జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, January 18, 2014

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా! - సినీ నటుడు కృష్ణంరాజు

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) తరఫున పోటీ చేయనున్నట్లు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు. కృష్ణంరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఈ సంగతి వెల్లడించారు. కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కృష్ణంరాజు ఇటీవల మళ్ళీ బి.జె.పి.లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో కాకినాడ, నరసాపురం పార్లమెంటరీ స్థానాల నుంచి బి.జె.పి. తరఫున నిలిచి, గెలిచిన ఆయన ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేయనున్నదీ చెప్పలేదు. ''పార్టీ నిర్ణయించిన స్థానంలో పోటీ చేస్తా'' అని ఆయన 'ప్రజాశక్తి'తో అన్నారు. మునుపటి నియోజక వర్గాల్లో తన పని తీరు బాగున్నందు వల్ల ఇప్పుడు ఇతర స్థానాల నుంచి కూడా తనను పోటీ చేయమంటూ అభ్యర్థనలు వస్తున్నాయని ఆయన అంటున్నారు. 

పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం నాడు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్న ఆయన, ''నేను బి.జె.పి. కుటుంబంలోని వాణ్ణి. మధ్యలో బయటకు వచ్చినా, ప్రస్తుత రాజకీయాలు నచ్చకపోవడంతో గడచిన నాలుగేళ్ళుగా వాటికి దూరంగా ఉంటున్నా. కానీ, పరిస్థితులు మారుతున్నాయనే చిన్న ఆశతో మళ్ళీ ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నా'' అని వివరించారు. 2009 ఎన్నికల సమయంలో మరో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం పార్టీ' (పి.ఆర్‌.పి)లోకి వెళ్ళిన కృష్ణంరాజు ఆ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో, కొద్ది రోజులకే బయటకు వచ్చేశారు. 

ఇక నుంచి మళ్ళీ బి.జె.పి. పక్షాన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటానన్న కృష్ణంరాజు ''మన రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్న''ట్లు తెలిపారు. 'ఒక ఓటు - రెండు రాష్ట్రాలు' అంటూ చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్న బి.జె.పి. అధినాయకత్వం బాటలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ''అయితే, రాష్ట్ర విభజన సమయంలో ఏ ప్రాంతం వాళ్ళకూ అన్యాయం జరగకూడదు. రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలి. అందు కోసం నా స్వరం వినిపిస్తాను'' అని కృష్ణంరాజు, 'ప్రజాశక్తి'తో అన్నారు. 


''నేను కోస్తా ఆంధ్రలో పుట్టినా, ఇక్కడే హైదరాబాద్‌లో బద్రూకా కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చదివాను. ఇక్కడ నుంచే మద్రాసులో సినీ రంగానికి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడకే వచ్చాను. కాబట్టి, నేను అన్ని ప్రాంతాల వాణ్ణి'' అని ఆయన అన్నారు. కొత్త ఏడాదిలో అవినీతి మూలాలను నిర్మూలించాలన్న ఇతివృత్తథంతో 'ఒక్క అడుగు' పేరిట ఓ సందేశాత్మక సాంఘిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభాస్‌, తాను కలిసి ఆ చిత్రంలో నటిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బి.జె.పి. విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌:

(Published in 'Praja Sakti' daily, 17th Jan 2014, Friday, Page No.4)
.........................

0 వ్యాఖ్యలు: