జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, August 10, 2014

అడవుల్లో... అడ్డంకుల్ని అధిగమించి... హీరో బాలకృష్ణ

అడవుల్లో... అడ్డంకుల్ని అధిగమించి...
 ఇటీవల దక్కిన ‘లెజెండ్’ ఘన విజయంతో ఊపు మీదున్న హీరో నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో తన తాజా చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణమవుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాలలో దిగ్విజయంగా జరిగింది. ‘‘నిజానికి, ఏజెన్సీలో భారీ వర్షాలు కురిసి, ఈ చిత్ర షూటింగ్‌కు అంతరాయం తలెత్తింది. 7 రోజులనుకున్న షెడ్యూల్ 13 రోజుల దాకా విస్తరించింది.

  అయినప్పటికీ, కష్టనష్టాలకు వెరవకుండా ముందుకెళ్ళి, ముందుగా అనుకున్న సన్నివేశాలను అనుకున్నట్లుగా చిత్రీకరించి, ఈ షెడ్యూల్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాం’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు ‘సాక్షి’కి చెప్పారు. ఎత్తై భారీ వృక్షాల మధ్య, అటవీ ప్రాంతంలో జరిగిన ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట దృశ్యాలనూ, కథానుగుణంగా కొన్ని టాకీ సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఈ ఏజెన్సీ షెడ్యూల్‌లో హీరో బాలకృష్ణ, హీరోయిన్ త్రిషతో పాటు చలపతిరావు, గీత, చిత్రలేఖ, శ్రావణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘దాదాపు 30 మంది ఫైటర్లతో ప్రధాన పోరాట సన్నివేశాలు తీశాం.

 వర్షాలు అడ్డంకి సృష్టించినప్పటికీ వెనుదిరిగి రాకుండా, ఓ కొత్త నిర్మాత ఇలా హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళిన 250 మంది యూనిట్‌తో అక్కడే బస చేసి, అనుకున్న రీతిలో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం అరుదైన విషయం’’ అని ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ చెప్పారు. రాజమండ్రికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అందని లొకేషన్‌లో ప్రకృతి పరిసరాల మధ్య తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

  వెంకట ప్రసాద్ ఛాయాగ్రహణం, రవీందర్ కళాదర్శకత్వం నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించాల్సి ఉంది. ‘‘రేపటి నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్, తదితరప్రాంతాల్లో పది రోజుల పాటు కొన్ని ప్రధాన పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు.

.................................

0 వ్యాఖ్యలు: