జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, April 3, 2011

సెంటిమెంట్ నిలిచింది... నమ్మకం గెలిచింది... వరల్డ్ కప్ నా వల్లే వచ్చింది...





బహుశా భారతదేశంలో 121 కోట్లమందికే కాదు, ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భారతీయ సంతతికి కూడా ఇది ఓ ఆనందభరిత క్షణం. దాదాపు 28 ఏళ్ళ తరువాత దేశ ప్రజల కల, దాదాపు 21 ఏళ్ళుగా సచిన్ టెండూల్కర్ స్వప్నం నిజమైన క్షణం. విశ్వవిజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచిన క్షణం. 2011 ఐ.సి.సి. వరల్డ్ క్రికెట్ కప్ ను మన జట్టు గెలుచుకున్న గర్వకారణమైన క్షణం. 1983 నాటికి ఊహ తెలియకపోయినా, ఆ తరువాత బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్, షార్జా కప్, ఆసియా కప్ ల మీదుగా భారత క్రికెట్ ను ఆసక్తిగా చూస్తూ వస్తున్న నాకు ఇవాళ ఓ ఉద్విగ్నపరిస్థితి. అయితే, కలసికట్టుగా కష్టపడితే ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా ఎలా బయటపడవచ్చో ఇవాళ మన జట్టు మరోసారి నిరూపించింది.


ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు దేశంలోని కొన్ని కోట్ల మంది భారతీయ క్రీడాభిమానుల లాగానే నేను కూడా మునుపెన్నడూ లేనంత ఉద్విగ్నతకు గురయ్యాను. నిజం చెప్పద్దూ.... ఒకానొక దశలో టెన్షన్ భరించలేక టీవీ కాసేపు ఆపేశా. కాసేపైన తరువాత మనవాళ్ళు పరుగుల లక్ష్య సాధనలో మరికొంత ముందుకు వెళ్ళాక అప్పుడు టీవీ పెట్టి చూడవచ్చులే అనుకున్నా. అలాగే చేశా, చూశా. నేను అనుకున్నట్లుగానే వికెట్లు పడడం ఆగి, మనవాళ్ళు లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళడం జరిగింది. దాంతో, అదో సెంటిమెంట్ గా మారి, మ్యాచ్ అంతా అదే పద్ధతిలో టీవీ కాసేపు ఆపడం, మళ్ళీ పెట్టడం అనే కలిసొచ్చిన సెంటిమెంట్ పద్ధతిలోనే చూశాను. చివరకు మనం గెలిచాం. భారత జట్టు సమష్టి కృషే కాదు, ధోనీ కెప్టెన్సీయే కాదు, నా లాంటి కోట్లాది అభిమానులు పాటించిన ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఇవాళ మన జట్టు గెలవడానికి కారణం. ఈ మాటను చాలా మంది కొట్టిపారేయవచ్చు. కానీ, అంతకంతమందికి నా లాంటి సెంటిమెంట్లు ఉంటాయనీ, వాటిని పాటించడం వల్లే మనం కప్పు గెలిచామని వారు ఏకీభవిస్తారనీ అనడంలో నాకు సందేహం లేదు. ఇది పిచ్చి వాదనే కావచ్చు, తర్కానికి నిలవకపోవచ్చు. కానీ, నమ్మకాన్ని మించినది లేదు కదా.

శ్రీలంక బ్యాటింగ్ ముగిసి, 275 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించిన తరువాత, మన వాళ్ళు బ్యాటింగ్ కు దిగే లోపల ఓ మిత్రుడు కమ్ జర్నలిస్టు నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావని అడిగాడు. ఇంట్లో టీవీలో మ్యాచ్ చూస్తున్నానని చెప్పా. ఏం రెండో లడ్డూ తినాలని అత్యాశగా ఉందా అన్నాడు. అదేమిటన్నా. పాక్ తో మనవాళ్ళు అనూహ్యంగా గెల్చి, మనతో ఓ లడ్డు తినిపించారు. మళ్లీ ఈ రోజు ఈ 275 పరుగుల లక్ష్యం ఛేదించి, గెలుస్తారని కల కనకు. అన్ని సార్లూ అద్భుతాలు జరగవు అన్నాడు. అసలే శ్రీలంక ఆఖరి 5 ఓవర్ల పవర్ ప్లేలో చేసిన బ్యాటింగ్ దాడి చూసి, బిత్తరపోయి ఉన్న నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రెట్టించి అతను అడిగేసరికి, ఏమనాలో తెలియక - ఏమో గుర్రం ఎగరావచ్చు - అని అపనమ్మకం నిండిన స్వరంతో నమ్మకాన్ని ధ్వనించా. ఆఖరికి నేను అన్నట్లే జరిగింది. సెహ్వాగ్, సచిన్లు బ్యాటింగ్లో విఫలమైనా, గంభీర్, ధోనీల సమయోచిత బ్యాటింగ్తో చివరకు మన జట్టు గెలిచింది. అవును. గుర్రం ఎగిరింది.

కప్పు గెలవగానే నేను వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న మా అమ్మతో, మా అన్నయ్యతో అందరితో ఎస్టీడీలు చేసి మరీ ఆనందం పంచుకున్నా. మా ఇంట్లో టీవీ వాల్యూమ్ గట్టిగా పెట్టి, పిల్లలతో కలసి డ్యాన్సులు చేశా. మేడ మీది నుంచి వీధిలోకి చూస్తూ అరిచా. ప్రపంచంలోని శతాధిక భారతీయులతో నేనూ గొంతు కలిపా. ఈ ప్రపంచ కప్ తో భారతదేశంలోని సమస్యలేవీ తీరకపోవచ్చు. మన జీవితం ఒక్క కప్పుతో మారకపోవచ్చు. కానీ, జాతి మొత్తం జయహో అనే క్షణాలు చాలా కొద్దిగా వస్తాయి. రకరకాల విభేదాలు, అంతరాలు, కుమ్ములాటలతో కుంగిపోతున్న నవ భారతావనికి ఇప్పుడు సరికొత్త స్ఫూర్తిప్రదాతలు దొరికారు. క్రీడల్లోనే కాదు, జీవితంలోనూ ఇవాళ మనకు ఇలాంటి స్ఫూర్తిదాతలు, గర్వకారకులు ఎంతైనా అవసరం. అందుకే, ఈ మన విజయం జీవిత కాలంలో ఓ చిరస్మరణీయ జ్ఞాపకం. భారత జట్టుకే కాదు, మనం గెలవాలనీ, గెలుస్తామనీ నమ్మిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.


(బ్లాగు మిత్రులందరికీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వేజనా : సుఖినో భవన్తు... సమస్త సన్మంగళాని భవన్తు).

2 వ్యాఖ్యలు:

KumarN said...

Amen

astrojoyd said...

నిజం రెంటాలా జీ..ఎవరి పిచ్చి వారికానందమని బాగా చెప్పారు మీరు.