జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, March 5, 2015

మాకు స్ఫూర్తి రజనీ గారే! - మహాభాష్యం చిత్తరంజన్,

- మహాభాష్యం చిత్తరంజన్,
 ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు


మాకు స్ఫూర్తి రజనీ గారే!
 ప్రముఖ కవి, గాయకుడు, వాగ్గేయకారుడు, స్వరకర్త రజనీగారు లలిత సంగీత వికాసానికీ, అభివృద్ధికీ ఎనలేని సేవలందించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో 1941లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో మధురమైన లలిత గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఉమర్ ఖయ్యాయి తత్త్వాన్ని వర్ణిస్తూ కృష్ణశాస్త్రి గారు రాసిన ‘అతిథిశాల’కు ఆయన పర్షియన్ సంగీతపు పోకడలతో అద్భుతమైన బాణీలు కూర్చారు. ఆయనే ఖయ్యావయిగా కూడా నటించి పాడారు.  మా తండ్రి గారు, రజనీ గారి తండ్రి గారు పిఠాపురం వాస్తవ్యులు.

 అందుకని ఆయనకు నా పైన ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. 1963లో హైదరాబాద్ ఆకాశవాణిలో ఈ నాటిక ప్రసారమైనప్పుడు ఆయనతో పాటు నేనూ అందులోని పాటలు పాడాను. అరబ్బీ సంగీత పద్ధతిలో పాటలే కాక పద్యాలు కూడా చదవడం అంత తేలికైన విషయం కాదు. కర్ణాటక, హిందుస్తానీ సంగీతంలో వాడుకలో లేని రాగాలెన్నిటినో ఉపయోగించడం లాంటి ప్రయోగాలెన్నో చేసిన మొట్టమొదటి వ్యక్తి - రజనీగారు. ఆ తరువాత పాలగుమ్మి విశ్వనాథం గారు, ఆ పైన నేను కూడా వాడుకలో లేని అనేక రాగాల్ని వినియోగించి, ప్రజారంజక గీతాలు తయారుచేశాం. ఆ విషయంలో మా అందరికీ స్ఫూర్తి రజనీ గారే.  

- Interview by Rentala Jayadeva

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
............................

ఒక ఆధునిక ఆంధ్ర వాగ్గేయకారుని చరిత్రము (బాలాంత్రపు రజనీకాంతరావు)

ఒక ఆధునిక ఆంధ్ర వాగ్గేయకారుని చరిత్రము

బాలాంత్రపు రజనీకాంతరావుఎవరో యీ తరం వారికి తెలియకపోవచ్చును. అది వారి లేమి. పాఠ్యగ్రంథాలలో ఏవి ఉండాలో నిర్ణయించేవారి దృష్టిలోపం. ఆయన తెలుగు సంగీత సాహిత్యాలకూ, వెండితెరకూ, ఆకాశవాణికీ చేసిన సేవ, వేసిన కొత్తబాట గత నూరేళ్లలో మరొకరు చేయలేదు. సుమారు 65 ఏళ్ల క్రితం మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రతిరోజూ ‘భక్తిరంజని’ కార్యక్రమం తెలుగులో వినవచ్చేది. కాస్త లలితమైన సంగీత సాహిత్యాలంటే అభిరుచి ఉన్నవారందరూ దినం తప్పక విన్న కార్యక్రమం అది. అందులో శాస్త్రీయ సంగీతం కాక పామరులకూ అందుబాటులో ఉండే లలిత సంగీత శైలిలో పొదగబడిన భక్తిమణులందు వినవచ్చేవి.

 నన్ను ఆకర్షించినవి రెండు పాటలు - ‘విన్నపాలు వినవలె వింత వింతలు’, ‘తందనాన భళా తందనాన’ అన్నవి. రెండోది కీర్తిశేషులు మల్లిక్ వరసా, గాత్రమూ అయితే, మొదటిది రజని వరస చేసి, భానుమతి చేత పాడించినది. నాకు యీ రెండు పాటల ద్వారానే రజని, మల్లిక్‌ల పేర్లు తెలియడం. అంతేకాదు. వీటి రచయిత అన్నమయ్య అన్న విషయమూ.  నాలో పెరిగిన అన్నమయ్య కల్పవృక్షానికి బీజం యివయితే, దాన్ని ప్రోది చేసి పెంచి, పూవులు పూయించి, పిందెలు, కాయలు, పళ్లు కాయించినది శ్రీమల్లాది రామకృష్ణశాస్త్రి కథలు రెండూ వనమాలలే.

 ఆకాశవాణిని గీర్వాణివాణిగా, సంగీత సాహిత్యాభినయాల త్రివేణీ సంగమంగా వెలార్చినవి ఎన్నో సంగీత రూపకాలు. ‘దేవదాస్’, ‘బేహుల’, ‘లైలా మజ్ను’, ‘ధర్మచక్ర’, ‘ఉమర్ ఖైయామ్’ -- యివన్నీ రజనీ కృతులే. కేవలం శ్రవ్యమే అయినట్టి రేడియో ప్రసారాలలో అభినయం ఉండే అవకాశమేదీ అంటారా?‘పూలతీవ పొదరిళ్ల మాటుగా పొంచి చూచు శిఖిపింఛమదే’ అంటేనూ, ‘రాధా మాధవ ప్రేమారామము బృందావనము, రాసక్రీడా మనోజ్ఞధామము బృందావనము’ వింటేనూ, ‘ఊరకే మాధురులూరిపోతున్నాయి’ చదివితేనూ అందులో అభినయం అర్థం కాదా, వినబడదా, బుర్రకెక్కదా!

 రజనీ సాహిత్యపు సొంపులు, పాడించిన తీరులో యింపులు, స్వర సమ్మేళనలలో రకరకాల మేళవింపులూ తమ ప్రభావాన్ని తదుపరి వారిపై చూపాయి. రజని స్వర సాహిత్యాల సౌందర్యాన్ని తమకే చేతనైన ఒదుగుల పౌడరద్ది, తమరమర్చిన వాద్యగోష్ఠి అత్తరు పూసి పేరుగొన్న వారెందరో! వారిలో సీతా, అనసూయలు ప్రథములు (వలపులో, జాబిల్లి వస్తున్నాడు, ఊరకే మాధురులు). ఆ తరువాత ఎస్.రాజేశ్వరరావు, ఆయన దాపున ఆర్.బాలసరస్వతీదేవి (ఆలయమున, చల్లగాలిలో, కోపమేల రాధా), ఘంటసాల (మజ్నూ విలాపం, లైలా విశ్వరూపం).

 ఇక సూర్యకుమారి ప్రాణప్రతిష్ఠ చేసిన రజని శిల్పాలు ఎన్నని! ‘శతపత్ర సుందరి’, ‘ఇదె జోత’, ‘మాదీ స్వతంత్ర దేశం’, ‘స్వప్నజగతిలో’, ‘చిన్నదోయి నా హృదయనావ’. భానుమతి, రజని కలసి ‘పసిడి మెఱుంగుల తళతళలూ’ రికార్డిచ్చారు (రెండవ ప్రక్క బంకించంద్రుని ‘వందే మాతరం’). రజని అరుదుగా యితరుల రచనలకూ స్వరకల్పన చేశారు. బసవరాజు అప్పారావు గారి ‘యశోధరా విలాపం’ (లేపనైనా లేపలేదే-టి. సూర్యకుమారి) వాటిలో కౌస్తుభం. ఈ పాటకే మద్రాసు విద్వత్సభలో శ్రీమతి బ్రగా బెస్సెల్ భరతనాట్యాభినయం చూపగా ప్రభావితులై ప్రసిద్ధ తమిళ కవి వైరముత్తు అప్పటికప్పుడా వస్తువుపై ఒక పాట వ్రాశారు.

 ఇప్పటివారు ‘అరేబియన్ సంగీతం’ సినిమాలకు మొదటిమారుగా తెచ్చిన ఘనత ఏ.ఆర్. రహమాన్‌ది అంటారు. ప్రప్రథమంగా భారతీయ సంగీతానికి ఆస్కార్ గుర్తింపు తెచ్చిన ఘనత అతనిది. అరేబియా సంగీతం మనకు దింపినది రజనీది. రేడియోలో ‘ఉమర్ ఖైయామ్’ యీనాడు వినే యోగం లేదు. కాని రజని సంగీతం చేసిన ‘గృహప్రవేశం’ చిత్రంలో ‘కనవోహో కనవోహో’ వినండి. ఆ తరువాత ‘రత్నమాల’ చిత్రంలో చిలకపాట వినండి. రెండూ భానుమతి కంఠంలో వెలిగిన ఖర్జూరాలే. ఆ ‘గృహప్రవేశం’కి సహాయ సంగీత దర్శకునిగా పని చేసిన పెండ్యాల ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’లో ‘నా మనసెంతో నాజూకు’, సత్యం ‘భూలోకంలో యమలోకం’ చిత్రంలో ‘ఏదో ఏదో వింత పులకింత’ వినండి. రజనీ ప్రభావం ఘనత తెలియండి.

  ‘విప్రనారాయణ’లో రాజేశ్వరరావు ‘ఎందుకోయీ తోటమాలి’లోను యీ శైలి తెలుస్తుంది.మరొక విషయం - ‘స్వర్గసీమ’కు చూడామణిగా అలరిన ‘ఓహో పావురమా’ పాట గురించి నిర్మాత - దర్శకుడు బి.ఎన్. రెడ్డి, వాగ్గేయకారుడు రజని, పాడిన భానుమతి ఒక కాశీమజిలీ కథ చెబుతూ వచ్చారు నలభై ఏళ్లుగా. ‘బ్లడ్ అండ్ శాండ్’ సినిమాలో నటి రీటా హేవర్త్ పాడిన పాటకది అనుసరణ అని. శుద్ధ అబద్ధం. వారి ఉద్దేశమదైతే కావచ్చు. కానీ, ఆ పాటకూ, దీనికీ పోలికే లేదు. అది శ్పానిష్ పద్ధతి. ఇది అరేబియన్ శైలి. అరుదైన యీ ఖండికను సాంకేతిక నిపుణుడు విజయవర్ధన్ నాకు చూపించారు. రజని చేసిన యితర సినిమాలు - ‘లక్ష్మమ్మ’ (ఒక తిల్లానా, ఒక జావళి వినా అవి రికార్డింగ్‌కి సంగీతం సిద్ధం చేసిన ఘంటసాల ఎన్నికలు, పూర్వపు రచనలు), ‘పేరంటాలు’. అలాగే, ‘మానవతి’ చిత్రంలో కొన్ని పాటలు.

 మలయమారుత రాగం సినిమా కోసం పెండ్యాల గొప్పగా మలిచినది ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది’ అంటారు. నిజం. అయితే అంతకు ఏళ్లముందు అశరీరవాణి కోసం తయారు చేసి ‘మానవతి’ సినిమాలో యీ రాగంలోనే వినిపించిన ‘ఓ మలయ పవనమా!’ (ఎం.ఎస్.రామారావు, బాలసరస్వతీ దేవి) రజని సృష్టి. త్యాగరాజు సృష్టించిన అపూర్వ రాగాలలో ఒకటి రసాళి, ‘అపరాధములనోర్వ’ అన్న కీర్తనకు. సినిమా పేరుబట్టి మొదట మానవతి రాగంలోనే రజని ఒక పాట చేయాలనుకొన్నారట. కాని ఆ రాగం అతి పరిమితమైనది కావడం చేత ఆ ప్రయత్నం మాని దగ్గరి మేళకర్తయిన నాటకప్రియ రాగజన్యమైన రసాళిలో చేశానని వారే చెప్పారు.

 ఈ గానలహరి కథలో ఒక పిట్ట కథ. పి.మంగాపతి గ్రామఫోన్ కంపెనీలో రికార్డింగ్ ఆఫీసరుగా ఉన్నప్పుడు, ఒక ఎల్.పి. కోసం నన్ను ఆర్. బాలసరస్వతి, ఎస్. రాజేశ్వరరావు సంకలనం - నా దగ్గరున్న బొక్కిసమాధారంగా - చేయమని అడిగారు. అందులో యీ రసాళి రాగచిత్ర (మానవతి) గీతం ‘తన పంతమే తానిడువడు’ పెట్టాను. ఆ సంకలనంలో ఆ పాట ఉండకూడదని బాలసరస్వతి పట్టుపట్టారు. (తిథి అమావాస్యో, పౌర్ణమో అయివుంటుంది). ఆ పాట లేకపోతే నేను చేయను అన్నాను. అప్పుడు ఆ ప్రయత్నం ఆగిపోయింది.

  ఆ తరువాత మరొకతను హెచ్.ఎం.వి. గద్దెనెక్కి, నాకు సంపూర్ణ స్వాతంత్య్రం యిచ్చిన తరువాత ‘అలనాటి అందాలై’ పూచింది. ఇక రజని పుస్తకాలు - ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ (1958). దీనితో ఆంధ్రుల సంగీత సాహిత్యాల చరిత్రావగాహన 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి వచ్చింది. ఇప్పటికీ అందులో ఉన్న విషయాలు త్రోసిరాజన్న రచనలు రాలేదు.రజని గేయాలు ‘శతపత్ర సుందరి’ అన్న పేరుతో 1953లో వచ్చాయి. ఖరీదు- మూడు రూపాయలు. అప్పుడూ యిప్పుడూ వెలకట్టే స్తోమత ఉన్న వారి దృష్టిలో దాని విలువ ఒక అలీబాబా గుహ.

 మరొక పుస్తకం గురించి చెప్పి దీన్ని ముగిస్తాను. నూట యాభై క్షేత్రయ్య పదాలను ఆంగ్లీకరించి ‘మువ్వగోపాల పదావళి’ అన్న పేరుతో, ‘ఆమోర్స్ ఆఫ్ ది డివైన్ కౌహర్డ్ విత్ జింగ్లింగ్ బెల్స్’ అన్న ఉపనామంతో రజని (బి.వి.ఎస్.ఎస్ మణి వదాన్యంతో) 1994లో ప్రచురించారు. ఆ పుస్తకం నాకు ముందుగా పంపి, మద్రాసులో పుస్తకావిష్కరణ సభలో దాని గురించి ప్రసంగించమని ఆదేశించారు రజని. చిన్ననాటి నుంచి దక్షిణదేశపు సానులు సేలం అమ్మాకణ్ణు, ధనకోటి, కోయంబత్తూరు తాయి, తిరువిడైమరుదూర్ భవాని యిచ్చిన రికార్డుల వలన, చిన్నతనాననే ఎదురుగా పాడిన బెంగుళూరు నాగరత్నం, ఆడిన గడ్డిభుక్త సీతారామ్ వలన యివి నాకు ఎరుకే, అభిమానమే, గౌరవమే.

 అందులో కొన్ని తప్పులు నాకు కనబడ్డాయి. అవన్నీ సభలో ఏకరవు పెట్టాను. ఒక చదువుల పెద్ద నాతో గుసరుసలాడేడు ‘శుభం పలకరాజేజమ్మా అంటే..’ అని. రజని ఏం చేశారో తెలుసా? నా ప్రసంగం అయిన వెంటనే ఆయనంతట ఆయనే మైకు దగ్గరకు వచ్చి ‘రంగారావు చెప్పిన వాటిలో మూడు నా తప్పే. తక్కినవి పరిశీలించాలి’ అన్నారు. సభ చివరలో మళ్లీ పిలవకుండానే మైకు చేత పుచ్చుకొని ‘మరి రెండూ నా తప్పులే’ అన్నారు. నా చేత ఉతికింపించుకొన్న చదువుకొన్న వారు, పేర్ల ముందు పొడి అక్షరాలు తగిలించుకొన్న వారు ఎందరో! అందులో ఎందరిలా ఒప్పుకొనగల ధీరులు! అలా బహిరంగంగా చెప్పుకొని ఒప్పిన మహనీయుడు రజని! ప్రణమామ్యహం! ఆయన పాటలు, సంగీత రూపకాలు కొత్త వారిచే మథింపజేసి, అమృతం పుట్టించే బాధ్యత ఆకాశవాణిది, లలిత సంగీత ప్రియులది, మీదీ, నాదీ! 

వి.ఎ.కె. రంగారావు , ప్రసిద్ధ సంగీత, నృత్య, కళా విమర్శకులు

......................................

Wednesday, March 4, 2015

క్షణ క్షణం రాగం - అనుక్షణం అనురాగం (by ఇంద్రగంటి జానకీ బాల)

