జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, January 16, 2015

ఆత్మబలంతో నెగ్గిన దసరా బుల్లోడు! - వి.బి. రాజేంద్రప్రసాద్‌



 తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. 1960, 70లలో దాదాపు అరవై ఏళ్ళ క్రితం సమాజంపై సినిమాల ప్రభావం,ప్రజల్లో సినిమాల పట్ల క్రేజు ఎక్కువవుతున్న రోజుల్లో తెలుగు నేలపై కోస్తా తీరం నుంచి సినీ రంగంలోకి వచ్చిన తరానికి చెందిన వ్యక్తి - వి.బి. రాజేంద్రప్రసాద్‌గా ప్రసిద్ధులైన వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్. నాటకాల్లో నటించి, ఆ అనుభవం, ప్రేమతో అటు నుంచి వెండితెరపైకి వచ్చారాయన. నటుడు కావాలనే కోరికతో సినీ రంగానికి వెళ్ళినా, నిర్మాతగా మొదలై, అపూర్వమైన విజయాలు సాధించి, అనుకోని రీతిలో దర్శకుడిగా మారి, ఆ విభాగంలోనూ రాణించిన ఘనత ఆయనది.

 రంగస్థలంపై స్త్రీ పాత్రధారి!
 ఎనభై రెండేళ్ళ క్రితం 1932 నవంబర్ 4న కృష్ణాజిల్లా ఉయ్యూరులో జన్మించిన వి.బి. రాజేంద్ర ప్రసాద్ స్వగ్రామం - గుడివాడ తాలూకా డోకిపర్రు గ్రామం. ఆయన తండ్రి జగపతిరావు చౌదరి భూస్వామి. స్కూలు చదువంతా పామర్రు, గన్నవరం, బందరుల్లో చేసిన ఆయన కాకినాడ పి.ఆర్. కాలేజీలో బి.ఎస్సీ చేశారు. కాలేజీ రోజుల్లోనే నటనపై మోజుతో ఆయన రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పటి ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ సమయంలోనే అదే కాలేజీలో బి.ఏ. చదువుతున్నారు. తరువాతి రోజుల్లో ీసినీ హీరోగా రాణించిన హరనాథ్ వీళ్ళకు ఒక ఏడాది జూనియర్. మరికొందరితో కలసి వీరంతా ఒక బృందంగా ఏర్పడి, నాటక రంగ ప్రముఖుడు బళ్ళారి రాఘవ పేరిట ‘రాఘవ కళా సమితి’ ఏర్పాటు చేసి, ఆ గొడుగు కింద నాటకాలు ప్రదర్శించేవారు.

  వడ్డాది సూర్యనారాయణ, తరువాత కాలంలో సినీ రంగంలో పేరు తెచ్చుకున్న విజయచందర్, అర్జా జనార్దనరావు, మాడా వెంకటేశ్వరరావు తదితరులు ఆ సంస్థలో కీలకసభ్యులు. ఆనాటి రంగస్థల ప్రముఖుడు డాక్టర్ గరికపాటి రాజారావుతో ఆ సంస్థను ప్రారంభించారు. ఆ రోజుల్లో రాజేంద్రప్రసాద్ రంగస్థలంపై ఆడవేషాలు కూడా వేసి, మెప్పించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘అంతర్ కళాశాలల నాటక పోటీ’ల్లో ఆత్రేయ ‘కప్పలు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, రాజేంద్రప్రసాద్ కథానాయిక పంకజం పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ స్త్రీ పాత్రలో ఆయన ఉత్తమ నటిగా, అదే నాటకంలో ఏడిద నాగేశ్వరరావు ఉత్తమ నటుడిగా బహుమతులు గెల్చుకోవడం విశేషం. ఆత్రేయ ‘వరప్రసాదం’, రెంటాల గోపాలకృష్ణ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’, అవసరాల సూర్యారావు ‘పంజరం’, అనిసెట్టి సుబ్బారావు ‘చెప్పు కింద పూలు’, పినిశెట్టి శ్రీరామమూర్తి ‘ఆడది’ లాంటి నాటకాలను అనేక చోట్ల ప్రదర్శించి, బహుమతులందుకున్నారు.

