జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, June 6, 2014

'ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కాదు' - మహేష్ బాబు

'ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్.. ఎలపరం వచ్చేస్తోంది' అంటూ 'ఆగడు'లో ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన డైలాగులపై పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాపై ఘాటుగా స్సందించారు. మా హీరోపై సెటైర్లు వేస్తారా అంటూ నిష్టూరమాడారు. దాంతో తాను చెప్పిన డైలాగులపై మహేష్ బాబు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ డైలాగులు చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు ఎవరినీ ఉద్దేశించి ఈ డైలాగులు రాయలేదని చెప్పారు. పాత్ర స్వభావానికి అనుగుణంగా డైలాగులున్నాయని వివరించారు. 'అత్తారింటికి దారేది' సినిమాలో 'సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా' అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ బాగా పాపులరైన సంగతి తెలిసిందే.

ఇక '1.. నేనొక్కడినే' సినిమా పోస్టర్ వివాదంపైనా మహేష్ స్సందించారు. అది వివాదాస్పదంగా ఎలా మారిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘వన్’ సినిమా పరాజయం తన ఆలోచనా ధోరణిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అది ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించినట్టు చెప్పారు. భవిష్యత్తులోనూ అలాంటి ప్రయోగాలు చేస్తుంటానని తెలిపారు.

తన కుమారుడు గౌతమ్‌తో కలిసి మరోసారి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. ఆగడు తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో సినిమా చేయనున్నట్టు చెప్పారు. దర్శకుడు మణిరత్నంతో తన సినిమా ఇంకా చర్చల దశలో ఉందన్నారు.


(Published in 'Sakshi' daily, 6th May 2014, Fri)
...................................................

0 వ్యాఖ్యలు: