జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, July 25, 2010

జర్నలిజం బాధ్యతాయుతమైంది --సాక్షి లో నా ఇంటర్వ్యూ !


జర్నలిజం బాధ్యతాయుతమైంది

అంబత్తూరు, తమిళనాడు, న్యూస్‌లైన్‌:

జర్నలిజం కేవలం ఉద్యోగం కాదు సమాజం పట్ల బాధ్యత అంటారు రెంటాల జయదేవ. ఆయన పాత్రికేయ రంగం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఈయన తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రవేసిన రెంటాల గోపాలకృష్ణ వారసుడు. తండ్రిక తగ్గ తనయుడు. రచయితగా, సమీక్షుకుడిగా, వ్యాసకర్తగా, విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా, పరిశోధకుడిగా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 'విస్తృత పరిజ్ఞానం కోసం నిత్యం అన్వేషించడం నాకిష్టం' అంటున్న జయదేవతో 'న్యూస్‌లైన్‌' ముఖాముఖి.

ప్రశ్న : తండ్రి కవిత్వంపై పరిశోధనలు చేయడంపై మీ అనుభూతి ?
జ: ఆయనను నా తండ్రిగా కంటే ఓ కవిగా, రచయితగానే నే ను గుర్తిస్తాను. శ్రీశ్రీ, ఆరుద్ర సమకాలికులుగా ఆధునిక కవిత్వాన్ని శాసించిన గోపాలకృష్ణ పీడిత ప్రజల పక్షాన చివరివరకు నిలిచారన్న విషయం మిగతా వారికంటే ఆయన కొడుకుగా నాకు బాగా తెలుసు. అందుకే ఆయన కవిత్వంపై పరిశోధన చేసేందుకు పూనుకున్నాను. తండ్రి కవిత్వంపై పరిశోధన చేసే అవకాశం రావడం మరుపురాని అనుభూతి. అందుకే నాకు వచ్చిన డాక్టరేట్‌ మా నాన్న గారికే అంకితం చేశాను.

ప్రశ్న : పాత్రికేయులై న మీరు పరిశోధన చేయడం గురించి ? పరిశోధన వివరాల గురించి?
జ: పాత్రికేయుడికంటే ముందు నేనొక రచయితను, వ్యాసకర్తను. 15 ఏళ్ల వయసులోనే మా నాన్నగారి రచనలకు అక్షరదోష పరిష్కర్తగా వ్యవహరించిన అనుభవం ఉంది. అందుకే నాకు చిన్నప్పటి నుంచి రచనలపై అవగాహన వచ్చిందనుకుంటున్నా. ఆ రకంగా నాన్నగారి రచనలపై పరిశోధన చేయడం నాకు పెద్ద కష్టమనిపించలేదు. పరిశోధనకు నా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం మరవలేనిది. 'రెంటాల గోపాలకృష్ణ కవిత్వం, సామాజిక దృక్పథం' పేరుతో చేసిన పరిశోధన సంపుటి నా జీవితంలో మరువలేనిది.
ప్రశ్న : పాత్రికేయులుగా మీ ప్రస్థానం గురించి?
జ: జర్నలిజంపై ఉన్న ఆసక్తితో డిగ్రీ పూర్తి కాగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజమ్‌, మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో ఎంఏ చేశాను. అలాగే పుణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్ ఆఫ్‌ ఇండియా సంయుక్త నిర్వహణలో చలనచిత్ర రసాస్వాదన (ఫిల్మ్‌ ఎప్రీసియేషన్‌ ) డిప్లొమో కోర్సు చేశాను. ఎన్ని చేసినా పాత్రికేయ రంగంలో ఏదో సాధించాలన్న తపన మాత్రం తగ్గడంలేదు. కొత్త విషయాలను నేర్చుకోవాలి. బాధ్యతాయుతమైన పాత్రికేయుడిగా నా కంటూ ఓ గుర్తిం పును తెచ్చుకోవాలని ముందుకు సాగుతున్నాను.