 తండ్రి పేరిట చిత్ర నిర్మాణ సంస్థ
 అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం రీత్యా, హీరోగా రాణించాలని సినీ రంగానికి వచ్చిన ఆయన అక్కినేని సలహాతో చిత్ర నిర్మాణం వైపు మళ్ళారు. తొలి సినిమా విఫలమైతే, వ్యవసాయానికి వచ్చేయాలని షరతు పెట్టి తండ్రి జగపతిరావు చౌదరి ఆయనకు యాభై వేలు ఇచ్చారు. తండ్రి పేరు మీదే తమ చిత్ర నిర్మాణ సంస్థకు ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అని పేరు పెట్టారు రాజేంద్రప్రసాద్. మరో మిత్రుడు పి. రంగారావుతో కలసి స్థాపించిన ఆ సంస్థపై ఆయన నిర్మించిన తొలి చిత్రం - ‘అన్నపూర్ణ’. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తరువాత వరుసగా ‘ఆరాధన’, ‘ఆత్మబలం’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘అదృష్టవంతులు’ తదితర చిత్రాలను అందించారు. ఆ చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. అలా అతి కొద్ది కాలంలోనే తెలుగు చిత్రసీమలోని నాగిరెడ్డి - చక్రపాణిల ‘విజయ’, దుక్కిపాటి మధుసూదనరావు ‘అన్నపూర్ణ’ తదితర ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థల సరసన రాజేంద్రప్రసాద్ ‘జగపతి’కి స్థానం దక్కింది.

 ఆయన కొలువు... స్టార్స్‌కు నెలవు
 అక్కినేనికి బాగా సన్నిహితుడైన రాజేంద్రప్రసాద్ సహజంగా ఆయనతోనే అప్పట్లో ఎక్కువ సినిమాలు నిర్మించారు. ఆనాటి మరో ప్రముఖ నటుడు జగ్గయ్య ‘జగపతి’ వారి చిత్రాల్లో పర్మినెంట్ ఆర్టిస్ట్. ఇక, భానుమతి, ఎస్వీ రంగారావు, జమున, జయలలిత, బి. సరోజాదేవి, వాణిశ్రీ, మంజుల, శోభన్‌బాబు - ఇలా స్టార్స్‌తో రాజేంద్రప్రసాద్ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేసేవి. ఆయన తమ ‘అంతస్తులు’ చిత్రానికి జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. అలాగే, ‘ఆస్తిపరులు’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది. అక్కినేని, బి. సరోజాదేవి నటించిన ‘ఆత్మబలం’ వానపాట ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ లాంటి వాటితో ఇవాళ్టికీ జనహృదయాల్లో నిలిచిపోయింది.

 ఆపద్ధర్మ దర్శకత్వం... ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్
 ఇటు కథ, అటు పాటలు, మరోపక్క సంగీతం - ఇలా అన్నీ దగ్గరుండి చూసుకొనే ఆ తరం ఉత్తమ నిర్మాతల్లో వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. దర్శకుడు వి. మధుసూదనరావు డేట్స్ కుదరకపోవడంతో, అక్కినేని ప్రోత్సాహం అండగా, అనుకోని పరిస్థితుల్లో ‘దసరాబుల్లోడు’తో రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. సినిమా రూపకల్పనపై, సామాన్య ప్రేక్షక జనం నాడిపై ఆయనకున్న అవగాహనకు సాక్ష్యం - వాణిశ్రీ, అక్కినేని నటించిన ‘దసరాబుల్లోడు’ అప్పట్లో ఆల్‌టైమ్ హిట్ కావడం! ఆ చిత్రంలోని ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ పాటలు ఇవాళ్టికీ జనం నోట నిలిచిపోయాయి.

 అలాగే, దర్శకుడిగా ఆయన రెండో చిత్రం ‘బంగారు బాబు’, ఆ సినిమాలో మళ్ళీ అదే అక్కినేని, వాణిశ్రీపై వచ్చే ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...’ పాట ఆ తరం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే! ‘మంచి మనుషులు’, ‘బంగారు బొమ్మలు’, ‘ముద్దుల కొడుకు’, ‘ఎస్.పి. భయంకర్’, ‘కెప్టెన్ నాగార్జున’ తదితర చిత్రాలుఆయన దర్శకత్వంలోవే! తెలుగుతో పాటు తమిళంలో ‘ఎంగళ్ తంగరాజా’, ‘ఉత్తమన్’, ‘పట్టాకత్తి భైరవన్’, హిందీలో ‘రస్తా ప్యార్‌కే’, ‘బేకరార్’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అలాగే, పల్లవి వారి ‘అందరూ దొంగలే’, అన్నపూర్ణా స్టూడియో వారి భాగస్వామ్యంతో తీసిన ఎన్టీఆర్ - ఏయన్నార్‌లతో ‘రామకృష్ణులు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తన చిత్రాల్లోని హిట్ పాటలను గీతమాలికగా రూపొందించి, ‘చిటపట చినుకులు’ పేరిట రెండు భాగాల సినిమాలుగా విడుదల చేసి, అక్కడా విజయం అందుకున్నారు. అలాగే, దర్శకుడు దాసరితో ‘లంచావతారం’, రవిరాజా పినిశెట్టితో ‘బంగారు బుల్లోడు’, ఫాజిల్‌తో ‘కిల్లర్’ తదితర చిత్రాలు అందించారు.

 
కార్మికుల కోసం సినీ నిర్మాణం
 అభిరుచి గల నిర్మాతగా, సంస్కారవంతుడైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ అందుకు తగ్గట్లే తన కోసం శ్రమించే వారి బాగు చూసేవారు. జగపతి సంస్థలో పనిచేసే కార్మికుల బాగు కోసం ఆ రోజుల్లోనే ఆయన ‘పిచ్చిమారాజు’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికులకే పూర్తిగా కేటాయించారు. అప్పట్లో మద్రాసులోని తెలుగు చిత్రసీమతో పాటు తమిళ, తదితర పరిశ్రమల్లోనూ అది పెద్ద సంచలనమైంది. ఆయన పెద్దకుమారుడి పేరు - రామ్‌ప్రసాద్. రెండో కుమారుడు - యోగేంద్రకుమార్, మూడో కుమారుడు జగపతిబాబుకు తన తండ్రి పేరునే పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్. తరువాతి కాలంలో కుమారుడు జగపతిబాబును ‘సింహస్వప్నం’ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. హీరో కావాలన్న తన చిన్నప్పటి కోరికను అలా కుమారుడి రూపంలో తీర్చుకున్నారు.

 ఆధ్యాత్మిక చింతనలో...
 చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారి, నష్టాలు వచ్చాక ఆయన క్రమంగా చిత్ర నిర్మాణానికి దూరం జరిగారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాక, ఇక్కడి ‘ఫిలిమ్‌నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో కీలక బాధ్యతలు పోషించారు. అలాగే, జీవితంలోని చివరి అంకాన్ని పూర్తిగా దైవభక్తిలో గడిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్‌లో ఫిల్మ్‌చాంబర్ పక్కనే కొండపై నెలకొన్న దేవాలయాల సముదాయం ‘దైవసన్నిధానం’ నిర్మాణంలో ఆయన ముఖ్యపాత్ర వహించారు. చిత్రసీమకు చేసిన సేవకు గుర్తింపుగా 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. కాగా, సీనియర్ సినీ జర్నలిస్టు భగీరథ ఈ సినీ దిగ్గజం జీవిత చరిత్రకు ‘దసరా బుల్లోడు’ పేరిట పుస్తకరూపం ఇవ్వడం విశేషం. చిన్నప్పటి నుంచి ఉబ్బసంతో బాధపడుతూ, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ వచ్చిన రాజేంద్రప్రసాద్ సోమవారం రాత్రి కన్నుమూయడంతో పాత తరం ప్రముఖ దర్శక, నిర్మాతల్లో మరొకరు కనుమరుగయ్యారు. ఇవాళ ఆయన లేరు... కానీ, ఆయన సినిమాలు, వాటిలోని పాటలు మాత్రం తెరస్మరణీయంగా మిగిలిపోయాయి.

- రెంటాల జయదేవ

..................................................

0 వ్యాఖ్యలు: