడ్డలకు కళా జన్మనిచ్చిన తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవడానికి తీరికలేనంత బిజీ అయిపోవడం నిజంగా దురదృష్టం. ఇప్పటి వరకూ పుట్టిన తేదీ తెలీదు కనుక జరపలేదు అనుకోవచ్చు, తెలిసిన తరువాతైనా ఏదీ పండుగ. ఎక్కడ వేడుక?
**
1932లో మాట్లాడే సినిమా మొదలైంది కనుక ఇప్పటికి 84 ఏళ్ల తెలుగు సినిమా అంటున్నాం. బాల్యం నుంచీ ఎయే దశలో ఏయే ఆనందం పొందుతామో -అలాగే తెలుగు సినిమా కూడా వనె్నచినె్నలు పోయి, దెబ్బలు తగిలించుకుని, ముళ్లనుదాటుకుని, కొన్ని సందర్భాల్లో పూలపై నడుస్తూ.. మొత్తానికి ఉన్నతమైన దశకు చేరకుంది. కష్టనష్టాలకు, సుఖానందాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఇప్పటికీ -అప్పటి తరం నిలిచే ఉంది. వాళ్లను కదిలిస్తే కథలుగా చెప్తారు కూడా. కానీ కదిలించేది ఎవరు? చరిత్రను నిక్షిప్తం చేసేది ఎవరు?.
**
ఫిబ్రవరి 6, 2016.
పరిశ్రమను ప్రేమించే కొందరు వ్యక్తులు తెలుగు సినిమా తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. కళామంజూష పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతి సంస్థ తరఫున దర్శకుడు బాబ్జీ, రామ్ రావిపల్లి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ లాంటివాళ్లు అందులో పాలుపంచుకున్నారు. నిజానికిది -చిరు ప్రయత్నమే. కానీ -తెలుగు సినిమా చరిత్రలోని మొదటి అంకాన్ని రికార్డు చేసుకోవాలన్న చారిత్రక అవసరాన్ని గుర్తు చేసే చేదు నిజం. తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి వచ్చే తరాలు తెలుసుకోవాలంటే -ఇప్పుడు మనం వాటిని రికార్డు చేసి తీరాలన్న సంకల్పం వాళ్లది. అదృష్టంకొద్దీ ఇప్పటికీవున్న అప్పటి ఉద్ధండ నటీనటులు, దర్శకులు చెప్పే విషయాలను భద్రపర్చాలన్న సంకల్పం వాళ్లది. అప్పటి చరిత్ర మూలాల్ని కనుక్కోడానికైనా -ఇలాంటి చిరు ప్రయత్నాలు మొదలెట్టాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేసే వేడుకది.
**
అందాల కలల ప్రపంచానికి సంబంధించిన తొలి అడుగు కనుక్కున్నారన్నది ఇక్కడ ప్రధానం కాదు. కానీ- ఈ ప్రయత్నం నుంచే అనేక చారిత్రక కోణాలు తెలుసుకునే ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పటి సినిమా నిర్మాణ విశేషాల చరిత్ర అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా తొలి ప్రదర్శన తేదీని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ‘బర్త్ డే’గా నిర్వహించారు. ఇందులో తొలి నాళ్లల్లో కథానాయికగా నటించి, అనేక చిత్రాలను శోభనాచల స్టూడియో ద్వారా రూపొందించి అనేక మంది లెజెండ్స్‌ను పరిశ్రమకు పరిచయం చేసిన సి కృష్ణవేణి, తొలితరం నేపథ్యగాయని రావు బాలసరస్వతి, శతాధిక వృద్ధుడైనా ఇప్పటికీ మంచి కథ దొరికితే సినిమా తీస్తానంటున్న ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవతోపాటు అలనాటి నటీమణులు జమున, గీతాంజలి, నటులు కాకరాల, రావి కొండలరావు, కెఎస్ రావు లాంటి వాళ్ళను సత్కరించుకుని పండుగ చేసుకున్నారు. వాళ్ల అనుభవాలను తెలుసుకుని ఆనందించారు. ఈ ప్రయత్నం చల్లారిపోకుండా, తడారిపోకుండా సినీ పరిశ్రమలోని పెద్దలు నడుంకట్టాలి. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమకు సరైన రికార్డు లేదని బాధపడుతూ సిగ్గుపడే పరిస్థితికి ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లం అవుతాం. కేవలం తళుకు బెళుకు చిత్రాలు చూపడమే కాదు, పరిశ్రమ చరిత్రనూ చెప్పేవాళ్లం అవుతాం. ఎవరో ఒకరు పూనుకుంటారులే అనుకోకుండా -పరిశ్రమ మనకు అన్నం పెట్టిందన్న నిజమైన అభిమానం ఉన్న వాళ్లంతా తరువాతి ‘బర్త్‌డే’లు పెద్ద ఎత్తున నిర్వహించడానికి పూనుకోవాలి. మూడుపువ్వులు ఆరుకాయల చరిత్రను లిఖించే సంప్రదాయాన్ని శాశ్వతంగా కొనసాగించాలి.
..............................................
జాతకం ఎలా?

ఎంతో ఆనందాన్ని, వినోదాన్ని పంచే తెలుగు సినిమా ఇటీవలి కాలంలో ఎందుకు వెలవెలబోతోందన్న ప్రశ్న -ఓ ఔత్సాహిక వ్యక్తికి కలిగిందట. జాతకం చెప్పమని జ్యోతిష్యుడు దగ్గరకెళ్తే -అందుకు పుట్టిన తేదీ కావాలని కోరాడట. అధ్యయనాలు, అష్టకష్టాల తరువాత ఒక తేదీని నిర్థారించుకున్న ఆ వ్యక్తి -తెలుగు సినిమా పుట్టిన తేదీని మళ్లీ జ్యోతిష్యుడికి చూపించాడట. మీ పరిశ్రమలో సిఎం అయిన నటుడున్నాడా? అని ప్రశ్నించాడట జ్యోతిష్యుడు. ఉన్నాడని సమాధానమిచ్చాడు ఔత్సాహికుడు. తన పాటతో అలరించిన గంధర్వ గాయకుడు ఉన్నాడా? అన్న ప్రశ్నకు ఘంటశాల పేరు చెప్పాడట. పరిశ్రమకు అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన రెండు కళ్లలాంటి నటులున్నారా? అన్న ప్రశ్నించాడట పుట్టిన రోజుతో జాతకాన్ని చూస్తూ జ్యోతిష్యుడు. ఎన్టీఆర్, ఎన్నాఆర్‌ల పేర్లు చెప్పాడట ఔత్సాహికుడు. అయితే, ఇదే మీ తెలుగు సినీ కళామతల్లి పుట్టిన రోజయ్యా! అంటూ నిర్థారించాడట జ్యోతిష్యుడు. ఆ రోజునే మనమిప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం.
-ఎస్వీ కృష్ణారెడ్డి
.................................
ఎగతాళితో ప్రేరణ
నేను చెన్నయ్‌లో ఉన్నప్పుడు ఓ తమిళ పాత్రికేయుడు చేసిన ఎగతాళి తెలుగు సినిమా బర్త్ డేట్‌ను కనుక్కోవడానికి ప్రేరణ అయ్యింది. అన్ని రకాల ఆధారాలతో తమిళ సినిమాకు చరిత్రవుంది, మీకు లేదా? అంటూ ఎగతాళిగా ప్రశ్నించినపుడు జవాబు కోసం వెతకడం ప్రారంభించాను. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నయ్, ముంబయి ప్రాంతాల్లో తిరిగి పదేళ్లు చేసిన కృషికి -చిన్న ఫలితం దొరికింది. అది -తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాదను శ్రీ కృష్ణ ఫిలిమ్స్ పతాకంపై బొంబాయికి చెందిన నిర్మాతలు రూపొందించారు. ముంబయి గెజిట్‌లో విడుదల చేసిన సెన్సార్ సర్ట్ఫికెట్‌ను పరిశీలిస్తే -అది ఫిబ్రవరి 6, 1932న విడుదలైందని అర్థమైంది. ఆ తేదీనే తొలి తెలుగు సినిమా ప్రదర్శన తేదీగా పరిగణించాలి.

- రెంటాల జయదేవ్
...............................
ఆమే.. అన్నం పెట్టింది!
తొలి నాళ్లల్లో నేను శోభనాచల స్టూడియోలో రికార్డింగ్ అసిస్టెంట్‌గా ఉండేవాడిని. షూటింగ్ కోసం కృష్ణవేణమ్మ నృత్యాన్ని సాధన చేస్తూ, రికార్డు చేసిన పాటను ప్రొజెక్టర్‌లో వెనక్కితిప్పి మళ్లీ మళ్లీ వినిపించమనేవారు. ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పి పాటను వినిపించేవాళ్లం. సాంకేతికంగా సౌలభ్యం లేకున్నా, అంత కష్టాన్ని అప్పట్లో భరిస్తూ నిబద్ధతగా సాధన చేసేవారు. మీర్జాపురం రాజావారు మాటిమాటికీ ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పుతున్నానంటూ ఉద్యోగంలోనుంచి తీసేస్తానన్నారు. అప్పుడు కృష్ణవేణమ్మ నేను రిహార్సల్స్ చేస్తున్నందువల్ల మళ్లీ మళ్లీ ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పి పాట పెట్టమన్నానని చెప్పడంతో నా ఉద్యోగం నిలబడింది. నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. కళాకారులను బిడ్డల్లా చూసుకునే రోజులవి. అందుకే స్వర్ణయుగంగా ఇప్పటికీ భావిస్తుంటాం.
- కెఎస్ రావు
.....................................
థ్రిల్లింగ్‌గా వుంది

తెలుగు సినిమా పుట్టిన రోజు ఉత్సవంలో పాల్గొనడం థ్రిల్‌గా ఉంది. వేలంటైన్స్, హీరోల హ్యాపీ బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకుంటున్న మనకి సినిమా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక డేట్ దొరికినందుకు గర్వించాలి. స్వర్ణయుగం సినీ కాలానికి ఆనవాళ్లుగా ఉన్న కృష్ణవేణమ్మ, జమున, గీతాంజలి వంటి వారిని సన్మానించుకోవడం మనల్ని మనం గౌరవించుకోడవమే.
- కాశీ విశ్వనాథ్

- Article written by Sarayu Sekhar
.......................................












































.......................................
...........................

తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు


తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు  [Held on 06-Feb-2016- Saturday at Prasad Labs, Hyderabad]

http://www.tv5news.in/newsdetails.aspx?ID=37622&SID=73&Title=Telugu%20cinema%20birthday%20celebrations


http://www.tv5news.in/WatchVideo.aspx?ID=37622&SID=73&Title=Telugu%20cinema%20birthday%20celebrations


(Telecasted in TV5 news channel on 7th Feb 2016, Sunday)
.............................................