జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 22, 2011

పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు




ఆరోపణలు చేయడం సులభం. తర్కం, ఆధారాలు లేకుండా ఆరోపించడమైతే మరీ సులభం. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద

విడుదల తేదీ మీద నేను సమర్పించిన పరిశోధన పత్రంలోని అంశాలపై
కొందరు ఆ పనే చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరికొందరు ఓ మెట్టు పైకెక్కి పరిశోధనకు దురుద్దేశాలు పులిమే ప్రయత్నం చేశారు. వాస్తవాలను నివేదిస్తూ, వాటి ఆధారంగానే వార్తలు, వ్యాసాలు అందించాల్సిన పత్రికా రచయితలలోని సీనియర్లు కొందరూ, దీర్ఘకాలంగా పత్రికా రంగంలో సమున్నత సేవలందిస్తున్న ప్రముఖ పత్రికలలో కొన్నీ - కూడా తొందరపాటుతో ఆ అవాంఛనీయ వైఖరినే అవలంబించడం ఆశ్చర్యకరమే కాదు, బాధాకరం కూడా. తొలి తెలుగు టాకీ పుట్టిన ‘‘తేదీపై వివాదమెందుకు?’’ అంటూ ఆంధ్రప్రభ దినపత్రిక తమ వారం వారీ సినీ ప్రత్యేకానుబంధం ’’చిత్రప్రభ’’లో ఏకంగా సంపాదకుడి సంతకంతో ఎడిటోరియల్ రాసింది (ఆ ఎడిటోరియల్ తాలూకు డిజిటల్ బొమ్మ, అందులోని సమాచారం ఈ పోస్టులోనే పక్కనే చూడగలరు).

తెలుగు సినిమా ఎనభై ఏళ్ళ ఉత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఈ హడావిడి ఏమిటంటూ, పరిశోధన ఉద్దేశాన్నే ప్రశ్నించింది. దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించింది. తర్కానికి అందని వ్యాఖ్యలెన్నో చేసింది. చేసిన పరిశోధనను సహృదయంతో అనుశీలించకపోగా, మళ్ళీ తానే గొంతు సవరించుకొని - ‘‘కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది’’ - అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఆ వెంటనే తానే తీర్పరి పాత్ర పోషిస్తూ - ‘‘అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి’’ - అని ఆ పత్రిక ముక్తాయించింది.

పరిశోధన జరపాలని ఓ నాలికతో అంటూ, ఇప్పటిదాకా సరైన సాక్ష్యాధారమేదీ లేని సెప్టెంబర్ 15వ తేదీనే తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని అలా తెగేసి మరో నాలికతో తీర్మానించేయడం ఏమిటో అర్థం కాదు. పరిశోధన చేస్తేనేమో దురుద్దేశాలు అంటగడుతున్నారు. కానీ పరిశోధన జరగాల్సి ఉందనీ మళ్ళీ తామే అంటున్నారు. ఇదెక్కడి చిత్రం.


పరిశోధనపై ఆరోపణలు చేసి, అనుమానాలు వ్యక్తం చేసిన ఆంధ్రప్రభ ఎడిటోరియల్ పూర్తిపాఠం ఇదీ --


..........................................
తేదీపై వివాద మెందుకు?


భక్త ప్రహ్లాద విడుదల తేదీపై వివాదం చెలరేగింది. ఇప్పటి వరకు 1931 సెప్టెంబర్‌ 15న ఈ చిత్రం విడుదలైందని చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. ఇటీవలే భక్త ప్రహ్లాద విడుదలైన తేదీని తెలుగు సినిమా పుట్టినరోజుగా పరిశ్రమ ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే కొత్త తేదీ ప్రచారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం వజ్రోత్సవాలను అట్టహాసంగా జరుపుకుని, ఇప్పుడు
ఎనబై యేళ్ళ ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలోనే విడుదల తేదీ, సంవత్సరం సరికాదంటూ వివాదం చేయడం వెనుక వారికి ఉన్న ఉద్దేశాల గురించి రంధ్రాన్వేషణ చేయడం అనవసరం.

సినీ ప్రముఖులు దాసరి నారాయణరావుగారు పేర్కొన్నట్టు తేదీపై సంపూర్ణ సమాచారం లేదు. ఆ రోజుల్లో తొలుత విజయవాడ మారుతీ టాకీస్‌లో తర్వాత రాజమండ్రి శ్యామల టాకీసులో విడుదలైన తర్వాత మద్రాసులో 1932లో విడుదలై ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై శాస్త్రీయంగా పరిశోధన జరగాలని సూచించారు. దాసరిలాంటి ప్రముఖులు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరనే విషయం పరిశ్రమకు తెలియంది కాదు. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భక్త ప్రహ్లాద తొలి టాకీ తెలుగు సినిమానా, లేక హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తెలుగు తమిళ సంభాషణలతో, తెలుగు పాటలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళ చిత్రంగా రూపొందిన కాళిదాసు తొలి తమిళ చిత్రమా అనేది కూడా తేలాలి.

దీనిపై సినీ పరిశోధకులు ఇంటూరి వెంకటేశ్వరరావు, వి.ఏ.కె.రంగారావు వంటి వారు ఎప్పుడో శోధించారు. వారి సూచన మేరకే 1931 సెప్టెంబర్‌ 15 అని పరిశ్రమ నిర్ణయానికి వచ్చింది. 1932న విడుదలైందంటూ కొన్ని ఆధారాలు చూపుతున్న పరిశోధకులు ఇంతకాలం మౌనంగా ఎందుకున్నారనేది ఆలోచించాల్సిన విషయం. ఎనిమిది దశాబ్ధాల ఉత్సావాన్ని సంబరంగా చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే ఇవిగో సాక్ష్యాలంటూ హడావుడి చేయడం వెనుక ఉన్న వారి ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. ఎనిమిది దశాబ్ధాలుగా నిజమని విశ్వసిస్తున్న తెలుగువారి నమ్మకాన్ని కాదని చెబుతున్నారు.

భక్త ప్రహ్లాద విడుదలైన తర్వాత సెన్సార్‌ జరిగి ఉండవచ్చు, లేదా దాసరి చెప్పినట్టు విజయవాడ, రాజమండ్రి తర్వాత మద్రాసులో రిలీజై
వుండవచ్చు కూడా. మన దేశంలో తక్కువ సంఖ్యలో అప్పట్లో టాకీచిత్రాలు (అంతకుముందు మూకీ చిత్రాలు వచ్చాయి) వస్తున్న సందర్భంలో సెన్సార్‌ శాఖ వేలసంఖ్య (11032)ను పొందు పరుస్తూ ఎందుకు సర్టిఫికెట్‌ జారీ చేసిందో మరి. ఏది ఏమైనప్పటికీ, విడుదల తేదీని పెద్ద వివాదం చేయడం సరికాదు. కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల, అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్‌ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి.

- పి. విజయబాబు,
ఎడిటర్‌
................................

Friday, October 21, 2011

తెలుగు సినిమా పుట్టినరోజు వివాదంపై టి.వి 9 స్టోరీ - వీడియో లింకు

తొలి తెలుగు సినిమా పుట్టిందెప్పుడు అన్న నా పరిశోధన పత్రంలోని అంశాలు పెద్ద చర్చకే దారి తీశాయి. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద 1931 సెప్టెంబర్ 15న విడుదల కానే లేదనీ, కాబట్టి తెలుగు సినిమా పుట్టినరోజంటూ ఆ తేదీని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదనీ సాక్ష్యాధారాలతో నేను చేసిన వాదనను కొన్ని టి.వి. చానళ్ళు ప్రస్తావించాయి. సరికొత్త సాక్ష్యాధారాలను పట్టించుకోకుండా తెలుగు సినిమా 80 ఏళ్ళ పండుగంటూ పరిశ్రమ ఏటేటా ఆ రోజు ఉత్సవం చేస్తామన్నసందర్భంలోనే ప్రముఖ ఉపగ్రహ టీవీ చానల్ టి.వి. 9 దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం తాలూకు వీడియో లింకును మిత్రులు ఈ మధ్యే నాకు మెయిల్ చేశారు.

1932 జనవరి 22న సెన్సారైన భక్త ప్రహ్లాద ఆ తరువాత ఏప్రిల్ 2న మద్రాసులో విడుదలైనట్లు నా పరిశోధనలో సాక్ష్యం దొరికింది. ఆ మధ్యలో ఎక్కడెక్కడ ఏ తేదీల్లో వచ్చిందో ససాక్ష్యంగా వివరాలు లభించలేదు. ఏమైనా, సినిమా సెన్సారైన 1932 జనవరి 22 నుంచి మద్రాసులో సినిమా విడుదల సమాచారం తొలిసారిగా లభిస్తున్న ఏప్రిల్ 2వ తేదీ మధ్యలోనే భక్త ప్రహ్లాద తొలి రిలీజు తేదీ ఉంటుందని నా వాదన.

పరిశోధించి, ప్రాథమిక, ప్రాసంగిక సాక్ష్యాధారాల సహాయంతో నేను చేసిన ఈ వాదనను టి.వి 9 జనం ముందుకు సమర్థంగానే తీసుకువెళ్ళింది. 30 నిమిషాల రికార్డింగును 300 సెకన్లకు కుదించడంలో ఒకటీ, అరా తప్పులు దొర్లినా, చరిత్రను సవ్యంగా అందించే కృషిలో భాగమైనందుకు టి.వి 9 బృందానికి కృతజ్ఞతలు. అక్కడ ప్రసారమైన వార్తా కథనం ఇక్కడ చూడండి.

Sunday, September 11, 2011

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రిలీజైంది 1931లో కాదు, 1932లో!



(తొలి తెలుగు టాకీ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న తప్పుడు చరిత్ర దీర్ఘకాలంగా ప్రచారంలో ఉంది. తీరా ఈ 2011 సెప్టెంబర్ 15న ఆ సినిమా వచ్చి, 80 ఏళ్ళు పూర్తయ్యాయనే పండుగ కూడా సినీ పరిశ్రమ పెద్దలు చేసేస్తున్నారు. కానీ, విడుదల తేదీపై వాస్తవ చరిత్ర అందుకు భిన్నంగా ఉన్నట్లు ఎంతో శ్రమించి చేసిన పరిశోధనలో తేలింది. మరి, అసలు తెలుగు సినిమాయే పుట్టని తేదీన పుట్టిన రోజు పండుగ చేస్తున్న మనవాళ్ళు ఇకనైనా కళ్ళు తెరుస్తారా?)

మాటలు లేని మూగ సినిమాలు నిర్మాణమవుతున్నంత కాలం ఏ భాష వారు ఆ చిత్రాన్ని తీసినా, దాన్ని భాషల చట్రాల్లో బిగించలేం. అది అందరి సినిమాయే తప్ప, ఫలానా భాషా చిత్రంగా చెప్పడానికి వీలు కాదు. కానీ, తెర మీద కదిలే బొమ్మలు మాటలు నేర్చుకోవడం మొదలైన తరువాత నుంచి పరిస్థితి మారింది. ఏ భాషలో మాటలు వినిపిస్తుంటే, ఆ భాషా చిత్రంగా పేర్కొనడం మొదలైంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సంగతికొస్తే, మూకీలను వెనక్కి నెడుతూ టాకీలు వచ్చింది - 1931లో. హిందీ - ఉర్దూల మిశ్రమ భాష (హిందుస్థానీ)లో తయారై, 1931 మార్చి 14న బొంబాయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో విడుదలైన 'ఆలమ్ ఆరా'యే తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేషిర్ ఎం.ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. 'ఆలమ్ ఆరా' తరువాత మరో ఏడు నెలలకు కానీ, మన దక్షిణాది భాషలో మాట్లాడే చిత్రాలు రాలేదు.

తొలి సినిమాపై తప్పుడు చరిత్ర

తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ఆ చిత్రంలో కథానాయక పాత్రధారి తెలుగులో మాట్లాడితే, మరో కథానాయిక సౌదామిని పాత్రధారిణి టి.పి. రాజలక్ష్మి తమిళంలో సమాధానమిచ్చారు. (కథానాయిక పాత్ర పేరు విద్యాధరి అని కొందరి కథనం) ఈ చిత్రంలో కథానాయిక రెండు త్యాగరాయ కీర్తనలను సైతం ఆలపించారు. అంటే తెలుగు, తమిళ భాషలు రెండూ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే ఎక్కువగా తమిళంలోనే మాటలు, పాటలు వినిపించాయి కాబట్టి, ప్రధానంగా దాన్ని తమిళ భాషా చిత్రంగానే పరిగణించారు. ఇలా 'కాళిదాస్'ను తొలి తమిళ టాకీగా తీర్మానించారు.

అయితే, ఆ తర్వాత పూర్తి తెలుగు సంభాషణలతో వచ్చిన తొలి తెలుగు టాకీ మాత్రం 'భక్త ప్రహ్లాద'. ఇంతవరకూ ఆ చిత్రం సరైన విడుదల తేదీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. తొలి తమిళ టాకీ 1931 అక్టోబర్ చివరలో వచ్చింది కాబట్టి, దానికి కనీసం నెలన్నర ముందు 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైనట్లు ఎవరో తెలివిగా ఓ కథనాన్ని పుట్టించారు. అందులోని నిజానిజాలు నిగ్గు తేల్చకుండా, ఆ కథనాన్నే ప్రతి ఒక్కరూ ప్రచారంలో పెట్టారు. తొలి తెలుగు టాకీ విడుదలైంది సెప్టెంబర్ 15నే అంటూ సాక్ష్యాధారాలు లేకుండానే మన చరిత్రకారులు గొఱ్ఱెదాటు ధోరణిని ప్రదర్శించారు. ఇటీవల పెరిగిన ఈ ధోరణితో, ఏటేటా సెప్టెంబర్ 15ను 'తెలుగు సినిమా జన్మదినం'గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ప్రకారం ఈ 2011 సెప్టెంబర్ 15తో తొలి తెలుగు సినిమా విడుదలై 80 ఏళ్లు పూర్తవుతున్న పండుగ కూడా చేసేస్తున్నారు.

కానీ, చరిత్ర మీద సిసలైన అభిమానంతో లోతుగా పరిశీలిస్తే, వాస్తవాలు వీటికి విరుద్ధంగా ఉన్నాయి. 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న వాదన కానీ, కనీసం తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ వచ్చేసిందన్న వాదన కానీ శుద్ధ తప్పు అని ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలింది.

సెన్సార్ కన్నా ముందే రిలీజెట్లా?

తొలి తమిళ, తెలుగు టాకీలు రెండింటికీ దర్శకుడు ఒకరే - హెచ్.ఎం.రెడ్డి. తమిళ టాకీ 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న మద్రాసులోని 'కినిమా సెంట్రల్' (ఇప్పుడు ఈ హాలు పేరు 'మురుగన్' టాకీస్)లో విడుదలైందనడానికి పత్రికా ప్రకటనలతో సహా తమిళ చరిత్రకారులు సాక్ష్యాధారాలు సేకరించారు. "10 వేల అడుగుల నిడివి'' గల ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది. ప్రదర్శన కాలం 112 నిమిషాలైన ఈ చిత్రం సర్టిఫికెట్ నెంబర్ "ఎం (మద్రాసు?) - 1598.''

కానీ, అంతకన్నా ముందే రిలీజైనట్లు పుట్టించిన పుక్కిటి చరిత్ర చెబుతున్న తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' మాత్రం సెన్సారైంది - 1932 జనవరి చివరిలో! ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 1932 జనవరి 22న! మొత్తం 9,762 అడుగుల నిడివి గల 10 రీళ్ల ఆ చిత్రం బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకొంది. 'బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సెన్సార్స్' అదే తేదీతో సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ "నెంబర్ - 11032, తేదీ 22 జనవరి 1932''. దీన్నిబట్టి, ఒక విషయం స్పష్టం. 1932 జనవరి చివరిలో సెన్సారింగ్ జరుపుకొన్న మన 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ మధ్యకే రిలీజై పోయిందనడం తలాతోకా లేని వాదన.

హెచ్.ఎం. రెడ్డి ఏం చెప్పారు?

దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి సైతం తాను ముందుగా తెలుగు టాకీ నిర్మించి, ఆ పైన తమిళ టాకీ చేశానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు, తమిళ టాకీ తీశాకే, తెలుగు టాకీ తీసినట్లు తన మాటల్లో, రాతల్లో స్పష్టంగా పేర్కొన్నారు. "... మొదటి హిందీ టాకీ అయిన 'ఆలమ్ ఆరా'ను తయారు చేసిన నలుగురు ప్రముఖులలో ఒకణ్ణి నేను" అని ఆయన చెప్పారు.

(బెంగళూరులోని సూర్యా ఫిలిమ్స్‌వారు తీసిన మూకీ చిత్రాలతో సినీ పరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హెచ్.ఎం.రెడ్డి ఆ తరువాత బొంబాయికి మకాం మార్చి, దర్శక - నిర్మాత అర్దేషిర్ ఎం. ఇరానీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఇరానీ నిర్మించిన 'విజయ్ కుమార్'లాంటి మూకీలకు దర్శకత్వం వహించారు.

తొలి టాకీ 'ఆలమ్ ఆరా' విజయంతో దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని అర్దేషిర్ ఇరానీ అనుకున్నప్పుడు ఆయన సహజంగానే తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణ భారతీయుడు హెచ్,ఎం.రెడ్డి వైపు మొగ్గారు. ఆ భాషలు తెలిసిన రెడ్డికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆ రకంగా, అర్దేషిర్ ఇరానీ నిర్మించిన తొలి తమిళ టాకీకి హెచ్.ఎం.రెడ్డి స్వయంగా దర్శకత్వం వహించారు).

"...మొదటి అరవ ఫిలిమ్ డైరెక్ట్ చేసినవాణ్ణీ నేనే! అది - టి.పి.రాజలక్ష్మి యాక్టు చేసిన 'కాళిదాస్'. అది నాదేగా! ... ఆ పైన అఖిల భారతదేశంలో ప్రథమ తెలుగు టాకీ అయిన 'ప్రహ్లాద'ను నేనే డైరెక్టు చేశాను...'' అని హెచ్.ఎం. రెడ్డి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్నిబట్టి చూసినా, తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చిందని అర్థమవుతోంది.

ఎల్.వి.ప్రసాద్ ఏం చెప్పారు?

మూకీల రోజుల నుంచి బొంబాయిలో ఉన్న నటుడు, తరువాత ప్రముఖ దర్శక - నిర్మాతగా మారిన ఎల్.వి. ప్రసాద్ సైతం తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా'లో ఉన్న ఎల్.వి. ప్రసాద్, తొలి తమిళ టాకీ 'కాళిదాస్'లోనూ ఓ చిన్న వేషం వేశారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తయారైన తొలి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద'లో సైతం ఆయన ప్రహ్లాదుడి సహాధ్యాయీ, గురువు చండామార్కుల వద్ద శిష్యుల్లో ఒకడూ అయిన మొద్దబ్బాయి పాత్ర ధరించారు. ఆ రకంగా హిందీ, తమిళం, తెలుగు - ఈ మూడు భారతీయ భాషల్లోనూ తొలి టాకీ చిత్రాలతో సంబంధం ఉన్న వ్యక్తులు - హెచ్.ఎం.రెడ్డి, ఎల్.వి. ప్రసాద్.

ఓ సందర్భంలో ఎల్.వి. ప్రసాద్ తన అనుభవాలను వివరిస్తూ 'బొంబాయిలో (హెచ్.ఎం) రెడ్డి గారు నాకు పరిచయమయ్యారు. ఆయనేదో అక్కడ పృథ్వీరాజ్ కపూర్ హీరోగా ఒక సైలెంట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడే 'టాకీ' ప్రారంభమైంది. 'ఆలమ్ ఆరా' వచ్చింది. అర్దేషిర్ గారికి తమిళంలో ఏదైనా సినిమా తీద్దామని ఉద్దేశం కలిగి, 'కాళిదాస్' ప్లాన్ చేశారు. అప్పుడు టి.పి. రాజలక్ష్మినీ, వారినీ పిలిపించారు. నేను కూడా ఉన్నాను కనుక అందులో నేనూ ఒక వేషం వేశాను. ఆ విధంగా హెచ్.ఎం.రెడ్డి గారితో పరిచయమైంది. ఆయన తెలుగువాడైనా, అక్కడ బాగా కమాండ్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడల్. ఆ ('కాళిదాస్') సినిమా అవగానే, కృష్ణా ఫిలిమ్ కంపెనీ వారికి 'భక్త ప్రహ్లాద' తీయాలనే ఉద్దేశం కలిగింది. (హెచ్.ఎం) రెడ్డిగారే డైరెక్ట్ చెయ్యడం కనుక ఆయనే నన్ను పిలిచారు' అని 'భక్త ప్రహ్లాద' విషయాలు తెలిపారు. ఆయన చెప్పిన మాటలను బట్టి చూసినా, తెలుగులో టాకీలు వచ్చింది తమిళం తరువాతే అన్నది స్పష్టం!

నోటి మాట కాదు, రాతలోనూ అదే!

వట్టి నోటి మాటగా చెప్పడమే కాదు, హెచ్.ఎం. రెడ్డి స్వయంగా ఈ వివరాలు రాశారు కూడా. భారతీయ టాకీ రజతోత్సవాల సమయంలో హెచ్.ఎం. రెడ్డి 'గడిచిన 25 ఏళ్లలో దక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ' శీర్షికతో ఓ వ్యాసం రాశారు. అందులోనూ ఆయన తమిళ టాకీ విజయమే తనను తెలుగు టాకీ నిర్మాణానికి ప్రోత్సహించినట్లు చాలా స్పష్టంగా తెలిపారు.

"... ఎన్నో పురిటినొప్పుల మధ్య తొలి తమిళ చిత్రం 'కాళిదాస్' (9000 అడుగులు)ను బొంబాయిలోని ఇంపీరియల్ స్టూడియోస్‌లో నిర్మించాం. అప్పట్లో తారలంటే రంగస్థల తారలే! సుప్రసిద్ధ రంగస్థల నటీనటులకు ఎంతో గిరాకీ ఉండేది. నిజం చెప్పాలంటే, ఆ తొలి సంవత్సరాల్లో నిర్మించిన చిత్రాలు కేవలం సుప్రసిద్ధ నాటకాల పునర్నిర్మాణాలే! కాకపోతే, సరికొత్త మాధ్యమమైన వెండితెరపై ఆ నాటకాలు చూపేవాళ్లం!

తమిళ చిత్రం సాధించిన విజయం తెలుగులో ఓ చిత్ర నిర్మాణానికి ప్రోత్సాహమిచ్చింది. అలా నేను దర్శకత్వం వహించిన (తెలుగు చిత్రం) 'భక్త ప్రహ్లాద' 1932లో విడుదలైంది. ఈ చిత్రం విజయం సాధించడంతో, తెలుగులో, తమిళంలో వరుసగా ఎన్నో పౌరాణిక చిత్రాలు వచ్చాయి. స్వర్గీయ రాజా శాండో, నారాయణ్ లాంటి అనుభవజ్ఞులైన సీనియర్లు, సి. పుల్లయ్య, హెచ్.వి.బాబు, స్వర్గీయ చిత్రపు నరసింహారావు లాంటి వారు ఆ పౌరాణికాలకు దర్శకత్వం వహించారు...'' అని సాక్షాత్తూ హెచ్.ఎం.రెడ్డే రాశారు. 'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1931లో కానే కాదనడానికి ఆ చిత్ర దర్శకుడు రాసిన ఈ మాటలే ప్రబలమైన సాక్ష్యం!

మరి 'భక్త ప్రహ్లాద' రిలీజైంది ఎప్పుడు?

ఇంతకీ, 'భక్త ప్రహ్లాద' విడుదల తేదీ ఏమిటన్నట్లు? ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలిందేమిటంటే, "తొలి 100 % తెలుగు టాకీ''గా సగర్వంగా ప్రకటించుకున్న 'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైంది తెలుగు సంవత్సరాది కానుకగా - 1932 ఏప్రిల్ 2న! మద్రాసులోని నేషనల్ పిక్చర్ ప్యాలెస్‌లో 'భక్త ప్రహ్లాద' విడుదలైంది. "ప్రేక్షకులచే క్రిక్కిరిసి పోవుచున్నది. గనుక ముందుగ స్థలము కొరకై జాగ్రత్త పడుడు. ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూచు యవకాశము బోగొట్టుకొనకుడు'' అంటూ ప్రకటనలు ఇచ్చారు. అప్పట్లో రోజుకు రెండు ఆటలే (సాయంత్రం ఫస్ట్ షో, రాత్రి వేళ సెకండ్ షో) ప్రదర్శించేవారు. ఏవైనా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మధ్యాహ్నం వేళ ప్రత్యేకంగా మ్యాట్నీ షో వేసేవారు. 'భక్త ప్రహ్లాద'కు కూడా ఆ తెలుగు సంవత్సరాది పండుగ నాడు సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు 'ప్రత్యేక మేటనీ ప్రదర్శన' వేశారు.

'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1932లోనే అని చెప్పడానికి మరో ప్రాసంగిక సాక్ష్యాధారం కూడా ఉంది. అది ఏమిటంటే - ఆ సినిమాకు సమీక్షలు సైతం 1932లోనే వచ్చాయి. 'ఆనంద బోధిని' లాంటి పత్రికలు 1932 మార్చి సంచికలో ఈ చిత్రాన్ని సమీక్షించాయి. ఒకవేళ పుక్కిటి చరిత్ర చెబుతున్నట్లు, 1931 సెప్టెంబర్‌లో 'భక్త ప్రహ్లాద' సినిమా రిలీజై ఉంటే, దొంగలు పడ్డ ఆరు నెలలకు సమీక్షించరు కదా! ఆ రకంగా చూసినా, 'భక్త ప్రహ్లాద' విడుదల 1931లో కాదు, 1932లో అని చెప్పవచ్చు.

('భక్త ప్రహ్లాద' రిలీజైంది ఏప్రిల్‌లో అయితే, మార్చి సంచికలో సమీక్ష రావడానికి కారణం ఏమిటని ఎవరైనా అనుమానం వ్యక్తం చేయవచ్చు. దానికి ఈ పరిశోధకుడి వివరణ ఏమిటంటే - అప్పటి పత్రికలు ఇప్పటిలా ముందస్తు తేదీలతో కాక, ఏ నెలకు ఆ నెలే రావడం కద్దు. పైగా , కొన్ని పత్రికలు నెల మధ్యలోనో, ఒక్కోసారి మరీ ఆలస్యంగా నెలాఖరులోనో విడుదలయ్యేవి. ఆర్థికాది అనేక కారణాలతో మరీ ఆలస్యమైనప్పుడు అరుదుగా కొన్నిసార్లు ముందటి నెల తేదీతోనే తరువాతి నెలలో వచ్చేవి. ఓపిగ్గా వెతికితే అలాంటి ఉదాహరణలు చాలా కనపడతాయి. కాబట్టి, పత్రిక మీద "మార్చి నెల'' అని రాసినా సదరు పత్రిక మార్చి నెల చివరలోనో, ఏప్రిల్‌లోనో వచ్చి ఉండవచ్చు.

ఇక, సినిమా రిలీజు ముందే సమీక్ష ఏమిటని కూడా నోళ్ళు నొక్కుకోనక్కర లేదు. ఎందుకంటే, సినీ పరిశ్రమ పెద్దలకూ, పత్రికల వారికీ సినిమాను ముందుగానే ప్రదర్శించి చూపే అలవాటు అప్పటికే చిత్రసీమలో ఉంది. సినిమా విడుదలకు ముందు రోజునో, రిలీజ్ రోజునో పెద్దలకూ, సన్నిహితులకూ ప్రివ్యూ వేసి చూపడం ఇప్పటి వాడుక. కానీ, అప్పట్లో అలా కాదు! సినిమా విడుదల కన్నా వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల ముందరే ప్రివ్యూ వేసేవారు. తొలి తమిళ టాకీ 'కాళిదాస్'కూ ఆ పద్దతి పాటించారు. అదే పద్ధతిని ఆ తరువాత వచ్చిన 'భక్త ప్రహ్లాద'కూ అనుసరించారని ఊహించవచ్చు. ఫలితంగా, ఏప్రిల్ 2న రిలీజైన 'భక్త ప్రహ్లాద'కు మార్చి నెల పత్రికలోనే సమీక్ష వచ్చి ఉండవచ్చు).

ఏమైనా, ఒకటి వాస్తవం. ఏ రకంగా చూసినా తొలి తమిళ టాకీ తరువాతే తొలి తెలుగు టాకీ విడుదలైందనేది చేదు నిజం! తెలుగు సినిమా పుట్టిన రోజు 1931 సెప్టెంబర్ 15 తేదీ కాదనేది ఖాయం!! ఇప్పటి వరకు లభిస్తున్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తే 1932 జనవరి చివరిలో సెన్సారైన తరువాతా, చిత్ర తొలి విడుదల సమాచారం దొరుకుతున్న ఏప్రిల్ లోపలా 'భక్త ప్రహ్లాద' విడుదలైనట్లు స్పష్టమవుతోంది. కాబట్టి, 'భక్త ప్రహ్లాద' 1931లో విడుదలైందన్న మాటే సత్యదూరం. మరి, ఇప్పటికైనా మన సినీ చరిత్రకారులు తెలుగు సినిమా పుట్టిన తేదీ గురించి ప్రచారంలో ఉన్న పాత తప్పులను సవరించుకుంటారా? పుట్టని సెప్టెంబర్ 15ను వదిలేసి, ఇకనైనా తెలుగు సినిమాకు సరైన రోజునే జన్మదినం జరుపుతారా?!

కొసమెరుపు :

'ఇన్నాళ్లూ తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ ముందు వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ సంతోషం లేకుండా చేశారే'మని మిత్రులు బాధపడనక్కర లేదు. ఎందుకంటే, తెలుగు మాటలు, పాటలు ఉన్నాయి కాబట్టి, హెచ్.ఎం. రెడ్డి 'కాళిదాస్' సినిమాను కేవలం తమిళ టాకీగా కాక, తొలి తెలుగు - తమిళ టాకీగా చెప్పుకోవచ్చు! అందులో హీరోయిన్ మన అచ్చ తెలుగు కీర్తనలు రెండు కూడా పాడారు. "తమిళ లిపిలో రాసుకొని మరీ, తెలుగు సంభాషణలు పలికా''రు. హీరో కూడా తెలుగులో డైలాగులు చెప్పారు. నిజానికి, 'కాళిదాస్' చిత్రానికి "తమిళ - తెలుగు భాషల్లో మాట్లాడే చిత్రం'' అనే ప్రకటనలిచ్చారు. ఆ రకంగా, తెర మీద బొమ్మలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి మాట్లాడాయి కాబట్టి, తమిళంతో సమానంగా తెలుగూ నిలిచిందని చెప్పుకోవచ్చు! సంతోషపడవచ్చు!!

(మద్రాసు విశ్వవిద్యాలయంలో సమర్పించిన పరిశోధన వ్యాసం నుంచి...)

Monday, August 29, 2011

కౌబాయ్ లకు కౌబాయ్




ఆ సినిమా వచ్చి ఇప్పటికి సరిగ్గా నాలుగు దశాబ్దాలైంది. విడుదలైన రోజుల నుంచి ఇవాళ్టి వరకు దాని గురించి గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నారు. తెలుగు చలనచిత్ర లోకానికి కౌబాయ్ కథలను పరిచయం చేసి, సంచలనం రేపిన ఆ చిత్రం - 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ రోజుల్లో ''ఏ తెలుగు నిర్మాతా సాహసించని లొకేషన్లలో, విశేష వ్యయ ప్రయాసలతో నిర్మించిన అపూర్వ చిత్రం''గా ఓ విశిష్ట స్థాయిని అందుకున్న ఈ ''తొలి తెలుగు కౌబాయ్ చిత్రం'' విడుదలై, ఈ ఆగస్టు 27 నాటికి సరిగ్గా నలభై ఏళ్ళయింది. తెలుగు తెరపై హాలీవుడ్‌ పోకడలకు తెర తీసి, ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించి, వివిధ భాషల్లోకి అనువాదమైన ఈ సూపర్‌హిట్‌ చిత్రం జ్ఞాపకాల స్వారీకి స్వాగతం...

ఒకే రకమైన జానపదాలు, పౌరాణిక చిత్రాలతో జనానికి విసుగెత్తుతున్న కాలం అది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు తారలుగా స్థిరపడిపోయి చాలా కాలం అవడంతో, యువతరానికి చెందిన నవ తారలకు అవకాశాలు తెరుచుకున్న సమయం. కృష్ణ, శోభన్‌బాబు లాంటి నటులు ఆ అవకాశాలను అందుకోవాలని తపిస్తున్న తరుణం. ఆ పరిస్థితుల్లో ఇంగ్లీషు, హిందీ చిత్రాల స్ఫూర్తితో తెలుగు సినిమా సైతం క్రైమ్‌, యాక్షన్‌ తరహా చిత్రాల వైపు క్రమంగా మొగ్గింది. అలాంటి కొత్త కథల అన్వేషణలో తెలుగు మసాలాతో వండి, వడ్డించిన పాశ్చాత్య తరహా కౌబాయ్ వంటకం - 'మోసగాళ్ళకు మోసగాడు' (సంక్షిప్తంగా 'మో.మో').

కౌబాయ్ కథే ఎందుకు?

తెలుగు సినీ లోకానికి అప్పటికి కొత్తగా అనిపించే ఈ సాహస గాథను హీరో కృష్ణ అసలు ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక కూడా నాటకీయత, సాహసం ఉన్నాయి. 1960ల ద్వితీయార్ధంలో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ, 1970 నాటికి 40కి పైగా సినిమాలు చేశారు. కానీ, నటుడి నుంచి తార స్థాయికి తనకు పదోన్నతి కల్పించే చిత్రాలు చేయలేకపోతున్నాననే అసంతృప్తి ఆయనలో కలిగింది. ఆ అసంతృప్తి నుంచే సొంత చిత్ర నిర్మాణ సంస్థ, సొంత సినిమాల నిర్మాణమనే ఆలోచనలకు బీజం పడింది. అనుకున్నదే తడవుగా పెద్దమ్మాయి పేరు మీద 'శ్రీపద్మాలయా మూవీస్‌' సంస్థను నెలకొల్పారు. ఆ పతాకంపై తొలి సొంత చిత్రంగా తానే హీరోగా 'అగ్ని పరీక్ష' (1970) నిర్మించారు. కానీ, అది ఫ్లాపైంది. హీరోగా కృష్ణ ఆశించిన ఫలితమూ దక్కలేదు.

దాంతో, స్వీయ చిత్ర నిర్మాణ సంస్థలో పెద్ద హిట్‌ సాధించాలనీ, ఇటు నిర్మాతగా, అటు హీరోగా పేరు తెచ్చుకోవాలనీ సహజంగానే కృష్ణలో పట్టుదల పెరిగింది. అలాంటి విజయం సాధించాలంటే, ఓ కొత్త తరహా సినిమా తీయాలని భావించారు. సరైన కథ కోసం వెతుకులాట మొదలైంది. అదే సమయంలో 'మెకన్నాస్‌ గోల్డ్‌' లాంటి హాలీవుడ్‌ కౌబాయ్ చిత్రాలు మద్రాసులో సంచలనం రేపుతున్నాయి. కృష్ణ మనసులో తళుక్కున ఆలోచన మెరిసింది. అలాంటి కౌబాయ్ కథే తెలుగులో తీస్తే? అలా 'మెకన్నాస్‌ గోల్డ్‌', 'గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ', 'ఫ్యూ డాలర్స్‌ మోర్‌' తదితర హాలీవుడ్‌ చిత్రాలను కలిపి, తెలుగులో కొత్త వంటకం తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ పాశ్చాత్య కథలు, సంఘటనలను పక్కాగా తెలుగు వాతావరణానికి తగ్గట్లు వండి, వడ్డించే బాధ్యతను రచయిత ఆరుద్రకు అప్పగించారు. అదిగో అలా తయారైన కథే - 'మోసగాళ్ళకు మోసగాడు'.

ఊళ్ళూ, పేర్లూ మాత్రం తెలుగు వాతావరణానికి తగ్గట్లు మార్చి, పాత్రల రూపురేఖలు, వస్త్రాలంకరణ మాత్రం ఇంగ్లీషు కౌబాయ్ సినిమాల శైలిలోనే ఉండేలా చూశారు. ఇంగ్లీషు చిత్రాల స్ఫూర్తితోనే తెలుగులో స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నారు. కృష్ణతో 'టక్కరి దొంగ - చక్కని చుక్క' (1969) తదితర చిత్రాలు రూపొందించిన కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ రౌడీ రాణి' (1970) చిత్ర విజయంతో మంచి జోరు మీదున్నారు. దాంతో, యువకుడు దాస్‌ను ఈ యాక్షన్‌ చిత్రానికి డైరెక్టర్‌గా ఎంచుకున్నారు.

సాహస గాథకు సాహసోపేత చిత్రీకరణ

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రేమికులైన హీరో హీరోయిన్లు తమ తండ్రులను చంపినవారిపై ఎలా పగ సాధించుకున్నారనేది ఈ చిత్ర కథ. హంతకులెవరో కనిపెట్టి, వారిని వెంటాడి, వేటాడే ఈ క్రైమ్‌ ఫార్ములాకు అమూల్యమైన నిధి కోసం అన్వేషణ, దాన్ని శోధించి సాధించడం, ప్రజల పరం చేయడం ఆసక్తికరమైన పైపూత! ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణం, గుర్రాల మీద ఛేజింగులు, పేలే తుపాకులు, కాలే ఇళ్ళు, దుర్గమమైన ప్రాంతాల్లో ప్రయాణాలు, సరసాలు, సరదాలు, వినోదాలతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, చకచకా సాగిపోయే కథా కథనం 'మో.మో'ను అప్పట్లో ప్రత్యేకంగా నిలిపాయి. ఈ సాహస గాథను సెల్యులాయిడ్‌పై చిత్రీకరించిన తీరు కూడా నిజంగా సాహస గాథే.

అప్పట్లో హీరో కృష్ణ సినిమాలను మూడు, నాలుగు లక్షల బడ్జెట్‌లో తీసేవారు. కానీ ఈ చిత్రానికి అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశారు. ''భారతదేశంలోనే తొలి కౌబాయ్ మా 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ సినిమాను సిమ్లా, రాజస్థాన్‌లోని బికనీర్‌, మద్రాసు, పాండిచ్చేరిలలో తీశాం. ఎడారి దృశ్యాలను రాజస్థాన్‌లోని కోటా అనే చోట చాలా శ్రమపడి చిత్రీకరించాం'' అని కథానాయకుడు కృష్ణప్రసాద్‌ పాత్రను పోషించిన హీరో కృష్ణ చెప్పుకొచ్చారు. కథానాయిక రాధగా నటించిన విజయనిర్మల సైతం తన కెరీర్‌లో ఎంతో కష్టపడి నటించిన సినిమా 'మో.మో' అని చెప్పారు. ''ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎన్నడూ అలవాటు లేని ఫైట్లు, గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నేను, కృష్ణ గారు, నాగభూషణం గారు రోజూ మద్రాసులోని మెరీనా సముద్రతీరంలో గుర్రపు స్వారీ సాధన చేసేవాళ్ళం'' అని విజయనిర్మల చెప్పారు.

''ఆ చిత్ర నిర్మాణం కోసం కృష్ణ ఎంతో శ్రమపడ్డారు. యూనిట్‌ సభ్యులందరినీ రైళ్ళలో ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ గదులు బుక్‌ చేసి ఉంచి, అక్కడ నుంచి సిమ్లాకు తీసుకువెళ్ళారు'' అని కృష్ణ కెరీర్‌ తొలి రోజుల నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉన్న సీనియర్‌ సినీ జర్నలిస్టు మోహన్‌ కుమార్‌ చెప్పారు. హీరో కృష్ణ నిర్మించిన చిత్రాలకు కొద్దికాలం పాటు నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, జ్యోతిలక్ష్మి తదితర ప్రముఖ నటీనటులెందరో ఈ చిత్రంలో నటించారు. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో మనుషులు తిరగని, మంచినీళ్ళు కూడా దొరకని చోట ప్రాణాలకు తెగించి, ఈ చిత్ర షూటింగ్‌ చేశారు. బికనీర్‌ కోటలో, సట్లెజ్‌ నదీ తీరంలోని తట్టాపానీ ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు. ''మో.మో. ఓపెనింగ్‌ షాటే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. వి.ఎస్‌.ఆర్‌. స్వామి కెమేరా పనితనం తెలియాలంటే, 'మో.మో' చూడాల్సిందే!'' అని మోహన్‌ కుమార్‌ అన్నారు.

విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు చూపించే సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. సరైన మేకప్‌ సామగ్రి దొరకని సమయంలో కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్‌ సి. మాధవరావుకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. దగ్గరలోనే బఠాణీలు దొరికితే తెప్పించారు. ఆ బఠాణీల పైన పొరలా ఉండే, తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖంపై అంటించారు. అంతే! సన్నివేశానికి కావాల్సిన ముఖంపై పొక్కుల ఎఫెక్ట్‌ వచ్చింది. సాంకేతిక నిపుణులు చూపిన అలాంటి సమయస్ఫూర్తి, 'గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ' చిత్రంలోని 'అగ్లీ' పాత్ర స్ఫూర్తితో మలచిన నక్కజిత్తుల నాగన్న (పాత్రధారి విలక్షణ నటుడు నాగభూషణం) పాత్రచిత్రణ, ఫైట్‌ మాస్టర్లు మాధవన్‌, రాఘవులు చేసిన సాహసాల లాంటివి ఇవాళ్టికీ ఓ పెద్ద గాథ.

తప్పిన అంచనాలు! తప్పని గురి!!

అయితే, ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత - దర్శకుడు, చిత్ర పరిశ్రమలో హీరో కృష్ణకు మొదటి నుంచీ శ్రేయోభిలాషీ అయిన చక్రపాణి ఒకసారి షూటింగ్‌ జరుగుతుండగా వచ్చారు. సెట్‌లోని కౌబాయ్ వాతావరణం, నటీనటుల గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. మన తెలుగు వాతావరణానికి దూరంగా ఉండే ఈ గెటప్పులనూ, సెటప్పులనూ సామాన్య ప్రేక్షక జనం మెచ్చరని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. కానీ, అప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్‌ అయిపోయింది. దాంతో, హీరో కృష్ణ బృందం ఆ అభిప్రాయాలను పక్కనపెట్టి, ముందుకు సాగారు. మొదట ఈ చిత్రానికి 'అదృష్ట రేఖ' అని పేరు పెడదామనుకున్నా, చివరకు 'మోసగాళ్ళకు మోసగాడు' అనే మాస్‌ టైటిల్‌నే ఎంచుకున్నారు.

తీరా షూటింగ్‌ పూర్తయి, తొలి కాపీ వచ్చాక కూడా ప్రివ్యూలు చూసినవారెవరూ, ఈ సినిమాపై సరైన అంచనా చెప్పలేకపోయారు. కానీ, హీరో ఎన్టీఆర్‌ మాత్రం 'బాగుంది బ్రదర్‌! నిజంగా విభిన్నమైన మాస్‌ సినిమా తీశారు. అయితే, ఈ సినిమాలో ఆడవాళ్ళకు నచ్చే అంశాలు మిస్సయ్యారు. కాబట్టి, వాళ్ళు పెద్దగా చూడరు. ఫస్ట్‌ రిలీజ్‌ కన్నా, రీ-రిలీజుల్లో మరింత డబ్బు వస్తుంది. సంచలనం రేపుతుంది' అన్నారు. సరిగ్గా ఆయన అన్నట్లే అయింది. 1971 ఆగస్టు 27 శుక్రవారం నాడు బెంగుళూరుతో సహా తెలుగు నాట సుమారు 27 కేంద్రాల్లో, ''దాదాపు 35 ప్రింట్లతో'' 'మోసగాళ్ళకు మోసగాడు' విడుదలైంది. చివరకు, ''ఎన్టీఆర్‌ చెప్పినట్లే అయింది. మహిళాదరణ దక్కలేదు కానీ, సినిమా సంచలనాత్మక విజయం సాధించింది'' అని హీరో కృష్ణ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

సక్సెస్‌కు సహకరించిన అంశాలు

తెలుగులో అంతకు మునుపెన్నడూ రాని సాహస గాథా చిత్రమైన 'ఈ కొత్త తరహా సినిమా తెలుగు తెరకు శోభాయమానమైన అమూల్య కానుక' అని అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంకా బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలే రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో పూర్తిగా ''ఈస్ట్‌మన్‌ కలర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో కథ కన్నా, కథా గమనం కన్నా కమనీయమైన దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా'' ఆకర్షించాయి. ''ఒక చక్కని ఆంగ్ల చిత్రం చూస్తున్నట్లు'' అనిపించింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది దర్శకుడు, ఛాయాగ్రహణ దర్శకుల చిత్రం. ఈ చిత్రానికి వన్నె తెచ్చింది, ప్రాణం పోసింది - ముఖ్యంగా వి.ఎస్‌.ఆర్‌. స్వామి సినిమాటోగ్రఫీ. అప్పుడప్పుడే వాడుకలోకి వస్తున్న రంగుల ఫిలిమ్‌ను ప్రకృతి రామణీయతను చూపేందుకు సద్వినియోగం చేసుకున్నారు. కెమేరా కోణాలను వి.ఎస్‌.ఆర్‌. స్వామి ఎంత వేగంగా మారుస్తూ వెళ్ళారో, సన్నివేశ పరంపరను కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ అంతే వేగంగా నడిపిస్తూ వెళ్ళారు. ఫలితంగా చిత్రంలోని లోటుపాట్లు చటుక్కున ఎవరికీ తట్టలేదు.

ఈ చిత్రకథకు సందర్భశుద్ధి కల్పించడానికి ఆరుద్ర ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అవి లోపరహితం కాలేకపోయాయి. ఈ సినిమాలో చూపినట్లు చిత్ర కథ జరిగే కర్నూలు సబాలో ఎడారులుండవు. గుంటూరు సర్కార్‌లో మంచుకొండలూ ఉండవు. అయినా, ఆ ఊపులో ఈ అనౌచిత్యం గురించి ప్రేక్షకులు ఎవరూ ఆలోచించ లేదు. ''దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కెమేరా కదలికలు వాడాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. 'మోసగాళ్ళకు మోసగాడు'లో ప్రధానంగా 8 ఆకారంలో కనిపించే కెమేరా కదలిక ఆయన సృష్టించినదే!'' అని కృష్ణ, ఈ వ్యాసకర్తకు వెల్లడించారు.

ఇక, సంగీతం, ప్రధానంగా నేపథ్య సంగీతాన్ని చిత్ర వాతావరణానికి అనుకూలంగా, కొత్త తరహాలో ఉంటూ జనాన్ని బాగా హుషారు పరిచేలా ఆదినారాయణరావు సమకూర్చారు. 'కోరినది దరి చేరినది...' అనే యుగళగీతం ఆకట్టుకుంది. డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్ల కృషి ఫలించడానికి కోటగిరి గోపాలరావు కూర్పు కూడా బాగా తోడ్పడింది. విచిత్రం ఏమిటంటే, అప్పటి దాకా నాయిక, ప్రధాన పాత్రలకే పరిమితమైన శాస్త్రీయ నర్తకి, నటి రాజసులోచనతో ఈ చిత్రంలో ఓ శృంగార నృత్యం చేయించడం! 'సిగ్గేలా మగాడికీ.. పగ్గాలా వయారికీ...' అనే ఆ పాటలో రాజసులోచన నృత్యం ఆనాటి ప్రమాణాల్లోనే ఆంగ్ల చిత్రాల స్థాయిని అందుకుంది.

సరికొత్త చరిత్రకు శ్రీకారం

హీరోగా కృష్ణకు 60వ సినిమాగా విడుదలైన 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం విమర్శలు, లోపాలకు అతీతంగా విజయవంతమైంది. 'పద్మాలయా' పతాకానికి తొలి విజయం అందించడమే కాక, తొలి తెలుగు కౌబాయ్ సినిమాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కృష్ణ ఈ చిత్రంతో స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతకు పదింతల పేరు నిర్మాతగా సంపాదించుకున్నారు. ''కేవలం 7 లక్షల రూపాయల బడ్జెట్‌లో 28 రోజుల్లో ఆ చిత్రాన్ని నిర్మించాం. తొలి రిలీజ్‌లోనే దాదాపు రూ. 32 లక్షలు వసూలు చేసింది. స్టార్‌ ఇమేజ్‌ కోసం సొంత బ్యానర్‌ను పెట్టిన నా లక్ష్యం నెరవేరింది. వెరసి 'మోసగాళ్ళకు మోసగాడు' ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయింది'' అని కృష్ణ అన్నారు.

ఆ సినిమాతో కృష్ణ ఎంత బిజీ అయ్యారంటే, మరో 12 చిత్రాలు విడుదలయ్యాక కానీ, ఆయన మళ్ళీ సొంత సినిమాను ప్రారంభించలేనంత బిజీ!

ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమా సహజంగానే ఇతర భాషల్లోకి డబ్‌ అయింది. తమిళంలో 'మోసక్కారనుక్కు మోసక్కారన్‌'గా, హిందీలో 'గన్‌ఫైటర్‌ జానీ' పేరుతో, ఇంగ్లీషులో 'ది ట్రెజర్‌ హంట్‌'గా అనువాదమైంది. ''తమిళంలో వంద రోజులాడింది. హిందీలో వంద రోజులు ఆడలేదు కానీ, బాగా వసూళ్ళు సాధించింది'' అని కృష్ణ చెప్పారు. గమ్మత్తేమిటంటే, హాలీవుడ్‌ చిత్రాల స్ఫూర్తితో అటు నుంచి ఇటు వచ్చిన ఈ చిత్ర కథ, మళ్ళీ ఇటు నుంచి అటు ఇంగ్లీషులోకి అనువాదమై, అక్కడి ప్రేక్షకుల్ని అలరించడం! ''ఇంగ్లీషు డబ్బింగ్‌ రూపం గల్ఫ్‌ దేశాలు, సింగపూర్‌, కౌలాలంపూర్‌, టర్కీ, ఆఫ్రికన్‌ దేశాలన్నిటిలో కలిపి దాదాపు 80 దేశాల్లో విడుదలైంది'' అని కృష్ణ తెలిపారు.

సినిమా విడుదలైన తొలి రోజుల్లో ప్రచారంలో పేర్కొన్నట్లుగానే ఈ చిత్రం ''తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభించిన చిత్రం''గా నిలిచింది. ఆ పైన మరెన్నో కౌబాయ్ చిత్రాలు తెలుగులో రావడానికీ, కృష్ణ కూడా మరిన్ని కౌబాయ్ వేషాలు వేయడానికీ తోడ్పడింది. 'మోసగాళ్ళకు మోసగాడే' ప్రేరణగా దాదాపు 15 కౌబాయ్ చిత్రాల్లో కృష్ణ నటించారు. అయితే, ఆ తదుపరి చిత్రాలేవీ తొలి విజయాన్ని మరిపించలేక పోయాయి.

సాక్షాత్తూ కృష్ణకు నట వారసుడైన యువ హీరో మహేష్‌బాబుతో కూడా మళ్ళీ అదే రకమైన కథతో పదేళ్ళ క్రితం భారీ వ్యయంతో 'టక్కరి దొంగ' (2002) చిత్రం నిర్మితమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, హాలీవుడ్‌ కౌబాయ్ ల అసలు సిసలు లొకేషన్లలో ఆ సినిమా తీశారు. హీరో కృష్ణ కూడా ఆ సినిమా శుభం కార్డు పడే సమయంలో ఒక్క క్షణం తెరపై మెరిశారు. కానీ, అవేవీ ఆ సినిమాకు విజయం అందించలేకపోయాయి. ఏమైనా, ఇవాళ్టికీ తెలుగులో కౌబాయ్ హీరో అంటే కృష్ణే! కౌబాయ్ సినిమా అంటే - 'మోసగాళ్ళకు మోసగాడే'!

Tuesday, July 19, 2011

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"



(మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది. దాన్ని పక్కన ఇమేజ్ రూపంలో చూడగలరు. వ్యాసం పూర్తి పాఠం ఈ కింద ఉంది).

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే!

ఆ గది లో ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , 'బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.

ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది.

గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడకు వచ్చేశారు. 'పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట 'రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.

నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--'ఎర్ర జెండాల' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో 'ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న 'జయంతి పబ్లికేషన్స్' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండలు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశంలో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమగా కొనసాగిన కాలంలో ఆయనకు సహచరులు, సహవ్రతులు.

నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గంలో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే 'సినిమా పేజీ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం. ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు.(రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు).

'పంచకళ్యాణి- దొంగలరాణి', 'కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లలాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే -- సాయంత్రం సినిమా సభలో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన 'దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు.

చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్షను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు 'బాలజ్యోతి' మాస పత్రికలో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడిగా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్య రెంటాల సత్యనారాయణనూ, మా అక్కయ్య కల్పనా రెంటాలనూ, నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.

నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ, పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు -- ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, 'రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, 'అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు.

ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గదిలో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజంలోకి తలుపులు తెరిచాయి.

గమ్మత్తేమిటంటే, నరసరావు పేటలో 'నవ్య కళా పరిషత్' వారి 'నయాగరా' (అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన 'కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన 'సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన 'సర్పయాగం' కవితా సంపుటాలు, 'శిక్ష', 'ఇన్స్పెక్టర్ జనరల్', 'అంతా పెద్దలే' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు.

"అమ్మా! ఉమా! రుమా! హీరోషిమా! విలపించకు పలపించకు..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవితను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.

అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి 'అరసం' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, 'నవభారతి' పత్రికకు 'మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వనాథను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు 'ఆంధ్రప్రభ' దినపత్రికలో 'వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు.

ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారంలోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యంలో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకి వెళ్ళిపోయారు.

నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాథమ్ సంపాదకత్వంలో గుంటూరు నుంచి వచ్చిన 'దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య 'నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వంలో 'ఆంధ్రప్రభ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు.

సమాజాన్ని సరైన దోవలో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి -- ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, 'స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా 'ఆంధ్ర ప్రభ', 'స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.

నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం 'శివధనువు' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18న కీర్తి శేషులయ్యారు. ఆ పైన 'శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.

'అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకంలో మేము 'నవగ్రహాలు' అన్న మాట! (చిన్నతనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యంలో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.

నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ -- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ -- ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.

అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్ గానే, 'ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. 'ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పన కవితలో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ

Sunday, May 8, 2011

అభినయానికీ, అందానికీ చిరునామా



అభినయ ప్రదర్శనతో పని లేకుండా అవయవ ప్రదర్శనదే ప్రాధాన్యమైన ప్రస్తుత సినిమా ప్రపంచంలో గుర్తుండే కథానాయికల పేర్లు, ముఖాలు అతి తక్కువ. కానీ, రెండు దశాబ్దాల క్రితం పరిస్థితి అలాంటిది కాదు. పాత్రను బట్టి అభినయానికీ, అందానికీ సమయోచిత ప్రాధాన్యం కల్పించే నాయికలు కనిపించేవారు. ఆ తరం నాయికల్లో సుజాత ఒకరు. ఆమె చూపిన అభినయం ఇవాళ్టికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. అందుకే, ఏప్రిల్‌ 6వ తేదీన చెన్నైలో సుజాత అకాల మరణ వార్త తెలియగానే చాలా మందికి మనసు చివుక్కుమంది. అందచందాల ప్రదర్శనతో కాక అభినయంతోనూ, ఆత్మ విశ్వాసం నిండిన పాత్రలతోనూ అభిమానులను సంపాదించుకున్న ఓ మంచి నటి దూరమైనందుకు తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రియులు బాధపడ్డారు.

చారడేసి కళ్ళు, ముచ్చటైన ముఖం, తీర్చిదిద్దినట్లుండే శరీరం, హుందాతనం నిండిన అలంకరణ, వస్త్రధారణలతో సుజాత ఎవరికి వారికి తమ ఇంట్లో అమ్మాయిలా అనిపించేవారు. నిజానికి, సుజాత మలయాళ అమ్మాయి. వాళ్ళ సొంత ఊరు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మరదు. కానీ, తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో స్థిరపడ్డారు. సుజాత పుట్టింది, పెరిగింది - శ్రీలంకలోని గాలే ప్రాంతంలో. 1952 డిసెంబర్‌ 10న ఆమె జన్మించారు. ఎనిమిదిమంది తోబుట్టువుల్లో సుజాత ఒకరు. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు.

రంగస్థలి నుంచి రంగుల లోకంలోకి...

సుజాత ఇంగ్లీషు బాగా మాట్లాడేవారు. కానీ, అసలు ఆమె పెద్దగా చదువుకోలేదనీ, కనీసం పదో తరగతి దాకా అయినా బడికి పోలేదనీ తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాల్లో ఆమె ప్రవేశం కూడా గమ్మత్తుగా జరిగింది. 1966లో తండ్రి రిటైరయ్యాక, సుజాతకు 13 ఏళ్ళ వయస్సులో వాళ్ళ కుటుంబం మళ్ళీ కేరళకు వచ్చేసింది. అప్పట్లో 'సినిమా మాసియా' అని మలయాళంలో ఓ మాసపత్రిక వచ్చేది. ''మా పక్కింటి అంకుల్‌ వాళ్ళ కుటుంబంతో నేను స్నేహంగా ఉండేదాన్ని. ఆయన నా ఫోటోను ఆ పత్రికకు పంపారు. పత్రికలో నా ఫోటో రావడంతో, తమ నాటకాల్లో నటించాల్సిందిగా చాలా మంది అడిగేవారు. మా అన్నయ్యకు నాటకాలన్నా, సినిమాలన్నా ఇష్టం. అన్నయ్య ప్రోద్బలం వల్ల నటించడం మొదలుపెట్టాను'' అని సుజాత ఒక సందర్భంలో చెప్పారు. అలా ఆమె రంగస్థల కళాకారిణిగా అడుగులు వేశారు. మలయాళ మేకప్‌మన్‌ జోస్‌ ప్రకాశ్‌ సాయంతో 'పోలీస్‌ స్టేషన్‌' అనే మలయాళ నాటకంతో ఆమె రంగస్థలం మీదకు వచ్చారు. అలా నాటకాలు వేస్తుండగానే సినీ నిర్మాతల దృష్టిలో పడ్డారు.

పదిహేనో ఏట 1967లో సుజాత సినీ జీవితం మొదలైంది. మలయాళ చిత్రం 'తబస్విని' ఆమె తొలి చిత్రం. ఆ తరువాత తమిళంలో, ఆ పైన తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ దర్శకత్వంలో 'అవళ్‌ ఒరు తొడర్‌ కదై' చిత్రం ద్వారా 1974లో సుజాత తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు (ఇదే చిత్రం తెలుగులో 1976లో 'అంతులేని కథ'గా జయప్రదతో రీమేకైంది). కుటుంబ బాధ్యతలను మోసే పట్టణప్రాంత ఉద్యోగిని పాత్రను సుజాత పోషించిన తీరు అప్పట్లో ఓ సంచలనమైంది. ఆ చిత్ర ఘనవిజయంతో సుజాతకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. శివాజీ గణేశన్‌, శివకుమార్‌, రజనీకాంత్‌, కమలహాసన్‌, విజయకుమార్‌ తదితర ప్రముఖ తమిళ హీరోల సరసన నాయిక పాత్రలను ఆమె ధరించారు. 'అవళ్‌ ఒరు తొడర్‌ కదై', 'విధి' లాంటి తమిళ చిత్రాల్లో విప్లవాత్మక ధోరణిలోని పాత్రలు పోషించిన ఈ అభినేత్రి కుటుంబ కథా చిత్రాల్లోని బరువైన పాత్రలను పోషించడంలోనూ అంతకు మించి పేరు సంపాదించారు. తమిళంలో ఆమె నటించిన 'సెందమిళ్‌ పాట్టు', 'అవళ్‌ ఒరువాళా' తదితర చిత్రాలు అందుకు నిదర్శనం.

సుజాతది ప్రేమ వివాహం. 1977 ప్రాంతంలో తమిళ చిత్రాల్లో తీరిక లేకుండా నటిస్తున్న సుజాత చెన్నైలో తాము అద్దెకున్న ఇంటివాళ్ళ అబ్బాయి జయకర్‌ హెన్రీని ప్రేమించారు. ఆ ప్రేమే, పెద్దల అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా పెళ్ళికి దారి తీసింది. తరువాత అమెరికా వెళ్ళినా, అక్కడి అలవాట్లు, సంప్రదాయాలు నచ్చని సుజాత కాన్పు కోసం భారతదేశానికి వచ్చి, భర్తతో కలసి ఇక్కడే ఉండిపోయారు.

తెలుగులో పండిన 'గోరింటాకు'

తెలుగులో తొలి చిత్రం 'గోరింటాకు' (1979)తోనే ఆమె తెలుగు చిత్రసీమలో బలమైన ముద్ర వేశారు. 'యువచిత్ర' పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాత కె. మురారి నిర్మించిన ఆ చిత్రంలో హీరో శోభన్‌బాబు సరసన ఆమె పోషించిన పాత్ర ఇవాళ్టికీ సినీ ప్రియులకు మరపురానిదే. ''అప్పట్లో 'గోరింటాకు' చిత్రంలో కొత్త కథానాయిక కోసం వెతుకుతున్నాం. అప్పుడు బాలచందర్‌ గారి సాయంతో సుజాతను హీరోయిన్‌గా ఎంపిక చేశా. షూటింగ్‌ సమయంలో ఆమె నటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ చిత్రంలో 'కొమ్మ కొమ్మకో సన్నాయి...', 'ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...' లాంటి పాటల్లో ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది'' అని అప్పటి సంగతులను మురారి గుర్తు చేసుకున్నారు. అలాగే, 'సంధ్య' (1980) లాంటి తెలుగు చిత్రాల్లో సుజాత పోషించిన త్యాగమయమైన పాత్రలు అప్పటికీ, ఇప్పటికీ మనస్సును చెమరింపజేస్తాయి.

గమ్మత్తేమిటంటే - 'గోరింటాకు' అవకాశం వచ్చినప్పుడు సుజాత ముందు ఒప్పుకోలేదట! తెలుగు తెలియదు కాబట్టి, తెలియని భాషలో డైలాగులు చెప్పేటప్పుడు అందరూ నవ్వితే అవమానకరం కాబట్టి, నటించనని ఆమె చెప్పారు. కానీ, 'గోరింటాకు' చిత్ర రచయిత్రి కె. రామలక్ష్మీ ఆరుద్ర వదలకుండా, తాను దగ్గరుండి ప్రతిదీ నేర్పుతాననే సరికి, బలవంతం మీద సుజాత ఒప్పుకున్నారు. 'గోరింటాకు' చిత్రంలో ఏడుస్తూ ఓ పెద్ద డైలాగు చెప్పడానికి 16 టేకులు తిన్న సుజాత ఆ తరువాత పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నారు. మొదట్లో సరిత, ఆ తరువాత ఇతరులు డబ్బింగ్‌ చెప్పినా, అటు పైన తెలుగు మీద పట్టు సంపాదించి, సొంతంగా సంభాషణలు చెప్పుకున్నారు. వృత్తి పట్ల అంకితభావం ఉన్న సుజాత తొలి రోజుల్లో సైతం ''పెద్ద స్టార్‌ హీరోయిన్‌ని అనే గర్వం కానీ, ఆడంబరం కానీ మచ్చుకైనా చూపించేవారు కాదు. అలాంటి మంచి మనిషి, గొప్ప నటి'' అని హీరో కమలహాసన్‌ సైతం ఇటీవల అన్నారు.

పెద్ద వయసు పాత్రల్లోనూ ప్రతిభావిష్కరణ

విచిత్రంగా - కథానాయిక పాత్రలు వేసిన రోజుల నుంచి కూడా సుజాత గ్లామర్‌ పాత్రలు ధరించింది చాలా తక్కువ. తెలుగులో ఎన్టీఆర్‌ ('సర్కస్‌ రాముడు' - 1980), ఏయన్నార్‌ ('గురుశిష్యులు' - 1981), శోభన్‌బాబు ('గోరింటాకు' - 1979), కృష్ణంరాజు ('బెబ్బులి' -1980) లాంటి అప్పటి అగ్ర హీరోల సరసన నటించినప్పుడు కూడా ఆమె పాత్రల్లో హుందాతనమే ఎక్కువ. చిరంజీవితో 'ప్రేమతరంగాలు' (1980)లో నటించిన సుజాత 1980ల చివరినాటి కల్లా ఆమె పెద్ద వయసు పాత్రలు పోషించడం మొదలుపెట్టేశారు. అక్కినేనితో 'బహుదూరపు బాటసారి' (1983), 'జస్టిస్‌ చక్రవర్తి' లాంటి చిత్రాల్లో ఆమె పోషించిన పెద్ద తరహా పాత్రలు సైతం ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్‌ను నిలిపాయి. అలాగే, గతంలో తాను హీరోయిన్‌గా నటించిన రజనీకాంత్‌, కమలసహాసన్‌లకు తల్లిగానూ సుజాత నటించారు. అందుకు రజనీకాంత్‌ 'బాషా' చిత్రమే ఈ మధ్య కాలపు ఉదాహరణ. 'ఏడంతస్తుల మేడ' (1980) తన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన తెలుగు సినిమా అని చెప్పిన సుజాతకు 'పసుపు - పారాణి' (1980), 'సుజాత' (1980), 'సంధ్య' (1980), 'గుప్పెడు మనసు' (1979), 'వంశ గౌరవం' లాంటి చిత్రాలు ఆమెతో పాటు జనానికీ నచ్చాయి.

మధ్యతరగతి ఇల్లాలిగా, కుటుంబం బరువంతా మోసే వనితగా మంచితనం, త్యాగం నిండిన పాత్రలకు ఆమె ప్రతీకగా నిలిచారు. 'సీతాదేవి' చిత్రంలో వికలాంగురాలిగా ఆమె చక్కటి నటన ప్రదర్శించారు. ''భావోద్వేగ నటనకు సుజాత పెట్టింది పేరు. కెమేరా ముందు మాత్రమే అభినయించడం గొప్ప కాదు. డబ్బింగ్‌ సమయంలోనూ వాచికంలో ఆమె అంతే భావోద్వేగాలను పలికిస్తారు. అప్పట్లో తమిళనాట ఇళయరాజా సంగీతం ఉంటే సినిమాలు హిట్టయ్యేవి. అలాగే, సుజాత నటించినా చాలు, ఆ చిత్రాలు బ్లాక్‌బస్టర్లే!'' అని సుజాతతో 12 చిత్రాల్లో కలసి నటించిన తమిళనాట ప్రముఖ సీనియర్‌ నటుడు శివకుమార్‌ చెప్పారు.

పెద్ద వయస్సు పాత్రలకు మళ్ళాక, 1990లలో ఆమె 'సూత్రధారులు', 'చంటి', 'సూరిగాడు' లాంటి పలు చిత్రాల్లో నటించారు. 'చంటి' చిత్రంలో హీరో వెంకటేశ్‌ తల్లిగా ఆమె పాత్ర ఒక కోణంలో సాగితే, 'పెళ్ళి' చిత్రంలో కోడలి బాగు కోసం కొడుకుకు విషమిచ్చే తల్లి పాత్ర మరో కోణంలో నడుస్తుంది. రెంటినీ ఆమె సమర్థంగా పోషించారు. 'పెళ్ళి' చిత్రంలోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల 'శ్రీరామదాసు'లో భద్రాచల సీతారామ విగ్రహాలను సంరక్షించే భక్తురాలు దమ్మక్క పాత్రలో జీవించారు. తమిళంలో 'వరలారు', తెలుగులో 'వెంగమాంబ' ఆమె చివరి చిత్రాలు.

పుట్టుక రీత్యా మలయాళీ అయినా, సుజాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 300 దాకా చిత్రాల్లో నటించారు. సెట్స్‌లో ఎవరితోనూ మాట్లాడకుండా, ముభావంగా ఉండడం మొదటి నుంచీ సుజాతకు అలవాటు. దాంతో, సుజాతకు పొగరెక్కువ అని ప్రచారం చేసినవాళ్ళూ ఉన్నారు. ''హంగామా లేకుండా అభినయం ద్వారా ఆకట్టుకొనే నటి సుజాత. పెళ్ళయిన తరువాత ఆమె ఎక్కువగా కుటుంబం మీద శ్రద్ధ చూపెడుతూ వచ్చారు. సెట్స్‌లో కూడా తన పనిలో తాను మునిగిపోయేవారు. గడచిన కొన్నేళ్ళుగా ఆమె సినీ పరిశ్రమకూ, బహిరంగ కార్యక్రమాలకూ దూరంగా కాలం గడుపుతూ వచ్చారు'' అని వెండితెరపై సుజాత తొలి చిత్రంలో ఆమెతో కలసి నటించిన తమిళ - తెలుగు సినీ నటుడు విజయకుమార్‌ చెప్పారు.

ఆఖరి రోజుల్లో బాధించిన అనారోగ్యం

గడచిన కొన్నేళ్ళుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినడంతో ఆమె క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అది అలా ఉండగా, హృద్రోగం కూడా తలెత్తడంతో, మార్చి నెలలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు పేస్‌మేకర్‌ను ఏర్పాటుచేస్తూ, శస్త్రచికిత్స చేసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఆ శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోక ముందే గుండెపోటుతో సుజాత హఠాన్మరణం పాలయ్యారు. సుజాత, వ్యాపారవేత్త జయకర్‌ హెన్రీ దంపతులకు ఓ అబ్బాయి (సజీత్‌), ఓ అమ్మాయి (దివ్య).

ఇన్నేళ్ళుగా సినిమా రంగంలో ఉన్నా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా, తన కన్నా తాను పోషించిన పాత్రలతోనే జనానికి సన్నిహితంగా మెలగడం సుజాతలోని విశిష్ట లక్షణం. 1970లు, '80లలో అభినయ ప్రధానమైన నాయిక పాత్రలు పోషించాలంటే, దర్శక, నిర్మాతలు అనివార్యంగా ఆమెనే ఎంచుకొనేవారు. నిజానికి, దర్శకుడు బాలచందర్‌ తీసుకువచ్చిన ఈ వజ్రం తమిళ, తెలుగు సినిమాల్లోకి వచ్చేనాటికి సినిమా హీరోయిన్లంటే టీనేజ్‌ అమ్మాయిలనే భావమే ఎక్కువ. అయిదు పదులు మీద పడిన అగ్ర హీరోలకు సైతం కుర్ర హీరోయిన్లే కథానాయికలు. వాళ్ళతో పోలిస్తే, వయస్సులోనూ, పరిణతిలోనూ పెద్దదైన సుజాత నాయికగా నిలదొక్కుకోవడం ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యకరమే.

అందంలో, అభినయంలో హుందాతనం

'గోరింటాకు' చిత్రం షూటింగ్‌ సమయానికే బిడ్డ తల్లి అయిన ఆమె, పసివాణ్ణి వెంట వేసుకొని షూటింగ్‌కు వచ్చేవారు. నాయిక పాత్రల నుంచి తల్లి పాత్రలకు మారినా, ఎబ్బెట్టుగా తోచకుండా, అభినయంతో పాత్రకు నిండుదనం చేకూర్చడం సుజాతలోని ప్రత్యేకత. అందమైన ముఖం, ఎడమ వైపు బుగ్గ మీద అందమైన చిన్న పుట్టుమచ్చ, ఒంటికి సరిగ్గా అతికినట్లు కుట్టించుకున్న జాకెట్ల, సాదాగా ఉన్నా చక్కటి కేశాలంకరణ, గంజి పెట్టినట్లు బిగుతుగా ఉండే కాటన్‌ చీర, అందుకు తగ్గ అలంకరణతో సుజాత ఎప్పుడూ హుందాగా కనిపించేవారు. ''ఎప్పుడూ ఆమె ముఖంలో చిరునవ్వే కనిపించేది. అలసట కనపడేది కాదు. ఆమె పరాయి భాషకు చెందిన అమ్మాయి అయినా, తెలుగు చిత్రాలతో తెలుగు ఆడపడుచుగానే గుర్తింపు పొందారు'' అని బాలచందర్‌ 'గుప్పెడు మనసు'తో సహా పలు చిత్రాల్లో సుజాతతో కలసి నటించిన శరత్‌బాబు పేర్కొన్నారు.

దక్షిణాది భాషా చిత్రాల్లో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న సుజాత ఎంత పెద్ద హీరోతో నటించినా, వాళ్ళకు దీటుగా అభినయిస్తూ, కొన్నిసార్లు వాళ్ళ కన్నా ఎక్కువ మార్కులు తానే సంపాదించేవారు. హీరోలదే రాజ్యమైన చిత్ర పరిశ్రమలో వివిధ భాషల్లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకూ, వాటి బాక్సాఫీస్‌ విజయానికీ ఈ అభినేత్రి చాలా కాలం మూలస్తంభంగా నిలిచారు. అప్పట్లో నటించిన చిత్రాల్లో అధిక భాగం బలమైన ఇతివృత్తం, బిగువైన కథనాలతో కూడుకున్నవి కావడం కూడా ఆమెకు సానుకూల అంశమైంది. అలాగే, అతిగా భావావేశాల ప్రదర్శనే వెండితెరపై రాజ్యమేలుతున్న రోజుల్లో ఆమె సున్నితమైన హావభావాలతో, అండర్‌ ప్లే ద్వారా పాత్రను ప్రేక్షకుల మనస్సుల్లోకి జొప్పించేవారు. నాట్యం నేర్చుకోకపోయినా, ఆమె తన వెడల్పాటి కళ్ళతో సులభంగా నవరసాలూ పండించేవారు. అందుకే, ''నా చిత్రాల్లో నటించిన హీరోయిన్లందరిలోకీ చాలా చక్కటి నటి - సుజాత'' అని చెప్పే నిర్మాత మురారి అన్నట్లు, ''సావిత్రి లాంటి నటనా చాతుర్యం ఉన్న మనిషి సుజాత. అభినయ ప్రధానమైన పాత్రలకు చిరునామా అయిన ఆమె మరణం నిజంగా విషాదం.''