ప్రశ్న : ప్రస్తుత పత్రికా వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ: పార దర్శకత లోపిస్తుంది. సమాజం పట్ల పాఠకుడికి అవగాహన కల్గించడంతో పాటు వాళ్లను జాగృతులను చేయాల్సిన బాధ్యత పత్రికలకు ఉందనే నిజాన్ని మరవకూడదు. ఎప్పుడైతే వ్యాపారధోరణిలో ఆలోచిస్తామో అప్పుడే పాత్రికేయులుగా మనం వెనకబడిన వారమవుతాం. ఆ విధానానికి స్వస్తి పలికి నిజాలు రాసినప్పుడే మన కలానికి పదును తగ్గే అవకాశం ఉండదు.
ప్రశ్న : తెలుగు పత్రికల్లో ఆంగ్లభాష ప్రభావం గురించి?
జ: అది మన స్వయంకృతమేనని నా భావన. మన చుట్టూ ఏదైతే భాషను వాడుతున్నారో అదే భాషను పత్రికల్లో వాడుతున్నారు. ఈ పద్ధతి మారాలంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పులు రావాలి. వారు నేర్పించే భాషనే పిల్లలు అలవాటు చేసుకుంటున్నారు. మనం తెలుగులో మాట్లాడితేనే కదా మన పిల్లలు తెలుగులో మాట్లాడుతారు.

ప్రశ్న : ఈ విధానం మారే అవకాశం లేదా?
జ: సాధ్యమైనంత వరకు తెలుగు పదాలను విని యోగించడం అలవర్చుకోవాలి. ఎక్కువగా తెలుగులో మాట్లాడడం చేయాలి. కచ్చితంగా మార్పు వస్తుంది. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తెలుగును చదవాలి, రాయాలి, మాట్లాడాలి. మనకు అందుబాటు లో ఉన్న తెలుగు పదాలను వినియోగిస్తే చాలు మన తెలుగును మనం కాపాడుకున్నట్లే.

ప్రశ్న : మీరు చేసిన రచనలు, వ్యాసాలు, పొందిన అవార్డు గురించి?
జ: వ్యాసాలు, అనువాదాలు ఎక్కువగా చేశానని చెప్పాలి. ధారావాహిక సంచిక రూపంలో చాలా వరకు వ్యాసాలు అందించాను. శ్రీరామకృష్ణ ప్రభ లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వ్యాసాలు చాలా రాశా ను. అలాగే కైలాస- మానస సరోవర యాత్ర వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించాను. స్వామి పురుషోత్తమానంద రచించిన సీక్రెట్‌ ఆఫ్‌ కాన్‌సన్‌ట్రేషన్‌, లెటర్‌ టు ఏ స్టూడెంట్‌ పుస్తకాలను 'ధ్యాన మార్గదర్శి' పేరుతో అనువదించాను. గ్రేట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా అనే ఐదు భాగాల పుస్తకాన్ని 'ఆదర్శ నారీ మణిదీపాలు' పేరిట ధారావాహికగా అందించాను. ప్రస్తుతం శ్రీరామకృష్ణ ప్రభలో ఆచార వ్యవహారాలు - అంతరార్థాలు పేరిట ధారావాహికను అందిస్తున్నాను. ప్రముఖ సీనియర్‌ పాత్రికేయులు ఇంటూరి వెంకటేశ్వర రావు గారి పేరుమీద ఏర్పాటు చేసిన మెమోరియల్‌ ట్రస్టు 'ఉత్తమ పాత్రికేయుడు' అవార్డుతో సత్కరించింది.
( సాక్షి తమిళనాడు లో 2010 జూలై 25, ఆదివారం నాడు ప్రచురితమైన నా ఇంటర్వ్యూ)

12 వ్యాఖ్యలు:

Afsar said...

Jayadeva:

Interview baagumdi.

mee itara rachanalu koodaa twaralo ee blog lo chadavaalani aasapaDutunna..

afsar
www.afsartelugu.blogspot.com

cbrao said...

మీ పేరు విన్నాను. మీ రచనలు గుర్తుకు రావటం లేదు. ధార్మిక రచనలు మీవి ఎక్కువనుకుంటాను. శ్రీరామకృష్ణ ప్రభ చూడటం కుదరలేదు. మీ నుంచి వైవిధ్యభరిత విషయాలపై వ్యాసాలను ఆశిస్తాను. బ్లాగ్లోకానికి స్వాగతం.
cbrao
Mountain view(CA)

Unknown said...

@afsar garu!

Thank u. mii aasa nu, naa aasa gaa chesukoni, blogging chesenduku
prayathnistaa. Regards.

@cbrao garu!
mii saadara swaagathaniki krithagnunni. mii aaasanu thirchenduku
praythnistaanu.
eppatikappudu mii abhipraayam cheppandi.
regards.

సుజాత వేల్పూరి said...

ఇండియా టుడే ద్వారా మీరు పాఠకులకు సుపరిచితులే!బ్లాగు ద్వారా కలుసుకుంటున్నందుకు సంతోషం! మీ నాన్నగారి కవిత్వం మీద పరిశోధన చేయడం సంతోషించదగిన విషయమే గానీ,ఇప్పుడు అందుబాటులో లేని గోపాల కృష్ణగారి పుస్తకాలని(ఉదా:ఆకలి,యమకూపం,బొమ్మలు చెప్పిన కథలు)మళ్ళీ ముద్రించే ప్రయత్నం ఏమైనా చేసే ఆలోచన ఉందా?ఎందుకంటే మేము సీరియస్ రీడర్లుగా మారే టైముకు ఆ పుస్తకాలన్నీ మార్కెట్లో లేకుండా పోయాయి.ఎలాగో ప్రయాస మీద "యమకూపం"సాధించాను.

టైముండి,అభ్యంతరం లేకపోతే ఈ కింది లింకు చూడండి!

http://manishi-manasulomaata.blogspot.com/2010/04/yama-pit.html

Unknown said...

@ సుజాత గారూ,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరు పంపిన లింకు ఇప్పుడే చూశాను. యమకూపం మీద మీ అనుభూతిని చక్కటి పరిచయంగా అందించారు. మంచి పుస్తకం గురించి రాసినందుకూ, అది మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ గారు చేసిన అనువాదం అయినందుకూ ఆనందించాను. చాలా రోజుల క్రితం చదివిన యమకూపం నవలను మరోసారి గుర్తు చేసినందుకు థ్యాంక్స్. పుస్తకం ముఖచిత్రం నేను చదివిన పాత కాపీలో కూడా చూసిన గుర్తు లేదు. ముఖచిత్రం చూడడం నాకిదే మొదటిసారి. యమకూపం నవల, అనువాదం గొప్పతనం గురించి జయంతి పబ్లిషర్స్ పెరుమాళ్ళు గారు, నవోదయ పబ్లిషర్స్ రామమోహనరావు గారు, పర్ స్పెక్టివ్స్ ఆర్.కె. గారు, నటులు కాకరాల గారు - ఇంకా పలువురు ఇప్పటికీ పదే పదే ప్రస్తావిస్తుంటారు. ఎన్. వేణుగోపాల్ గారు ఆ మధ్య హైదరాబాదులో జరిగిన సభలో కూడా రెంటాల యమకూపం అనువాదం లోని విశిష్టత, విశేషాల గురించి చక్కగా వివరించారు. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకొనేలా చేశారు. అభివాదాలు.

సుజాత వేల్పూరి said...

నేనడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదండోయ్! మీ నాన్నగారి పుస్తకాలు మళ్ళీ బయటికి తెచ్చే ప్రయత్నం ఉందా ? ఆకలి అర్జెంట్ గా చదవాలని ఉంది. ఎక్కడా దొరకడం లేదు.

critic said...

‘ఆకలి,‘యమకూపం’తో పాటు
మీ నాన్నగారిది ‘జాతీయాలు
పుట్టుపూర్వోత్తరాలు మరియు సంస్కృత న్యాయాలు’ అనే పుస్తకం కూడా ఉండాలి.దాని పున: ప్రచురణ జరుగుతుందా? అసలు ఒక వెబ్సైట్ తెరచి, ఆయన రచనల వివరాలూ, జీవితవిశేషాలూ మీరు పొందపరచవచ్చు కదా!

Anonymous said...

sir
yamakoopam tho paatu anna kerineenaa koodaa naanna garu anuvaadam chesaarukadaa. adi sampadinchaa.
-gorusu

Unknown said...

@ గొరుసు గారూ,
నమస్తే.

రెంటాల గోపాలకృష్ణ గారి అనువాదాల్లో అన్నాకెరినినా మీరు సంపాదించి చదివాననడం ఆనందం కలిగించింది. రవీంద్రనాథ్ టాగూర్ రచనలు కూడా చాలానే రెంటాల అనువాదం చేశారు.

@ సుజాత గారూ,
@ క్రిటిక్ గారూ,

నమస్తే.

రెంటాల గారు దాదాపు 200 రచనలు చేశారు. వాటిలో దాదాపు 170 పైన పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి - వేర్వేరు పబ్లిషర్స్ నుంచి. మిగిలినవి ఇంకా గ్రంథరూపంలో రావాల్సి ఉంది.

రెంటాల గారికి అభ్యుదయ కవిగా పేరు తెచ్చిన - సంఘర్షణ, సర్పయాగం - కవితా సంపుటాలను ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులం పునర్ముద్రించాం.

ఆయన చిరకాల వాంఛ అయిన - శివధనువు- కవితా సంపుటాన్ని తొలిసారిగా పుస్తక రూపంలో తెచ్చాం.
సంకలనం కాని ఆయన నాటికలు, నాటకాలను - రెంటాల నాటక సాహిత్యం మొదటి సంపుటం-గా ప్రచురించాం. తెలుగు నాట వ్యక్తిగతంగా పుస్తక ప్రచురణ, వాటి మార్కెటింగ్ ఎంతటి కష్టమో మీకు తెలియనిది కాదు. ఆ పుస్తకాలతో చేతులు కాలి, నడుములు విరిగాయి.

బొమ్మలు చెప్పిన కథలు ఇంకా పుస్తక రూపంలో రాలేదు.

రెంటాల గారు రాసిన జాతీయాలు పుట్టుపూర్వోత్తరాలు - సంస్కృత న్యాయాలు, సుభాషిత రత్నావళి పుస్తకాలు బెజవాడ క్వాలిటీ పబ్లిషర్స్ వారు వేశారు. ఆ పుస్తకాలు వారి దగ్గర లభిస్తున్నాయి.

రెంటాల చేసిన మరో మంచి అనువాద నవల విజయధ్వజం (మూల రచయిత ఎస్. మకరెంకో) ఇటీవలే పునర్ముద్రితమైంది. మంచి పుస్తకం, తార్నాకా, హైదరాబాదు వారు పునర్ముద్రించారు. అదీ మార్కెట్లో దొరుకుతోంది. బెజవాడ నవోదయ బుక్ హౌస్ లో కూడా కాపీలు ఉన్నాయి.

రెంటాల పునఃకథనం చేసిన రామాయణ, భారత, భగవద్గీతలు, మనుచరిత్రాది ప్రబంధ సాహిత్యం సరళమైన తెలుగు వచనంలో బెజవాడ జయంతి పబ్లికేషన్స్, ఏలూరు రోడ్, విజయవాడ వారి ప్రచురణలుగా అందుబాటులో ఉన్నాయి. ఇక, రాజాజీ మెచ్చిన భాగవతం పేర భాగవత అనువాదం ఉప్పులూరి కాళిదాసు గారి వ్యాస ప్రచురణాలయం వారి పబ్లికేషన్ గా మార్కెట్లో ఉంది.

రెంటాల సరళంగా అనువదించిన వాత్స్యాయన కామసూత్రాల రచన సరే సరి. రైల్వే స్టేషన్లలోని హిగ్గిన్ బాదమ్స్ సహా ఎక్కడ బడితే అక్కడ దొరుకుతుంది. పిల్లల కోసం రాసిన బొమ్మల పుస్తకాలు నవరత్న బుక్ హౌస్, రహమాన్ వీధి, అరండల్ పేట, విజయవాడ వారి ప్రచురణలుగా లభిస్తున్నాయి.

ఇదీ స్థూలంగా వివరాలు.

యమకూపం, ఆకలి, అన్నాకెరినినా, భయస్థుడు, గోరా, మృత్యుముఖంలో తుది రోజు లాంటి ఎన్నో మంచి అనువాదాలు రెంటాల గారు చేశారు. అయితే, వాటి పునః ప్రచురణ లాంటివి వ్యవస్థీకృతమైన పెద్ద సంస్థలు చేయాల్సిన పనే తప్ప, మధ్యతరగతి ఉద్యోగ జీవులు చేయగలిగింది కాదు. చేయడానికి ప్రయత్నిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యక్ష అనుభవం కూడా చూశాం.

అయినా ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆచరణలోకి వచ్చినప్పుడు కచ్చితంగా మీ లాంటి సాహితీ ప్రియ మిత్రులందరికీ చెబుతాను.

గత స్మృతులన్నీ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొనేలా చేసినందుకు కృతజ్ఞతలు.

KumarN said...

I didn't know there is a telugu translation of Anna Karenina!!

Is it available? How do I get it?

Unknown said...

@ కుమార్ గారూ,
నమస్తే.

ప్రపంచ ప్రసిద్ధ టాల్ స్టాయ్ నవల అన్నా కెరినినాకు రెంటాల గోపాలకృష్ణ గారు చేసిన అనువాదం 1956 ప్రాంతంలో ప్రథమంగా ప్రచురితమైంది. అప్పట్లో అభ్యుదయ పుస్తకాల ప్రచురణకు చిరునామా అయిన గద్దె లింగయ్య గారి ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. సరళమైన తెలుగులో సాగే ఈ రచన ఆ తరువాత కూడా ముద్రణలు పొందినట్లు గుర్తు. ప్రముఖ గ్రంథాలయాల్లో ఎక్కడైనా దొరకవచ్చు.

సుజాత వేల్పూరి said...

జయదేవ గారూ,
చాలా సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు!

విజయధ్వజం ఉందండీ నా దగ్గర! మకరెంకో పుస్తకాలు బాగుంటాయి. ముఖ్యంగా "అల్లరి పిల్లలలో అద్భుత మార్పులు..!"