- ఇంద్రగంటి జానకీ బాల, ప్రముఖ రచయిత్రి - గాయకురాలు

క్షణ క్షణం రాగం - అనుక్షణం అనురాగం

ఏ సామాన్య గుణానికైనా కొన్ని మినహాయింపులుంటాయి. కళాకారులు - వారు గాయకులైనా, కవులైనా - వచన రచన చేసే రచయిత(త్రు)లైనా పరస్పరం అసహనం - కించిత్ ఈర్ష్య, స్పర్ధ కలిగి ఉంటారనేది లోకసహజంగా అనుకునే విషయం. ఈ లోకవాక్యానికి రజనీకాంతరావుగారు పూర్తిగా మినహాయింపు. రజనిగారు అనేక సాహిత్య ప్రక్రియల్లోనూ, రకరకాల సంగీత రీతులలోనూ నిష్ణాతులు. అయితే ఆయన పాటల గురించి, ప్రత్యేకంగా లలిత గీతాల గురించి ఇక్కడ మాట్లాడాలనిపిస్తోంది. ఆయన పాటరచన, దానికి ఆయన కూర్చే బాణీ చాలా విలక్షణంగా ఉంటాయి. ఒక ప్రత్యేకత గల లిరిసిస్ట్! అపారమైన సంగీతంతో మనసు నిండి ఉండడం వల్ల రాగం - భావం జంటగా ఒక పాటై బయటికి వచ్చి ఆయన గళంలో పలుకుతుంది. అది ఒక తిరుగులేని కళారూపమై అందర్నీ అలరిస్తుంది. ఆయన పాటలు చాలా సున్నితంగా, సులభశైలిలో ఉన్నట్లనిపిస్తాయి గానీ పాడి ఒప్పించటం కష్టంగానే అనిపిస్తాయి. అయినా రజని సినిమాల్లో చేసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి.

నాకు చిన్నప్పటి నుంచీ రజనీ గారి పాటలు వినడం, పాడడం అలవాటుంది. స్కూలు రోజుల్లో ‘మాదీ స్వతంత్ర దేశం...’, ‘ఇదె జోతా - నీకిదె జోతా...’, ‘పసిడి మెరుగుల తళతళలు...’ లాంటి పాటలు తరచూ పాడే సందర్భాలుండేవి. 1970లో ఆలిండియా రేడియో (విజయవాడ)లో లలిత సంగీతం పాడేందుకు ఆడిషన్ ప్యాసయ్యాను. అప్పటికి రజని విజయవాడ స్టేషన్ డైరక్టర్‌గా రాలేదు. రేడియోలో ‘గీతావళి’ కార్యక్రమం కోసం పాటలు ఎంపిక చేసుకోవాలంటే ఆయన పాటలు ఆకర్షణీయంగా ఉండేవి. ‘రజని’ పాటలుగా ఆయన గీతాలు రేడియోలో మారు మ్రోగుతూ ఉండేవి. సాలూరి రాజేశ్వరరావు పాడిన ‘ఓ విభావరీ...’ గ్రామ్‌ఫోన్ రికార్డు ఆనాటి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించింది. ఇందులో సమాసాలు, పదబంధాలు వినూత్నంగా ఉంటాయి. ‘‘ఓ విభావరీ - / నీ హార హీర నీలాంబర ధారిణీ/ మనోహా రిణీ - ఓ విభావరీ’’ అంటూంటే ఆ ఊహ మనకందని లోకాలలో విహరింప చేస్తుంది. దానికనుగుణంగా రాగం తీగెలు సాగుతుంది.

అలాగే ‘చల్లగాలిలో యమునా తటిపై, శ్యామ సుందరుని మురళీ...’. ఇదీ సాలూరి రాజేశ్వరరావు పాడిన పాటే. ఇందులో -  ‘‘తూలిరాలు వటపత్ర మ్ముల పయి/ తేలి తేలి పడు అడుగులవే/ పూల తీవ పొదరిండ్ల మాటగ / పొంచి చూడు శిఖి పింఛమదే -’’ అంటూ పాటలోనే బొమ్మకట్టి, కళ్ల ముందుంచి, అద్భుత దృశ్యాన్ని మనోఫలకంపై ముద్రిస్తారు. రజనీగారి పాటలో సాహిత్యం - సంగీతం చెట్టాపట్టాలేసుకుని నడిచే నర్తకీమణుల్లా మెరిసిపోతూంటాయి. శృంగారం, దేశభక్తి, ప్రకృతి, భక్తి - వేటికవే అందంగా పలుకుతాయి ఆయన లలిత గీతాల్లో. ‘‘హాయిగ పాడుదునా సఖీ -/ ఆకసమందున రాకా చంద్రుడు/ నా కౌగిలిలో నీ సౌందర్యము/ కాంచలేక నా మబ్బుల లోపల/ పొంచి చూసి సిగ్గున తలవంచగ - హాయిగ పాడుదునా!’’ ఇక, దేశభక్తి రజనీగారికి వెన్నతో పెట్టిన లక్షణం. దేశ స్వాతంత్య్రం ప్రకటించగానే పాట, ఆంధ్రరాష్ట్రం లభించగానే పాట, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాట - ఇలా అన్ని సందర్భాల లోనూ ఆయన పాటలు రాశారు.

‘‘పసిడి మెరుంగుల తళతళలు / పసిమి వెలుంగుల మిలమిలలు/ గౌతమి కృష్ణల గలగలలు/ గుడి జేగంటల గణగణలు -’’ అంటూ ఆ శుభ సమయాన్ని ఉత్తేజంగా ప్రకటిస్తారు. ‘‘మరునిముసము మనదో - కాదో/ మధువానవో - మధుపా మధుపా’’ అని మరొక్కసారి తాత్వికంగా అంటారు. ‘పోయిరావే కోయిలా’ అంటూ కోయిలకు వీడ్కోలు చెబుతారు. ఇలా చెప్పాలంటే రజనీ గారివి ఎన్ని భావాలు! ఎన్ని ఊహలు! ఎంత వేదన - ఎంత ఆవేదన! ఎంత ప్రేమ - ఎంత అభ్యుదయం - ఎంత సమ భావం! ఇవన్నీ కలిసి ‘రజని’, ఆయన పాటలూ!!

మళ్లీ మొదటికొస్తే, 1980లలో రజనీగారి పుట్టిన రోజు ఉత్సవంగా విజయవాడలో జరిగి నప్పుడు నేను ఆయన పాటలు రెండు పాడాను. ఆ రెండూ మా తమ్ముడు సూరి కుమారస్వామి ట్యూన్ చేశాడు. ఒకటి ‘నటన మాడవే మయూరి’. రెండోది ‘పోయి రావే కోయిలా.’ అవి విని రజని గారు బాగున్నాయని నన్ను అభినందించారు. నా లాంటి సామాన్య గాయకురాలు పాడిన పాటలు కూడా ఆనందంగా స్వీకరించి, బాగా పాడాననడం ఆయన హృదయ సంస్కారం.

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
..................................

రేడియో హోదా పెరిగింది! - by మల్లాది సూరిబాబు,

- మల్లాది సూరిబాబు, కర్ణాటక సంగీత విద్వాంసులు - ‘ఆకాశవాణి’ నిలయ కళాకారులు

రేడియో హోదా పెరిగింది!
అనుభూతి శబ్దాన్ని ఆశ్రయిస్తే మంచి పాట పుడుతుంది. సుస్వరంతో నిండిన ఆ శ్రావ్యమైన పాట సంస్కారవంతమైన హృదయాన్ని తట్టి లేపుతుంది. అప్పటికప్పుడు పాటను వ్రాయడం, అలా వచ్చిన పాటకు స్వరం కూడా తనే సమకూర్చుకుని పాడడం - ఈ మూడూ ఒకే వ్యక్తి వల్ల అయ్యే పనులు కాదు. రచన, సంగీతం, గానం - ఒకరే అయితే? మధురానుభూతుల్ని మాటలుగా మార్చి, వాటిని అందంగా పేర్చగల ప్రతిభామూర్తి మా రజనీ బాబాయ్. ‘‘హాయిలో నేల యెదకింత హింస... తీయ పాటలో బాధేల వంశీ...’’ అనే రజని పాటను నాలుగు దశాబ్దాల క్రితం ‘గజల్’గా ‘జనసమ్మోదిని’ రాగంలో ట్యూన్ చేసి, రజని గారికే వినిపించాను. గజల్ శైలిలో తన పాట విని ఆయన ఎంత పరవశించారో. ఈ పాటతో మా ఇద్దరి స్నేహం ఎంతో పెరిగింది. ఇవాళ్టికీ ఆయనకు ఈ పాట ఇంకా గుర్తే!
 రజనీ గారిది అదో సహజమైన, స్వతంత్రమైన సంగీతధార. ఆయన సంగీత విహంగం రెక్కలు చాపుకొని నాదప్రపంచంలో అందచందాలను వెతుక్కుంటూ, అటు మధ్య ప్రాచ్యం దాకా ఎగిరి రాగలదు. ఇటు హిందు స్థానీ, బెంగాలీ, జానపద రీతులతోనూ జత కట్టగలదు. జాతీయతకు (నేటివిటీ) దూరం కాకుండా నాద ప్రపంచంలో తనకో శైలిని ఏర్పరచుకున్నాడాయన.

 శాస్త్రీయ రాగాలు, వాటి స్వరూప స్వభావాలు, కోమలంగా ఉండే స్వరాలు, తీవ్రమైన స్వరాలు, పాటలోని మాటలకు ఏయే స్వరాన్ని ఎలా పాడితే భావాన్ని చెప్పగలమో అన్నీ తెలిసిన ‘సంగీతవేత్త’. ‘మనసౌనే ఓ రాధా...’, ‘మరు నిముసమే మనదో కాదో...’, ‘ఆశా నా ప్రాణసఖీ...’ లాంటి పాటలు ఓలేటి వెంకటేశ్వర్లు గారి కంఠంలో ఎన్ని హొయలు పోయాయో వింటే... రజని గారి ఊహాలోకాన్ని దర్శించవచ్చునని నాకనిపిస్తుంది.

నూతన రీతుల క్రియాశీలతకు సంప్రదాయ పరిధులు అడ్డు రాకూడదనే విధానాన్ని వెనుకటి తరంలోని రేడియో స్టేషన్ డెరైక్టర్లు పాటించారు కాబట్టే, ఈవేళ ‘ఆలిండియా రేడియో’ గౌరవం తరిగిపోకుండా అలా నిలబడింది. అటువంటి సంగీత, సాహిత్య మర్యాదలను నిలబెట్టినవారిలో శ్రీరజనీకాంతరావు ముందు వరుసలో ఉంటారు.

గమ్మత్తేమిటంటే, రచన, సంగీతం - రెండూ రజని గారి మనసులో నుంచి ఏకకాలంలో వచ్చేస్తాయి. రజని గారి వరసలు ఎవరూ, ఏమీ మార్చలేరు. వాటిని అవగాహన చేసుకుని పాడడం సామాన్య గాయకుడికి కష్టం. ‘రజని గారి గేయా లను స్వర సహితంగా అచ్చువేస్తే, భావితరాలకు ఆయన సంగీతజ్ఞత బోధపడుతుంద’ని బాల మురళీకృష్ణ గారోసారి నాతో అన్నారు. అంటే, రజని పాటల్లోని మజా ఏమిటో మనకర్థవుతుంది. పాటల్ని కంపోజ్ చేయడంలో రజనీది ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరూ అనుకరించ లేని శైలి. ఎవరూ ఎదురుచూడని దారులు తొక్కుతూ, ఏదో కొత్తదనం  కనిపిస్తూనే ఉంటుంది.

విజయవాడలో 1970ల మొదట్లో ‘జై ఆంధ్రా’ ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ‘ఆకాశవాణి’లో ఏ కార్యకలాపాలూ జరగరాదని నిర్ణయించిన ఉద్యమకారులు స్టూడియో చుట్టూ మోహరించినప్పుడు, ఆ సమస్యను గ్రహస్థితికి ముడిపెట్టి, రజని గారు తయారు చేసిన ‘నవగ్రహ స్తుతి’ ఒక వినూత్న అనుభవం. ఈ కీర్తన ప్రసారమైన కొన్నాళ్ళకి ఉద్యమం కాస్త తగ్గింది.
 అలాగే, 1977లో దివిసీమ తుపానప్పుడు రజని ఒక పాట రాశారు. ‘నివాత శూన్య స్తంభం, నిష్పీడన మంథానం, జంఝా వాత సంరంభం, హంసవిధి విధానం...’ అనే పల్లవితో తుపాను బీభత్స సమయాన్ని ప్రతిబిం బిస్తూ సాగే ఆ పాటను ‘ఆకాశవాణి’లో ‘ఈ మాసపు పాట’గా పాడాను. నిజానికి, ఆ పాటలోని మాటలన్నీ చక్రవాక తుపానుకు సంబంధించిన సాంకేతిక పదాలకు చక్కటి తెలుగు మాటలు. ‘సైక్లోనిక్ సిలిండర్’కి అనువాదం ‘నివాత శూన్య స్తంభం’. సంక్లిష్టమైన మాటలు, తుపానుకు సంబంధించిన విషాదం అయినప్పటికీ... పాడడానికి అనువుగా ఉండే అద్భుతమైన గీతం అది. రేడియోకు ఒక ప్రత్యేకతను తెచ్చిన ఘనత - రజనీదే! ‘సంస్కృత పరిచయం’, ‘భక్తిరంజని’, ఓలేటి చేత ‘సంగీత శిక్షణ’, ‘ఈ మాసపు పాట’ వంటి కార్యక్రమాల రూపకల్పనకు ఆద్యుడు రజనీయే. రజని తన దగ్గర పనిచేసేవారిలోని ప్రతిభను గుర్తించి, కార్యక్రమాలను చేయించేవారు. అది చిన్న విషయం కాదు. ఆయనకున్న హోదా వల్లనే పేరు ప్రఖ్యా తులు వచ్చాయనుకుంటే పొరపాటు. ఆయన వల్ల రేడియో హోదా పెరిగిందనడం నిజం.

http://img.sakshi.net/images/cms/2015-01/61422469916_Unknown.jpg

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)




/...................................

Tuesday, March 3, 2015

మేధస్సు అలసిపోదు - గొల్లపూడి మారుతీరావు

 - గొల్లపూడి మారుతీరావు,  ప్రసిద్ధ రచయిత - నటుడు - కాలమిస్టు

మేధస్సు అలసిపోదు

కిందటి శతాబ్దపు అయిదో దశకం తెలుగు దేశానికి మరపురాని దశ. కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవం. ముఖ్యంగా ‘భక్తి రంజని’. నిజానికి ఆ కార్యక్రమాన్ని ‘భక్తిరజని’ అనాలని చాలామంది అనేవారు. కారణం ఆ వైభవానికి మూలపురుషులు బాలాంత్రపు రజనీకాంతరావుగారు కావడం. నాకప్పుడు ఇరవయ్యేళ్లు. తెల్లవారితే ప్రతీ ఇంట్లో ‘భక్తిరంజని’ పాటలే చెవుల్లో గింగుర్లెత్తించేవి. తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, నరసదాసు, నారాయణ తీర్థులు, రామదాసు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి - ఇలాగ. ఇవన్నీ మధురమయిన జ్ఞాపకాలు. బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, ఎమ్.వి. రమణమూర్తి, సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, పాకాల సావిత్రీ దేవి, నల్లాన్ చక్రవర్తుల నరసింహా చార్యులు - వీరంతా గానం చేసిన పాటలవి. అన్నమాచార్య కీర్తనలు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. మూడు శతాబ్దాలు తిరుమల శ్రీవారి ఆలయ భాండాగారంలో అజ్ఞాతంగా మిగిలిపోయిన ఆ కీర్తనల వైభవాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రారంభించగా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు కొనసాగించారు. అయితే ‘‘ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది’’ అన్న కీర్తన బాలమురళీ కృష్ణ పాడగా విన్న గుర్తు. అప్పటికి టీవీలు లేవు. ఆనాటి రేడియో ప్రాచుర్యాన్ని పూర్తిగా అనుభవించిన తరం మాది. కానడలో వోలేటిగారి హనుమాన్ చాలీసా, చరిత్రగా నిలిచిపోయిన బిళహరి, కాంభోజీ, జౌన్‌పురీ, నాట మొదలైన రాగాలలో బాలమురళి నారాయణ తీర్థ తరంగాలు, రజని సూర్య స్తుతి - ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు. ‘మాది’ అని నన్నూ కలుపుకోడానికో కారణం ఉంది. నా జీవితంలో - ఆ మాటకి వస్తే మా ఇంట్లో మొదటి రేడియో నేను కొన్నదే. 1959లో నేను అంతర్జాతీయ రేడియో నాటికోత్సవాల పోటీలలో నా నాటిక ‘అనంతం’కు మొదటి బహుమతిగా పుచ్చుకున్న వంద రూపాయలతో, నేను రేడియోకి రాసిన ‘శాఫో’ అనే నాటికకి దక్కిన పదిహేను రూపాయలు, ‘అనంతం’లో నటించినందుకు దక్కిన మరో పాతిక కలపగా, మా నాన్నగారు మరో ఇరవై రూపాయలు ఇచ్చిన గుర్తు. ఆ పైకంతో చిన్న ‘మర్ఫీ’ రేడియో కొన్నాను. అది ఆ తర్వాతి 57 సంవత్సరాల జీవితానికి పెట్టుబడి అయింది. ఆ విధంగా రజనీకాంతరావుగారు, బాలమురళీకృష్ణ, మిగతా గాయకులంతా నా డ్రాయింగు రూములో కొలువుతీరారు. ఓ చిన్న రచయితకి అదొక దేవలోకం. ఎప్పుడయినా ఈ గంధర్వుల్ని చూడగలుగుతానా అనుకొని రేడియోలో తలదూర్చి మరీ లలిత సంగీతం వినేవాడిని. అది 1959. మరో నాలుగేళ్లకు (1963) వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.

రేడియోలో ఉద్యోగం వచ్చింది! అంతే. అదే జీవితంలో పెద్ద మలుపు. నా జీవితంలో గొప్ప అదృష్టాన్ని చెప్పమంటే నా ప్రవృత్తి- వృత్తి మమేకయి జీవితమంతా కొనసాగడం. అడుగడుగునా ఎందరో పెద్దలతో భుజం కలిపి పనిచేయడం. ఏనాడూ అహంకారానికి తావివ్వని ప్రతిభావంతుల, పెద్దలతో సాంగత్యం, ఆ మలుపులో నా అభిరుచిని సంధించినవారిలో రజనీకాంతరావుగారి పాత్ర ఉంది.
 1959 నాటి మరో ప్రత్యేకమైన జ్ఞాపకం - విజయవాడ మొగల్రాజపురంలో మహీధర రామమోహనరావు గారింట్లో సాహితీ సమావేశం. ఆ రోజుల్లో నా ఆనర్స్ చదువు పూర్తి చేసుకుని ‘ఆంధ్రప్రభ’లో ఉద్యోగానికి వారం వారం నీలంరాజు వేంకట శేషయ్యగారిని కలుస్తూండేవాడిని. విజయవాడలో మహీధర రామ మోహనరావుగారు సాహితీ సమావేశాలకు సంధానకర్త. సైకిలు మీద వచ్చి అందరి ఇళ్లకీ వెళ్లి మమ్మల్నందరినీ పేరు పేరునా సమావేశాలకు ఆహ్వానించేవారు. ఆ రోజు కొడవటిగంటి, శ్రీశ్రీ వచ్చారు. ఆనాటి సభలో నేనూ, ఏటుకూరి బలరామమూర్తి, పరకాల పట్టాభిరామారావు, అంగర సత్యనారాయణ రావు ప్రభృతులు ఉన్న జ్ఞాపకం. రజనీగారు అప్పుడు విజయవాడ రేడియోలో చేస్తున్నారు. వచ్చారు. అనర్గళంగా ‘మహాప్రస్థానం’లో కవితల్ని గానం చేశారు.

1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి - ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి - ఇలాగ. నా జీవితంలో అదృష్టం - తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను.
 వోలేటి పాడిన ద్విజావంతి రాగంలో రజని గీతం ‘మనసౌనే రాధా, మరల వేణువూద!’’ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. పాట వినగానే నా జ్ఞాపకాలు 55 ఏళ్లు వెనక్కి దూకుతాయి. రజని పాట ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ అన్నపాట ఇప్పటికీ పాడగలను. రేడియోలో ఎస్. వరలక్ష్మిగారు పాడారు. ఆవిడ నాకంటే 12 సంవత్సరాలు పెద్ద. నిజానికి నా ముందుతరం హీరోయిన్. 35 సంవత్సరాల తర్వాత మేమిద్దరం కనీసం నాలుగు చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించాం! ‘శ్రీవారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆవిడకి ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ పాటని గుర్తు చేశాను. ఆవిడకి జ్ఞాపకం రాలేదు. నాకు గుర్తున్నట్టు పాడి వినిపించాను. అది విని ఆమె నాకు మళ్లీ పాడారు. మంచి పాట, మంచి బాణీ, రజని సంగీతంలో జీవలక్షణం చిరంజీవి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
 రజనిగారు 1940లో రేడియోలో ఆర్టిస్టుగా చేరారు. 1943లో ఆయన ఉద్యోగం రెగ్యులరైజ్ అయింది. 1978 వరకూ పనిచేసి స్టేషన్ డెరైక్టరుగా పదవీ విరమణ చేశారు. ఆ తరానికి అది ఉద్యోగం కాదు. ఉద్యమం. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మద్రాసు కమాం డరన్ చీఫ్ రోడ్డులోఉన్న ఆకాశవాణి కేంద్రంలో దాదాపు అందరూ ఉన్నారు. పార్లమెంటులో నెహ్రూ ప్రసంగాన్ని వారూ పులకించిపోతూ విన్నారు. ఆనాడు రజని టంగుటూరి సూర్యకుమారి చేత ‘మాదీ స్వతంత్ర దేశం’ పాడించారు.

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రసారమైన మొదటి దేశభక్తిగేయం ఇది. ఎంతటి గౌరవం! అప్పుడు కేంద్రంలో బుచ్చిబాబు, అనౌన్సరు మల్లంపల్లి ఉమామహే శ్వరరావు మొదలైనవారంతా ఉన్నారు. ఏం రోజులవి? రేడియో మాధ్యమానికి పునాదులు వేసిన తరం అది. ఆ స్ఫూర్తితోనే మా తరం వారంతా పనిచేశాం. నాకు ఏనాడూ రేడియోలో నా జీతమెంతో తెలి సేది కాదు. తెల్లవారితే ఏ కొత్త పనిచెయ్యాలా అని ఆఫీసుకి దూకే వాళ్లం.


 1963-68 మధ్య హైదరాబాదులో రేడియోలో ఉద్యోగం. నా పని డ్యూటీ ఆఫీసరు. ఒక సంఘటన బాగా గుర్తు. ఆ రోజు అయిదు గంటలకి ఇంటికి బయలుదేరుతున్నాను. స్టూడియోలో రజనిగారు, వేణుగాన విద్వాంసులు ఎన్.ఎన్. శ్రీనివాసన్‌గారూ - అంతా హడావిడి పడుతూ పరుగులు తీస్తున్నారు. పాటల రికార్డింగు మరో పక్క జరుగుతోంది. ‘బావొచ్చాడు’ నాటిక గ్రామస్తుల కార్యక్రమంలో (సాయంత్రం 6-20కి) ప్రసారం. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వెళ్తున్న నన్ను ఆపారు. అప్పటికే ఆయన కంఠం మూగపోయింది. నన్ను పిలిచి కాగితం మీద రాశారు. ‘‘నీ మొహం రాగి చెంబులాగ ఉంటుంది. నా నాటికలో వేస్తావా?’’ అని. చేసేది రేడియో నాటిక. మొహానికీ దానికీ సంబంధం లేదు. ఆయన చమత్కారమది. ఏం వేషం? అందులో నా పాత్ర ‘బావ’. అంటే ప్రధాన పాత్ర. సంగీత రూపకానికి సంగీతం సమకూర్చినది రజనీకాంతరావుగారు. ఆశగా కూర్చున్నాను. కార్యక్రమం పాటతో ప్రారంభమైంది. అవుతూనే మరో పాట. పండగకి బావ ఇంటికి రావడం సందర్భం. పాటలు వేడివేడిగా వస్తున్నాయి. కాలం జరిగిపోతోంది.7 గంటలకి తెలుగులో వార్తలు. 6-55 అయిపోయింది. ఈ బావ ఎప్పుడొస్తాడు? దేవులపల్లివారిని అడిగాను. సన్నని చిరునవ్వు సమాధానం. 6-57 అయింది. నా చేతికి ఓ కాగితం మీద ఒక మాట రాసిచ్చారు దేవులపల్లి. ‘‘ఏమర్రా పిల్లలూ!’’ అన్నాను. అంతా ‘‘బావొచ్చాడు బావొచ్చాడు’’ అన్నారు. నాటిక అయిపోయింది! ఆ విధంగా రజని గారి సంగీత రూపకంలో ఒకే ఒక్కసారి నటించాను. నా షష్ఠిపూర్తికి ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ రజని గారు ప్రత్యేక సంచికలో వ్యాసం రాశారు. అంతటి మహానుభావులతో 50 ఏళ్లు నిలిచిన మధురమైన జ్ఞాపకం ఇది.

నేను విజయవాడలో పనిచేసే నాటికి రజనీగారు ఉత్తర దేశంలో పనిచేసేవారు. నాకు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ వచ్చి శంబల్‌పూర్ బదిలీ చేసేనాటికి విజయవాడ స్టేషన్ డెరైక్టరుగా వచ్చారు. అప్పటికి నేను సినీమాల్లో ముమ్మరంగా రచనలు చేస్తున్నా. సినీరంగ మిత్రులు నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. రాజీనామా పత్రాన్ని తీసుకుని రజనీగారి గదిలోకి వెళ్లాను. కాగితం తీసుకు చదివారు. ఒక్కసారి నన్ను ఎగాదిగా చూసి కాగితాన్ని అడ్డంగా చింపేశారు. ‘‘శంబల్పూరు వెళ్లు. అక్కడి నుంచే రచనలు చెయ్యవచ్చు. నేను డిఫికల్టు స్టేషన్లలో పనిచేయబట్టే ఇక్కడికి రాగలిగాను. మరేం ఆలోచించకు. వెళ్లు’’అంటూ హితవు చెప్పారు. ఆయన కారణంగా వెళ్లాను. మరో పదేళ్లు రేడియోలో పనిచేసి, అసిస్టెంటు స్టేషన్ డెరైక్టరుగా ప్రమోషన్ తీసుకుని, కడప రేడియో స్టేషన్‌కి హెడ్డునయి, ఊహించని రీతిలో సినిమాల్లో నటించి, తొలి సినిమాకే స్టార్‌నై- అప్పుడు తప్పక రాజీనామా చేశా.
 మేథస్సుతో పనిచేసే వ్యక్తికి శరీరం అలిసిపోదు. వృద్ధాప్యం కేవలం శరీరానికే పరిమితం. ఒక శతాబ్ద కాలం సంగీత సాహిత్యాలకు తనదయిన ప్రత్యేకతలను సంతరించిన వాగ్గేయకారులు రజనీగారు. ఆయన నూరేళ్ల జీవితం ఒక ఉద్యమం. ఆయన తరానికి దక్కిన అవకాశాలు మరే తరానికీ దక్కవు. ఓ మాధ్యమానికి ఊపిరి పోసి, ఓ దేశ స్వాతంత్య్రాన్ని చిరస్మరణీయం చేసి, సంగీతానికి నూరేళ్ల ఆయుష్షును పోసిన నిండు జీవితం రజనీగారిది. తెలుగు సాహితీ చరిత్రలో ఆయన ఒక సువర్ణ అధ్యాయం.

http://img.sakshi.net/images/cms/2015-01/41422469519_Unknown.jpg





................................

కృతజ్ఞతాగేయం - రచన: బాలాంత్రపు రజనీకాంతరావు

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు

కృతజ్ఞతాగేయం
అహ్మదాబాద్ స్టేషన్ డెరైక్టర్‌గా రజనీకాంతరావు (1970)


నే చేయునదీ నే చేయనిదీ
సాధించినదీ ఫలియించనిదీ
నీ యిచ్ఛలేక జరుగదట
నా స్వేచ్ఛ మొదలు తుది యెచట!    ॥చేయునదీ॥

నిను చూచుటకే రప్పించితివీ
నీ దరిసెనమే యిప్పించితివీ
యీనోట పాట పాడించితివీ
యిది ఎవరి రచనయని యడిగితివీ    ॥చేయునదీ॥

నా భావనమే నా జీవనమై
నీ ప్రణయమ్మే నా కవనమ్మై
నా అహపుటంచు చెరిపించెదవో
నా ఇహము పరము గావించెదవో    ॥చేయునదీ॥

నాదామృతమే పరసాధనగా
నీ దివ్య వాక్కే ఉద్బోధనగా
ఈ రజని కాంతు లొలయించెదవో
విశ్వ జనహితము వెలయించెదవో    ॥చేయునదీ॥

(1965 మే)

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
..................................