జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, January 26, 2011

నిబద్ధ పాత్రికేయుడు శివలెంక శంభుప్రసాద్ శత జయంతి నేడే!



(బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆంధ్రపత్రిక దినపత్రిక, వారపత్రిక, భారతి మాసపత్రికల అధిపతి, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి మేనల్లుడూ, అల్లుడూ అయిన స్వర్గీయ శివలెంక శంభుప్రసాద్ గారి శత జయంతి నేడు (2011 జనవరి 26). ఆ సందర్భంగా దాదాపు 50 ఏళ్ళ పాటు ఆంధ్రపత్రిక ప్రచురణలకు కార్యక్షేత్రమైన చెన్నపట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ, మద్రాసు తెలుగు జర్నలిస్టు మిత్రులం కలసి శతజయంతి స్మరణోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ఆయనను స్మరిస్తూ, 92 ఏళ్ళ సీనియర్ జర్నలిస్టు - ఆంధ్రపత్రిక కార్యనిర్వాహక సంపాదకులూ అయిన మద్దాలి సత్యనారాయణ శర్మ గారు రాసిన ఈ ప్రత్యేక వ్యాసం - సాహితీ, పత్రికాభిమానుల కోసం...)


అక్షయ భావాల అక్షర తేజం


--- రచన -- మద్దాలి సత్యనారాయణ శర్మ

ఆం ధ్రపత్రిక, సచిత్ర వారపత్రిక, భారతి, ఉగాది సంచికలకు 1938నుంచి 1972 వరకు సంపాదకత్వం వహించిన శివలెంక శంభుప్రసాద్‌కు నేడు శతజయంతి. ఆ కాలపు తెలుగు పత్రికా సంపాదకులలో శంభుప్రసాద్‌ది ఒక ప్రత్యేక స్థానం. 1936 నాటికే ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఇరుగు పొరుగు ప్రాంతాలకంటే అధికంగా ఉండేది. పత్రికల ప్రాచుర్య ప్రాబల్యాలు కూడా ఎక్కువ. పెద్ద దినపత్రికలే కాక చిన్న వార, పక్ష మాస పత్రికలు కూడా వివిధ రకాలుగా పాఠకుల అభిమాన ఆదరాలను పొందడానికి బహురకాలుగా ప్రయత్నిస్తూ ఉండేవి.
వీటిలో ముఖ్యమైనవి: సంపాదకుల పేర్లను ప్రముఖంగా ముఖపత్రాలపై ప్రచురించుకొనడం.... అప్పట్లో ప్రామాణికాలుగా పరిగణితమైన హిందూ, స్టేట్స్‌మన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ పత్రికలవలె ఆంధ్రపత్రిక, తమిళ స్వదేశమిత్రన్‌కూడ సంపాదకుల పేర్లను ‘ఇంప్రింటు’లో మాత్రమే చూపేవి. వీటి సంపాదకులు అరుదుగా సభలలో, సమావేశాలలో పాలొన్నప్పటికీ విషయ ప్రాధాన్యంతో వార్తలు వేయడమేగాని తమ ఫోటోలను తమ పత్రికలలో వేసుకునేవారు కాదు. ఆంధ్రపత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఈ ప్రమాణాలను పాటించేవారు. తమ పత్రికా సిబ్బందిలో ఎవరైనా అత్యుత్సాహంతో తమను గురించి వ్యక్తిగత వార్తను గానీ, తమ ఫోటోనుగానీ పొరపాటున ప్రచురిస్తే మందలించేవారు. నాగేశ్వరరావు పంతులు నిర్యాణానంతరం ఆ పత్రిక ప్రచురణ, సంపాదక బాధ్యతలను వహించిన శంభుప్రసాద్ కూడా కట్టకడపటి వరకూ ఆ ప్రమాణాలను పాటించారు.

నాగేశ్వరరావు పంతులు బహు వ్యాపకం పెట్టుకున్నందున ఆయన ఉపన్యాసాల, ప్రసంగాల వార్తలు వేయక తప్పేది కాదు. అట్లాగే శంభుప్రసాద్ రాజ్యసభ, రాష్ట్ర శాసనమండలి సభ్యత్వాలను స్వీకరించినపత్యాగమయం..జీవితం!్పడు కూడ ఆ ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించారు, ఇష్టాగోష్టులలో పాల్గొనడానికే తప్ప వేదికలెక్కడానికి ఒప్పుకునే వారు కాదు. నోరి నరసింహ శాస్ర్తీ వంటి పెద్దలకు కూడా ఆయనను వేదిక ఎక్కించడం సాధ్యం కాలేదు.
రాజ్య సభ , శాసనపరిషత్ సభ్యత్వం కాలంలో వివిధ సమస్యలపై వివరాలను సేకరించి, తన అభిప్రాయాలను సూచిస్తూ ఆయా మంత్రిత్వ శాఖలకు లిఖిత పత్రాలను పంపేవారు కాని సభలో సవాళ్లు విసిరీ, వాగ్ధాటి చూపీ పేరు ప్రఖ్యాతులు పొందాలని వాంఛించలేదు. నిత్యాధ్యయనంతో బహువిషీయ పరిజ్ఞానం సాధించినవాడు. వ్యక్తిగత సంభాషణలు, ఉత్తరప్రత్యుత్తరములలో ఆయన ప్రజ్ఞను గ్రహించిన రచయితలు ఎందరో ఎంతో ప్రశంసిస్తూ ఆయన మరణించినపుడు పత్రికలకు రాశారు.

శంభుప్రసాద్ నాగేశ్వరరావుపంతులు సోదరి భ్రమరాంబగారి కడసారి బిడ్డ. మేనమామ ఇంటనే కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ఎలకుర్రులో 1911 జనవరి 26న శంభుప్రసాద్ జన్మించారు. సాధ్యమైనంత సంపాదించి దేశహితానికి వినియోగించాలన్నఏకైక ధ్యాస, ధ్యానంతో చెన్నపట్నం, కలకత్తా, ముంబయిలకు వెళ్లిచొరవగా ధనార్జన మార్గాలను అనే్వషిస్తున్న నాగేశ్వరరావు పంతులు మేనల్లుని తీరు తెన్నులను చిన్నతనంలోనే గ్రహించి సరియైన మార్గంలో పెట్టి ప్రోత్సాహించారు.
శివలెంక వారి పెసరమిల్లి అగ్రహారంలో ప్రాథమిక విద్య ముగియడంతోటే సోదరి బావలను ఒప్పించి పిల్లవానిని చెన్నపట్నం తీసుకువెళ్లి అడయారులోని బెసెంట్ థియసాఫికల్ హైస్కూలులో చేర్పించారు. అప్పుడు చెన్నరాష్ట్రంలో తొలి ఆశ్రమ పాఠశాల అది. అక్కడే శంభుప్రసాద్‌కు స్వావలంబన అలవడింది. తర్వాత బందరు జాతీయ కళాశాలలో చేర్పించారు. తమ ఏకైక తనయ కామాక్షమ్మను ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత రవీంద్రుని శాంతినికేతన్‌కి పంపారు. అక్కడ పట్ట భద్రుడు అయిన మీదట ఆంధ్రపత్రిక సంస్థలోని అన్ని పనులు అభ్యసింపచేసారు.
శంభుప్రసాద్ సంసార జీవితం సొగసైనది, సంస్కారవంతమైనది. అనేక విద్యలు అభ్యసించిన అర్ధాంగి అనుకూలవతి. భర్తకు అన్నివిధాలా ఆసట బాసటగ ఉండి ఆయన కర్తవ్యనిర్వహణకు ఎంతో తోడ్పడింది. బంధుకోటితో నిండిన గృహ నిర్వహణలోను, పిల్లల పెంపకంలోను ఆమెదే ముఖ్యపాత్ర. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
నాగేశ్వరరావు పంతులు మనసుపడి నిర్మించిన శ్రీబాగు ఎల్లప్పుడు బంధు జనులతో కళకళలాడుతుండేది. పత్రికా సిబ్బందికి కూడా ఆ ఇంటి ఆతిధ్యం అనుభవించే అవకాశాలు లభించేవి. కార్యాలయంలో వినాయక చతుర్థి దసరారోజులలో పూజలు జరిగేవి.

వి.ఎస్.నయీపాల్ వంటి విదేశీ భారతీయుల ప్రముఖులు వచ్చినప్పుడు శంభుప్రసాద్‌ని కలిసి కాలక్షేపం చేసి ఆతిధ్యం పొందడం పరిపాటి. ఆ సందర్భంలో సంపాదకవర్గ సభ్యులకు కూడా పాల్గొనే అవకాశాలుండేవి. శంభుప్రసాద్ జీవితం,సంతృప్తికరంగా, ఆదర్శప్రాయంగా గడిచిపోయింది. ఆయన సన్నిహితులం అయిన కొందరం శతజయంతిని జరుపుతున్నాము.

1 వ్యాఖ్యలు:

Chowdary said...

ఆంధ్రపత్రికలో పనిచేసిన బాపు, రమణలు 'అయ్యవారు' గురించి చాలా గౌరవంగా, ప్రేమగా, భక్తిగా మాట్లాడుతారు. కోతికొమ్మచ్చిలో రమణగారి మాటల్లో ఇది చాలాసార్లు చూడొచ్చు. అప్పట్లో సంచలనం సృష్టించిన తెలుగు వెలుగులు శీర్షిక, మొదటి వ్యాసాలు శంభుప్రసాద్‌గారి దగ్గరనుంచే వచ్చాయనికూడా చెపుతారు.